నేతి–నేతి-’’ఏతి’’
పరబ్రాహ్మం ను తెలుసుకోవటానికి ఇదికాదు అదికాదు అంటే నేతి నేతి -అంటే నా ఇతి ఇదికాదు అంటూ పోయి చివరికి ఆత్మయే పరమాత్మ అని తెలుసుకోమని వేదం ఉపనిషత్తులు బోధించాయి .ఇదే ఎలిమినేషన్ పధ్ధతి . అలాగే సుమారు 25 ఏళ్ళక్రితం హిమాలయాలలో మంచు మనిషి ఉన్నాడని అక్కడ కనిపించాడు ఇక్కడ కనిపించాడని పరిశోధకులకు ప్రోత్సాహం కలిగించి వాళ్ళందరూ వెళ్లి చూసి మంచుమనిషి ఉన్నదని కొందరు లేరని కొందరూ ఎటూ తేల్చలేక పత్రికలకు కావలసినంత మేత పడేశారు . పత్రికలూ పతాక శీర్షికలతో హల చల్ చేసినసంగతి మనకు తెలుసు .యదార్ధం ఏమిటో ఇప్పటికీ బ్రహ్మ పదార్దమే . ఏతి అంటే మంచుమనిషి .దానికే ‘షాంగ్రిల ‘’అనే పేరు .హిమాలయ సానువులలో జన్మించి సుమారు 5 0 ఏళ్ళు హిమాలయ పర్వతాలను ఆ చివర నుంచి ఈ చివర దాకా శోధించి అన్ని ఎత్తులలోను కాలినడకన సంచరించి గుహలలో తపస్సు చేసి హిమాలయాలే తనకు పాశాలలు అని తన అనుభవాలను ‘’లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ ‘’గా రచించిన స్వామి రామ మంచుమనిషి అనేది లేదని అదొక భ్రమ అని తేల్చి చెప్పారు . ఆ విషయాలే మీకు తెలియ జేస్తున్నాను .
పాశ్చాత్యులకు హిమాలయాలలో ఏతి -శాంగ్రిల అనే మంచుమనుషులుఉన్నారని భ్రమపడి ఎన్నో పరిశీలనలు చేశారు .వీరికి స్థానిక షెర్పాలు సామాను మోయటానికి దారి చూపటానికి సాయపడే వారు ఏ షేర్పా కూడా తానూ యేతి ని చూసినట్లు ఇంతవరకు చెప్పలేదు వాళ్ళు ఎక్కలేని ఎత్తు లేనేలేదు .
అయితే ఈ నమ్మకానికి కారణం హిమాలయాలలో చాలా ఎత్తున ఉన్న రెండు పురాతన మొనాస్ట రీస్ అంటే’’గుహా మఠాలు.’’ ఇవి అనుశ్రూతంగా తపస్సుకు అత్యంత అనుకూలమైన ప్రదేశాలుగా చెప్పబడ్డాయి .ప్రశాంతమైన వాతావరణం ,తపస్సుకు ఎలాంటి భంగమూ కలిగించని పరిస్తితులు ఇక్కడ ఉండటం వలన యోగులు ఇక్కడిదాకా కస్టపడి వచ్చి ధ్యానం తపస్సులతో ఆత్మ జ్ఞానం పొందేవారు .ఇందులో ఒక మఠం లేక ఆరామం కాంచనగంగ శిఖరం పై సుమారు 14 వేల అడుగుల ఎత్తున ఉన్నది ,రెండవది హిమాలయ అంతర్భాగం లో టిబెట్ -గార్వాల్ సరిహద్దులో ఉంది .ఈ గుహాకార ధ్యాన మందిర౦ లేక మఠ౦ చాలా మంది ఉండటానికి అనువుగా ఉంది .ఇది సుమారు 12 వేల అడుగుల ఎత్తులో ఉంది. చాలా కొద్దిమంది మాత్రమే ఇక్కడికి చేరుకోగలరు .ఇది ఇప్పటికీ ఉంది .ఈ గుహా మఠం లో సంస్కృత ,టిబెట్ ,సంధ్యాభాష వ్రాత ప్రతులు లభిస్తాయి .
సాధారణంగా విదేశీయులు డార్జిలింగ్ వచ్చిషెర్పాల సహాయం తో హిమాలయాలు చూస్తారు .వాళ్ళ పరిశోధనలో షా౦గ్రిల లేక ఏతిఅనే మంచుమనిషి ప్రస్తావన వస్తుంది .అందర్నీ అడుగుతుంటారు మీరు చూశారా మీరు చూశారా అని అదొక ఉత్కంఠ వాళ్లకు .అయితే వీళ్ళకేవ్వరికీ గోచరించని హిమాలయ ప్రాంతాలున్నాయి. వీళ్ళు ఎవరూ అక్కడికి వెళ్లి శోధన చేయలేదు చేయలేరుకూడా ..ఒకసారి ఒక అమెరికా ధనవంతుడు మంచుమనిషి ని అన్వేషి౦చ టానికి వచ్చి స్వామి రామా ను అడిగాడు .స్వామి తనకు అలాంటి మనిషి ఎక్కడా ఇన్నేళ్ళలో కనిపించలేదని రామా చెప్పారు ..నాలుగునెలలు ఉండి ౩౩ వేల డాలర్లు ఖర్చు చేసి ఎలాంటి ఫలితమూకనిపించక తిరిగి వెళ్ళిపోయాడు .ఢిల్లీ వెడుతూ దారిలో ఒక నేపాలీ సాధువును ఫోటో తీసి ఆయనే మంచుమనిషి అని చెప్పి పేపర్లలో ప్రచురించాడుకూడా .మరో పాశ్చాత్య మహిళా సిక్కిం నుంచి హిమాలయాలకు షేర్పా లసాయం తో వచ్చింది .డార్జిలింగ్ లో ఉంటూ మూడు సార్లు ప్రయత్నించి స్నోమాన్ ను కనుక్కోలేక పోయింది
తానూ చిన్నతనం నుంచి హిమాలయాలలో సంచరిస్తున్నా తనకు ఎప్పుడూ మంచుమనిషి షంగ్రిలా అనే ఏతి కనిపించలేదని స్వామి రామా చెప్పారు ..కాని హిమాలయ వాసులు వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మల వలన మంచుమనిషి కధలు గాధలూ ప్తరతరాలుగా వింటున్నారని అన్నారు .మానవుడికి ఫాంటసి అతి ప్రాచీనకాలం నుండే అలవడింది. అప్పటినుంచీ మంచుమనిషి కధ ప్రచారం లో ఉంది ..హిమాలయాలలో మంచు దట్టంగా ఉన్నప్పుడు మన చూపు కు ఆటంకమేర్పడి వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి .అప్పుడు అతి అరుదుగా కనిపించే ఎలుగు బంట్లు దూరం నుంచి చూస్తే మంచు మనుషులు అనిపిస్తాయి .కంటి దోషమేకాని యదార్ధంగా మంచు మనిషి కాదు .ఈ ఎలుగులు చాలా ఎత్తైన ప్రదేశాలలో మాత్రమే ఉంటాయి .పరిశోధకుల ఆహార పదార్ధాలను ఎత్తుకు పోయి తినేస్తాయి .అప్పుడు వాటి పాదాల గుర్తులు మానవ పాదం గుర్తులులాగా మంచులో దిగి చాలా పెద్దగా కనిపిస్తాయి .కనుక పరిశోధకులు ఈ పెద్దపాదాలను మంచుమనిషి పాదాలుగా భ్రమ పడుతారు .భ్రమ వలన కలిగే పొరబాటు ఇది .అంతేకాదు ఎలుగుబంటి మంచుపై వేగంగా పరుగెత్తినా,ఎత్తుకు ఎక్కుతున్నా కిందికి దిగుతున్నా దాని పాద ముద్రలు మామూలుకంటే చాలా పెద్దవిగా కనిపించటం సహజ౦ .తాను పెంచుకున్న ఎలుగు బంటి పాదముద్రలు కూడా ఇలాంటి సందర్భాలలో పెద్దవిగా చూడటం ఆశ్చర్య పోవటం జరిగింది అని స్వామి తెలియ జేశారు .దీనినే స్వామిరామ ‘’హిమాలయ మాయ ‘’అన్నారు .
అంతా బాగానే ఉందికాని అసలు ఈ ఏతిఅనే మాట ఎక్కడిది ,ఎందుకు వచ్చింది ?ఏతి కాదు అసలు పేరు ‘’యతి ‘’అంటే సన్యాసి ,యోగి అని అర్ధం .అది అపభ్రంశమై ఏతి గా మారింది .శంకరాచార్యస్వామి శిష్యులను యతులు అంటారు .వీరు ఈ అత్యంత ఎత్తైన హిమాలయాల గుహలలో తపస్సు చేసుకుంటారు . ఈ యతులు సాధారణం గా గుహలలో ఉంటారు బయటికి రారు ఎప్పుడైనా వీరు బయటికి వచ్చి కనిపిస్తే ఈ యతులను ఏతులు గా అంటే మంచు మనుషులుగా షంగ్రిలాలుగా భ్రమ పడుతారు అదీ అసలు రహస్యం
19 వ శతాబ్దికి పూర్వం నుంచే యేతిపదం ప్రచారం లో ఉంది .19,20 21 శతాబ్దాలలోకూడా చాలామంది చాలా దేశాలనుంచి వచ్చి మంచుమనిషిపై హిమాలయాలలో పరిశోదిన్చారుకాని అని ఫలితం శూన్యం .20 04 ,7 ,8 11 .లలో కూడా కష్టపడ్డారు .రష్యాలో 20 11 లో ఒక కాన్ఫరెంస్ జరిగి సైంటిస్ట్ లు తాము సేకరించిన సాక్ష్యాదారాలలో తొంభై ఐదుశాతం యేతి ఉన్నట్లు రుజువైందని చెప్పారు .కాని అందులో పాల్గొన్న అమెరికన్ ఆన్త్రో పాలజిస్ట్ ,అనాటమిస్ట్ జెఫ్రీ మెల్ డ్రంమాత్రం వారితో ఏకీభవించక అదంతా స్థానికులు ప్రచారం కోసం చేసిన స్టంట్ అని తెల్చిపారేసి వాళ్ళ ఆశలపై నీళ్ళు కుమ్మరించాడు .కనుక ఇప్పటికి’’ ఏతి’’ నేతి నేతి గా నే ఉంది .’’యతి ‘’అనుకొంటే మళ్ళీ సందేహాలు రావు .బ్రహ్మ పదార్ధం సిద్దించినట్లే .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-4-17-కాంప్-షార్లెట్ -అమెరికా

