కేరళ పాణిని రాజరాజ వర్మ -5(చివరి భాగం )

కేరళ పాణిని రాజరాజ వర్మ -5(చివరి భాగం )

కాలేజిలో పని చేసే రోజుల్లో వర్మ ఉదయం 9లోపే స్నాన భోజనాలు పూర్తీ చేసేవాడు .కాలేజిలోనే టిఫిన్ చేసి ,కాలేజి అవగానే యూనియన్ క్లబ్ కు వెళ్లి ,పేకాట ,టెన్నిస్ ఆడి ,చీకటి పడ్డాక ఇంటికి చేరేవాడు .

  కుటుంబ జీవనం

రాజరాజ వర్మ తమ్పురాన్ ది ఆదర్శ సంసారం .భార్యా పిల్లల్ని అనురాగంతో చూసేవాడు .వారి కి సుఖ సంతోషాలు అందించాడు .వర్మకు ఏడుగురు కూతుళ్ళు ,ఆరుగురు కొడుకులు .చివరికి నలుగురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులే మిగిలారు 13మంది సంతానం లో .కేంద్ర మంత్రి జి రవీంద్ర వర్మ ఒక కూతురు కొడుకు .1915లో మేనమామ కేరళ వర్మ చనిపోయాడు .ఇది జీర్ణించుకోలేకపోయాడు రాజరజవర్మ .తీరిక లేకపోయినా సంసార ధర్మ గురించేఆలోచన .1918లో కొడుకు రాఘవ వర్మ పెళ్లి చేశాడు .

  జీవితం భారంగా గడుస్తోంది .శరీరానికి నీరు పట్టింది .దానికి తోడూ అతిసారం పెరిగి వ్యాకులం కల్గించింది .మూడురోజుల్లో బాగా బలహీనమయ్యాడు .టైఫాయిడ్ వచ్చి 103డిగ్రీల జ్వరం తో బాధపడ్డాడు .అయినా డాక్టర్ తో చతురోక్తులాడేవాడు .కూతుర్ని గీత గోవిందం గానం చేయమని, వినేవాడు .తాను రాయాలనుకొన్న   నాటకం కథా ప్రణాళిక చెప్పి ఆమెతో రాయించాడు .ఆమె తండ్రిని విశ్రాంతి తీసుకోమని మొత్తుకున్నా వినేవాడు కాదు .పక్షం రోజులు టైఫాయిడ్ ఆయన్ను పీల్చి పిప్పి చేసింది .18-6-1918 న 55 వ ఏట కేరళ పాణిని రాజరాజ వర్మ పరమపదించాడు .

   రాజరాజ వర్మ రాసిన కేరళ పాణినీయం కు మించిన వ్యాకరణం లేదు .అది అతి ప్రామాణిక వ్యాకరణం .కేరళ పాణినీయం విద్యార్ధులకు కొరకరాని కొయ్య గాఉందనిపించి ,1902లో మూడు నెలలు కష్టపడి సులభ బోధకంగా ఉండటానికి ‘’శబ్ద శోధిని ‘’వ్యాకరణ౦  రాశాడు ఇది బాగా క్లిక్ అయింది .ప్రాధమిక విద్యార్దులకోసం ‘’ప్రధమ వ్యాకరణం ‘’1906లో ,మధ్యమ వ్యాకరణం 1907లో మాధ్యమిక పాఠశాల విద్యార్దుల కోసం రాశాడు .మలయాళం లో సరళ సంస్కృత వ్యాకరణం  అవసరాన్ని గుర్తించి వర్మ ‘’మణి దీపిక ‘’అనే వ్యాకరణాన్ని 1908లో రాశాడు .ఆయన ఉద్దేశ్యం లో మణి అంటే సంస్కృతం అని అర్ధం .మణిదీపిక రాశాక ,పాణిని అడుగుజాడలలో సులభ సంస్కృత వ్యాకరణం 1910లో రాసి కృతకృత్యుడయ్యాడు .ఈ వ్యాకరణ౦  రచన చూసి ముచ్చటపడిన ప్రొఫెసర్ జాకోబి వర్మకు ‘’మీ వ్యాకరణం అన్నిటి కకంటే ఉత్క్రుష్టం గా ఉంది .మా విద్యార్ధులకు పాణినీయం బోధించేటప్పుడు ‘’సిద్ధాంత కౌముది ‘’ని కాకుండా మీ గ్రంధాన్ని ఉపయోగించాలనుకొంటున్నాను .’’అని రాశాడు ఇంతకంటే గొప్ప  ప్రశంస ఇంకేమి ఉంటుంది? వర్మ జీవితం, ఆవ్యాకరణం ధన్యం  .బొంబాయి విల్సన్ కాలేజి ప్రొఫెసర్ ‘’మీ ప్రణాళికఅత్యుత్తమం .పాణిని హృదయాన్ని విద్యార్ధులకు ఆవిష్కరిస్తుంది ‘’అని మెచ్చాడు .పూనా డక్కన్ కాలేజి ఆచార్యుడు ఆర్ సి రానడే ‘’పాణిని సూత్రాలను కొత్త మూసలో అందించారు .మీ ఉపోద్ఘాత౦ చదివితే సంస్కృత౦ మృత భాష అన్న దోషం తొలగిపోతుంది’’అన్నాడు  .పాణిని అష్టాధ్యాయి లో 2,978 సూత్రాలు ఉంటె వర్మ రాసిన దానిలో 1959 సూత్రాలున్నాయి. వైదిక ఖండం ,స్వర ఖండం లు మాత్రమేకాక ,భాషను గూర్చి ప్రాక్ ,పశ్చిమ ప్రామాణిక ఆచార్యులతో జరిపిన చార్చలతో ఉన్న ‘’లఘు పాణిని ‘’ని రెండవభాగాన్ని 1912లో ప్రచురించాడు .

  బెయిలీ ,గుండర్ట్ ల నిఘంటువులకు మించిన నిఘంటువు తయారు చేయాలనీ వర్మభావించాడు .కాని ఇతరవ్యాపకాలు పాఠ్య పుస్తకాల రచనలతో తలమునకలవటం వలన ఆపని చేయలేకపోయాడు .లక్షణ గ్రంధాలను సమన్వయ పరచి వర్మ భాషాభూషణం , వృత్త మంజరి ,సాహిత్య సహ్య౦ రాశాడు .అనువాదకుడుగా కూడా వర్మ రాణించాడు .కాళిదాసు  మేఘదూతం, కుమార సంభవం ,శాకుంతలం,మాలవికాగ్నిమిత్రం  లను నిర్దుష్టంగా అనువదించాడు .భాసుని చారుదత్త ,స్వప్న వాసవ దత్తం నాటకాల  అనువాదం చేశాడు .షేక్స్పియర్ నాటకం ఒదేల్లో ను ఉద్దాలచరిత గా గద్యం లో అనువదించాడు .

  రాజరాజ వర్మ సృజనాత్మక విమర్శ రచనలు కూడా చేశాడు .భంగవిలాపం ,పితృ విలాపం అనే స్మృతికావ్యాలు సంస్కృతం లో రాశాడు .తోలి రోజుల్లో రాసిన శ్లోకాల సంకలనం కు విద్వాన్ తురవూర్ నారాయణ శాస్త్రి టీకా రాశారు .సరస్వతీ స్తవం వీణాష్టకం ,రాగముద్రా సప్తకం ,విమానాష్టకం ,హిందూ పద వ్యుత్పత్తి ,పితృ ప్రలాపం ,దేవీ దండకం ,ఏకాంకిక గా గైర్వాణీ విజయం రాశాడు నాలుగు రాత్రులలో రాధా మాధవ సమాగమనాన్ని ‘’విట విభావరి ‘’గా రాశాడు .

   ఆధునికకవులు రాసిన సంస్కృత కావ్యాలలో శిఖరాయమానమైనది రాజ రాజ వర్మ రాసిన ‘’ఆంగ్ల సామ్రాజ్యం ‘’.ఇందులో బ్రిటిష్ పాలన ,విక్టోరియా మహారాణి పాలన 60వ వార్షికోత్సవం వరకు వర్ణించాడు .ఈ వజ్రోత్సవం దేశమంతా మహా వైభవంగా జరిగింది .ఇదంతా సంస్కృతంబు పచరించిన పట్టున అన్నట్లు వర్మ సంస్కృత సాహిత్య శేముషీ వైభవం .

  మళయాళ భాషలో కూడా వర్మ తన పాండిత్య కవిత్వ ప్రతిభ చూపాడు .పడమటి కనుమలను వస్తువుగా తీసుకొని ‘’మలయ విలాసం ‘’గేయం రాశాడు .చనిపోవటానికి ముందు వర్మ తిరువనంతపురం రాజు శ్రీ మూలం తిరుణాల్ షష్టిపూర్తీ సందర్భంగా ‘’ప్రసాద మాల ‘’సుదీర్ఘ మళయాళ కావ్యం రాశాడు .సాహిత్య విమర్శ రచనకూడా చేశాడు .ఉన్నాయి వారియర్ రాసిన ‘’నల చరిత్ర ‘’గురించి అద్భుత విమర్శరాసి లోకానికి కవి సత్తా చాటి చూపించాడు .దీనికి రాసిన పీఠిక మళయాళ సాహిత్య విమర్శలో చిరస్థాయిగా నిల్చింది .ఈ పీఠిక కు ‘’కాంతార తారకం ‘’అనిపేరు పెట్టాడు .కుమరన్ ఆసన్ రాసిన ‘’నళిని ‘’కావ్యానికి గొప్ప వికాస వంతమైన పీఠిక రాశాడు .ఆసన్ రాసిన ‘’రాలిన పూవు ‘’కావ్యానికి మొదట్లో ప్రశంసలు రాలేదు .నళినికి వర్మ రాసిన పీఠిక వలన గొప్ప ప్రచారం కలిగింది .

  జ్యోతిష శాస్త్రం లో బాగా కృషి చేసిన వర్మ ‘’పంచాంగ శుద్ధిపద్దతి’’,కేరళ జ్యోతిష శాస్త్రం ‘’అనే విశిష్ట రచనలు చేశాడు .సాహిత్య పూర్వ వికాస ప్రదాత గా రాజరాజ వర్మ గణుతింప బడ్డాడు .సాహిత్య చరిత్రలో నవ వికాసం కల్పించాడు రాజరాజ వర్మ ..

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.