పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -5

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -5

21-క్రియాదక్షో దక్షః క్రతుపతి రదీశస్త నుభ్రుతా –మృషీణామార్తిజ్వం శరణద సదస్యా స్సురగణాః

క్రతు భ్రంశ స్త్వత్తః క్రతుషు ఫలాదాన వ్యసనినో –ద్రువం కర్తు శ్శ్రద్దావిదుర మభి చారాయ హి మఖాః’’

భావం –భక్తరక్షక పరమేశా !శరీరధారులకు దక్షుడు అధిపతి .యాగ నిర్వహణలో గొప్ప  సమర్ధుడు .ఆయన చేసే యజ్ఞాన్ని నిర్వహించేవారు సామాన్యులుకాదు , మహర్షులు . యజ్న వేదికపై ఆసీనులైనవారు దేవతా సమూహం . ఇన్ని సమకూరినా యాగ ఫలాన్నిచ్చే నీ వలన దక్ష యజ్ఞం విధ్వంసమైంది. శ్రద్ధ లేనివాడు ఎంత వైభవంగా యజ్ఞం చేసినా కూడా ,ఆ యజ్ఞాలు చేసేవారికి అనర్ధాలే కలిగిస్తాయి .

యజ్నఫల దాత శివుడు ఫలాననివ్వటానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాడు .యజ్ఞం లోశ్రద్ధలేకుండా ఆయన అనుగ్రహం పొందలేరు .ఎంతటి గొప్పవాడైనా, శాస్త్రీయంగానే యజ్ఞం చేసినా అనర్ధాలే ఫలిస్తాయి ‘’యదేవ శ్రద్ధయా కరోతి తదేవ వీర్య వత్తరం భవతి ‘’అని  ఛాందోగ్యం చెప్పింది

22-ప్రజానాధం ప్రసభ మభికం స్వాం దుహితరం –గతం రోహిద్భూతాం రిరమయి షుమృశ్య వపుషా

ధనుష్పాణేర్యాతమ్ దివమపి సపత్రా కృతమముం –త్రసంతం తే ద్యాపిత్యజతి  న మృగ వ్యాధ రభసః ‘’

భావం –గౌరీశా !సంధ్యాదేవి బ్రహ్మ కూతురు .ఒక రోజు ఆమె లేడి రూపం పొంది విహరిస్తుంటే బ్రహ్మకాముకుడై ఆ లేడి వెంట పడి కూతురే అయినా క్రీడించటానికి ఉబలాట పడ్డాడు .అప్పుడు విషయం తెలుసుకొన్న నువ్వు పినాకం అనే ధనుస్సు ధరించి వేటాడే బోయవానిగా ఎడురయ్యావు .బ్రహ్మ భయపడి ఆకాశం లోకి పారిపోయాడు .నీ వేటగాని సంరంభం బ్రహ్మకు ఎప్పుడూ ఒణుకు తెప్పిస్తూనే ఉంటుంది .అనుచితంగా ప్రవర్తించే వారికి నువ్వు సింహ స్వప్నమే .

23-స్వలావణ్యాంశంసా ధృత ధనుష మహ్నాయ తృణవత్-పురః ప్లుస్టం ధృస్ట్వాపురమధన పుష్పాయుధమపి

యది స్త్రైణ౦ దేవీ యమనియత దేహార్ధ ఘటనా –దవైతి త్వామద్దా బత వరద !ముగ్దా యువతయః ‘’

భావం –పరాక్రమ ప్రబల త్రిపురాసురిడిని సంహరించిన పరమేశా !అహంకారం తో మన్మధుడు నీకు చిత్త చాంచల్యం కలిగించాలని సంకల్పించి విల్లు ఎక్కుపెట్టగా నువ్వు గడ్డిపోచనుకాల్చినట్లు  దహనం చేసేశావు .కనుక నువ్వు మన్మధ వికార రహితుడవని భావించాలి .యోగ సమాధిలో నిగ్రహించుకొన్న శరీరం తో నువ్వు జగజ్జనని అయిన పార్వతీ దేవిని అర్ధభాగంగా గ్రహించావు .తన ముఖ లావణ్యాన్ని తలచుకొని ఆమె నిన్ను స్త్రీలోలుడిగా భావించి ఉంటె, లోకం లో యువతులు తెలివి తక్కువ వాళ్ళు అని  నిశ్చయి౦చాల్సి వస్తుంది .ఇది యదార్ధమేకడా ఈశా .అంటే నిన్ను స్త్రీలోలుడిగా భావించటం తెలివి తక్కువ తనమే .

మాలవికాగ్ని మిత్రం లో మహా కవి కాళిదాసు ‘’కాంతా సమ్మిశ్ర దేహోప్య విషయ మనసాం యః పరస్తా ద్యతీనాం ‘’అన్నాడు శరీరం లో అర్ధభాగం గా పార్వతిని గ్రహించినప్పటికీ పరమేశ్వరుడు విషయ వా౦చల నుండి ఇంద్రియాలను నిగ్రహించుకొన్న యోగి పుంగవుల కంటే అగ్ర గణ్యుడుఅని తెలియ జెప్పాడు .

24-స్మశానేష్వా క్రీడా స్మరహర !పిశాస్స హ చరాః-చితాభస్మా లేపః స్రగపి నృక కోటీ పరికరః

అమంగల్యం శీలం తవ భవతు నామైవమఖిలం –తదాపి స్మర్త్రూణాం వరద !పరమం మంగళమపి ‘

భావం –స్మర దహనా !శివా !నువ్వు విహరించేది స్మశానాలలో .నువ్వుపూసుకోనేది శవాలు కాలిస్తే వచ్చే బూడిద .నీ మెడలో మానవ కపాలాల దండ .ఇలా నీ స్వభావం సర్వం అమంగళమే .వరదాతవైన నువ్వు భక్తులకు పరమ శుభ దాయకుడవు అవటం ఆశ్చర్యం .

‘’శివం కల్యాణం తద్యో గాద్వా శివ ప్రదత్వా ద్వా శివః ‘’అని శివ శబ్దానికి నిరుక్తి .శుభాలతో కూడి, శుభాలనిచ్సువాడు .అమంగళం గా కనిపించినా మంగళ కారుడు శివుడు అని తాత్పర్యం .

25-మనః ప్రత్యక్చి త్తే సవిధ మవధా యాత్త మారుతః –ప్రహ్రుష్య ద్రోమాణః ప్రమద సలిలో త్సంగిత దృశః

యదా లోక్యా హ్లాదం హ్రద ఇవ నిమజ్యా మృత మయే –తధత్యంత స్తత్వం కిమపి యమిన స్తత్కిల భవాన్ ‘’

భావం –దుర్గేశా !యోగులు యోగ విధానం లో మనసును వాయు స్తంభన చేసి ప్రత్యగాత్మ లో నిలుపుతారు .అప్పుడు వారు అలౌకికానందాన్ని పొందుతారు .ఆ ఆనందానుభవంగా వాళ్ళ ఒళ్ళు పులకరిస్తుంది .కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి .ఆ స్థితిలో  ఏ వస్తువును  చూసి అమృత సరస్సులో మునిగి నంత ఆనందం పొందుతారో దాన్ని వాక్కులచేత వివరింప శక్యం కాదు పరమాత్మా ! ఆ వస్తువు నువ్వే .పరమేశ్వరుడు సచ్చిదానంద పరబ్రహ్మ అని తాత్పర్యం .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-16 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.