8-పరశురామ పంతుల లింగమూర్తి గారి రెండు శతకాలు
రెండు అముద్రిత శతకాలు రాసిన పరశురామపంతుల లింగమూర్తి ‘’ శ్రీ సీతారామాంజ నేయం ‘’అనే అద్భుత ఆధ్యాత్మిక గ్రంధం రాసిన తెలంగాణా కవి .శేషాద్రి రమణకవులు కూడా పై రెండు శతకాలను ప్రస్తావించలేదు .వంగూరి సుబ్బారాగారు ‘’మనశ్శతకం ‘’గురించి చెప్పారు .బిరుదురాజు రామరాజుగారు మాత్రం అముద్రితాలైన లింగమూర్తి గారి ‘’ఆత్మారామ శతకం ‘’,,గోవింద శతకం’’ గురించి త్రవ్వితీసి లోకానికి చాటారు .నియోగి బ్రాహ్మణుడైనఈ కవి వంశంవారు మహారాష్ట్ర నుండి వలసవచ్చారు .ఈ ఇంటిపేరు వాళ్ళు అంబాల , ఈదులవాయ మట్టేవాడలలో ఉన్నారట .కవికాలం 18శతాబ్ది .సీతారామాన్జనేయం 1760లో రచింపబడి ఉంటుందిఅని శేషాద్రి రమణ కవులూహి౦చారు .రతి మన్మధ విలాసం , జీవన్ముక్తిప్రకరణం ,బ్రహ్మనారద సంవాదం, తారకయోగం, మానస శతకం ,సీతారామా౦జనేయం లింగమూర్తిగారి కృతులని వారు చెప్పారు .తర్వాత ‘’సీతపాట ‘’అనే అద్భుత గేయకావ్యం వచ్చిందని రాజుగారన్నారు .కవి పోతన్న, రామదాసు వంటి భక్తకవి వేదాంత వేత్తకూడా .భక్తీ వైరాగ్యాల కూడలి లింగామూర్తికవి అన్నారు బిరుదు రాజువారు .ఓరుగల్లులో మట్టేవాడ ఒకభాగం అక్కడ కవి గారి గృహం ఇప్పటికీ దర్శనీయమే .దీన్ని ప్రభుత్వం భద్రపరచాలని కోరారు .ఈ రెండు శతకాలు మరికొన్ని పంచరత్నాలు రెండు’’ బెత్తెలపొడవున్న’’ 34తాటాకులపై వ్రాయబడ్డాయి.
ఇందులో ఆత్మారామ శతకం లో 108కందపద్యాలున్నాయి .100పద్యాల తర్వాత’’ శ్రీ రామార్పణమస్తు’’ అని ముగించి ,తర్వాత ఆరు పద్యాలలో గురు స్తుతి ,కృతి ప్రశంస ,ఫలశ్రుతి చెప్పాడు .రుచికి కొన్ని కందాలు –
‘’నరనారాయణము మన –మిరువురము నవిద్యవలన నేకాత్ముల ,
మక్షర పురుష ,పరమపురుషుల –మరయంగా విద్యవలన నాత్మారామా ‘’.
‘’నిమ్నోన్నతములుగాని సు-షుమ్నామార్గమున నిన్ను జూచి జిత ప్ర
ద్యుమ్నులగు యోగిపు౦గవు –లామ్నాయ విధిం భజింతు రాత్మారామా ‘’
‘’గురుడనగా నీశ్వరుడగు –స్థిరమతి శిష్యు౦డ౦న జీవాత్ము౦డ
య్యిరువుర కైక్యస్థానం –బరయంగా పరమపదము నాత్మారామా ‘’
‘’ఇల పరశురామ పంతుల –కులజ శ్రీ లింగమూర్తి గురుడవు నీవై
పలికితివి గాక నితరుల –కలవడునే యిట్లుబలుక నాత్మారామా ‘’
ఈ శతకాన్ని నక్కా నరస౦భట్లు అనే వ్రాయసగాడు 27-4-1798న రాసినట్లు రాజుగారు ధృవీకరించారు .
15వ కమ్మ రెండవ వైపు ‘’గోవింద శతకం ‘’ప్రారంభమైంది .111కంద పద్యాలు .ఇందులోకూడా వందవ పద్యం తర్వాత ‘’శ్రీరామా ‘’అని ముగించి మిగిలిన 11పద్యాలలో మిగిలిన విషయాలురాశాడు .ఈ శతకం లో భక్తీ, వేదాంతం రెండూ ఉన్నాయి-
‘’శ్రీ లక్ష్మీ నారాయణ –నీలాంబుద నిభ శరీర ,నిగామాధారా
లీలావిహార ,నిర్మల –శీల, చిదానందకంద శ్రీ గోవిందా ‘’
‘’యోగకర ,యోగవిద్వర – యోగాభ్యాస ప్రవీణ,యోగాధారా
యోగైశ్వర్య పరాయణ –యోగానందానుభూతి యుత గోవిందా ‘’
‘’క్షరతత్వము నంటక న –క్షర పురుషుని మించి సర్వ సాక్షి యనంగా
పురుషోత్తముడని వెలసిన –పరాత్ముని నిను భజింతు వర గోవిందా ‘’
83వ పద్యం నుంచి వివిధ అవతార స్తోత్రాలురాశాడు –
‘’ధరణీ సురవరద మహా –పరశు ధర ,నృపాల జలధి బడబానల ,భా
సుర సు తపోధనఘన సు౦ –దర ,భార్గవ రామ రూపధర గోవిందా ‘’
‘’ఈ స్తోత్ర రత్నరాజము –కౌస్తుభ మణి తుల్యముగను,గని ,కానుకగా
హస్తాబ్జ౦బుల గైకొని –విస్తరముగ మై ధరి౦పవే గోవిందా ‘’
తర్వాత ఒకపద్యంలో తనను గురించి చెప్పాడు .
వ్రాయసకాడు నక్కా నరసంభట్లు ‘’శ్రీసీతారామ పరబ్రహ్మణేనమః ,శ్రీ లింగమూర్తి పరబ్రహ్మణే నమః ‘’అని రాసి తానొక పద్యం రాశాడు .వ్రాతకాలం 28-4-1798అన్నారు రాజుగారు
‘’దయ నాదరింపు భక్త హృ –దయ,నా ఫణిశయన వికసితాంబుజ నయనా
నయనామయ నామయ నా-భయ నాశము చేసి మమ్ముపాలింపు హరీ ‘’
ఈ రెండు శతకాల తర్వాత పంచరత్నాలున్నాయి –ఒకపద్యం –
సీ-‘’మొదలు ప్రాణాపానములను,తద్రేచక పూరక కు౦భకంబులను నవి మెల౦గు,నిడా ,పింగళా సుషుమ్నల హంసత్వమునే సాక్షి తానె తెలియు
వికచహృత్కమల కర్ణిక యందు ఘోషించు ప్రణవనాదంబు నే ప్రభు డెరుగు -భ్రూ మ, ద్యమమును చూపులను ,నానావిధ కళలను మనము నే ఘనుడు గాంచు
నతడె ప్రత్యగాత్ము డతడెపో పరమాత్ము –డతడె వాసుదేవు డతడె శివుడు
అతడెస్వప్రకాశకుడైన శ్రీమన్మహా –దేవ లింగమూర్తి దివ్యకీర్తి ‘’
ఇలా నాలుగుపద్యాలురాసి తర్వాత అయిదవ సీసపద్యానికి ‘’సాంఖ్యం’’ అని ,ఆరవదానికి ‘’అమనస్కం’’ అని శీర్షికలుపెట్టాడు .వీటి తరవాత ‘’శ్రీరామరామేతి రమే రామే మనోరమే ‘’మొదలైన పంచరత్న శ్లోకాలున్నాయి .వీటి తర్వాత వీటి తెలుగుఅనువాద గీతపద్యాలున్నాయి –
‘’శ్రీమనోరమ శ్రీరామ రామరామ –యనుచు రమియించు రాముని యందు రామ
నామము వరానన సహస్రనామ తుల్య –మట్లు గావున దీని నీ వవధరింపు ‘’
మందారమకరంద తు౦దితాలైన వేదాంత పద్యాలు రాయటం పరశురామపంతుల లింగమూర్తిగారికి ఎన్నతో పుట్టిన విద్య అనిపిస్తుంది వారి ‘’శ్రీ సీతారామాంజేయం ‘’చదివి పులకించని తెలుగువాడు లేడు అని నా అభిప్రాయం .ఈ శతకాలు అలాంటివే .
వీటిని కూడా వ్రాయసకాడు నక్కా నరసంభోట్లు 29-4-1798న రాసినట్లున్నది .యితడు లింగమూర్తికవిని దర్శించి తరించినట్లు చెప్పుకొన్నాడు
ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-19-ఉయ్యూరు


1898 మే నెల 3వ తేదీ న జన్మించిన’’ గోల్డా మాబో విచ్ ‘’ఆనాటి రష్యా సామ్రాజ్యం లో, నేటి యుక్రెయిన్ లో బ్లూమ్ నీడిచ్ ,మాషే మాటోవిచ్ దంపతులకు జన్మించింది .కార్పెంటర్ అయిన తండ్రి ఉద్యోగాన్వేషణలో 1903లో అమెరికాలోని న్యూయార్క్ సిటీ కి , తర్వాత మిల్ వాకీ సిటీ కి చేరి రెండేళ్ళు బాగా కస్టపడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని తెచ్చుకొన్నాడు తల్లి గ్రోసరి దుకాణాన్ని చూసుకొనేది .గోల్డా ఆమెకు సాయం చేసేది .1906నుండి 1912 వరకు ఫోర్త్ స్ట్రీట్ గ్రేడ్ స్కూల్ లో చదివింది .స్టూడెంట్ లీడర్ గా ఉంటూ తోటి విద్యార్ధులు పుస్తకాలు కొనుక్కోవటానికి నిధి సేకరించి అందజేసింది .’’అమెరికన్ య౦గ్ సిస్టర్స్ అసోసియేషన్ ‘’స్థాపించి ,ఒక హాలు అద్దెకు తీసుకొని సభలు సమావేశాలు జరిపింది .తన క్లాస్ కు ‘’వాలడి క్టేరియన్’’గా గ్రాడ్యుయేట్ అయింది .












