ధనికొండ హనుమంతరావు
ఒకప్పుడు’’ రేరాణి ‘’పత్రిక చదవని వారంటూ ఉ౦డేవారుకాదు ..చదవక పొతే గిల్టీగా ఫీలయ్యేవారుకూడా .అంతటి ప్రభంజనం సృష్టించి౦ది ఆ’’ రాత్రి రాణి ‘’..ఈ పత్రిక సంపాదకుడే ధనికొండ హనుమంతరావు .గుంటూరు జిల్లా తెనాలి దగ్గర అమృతలూరు మండలం లో ఇంటూరు గ్రామం లో హనుమంతరావు 1919 లో జన్మించాడు .బి ఏ .చదువు మధ్యలోనే ఆపేసి, రచనలపై దృష్టి పెట్టాడు .గొప్ప రచయితగా ప్రసిద్ధుడైనాడు .’’ఇంద్ర జిత్ ‘’ అనే మారుపేరుతో కూడా రాసేవాడు .ఆయన ఏదిరాసినా హాట్ కేక్ గా చలామణి అయ్యేది. అంతటి చదివించే శక్తి ఆయన కలానికి ఉండటం అదృష్టం .
ఆ కాలం లో బాగా పేరున్నవార ,పక్ష మాస ,పత్రికలకు ధనికొండ రచనలు’’ ధనకొండ ‘’గా నిలిచి సిరి సంపదలిచ్చాయి .అనేక కథలు రాసి 15 సంపుటాలుగా వెలువరించాడు .నవలలు నవలికలు 10 రాశాడు .ఆయన 7 నాటికలు ,నాటకాలు కూడా రాసి తన ప్రతిభ చాటాడు .అంటే ఆ రోజుల్లో అందరూ ఇష్టపడి చదివే ఈ మూడు ప్రక్రియలలో రచనలు చేసి పాఠకులకు అతి సన్నిహితుడయ్యాడు .
వడ్డాది పాపయ్య ముఖ చిత్రాలతో ,లోపలి రంగుల చిత్రాలతో చూడగానే మనసు దోచే’’యువ ‘’మాసపత్రిక ,వంపు సొంపుల అభిసారిక అందచందాలతో వెలిగే ‘’అభిసారిక ‘’ ధనికొండ మానస పుత్రిక , ,వెన్నెలకంటి వారు సాకి పెంచి పోషించిన న , బాపు రమణలు తీర్చిదిద్దిన ‘’జ్యోతి ‘’మాసపత్రిక , సాహిత్య పత్రికగా ప్రసిద్ధి చెందిన కాశీనాధుని వారి ‘’భారతి ‘’,అలాగే సుభాషిణి ,వాణి ,మహిళా సంపాదకురాలు నిర్వహించిన ‘’ఆహ్వానం ‘’మాసపత్రిక ,రఫ్ పేపర్ అనిపించే కాగితాలపై ప్రింట్ అయి వచ్చే ‘’చిత్రగుప్త ‘’మాసపత్రిక ,కె.ఎల్.యెన్ .ప్రసాద్ పురుడుపోసిన ఆంద్ర జ్యోతి ,నీలంరాజు వారు సాకిన ఆంధ్రప్రభ పత్రిక ,,ప్రజాబంధునీలిమ ,కథాంజలి ,ఆన౦ద వాణి,పుస్తకం మొదలైన ఎన్నో పత్రికలు ధనికొండవారి రచనలకు నిలయాలయ్యాయి .
ధనికొండ స్వయంగా క్రాంతి పబ్లికేషన్స్ ,కాంతి ప్రెస్ లు స్థాపించి తన రచనలేకాక ఇతర రచయితల రచనలనూ ముద్రించేవాడు .రేరాణి పత్రిక తో పాటు జ్యోతి మాసపత్రిక ,అభిసారిక ,చిత్ర సీమ పత్రికలను స్థాపించి ప్రచురించాడు .తీరిక లేని పని ఒత్తిడితో ఆయన ప్రెస్ లు ఉన్నప్పుడు జ్యోతి మాసపత్రికను వెన్నెలకంటి రాఘవయ్యకు ,అభిసారిక పత్రికను సామర్లకోటకు చెందిన’’ రాంషా ‘’కు ,చిత్రసీమ పత్రిక ను కొలను బ్రహ్మానందరావు కు ఇచ్చేశాడు .జ్యోతి ని రాఘవయ్యే నడిపినా సంపాదకుడి గా ధనికొండ హనుమంతరావు పేరే వేసేవాడు .
ధనికొండ సాహిత్య వివరాలు తెలుసుకొందాం —
1-నవలలు నవలికలు -1-లోక చరిత్ర 2- గుడ్డివాడు ౩-మగువ మనసు 4-ఏకాకి 5-ఇలవేలుపు 6-దూతికా విజయం 7-జ్ఞాని 8-తీర్పు 9-జగదేక సుందరి 10-క్లియోపాత్రా .
2- కథాసపుటాలు -1-పరిశోధన 2-గర్వ భంగం 3-ప్రియురాలు 4-కాముకి 5- సంజీవి 6-కుక్కతోక 7- బుద్ధి శాలి 8-ప్రణయాన్వేషి.9-అనాథ 10-చక్రి 11-అపనింద 12-గళ్ళరుమాలు13-పన్నాగం 14 –వృత్తి ధర్మ౦ 15-నా కొడుకు (పెద్ద కథ)
3-నాటికలు నాటకాలు –1-ఎర్రబుట్టలు 2- ఉల్టా సీదా 3-ప్రోఫెసర్ బిండ్సన్ 4-చికిత్స 5-జ్ఞాని 6-మధుర కల్యాణం( దృశ్య నాటిక) .7-పవిత్రులు (దృశ్య నాటిక)
అ నాటి తెనాలి సాహిత్యం లో నందనవనమై సురభిళ సాహితీ సంపదకు నిలయమైంది .రావూరి భరద్వాజ ,ధనికొండ హనుమంతరావు ,ఆలూరి భుజంగరావు ,శారద పేరుతో తెలుగు నవలలు రాసిన తమిళుడు నటరాజన్ అత్యంత స్నేహంగా సన్నిహితంగా ఉండేవారు .’’సాహిత్యబాట సారి శారద ‘’అని భుజంగరావు శారదను స్మరించాడు .ధనికొండ అండ తో , శారద ప్రోత్సాహంతో ఆలూరి రచన ప్రారంభించాడు .వీరందరికీసాహిత్య ప్రేరణగా నిలిచినవాడు రావూరి భరద్వాజ .ఒక్క ధనికొండ తప్ప వీరందరూ బీదరికపు లోతులు తరచినవారే .అందరూ అద్భుత రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారే .ధనికొండ హనుమంతరావు వీరికి అన్నిరకాలుగా వెన్ను దన్నుగా నిలిచిన దాత ,ప్రోత్సా హకుడు.
బహువిధ పత్రికాసంపాదకుడు ,కథ, నాటిక, నవలా ప్రక్రియలలో సామాజికాంశాలను ప్రతిబి౦బించేట్లు రచనలు చేసి,పాఠకులకు అతి సన్నిహితమైన చెయ్యి తిరిగిన రచయిత, వితరణ శీలి ,సాటి రచయితలకు కొండంత అండా, దండా ధనికొండ హనుమంతరావు 71 వ ఏట మద్రాస్ లో 21-12- 1989 లో మరణించాడు .
రాడికల్ హ్యూమనిస్ట్ ,తెనాలి ప్రాంతం వారూ అయిన డా .నరిశెట్టి ఇన్నయ్య గారు నాకూ ,శ్రీమైనేని గోపాల కృష్ణ గారికి సాహితీ మిత్రులు . చాలాకాలం నుండి అమెరికాలోనే శ్రీ ఇన్నయ్య దంపతులు పిల్లలవద్ద ఉంటున్నారు .నేను ఇండియాలో ఉన్నా ,అమెరికాలో ఉన్నా ,కనీసం నెలకొకసారైనా ఫోన్ చేసి మా ఇద్దరితో మాట్లాడే సహృదయులు .ఐదురోజుల క్రితం శ్రీ ఇన్నయ్యగారు అమెరికా నుంచి ఫోన్ చేసి, ఈ ఏడాది ధనికొండ హనుమంతరావు గారి శతజయంతి సంవత్సరం అనీ ,ఆయన సాహిత్యం నాదగ్గర ఉందా అనీ అడిగితే లేదని చెప్పాను.తామిప్పుడు తెనాలి మిత్రుల సహకారం తో ధనికొండ సంపూర్ణసాహిత్యాన్ని పునర్ముద్రణ చేస్తున్నామని చెప్పారు .చాలా సంతోషం అన్నాను .ఈ శతజయంతి సందర్భం గా ధనికొండ ను సాహితీ మిత్రులకు పరిచయం చేయటానికి చేసిన ప్రయత్నమే ఇది .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-9-18 –ఉయ్యూరు
ధనికొండ హనుమంతరావు
సాహితీ బంధువులకు ఒక విజ్ఞప్తి -నిన్న రాత్రి ధనికొండ హనుమంతరావు పై నేను రాసిన ఆర్టికల్ శ్రీ మైనేని గారు తనకు పంపగా శ్రీ ఇన్నయ్య గారు చదివి అందులో నేను మర్చి పోయిన విషయాన్ని తెలియ జేశారు .వారికి ధన్యవాదాలు -వారు సూచిన విషయం —
”రేరాణి సంపాదకులు గా ధనికొండ హనుమంతరావు ను చేసింది శ్రీ ఆలపాటి రవీంద్ర నాథ్.ధనికొండ ను ”అభిసారిక ”పత్రిక స్థాపించమని కూడా శ్రీ ఆలపాటి ప్రోత్సహించారు” .
మీకోసం మరొక్క వివరణ.శ్రీ ఆలపాటి రవీంద్ర నాథ్”మిసిమి ”అనే సాహిత్య సాంస్కృతిక మాస పత్రిక సంస్థాపక సంపాదకులు ..శ్రీ ఆలపాటి బాపన్న గత ఇరవై ఏళ్ళుగా ప్రచురణకర్తగా ఉన్నారు .శ్రీ చెన్నూరి ఆంజనేయ రెడ్డి ప్రధాన సంపాదకులు .శ్రీ అన్నపరెడ్డి వేంకటేశ్వర రెడ్డి సంపాదకులు .శ్రీ లక్ష్మీ రెడ్డి, శ్రీ ఈమని నాగిరెడ్డి ,,,అబ్బూరి గోపాలకృష్ణ, శ్రీ జయధీర్ తిరుమలరావు, శ్రీ కుర్రా శ్రజితేంద్ర బాబు సహాయ సంపాదకులు .
.మిసిమి మాసపత్రిక అరుదైన పత్రిక దాన్ని చదవటం ఒక గొప్ప అనుభూతిగా ఉండేది. మిసిమి తెల్లదనపు కాగితం ,రంగుల చిత్రాలు దేశ విదేశాల చిత్రాలు ఆయిల్ పెయింటింగ్స్ ,అరుదైన వ్యాసపరమపర మిసిమిని అత్యున్నత స్థాయి పత్రికను చేశాయి –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్
