గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4భాగం )–సంపాదకులు -డా.ఇ.ఆర్.కృష్ణారావు-1964 (వెంకటేశ్వర యూని వర్సిటి
350–వేదసమీక్షా -2(చివరి గీర్వాణ కవుల
‘’సామవేదః లౌకికో వ్యవహారశ్చ’’వ్యాసం లో శ్రీ మ.రామ నాథదీక్షితులుగారు ‘’వేదానాం సామ వేదోస్మి ‘’,’అని గీత లో,’సామగాన ప్రియా ‘’అని లలితా రహస్యం లోను ఉన్న సామవేద విశిష్టతను సంస్కృత వచనంలో చక్కగా చెప్పారు .అందులోని బ్రాహ్మణాదులను నిర్వ చించారు .అదృస్టవంతులైన స్వర్గాదులకే కాక ,దృష్ట ప్రయోజనం కల లౌకిక సిద్ధులకు కూడా సామమంత్ర ప్రయోగం ఎలా ఉపయోగపడుతుందో వివరించారు .
శ్రీ వే.జగదీశ్వర శాస్త్రి గారు ‘’శుక్ల యజుర్వేదమీమా౦సా ‘’లో యజుర్వేద ప్రథమామాచార్యుడు యాజ్ఞవల్క్య అతిశయాన్ని ,శాఖా భేదాలను ,శత పద బ్రాహ్మణ విశేషాలను ,ఈ సంహితకు భాష్య కారులను చెప్పి ,యాజ్ఞవల్క్య చరిత్రతో ముగించారు .మంత్రం భాగము మాత్రమె వేద పద వాచ్యం అనే ఆధునికుల వాదాన్ని ఖండించి సహేతుకంగా మం త్రం ,బ్రాహ్మణాలు రెండూ వేద పద వాచ్యాలని సప్రమాణంగా రుజువు చేశారు .
శ్రీసూర్య ప్రకాశ శాస్త్రి గారు ‘’వేదేషు రాజనీతిః’’లో వేదభాగం లోని వాక్యాలను సూత్ర ప్రాయంగా తీసుకొని ,మన్వాది స్మృతులు ,పురాణాలు ,కౌటిల్యుని అర్ధ శాస్త్రం ఎలా విస్తరించాయో వివరించారు వేద విధానం లో ‘’రాజ సూయం ‘’ప్రకరణ బట్టి భారతీయ రాజుల ధర్మ ప్రవర్తన ,ప్రజాను రంజకపాలన నిరూపితమైందని ,క్షత్రియులే రాజులైతే వారిలో విద్యావినయాది సద్గుణాలు కలవారికే రాజ్యాభిషేకం చేయాలని ,వాళ్ళు మంత్రి, పురోహితులను నియమించుకొని వాళ్ళ ఆజ్ఞలు పాటించాలని తెలిపారు .మంత్రుల లో పురోహితుడు అగ్రగణ్యుడు .అతడు ఉత్తమ గుణ శీల సంపన్నుడై, వేద వేదాంగాలలో ,దైవ కార్యాలలో ,దండనీతిలో నిష్ణాతుడై దైవ ,మానుష ఉపద్రవాలకు ప్రతిక్రియ చేయగల సమర్ధత కలిగి ఉండాలి .రాజు పురోహితుని గురువుగా ,ఆచార్యునిగా సేవించాలి. యుద్ధ౦ ఆత్మ రక్షణ ,,పన్నులు ఎలా చేయాలో స్పష్టంగా చెప్పారు .
‘’వేద లక్షణం ‘’లో శ్రీ రా. కృష్ణ స్వామి ఘనాపారి గారు ప్రాతి శాఖ్యాల ప్రయోజనం వివరించారు .’’దర్శనానాంలోక న్యాయానా౦ చ మూల భూతా వేద భాగాః’’లో శ్రీ చతుర్వేది రామ చంద్రా చార్యులుగారు కొందరు దర్శనాలు 6అంటే మరికొందరు 10అన్నారని ,’’సర్వ దర్శన సంగ్రహం ‘’16 చెప్పిందని ,ఆయా అభిప్రాయాలకు మూల భూతాలైన వేదవచనాలను పేర్కొన్నారు .ఇవి ఎక్కువభాగం ఉపనిషత్తులలోని వే కాని వేదభాగాలలోనివి కావు అన్నారు నోరివారు . ఈ వ్యాసాలన్నీ సంస్కృతం లో రచించినవే .
ఇంగ్లిష్ లో రాసిన వ్యాసాలలో శ్రీ సి ఎస్.వెంకటేశ్వరన్ ఋగ్వేదం లోని బృహస్పతి ,బ్రహ్మణస్పతి శబ్ద విచారణ చేసి ,రెండూ ఒకే దేవత పేర్లు అన్నారు .శ్రీ ఇ.అనంతా చార్యులు ‘’ఆపో విషయక వేద భావన ‘’ఎంతగొప్పదో గొప్పగా వివరించారు –It is from the flow of ocean universal consciousness that our human hearts too receive the flood of the universal consciousness .The waters are therefore aid to contain the Powers of immortaality and rectitude and the Devas alone are capable of declaring the Powers of the waters ‘’.
మీమాంసా శాస్త్ర పండితులు శ్రీడి టి తాతాచార్యులుగారు ‘’శ్రౌత సూత్రాలు ‘’వ్యాసం లో సూత్ర లక్షణం ,యజ్ఞ స్వరూపం ,కర్మ వైవిధ్యం తెలిపి ,వేద కర్మలు ప్రధానం –ఇషఅతి ,పశు ,సోమ అనే మూడు విదాలైనాయని రుగ్మంత్రఉచ్చారణ –స్తోత్రం , శస్త్రం అనే రెండు భేదాలుంటాయని,ఏయే వేద శాఖకు, ఏయే శ్రౌత సూత్రాలు పుట్టాయో ,వాటిలో ఏవి నేడు లభిస్తున్నాయో వివరించారు. యజ్ఞ కర్మలు కర్తకు మాత్రమేకాక ,దేశానికి ,విశ్వానికీ మహా ప్రయోజనమని చెప్పారు .డా.శ్రీ ధూళిపాళ అర్క సోమయాజి గారు ‘’వేదాలలో జ్యోతిశ్శాస్త్ర స్మరణం ‘’వ్యాసం లో సంధ్యావందనం నుంచి ,పింజపితృ యజ్ఞం వరకు యజ్ఞ వేదికలు నిర్మించటానికి కాల జ్ఞానం ఎలా ఉపయోగ పడుతుందో వివరించారు .శ్రీ అగ్ని హోత్రం రామానుజా చార్యులుగారు ‘’వేదాలలో రాజకీయ భావనలు ‘’లో సభా ,సమితి ,గణాలు మొదలైన వాటివలన ప్రజా తంత్ర రాజ్యాలున్నాయని ,రాజ సూయ ప్రకరణం లో రాజు ఎన్నుకోబడి ,అభిషిక్తుడు అయ్యేవాడని సామ్రాట్ ,విరాట్ ,ఏకరాట్,అధిరాట్ శబ్దాలను బట్టి చక్రవర్తి భావన కూడా ఉండేదని అన్నారు .’’వేదాలలో ఖగోళ విషయాలు ‘’లో శ్రీ వి .సుబ్బారావు గారు ఇండో ఆర్యన్లు ఏయే భూముల్ని ,ఏ వరుసలో ఆవాస భూములుగా మార్చుకోన్నారో ,వాటిని తెలిపే ఋక్కులను ,వారికి తెలిసిన వృక్షజాలాన్ని ,పంటలు మొదలైనవి వివరించారు .
‘’వేదం లో ఆర్ధిక సంపద ‘’లో శ్రీ ఏం ఎస్ ప్రసాద రావు గారు వేదకాలం లో ఆర్ధిక స్థితి గోవిన్దావస్థ నుండి ,వ్యావసాయకానికి ,పారిశ్రామికానికి ,వాణిజ్య స్థితికి ఎలా క్రమ పరిణామ౦ చెందిందో చెప్పారు .ఋగ్వేదం లోని సముద్ర శబ్దం ,శాతారిత్ర(నూరు తెడ్లు కల నౌక ) శబ్దం తరచుగా ఉండటం వలన సముద్ర వ్యాపారం కూడా ఉండేదని ,ఇలా రెండు వేల సంవత్సరాల కాలం లో జరిగిన పరిణామాలను తెలియ జేశారు .’’వేదాలలో రసాయన శాస్త్రం ‘’లో శ్రీ వి ఆర్ కృష్ణన్ రసాయన శబ్దం అధర్వ వేదం లో ఉందని బంగారం సీసం ఇనుము వాడుక లో ఉండేవని ,సోమం ,యవ లనుండి మద్యం తీయటం వారికి తెలుసనీ ,ఓషధి పరిజ్ఞానం సూత్ర ప్రాయం గా ఉండేదని ,తర్వాతకాలం లో చరకుడు ,శుశ్రుతుడు మొదలైన వారు ఆయుర్వేద శాస్త్ర రూపొందించారని అన్నారు ‘
‘’వేద సమీక్షా ‘అనే ఈ వ్యాస సంకలనం విద్వా౦సులకే కాక ,సామాన్యులకూ,వేదాభిరుచి ఉన్నవారికి అనేక విషయాలు అందుబాటులోకి తెచ్చిందని ,దీన్ని సమీక్షించిన శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారన్నారు .
ఆధారం –శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు భారతి మాసపత్రికలో 1967నవంబర్ సంచిక లో చేసిన సమీక్ష .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-18-ఉయ్యూరు
,
.
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

