పల్లవించిన పల్లె సోయగం.. -మంతెన

పల్లవించిన పల్లె సోయగం..

  • -మంతెన
  • 22/11/2014
TAGS:

డా.వాసా ప్రభావతి కథానికలు
వేదగిరి కమ్యూనికేషన్స్ ప్రచురణ
వెల: రు.100.. పేజీలు: 139
ప్రతులకు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు అన్నిట్లో

కథకురాలు వాసా ప్రభావతిగారు విలక్షణమైన వ్యక్తిత్వం కలదని వేదగిరి రాంబాబు గ్రంథాదిలో చెప్పినట్టుగా కావచ్చు. కాని ఆమె తన కథల్లో గ్రామీణమైన వస్తువుతోనే ఎక్కువ కథల్ని రాసినట్టు చెప్పుకోవాలి. ఈ పుస్తకంలో ఆమె పదహారు కథల్ని గుదిగుచ్చి తెలుగు కథా సరస్వతి అలంకరించడం విశేషం. ‘ఊరగాయ జాడీ’తో ప్రారంభించి ‘నాకూ ఓ మనసుంది’తో ముగించారు. ఈ సంపుటిలో మూడొంతుల కథలు పల్లె వాసనల గుబాళింపులు, ‘కొత్తవెలుగు’ వంటి తుళ్లింతలు, ‘అనసూయ లేచిపోయింది’ వంటి పలవరింతలు ఈనాటి సమాజాన్ని దృశ్యమానం చేస్తాయి. ప్రతీ కథా పాఠకుడ్ని చివరి వరకు చదివిస్తాయి. ‘న్యాయం గుడ్డిది’ కథ ద్వారా ఆమె కూటికి పేదరాలైనా నిజాయితీగల స్ర్తి ఔన్నత్యాన్ని ఆ ఇంటి యజమమానురాలి కొడుకు సానిదానికి సమర్పించిన నగల గురించి చివర్లో ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టలేడన్న నీతిని ప్రదర్శించారు. దీనిలో యజమానుల అభియోగం, పోలీసుల జులుం, పేదల పట్ల చులకన ఉంది.
‘ఊరగాయ జాడీ’ కథలో కొంత సాంప్రదాయ వాసన కనిపించినా చుట్టాల కంట్లో అది పడకూడదని యజమాని అది తీస్తూ కిందపడి జాడీ బద్దలవ్వడం, ఊరగాయ బూజు పట్టడం వంటివి సహజత్వానికి దగ్గరగా నిలుస్తాయి. ‘సంధ్య అంచున’ అన్న కథ ఒక ప్రధానోపాధ్యాయురాలు పదవీ విరమణ చేస్తూ భర్తతో తాను ఎక్కువ సమయాన్ని గడపలేకపోయానే అనే ఆవేదన కనిపిస్తుంది. జీవితం చివరిలోనైనా మనం ఒకరికొకరమయ్యాం అనే కొసమెరుపు హాయిగా ఉంది. ‘సిలకమ్మ’ కథలో ఆమె కాస్త విద్యాగంధం కలిగినందువల్ల చిన్నయ్యకు తాకట్టుపెట్టిన పొలం కూలి నాలి చేసి అప్పు తీర్చి పొలం దక్కించుకున్న తీరు బాగుంది. ‘నాన్న కావాలి’ కథలో తన పుట్టుకకు తండ్రిగాని తండ్రి అయిన అతనినే ఆరాధించే బిడ్డలున్న తీరును రచయిత్రి చిత్రించిన తీరు ఆకట్టుకునే దిశలో సాగింది.
‘కామాక్షి కాసులపేరు’ కథలో కథకురాలు ఒక గమ్మతె్తైన ఎత్తుగడతో నగలమీద మోజున్న కూతురిని కష్టపెట్టడం ఇష్టంలేక వెండిదాన్ని కొని దానికి బంగారు మలాము చేయిస్తుంది. అది కొన్ని రోజులకే రంగు మారిపోతుంది. ఆ కాసుల పేరు పుణ్యాన కూతురికి పెళ్లి కుదురుతుంది. ఈ కథలో నిజ జీవితంలో నగల్ని చూసి పెళ్లిళ్లయిపోతే ఆడకూతుళ్లకు అత్తింటి ఆరళ్లు అసలుండవా అనిపిస్తుంది. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా విషయం తెలియక తప్పదు. ‘వీధి దీపాలు’ కథ ద్వారా భిన్న మతస్తులలో గుడ్డినమ్మకం, అంధ విశ్వాసాలు విడిచిపెట్టి అంతా సోదరులలా జీవించాలని రచయిత్రి సహేతుకంగా వస్తువులో చూపించారు. ‘మిసెస్ రామనాథం’ కథలో పెద్దగా పట్టులేకపోయినా సామాజిక స్పృహతోబాటు స్ర్తిలు కూడా గౌరవార్హులు కావాలన్న బాధ్యతల్ని సూచిస్తుంది. ‘మా బతుకులింతేనా’ కథానికలో వస్తువు మనిషి జీవన పోరాటంగా చిత్రితమైంది. దానిలో తల్లి, కొడుకు వీరితోబాటు ఓ మూగజీవం కుక్క. అట్టడుగు బడుగు జీవులకు తమకురోజులు వెళ్లకపోయినా మరో ప్రాణిని పోషించగల ఉదారగుణం ఉంటుందన్న కారుణ్య దృక్పథాన్ని ఆవిష్కరిస్తుంది.
‘తోడు-నీడ’ ఈ కథానికలో వస్తువు పాతదైనా భార్యాభర్తలలో భర్త ఆమెనే శాసించడం, బాస్‌లా పీడించడం వంటివి సాధారణ విషయాలైనప్పటికీ మహిళల పట్ల మగవారి అలసత్వాన్ని అక్షరీకరించిన వైనం అగుపిస్తుంది. ‘చుక్క’ కథలో నీలిమ అనే యువతిని ఒక దొమ్మరాట వాడు కిడ్నాప్ చేసి తీసికెళ్లి ‘గడసాని’గా చేస్తాడు. ఆమె తాను జీవితాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే విద్యను ప్రదర్శిస్తూ తాడుమీంచి పడి ప్రియుని ఒడిలో కన్ను మూస్తుంది. ఇది కరుణరస పూరితమైన కథ. ‘అంగడి వినోదం’ నేటి వస్త్ర దుకాణాలలో బొమ్మలుగా మనుషుల్ని పెట్టి వారి వ్యాపారం పెంచుకునే తీరును రచయిత్రి చిత్రించారు. దీనిలో బొమ్మలా నిలుచున్న వ్యక్తి తిండి తిననీయకుండా ప్రదర్శిస్తూ పడిపోతే యజమాని జనం వత్తిడికి జడిసి అనుకున్న దానికన్నా పైకం ఎక్కువిస్తే అందులో కొంత దళారీ మింగేస్తాడు. అతని తల్లి ఆ కుర్రాడిని ఆసుపత్రికి తీసికెళ్లడంతో కథ ముగుస్తుంది.
‘గెద్ద’ కథానికలో అత్తగారు ఎరుకల సానిగా సోది చెబుతూ, కోడలు పురుళ్లు పోస్తూ, కొడుకు పందులు మేపుతూ వారు తమదైన శైలిలో జీవిస్తుంటారు. వారి కలిమిలేములను చిత్రిస్తుందీ కథ. డా. వాసా ప్రభావతిగారి కథలు కొన్ని నాటి నేటి వస్తువుల జమిలి నేతతో హృద్యంగా సాగుతాయ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా సాహిత్యాన్ని అందించే ‘పొనుక’ -ముదిగొండ శివప్రసాద్

తెలంగాణా సాహిత్యాన్ని అందించే ‘పొనుక’

  • -ముదిగొండ శివప్రసాద్
  • 22/11/2014
TAGS:

పొనుక- వ్యాస సంకలనం;
-డా.టి.రంగస్వామి,
వెల: రు.100/-
ప్రతులకు- విశాలాంధ్ర
అన్ని శాఖలు

తెలంగాణా ఉద్యమ ప్రభావంలో ఇటీవల తెలంగాణా సాహిత్య సాంస్కృతిక మూలాలను మూల్యాలను అనే్వషించే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి జాతికి ఒక అస్తిత్వం ఉన్నట్లే ప్రతి ప్రాంతానికీ చరిత్ర, విలక్షణ సంస్కృతి ఉంటుంది. శాతవాహనుల కాలంనుండి మనకు కోటిలింగాల వద్ద తెలంగాణా మూలాలు లభిస్తున్నాయి. కాకతీయుల కాలంలో వింధ్యనుండి రామేశ్వరం వరకు వారి పరిపాలన సాగింది. ఆ తర్వాత అవిచ్ఛిన్నంగా ఏడువందల సంవత్సరాలు ముస్లిం పాలనలో తెలంగాణా ప్రజలు తమ అస్తిత్వాన్ని మరచిపోయారు. ఇప్పుడు తిరిగి జాతీయ పునరుజ్జీవనంలో భాగంగా సాహిత్య సామాజిక సాంస్కృతిక తత్వాలను పరిశోధిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన గ్రంథమే పొనుక అనే వ్యాస సంకలనం. ఇదొక తెలంగాణా మాండలిక పదం. వ్యవసాయ ఉత్పత్తులను మోసుకొనిపోయే వస్తువు. శబ్దరత్నాకరంలో పొనిక అనే రూపం మాత్రమే ఉంది. దానికి ముంజగడ్డి అని అర్థం ఇచ్చారు. డా.టి.రంగస్వామిగారి వ్యాసాలను మోసుకొని వచ్చిన పొనుక నిండా ఇక్కడి మట్టి సుగంధాలు వెలువడుతున్నాయి. రంగస్వామిగారు లోగడ చాలా గ్రంథాలు ప్రచురించి లబ్ధప్రతిష్టితుడైన రచయిత. ఇదొక వ్యాస సంకలనం. ఇందులో ఆయా సందర్భాలలో వెలువరించిన భిన్నాంశాలకు చెందిన రచనలు ఉన్నాయి. ఆముక్త మాల్యదనుండి ఇందూరు దాకా ఈ ప్రస్థానం సాగింది. కొన్ని వ్యాసాలు పరిధిలో సంక్షిప్తంగా ఉన్నాయి. వాటిని ఇంకా విస్తరింపవలసి ఉంది. ఇంద్రపురి ఇందూరుగా మారిందనే వివరణ సమంజసంగా ఉంది. మహారాష్ట్ర సరిహద్దులో చక్కెర పరిశ్రమ కేంద్రం బోధను ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని ఇంద్రవల్లభుడు పాలించినట్లు శాసనస్థమైన ఆధారాలు లభిస్తున్నాయి. ఇక్కడి ఇంద్ర నారాయణ దేవాలయ నిర్మాత ఈయనే. తర్వాతి కాలంలో అప్పాప్రగడ బోగప్పయ్య దీనిని పునరుద్ధరించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఇక్కడి దేవాలయాలు కొన్ని మసీదులుగా మారాయి. దేవత్ మసీదు అలాంటిదే. ఈ చరిత్ర మొత్తం ఈతరం విద్యార్థులకు తెలియదు. కనీసం 1947కు ముందు కాశింరజ్వీ నాయకత్వంలో తెలంగాణాను పీడించిన రజాకార్ల గూర్చికూడా నేటి విద్యార్థులకు తెలియదు. ‘ముసలి నక్కకు రాజరికంబు దక్కునే’ అని గర్జించిన దాశరథి కవిత్వం వెనుక ఉన్న ఉద్యమస్ఫూర్తిని ప్రజలు మరచిపోకూడదు. టి.రంగస్వామిగారు ఒక వ్యాసంలో ఆనాటి ఉద్యమంలో పాల్గొన్న కమ్యూనిస్టు రచయితల జాబితాను అందించారు. భూమికోసం భుక్తికోసం విముక్తికోసం రజాకార్లనుండి దొరలనుండి స్థానిక దొరల దోపిడీనుండి విముక్తి పొందటంకోసం 1947 ప్రాంతంలో తెలంగాణా ఉద్యమం వచ్చింది. 1947 ఆగస్టు 15 మొత్తం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణాకు ఎందుకు రాలేదు?? ఈ అంశాన్ని సాహిత్యపరంగా విశే్లషించిన ఒక చిన్న వ్యాసం ఇందులో ఉంది. ఇటు కులశేఖర ఆళ్వారుల మధుర భక్తినుండి అటు సర్దారు పాపారాయుడి వీరగాథవరకు చాలా అంశాలు ఈ వ్యాసాల్లో రచయిత తన పొనుకలో మోసుకొని వచ్చారు. వరదన్నగారి జీవిత చిత్రణ వ్యాసం బాగుంది. వీరికి అభినవ పోతన అనే బిరుదు సార్థకమైనదే. రామాయణంలో అతిథి పాత్రలు మంధర కైకేయి అనే వ్యాసంలో ఐతిహాసిక విశే్లషణ జరిగింది. కర్ణుడు లేని భారతం లేనట్లే కైకలేని రామాయణం లేదు. ఆమె ప్రేరణవల్లనే రాముడు అరణ్యాలకు వెళ్లి రావణ సంహారం చేశాడు. ఈ మహోపకారానికి మనం కైకమ్మను అభినందించాలి. కళారూపాల్లో సామాజిక సమస్యలేమిటి? మానవ సంబంధాలు నిన్న నేడు రేపు ఎలా ఉండబోతున్నాయి?? తమిళనాడులో తెలుగు సాహిత్యం వంటి వ్యాసాలు రచయిత పరిశోధనాసక్తిని ఎత్తిచూపుతున్నాయి. ముఖ్యంగా జీవన గీత కర్మయోగము- గీతాంజలి వ్యాసాలు రచయిత అభిరుచికి అద్దం పట్టాయి.
రంగస్వామిగారి సంకలనం చాలా బాగున్నా గ్రంథ రూపంలో వచ్చినప్పుడు వ్యాసాలను మరింత విస్తరించవలసిన అవసరం ఉందని అనిపిస్తుంది. నిబద్ధ దేశి- అనిబద్ధదేశి అనే విశే్లషణ గేయ (గాథ) కవితలో ఎలా ఉంటుందో సర్వాయిపాపడి వ్యాసంలో రచయిత చూపారు. మొత్తంమీద ఈ పొనక ప్రయోజనాత్మక గ్రంథంగా పాఠకుల ఆదరణను పొందుతుందని భావింపవచ్చు. భండారు నాగభూషణరావుతోబాటు వా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహానుభావులెం చేశారు పాపం ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మతి గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభ సభ

శ్రీమతి గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభ సభ

ఆత్మీయ మిత్రులు , కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి ధర్మ పత్ని శ్రీమతి గుత్తికొండ రామ రత్నం గారి ప్రధమ వర్ధంతి సందర్భం గా ,సుబ్బారావు గారు ,వారికుమార్తెలు కలిసి ఏర్పరచిన ‘’గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ ‘’మచిలీపట్నం ఆర్ .కే పాలస్ లో23-11-14-ఆదివారం  ఆంద్ర ప్రదేశ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ,హిందీ భాషా ప్రచారకులు శ్రీ యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ ,ప్రముఖ రచయిత శ్రీవిహారి ,కృష్ణా జిల్లా రచయితల సంఘ ప్రధాన కార్య దర్శి డా జి వి పూర్ణ చంద్ ఆత్మీయ అతిధిలుగా పాల్గొన్నసభలో ప్రారంభమైంది .బంధువులు ,ఆత్మీయులు ,సాహిత్య ప్రియులు సుమారు మూడొందల మంది  పాల్గొని స్వర్గీయ రామ రత్నం గారి బహుముఖీనమైన సేవలను ప్రస్తుతించి సంతాపం ప్రకటించారు .ఆమె స్మ్రుతి చిహ్నం గా ట్రస్ట్ వెలువరించిన ‘’స్మ్రుతి గీతి’’అనే ఫోటో దృశ్యమాలికను శ్రీ లక్ష్మీ ప్రసాద్ ,డా పూర్ణ చంద్ రాసిన ‘’తెలుగే ప్రాచీనం ‘’అన్నపుస్తకానికి శ్రీమతి తుర్లపాటిరాజేశ్వరి శ్రీ మూర్తి దంపతులు చేసిన ఆంగ్లానువాదం ‘’Telugu –Antiquity’’గ్రంధాన్ని శ్రీ బుద్ధ ప్రసాద్  ఆవిష్కరించారు .వేదిక మీది పెద్దలే కాక  సుబ్బారావు గారి అమ్మాయిలూ ముగ్గురూ ,వారి బన్ధువులు , సభలోని సాహితీప్రియులు కూడా రామ రత్నం గారి జీవిత విశేషాలను జ్ఞప్తికి తెచ్చుకొని ఘన నివాళి అర్పించారు .ఏంతో  హుందాగా ఆత్మీయం గా భోవోద్వేగం గా కన్నీటి పర్యంతంగా భారహృదయంతో ఇంతమంది పాల్గొని నిజమైన ఆత్మీయమైన శ్రద్ధాంజలి ఘటించటం అపూర్వమనిపించింది .వారందరి మాటల్లోని భావాన్ని మాత్రం పొందుపరుస్తున్నాను .2ramaratnam 001 ramaratnam 1 001

‘’శ్రీమతి రామ రత్నం గారు అర్ధాంగి అనే పేరు కు అసలైన నిర్వచనం  .తాను కాలికరిగిపోతూ కూడా వెలుగు నిచ్చే కొవ్వోత్తి లాగా ఆమె  18సంవత్సరాలు గా తీవ్ర వ్యాధితో చిక్కి  శల్యమై పోతున్నా ,ద్రవాహారం మాత్రమె తీసుకొని జీవిస్తున్నా ఏనాడు జీవితం పై విరక్తి పెంచు కోని వ్యక్తీ .నలుగురీ ఉపయోగపడాలన్న కోరికే ఆవిడను అంతకాలం జీవింప జేసింది .తన పిల్లలు మిగిలిన వారిపిల్లల లాగా ఉన్నత విద్య నేర్చి గొప్ప ఉద్యోగాలు చేసి స్వంతం గా నిలబడాలన్న ధ్యేయం తో వారిని పెంచి తీర్చి, దిద్ది సఫలమనోరధ  అయింది .ఏదైనా మనసులో అనుకొంటే అది పూర్తీ అయ్యేదాకా నిద్రపోని కృషి  ,పట్టుదల కల మహిళ.ఒక రకంగా ఆమె ‘’స్వయం సిద్ధ’’. భర్త సుబ్బారావు గారు సాహిత్యోపజీవి .ఆయన సాహిత్య వ్యాసం గానికి పూర్తీ సహకారం అందించి ,తన అనారోగ్యం మూలం గా ఆయన్ను వాటికీ  దూరం కాకుండా చూసిన అపూర్వ మనస్తత్వం ఆమెది .ఆయనపుస్తక ముద్రణకు   డబ్బు లేకపోతె తన మంగళసూత్రాన్ని అమ్మటానికి  సిద్ధపడిన త్యాగ మూర్తి .భర్త ఆదాయానికి సాయపడాలని ఇంట్లోనే’’ గ్రుహ ప్రియ ‘’స్వీట్ షాప్ పెట్టి యెన్దరకో ఉద్యోగం కల్పించి,మంచి యాజమాన్యం తో పర్య వేక్షణతో  నాణ్యమైన పదార్ధాలతో ,అందరింటే చవకగా అందిస్తూ  ఆదాయాన్నెకాక అందరి అభిమానాన్ని   షాపు పొందేట్లు చేసిన సమర్ధురాలు .అందుకే రోటరీక్లబ్ వారు ఆమెను ఉత్తమ పారిశ్రామిక వేత్తగా గుర్తించి ఘన సన్మానం చేశారు .

బంధువులందరికీ ఆప్యాయతను పంచిపెట్టిన ఉత్తమా ఇల్లాలు .తన మనసులోని కోరికను భర్త గుర్తిన్చేట్లు ,ఆయన మనసెరిగి ప్రవర్తించిన సాధ్వి తాను మరణం అంచున ఉన్నా ఎవరికే కష్టం వచ్చినా ఆదుకొని  ధైర్యం చెప్పి సముదాయించే స్తిత ప్రజ్ఞు రాలు . అయిదు నిముషాలలో మ్మృత్యువు కబళించ బోతోంది అని తెలిసి కూడా  అమెరికా నుంచి కూతురు వచ్చినా ,ఆమె యోగ క్షేమ విచారణ కంటే ముందుగా  కూతురు  చేత హాస్పిటల్ లో తను సేవచేసిన నర్సులు ,వార్డ్ బాయ్ లకు కృతజ్ఞతాపూర్వకం గా డబ్బు ను ఇప్పించిన అపూర్వ నారీరత్నం  శ్రీమతి రామ రత్నం .ఆమెకున్న మొక్క వోని ఆత్మ విశ్వాసం ,నమ్మకం ,పట్టుదల కార్య దీక్ష తమను ఇంతటి వారిని చేశాయని కుమార్తెలు అశ్రునయనాలతో జ్నప్తికి తెచ్చు కోవటం  అందరిని కదిలించి వేసింది .మరణానికి సుమారు ఏడాది ముందు జగ్గయ్య పేట దగ్గరున్న ముత్యాల వద్ద ఉన్న శైవ క్షేత్రం లో దేవుడి మీద పెద్దగా నమ్మకం లేని భర్త సుబ్బారావు గారిని ఒప్పించి భార్యా భర్తలిద్దరూ పూనుకొని ఓపికగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి శివ లింగాన్ని ప్రతిస్టిం చారు. ఇది వారిద్దరి దాంపత్య జీవితం లో అపూర్వ సన్నివేశం .ఇంట్లో వ్యాధితో బాధ పడుతున్న భార్యను అన్నేళ్ళు చూస్తూ యెంత తల్లడిల్లి  మనో వ్యధ చెందారో సుబ్బారావు గారు ?తలచుకొంటె గుండె చెరువవుతుంది .అయ్యో భర్తను ఇంత క్షోభ పెడుతున్నానే అని ఆ తల్లి యెంత మనో వేదనకు  గురైందో ఊహించలేము .ఒకరి మనసు ఒకరు తెలుసుకొని అన్యోన్యం గా ఆదర్శం గా జీవితం సాగించిన వారిద్దరూ అభినందనీయులు .’’ఆర్ .కే. పారడైజ్’’ లో జరిగిన ఈ సభ ను చూస్తె శ్రీమతి రామ రార్ణం గారు చేసిన గుప్తదానాలు ,సాంఘిక  సేవ ,ధర్మా చరణ  సాదు శీలత ,మనో నైర్మల్యం ,ప్రేమానురాగాలు ,మానవీయత  ,అజాత శత్రుత్వం  మనోబలం  కార్య శూరత ఆమెకు తప్పక’’ పారడైజ్ ‘’అంటే స్వర్గ ప్రాప్తి కలిగిస్తుందని అని పించింది .

This slideshow requires JavaScript.

రామ రత్నం గారి పేర ఏర్పడిన ఈ దార్మి  సంస్థ ముఖ్యం గా పేద బాలికల విద్యాభి వృద్ధికి,వారి కాళ్ళ మీద వారు నిలబడి స్తిరమైన ఆదాయాన్ని సంపాదిం చు కోవటానికి దోహద పడే  సంస్థ అని నిర్వాహులు తెలియ జేశారు .సంస్థ దిన దిన ప్రవర్ధమానమై ,అర్హులు చేదోడుగా నిలిచి అభివృద్ధి చెందాలని వక్తలందరూ అభిలషించారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-14-ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరసభారతి 72వ సమావేశం వక్త శ్రీ నవులూరి రమేష్ బాబు -కార్తీక మాస ధార్మికకార్యక్రమం 

సరసభారతి 72వ సమావేశం -శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం 22-11-14శనివారం సాయంత్రం -వక్త శ్రీ నవులూరి రమేష్ బాబు -రిటైర్డ్ తెలుగు లెక్చరర్ -విషయం -తెలుగు కావ్యాలలో పార్వతీ పరమేశ్వర వర్ణనం కార్తీక  మాస ధార్మికకార్యక్రమం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

యెర్ర బస్సు గాలి తుస్సు

ఎర్రబస్సు రివ్యూ! (18-Nov-2014)
దాదాపు ఐదేళ్ళ క్రితం ‘మేస్త్రి’లో కీలక పాత్ర పోషించిన దాసరి నారాయణరావు ఈ యేడాది ప్రారంభంలో ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మోహన్ బాబు మావగారికి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు… మళ్ళీ ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో దాసరి ‘ఎర్రబస్సు’ చిత్రాన్ని రూపొందించారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, కేథరిన్ జంటగా నటించిన ఈ సినిమాలో విష్ణు తాతగా దాసరికి కీ రోల్ ప్లే చేయడం విశేషం.

కథ విషయానికి వస్తే… చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన రాజేశ్ (మంచు విష్ణు)ని అన్నీ తానై తాతయ్య నారాయణ స్వామి (దాసరి నారాయణరావు) పెంచి ప్రయోజకుడిని చేస్తాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే రాజేష్ కు అమెరికా వెళ్ళాలన్నదే జీవితాశయం. ఆ ప్రయత్నంలో ఉండగానే శైలజ (కేథరిన్) అనే డెంటిస్ట్ తో తొలిచూపు ప్రేమలో పడతాడు. తాను యు.ఎస్. వెళ్ళే లోగా ఓ మూడు నెలల పాటు తన తాతయ్యను తన దగ్గరే ఉంచుకుని ఆయనతో ఆ విలువైన కాలాన్ని గడపాలని రాజేశ్ భావిస్తాడు. పాలకొల్లు నుండి తాతయ్యను హైదరాబాద్ తీసుకొస్తాడు. నగర జీవనం గురించి, సాంకేతిక పరిజ్ఞానం గురించి ఏ మాత్రం అవగాహన లేని నారాయణ స్వామి ఇక్కడ అనేక తిప్పలు పడతాడు. ఎదుటి వాడి కష్టాన్ని తన కష్టంగా భావించే ఈ మనసున్న మొండి మనిషిని చాలా మంది అర్థం చేసుకోలేకపోతారు. ఒకానొక సమయంలో మనవడు కూడా అతన్ని అపార్థం చేసుకుంటాడు. ఆ విషయాన్ని గ్రహించిన నారాయణస్వామి తన తప్పుల్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే… నారాయణ స్వామి మంచి మనసును అతని చుట్టుపక్కల వాళ్లు గ్రహించారా? ముఖ్యంగా మనవడు తన తప్పును తెలుసుకున్నాడా లేదా అన్నది మిగతా కథ!

తమిళంలో విమల్, లక్ష్మీమీనన్ జంటగా నటించిన ‘మంజాపై’ చిత్రానికి ఇది రీమేక్. అక్కడ రాజ్ కిరణ్ పోషించిన పాత్రను ఇక్కడ దాసరి ధరించారు. మానవ సంబంధాలు, అనుబంధాలు ఎక్కడైనా ఒక్కటే కాబట్టి… ఇది మన తెలుగువాళ్ళకూ నచ్చుతుందని దాసరి భావించారు. మరీ ముఖ్యంగా ఇందులోని తాత పాత్రను తాను పోషించే అవకాశం ఉండటంతో దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి ఆసక్తి చూపినట్టు అనిపిస్తుంది. ఆధునిక సాంకేతిక సదుపాయల గురించి నిన్నటి తరం వారు ఏ రకంగా పొరపాటు పడుతుంటారు, ముక్కుసూటిగా పోయే వారి మనస్తత్వం కారణంగా ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అనేది ఇందులో చాలా సునిశితంగా చూపించారు. అయితే… సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన విష్ణు, డెంటిస్ట్ అయిన కేథరిన్ చీటికి మాటికి పోట్లాడుకోవడం అర్థం లేనిదిగా అనిపిస్తుంది. నాజర్ కూతురు ప్రేమించింది అతనికి సాయం చేసిన నారాయణస్వామి మనవడినే అనే విషయాన్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అతని గురించి అన్నీ ఆరాతీశానని చెప్పిన నాజర్… ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం శోచనీయం! అయితే… ప్రథమార్ధంలోని చాలా సన్నివేశాలకు ద్వితీయార్ధంలో చక్కని ముగింపు ఇచ్చారు. దాంతో సినిమా చివరకు వచ్చే సరికీ ఓ రకమైన సంతృప్తి ప్రేక్షకుడికి కలుగుతుంది!
తాతామనవళ్ళుగా దాసరి, విష్ణు ఇద్దరు చక్కగానే నటించారు. అయితే సినిమా ప్రారంభ సన్నివేశాలలో మంచు విష్ణు డైలాగ్ డెలివరీ అంతా మోహన్ బాబు తరహాలో సాగడం చికాకు తెప్పిస్తుంది. కేథరిన్ దీ కాస్తంత ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. వైరు పాత్రలో రఘుబాబు చక్కగా నటించాడు. బ్రహ్మానందంపై తీసిన కాకుల కామెడీ సీన్ కంటే కూడా నెమలి కంటే కాకి ఎలా గ్రేట్ అంటూ దాసరి తీసుకున్న ప్రైవేట్ క్లాస్ బాగా పేలింది! దాసరి, సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల, కరుణాకర్ అర్థవంతమైన గీతాలను రాశారు, చక్రీ బాణీలు నేపథ్య సంగీతం బాగున్నాయి. సన్నివేశాలు చకచకా సాగకపోవడం ప్రధానమైన మైనస్! అలానే కృష్ణుడు, మేల్కొటే కామెడీ కూడా పెద్దంతగా పేలలేదు! ఓవర్ ఆల్ గా ‘ఎర్రబస్సు’ నిరుత్సాహాన్ని కలిగించదు కానీ మనలో కొత్త ఉత్సాహాన్నీ నింపదు!!

నా బంగారు తల్లి రివ్యూ!

‘ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా’ సినిమాతో అంతర్జాతీయంగా దర్శకుడు రాజేశ్ టచ్ రివర్ కు మంచి గుర్తింపు లభించింది. ప్రజ్వల సంస్థ నిర్వాహకురాలిగా సునీత కృష్ణన్ కు చక్కని గౌరవం ఉంది. వీరిద్దరు కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘నా బంగారుతల్లి’! ప్రేక్షకుల ముందుకు రావడానికంటే ముందే ఈ సినిమాకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు వచ్చాయి. అలానే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలోనూ ప్రశంసలు లభించాయి. ఆడియో రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడం, నాగార్జున సతీమణి అమల సినిమా విడుదలకు సహకరించడం, సునీతా కృష్ణన్ కోరిక మేరకు వందలాది మంది స్వచ్ఛందంగా విరాళాలను అందించడంతో ‘ఖచ్చితంగా ఇది మంచి సినిమా’ అనే భావన చాలామందిలో కలిగింది!

కథ లోకి వెళితే… దుర్గా (అంజలీ పాటిల్) బ్రిలియంట్ స్టూడెంట్. ఇంటర్ లో స్కూల్ ఫస్ట్ రావడమే కాదు… ఆ జిల్లాలోనే ఎయిత్ ర్యాంక్ సంపాదించుకుంటుంది. అయితే ఆ క్రెడిట్ మొత్తం తన తండ్రి శ్రీనివాసన్ (సిద్ధిక్) కే దక్కుతుందని, తనతో పాటు ఆయన్నీ సత్కరించమని స్కూల్ యాజమాన్యాన్ని కోరుతుంది. తమ ఊరిలో కాకుండా హైదరాబాద్ వెళ్ళి డిగ్రీ చదవాలన్నది దుర్గ కోరిక. కానీ తండ్రి మాత్రం తమని వదిలి దూరంగా ఉండొద్దని చెబుతుంటాడు. తన కళ్ళముందు ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా సహించలేని మనస్తత్వం దుర్గది. తండ్రి తరహాలోనే ఈ అమ్మాయి కూడా సమాజాన్ని ఉద్ధరిస్తోందంటూ ఊరి వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. అయినా… ఆ మాటలను పట్టించుకోకుండా తన దారిన తాను ముందుకు పోతూ ఉంటుంది దుర్గా. తన స్నేహితురాలి పెళ్ళిలోనే దుర్గ మనసుకు నచ్చని వ్యక్తి తారసపడతాడు. పెద్దల అంగీకారంతో విజయ్ ( రత్న శేఖర్)తో నిశ్చితార్థం కూడా జరుగుతుంది. అదే సమయంలో హైదరాబాద్ లో డిగ్రీ చదవడానికి దుర్గకు అవకాశం లభిస్తుంది. తండ్రి అప్పటికే హైదరాబాద్ లో ఉండటంతో… తల్లిని ఒప్పించి… సిటీకి ఒంటరిగా బయలుదేరుతుంది. అయితే… సిటీ చేరిన దుర్గ జీవితంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి, ఈ చదువుల తల్లి ఎలాంటి ఇబ్బందుల్ని, అనూహ్య సంఘటనలను ఎదుర్కొందన్నది మిగతా కథ!

హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. ఆ కోవకే చెందిన కమల్ హాసన్ ‘మహానది’ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయి ఉంది. ఈ సినిమా మొదలు కాగానే… ‘మహానది’లా ఉందే అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ సమయానికి కథ ఊహించని మలుపు తిరిగి ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. అలానే క్లయిమాక్స్ కూడా చాలా అర్థవంతంగానూ… సహజంగానూ ఉంది! ఇలాంటి కథలను తెరకెక్కించడానికి కేవలం డబ్బులు ఉంటే సరిపోదు… మంచి మనసు, గట్టి పట్టుదల ఉండాలి. అవి రెండూ తమకు ఉన్నాయని రాజేశ్ టచ్ రివర్, సునీత కృష్ణన్ నిరూపించుకున్నారు. కథనంలో కొన్ని లోపాలు ఉన్నా… ఎంపిక చేసుకున్న కథ… నటీనటుల అభినయం మనల్ని సినిమాలో లీనమయ్యేట్టు చేస్తాయి. ముఖ్యంగా దుర్గ పాత్రను అంజలీపాటిల్ అద్భుతంగా పోషించింది. జాతీయ అవార్డుల కమిటీ అందుకే ఆమెకు ప్రత్యేక పురస్కారం అందించిందనిపిస్తుంది. అలానే ఆమె తండ్రి పాత్ర పోషించిన సిద్ధిక్ కూడా తన నటనతో మెప్పించాడు. నేపథ్య సంగీతానికి జాతీయ అవార్డును అందుకున్న శాంతను మోయిత్రా గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే! పాటల్లోని సాహిత్యం కూడా అర్థవంతంగా ఉంది. పేరుకు ఇది తెలుగు సినిమానే, చిత్రీకరణ కూడా అత్యధిక భాగం హైదరాబాద్ లోనే జరిగింది, అయినా… పరిచయం ఉన్న ముఖాలు రెండు మూడు కూడా లేకపోవడం ఈ సినిమాకు సంబంధించిన ప్రధానమైన మైనస్! అంజలీ పాటిల్ వంటి నటి తెలుగులో దొరక్కపోవచ్చు… కానీ మిగిలిన పాత్రలకైనా ఇక్కడి వారిని తీసుకుని ఉంటే… మరింతగా తెలుగు ప్రేక్షకులలోకి ‘నా బంగారు తల్లి’ చొచ్చుకుని పోయి ఉండేది! అలా చేయకపోవడం వల్ల డబ్బింగ్ సినిమానేమో అనే భావన ప్రేక్షకులకు కలుగుతోంది! ఏదేమైనా రాజేశ్ టచ్ రివర్, సునీతా కృష్ణన్ కృషిని, పట్టుదలను అభినందించాలి!

Posted in సినిమా | Tagged | Leave a comment

చరిత్ర సృష్టించిన నేతలు

చరిత్ర సృష్టించిన నేతలు

  • – ఎస్.కె. సిన్హా

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఇందిరాగాంధీలు ఇద్దరూ జాతి గుర్తుంచుకోవలసిన గొప్ప నేతలు. వివిధ రంగాల్లో దేశానికి వీరిద్దరూ చేసిన నిరుపమానమైన సేవ ఎన్నటికీ మరువలేనిది. వల్లభ్‌భాయ్ పటేల్ దేశాన్ని సమైక్యం చేయడమే కాకుండా ఏడాదికాలంలో ఉపఖండంగా గుర్తింపు తీసుకొచ్చారు. లేకపోతే దేశం మొత్తం 550 ముక్కలుగా విడిపోయి ఉండేది. హైదరాబాద్ సంస్థానం తప్ప మిగిలినవన్నీ శాంతియుతంగానే ఇండియన్ యూనియన్‌లో కలిసిపోయాయి. హైదరాబాద్‌లో భారత సైన్యం పోలీసు చర్యను చేపట్టాల్సి వచ్చింది. కేవలం ఐదురోజుల్లోనే హైదరాబాద్ సైన్యం లొంగుబాటు పూర్తయింది. ప్రాణనష్టం కనిష్ఠ స్థాయిలోనే నమోదైంది.
కేవలం ఏడాదికాలంలో మొత్తం దేశాన్ని శాంతియుతంగా సమీకృతం చేయగలగడం నిజంగా మానవాళి చరిత్రలో అపూర్వఘట్టం. ప్రష్యాకు చెందిన బిస్మార్క్ జర్మనీ ఏకీకరణలో విజయం సాధించి గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరుపడ్డాడు. 1824లో డెన్మార్క్‌తో ప్రారంభమైన యుద్ధం, ఆస్ట్రియాకు అటు తర్వాత 1871లో ఫ్రాన్స్‌కు పాకింది. అయితే తక్కువ విస్తీర్ణం, జనాభా కలిగిన భౌగోళిక ప్రాంతాన్ని ఏకీకరించడానికి బిస్మార్క్‌కు చాలా కాలం పట్టింది.
ఒక యుద్ధనేతగా ఇందిరాగాంధీ చేసిన సేవకు దేశ చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేక స్థాన మే. ఆమె సాధించిన సైనిక విజయం అసామాన్యమైంది. 92వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఆ విజయంతో కోటిమంది జనాభాతో కూడిన బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. నిక్సన్-కిసింజర్‌ల ద్వయం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో ఇందిరాగాంధీ ఈ విజయాన్ని సాధించడం గొప్ప విశేషం. ఇదే సమయంలో పాక్‌తో చైనా మైత్రి, పర్వత శిఖరాలకంటే సమున్నతంగా, లోతైన సముద్రాలకంటే మరింత లోతుగా కొనసాగుతున్న తరుణమది. అణు శక్తితో నడిచే విమానవహక నౌకతో సహా అమెరికా సప్తమవాహక దళం, హిందూ మహాసముద్రంలో మోహరించినా పాకిస్తాన్‌కు ఏవిధమైన ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే సోవియట్ యూనియన్ జలాంతర్గాముల రంగప్రవేశం చేయడమే అందుకు కారణం. అప్పట్లో భారత- సోవియట్ మైత్రి, సహకారం గొప్ప రక్షణగా నిలవడమే అందు కు కారణం.
ఇక శీతాకాలంలో హిమాలయ పర్వత ప్రాంతాలు మంచుతో పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల, పర్వత రహదారులన్నీ మూసుకుపోయాయి. ఫలితంగా చైనా కలుగజేసుకోవడానికి వీల్లేకపోయింది. అప్పట్లో అటల్ బిహారీ వాజ్‌పేయి, పార్లమెంటులో మాట్లాడుతూ ఇందిరాగాంధీని అపర దుర్గగా అభివర్ణించారు. రెండువేల సంవత్సరాల క్రితం చంద్రగుప్త వౌర్యుడు, అలెగ్జాండర్ సైన్యాధిపతి సెల్యూకస్‌పై ఘనవిజయం సాధించిన తర్వాత, మనదేశానికి లభించిన తొలి విజయం ఇది. అప్పట్లో సెల్యూకస్ అఫ్గానిస్థాన్‌ను అలెగ్జాండర్ సామ్రాజ్యంలో కలిపేసాడు. తర్వాత మధ్య యుగాల కాలంలో పశ్చిమాసియా, యూరప్ ప్రాంతాలనుంచి వచ్చిన చొరబాటుదార్ల చేతిలో మన సైన్యాలు పదే పదే పరాజయం పాలయ్యాయి.
సాధారణంగా ప్రముఖ నేతల జయంతులే కాని వర్థంతులు జరుపుకోం. ఇందుకు జాతి పిత మహాత్మాగాంధీకి మినహాయింపు. ఇక నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాం ధీల జయంతులు మాత్రమే జరుపుకుంటు న్నాం కానీ వర్ధంతులను నిర్వహించడం లేదు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పుట్టిన రోజు. అదేరోజు ఇందిరాగాంధీ అంగరక్షకుల తూటాలకు బలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్ 31ని ‘జాతీయ ఏక్తా దివస్’గా ప్రకటించింది. దేశం కోసం ఇందిర చేసిన త్యాగానికి గుర్తుగా దీన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇది చర్చించాల్సిన విషయం. ఆమె విషాదాంతం దేశానికి తీరని నష్టమే అయినప్పటికీ, అకాలీ సమస్యను పరిష్కరించడంలో అనుసరించిన విధానమే తన హత్యకు కారణమైంది. ఈ నేపథ్యంలో సర్దార్ పటేల్‌ను ‘్ఫట్‌నోట్’ స్థాయికి కుదించడం చరిత్రను అధిక్షేపించడం మాత్రమే. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ…సర్దార్ పటేల్‌పై దృష్టి కేంద్రీకరించడం ఎంతో సముచితమైన చర్య. ఇదే సమయంలో ఇందిరాగాంధీ బలిదానాన్ని ఆయన ప్రస్తావించకుండా ఉండలేదు. ఆమె పుట్టిన దినమైన నవంబర్ 19ను, బంగ్లాదేశ్ యుద్ధంలో సాధించిన గొప్ప విజయానికి గుర్తుగా ‘రాష్ట్రీయ శక్తిదివస్’ పేరుతో జరుపుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ ఆమె జయంతి, వర్ధంతి ఉత్సవాలను జరుపుకోవడాన్ని విమర్శించడం ఏమాత్రం తగనిదని గుర్తించాలి.
జవహర్‌లాల్ నెహ్రూ జయంతి నాడు భారతీయ జనతాపార్టీ ఆయనకు గొప్ప నివాళులర్పించింది. కానీ కాంగ్రెస్ ప్రథమ కుటుం బం మాత్రం ఈ సందర్భంగా పేరు ఉచ్ఛరించకుండానే మోదీపై కటువైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం తగని పని. ఇందిరాగాంధీ చేసిన తప్పులను ఎవ్వరూ మరువలేరు. 1972 సిమ్లా చర్చల్లో జుల్‌ఫికర్ అలీ భుట్టో ఆమెను వంచించాడు. మనవద్ద అప్పట్లో ఉన్న రెండు ‘ట్రంప్ కార్డు’లైన 92వేల మంది పాక్ సైనికులను, ‘శాకర్‌గడ్ బల్జ్’ భూభాగాన్ని పాక్‌కు తిరిగి ఇచ్చివేయడం చారిత్రక తప్పిదమైంది. నియంత్రణ రేఖనే అంతర్జాతీయ సరిహద్దుగా మార్చడానికి పాక్‌ను ఒప్పించడానికి అంతకు మించిన అవకాశం మనకు రాలేదు ఇక ముందు వస్తుందని చెప్పలేం కూడ. అత్యవసర పరిస్థితి విధించి, ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన ఆమె చేసిన తప్పు ఎన్నటికీ క్షమార్హం కాదు. ఆమె ఉద్యోగస్వామ్యాన్ని, పోలీసు వ్యవస్థను ధ్వంసం చేశారు. న్యాయవ్యవస్థ చివరికి సైన్యాన్ని కూడా రాజకీయమయం చేసిన ఘనత ఆమెదే. దేశంలో విపరీతంగా పెరిగిపోయిన అవినీతిపై ఇందిర వ్యాఖ్యానిస్తూ ‘‘అవినీతి అనేది అంతర్జాతీయంగా కొనసాగుతున్నదే’’ అంటూ సమర్ధించుకో జూశారు. కుటుంబ పాలనను ప్రవేశపెట్టి, ప్రజాస్వామ్యంలో ఫ్యూడల్ వ్యవస్థను సుస్థిరం చేసింది కూడ ఆమెనే!
ఇక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విషయానికి వస్తే, దేశాన్ని ఏకీకరించడంతో పాటు ఎన్నో గొప్ప పనులు చేశారు. చంపరాన్‌లో నీలిమందు రైతులకు అనుకూలంగా మహాత్ముడు అహింసా ఉద్యమాన్ని చేపట్టగా, సర్దార్ పటేల్ అస్సాంలోని బార్డోలీలో అహింసా ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సర్దార్ బిరుదును పటేల్‌కు ప్రదానం చేసింది మహాత్ముడే. ఆల్ ఇండియా సర్వీసులను ఎత్తివేసి వాటి స్థానంలో సెంట్రల్ సర్వీసులు, స్టేట్ సర్వీసులను అమల్లోకి తీసుకొని రావాలని కాంగ్రెస్ భావించింది. అప్పట్లో ఐసిఎస్ మరియు ఐపిలపై తీవ్ర వ్యతిరేకత ఉండేది. స్వాతంత్య్రోద్యమ కాలంలో వీరిలో కొందరు అతిగా వ్యవహరించారన్న అపప్రధే అందుకు కారణం. అయితే అఖిల భారత సర్వీసులను కొనసాగిస్తామని సర్దార్ పటేల్ హామీ ఇవ్వడంతో ఐసిఎస్ మరియు ఐపి అధికార్లు కొనసాగడమే కాకుంగా బ్రిటిష్ ప్రభుత్వంలో మాదిరిగానే జీత భత్యాలను పొందారు. వీరి తర్వాత ఐఏఎస్, ఐపిఎస్ నియామకాలు జరిగాయి. అయితే వీరి జీతభత్యాలు తగ్గించినప్పటికీ, బ్రిటిష్ ప్రభుత్వం నాటి సదుపాయాలు మాత్రం యధాతథంగా కొనసాగించారు. కానీ దీనివల్ల దేశ విభజన సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది. సీనియర్ స్థాయిల్లో ఉన్న బ్రిటిష్ అధికార్లు అకస్మాత్తుగా తమ పదవులను వదిలేసి వెళ్లిపోవడంతో, దేశ విభజన కాలంలో కొనసాగిన అరాచక పరిస్థితులను నియంత్రించడం కష్టసాధ్యమైపోయింది. సరీగ్గా ఇదే సమయంలో ఐఏఎస్ అధికార్లు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను నిర్భయంగా మంత్రులకు తెలియ జేయాలని పటేల్ స్పష్టంగా చెప్పారు. ఒకవేళ అవి మంత్రుల ఉద్దేశాలకు విరుద్ధంగా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. అయితే అన్నీ విన్న తర్వాత మంత్రులు తీసుకున్న నిర్ణయాలను వినయ విధేయతలతో అమలు పరచాల్సిందేనని పటేల్ సివిల్ సర్వెంట్లకు నిర్మొహమాటంగా చెప్పాడు. అవినీతి మరక అంటని సచ్ఛీలుడు పటేల్. మరణించే నాటికి ఆయన బ్యాంక్ బ్యాలన్స్ కేవలం రూ. 237 మాత్రమే! ఆయన కుమారుడు లేదా కుమార్తె తండ్రి స్థాయిని తమకు అనుకూలంగా ఎన్నడూ మలచుకోవడానికి యత్నించలేదు. పటేల్ కుమార్తె, తండ్రి బాగోగులు చూసుకోవడంలోనే జీవితం గడిపింది. చివరకు అహమ్మదాబాద్‌లో దుర్భర దారిద్య్రంలో మరణించింది. అప్పట్లో మూడు తప్ప అన్ని ప్రావెన్షియల్ కమిటీలు సర్దార్ పటేల్‌ను ప్రధానిగా ఎన్నుకున్నాయి. ఆ మూడింటిలో రెండు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు, కేవలం ఒక్కటి మాత్రమే నెహ్రూకు మద్దతు పలికాయి. అయినప్పటికీ మహాత్ముడు నెహ్రూను దేశ తొలి ప్రధానిగా ఎంపిక చేశారు. సర్దార్ పటేల్ మ హాత్ముని ఆదేశాలను తలవంచుకొని పాటించారు. డిప్యూటీ ప్రధానిగా ఎంతో వినయ విధేయతలతో పనిచేశారు.
మరో మూడు వారాల్లో మరణిస్తాడనగా సర్దార్ పటేల్, అప్పటి ప్రధాని నెహ్రూకు ఒక లేఖ రాశారు. నిజంగా ఆ లేఖ, ఆయనలోని వ్యూహాత్మక దృష్టికి అద్దం పట్టింది. 1950లో చైనా టిబెట్‌ను ఆక్రమించడం వల్ల మనకు ప్రమాదం పొంచి ఉన్నదని అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నది ఆ లేఖ సారాంశం. దురదృష్టమేమంటే నెహ్రూ ఈ లేఖనే పెడచెవిన పెట్టడం. దీని పర్యవసానం 1962లో చైనా చేతిలో భారత్ అత్యంత అవమానకరమైన ఓటమి పాలుకావడం. అటువంటి దార్శనికుడి పట్ల దేశ ప్రజల్లో చైతన్యం కలుగ జేయడానికి కృషి చేయడం మోదీ చేస్తున్న సముచిత కార్యం. తొలినాళ్లలో పటేల్‌పై తీసిన చిత్రం ఆధారంగా నూతన ప్రభుత్వం హడావుడిగా నూతన చిత్రాన్ని తీసింది. ఈ డాక్యుమెంటరీ దూరదర్శన్‌లో ప్రసారమైనా గొప్ప ప్రచారం లభించలేదు. కేవలం దీని ద్వారా సర్దార్‌కు ఇది పూర్తి న్యాయం చేసినట్టు కాదు. అటెన్‌బరో.. గాంధీపై చిత్రాన్ని తీసిన మాదిరిగానే, సర్దార్ పటేల్‌పై కూడా ఒక వాణిజ్యపరమైన చలన చిత్రాన్ని రూపొందించాలి. ఒక గొప్ప నాయకుడు దేశానికి చేసిన నిరుపమాన సేవను, ప్రజల మనోఫలకాలనుంచి తొలగించడానికి గతంలో కాంగ్రెస్ చేసిన యత్నాలన్నీ దీని ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెహ్రూ ఆధ్యాత్మిక జిజ్ఞాస – రామచంద్ర గుహ (16-Nov-2014)

నెహ్రూ ఆధ్యాత్మిక జిజ్ఞాస – రామచంద్ర గుహ (16-Nov-2014)
నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ రామాయణంతో పాటు కొన్ని క్రైస్తవ గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందారు. తన డెబ్భైల్లో ఆరోగ్యం అంతకంతకూ దిగజారిపోతూ మరణం ఆసన్నమవుతున్న తరుణంలో ఆయన మరొకసారి మతపరమైన సాంత్వనలకు మళ్ళారు.
నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ రామాయణంతో పాటు కొన్ని క్రైస్తవ గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందారు. తన డెబ్భైల్లో ఆరోగ్యం అంతకంతకూ దిగజారిపోతూ మరణం ఆసన్నమవుతున్న తరుణంలో ఆయన మరొకసారి మతపరమైన సాంత్వనలకు మళ్ళారు.
‘మత విశ్వాసాలు లేని రాజకీయవేత్త నెహ్రూ. అయితే ఆయనలో గాఢమైన నైతిక వివేకం ఉన్నది. మతంపై ఆధారపడకుండా ఒక నైతికతను పెంపొందించడానికి నెహ్రూ ప్రయత్నించారు; అధికార బాధ్యతలను నిర్వర్తించడంలో ఎదురయ్యే ఒత్తిళ్లలోనూ ఆయన నైతిక విచక్షణతో వ్యవహరించారు’- ఇది, ప్రముఖ చరిత్రకారుడు సునీల్‌ ఖిలానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యాసంలో చేసిన వాదన. ఖిలానీ తన వ్యాసాన్ని, 1933లో గాంధీకి నెహ్రూ రాసిన ఒక లేఖ నుంచి ఉటంకింపుతో ప్రారంభించారు. ‘మతం నాకు అంతగా తెలిసిన వ్యవహారం కాదు. పెద్దవాడినవుతున్న కొద్దీ నేను ఖచ్చితంగా మతానికి దూరమవుతూ వచ్చాన’ని నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తరువాత (1936లో ప్రచురితమైన) నెహ్రూ ‘ఆత్మకథ’లోని మాటలను ఖిలానీ ఉటంకించారు. ‘వ్యవస్థీకృత మతం నాలో ఎప్పుడూ భీతిని గొల్పుతుంది… ఒక అంధ విశ్వాసానికి, పిడివాదానికి, మూఢ నమ్మకాలకు, దోపిడీకి అది ఆలవాలంగా ఉన్నట్టు కన్పిస్తుంద’ని నెహ్రూ అన్నారు.
మతం పట్ల నెహ్రూ ఉదాసీనతతో ఉండేవారన్న అవగాహన అసత్యమేమీకాదు. అయితే అది పూర్తిగా సత్యమూ కాదు. మత గ్రంథాలు, ధార్మిక భావాల పట్ల ప్రగాఢంగా ఆకర్షితుడైన సంద ర్భాలు ఆయన జీవితంలో ఉన్నాయి. సహాయ నిరాకరణోద్యమ (1921-22) కాలంలో నెహ్రూ జైలులో ఉన్న సమయం అటు వంటి వాటిలో ఒకటి. 1922 తొలినాళ్లలో గాంఽధీకి నెహ్రూ రాసిన రెండు అసాధారణ లేఖలను ఇటీవల నేను కనుగొన్నాను. ఇవి, ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాలేదు. అయితే ఇవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ లేఖలు, మతం పట్ల నెహ్రూ వై ఖరి గురించి మన అవగాహనను మరింత సంక్లిష్టం చేస్తాయి.
ఆగ్రాలోని జిల్లా జైలు నుంచి నెహ్రూ ఈ రెండు లేఖలను గాంధీకి రాశారు. 1922 జనవరి 9న రాసిన మొదటి లేఖలో జైలులో తాను చదువుతున్న పుస్తకాల గురించి నెహ్రూ ప్రస్తావించారు. అవి చాలావరకు మత సంబంధమైన గ్రంథాలే. ‘గ్లోవర్‌ రాసిన ‘‘జీసస్‌ ఆఫ్‌ హిస్టరీ’’ చదివాను. పాఠకుడిని పూర్తిగా తనలో లీనం చేసుకొనే రచన ఇది. ఈ పుస్తకం ఇచ్చిన అవగాహనతో బైబిల్‌ని కూడా చదివాను. రామాయణాన్ని తదేక దీక్షతో చదవడం ప్రారంభించాను. తులసీదాస్‌ రామచరిత మానస్‌, కబీర్‌ భజన్‌లు, భగవద్గీత శ్లోకాలు ఉదయం, సాయంత్రం నడక సమయాల్లో ధారణ అభ్యాసాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రతిరోజూ క్రమబద్ధంగా ప్రార్థనలు చేస్తున్నాను. మీరు చెప్పిన సమయానికి నిద్రకు ఉపక్రమిస్తున్నాను. గురునానక్‌ చెప్పినట్లుగా ‘ఆకాశం మకరందాన్ని వర్షించే సమయం’లో నిద్ర నుంచి లేస్తున్నాను’. నాలుగు వారాల అనంతరం (1922 పిబ్రవరి 19) నెహ్రూ రెండో లేఖ రాశారు. అలీగఢ్‌ నుంచి ‘ఖ్వాజా సాహెబ్‌’ అనే పెద్ద మనిషి నెహ్రూకు సహ ఖైదీగా వచ్చారు. ‘ఖ్వాజా నుంచి ఉర్దూ నేర్చుకోవడం ఒక ప్రత్యేకమైన ఆనందమని’ గాంధీకి నెహ్రూ రాశారు. ‘ఉర్దూ లిపి చాలా మాననీయమైనది. ముస్లమాన్‌ల వైభవానికి అది ప్రతీకలా గోచరిస్తుందని’ ఆయన రాశారు. ఉర్దూ లిపి నేర్పడంతో పాటు ఖ్వాజా సాహేబ్‌ రోజూ ఉర్దూ కవుల నుంచి కొన్ని ద్విపదలను, ఖురాన్‌ బోధనలను నాకు నేర్పుతున్నారు. ఆయనకు నా వంతుగా ఉపనిషత్తులలోని విషయాలను చెబుతున్నాను. భగవద్గీతలోని శ్లోకాలనూ వివరించదలిచాను’.
మరో సహ ఖైదీ రామ్‌నరేష్‌జీతో కలసి నెహ్రూ రామాయణంలోని బాలకాండ, అయోధ్యాకాండలను చదవడం పూర్తి చేశారు. ‘మిగతా కాండలను కూడా ఇరవై రోజుల్లో పూర్తిచేయగలనని భావిస్తున్నాను. నైనీటాల్‌ జైలులో ఉండగానే సుందరకాండను చదివాను. ప్రతి ఉదయమూ రామాయణాన్ని చదవడం చాలా ఆనందప్రదమైన విషయం. రామాయణం శ్రీరామచంద్రుని కవితాత్మక చరిత్ర కంటే ఎక్కువగా ఒక ఆధ్యాత్మిక ఆత్మకథ’.
ఈ లేఖలను రాసినప్పుడు నెహ్రూ ముప్పై రెండేళ్ల వయస్సులో ఉన్నారు. అప్పటికి ఆయన పూర్తిగా గాంధీ ప్రభావంలోకి వచ్చారు. గాంధీ ప్రగాఢమైన మత విశ్వాసాలు కల వ్యక్తి. సకలమతాల ప్రబోధాలను సమాదరించిన విశాల మనస్కుడు. ముగ్గురు ఋషితుల్యుల ప్రభావం ఆయనపై అమితంగా ఉంది. వారు వైష్ణవ కవి నరసింహ మెహతా, జైన దార్శనికుడు రేచంద్‌భాయి, సంప్రదాయ వ్యతిరేకుడైన క్రైస్తవ చింతకుడు లియో టాల్‌స్టాయ్‌. మహాత్ముని ప్రభావంతోనే యువ నెహ్రూ తన జైలువాసంలో హిందూ, ఇస్లామ్‌, క్రైస్తవ, సిక్కు మత గ్రంథాలను శ్రద్ధాసక్తులతో అధ్యయనం చేశారు. గాంధీకి ఈ లేఖలు రాసిన దశాబ్దంలోగానే మతంపట్ల తన ఆసక్తిని నెహ్రూ కోల్పో యారు. ఈ మార్పుకు కారణమేమిటి? సహాయ నిరాకరణోద్యమంలో హిందువులు, ముస్లింలు కలసికట్టుగా పనిచేశారు. అయితే ఆ తరువాత రెండు మతాల వారు వేరయిపోయారు. ఉత్తర భారతంలో వరుసగా పలుచోట్ల హిందూ -ముస్లిం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో భారత రాజకీయాల్లో మతం చాలా ప్రమాదకరమైన చీలికలు సృష్టించే శక్తి అనే భావనకు నెహ్రూ వచ్చారు. ప్రజా వ్యవహారాల్లో మతానికి ప్రమేయం కల్పించకూడదనుకున్నారు.
1930 దశకంలో నెహ్రూను పాశ్చాత్య సోషలిస్టు భావస్రవంతి, ఉద్యమాలు ప్రభావితం చేశాయి. లౌకిక, శాసీ్త్రయ దృక్పథానికి ప్రాధాన్యమిచ్చే సోషలిజం మత విశ్వాసాలపై ఏ విధంగానూ రాజీపడలేదు. 1921-22లో జైలు వాసంలో లౌకిక సాహిత్య అధ్యయనానికి నెహ్రూ పెద్దగా ప్రాధాన్య మివ్వలేదు. 1930ల్లో ఆయన పూర్తిగా సోషలిస్టు సాహిత్య అధ్యయనానికే అంకితమయ్యారు. దేశ విభజన సమయంలో చెలరేగిన మతోన్మాద హింసాకాండ వ్యవస్థీకృత మతంపట్ల నెహ్రూను మరింతగా విముఖుడ్ని చేసింది.
భారతీయ ప్రజానీకంలో ‘శాసీ్త్రయ దృక్పథాన్ని’ పెంపొందించాలని 1940, 50 దశకాలలో నెహ్రూ ఆరాటపడ్డారు. జాతి నిర్మాణంలో మతానికి ఎటువంటి స్థానం లేదని, భారత్‌ ఎటు వంటి పరిస్థితులలోను ‘హిందూ పాకిస్థాన్‌’గా పరిణమించకూడదని ఆయన గట్టిగా భావించారు. అయితే వృద్ధుడు అవు తున్న కొద్దీ నెహ్రూ ఆలోచనల్లో మార్పు వచ్చింది. మతాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని గట్టిగా విశ్వసిస్తూనే ఒక వ్యక్తి జీవితంలో మతం నిర్వహించేపాత్ర ఒకటి తప్పక ఉందని ఆయన భావించారు. తన చివరి సంవత్సరాలలో నెహ్రూ మా ఊరు-డెహ్రాడూన్‌-ను తరచు సందర్శించేవారు. శోభాయమానమైన హిమాలయాలను వీక్షించడంతో పాటు ఒక ఆధ్యాత్మిక గురువు వద్ద తన సమయాన్ని గడపడానికి ఆయన డెహ్రా డూన్‌ వచ్చేవారు. డెహ్రాడూన్‌-రాజ్‌పూర్‌ రోడ్‌లో నివశించే ఆ ఆధ్యాత్మిక గురువు పేరు ఆనందమాయి మా. ఆమె బెం గాలీ హిందూ. అయితే గాంధీ వలే అన్ని మతాలను ఆమె సమాదరించేవారు. అన్ని మతాల వారితో ఆమె ఆధ్యాత్మిక సంభాషణలు జరిపేవారు.
నెహ్రూ, ఆనందమాయి మా ఏమి మాట్లాడుకునే వారో ఎవరికీ తెలియదు. అయితే ఇరువురూ తరచు సమావేశమవ్వడం, మతం పట్ల నెహ్రూ వైఖరి విషయమై మన అవగాహనను సంక్లిష్టం చేస్తుంది. ఆయన అభిమానులు కొంతమంది, అనేకమంది వ్యతిరేకులు మనలను విశ్వసించేలా చేస్తున్నట్టుగా నెహ్రూ కలహశీల నాస్తికవాది కాదు. నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ రామాయణంతోపాటు కొన్ని క్రైస్తవ గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందారు. తన రాజకీయ జీవితం అత్యున్నత దశలో ఉన్న నలభైలు, యాభైల్లో హేతువాదంతో మాత్రమే మనిషి ఈ ప్రపంచాన్ని (జయించలేకపోయినా) అర్థం చేసుకోగలడని విశ్వసించారు. తన డెబ్భైల్లో ఆరోగ్యం అంతకంతకూ దిగజారిపోతూ మరణం ఆసన్నమవుతున్న తరుణంలో ఆయన మరొకసారి మతపరమైన సాంత్వనలకు మళ్ళారు.
– రామచంద్ర గుహ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాయని మచ్చ

మాయని మచ్చ
ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు కూడా ఆయనలో అవమానాన్నీ, ఆగ్రహాన్నీ కలిగించ లేదట. రాజీనామా చేసేది లేదంటున్నారు. మరో పదిరోజుల్లో పదవీ విరమణ చేస్తున్న ఆయనకు ఇదంతా పరువు తక్కువ వ్యవహారంగా కనిపించకపోవచ్చునేమో కానీ, యాభైయేళ్ల వయసున్న ఓ అత్యున్నత స్థాయి సంస్థకు మాత్రం ఇది పరువుప్రతిష్ఠల సమస్యే. అటువంటి వ్యక్తి చేతుల్లో ఆ సంస్థను పెట్టినందుకు ఈ దేశానికి కూడా. వీరతాళ్ళు వేయించుకోవలసిన ఓ సంస్థ ఆయన నేతృత్వంలో ఉరితాళ్ళు వేయించుకుంది. ‘పంజరంలో చిలక’ అంటూ చీవాట్లు తిన్నది. సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా ఇంతటి మొండిఘటం కాబట్టే, 2జీ కేసులో ఆయనగారిని పక్కకు తప్పిస్తూ కూడా, సీబీఐని పల్లెత్తుమాట అనకుండా స్వయంగా సుప్రీంకోర్టే దాని పరువూ, తన పరువూ కాపాడుకుంది.
సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఒక కీలకమైన కేసు నుంచి ఆ సంస్థ అధినేతనే దూరం పెట్టడం చరిత్రలో తొలిసారి. రంజిత్‌ సిన్హాకు ముందు ఆ సంస్థ అధినేతలుగా ఉన్నవారు కొందరు కొన్ని కేసుల దర్యాప్తు నుంచి తమకు తాముగా వైదొలిగిన సంఘటనలు మాత్రమే ఇప్పటివరకూ ఉన్నాయి. గతంలో వారు పనిచేసిన రాష్ట్రాలకూ, అప్పటి ముఖ్యమంత్రులకూ సంబంధించి దర్యాప్తులు చేయవలసి వచ్చినప్పుడు వారు ఈ జాగ్రత్తలు తీసుకొనేవారు. చివరకు తమతోపాటు గతంలో కలసిపనిచేసినవారి విషయంలోనూ ఇదే జాగ్రత్తపడేవారు. అంతెందుకు, ఇదే 2జీ కుంభకోణంలో రాజాపేరు వచ్చిచేరగానే తమిళనాడు కేడర్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి దర్యాప్తు బృందం నుంచి తక్షణం తప్పుకున్నారు. వీటిని విలువలని అనుకున్నా, చెడ్డపేరు వస్తుందన్న భయమనుకున్నా, ఇప్పుడు నేరుగా ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే తన సౌశీల్యాన్ని శంకించినప్పుడు రంజిత్‌ సిన్హా కనీసంగా చేయవలసింది ఏమీలేదా? తనకోసం కాకున్నా, తాను స్వయంగా స్వర్ణోత్సావాలు నిర్వహించిన సంస్థ గౌరవం కోసమైనా సెలవుపెట్టి పోనవసరం లేదా? ఆయన ధోరణి చూస్తున్నప్పుడు అలా జరిగే అవకాశాలు లేవు కనుక ప్రభుత్వమే ఇక ఆ పని చేయవలసి ఉంది.

సీబీఐ తీరుపై చాలాకాలంగా విమర్శలున్నాయి. ముఖ్యంగా, రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందువల్ల ప్రతిపక్షాల నోట్లో అది కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అయి కూచుంది. ఈ దశాబ్దకాలంలో అనేక కుంభకోణాలు వెలుగుచూడడం, కాగ్‌ వంటి సంస్థలు తూర్పారబట్టిన కారణంగా సుప్రీంకోర్టే స్వయంగా రంగంలోకి దిగడంతో సీబీఐ వ్యవహారశైలి మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఇంతకాలమూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారపక్షంలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన ఆ సంస్థ చిలుకపలుకులు మానేసి పులిలా గాండ్రిస్తుందని అనుకోనక్కరలేదు. కానీ, సర్వోన్నత న్యాయస్థానమూ, సీవీసీ, కాగ్‌ వంటివి క్రియాశీలకంగా ఉంటూ, యావత్‌ దేశమూ ఓ కన్నువేసి ఉంచినప్పుడు, అప్పటికే విమర్శల పాలైన సీబీఐ ప్రతిష్ఠని దాని రథ సారధే తన దుష్ప్రవర్తనతో మరింత దిగజార్చడం ఆశ్చర్యం కలిగించకమానదు. బాధ్యతాయుతంగా, పారదర్శకంగా వ్యవహరించవలసింది పోయి, సర్వాధికారాలూ తనకు దక్కినప్పుడు తన సంస్థ మరింత స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తుందంటూ సిన్హా సుప్రీంకోర్టుకు అఫిడవిట్లు సమర్పించడం విచిత్రం.

ఆయన ఇంటికి 2జీ స్పెక్ట్రమ్‌ నిందితులు తరచుగా వచ్చిపోతున్నారంటూ నాలుగునెలల క్రితం ‘సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌’ (సీపిల్‌) అనే సంస్థ ఆరోపించింది. దీనిని సిన్హా ఖండించారు. అనంతరం ఆయన నివాసంలోని లాగ్‌బుక్‌లో నమోదైన సందర్శకుల వివరాలను ఆ సంస్థ కోర్టుకు ఇవ్వడంతో, అదంతా అసత్యాల చిట్టా అనడంతో ఆయన దబాయింపు ఆరంభమైంది. ‘నా ఇంటికి ఎవరైనా రావొచ్చును, తలుపులు తెరిచే ఉంటాయి’ అన్నారు. వచ్చేవారు నిందితులైతేనేమి నా మిత్రులైనప్పుడు కలవకూడదా? అని కూడా ప్రశ్నించారు. అలా అనేకులు వచ్చి సమాచారం ఇస్తున్నందువల్లే దర్యాప్తులు సాగుతున్నాయంటూ దీర్ఘం తీసారు కూడా. ఈయన తన ఇంటి తలుపులు తెరిచి స్వాగతించినవారందరూ వివాదాస్పదులే. అక్రమ ఆస్తుల కేసు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ మాంసం ఎగుమతిదారు మోయిన్‌ ఖురేషీ ఏడాదిన్నర కాలంలో 90సార్లు ఈయనను కలిశాడు. అనిల్‌ అంబానీ కుడి, ఎడమ భుజాలనుకొనే ఇద్దరు వ్యక్తులు ఈయనను యాభైసార్లకు పైగా కలిశారు. బొగ్గుకుంభకోణంలో నిందితుడైన విజయ్‌ దర్దా పదిసార్లు, 2జీ కుంభకోణంలో లబ్ధిదారైన ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత 71సార్లు ఈయనను కలుసుకున్నారు. న్యాయస్థానానికి ఈ చిట్టా ఇచ్చినందుకు సీపిల్‌ సంస్థ మీదా, ప్రశాంత్‌భూషణ్‌ పైనా కేసులు పెట్టాలని సిన్హా వాదించారు. తన సంస్థలోనే ఓ వ్యక్తి తనకు వ్యతిరేకంగా కుట్రపన్ని, గూఢచారిలాగా పనిచేసి వారికి ఈ వివరాలు ఇచ్చాడంటూ విరుచుకుపడ్డారు. సిన్హా జగన్నాటకాన్ని ఎంతో ఓపిగా వీక్షించిన సర్వోన్నత న్యాయస్థానం చివరకు ఆయన పట్ల ఏమాత్రం నమ్మకం లేదన్న ఏక వాక్యంతో 2జీ దర్యాప్తు నుంచి దూరం పెట్టింది.
ప్రధానమంత్రి, విపక్షనేత తదితరులంతా ఉన్న కొలీజియం ద్వారానే సీవీసీ, సీబీఐ వంటి సంస్థల అధిపతుల నియామకం జరగాలన్న ప్రతిపాదన ఉన్న లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రంజిత్‌ సిన్హా నియామకాన్ని పూర్తిచేసేసింది. అందుకు ఆయన ఎంతో రుణపడి వున్నమాట నిజం. 2జీ కుంభకోణం దర్యాప్తులో రంజిత్‌ సిన్హా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సలహాలు ఇచ్చేవారనీ, ఆయన మాట వినివుంటే కేసు మొత్తం కుప్పకూలేదని సీబీఐ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆనంద్‌గ్రోవర్‌ న్యాయస్థానం ముందు చేసిన వ్యాఖ్యలు సిన్హాకు అత్యంత అవమానకరమైనవి. తమ న్యాయవాదినుంచే అంతమాట పడ్డాక మరొకరైతే తక్షణమే రాజీనామా చేసివుండేవారు. ఇప్పుడు న్యాయస్థానం పక్కనపెట్టినా కుర్చీవదిలేది లేదు అంటున్న రంజిత్‌ సిన్హా విషయంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అవసరం. ఈ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకుని, పంజరంలో చిలుకకు స్వేచ్ఛ ప్రసాదించడం మరింత ముఖ్యం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్మృతులు – నా కవిత – బందా

జయించరాని మరణానికి తలవంచిన మానవత నిర్మించినవే స్మృతులు – అవే సమాధులు!

భరించరాని దుర్మార్గం కబళించలేక  మిగిలించినవే  స్మృతులు – అవే శిధిలాలు !
అనంతమైన సంపదలు ఆవిరవగ  అగుపించేవే స్మృతులు – అవే పురాతన భవనాలు !
అన్యోన్యమైన ప్రేమ విఫలమైతే మరణించేవే స్మృతులు – అవే ఎందరో ప్రేమికుల విషాదాంతాలు !
 అభాగినుల ఆక్రందనలో  అంతమయేవి స్మృతులు – అవే నిర్భయల నిర్యాణాలు !!
           పాపపుణ్యాల కోలాటంలో విగ్రహాల ఆరాధనాస్మృతులు  – అవే ఆస్తికుల ఆవాసాలు !
           విగ్రహారాధన వద్దంటూనే వాటికి జోహార్లు పలికే స్మృతులు – అవే నాస్తికుల మనస్తత్వాలు !
           కాలం ఏదైనా ! గమనం ఎటైనా ! అనంతాలు స్మృతులు! అనిర్వచనీయాలు స్మృతులు !
          గత కాలపు స్మృతులతో కాలాన్ని వృధాచేయరాన్నది వేదం – అదే అదే ఈ బందా నాదం!!img018
                                      ———— రచన బందా వేంకట రామారావు , 9393483147..
Posted in కవితలు | Tagged | Leave a comment

ఒకే రోజు మూడు క్షేత్రాల సందర్శనం- 2

దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ త్రికూటేశ్వర స్వామి -కోటప్పకొండ

సాహితీ బంధువులకు శుభ కామనలు -నిన్న 20-11-14 గురువారం మేమిద్దరం ,మా కుటుంబ స్నేహితురాలు శ్రీమతి మల్లికాంబ గారు ఉదయం అయిదింటికి ఉయ్యూరులో కారులో బయల్దేరి  విజయవాడ గుంటూరు మీదుగా నరసరావు పేట వెళ్లి ఆడ మా బంధువుల అమ్మాయి తెలుగు లెక్చరర్ అయిన శ్రీమతి యడవల్లి మనోరమ వాళ్ళ ఇంట్లో ఒక గంట  ఉన్నాం . తర్వాతగుంటూరు జిల్లాలోని  కో టప్ప కొండ వెళ్లి అక్కడ  శ్రీ త్రికోటీ శ్వర స్వామి దివ్య దర్శనాను భూతిని పొంది ,ఆక్కడి  నుండి ప్రకాశం జిల్లాలోని త్రిపురాసుర సంహారాన్ని మహాశివుడు చేసిన త్రిపురాంతకం  చేరి  ఆక్కడ డ మహా మహిమాన్విత,మరియు బావి లో వెలసిన  శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ,ఛి న్న మస్తకాదెవిని ,కొండ పైనున్న శ్రీ త్రిపురాన్త కేశ్వర  ,పార్వతీ అమ్మవార్లనుదర్శించాం   అక్కడి నుండి మళ్ళీ గుంటూరు జిల్లా పొన్నూరు చేరి అక్కడ  అతిపెద్ద శ్రీ ఆంజనేయ స్వామిని , ప్రసిద్ధ శ్రీ భావనారాయణ స్వామిని ,శ్రీ ఆంజనేయ శివ దేవాలయాల  సమూహ దేవాలయాలను దర్శించి ,రాత్రి పది గంటలకు ఉయ్యూరు చేరుకొన్నాం . కా ర్తీక మాసం  చివరి రోజుల్లో చేసిన ఈ క్షేత్ర దర్శనమ్ దాదాపు అరవై ఏళ్ళ కల సాఫల్యం అయింది ఆనన్దమ్ గా  గా ఉంది .

మేమిద్దరం ,మల్లికాంబగారు -20-11-14గురువారం నరసరావుపేటలో శ్రీమతి యడవల్లి మనోరమ ఇంట్లో ను కోటప్ప కొండ ,త్రిపురాంతకం ,పొన్నూరు దేవాలయ సందర్శన చిత్ర భోగం .కోటప్పకొండపై మా శ్రీమతి ప్రభావతి అమ్మగారు పద్మావతమ్మగారి త్తండ్రి తండ్రి గారు శ్రీ చతుర్వేదుల పున్నయ్య గారు తమస్సు చేసి, కపాల మోక్షం పొందినఎత్తైన  పై కొండ ,కొండకింద మా గబ్బిటవారైన  శ్రీ గబ్బిట కోటయ్య గారు శివరాత్రి రోజుల్లో చేసే  బ్రాహ్మణ అన్నదాన సత్రం -ఉన్నాయి చూడండి

 ఈ యాత్రలో మొదటి అను భూతి  మా పాపాయి పిన్ని (బుల్లిమూతి పిన్ని )మేనకోడలు శ్రీమతి యడవల్లి మనోరమ దంపతులను నరసరాపేట లో వారింటికి వెళ్లి చూడటం .ఆమె చేసిన సత్కారం పొందటం సరసభారతి పుస్తకాలు ఆమకు  అందించటం, ఆమె ఇచ్చినవి తీసుకోవటం శ్రీ గంధం యాజ్ఞ వల్క్య శర్మ గారికి  మన పుస్తకా లు అందజేయమని మనోరమకు ఇవ్వటం శర్మగారి  కొత్త కదా సంపుటి(ఇంకా ఆవిష్కారం కా నిది)  ఈమె ద్వారా నాకు అంద జేయటం .
 రెండవది మా శ్రీమతి ప్రభావతి తల్లిగారు (నా అత్త గారు )పద్మావతక్కయ్య తండ్రి గారు చతుర్వేదుల వెంకటప్పయ్య గారి తండ్రి గారు చతుర్వేదుల పున్నయ్యగారు కోటప్ప కొండలో  త్రికూట  పర్వతాలలో అత్యంత ఎత్తైన కొండమీద దారి తెన్నూ లేని మార్గాన వెళ్లిసుమారు మూడు వందల ఏళ్ళ క్రితం  అక్కడే  తపస్సు చేసి కపాల మోక్షం తో ముక్తిని సాధించిన ఆ కొం డను త్రికూటేశ్వర స్వామి కొండ నుంచే  దూరంగానే చూసి పరవశిం చటం,  మా ఆవిడ ఎన్నో ఏళ్ళుగా చూడాలని తపించిన ఈ క్షేత్రాన్ని ,ఆ కొండను ఇన్నాళ్ళకు చూపించ గలగటం
        ,మూడవ విశేషం -దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం వరకు కోటప్ప కొండ నుండి ఒక బ్రాహ్మణుడు కోటప్ప కొండలో శివరాత్రి రోజుల్లో బ్రాహ్మణులకు అన్నదానం నిర్వహించే శ్రీ గబ్బిట  కోటయ్య గారి తరఫున ఉయ్యూరుకు శివరాత్రికి నెల రోజుల ముందే  వచ్చి మా ఇంటిలోనూ ,ఊళ్ళోని బ్రాహ్మణ్యం దగ్గరా చందాలు వసూలు చేసి రసీదులు ఇచ్చి మా ఇంట్లో భోజనం చేసి   వెళ్ళేవారు అప్పుడు   మేమిచ్చిన చందా  రెండు రూపాయలు మాత్రమె అని ఇప్పుడు చెబితే ఆశ్చర్యం గానే ఉంటుంది  అదే ఎక్కుకు ఆరోజుల్లో ..  దాన్ని అయిదు రూపాయలకు చివరికి పది రూపాయలు చేసి ఇచ్చిన జ్ఞాపకం .శివరాత్రి అవగానే ప్రసాదం ,అక్షతలు పోస్ట్ లో పంపే వారు.  మా నాన్న గారి కాలం లో మా అమ్మగారికా లమ్ లోను ,  నాకాలం లో ఇది అవిచ్చిన్నంగా జరిగింది గత ముప్ఫై ఏళ్ళుగా అక్కడి నుండి ఆ బ్రాహ్మణు డు కాని ఆయన తరఫున కాని ఎవరూ చందాలకు రాకపోవటం మాకు వెలితిగానే ఉంది  .నిన్న కోటప్ప కొండలో ఆ గబ్బిట కోటయ్య గారి  అన్నదాన సత్రం ను చూసి గొప్ప అనుభూతికి  లోనయ్యాం . శిధిలావస్థ లో ఉంది సత్రం అయితె మనోరమ చెప్పినదాని ప్రకారం గబ్బిట కోట య్య గారి వంశానికి చెందిన వారు ఇప్పటికీ ప్రతి శివరాత్రీ కి పది హీను రోజులు ముందు ఈ సత్రానికి వచ్చి బ్రాహ్మణులకు అన్నదానం  చేస్తున్నారని తెలిసి మహదానందం వేశింది . . మాకు  అందులో భాగం కల్పించి విరాళాలు స్వీకరించి మాకు పుణ్యాన్ని కల్పించ లేక పొతు న్నందుకు మనసులో బాధ గానే ఉంది .కాని ఆ కోటయ్య గారి సత్రం చూసినందుకు సంతృప్తిగా ఉంది .కొట య్యగారికి శతకోటి నమస్కా రాలు ,క్క్రుతజ్నతలు మనసులోనే అర్పించాను  సత్రం శిదిలమవుతున్నందుకు బాధగా కూడా ఉంది  .
  ఇదంతా నిన్నటి మహానందా  ను భవం   కా ర్తీకం లో దక్కిన మహా పుణ్యం .
 మీ-  గబ్బిట   దుర్గా ప్రసాద్ –  21-11-14
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఒకే రోజు మూడు క్షేత్రాల సందర్శనం

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

విశేష ప్రతిభావంతుడు సాంఖ్యాయన శర్మ – ద్వా.నా.శాస్ర్తీ,

విశేష ప్రతిభావంతుడు సాంఖ్యాయన శర్మ

  • – ద్వా.నా.శాస్ర్తీ, 9849293376

ఆధునిక సాహిత్యాభివృద్ధికోసం, ప్రాచుర్యం కోసం తొలి నాళ్ళలో ఎందరో శ్రీకారం చుట్టారు. బీజాలు లేనిదే చెట్టు రాదు. అటువంటి బీజాలు వేసిన వారిలో ‘మహోపాధ్యాయ’ శ్రీ ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ ఒకరు. 1864లో ఉత్తరాంధ్రలో జన్మించి పార్వతీపురానికి దగ్గరలో వున్న ‘మేరంగి’ జమీందారీ సంస్థానంలో దివాన్‌గా పనిచేశారు. అంతకుముందు న్యాయవాదిగా బాగా సంపాదించారు. సమకాలికులు ఆచంట వారిని ‘‘నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం’’గా ఆదరించారు. 14వ ఏటనే మిడిల్ స్కూల్ పరీక్షలో మద్రాసు రాష్ట్రంలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారన్నా, సంస్కృతాంధ్రాలు పుక్కిట బట్టారన్నా, వివిధ శాస్త్రాలు, దర్శనాలు ఆకళింపు చేసుకొన్నారన్నా, సాహిత్య పత్రికలు నడిపారన్నా- అది ఆచంటవారి ప్రజ్ఞానానికి నిలువుటద్దం. అక్కిరాజు రమాపతిరావు ‘‘కిందటి శతాబ్ది జన్మించి ఈ శతాబ్దిలో ఎన్నో రంగాలలో విశేష ప్రతిభావంతులు’’గా పేర్కొనటం సమంజసమే. చిత్రలేఖనంలో కూడా నిపుణులు!!
సాంఖ్యాయనశర్మ తెలుగులో ఎవరూ రాయని ‘‘ఉత్సృష్టికాంకం’’అనే రూపకం రాశారు. ‘‘బొండుమల్లెలు’’ అనే తొలి ఖండకావ్యం రాశారు. ‘లలిత’ అనే తొలి కథ రాశారు. మొట్టమొదటగా సాహిత్య పత్రిక ‘కల్పలత’ పత్రికను నడిపి ‘‘ప్రశ్నావళి’’ శీర్షిక నిర్వహించి ఉత్తమమైన సమాధానాలు రాసిన వారికి ఆరోజుల్లో నూట పదహారు రూపాయలు నగదు బహుమతి ఇచ్చేవారు. నట సమాజాలకు శిక్షణ ఇచ్చేవారు. పదిహేడు సంవత్సరాల వయసులోనే ‘‘సుజన ప్రమోదిని’’ అనే పత్రిక నడిపారని రమాకాంతరావు పేర్కొన్నారు. ‘‘నాటక సర్వస్వం’’ అనే గ్రంథం రాశారు గానీ అలభ్యం. కాళిదాసు నాటకాలను అనువదించారు. వీరు రాసిన ‘‘రహస్య దర్పణం’’ పుస్తకంలో భూగోళ ఖనిజ, క్రిమికీటక శాస్త్ర విషయాలున్నాయనీ, సౌరశక్తిని గురించి అందులో పేర్కొన్నారనీ తెలుస్తోంది. అంతటి పరిపూర్ణ ప్రజ్ఞాచార్యులు సాంఖ్యాయనశర్మ. నరసమాంబ, బాపిరాజులకు జన్మించిన వీరు 1933లో పరలోక గతులయ్యారు.
ఆనాడు సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావం సంప్రదాయవాదుల మీద చాలా ఉండేది. సాంఖ్యాయనశర్మ 1892లో ‘‘ఆంధ్ర పద్యావళి’’ అనే కావ్య సంపుటిలో ‘సంఘ సంస్కరణము’ అనే ఖండికనుంచి సినారె తమ సిద్ధాంత గ్రంథంలో ఒక పద్యం ఉదహరించి వీరి సేవ ఎన్నదగినది అని ప్రశంసించారు.
‘‘మగువలకె గాని చన్బాలు మగలకెందు
పొడవమను మాటలన్నియు బూటకములు
పురుషులికమీద స్తన్యంబు పొడమునట్లు
రొమ్ము సవరించు కొనుక భాగ్యమ్ముకాదె!’’
పురుషులలో వీరతాస్ఫూరి కలగాలని అధిక్షేపంతో చెప్పిన పద్యమిది. కల్పలత (1904, ఆగస్టు సంచిక)లో ‘‘బొండుమల్లె’’ పేరుతో 150 పంక్తుల గీతమాలికను ఖండ కావ్య రచనకు సాంఖ్యాయన శర్మ మార్గదర్శకుడయ్యారని సినారె పేర్కొన్నారు. రాయప్రోలు వారి ఖండ కావ్యాలకు ఇది స్ఫూర్తి అనవచ్చు. చిన్న ప్రేమకథను తీసుకొని స్వతంత్ర ఖండకావ్యం రాసినది ఆచంటవారే. అప్పట్లో ఆంగ్ల ఖండకావ్యాలకు అనువాదాలే వచ్చేవి. అయితే చెప్పుకోదగిన నవ్యత లేకపోవటం వల్ల పేరు పొందలేదని సినారెగారే తెలిపారు.
ఇదంతా ఒక ఎత్తు, కథాసాహిత్య రచన ఒక ఎత్తు. శర్మగారు ‘‘లలిత’’, ‘‘విశాఖ’’, ‘‘అపూర్వోపన్యాసము’’ వంటి కథలు 1903, 1904లలోనే రాయడం గొప్ప ప్రయత్నం. ఆధునిక కథకి ఒక ప్రాతిపదిక రూపొందించారు.
ఆచంటవారి ‘‘లలిత’’ తొలి కథగా గిడుగు సీతాపతి, పురిపండా వంటివారు సమర్ధించారు. సెట్టి ఈశ్వరరావు మొదలైనవారు దీనిని అంగీకరించలేదు. కానీ సుప్రసిద్ధ విమర్శకులు, ఆధునికత నిండుగా ఉన్న కె.కె.రంగనాథాచార్యులు ఆచంటవారి కథల్ని తొలి కథలుగా నిర్ణయించారు. 1978 మార్చి ‘అభ్యుదయ’ పత్రికలో కూడా ‘లలిత’ను మొదటి కథగా పేర్కొనబడింది. సరే, తొలి కథ అవునా? కాదా? అన్నది అలా వుంచితే తెలుగు కథకి ఓనమాలు దిద్దింది సాంఖ్యాయనశర్మ అనటంలో అనౌచిత్యం కనబడదు.
‘లలిత’ కథలో ఎత్తుగడ, స్ఫూర్తి, స్ర్తి స్వేచ్ఛ వంటివి ఉన్నాయి. ఒకసారి అనురాగం చూపిన తర్వాత మగవాడికి తనపై అధికారం లేదంటుంది లలిత. స్ర్తి పురుష స్వేచ్ఛలు అనే అంశం ఆధునికం తప్ప సంప్రదాయభావన కానే కాదు. అయితే జానపద రీతులుండటం నచ్చకపోవచ్చు. ఇది కథనానికి సంబంధించింది. వస్తువు ఆధునికమే. ‘‘విశాఖ’’ కథ సంభాషణతో మొదలవుతుంది. (వర్ణనతో కాదు). ఒక ప్రేమికుల జంట పక్షాన అబద్ధమాడి, తను మనసుపడినా దానిని చంపుకొని వారిద్దరికీ వివాహం చేసే స్ర్తి పాత్ర సరళ. ఈ కథలో ఆధునికతగల ‘‘మానసిక సంఘర్షణ’’ అనే శిల్పం అబ్బురపరుస్తుంది అంటారు కె.కె.ఆర్. అప్పటి సాంఘిక ఇతివృత్తం గల కథ ‘‘అపూర్వోపన్యాసం’’. సంస్కరణవాదుల ఉపన్యాస విన్యాసాలపై వ్యంగ్య శిల్పంతో రాయబడింది. సభలలో సరిగ్గా మాట్లాడటం రానివారు కూడా సంస్కర్తగా చిలుక పలుకులు పలకటం గమనిస్తాం. ఈ అంశాలన్నీ ఆధునికం కావా? ఇప్పటికి అన్వయించవా?
అయితే ఈ కథలు గ్రాంథికంలో ఉన్నాయి కాబట్టి ఆధునికత లేదనే విమర్శ. ఈమాట అనేముందు 1903-09నాటి సాహిత్య వాతావరణం అర్థం చేసుకోవాలి. అసలు కథే లేని రోజుల్లో కథకు నాంది పలకటమే గొప్ప. కేవలం భాషనుబట్టి ఆధునికత కాదని అంచనావేయడం అనుచితం. ఆ తర్వాత వచ్చిన అచ్చమాంబ మొదలైనవారూ గ్రాంథికంలోనే కథలు రాశారు. అంతవరకు ఎందుకు? గురజాడే ‘కమలిని’ పేరుతో గ్రాంథికంలో రాసి వాడుక భాషకి మార్చి ‘దిద్దుబాటు’ రాయలేదా? అప్పటికిగాని వాడుక భాష తెరమీదకి రాలేదు. గురజాడ తర్వాత వారు రాసిన కథలన్నీ వాడుక భాషలో లేవుకదా! గురజాడ దిద్దుబాటు రావటానికి పూర్వ రచయితల నేపథ్యమూ, స్ఫూర్తీ వున్నాయి. ఆ విధంగా సాంఖ్యాయన శర్మను స్మరించుకుందాం. దీపధారుల్ని విస్మరించటం సబబుకాదు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విస్మరించలేని సాహిత్య గుణాలు – ఒబ్బిని

విస్మరించలేని సాహిత్య గుణాలు

  • – ఒబ్బిని, 9849558842

‘‘తాము గడపవలసిన జీవితం, అనునిత్యం తాము ఎదుర్కోవాల్సిన పోరాటాలు తమ కళా రచనలో భాగంగా ఉండకపోతే, అవి దేశానికి ప్రాతినిధ్యం వహించకపోతే, ఆ ప్రజల్లో ఏదో పెద్ద లోపం, ఏదో కుళ్లు ఉందన్నమాట…’’
– కట్టమంచి రామలింగారెడ్డి
ఈ వాక్యాలు మనకు సాహిత్యం యొక్క బాధ్యత గురించి తెలియజేస్తాయి. అలాగే బాధకి పర్యాయపదంగా కవిత్వాన్ని నిర్వచించడం కూడా ఇంతవరకూ మనం ఎరిగిన విషయం. అంతేకాదు ఆవేశ మూలకమైన కళల్లో ఆవేదనా ఆహ్లాదాలు కూడా ఉబుకుతాయి. ఇదే వొరవడిలో ‘బాధ్యత’, ‘ఇంగితజ్ఞానం’ అన్నవి కూడా చేరతాయి. కవితా కళా విధుల్లో భాగంగా ‘‘తన సోదర భారతీయులు తన దేశంలో స్వాతంత్య్రం నిమిత్తం త్యాగాలు చేస్తుంటే తాను ఇక్కడ కూర్చోటం ఆయనకు అన్యాయంగా తట్టింది. దాంతో స్వదేశానికి తిరిగి వెళ్లాలనే ఆకాంక్ష తీవ్రమైంది’’ అంటూ డా.సంజీవదేవ్ ఓ వ్యాసంలో హరీంద్రనాధ్ ఛటోపాధ్యాయగారి గురించి చెప్పడాన్ని మనం ‘బాధ్యత’గా తీసుకోవచ్చు. ఏ తత్త్వానికైనా ‘బాధ్యత’, ‘ఇంగితజ్ఞానం’ అన్నవి రెండూ నికరంగా అవసరమైనవే. ఇండిగ పిక్కతో బురదనీటిని తేటమయం చేసినట్టు ఈ రెండూ స్వచ్ఛ విషయావిష్కరణలు తోడ్పడేవే. ‘బాధ్యత’, ‘ఇంగితజ్ఞానం’ అన్నవి మానవ చైతన్యంలో భాగంగా ఉంటాయి. ఈ ఇంగితమూ, బాధ్యతా పరస్పరమూ మనిషి ప్రేరణకు తోడ్పడి ప్రగతి పథంలో సాగడానికి ఉపకరిస్తాయి. కుటుంబంలోగాని, సమాజంలో కాని, దేశంలోగాని, లోకంలో ఎక్కడైనా పై రెండింటితో, ఆ స్వభావంతో మానవ మనుగడ సాగుతుందనడంలో ఎట్టి సందేహం ఉండదు. అలాగే కళలు, సాహిత్యంలో కూడా వీటి పాత్ర చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. భవన నిర్మాణానికి ప్రణాళికలు ఎలాగో, ఈ రెండూ కూడ సుసాహితీ శిల్పాల నిర్మాణాల్లో ఆ విధంగా తోడ్పడతాయి.
నిర్దిష్ట కులానికి, మతానికి చెందిన ప్రజల నిర్దిష్ట జీవితానుభవంనుండి కలిగిన స్వీయజ్ఞానం అనిర్దిష్టమైన శ్రామికవర్గ చైతన్యం కన్నా లోతయినది, నిండయినది. అది ఇచ్చే ఆత్మవిశ్వాసం బలమైనది. అది చైతన్యం దగ్గర ఆగిపోకుండా కొత్త జ్ఞానాన్ని- వారి నిర్దిష్టమైన జీవితానుభవంనుండి పుట్టిన జ్ఞానాన్ని సృష్టించగలదు. ఒక కొత్త రాజకీయ సమీకరణే కాక కొత్త మేధావి వర్గం ఆవిర్భావానికి కూడా అది దారి తీయగలదు…’’ (కె.బాలగోపాల్ ‘మనిషి-మార్క్సిజం’ నుండి). అది చదివినపుడు ఓ విశేష జ్ఞానం సంతరించుకుంటారని, అది బాధ్యత గలదై వుంటుందని సామాన్యుల ఇంగితానికి దగ్గరగా ఉంటుందని, పదుగురికీ ఉపయోగపడుతుందని ఆశించడం జరుగుతుంది. అటువంటి విశేషత లేకపోగా తారుమారు ఫలితాలు మనం చూడగల్గుతున్నాం.
అలాగే ఓ కవి- ‘‘ఆదివారం బొగ్గుబావుల సంతల్లో నేనమ్మిన కోడిపెట్టలు, చింత చిగురు కుప్పలు, ఐస్‌క్రేట్స్, కారేపల్లి కిరాణా దుకాణాల్లో గుమాస్తాగా నేనమ్మిన సరుకులు, ఇంటింటికీ పంచుకుంటూ తిరిగిన పత్రికలు-నా ఆకలితీర్చిన అమ్మలు’’ అని వాపోవడం జరిగింది. కాని తన కవితా సంపుటి సారంలో మాత్రం తన పునాది గురించి తపన లేశమాత్రం కనబడకపోవడం మాట అటుంచి, తన మతాంతర వివాహం, తన మతం గురించి ఓ ఫండమెంటలిస్టుగా, అపరాధ భావానికి లోనైన వాడిలా, కనీసం సంస్కరణ భావాలైనా లేకుండా మూడొంతులు వాపోవడం జరిగింది. ఏ దిశా నిర్దేశాన్ని చేయకుండా, అనగా ఎటువంటి బాధ్యత లేకుండా, దర్శనం లేకుండా సామాన్యులు అన్నమాటనే క్రాంత దర్శి అయిన కవి కూడా పలికితే విశేషతేముంటుంది. సవాలక్ష సామాజిక అవలక్షణాలు మన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు ఏ ఒక్కదాన్నయినా విడమరచాలి, విరుగుడు ఆలోచించాలి.
“…cronyism often overshadowing merit and system and process being undermind by power and influence” అన్నది ఈ నాటి సామాజిక స్వరూప సారం. ఈ నేపథ్యంలో ‘సమసమాజ ధ్యేయం మనుషులు చైతన్యవంతంగా ఎంచుకునే రాజకీయ లక్ష్యమే తప్ప అణచివేతనుండి అనివార్యంగా పుట్టే ఆకాంక్ష కాదు’ అన్న ప్రకటన తీసుకున్నప్పుడు ఏ ధ్యేయమైనా లేక బాధ్యతైనా ఓ మనిషి చైతన్యం నుండి అంకురిస్తుందని చెప్పుకోవచ్చు. అలా కాకుండా పైనుదహరించిన అనుభవాలు ఏ ప్రగతి చైతన్యాన్ని అందించలేకపోయాయని అర్థమవుతుంది మనకు. మానవతా గుణాలు అని చెప్పుకునే కరుణ, మైత్రి, ధైర్యం, ఉత్సాహం, ఆశావాదం, నిస్వార్థత, సహిష్ణుత అన్నవి ఈ ఇంగిత జ్ఞానమూ, బాధ్యతలతో కూడుకున్నవే. ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తాయి ఈ రెండూ. నిష్పూచీతనంతో సమాజంలో వికృతతత్వం చోటుచేసుకున్నప్పుడు ఈ రెండింటి కలయికతోనే సామరస్యం సాధించబడుతుంది సమాజంలో. కనీస ధర్మాలైన ఈ ఇంగిత జ్ఞానమూ, బాధ్యతా అన్నవి కొరవడడం మూలాన గొప్ప గొప్ప అనర్ధాలు చరిత్రలో చోటుచేసుకున్న సంగతులు మనకు అనుభవనీయమే. ‘మైత్రే తంతి అక్షరం’ అని నిర్వచించుకుంటున్న ప్రయోజనం నెరవేరదు ఈ ఇంగితమూ, బాధ్యతా లోపించినపుడు. ‘లజ్జ’ శీర్షికతో నవల వెలువడడానికి ఈ రెండే ప్రధాన మూలకాలు అని మనం భావించవచ్చు. అలాగే ఈ రెండూ ఎవరిలోనైనా ప్రోది చేసుకున్నప్పుడు మానవాభివృద్ధి కారక ఔచిత్యమైన అసంతృప్తితో కూడిన రచనలు చోటుచేసుకోవచ్చు.
“….infact the history of progress of mankind is a hisory of informed dissent, much of crative activity of high quality in all areas of human endeavour at any given time has been a reflection of such dissent…”
ఈమధ్యే మన ఉన్నత న్యాయస్థానాలు బాధ్యతాయుతమైన తీర్పులను వెల్లడించిన సంగతి మనం గమనించవచ్చు. అవినీతి మానవహక్కుల్ని హరిస్తుందని, ఆర్థిక అసమానతలని వ్యాపింపచేస్తుందని. కానీ మనం చూస్తున్నది నేడు మన సమాజంలో ఓ నిష్పూచీతనం ఓ బాధ్యతా రాహిత్యం, ఇంగితం లేని తనం, సోయలేనితనం, నిర్లజ్జగా సాగిపోతున్న దోపిడి. సానుకూలాంశాలు సాహిత్యంలో ప్రతిఫలించడమన్నది ఈ ఇంగితమూ, బాధ్యతల పరస్పర రసాయనమే. ఈ రెండు మూలకాలూ కేవలం గడ్డిపొలాల్నే కాకుండా పంట పొలాలనీ, ఫలసాయాన్నీ అందిస్తాయి. నిజానికి యజ్ఞాల్లాంటివి ఈ రెండూ సాహిత్యాన్ని ఉన్నతీకరించడానికి, అవ్యవస్థీకరణ దశను దాటి ఉచ్ఛస్థితిని చేరడానికి – ఈ బాధ్యతా ఇంగిత జ్ఞానాలన్నవి వసంతకాలపు చిగుళ్లలాంటివి. శోభాయమానమై, శుభ పరిమళాలు అందచేస్తాయి. ఇంకా ఇవి సెలయేళ్లలా ప్రవహించి సాహితీ శిల్పాన్ని నిర్మిస్తాయి.
పాలనా గద్దెలనుండి ప్రసరించే అవరోహణా కిరణాలను తిప్పికొట్టి నేలమీది పాదాలనుండి పాకే ఆరోహణా కిరణాలను ఆవిష్కరించడంలో, ఆదరించడంలో, ఆచరించడంలో ఈ బాధ్యత, ఇంగిత జ్ఞానాలన్నవి సాహిత్యంలో పరిపూర్ణ విధులను నిర్వర

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాంధీ చీపురా? గాడ్గే చీపురా? – మల్లంపల్లి సాంబశివరావు

గాంధీ చీపురా? గాడ్గే చీపురా? – మల్లంపల్లి సాంబశివరావు
బ్రూమ్‌ టెక్నిక్‌(చీపురు టెక్నిక్‌)కు ఆద్యుడు గాంధీజీ కాదు. దీనికి ఆద్యుడు సంత్‌గాడ్గే బాబా. ఆ నిరంతర సంచారి ఉదయం ఏదో ఒక ఊరెళ్లి, చీపురుతో ఊడ్చేసి, సాయంత్రం ఏ గుళ్లోనో కీర్తనలను పాడేవాడు.. జనం మస్తిష్కాల్లో, తిష్ఠవేసిన మూఢత్వాలను, మకిలిని కడిగేసేవాడు. మహారాష్ట్రలో సోషలిస్టు భావాలకి ఒక భూమిక ఏర్పడడానికి గాడ్గే బాబా బోధనలూ కీర్తనలూ ఎంతగానో ఉపకరించాయి.
కొత్తగా చీపురు పట్టుకున్న నరేంద్ర మోదీ – ఆయన పరివారమూ కలిసి, కొన్ని పాత చరిత్రలను ఊడ్చే పనిలో పడ్డారు. కొన్ని కొత్త ప్రతీకల్ని నెలకొల్పదల్చుకున్నారు. అందులో భాగమే పటేల్‌ జయంతిని సమైక్యతా దివస్‌గా ప్రకటించడం, గాంధీ జయింతికి స్వచ్ఛ్‌ భారత్‌ను ప్రారంభించటం…
మోదీ అండ్‌కో చెబుతున ్నట్టుగానే – ఆ ఇద్దరు మహనీయులకి కాంగ్రెస్‌ సరైన గుర్తింపును ఇవ్వలేదనుకుందాం.. అంతమాత్రాన చరిత్ర పుటల్లో పటేల్‌కి ఇండియన్‌ బిస్మార్క్‌గా ఉన్న ఖ్యాతిని ఎవరైనా చెరపగలరా? మహాత్ముడు ఇ-జనరేషన్‌కి కూడా ఎంతో స్ఫూర్తినిస్తున్నారని చెప్పడానికి మున్నాభాయ్‌ సినిమాల్ని మించిన ఉదాహరణ కావాలా? పటేల్‌ సంగతి అలా ఉంచితే, గాంధీని కూడా హైజాక్‌ చేస్తుంటే – ఇక ఏ చెట్టు పేరు చెప్పుకుని బతకాలో తెలీక కాంగ్రెస్‌ కలవరపడుతోంది. ఎప్పుడూ విజేతలే చరిత్రను రాయటం ఎంత నిజమో, రాసేవాళ్లు ఎందరినో విస్మృతిలోకి నెట్టేయడమూ అంతే నిజం. మనకి ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసు, కానీ ఝల్కారీబాయి గురించి బుందేల్‌ ఖండ్‌ దాటి ఎవరికీ తెలీదు. తెలంగాణ పోరాటంలో మల్లు స్వరాజ్యంలాగే తుపాకీ పట్టిన ఎరుకల గండెమ్మ (బీబీ నగర్‌) పేరు తెలీదు మనకి. ఇక సీ్త్ర జనోద్ధరణ అనగానే రాజారామ్‌ మోహన్‌రాయ్‌, కందుకూరి గుర్తొస్తారు… ఆడపిల్లల కోసం దేశంలోనే తొలి పాఠశాల పెట్టిన సావిత్రీబాయి ఫూలేని జాతికి తెలియనిచ్చారూ? గాంధీ కంటే ముందే ప్రజల సమక్షంలో జ్యోతిబా ఫూలేకి మహాత్మ అనే బిరుదు ఇచ్చినా దాన్ని మరుగు పరిచి-రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ గాంధీజీని సంబోధిస్తూ మహాత్మా అన్న మాటనే బిరుదుగా మార్చి స్థిరపరచలేదా? ఇప్పుడు మళ్లీ స్వచ్ఛ్‌ భారత్‌కి వస్తే… ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పట్టుకుని – తమ చీపురును మోదీ హైజాక్‌ చేశారని ఆమ్‌ ఆద్మీ ఆరోపిస్తోంది. అది గాంధీ చీపురని బీజేపీ చెబుతోంది. కొంచెం చరిత్రలోకి వెళితే చీపురు మీద గాంధీకి పేటెంట్‌ హక్కులు లేవన్న సంగతి తెలుస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యమిచ్చిన గాంధీజీ తన ఆశ్రమంలోనూ, నౌఖాలీలోనూ మరికొన్ని ప్రత్యేక సందర్భాలలోనూ – చీపురు పట్టుకోవటమూ, టాయ్‌లెట్లను శుభ్రపరచటమూ నిజమే. అయితే గాంధీకున్న అనేక కోణాల్లో ఇది ఒక కోణం మాత్రమే. గాంధీ కంటే చాలా ఏళ్ళముందే – పరిశుభ్రతకే మొత్తం జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుడున్నాడు. అతడి పేరు గాడ్గే బాబా. చీపురు ఆయన ట్రేడ్‌ మార్క్‌. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో వెనకబడిన ధోబీ కులంలో పుట్టిన దేవూజీ అనే నిరక్షరాస్యుడు – మరాఠీలంతా ఆరాధించే గాడ్గే బాబాగా ఎదిగాడు. చీపురుతో పాటు బిచ్చమెత్తుకునే మట్టి పాత్ర ఒకటి ఉండేది ఆయన దగ్గర. తిన్న తర్వాత దాన్నే కడిగి నెత్తిన బోర్లించుకునేవాడు. మరాఠీలో మట్టిచిప్పను గాడ్గే అంటారు.. అలా దేవూజీ పేరు కాస్తా గాడ్గే బాబాగా మారిపోయింది. ‘గోపాల గోపాల దేవకీ నందన్‌గోపాల’ అనే కీర్తన ఆయనకి పర్యాయపదంగా నిలిచింది. తన కీర్తనల్లో – జంతుబలుల్ని, బాల్య వివాహాల్ని అంటరానితనాన్ని, మద్యపానాన్ని, మూఢత్వాన్ని నిరసిస్తూ సామాన్య ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించేవాడు. గాడ్గేబాబా 1905లో తన ముప్పయ్యో ఏట సాధువుగా మారి చీపుర పట్టిన సమయానికి గాంధీజీ ఇంకా జోహెన్స్‌బర్గ్‌లోనే ఉన్నారు. గాడ్గే బాబా అనుచరుడైన ప్రముఖ మరాఠీ రచయిత పి.కె. ఆత్రే ఇలా రాశారు – ‘చాలా మంది విద్యాధికుల్లో బ్రూమ్‌ టెక్నిక్‌ (చీపురు టెక్నిక్‌)ను గాంధీజీయే కనిపెట్టినట్టు ఒక మూఢనమ్మకం వ్యాపించి ఉంది. కానీ దీనికి ఆద్యుడు సంత్‌గాడ్గే బాబా. ఆ నిరంతర సంచారి ఉదయం ఏదో ఒక ఊరెళ్లి, చీపురుతో ఊడ్చేసి – సాయంత్రం ఏ గుళ్లోనో కీర్తనలను పాడేవాడు…. జనం మస్తిష్కాల్లో, తిష్ఠవేసిన మూఢత్వాలను, మకిలిని కడిగేసేవాడు’. మహారాష్ట్రలో సోషలిస్టు భావాలకి ఒక భూమిక ఏర్పడడానికి గాడ్గే బాబా బోధనలూ కీర్తనలూ ఎంతగానో ఉపకరించాయని కూడా ఆత్రే విశ్లేషించారు. గాడ్గే బాబా -మహారాష్ట్రలో చాలామంది దృష్టిలో గాంధీ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ కూడా. ఆ ఇద్దరి మధ్యా జరిగిన ఒకేఒక సమావేశంలో అంటరానితనంపై చర్చలు జరిగాయి. ఆ ప్రభావం గాంధీజీ కార్యక్రమాల్లో తర్వాత ప్రతిఫలించిదని చెబుతారు.
ప్రజలిచ్చిన విరాళాలతో గాడ్గే బాబా మొత్తం 141 విద్యాలయాలను నెలకొల్పారు. కింది కులాల చదువుకోసం గాడ్గే పడుతున్న తపనను, చేస్తున్న కృషిని చూసి అంబేద్కర్‌ ఆయనపై అభిమానాన్ని పెంచుకున్నారు. బాబాను తన గురువుగా చెప్పుకున్నారు. చివరి క్షణం వరకూ చీపురు, మట్టిపాత్ర, చింకిపాత్రలే ఆస్తులుగా బతికిన గాడ్గేబాబా సేవలకి గుర్తింపుగా – వాజ్‌పేయి హయాంలో కేంద్రం ఓ పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. ఇక 1986 నుంచి కేంద్రంలో అమలవుతున్న స్వచ్ఛతా పథకాన్ని మెరుగుపరచి – 2001లో సంత్‌ గాడ్గే బాబా పేరు పెట్టారు. ఏళ్లతరబడి గాడ్గే పేరు మీద జాతీయ స్థాయిలోనూ, మహారాష్ట్రలోనూ అమలవుతున్న పథకాన్ని – మోదీ వచ్చి గాంధీకి అంటగట్టారు. ఎంతో కొంత వెలుగులోకి వచ్చాడనుకున్న గాడ్గేబాబాను ఇప్పుడు మళ్లీ కిందికి నెట్టే శారు. గాడ్గే బాబా సర్వసంగ పరిత్యాగి కావడానికి ముందు ఒక చిన్న రైతు. తాను ఎంతో కష్టపడి సాగులోకి తెచ్చిన బంజరును ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని, ఆ ఊరి షావుకారు కుట్ర పన్ని గూండాలను ఉసిగొలిపితే – వారిని తన పొలంలోకి అడుగుపెట్టనివ్వకుండా తన్ని తరిమేశాడు. ఇప్పుడు చీపురుమీద పేటెంట్‌ను – ఎవరెవరి ఖాతాలలోనో వేద్దామని చూస్తే మాత్రం ఊరుకుంటాడా? దళిత బహుజనుల రాజ్యం వచ్చినప్పుడు ఊడ్చాల్సినపేర్లను ఊడ్చేయకుండా ఉంటాడా?
– మల్లంపల్లి సాంబశివరావు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గండిపెతకు గండికొట్టే యత్నం లో ”కల్వ కుంట ”

గండిపేటకు గండం
హైదరాబాద్‌లో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ పరిరక్షణకోసం అమలులో ఉన్న జీవో 111ను మార్చి, పరిసర గ్రామాల్లో భూములకు మంచి విలువ వచ్చేట్టు చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్య అమితాశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ జీవో ప్రకారం ఆ రెండు జలాశయాలకు 10కి.మీ. పరిధిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు కనుక, గ్రామాల్లో భూముల ధరలు పెరగడానికి వీలుగా జీవోని సవరించడానికి ప్రభుత్వం సంకల్పిస్తున్నది. తెలంగాణ తొలి ప్రభుత్వం చెప్పుకుంటున్న ఈ సంకల్పం సాధ్యాసాధ్యాలను అటుంచితే, ఈ దిశగా సాగే ఎటువంటి ప్రయత్నమైనా తెలంగాణ స్ఫూర్తికి విఘాతం కలిగించేదే అవుతుంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు తన పార్టీలో చేరుతున్న సందర్భంగా కేసీఆర్‌ ఈ హామీని ఇచ్చినప్పటికీ, అది చేరుతున్నవారికీ, చేర్చుకుంటున్నవారికీ మధ్య జరుగుతున్న ఒక తాత్కాలిక రాజకీయ క్రీడగా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ నాయకులు ఆ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఈ జీవో రద్దు కూడా ఒకటి. మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనుమడు, చేవెళ్ళ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీగా బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి, రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ఈ జీవో విఘాతంగా ఉన్నదనీ, దానికి సవరణలు చేయిస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. గ్రామాల ఎంపిక విషయంలో శాసీ్త్రయత పాటించలేదనీ, ఈ 84 గ్రామాల్లో చాలా గ్రామాలు జీవో పరిధిలోకి రావనీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంలో కూడా కొత్తేమీ లేదు. అది సత్యమా, అర్థసత్యమా అన్న వివాదాన్ని పక్కనబెడితే, ఈ జీవో మీద కన్నెర్రచేసిన గత పాలకులు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసేవారు. దాదాపు ఈ రెండు దశాబ్దాల కాలంలో ఆ జీవోచుట్టూ అల్లుకున్న రాజకీయం, దానిని బలహీనపరచే ప్రయత్నాలు కూడా ఇలాగే మొదలయ్యేవి. కాకుంటే, తెలంగాణ నీటివనరుల పరిరక్షణ విషయంలో గత ప్రభుత్వాల వివక్షనీ, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా దునుమాడుతూ, ఇప్పుడు అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా అదే దారిలో అడుగులు కదపడమే ఆందోళన కలిగిస్తున్నది.
తమ ప్రాంతాల అభివృద్ధికి ఈ జీవో ప్రతిబంధకంగా మారిందనీ, దీన్ని సవరించాలని స్థానికులు చాలా ఏళ్ళనుంచి అడుగుతున్నారు. హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ పరివాహక ప్రాంతంలోని 84 గ్రామాలను జీవ పరిరక్షణమండలి (బయో కన్జర్వేషన్‌ జోన్‌)గా పరిగణిస్తూ 1996 మార్చిలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో సుమారు ఆరుమండలాల్లోని భూముల విలువ పెరగడానికీ, అభివృద్ధికీ ఆటంకంగా ఉందని వారి బాధ. ఈ పరిధికి అడుగుదూరంలో పుట్టుకొచ్చిన ఆకాశహార్మ్యాలు, చుక్కలనంటుతున్న ధరలు చూసినప్పుడు వారి ఆవేదనలో అర్థం ఉందనిపిస్తుంది. ఒకవైపు ఈ జీవోను అడ్డంపెట్టుకునే కారుచవుకగా భూములు సంపాదించి రిసార్టులు, ఫామ్‌ హౌస్‌లు కట్టుకున్నవారు ఉన్నారు. సాధ్యమైనన్ని గ్రామాలు దీనినుంచి మినహాయించాలన్న ఒత్తిడి గతంలో మాదిరిగానే కొత్త పాలకులపై ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలోనే, జిల్లా కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు అందడమూ, నీటిపారుదల శాఖ ప్రత్యేకంగా సర్వేచేసి జీవో వర్తింపచేసిన గ్రామాలన్నీ జలాశయాల ఎగువ ప్రాంతంలోకే వస్తాయనీ, దీనిని ఏమాత్రం సవరించినా జంటజలాశయాల అస్తిత్వం దెబ్బతింటుందని ఇటీవలే ఒక నివేదిక సమర్పించడమూ జరిగింది. అయినా ఇప్పుడు అందుకు భిన్నమైన ప్రతిపాదన బలంగా ముందుకు వస్తున్నది.
పర్యావరణ వేత్తలు, భాగ్యనగర ప్రేమికుల చొరవ వల్ల, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాలు అడ్డంకిగా ఉండడంతో సాధ్యం కాలేదు కానీ, మినహాయింపుల పేరిట 111కు ఎగనామం పెట్టాలనే పాలకుల సంకల్పం నిజానికి ఎప్పుడో నెరవేరిపోయి ఉండేది. జంట జలాశయాలను ఈ జీవో బలంగా కాపాడుతున్నదని కానీ, పరీవాహక ప్రాంతంలో నిర్మాణాలు లేవని కానీ అనడం లేదు. జీవోని బలహీనపరచాలని చూసిన వరుస ప్రభుత్వాలు దాని అమలు విషయంలో ఎంతటి చిత్తశుద్ధి కనబరచివుంటాయో అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ప్రభుత్వాలే సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఎ ప్రింటింగ్‌ వంటి సంస్థలకు ఈ పరిధిలో అనుమతులు ఇచ్చాయి. అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలోనూ పర్యావరణ వేత్తలు కోర్టులకు ఎక్కారు. రేస్‌కోర్సు క్లబ్బులూ, ఫార్ములా వన్‌ రేస్‌ కోర్సులూ ఆ ప్రాంతాలను దున్నేయడానికి ఎంతో తపించాయి. న్యాయస్థానాలు అడ్డం పడినప్పుడల్లా భూమి వినియోగం నిర్వచనాన్ని మార్చడానికి ఏపీఐఐసీ తపించింది. ఈ విధంగా ఉల్లంఘనలు ఉన్నా, ఇప్పటికీ ఆ ప్రాంతాలు తమ అస్తిత్వాన్ని ఎంతో కొంత కాపాడుకుంటూనే ఉన్నాయి.
సామాన్యుడి దాహార్తిని తీరుస్తున్న ఈ జంట జలాశయాలను రియల్‌ ఎస్టేట్‌ పడగనుంచి కాపాడుకోవడం పర్యావరణ ప్రియులకు ఆది నుంచి సమస్యగానే ఉంది. కాస్తంత ఊపిరి తీసుకుంటున్న దశలో ఇప్పుడు మళ్ళీ ఆ భయం మొదలైంది. జంటనగరాలకు మంచి నీటిని సరఫరా చేసే విషయంలో ఇప్పటికే, ఒకదాని తరువాత ఒకటి కొత్త ప్రాజెక్టులు నెత్తిన ఎత్తుకుంటూ, సుదూర ప్రాంతాలనుంచి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం, ఈ జంటజలాశయాలకు నీరు అందే మార్గాలను మరింత సుగమం చేయవలసింది పోయి భూమి ధరల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఆ విషయంలో ఆందోళనలో ఉన్నవారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసింది పోయి నేరుగా జీవోనే సవరించాలనుకోవడం సముచితం కాదు. కాదూ కూడదని ముందుకు సాగిన పక్షంలో, సవరణలకు వీలులేదంటూ సర్వోన్నత న్యాయస్థానం 2000 సంవత్సరంలో ఇచ్చిన ఆదేశాలే పర్యావరణ వేత్తలకు శ్రీరామరక్ష. ఒకవైపు మూసీనదిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలన్న వాదన బలంగా ముందుకు వస్తున్న తరుణంలో ఇటువంటి ఆలోచనలను తెలంగాణ ప్రజలు ఆమోదించలేరని ప్రభుత్వం గమనించాలి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంటి ఉసిరి మహా(మినీ)ఉసిరి చెట్టు కింద కార్తీకమాసం చివరి సోమవారం కార్తీక వన భోజం

మా ఇంటి ఉసిరి మహా(మినీ)ఉసిరి చెట్టు కింద కార్తీకమాసం చివరి సోమవారం 17-11-14న మా అన్నయ్య గారి మనవడు ఛి కళ్యాణ్ తో కలిసి మహన్యాస పూర్వక శ్రీ రుద్రాభిషేం ,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ,శ్రీ వెంకటేశ్వర దీపారాధన ,బంధు మిత్రులతో కార్తీక వన  భోజం  దృశ్యమాలిక

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

మోడీ” స్వచ్చ భారత్” కోసం శ్రీలంకను” క్లీన్ స్వీప్ ”చేసిన భారత్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిత్వం నా ప్రతిఘటనా ప్రవ్రుత్తి -అనిసెట్టి రజిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ వజ్రం ఆవంత్స సోమసుందర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి 72 వ సమావేశం -కార్తీకం

సరస భారతి -సాహిత్య సంస్క్క్రుతిక సంస్థ -ఉయ్యూరు

                     72 వ సమావేశం -ఆహ్వానం

సరసభారతి 72 వ సమావేశం శ్రీ సువర్చలాంజ  నేయ స్వామి దేవాలయం మహిత మందిరం లోకార్తీక మాసం చివరి రోజు   22-11-14 శనివారం సాయంత్రం 6-30గం లకు జరుగును . రిటైర్డ్ తెలుగు లెక్చరర్ శ్రీ నౌడూరి   రమేష్  గారు ”తెలుగు కావ్యాలలో  శివ పార్వతీ వర్ణనం”   పై  ప్రసంగిస్తారు .భక్తులు సాహిత్యాభిమానులు పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన
జోశ్యుల శ్యామల దేవి -మాది రాజు శివ లక్ష్మి  -గబ్బిట వేంకట రమణ-   గబ్బిట  దుర్గా ప్రసాద్
 గౌరవాధ్యఖులు          కార్య దర్స్ది               కోశాధికారి                 అధ్యక్షులు -సరసభారతి
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీజగాదాంబా సమేత సోమేశ్వరాలయం లో 16-11-14ఆదివారం శ్రీ జగదాంబా సమేతసోమేశ్వర బ్రాహ్మణ సేవా సంఘం మొదటి సమావేశం

ఉయ్యూరు శ్రీజగాదాంబా సమేత సోమేశ్వరాలయం లో 16-11-14ఆదివారం శ్రీ జగదాంబా సమేతసోమేశ్వర  బ్రాహ్మణ సేవా సంఘం మొదటి సమావేశం – శ్రీ సత్యనారాయణ వ్రతం ,పెద్దలకు సన్మానం మరియు మొదటి కార్తీక వన భోజనం -విరగ బడి హాజరైన బ్రాహ్మణ్యం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు .-83 ఆత్కూరు ఉద్యోగం

నా దారి తీరు .-83

ఆత్కూరు ఉద్యోగం

ఆత్కూరు కు వెళ్ళా లంటే ఉయ్యూరు నుంచి కంకిపాడు వెళ్లి  ఆక్కడగన్నవరం షటిల్ బస్ లో గన్నవరం చేరి ,అక్కడి నుండి హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్ళే ఏలూరు బస్ ఎక్కి ఆత్కూరు దగ్గర దిగి  అక్కడి నుండి సుమారుకిలో మీటరు నడిచి స్కూల్ కు చేరుకోవాలి .అదీ తొమ్మిదిన్నర కి అక్కడ ఉండాలి .కంకి పాడు లో బస్ అందుకోవటం ,అక్కడ జంక్షన్ బస్ పట్టుకోవటం చాలా ఇబ్బందిగా ఉండేది .ఇంటి దగ్గర సుమారు ఏడున్నరే బయల్దేరాల్సి వచ్చేది .అప్పటీ ప్రభావతి అన్నం వగైరా వండి రెడీ చేస్తే  ఇంత’’కతికి ‘’ఆదరా బాదరా ముక్కూ  నోటా కుక్కుకొని వెళ్ళే వాడిని .వీలయితే టిఫిన్ కూడా  మధ్యాహ్నానికి తయారు చేసిచ్చేది .ఆక్కడ పని చేసినంత కాలం ఉరుకులూ ,పరుగుల జీవితమే అయింది .సాయంత్రం నాలుగున్నరు స్కూ ల్ అయిపోగానే  అక్కడి నుంచి నడిచి సెంటర్ కు వచ్చి  గన్నవరం వెళ్ళే బస్ పట్టుకొని ,అక్కడి నుంచి కంకి పాడు బస్సుఎక్కి అక్కడ దిగి ఉయ్యూరు వెళ్ళే బస్ అందు కోవాలి .ఇప్పుడున్నంత బస్ ఫ్రీక్వేన్సీ ఆ రోజుల్లో  ఉండేవి కావు .చాల ఇబ్బందులు పడాల్సి వచ్చేది .ముఖ్యం గా గన్నవరం నుండి బయటం పడటం మహా ఇబ్బంది గా ఉండేది .బస్ లు దొరక పొతే గన్నవరం దగ్గర యెర్ర మట్టి లారీలు లేక  కంకర లారీలు ఎక్కి రావాల్సి వచ్చేది  . కాబిన్ లో ఖాళీ  లేక పొతే పైన కూర్చోవాల్సి వచ్చేది .బట్టలన్నీ యెర్ర దుమ్ముతో నిండిపోయేవి ఇంటికొచ్చేసరికి .ఇదీ ఆత్కూరు ఉద్యోగం ‘’సౌఢభ్యం ‘’

అక్కడ చేరిన మర్నాడే సాయంత్రం  గన్నవరం లో దిగి హైస్కూల్ దగ్గర రోడ్డులో ఉన్న శ్రీ అప్పరాయ వర్మ గారింటికి వెళ్లి కలిసి చేరినట్లు చెప్పి ధన్యవాదాలు తెలియ జేశాను. ఆయనా సంతోషించారు .హెడ్ మాస్టారు చాలా మంచివారని సిన్సియర్ అని డ్యూటీ మైండెడ్ అని చెప్పారు .అంటే ఆయన్ను మెప్పించటం అంత సులువు కాదని చెప్పకనే చెప్పినట్లు . హెడ్ కోటేశ్వరరావు గారు తెల్లని మల్లెపూవు లాంటి గ్లాసో పంచె తెల్ల చొక్కా తో ఉండేవారు .ముందు రెండుపళ్ళమధ్య కొద్దిఎడం .నవ్వు ముహం లో కనిపించేది కాదు .సీరియస్ గా ఉన్దేవారేప్పుడూ .అంతా టైం ప్రకారం నిర్దుష్టం గా జరగాలని కోరేవారు .అలాగే జరిపేవారు .ఇంగ్లీష్ చెప్పేవారు .సోషల్ మేష్టారు వెంకటేశ్వర రావు ప్రక్కనే ఉన్న పేద అవుటుపల్లి గ్రామస్తుడు .రోజూ సైయిల్ మీద ఆక్కడినుంచే వచ్చేవారు .సరదామనిషి .హెడ్ గారీ తలలో నాలుక .పెదవుతూ పల్లి లో జోసెఫ్ తంబి ఆశ్రమం ఉంది ఆయన ఆరాధనోత్సవాలు ఘనం గా నిర్వహిస్తారు .అకడ మిషన్ గర్ల్స్ స్కూల్ ఉంది .

సైన్స్ మేష్టారు హనుమంత రావు ఏలూరు వర్క్ షాప్ లో చాలా ఏళ్ళ క్రితం పరిచయమైనా వాడు .లాబ్ ఇంచార్జ్ .లాబ్ కూడా పెద్దదే .హార్ట్ పేషెంట్ అనిజ్ఞాపకం .మంచి స్నేహితుడు .లంచ్ టైం లో ఇంటికి స్కూటర్ మీద తీసుకోని వెళ్లి భార్య తో టిఫిన్ చేయించి టీ తో సహా ఇచ్చేవాడు .ఆవిడా చాలా సంస్కారం తో అన్నయ్యగారూ అంటూ ఆప్యాయం గా పలకరించేది .ఇద్దరు పిల్లలని గుర్తు .వాళ్ళూ సరదాగా ఉండేవారు .అలాగే ఒక జూనియర్ తెలుగు పండిట్ విజయ లక్ష్మి అని గుర్తు .స్కూల్ లో ఖాళీ పీరియడ్స్ లో చాలా ఆత్మీయంగా  మాట్లాడేది .వాళ్ళ ఆయన అక్కడ పోస్ట్ మాస్టారు .ఆమె కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి  ఆహ్వానించి టిఫిన్ చేసి పెట్టేది .స్కూల్ కు  కాఫీ ఫ్లాస్ తీసుకొచ్చి నాకు  కూడా కాఫీ ఇచ్చేది .ఇలాంటి ఆత్మీయులు ఇక్కడ లభించటం నా అదృష్టం . అలాగే వాలేశ్వర రావు గారనే సెకండరీ గ్రేడ్ టీచర్ నల్లగా లావుగా తెల్లటి నేత పంచె చొక్కా ఉత్తరీయం తో ఉండేవారు .గొప్పకవి .మా ఇద్దరికీ ఖాళీ దొరికితే సాహిత్యం తో కాలక్షేపం చేసేవాళ్ళం .ఆయన రాసిన పద్యాలు వినిపించేవారు .చాలా ధారా శుద్ధితో పద్య రచన చేశారు .విశ్వనాధ వారి శిష్యులు కూడా .విశ్వనాధ అంటే వీరాభిమానం ఆయనకు .నాకూ అంతే కనుక మా సాన్నిహిత్యం మరీ ఎక్కువైంది .అయన రిటైర్ అయి బెజవాడ దగ్గర ముత్యాలంపాడు లో ఉండేవారు .ఒక సారి ఉయ్యూరు వచ్చిమా ఇంటికి  వచ్చారు .అప్పుడు మా శ్రీమతి ఊర్లో లేదు .నేనే వండు కుంటు న్నాను .కనుక ఆతిధ్యం ఇవ్వలేకపోయాను కాని ఉయ్యూరులో శివాలయ అర్చకుడు  రాఫ్ట్ మేష్టారు నా శిష్యుడు మామిళ్ళ పల్లి సోమేశ్వర రాకు బంధువులు ఆయన .వాళ్ళ ఇంటికే  వచ్చానని అక్కడే  భోజనం చేస్తానని చెప్పారు .ఉయ్యూరు లో సాహితీ మండలిని మా గురువుగారు స్వర్గీయ లంకా బసవా చారి మేష్టారు మా అందరితో కలిపి ప్రారంభించిన రెండు మూడేళ్ళ తర్వాత జరిపిన కవి సమ్మేళనాలలో వాలేశ్వర రావు గారిని వచ్చి పాల్గొన మని కోరేవాళ్ళం. వచ్చి చక్కని చికని కవిత్వం రాసి వినిపించేవారు .తను రాసిన పద్యాల పుస్తకాలు  అందరికీ ఇచ్చేవారు .ఆత్కూరు లో గబ్బిట వారున్నారు .ఒక సరి వారింటికి వెళ్లాను .ఎప్పుడో తరాలు విడిపోయిన వారు .కూరాడలో బందర్లో ఆత్కూరులో ఉండే వీరిని ఆ ఊరి గబ్బిట వారుగా పేర్కొంటారు .స్కూల్ లో అటెండరు పాలు తెచ్చి ఆఫీ డికా షన్  వేసి ఇంటర్వెల్ లో కలిపిందరికి ఇచ్చేవాడు నేల అవగానే లెక్క  చూసి అందరికీ డబ్బు సమానం గా వేసి వసూలు చేసేవాడు .ఇంకో లెక్కల మేష్టారు వెంకటేశ్వర రావు దీన్ని పర్య వేక్షించేవాడు ఈయనా చాల మంచివాడు తర్వాత అక్కడే హెడ్ మాస్టర్ గా పని చేశాడు .

స్కూల్ లో ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లు నాతొ చాలా క్లో జ్ గా ఉండేవారు .వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి ఆతిధ్యం ఇచ్చేవారు .చాలా సరదా మనుషులు .స్కూల్ దగ్గర ఒక మామిడి తోట ఉండేది .అందులో పనస చెట్లు విరగ కాసేవి .నాకు ఆ కాయలు తెప్పించి ఇచ్చేవారు . ఇంటికి  తీసుకోచ్చేవాడిని .డ్రిల్ మాస్టారు జగన్మోహన రావు .ఆ ఊరివాడే .పంచె కట్టుతో సోడా బుడ్డి కళ్ళ అద్దాలతో ఉండేవాడు .హెడ్ గారి టైల్ .లెక్కల మేష్టారు నల్లగా వెడల్పు ముఖం తో సఫారీ బట్టలతో ఉండే జగన్మోహన రావు .ఈయన రుద్రపాక  హెడ్ మాస్టారు ఈడుపు గంటి వెంకటేశ్వర రావు గారి తమ్ముడూ ,డ్రిల్ మేస్టారూ అయిన రత్తయ్య గారి అల్లుడు .అప్పుడప్పుడు వచ్చి కనిపించి వెళ్ళే వాడు రత్తయ్య గారు  .ఆయన మనవడు నైంత్ క్లాస్ ఇకడే స్కూల్ లో చదువుతున్నాడు .మంచి బ్రిలియంట్ .అన్నిటా ఫస్ట్ గా ఉండేవాడు .ఆ తర్వాత ఆతను బి టెక్ పాసై మంచి ఉద్యోగం సాధించాడని రత్తయ్య గారేప్పుడో కనిపించి చెప్పారు .రత్తయ్య గారు తాడిగడప లో సెటిల్ అయ్యారు .మా రెండవ కోడలు  శ్రీమతి ఇందిరా  వాళ్ళ తాతయ్యది అదే వూరు .ఒక సారి ఆవూరు వెళ్ళినప్పుడు రత్తయ్య కనిపించి ఏంతో ఆత్మీయత చూపారు .నేను అడ్డాడ హెడ్ మాస్టారు గా పని చేసినప్పుడు అక్కడ పని చేసి రిటైర్ అయిన రత్తయ్యగారిని ఒక ఉపాధ్యాయ దినోత్సవం నాడు సన్మానించాం .

ఆత్కూరు లో నే రిటైర్ అయిన అర్జున రావు గారు అనే ఫిజికల్ సైన్స్ టీచర్ గారి పేరు వినటమే కాని ఎప్పుడూ చూడలేదు .ఆయనే ఒక సారి స్కూల్కు  వచ్చి నన్ను పరిచయం చేసుకొని నా బోధనా విధానాన్ని చాలా మెచ్చుఒన్నారు .ఆయనే చాలా గొప్ప టీచర్ అలాంటి వారు నన్ను మెచ్చు కో వటం నా అదృష్టం . .తొమ్మిదో తరగతి కి రత్తయ్య గారి మనవడున్న సక్షన్ కు  నేను ఇంగ్లీష్ చెప్పేవాడిని .టెన్త్ నైంత్ లు ఫిజికల్ సైన్స్ బోధించేవాడిని .నా టీచింగ్ విధానం గురించి ఎప్పుడూ కామెంట్ చేయలేదు హెడ్ గారు .ఆయన బాగా గమనించేవారు .ప్రతివారితోనూ బిల్ అండ్ బెల్ గా వ్యవహ రించే వారు   ఆయన నవ్వగా నేనెప్పుడూ చూసిన పాపాన పోలేదు  నా విధి నిర్వహణా బిల్ అండ్ బెల్ గా నే జరిగిపోయింది .ఒక్కో సారి ఇంటికి  వచ్చేసరికి  రాత్రి ఎనిమిదయ్యేది . అందుకే  ఆత్కూరు రావటం ఒక రకం గా ఇంటి నుండి రావటమే అయిణనా ఈ ప్రయాణం వగైరా చూస్తె ముందే చెప్పినట్లు  నాపని పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది .అలాగే లాగిస్తున్నాను  యెంత పని చేసినా హుషారు ఉండటం లేదు. స్వేచ్చ ఉన్నట్లనిపించటం లేదు  అంత రిజర్వేడ్ వాతావరణం లో పని చేయటం నా స్వభావానికి పూర్తిగా విరుద్ధం . ఇక్కడ ఉండాలనే కోరికా లేదు .ఎక్కడికి  వెళ్ళాలో తెలియని స్తితి .వార్షికయా పరీక్షలై పోయి పేపర్లు దిద్ది మారర్కుల లిస్టు లు హాన్దోవర్ చేశాను.నిశ్చింతగా ఉన్నా మనసులో ఏదో అందోళన  . ఏప్రిల్ ఇరవై మూడోతేదీ తో స్కూల్ వర్కింగ్ డేస్ అయిపోయింది .ఆత్కూరు లో మెటర్నిటీ లీవ్ పెట్టిన ఆవిడ జాయింగ్ పెర్మిషన్ కోరిందట  ఆమెను ఆత్కూరులో నాపోస్ట్ లో మళ్ళీ వేసి నన్ను జగ్గయ్య పేట దగ్గరున్న గండ్రాయి హైస్కూల్ కు అక్కడ జిల్లాలోనే జూనియర్ మోస్ట్ గా పని చేస్తున్న ఒక లేడీ సైన్స్ అసిస్టంట్ ను హూస్ట్ చేసి నన్ను అందులో వేశారు .కను ఆత్కూరు  హెడ్మాస్టారుకార్డ్ర్ద్ ద్వారా  నాకు తెలియ జేసి నన్ను ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయమే రిలేవ్ చేసేశారు .వేసవి సెలవలు కనుక  ట్రాన్సిట్ వాడుకొని గండ్రాయి లో చేరాలి .

ఆత్కూరు లో రిలీవింగ్ ఆర్డర్ తేసుకొవటానికి  వెళ్లాను .హెడ్ మాస్టారు కోటేశ్వర రావు గారు చాలా సాదరం గా ఆహ్వానించి టిఫిన్ కాఫీ తెప్పించి ఇప్పించారు  . సిన్సియారిటీని బోధనను మెచ్చుతూ మాట్లాడారు . అక్కడె ఉన్న ఆఫీస్ అసిస్టంట్ గా ఉన్న  కుర్ర గుమాస్తా ఇది చూసి బోల్డు ఆశ్చర్య పోయి ,నేను హెడ్ దగ్గర వీడోలు తీసుకొని బయటివస్తుంటే ‘’మాస్టారు –నేను చాల ఏళ్ళుగా ఇక్కడే  పని చేస్తున్నాను  హెడ్ గారి శిష్యుడినికూడా .కాని నాకు తెలిసి నంతవరకు ఆయన ఏ టీచర్ కూ స్వయం గా కాఫీ ఇవ్వగా,మెచ్చుకాగా  నేను చూడలేదు .మీరు చాలా అదృష్ట వంతులు  ఆయనుకు  మమీ పైన ఉన్న గౌరవానికి , మీ టీచింగ్ సామర్ధ్యానికి నిదర్శనం ‘’అని ఏంతో సంబర పడ్డాడు .ఆతను ఈ ఊరికి దగ్గరలోనే  ఏలూరు దారిలో ఉన్న ఊరివాడు  చాలా మంచివాడు .అలా ఆళ్ళ కోటేశ్వర రావు గారి అభిమానాన్ని పొందాను .

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -62

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -62

96- భాషార్నవ కర్త -నుదురుపాటి వెంకన్న

పుదుక్కోట రాజు ఆస్థానం లో ఉన్న తెలుగు కవి నుదురు పాటి వెంకన్న సంస్కృతం తెలుగులలో దిట్టమైన కవి .’’ఆంద్ర భాషార్నవం ‘’అనే తెలుగు నిఘంటువు రాశాడు .తొండమాన్ రాజుల వంశావళి రాశాడు .తండ్రి సీతారామయ్యా గోప్పకవే ‘’.ఉద్దండకవి’’ బిరుదాంకితుడు తండ్రి .వెంకన్న పార్వతీ కల్యాణం,రఘునాదీయం ,మల్లుపురాణం,బృహనన్నాయిక దండకం ,తొండమాన్ వంశావళి అనే గ్రంధాలు రాశాడు .ఇతని భాశార్నవం తెలుగు తమిళ దేశాలలో బాగా ప్రచారమైన పద్య నిఘంటువు . మూడు భాగాలున్న ఈ బృహత్ నిఘంటువు అంతవరకూ ఎవరూ రాయని మహత్తర రచన .

వెంకన్న రాసిన రఘునాదీయం అనే సంస్కృత రచన ను సమకాలీనుడు ప్రభువు అయిన రఘునాధ రాయ తొండమాన్ కు  అంకితమిచ్చాడు .పార్వతీకల్యాణం యశాగానం మల్లపురాణం  తెలుగు రచన .మల్ల జాతి వివరాలుంటాయి .బృహన్నాయక దండకం రఘునాధ రాయని మీద చెప్పిన తెలుగు కవిత్వం .అద్భుతరచన గా ప్రాముఖ్యం పొందింది . ఇంతకంటే ఈ కవి వివరాలు మనకు తెలియటం లేదు .

97-వికట నితంబ

తొమ్మిదవ శతాబ్దానికి చెందినా ఈ మహిళా కవి సంస్కృతం లో సరళ విలక్షణ రచన చేసింది .’’భయంకర మైన పిరుదులుకలది ‘’ అని వయాట నితంబ అనే మాటకు అర్ధం .బహుశా నిక్ నేమ్ అయి ఉండచ్చు .తన కవిత్వం లో వీటిని మెక్చుఒన్తో రాసుకున్నది .ఆ కాలం లో ఇలాంటి పేర్లు ఉండేవి .జఘన చపాల అలాంటి పేర్లలో ఒకటి .వయాట నితంబ రాసిన వానిని తరువాతిఆలపు కవులు పేర్కొన్నారు .ముఖ్యం గా 1363వాడిన సారంగ ధరుడు ఆమె కవిత్వాన్ని సుభాషిత రత్న కోశం లోఉదాహరించాడు .విద్యాకారుడు సదుక్తి కర్ణామృతం ,సుభాషితావళిలో పేర్కొన్నాడు . శృంగార రసం లో కవిత్వాన్ని ముంచి తేల్చింది వికట నితంబ ..ఆమె కవిత్వాన్ని రాజశేఖరుడు ఆనంద వర్దానాచార్యుడు ఉదాహరించారు .భోజ దేవుడు శృంగార ప్రకాశ లో ఆమె కవిత్వాన్ని మెచ్చాడు .

‘’పృదా కాలే వదతి సభాషం-తద్విపరీతం యస్య హిరన్యే-లుమ్పతి చాస్తిత్రే రం వా షం వా –తస్మై దత్త వికట నితంబా ‘’దీని అర్ధం చదువురాని మూర్హ శిఖామణికి  ఉస్త్ర అనే మాటనే పలకలేని సన్యాసికి వికట నితంబను కట్ట బెట్టారు ‘ఇదిఒక చాటువు .రుద్రకుడు దీన్ని ఉదాహరించాడు .

97-కిల్లినూర్ రాజ రాజ వర్మ

కరీంద్ర లేక చేర్నూరి అని పిలువా బడే కిల్లినూర్ రాజ రాజ వర్మ 1812-1845కాలం సంస్కృతకవి ,సంగీతకారుడు .తిరువాన్కూర్ సంస్థాన మహా రాజు కవి సంగీతజ్ఞుడు స్వాతి తిరుణాల్ రాజాస్థానం లో ఉండేవాడు .మనకవి కిల్లినూర్ రాజ ప్రాసాదం లో జన్మించాడు .ద్రుత కవిత్వం లో మహా విద్వాంసుడు .అందుకే అతనికి’’ ద్రుత కవి మణి’’.అని బిరుదు వచ్చింది .భారీ గా మంచి పర్సనాలిటీ తో ఉండే వాడు కనుక ‘’కరీంద్రన్’’.ఆశువుగా నిమిషాల మీద కవిత్వం చెప్పేవాడు .అందుకనే విద్వాన్ అనే బిరుదును మహా రాజా స్వాతి తిరుణాల్ నుంచి  పొందాడు .కదాకాలి లేక అట్టకాలు అనే నాటకాలు సంస్కృతం లో రాశాడు .సంతాన గోపాలం రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-11-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రమైక జీవనం -వి.ఛాయాదేవి

శ్రమైక జీవనం

కథల పోటీలో ఎంపికైన రచన
……………..

ప్రయాణం చేస్తున్నంతసేపూ ఎప్పుడు ఇల్లు వస్తుందా? ఎప్పుడు కూతుర్ని చూద్దామా? అని మనసు కొట్టుకుపోతూనే వున్నది లలితమ్మకి.
‘అమ్మా..! ఒంట్లో అసలు బాగుండటం లేదే! చాలా నీరసంగా ఉంటున్నది. ఏ పనీ చేసుకోలేకపోతున్నాను. నిన్ను చూడాలని వుంది’- అని ఈ మధ్య ఫోన్లమీద ఫోన్లు చేసింది కూతురు.
కవల పిల్లలవటంతో భార్య చేసుకోలేపోతున్నదని, పిల్లలు కాస్త పెద్దయ్యేవరకూ తోడు రమ్మని కొడుకు బతిమాలితే కాదనలేక కొడుకు ఉద్యోగం చేస్తున్న గౌహతికి లలితమ్మ దంపతులు వెళ్ళారు. దూరాభారం.. ప్రయాణం కష్టం! అంచేత ఏణ్ణర్థం అయిపోయింది ఇటుకేసి రాక!
ఇన్ని రోజులు చూడకుండా ఎప్పుడూ లేదు. అందుచేత దిగులు పడి అట్లా మాట్లాడుతున్నదేమోలే వెఱ్ఱిపిల్ల! అనుకొన్నారు కానీ, ఓ వారం నాడు అల్లుడు కూడా ఫోన్ చేసి ‘మీ అమ్మాయికి అసలు ఆరోగ్యంగా లేదు. నీరసమంటోంది! ఉపవాసాలు చేస్తున్నది! డాక్టర్‌కి చూపిస్తానంటే రాదు. మీ మాటంటే గురి కదా! మీరు ఎప్పుడు వస్తారా?’-అని ఎదురుచూస్తున్నాము- అనేసరికి అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకుని వచ్చేశారు.
పెళ్లికి ముందు ఉత్సాహంగా నేలపై కాలు ఆననట్లు తిరిగేది పిల్ల! పిల్లలతో షటిల్ ఆడేది. ఎప్పుడూ ఉస్సు ఉస్సుమన్న పాపాన పోలేదు. పోనీ అత్తింట్లో చాకిరియా? అంటే మొగుడు పెళ్లాం, ఇద్దరు పిల్లలు. అన్నిటికీ పనిమనుషులున్నారు! అల్లుడు అంత పెద్ద ఆఫీసరయినా తన పన్లన్నీ తను చేసుకోవటమే కాక తీరిక దొరికినప్పుడు ఇంట్లో పనులకు సహాయం చేస్తాడు. పిల్లలు అల్లరివాళ్లు కాదు! అయినా, వాళ్లని మూడో ఏడు నిండగానే స్కూల్లో వేసేసింది. మరి ఈ నీరసమేమిటో? డాక్టర్‌కి చూపిచ్చుకోకపోవటమేమిటో? ఏం మాయదారి జబ్బులో?-అని దారంతా మదనపడుతూనే వుంది లలితమ్మ.
చూడగానే ‘అమ్మా!’ అంటూ కావలించుకొన్న కూతురి వెన్ను నిమురుతూ ఉండిపోయింది లలితమ్మ. కాస్త స్థిమితపడ్డాక కూతుర్ని పరీక్షగా చూచింది.
చిక్కి శల్యంలా ఉంటుందేమోననుకుంటే బాగా ఒళ్లు చేసి పిప్పళ్ల బస్తాలాగా వున్నది. ఈమధ్యకాలంలో చూడలేదేమో తేడా కొట్టొచ్చినట్లు కనపడుతున్నది. పిల్లలు మాత్రం చిక్కిపోయ వున్నారు.
మనవడు నాలుగేళ్లవాడు పొడి పొడిగా వున్న అన్నాన్ని కోడికెలికినట్లుగా తింటున్నాడు.
‘‘ఇదేమిటే..? పాపం.. వాడికి నీవు అన్నం కలిపి పెట్టకూడదూ..! అయినా ఇంత బిరుసుగా వున్న అన్నాన్ని పసివెధవ ఎలా తింటాడు? వేరే గినె్నలో కాస్త మెత్తగా వండచ్చు కదా!’’ అన్నది లలితమ్మ నొచ్చుకుంటూ.
‘‘అబ్బ.. అన్ని రకాలు వండటానికి నాకు ఓపిక లేదే! ఏదో తప్పనిసరిగా వండి పడేశాను’’ అని తేల్చేసింది కూతురు భార్గవి.
‘‘అయ్యో..! నా తండ్రీ! నేను కలిపి పెట్టనా?’’ అంటూ లలితమ్మ దగ్గరికి పోబోతే వాడు దూరంగా వెళ్లి తాతగారి దగ్గర నించున్నాడు.
‘మనల్ని చూచి ఏణ్ణర్థం దాటిపోయిందిగా..! పాపం గుర్తుపట్టలేదు’ అంది లలితమ్మ.
‘అదేం కాదు..! ఆ వెధవ ఆడాళ్ల దగ్గరకు రాడు. ఇంతప్పటినుండి గీర్వాణం వెధవకి. ఆకలైతే వాడే తింటాడులే, నీవు ఊరుకో…’ అంది భార్గవి.
ఆ రోజు పెద్దవాళ్లందరికీ గురువారం కాబట్టి అల్లుడు అందరికీ ఫలహారాలు బయటనుండే తెచ్చాడు. ఇడ్లీలు, పూరీలు, వడలు, సాంబారు, చట్నీలు, పళ్లరసాలు.. టేబిల్ నిండా పరచినవన్నీ చూసేసరికి వెలపరం వచ్చింది లలితమ్మకి.
వద్దంటే బాగుండదని రెండు ఇడ్లీలు, ఒక వడ మాత్రం తీసుకుని ఇవతలకి వచ్చి కూర్చుని తిన్నాననిపించింది.
భార్గవి మాత్రం శుభ్రంగా అన్నీ లాగించి పెద్ద గ్లాస్‌తో జ్యూస్ తాగేసింది. తరువాత బ్రెడ్, ఫ్లాస్క్‌లో పాలు గదిలో పెట్టుకుంది. రాత్రి ఆకలైతే తింటుందట!
మర్నాడు పొద్దునే్న పనిమనిషి వచ్చి పనంతా చేసి పిల్లల్ని తయారుచేసి టిఫిన్స్ తెచ్చిపెట్టి వెళ్లింది. అప్పటికి లేచింది భార్గవి.
ఈలోగా లలితమ్మ వంటింట్లోకి వెళ్లి డబ్బాలన్నీ తనిఖీ చేసింది. బియ్యం, పంచదార, ఇన్‌స్టెంట్ కాఫీ పొడి లాంటివి తప్ప వంటకు పనికివచ్చే పదార్థాలేవీ లేవక్కడ!
‘ఏవిటే…?’ అని అని కూతుర్ని అడిగితే- ‘అబ్బో..! పక్కనే బోలెడన్ని కర్రీ పాయింట్లు వున్నాయి. రాత్రే తెప్పించి ఫ్రిజ్‌లో పెట్టేస్తాను. అన్నం ఒక్కటీ వండుకుంటే చాలు! ఖర్చూ, శ్రమా రెండూ తప్పుతాయి’ అంది తేలిగ్గా.
‘అందుకని రోజూ బయటి తిండ్లు తింటున్నారా? ఆరోగ్యాలు చెడ్డాయి అంటే చెడవు మరి..?’ అని కోప్పడింది లలితమ్మ!
‘వంట మనిషిని పెడతానంటే వద్దంటుందండీ’ అల్లుడు గిల్టీగా అన్నాడు.
‘ఆ..! ఆవిడకన్నీ అందించటం, సరుకులు తెప్పించటం, డబ్బాలలో సర్దడం, ఇవన్నీ ఎవరు చేస్తారు? నాకసలు ఓపిక లేదు బాబూ..!’ అంది భార్గవి టిఫిన్ లాగిస్తూనే.
‘శుభ్రంగా తినేది తింటూనే ఈ ఓపిక లేకపోవడం ఏమిటో? నిండా ముప్ఫై ఏళ్ళు లేవు, ముసలి వగ్గులా మాట్లాడుతోంది’ అనుకుంటూ భర్తని కూరలు, సరుకులు తెమ్మని పురమాయించింది లలితమ్మ వంట చేయటానికి.
‘‘అమ్మమ్మా..! ఇవాళ కూరలు యింట్లో వండుతావా! బెండకాయ ఫ్రై, ముద్దపప్పు చేయవా.. కర్రీ పాయింట్లో కూరలు బాగుండవు! కారంగా ఉంటాయి. మరేమో.. అమ్మమ్మా..! ఇవాళ నేను స్కూలు డుమ్మా కొడతాను. అమ్మతో చెప్పవా..’ గారాబాలు పోతూ అన్నది మనవరాలు శ్రావణి.
‘వద్దులే బంగారం! ఒక్క రోజు స్కూల్‌కెళ్ళకపోతే మునిగిపోయిందేమీ లేదులే. అమ్మేం అనదులే.. తాతగారు కూరలు తేగానే వండుతాను, తిందురుగాని’ అన్నది లలితమ్మ!
మనవడు ఏం చెప్పటానికి భాష చాలక తాతగారి ఒళ్లో చేరిపోయాడు.
ఇంతలో పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్లటానికి ఆటో అతను వచ్చాడు.
‘ఈ పిల్లమూకతో వేగే ఓపిక లేదు నాన్నా నాకు..’ అని భార్గవి గొడవ పెడుతున్నా వినకుండా చంద్రవౌళిగారు ఆటోను పంపేశారు.
నాలుగేళ్ల పసివాడికి రోజంతా స్కూలూ, ఆపైన ట్యూషనూ..! ‘స్కూల్‌కి వచ్చే సంవత్సరం వెళుదువులే నాన్నా! మాతోటి వస్తావా?’ అన్నారాయన తనని బల్లిలా కరచుకున్న మనవడి వీపు తడుతూ.
అంతే..! వాడు తాతగారు ఎటువెడితే అటు చివరకు బజారుకు కూడా వెంటబడి వెళ్లాడు.
ఇక భార్గవి
నిశ్చింతగా స్నానం చేసి దేవుడి ముందు ఓ నిముషం కూర్చుని టీవీ ముందున్న దివాను కాట్ మీద సెటిలయ్యింది. ఆ తరువాత ఆ ఛానెల్‌లో ఆ సీరియల్, ఈ ఛానెల్‌లో ఈ సీరియల్… అనుకుంటూ చూస్తూనే వుంది. మధ్యమధ్యలో కునుకు తీస్తూనే వుంది. లేచినప్పుడు పక్కనే టీపాయ్ మీద పెట్టుకున్న పళ్లూ, బిస్కెట్లు, స్వీట్లూ కడుపులో వేస్తూనే వుంది. మళ్లీ నీరసం అంటూనే వుంది.
‘దీనికేమన్నా బకాసురుడు కానీ పూనలేదు కదా..! ఇంతకుముందు ఇలాగ తినేది కాదే’-అనుకుని, మళ్లీ ‘్ఛ! ఛీ!’ అని చెంపలేసుకుంది లలితమ్మ!
వంటయిన తరువాత దగ్గర కూర్చుని పిల్లలకు కలిపి పెడుతుంటే.. ‘ఇంకా.. ఇంకా..’ అని పోటీలు పడి తిన్నారు.
‘పాపం..! పిచ్చి సన్యాసులు తిండికి ముఖం వాచిపోయారు’ అనుకుంటూ భర్తకు పెడుతూ కూతుర్ని కూడా భోజనానికి కేకేసింది లలితమ్మ.
‘అమ్మా..! ఇక్కడికే తెచ్చిపెట్టేవే! మంచి సినిమా వస్తున్నది’ అంది భార్గవి లేచే ప్రయత్నం చేయకుండానే.
లలితమ్మ గమనిస్తూనే వుంది. భార్గవికి తిండితోపాటు బద్ధకమూ పెరిగింది. భర్తో, పిల్లలో, పనివాళ్లో ఎవరికి పడితే వాళ్లకు పనులు చెబుతుంది. ‘పందిరిగుంజకు పని చెప్పటమంటే ఇదే..’ కాబోలు అనుకుంది లలితమ్మ.
ఆ రాత్రికి మళ్లీ ఉపవాసమని చెప్పి రకరకాల తినుబండారాలు తెప్పించుకొన్న భార్గవితో ‘ఈ ఉపవాసాలెన్ని రోజులేమిటి?’ అడిగింది లలితమ్మ.
‘గురువారం బాబాకి, శుక్రవారం సంపదల కోసం.. వేంకటేశ్వరస్వామికి శనివారాలు, ఇకపోతే అన్నం ముట్టని ఆదివారాలు, శోకం లేని సోమవారాలు నోములు పట్టాను. మంగళ, బుధవారాలే లేవులే..’ అంది భార్గవి.
‘అయ్యో..! అదేం పాపం! మతిలేని మంగళవారాలు, బుద్ధిలేని బుధవారాలు కూడా నోములు పట్టకపోయావా?’ అన్నారు చంద్రవౌళిగారు.
ఆయన ఉండి ఉండి ఒక చురక అంటిస్తారు.
తండ్రి మాటలకు నవ్వి ‘అమ్మావాళ్లు కూడా నోములు నోచుకునేవారు కదా నాన్నా..!’ అంది భార్గవి.
తాము ఇలా నోచుకునే వాళ్ళా! ఉపవాసమంటే ఏ పండో, పాలో పుచ్చుకునేవారు. అంతగా వుండలేనివాళ్లు కాస్త పిండో, రొట్టె ముక్కో తినేవారు. నాగులచవితికి చలిమిడి, పౌర్ణమికి అట్లు, శివరాత్రికి పళ్లు, అంతేగానీ- ఈ బజారు తిండ్లేమిటి? ఈ ఉపవాసాలేమిటి? అనుకుంది లలితమ్మ.
‘అయినా.. పైకి మాత్రం నీరసం అంటూ ఈ ఉపవాసాలెందుకే! శుభ్రంగా ఇంత అన్నం కూరా పప్పు తింటే బలం కదా!’ అన్నది.
‘ఇంకా నయం.! ఈ ఉపవాసాలుంటేనే ఇంతగా ఊరాను. పదిహేను కేజీలు పెరిగాను తెలుసా?’ అంది భార్గవి.
‘అంతేనా! ఈ రకంగా తింటే నూట యాభై కేజీలకు చేరుకుంటావు!’ అన్నారు చంద్రవౌళిగారు.
ఆయనకి కూడా కూతురు తినే పద్ధతి అబ్‌నార్మల్‌గా తోచింది.
‘చాల్లే! ఊరుకోండి! పిల్ల అసలే బాధపడుతుంటేను!’ అని ఆయన్ని కసిరి ‘మరి… డాక్టర్ దగ్గరకెందుకెళ్లావు?’ అడిగింది లలితమ్మ?
‘అబ్బ…! టెస్టులు అవీ అంటారు, నాకు విసుగే! అయినా నాకేం జబ్బని చెప్పు?’ అంది భార్గవి.
‘‘అది నీకూ నాకు ఎలా తెలుస్తుంది? పోనీ మామయ్య మంచి అనుభవమున్న డాక్టర్ కదా! అక్కడికి వెళ్లకపోయావా?’’
‘అబ్బా..! సిటీకి ఈదరిని మేము, ఆ దరిని ఆయన. ఈ ట్రాఫిక్‌లో ఇప్పుడు బయలుదేరితే వెళ్లేసరికి తెల్లారుతుంది’.
‘‘చాల్లేవే మరీ చోద్యం! నేను మామయ్యతో నిన్ననే మాట్లాడాను. రెండు రోజులుండేటట్లుగా వస్తే అన్ని టెస్టులూ చేయిస్తానన్నాడు. అల్లుడుగారికి కూడా సెలవులే కదా! మనందరం రేపు పొద్దున వెళుతున్నాం.. అంతే!’’ అంది లలితమ్మ.
***
‘మేమంటే పెద్దవాళ్ళమయ్యామనుకో! నీకేం చిన్నదానివి. ఒక్కసారన్నా వచ్చి చూడవా భార్గవీ?’ అని నిష్ఠూరం ఆడుతున్న అత్తయ్యతో-
‘ఒంట్లో అస్సలు ఓపికుండటం లేదత్తయ్యా! తగని నీరసం! ఎక్కడికి చివరికి గుడిక్కూడా వెళ్లటంలేదు. పెద్దవాళ్లయినా కాని నాకంటే మీరే నయమనుకో అత్తయ్యా’.
అంటున్న భార్గవిని తేరిపార చూస్తూ ఆమె మాటలు వింటున్నాడు డాక్టర్ రామారావు.
తరువాత చెల్లెలని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకొన్నాడు. ఆ తరువాత పక్కనే వున్న తన క్లినిక్‌కి తీసుకువెళ్లి టెస్టులు చేయించాడు.
ఆ మరునాడు భోజనాలు అయి అందరూ కూర్చున్నపుడు చెప్పటం మొదలుపెట్టారు.
‘్భర్గవీ..! నేను చెప్పేది జాగ్రత్తగా విని అర్థం చేసుకో! పూర్వం అంటే నా చిన్నతనంలో కూడా ప్రతివాళ్లు ఒళ్లు వంచి కష్టపడి పనిచేసేవాళ్లు! ఏమీ లేని ఆడవాళ్లు పొలాలలో పనిచేస్తుంటే, బాగా వున్నవాళ్లు కూడా పప్పులు విసురుకోవడం, పిండి రుబ్బి వడియాలు, అప్పడాలు పెట్టుకోవడం, పచ్చళ్లు పెట్టుకోవడం- ఇలాంటి పనులన్నీ తీరిక లేకుండా చేసుకొనేవారు. ఎక్కువగా పనిచేయలేని పెద్దవాళ్లు సాత్త్వికాహారం మితంగా తింటూ నియమ నిష్ఠలతో దైవచింతనతో పగలు నిద్రించకుండా ఉపవాసాలు చేసేవాళ్లు! కార్తీకమాసం మాగుడుకాలం అంటే చలికి తిండి అరగదు. అందుకే ఉపవాసాలు. ఇపుడు ఒళ్లు వంచే పనిలేదు. ఆహార నియమాలసలే లేవు! నీ సంగతే చూడు! పెళ్లికి ముందు ఎంత ఉషారుగా వుండేదానివి! స్పోర్ట్స్ ఛాంపియన్ కదా నీవు! కాలేజ్ యాక్టివిటీస్ అన్నిట్లో లీడింగ్‌లో వుండేదానివి. ఇపుడో.. రోజంతా టీవీ ముందు కూర్చునో లేక నిద్రపోతూనో కాలక్షేపం చేస్తున్నావు. పిల్లలను కూడా చూసుకోకుండా- స్కూళ్లకీ, ట్యూషన్లకీ పంపేస్తున్నావ్! పైగా దేవుళ్ల పేరు చెప్పి అడ్డమైన తిళ్లకు అలవాటుపడ్డావు. మంచం దిగగానే బాత్‌రూం, ఆ పక్కనే డైనింగ్ రూం, లేకపోతే టీవీ… నీ శరీరానికి వ్యాయామం ఎక్కడ?
ఈ నియమ నిష్ఠలు లేని తిండివల్ల, శారీరక శ్రమ చేయకపోవటంవలన నీ ఒంట్లో షుగర్ నిల్వలు బాగా పెరిగిపోయినాయి. అందుకే ఈ ఒబెసిటీ! భార్గవీ! ఈ శరీరాన్ని మనమెంత సుఖపెట్టాలని చూస్తే అది మనల్నంత బాధపెడుతుంది, గుర్తుపెట్టుకో..!
కనుక ఇకనైనా ఆహార నియమాలు పాటిస్తూ చక్కగా ఒళ్లు వంచి పనులు చేసుకో! నీ పిల్లల పనులు పనివాళ్లకు అప్పచెప్పక నీవే చూసుకో! ఉదయానే్న లేచి వాకింగ్, తోట పని చేయి. ఇంకా తీరిక వుంటే సోషల్ వర్క్ చేయి. ఆ టీవీని అమ్మేయి! లేకపోతే డస్ట్‌బిన్‌లో పడెయ్యి!’ అన్నాడు.
ఆ తరువాత- తాను పీట మీద కూర్చోలేనంటే కుర్చీమీద కూర్చోబెట్టి వంగి కాళ్లకు పసుపు రాసి, బొట్టు పెట్టి పట్టుచీర చేతిలో పెడుతున్న డెబ్భై ఏళ్ళ అత్తయ్యను, అన్నా వదినల కాళ్లకు వంగి నమస్కరించి చలాగ్గా పిల్లవాడిని చంకన వేసుకున్న ఏభై ఎనిమిదేళ్ల తల్లిని చూస్తూ ఆలోచనలో పడింది భార్గవి. *

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

కృష్ణ శాస్త్రి జయంతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శత వసంతాల జస్టిస్ కృష్ణయ్యర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -82 బదిలీకో ఉపాయం

నా దారి తీరు -82

బదిలీకో ఉపాయం

ఆ రోజుల్లో ట్రాన్స్ ఫర్ కావాలంటే జిల్లా పరిషత్ ఉ వెళ్లి దానికి సంబంధించిన గుమాస్తాకు ముందే ముట్ట చెప్పాల్సిని ముట్ట చెప్పి కమ్యూటేడ్ లీవ్ ఆయన సలహాపై రెండు నెలలు పెట్టి ఇంట్లో కూర్చోవాలి .పది హీను రోజులు దాటగానే మళ్ళీ వెంటపడి ఆరోగ్యం బాగానే ఉందని మీడియాల్ సర్తిఫికేట్ సంపాదించి అంట దూరం లో పని చేయ లేనని స్వగ్రామం దగ్గరకు బదిలీ చేయమని రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి .గుమాస్తాను ముందే మెయింటేన్ చేస్తే వెంటనే అన్సిదర్ చేసి ఖాళీ ఎక్కడుందో చెప్పి వీలయితే రాజీయ ప్రయత్నం చేయమని చెప్పి ,ఆ హాలీలో ఎవరినీ నిమ్పకుమ్డా చూసి మనకు దక్కెట్లు చేస్తారు .అలాగే మ బి ఇ డి గుమాస్తా ‘’రాజు గారిని ‘’ప్రసన్నం చేసుకొని ,  రాజీయ ప్రయత్నాలతో బాటు ,కృష్ణాజిల్లాటీచర్స్  గిల్డ్ నాయకులను ఇంఫ్లుఎంస్ చేశాను .అప్పుడుగిల్డ్  ప్రెసిడెంట్ గా ఉన్న గన్నవరం హిందీపండిట్ శ్రీ తోటకూర అప్పరాయ వర్మ(తానా అధ్యక్షుడుగా పనిచేసిన ప్రసాద్ తోటకూర  గారి తండ్రి )నయు కొల్లూరి తర్వాత ముఖ్యమైన ఆత్మీయులు .ఆయన్ను అలిసి చెప్పాను ఆయనకు నేనంటే గొప్ప అభిమానం .అన్డుఅని తప్పక తన వంతు సాయం చేస్తానన్నారు .ఆయను జిల్లా పరిషత్ చైర్మన్ గారి దగ్గర మంచి చనువు గౌరవాలున్నాయి ఆయన మాటు విలువ నిచ్చేవారు చైర్మన్ గారు .అది నాకు  ఒక రకం గా కలిసోచ్చింది .నేను నా ప్రయత్నాన్నిగట్టిగానే చేశాను  .ఉయ్యూరు నుంచి పెనుగాంచి ప్రోలుకు రావాలంటే ఉదయాన నాలుగింటికే లేచి ప్రభావతి అన్నం వండి టిఫిన్ చేసి కూరా నారా చేసి కారియర్లో సర్ది ఇస్తే బస్ లో బయల్దేరి బేజా వాడ చేరి అకడి నుండి నందిగామ బస్ కో దొరక్క పొతే జగ్గయ్య పేట బస్సో ఎక్కి చిల్లకల్లు దిగి ,అక్కడి నుండి పెనుగంచిప్రోలు షటిల్ ఎక్కి  వెళ్ళేవాడిని .చాలా రిస్క్ అయిన ప్రయాణం .ఓపిగ్గా చేసేవాడిని.ప్రభావతి పడిన శ్రమ అంతా ఇంతా కాదు .

శ్రీ తిరుమల గిరి క్షేత్రం –వెలమకన్ని వారి ఊసులు

.పెనుగంచిప్రోలు నుండి మక్క పేట మీదుగా జగ్గయ్య పేట కు  వెళ్ళే దారిలో  ‘’తిరుమల గిరి ‘’అనే క్షేత్రం ఉంది .చిన్న  కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు . .ఈ ప్రాంతం వారికి దాదాపు తిరుపతి తిరుమల లాంటిది .మహిమ గల దేవునిగా భావించి ఆరాధిస్తారు .చిల్లకల్లుకు అయిదు కిలో మీటర్ల దూరం. ఆటోలో వెళ్ళాలి .చాలా ప్రశాంత వాతావరణం లో ఆలయం ఉంటుంది .ఒక సారి వెళ్లి దర్శించు కొన్నాను .ఇక్కడే మా కజిన్ బ్రదర్స్ వెలమకన్ని శోభ నాద్రి సోదరులకు  వందల ఎకరాల పొలం ఉంది .దీనిలో పంటలు పండేవి కావు .పశువుల మేతకు ఉపయోగపడే పుల్లరి భూములు .ఉయ్యూరు చుట్ట్టు ప్రాల ప్రాంతాలనుండి గొడ్లను తోలుకొని వచ్చి ,పుల్లరి చెల్లించి మేపుకొని మళ్ళీ ఇళ్ళకు తోలుకు వెడతారు .మా మామయ్యగారి ఎడ్లూ ,పశువులు అలాగే ఇక్కడికి తోలుకొచ్చి మేపేవారు పాలేళ్ళు . బక్క చిక్కిన పశువులు మోకాలు ఎత్తు పెరిగిన పచ్చ  గడ్డిలో మేసి బాగా బలిసి మళ్ళీ ఇళ్ళకు చేరేవి .ఆ కాలం లో ఒక పాలేరు ఇక్కడే ఉండేవాడు .లేక వీరే కాపలా కాయించి డబ్బు తీసుకొనే వారు .

వీరిది జగ్గయ్య పేట కు ముత్యాల దాటినా తర్వాత ‘’శోభ నాద్రిగూడెం అగ్రహారం ‘’ఆక్కడా స్వంత ఇల్లు  మెట్టా ,మాగాణి పొలాలు వేల కొలదిల ఎకరాలున్నాయి .అగ్రహారం అంతా వెలమకన్ని వారిదే .స్వంత వ్యవసాయం  నౌకర్లు, చాకర్లు  పాలేళ్ళు గొడ్లు గోదా బోలెడు లంపటం ఉంది .శోభనాద్రి మామ్మ ,మా మామ్మ స్వయానా ఆ క్కచెల్లెళ్ళు .అంటే మేము అక్క చెల్లెళ్ళ మనుమలం అన్న మాట .మా మామ్మ చెల్లెలు సూరి సౌభాగ్యమ్మఅంటే మా బుల్లిమామ్మ  గారిది ఉయ్యూరు .ఆమె చిన్న కొడుకే సూరి  లక్ష్మణస్వామి బాబాయి .  ఆయన్ను వెలమకన్ని వారికి పెంపుడు ఇచ్చింది మామ్మ .ఆయన భార్య సత్యవతి పిన్ని .బాగా స్థితి పరుదవటం వలన దాయాదులు అసహనం తో  లక్ష్మణ స్వామి బాబాయికి  ఒక కూతురు శారదక్కయ్య,  ఇద్దరు కొడుకులు శోభనాద్రి ,రాముడు పుట్టిన తర్వాత ఉదయాన బహిర్భూమికి వెళ్లి వస్తుంటే తుపాకి  తో కాల్చి చంపేశారు ఆయనూ లసేన్స్ద్ తుపాకీ ఉండేదట .ఆ రోజు పొరబాటున తీసుకు  వెళ్ళటం మరిచిపోయాడట .అదే అదునుగా దాయాదులు కిరాయి మనిషి తో ఆల్చి చంపించారు .ఈ ముగ్గురు పిల్లలూ చిన్న వారే .వారిని పోషించుకొంటూ వ్యవహారాలను చూస్తూ  వ్యవసాయం చేయిస్తూ  కోర్టు లలో  వ్యాజ్యాలు గెలుస్తూ సత్య వతి పిన్ని పడిన కస్టాలు అంతులేనివి  . ఒంటి చేతిమీద ఇన్ని వ్యవహారాలను చక్క  పెట్టింది పిన్ని .శారదక్కయ్యనుబెజవాడలో ప్రఖ్యాత లాయర్ చెరుకుపల్లి పట్టాభి రామయ్య గారి పెద్ద కొడుకు  లా చదివిన రామ చంద్ర మూర్తికిచ్చి వివాహం చేసింది పిన్ని .ఈ శారదా రామచంద్ర మూర్తి అక్కయ్యా బావ లనే ఈ నెల తొమ్మిదో తేదీ మేము హైదరాబాద్ లో తిరుమల గిరి లోని వాళ్ళబ్బాయి లక్ష్మణ స్వామి స్వంత ఇంట్లో కలిసి వచ్చాం .ఆయనకు  తొంభై ,అక్కయ్యకు ఎనభై అయిదేళ్ళు .ఇద్దరూ మంచి ఆరోగ్యం గానే ఉన్నారు .తలిదండ్రులను  కంటికి రెప్పలాగా చూసు కొంటూ  అండగా  ఉన్నాడు లక్ష్మణ్ .శోభనాద్రి ,రాముడు నాకు  బెజ వాడలో ఇంటర్ లో క్లాస్స్ మేట్స్ . రాముడి పెళ్ళికి శోభనాద్రి గూడెం మొదటి సారి వెళ్లాను మా మామయ్యా గారబ్బాయి పద్మనాభం తో .. శోభనాద్రి గూడెం లో ఉన్న పొలాలు పులి చింతల  ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం తీసుకొని గొప్ప పరిహారం ఇచ్చింది   అయిదేళ్ళ రక్రితం శోభనాద్రి హార్ట్ ఎటాక్  వచ్చి చనిపోయాడు   రాముడికి ముందే వచ్చినా డాక్టర్ రమేష్ చేసిన  ఆపరేషన్ వలన ఆరోగ్యం పొందాడు   .వాడి పెద్దకొడుకు శోభనాద్రిపురం లో పోస్ట్ మాస్టర్ గా ఉంటూ ,కుటుంబం తో  ఉండి వ్యవసాయం చేయిస్తున్నాడు .రెండు మూడులలో ఒకడు లాయర్ గా తిరుమల గిరిలో ఉన్నాడు .మూడోవాడు హైదరాబాద్ లో మంచి ఉద్యోగి .రాముడు జగ్గయ్య పేట సీతారామ పురం లో స్వంత ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు .శోభానాద్రికి ముగ్గురూ ఆడపిల్లలే. పెళ్ళిళ్ళు చేసిన తర్వాతే చనిపోయాడు .భార్య నందిగామ లో ఉంటోంది . శోభనాద్రి గూడెం లో   వరి తక్కు వ గా పండేది .వేరు సెనగ ,పొగాకు ,పత్తి  పంటలు పుష్కలం . మిర్చి బాగా పండేది .శోభనాద్రి మా ఉయ్యూరుకు వచ్చి ఎండు గడ్డి కొనుక్కొని లారీల మీద తోలుకు వెళ్ళేవాడు .

ఆత్కూరు కు బదిలీ

నేను పెట్టిన కమ్మ్యూ టెడ్ లీవ్  ను శాంక్షన్ చేసి సెలవలో ఉన్న నన్ను గన్నవరం దగ్గరున్న ఆత్కూరు హై స్కూల్  కు ట్రాన్స్ ఫర్ చేశారు .అది ఒక  మెటర్నిటీ లీవ్లో వెళ్ళిన ఒకావిడ పోస్ట్ .అందులో వేశారు . నేను పెనుగంచిప్రోలులో గట్టిగా పని చేసింది నాలుగు నెలలే .సెలవలు ఒక  ఇరవై  అయిదు రోజులు  .సెలవలలోనే వచ్చి పెనుగంచిప్రోలులో 11-2-86న రిలీవ్ అయ్యాను ఒక రోజు ట్రాన్సిట్ వాడుకొని .13-2-86 ఉదయం  ఆత్కూరు హైస్కూల్ లో చేరాను .హెడ్ మాస్టారు శ్రీ ఆళ్ళ కోటేశ్వర  రావు గారు  .ఇదీ మూడు నాళ్ళ ముచ్చటే అయింది .ఒక రకం గా ణా పని పెనం లోంచి పొయ్యిలో పడ్డ చందం అయింది .ఆ వివరాలు తరువాత తెలియ జేస్తాను . సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-14-ఉయ్యూరు .

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

పాల’ పాపాలు!

పాల’ పాపాలు!

ఆది కలియుగం అన్న వాస్తవం చాలామందికి తెలియకపోవచ్చు! ఇది కల్తీయుగం అన్నది మాత్రం జగమెరిగిన సత్యం! ఈ కల్తీ గురించి బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో జరిగిన గొడవ ‘పాలు తాగితే ప్రమాదమన్న’ భయాందోళనలను సృష్టించింది! హెరిటేజ్ సంస్థ వారు సరఫరా చేస్తున్న పాలలో ప్రాణాంతకమైన కల్తీ పదార్ధాలు కలిసాయా లేదా అన్నది విస్తృత వైపరీత్యంలో సముద్రంలో బిందుకణం వంటిది! అందువల్ల హెరిటేజ్ సంస్థ పాలు కాని మరో సంస్థ పాలు కాని కల్తీ అయినాయంటే అందులో ఆశ్చర్యం ఆవగింజంతైనా అక్కరలేదు!! ఆవాలలో కూడ కల్తీ జరిగిపోతోంది! ‘పాల’ను ‘జెర్సీ’తో కల్తీచేసినప్పుడే పాలగుణం పాడయిపోయింది! పంటలను ‘బిటి’ జీవ రసాయనంతో కల్తీ చేస్తున్న ‘జన్యు సంకరం’ నడిచిపోతున్న ప్రధాన వైపరీత్యం!! ఇలాంటి విస్తృతమైన కల్తీకి కారణమైన విధానాలను దశాబ్దులుగా మన దేశంలో ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి! పాలలో ఆక్సిటోసిన్ కలిసిపోవడం ఈ విస్తృత సాంకర్యంలో ఒక చిన్న అంశం! మన పాడిపంటలను పాడుచేస్తున్న కల్తీ నిజానికి ఉదాత్తమైన విధానంగా చొచ్చుకుని వస్తుండడం జనానికి పట్టని మహా విషయం!! హెరిటేజ్ సంస్థ వారి ఒక రకం-బ్రాండ్ పాలను నెలరోజులపాటు అమ్మరాదని కేరళ ప్రభుత్వం నిర్దేశించిన మాట వాస్తవమేనట! ఆ సంస్థ వారే వెల్లడించిన అంశమిది! కానీ ఆ తరువాత ఆ పాలలో ఎలాంటి కల్తీ పదార్ధాలు లేవని కనిపెట్టిన కేరళ ప్రభుత్వం తరువాత ఆ రకం పాలను కూడా అమ్ముకోవడాన్ని అనుమతించేసిందట! ఇది హెరిటేజ్ సంస్థ ఇచ్చిన స్పష్టీకరణ! హెరిటేజ్ సంస్థలకు గేదెలు కాని ఆవులు కాని లేవట! అందువల్ల తాము ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌లతో పాడి పశువులు సంకరం చేసే ప్రసక్తి లేదని సంస్థవారి వివరణ! హెరిటేజ్ సంస్థ రాజకీయ కుటుంబానికి చెందినది కాబట్టి ఈ వ్యవహారంపై శాసనసభలో ప్రస్తావన జరగడం సహజం! ప్రత్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోకూడ హెరిటేజ్ ఉత్పత్తులను నిషేధించాలని కోరడం కూడ సహజం!! తెలంగాణ ప్రభుత్వం నిషేధించలేదు కాబట్టి మొత్తం వ్యవహారం ఉద్ధరిణిలో ఉప్పెనవలె సమసిపోవచ్చు!! జంటనగరాలలో ప్రభుత్వం సేకరించిన ముప్పయి రెండు పాల ప్యాకెట్లలో పదకొండు ప్యాకెట్లలోని పాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవట! కానీ రాష్టవ్య్రాప్తంగాను దేశవ్యాప్తంగాను వివిధ సంస్థలు రకరకాల పేర్లతో చెలామణి చేస్తున్న పాలు ప్రమాణాలకు అనుగుణంగా లేదన్నది పదిహేను ఏళ్ల క్రితమే ధ్రువపడిన వాస్తవం!! అప్పటినుంచి ఇప్పటికీ కల్తీ పాలను నిరోధించలేకపోవడం ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న ప్రధాన సమస్య! జంటనగరాలో సేకరించిన పాల నమూనాలలో హెరిటేజ్ నమూనాలు ఉండవచ్చు, ఇతర సంస్థల నమూనాలు ఉండవచ్చు!! కానీ అసంఖ్యాక ప్రజల వంట ఇళ్లలోకి చేరిపోతున్న పాకెట్లలోని పాలలో కల్తీ జరిగిందా లేదా అన్నది ఎవరు నిర్ధారించగలరు?
రోజుల తరబడి నిలువ ఉండే-టెట్రా-పాలు, వెన్న తీసిన-టోన్డ్-పాలు, ప్రాకృతీకరించిన-పాశ్చురైజ్డ్-పాలు, సంపూర్ణత్వం సిద్ధించుకున్న-హోల్-పాలు, ఇలా వివిధ రకాల పేర్లతో వివిధ సంస్థలు పాలు అమ్మేస్తున్నాయి! కొంటున్న జనానికి వీటి మధ్య ఉన్న ప్రామాణిక అంతరం గురించి గాని, వాటి ప్రాశస్త్యం గురించి కాని తెలియదు!! ప్లాస్టిక్ పాకెట్ మీద ఉన్న ధర కంటె ఒకటో రెండో రూపాయలు అధికంగా చెల్లించి పాలు కొనడం మాత్రమే ప్రజలకు తెలిసిన వ్యవహారం! ఆవుపాలు కొంటున్నవారు కేవలం భక్తితో దేవుడికి అభిషేకించడానికి వాటిని వినియోగిస్తున్నారు! ఆవుపాలు తాగడానికి పనికి రావన్నది, ఆవు నెయ్యి తినడానికి కాదన్నది వినియోగదారులలో అత్యధికుల విశ్వాసం! అవి కేవలం హోమాలకు, హవనాలకు, అభిషేకాలకు మాత్రమే ఉపయోగపడే అపురూప పదార్ధాలన్నది వ్యావహారిక వాస్తవమై కూచుంది! ఈ దేశ ప్రజల విశ్వాసాలు ఇలా కల్తీ అయిపోతుండడం గురించి ఎవ్వరికీ పెద్దగా ధ్యాసలేదు. తినడానికి గేదెల నెయ్యి, తాగడానికి గేదెల పాలు మాత్రమే ఉపయోగించాలన్నది విశ్వాసం!! ‘‘శరత్కాలంలోని చంద్రుని వెనె్నల వంటి తెల్లనైన పెరుగు’’-మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధి-తనకు ఇప్పించమని పూర్వం ఎప్పుడో ఒక పండితుడు రాజుగారిని యాచించాడట! ఆరోజులలో అధికాధికులు ఆవు పెరుగునే ఆరగించేవారు! అందువల్ల గేదెల పెరుగు అపురూపమైన పదార్ధమైంది! కానీ ఇప్పుడు గేదెపాలు, గేదె పెరుగు, గేదె నెయ్యి, గేదె వెన్న సర్వసాధారణ ఖాద్య పదార్ధాలు! అందువల్ల ఆవుపాలు తాగాలని భావించేవారు ఎవరైనా ఉంటే వారు తాగుతున్నది కల్తీపాలు…
ఆవుపాలను ఎలా తయారుచేస్తున్నారు?? గేదె పాలలో పసుపు పచ్చటి రసాయనాన్ని కలిపి పాకెట్లలో నింపుతున్నారు! ఆ పాలను కాచేసరికి పచ్చని పదార్దం విడిపోయి పాలు మళ్లీ, గేదె పాలంత తెల్లగా తయారైపోతున్నాయట! కాచకుండా అభిషేకాలు చేసేవారికి ఈ సంగతి తెలీదు! ఆవుపాలు గేదెపాలంత తెల్లగా ఉండవని మాత్రమే తెలుసు! ఈ ఆవుపాలను కాచి వేసవి కాలంలో పెరుగు చేసిన తరువాత మరోవైపరీత్యం బయటపడుతోందట! ఆ పెరుగు వెండి తీగెల, వెండి దారాల వలె సాగిపోతూ ఉంటుంది! పాలు సరఫరా చేసేవారు సైతం అంగీకరించిన వాస్తవమిది! పాల ఉత్పత్తి తగ్గి గిరాకీ అధికంగా ఉండే వేసవి రోజులలో పాలపిండిని నీటిలో కలిపి పాలు సరఫరా చేయడం ప్రఖ్యాతమైన వ్యవహారం!! పాలపిండిని మాత్రమే కలుపుతున్నారా? మైదాపిండిని కలుపుతున్నారా? మరో పిండిని కలుపుతున్నారా? అన్నది పరిశోధకులు ఇంతవరకు తేల్చలేదు! యూరియా వంటి ఎరువులను పాలలో కలుపుతున్నారన్నది దేశంలోని అనేక రాష్ట్రాలలో నిర్ధారణ జరిగిన అంశం! ఇది మొదటి రకం కల్తీ! ఇది చట్టవిరుద్ధమైనది! కానీ చట్టబద్ధమైన కల్తీ ఎప్పుడో జరిగిపోయింది. జెర్సీ రకం విదేశీయ జంతువుల జన్యుకణాలతో మనదేశంలోని ఆవుల సంతతి కల్తీ అయిపోయింది! ఈ జెర్సీ ఆవుపాలు నెయ్యి వైద్య చికిత్సలకు పనికిరావన్నది ఎప్పుడో ధ్రువపడిపోయింది!! ‘పంచగవ్యాల’ చికిత్సకు, పంచగవ్యాలతో తయారయ్యే ఎరువులకు దేశవాళీ ఆవులు మాత్రమే పనికి వస్తాయి! కానీ దేశవాళీ ఆవులను మాంసం కోసం శతాబ్దుల తరబడి హత్య చేసారు! అందువల్ల జెర్సీ వంటి సంకర జాతుల ఆవుల పాలు మాత్రమే మన సౌభాగ్యం!! వీటితోనే భక్తాదులు శ్రద్ధతో అభిషేకాలు చేస్తున్నారు! జెర్సీ రకం ఆవుపాలను పాల ఉత్పత్తులను తాగడం వల్ల తినడంవల్ల క్రమంగా మన పొట్టలో కాన్సర్ కణాలు పెరుగుతాయన్న పరిశోధన ఫలితాలకు పెద్ద ప్రచారం లేదు…అందువల్ల ఆవుల ఉత్పత్తుల కంటే గేదెల ఉత్పత్తులను ఆరగించడమే సాపేక్షంగా ఆరోగ్యకరమన్నది జరుగుతున్న ప్రచారం!!
గేదెల పాల కల్తీ గురించి ఇప్పుడు ప్రధానంగా గొడవ జరుగుతోంది!! ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వడంవల్ల గేదెలలో పాల ఉత్పత్తి బాగా పెరిగిపోతోందట! కానీ ఈ ఆక్సిటోసిన్ పాల స్వభావాన్ని మార్చివేస్తోంది! ఈ పాలు తాగిన దూడలు త్వరగా ఎదుగుదల కావడం ఒక వైపరీత్యం! ఈ పాలు తాగిన పాపలకు, బాలురకు అత్యంత వేగంగా వన లక్షణాల ఏర్పడుతున్నాయట! ఇది మన వైపరీత్యం! గేదె అతి పెద్ద మోతాదులో పాలిచ్చి అతి త్వరగా చనిపోవడం ఇంకో వైపరీత్యం!! ఈ వైపరీత్యాలకు విరుగుడును కూడ కల్తీ ముఠాలు కనిపెట్టాయట! పామాలిన్ నూనె, వంట సోడా, యూరియా, సబ్బులు, మైదాపిండి వంటి వాటిని రసాయనాలలో మేళవించి నకిలీ పాలను తయారుచేసి పాకెట్లకెత్తుతున్నారట! మనం తాగుతున్నది ఏ పాలు??

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దీపాలు వెలిగించటం లో ఏమిటి ఉద్దేశ్యం -సద్గురు

దీపాలు వెలిగించడంలో విశిష్టత ఏమిటి?

విద్యుద్దీపాలు ప్రజాదరణ పొందేవరకూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలు, సంస్కృతులలో నూనె దీపాలను వాడేవారు. కాని, నేడు వీటి ఉపయోగం కేవలం కొన్ని గృహాలలో అలంకరణగా, అదికూడా నేత్రానందం కలిగించడం వరకే 
పరిమితమైంది. కార్తికమాసం సందర్భంగా నూనె దీపానికి మన పరిసరాలకు వెలుగు, అందం ఇవ్వడానికి మించిన ప్రయోజనాలు ఉన్నాయని సద్గురు చెబుతున్నారు. ఈ నూనె దీపంతో మీరు మీ గృహంలో సానుకూల శక్తినీ, పరిసరాలనూ, వాతావరణాన్ని ఎలా సృష్టించుకోవచ్చు అన్న విషయాల గురించి సద్గురు వివరిస్తున్నారు. 

మన కళ్లు తయారు చేయబడ్డ విధానాన్ని బట్టి మన జీవితాల్లో వెలుగుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ మన కళ్లు గుడ్లగూబల కళ్లలా ఉండి ఉంటే, వెలుగు మనకు అంత ముఖ్యమైనది అయి ఉండేది కాదు.
నేడు మనకు విద్యుద్దీపాలు ఉన్నాయి. కాబట్టే దీపం అవసరమేమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం సంగతిని ఊహించుకోండి, ఇంటి లోపల ఒక దీపం లేకుండా ఏమీ చేయలేరు. చారిత్రాత్మకంగా దీపం ముఖ్యంగా రెండు కారణాల వల్ల మన గృహాలలో ఒక అంతర్భాగం అయింది. అప్పట్లో విద్యుద్దీపాలు లేవు. ఇళ్లను కలప, తాటాకు వంటి సేంద్రీయ వస్తువులతో నిర్మించుకునేవారు. అందువల్ల వారు పెద్ద పెద్ద కిటికీలు పెట్టుకోలేక పోయేవారు. సాధారణంగా పురాతన కాలంలో ఇళ్లలో బాగా చీకటిగా ఉండేది. నేడు కూడా పల్లెటూర్లలో పాత ఇళ్లు, మురికివాడలు చీకటిగా ఉండటం మీరు చూశారా? అందుకనే ఆ కాలంలో పగటి సమయంలో కూడా దీపం పెట్టి ఉంచేవారు. సామాన్యంగా అదే పూజా స్థలంగా ఉండేది.
సంప్రదాయ పరంగా సరైన వాతావరణాన్ని సృష్టించడానికి చేసే మొదటి పని ఒక దీపాన్ని వెలిగించడం. కాకపోతే నేడు మనకు ఉన్న చాలా సమస్యల వల్ల మనం విద్యుద్దీపాలను వెలిగిస్తున్నాం. కానీ మీలో దీపాన్ని వెలిగించే అలవాటు ఉన్నవారు కేవలం దీపం చుట్టూ ఉండడం వల్ల ఎంతో తేడాగా అనిపిస్తుందని గమనించి ఉంటారు. మీరు ఏ దేవుడినీ నమ్మనవసరం లేదు. చీకటిగా ఉండక పోయినా, చూడటానికి అవసరం లేకపోయినా, మీరు దీపం వెలిగిస్తే కొంత తేడా ఉంటుందని గమనించారా? ఇది ఎందుకంటే మీరు దీపం వెలిగించిన మరుక్షణం కేవలం ఆ జ్వాల మాత్రమే కాదు, ఆ జ్వాల చుట్టూ ఒక గుండ్రని కనిపించని చక్రం లాంటి శక్తి వలయం సహజంగా ఏర్పడుతుంది.
ఎక్కడ ఇలాంటి శక్తి వలయం ఉంటుందో అక్కడ మనుషుల మధ్య అన్యోన్యత, అనుబంధాలు బాగుంటాయి. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా క్యాంప్‌ ఫైర్‌ చుట్టూ కూర్చున్నారా? మీరు కనుక కూర్చుని ఉండే, ఆ సమయంలో చెప్పుకునే కథల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని మీరు గమనించారా? పాత కాలంలోనే కథలు చెప్పే వాళ్లు దీన్ని అర్థం చేసుకున్నారు. చలి మంట చుట్టూ చెప్పుకునే కథలు చాలా బలంగా మనస్సులో నాటుకు పోతాయి. వాటిని మనం చాలా సులభంగా గ్రహించగలుగుతాం.
కాబట్టి మనం ఏదైనా ప్రారంభించాలనుకుంటే, లేదా ఒక నిర్దిష్టమైన వాతావరణాన్ని సృష్టించాలనుకుంటే, ఒక దీపం వెలిగిస్తాం. ఒక దీపాన్ని వెలిగించినపుడు, అది దృశ్యపరంగానే కాకుండా, శక్తిపరంగా కూడా పూర్తి ప్రదేశాన్ని ఒక భిన్నమైన శక్తితో నింపుతుందన్న అవగాహన నుంచి ఈ ఆచారం వచ్చింది. ఒక నూనె దీపాన్ని వెలిగించటంలో కొన్ని సూచనలు ఉన్నాయి. దీపాన్ని వెలిగించటానికి కొన్ని ప్రత్యేకమైన నూనెలను వినియోగించడం మంచిది. ప్రత్యేకించి నువ్వుల నూనె, ఆముదం లేదా నెయ్యి ఒక రకమైన అనుకూల శక్తిని వెలువరిస్తాయి. ఆ శక్తికి దాని సొంత శక్తి క్షేత్రం ఉంటుంది.
అగ్ని పలు విధాలుగా వెలుగుకి, జీవితానికి మూలం. ప్రతీకాత్మకంగా, మనం అగ్నిని జీవితం యొక్క మూలంగా చూస్తాం. నిజానికి, మీ జీవితమే అగ్ని అని చాలా భాషల్లో ప్రస్తావిస్తారు. మీలోని అగ్ని మీరు జీవించటానికి కారణం. సూర్యుడు, ఈ గ్రహం మీద జీవానికి మూలం. అతనొక అగ్ని గోళం, అవునా? కాదా? మీరు ఒక విద్యుద్దీపాన్ని వెలిగించినా, స్టవ్‌ మీద వంట చేసినా, మీ కారులోని ఇంటర్నల్‌ ఇంజిన్‌ను స్టార్ట్‌ చేసినా అది అంతా కూడా అగ్నే. అవునా? కాదా? ఈ ప్రపంచంలో జీవాన్ని నడిపేది అంతా కూడా అగ్నే. కాబట్టి అగ్నిని జీవానికి మూలంగా చూస్తాం. అది దాని చుట్టూ ఒక శక్తి క్షేత్రాన్ని సృష్టించుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా అది మనకు అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మీరు మీ రోజుని ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగిస్తున్నారు అంటే మీరు అదే నాణ్యతని, గుణాన్ని మీలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ప్రతీకాత్మకంగా చూస్తే, అది మీ సొంత అంతర్గత స్వభావాన్ని ప్రేరేపించే ఒక విధానం.
– సద్గురు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అర్ధ రూపాయకు తాళి బొట్టు అందజేస్తున్న వరద రాజ గ్రామ కుటుంబం

తాళి ‘కట్టు’ శుభవేళ
భూలోకమంత పీట – ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేసినా..
ఏ నలుగుర్నో పిలిచి నాలుగు అక్షింతలు వేసుకున్నా పెళ్లి పెళ్లే!
అయితే, ఉన్నోళ్లయినా లేనోళ్లయినా పుస్తెలతాడు లేనిదే పెళ్లి చేసుకోలేరు. మెడలో మూడుముళ్లు వేస్తేనే మాంగల్య బంధం. అంత పవిత్రమైన పుస్తెల తాళ్లకు ఒక ఊరు పెట్టింది పేరు. నిత్యకళ్యాణం పచ్చతోరణంలా వారి పుస్తెలతాళ్లతో ఇప్పటి వరకు లక్షల పెళ్లిళ్లు అయ్యాయి. తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్‌ జిల్లాల సరిహద్దులో ఉండే ఆ పుస్తెలపల్లె పేరు వరదరాజపురం.. 

కాపురం పచ్చగా ఉంటే అదే పదివేలు..

‘‘లాభాపేక్ష లేని పవిత్రకార్యం మాది. ఒక్కో పసుపుతాడుకు కేవలం యాభైపైసలు మాత్రమే తీసుకుంటాం. కాని అది చాలామంది చేతులు మారడం వల్ల ధర పెరుగుతోంది. తిరుపతికి కూడా ఇక్కడి నుంచే సరఫరా చేస్తుంటాము. ఎంతోమంది తెలుగువాళ్లు, దక్షిణ భారతీయులు ఫోన్ల ద్వారా ఆర్డరు చేసి తెప్పించుకుంటుంటారు. మాకు బతుకుతెరువు చూపిస్త్తున్న పసుపుతాళ్ల ఉత్పత్తినే జీవితంగా చేసుకోవడం అదృష్టం. మా ఊళ్లో తయారైన పసుపుతాళ్లు ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది మహిళల మెడల్లో మంగళసూత్రాలై మెరుస్తున్నాయి. కాపురాలు పచ్చగా ఉన్నాయి. ఇంతకంటే మాకు కావాల్సిన ఆనందం ఏముంది?
– వరదరాజపురం నేతకార్మికులు

‘తాళికట్టు శుభవేళ.. మెడలో కళ్యాణమాల’ – వరదరాజపురంలోకి కాలు పెట్టగానే ఇలాంటి పెళ్లి పాటలే గుర్తుకొస్తాయి. వివాహవేడుక కళ్లముందు మెదులుతుంది. ఊళ్లో ఎక్కడ చూసినా పసుపు పరిమళం. పుస్తెలతాళ్ల వరుసలు కనువిందు చేస్తాయి. పుస్తెలతాళ్లకు పెట్టింది పేరైన వరదరాజపురం శ్రమ వెనక ఎంతో చరిత్ర ఉంది. చుట్టుపక్కల పల్లెలకు ఆ ఊరు పేరు చెబితే తెలీదు, తాళికయిర్‌ (పుస్తెలతాడు) అంటేనే టక్కున గుర్తుపడతారు. పుస్తెలతాళ్లను తయారుచేయడమే గ్రామస్థుల ప్రధానవృత్తి. యాభైఏళ్ల కిందట ఊళ్లో మగ్గాలు ఉండేవి. ఎక్కువ మంది నేతనే నమ్ముకుని బతికేవారు. మారుతున్న కాలం కొద్దీ వృత్తిలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఎన్ని వసా్త్రలు నేసినా పూటగడవడానికే సరిపోయేది. నెలాఖరికి అప్పులే మిగిలేవి. వృత్తిని వదల్లేక, ఊరు విడిచి మరో ప్రాంతానికి వెళ్లలేక అవస్తలు పడేవారు. చేతిలో పని ఉండీ ఎందుకీ తిప్పలు అని మధనపడిన ఒక పెద్దాయన మదిలో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. ‘ఎలాగూ నేత పని చేస్తున్నాము కాబట్టి.. ఇందులోనే డిమాండ్‌ కలిగిన పని చేస్తే ఎలా ఉంటుంది?’ అనుకున్నాడు. ఆయన ఆలోచన – పుస్తెలతాళ్లను తయారుచేయడం. ఆ పని మొదలైంది. రంగుల అద్దకంలో ఇప్పుడున్నంత సాంకేతికత ఆ రోజుల్లో లేదు. మిలమిల మెరిసే రంగులు అందుబాటులో ఉండేవికావు. నూలుదారాలకు కేవలం పసుపుపూసి పుస్తెలతాళ్లను తయారుచేసేవారు. మొదట్లో ఆ పెద్దాయన ఏ శుభముహూర్తాన ఈ శుభకార్యం మొదలుపెట్టాడో కాని – కొన్నాళ్లకే పుస్తెలతాళ్ల వ్యాపారానికి శ్రీకారం చుట్టుకుంది. ఏ ఊళ్లో పెళ్లిళ్లు జరిగినా వరదరాజపురం వెళ్లి పుస్తెలతాళ్లు కొనుక్కోనిదే భజంత్రీలు మోగేవి కావు. అక్షింతలు రాలేవి కావు..! ఊహించనివిధంగా – కొమ్మ కొమ్మకో సన్నాయిలా.. పుస్తెలపల్లె పేరు కోటి రాగాలై.. మార్మోగిపోయింది. ‘‘మన సంప్రదాయాల్లో, జీవనవిధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ ప్రభావం పెళ్లిళ్ల మీద పడింది. వేడుకల్లో ఎన్ని మార్పులొచ్చినా మంగళసూత్రం విలువ కించిత్తు తగ్గలేదు. ముత్తయిదువులకు అదొక పవిత్రమైన ఆభరణం. అందుకనే మేము పుస్తెలతాడును ఒట్టి నూలుదారంగా భావించలేదు. వాటి తయారీని ఎంతో నిష్టగా చేస్తాము..’’ అంటున్నారు కార్తికేయన్‌, గోమతి.
దేవుడ్ని మొక్కుతాం..

మూడొందల ఇళ్లున్న పల్లెటూరు వరదరాజపురం. ఇందులో సగంమంది పుస్తెలతాళ్ల తయారీ మీదే బతుకుతున్నారిప్పుడు. ఊరంతా కలిసికట్టుగా మాట్లాడుకున్నట్లు – ఒకటే నిష్ట, ఒకటే క్రమశిక్షణతో పని మొదలవుతుంది. ‘‘జీవితంలో వివాహాన్ని ఎంతో శుభకరంగా భావిస్తుంది మన సమాజం. అలాంటి పెద్ద కార్యానికి తాళి కేంద్రబిందువు అవుతుంది. దాన్ని తయారుచేయడంలోను మేమొక పద్ధతిని ఎంచుకున్నాం. ఉదయాన్నే ఆరుగంటలకు నిద్రలేస్తాం. స్నానపానాదులు ముగించుకుని మా ఇలవేల్పును భక్తిశ్రద్ధలతో పూజిస్తాం. ‘దేవుడా! ఈ రోజు మేము తయారుచేసే పసుపుతాళ్లను కట్టుకున్న ఏ ఇల్లాలి మెడలోను అది తెగిపోకూడదు. ఆశీర్వదించు!!’ అని వేడుకుని పనికి శ్రీకారం చుడతాము’’ అంటారు నేత నిపుణులు. తాళి దారాన్ని బందారం అంటారు. ‘‘దానికి ఉపయోగించే దారాన్ని కాటన్‌మిల్లుల నుంచి సేకరిస్తాం. మిల్లుల్లో సైజింగ్‌లోని వేస్ట్‌ మెటీరియల్‌ చౌకధరకు దొరుకుతుంది. అయితే దీనికి పసుపురంగును అద్దడంలోనే ఉంది రహస్యమంతా. నూలును బాగా ఉడకబెట్టాక రంగును పూస్తాం. ఆ తర్వాత ఎండకు ఆరబెడితే సరిపోతుంది’’ అన్నారు గ్రామస్తులు.
నలుమూలలకు..
ఇలా తయారైన పసుపుతాళ్లు దక్షిణ భారతదేశానికంతటికీ సరఫరా అవుతున్నాయి. హిందువులు ఉపయోగించే తాళికి పసుపురంగు వాడతారు. అయితే ఇందులో ఒక్కో రాష్ట్రం ఒక్కో రంగుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. ‘‘తెలుగురాషా్ట్రల వారు నిమ్మకాయ పసుపు రంగు తాళ్లనే తీసుకుంటారు. తమిళనాడులోని మేల్‌మరువత్తూరు అమ్మవారి భక్తులు అయితే ముదురు పసుపు రంగుకు ప్రాధాన్యం ఇస్తారు. మొత్తంగా చూస్తే – ఎక్కువమంది కోరుకునేది మామిడి పసుపు. అందుకే మేము మూడు రకాల బందారాలను తయారు చేస్తున్నాం..’’ అని చెప్పారు తయారీదారులు. పసుపుతాళ్లకు కూడా ఒక్కో సీజన్‌లో ఒక్కో డిమాండ్‌ ఉంటుంది. ‘‘తైపూసం ఉత్సవాలప్పుడు మలేషియాకు సైతం ఎగుమతి అవుతాయి. ఆషాఢమాసం వస్తే కావేరీ నదీ తీరంలో మహిళలు తాళిని విప్పి మళ్లీ కొత్తదారం కట్టుకుంటారు. అయ్యప్ప స్వామి మాలధారణ సమయంలో – గుడికి వెళ్లి ఇంటికి వచ్చేప్పుడు మహిళలకు ఈ దారం తీసుకెళ్లాలనే ఆనవాయితీ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మంచి డిమాండ్‌ ఉంటుంది’’ అని వివరించారు నేతపనివాళ్లు. ఆఖర్న ఊర్లోని ఒక ముసలాయన ‘‘పదికాలాల పాటు పెళ్లిళ్లు పచ్చగా ఉన్నంత కాలం.. మా పుస్తెలపల్లెకు ఢోకా లేదు’’ అన్నాడు.
– పూనూరి ప్రవీణ్‌, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవుడెలా ఉంటాడో చూపిస్తున్న శ్రీ కె అరవింద రావు

దేవుడెలా ఉంటాడు ?

దేవుడెలా ఉంటాడనే ప్రశ్న అనాదిగా మనిషి వేసుకుంటున్నదే. దీనికి మనిషే సమాధానం చెప్పాలి. పోతే.. దేవుడు నాకు చెప్పాడనో, దేవుని తరఫున మరొకరు చెప్పారనో లేదా మా మతగ్రంథం ఇలా చెపుతుందనో చెప్పాలి.
లేకుంటే ఇతరులు నమ్మరు. దేవుడు ఆకాశంలోనూ, మనం భూమిపైనా ఉన్నామని సాధారణంగా ఎవరైనా చెప్పగల్గిన విషయమే. దానికి మన ఊహను జోడించి దేవుడున్న లోకంలో మనం ఈ లోకంలో ఎదుర్కునే కష్టాలేమీ ఉండవనీ, అక్కడంతా బంగారు ఇండ్లు, రోడ్లు,పేవ్‌మెంట్లు ఉంటాయనీ, దేవుడి శక్తిసామర్థ్యాలని అంచనా వేయలేమనీ చెప్పవచ్చు. వివేకానందుడు చెప్పినట్లు చీమకు ఆలోచనాశక్తి ఉంటే దేవుణ్ణి వేలకొద్దీ తలలు, అవయవాలూ ఉన్న గొప్ప చీమరూపంలో ఊహించుకుంటుంది. అలాగే మన కల్పనా సామర్థ్యాన్ని బట్టి, మన స్వభావాన్ని బట్టి మన దేవుళ్ళు ఉంటారు. మన శత్రువులే దేవుడికి శత్రువులు. మనమే దేవుడికి అతి ప్రేమపాత్రులైన జాతి అని కూడా చెప్పుకోవచ్చు. దేవుడికి తన భక్తుల్ని అన్ని విధాలా ఆదుకునే స్వభావం. భక్తులను కానివాళ్ళను అనేక కష్టాలకు గురిచేసే స్వభావం ఉంటుంది అని కూడా కొన్ని మతాలు చెబుతాయి. మనిషి గుణాలలాగానే దేవుడికి కూడా కొన్ని గుణాల్ని మనం అంటగడతాం. ఈ స్థాయిలో వర్ణించబడే దేవుడిని సుగుణస్థాయి అంటారు. ఇంగ్లీషులో దీన్నే (personal god) అంటారు.

అయితే ఈ సుగుణస్థాయి రెండు విధాలుగా చూడగలం. దేవుణ్ణి అనేక గుణగణాలున్న వ్యక్తిగా మనం భావించినపుడు ఆ గుణగణాలను ఒక రూపం ద్వారా తెలియజేయడం. ఉదాహరణకు మనం సైన్సులో అనేక సంజ్ఞల్ని (symbols) వాడుతుంటాం. అలాగే సృష్టి అనే ప్రక్రియకు తెలివి అవసరం కావున సృష్టికర్తకు నాల్గువేదాలు తెలుసని చెప్పడానికి నాలుగు తలల్ని ఊహిస్తాం. తెలివి అనే శక్తిని సీ్త్ర రూపంలో భావించి అతనికి భార్యగా ఊహిస్తాం. ఇదే విధంగా మన పురాణాల్లో అనేక దేవతారూపాలకు సాంకేతికమైన అర్థాల్ని చూడగలం. ఇలాగ ఒకానొక రూపమున్న దేవుడు సుగుణం అనే కేటగిరీలో ఉన్నా సాకార(ఆకారం ఉన్న)అనే స్థాయికి చెందుతాడు. మన సంప్రదాయంలో ఉన్న శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు, లక్ష్మి, గణేశుడు మొదలైన అనేక దేవతారూపాలు ఈకోవకు వస్తాయి. ఇదే సుగుణస్థాయికి ఎలాంటి రూపాన్నీ ఇవ్వకుండా కూడా చెప్పవచ్చు.మన సంప్రదాయంలో వైశేషికులు, పతంజలి యోగులు మొదలైనవారు ఇలాంటి దేవుడి గురించి చెప్పారు. ఈ దేవుడు సుగుణం అనే స్థాయిలో ఉన్న నిరాకారుడు అనే కోవకు వస్తాడు. పాశ్చాత్యమతాలు కూడా ఈ కోవకు వస్తాయి. వారి మతగ్రంథాల్లో దేవుడు కూడా అనేక పనుల్ని చేస్తూ తన భక్తుల్ని రక్షిస్తూ, భక్తులుకాని వారిని దండిస్తూ కనిపిస్తాడు. దేవుడు తన ప్రతిరూపంలోనే మనిషిని చేశాడని చెబుతూనే, అతనికి ఆకారం లేదని అంటారు. పైన చెప్పిన సుగుణ, సాకార అనే స్థాయి, సుగుణ, నిరాకార అనే స్థాయి – ఈ రెండూ ఞ్personal god అనే నిర్వచనం కిందకే వస్తాయి. మనిషి తన కల్పనాశక్తిని ఉపయోగించి నిర్మించిన స్థాయి.
ఉపనిషత్తులు దేవుడిలా ఉంటాడు అని చెప్పకుండా దేవుడెలా ఉండాలి అని ఆలోచిస్తాయి. ఈ స్థాయిలో ‘దేవుడు’ అంటూ ‘డు’ గానీ ‘దేవత’ అంటూ ‘త’ గానీ చెప్పలేం. అంటే దీన్ని పుంలింగంలోగానీ, సీ్త్రలింగంలో గానీ చెప్పలేం. దీన్ని మనలాగ జీవి అని కూడా చెప్పలేం. జీవి అని అంటే దీనికి ఒక ఆకారం. అవయవాలు ఉండాలి. ఒకానొక స్థానంలో, ఒకానొక పరిమాణంలో ఉండాలి. ఉదాహరణకు మనం మన ఇంటిలో ఒక చదరపు గజమంత పరిమాణంలో ఉంటాం. ఇక్కడ ఉంటే మరొక చోట ఉండలేం. ఈ కాలంలో ఉంటే మరొక కాలంలో ఉండలేం. అంటే మనం ఉండే ప్రదేశంచేత, పరిణామంచేత, కాలంచేతం మనం కొలవబడి ఉన్నాం. దేవుడికి ఇలా చెప్పడానికి వీలులేదు. పై మూడు రకాలైన పరిమితులు, కొలతలు చెప్పలేం.
అలాగే దేవుడు సృష్టి చేశాడు అంటే ఏ ముడిసరుకును తీసుకుని సృష్టి చేశాడని ప్రశ్న వస్తుంది. ఏదో ఒక ముడిసరుకు ఉన్నది అని అంగీకరిస్తే,దేవుడు కంటే వేరుగా అది ఉంది కాబట్టి దేవుడికి ఒక పరిమితి ఉన్నట్లే అవుతుంది. ముడిసరుకు లేదు, అయినా సృష్టి జరిగింది అంటే దేవుడు తనలోనే ఏదో ఒకభాగాన్ని తీసి సృష్టి చేశాడని చెప్పాల్సి వస్తుంది. అంటే దేవుడికి అవయవాలు ఉన్నవని భావించినట్లవుతుంది. ఇలా కూడా చెప్పడానికి వీలులేదు. దేవుడు వ్యక్తి కాదు, దేవుడి కంటే వేరుగా మరొక పదార్థం లేదు అన్నప్పుడు ఆ దేవుడు అనే తత్వమే సృష్టిలా మారిందనో, సృష్టిలాగ కనిపిస్తుందనో చెప్పాలి. సృష్టిలాగ మారింది అనేది ఒక వాదన. సృష్టిలాగ కనిపిస్తుంది అనేది మరొక వాదన. ఈ విచారణలోకి మనం వెళ్ళాల్సిన పనిలేదు.
ఎలా చెప్పినా మనం దేవుడు అనేది ఒక వ్యక్తి కాదు కేవలం ఒక తత్వం అని చెప్పాల్సివస్తుంది. ఈ తత్వాన్ని సత్యం, జ్ఞానం, అనంతం అని ఒక ఉపనిషత్తు చెబుతుంది. ప్రతిచోట ఒక ఉనికి రూపంలో కనిపించేదే ‘సత్‌ ’ లేదా సత్యం అంటారు. ఇది చీమ నుండి మొదలుకుని ఏనుగు వరకూ అన్ని జీవులలో తెలివి రూపంలో తెలుస్తూ ఉంది కాబట్టి జ్ఞానం అన్నారు. దీన్ని ఏదో ఒక పేరుతో పిలవాలి కాబట్టి బ్రహ్మ అని పేరు పెట్టారు (ఈ బ్రహ్మ వేరు, సృష్టికర్త బ్రహ్మదేవుడు వేరు అని ఇది వరలో చెప్పుకున్నాం )
ఈ బ్రహ్మకు ఆకారం ఉండదని చెప్పాల్సిన పనిలేదు. నిరాకారమే కాకుండా ఎలాంటి గుణాలు చెప్పడానికి వీలులేదు. అంటే ఈ బ్రహ్మ భక్తుల్ని రక్షిస్తుందని గానీ, ఇంకేదో చేస్తుందని గానీ, ఎలాంటి గుణాలు చెప్పడానికి లేదు. దీన్ని నిరాకార , నిర్గుణస్థాయి అంటారు.ఇదొక చైతన్యతత్వం. దీనికి ఒకలోకం అంటూ లేదు. స్వర్గం, నరకం, దేవుళ్ళు, దేవదూతలు, రాక్షసులు మొదలైన కల్పనలేవీ లేవు. ఈనాడు మనకున్న సైన్సు పరిజ్ఞానంతో పదిమంది శాస్త్రజ్ఞులు కూర్చొని మేధోమధనం చేసినా ఇంతకన్నా వేరుగా చెప్పలేరు. ఉపనిషత్తులు ఇలాంటి విచారణే చేశాయి.
మతం స్థాయిలో దేవుడు, స్వర్గం, నరకం, పుణ్యం ,పాపం అనే స్థాయిలో చెప్పేదంతా విశ్వాసంతో ముడిపడి ఉంది.ఇది శివుడు కావచ్చు.విష్ణువు కావచ్చు. అమ్మవారు కావచ్చు,లేదా పాశ్చాత్యమతాల్లోని దేవుడు కావొచ్చు.వీరందరికీ పుణ్యము, పాపం, రక్షించడం, శిక్షించడం మొదలైన గుణాలన్నీ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మా విశ్వాసమే సరైనది. మా పుస్తకమే సరైనది అనడం చిన్నపిల్లల వాదం లాంటిది. ఉపనిషత్తులు చేసే శాసీ్త్రయమైన విచారానికి మతము, విశ్వాసంతో సంబంధం లేదు. కేవలం సత్యం ఏమిటనేదే ప్రశ్న.
మామూలు మనిషికి ఎక్కువ సత్యంతో పనిలేదు. టి.ఎస్‌.ఎలియెట్‌ అనే ఆంగ్లకవి చెప్పినట్లు ‘human kind cannot bear too much of reality. మనిషికి తన గోల చెప్పుకోవడాననికి ,నడిరేయి ఏ జాములోనైనా పతిదేవుని ఒడిలో పవళించే అమ్మవారిని డిస్టర్బ్‌చేసి, ఆమె ద్వారా ఆయ్యవారికి తన పిటిషన్‌ వివరించడానికి ఒకానొక దేవుడు కావాలి.ఈ స్థాయిని మనం కాదనలేం.అందుకు ఉపనిషత్తులు సుగుణ స్థాయిలో మనం చెప్పుకునే దేవుణ్ణి పూర్తిగా నిరాకరించలేదు. పోతే దీన్ని lower level of reality, వ్యవహారస్థాయిసత్యం అని అన్నాయి. మరి నిరాకరించలేని నిజం ఏమిటి అంటే చైతన్యము (consciousness) అదేabsolute reality, పరమార్థసత్యం.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నడక తో భూములు జయించిన సర్కారీ సాదు -వినోబా భావే

ఆధ్యాత్మిక నడక

‘భూదానోద్యమం’ కోసం, ‘సర్వోదయ’ సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన ఆధ్యాత్మిక జీవి ఆచార్య వినోబా భావే. రవాణా కోసం ధనం ఖర్చుకాకూడదనే నియమంతో ఆయన జీవితమంతా కాలినడకనే సాగిపోయాడు.
దేశమంతా తిరుగుతూ, దాతల నుంచి సేకరించి లక్షలాది ఎకరాలు పేదప్రజలకు అందేలా చేశాడు. ‘‘నడిచే సాధువు’ గా పిలవబడే వినోబా తన ప్రతి సామాజిక కార్యక్రమాన్ని ఆఽధ్యాత్మిక కార్యక్రమంగా, ఒక యజ్ఞంగా విశ్లేషించేవారు. రేపు అంటే నవంబర్‌ 15న జరిగే ఆచార్య వినోబా 32వ వర్థంతి

సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం…
‘‘నీ పిలుపు విని ఏ ఒక్కరూ నీతో రాకపోతే
నువ్వొక్కడివే నడువు.. నువ్వొక్కడివే నడువు’’
అన్న టాగూరు గీతానికి ఒకానొక నిలువెత్తు ప్రతిరూపం వినోబా భావే.
‘‘ ప్రేమ, ఉదాత్త భావాలతో హృదయం విశాలం కావడానికి అనంతమైన ఆకాశం కింద కాలినడకన పయనం సాగించడానికి మించిన మార్గమేముంది? మనిషి నిద్రిస్తున్నప్పుడు అతని మొత్తం శరీరం నేలను తాకుతూ ఉండిపోతుంది. మనిషి కూర్చున్నప్పుడు శరీరంలోని కొంత భాగమే నేలను తాకుతుంది. నిలుచున్నప్పుడు రెండు అరిపాదాలు మాత్రమే నేలను తాకుతాయి. అయితే మనిషి నడుస్తున్నప్పుడు మాత్రం ఏదో ఒక పాదమే నేలను తాకుతుంది. నేలతో తన అనుబంధం ఎంత తక్కువగా ఉంటే, పరమాత్మతో అతని అనుబంధం అంత ఎక్కువగా ఉంటుంది. నిజానికి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం కన్నా నడక ఎన్నో రెట్లు ఉత్కృష్ఠమైనది’’ అంటాడు వినోబా.
ఎన్నో ఏళ్లు తపస్సు చేసి, జ్ఞానసిద్ధి పొందిన గౌతమ బుద్దుడు ఆ త ర్వాత కాలమంతా వేల మైళ్లు నడిచే వెళ్లాడు.
అరణ్యాలూ, నదులూ దాటుతూ, ఽధర్మబోధ చేస్తూ ఒక చోటునుంచి మరో చోటికి జీవితమంతా అలా సాగిపోయాడు.
జగ ద్గురు శంకరాచార్య కూడా తాను బతికున్న ఆ మూడుదశాబ్దాల కాలమంతా దేశమంతా కాలినడకనే తన జీవనయానాన్ని కొనసాగించాడు. నిజానికి సాధువుల్లో అఽత్యధికులు మానవాళి హృదయాల్లో చైతన్యదీప్తుల్ని వెలిగిస్తూ అలా సాగిపోయినవారే. అలా నిరంతరం కాలినడకన సాగిపోయినవారిలో అత్యంత ప్రముఖుడు వినోబా భావే. కేవలం 13 ఏళ్లలో 70 వేల కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లిన ఆధ్యాత్మిక చైతన్య మూర్తి ఆయన.
నడక ఒక ఆధ్యాత్మిక యానం
రవాణా కోసం కానీ ఖర్చు చేయకూడదని చెప్పే ‘కాంచన ముక్తి’ అనే సూత్రాన్ని అనుసరించి జీవితమంతా తన భూదానోద్యమ యానాన్ని ఆయన కాలినడకనే సాగించాడు. అప్పటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఢిల్లీలో జరిగే తొలి ప్లానింగ్‌ కమీషన్‌ సదస్సుకు రావలసిందిగా వినోబాను ఆహ్వానించినప్పుడు వార్థా సమీపంలోని తన పౌనార్‌ ఆశ్రమానికి 1350 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి ఆయన కాలినడకనే వెళ్లాడు. ఊరూరూ తిరుగుతూ, ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవడానికి ప్రజల పేదరికాన్ని, వారి ఆకలి మంటల్ని తెలుసుకోవడానికి, వారితో ఒక ఆత్మీయబంధాన్ని నిలబెట్టుకోవడానికి, కాలినడకన వెళ్లడానికి మించిన మార్గమేముంది? అనేవారు ఆయన. అసలైన ఆధ్యాత్మికత ముందుగా పేదరికాన్ని, ఆకలి మంటల్ని తీర్చే విధంగా సాగిపోతుందంటాడు వినోబా. అందులో భాగంగానే పేదరైతులకు వ్యవసాయ భూములను అందేలా చూసే ప్రయత్నంలో పడ్డాడు.
భూమి… మనిషి మరో ఆత్మ 
తెలంగాణలోని పోచంపెల్లి గ్రామ హరిజనుల కోసం భూమి సేకరించడంతో మొదలైన భూదానోద్యమం క్రమక్రమంగా జాతీయ స్థాయి ఉద్యమంగా మారింది. ఎంతో మంది దాతలు కొన్ని లక్షల ఎకరాల్ని వినోబాకు అందచేశారు. ఆ సందర్భంలో ‘‘ మానవాళికి భూమి ప్రాణంతో సమానం. అది వారి ఆత్మకు ప్రతిరూపం. అలాంటి భూమిని దానం చేయడం అంటే అది ఆత్మత్యాగమే అవుతుంది. అది ఆధ్యాత్మిక పరిణతితోనే సాధ్యమవుతుంది. అయితే పేదవారికి భూమిని అందచేసే క్రమంలో ఎక్కడా హింసకు తావు ఉండకూడదు. ఈ అణుబాంబుల యుగంలో మానవాళి ముందున్నవి రెండే రెండు మార్గాలు. అవి యుద్దం, అహింస. నిజానికి ప్రేమ, అహింస ఈ రెండే ప్రపంచ యుద్దాన్ని నివారించగలవు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిపూర్ణంగా పుణికి పుచ్చుకున్న వాళ్లు అహింసావాదులే అవుతారు. ఒకే ఒక్క పరమాత్మ
సర్వవ్యాప్తమై ఉన్న సత్యాన్ని గుర్తించిన తర్వాత ఎవరు ఎవరిని హింసిస్తారు? అది సాధ్యం కాదు. అందుకే అహింసా సిద్ధాంతమే ఆధారంగా సాగిపోయేవాళ్లు ఆధ్యాత్మిక వాదులే అవుతారు.’’ అంటాడు
ఒక ప్రయోగశాల
మహారాష్ట్రలోని పౌనర్‌లో నెలకొల్పిన తన ఆశ్రమాన్ని ఆయన ఆధ్యాత్మిక ప్రయోగశాల అనేవారు వినోబా. అయితే ఇందులో జరిగే ప్రయోగాలన్నీ సామాజిక సంక్షేమ లక్ష్యంగా ఉండాలని చెబుతుండే వారు. భూదానోద్యమంలో భాగంగా కాలినడకన వేలాది మైళ్ల దూరం నడిచి అలిసిపోయిన వినోబా తన మరణం దాకా తన ఆశ్రమంలోనే ఉండిపోయారు. చివరి దశలో స్వేచ్ఛా మరణం అంటే సమాధి కోసం ఆయన ఆహార పానీయాలు సైతం మానివేశారు. ఎక్కువ గంటలు నిద్రలోనే ఉండిపోయేవారు. ఆ సందర్భంగా ఆయన ‘‘నిద్ర మరణానికి ముందు రిహార్సల్‌ లాంటిది. అందుకే ప్రతి నిద్రకు ముందు మరణానికి సిద్ధమవుతున్నట్లే ఉండాలి’’ అన్నారు వినోబా బావే. ఆత్మబోధ, సమాజ సేవ ఈ రెండింటి సమిశ్రంగా ఆయన రూపొందించిన సర్వోదయ సిద్ధాంతం సమస్త మానవాళిలో గొప్ప ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. కటిక చీకట్లు కమ్ముకున్న వేళ సమాజానికి నిజంగా అదో అద్భుతమైన దివిటీలా తోడ్పడుతుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”దొ ర ”నెహ్రూను యెత్తు కెడితే నెహ్రూ దొరను ఎత్తి కుదేశాడు

నెహ్రూ – ఓ జ్ఞాపకం
నెహ్రూ గారు నారాయణ దొరగారిని అమాంతం ఎత్తి సోఫాలో కుదేశారు. ఎవరీ నారాయణ దొర గారు? ఆయనకూ నెహ్రూ గారికీ ఏమిటి సంబంధం? 
అప్పట్లో కలం కూలీ జి. కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు నిసావానికి ఈ నారాయణ దొర వచ్చారు. సాలూరు ప్రాంతీయుడయిన కునిసెట్టి వెంకట నారాయణ దొర పాత కాలపు కాంగ్రెసువాది. అప్పటి సంగతులను గురించి జి. కృష్ణ తమ ‘విలేఖరి లోకం’ లో ఇలా గుర్తు చేసుకున్నారు. ‘దొరకు ఇంగ్లీష్‌ రాదు. హిందీ కూడా రాదు. వచ్చీ రాగానే జవహర్‌ లాల్‌ నెహ్రూ గారితో మాట్లాడాలన్నాడు. వెంటనే వచ్చి కలవవచ్చని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం వచ్చింది. పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు.’
దొరగారు ఖద్దరు దుస్తులు ధరించి వెళ్లారు. వెంటనే దర్శనం లభించింది. దొరగారు గదిలోకి వెళ్ళగానే గులాబీ పువ్వు నెహ్రూ షేర్వాణీకి తగిలించడానికి ముందుకు కదిలాడు. నెహ్రూ అమాంతం అతడిని పట్టి ఎత్తి సోఫా మీద పడేశాడు. అప్పటినుంచి కాసేపటి దాకా ఇద్దరూ నవ్వులే నవ్వులు. దీనికి కొంత నేపథ్యం ఉంది.
1936లో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రాలో ప్రచారానికి వచ్చిన నెహ్రూకు అంగరక్షకుడిగా అప్పటి ఆంధ్ర కాంగ్రెస్‌ కార్యదర్శి బులుసు సాంబమూర్తి గారు వెంకట నారాయణ దొరను నియమించారు. నెహ్రూకు తెలుగు రాదు.. దొరకు హిందీ రాదు. అయినా సైగలతో గడిపేశారు. బొబ్బిలిలో నెహ్రూపై జస్టిస్‌ పార్టీ వాళ్లు రాళ్లవర్షం కురిపించారు. అంతే! దొర అమాంతం నెహ్రూను ఎత్తుకుని ఫర్లాంగు దూరం తీసుకువెళ్లాడు. జవహర్‌ లాల్‌ యెంత గింజుకున్నా దొర వొదలలేదు. మళ్ళీ 1953లో ఢిల్లీలో తనను చూడవచ్చిన దొరను కూడా నెహ్రూ అమాంతం ఎత్తి సోఫాలో కుదేసి పాత స్మృతులను నెమరువేసుకున్నారని కృష్ణ గారు రాశారు.
– భండారు శ్రీనివాసరావు, హైదరాబాద్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత ప్రజాస్వామ్య పితామహుడు

భారత ప్రజాస్వామ్య పితామహుడు

పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ- ఆధునిక భారతదేశ పితామహుడు- చర్రితపై చెరగని ముద్ర వేశారు. సార్వకాలిక మహోన్నత రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. నెహ్రూ ‘ప్రపంచ రాజనీతిజ్ఞులలో ప్రముఖుడు’ అని క్లెమెంట్‌ అట్లీ ప్రశంసించారు. ఫ్రెంచ్‌ మేధావి ఆంద్రే మార్లా దృష్టిలో ఇరవయ్యో శతాబ్ది ముగ్గురు విశిష్ట వ్యక్తులలో నెహ్రూ ఒకరు. వైదేశిక నీతిలో నెహ్రూ అలీన విధానం- ద్విధ్రువ ప్రపంచపు అధికార రాజకీయాలలో చిక్కుకోకుండా ఉండడం- తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడంలో భారతదేశానికి తోడ్పడింది; అంతేకాకుండా ప్రపంచ దేశాల మధ్య అవగాహనను పెంపొందించి, శాంతి సామరస్యాలను నెలకొల్పింది; తద్వారా అంతర్జాతీయ ఘర్షణల్లో మధ్యవర్తి పాత్రను పోషించే శక్తిని భారత్‌కు సమకూర్చింది. నెహ్రూ నాయకత్వంలో అలీనోద్యమం ప్రపంచపు అతి పెద్ద శాంతి ఉద్యమంగా వర్ధిల్లింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాశ్చాత్య రాజ్యాలు, సోవియట్‌ యూనియన్‌ పరస్పర అపనమ్మకాలతో ఉండేవి. తమ మధ్య ఘర్షణలను నివారించి రాజీ కుదర్చడానికి నెహ్రూ వైపు చూస్తుండేవి. ఆయన మధ్యవర్తిత్వాన్ని కోరుకునేవి. ఒక తటస్థ, నిష్పాక్షిక వ్యక్తిగా ఈ రెండు శత్రుపూరిత కూటముల మధ్య శాంతి వారధిని నిర్మించడానికి నెహ్రూ అపారమైన కృషిచేశారు. కొరియా యుద్ధం (1950), సూయెజ్‌ వివాదం (1956), కాంగో అంతర్యుద్ధం మొదలైన అంతర్జాతీయ సంక్షో భాలు మరింతగా విషమించకుండా సమస్యలను పరిష్కరించడంలో నెహ్రూ సఫలమయ్యారు.పలు సందర్భాలలో మూడో ప్రపంచయుద్ధం ప్రజ్వరిల్లకుండా నెహ్రూ నివారించారని బెర్ట్రండ్‌ రస్సెల్‌ కొనియాడారు.
స్వతంత్ర భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తుందని నెహ్రూ ప్రకటించినప్పుడు ఆయన ఆదర్శం ఆచరణాత్మకం కాబోదని పాశ్చాత్యరాజ్యాలు కొట్టివేశాయి. అయితే ప్రజల స్వతసిద్ధ వివేకంలో సంపూర్ణ విశ్వాసమున్న నెహ్రూ కుల మతాలకు అతీతంగా, విద్యార్హతలతో నిమిత్తం లేకుండా 21 ఏళ్ళ వయస్సు నిండిన ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించారు. దేశ పౌరులందరికీ సమాన రాజకీయ హక్కులు కల్పించారు. సామాజికంగా, సాంస్కృతికంగా అపార వైవిధ్యంతో విలసిల్లుతూ, ఆర్థికంగా వెనుకబడి, అక్షరాస్యత అతి తక్కువ శాతం ఉన్న సమాజంలో ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించడమనేది అత్యంత సాహసోపేతమైన ప్రజాస్వామిక ప్రయోగం. నెహ్రూచేసిన ఈ ప్రజాస్వామిక ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమైందని మరి చెప్పాలా? ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించి, సుస్థిరంగా వర్ధిల్లుతుందంటే అందుకు నెహ్రూయే ప్రధాన కారకుడు.
పురానవ భారతదేశాన్ని, దాని చరిత్రను, సమున్నత సాంస్కృతిక వారసత్వాన్ని నెహ్రూ కంటే మెరుగ్గా అర్థంగా చేసుకున్న వారు మరొకరులేరు. ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ (భారతదర్శనం)లో ‘భిన్నత్వంలో ఏకత్వంగా… వైరుద్ధ్యాల పుట్ట అయినప్పటికీ అదృశ్య శక్తులతో, సమైక్యంగా విలసిల్లుతున్న జాతిగా… ఒక కల్పన, ఒక భావం, ఒక స్వప్నం, ఒక దార్శనికతగా..’ మన పుణ్యభూమిని నెహ్రూ అభివర్ణించారు. ఆ రాజనీతిజ్ఞుని దార్శనికత, ఆదర్శాలే స్వతంత్ర భారతదేశంలో లౌకిక ఉదారవాద ప్రజాప్వామ్య వ్యవస్థకు పునాదులు వేశాయి. 1947 ఆగస్టు 14 రాత్రి రాజ్యాంగసభలో నెహ్రూ ఒక ఉత్తేజకరమైన ప్రసంగాన్ని వెలువరిస్తూ దేశప్రజలకు ఒక ఉదాత్త, స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. ‘చాలా సంవత్సరాల క్రితం అదృష్టదేవతతో సమాగమానికి మనం ఒక ముహూర్తం కుదుర్చుకున్నాం. ఇప్పుడు మన ఆ ప్రతిజ్ఞని సంపూర్ణంగా లేక పూర్తి స్థాయిలో కాకపోయినా గణనీయమైన స్థాయిలో నెరవేర్చుకునే తరుణం ఆసన్నమయింది. సరిగ్గా అర్థరాత్రి పన్నెండుగంటలకి, ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు, భారతదేశం జాగృతమై నూతన జీవితంలోకి, స్వాతంత్య్రంలోకి అడుగుపెడుతోంది…. ఈ పవిత్ర తరుణంలో మనం భారతదేశం, భారత ప్రజ, అంతకంటే బృహత్తరమైన మానవజాతి సేవకి అంకితమవుతూ శపథం చేయడం ఎంతైనా సముచితం’. ఆ అర్థరాత్రి నెహ్రూ మాట్లాడిన ఆ మాటలు భారతీయులను ఎప్పటికీ ఉత్తేజపరుస్తూనే ఉంటాయనడంలో సందేహం లేదు.
నేడు మన దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ విఫల రాజ్యాలే. ప్రజాస్వామ్య విధానాన్ని మనం ఎటువంటి ఆటంకాలు లేకుండా చిత్తశుద్ధితో విజయవంతంగా అనుసరించగలుగుతున్నామంటే అందుకు స్వతంత్ర భారతదేశ తొలినాళ్ళలో నెహ్రూ అందించిన నాయకత్వమే ముఖ్య కారణం. ప్రజల విచక్షణా వివేకాల్లో ఆయన ఉంచిన సంపూర్ణ విశ్వాసం ఏమాత్రం వమ్ము పోలేదు. నెహ్రూనే స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధానమంత్రి కాకపోయి ఉన్నట్టయితే మన స్వాతంత్య్రం, ప్రజాస్వా మ్యం సుస్థిర మనుగడను సాధించుకునేవా అన్నది అనుమానాస్పదమే. మన దేశం కూడా పాకిస్థాన్‌ వలే రూపొంది ఉండే దేమో! ఆ దేశంలో వలే ఇక్కడ కూడా సంకుచితులైన మతాచార్యులు సమాజంపై పెత్తనం చెలాయిస్తుండేవారు. రాజకీయ అఽధికారానికి ఆరాటపడే సైనికాధికారులు రాజ్యవ్యవస్థను తమ నియంత్రణలో ఉంచుకునేవారు. అటువంటి పరిస్థితుల్లో ఒక సువ్యవస్థిత జాతి-రాజ్యంగా మన దేశం ఎదిగి ఉండేది కాదనడంలో సందేహం లేదు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం పటిష్ఠమవడానికి నెహ్రూ వంటి నాయకుడు లేరని ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగంగానే అంగీకరించారు, ఇప్పుడు పాక్‌ అస్తిత్వం సంక్షోభంలో పడిందని మరి చెప్పనక్కరలేదు. భారతదేశంలో ప్రజాస్వా మ్యాన్ని, ప్రజాస్వామిక సంస్థలను నెహ్రూనే పెంచి పోషించారు. భారతీయులు ఇప్పటికి 16 సార్లు తమ జాతీయ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ఏడాది జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 81 కోట్ల మందికి పైగా ఓటర్లలో 51 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ భారతీయ ఓటర్ల సంఖ్య అమెరికా, బ్రిటన్‌, కెనడా, జర్మనీల మొత్తం జనాభా కంటే అధికం. ఇంత భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే ప్రజాస్వామిక వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇదొక చరిత్రాత్మక విజయం. భారతీయులు మాత్రమే సాధించగల విజయమిది.
లౌకిక వాదం నెహ్రూకు ఒక సునిశ్చిత విశ్వాసం. సమాజాల, నాగరికతల చరిత్రపై సమగ్ర అవగాహన ఉన్న నెహ్రూకు మతతత్వ రాజకీయాలు భారతదేశాన్ని విభజించాయన్న సత్యం బాగా తెలుసు. ప్రజాజీవితంలో మతం, రాజకీయాలు వేర్వేరుగా ఉండాలని, ఎట్టి పరిస్థితులలోను ఆ రెండిటినీ కలిపివేయకూడదని ఆయన గట్టిగా విశ్వసించేవారు. లౌకికవాద రాజకీయాలే బహుళ మతాలతో విలసిల్లుతున్న సమాజాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతాయని ఆయన భావించారు. మతం ప్రభావం బాగా ఉన్న సమాజంలో మత మైనారిటీలకు భద్రత ఉండాలని, వారికి అన్ని రంగాలలోనూ సమాన హక్కులు ఉండాలని నెహ్రూ భావించారు. కనుకనే భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ మత స్వాతంత్ర్యాన్ని కల్పించింది. రాజకీయ ప్రయోజనాలకు మతాన్ని ఉపయోగించుకోవడాన్ని, యావత్‌ జాతిపై నిర్దిష్ట మత విశ్వాసాలను రుద్దడంగానీ జరిగితే దేశ ఐక్యత, సమగ్రత విచ్ఛిన్నమవుతాయని నెహ్రూ పదే పదే హెచ్చరించేవారు. ఇటీవలి మన చరిత్రను సింహావలోకనం చేద్దాం. 1992లో మతావేశంతో ఊగిపోయిన హిందూమూకలు బాబ్రీ మసీదును కూల్చి ఉండకపోతే 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు జరిగివుండేవికావు; 2002లో గుజరాత్‌లో గోధ్రా ఘటన, ముస్లింల ఊచకోతలు చోటుచేసుకుని ఉండేవి కావు. గుజరాత్‌ మతతత్వ అల్లర్ల వల్లే ఇండియన్‌ ముజాహిదీన్‌ అనే మిలిటెంట్‌ సంస్థ ఏర్పడింది. గుజరాత్‌ అల్లర్లపై పగ తీర్చుకునేందుకే ఆ సంస్థ ఏర్పడింది. ఈ పరిణామాల అనంతరం భారత్‌ ఇంకెంత మాత్రం మునుపటి వలే లేదు.
నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రి కావడంతో సంఘ్‌ పరివార్‌ తన ‘హిందూ ఎజెండా’ను అమలుపరచాలని ఒత్తిడి చేయవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మోదీ విజయంతో భారత్‌ మితవాద పథంలోకి మళ్ళిందన్నది స్పష్టం. హిందూ ఛాందసవాదం ప్రజ్వరిల్లుతోందనేది కూడా వాస్తవం. దేశ జనాభాలో 82 శాతంగా ఉన్న హిందువులకు 14 శాతంగా ఉన్న ముస్లింల నుంచి ముప్పు ముంచుకొస్తోదని ఆరెస్సెస్‌ భావిస్తోంది. అల్పసంఖ్యాకులుగా ఉన్న మతస్థులు అధిక సంఖ్యాకులుగా ఉన్న మతస్థులు నిర్దేశించిన విధంగా ఉండాలనేది సంఘ్‌పరివార్‌ సిద్ధాంతం. ఇది ఇప్పుడు భారత రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే అంశంగా పరిణమించింది. ఇది సంకుచిత దృక్పథం. వాస్తవ విరుద్ధమైనది. దేశలౌకికవాద పునాదులను దెబ్బతీస్తుంది. సంఘ్‌పరివార్‌లోని తీవ్రవాదులు మన దేశాన్ని ‘హిందూ రాష్ట్రం’గా మార్చడానికి ఆరాటపడుతున్నారు.
మరో ఆందోళనకరమైన విషయమేమిటంటే నెహ్రూ పట్ల మోదీ అయిష్టత. నెహ్రూ కాకుండా పటేల్‌ ప్రథమ ప్రధానమంత్రి అయివున్నట్టయితే దేశచరిత్ర మరో విధంగా ఉండేదని ఆయన అంటున్నారు. మహాత్ముడు స్వయంగా జాతీయ ప్రభుత్వాధినేతగా నెహ్రూను ఎంపికచేశారని, పటేల్‌ ఆయన నిర్ణయాన్ని అంగీకరించారన్న వాస్తవాన్ని మోదీ విస్మరిస్తున్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు పటేల్‌ స్మృతిని వినియోగించుకోవడానికి మోదీ ప్రయత్నించడం విచ్రితంగా ఉంది. సంఘ్‌పరివార్‌ నాయకుల విద్వేష ప్రసంగాల వల్లే నెలకొన్న విషమ వాతావరణం గాంధీజీ హత్యకు దారితీసిందని పటేల్‌ విశ్వసించారు. ఆ కారణంగానే ఆయన ఆ సంస్థపై నిసేధం విధించారు. అయితే ఆరెస్సెస్‌ సాంస్కృతిక కార్యకలాపాలకు పరిమితమై రాజకీయాలకు దూరంగా ఉంటుందని గోల్వాల్కర్‌ లిఖిత పూర్వకంగా హమీ ఇవ్వడంతో పటేల్‌ ఆ సంస్థపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ వాగ్దానాన్ని ఆరెస్సెస్‌ విస్మరిస్తోంది. నెహ్రూ వ్యతిరేకతే ప్రాతపదికగా తన రాజకీయాలను తీర్చిదిద్దుకున్న వ్యక్తి ఇప్పుడు, నెహ్రూ సువ్యవస్థితం చేసిన ఉదారవాద ప్రజాస్వామిక రాజ్య వ్యవస్థకు సారథ్యం వహిస్తున్నారు. మరి ఈ మన ప్రజాప్వామ్య వ్యవస్థ భవిష్యత్తు భద్రంగా ఉంటుందా? నెహ్రూ వారసత్వం, ప్రమాదంలో పడింది.
డాక్టర్‌ జి. రామచంద్రం
(ముంబై విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యులైన రామచంద్రం ‘నెహ్రూ అండ్‌ వరల్డ్‌ పీస్‌’ గ్రంథకర్త)
(నేడు నెహ్రూ 125వ జయంతి)
సామాజికంగా, సాంస్కృతికంగా అపార వైవిధ్యంతో విలసిల్లుతూ, ఆర్థికంగా వెనుకబడి, అక్షరాస్యత అతి తక్కువ శాతం ఉన్న సమాజంలో ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించడమనేది అత్యంత సాహసోపేతమైన ప్రజాస్వామిక ప్రయోగం. నెహ్రూచేసిన ఈ ప్రజాస్వామిక ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమయిందని మరి చెప్పాలా? ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించి, సుస్థిరంగా వర్ధిల్లుతుందంటే అందుకు నెహ్రూయే ప్రధాన కారకుడు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రోహిట్టింగ్ -264

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భద్రాద్రి రామునికి లక్ష కార్తీక దీప శోభ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -81 బాబు గారింట్లో ఈ బాబు

నా దారి తీరు -81

బాబు గారింట్లో ఈ బాబు

మెయిన్ రోడ్ లోనే రోడ్డుమీదనే శ్రీలక్ష్మీ  తిరుపతమ్మ గుడికి వెళ్ళేదారిలో గుడికి సుమారు రెండు ఫర్లాంగుల దూరం విష్ణు భొట్ల శాస్త్రి గారిల్లుంది .వారిని ఊరిలో అందరూ గౌరవం గా ‘’బాబు గారు ‘’అంటారు .కనుక పేరుకంటే బాబు గారనే పేరుతోనే అందరూ పిలుస్తారు .అప్పటికే ఎనభై ఏళ్ళ ‘’వృద్ధ వేదపండు’’ .ఎర్రగా కుది మట్టం గా పంచె తో విభూతి రేఖలతో  కన్పిస్తారు .సాధారణం గా చోక్కా  వేసుకోరు .డబ్బా పండు వంటి మై ఛాయ. భార్య మహా లక్ష్మీ దేవిలాగా పొడుగ్గా కాళ్ళకు కడియాలు నుదుట పెద్ద  కుంకుమ బొట్టు ,మేడలో బంగారు ఆభరణాలు ,చేతులకు బంగారు గాజులతో అపర అన్నపూర్ణా దేవిగా కనిపిస్తారు .మాటలో ఆత్మీయతా ,ఆప్యాయతా మూర్తీభవించి ఉంటారు .నన్ను ఇద్దరూ ‘’మాస్టారు గారు ‘’అనే పిలిచే వారు .అలాంటి వారింట్లో  బయట ఒక చిన్న గది నాకు అద్దేకిచ్చారు .ఉయ్యూరు నుంచి నా మడత మంచం తెచ్చుకౌండా వారిదే ఒక మంచం నాకిచ్చారు .పక్క బట్టలు దిండు మాత్రం తెచ్చుకొన్నాను ఉమ్రావ్ స్టవ్ కిరోసిన్  వంట పాత్రలు ,కంచం ,గ్లాస్ లతో దిగాను .పొద్దున్నే పాలు పొయించుకుని  కాఫీ డికాషన్ వేసి పాలు వేడి చేసి కాఫీ కలుపుకొని తాగేవాడిని .  దొడ్లో స్నానం చేసి సంధ్యా వందనం చేసుకొని వంట మొదలు పెట్టేవాడిని .నా అవస్థ చూసి మామ్మ గారు వాళ్ళ ఇంట్లో నే ఒక్కో సారి కాఫీ ఇచ్చేవారు .నేను తోమ్మిదిన్నరకల్లా భోజనం చేసి స్కూల్ కు బయల్దేరేవాడిని .ఇంటి కి బడి సుమారు కిలో మీటరు ఉంది .నడిచే వెళ్ళేవాడిని .

మధ్యాహ్నం మిగిలిన స్టాఫ్ మెంబర్ లతో కలిసి దగ్గరలో ఉన్న ఒక తాటాకు పాక హోటల్ లో  ఇడ్లీ ,లేక బజ్జీ  బొండా ఏదో ఒకటి  తిని టీ తాగే వాడిని .పల్లీ చట్నీ చాలా బాగుండేది .ఆక్కడి  నుండి మళ్ళీ స్కూలు కు  వెళ్ళేవాడిని .మళ్ళీ రొటీన్ వర్క్ సాయంత్రం దాకా. తర్వాత ఆటలాడుకొనే వాళ్ళం .ఇది అయిన తర్వాత ఇంటికి వచ్చే వాడిని .ఆచార్యులుగారు నేనూ సైన్స్  అటేన్దరూ కలిసి ,అమ్మవారి గుడికి ,శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామిగుడికీ మధ్యలో ఉన్న శివాలయానికి వెళ్లి , దగ్గరలో ఉన్న చెరువు దాకా నడిచి వెళ్లి కాసేపు అక్కడ ఊర్చుని చీకటి  పడిన తర్వాత  ఇంటికి చేరుకొనే వాళ్ళం .మళ్ళీ రాత్రి వంట .సంధ్యా వందనం .తర్వాత భోజనం .బాబు గారింట్లో మధ్యాహ్న భోజనం ఆలస్యం అయ్యేది కారణం ఆయన నిత్యం అనుష్టానం చాలా సేపు చేసేవారు .అది పూర్తీ అయితే కాని భోజనం చేసేవారు కాదు .మామ్మ గారు నాకోసం మధ్యాహ్నం చేసిన కూరలు  పచ్చళ్ళు  జాగ్రత చేసి నాకు తినమని ఇచ్చే వారు .నన్ను వారింటిలో ఒక సభ్యునిగా భావించి ఆదరించారు .ముప్పాళ్ళ లో భండారు సుబ్బారావు గారు ,భార్య సీతారావమ్మ గారు చూపించిన ఆత్మీయతను మళ్ళీ ఇక్కడ బాబు గారు బామ్మ గారి దంపతుల నుండి పొందాను .మంచి సంస్కార వంతులు దంపతులు .నన్ను రోజూ ఏమి వండుకోన్నారని అడిగి ,తినేవి లేవని తెలుసుకొని వారింట్లో ఊరగాయ అప్పడం వడియాలు నాకు వేయించి ఇచ్చేవారు .ఆ ఆదరాన్ని జీవితం లో మరువ లేను .బాబు బహు గ్రంధ కర్త .స్మార్తం లో దిట్ట .ఆ చుట్టూ ప్రక్కలే కాక సుదూర ప్రాంతాలలో వారి పేరు ప్రఖ్యాతులు వ్యాపించాయి .మంచి జ్యోతిష్ పండితులు .ముహూర్తాలోసం నిత్యం చాలా మంది వచ్చేవారు .మంచి చెడు చెప్పేవారు .ఈ దంపతులకు పిల్లలు లేక పోవటమే పెద్ద వెలితి .వీరింటి ప్రక్కనే బాబు గారి తమ్ముడుగారిల్లు ఉంది. తమ్ముడు చనిపోయాడు .మరదలు ఉంది వారికి పిల్లలున్నారు .మామ్మ గారి తమ్ముడు వాళ్ళు వెనక  బజారు లో స్వంత ఇంట్లో ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎప్పుడూ వస్తూ సందడి చేసేవారు .తమ్ముడి కూతురికో  మనవ రాలికో లెక్కలు చెప్పిన జ్ఞాపకం .

ఒక నెల గడిచిన తర్వాత హాస్టల్ పిల్లలు ట్యూషన్ చెప్పమని వచ్చారు .ప్రతి శనివారం నేను ఉయ్యూరు వెళ్లి సోమవారం పొద్దును కాని రానని ,ఉన్న రోజుల్లోనే చెబుతానని డబ్బు ఇవ్వక పోయినా ఇంట రెస్ట్ ఉంటె చెబుతానని అన్నాను .అలానే అని అయిదుగురు చేరారు .వాళ్ళు ఎస్ సి లు .అయినా బాబుగారు మామ్మ గారు ఏమీ పత్తిన్చుఒక పోవటం వారి సంసారాన్ని తెలియ జేసింది .ఉదయం ఏడుగంటల నుండి ఎనిమిదిన్నర దాకా వంట వండు కుంటూ చెప్పేవాడిని .రాత్రి ఏడు నుంచి తొమ్మిది దాకా చెప్పేవాడిని .శుక్రవారం రాత్రి తొమ్మిది  గంటలకు శ్రీ యోగానంద లక్ష్మీ  నృసింహ స్వామి  స్వామి ఆలయానీ వెళ్లి పూజ ,భోగం పవళింపు సేవ చూసేవాడిని .ఆడవాళ్ళూ ఆచార్యులవారు చక్క ని పవళింపు సేవ పాటలు భావ రాగ యుతం గా భక్తియుతం గా పాడే వారు. చాలా ఆనందం కలిగేది .ప్రసాదాలు బాగా ఉండేవి  చాలా పద్దతిగా కార్య క్రమాలను అయ్యవారు నిర్వహించేవారు .కుటుంబం అంతా అంటే భార్యా ,ఉమారుడు కోడలు ,మనుమలు మనుమరాళ్ళు అందరూ అంటే శ్రద్ధతో స్వామి సేవలు చేసేవారు .చూడ ముచ్చటగా ఉండేది .

లెక్కల మేష్టారు ఆచార్యులు గారు మా వెనక  బజారులో ఒక గది అద్దెకు తీసుకొని ఉండేవారు. నాలానే వంట చేసుకొనే వారు .చాలా సహృదయుడు .నామం పెట్టు కొనే  వారు. చామన ఛాయ.దేహం నవ్వు ముఖం గొప్ప సహాయ ఆరి .పిల్లలను లేఅలకు మోటివేట్ చేయటం లో చాలా శ్రమ పడేవారు .మంచి మార్కులు వచ్చేట్లు చేసేవారు .అంతటి కృషి చేసిన వారు అక్కడేవ్వరూ లేరు .ఇది మరువ రాని విషయం .ఏదో పోటీలుపెట్టి పెన్నులు వగైరా కొని తెచ్చి బహుమతులిచ్చేవారు .పిల్లలకు ఆయన అంటే మహా గౌరవం  చనువు ఉండేవి .తెలుగు శాస్త్రి గారింటికీ అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం భోజనమూ చేసేవాళ్ళం .ఆచార్యుల గారిని ఆయన వచ్చిన ఊరివారు చైర్మన్ పై ఒత్తిడి తెచ్చి మళ్ళీ వాళ్ళ ఓరీ ట్రాన్స్ ఫర్ చేయిన్చుకోన్నారు .స్పాట్ వాల్యుయేషన్ లో కనిపించేవారు ఆ తర్వాత .

నేను తెచ్చిన సంస్కరణలు

స్కూలు లో మార్కుల రిజిస్టరు అటెండెన్స్ రిజిస్టరు ,కన్సాలిడేటెడ్    రిజిస్టర్ ల నిర్వహణ సరిగ్గా ఉండేదికాదు .ఏ పిల్లాడు ఏ క్లాసులో ఏ సెక్షన్ లో ఉన్నాడో తెలిసేదికాదు .ఈ విషయం హెడ్ మాస్టారు ఆన్జనేయులుగారికి చెప్పాను ఆయనీ దీని మీద అవగాహన లేదు .సుందరరావు ఇలాంటి వాటిలో రిస్క్ తీసుకొనే వాడు కాదు .అందుకని నన్నే ఫస్ట్ అసిస్టంట్ గా ఉండమని వీటి సంగతి ,పరీక్షల నిర్వహణా చూడమన్నారు .నాకు  చేతి నిండా పని .నా క్లాసులు నేను అటెండ్ అవుతూ ఈ పని చూశాను .మొదటి టెస్ట్ కే  అన్నీ లైన్ లో పెట్టాను .ఆరవ తరగతి పిల్లల నంబర్లు ఆరు వందలు ఏడవ తరగతికి ఏడు వందలు అలాగే వరుసగా ఇస్తూ పడవ తరగతి వారికి వెయ్యి తో నంబర్లు మొదలైయ్యేట్లు చేశాను .ఆరవ తరగతి ఏ సెక్షన్ నంబర్లు 6101,Bsection 6201,Csection 6301 etc ఏడవతరగాతి ఏ సెక్షన్ నంబర్లు 7101,B section -7201  C section 7301  etc  ఎనిమిదో తరగతి ఏ సెక్షన్ నంబర్లు 8101 B section 8201 C section -8301 తొమ్మిదో తరగతి ఏ సెక్షన్ నంబర్లు 9101 B section 9201 ,C section -9301,పదవ తరగతి ఏ  సెక్షన్ నంబర్లు 1101 ,B section 1201 C section 1301తో ప్రారంభంయ్యేట్లు చేశాను . అటెండెన్స్ లన్నీ నేనే రాసి  నేనే యెర్ర సిరా తో నంబర్లు వేశాను .ఇది చూసి యెంత తేలికగా  హాయిగా ఉందొ అని అందరూ నన్ను అభినందించారు .అలాగే మార్కుల రిజిస్టర్ లో కూడా పేర్లు నంబర్లూ నేనే రాశాను కంసాలిడేటెడ్ అటెండెన్స్ రిజిస్టర్ కూడా నేనే రాసి నంబర్లు వేశాను .ప్రతి సెక్షన్ టీచర్ నెలాఖరుకు ఎవరైనా మానేస్తా సగం కంటే ఎక్కువ  రోజులు రాకపోతే వాళ్ళ నంబర్లను కింద బ్లాంక్ నంబర్లు గా రాయించాను .మరుసటి నెల హాజరు పట్టీ  లో బ్లాంకులు చూపిస్తూ పేర్లు రాయించాను. రెండో నేలకే  టీచర్లు బాగా అలవాటు పడ్డారు .ఒక  వేళ వారు చేయక పొతే  మర్చిపోతే నేనే వెంటపడి రాయిన్చేవాడిని .మూడో నెలలో  అంతా గాడిలో పడ్డారు .ఈ మార్పులను అందరూ హర్షించటం నాకు తృప్తి నిచ్చింది .పరీక్షలను  కూడా చాలా పద్బండీ గా నిర్వహించాను  కాపీలు కొతట్టా నివ్వలేదు ,తేనివ్వలేదు .మొదట్లో ఇబ్బందిపడ్డా క్రమం గా అలవాటు పడ్డారు .పరీక్షల్లో ఒక క్షణం కూడా కూర్చునే వాడినికాదు .టైం ప్రకారం క్వేస్చిన్ పేపర్లు ఇవ్వటం ,టైం కే పిల్లలు రాయటం ,అనుకొన్న గడువు లో టీచర్లు దిద్ది మార్కులు పోస్ట్ చేయటం ప్రోగ్రెస్ కార్డులు  జారీ అన్నీ నియమం గా జరిపించాను .

ఒక  సోషల్ మేష్టారు వెనతెశ్వర రావు గారు బెజవాడ ఆయన ఎర్రగా బా పలుచగా తెల్ల జుట్టుతో ఉండేవారు . చాలా ఆత్మీయంగా ఉండేవారు నాపద్ధతులన్నీ నచ్చాయి  ఆయన రిటైర్ అయిన తర్వాత అప్పుడప్పుడు బేజ వాడలో కలిసే వారు . కాకాని  నరసింహారావు బారుగా నల్లగాఉండేవారు .జగ్గయ్య పేటలో కాపురం .ఆక్కడినుండే మోటారు సైకిల్ మీద వచ్చేవారు .అక్కడ వ్యవసాయం  వ్యాపారం చాలా ఉన్నాయి .మనిషి మంచివాడు .స్నేహ శీలి .మన ప్రాంతం వాడే అవటం తో  బాగా సన్నిహితుడయ్యాడు . సైన్స్ సుందరరావు అప్పుడప్పుడు తన ఇంటికి ఆహ్వానించి టిఫిన్ కాఫీ  ఆఫర్ చేసేవాడు .శని వారం రాత్రి ఇంటికి  చేరే సరికి  రాత్రి తొమ్మిది దాటేది .పది హీను రోజులోసారి రుద్రపాక ఉదయానికే వెళ్లి చైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వర రావు గారిని కలిసి ఉయ్యూరు బదిలీ చేయమని  అడిగే వాడిని  .ఇక్కడ ఉంటున్నా ముళ్ళ మీద ఉంటున్నట్లే ఉండేది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-14-ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మొట్ట మొదటి ముస్లిం స్త్రీ వాద రచయిత్రి -రోకియా సఖావత్ హుసేన్

మొట్ట మొదటి ముస్లిం  స్త్రీ వాద రచయిత్రి -రోకియా సఖావత్  హుసేన్

బేగం రోకియాఅని అందరిచేతా పిలువబడే రోకియా సఖావాత్ హుసేన్ బెంగాల్ లో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మాత్రమె ఆక గొప్ప సాంఘిక సంస్కర్త కూడా . 9-12-1880లో ఈ నాటి బంగ్లా దేశ్ లోని రంగాపూర్ లోని మితాపూర్  దగ్గర పైరా బంద్ లో జన్మించింది .తండ్రి జహీరుద్దీన్ మొహమ్మద్ ఆబూ ఆలి హైదర్ సేబార్ పెద్ద జమీందార్ మాత్రమె కాక గొప్ప విద్యా వేత్త . రోకియాకు ఇద్దరు సోదరిలు ముగ్గురు సోదరులున్నారు .పెద్దన్న ఇబ్రహీం ,పెద్ద చెల్లెలు కరీమున్నీసా ల ప్రభావం ఈమెపైన ఎక్కువ గా ఉండేది .కరీమున్నీసాకు బెంగాలీ భాష లో చదువుకోవాలని ఉన్నా  తలి  దండ్రులకు మాత్రం ఆరేబిక్ ,పర్షియా భాషలల మాధ్యమం లో చదువు  నేర్వాలని కోరారు .ఇబ్రహీం తన ఇద్దరు చెల్లెళ్ళు రోకియా ,కరీమున్నేసా లకు  ఇంగ్లీష్ ,బెంగాలీ భాషలు నేర్పాడు .వీరిద్దరూ గొప్ప రచయిత్రులయ్యారు .

కరీమున్నీసా పద్నాలుగవ ఏటనే వివాహం చేసుకొని కవయిత్రి గా ప్రసిద్ధి చెందింది .ఆమె కుమారులిద్దరూ బ్రిటిష్ ప్రభుత్వం లో మంత్రులుగా పని చేశారు . రోకియా 1896లో పదహారవ ఏట ఉర్దూ భాషాభిమాని అయిన ఖాన్  బహదూర్ షెఖావత్ హుసేన్ ను వివాహ మాడింది .ఆయన భారత దేశం లోని బీహార్ రాష్ట్రానికి చెందిన భాగల్పూర్ జిల్లాకు డిప్యూటీ మేజిస్ట్రేట్ గా పని చేసేవాడు .భర్త ప్రోత్సాహం తో బెంగాలీ ,ఇంగ్లీష్ లను నేర్చుకొన్నది .ఆ నాటి జన సామాన్య భాష అయిన బెంగాలీనే ప్రధాన భాష గా ఎంచు కొని లోనే రచనలు చేయాని ,దానివలననే తన మనోభావాల వ్యాప్తి జరుగుతుందని భావించింది .1902లో మొదటి వ్యాసం ‘’పిపాస ‘’(దాహం )బెంగాలీ భాష లో రాయటం తో ఆమె రచనా రంగ ప్రవేశం చేసింది .

1909లో భర్త హుసేన్ మరణిస్తూ కొంత  డబ్బు తీసి ఉంచి ఆ ధనం తో  మహిళలకు  పాఠశాలను ఏర్పాటు చేయమనికోరాడు .ఆయన కోరికను తీరుస్తూ అయిదు నెలల తర్వాత ‘’సఖావ త్ మోరియల్ గర్ల్స్ హైస్కూల్‘’ను స్థాపించి  భర్త ఆత్మకు శాంతి చేకూర్చింది .ఇప్పటికీ ఈ విద్యాలయం విద్యా సేవ చేస్తూండటం ముదావహం . మహిళలు ధైర్యం గా ముందుకు రావాలని ,సంస్కరణలలో పాలుపంచుకోవాలని రోకియా అభిలషించింది .కాని ఆ నాటి సంప్రదాయ కుటుంబాలు అంత ధైర్యం చేయలేక పోయాయి .కనుక ఆమే ఆశించిన సంస్కరణ నెమ్మదిగా నే సాగింది

1916లో ‘’ముస్లిం మహిళా సంఘం ‘’ఏర్పాటు చేసి స్త్రీ విద్యకు ,ఉద్యోగానికి దోహదం చేసింది .1926లో కలకత్తా లో జరిగిన ‘’బెంగాలీ మహిళా విద్యా సదస్సు ‘’కు అధ్యక్షత వహించింది .దీనితో మహిళా విద్యా ప్రాదాన్యాన్ని  అందరికీ తెలియ జేసింది .ఇలాంటి ఎన్నో సదస్సులలో చర్చలలో పాల్గొని మహిళా హక్కులకోసం పోరాడిన ధీర వనితరోకియా బేగం .

.దీనితో రోకియా  మొదటి ముస్లిం స్త్రీ వాద మహిళా గా  గుర్తింపు పొందింది ..కొరాన్ లో చెప్పబడిన మత పద్ధతులను పాటించాలనే ఆమె  అందరికి  చెప్పేది ‘’.అంజుమాన్ ఏ ఖవాతీన్ ఏ ఇస్లాం ‘’ సంస్థ ముస్లిం లను పెడమార్గం పట్టిస్తోందని విమర్శించేది .జీవితాంతం త్తనుస్తాపించిన సూల్ అభి వ్రుద్ధికోసం కృషి చేస్తూ ,తన మనోభావ వ్యాప్తికి రచనలు చేసింది .9-12-1932న 52వ ఏట బేగం గుండె జబ్బుతో మరణించింది .ఆమె మరణించిన డిసెంబర్ తొమ్మిదవ తేదీని ‘’రోకియా దినం ‘’(రోకియా డే)గా బంగ్లాదేశ్ ప్రభుత్వం గౌరవం గా నిర్వహిస్తోంది ముస్లిం స్త్రీలు పరదా నుండి బయట పాడాలన్న ఆమె పోరాటం నెమ్మదిగా విజయ వంతమై అన్నిట్లో మహిళా ప్రాధాన్యత పెరిగింది .స్త్రీ సాంఘిక ఉన్నతి సాధించాలన్న ఆమె వాచితం నేర వేరింది .ఇంటింటి కీ  తిరిగి తలిదండ్రులను ఒప్పించి స్కూల్లో చేర్పించింది . స్కూలు లో కూడా పరదా ఉంటుందని నచ్చ చెప్పింది .

ముస్లిం మహిలలో  సాంఘిక భద్రత కలిపించటం ,వారిలో సాన్ఘియా సంస్కరణాభిలాష రగుల్కొల్పటం కోసం తీవ్రం గా రోకియా పని చేసింది .దీనికోసం కధలు ,వ్యాసాలూ ,నవలలు పుంఖాను పుంఖం గా రాసింది .బెంగాలీ భాష మాట్లాడే ముస్లిం మహిళల కస్టాలు ,సమస్యలు ,అణచ బడే మతాచారాలు  ఇస్లాం మతాన్ని స్వార్ధం కోసం వాడుకొనే వారి పట్ల అసహనం ,కనీస మానవత్వం చూపించని సంఘ పెద్దలను ఆమె రచనల్లో వ్యంగ్యం ,అధిక్షేపణ ,లతో అలిపి ఎండ గట్టింది .ముస్లిం పురుషులతో బాటు స్త్రీలూ సమాన హక్కులు కల్పించాలని పోరాడింది .మతం పేరిట ముస్లిం మహిళలను చదువుకు దూరం చేయటం ఆమె సహించలేదు .ఇస్లాం మతం లో మహిళలు చదువు కో కూడదని  ఎక్కడా లేదని తెలియ జెప్పింది .

పిపాస అనే వ్యాసం కాక మోతీచూర్  అనే రెండు సంపుటాల వ్యాసాలూ ,దేలీసియా హత్యా ,జ్వన్ ఫల్ ,నారీ సృష్టి ,నర్స్ నేల్లీ ముక్తిఫల్ ,సుల్తాన్స్ డ్రీం ,సావోగాట్ అనే పద్య సంపుటి ,పద్మరాగ్ అనే స్త్రీ వాద ధోరణి రచన ,అవరోధా భాషిని ,బోలిగార్తో అనే కధ ,నారీర్ అధికార్ ,గాడ్ గివ్స్ మాన్ రోబ్స్,ఎడ్యు కేషన్ ఐడియల్స్ ఫర్ దిమోడరన్ ఇండియన్ గర్ల్ ,మొదలైన వైవిద్య భరిత రచనలను కవిత్వం, కధలు ,నవలా ,వ్యాసం, లాజిక్ ,ఆలోచనసంస్కరణ,అభివృద్ధి ,ముందు చూపు ,సమానత్వం ,మహిళాహక్కు లను మేళవించి రాసింది

 

You have moulded me from childhood.. your love is sweeter than honey which after all has a bitter after-taste; it is pure and divine like Kausar [the stream of nectar following in heaven mentioned in the Qur’an].

The love and deep gratitude that Rokeya felt for this brother fill the dedicatory paragraph of her novel, Padmaraga: 

Inline image 1   Inline image 2  Inline image 3

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-14-ఉయ్యూరు

, .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇందర్ మల్హోత్రా మనో వేదన -చరిత్రలో నెహ్రు

చరిత్రలో నెహ్రూ – ఇందర్‌ మల్హోత్రా
జవహర్‌లాల్‌ నెహ్రూని అభిమానించని వారు వుంటారా? ఉంటారని గత కొన్ని దశాబ్దాలుగా చోటుచేసుకొంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నెహ్రూ వ్యక్తిత్వం, విధానాలపై అడ్డూ, అదుపూ లేని విమర్శలు ఇప్పుడు పరాకాష్ఠ నందుకొంటున్నాయి. యావజ్జీవితమూ దేశ సేవకు అంకితం చేసిన ఆ మహోన్నతుడితో పోల్చదగిన వారు అరుదు. జీవితకాలంలో ఆబాలగోపాలంచే ఎంతగా ప్రేమాదరాలు పొందారో అంతగా ఇప్పుడు ఆయన అపనిందలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర భారత ప్రథమ ప్రధానిని అప్రతిష్ఠ పాలుచేసే ప్రచారోద్యమ ఉధృతి పెరుగుతుందేగానీ తగ్గడం లేదు. నిజమే, నెహ్రూ గుణనిధి కాదు. సామాన్యులు, అసామాన్యులు అందరివలే ఆయనా తప్పులు చేసారు. కొన్నిసార్లు మహా ఘోరమైన తప్పులు చేశారు. ముఖ్యంగా చైనా విషయంలో చాలా పొరపడ్డారు. నెహ్రూ చేసిన తప్పులను తీవ్రంగా విమర్శించాల్సిందే.
అయితే స్వతంత్ర భారతదేశంలో అపమార్గం పట్టిన, అపసవ్యంగా జరిగిన ప్రతిదానికీ నెహ్రూను బాధ్యుడినిచేస్తూ ఆయన స్మృతిని కించపరచడానికి ఎడతెగని ప్రయత్నం చేయడం గర్హనీయం కాదా? అంగీకార యోగ్యంకాని ఈ దూషణోద్యమం వెనుక రెండు ప్రధాన శక్తులున్నాయి. మొదటి బృందంలోని వారు అమాయకులని చెప్పాలి. వీరిలో అత్యధికులు నెహ్రూ మరణాంతరం జన్మించిన వారు. స్వేచ్ఛావిపణిని, ప్రపంచీకరణను విశ్వసించేవారు. వలసపాలన నుంచి విముక్తమైన మరుక్షణంనుంచీ స్వేచ్ఛా వాణిజ్య విధానాలను అనుసరించనందుకు నెహ్రూను తప్పుపట్టే వీరికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశం ఎలా ఉండేదన్న విషయమై అవగాహన లేనివారు. రాజకీయంగా, ఆర్థికంగా, మరెన్నో విధాల భారత్‌ను అభ్యుదయ పథంలోకి నడిపించడంలో నెహ్రూ కృషి గురించి తెలియని తరమిది.
నెహ్రూని విమర్శించే రెండో బృందం వారు మొదటి వారికంటే మరింత ద్వేషపూరితంగా, పెడరసంగా వ్యవహరించ డంలో సుప్రసిద్ధులు. కరడు గట్టిన హిందూత్వ వాదులు ఈ బృందంలో అత్యధికంగా ఉన్నారు. నెహ్రూ లౌకికవాద సంస్కృతిని రూపుమాపడానికి వీరు ఎంతగా కష్టపడినప్పటికీ సఫలంకాలేకపోతున్నారు. ఈ వైఫల్యం వీరిని మరింతగా నెహ్రూ ద్వేషులుగా చేస్తోంది. భారతీయ జనతా పార్టీ సొంతంగా, స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావడంతో హిందూత్వ తీవ్రవాదులు మరింతగా చెలరేగిపోతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మతసామరస్యాన్ని దెబ్బతీసి ప్రజల మధ్య చీలికలు సృష్టించే ప్రకటనలు నిర్భయంగా చేస్తున్నారు. వారిని నిలువరించేవారు ఎవరూ కన్పించడం లేదు.

యోగి ఆదిత్యనాథ్‌, సాక్షి మహరాజ్‌ ఇత్యాది ద్వితీయ శ్రేణి నాయకులను అలా ఉంచండి. సాక్షాత్తు సంఘ్‌పరివార్‌ అధినేత, రాషీ్ట్రయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భగవత్‌ మహాశయుడు ఏమన్నారో చూడండి. ‘హిందుస్థాన్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువే’ అని ఆయన అన్నారు. హిందుస్థాన్‌లో నివసించేవారు హిందుస్థానీలని, వీరిలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు మొదలైన వారు ఉన్నారనే వాస్తవాన్ని ఎవరైనా ఈ పెద్ద మనిషికి దయచేసి తెలియజేస్తారా! ఈ మత సంకుచితత్వాన్ని నిరోధించడానికి ప్రధాని మోదీ ఇంతవరకు చేసింది చాలా స్వల్పం. అయితే తన అనుయాయులు, అభిమానులు మతం ప్రాతిపదికన హింసాత్మక ఘర్షణలను ప్రారంభించడంలో సఫలమయితే అభివృద్ధి సాధన గానీ, పాలనావ్యవహారాలను సజావుగా నడపడం సాధ్యం గాదనే సత్యం మోదీకి త్వరలోనే తెలిసివస్తుందని ఆశిస్తున్నాను. అయోధ్యలో రామాలయాన్ని నిర్దిష్ట గడువులోగా నిర్మించాలనే డిమాండ్‌ను వదిలిపెట్టేలా హిందూత్వ తీవ్రవాదులకు ప్రధాని మోదీ నచ్చజెప్పగలగడం భవిష్యత్తుపై ఒక ఆశావహ, ప్రోత్సాహకర భరోసాను కల్పిస్తోంది.
ఇదే సమయంలో మనం సిగ్గు పడాల్సిన పరిణామం ఒకటి చోటు చేసుకున్నదనే వాప్తవాన్ని విస్మరించకూడదు. గత ఆదివారం నాడు మోదీ మంత్రిమండలి విస్తరణలో బీహార్‌కు చెందిన బీజేపీ నాయకుడు గిరిరాజ్‌ సింగ్‌కు కూడా చోటు లభించింది! దీనినెలా అర్థం చేసుకోవాలి? గత వేసవిలో సార్వత్రక ఎన్నికల సందర్భంగా ‘మోదీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారికి భారత్‌లో స్థానం లేదు. వారిని పాకిస్థాన్‌కు పంపించి వేయాలి’ అని ప్రకటించింది ఈ గిరిరాజ్‌ సింగ్‌ మహాశయుడే కాదూ? ఆ అప్రజాస్వామిక ప్రకటనను గిరిరాజ్‌ ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. పైగా మరింత గట్టిగా పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు ఆ బెదిరింపు ప్రకటనను. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అప్పటి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌, గిరిరాజ్‌ సింగ్‌ ప్రకటనతో తమ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. అంతే గానీ తమ పార్టీ సభ్యుడిని ఏ విధంగానూ మందలించలేదు. చివాట్లు పెట్టకపోగా ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రిమండలిలో చోటు కల్పించారు!

ఈ నేపథ్యంలో మనం జవహర్‌లాల్‌ నెహ్రూ 125వ జయంత్యుత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ శుభ సందర్భంలో నెహ్రూ సమున్నత వ్యక్తిత్వం (ఆయన చేసిన తప్పులతో సహా) గురించి సర్వత్రా చర్చలు జరగకుండా ఎలా ఉంటాయి? జరుగుతున్నాయి కూడా. ఈ చర్చల ద్వారా, దేశ జనాభాలో మూడింట రెండు వంతులుగా ఉన్న 35 ఏళ్ళ వయస్సు లోపు యువజనులకు ఆ ఉదాత్త చరిత్ర నిర్మాత గురించి వాస్తవాలు తెలుసుకునే అవకాశం లభిస్తోంది. ఇది మాలాంటి వారికి ఎంతైనా సంతోషకరమైన విషయం. ఇప్పటికే పత్రికలు, టీవీల్లో జరిగిన చర్చల సారాంశాన్ని క్లుప్తంగా చెబుతాను. నెహ్రూ గురించి చాలా విమర్శలు చేశారు. వాటిలో కొన్నిటిని ఒప్పుకోక తప్పదు. అయితే చాలా విషయాలపై ఏకాభిప్రాయం ఉన్నది. మనకాలంలో మహాత్మా గాంధీ తరువాత ద్వితీయ మహోన్నత భారతీయుడు జవహర్‌లాల్‌ నెహ్రూ అనే విషయమై అందరూ ఏకీభవించడం వాటిలో చాలా ముఖ్యమైనది.
స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహోన్నతులైన నాయకులు ఇంకా పలువురు ఉన్నారు. వారందరూ మహాత్మాగాంధీ మార్గదర్శకత్వంలో దేశానికి సమర్థమైన నాయకత్వాన్ని సమకూర్చారు. వల్లభ్‌భాయ్‌ పటేల్‌, మౌలానా ఆజాద్‌, రాజాజీగా చిరస్మరణీయుడైన సి.రాజగోపాలాచారి తదితరులు వారిలో కొందరు. అయితే పటేల్‌ మినహా వీరిలో ఎవరూ నెహ్రూతో సమస్థాయి నేతలు కాదు. నిజానికి 1947 ఆగస్టు నుంచి 1950 డిసెంబర్‌ వరకు భారత్‌ను ‘పండిట్‌జీ’, ‘సర్దార్‌’గా ప్రజలు గౌరవించిన ఈ నాయకులిరువురూ పరిపాలించారనడం సత్యదూరం కాదు. అయితే దృక్పథం, భావజాలం, చివరకు పనిచేసే తీరుతెన్నుల్లో కూడా పరస్పరం పూర్తిగా భిన్నమైన వారు. తరచు తగాదా పడేవారు. కొన్నిసార్లు పరిపాలనకు సంబంధించిన అప్రాధాన్య అంశాలపై కూడా వారు విభేదించే వారు. అయితే దేశ సేవలో ఇరువురూ ఒకటై నిలిచేవారు. సరే, ఒక మౌలిక అంశానికి వస్తాను. మహాత్ముడు భారతదేశ విమోచకుడు. స్వతంత్ర భారతదేశ ఆధునికీకరణ కర్త నెహ్రూ. భారతదేశపు లౌకిక, సామ్యవాద ప్రజాస్వామ్య వ్యవస్థ సంస్థాపకుడు. శాస్త్ర సాంకేతికరంగాల అభివృద్ధికి పునాదులు వేసిన దార్శనికుడు నెహ్రూ. నెహ్రూ ఆర్థిక విధానాలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. అది చాలా విస్తృతమైన, ప్రత్యేకంగా చర్చించవల్సిన అంశం. అయితే ఆర్థిక రంగంలో నెహ్రూ సాధించిన విజయానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తాను. బ్రిటిష్‌ వలసపాలనలో 1857 నుంచి 1947 వరకు భారతదేశపు వార్షిక వృద్ధిరేటు 0.7 శాతం మాత్రమే. నెహ్రూ తన పదిహేడేళ్ళ పరిపాలనలో మొదటి నుంచి చివరి వరకు ఆ వృద్ధిరేటును 3 శాతానికి పెంచారు. ప్రధానమంత్రి పదవిలో నెహ్రూవారసులు మరింత అధిక వృద్ధిరేటును సాధించడంలో విఫలమైతే, అందుకు ఆయన్ని తప్పుపట్టకూడదు.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎవరూ ఎవరికీ పోటీకాదు – ఎనభై ఏళ్ళ గాన కోకిల సుశీల

ఎవరూ ఎవరికీ పోటీకాదు

స్వరబద్ధమైన సంగీతంలోని నాద సౌందర్యమే శ్రావ్యత. నాద శ్రావ్యతకు పాములు కూడా తలలు ఆడిస్తాయని చెబుతారు పెద్దలు. అట్లా, చెవుల్లో అమృతపు చుక్కలు పడ్డట్టుగా గానం చేయగలిగిన గాయని పులిపాక సుశీల. తన తీయని గానంతో కొన్ని తరాల తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సుమధుర గాయనీమణి. 60 ఏళ్లుగా పాడుతున్నా, వన్నె తగ్గని సుస్వరలయ విన్యాసం సుశీల. నేడు ఆమె 80వ పుట్టినరోజు.
సుశీల జన్మదినోత్సవం తెలుగు సినిమాసంగీత ప్రియులకు పండుగ రోజు. అది.. చెన్నైలోని ఆళ్వారుపేటలో ఒక ప్రశాంతమైన వీధి. ఆ మూలనున్న విశాలమైన ఇంట్లో పి.సుశీల సాదరంగా ఆహ్వానించారు. తన అంతరంగాన్ని ఆవిష్కరించారు..

‘‘మాది విజయనగరం. నా తల్లిదండ్రులే నాకు తొలి సంగీత గురువులు. మా నాన్నగారు పులిపాక ముకుందరావు న్యాయవాది, కళాప్రియులు. అమ్మ శేషావతారం కూడా సంగీతాభిమాని. అప్పట్లో విజయనగరం వచ్చిన కళాకారులు ఎవరైనా మా ఇంట ఆతిథ్యం స్వీకరించవలసిందే! ఇక నాన్న స్వయంగా వీణ విద్వాంసుడు కూడా. అలా నాన్న నాకు వీణ పాఠాలు కూడా నేర్పించారు. ఆ తరువాత మురారి అనే గురువు వద్ద నేను సంగీతంలో శిక్షణ పొందాను. చాలా చిన్నతనంలో సినిమాలలో పాడడంతో ఈ ప్రయాణం ఇలా కొనసాగింది. 1951లో చెన్నై ఆకాశవాణిలో రేడియో అన్నయ్య, అక్కయ్య నిర్వహించే బాలానందంలో నేను సభ్యురాలిని. ఆ సమయంలో ఒక చిన్న పిల్లల సినిమాలో పాడడానికి నిర్మాతల కోరికపై రేడియో కేంద్రం నుంచీ ఐదుగురిని పంపించారు. అందులో సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు నన్ను ఎంపిక చేశారు. అట్లా సినిమాలకు పాడడం మొదలైంది. ప్రకాష్‌ స్టూడియోలో ‘లావొక్కింతయు లేదు’ అన్న పోతన పద్యం పాడాను. ఎవీఎం వారి ‘భక్తప్రహ్లాద’ సినిమాలో పాడే సమయంలో నటి రోజారమణి కూడా రోజూ వచ్చి పాట ఎలా పాడుతున్నామో చూసేది. భావం ఎలా పలకాలో, ఎలా నటించాలో నేర్చుకునేది. తనకప్పటికి ఆరేళ్ళుంటాయ్‌ అంతే.
మరోలా నాన్న ఆలోచన…
నేను సినిమా గాయని కావడం నాన్నకు ఇష్టం లేదు. శాస్ర్తీయ సంగీత కళాకారిణిగా నన్ను చూడాలన్నది ఆయన కోరిక. అందుకే నన్ను స్వయంగా వెంటబెట్టుకుని డీకే పట్టమ్మాళ్‌ ఇంటికి కూడా తీసుకెళ్లారు. ఆవిడతో నేను సినిమాలకు పాడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. అందుకు పట్టమ్మాళ్‌ బదులిస్తూ, మంచి స్వరం పాడనీయండి అన్నారు. సంగీత ప్రపంచంలో అప్పటికే పేరు పొందిన డీకే పట్టమ్మాళ్‌, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి వంటివారు ఉన్నందున ఆ దేవుడు నన్ను సినిమా ప్రపంచంవైపు పంపించి ఉంటాడనుకుంటాను. సినిమాల్లోకి రాక ముందే మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారికి కూడా నా పాట వినిపించారు నాన్న. ఆయన కూడా సినిమాల్లో పాడడం మంచిదేనన్నారు. చివరికి ఆయనతో కలిసి పాటలు కూడా పాడాను. ఇదంతా నా పూర్వజన్మసుకృతం. ఇలా జరుగుతూ ఉండగా, ఏవీఎం వారి సరస్వతి స్టోర్‌ మేనేజర్‌ ద్వారా ఏవీఎం స్టూడియోలో కాంట్రాక్ట్‌ లభించింది. 1953 నుంచీ 57 వరకూ నెలకు రూ. 500 వేతనంపై ఏవీఎంలో పాడాను. అంతకు ముందే ‘వద్దంటే డబ్బు’ తదితర చిత్రాల్లో చాలా వాటిలో పాడినా, ఏవీఎం వారి సినిమాలతో నా గొంతు అందరికీ తెలిసింది. గుర్తింపు వచ్చింది. తరువాత వరుసగా జెమినీ, వాహిని, గోల్డెన్‌, వాసు, విక్రమ్‌, శారద, ప్రకాష్‌, అన్నపూర్ణ సంస్థల్లో పాడడం జరిగింది. తమిళం-తెలుగులో నిర్మించిన ‘కన్నతల్లి’ సినిమాలో ఏఎం రాజాతో కలిసి ‘ఎందుకు పిలిచావెందుకు’ అనే మొదటి యుగళగీతం పాడాను. అప్పటికి ఘంటసాల గారిని చూడలేదు. ఆయన మా ప్రాంతం వారేనని, ఆయనతో కలిసిపాడేటపుడే తెలిసింది. విజయనగరంలో మీ ఇంటికి వచ్చేవాడిని, మీ ఇంట్లో ఉన్న రేడియోలో పాటలు వినడం కోసం చాలామార్లు మీ ఇంటికి వచ్చానని ఆ తరువాత ఘంటసాల గుర్తు చేసుకునేవారు. ఆయనతో కలిసి కొన్ని వందల పాటలు పాడగలగడం అదృష్టం.
నేను ఇంత గొప్ప గాయనిగా నిలదొక్కుకోవడానికి నా తల్లి శిక్షణే కారణం. జన్మతః వచ్చిన నా గాత్రానికి సినీరంగం నగిషీలు చెక్కింది. పెండ్యాల నాగేశ్వరరావు హస్తవాసి నన్ను ఈ స్దాయికి చేర్చింది. 60 సంవత్సరాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, సింహళ భాషాల్లో పాటలు పాడుతున్నా. నా సంగీత దర్శకులు ఆశించిన మేరకు పాడి వారిని ఒప్పించడం నా భాగ్యం.
పాతనీరు పోయి కొత్త నీరొస్తుంది

మాకు ఎవరితోనూ పోటీలేదు. సినిమా ప్రపంచం ఒక సముద్రం లాంటిది. అలలు వస్తూపోతూ ఉన్నట్లే, కళాకారులు కూడా, ఎవరూ ఎవరికీ పోటీ కాదు. నా స్వరం వేరు. ఎస్‌.జానకి స్వరం వేరు. మేం పాడిన పాటలు వేరు. నా తరువాత 1957 ప్రాంతంలో జానకి సినిమాల్లోకి వచ్చారు. ఎవరి పాట వారిదే. పాతనీరు పోతూ ఉంటుంది, కొత్తనీరు వస్తూ ఉంటుంది. ఆ కాలంలో జిక్కీ, లీల, ఎంఎల్‌ వసంతకుమారి వంటి ఎందరో గొప్పగాయనీమణులు ఉండేవారు. అందరికీ వారి పాటలు వారికి ఉండేవి. పోటీ అనడం నాకు ఇష్టం లేదు.
పెద్దగా చదువుకోలేదు…
తెలుగులో సహా ఇతర భాషల్లో పాడాలని ఉంటుంది. కానీ అవకాశాలు రావాలి కదా. నాకు సంగీతం తప్ప ఏ ఇతర భాషా రాదు. పెద్దగా చదువుకోలేదు. కనీసం విద్వాన్‌ పూర్తి చేద్దామని అడయారులోని కాలేజీలో చేరా. ఆరు మాసాలకే ఆ ముచ్చటా ముగిసిపోయింది. ఒకసారి ఓపి నయ్యర్‌ సారథ్యంలో ‘నయాదౌడ్‌’ హిందీ సినిమా తమిళ్‌ డబ్బింగ్‌ కోసం ముంబయి వెళ్లా. అక్కడ నా గొంతు విన్న మరో దర్శకుడు నన్ను హిందీలో పాడమన్నారు. కాంట్రాక్ట్‌ సంతకం చేయమన్నారు. కానీ భాష రాదు, అప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషలలో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఎందుకు సాహసం చేయడం అని కుదరదని చెప్పేశాను. అప్పటికే అక్కడ గొప్పవారు చాలా మంది ఉండేవారు. వారి మధ్యలో నిలదొక్కుకోవడం కోసం పోరాటం ఎందుకు అనుకున్నాను.
పాడనన్నా పాడించారు…
1980ల తరువాత సినిమాలో వేగం పెరిగింది. ‘గుగ్గు..గుగ్గు గుడెసుంది…’ వంటి పాటలు పాడనన్నా, నాచేత పాడించారు. అవి మరో తరం ప్రేక్షకులకు నన్ను దగ్గర చేశాయి. సంగీత దర్శకులు చక్రవర్తినన్ను మాస్‌ ప్రేక్షకులకు దగ్గర చేశారు. ఎందరో మహానుభావులు పెండ్యాల, ఘంటసాల, అశ్వథామ, గోపాలం, రాఘవులు.. ఇలా చాలా మంది ఉన్నారు. అందరూ నన్ను ఆదరించి ప్రోత్సహించారు. అప్పట్లో దర్శకులు కె.విశ్వనాథ్‌ మేం పాడే పాటలను రికార్డు చేసేవారు, అలాగే కె.రాఘవేంద్రరావు ప్రకాష్‌ స్టూడియోలో లాగులతో తిరగడం చూశాను. వారు ఆ తరువాత గొప్ప దర్శకులుగా మారడం అందరికీ తెలుసు. అలాగే విజయనిర్మల. తను దగ్గరుండి ఏం కావాలో పాడించుకుంటారు. ‘సింహాసనం’ సినిమా హిందీలోనూ నన్నే పాడమన్నారు. సరే చూద్దాం! అనుకున్నా, చివరికి నాచేతే పాడించారు. కిషోర్‌కుమార్‌తో కలిసి పాడాను. పరభాషలో పాడుతున్నపుడు పాటలో లీనమై పాడడానికి కృషి చేస్తాను. అందువల్ల ఉచ్చారణ దోషాలు లేకుండా పాడగలుగుతాను. ఒక విషయం చెబుతా, బీఎన్‌ రెడ్డిగారి ‘బంగారుపాప’ చిత్రం కోసం ఓ ఏడుపు పాట పాడాను, వాహినీ స్టూడియోలో పాట రికార్డింగు తరువాత రెడ్డిగారు ఏడుస్తూ బయటికి వస్తున్నారు. నేను నవ్వుతూ ఉన్నాను. నన్ను చూసి, ‘ఏమ్మా, అక్కడ ఏడుస్తూ పాడావ్‌.. ఇక్కడ నవ్వుతున్నావ్‌’ అన్నారు. అలా పాటల్లో లీనమై పాడేవారం. కేవీరెడ్డిగారు కూడా అంతే మన తెలుగు అమ్మాయి అన్న భావనతో ‘దొంగరాముడు’లో పాడించారు. అక్కినేని నాగేశ్వరరావు ‘సుశీల మా ఇంట్లో మనిషే’ అనేవారు. అవన్నీ మరచిపోలేని మధురజ్ఞాపకాలు.
రెండుతరాలకు పాడుతున్నా..
నటి జయచిత్ర తల్లి అమ్మాజీ నటించిన సినిమాలో ఆమెకు పాడాను. అలాగే జయచిత్రకు కూడా పాడాను. ఎస్పీ బాలుతో, ఆయన కుమారుడు చరణ్‌తో కలిసి పాడాను, జె.ఏసుదాసుతో, ఆయన కుమారునితో కలిసి పాడాను. ఇలా రెండు తరాల వారితో కలిసి పనిచేయడం అదృష్టమే కదా! ఇంతకాలంగా నా పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ‘ఆంధ్రజ్యోతి’కీ నా ధన్యవాదాలు.

తియ్యదనం, మృదుత్వం కలబోస్తే…
తెలుగు కొమ్మల్లో పుట్టి తెలుగుపాటకు పరమోత్కృష్ట స్థాయి తెచ్చిన కోయిలమ్మ సుశీల. ఈ గానకోయిల పాటల్ని వెతకడ మంటే… వసంతంలో వొగలు పోయే వేలాది పువ్వుల్ని కోయటమే. జలధిలోని ముత్యపుచిప్పల్ని ఏరుకోవటమే. అయినా జాబిలమ్మ పోసే వెన్నెల లాలలో ఎంతసేపు ఉంటే మనకి సేదతీరుతుందీ? సుశీలమ్మ పాటలూ అంతే! ఒకటి విన్నాక మరొకటి వినాలనే తలంపు కలుగుతుంది. ఆ తర్వాత పల్లవీ మాధుర్యం నుంచి చరణాల్లోకి లాగిన్‌ కావాల్సిందే. సుశీల పాటలప్రవాహం వెంబడి చిన్నపిల్లల్లా ఆడుకుని గెంతులేయాల్సిందే. చిన్నతనంలో ఆకాశవాణి పాటలపోటీల్లో పాల్గొని పదిహేడవ యేట చిత్రరంగంలోకి వచ్చిన సుశీల అతి తక్కువ కాలంలో పాపులర్‌ అయ్యింది. సున్నితమైన, సౌకుమార్యమయిన ఆమె గొంతుకు వీరాభిమానులు పుట్టుకొచ్చారు. సోలో పాటల్లో అలతి అలతి పదాల్ని ఎంత హాయిగా పలుకుతుందో యుగళగీతాల్నీ, హుషారెత్తించే పాటల్నీ భావయుక్తమైన ఆలాపనల్ని, భక్తిరసాలని అంతే అద్భుతంగా పాడటంలో సుశీల దిట్ట. 1969లో తొలిసారి భారతప్రభుత్వం జాతీయ ఉత్తమ సింగర్‌ అవార్డులు ప్రవేశపెడితే ఉత్తమగాయని అవార్డు సుశీలకే దక్కింది,. ఉత్తరాదికి లతాజీ ఎలాగో దక్షిణాదికి సుశీలమ్మ అలాంటి వారు. తెలుగుసినీ ఆమనిలో ఎన్నికొత్త గొంతుకలు వచ్చినా సుశీలమ్మ గాత్రానికి తిరుగులేదనేది నగ్నసత్యం. పాడమని నన్నడగవలెనా అంటూనే ‘ఆకులో ఆకునై..’ అంటూ ప్రకృతిలో విహరింప చేసిన ఆ గానం ‘నిన్నటిదాకా శిలనైనా’ అంటూ మరో లోకంలోకి తీసుకెళుతుంది. ‘పాడవోయి భారతీయుడా..’, ‘గాంధీ పుట్టినదేశమా’ అంటూ సుశీల గాత్రం దేశభక్తిని నింపుతుంది. ‘ముత్యమంతా చాయ’ అంటూ వేకువజామును తీసుకొస్తుంది. ‘స్వాతిముత్యం’ చిత్రంలో ‘లాలీ లాలీ’ అంటూ నిద్రపుచ్చుతుంది. అదీ సుశీలపాటకున్న మహత్యం. ‘గోదారిగట్టుంది’, ‘మొక్కజొన్నతోటలో’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’, ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ అంటూ హుషారెక్కిస్తాయి సుశీల పాటలు. ‘ఇది మల్లెల వేళయనీ’ అంటూ హాయిగొలిపే ఆ స్వరం ‘వ్రేపల్లియ యద ఝల్లున పొంగిన రవళి’ అంటూ భావుకత్వాన్ని పొంగిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సుశీల పాటలు అనంతం. దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఒరియా, బెంగాళీ, తుళు, సింహళ భాషల్లో దాదాపు 50 వేల గీతాలు ఆలపించిన సుశీలకు అవార్డులు, రివార్డులకు కొదవలేదు. భారత ప్రభుత్వం 2008లో పద్మభూషణ్‌తో సత్కరించింది. సుశీల ‘జీవనతరంగాలు’ చిత్రంలో ‘పుట్టినరోజు పండుగే అందరికీ… మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికో’ అని ఆలపించారామె. ఇలా.. భారతీయశ్రోతల్ని, సంగీతప్రియుల్ని మైమరపించిన గానసరస్వతి సుశీల.

మాకు ఎవరితోనూ పోటీలేదు. సినిమా ప్రపంచం ఒక సముద్రం లాంటిది. అలలు వస్తూపోతూ ఉన్నట్లే, కళాకారులు కూడా, ఎవరూ ఎవరికీ పోటీ కాదు. నా స్వరం వేరు. ఎస్‌.జానకి స్వరం వేరు. మేం పాడిన పాటలు వేరు. నా తరువాత 1957 ప్రాంతంలో జానకి సినిమాల్లోకి వచ్చారు. ఎవరి పాట వారిదే. పాతనీరు పోతూ ఉంటుంది, కొత్తనీరు వస్తూ ఉంటుంది. ఆ కాలంలో జిక్కీ, లీల, ఎంఎల్‌ వసంతకుమారి వంటి ఎందరో గొప్పగాయనీమణులు ఉండేవారు. అందరికీ వారి పాటలు వారికి ఉండేవి. పోటీ అనడం నాకు ఇష్టం లేదు.

మన్నవ గంగాధరప్రసాద్‌, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -80 శ్రీ తిరుపతమ్మ సన్నిధి పెనుగంచిప్రోలులో

నా దారి తీరు -80

శ్రీ తిరుపతమ్మ సన్నిధి పెనుగంచిప్రోలులో

ఉయ్యూరు నుంచి పెనుగంచిప్రోలుకు వెళ్ళాలంటే విజయవాడ వెళ్లి ,నందిగామ ,మీదుగా వెళ్ళాలి .లేకపోతె జగ్గయ్య పేట దగ్గర చిల్ల కల్లు అనే హైదరాబాద్ రూట్ లో ఉన్న సెంటర్ నుంచి మక్కపేట మీదుగా వెళ్ళవచ్చు .నేను జాయిన్ అవటానికి వెళ్ళినప్పుడు నందిగామ నుంచే వెళ్లాను .అక్కడ హెడ్ మాస్టారు నేనెప్పుడో  బాడ్మింటన్ ఆటల్లో చూసిన ఏం .ఆంజనేయులుగారు .ఎర్రగా చాలా ఎత్తుగా తెల్లని గ్లాస్గో పంచె ,చొక్కా తో ఉండేవారు .చొక్కాకి గుండీలు పెట్టేవారు కాదు. కంకిపాడు దగ్గర గొడవర్రు స్వగ్రామం .మంచి వాలీబాల్ ,బాడ్మింటన్ ప్లేయర్ .వీటికి తోడూ చెస్ అంటే విపరీతమైన క్రేజ్ .పేకాట సరే సరి .ఫిజికల్ సైన్స్ టీచర్ .ప్రమోషన్ పై హెడ్ మాస్టారుగా ఇక్కడికి వచ్చారు .సరదా మనిషి ఈజీ గోయింగ్ వారు .,ఇది కమ్మ టూరు .శ్రీ తిరుపతమ్మ దేవత అమ్మ వారి ఆడ బడుచు .కృష్ణా  జిల్లాలో గొప్ప తిరుణాల ఇక్కడే జరుగుతుంది .శక్తిగల దేవత గా ప్రసిద్ధి .మునేరు నది ఒడ్డున ఆలయం ఉంది .నదిదాటితే  మరో ఊరు వస్తుంది . అక్కడా హైస్కూల్ ఉంది .

పెనుగంచి ప్రోలు హైస్కూల్ పెద్దదే .దాదాపు అయిదు వందల ,మంది విద్యార్ధులున్నారు అన్నీ డబల్ సేక్షన్లే.కింది తరగతుల్లో మూడు నాలుగు సెక్షన్లు ఉన్నాయి .ఒక పెద్ద బిల్డింగ్ ,దానికి  ఆనుకొని రేకుల షెడ్లూ ఉన్నాయి .వీటిలో లోయర్ క్లాసులు ఉండేవి .సుందరరావు అనే ఫిజికల్ సైన్స్ మేష్టారు స్తానికుడే .సబ్జెక్ట్ లో ఏమీ దమ్ము లేనివాడు .క్లాసుకు  వెళ్లి పాఠం చెప్పాలంటే విసుక్కొనే వాడు .లాబ్ కూడా పెద్దదికాదు .దాదాపు విద్యార్ధులందరూ కింద కూర్చోవటమే .సెక్షన్ కు కనీసం యాభై మంది ఉండేవారు .ఆడపిల్లలకు విడిగా సెక్షన్లున్నాయి .కింద కూచుని పైకి లేచే ఆడపిల్లలను చూస్తుంటే జాలి వేసేది .చదువు ఇక్కడ చాలా తక్కువే .నేను పది ,తొమ్మిది ఎనిమిది తరగతులకు ఫిజికల్ సైన్స్  చెప్పేవాడిని .ఇంగ్లీష్ కూడా టెన్త్ కుచెప్పేవాడినని జ్ఞాపకం  .పిల్లలకు ఏమీ రాదు కనుక మనం ఏమీ చెప్పక్కర లేదని అందరి మేస్టార్ల అభిప్రాయం .

లెక్కల మేష్టారు ఆచార్యులు గారు నాతొ పాటే భుజబల పట్నం దగ్గర ఉండే హైస్కూల్ నుండి బదిలీపై వచ్చారు .ఉయ్యూరు దగ్గర కపిలేశ్వర పురానికి చెందినా సాయిబు గారుకూడా లేక్కల టీచర్  .ఇంకో ఆతను వెంక టేశ్వర్లుకూడా  ఉండేవాడు .మంచి వాడు . బ్రాహ్మణుడు రోజూ బేజా వాడ నుండి వచ్చేవాడు . .సోషల్ మేస్టర్ లలో ఎవరూ గుర్తులేరు .తెలుగుకు ఒక శాస్త్రి గారుపంచె చొక్కా ,పిలకా తో ఉండేవారు .భార్యా విధేయుడని పేరు .కలతల కాపురం అని చెప్పుకునే వారు .పింగళి లక్ష్మణ రావు అనే తెలుగు ఏం .ఏ .జూనియర్ తెలుగు పండిట్ .కాకాని నరసింహా రావు ,దాసుగారు ,సుందరీ గ్రేడ్ టీచర్లు .దాస్ గారు జిల్లా లో పేరుమోసిన బాడ్మింటన్ ప్లేయర్ .వాలీ బాల్ ఆటగాడు కూడా . క్రాఫ్ట్ మేష్టారు వెంకటేశ్వర రావు నల్లగా బారుగా ఉండేవాడు .డబ్బు వడ్డీలు తిప్పేవాడు .మేస్టర్లకు అప్పు లిచ్చి ఒకటో తేదీ జీతాల రోజున కాబూలీ వాలా లాగా అయిదు రూపాయల వడ్డీ తో గోళ్ళు ఊడ కొట్టి లాక్కునే వాడని అనుకొనే వారు .గార్దేనర్ గా భర్త చనిపోయిన ఒక  అమ్మాయి ఉండేది .ఆమెకు క్రాఫ్ట్  కూ’’ ఏదో ఉందని ‘’గుసగుసలున్దేవి .డ్రిల్ మేష్టారు గా కాకాని రంగయ్య గారు చాలా వృద్ధులు .పంచ చొక్కా తో ఉండేవారు .లోకల్ కాంగ్రెస్ లీడర్ .గోపయ్య గారనే పెద్దాయన డ్రాయింగ్ ?టీచర్ గా ఉండేవాడు .ఈయనదీ పంచె కట్టే .మామిడి వెంకటేశ్వర రావు డ్రిల్ మేష్టారు కుర్రాడు మంచిప్లేయర్ .తమిరిస నుంచి వెంకటేశ్వర రావు అనే వెడల్పు ముఖం ఉన్న ఒక కుర్రాడు చెవుల పోగులతో గొల్లతను లాబ్ అసిస్టంట్ గా ఉండేవాడు .ఇక్కడికి వచ్చి ఎదేనిమిదేళ్ళయిందని చెప్పేవాడు .అలాగే ఆక్కడి నుంచే వచ్చిన ఒక క్రాఫ్ట్ మేష్టారు మంచి ఆంజనేయ భక్తుడు .ఏ రోజుకా రోజు మళ్ళీ వెళ్ళిపోతా నని చెప్పేవాడు ‘’ఇన్ ఫ్లు ఎంషియల్ పెర్సన్ ‘’ లా ఉండేవాడు . నాకూ అదే కోరిక ఉండేది .ఆయన ఎక్కువ కాలం ఉండ కుండానే   ట్రాన్స్ ఫర్  చేయించుకొని వెళ్ళిపోయాడు .

స్కూలు కు మంచి ప్లే గ్రౌండ్ ఉంది .మంచినీటి సరఫరా ,లైబ్రరి ,తోట ఉన్నాయి .సాయంకాలం ఆటలు ఆడేవాళ్ళం .ఊళ్ళో తిరుపతమ్మ దేవాలయమే కాక యోగానంద  నరసింహాలయం ,పాత శివాలయం మొదలైనవి ఉన్నాయి .ఒకప్పటి బౌద్ధ క్షేత్రం కూడా .తిరుపతమ్మ తిరుణాలు మూడు రోజులు జరిగే ఉత్సవం .ఎక్కడెక్కడి నుండో జనం తీర్ధ ప్రజల్లాగా చేరుతారు .మునేరు ఒడ్డున గుడారాలు వేసుఒని  వండు కొంటారు .పొంగళ్ళు వండి నైవేద్యం పెడతారు .నేను పని చేసినప్పుడు అంటే 1985లో అమ్మవారి గుడి చాల ఇరకుగా ఉండేది .ఇప్పుడు అన్ని వసతులతో సర్వాంగ సుందరం గా ఉంది .తిరుపతమ్మ ,ఆమె భర్త గోపయ్య విగ్రహాలుంటాయి .శివాలయం చాలా పాతది .అయిదు వందల యల్లా ఆలం నాటిది .కార్తీక  మాసం లో ఉత్సవాలు బాగా జరుగుతాయి .ఊరికీ దగ్గర లో పెద్ద చెరువు ఉంది .దీని నీళ్ళు వ్యవసాయానికి బాగా ఉపయోగ పడుతాయి .వరి పండిస్తారు .మెత్తచేలల్లో పోగాకు పండుతుంది .మినుము ,పెసర వేరు సెనగ కూడా పండుతాయి .యోగానంద నరసింహాలయం లో ప్రతి శుక్రవారం రాత్రి పూట పూజ  భజన ,పవళింపు సేవ  పాటలు భక్తిగా నిర్వహిస్తారు వైష్ణవ పూజారిగారు .ఆయన్ను అందరూ ‘’అయ్యా వారు ‘’అంటారు .రోడ్డుకు కొంచెం ఎత్తైన ప్రదేశం లో ఈ ఆలయం ఉంది .పూజారి గారు అక్కడే కాపురం .వ్రుద్దులైనా ఏంతో చదువుకొన్నవారు .గౌరవం మర్యాదా ఊరందరి చేతా పొందుతారు .  కొత్త వారెవరైనా బ్రాహ్మలు ఊర్లోకి  వస్తే ఆచార్యుల గారింట్లోనే భోజనం .అతిధి మర్యాద బాగా ఉన్న వారు .వీరు కాక పది బ్రాహ్మణ  కుటుంబాలున్నాయి .కోమట్లు కూడామంచి స్తితి పరులే .వ్యాపారం వారిదే .చిన్న భోజన హోటల్ ఉంది .ముందుగా చెబితే వంట చేసి పెడతారు .స్కూలుల్ కు వెళ్ళేదారిలో ఒక పాక లో  ఒక టిఫిన్ హోటల్ ఉండేది .ఉదయం టిఫిన్ ,కాఫీ మధ్యాహ్నం టిఫిన్ ,టీ అక్కడే బాగా బిజీ గా ఉండేది .

మెయిన్ రోడ్డు ఒకటే .బస్సులు ఈ మార్గం గుండానే గుడి దాకా  వెడతాయి .చెరువు ప్రక్కగా నందిగామ కు వెళ్ళే బస్సులు తిరుగుతాయి .మెయిన్ రోడ్డు మీదుగా మక్క పేట సెంటర్ కు చేరి చిల్లకల్లు మీదుగా జగ్గయ్య పేట  వెడతాయి .మెయిన్ రోడ్డు మీద ,దాని వెనకాల రోడ్డు మీదే బ్రాహ్మణుల కుటుంబాలున్నాయి .మెయిన్ రోడ్డు మీద ఉన్న బ్రాహ్మణులలో విష్ణుభొట్ల బాబు గారు బాగా సంపన్నులు. వేద విదులు .అనేక దేవాలయ ప్రతిస్ట లు  నిర్వహించిన  కర్మిష్టి.వారింటిలో ఒక  గది ని నాకోసం మా లాబ్ అటెండర్ మాట్లాడి ఉంచాడు .అద్దె యాభై రూపాయలని జ్ఞాపకం .అక్కడ కాపురం వగైరా ఈ సారి రాస్తాను .

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-11-14-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

”టెలి ట్రాన్స్ పోర్టే షన్”ద్వారా 40 సార్లు కుజుదిమీడకు వెళ్లి వచ్చిన ఇద్దరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి

అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి

కష్టాలకు కుంగిపోలేదామె. ఊరంతా అప్పులే అయినా ఏనాడూ ధైర్యం వీడలేదు. ఎన్నోచోట్ల చిన్నాచితక ఉద్యోగాలు చేసినా అవి ఆమె కుటుంబం కడుపునింపలేదు. దీంతో ఆటోడ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమె జ్ఞానాపురం నివాసి సిరిపురపు నర్సలక్ష్మి. ‘నువ్వు ఆటో నడుపుతావా..’ అంటూ కొందరు హేళన చేశారామెను.
మరికొందరు ‘నీవల్ల కాదం’టూ చులకన చేసి మాట్లాడారు. అయినా లక్ష్మి కుంగిపోలేదు. ఆటో నేర్చుకుని విశాఖ నగరంలో నేడు పలువురు మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడందరూ ఆమెను ఆటో లక్ష్మి అని పిలుస్తారు. తన జీవన ప్రయాణంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను లక్ష్మి ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘నాకు ఎర్రినాయుడుతో 1987 వివాహమైంది. పెళ్లికి ముందు నుంచే నా భర్త వ్యసనపరుడు. దీంతో చూస్తుండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. చివరకు మా పేరిట ఉన్న ఒక్క ఇల్లూ అమ్మేసి ఓ ఆటో కొన్నాడు. అది కూడా ఎన్నో రోజులు ఉండలేదు. మాకు ఓ కొడుకు పుుట్టాడు. అప్పటికి మా పరిస్థితి మరింత దిగజారింది. ఇల్లు గడవడం కష్టమయింది. మా అత్తగారు ఆడపడుచులు మమ్మల్ని ఎప్పుడూ ఆదుకునేవారు. కానీ ఎన్నాళ్లిలా? గత్యంతరం లేక నేనే ఓ హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ ఉద్యోగంలో చేరాను. అక్కడ నెలకు రూ.3,500 ఇచ్చేవారు. దుర్వ్యసనాలకు బానిసైన నా భర్తకు టీబీ సోకింది. ఒకరోజు నా భర్త ఎక్కడో పడిపోవడంతో వెన్నుపూసకు గాయమైంది. దీంతో పగలే కాదు రాత్రిపూట కూడా ఆస్పత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. హోటల్‌లో నెలకు మించి సెలవు ఇవ్వలేమన్నారు. దీంతో ఆ ఉద్యోగం పోయింది. రోజులు గడవడం కష్టంగా మారింది. తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేసి కొన్నాళ్లు గడిపాను.
బట్టల వ్యాపారం…
లక్ష రూపాయలు అప్పు చేసి బట్టల వ్యాపారం ప్రారంభించాను. అది కొన్నాళ్లు బాగానే గడిచింది. బట్టలు కొన్నవాళ్లు ఇన్‌స్టాల్‌మెంట్స్‌ సరిగా చెల్లించకపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. ఈ వ్యాపారం కోసం చేసిన అప్పు రూ.నాలుగు లక్షలకు చేరింది. దీంతో వచ్చిన కొంత ఆదాయం కాస్తా వడ్డీలకే పోయేది. నా భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించి గత ఏడాది మరణించాడు. ఒకపక్క బాబు చదువు, మరోపక్క ఇంటి నిర్వహణా ఖర్చులు నన్ను వెన్నాడేవి. ఏం చేయాలో పాలుపోలేదు నాకు.
ఆటో నేర్చుకోవాలనుకున్నాను…
ఒక టీవీ చానెల్‌లో నాలాగే కష్టాలు పడి చివరకు ఆటో డ్రైవర్‌గా మారి జీవితాన్ని చక్కదిద్దుకున్న ఒక వ్యక్తి గురించిన కార్యక్రమం చూశాను. అది నాకెంతో స్ఫూర్తినిచ్చింది. దాంతో నాకు ఆటో నేర్పించమని స్థానికంగా ఆటోలు నడుపుతున్న కుర్రాళ్లను అడిగాను. ‘మీరా ఆంటీ.. కష్టం నడపలేరు..’ అన్నారు వాళ్లు. చిన్నప్పటి నుంచి తెలిసిన ఓ అబ్బాయి నాకు నేర్పడానికి ముందుకొచ్చాడు. రోజూ రెండు, మూడు గంటలు చొప్పున నెల రోజుల పాటు ఆటో నడపడాన్ని బాగా సాధన చేసి నేర్చుకున్నాను. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేశాను. ఆర్టీఏ అధికారులు కూడా నన్ను ఎంతో అభినందించారు. నగరంలో ఆటో లైసెన్స్‌ తీసుకున్న తొలి మహిళ నేనని చెప్పారు.
డ్రైవింగ్‌ సరే..ఆటో మాటేంటి…
ధైర్యం చేసి ఆటో నేర్చుకున్నాను కానీ.. ఎవరూ ఆటోని అద్దెకిచ్చేందుకు సాహసించలేదు. సొంతంగా ఆటో కొనడం తప్ప మరో మార్గం కనిపించలేదు. కానీ సుమారు రూ.మూడు లక్షలు ఎక్కడి నుంచి తేవాలి నేను? మళ్లీ జీవితం మొదటికి వచ్చింది. అప్పుకోసం ప్రయత్నించాను. ఎక్కడకు వెళ్లినా ఆస్తులున్నాయా? హామీ ఎవరిస్తారు? అనే ప్రశ్నలు నాకు ఎదురయ్యేవి. ప్రభుత్వ సాయం దక్కదని అర్ధమైంది. గతంలో అప్పు ఇచ్చిన ఒకామె నా పరిస్థితి చూసి జాలిపడి నన్ను ఆదుకుంది.
తొలి రోజు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు..
ఆటో తీసిన మొదటి రోజు జ్ఞానాపురం జంక్షన్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు సుమారు ఐదు కిలోమీటర్లు సర్వీసు ప్రారంభించాను. ఆటోను 40 కిలోమీటర్ల వేగానికి మించి నడపలేదు. రోజూ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహం ఒంటి గంట వరకు.. తిరిగి మూడు నుంచి ఐదు గంటల వరకు ఆటో నడుపుతాను. ఎక్కువగా కాలేజీ యువతులు, మహిళలు నా ఆటో ఎక్కేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు నగర పరిధిలో 20 కిలోమీటర్లకుపైగా ఆటో నడపగలుగుతున్నాను. రోజుకు రూ.500 వరకు సంపాదించగలుగుతున్నాను. ఆటో ఫైనాన్స్‌ కట్టి మిగిలిన సొమ్ముతో ఇంటిని నడుపుతున్నాను. నా కొడుకు ఇప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. వాడు డిగ్రీ పూర్తి చేసి స్థిరపడితే నా జీవిత లక్ష్యం నెరవేరినట్టే.
వాసు, విశాఖపట్నం,
ఫొటోలు.. కోటేశ్వరరావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ రాజకీయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment