గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 418-‘’బాలసరస్వతి ‘’తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసా చార్యులు(1869)

  • గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

418-‘’బాలసరస్వతి ‘’తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసా చార్యులు(1869)

వీరి వంశ మూలపురుషుడు శ్రీశైలపూర్ణులు .ఇందులో బుచ్చి వెంకటాచార్యులకుమారుడే మన బాలసరస్వతి బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు .వీరిది కడప మండలం  లోని బుక్కపట్టణం .సురపుర సంస్థానాధీశుడైన స్వామి నాయకుని (1752-1773)ఆహ్వానం మేరకు అణ్ణయాచార్యుల మూడవ కుమారుడు శ్రీనివాసాచార్యులు బుక్కపట్టణం వదలి సురవరం లోరాజగురువులై  స్థిర నివాసమున్నారు .శ్రీనాథునిలాగా ఈ వంశం లోని కిరీటి వెంకటాచార్యుల సాహితీ జైత్రయాత్ర విలువైనది .

 మన శ్రీనివాసాచార్యులు తండ్రి వద్దనే11వ ఏట  సాహిత్య ,అలంకార గ్రంథాలు గ్రహించారు .సంస్కృత ఆంధ్రాలలో కవనం అల్లటమూ ప్రారంభించారు .16వ ఏట మైసూరుకు వెళ్లి రాజగురు పరకాల స్వామి వద్ద తర్కం నేర్చి, మహారాజు చామరాజు ఒడియార్ ను మెప్పించి ‘’బాలసరస్వతి ‘’బిరుదుపొండాడరు .రాజుగారిచ్చిన ఉపకార వేతనం తో కాశీ వెళ్లి అద్వైత వేదాంతాన్ని స్వామి శాస్త్రిగారి వద్ద ,న్యాయశాస్త్ర క్రోడంను జగాధీశుని కైలాస చంద్ర శిరోమణి భట్టాచార్యులవద్దా ఆపోసనపట్టి ,నవద్వీపానికి వెళ్లి మీమాంసను అధ్యయనం చేసి ,అక్కడి పండితులు 1889లో అందజేసిన ‘’తర్క తీర్ధ ‘’బిరుదు నందుకొన్నాడు .సాహితీ ఉత్తర జైత్రయాత్ర దిగ్విజయంగా ముగించుకొని ,స్వరాస్ట్రానికి బయల్దేరి మార్గ మద్యం లో ఉత్తరాది సంస్థానాలు దర్భంగా ,జోధ్పూర్ ,బుందీ దత్తియా ,గ్వాలియర్ ,కోటా౦ జరీ ,ఇందూర్ ,దారానగరం ,జమ్మూ-కాశ్మీర్ లను  ,దర్శించి అక్కడిపండితులను వాదం లో జయించి ,వారు నతమస్తా కులై అభినందించగా ,ఆరాజులు విశేష గౌరవం తో సత్కరించిపంపగా స్వరాష్ట్రం చేరారు .

 గంటకు వంద శ్లోకాలు అవలీలగా  చెప్పగల నేర్పు మన శ్రీనివాసాచార్యులది .అందుకే వారికి ‘’ఘంటా శతశ్లోక కవి ‘’అనే బిరుదు సార్ధకమైనది .ఆంద్ర దేశం లో బళ్ళారి ,కడప ,పెనుగొండ తాడిపత్రి ,మద్రాసు ,బనగానపల్లి ,మొదలైన చోట్ల అవదానాలు చేసి పండిత శాస్త్రవేత్తల మెప్పు పొందారు .కీర్తి,కనకాలు ఆయన వె౦టపడ్డాయి .తర్వాత దేశమంతా సాహిత్య జైత్రయాత్ర దిగ్విజయంగా ముగించి అరుదైన సన్మానాలు అందుకొని చివరికి తన జన్మస్థలమైన  ఆత్మకూరులో సంస్థానాధీశుల ప్రధాన విద్వాంసులుగా స్థిరపడ్డారు.రాజు అనేక అగ్రహారాలు వారికి ఈనాముగా అందించి గౌరవించాడు .తాను సత్కారాలు అందుకోవటమే కాదు ,స్వయంగా ‘’బ్రహ్మామృత వర్షిణి’’అనే సంస్థ నేర్పాటు చేసి ,ప్రతిఏడాది ఘనంగా వేద సభలు నిర్వహించి  వేద, శాస్త్ర పండితులను సత్కరించారు .ఈ ఆస్థానానికి వచ్చిన తిరుపతి వేంకటకవులు శ్రీనివాసాచార్యులవారి చేతిలోశాస్త్ర  వాదం లో ఓడిపోయారు  .ఈ విషయాలు బాలసరస్వతిగారి మనవడు శ్రీమాన్ తార్కిక సిమ్హాచార్యులు ,తిరుపతి కవులకు గద్వాలలో ఆతిధ్యమిచ్చిన మహా పండితుడు గుండేరావు హర్కార్ తెలియజేశారని బిరుదురాజువారు రాశారు .

  ఆచార్యులవారి ముద్రితాముద్రితగ్ర౦థాలు చాలాఉన్నాయి .ఇందులో నంజరాజ చంపూః,దుర్మద నిర్మధనం ,జాంబవతీ పరిణయం ,తత్వ మార్తాండ ప్రభామండలం ,రాజశేఖర చరితం ,సురపుర వెంకట గురు చరితం ,శత ఘంటావధానం ,శ్రీనివాస విలాసః ,వీరశైవ శిరస్తాడనం ,దుర్విగ్రహ నిగ్రహ౦ ,కిరీటి వేంకటాచార్య విజయ వైజయంతి ,రాజవంశరత్నావళీ,లక్ష్మీ సరస్వతీ దండకం ,విష్ణుస్తుతి వ్యాఖ్యా ,రహస్య త్రయ సారార్ధః ,గంగాస్తుతిః,ఆంగ్లేయ ,జర్మనీ యుద్ధ వివరణం,ప్రపత్తి పదవీ , హయగ్రీవ పంచాశత్ నరకేసరి స్తుతిః ,దశావతార స్తోత్రం ,విజయ దశమీ నిర్ణయః అనే 22ఉద్గ్రందాలున్నాయి .

 ఇందులో శతఘంటావధానం లో కడప పోద్దుటూరు బళ్ళారి  మద్రాస్ లలో ఆచార్యులవారు చేసిన అవధాన శ్లోకాలున్నాయి .దీన్ని సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు పండిత డి.గోపాలాచార్యులు ప్రచురించారు .దీనిలో ఏడవ ఎడ్వర్డ్  రాజు పట్టాభిషేక సమయం లో చెప్పిన 23శ్లోకాలు ,శివునిపై స్తోత్రం చెప్పమని కోరితే చెప్పిన ‘’భవానీ సంగమేశ్వర స్తుతి ‘’ వివిధ ప్రాకృత భాషలలో ఆశువుగా చెప్పిన శ్లోకాలు కూడా ఉన్నాయి .హయగ్రీవ పంచాశత్ ,నరకేసరి స్తుతి కూడా ప్రాకృతం లో చెప్పినవే.

సంగమేశ్వర స్తుతిలోని  మూడు శ్లోకాలు –

‘’స్రవ౦తీమాభ్యాం వలయిత నిశాంతం కిమపిత –త్ప్రశాంతంజ్యోతిర్నఃప్రథయతు శశాన్కార్ధ మకుటం ‘’

‘’నిదానం లోకానాం నిరవధి చిదానంద హరీం –దధానం భక్తానాం శమధన హృదానందనచణం’’

‘’సురాసుర శిరస్తటీ మకుట చుంబి పాదాంబుజం –చరాచర కుటుంబినం,శమధ నాశయా లంబనం

ధరాధర కుమారికా ,స్మరవిలాస లోలాశయం –జనాస్తుహిన భాస్వరం ,భజత సంగమాధీశ్వరం ‘’ఆరాళచలకున్తలం పరమరాళయనా౦ చితం – ప్రవాళ మృదులాధర౦ ,సితకరాధికాస్య ప్రభం

స్మరామి పురవైరిణః కమపి నిత్య నేత్రోత్సవం ‘’.

ఆచార్యులవారి రచనలలో ;;కిరీటి వేంకటాచార్య వైజయన్తినాటకం  ‘’అముద్రితం అన్నారు రాజుగారు .దీనిప్రతి తమవద్ద ఉందని ఇది 8అ౦కాలనాటకమని చెప్పారు .ఇందులో మూడవ అణ్ణ  యాచార్యుల కుమారుడు కిరీటి వెంకటాచార్యుల సాహిత్య జీవితం ఉన్నది .ఈయన సురపుర సంస్థానాదీశుడు వెంకటప్పయ్యనాయకుని రాజగురువైన ఆస్థానకవి .

నా౦దీ శ్లోకం –‘’-

‘’కారుణ్యేన  కిరీటినే ప్రవితరన్నధ్యాత్మ విద్యామృతం-ద్వారానేనవిరొధినోవిదళయన్  శాస్త్రేషుసాదధీయసా

తస్యై తస్య యశ శ్శశాంక  ధవళం తన్వన్ధరామండలే-శ్రీమాన్ శ్రీనిధి రచ్యుతః ప్రదిశతుశ్రేయాంసి భూయంసినః  ‘’

8వ చివరి అంకం లో తిరుమల తిరుపతి ధర్మాధికారి మహంతు హాథీరాం బాబా  వేంకటాచార్య గురువు పిత్రువ్యులు అయిన శ్రీనివాస దేశికుల మహత్వం తెలుసుకొని ఆచార్యులవారిని స్వయంగా సత్కరించటం తో నాటకం పూర్తి .భరతవాక్యం –

‘’నిర్దోష నిత్య మధురాణి నిరామయాని –శాస్త్రాణి నిత్య శుభగాని జయంతు లోకే

నిత్యాద్రుతా నృపతి భి స్సదృశా౦  సభాశ్చ-వాక్సౌరభీ చ సుభగా సతతం కవీనాం ‘’

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-6-19-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.