ఇది విన్నారా కన్నారా ! 26 37-వీణా పాణి విశ్వేశ్వరన్

ఇది విన్నారా కన్నారా !  26

37-వీణా పాణి విశ్వేశ్వరన్

281-తెలుగు మాతృ భాష అయినా  విశ్వేశ్వరయ్య ఎప్పుడో మైసూర్ రాష్ట్రానికి తరలి వెళ్లి పోయారు .అందుకే ఇంటి పేరు తండ్రి పేరే అయింది .తల్లి వరలక్ష్మి ,తండ్రి రామయ్య గార్లు .కనుక రామయ్య గారి విశ్వేశ్వరయ్య ఆర్ .విశ్వేశ్వరయ్య అయ్యారు .కుటుంబం లో అందరికి సంగీతాభిమానం ఉంది .విశ్వేశ్వరన్ ఎవ్వరి వద్దా వీణ నేర్చుకోలేదు వీనావాదనం ఆయన లోంచి విచిత్రంగా ఆవిష్కారమైంది .అన్న సీతారాం ఆ నాడు ఆస్థాన విద్వాంసుడు .ఒక రోజు అన్నగారు ‘’సామి నిన్నే ‘’అనే శంకరాభరణ రాగం గురు పద్ధతిలో వాయిస్తూ ఉంటే ,అది తమ్ముడు విశ్వేశ్వరన్ కు కర్ణ కఠోరం  అనిపించి ,అలా వాయించ రాదు అని వెక్కిరించారు .’’వాయిస్తుంటే పాడి నట్లు ఉండా’’ అని తమ్ముడు అన్నకు సలహా ఇచ్చాడు ‘.పౌరుషం పొడుచుకొచ్చిన అన్న ‘’మరెట్లా వాయించాలో వాయించి ఏడు ‘’అన్నాడు కోపంగా .ఇది చాలెంజ్ అనిపించి అ౦తకు ముందు ఎన్నడూ వీణను ముట్టుకొని సాధన చేయని  విశ్వేశ్వరన్  వీణ దగ్గరకు వెళ్లి తీసుకొని ‘’దేవుడు పూనిన వాడి ‘’లాగా నిండు గమకం తో పాట పాడినట్లు అని పించేలా శంకరా భరణ  వర్ణాన్ని వాయించాడు .ఇది అటు ‘’అన్నాయి’’ కే కాక ఇటు ‘’తమ్మాయి’’కీ అద్భుతం అని పించింది .దైవానుగ్రహం వలన ఆ రోజు వాయించిన వైనమే ఆయన్ను అగ్రశ్రేణి విద్వాంసుని చేసింది .

282 –బాల్య దశలో జరిగిన పై సంఘటన తర్వాత విశ్వేశ్వరన్ యే రాగాన్ని పట్టుకొంటే ఆ’’ రాగ దేవత’’ ఆయన్ను రెండు ,మూడు గంటలు ఆవహించి ఉండేది .ఇలా చిన్ననాటి నుంచి నాద సుఖాన్ని ,నాదానందాన్ని ఆయన అనుభవించారు .గురువు లేకుండా వీణా సాధన అసాధ్యం .గురుముఖతా నేరిస్తేనే ఎడమ చేతి వ్రేళ్ళతో వాయించే నేర్పు అలవడుతుంది కాని వీటికి అతీతుడైన విశ్వేశ్వరన్ అన్నీ గురువు లేకుండానే దైవ కృప వలన నేర్చుకొన్నారు ఇదొక అద్భుతం

283 –విశ్వేశ్వరన్ వ్రేళ్ళను వీణ మీద సాధించటం తో పాటు తన గొంతునే వీణ మీదకు దింపారు అన్నారు ఆచార్య ముదిగొండ .అందరూ ఇలా చేయగలరా అంటే లేదనే చెప్పాలి .కొందరికే ఇది సాధ్యమయింది .ఆయన వ్రేళ్ళను వినియోగించేవిధానం పరమ నూతనం అని ,దాన్ని చూసి అనుభవించాల్సిందే తప్ప రాతలో వర్ణించి చెప్పలేమని ఆచార్య వీరభద్రయ్య గారి అభిప్రాయం .అందుకే వీణపై ‘’విశ్వేశ్వరన్ రీతి ‘’ఏర్పడింది అన్నారు. విద్యలతల్లి సరస్వతీ మాత మాత్రమె ఆయన గురువు .వేరే గురువెవ్వరూ లేరాయనకు. ఒక నాడు నాదానందం లో లయించి ఉండగా నాద దేవత వాణీ దేవి దర్శన మిచ్చి ,రెండు రోజులు వీరికి విద్యా బోధన చేసింది .వాద్యం లో లీనమయిన వానికి అమ్మ అనుగ్రహం తప్పక ఉంటుంది .అందుకే వీనావాదనం మోక్ష విద్యకు మార్గం అయింది అన్నారు ఆచార్య శ్రీ .గాత్ర ధర్మం లో లేని ఒక్క అంశమూ వారి వీణా వాదనలో వినిపించక పోవటం ప్రత్యేకత .నిష్ణాత్రుత్వం తో విశ్వేశ్వరన్ ‘’స్వయంభు ‘’అయ్యారన్నారు ముదిగొండ వారు .మానుష గురువు లేకుండా ఇంతటి పూర్ణ ప్రజ్న సాధించినవారెవ్వరూ లేరు అని వీరభద్రయ్య గారు వాక్రుచ్చిన మాట యదార్ధం .వీణ చేత బట్టిన ఆరు నెలలకే మైసూరు చుట్టుప్రక్కల వైణికుడు గా విశ్వేశ్వరన్ పరిచయమయ్యారు. వైదుష్య సంపాదనలో ఆయన ఇంకా శిఖరారోహణం చేస్తూనే ఉన్నారు .

284 –నూనూగు మీసాల నూత్న యవ్వనం లో 16 వ ఏట మైసూర్ కు 18 మైళ్ళ దూరం లోని టి .నరసీపూర్ లో రామోత్సవాలలో ఆహ్వానం పై  1947 .ఏప్రిల్ లో 3 ½గంటలు వీణ కచేరీ చేసి అందరినీ తల ఊపేట్లు చేశారు .ఈ తొలి కచేరీకి మృదంగం వాయించిన వారు  మహా మార్దంగికులైన విద్వాన్ శ్రీ చౌడయ్య.వయోలిన్ చౌడయ్యగారికి ,ఈ చౌడయ్య గారు చాలా కచేరీలలో మృదంగం వాయించారు

285 –విశ్వేశ్వరన్ ఎంతటి వైణికులు అంటే వీణ మాస్ట్రో బాలచందర్ నిండు గుండెలతో మెచ్చుకొన్న వైణికులు .విశ్వేశ్వరన్ కంటే వీణ బాలచందర్ నాలుగు ఏళ్ళు మాత్రమే పెద్దవారు .మీటులో ఇద్దరికీ చాలా తేడా ఉంది అన్నారు ఆచార్య శ్రీ .సంగీత సామ్రాజ్యం లో బాలచందర్ మకుటం  లేని చక్ర వర్తి .ఆయన పంధా ఎవరూ అనుసరి౦చ లేరు .ఒక సారి బాల చందర్ ఇంటి పూజా గదిలో విశ్వేశ్వరన్ వీణ కచేరీ ఏర్పాటు చేశారు .ప్రసిద్ధ సంగీత విద్వా౦ సులందర్నీ ఆహ్వాని౦చారు .విశ్వేశ్వరన్ వీణ వాయిస్తున్నత సేపు బాల చందర్ ‘’సెహ బాష్ ,’’భేష్ ‘’అని చాలా సార్లు అని పొంగిపోయి కచేరీ అనంతరం కాశ్మీర్ జరీ శాలువా తో సన్మానించి ,ప్రశంసించారు బాలచందర్ .

286 –ఒక సారి ‘’ఇడయం ‘పత్రిక బాల చందర్ ను ఇంటర్వ్యు చేస్తూ ‘’మిమ్మల్ని మెప్పించిన వైణికులు ఎవరు ?’’’’అని ప్రశ్నిస్తే ‘’వాగ్గేయకారుడు ,అత్యంత ప్రతిభావంతుడు ,మైసూర్ విశ్వేశ్వరన్ నా హృదయాన్ని దోచుకొన్న వాడు ‘’అని చెప్పారు ,1988 లో మైసూర్ లో బాలచందర్ ‘’విశ్వేశ్వరన్ నాకన్నా గొప్ప సంగీత విద్వాంసుడు .నేను కేవలం వైణికుడినిమాత్రమే .ఆయన వైణికుడేకాక వాగ్గేయ కారుడు కూడా ‘’అన్నారు హిమాలయోత్తు౦గ  సదృశ పద్మభూషణ్ డా బాలచందర్ .1990 లో మద్రాస్ లో ‘’సరస్వతీ వాగ్గేయ ట్రస్ట్ ‘’విశ్వేశ్వరన్ స్వీయ రచనల కచేరీ ఏర్పాటు చేయగా బాలచందర్ వచ్చి ఆశీర్వదించి ‘’నా కన్నా కొన్ని సంవత్సరాలు చిన్నవాడే అయిన విశ్వేశ్వరన్ బుద్ధీ ,పాండిత్యం ,సంగీతసార అవగాహన లో ,మేధావిలసనం లో ఎంతో పెద్దవాడు గొప్పవాడు విశ్వేశ్వరన్ లాంటి వారి వలననే మనం సంగీతం లో అసలైన శాస్త్రీయత (క్లాసిజం )ను అవగాహన చేసుకో గలుగుతున్నాం .ఆయన సంగీతాన్ని ,వారు చెప్పే మాటల్ని ,వారి రచనల్లో నిక్షిప్త మైన విలువలను శ్రద్ధగా వినటం వలన మనకు భగవంతుని చేరే మార్గం చాలా సులభతరం అవుతుంది ‘’అని నిండుమనసుతో మెచ్చుకొన్నారు

287 –వీణ పై మొదటి కచేరీచేసిన కొద్ది రోజులకే మైసూర్ రేడియో వారు విశ్వేశ్వరన్ గారిని 1949 లో  వీణ కచేరీకి ఆహ్వానించారు .అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 60  సంవత్సరాలు ఆకాశ  వాణి కేంద్రాలలో వాయిస్తూనే ఉన్నారు .మద్రాస్ సంగీత అకాడెమి వీరి కచేరీ ఏర్పాటు చేసి గౌరవించింది .వీరికి ప్రక్క వాద్యాలు వాయించిన మహా మార్దంగికులలో పాల్ఘాట్ రఘు ,ఉమయాళ పురం శివరామన్ ,గురువాయూర్ దొరై ,ఉపేంద్రన్ ,ఎల్లా వెంకటేశ్వర రావు మొదలైన వారున్నారు.

 

Inline image 1Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-16- కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.