గౌతమీ మాహాత్మ్యం -14
23-పాప ప్రణాశన తీర్ధం
ధృతవ్రతుడనే బ్రాహ్మణుడు మహీ అనే సుందరిని పెళ్ళాడి ,సూర్య ప్రతాపం ఉన్న కొడుకు’’సనాజ్జతుడు ‘’ను కనీ చనిపోయాడు .మహి గాలవ మహర్షికి కొడుకునప్పగించి స్వేచ్చా చారిణిగా మారి తిరుగుతోంది .గాలవుని వద్ద ఉన్న ఆమె కొడుకు కు తల్లిగుణాలబ్బి వేశ్యాలోలుడై నానాజాతులతో ఉండే జన స్థానాకి వెళ్లి అక్కడ వేశ్యగాఉన్న మహి తో తల్లి అని తెలియదు కనుక కామ కేళిలో ఉన్నాడు .
కొడుకులో ఎక్కడో వాసనా రూపంగా తండ్రి లక్షణాలు ఉండటం వలన వాడు బ్రాహ్మీ ముహూర్తం లొ గౌతమీ స్నానం చేసి సంధ్యావందనం చేసి ,విప్రులకు నమస్కరించి తర్వాత తన విద్యతో డబ్బు సంపాదించి తనవార కాంత ఐన తల్లి మహిని పోషిస్తున్నాడు సుఖిస్తున్నాడు .ఒక రోజు గాలవముని గౌతమీ నదికి స్నానానికి వెళ్ళినపుడు వికృత రూపం లొ కుష్టు రోగి ఒకడు ఒళ్ళంతా చీము నెత్తురూ కారుతూ గంగలో స్నానం చేసి బయటికి వచ్చాక అందంగా సూర్యకా౦తితో కనిపించేవాడిని చూశాడు .అతడికి ఈ రెండు రూపాల విషయం తెలియదు .గాలవమహర్షి స్నానం చేసే చోటే అతడూ చేసి మునికి నమస్కరించి వెళ్ళేవాడు .గాలవుడు కనిపెడుతూనే ఉన్నాడు .ఒకరోజు ముని అతని గురించి అడిగాడు .’’రేపు చెబుతాను ‘’అని వెళ్ళిపోయాడు .
రాత్రి తనకు పడకసుఖం ఇస్తున్న తల్లి మహితో ‘’మన ఇదరికి ఒకరిపై ఒకరికి సమాన ప్రేమ ఉంది .నీపేరు ,కులం ఊరు బంధువుల గురించి చెప్పు ‘’అని అడిగాడు .ఆమె తాను ధృత వ్రతుని భార్య అని ,తనకొడుకు సనాజ్జతుడిని గాలవమునికి అప్పగించి స్వైరిణిగా తిరిగి వేశ్యనయ్యానని తానూ బ్రాహ్మణ స్త్రీనే అని చెప్పింది .ఈ మాటలువిన్న విటరూపం లొ ఉన్న కొడుకు తట్టుకోలేక కిందపడిపోగా , కారణం అడుగగా తానూ ధృత వ్రాత ,మహీల కుమారుడుసనాజ్జాతుడ నని దైవ వశం లొ తానూ తల్లితో కామకేలి చేస్తున్నానని చెప్పగా విధి ఆడిన వి౦త నాటకానికి ఇద్దరూ తట్టుకోలేక విలపించారు.తెల్లవారగానే గాలవ మునిని సందర్శించి రాత్రి జరిగిన విషయం వాడు చెప్పాడు. గాలవుడు ‘’దుఖించకు.నీరెండు రూపాలు రోజూ నేను చూస్తూనే ఉన్నాను .అందుకే నిన్ను అడిగాను .నేనేది తెలుసుకొన్నానో దానినే నువ్వూ చెప్పావు .ఈ తీర్ధ మాహాత్మ్యం వలన ,గంగానుగ్రహం వలన నువ్వు పవిత్రుడవయ్యావు .నీ ఉదయరూపం నువ్వు పగలూ రాత్రి చేసిన పాపాలతో కూడినది .గౌతమీ స్నానాన౦తర రూపం ఉత్తమ గుణ శోభితమైనది .నీతల్లి కూడా తన పాపం తెలుసుకొని పస్చాత్తపపడింది కనుక నిష్కృతి పొందింది .ప్రాణికోటి కి విషయ వాంఛ సహజం . సత్సంగం పుణ్యాన్నిస్తుంది. సత్సంగత్వమే మోక్ష హేతువు .నీతల్లి కూడా గంగా స్నానం చేస్తే పాపాలు దూరమౌతాయి .మహికూడా గంగాస్నానం కొడుకుతో సహా చేసింది.ఇద్దరూ పవిత్రులై నారు కనుక ఇది ‘’దౌత పాప తీర్ధం ‘’అయింది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు’
24-విశ్వామిత్ర తీర్ధం
నారదుని బ్రహ్మ విశ్వామిత్ర తీర్ధ విశేషాలు చెప్పాడు –ఒకప్పుడు విపరీతమైన అనావృస్టి ఏర్పడింది .విశ్వామిత్ర మహర్షిభార్య ,పిల్లలు శిష్యులతో గౌతమీ తీరం చేరి ఆకలికి అల్లల్లాడుతూ శిష్యులను వెతికి తినటానికి ఏదో ఒకటి తెమ్మన్నాడు .ఎంత వెదికినా తినటానికి ఏమీ దొరక్క ,చచిపోయిన కుక్క కనిపిస్తే తీసుకొచ్చారు .శుభం అంటూ దాన్ని చేతితో తాకి ‘’ముక్కలు చేసి చక్కగా వండండి .పితరులకు, రుషి, దేవతలకు హోమాగ్నిలో హవనం చేసి ,అతిధులకు ,గురువులకు తృప్తిగా పెట్టండి .మిగిలింది మనమందరం తిందాం ‘’అన్నాడు .శిష్యులు ‘’శ్వ మాంసం ‘’వండుతుండగా అగ్ని దేవుడు మిగిలిన దేవతలదగ్గరకు వెళ్లి విషయం వివరించగా ,ఇంద్రుడు డేగ రూపం లొ వచ్చి మాంసం ఉడికే గిన్నె తన్నుకు తీసుకు పోయాడు .మునికి చెప్పగా కోపం తో ఇంద్రుని శపించటానికి కౌశికుడు సిద్ధమవగా ,భయపడిన ఇంద్రుడు దానిని అమృతం తోని౦పి యధాప్రకారం నిప్పులపై ఉంచగా ,మధుపాత్ర అని తెలిసిన ముని ‘’కుక్కమా౦సమే మాకు ఇవ్వు మధువు నువ్వే తీసుకో .లేకపోతె భస్మ౦ చేస్తా నిన్ను ‘’అని ఆగ్రహంగా అన్నాడు..ఇంద్రుడు ‘’హాయిగా మధుపానాన్ని నువ్వూ నీకొడుకులు భార్యా చేసి తృప్తి చెందక కుక్కమాంసం కావాలనటం వివేకమా ‘’అన్నాడు .విశ్వామితుడు ‘’అమృతం మేమే తింటే నన్ను నమ్ముకున్న శిష్య ముని గురు గణం ఏమవ్వాలి .ప్రజలంతా అన్నమో రామ చంద్రా అని అలమటిస్తుంటే నేను హాయిగా అమృతపానం చేసి సుఖపడలేను మేమంతా కుక్కమా౦సమే తింటాం ‘’అని భీష్మించాడు.సాటి మనుషులపై మహర్షికి ఉన్న అనుకంపను అర్ధం చేసుకొని ఇంద్రుడు తక్షణమే మేఘాలను పిలిపించి కుంభ వృష్టి కురిపించి అనావృస్టి తొలగేట్లు చేసి ప్రజలకు తృప్తి కలిగించాడు .
విశ్వామిత్రుడు ఇంద్రుడు అందజేసిన అమృతాన్ని ముందుగా దేవతలకు అర్పించి తృప్తి పరచి ,తర్వాత మూడులోకాలను తృప్తి పర,చి ఆతర్వాత భార్యా పుత్రులు శిష్యులతో అమృతం సేవించాడు .ఇంద్రుడు అమృతాన్ని తెచ్చి ఇచ్చిన ఈ ప్రదేశం విశ్వామిత్ర ,మధు ,ఇంద్ర, శ్యేన ,పర్జన్య తీర్ధం గా ప్రసిద్ధి చెందింది .ఈ తీర్ధం లోనే రాముడు సీతాసమేతంగా పితరులకు తర్పణం చేశాడుకనుకపిత్రుతీర్డం అంటారు .ఇక్కడే శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని పూజించాడు కనుక విశ్వామిత్ర తీర్ధం అయింది
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -22-11-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
