ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
24-ఉయ్యూరు కెసీపి షుగర్ ఫాక్టరీ నిర్మాత-వెలగపూడి రామ కృష్ణ
శ్రీ వెలగపూడి రామ కృష్ణ 1896లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా నగరం మండలం లోని బెల్లం వారి పాలెం లో 1896లో జన్మించారు .వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా తేళ్ళపాడు గ్రామస్థులు.ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం లో బిఎసి ,ఎం ఏ .లు చదివారు .ఇండియాకు తిరిగివచ్చాక దక్షిణ భారత దేశం లోనే పేరుపొందిన ఐ ఏ ఎస్ ఆఫీసర్ గా కీర్తిపొందారు .
కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర సిద్ధాంతం లో వేలాది ఎకరాల భూస్వామి ,ఉయ్యూరులోనూ భూములున్న శ్రీ అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య అనే సంపన్న వ్యవసాయ దారుడు 1932లో ఉయ్యూరులో సుగర్ ఫాక్టరీ నిర్మించారు . ఆయన నిర్వహణలో ఫాక్టరీ నడిచినా టెక్నికల్ అనుభవం లేనందున కుంటినడకే నడిచింది .రైతులకు, ఆయనకూ కూడా నిరాశే మిగిల్చింది . రామకృష్ణ గారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు రాష్ట్రం పారిశ్రామిక రంగం లో పురోగమించాలన్న తలంపుతో ఉయ్యూరులో తనభార్య శ్రీమతి దుర్గాంబ తండ్రి అంటే తన మామగారు స్థాపించిన షుగర్ ఫాక్టరీ అనుకొన్న లక్ష్యాలను సాధించటం లో విఫలమై వెనకడుగు లో ఉండగా వెలగపూడి రామకృష్ణగారు ఉయ్యూరు షుగర్ ఫాక్టరీని మామ గారి కోరికపై నిర్వహణ బాధ్యతలు1941లో చేబట్టి కెసీపి లిమిటెడ్ గా నామకరణం చేశారు లాభాలలో నడిపించి ఆసియా ఖండం లోనే అతిపెద్ద షుగర్ ఫాక్టరీ గా తీర్చి దిద్దారు .ఈవిధంగా రామకృష్ణగారు మద్రాస్ రాష్ట్రం లో తోలి పారిశ్రామిక వేత్తగా గుర్తింపుపొందారు .ఫాక్టరీ సామర్ధ్యాన్ని600 T.C.D.కి పెంచారు .ప్రస్తుతం కెపాసిటి న 7,500 T.C.D.కే పెరిగింది .ఇలా దినదిన౦గా గణనీయమైన అభి వృద్ధి సాధించింది కేసిపి ., చెరుకు రైతులలో విశ్వాసం పెంచి చెరుకు నాటటానికి తగిన ప్రోత్సాహకాలు రైతులకు అందించారు
వెలగపూడి వారి ప్రోత్సాహం తోనే తణుకులో సర్వారాయ షుగర్ ఫాక్టరీ ,ఆంధ్రా సుగర్స్ , డెక్కన్ సుగర్స్ చక్కర పరిశ్రమలు ఏర్పడి వాణిజ్యరంగం లో కొత్త పుంతలు తొక్కాయి మద్రాస్ లో సెంట్రల్ వర్క్ షాప్ ఏర్పాటు చేశారు .కెసీపి సిమెంట్ ఫాక్టరీ మాచర్లలో నెలకొల్పారు షుగర్ లో ఎంత పేరుందో కెసీపి సిమెంట్ కూ అంత నాణ్యతా గిరాకీ ఉంది .ఇతర దేశాలలో షుగర్ ఫాక్టరీలను కూడా ఉయ్యూరు కెసీపి నిర్మించి గొప్ప పేరు సంపాదించింది
..కృష్ణా కమ్మర్షియల్ ప్రాడక్ట్స్ అంటే కె .సి.పి.పంచదార ఉత్పత్తిలో ప్రముఖ స్థానం పొందింది .ఇక్కడి షుగర్ క్రిస్టల్స్ నాణ్యత మరే పంచదారకూ లేదు .దీనికి అనుబంధంగా సోడా గాస్ ,రెక్టిఫైడ్ స్పిరిట్ ,ఉత్పత్తిలోనూ పేరు పొందింది .ఉయ్యూరు సోడా వాటర్ తాగినవారికి ఇంకెక్కడి సోడా నచ్చనే నచ్చదు.కన్ఫెక్షనరి అంటే’’పంచదార బిళ్ళలు’’కూడా ప్రసిద్ధి చెందాయి . కొంతకాలం తర్వాత బిళ్ళలవీటి ఉత్పత్తి ఆగిపోయింది ‘.ప్రస్తుతం అసిటిక్ యాసిడ్ ప్లాంట్ గణనీయమైన లాభాలు గడిస్తోంది .
రామకృష్ణగారి మరణం తర్వాత రామ కృష్ణగారి ఇద్దరు కుమారులు శ్రీ మారుతీ రావు శ్రీ లక్ష్మణదత్ .కుమార్తె శ్రీమతి రాజేశ్వరి .కొన్నీల్లు ఫాక్టరీలను సమర్ధవంతంగా నడిపారు .తర్వాత అన్నదమ్ముల వాటాలలో ఉయ్యూరు చల్లపల్లి, షుగర్ ఫాక్టరీలు శ్రీ మారుతీ రాగారికి మాచార్ల సిమెంట్ ఫాక్టరీ మద్రాస్ సెంట్రల్ వర్క్ షాప్ శ్రీ దత్తుగారికి లభించాయి .మారుతీ రావుగారు గొప్ప టెక్నీషియన్ .మాన్ పవర్ తగ్గించి ఫాక్తరీని ఆధునికత జోడించి సమర్ధంగా నడిపారు . రైతులు డబ్బుకోసం ఫాక్టరీ చుట్టూ తిరుగకుండా బాంకులలో రైతులపెర అకొంట్ లు తెరిపించి సరాసరి నగదు ఆ అకౌంట్ లలో జమ అయ్యేట్లు చేశారు .ఇది రైతులకు వరప్రదాయిని అయింది. ఉయ్యూరులో ఒక పారిశ్రామిక విప్లవమే వచ్చినట్లైంది .మారుతీ రావు గారి మరణం తర్వాత ఉయ్యూరు కెసీపి బాధ్యతలు ఆయనభార్య శ్రీమతి ఇర్మ్ గార్డ్ చేబట్టారు .శ్రీ దత్తు ఫిక్కీ అధ్యక్షులయ్యారు దత్తుగారి భార్య ముక్త్యాలరాజా కుమార్తె శ్రీమతి ఇ౦దిరాదత్తు.ప్రపంచ తెలుగు ఫెడరేషన్ అధ్యక్షురాలు .వెలగపూడి రామకృష్ణగారమ్మాయి శ్రీమతి రాజేశ్వరీ రామకృష్ణన్ జయపూర్ చక్కర కర్మాగారానికి మేనేజింగ్ డైరెక్టర్ .వీరికుమారుడు శ్రీ ఆర్ ప్రభు తమిళనాడు ఊటీ (నీలగిరి )పార్లమెంటరీ స్థానానికి 5 సార్లు ఎన్నికై ,ఒకసారి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు .
వెలగపూడి రామకృష్ణ గారు జయపురం సంస్థానానికి దివాన్ గా పని చేశారు . మద్రాస్ ప్రభుత్వం లో అభి వృద్ధికమిషనర్ .గా సేవలందించారు .జిల్లాకలేక్టర్ గా ,లేబర్ కమీషనర్ గా ,పరిశ్రమల కమీషనర్ గా ,పార్లమెంట్ సభ్యునిగా ప్రజా సేవలో పునీతులయ్యారు .
వదాన్యులైన రామకృష్ణగాఋ జన్మించిన చోట ఆయన బహుముఖీన సేవలకు గుర్తింపుగా ’’నగరం ‘’లో ‘’వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ కాలేజి’’ఏర్పాటైంది.తెనాలిలో విఎస్ ఆర్ ,అండ్ యెన్ వి ఆర్ కాలేజి స్థాపించారు .విజయవాడలో వెలగపూడి రామకృష్ణ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి స్థాపన జరిగింది .మద్రాస్ లో ఆంధ్రా చేంబర్ ఆఫ్ కామర్స్ ఆయన పేరిట నిర్మించారు .ఇంతటి పారిశ్రామిక దిగ్గజం శ్రీవెలగపూడి రామ కృష్ణ గారు 72వ 1968 ఏప్రిల్ 18న మరణించారు .
తణుకు కు చెందిన పండిత శ్రీ పెనుమెచ్చ సత్యనారాయణ రాజుగారు ‘’ తెలుగు రాజు కృతులు ‘కావ్యాన్ని మంజరీ ద్విపదలో మనోహరంగా రాసి తన మిత్రుడు వెలగపూడి రామకృష్ణగారి 58 వ జన్మ దినోత్సవం సందర్భంగా ‘’ రామ కృష్ణము ‘’పేరుతొ పద్యాలు రాసి అంకితమిచ్చారు . దీనికి ప్రముఖ శాస్త్రవేత్త రక్షణశాఖ కు సలహాదారు ,ఉస్మానియా యూని వర్సిటి వైస్ చాన్సలర్ రాజుగారికి తన చిన్నతనం లో శిష్యుడు ,రాజా విక్రమ దేవవర్మగారి సౌజన్యంతో ఆంద్ర విశ్వ విద్యాలయ౦ లో ప్రొఫెసర్ గా పని చేసిన డా శ్రీ సూరి భగవంతం గారు ,ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు ముందుమాటలు రాశారు .
రామకృష్ణగారిపై రాజు గారు రాసిన కొన్ని పద్యాలు రుచి చూద్దాం .
‘’గోదావరీ తీర కేదారములుపోవ –ఇంద్రావతీ భూములిచ్చినావు
‘’కాకరపర్రు’’లోనున్న గృహంబు ను వీడ –కోటపాడు న ఇల్లు కూర్చినావు ‘’
యుద్ధకాలమున౦దు ఉద్యోగ మొనగూర్చి –దోసిళ్ళతో సొమ్ము పోసినావు
నరసిన నా తల నరసి సోడా గ్యాసు –నేజెన్సి యిచ్చి పోషించు చుంటి
విన్ని యుపకారములు చేయుచున్న కతన –నస్మదీయాంధ్ర కృతి కన్య నాత్మసఖుడ
వైన నీ కిచ్చినాడ నేన౦కితముగ-ప్రేమతో శ్రీ వెల్గ పూడి రామకృష్ణ
‘’ఆరాధనంబుతో నీరాజనంబిచ్చి –యావేదనంబును నందజేసి
విజయంపు శ్రీతోడ రుజుభావమందించి –చంపకమాలినీ చరితమొసగి
పండిత రాట్చాటుభావాల గైసేసి –సరస రసాలంపు జవుల జూపి
భీమేశు శతకంబు నామెత గావించి-విక్రమ శతకంబు విశద పరచి
ప్రేమతోడ జ్ఞానాంజలి పెట్టి దీని –‘’రామ కృష్ణము ‘’గావించి రామకృష్ణ
దేశదేశాల నీ కీర్తి తేజరిల్ల –నంకితము జేయుచుంటి నీకందుకొనుము ‘’
‘’పుత్రుని ‘’రామకృష్ణ ‘’యని ముద్దిడు కొంచును నీదు పేరుతొ
బుత్రిక తెల్గురాట్కృతి ని మోదముతో నిడి నీకు ,జన్మ తా
పత్రయ మీగ గంటి,భవ బంధములన్నియు ద్రెంచుకొంటి,స’
న్మిత్రమ ! రామ కృష్ణ కనుమీ !ధనధాన్య చిరాయుతున్నతుల్ ‘’
‘’ఏబది యెన్మిదైన భవదీయ జయంతికి నంకితంబుగా –నేబడది యైదు వత్సరము లించ జనించిన నా’’ కుమారికన్’’
కూబర వృత్త రీత గుణ గుంఫిత రత్న మయూఖ దీపికన్ –నీ బహుమాన హస్తమున నేనిడితిన్ గొను రామ కృష్ణుడా ‘’
‘’ఢిల్లీ కోటలుదాటి నీదు గుణ మల్లీ వల్లికల్ హిందూ భూ –వాల్లభ్యధ్వజ దండమండన కళాపాండిత్య మార్జి౦చు టల్
సల్లాపామృత,రామ కృష్ణ !సతిగా సౌహిత్య సాహిత్య సం-పల్లావణ్య వతిన్ కృతీంది నిడితిన్ బాణిం గ్రహింపం గదే’’
‘’దుర్గా౦బా ‘’దరహాస చంద్రికలలో దూగాడుచున్ గూడ శ్రీ –స్వర్గంగా లహరీ ప్రభావ కవితా భామా రమా కేళిమై
దుర్గా గంగలతోడి ఈశుడటు సంతోషంబు రేకెత్తగన్ -దిర్గన్ వచ్చును ‘’రామకృష్ణ ‘’గైకొ నీ తెల్గు రాట్పు త్రికన్ ‘’
ఇతి శివం
పండిత పెను మెచ్చ సత్యనారాయణ .
ఇలా రామకృష్ణగారు ఇన్ని మంచిపనులు చేశారని ,ఆయనకు ఒక కృతి అ౦కిత మివ్వబడిందనీ ఈ నాటి వరకు నాకే కాదు ఇక్కడి వారెవరికీ తెలియదు .రాజుగారి కావ్యాన్ని మా అబ్బాయి శర్మ లింక్ ద్వారా నిన్న పంపాకే నాకు తెలిసింది .
ఆధారం తెలుగు వీకీపీడియా కొంత నాకు తెలిసిందీ ,మిగిలినది రాజు గారి కావ్యం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-6-19-ఉయ్యూరు

