గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
472-సిద్ధాంత శిరోమణి కర్త ,కాల్క్యులస్ కు ఆద్యుడు –భాస్కరాచార్య( 1114-1185)
కర్ణాటకలోని బీజాపూర్ లో భాస్కరాచార్య 1114లో జన్మించాడు .మహా గణిత ,ఖగోళ శాస్త్ర వేత్త .’’సిద్ధాంత శిరోమణి ‘’అనే గొప్ప గ్రంధాన్ని సంస్కృతం లో రచించాడు .ఇందులో నాలుగుభాగాలు లీలావతి ,బీజ గణితం ,గ్రహగణితం ,గోళాధ్యాయం ఉన్నాయి ..నాలుగూ వేటికవే ప్రత్యేకమైనవి .ఇందులో గ్రహాలకు సంబంధించిన సకల గణితమూ ఉంది .’’కర్ణ కుతూహల ‘’అనే మరో ఉద్గ్రంధమూ రాశాడు .న్యూటన్ ,లీబ్నిజ్ లు కనిపెట్టిన కాల్క్యులస్ కంటే అర్ధ సహస్రాబ్ది (500 ఏళ్ళు ) ముందే భాస్కరాచార్య దాని గురించి చెప్పాడు ‘’.డిఫరెంషియల్ కాల్క్యులస్’’దాని ఉపయోగించే విధానంఆధారం గా ఖగోళ గణితాన్ని అభివృద్ధి చేశాడు . కాల్క్యులస్ పితలుగా న్యూటన్ ,లీబ్నిజ్ లను పేర్కొనటం అత్యంత దారుణం .దీనికి ఆద్యుడు భాస్కరాచార్య యేఅని నిర్ద్వంద్వంగా పేర్కొంటారు .
భాస్కరుడు తాను రాసిన వాటిని ‘’ఆర్యా వృత్త శ్లోకం లో ఇలా తెలియ జేశాడు –‘’రస,గుణ ,పూర్ణ మహీసమా –సాక నృప సమయే భవత్ మహోత్పత్తిః-రస గుణ వర్షేణ మయా – సిద్ధాంత శిరోమణి రచితాః ‘’.దీన్ని బట్టి తాను 1036అంటే శక వత్సరం 1114లో పుట్టానని ,36ఏళ్ళ వయసులో సిద్దాంతా కౌముది రాశానని ,69వ ఏట ‘’కర్ణ కుతూహల ‘’1183లో రచించానని చెప్పాడు .బ్రహ్మ గుప్త ,శ్రీధర ,మహావీర ,పద్మనాభ లప్రభావం భాస్కరునిపై ఉంది .ఉజ్జయినిలో గ్రహవేధశాలకు అధ్యకక్షునిగా పని చేశాడు .మహారాష్ట్రలోని సహ్యాద్రిపర్వత ప్రాంతం లో జలగం జిల్లలో ఉండేవాడు .తరతరాలుగా రాజాస్థానం లో గౌరవ స్థానం లో ఉన్న కుటుంబం .తండ్రి మహేశ్వరోపాధ్యాయుడు గణిత ఖగోళలలో నిష్ణాతుడు .కొడుకుకు వీటిని నేర్పి ,మనుమడు లోక్ సముద్రకు అందజేస్తే ,ఆయన కొడుకు 1202లో భాస్కరాచార్య రచనలను అధ్యయనం చేసే విద్యాలయం పెట్టాడు .
సిద్ధాంత శిరోమణిలోని ‘’లీలావతి ‘’లో 277శ్లోకాలున్నాయి .ఇందులో కొలతలు,ప్రస్తారణలు (పెర్ముటేషన్స్),ప్రోగ్రేషనన్స్ మొదలైన గణనం ఉంటుంది . బీజగణితం లో 213శ్లోకాలుంటాయి .సున్నా ,అనంతం ,(ఇన్ ఫినిటి)ధన ,రుణ సంఖ్యలు ,ఇప్పుడు పెల్లీస్ ఈక్వే షన్ గా పిలువ బడే ‘’కుట్టక పధ్ధతి ‘’ఉన్నాయి భాస్కరుడు 61×2+1=y2అనే సూత్రాన్ని ఐరోపావాళ్ళు కనిపెట్టి చెప్పిన ఎన్నో వందల ఏళ్ళ క్రితమే సాధించి చెప్పాడు .గ్రహ గణితం లో గ్రహాల వేగాలను కనిపెట్టే సూత్రం ‘’బిమ్బార్ధస్య కోటీయాగుణ స్త్రిజగాహారః ఫలం దొరియాయో రంతరం ‘’చెప్పాడు .దీని ఫలితాన్ని అంతకుముందే 932లో ‘’లఘుమానసం ‘’లో మున్జకాచార్య లెక్క గట్టి సరి చూశాడు .ఇవన్నీ ట్రిగనామెట్రి’’లో ‘’సైన్ ‘’కు సంబంధించిన లెక్కలు .గ్రహం అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు దాని వేగం శూన్యం అని చెప్పాడు .పైథాగరస్ కంటే ఆ సిద్ధాంతాన్ని ముందే చెప్పాడు .వర్గ ఘన ద్విఘాత(క్వార్టే క్)మొదలైన వాటిని చెప్పాడు .సైక్లిక్ విధానం –చక్రవల పధ్ధతి చూపాడు ,రుణ ,కరణీయ(ఇర్రేషనల్)సంఖ్యలను సాధించాడు . చేశాడు .
అంక గణితం లో నిర్వచనాలు ,అంక గణితపదాలు ,ప్రోగ్రెషన్లు మొదలైనవాటిని లీలావతిలో 13అధ్యాయాలలో వివరంగా చెప్పాడు .బీజగణితం లో 12అధ్యాయాలున్నాయి .ధన ,రుణ సంఖ్యలను ,సున్నా ,తెలియని నంబర్లను (అన్నొన్)చర్చించాడు .ట్రిగానా మెట్రి,కాల్క్యులస్లలో ఏంటో ముందు చూపుతో ఎన్నో విషయాలు భాస్కరుడు చెప్పాకే ఎన్నో వందల ఏళ్ళ తర్వాత పడమటి దేశీయులకు తెలిశాయి.
ఖగోళ శాస్త్రం లో సూర్య చంద్ర గ్రహణాలు ,గ్రహాల అక్షాంశాలు ,సూర్యోదయ సమీకరణాలు ,చంద్ర వంకలు ,గ్రహాలు , భూమికి ఉన్న సముచ్చయాలు,సూర్య చంద్ర గతులు అన్నీ ఖచ్చితమైన లెక్కలతో చెప్పాడు .1150లోనే నిరంతరం తిరిగే యంత్రాన్ని తయారు చేసి తన ఇంజినీరింగ్ ప్రతిభనూ కనబరచాడు .
473-సంస్కరణ లతో పాటు సంస్కృతాన్ని నిలబెట్టిన –భండార్కర్ (1837-1925)
6-7-1837లో మహారాష్ట్రలోని సింధు దుర్గ జిల్లా మాల్వన్ లో జన్మించాడు .రత్న గిరిలో చదివి ,బొంబాయి ఎల్ఫిన్ స్టన్ కాలేజిలో చేరాడు. మహా దేవ గోవింద రానడే తోకలిసి బొంబాయి యూని వర్సిటి నుండి మొట్ట మొదటిసారి గ్రాడ్యుయేట్ అయ్యాడు .మరుసటి ఏడాది మాస్టర్ డిగ్రీ పొందాడు .1885లో గోటింజెన్ నుండి పి.హెచ్ డి.పొందాడు .ఎల్ఫిన్ స్టీన్,దక్కన్ కాలేజీలలో లెక్చరర్ గా పని చేశాడు .రచనలో రిసెర్చ్ లలో జీవితాంతం గడిపాడు .బాంబే యూని వర్సిటి వైస్ చాన్స్ లర్ గా 1884లో రిటైర్ అయ్యాడు .1874లో లండన్లో ,1886లో ,వియన్నాలలో లో జరిగినఅంతర్జాతీయ ఓరి యెంటల్ భాషా సదస్సులో పాల్గొన్నాడు .శాతవాహన ,డెక్కన్ చరిత్రలకు ప్రాణం పోశాడు .భండార్కర్ గొప్ప సంస్కరణాభిలాషి .వితంతు వివాహాన్ని సమర్ధించాడు .కుల వ్యవస్థను బాల్య వివాహాలను నిరసించాడు .
1903లో కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నాన్ అఫీషియల్ మెంబర్ గా ఎన్నికయ్యాడు .గోపాలకృష్ణ గోఖలేగారు ఇందులో మరొక మెంబర్ .1911లో ప్రభుత్వం ‘’నైట్ హూడ్’’ను(సి.ఐ.ఇ) ప్రదానం చేసి గౌరవించింది .సమకాలీన సమాజం లోని కుళ్ళు ను ఏరిపారేయటానికి ‘’పరమ హంస సభ ‘’ను ఏర్పాటు చేసి ప్రక్షాళనం చేశాడు .1864లో కేశవ చంద్ర సేన్ పర్యటనతో ప్రభావితమై ఆత్మారాం పాండురంగ ఇంట్లో సభ్యులు సమావేశమై కులవ్యవస్తను నిరసించి ,విధవా వివాహాలను సమర్ధించి బాల్య వివాహాలను ఈసడింఛి స్త్రీ విద్యనూ సమర్ధించారు .31-3-1867న ఈ సంస్కరణల అమలుకోసం ప్రార్ధనా సమావేశం జరిపారు . ఇదే తర్వాత ‘’ప్రార్ధనా సమాజ్ ‘’అయింది .కేశవ చంద్రుని మరో పర్యటన ,ప్రతాప చంద్ర మజుందార్ ,నవీన్ చంద్ర రాయి ల ప్రేరణతో పంజాబ్ బ్రహ్మ సమాజం ఏర్పడింది .పూనా లోని భండార్కర్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆయన పేరుమీదనే ఏర్పడింది .
భండార్కర్ సంస్కృత భాషాభ్యాసం కోసం పుస్తకాలు రాశాడు .మొదటిపుస్తకం లో విద్యార్ధులను దృష్టిలో పెట్టుకొని వ్యాకరణం సంస్కృతవాక్యాలను ఇంగ్లీష్ లోకి అనువదించటం ఉంటాయి .సులభం గా అర్ధమయ్యేవిధానం లో రాశాడు .రెండవ పుస్తకమూ పరమ ప్రయోజనకరమైనదే .ఒకరకంగా అది ఉపాధ్యాయులకూ విద్యార్ధులకూ కూడా కర దీపిక .తెలుగులో ఏం ఏ చదివేవారికి సంస్కృతం లో ఒక పేపర్ ఉంటుంది దీనికోసం అందరూ భండార్కర్ శరణం గచ్చామి అనాల్సిందే .సంస్కృత వ్యాకరణం కూడా రాశాడు భండార్కర్ .భండార్కర్ పుస్తకాలన్నీ పరమ ప్రయోజనకరమైనవి .సంస్కృత భాషకు భండార్కర్ చేసిన కృషి చిరస్మరణీయం .
భండార్కర్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్లో దక్షిణ ఆసియాలో ఉన్న అరుదైన సంస్కృత వ్రాత ప్రతులన్నీ ఉంటాయి .లక్షా ఇరవై ఐదువేల పుస్తకాలు ,29,510 వ్రాతప్రతులు ఉన్నాయి .మూడునేలలోకసారి జర్నల్ ను ప్రచురిస్తారు .ఇందులో భద్రపరచిన ఋగ్వేదం వ్రాత ప్రతి ‘’యునెస్కో వారి మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ ‘’లో చోటు చేసుకొన్నది .24-8-1925న భండార్కర్ మహశయుడు 88వ ఏట మరణించాడు
.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-2-16-ఉయ్యూరు
