కరపత్ర స్వామి ‘’అద్వైత బోధ దీపిక ‘’లోని ముఖ్య విషయాలు
ఒకసారి ఒక శిష్యుడు గురువు దగ్గరకు వగరుస్తూ పరుగెత్తుకొని వచ్చి తనను సంసార నావ దాటి౦చ మని సంసార సర్ప కాటునుంచి కాపాడమని కోరాడు .శిష్యుడు తెలివిగా లవాడేనని క్రమ శిక్షణ ఉన్నవాడేనని గ్రహించి గురువు ఇలా చెప్పాడు -’’’మార్పు లేని ,ఆకారం లేని , ఆనంద మయుడవైన నువ్వు పరకాయ ప్రవేశం చేశానని ,నికృష్ట జీవితం గడుపుతున్నానని ఎందుకు అనుకున్నావు ?నిజానికి చావు లేదు ,పుట్టుక లేదు చావటానికి ఎవరూ పుట్టటానికి చావటానికి ఉండరు .అసలు అలాంటిదేమీ లేదు .మరి ఉన్నదేమిటి అని అనుమానం వస్తుంది .ఆది అంతం లేని అద్వైతమైన బంధనం లేని సర్వ స్వతంత్రమైన ఏక ఆనంద సత్య చిదానందమే .మరి ఈ బాధలూ అవి ఎందుక౦ టే అద్వైత శక్తిని పూర్తిగా సరిగా అర్ధం చేసుకోకపోవటం వలన .మాయా మొహం వలన .అది ఎందుకు ఏర్పడుతుంది ?అజ్ఞానం అవిద్యవలన అలా అనిపిస్తుంది .సరే అజ్ఞానం అంటే ?శరీరం నేను అనే భావాన్ని కలిగిస్తుంది దానినే జీవాత్మ అనుకొంటుంది .ఈ జీవాత్మ ఈ కనిపించేది అంతా నిజమని తానేఅన్నీ చేస్తున్నానిఅనుకుని సుఖ దుఖాలు పొందుతాడు .అదికావాలి ఇదికావాలని ఆరాట పడతాడు .అంతేకాని తనను తానూ తెలుసుకోడు .తన స్వీయజ్ఞానాన్ని ఉపయోగించడు .’’నేనెవరు ? ఈ ప్రపంచం ఏమిటి ’’అని ప్రశ్నించుకోడు .కనుక సంసార లంపటం లో పడి స్వస్వరూపాన్ని జ్ఞానాన్ని కోల్పోయి మర్చిపోతాడు ఇదే అజ్ఞానం
శాస్త్రాలన్నీ మాయ వలననే సంసారం ప్రపంచం ఏర్పడుతున్నాయని అంటారు కదా మరి అజ్ఞానం వలన అంటారెందుకు ?ఈ రెండిటిని ఎలా సమన్వయించాలి ?మంచి ప్రశ్నే ఇది అజ్ఞానికి అనేక పేర్లున్నాయి అవే మాయ ,ప్రధాన ,అవ్యక్త ,అవిద్య ,ప్రకృతి చీకటి మొదలైనవి .అజ్ఞానం వలనననే సంసారం ఏర్పడుతుంది .అజ్ఞానం రెండు విధాలుగా ఆవరణ విక్షేపణ లా పని చేస్తుంది ఆవరణ లో రెండురకాలు -ఇదికాదు అనేది ,అది ప్రకాశించదుఅని చెప్పేవి .మరి వీటినుండి దూరమై అసలు స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి ?గురువులవద్ద శాస్త్రాలు చదివి అర్ధం చేసుకొని .అప్పటికీ అద్వైత భావన అర్ధం కాకపొతే సత్యం ప్రకాశించడు అనిపిస్తుంది .దీనివలన కొంత జ్ఞానం కలిగి ఇంకా భ్రమలోనే ఉండటం జరుగుతుంది .ఇదే ఆవరణలో రెండవ దశ .
విక్షేపం అంటే ?తాను అద్వైత సచ్చిదానంద స్వరూపం అయినా తనను శరీరిగా భావి౦చటం వాడు వీడు అనుకోవటం అన్నీ తానే చేస్తున్నట్లు చెప్పుకోవటం ను విక్షేపం అంటారు .ఇక్కడ అద్వైత సత్యం విక్షేపం లో చుట్టబడి ఉంటుంది . దీనినే అధ్యారోపణ౦ సూపర్ ఇంపోజిషన్ అంటారు .దీనిభావమేమి తిరుమలేశ ?తాడు పాముగా భావించటం స్తంభాన్ని దొంగగా భావించటం ఎండమావి ని నీరుగా అనుకోవటం లాంటిది .అసలు వస్తువును వేరొకటి అని భ్రమించటమే అధ్యారోపణ. ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే అద్వైత సచిదానంద పరమాత్మ సత్యమైనది .దీనిపై ప్రపంచం లోని జ్ఞాన అజ్ఞాన విషయాలు వస్తువులు విక్షేపిస్తాయి .ఇది నిజం కాని భావన -అన్ రియల్ ఫినామిన .అలా అయితే అద్వైతం కానిది ఏది ఎవరు విక్షేపం కలిగిస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది .సమాధానం మాయ .మాయ అంటే బ్రహ్మ గురించి తెలియకపోవటం
సృష్టికి ముందు లయం తరవాత ప్రపంచం లేదు అంటే ఏది ఉన్నట్లు ? సజాతీయ ,విజాతీయ ,స్వగత భేదాలు లేని ఆధార భూతమైన ది మాత్రమె ఉంది . అదే సత్యజ్ఞానమన0తమ్ బ్రహ్మ .దాన్ని తెలియటం యెట్లా ?వేదం ఏం చెప్పిందంటే -సృష్టికి పూర్వం శుద్ధ ఆత్మ మాత్రమే ఉన్నది .యోగ వాశిస్టం వలన కూడా అర్ధం చేసుకోవచ్చు .కొంచెం వివరంగా చెప్పాలంటే -ప్రళయం లో ఏక శుద్ధాత్మ తప్ప అంతా వెనక్కి తీసుకోబడుతుంది -విత్ డ్రాన్..శుద్ధాత్మ కదలదు మాట్లాడదుఆలోచించదు .కా౦తిచీకటికాని ఉండవు అయినా పరిపూర్ణంగా అవాచ్యం గ అంటే చెప్పటానికి వీలులేనిదిగా శూన్యం కానిదిగా ఉంటుంది .అలాంటి అద్వైత స్థితిలో సృష్టి ఎలా జరిగింది ?అంటే మాయ వలన .దానితో అనేక రూపాలు పేర్లు వచ్చాయి .ఈ మాయ మనసుగా మారి అన్నీ సృష్టిస్తుంది .ఈ విషయాన్ని ఇంతకు ముందు ఎవరైనా చెప్పారా ?శ్రీరాముడికి వశిష్టుడు చెప్పాడు .ఎలా ? బ్రహ్మ౦ శక్తి అనంతం .అ శక్తులు మార్పు చెంది అన్నీ ఏర్పడతాయి . బ్రహ్మానికున్న విశేష శక్తు లేమిటి?జ్ఞానులలో జగృతికలిగించటం ,ఆకాశగమనం భూమిని ఘనంగా చేయటం ,నీటికి ద్రవత్వం ,అగ్నికి వేడి ఆకాశం లో శూన్యం ,మృతజీవులను కుళ్లి౦ప జేయటం ,మొదలైనవి దాని అనంత శక్తులో కొన్నిమాత్రమే ఈ లక్షణాలన్నీ వాటిలో అంతర్గతంగా ఉంటాయి . బ్రహ్మ౦ వలన చైతన్యమౌతాయి . అద్వైత బ్రహ్మం లో ఇవన్నీ పైకి కనిపించకుండా లోపలే ఉండి నెమలి పురివిప్పినప్పుడు కనిపించే వివిధ రంగుల్లా విత్తనం లో దాగిన వృక్షంలా గుడ్డులోని పక్షిలా బయట పడతాయి .
బానే ఉంది ఇన్ని శక్తులు బ్రహ్మం లొ అంతర్గతంగా ఉంటె అన్నీ ఒక్కసారే ఎందుకు బయట పడవు అని అనుమానం రావచ్చు . భూమిమట్టిలో అనేక రకాల విత్తనాలు కాలాన్ని బట్టి ప్రదేశాన్నిబట్టి అనుకూల పరిస్తితులబట్టి ఎలా మొలకెత్తి వృద్ధి చెందుతాయో ఇక్కడా అంతే.బ్రహ్మం మాయ ను మనసుగా మార్చటం తో దాని శక్తులన్నీ విజ్రుమ్భించి ఈ ప్రపంచం ఆవిర్భ విస్తుంది అని రాముడికి వశిష్టుడు బోధించాడు .
రేపు 30-4-17 ఆదివారం వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకరాచార్య జయంతి సందర్భం గా శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—
