మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 43
· 43-నట యోగి ముదిగొండ లింగమూర్తి
· ముదిగొండ లింగమూర్తి తెనాలి ప్రాంత్రం నుండి వచ్చిన పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు. ప్రతి విషయాన్నీ తర్కం, స్వభావం, శాస్త్రాలతో రంగరించి, విపులీకరించే లింగమూర్తిగారు చివరి దశలో సన్యాసాశ్రమం తీసుకున్నారు.
కుటుంబం
లింగమూర్తి పూర్వీకులు కాశ్మీర శైవులు. వీరి చరిత్ర కల్హణుని రాజతరంగిణి (12వ వతాబ్దం) అనే సంస్కృత గ్రంథంలో కన్పడుతుంది. ఉద్భటారాధ్యుడు జయాపీడుడు అనే రాజుకు గురువు. అతని వంశస్థులు వారణాసి వచ్చారు. వారి వారసుడు 12వ శతాబ్దంలో కాకతీయ ప్రభువైన మహాదేవుని పిలుపుపై ఓరుగల్లు వచ్చాడు. వారికి నల్గొండ జిల్లాలోని ముదిగొండ గ్రామం అగ్రహారంగా ఇచ్చారు. 1310 మాలిక్ కాఫిర్ దండయాత్ర తర్వాత ఈ కుటుంబాలవారు కృష్ణా తీరానికి వలస వెళ్లారు. లింగమూర్తి పూర్వీకులు గొప్ప మంత్రసిద్ధులు. బాల్యం నుండే నటనపై ఆసక్తి గల లింగమూర్తి మద్రాసువెళ్లి తన ప్రతిభను ప్రదర్శించి చిత్రసీమలో స్థిరపడ్డాడు. లింగమూర్తి సంతానం చంద్రశేఖర్, త్యాగరాజు ప్రభృతులు బ్యాంకు ఉద్యోగాలు చేసుకుంటున్నా నాటకరంగానికి సేవ చేస్తున్నారు[1]
సినిమా రంగం
నాటకరంగం మీద అన్ని రకాల పాత్రలూ ధరించి, పేరుతెచ్చుకుని, సినిమా రంగంలో ప్రవేశించారు లింగమూర్తి. తుకారామ్ (1937) లో నటించినా వందేమాతరం (1939) తో అందరికీ తెలిసారాయన. రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రాక, సాంఘిక నాటకాల్లో నటించినట్టుగానే, తెరమీద కూడా నటించారు. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వాహిని సంస్థ నిర్మించిన తొలి చిత్రం వందేమాతరం – వాహిని బృందంతో లింగమూర్తినీ కలిపింది. ఆయనా, ఆ యూనిట్లో ఒకరైనారు. వేషం వున్నా లేకపోయినా, నిర్మాణవ్యవహారాల్లో పాలుపంచుకునేవారు. కొంతకాలం అధికారికంగా ప్రొడక్షన్ మేనేజరుగా వ్యవహరించారు.
క్రూరపాత్ర ధరించినా, అక్రూరపాత్ర ధరించినా, హాస్యపాత్ర ధరించినా నటనలో దేనికదే భిన్నంగా వుండేది. వివిధ భూమికానిర్వహణ సమర్థుడు అనిపించుకున్నాడు లింగమూర్తి. తమిళ చిత్రం ఆధారంగా నిర్మించిన ఆడజన్మలో అతిగా నటించారన్న పేరు తెచ్చుకున్నారు. తరువాత అది పాత్ర, పరిస్థితి కారణంగా అలా చేశానని చెప్పుకొన్నారు
వ్యక్తిత్వం]
లింగమూర్తికి పాత్ర, దర్శకుడు, పారితోషికం అన్నీ నచ్చితేనే సినిమాలు ఒప్పుకొనే వారు. దీని కారణంగా ఆయన ఎక్కువ చిత్రాల్లో నటించలేదు. అన్ని విషయాల్లోనూ కచ్చితమైన మనిషి. ముక్కుకి సూటిగా పోయే మనస్తత్వం, రాజీపడని మనస్తత్వం. మొహమాటం వుండేది కాదు. ఏదైనా కుండ పగలగొట్టినట్టు చెప్పేవాడు. సభల్లో మాట్లాడినప్పుడు కూడా నిర్మొహమాటంగా, బల్లగుద్ది మాట్లాడేవారు. లింగమూర్తిగారు మాట్లాడతారంటే, ప్రేక్షకుల్లో చిన్న కలకలం లేచేది – ఎవర్నో గట్టిగా దుయ్యబడతారని.
ఇతర విశేషాలు[మార్చు]
నిజానికి దర్శకుడు చెప్పింది వేదం. అతను చెప్పింది చెయ్యాలి. కాని మనం కూడా ‘కన్విన్స్’ కావాలిగదా! గుడ్డిగా వెళ్లడం నాకు చేతకాదు. అది డిసిప్లిన్కి విరుద్ధయమైతే నేనేం చెయ్యలేను. ఒకసారి బి.ఎన్.రెడ్డితోనే వచ్చింది. ‘స్వర్గసీమ’లో నేను భానుమతి తండ్రిని. పల్లెటూరివాడిని. హాస్యంపాలు కూడా వున్న పాత్ర అది. హీరోని వల్లో వేసుకోవాలని కూతురితో చెప్పే సన్నివేశం వుంది. ‘ఎన్నాళ్లని ఈ బిగువు? వాడేం దయ్యమా, రాక్షసుడా? దగ్గరకెళ్లి అంతా సరిచేసుకో’ అని డైలాగు. అందులో నాకు చమత్కారం కనిపించలేదు. ఆ మాటే బి.ఎన్.తో అంటే కస్సుమని లేచాడాయన. ‘చమత్కారం ఏం చేస్తావో చేసి చూపించు!’ అని కోపంగా అన్నాడు. ‘నేను చెప్తాను బాగుంటే వుంచండి – లేకపోతే ఉన్నదే చెప్తాను’ అన్నాను. ‘చెప్పు’ అన్నట్టు మొహం పెట్టారు డైరెక్టరు ధుమధుమలాడుతూనే. ‘వాడేం పులా, సింగమా?’ అని ‘వూ’ అని చమత్కారంగా అన్నాను. ‘వూ’ అనడంలో ఒక చమత్కారం వచ్చింది. డైరెక్టరూ, రైటరూ సరే అన్నారు. సినిమాలో ఆ మార్పు బాగానే పట్టుకుంది జన్నాని‘ అని ఒక సందర్భంలో చెప్పారు లింగమూర్తి. ’అందుకే కొందరు దర్శకులూ, నిర్మాతలూ నా జోలికిరారు. పోనీ! అనేవారాయన.
నర్తనశాల (1963) లో శకుని వేషానికి లింగమూర్తిని అడిగారు. ‘అప్పుడు నాకు వేషాలులేవు. ఖాళీగానే వున్నాను. అంచేత డబ్బు తగ్గించమన్నారు. నేను తగ్గించనన్నాను. ’నాకు సినిమాలు తగ్గవచ్చు కాని, నా టాలెంట్ తగ్గలేదు. మీరిచ్చే డబ్బు నా టాలెంట్కి!‘ అని చెప్పేశాను’ అని చెప్పారొకసారి.
‘పాండవవనవాసం’లో రంగారావు ధుర్యోధనుడు. లింగమూర్తి శకుని. ‘ఈ సీనులో రంగణ్ని జయిస్తాను చూడు!’ అని లింగమూర్తి అంటే ‘రమ్మను, నా శక్తి నేనూ చూపిస్తాను’ అని రంగారావు అనేవారు. ‘అలాంటి ఆరోగ్యకరమైన పోటీలు వుండేవి. నాటకరంగం మీదా అంతే!’ అన్నారు లింగమూర్తి.
‘టాకీషాట్స్లో సైలెంట్ రియాక్షన్స్ ఇవ్వడంలో లింగమూర్తి గట్టివాడు’ అని కె.వి. రెడ్డి పొగిడేవారు. దానికి ఉదాహరణ: ‘యోగివేమన’ చివరి దృశ్యంలో వేమన చివరిసారిగా అభిరాముడిని (లింగమూర్తి) హత్తుకుంటాడు. ఆ షాటులో లింగమూర్తి వీపు మాత్రమే కెమెరా వైపు వుంటుంది. కనిపించేది నాగయ్యే. ‘వేమన కావలించుకోగానే, ఒళ్లు పులకరించినట్టు, జలదరించినట్టు లింగమూర్తి వీపుతోనే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. గ్రేట్!’ అని అభినందించారు కె.వి.రెడ్డి ఒక సందర్భంలో.
‘యాక్షన్ కంటె రియాక్షన్ కష్టం. మన రియాక్షన్ బాగుంటే, అవతలి నటుడి యాక్షనూ మెరుగుపడుతుంది’ అని చెప్పేవారా మహానటుడు. ఆయన రేడియో నాటకాల్లో కూడా తరుచూ పాల్గొనేవారు. ‘అక్కడ వాచకమే ప్రధానం. కళ్లతోనూ, చేతులతోనూ చేసే నటనంతా ఒక్క కంఠంతో చెయ్యాలి. దాని కష్టం దానికుంది’ అని చెప్పేవారు. పానగల్ పార్కుకి సాయంకాలం పూట కాలక్షేపం కోసం వెళ్లినా, మిత్రులతో సంభాషించినా ‘ప్రయోజనం’ కనిపించకపోతే నిష్క్రమించేవారాయన.
అవసాన దశ
1960లలో షష్టిపూర్తి తర్వాత లింగమూరి వయోభారం వల్ల సినీరంగం నుండి విరమించాడు. 1974లో భార్య చనిపోయిన తర్వాత పూర్తిగా సన్యాసాశ్రమం పుచ్చుకొని వారణాసిలో జీవించసాగాడు.. ఈయన 1980 జనవరి 24న వారణాసిలో మరణించాడు[2]
బాల్యం నుంచి కలాభిమానిఅవటం తో తెనాలి శ్రీరామ విలాస సభ వారి నాటకాలలో చిన్నా ,పెద్దా పాత్రలు పోషించారు .కన్యాశుల్కం నాటకం లో రామప్ప పందులు వేషం లో అఖందకీర్తి సాధించారు
1937లో సెంట్రల్ స్టూడియోస్ వారు నిర్మంచిన ‘’తుకారాం ‘’సినిమాలో నటించి వెండి తేరా కు పరిచయమయ్యారు .వాహినీవారి దేవత,,పోతన ,స్వర్గసీమ ,సారదీ వారి పంతులమ్మ స్వర్గసీమ,రేణుకావారి త్యాగయ్య ,ఎం ఆర్ ఎ వారి లక్ష్మమ ,రాజరాజేశ్వరీవారి పేదరైతు ,భాస్కరవారి భక్తిమాల ,వినోదావారి కన్యాశుల్కం ,శారదా వారి పెద్ద మనుష్యులు ,గౌతమీ వారి మహామంత్రి తిమ్మరుసు ,విఎన్ వారి రామదాసు చిత్రాలలో విభిన్న ప్రవ్రుట్టులతో ప్రక్రుతులతో ఉన్న పాత్రలు ధరించి ఆపాత్రలక్ను చిరస్మ్మరనీయం చేశారు ‘
ఆంద్ర నాటక కళా పరిషత్ ,ఇతర సాంస్కృతిక సంస్థలు లింగామూర్తిగారిని గనంగా సత్కరించాయి .పెద్దమనుసులు వీరి రామదాసు పాత్ర తిమ్మరుసులో హం వీర పాత్ర లకు ప్రభుత్వ ప్రశంసా పత్రాలు ,పారితోషికాలు పొందారు .సిద్ధిపొండిన నటులేకాక లింగమూర్తి సంస్కారం అనుభవం పుష్కలంగా ఉన్న రచయితా అని వీరి కలం నుండి వెలువడిన ‘’వెంకన్నకాపురం ‘’నాటకం రుజువు చేసింది .ఈ నాటకాన్ని ఎన్నో కంపెనీలు ప్రదర్శించి బహుమతులు పొందాయి .పండిత ప్రకాండుల చేత ,విమర్శకుల చేత ‘’నటయోగి ‘’అని పిలువబడిన ముదిగొండ లింగమూర్తి 24-1-1980 న శివైక్యం చెందారు
నటించిన సినిమాలు
· వందేమాతరం (1939) (లింగమూర్తి)
· సుమంగళి (1940)
· భక్తిమాల (1941)
· దేవత (1941)
· భక్త పోతన (1942) (అజామీళుడు)
· స్వర్గసీమ (1945) (భానుమతి తండ్రి)
· త్యాగయ్య (1946) (జపేశం)
· పల్నాటి యుద్ధం (1947) (నరసింగరాజు)
· యోగి వేమన (1947) (అభిరామ)
· సువర్ణమాల (1948)
· మంత్ర దండం (1951) (మాంత్రికుడు)
· ధర్మ దేవత (1952) (వీరసేన రాజు)
· నా ఇల్లు (1953) (ధనరాజ్)
· పెద్దమనుషులు (1954) (పత్రిక సంపాదకుడు రామదాసు)
· కాళహస్తీశ్వర మాహాత్మ్యం (1954) (కైలాసనాథ శాస్త్రి)
· మహామంత్రి తిమ్మరుసు (1962)
· రామదాసు (1964)
· పాండవ వనవాసం (1965) (శకుని)
· శ్రీకృష్ణావతారం (1967) (శకుని)
ప్రొడక్షన్ మేనేజర్ గా
· స్వర్గసీమ (1945)
· భక్త పోతన (1942)
లింగమూర్తి గారు నటన పై భారతిలో ఒక వ్యాసం రాశారు. అందులోని ముఖ్యవిషయాలు –‘’నటన అత్యుత్తమ కళ.మిక్కిలి కష్ట సాధ్యమైందికూడా.’’ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని మరుగు పరచుకొనివేరొక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించటం నటన’’.అత్యుత్తమ పరిణామ దశలోని నటన ప్రయోజనం సాధిస్తుంది .నటన అనేది దైహిక,మానసిక ఏకైకమై ప్రదర్శించే ఒక విచిత్ర ప్రక్రియ .ఒకానోకఅత్యద్భుత అనుభూతికి ప్రతిఫలం .దీనికి మనవ మనస్తత్వ పరిచయం ఉండాలి .మానవ జీవితం లో వివిధ అనుభావాలపునశ్చరణ లేక ప్రతిబింబమే నటన .ఒకరకమైన పరకాయ ప్రవేశం .నటనకు ముఖ్యంగా కావాల్సింది తన వ్యక్తిత్వాన్ని దాచుకోవటమే .
నటన అసత్యంతో పరమసత్యాన్ని సాధించటమే .ఉపాసనా విశేషం .నటాశ్రయం .నటనకు రససిద్ధి ,ప్రేక్షక రంజనం అనే రెండు ప్రయోజనాలున్నాయి .ప్రేక్షక రంజకంగా నటించటానికి నటునికి బాధ్యతలు చాలా ఉంటాయి .పాత్ర ప్రవృత్తిని అమూలంగా అర్ధం చేసుకొంటేనే నటన పండుతుంది .నటుడు పాత్రలో లీనమై తన్మయత్వం పొంద కూడదు .తానె పాత్రగా మారిపోకూడదు. ప్రీక్షక హృదయాలలో చొచ్చుకొని పోయేట్లు నటించాలి .పాత్ర అనుభవాలతో ప్రేక్షకుని అంతః కరణలు లీనమై రసాను భూతి పొందితే నటుడి ప్రయత్నం సార్ధకమై నటుడు కృతార్ధుడౌతాడు .నటుని ప్రదర్శన కేవలం సహజం ,వాస్తవికం గా ఉండాల్సిందే .

