సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -1

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -1
గుంటూరు జిల్లా పలనాడు తాలూకా చానపాడు లో నివసించిన శ్రీ జానపాటి పట్టాభిరామయ్య గారికి తిరుపతికవులంటే అత్యంత గురుభావం .అందుకే తమ జీవిత విశేషాలను ‘’జాతక చర్య ‘’అని భక్తిభావంతో పేరు పెట్టుకొన్నారు. ‘’అభినవ సరస్వతి’’అనే సాహిత్య పత్రిక స్థాపించి నాలుగు దశాబ్దాలు నిర్విరామంగా నిర్వహించారు .గుంటూరు జిల్లా నివాసం తర్వాత సికందరాబాద్ వెళ్లి అక్కడే ఉంటూ తెలంగాణా సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేసి తమ స్వీయ చరిత్రలో చేర్చారు .
పట్టాభి రామ శాస్త్రిగారు అంటరానివాళ్ళు’ అనే శీర్షిక కింద 1922 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఐదుసంచికలలో సుదీర్ఘ వాదన చేసారు.
అంటరానివాళ్ళా అన్న కరపత్రపు శీర్షిక లోనే భాషాదోషం ఉందని ,వాళ్ళా ?వాండ్రా ఇందులో ఏది సరైనదంటూ కరపత్ర రచయితలను ఎద్దేవా చేయటం దగ్గర మొదలు పెట్టి ‘ అస్పృశ్యతా దోషం ఉండబట్టే అస్వతంత్రులమై స్వరాజ్యము పొందలేక పోతున్నాం అన్నవారి వాదాన్ని అపహాస్యం చేస్తూ స్వరాజ్య సంపాదనకు అంటరానితనం అడుగంటించటం సాధనం కాదని వర్ణధర్మభేదములు ఉండవలసినవే అని పేర్కొన్నాడు. అవి భగవంతుడి ఆజ్ఞ అని, స్పర్శ, సహపంక్తి భోజన నిషేధాలు పరమార్ధ సాధనకు ఏర్పడ్డాయని, స్వరాజ్య సుఖం కన్నా పరమార్ధ సుఖం అత్యుత్తమమని వాదించాడు. “ మమ్ములను దక్కువగా జేసినారని తక్కువజాతి వారెక్కువ జాతివారిని నిండించగూడదని, తమతమ తక్కువతనమునకు తమతమ కర్మయే కారణము కానీ ద్వేషముతో ఇతరులచేత ఏర్పరచబడినది కాదు” అని చెప్పటానికి కూడా జంకని కరుడుగట్టిన సంప్రదాయ బ్రాహ్మణవాదం అది. పంచములను అంటరాని వారని బాధపెట్టటం హిందూ ధర్మాలలో ఒకటి అంటే నేను హిందూ మతమునకే ప్రబల విరోధిని అని చెప్పిన గాంధీ దగ్గర నుండి అంటరానితనమేమిటని అసహ్యపడిన బరోడా మహారాజు, బాలగంగాధర తిలక్ మొదలైన అందరినీ నిరసించాడు ఈ శాస్త్రి.
1922 అక్టోబర్ సంచికలో ఈయన పంచమ వ్యతిరేకత ను బయలు పరిచే రచన ఒకటి ఉంది. ఆదిమాంధ్రులు చేయతలపెట్టిన గోరక్షణ సభకు సంబంధించి సుండ్రు వెంకయ్య, కుండజోగయ్య చేసిన విజ్ఞాపన కరపత్రం ప్రచురించాడు. అంతవరకు బాగానే ఉంది. వెనువెంటనే గూడూరి రామచంద్రరావు గుడివాడలో ఏర్పరచిన సేవాశ్రమం నుండి 7- 6- 22 న నిమ్నజాతుల ఉద్ధరణకు పాటుపడుతున్న కుసుమ వెంకట్రామయ్య, కుసుమ ధర్మన్న, శెట్టిబత్తుల వీరన్న, రాయడు గంగయ్య, కె. నారాయణ దాసు, కె. జోగయ్య, కె. నాగూరు, కనుపర్తి రంగయ్య, సుండ్రు వెంకయ్య సమిష్టిగా అభినవ సరస్వతి సంపాదకులకు తమ ఆశ్రమానికి ఉచితంగా పత్రిక కాపీ పంపమని, తమ సంఘాభ్యుదయానికి సంబంధించిన రచనలను ప్రచురించమనీ కోరుతూ రాసిన ఒక ఉత్తరం కూడా ప్రచురించి ఇక ఆ రెండింటి మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాసుకొంటూ పోయాడు.నాగర ఖండ ,స్వర్ణ కార వ్యవహారం మొదలైన రచనలు శాస్త్రి గారు చేశారు .’’అంటరాని వాళ్ళు ‘’అని పట్టాభిరామ శాస్త్రి గారు రాసిన పుస్తకం గుంటూరు చంద్రికా ముద్రాక్షర శాలలో 1926న ముద్రించారు. వెల.అర్ధరూపాయి .ఇందులో అస్పృశ్యతా నిరూపణం పేరుతొ మల్లాది రామ కృష్ణ చయనులు గారు రాస్తే ,దాన్ని కాదని అస్పృశ్యతా నివారణ అనే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించటానికి శ్రీ పెరి వెంకట రత్న దీక్షితులు గారి ఆహ్వానం పై 19-6-1925న అమలాపురం తాలూకా పాలగుమ్మి గ్రామం లో శ్రీ చేన్నమల్లెశ్వరస్వామి దేవాలయం లో ఒక పెద్ద విద్వత్ సభ జరిగింది .శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ కాశీ భట్లబ్రహ్మయ్య ,శ్రీ బులుసు అప్పన్న శాస్త్రి ,శ్రీ పుల్య ఉమామహేశ్వర శాస్త్రి మొదలైన దిగ్దంతులైన సిద్ధాంతులు సోమయాజులు సుమారు 70మంది హాజరయ్యారు .ప్రేక్షకులు అన్నివర్ణాలవారు కలిసి 400మంది వచ్చారు .శ్రీ జయంతి రామయ్య గారు శ్రీ కప్పగంతుల రామశాస్త్రి గారు సభాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు .ఎవరివాదాలు వారు చేశారు .
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తమ ‘’ప్రబుద్ధాంధ్ర ‘’పత్రికలో ఒక తమాషారాశారు .పుల్లంరాజు చక్రవర్తి ఒకసారి గుర్రప్పందాలు చూడటానికి మరి కొన్ని స్వంత పనులమీద బొంబాయి వెళ్లి కొన్ని రోజులున్నారు .అక్కడ ఆయన అనేక సభల్లో పాల్గొని వన్నె తెచ్చారు అందులో ఆయనకు బాగా నచ్చింది ,మనసుని కదిల్చిందీ ‘’అస్పృశ్యతా నివారణ సభ ‘’.అక్కడి పేపర్లన్నీ రాజుగారిని బాగా మెచ్చాయి ,తిరిగిరాగానే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు జరిపిన సభలలో స్పందన కనిపించకపోయే సరికి తానె నడుం కట్టాలనుకొన్నారు .అస్పృశ్యులు పెద్ద సభాజరిపి తమల్ని ఎందుకు దూరం పెడుతున్నారో తెలీదని తాములేకుండా సంఘ జీవనం సాగుతుందా అని రాజుగారికి మహాజర్ పంపి వెంటనే కల్పించుకోమని కోరారు .రాజు బాగా ఆలోచించి అందర్నీ సంప్రదించి దుప్పలపూడి సామ్రాజ్యం లోఅస్ప్రుశ్యత లేకుండా చేసి అందరి మెప్పూ పొందాడు .పై విషయాలన్నీ పట్టాభిరామశాస్త్రిగారు గ్రంధస్తం చేసి కళ్ళు తెరిపించారు .పుస్తకం చివర్లో అంటరాని తనాన్ని సమర్ధిస్తూ మల్లాది చయనులు గారు రాసిన పుస్తకం కూడా చేర్చి దాన్ని చదివి అర్ధం చేసుకోమని అస్పృశ్యతను నివారించమని పట్టాభి రామ శాస్త్రిగారు చెప్పారు
పట్టాభిరామ శాస్త్రిగారు ‘’ఆరోగ్య భాస్కరం ‘’అనే మరొక గ్రంధాన్ని 1933లో రచించి గుంటూరు చంద్రికా ముద్రణాలయం లో ముద్రించారు దీన్ని త్రిలింగ పత్రిక ,శ్రీ వావిళ్ళ వెంకటేశ్వర్లుగారు శ్రీ శిష్ట్లా హనుమత్సాస్త్రి ,శ్రీ మల్లాది విద్వత్ చయన్లు ,శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి మొదలైనవారు అమూల్య అభిప్రాయలు తెలియజేశారు .ఇది మొదట్లో త్రిలింగ పత్రికలో ధారావాహికంగా వచ్చింది .
మొదటిపద్యం –‘’శ్రీపతి నీదు మండలము చేరివసింప ద్రయీతనుండవై –రేపులుమాపులున్ ద్విజులు ప్రీతి నొసంగు జలా౦జలుల్ కరం
బొపిక తోడ గొంచు మరి యూరకయు౦డక వారి బాధలన్ –పాపుచు నుండు నీదు పదపద్మములన్ శిరముంతు భాస్కరా ‘’
సంధ్యల నర్ఘ్యముల్ ల్విడిచి సంస్తుతి చేయుచుంటి ‘’అనీ రుగ్యుతు డే౦చ నౌ నిను ‘’,’’మిత్రుదతంచు నిన్ శ్రుతియే మిక్కిలి పేర్కొనే –రోగాయుద్గాత్రుని పట్ల మిత్రు దదికంబుగా జూపడే మైత్రి భాస్కరా ‘’అంటూ భాస్కరా అనే మకుటంతో 126చంపక శార్దూల మత్తేభ ఉత్పలమాల పద్యాలతో భాస్కర శతకం రాసి ఆరోగ్యమిచ్చే భాస్కర మిత్రుడికి అంకితం చేశారు కవి .చివరికి గద్యం లో తనగురించి చెప్పుకొన్నారు .
‘’ఇది శ్రీమజ్జగద్గురు కరుణా కటాక్ష సంప్రాప్తోభయ భాషా పాండిత్య ,రసవత్కవిత్వ నిధాన హరితస గోద్భవ లక్ష్మీ నారాయణ ,పేరమా౦బికాగర్భ శుక్తి ముక్తాయమాన ,విద్వత్సభావిష్కృ తావధాన విధాన ,జానపాటి పట్టాభిరామాభి ధాన విలిఖతంబగు ఆరోగ్య భాస్కరం’’
ఇంతటి విద్వత్ కవి గురించి మనవాళ్ళు ఎవరూ ఎక్కడా పేర్కొనకపోవటం ,విడ్డూరంగా ఉంది .వీరిని వీరి శతకాన్ని పరిచయం చేసే మహద్భాగ్యం నాకు దక్కింది .మా అబ్బాయిశర్మ పంపిన ఈ శతకాన్ని బట్టి రాయగలిగాను .కవి గారిఇతర రచనలగురించి మరో వ్యాసంలో తెలియ జేస్తాను .
సశేషం
గబ్బిట దుర్గా ప్రసాద్ -9-5-22-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.