ఇది విన్నారా కన్నారా ! 23
36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -6
262-తానం లయ బద్ధమైన రాగాలాపనమే .ఆ లయకూ వీణ వాద్యం లో నాద మాధుర్యం లో ని౦ప గలిగే అవకాశం ఉంది .దీన్ని సంపూర్ణంగా వినియోగించుకున్న మహానుభావులు ఈమని శంకర శాస్త్రి గారు .రాగాలాపన చేయటం లోనూ శాస్త్రి గారు వీణ లో ప్రత్యేకత సాధించారు .రాగాలాపనలో మీట్లుతక్కువ గా ఉంటాయి .ఐతే శాస్త్రి గారు తక్కువ మీట్లతో రాగాలాపన చేస్తూనే స్వరకల్పనలో లాగానే స్వర సమూహాలను వెంట వెంటనే మీటి రాగాలాపనలో భాగం గా వాటిని మెరిపించేవారు .వీరి తరవాతి వైణికులు కూడా దీన్ని బాగా అంది పుచ్చుకున్నారు అంటే శాస్త్రిగారి ప్రయోగం యెంత ఔన్నత్యాన్ని సాధించిందో అర్ధమవుతుంది .తానం మీట్లతో ,తాళం తీగలను మీట కుండా ,రాగా లాపనలో ఇమిడించటం కూడా శాస్త్రి గారి మరో విశిష్ట పద్ధతియే అంటారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .
263 –గాయకుని గొంతులో వంపు సొంపులు ఇచ్చా మాత్రం తో తేగలగడం ఎలాంటిదో ,వీణ లో మీటు అలాంటిది .అందరూ వీణ బాగానే వాయిస్తారు .కాని వాదన కళ ఈ వంపు సొంపులను సృష్టించటం లోనే ఉంది .వీటినేసంగీత శాస్త్రం ‘’గమకాలు’’ అన్నది .మీటులో నైపుణ్యమే లేక పొతే గమకం సిద్ధి౦చనే సిద్ది౦చదు .మీటులో నైపుణ్యం కుదిరాక ఎడమ చేతితో దండం మీద తీగలను సాధించాలి .ఈ రెండూ ఒకదానితో ఒకటి కలిస్తే ‘’వాదనం ‘’అవుతుంది లేకపోతే మిగిలేది ‘’రోదనమే ‘’అని చమత్కరించారు ఆచార్య జీ..శంకర శాస్త్రి గారికి అటు కుడి చేతి మీటు లోను ,ఇటు ఎడమ చేతి వాయింపు లోను ఉన్నంత అధికారం మరే వైణికుడికి లేదని ఆచార్య ముదిగొండ ఘంటా పదంగా చెప్పారు .రెండిటికి సమప్రాదాన్యమిచ్చినప్పుడే ప్రేక్షక శ్రోత్రుజనం సంతోషిస్తారు .ఈ రెంటినీ సాధించినప్పుడే వైణికుడు కూడా తన ‘’కళలో రమిస్తాడు ‘’.ఒక రకం గా ఇది ‘’వైణిక సవ్య సాచిత్వం ‘’అని తేల్చారు వీరభద్రయ్య గారు .ఈ విద్యకు శంకర శాస్త్రిగారు పెట్టింది పేరు అని తీర్పునిచ్చారుకూడా .గతించి పోయిన వీణా వైభవాన్ని శాస్త్రి గారి ఈ సవ్య సాచిత్వం తోనే పునరుద్ధరించారు అని నిర్ద్వంద్వంగా ముదిగొండ వీరభద్రయ్య గారు ఆచార్యానుభవం తో నిర్ణయించి చెప్పారు .
264-వీణ పై తోడి రాగం వాయించటం కష్టమని ,మరీ ,’’హనుమత్తోడి’’లో సాధారణ గా౦ధారాన్నీ ,కైశిక నిషాదాన్నీ మెట్టు మీద చూపటం కుదరనే కుదరదని ,దీనికి దగ్గర గా ఉండే ఆనంద భైరవిలో సాధారణ గా౦ధారాన్ని పైనే చూప వచ్చని ,చూపాలి కూడా నని అన్నారు ఆచార్య శ్రీ .కాని కర్నాటక తోడి లో ఇది కుదరదు .దాన్ని ఖచ్చితంగా ఎప్పుడైనా చతుశ్రుతి రిషభం లోనే ,కంపిత గమకం తో చూపాలి .ఆరోహణలోనూ అంతే .అలాగే శుద్ధ దైవతం లోనే కైశిక నిషాదాన్ని చూపాలి . దీనివలన స్వర కల్పనలో వేగ సాధనకు కొంచెం ఇబ్బంది కలుగుతుందని, కాని శాస్త్రి గారు సంప్రదాయాన్ని పాటిస్తూనే మధ్య మధ్యలో కైశిక నిషాదాన్నిమెట్టు పైననే చూపేవారని ,చాలా కొద్ది సార్లు సాధారణ గా౦ ధారాన్ని మెట్టు మీదే చూపేవారని కాని అది ఏమాత్రం ఎబ్బెట్టుగా ఉ౦డేదికాదని,పైగా గొప్ప అందంగా ఉండేదని స్వర రాగ కషాయాన్ని కాచి వడబోసిన ఆచార్య వర్యుల ఉవాచ .నాట రాగం లో షట్ శ్రుతి రిషభం ,షట్ శ్రుతి దైవతం లను వెనక స్వరాలలో లాగి చూపాల్సిందే తప్ప మెట్టు మీద వాయించటానికి వీలు లేదని ,అవరోహణలో మాత్రమప్పుడప్పుడు అలా వాయించినా ఓర్చు కొంటు౦దని శాస్త్రిగారి వాదనలో ఈ మెలకువలన్నీ ఇమిడిపోయి ఎంతో రామణీయకం సృష్టింప బడేది అని వీణా వాదనా సామర్ధ్యమున్న ఆచార్య ముదిగొండ వీర భద్రయ్యగారు . విశ్లేషించి వెలికి తీసి చెప్పిన ‘’మహా వాక్యా’’లివి .
265-శాస్త్రం లో గమకాలూ’’ పది’’ అని, వాటిలో ఆరోహరణ అవరోహణ, మూర్చనలు విశేషం లేనివని ,ఢాలు,స్పురితం ,కంపితం ,ఆహతం ,ప్రత్యాహతం ,త్రిపుచ్చం ,ఆందోళనం అనే ఎనిమిది గమకాలూ వీణ మీద వాయిస్తే విశేష మాదుర్యాన్నిస్తాయని ,శంకర శాస్త్రి గారు వీటి నన్నిటినీ’’ నిర్దుస్టం’’గాను ‘’నిర్దిష్టం ‘’గాను పలికి౦చేవారని ,కాంటాక్ట్ మైక్ వీటికి ఎంతగానో తోడ్పడిందని ,ఈ ‘’దశ విధ గమకాలు ‘’కాకుండా శాస్త్రి గారు మరొక ‘’12 గమకాలు ‘’వీణా వాదన లో సృష్టించారని ,వాటికి పేర్లు లేవని ,ఇప్పుడు వాటిని వాయి౦చేవరూ లేరని ,శాస్త్రిగారి కుమార్తె మాత్రం కొన్నిటిని వాయిస్తుందని తేల్చి చెప్పారు ఆచార్య వర్యులు .
266-వీణా తంత్రులను కృత్రిమ గోళ్ళను తొడుక్కొని వాయిస్తారు చాలామంది .వీటిని తీగలతోనే చేస్తారు .వీటిని మధ్య వ్రేలికి దాని ప్రక్క వ్రేలికి తొడుక్కుంటారు .అయితే శాస్త్రిగారు వీటిని అసలు వాడేవారు కాదు .అంతాసహజమైన గోళ్ళ ద్వారానే సాధించారు .నాదం లో హెచ్చు తగ్గులు కలిగేట్లు మీటడం వలన గొప్ప శ్రుతి సుభగాత్వాన్ని శాస్త్రిగారు సాధించే వారు అంటారు ఆచార్య ముదిగొండ శ్రీ .
చంద్ర లేఖ సినిమా లో మూడు దృశ్యాలు
సశేషం
15-8-16 సోమవారం 70 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-16-ఉయ్యూరు
