కిరాతార్జునీయం-.25
త్రయోదశ సర్గ -2
శంకరుని బాణం రెక్కల నుంచి వచ్చిన ధ్వని పాములపై గరుత్మంతుని దాడి లాగా హృదయాన్ని చెవుల్ని భేదిస్తూ ప్రతిధ్వనించింది .శివుని మూడోకంటి అగ్ని జ్వాలలాగా పిశంగ(ఎరుపు ) వర్ణపు కాంతితో ప్రకాశిస్తూ అత్యంత వేగంగా వస్తూ ఆకాశం లో పిడుగులు పడినట్లు అనిపించింది .-‘’నయనాదివ శూలినః ప్రవృత్తై-ర్మనసోప్యాశుపరంయతః పిశంగైః-విదధే విలసత్తడిల్లతాభైః-కిరణైర్వ్యోమని మార్గ ణస్యమార్గః ‘’.శివబాణ౦ వెడలిన క్షణం లోనే ,శివునికి దగ్గరున్న ప్రమథ గణం,వరాహానికి దగ్గరలో ఉన్నఆకాశ సంచారు.లైన సిద్ధ చారణాదులు వరాహం శరీరం లో ప్రవేశించటం చూశారు .అంటే ప్రయోగించటం ,దానికి తగలటం ఏకకాలం లోనే జరిగిందని భావం –‘’అపయంధనుషః శివాంతికస్థై-ర్వివరే సద్భి రభిఖ్యయా జిహానః –యుగ పద్దదృశేవిశన్వరాహం-తదుపోఢైశ్చనభశ్చరైఃపుషత్కః’’.శివబాణ౦కానుగ లాగా నల్లగా ఉన్న ఆ పంది శరీరం లో ప్రవేశించగా ఆకాశ చారులు నీటిని చీల్చుకొని భూమిలోకి ప్రవేశించే జలచరం అనుకొన్నారు –‘’స తమాల నిభే రిపౌ సురాణా౦-ఘన నీహార ఇవా విషక్త వేగః-భయ విఫ్లుత మీక్షితో నభ స్థై –ర్జగతీంగ్రాహ ఇవాపగాం జగాహే ‘’.
శివుడు బాణం వేసిన సమయం లోనే అర్జునుడు కూడా ప్రయోగించిన బాణం ప్రాణులకు పీడకలిగిస్తూ ఆకాశంలో ప్రకాశించి ,దాని చివర ఉన్న గోరు ఆకారపు లోహపు ములికి కోపించిన యముడిచూపుడు వేలులాగా శోభించింది –‘’సపది ప్రియరూప పర్వ రేఖః –సీతా లోహానగ్ర నఖా ఖమాస సాద-కుపితా౦తకతర్జనాంగులిశ్రీ –ర్వ్యథయన్ ప్రాణ భ్రుతఃకపి ధ్వజేషుః’’.మంత్ర చోదిత అర్జున బాణం ,తోక చుక్క కాంతితో ,మహా శబ్దం తో అడవిని ప్రకాశి౦పజేస్తూ ,పక్షులను చెదరగొట్టింది..అర్జునుని ధనుస్సు నుంచి బయల్దేరటం ,ప్రయాణించటం ,లక్ష్యాన్ని భేదించటం అన్నీ ఏకకాలం లో జరిగినట్లనిపించింది.ఆలోచన ముందా తర్వాతా అనే తేడా తెలీలేదనిపించింది . –‘’అవి భావిత నిష్క్రమ ప్రయాణః-శమితాయామ ఇవాతిరంహసాసః-సహ పూర్వతరం ను చిత్తవృత్తే-రపతి త్వాను చకార లక్ష్య భేదం ‘’. పందికి రెండవవైపు అంటే శివబాణ౦ తగిలిన దానికి రెండో వైపు దూసుకుపోయి,మనుష్యప్రయత్నానికి దైవ ప్రయత్నం తోడయినట్లుగా ఉంది .’’స వృషధ్వజసాయకా వభిన్నం –జయహెతుఃప్రతికాయ మేష ణీయం-లఘు సా౦ధయితుం శరః ప్రసేసే-విధినేవార్థ ముదీరితంప్రయత్నః’’ .అవివేకం ,వృధా శ్రమ ధనాన్ని ఎలా పోగొడతాయో,అత్యాశ సంపాదన ఆశ్రయించిన వారి ప్రేమను ఎలా దూరం చేస్తాయో దుర్నీతి అనవదానత ఎలా జయం కోరిన వారిని చెడ గొడతాయో అలా శివుడు,అర్జునుడు ప్రయోగించిన బాణాలు వరాహాన్ని నిర్జీవం చేశాయి –‘’అవివేక వృధాశ్రమా వివార్ధం –క్షయ లోభా వివ సంశ్రితానురాగం -విజిగీషు మివా నయ ప్రమాదా –వవసాదంవిశిఖౌ వివిన్యతుస్తం ‘’.ఆపంది మృత్యు వాత పడుతూ ,వేగం తగ్గి ,నాలుగు వైపులా దొర్లుతూ ,,సూర్యుడు నేలమీద పడినట్లు ,భూమి చుట్టూ చెట్లతోనిండి నట్లు భావించి ,చుట్టూ గిరగిరా తిరిగి నేలకు ఒరిగింది .పంది చావు కళ్ళకు కట్టినట్లు గా చూపించిన భారవి కవి కవిత్వానికి కైమోడ్పు .-‘’అథ దీర్ఘతమ౦ తమః ప్రవేక్ష్యన్ –సహసా రుగ్జర యః’’ స సంభ్ర మేణ-నిపతంత మివో ష్ణ రశ్మి ముర్వ్యాం-వలయీ భూత తరుం ధరాం చ మేనే’’.
నేలమీద పడి వేడి రక్తం తో తడుపుతూ ,కాలిగిట్ట లతో ,నోటి కోరలతో రాళ్ళను పొడుస్తూ ఒక్కక్షణం ఆర్జునుడిని చూసి ,కోపంతో ఘుర్ ఘుర్ మంటూ గర్జిస్తూ ప్రాణం వదిలింది .’’అసుభిఃక్షణ మీక్షితే౦ద్రసూను –ర్విహతా మర్ష గురు ధ్వని ర్నిరాసే ‘’ .పంది చనిపోయాక అర్జునుడు తన బాణం తీసుకోవటానికి దగ్గర కొచ్చాడు .అతని దగ్గర చాలా బాణాలున్నా ,ఈ బాణమే దాన్ని చంపిందని కృతజ్ఞతా భావంతో వచ్చాడు .ఎప్పుడోచేసిన ఉపకారం కన్నా ,తత్కాలం లో చేసిన సహాయాన్ని అభినందిచటం లోక సహజం కదా .-‘’స్ఫుట పౌరుష మాపపాతపార్థ –స్తమథ ప్రాజ్య శరః జిఘ్రుక్షుః-న తథాకృత వేదినాం కరిష్యన్-ప్రియతా మేతియథా కృతావ ధానః ‘’.నీచునికి చేసిన ఉపకారం వ్యర్ధమైనట్లు ,పందిని కొట్టిన బాణం కనిపించలేదు .తన పరాక్రమం వ్యర్ధమై౦దని సిగ్గుతో తలది౦చు కొన్నాడు ధనంజయుడు .-‘’ఉపకార ఇవా సతి ప్రయుక్తః స్థితి మప్రాప్య మృగే గతః ప్రణాశం-కృత శక్తిరథోముఖోగురుత్వాజ్జనిత వ్రీడఇవాత్మ పౌరుషః’’.ఉజ్వలకా౦తితో ఉన్నా ,తన బాణం పరాక్రమం గురించి ప్రశ్నిస్తున్నాడా అన్నట్లు మాటి మాటికీ కళ్ళతో పందిని కావలి౦చు కొంటున్నాడా అన్నట్లు చూశాడు .ఉత్తములు తమ పరాక్రమమం చూపితల ఎగరేయరు.-‘’స సముద్ధరతా విచి౦త్య తేన –స్వరుచిం కీర్తిమివోత్తమాందధానః –అనుయుక్త ఇవ స్వవార్త ముచ్చైః-పరిరేభే ను భ్రుశంవిలోచనాభ్యాం ‘’ .పందిలో గుచ్చిన తన బాణాన్ని వెతుకుతున్న అర్జునుడి దగ్గరకు శివుని సందేశం చెప్పటానికి వచ్చిన ధనుర్ధారి అయిన ఒక కిరాతుని చూశాడు.అతడు మర్యాదగా నమస్కారం చేసి ,శాంతంగా యుక్తియుక్తంగా ఇలా చెప్పాడు –‘’నీ శాంతం నీహృదయ స్వభావాన్ని,వినయాన్నీ తెలియజేస్తోంది .గొప్ప తేజస్సుతో చేసిన తపస్సు శుద్ధశాస్త్రజ్ఞానాన్ని తెలియ జేస్తోంది .దేవతలతో పోల్చదగిన నీ ఆకారం నీ ఆకృతికి విరుద్ధమైన వంశాన్ని ప్రకటిస్తోంది-‘’శాంతతా వినయ యోగి మానసం –భూరి ధామ విమలం తపః శ్రుతం –ప్రాహ తే ను సదృశీ దివౌకసా –మన్వవాయ మవదాతమాకృతిః’’.ముని వేషం లోనూ మహా ప్రకాశమానం గా ఉన్నావు .నీ మహత్వం ఇతర రాజులను తక్కువ చేస్తుంది .ఇంద్రకీలం లో ఉంటూ ,ఇంద్రుని ద్వారా త్రిలోకాధిపత్యం చేయిస్తున్నట్లుంది . తస్విగా ఉన్నా,సకల సంపన్నుడి లాగానే ఉన్నావు . ఒంటరిగా ఉన్నా ,తేజస్సుతో మంత్రులతో ఉన్నట్లుగానే భాసిస్తున్నావు –‘’తాపసోపి విభూతాముపే యివా –నాస్పదం తవమసి సర్వ సంపదాం-దృశ్యతే హిభవతో వినా జనై-రన్వితస్య సచివైరివ ద్యుతిః..నీకు జయలక్ష్మి ప్రాప్తించటం ఆశ్చర్యం కలిగించేది కాదు .ముక్తిని గురించి చి౦తించాల్సిన పనీలేదు .అది నీకు దుర్లభం ఏమీకాదు .రజస్తమో గుణాలను జయించిన వారికి సిద్ధించని కోరిక ఉండదు కదా ‘’అన్నాడు భిల్లుడు అర్జునుడితో .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-12-20-ఉయ్యూరు
