రాంగేయ రాఘవ -5(చివరి భాగం )

రాంగేయ రాఘవ -5(చివరి భాగం )

కథలు –నిబద్ధత

సమకాలీన సాంఘిక రాజకీయ సమరశీల ఉద్యమాల ఆందోళనే రాఘవ కథా ప్రపంచం  .వీటిలో జాతీయ పెట్టుబడి దారులు విదేశీ  పెట్టుబడి దారులతో ఎలా మిలాఖత్ అయ్యారో చూపాడు .భూస్వాములు,,పెట్టుబడి దార్లు  రక్షణ కోసం కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు .జాతీయోద్యమ ప్రతి ధ్వని చర్మకార కార్మికాది శ్రమ జీవులఇళ్ళల్లో భూస్వాముల అకృత్యాలు ,దహనకాండ ,అత్యాచారాలు ,వారి దుర్భర జీవితాలు  వెలుగులోకి తెచ్చాడు .వాటి మూలకారణాలు ,పరిష్కార మార్గాలు కూడా సూచించాడు .ప్రజలు ధనస్వామ్య వర్గం లో బందీ లై పోయారు .మానవ అంతః కారణాలు జాతీయోద్యమం సామాజిక చింతన ,వేదన ప్రతిధ్వనిస్తాయి .నలుపు ,ఆకృత్యాలను కప్పి పుచ్చటానికి పైన తెలుపు అంటే ఖద్దరు టోపీ ధరిస్తారు అంటాడు .బాప్ కా దోస్త్ లో గాంధేయ ,రాజకీయ దుర్మార్గాలను ఎండగట్టాడు .ఆయనకాలం నవ నవో న్మేషణం..అభ్యుదయ సాహిత్యం ను వెలువరించాడు .హోటల్ కార్మికుల దుస్థితి వివరిస్తూ వారిలో  అంతర్జాతీయ చైతన్యాన్ని తెచ్చే ప్రయత్నం తెచ్చాడు .అణచి వేతకు ఇక సహించరని తిరగబడటం ఖాయమని చెప్పాడు .యహ్ గ్వాలియర్ హై కథలో గాంధీ కాళ్ళమీద పెట్టుబడి దారీ విధానం పాములా కూర్చుని ఉందని చెప్పాడు .కథల్లో పీడితులు పోరాడే వీరులుకారు అలాగని మిలిటెంట్లు కూడా కాదు .రచయితే సైన్యంగా ,సేనాధిపతిగా అవతరిస్తాడు .ఆయన కథలను మగ్గం మీద నేత అన్నారు విమర్శకులు .తాడిత పీడిత జనుల ఆత్మ బంధువుగా రాఘవ కనిపిస్తాడు .బిచ్చ గాళ్ళలో కూడాస్థాయీ భేదాలున్నాయనీ , దాన్నిబట్టే వాళ్ళ ఆశలు ఆశయాలు ఉంటాయని చెప్పాడు .బిచ్చగాడి భార్య తన కడుపులో పెరిగే బిడ్డ బిచ్చగాడు కారాదని కార్మికుడు అవాలని కోరుకుంటుంది .ఆవారా కథలో అసలు దోషి వ్యవస్థ అని చూపాడు .సాహిత్యం తప్పని సరిగా యుగ స్వభావాన్ని తీసుకొని చైతన్య వాణి వినిపించాలని ఆశించాడు .దేశ విభజన ఆధారంగా ‘’తబేలేకా దుమ్ధలకా ‘’కథ రాశాడు .పరాధీనత ఒకవైపు సర్వం దోచుకోవాలనే అత్యాశ మరో వైపు ఉండటం చూపించాడు .వ్యవస్థలోని రుగ్మతలు బయట పెట్టె కథలు అసామాన్యంగా రాశాడు ..’’రాత్రి చీకటి లో నాటుసారా (ఠర్రా)తనస్వభావం చూపి ,తర్వాత బయట ప్రకృతి  లోఏకాగ్ర చిత్తం వల్ల వణుకుతూ ఉన్న గాడాంధకారం చైతన్యం మీద క్రమంగా పాకి కప్పేసి విస్తరించింది ‘’ఇలాంటి లైన్లు చాలా ఉంటాయి రాఘవ కథలలో .పెట్టుబడి దారీ సమాజం లో ‘’కల’’వాడే మగాడు.వాడెం చేసినా చెల్లుతుంది అదే న్యాయం …’’మృగ తృష్ణ’’అంటే ఎండమావి కథ సింబాలిక్ గా రాశాడు .వారసత్వానికి సంబంధిన కథను చాలా కళాత్మకంగా సంధించాడు .వ్యవస్థ అనే వ్యాఘ్రం వేట గాడి లా కుక్క రూపం లో తన మెలకువతో మృగీ ని నోటకరుచుకు పారి పోతుంది .చావు దగ్గరకొచ్చినప్పుడు మృగీ లో పశ్చాత్తాపం కలుగుతుంది .మృగం చచ్చాకకూడా కథ కొనసాగుతుంది .’’ఎవరు జ్ఞాపకం తో తీయతనాన్ని నింపుకు పోతారో వారిని అది ప్రేమతో తనలోకి తీసుకొంటుంది ‘’.హిందీ విమర్శకుల రాగాద్వేషాలనూ తీవ్రంగా తూర్పారబట్టాడు .క్షేమరాజ్ మార్మిక వాదాన్నీ ,జైనేన్ద్రకుమార్ భంగ పాటు ను తన విమర్శలో సంకేతంగా చెప్పాడు రాఘవ ..’’గదల్ ‘’లాంటి గొప్ప రచనలు తానూ ఎన్నో చేశాననీ ,వాటిని విమర్శకులు చూడనే లేదనీ ఈసడించాడు .స్కెచ్ ,రిపోర్ట్ ఫీచర్ లు ఆయన కథల్లో చోటు చేసుకొన్నాయి .పెద్ద కథమృగతృష్ణ లో యుగసత్యాలు బాగా ఆవిష్కరించాడు .లక్ష్య లక్ష్యణాలలో ఇది హిందీ సాహిత్యం లో ఉత్కృష్ట కథ గా మిగిలిపోయింది .

  విమర్శలో మార్క్సిస్ట్ దృక్పధం

1945నుంచి 55వరకు అభ్యుదయ సాహిత్య ఉద్యమం లో మార్క్సిజం ముఖ్య పాత్ర పోషించింది రాగద్వేషాలు పెరిగి నిబద్ధత,నిజాయితీ  తగ్గి  ఉద్యమం ముక్కలైపోయింది .రచయితల సంఘటిత శక్తి దెబ్బ తిన్నది .నిరాశావాదం మృత్యువు లపై దృష్టి పెరిగింది పోరాడే శక్తి సామర్ధ్యాలమీద కాకుండా మృత్యువు దయ దాక్షిణ్యాల మీద  జీవితం గెలుస్తుంది అనే ధోరణి పెరిగింది .ఆలోచనలు సంకుచితాలయ్యాయి .హజారీ ప్రసాద్ ద్వివేదీ లాగా రాఘవ సృజనాత్మక రచనలలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా సాహితీ విమర్శ చేబట్టాడు కావ్యాలనే తీసుకొని రాశాడు. వైదిక సాహిత్యం అంతాఒక యుగం లో మాత్రమె వచ్చి౦ది కాదన్నాడు .ఋగ్వేద రుక్కులే సామవేదం లో కొంత మార్పు చెందాయి యజుర్వేదంలో యజ్ఞ ప్రాధాన్యముంది .వైయక్తిక సాధనా పరిశీలనే అధర్వ వేదం ‘’వేదాలు ప్రేరణా స్రోతస్వినులు .ఏక పక్ష సిద్ధా౦తాలు కావు .వేద సందేశం బహు వ్యాప్తమైంది .రుక్కుల అర్ధతాత్పర్యాలు వివరించిన జీనియస్ రాఘవ .మానవుడికి దగ్గరగా ఉన్న పరిజ్ఞానం అవి .ఆర్య సంస్కృతికి చిహ్నాలు కావు అన్నాడు స్పష్టంగా .మార్సిస్ట్ విమర్శకుడు వర్గ పోరాటానికే పరిమితమౌతాడు అన్నాడు .పురూరవునిలో కరుణామయ పిలుపు ,యమీ -యమ సంవాదం లో విషయ వాంచలు కర్తవ్యాలమధ్య ఉదాత్త చర్చ గమనించాడు రాఘవ .

  మహాభారతం ను తన అంతర్భుక్తిసిద్ధాంతం ఆధార౦గా విశ్లేషించాడు .ఆర్య సంప్రదాయ గ్రంథం కాదు భారతం అన్నాడు .అపూర్వ వివేచన అన్నాడు .విషయ పరిజ్ఞానం  దృష్టి లో ఆకాశమ౦త  విస్త్రుతమైనది .నాథ పరంపర సాహిత్యానికి గొప్ప సేవ చేసిందని పరిశీలించి చెప్పాడు .భక్తి ఉద్యమం లో సాంఘిక పాత్రపైనే దృష్టిపెట్టాడు .ఇస్లాం కు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే భక్తి ఉద్యమం అన్నాడు .తులసీ దాసు ను వర్ణ వ్యవస్థ రక్షకుడుగా చూశాడు .తులసీ దాస్ వివేకాన్ని బాగానే పొగిడాడు .

  లేఖా సాహిత్యం లో సాహిత్య రాజకీయ సంబంధాలు చర్చించాడు .సాహిత్యం లో వ్యక్తిరావాలి అన్నాడు .సంకుచితత్వాన్ని ఎదిరించాడు .నాటకాలు కూడా రాసి ‘’చరిత్రకు మమకారం ఉండదు ‘’అని చెప్పాడు .స్వీయ సుఖ చింతన తాముమాత్రమే పైకి రావాలనే ఆదుర్దా ,ఆదాయ వ్యామోహం సమాజాన్ని భ్రష్టు పట్టించినట్లు చెప్పాడు .’’ఎముకలచిరునవ్వు’’ ను చూడగలిగాడు రాఘవ .స్వాతంత్రం తర్వాత గ్రామీణ జీవితాన్ని దర్శించి రాశాడు .ఎందులో చూసినా ఆయన సంవేదనా దృష్టి గోచరిస్తుంది .శాశ్వత  ప్రమాణాలతో ఉన్నత విలువలతో రాఘవ రాశాడు .ప్రజలకు విధేయుడై ఉంటూ రాశాడు .అతడిమానవతా వాదం ఆబ్ష్ట్రాక్ట్ కాదు .మానవ సంఘర్షణ వికాసాలను రాఘవ చిత్రించిన తీరు అనితర సాధ్యం .అతడు సత్యాన్వేషకుడు .మానవుడి పట్ల సంవేదన కలిగి,పోరాటం లో కొత్త విశ్వాసం కలిగించాడు .ఇప్పటికీ  రాంగేయ రాఘవ వంటి ప్రతిభా వ్యుత్పత్తులు సృజన ఉన్న రచయిత హిందీ సాహిత్యం లో రాలేదు అన్నాడు జ్వాలాముఖి .

 ఆధారం –మధురేశ్ హిందీ రచనకు జ్వాలాముఖిఅనువాదం ‘’రా౦గేయ రాఘవ ‘’పుస్తకం   .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.