వరద ´లో తేలి (రి )న తేట ఊట -5

వరద ´లో తేలి (రి )న తేట ఊట -5

25-ముద్దు కృష్ణ -సామి నేని ముద్దుకృష్ణ స్థిరంగా ఒక్క చోట ఉండేవాడుకాదు .ఎక్కడ కవులు వాలితే అక్కడ వాలిపోయేవాడు ..పెళ్లి చేసుకోలేదు ..ఎక్కువకాలం కాకినాడ రాజమండ్రి లో గడిపాడు ..కవిత్వం రాశాడు కానీ అచ్చేసుకోలేదు ..ఏదో కొత్తదారి తొక్కాలని కాంక్ష ఉండేది . సంచలనం కల్గించాలని తపన . తెలుగు కవిత్వం లో మంచివన్నీ ఏరి సంకలనం గా ”వైతాళికులు ”తెచ్చిన ఘనత ఆయనదే .దీన్ని శ్రీశ్రీ మెచ్చలేదు .ఎంపిక కృష్ణ శాస్త్రి చేశారని ముద్దుకృష్ణకాదని ఆయన అభియోగం .ఇందులో కొంత నిజం లేకపోలేదన్నారు వరద .
  ఆధునిక సాహిత్యానికి కృష్ణ శాస్త్రి చేసి పెట్టినంత ప్రచారం వేరెవ్వరూ చెయ్యలేదు .ఆధునిక కవులపద్యాలు గేయాలు ఊరూరా పాడి వినిపించింది శాస్త్రిగారే . ఆయనపాడిన వాటిలో తొంభై శాతం వైతాళికులు లో చేరాయి ..ఇంగిలీషు లో వచ్చిన ”గోల్డెన్ ట్రెజరీ ”ని మనసులో పెట్టుకొని వైతాళికులు తెచ్చానని ముద్దుకృష్ణ అన్నాడు . ఎన్నో ముద్రణలకు నోచుకున్నది
 ముద్దుకృష్ణ మాత్రాఛందస్సులో ప్రయోగాలు చేశాడు –
”వేయరా మగ్గం -నేయరా -నేయరా గుడ్డా -చేయరా -చేయరా సేద్యం
కాయండి యువకులు -కాయండి భుజములు కష్టంగా ఉంటుంది -కానీ తప్పదు మనకు
 బెజవాడలో ”జ్వాల”పత్రిక నడిపాడు అందులోనే శ్రీశ్రీ ”మరో ప్రపంచం ”మొదటి సారి అచ్చు ముఖం చూసింది .ఆపత్రికలో ”ఎవరైనా అక్రమ సంబంధం వలన చాటుగా పిల్లల్ని కంటే ఆదుకుంటాం ”అనే ప్రకటన ఉండేదని వరద గుర్తు చేశాడు . హరీన్ ఛట్ఠో ప్రభావం తో నాటకాలలో వేలు పెట్టాడు .అనార్కలి అశోకం అనే రెండు నాటికలు రాశాడు ముద్దు .వీటికి పూర్వమే చలం హరిశ్చంద్ర రాశాడు అయితే చలం నాటకం ఎక్కడా ప్రదర్షింపబడలేదన్నాడు వరద .
 గుంటూరులో అశోకం నాటకం ఆడుతుంటే సీత రావణుడికి అతి దగ్గరగా రావటం చూసి ప్రేక్షకులు సహించలేక వారి మద్దరి మధ్యా వెళ్లి కూర్చున్నారని నాటకం ఆగిపోయిందని వరద అన్నాడు ”ఈ నాటకాలను ముందు ప్రజలచేత చదివించి తరువాత ప్రదర్శించాల్సి ఉంది ”అన్నాడు ముద్దు వార తో
  తన సాహిత్య స్మృతులు రాసి పుస్తక రూపం లో తెద్దామనుకొన్నాడు .కానీ రాసింది మాయమై పోయింది .తరువాత వరద అడిగితె ”మంచిపనే జరిగింది వరదా .నాకు తెలిసినకవుల వెధవపనులన్నీ గుర్తున్నాయి వాటిని రాసి ఉంటె మనల్నీ తిడతారు .వాళ్ళ కవిత్వాన్ని మెచ్చుకొందాం లే ”అన్నాడు .
మిత్తులు బెజవాడలో సన్మానం చేద్దామనుకొంటే వారితో ”పెళ్లికాని వాడిని .నాకో మానం ఇప్పించండి సన్మానం వద్దు ”అని చమత్కరించాడు .ముద్దుకృష్ణ తాత ముద్దు నరసింహం గారు ”హిత సూచీని ”గ్రంధాన్ని 1840 లో రాసి వీరేశలింగానినికి పరోక్ష మార్గ దర్శకులయ్యారని వరద ఉవాచ అందులో వితంతు పునర్వివాహాన్ని సమర్ధించారు .శిష్ట వ్యావహారిక రచన .ముద్దు కృష్ణకూ సంఘ సంస్కరణాభిలాష వారసత్వంగా వచ్చింది .
26-తురగా వెంకట రామయ్య -”లోకాలు నాకెలానే -కోకిలా -బాలకృష్ణుడే చాలునే ”వంటి గేయాలు రాశాడు దీన్ని ద్వారం వారు ఫిడెల్ మీద వాయించి చిరస్మరణీయం చేశారు . దరిద్రం అనుభావిస్తున్నా ముఖం లో కొంటె తనం ఉండేది .బసవరాజు అప్పారావు తర్వాత గేయరచనలో తురగా సిద్ధ హస్తులు అన్నాడు వరద .శ్రీశ్రీ మీద ఆయన ప్రభావం ఉన్నది .పొల్లు లేని రచన ఆయనది
”దున్నరా ఈ భారత భూమిని -తొలకరించిన పుణ్య భూమిని -కరువు లేనీ స్వర్గ రాజ్యపు -దొరవు నీ వయ్యెదవురా ”
 తురగా వారిమీద వరద ”తురగ వెంకట రామయ్య -కొరగాని కవిత్వ మేల కొలిచెదవయ్యా ”అని ఆశువుగా చెప్పాడు వరద తలనిమిరి ”పద్యం బాగుండకపోయినా నిజం చెప్పావు నాయనా ”అన్నారట ..పిల్లలకోసం ఒక రాత పత్రిక ”జాబిల్లి ”తెస్తూ వరద ముఖ చిత్రం పై తురగావారి చేత
”ఆడుకొనుము పాడుకొనుము -ఆనందముతో వత్సా !తెలుగుతల్లి దీవెనలం -దించి మెచ్చన్ ”గేయం రాయించి వేశాడు ..ఆయన కావ్య సంకలనానికి ఎవరైనా పూనుకొని పుణ్యం కట్టుకోమని వరద గోల చేశాడు .
27-పురిపండా అప్పలస్వామి -విశాఖలో ఖద్దరు షాపు ఉండేది ఆయనకు .”కలాపహాడు అనే ఒరియా నాటకాన్నితెలుగులో అనువదించి ప్రచురించారు  భావకవిత్వం రాశారు . కృష్ణ శాస్త్రి ప్రభావం ఎక్కువ  ఆ వయసులోనూ ఇంగిలీషు ను సబినవీసు కేశవరావు గారిదగ్గర నేర్చుకునేవారు ఒకరోజు రాత్రి పిడుగులతో పడిన వర్షానికి ఆయన గది గోడమీద పిడుగుపడి ఎదుటి గోడకు కన్నం వేసింది ఈ అనుభవాన్ని ఆయన మర్నాడు కవిత్వీకరించారు .అదే ”సౌదామిని ”ఈ పేర సంకలనం తేవాలనే ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు ..కట్టమంచి తో ముందుమాట రాయించామని వరద నాన్నగారికి చెబితే ఆయనకిస్తే ,రామ కృష్ణారావు రాయలేదుకనుక తానెందుకు రాయాలని వ్రాతప్రతిని కూడా తిరిగి పంపలేదు .తర్వాత శ్రీ శ్రీ అందులో కొన్ని గీ తాలను ఇంగిలీషు లోకి తర్జుమా చేసి చిన్న పుస్తకం గా తెచ్చాడు ..సాహిత్యానికి అంకిఅతమైన జీవి స్వామి .శ్రీశ్రీ లాంటి వారెందరినో ప్రోత్సహించారు ..మాత్రా ఛందస్సులో అపురూప ప్రయోగాలు చేశారు స్వామి .అందులో ”మల్లెమడుగు ”పదికాలాలు నిలిచెరచన అని వరద విశ్వాసం .విశాఖ లో కవుల ఛాయా చిత్ర ప్రదర్శన మొట్టమొదటి సారి నిర్వహించింది అప్పలస్వామిగారే ఇది గ్రంథ రూపం పొందాలని వరద కోరాడు

28-నళినీ కుమార్ -అసలుపేరు ఉండవల్లి సూర్య నారాయణ ..శ్రీ శ్రీ మహా ప్రస్థానాన్ని అచ్చు వేసినవాడు నళినీయే .విశ్వనాధ కూడా తన రస తరంగిణి ప్రెస్ లో అచ్చు వేద్దామని ప్రయత్నించారు . జీవితం వికృతి అని భావించాడు .”పణ  విపణి ”కావ్యం రాశాడు .
”ముండ్లు లేని గులాబీ ల -చెండ్లకు దారమ్ము లేదు -క్రీనీడలు లేని వెలుగు -తానీషాలైన కనరు
శృతి కలియని పాటలతో -బ్రతుకంతయు చితికినది -ఏనాటికి వ్రాసినదో -ఈ నాటికి సుఖాంతమ్ము
యాచకులై ఎంచుకొనగా -నావకాశము కోరు టెట్లు ?జీవులెల్ల యాచకులే -జీవనమొక కబళ మ్ము ”
29- శ్రీరంగం నారాయణ బాబు -బుజం మీద దిగజారిన జుట్టూ ,చెంపలమీద నున్నగా దువ్వుకున్న గిరజాలు ,చిన్న చక్కని మీసం ,కళ్ళజోడు ,చాతీకి ఎడమవైపు ఖాజాలతో లాల్చీ , బెంగాలీ ధోవతి నారాయణబాబు ఆహార్యం ..నటాలిలో ఉద్యోగించాడు ..చెకోవ్ రాసిన చెరీ ఆర్చర్డ్ ను నాటకంగా అనువాదం చేయమని ఇస్తే చేశాడు కానీ అబ్బూరి నచ్చక శ్రీ శ్రీ వరదలకిస్తే ”సంపంగి తోట గా అనువదించి ప్రదర్శించారు .దీనిపై పెద్ద దుమారం లేపాడు దీనికి వేదిక ”నవోదయ వారపత్రిక ”లో నీలంరాజు వెంకట శేషయ్యకల్పించాడని వరద అంటాడు బాబు అమాయకుడేకాక భాష మీద అధికారం సాధించలేదన్నాడు వరద
30-అరసం -అభ్యుదయ రచయితల సంఘం ను అబ్బూరి ”మనం నాద బ్రహ్మను ఆశ్ర యిస్తే వాళ్ళు నినాద బ్రహ్మ ఆరాధిస్తున్నారు మనకి కుదరని వ్యవహారం ”అన్నారు .అరసం కమ్యూనిస్ట్ వాసన వేస్తోందని తెలిసి చాలామంది తప్పుకున్నారు .
విశ్వనాథను వరద ”మీ తోటికవులు అంతా అభ్యుదయ వాదులైతే మీరొక్కరే ఒంటరై పోయారేం /అని అడిగితె ఆయన –
”అరసంఘమే పెద్ద -అక్షయ పాత్ర -అడ్డమైన కవితే -అన్నపూర్ణాదేవి ”అన్నారు అప్పుడే కృష్ణ శాస్త్రి అరసం మీటింగ్ లో అధ్యక్షోపన్యాసం చేస్తున్నారని వరద  చమత్కరించాడు . .
  సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.