ఇమాన్యుయేల్ కాంట్ -వికాసం అంటే ఏమిటి ?
ఇమాన్యుయాల్ కాంట్ (1724-1804 )గొప్ప జర్మన్ మేధావి గణిత శాస్త్ర వేత్త ప్రపంచ తత్వ వేత్తలలో అగ్ర శ్రేణికి చెందినవాడు .భారతీయ తత్వ వేత్తలు ఆయన సిద్ధాంతాలను తరచూ ఉదాహరిస్తూ ఉంటారు .ఆయనకూ మన దేశం పై అపార మైన గౌరవం ఉన్నది .వికాసోద్యమానికి ఆధ్యాత్మిక మూలాలు సంతరించాడు. స్వచ్చమైన హేతువాద పరామర్శ (క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ ),సిద్ధాంతీకరణ విమర్శ(క్రిటిక్ ఆఫ్ జడ్జిమెంట్ ) కాంట్ గొప్ప రచనలు .లెస్సింగ్ లాగా వికాసం అనేది నిరంతర కార్యక్రమం అని మనోవికాసం తో కూడిన హేతు వాదం వైపుకు పురోగామించటమే మానవ జీవిత పరమార్ధమని కాంట్ అంటాడు .ఆయన రాసిన’’ హేతు వాదం అంటే ఎమిటి ‘’?అనేదాన్ని ఆయనమాటలలోనే తెలుసుకొందాం
‘’వికాసం అంటే స్వయంగా తెచ్చుకొన్న పారతంత్రం నుండి విమోచన .పార తంత్రం అంటే మనిషి ఇతరుల ఆదేశం లేకుండానే తన తెలివిని ఉపయోగించుకోలేని అసమర్ధత . అందుకే ఈ పారతంత్ర్యం .దానికి హేతువు అయిన వివేచనా శక్తి లోపం వలన కాకుండా ఇతరుల ఆదేశం లేకుండా దాన్ని ఉపయోగించుకోవటానికి అవసరమైన పట్టుదల సాహసం లేక పోవటం వలన కలిగేది. ఇది స్వయం కృతం .’’సాహసించు –నీ హేతువాద వివేకాన్ని ఉపయోగించు ‘’అనేది వికాస వాద సూత్రం .
‘’అలసత్వం ,పిరికితనం పారతంత్రానికి ముఖ్య కారణాలు.బాహ్య దేశం నుంచి విముక్తిపొందినా వీళ్ళు జీవితమంతా సంరక్షకత్వం (ట్యూటేలేజ్ )లో మసులుతూ ఉంటారు .నాకోసం అన్నీ అర్ధం చేసుకొని నా పని తేలిక చేసే పుస్తకం ,నాకోసం ఒక అంతరాత్మగల గురువు ,నా ఆహారాన్ని నిర్ణయించే వైద్యుడు ఉంటె నేనుగా ప్రయత్నం చేయటం ఎందుకు ?నేను ఆలోచి౦చక్కరరలేదు .నేను డబ్బు వెదజల్లితే ఇవన్నీ చేసేవారు నాకు దొరుకుతారు ..ఇతరులే నా బదులు పని చేయటానికి సిద్ధంగా ముందుకు వస్తారు ..ఈ సంరక్షకులు మొదట తమ ‘’పశువుల మందకు’’ మూగతనాన్ని అలవాటు చేసి తర్వాత తాళ్ళతో బంధించి బండీకి కట్టేస్తారు .తప్పించుకొనే ప్రయత్నం చేస్తే ఎంత ప్రమాదమో తెలియ జేసి గ్రిప్ లో ఉంచుకొంటారు .ఎవరిడైనా గీత దాటటానికి చేసి విఫలమైతే మిగిలిన వారికి కనువిప్పుకలిగించి ఆ ప్రయత్నం జోలికి వెళ్ళకుండా చేస్తారు .కనుక ఒంటరిగా ఉంటూ ఈ పారతంత్రం నుంచి తప్పించుకోవటం చాలా కష్టం .పారతంత్రం అతనికి మహా భాగ్యం గా ఉంటుంది .బుద్ధిని ఉపయోగించటానికి అశక్తుడు అవుతాడు .అవకాశమూ ఇవ్వరు, తీసుకోడు కూడా .స్వేచ్చాచలనం అలవాటు లేక దేనికోదానికి బందీ అయిపోతాడు .
ప్రజలు తమంత తాము వికాసం పొందటం సాధ్యమే .స్వేచ్చ ఇస్తే వికాసం వస్తుంది .పారతంత్ర కాడిని బుజం మీదనుంచి తోసిపారేశాక తమ యోగ్యతను గురించి ఆలోచిస్తారు .కర్తవ్యమ్ అనే సూత్రాన్ని గుర్తెరిగి బాగా ప్రచారం చేస్తారు .అసూయా ద్వేషాలు నాటటం ప్రమాదకరం .మనోవికాసానికి కావాల్సింది స్వేచ్చ మాత్రమే . ‘’వాదించకు ,చెప్పింది చెయ్యి విశ్వసించు ,వాదించినా విదేయుడవై ఉండు ‘’అని స్వాతంత్ర్యాని అడ్డ కట్టలు సర్వత్రా ఉంటాయి .హేతువాద వివేచనకు మనిషికి ఎప్పుడూ స్వతంత్రం కావాలి .సమాజం లోని వ్యక్తులు కృత్రిమ ఐక మత్యం తో అస్వతంత్రులుగా పని చేయాలి .అప్పుడే వారి ప్రయోజనాలను ప్రభుత్వం గుర్తించి అనుకూలంగా ప్రవర్తిస్తుంది .పన్నుల అనౌచిత్యాన్ని ,అన్యాయాల గురించి అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు పౌరులుగా తమ ధర్మాలకు వ్యతిరేకంగా పని చేయకూడదు .మతం కాని సంఘం కాని మనవ మనో వికాసాన్ని అణచిపెట్టే ఏ పనీ చేయ రాదు .ఒక వర్గానికున్న హక్కును వేరొక వర్గానికి లేకుండా చేయరాదు
‘’మనం వికాస ౦ పొందిన యుగం లో జీవించటం లేదా అని ఎవరైనా ప్రశ్నిస్తే’’లేదు’’ అని నా సమాధానం .కారణ౦ మనం ఉన్నది వికాస వాద యుగం లోనే కాని , వికాస యుగం లోకాదు. వికాసవాద యుగం అంటే ఫ్రెడరిక్ శతాబ్ది. ఫ్రెడరిక్ ప్రభువు మానవులకు నిషేదాలులేకుండా స్వేచ్చా జీవుల్లా ఉంచటానికి ప్రయత్నంచేసి మనోవికాసాన్ని సాధించినవాడు .పౌరస్వాతంత్ర్యం ప్రతి వ్యక్తీ మనస్సుకూ తన శక్తికొలది విస్తృతంగా వికాసం పొందటానికి అవకాశం కలిగిస్తుంది .అతి కఠిన మైన మెదడు చిప్పలోప్రకృతి అద్భుతమైన విత్తనాన్ని ఆరోపించింది .దాన్ని అతి సుకుమారంగా చూసుకొంటుంది. ‘స్వేచ్చగా ఆలోచించాలి అన్న ఆసక్తే ఆ బీజం .ఇది ప్రజల పరిణామ౦ మీద ప్రభావం కలిగిస్తుంది దానితో స్వాతంత్రానికి అర్హత సంపాదిస్తాడు .చివరికి అది ప్రభుత్వ విదానాలమీదకూడా ప్రభావం చూపిస్తుంది .ప్రభుత్వం వారిని యంత్రాలలాగా కాకుండా అప్పుడు వారి వారి హోదాలకు తగినట్లు సంభావిస్తుంది .
ఆధారం –జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం –మధ్యయుగాల నుండి నేటి వరకు -1971 లో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ –మద్రాస్ ప్రచురణ
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-16 –ఉయ్యూరు
