గౌతమీ మాహాత్మ్యం-1

    గౌతమీ మాహాత్మ్యం-1

    సాహితీ బంధువులకు పవిత్ర  కార్తీకమాస శుభాకాంక్షలు –ప్రతికార్తీకం లో శివపరమైనది ఏదో ఒకటి ధారావాహికగా రాయటమలవాటై, కాశీఖండం, భీమఖండం ,శివానందలహరి శివమహిమ్న స్తోత్రం ,రుభు గీత మొదలైనవి రాసి మీకు అందజేశా. ఈ కార్తీకం లో  డా శ్రీ కొరిడెవిశ్వనాథ శర్మగారు ,డా  వెల్మకంటి హనుమాన్ శర్మగారు కలిసి ఆంద్రీకరించిన  శ్రీ బ్రహ్మ పురాణా౦తర్గత ‘’గౌతమీ మహాత్య్మం ‘’ను  ధారావాహికగా అందజేసే ప్రయత్నం చేస్తూ ,ఆ ద్వయానికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ ,ఈ అమూల్య గ్రంథాన్ని నాకు కానుకగా అందజేసిన  శ్రీ విశ్వనాథ శర్మగారికి నమస్సు లందజేస్తున్నాను  –దుర్గాప్రసాద్

     ప్రథమ అధ్యాయం

ఒకప్పుడు బ్రహ్మదేవుని నారద మహర్షి తీర్ద భేదాలగురించి   అడిగితే బ్రహ్మ ‘’అన్ని క్షేత్రాలలో ,తీర్ధాలలో జప తప  వ్రత దాన హోమాదులు చేస్తే వచ్చే ఫలితం పురుషోత్తమ క్షేత్రం లో చేసే దానికి సాటి రావు .’’పురుష ‘’అనే క్షేత్రం చాలా గొప్పది . సముద్ర జలాలతో శోభించే ఆ క్షేత్రాన్ని ఒక సారి సందర్శిస్తే పునర్జన్మ ఉండదు .అక్కడ ఒక ఏడాది ఉండాలి .కనీసం నెల అన్నా ఉండాలి .అలాంటి వాడు యోగేశ్వరుడైన హరి ఉండే పరమస్థానం పొందుతాడు .ఇదివరకే చాలా తీర్దాలు క్షేత్రాలగురించి వివరంగా తెలిపాను .పురుషోత్తమ పురాణం సంసార బంధాలను తెగగోడుతుంది’’అన్నాడు మునులకు సంతృప్తికలగక  అన్నిటిలో సర్వ శ్రేష్ట తీర్ధాన్ని గురించి వివరించమని కోరారు .అప్పుడు బ్రహ్మ ‘’ఈ విషయాన్నీ పూర్వం నారడుడుఅడిగితే చెప్పాను .ఎలాగంటే –అనగా నారదుడు ‘’తండ్రీ !నీ నుండి అన్నీ పొందాను .ఎన్ని తీర్దాలున్నాయి వాటి విశేషాలు ఇప్పుడు చెప్పు .’’అని అడిగాడు .బ్రహ్మ ‘’స్వర్గ ,మర్త్య ,రసాతలలో ఉండే తీర్దాలు దైవములు ,ఆసురాలు ,ఆర్షాలు ,మానుషాలు అని నాలుగు రకాలు .మానుష తీర్ధం కంటే ఆర్ష తీర్ధం, దానికంటే ఆసురం , దీనికంటే దైవ తీర్ధం పుణ్య ప్రదాలు .జనుల కోర్కెలు తీర్చేవి .బ్రహ్మ విష్ణు శివులచే నిర్మించబడినవి దైవతీర్ధాలు ముల్లోకాలలో తీర్ధం పవిత్రమైనది అనే చెప్పబడింది .కాని జంబూ ద్వీపం లోని తీర్దాలు ఎక్కువ ఫలితాలిస్తాయి. అందులోనూ భారత వర్షం లోని తీర్దాలు ముల్లోకాలలో ప్రసిద్ధం- కారణం భారత దేశం కర్మభూమి కనుక .హిమాలయ –వింధ్య పర్వతాలమధ్య ఉన్న ఆరు నదులు దేవ సంభవాలు .వింధ్య –దక్షిణ సముద్రం మధ్య ఉన్న ఆరునదులు కూడా దేవ సంభావాలే .అంటే ఈ 12నదులు ప్రాధాన్యం పొంది ,భారతవర్షం కర్మభూమిగా సుప్రసిద్ధమైంది ..ఆర్ష తీర్దాలు ,కొన్ని దైవజ తీర్దాలు రాక్షసులచేత ఆక్రమి౦చ బడ్డాయి .వీటినే ఆసుర తీర్దాలంటారు .దేవ భూములలో మహర్షుల తపో మహిమచేత నిర్మించబడినవి ఆర్ష తీర్దాలు .మానవులు ముక్తి ,పూజ ,ఐశ్వర్యం అభీష్ట సిద్ధికోసం ఏర్పాటు చేసుకొన్నవి మానుష తీర్దాలు .ఇలా తీర్దాలు నాలుగు రకాలు .ఈ తీర్దాల పూర్తి వివరాలు తెలియజేయమని నారదుడు పితామహుని కోరాడు .అప్పుడు బ్రహ్మ దేవుడు ‘’వింధ్య పర్వత దక్షిణ దిక్కు లో గోదావరి భాగీరధి ,భీమరదీ ,తుంగభద్రా  వేణికా ,తాపీ ,పయోష్ణీ నదులున్నాయి .హిమవత్పర్వతం నుంచి భాగీరధీ ,నర్మదా ,యమునా ,సరస్వతీ ,విశోకా,వితస్తా నదులు పుట్టాయి .వీటివలన ఏర్పడినవే దేవ తీర్దాలు .

  గయుడు ,కొల్లాసురుడు ,వృత్రుడు,త్రిపురాసురుడు ,అన్ధకుడు ,హయగ్రీవుడు ,లవణాసురుడు ,నముచి ,శృంగాకుడు ,యముడు ,పాతాలకేతువు ,మయుడు ,పుష్కరుడు అనే అసురులచేత ఆక్రమి౦ప బడినవి ఆసుర తీర్దాలు .ఇవీ శుభప్రదాలే .ప్రభాస ,భార్గవ ఆగస్తి  ,నర,నారాయణ ,వసిష్ట ,భరద్వాజ ,గౌతమ ,కశ్యప మను మొదలైన మునులచే సేవి౦పబడినవి రుషి తీర్దాలు . ,అంబరీష , ,హరిశ్చంద్ర ,మా౦ధాతృ,మనువు ,కురు ,కనఖల ,భద్రాశ్వ ,సాగర ,అశ్వ యూప ,నాచికేత ,వృషాకపి ,అరిందమ మొదలైన మానవులచే కీర్తి ఐశ్వర్య లబ్ధికి నిర్మింపబడిన శుభ ప్రదమైనవి  మానవ తీర్దాలు .స్వతస్సిద్ధంగా ఏర్పడిన పుణ్య తీర్దాలనే దైవ తీర్దాలంటారు .

  రెండవ అధ్యాయం –గంగోత్పత్తి

నారద మహర్షి ‘’త్రిమూర్తుల చే నిర్మింపబడినది తీర్ధ రాజ౦  అని చెప్పారు కదా దాని స్వరూప  భేదాలను వివరించండి ‘’అని బ్రహ్మను కోరగా ఆయన ‘’దైవ తీర్థాలను దర్శించనంతవరకు మిగిలినవి గొప్పవి .అన్ని నదుల్లో గంగానది  శ్రేష్టమైనది . కోరికలు తీర్చేది .దీన్ని’’ త్రి దైవత్యం ‘’అంటారు .దీని పుట్టుక గురించి చెబుతా .10వేల సంవత్సరాలకు పూర్వం తారకాసురుడు నేనిచ్చిన వర గర్వంతో దేవతల సంపద లాక్కొనగా దేవతలు విష్ణు మూర్తి ని దర్శించి స్తోత్రం చేసి ,శరణం లేని తమను ఎందుకు ఉపేక్షించావని  తారకాసుర వధతక్షణ కర్తవ్యమని   వాపోయారు .దానికి  ఆయన వివరంగా చెప్పమని అడిగితె వాళ్ళు ‘’వాడు యుద్ధం, తపస్సు శాపాలతో చచ్చేవాడు కాదు .పది రోజులపిల్లవాడి వలననే వాడి మరణం .దీనికి ఉపాయం ఆలోచించు ‘’అన్నారు .దానికి విష్ణువు ‘’నేను దేవతలు వాడిని చంపలేము ఈశ్వరుని వలన సాధ్యం కావచ్చు .ఆయనకు బలశాలి కుమారుడుగా పుడితే తారక వధ సుసాధ్యం  అందరం కలిసి వెళ్లి శివుడి వివాహ ప్రయత్నం చేద్దాం ‘’అని చెప్పి  వాళ్ళతో తోకలిసి హిమవంతుని భార్య మేనకాదేవిని దర్శించి ఆమెను స్తుతించి ‘’జగన్మాత దేవతలకార్యం తీర్చటానికి మీ గర్బం లో ప్రవేశించింది .ఆమె జన్మించి జగన్మాత అయి శివుని అర్ధాంగి అవుతుంది ‘’అన్నారు హిమవంతుడుకూడా సరే అన్నాడు .జగద్ధాత్రి గౌరీ గా మేనకా హిమవంతులకు జన్మించింది .శివునిపైనే ఆమె మనసు లగ్నమైంది .దేవతలు ఆమెను శివుని అనుగ్రహం కోసం తపస్సు చేయమని ప్రార్ధించారు .అలాగే హిమాలయం పై ఘోర తపస్సు చేసింది .

 దేవతలకు మహర్షులకు శివుడికి గౌరిమీద ప్రేమ ఉందా  అనుమానం వస్తే బృహస్పతి ‘’మన్మధుడి పరాక్రమం ముందు ఎవరూ ఆగలేరు .కనుక అతడిని ఒప్పించి , శివునిమనసులో మన్మధ తాపం కలగ జేయమని కోరండి ‘’అనగా మదనుని ప్రేరేపించగా అతడు భార్య రతీ దేవితో వచ్చి ముందు సందేహించినా దేవకార్యం కదా అని సిద్ధమై శివునిపై పుష్పబాణ౦  వేయటం ఆయన కంటిమంటకు భస్మమై పోవటం క్షణాలలో  జరిగిపోయాయి .దేవతలు శివుడిని ప్రార్ధించి’’ తారకాసుర సంహారానికి మేము చేసిన ప్రయత్నం ఇది నువ్వు హిమవత్పుత్రికను వివాహమాడాలి .మీకు జన్మించిన కుమారుడు తారక సంహారం చేయగలడు’’అనగా శివుడుకూడా  అంగీకకరించగా అరుంధతీ వసిస్టమహర్షి లను ,బ్రహ్మ విష్ణువు లను ఒప్పించి హిమవంతునికి నచ్చ చెప్పి శివ పార్వతుల కల్యాణం దగ్గరుండి జరిపించారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-11-18-ఉయ్యూరు   

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.