గౌతమీ మాహాత్మ్యం -29 41- పిప్పల తీర్ధం  

గౌతమీ మాహాత్మ్యం -29

41- పిప్పల తీర్ధం

శివుడు విష్ణువు యెడ ప్రసన్నమైనదే  పిప్పల తీర్ధం .ఒకప్పుడు దధీచి మహర్షి అర్ధాంగి,అగస్త్యముని భార్య లోపాముద్రకు సోదరి ఐన  గభస్తిని తో  భాగీరధీ తీరం లో తపస్సు చేస్తున్నాడు ఈమెకు ‘’వడవా ‘’అనే పేరుకూడా ఉంది .మహర్షి ప్రభావం వలన ఆ ప్రాంతం లో శత్రువులు ,రాక్షసులు లేరు .ఒకసారి దైత్యమర్దన చేసిన దేవతలు ,రుద్ర ,ఆదిత్యులు ముని ఆశ్రమానికి వచ్చి ,స్తుతించి అతిధి సత్కారం పొంది మహర్షితో ‘’రాక్షస సంహారం చేసి , మీ దగ్గరకు వచ్చాం .ఇప్పుడు మాఆయుదధాలతో పని లేదు .వీటిని మీ ఆశ్రమ లో దాచటానికే వచ్చాం .వాటిని దాచి ,రక్షించే సమర్ధత మీకే ఉంది ‘’అనగా సరే అన్నాడు .భార్య వివేకం తో ‘’మహర్షీ !దేవతలఆయుధాలు ఇక్కడ దాస్తే ,రాక్షసులకు మనపై కోపం వచ్చి శత్రువులౌతారు .ఒకవేళ ఆయుధాలను ఎవరినా అపహరిస్తే దేవతలకు శత్రువులమవుతాం .ఇతరుల సొమ్ము దాచటం సజ్జనులు చేయరాదు ఆలోచించండి ‘’అనగా ముని ‘’దేవతలమాటకు సరే అని ఇప్పుడు కాదనటం న్యాయం కాదు ‘’అని చెప్పి ఆయుధాలు దాచటానికిఅనుమతినివ్వగా సంతోషించిన దేవతలు తమ ఆయుధాలు దధీచి మహర్షి ఆశ్రమం లో భద్రంగా దాచి స్వర్గానికి సంతోషంగా వెళ్ళిపోయారు .

  వెయ్యి సంవత్సరాలు గడిచాయి .ఒకరోజు భార్యతో మహర్షి  దేవతాయుధాలు తమవద్ద దాచటం వలన దైత్యులు ద్వేషిస్తున్నారని చెప్పి ,సురలు అస్త్రాలను తీసుకు వెళ్ళటం లేదని బాధపడి ఉపాయం చెప్పమన్నాడు .అన్నిటికీ భర్తయే సమర్ధుడని ఆమె చెప్పగా, దధీచి మంత్రజలం తో ఆ అస్త్రాలను కడిగి ,తేజోమయం చేసి  ఆ మంత్రజలాన్ని తాగేశాడు .అస్త్రాలు నిర్వీర్యాలై క్రమ౦గా నశించి పోయాయి .కొంతకాలమయ్యాక  సురలు  మహర్షి దగ్గరకు వచ్చి తమకు రాక్షస భయం ఎక్కువైందని ,అస్త్రాలనిస్తే వెళ్లి యుద్ధం చేసి జయిస్తామని చెప్పగా ,తాను  అస్త్రాలను తాగేశానని చెప్పాడు .

 సందిగ్ధం లో పడిన దేవతలు ‘’మహాత్మా !అస్త్రాలు వద్దనీ చెప్పలేము ,ఇమ్మని అడగటానికి వీలుకూడాకాకుండా ఉంది .మేము దేవలోకం లో తప్ప ఇంకెక్కడా ఉండే అవకాశం లేదు .మీముందు మాట్లాడటాని అశక్తులం ‘’అని వినయంగా విన్నవించారు .అప్పడు గౌతముడు తన ఎముకలలో లో అస్త్రాలున్నాయని వాటిని తీసుకోమని చెప్పగా వాటితో తాము దానవ భంజన చేయలేమన్నారు .దధీచి ‘’నేను యోగం తో ప్రాణాలు వదిలేస్తాను .నా అస్ది రూపమైన ఉత్తమోత్తమమైన అస్త్రాలు తీసుకోండి ‘’అన్నాడు .అలాగే అన్నారు. ఆసమయం లో గర్భవతి అయిన ఆయన ధర్మపత్ని అక్కడ లేదు .ఆమె వస్తే అభ్యంతరం చెబుతు౦దేమోననే సందేహం తో మహర్షిని వెంటనే ప్రాణాలు వదిలేయమని తొందరపెట్టారు .దధీచి ‘’నా దేహాన్ని మీరు ఎలాకావాలంటే అలా వాడుకోండి ‘’అని చెప్పి,పద్మాసనం లో కూర్చుని ,నాసాగ్రం పై దృష్టి నిలిపి ,ప్రసన్న చిత్తం తో యోగం ద్వారా సుషుమ్నను జాగృతం చేసి ,శరీరరగత వాయువు అగ్ని ఉద్దీపి౦ప జేసి  నెమ్మదిగా హృదయగహ్వరం లో ప్రవేశపెట్టి ,పరబ్రహ్మము పై  బుద్ధినిల్పి పరబ్రహ్మ సాయుజ్యం పొందాడు .

  ‘’ సుందరానికి తొందరెక్కువ ‘’అన్నట్లు  సురులు  హడావిడి పడుతూ త్వష్ట ను పిలిచి దధీచి శరీరం తో అస్త్రాలు చేయమని చెప్పారు .త్వష్ట ‘’ఇది బ్రాహ్మణ కళేబరం .నేను చీల్చి అస్త్రాలు చేయలేను .ఎవరినా  అస్దు లను వేరు చేస్తే ,చేసిస్తాను ‘’అన్నాడు పాలుపోక వాళ్ళు గోవులను పిలిచి దేవకార్యం కోసం ముని అస్ధులను వేరు చేయమని వేడుకొన్నారు .అవి వెంటనే ఎముకలను వేరు చేసి బాగా నాకి  శుభ్రం  చేసి దేవతలకిచ్చాయి .దేవతలు సంతోషం తో ,గోవులు విధి నిర్వర్తి౦చామన్న సంతృప్తితో వెళ్లి పోయారు .త్వష్ట దధీచి ఎముకలతో దేవతలకు కావాల్సిన అస్త్రాలు తయారు చేసి వెళ్ళిపోయాడు .

  చాలాకాలం తర్వాత గర్భవతి దధీచి మహర్షి పత్ని భర్త కోసం ఆశ్రమానికి వచ్చింది .దారిలో పిడుగుపడి ఆలస్యమైంది .భర్త కనపడక పోయే సరికి అగ్నిని ప్రశ్నించింది .జరిగినదంతా ఆమెకు తెలియజేశాడు అగ్ని .దుఖితురాలై నేలపై మూర్చపోయింది. తేరుకొని తాను  దేవతలను శపించటానికి సమర్ధురాలను కాను కనుక అగ్ని ప్రవేశమే మంచిదనుకొని ,కాసేపు వితర్కి౦చు కొని తనభర్త పరోపకారం కోసం శరీర త్యాగం చెసిఉత్తమ లోకాలు పొందాడు ,విధి రాత తప్పి౦పరానిది అని ఊరట చెందింది .దధీచి మహర్షి అవశిస్టాలైన రోమాలు ,చర్మ౦ ఒక చోట చేర్చి ,తనకడుపు చీల్చి అందులోని బాలకుడిని చేతిలోకి తీసుకొని గంగానది ,భూమి ,ఆశ్రమం ,వృక్షాలకు వోషధులకు నమస్కరించి –

‘’పిత్రాహీనో బందుభి ర్గోత్రజై శ్చ ,మాత్రాహీనో బాలకః సర్వఏవ-రక్షంతు సర్వేపి చ భూత సంఘా స్తథౌషద్యో బాలకాం లోకపాలకం ‘’—ఏ బాలకాం మాత్రు పితృప్రహీణం,స నిర్వి శేషం స్వతను ప్రరూ ఢైః-పశ్యన్తి రాక్షన్తిత ఏవ సూన౦ ,బ్రహ్మాది కనామపి వందనీయాః’’అని ప్రార్ధించింది –తండ్రి బంధువులు గోత్రం  లేని ఈబాలుడు మాతృ హీనుడు .మీరంతా వేడిని రక్షించాలి .స్వంతబిడ్డ లాగా వీడిని చూసినవారు బ్రహ్మాదులచేతకూడా నమస్కరింప దగినవారు .

  అని పలికి పిప్పల వృక్షం కింద బాలుని వదిలేసి ,,అగ్ని ప్రదక్షిణం చేసి ,యజ్ఞపాత్రతో భర్త తో అగ్ని లో ప్రవేశించి ,భర్తతో స్వర్గం చేరి౦ది .ఈ కరుణార్ద్ర సన్నీ వేశానికి ప్రకృతి కూడా విలపించింది .తండ్రిలాంటి దధీచి,తల్లిలాంటి ఆయన అర్ధాంగి ప్రాతి ధేయి లేకుండా ఆశ్రమం లో ఉండటానికి మృగాలు ,పక్షులు ఓషధులు కూడా ఇష్టపడక  తమ రాజైన సోముని ఆశ్రయించి అమృతం కోరగా ఇచ్చేయగా ఆబాలుడికి అమృతం ఇచ్చారు .ఆ వృక్షాలే అతన్ని పెంచాయి పిప్పల  వృక్షాలచే పెంచబడిన ఆబాలుడు ‘’పిప్పలాదుడు ‘’అయ్యాడు .చెట్టు విత్తనం నుంచి ,పక్షి గుడ్డు నుంచి పుడితే తాను వృక్షాలనుండి ఎలా పుట్టాను అనే సందేహం కలిగి వాటిని అడిగితె అతని తలిదండ్రుల చరిత్ర అంతా పూసగుచ్చినట్లు చెప్పాయి .సంతృప్తి చెందిన బాలుడు తన పితృ హత్య చేసినవారి పై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పగా ,అవి సోముడి దగ్గరకు తీసుకు వెళ్ళాయి .సోమునిస్తుతి౦చ గా  సంతోషించి మంచి విద్య నేర్వటానికిసహకరిస్తానన్నాడు .తన తండ్రి హంతకులపై ప్రతీకారం తీర్చుకోకుండా ఆవిద్యలు తన కెందుకన్నాడు .భుక్తి, ముక్తి శివునివలననే కలుగుతాయి .అనగా బాలుడనైన తానెట్లా ఆపని చేయగలనని అడిగితె, గౌతమీ నదికి వెళ్లి చక్రేశ్వర హరుని  స్తుతి౦చమంటే,పిప్పల వృక్షాలు ఆబాలుని తీసుకొని వచ్చి దింపి వెళ్ళాయి.

  పిప్పలాదుడు గౌతమీ  స్నానం చేసి శుచియై ,శివునికై తపస్సు చేసి మెప్పించి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, తన తండ్రి హంతకుల పై ప్రతీకారేచ్చ వెల్లడించగా త్రినేత్రుడు అతన్ని తన మూడవకంటి ని చూడగలిగితే దేవతలను సంహరించే శక్తి వస్తుందని చెప్పగా ,మనస్సు నిల్పి ప్రయత్నం చేసి ,సాధ్యంకాక పోతే శివుడే తపస్సు చేసి సాధించమని చెప్పి అదృశ్యమయ్యాడు .      సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-12-18-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.