దీపం ఓ ఆధ్యాత్మిక మార్గం – కార్తీక దీపాలెందుకు?

 
 
 

దీపం యథార్థంగా పరమేశ్వర స్వరూపం. ఏ సహస్ర నామాన్ని చదివినా దానిలో అనేక నామాలుంటాయి. దానిలో పరంజ్యోతి అనే నామం కూడా ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. అలాంటి ఈశ్వరుడు స్త్రీయా, ఈశ్వరుడు పురుషుడా, నపుంసకుడా అని ఆలోచించండి. అసలు ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడూ కాడు. ఈశ్వరుడు కాంతి స్వరూపి. ఆయన ఎప్పుడూ మన వెనుక వెలుగుతూ ఉంటాడు. పోతనగారు భాగవత రచన చేస్తూ ఈశ్వరుడు, ” స్త్రీ, పురుష, నపుంసక ముక్తిలోకాక, క్రియ అక్రియ వరాహమూర్తియు కాక, .. వుండు తాను విభుతలంపు” అంటారు. మన వెనక ఉండి ప్రకాశిస్తూ మన శరీరాన్ని ఎంత కాలం నిలబడాలో అంత కాలం ఊపిరిని చిత్రంగా, గుప్తంగా నిలబెట్టి, ఆ ఊపిరి అయిపోగానే బయటికి వెళ్ళి శివాన్ని శవం చేసి పడగొట్టగలిగిన స్వరూపమే అది. అందుకే పూజ అంతా అయిపోయిన తర్వాత మంత్రపుష్పంలో ” నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా” అని చెబుతారు.

అంటే, ఈశ్వరుడు అణువంత రూపంతో ఇక్కడ ప్రకాశిస్తుంటాడు. ఆ కాంతి పైకి కిందకి పక్కలకి కొడుతోంది. దాన్ని ఏ పేరు పెట్టి పిలవాలి? ” సబ్రహ్మ సశివః సహరిః సేంద్రః సో¬క్షర పరమః స్వరాట్.” నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా ఈ కాంతి పలుకుతుంది. యథార్థానికి అది ఒక రూపం కాదు. అది ఒక కాంతి. అందుకే వెలుగుతోంది. భాస్కర అని దానికి పేరు. భా అంటే కాంతి. ఒక పెద్ద వెలుగు ముద్ద ఒకటి ఇక్కడ కూర్చుని ఉంది. ఆ వెలుగుల ముద్ద కాంతి కొడుతోంది. తిర్యగూర్ధమధశ్శాయా అని చెబుతున్నాం కదా…పైకి పక్కలకి, కిందకి కాంతి కొడుతోంది. ఆ కాంతే పరమేశ్వరుడు. నువ్వు సాకారం చేస్తే నువ్వు ఎలా కావాలంటే అలా కనబడతాడు. నిజానికి ఆయనకొక ఆకారమెక్కడుంది? ఆకారముండదు. అలాంటప్పుడు దేనిని పూజించాలనే సందిగ్ధత ఏర్పడుతుంది. దీనిని నివారించటానికే శంకరాచార్యులవారు వేదాంత డిండిమం చేస్తూ, “ఆకారంచ నిర్గుణంచ, సాకారంచ గుణంకరం తత్తం తత్తం…” అంటారు.

ఈ ప్రపంచంలో నిర్గుణం, సగుణం అని రెండు రకాలు ఉంటాయి. నిర్గుణంలోకి వెళ్ళాలన్నవాడు పరమ వైరాగ్యంలోకి వెళతాడు. సాధారణ ఉపాసన చేసేవాడు, బాహ్యప్రయోజనం కావాలనుకునేవాడు మనసు నిలబెట్టాలి కాబట్టి ఒక ఆకారాన్ని పూజ చేస్తాడు. యథార్థానికి అది ఒక కాంతిపుంజం. ఆ కాంతిపుంజమే దివ్వె. ఆ దీపమే పరమేశ్వర స్వరూపం. కానీ దానిని అర్థం చేసుకోవటం ఎలా? ఉపాసన చేసినప్పుడు మేఘంలో, ప్రవాహంలో, బురదలో, దుంగలో అంతటా ఈశ్వరుడే కనిపిస్తాడు. అంతటా పరమేశ్వర స్వరూపం చూడగలిగిన స్థితికి ఎదగగలిగితే దీపాన్ని అర్థం చేసుకున్నట్లు గుర్తు. ఈశ్వరుణ్ణి ఎక్కడ చూడాలి అంటే పూజా మందిరంలో కాదు. ఈ లోకమంతటా ఈశ్వరుడిని చూడగలగాలి. అందుకే రుద్రంలో, ” నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో” అంటారు.

కదలకుండా నిలబడి వింటున్నట్లు ఉంటే ఆకుపచ్చని చెట్టులో, ప్రతి ఆకులో పచ్చదనంలోను ఈశ్వరుడే కనబడాలి. ఆ దర్శనం పొందామనటానికి ప్రత్యక్ష ఉదాహరణ దీపం. ఎందుకంటే లోకంలో యథార్థం తెలియాలంటే దీపం ఒక్కటే సాధనం. మనకు ఒక పొడవైన తాడు కనిపించింది. కాని అది తాడో, పామో మనకు తెలియదు. అలాంటప్పుడు దీపం పనికొస్తుంది. అది తాడు అని పాము కాదని తెలిస్తే భయం పోతుంది. అందుకే ఆ తేజోరూపమైన పరమా త్మను నేను ఆరాధన చేస్తున్నాననే ఆంతర సంస్కారాన్ని పొందడానికి పది మెట్లు పైకెక్కి నిలబడి అంతటా ఈశ్వర దర్శనం చెయ్యగలిగిన మహోత్కృష్టమైన స్థితికి చేరుకోవటానికి ప్రతీక కార్తీక దీపం. అందుకే కార్తీక దీపం అని ప్రత్యేకంగా పిలుస్తాం. దీపం, దీప వైభవం తెలుసుకొని దానిని వెలిగించటం ఒక ఎత్తు. తెలియకపోతే కార్తీక పౌర్ణమినా డు దీపం వెలిగిస్తున్నప్పుడు, “దామోదరమా వాహయామి” లేదా “త్య్రయంబకమావాహయామి” అనాలి.

దామోదరుడు అంటే విష్ణు సంబంధమైన విషయం. త్రయంబకం అంటే శివ సంబంధం. మూడు లోకాలకు కూడా తల్లీ, తండ్రి అయి ఉంటాడు కాబట్టి త్రయంబకుడని పేరు. అటువంటి త్రయంబక స్వరూపమైన పరమశివుణ్ణి ఆవాహన చెయ్యాలి. అక్షతలు వేసి. పువ్వో, పసుపో, కుంకుమో వెయ్యాలి దీపం మీద. దామోదరుణ్ణన్నా పిలవాలి, త్రయంబకుణ్ణి అయినా పిలవాలి. అలా ఆవాహన చేసిన తర్వాత ఆ దీపాన్ని పైకెత్తి పట్టుకోవాలి. లేదా ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. (ఎమెస్కో బుక్స్ ప్రచురించిన కార్తిక మాస వైభవం పుస్తకం నుంచి)

కార్తీక దీపాలెందుకు?

 

 

 
 
 

శంకరాచార్యులవారు దక్షిణామూర్తి స్తోత్రంలో, “నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాద్వీప ప్రభా భాస్వరం, జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే” అంటారు. “ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను అయిదు ఇంద్రియాలకూ నాయకురాలి లాంటిది. కన్ను లేకపోతే సుఖాలన్నీ చచ్చిపోయినట్లే. కన్నుంది కాబట్టే చాలా సుఖాలున్నాయి. అటువంటి కంటిని నాకిచ్చినందువల్ల నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, నా చెట్లని, పరమేశ్వరమూర్తిని, రామాయణాన్ని, ్రగంథాల్ని శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను. ఇవి చూసి ఎంత పొంగిపోతున్నానో ఈశ్వరా! ఈ కన్ను నాకిచ్చావు కాబట్టి ఇన్ని ఉన్నాయి, ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పటానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నాను” అనేది దీని అర్థం.

అందుకే మనం దీపం పెట్టి ఈశ్వరుడికి పూజను ప్రారంభిస్తాం. కానీ కాక్తీక మాసంలో పెట్టే దీపం అందుకోసం కాదు. ఈ మాసంలో పెట్టే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రాముఖ్యం ఉంది. కార్తిక సోమవారం పెట్టే దీపానికి ఒక ప్రాశ్తస్యం ఉంది. చంద్రుడు మొట్టమొదటి హోరలో ఉన్నటువంటి రోజున ప్రారంభమయ్యే రోజుకు సోమవారం అని పేరు. మనకి ఎప్పుడూ ఒక రోజులో ఎనిమిది హోరలు మూడు పర్యాయాలు తిరుగుతాయి. మూడు ఎనిమిదులు ఇరవై నాలుగు. మొట్టమొదటి హోర, అన్నిటికన్నా ప్రారంభంలో ఉండే హోర సూర్య హోర. తరువాత వచ్చేది శుక్ర హోర. తరువాత వచ్చేది బుధ హోర. తరువాత వచ్చేది చంద్ర హోర, తరువాత శని హోర, తరువాత గురు హోర, తరువాత కుజ హోర. ఎనిమిది హోరలు. అందుకే ఆ హోరలు మూడు ఎనిమిదుల ఇరవై నాలుగు పూర్తి, మళ్ళీ ఇరవై అయిదవ హోర వచ్చేటప్పటికి హోర ప్రారంభమవుతుంది కాబట్టి దానికా పేరు.

సోమవారం ఉందనుకోండి చంద్ర హోరతో మొదలవుతుంది. చంద్ర హోరతో మొదలవుతుంది కాబట్టి సోమవారం అని పిలుస్తాం దాన్ని. ఆదివారమనుకోండి సూర్య హోరతో ప్రారంభమవుతుంది. సూర్య హోరతో ప్రారంభమవుతుంది కాబట్టి ఆదివారం, భానువారం అని పిలుస్తాం. ఈ ఎనిమిదే ఇరవై నాలుగు గంటలలో పూర్తి అయిపోతాయి. అటువంటి రోజుల్లో సోమవారం నాడు చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసో జాతః అని పిలుస్తుంటారు. మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు. హృదయ స్పందనే మనుష్యప్రాణి జీవనం. గుండె ఎంతసేపు కొట్టుకుంటుందో అంతసేపు బతికివున్నాడంటారు. గుండె ఆగిపోయిందనుకోండి ఆయన వెళ్ళిపోయాడండీ అంటారు. ఈ గుండె కొట్టుకోవటం అనే దానికి హృదయంలో హృదయ నాడి అనే నాడి ఉంటుంది.

నాడి మీకు భౌతికంగా కనబడేది కాదు. అది ఈశ్వర తేజస్సును పొంది ఉంటుంది. దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు. ఆయన అన్రుగహమయిపోగానే హృదయనాడి మూసుకుపోతుంది. యమదంష్ట్ర బయటకి వచ్చిన కారణం వల్ల ఆ కాలంలో హృదయనాడి మూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యమధర్మరాజు దేనికి ఎక్కువ ప్రీతి పొందుతాడంటే నువ్వుల నూనె వల్ల. నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు వత్తి నుంచి వచ్చే పొగ వాసన చూస్తే హృదయనాడి బలిష్ఠమవుతుంది. యమధర్మరాజు పీల్చి వదులుతాడు. ఆయుఃకారకమవుతుంది. హృదయనాడి నిలబడుతుంది. అందుకని దీపాలు పెడతారు. అందరినీ దీపం పెట్టండి అంటారు. ప్రతివారినీ దీపం పెట్టండంటూ కార్తీక మాసం ఉదయం దీపం, సాయంకాలం దీపం ఎందుకు పెట్టిస్తారంటే సమస్త భూతకోటికి ఉపకారం చెయ్యమని. వాతావరణంలో ఆరోగ్యకరమైన వేడిని పెంచమని. బాహ్యంలో ప్రతిపాదన చేయడానికి ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో గానీ పెట్టిన దీపమే పెట్టమని చెప్పటానికి వెనక ఉన్న తార్కికమైన కారణమది.

కార్తీక మాసంలో దీపాలు వెలిగించాల్సిన అవసరం గురించి, ఆ దీపాలకు ఆధ్యాత్మికంగా ఉన్న ప్రాధాన్యం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర రావు శర్మ ఈ వ్యాసంలో వివరిస్తున్నారు.
(ఎమెస్కో బుక్స్ ప్రచురించిన కార్తిక మాస వైభవం పుస్తకం నుంచి)

ఉపనిషత్తుల్లో దీపం
దీపం గురించి ” న సూర్యోభాతి న చంద్రతారకం నేమా ద్యుతోభాతి కుతో….. త్వమేవ భాంతి మనుభాత సర్వం ఇతి భాసా సర్వమితవ్య భాసం” అని ఉపనిషత్తులు చెబుతాయి. పరమేశ్వరుడు ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకంటే ఆ వెలుగు ముందు ఈ వెలుగు పనిచెయ్యదు. కాబట్టి ఆయన ఒక్కరే ప్రకాశిస్తూ ఉంటాడు. అందువల్ల ప్రకాశిస్తున్న ఆ కాంతి పుంజమున్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. దీనినే పోతనగారు-
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగుపెం
జీఁకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్ అని వర్ణిస్తారు. ఇది భాగవతం అష్టమ స్కంధంలో ఉంటుంది. అందరూ మహా ప్రళయంలో పడిపోతే, కటిక చీకటి ఆవరిస్తే, సూర్యచంద్రుల గమనమాగిపోతే, ఈ కటిక చీకటికావల ఒక్కడు వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలిగిపోతున్న వెలుగుకు వెలుగైనదొక్కటున్నదే అది పరమేశ్వర స్వరూపం. దాన్ని నేను పిలుస్తున్నానంటాడు గజేంద్రుడు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రవాస తెలుగు వారికి అండదండలు

 

ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగువారికి భాషా వికాస పరిధిలో తగిన ప్రోత్సాహం అందించడానికి, భాషను వ్యాప్తి చేయడానికి అధికార భాషా సంఘం పెద్దయెత్తున కృషి ప్రారంభించింది.

దిగంతాలకు విస్తరించిన తెలుగుదనంలో అచ్చమైన తేటతెలుగు మాటలు తరిగిపోతున్నాయి. పలచబారిపోతున్న మన రాతకోతల తెలుగుపై రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన పలుకుబడి, నుడికారం ఎల్లెడలా పరివ్యాప్తి చెందేలా సరికొత్త ప్రయత్నాలు చురుగ్గా చేపట్టారు. 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత స్వరాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాలలోని తెలుగువారు కూడా సరైన తెలుగును తెలుసుకుని, దాని అభివృద్ధి కోసం పాటు పడే విధంగా ఆయన కృషి ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశాలోని బరంపురం, కర్నాటకలోని బళ్ళారి, మహారాష్ట్రలోని ముంబాయి వంటి ప్రధాన కేంద్రాలు, ఆయా రాష్ట్రాల పట్టణాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాల్లో కొత్తతరంలో తెలుగు వాడకం తగ్గిపోతుంటే, ఆందోళన తప్ప శిక్షణ, వినిమయంపై తగిన శ్రద్ధ, ఫలితాలు ఉండటం లేదని ఆయన గుర్తించారు.

భాషా సంఘం అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కావడంతోపాటు 2013ను తెలుగు భాష, సాంస్కృతిక సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా చేపట్టిన విధివిధానాలను సమర్థంగా అమలు చేయడానికి పెద్దయెత్తున కృషి ప్రారంభించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తమ భాషా సంఘం వారి అధ్యయనంతో పాటు, భవిష్యత్ కార్యాచరణకు అనువైన విధి విధానాన్ని సూచించే నివేదికను ఆయన సమర్పించారు. నలభై ఏడేళ్ళ క్రితం ఏర్పాటైన మన రాష్ట్ర అధికార భాషా సంఘంలో పనితీరులో ఫలితాలకన్నా చేయాల్సినవి చాలా ఉన్నాయని పేరుకుపోతున్న అలసత్వం వల్ల ప్రమాదకరమైన స్థాయిలో తెలుగు నుడి దెబ్బతింటోందని ఆయన భావిస్తున్నారు.
తాజాగా గత వారంలో దీపావళి పండుగ తర్వాత తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఆయన ప్రత్యేకంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని తెలుగువారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా అధికారికంగా కలసి ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన అంశాలతో పాటు, తమ పూర్వీకుల తెలుగు జాడలు, వారి వారసత్వం అందుకోవడంలో వెనుకబడిపోయామన్న ఆవేదన అక్కడి వారిలో వ్యక్తమైంది. తమ మాటపై పట్టు పెంచుకోవాలన్న ఆకాంక్ష ఉన్న ఆ తెలుగువారు తమను పట్టించుకోని ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా స్పందించారు. ఆ పర్యటనలోని విశేషాలను, తాము చేపడుతున్న చర్యలను మండలి బుద్ధప్రసాద్ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.

ప్రవాసుల సమస్యలు
“ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తెలుగువారిని కలిశాం. అక్కడ నివసిస్తున్న వారిలో అడుగడుగునా తెలుగుదనంపై అపారమైన ఆపేక్ష, అభిమానం, భావోద్వేగ అభిమానం కనిపించింది. సుమారు 800 ఏళ్ళ క్రితం తమిళనాడు ప్రాంతాల్లోకి వలస వెళ్ళినవారి కుటుంబాలకు చెందినవారి ఈ తరం ప్రతినిధులను కలుసుకున్నప్పుడు, తెలుగు మాట, అక్షరాలు నేర్చుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలోనే అంతంతమాత్రంగా ఉన్న తెలుగునుడి, వాడుకపై సమగ్ర విధానం లేని మనకు ఇతర ప్రాంతాల తెలుగువారి తపన కొత్త పాఠాలు నేర్పింది. నాలుగు రోజులపాటు నాతో పాటుగా మరి కొందరు భాషాభిమానులు చెన్నై ప్రాంతంలోని తెలుగు ప్రచార, ప్రసార మాధ్యమాల ప్రతినిధులు కలసి తెలుగువారి సాంస్కృతిక రాజధాని తంజావూరు ప్రాంతంలో పర్యటించడం జరిగింది. చెన్నై, పుదుచ్చేరిలలో తెలుగువారి సంగతులు గమనించిన మాకు ఇంకా ఇంకా కొత్త అనుభవాలు, అనుభూతులు కలిగాయి.

నాతో పాటు రాష్ట్ర ప్రాచ్యలిఖిత భాండాగారం సంచాలకుడు ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం, రెండుమార్లు తెలుగు రచయితల మహాసభలు నిర్వహించిన అనుభవం గల రచయిత డాక్టర్ జీవీ పూర్ణచంద్, తమిళనాడులోని తెలుగువారు, కళలపై లోతైన అధ్యయనం చేస్తున్న డాక్టర్ సగిలి సుధారాణి, అమెరికాలోని సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్, చెన్నై ఆకాశవాణి కేంద్రం నుంచి రచయిత నాగసూరి వేణుగోపాల్, మరికొందరు పాత్రికేయులు మా బృందంలో ఉన్నారు.

మా బృందం పర్యటన ప్రతిపాదన తెలియంగానే తమిళనాడు గవర్నర్ డాక్టర్ కె. రోశయ్య మమ్మల్ని ప్రోత్సహించి, అభినందించారు. మన తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పటానికి నాలుగేళ్ళ ముందే అప్పటి తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ చొరవతో ఆరంభించిన తమిళ విశ్వవిద్యాలయంలో రెండు రోజులు గడిపాం. తమిళ భాష వికాసం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భాషకు అన్వయిస్తున్న తమిళ యూనివర్సిటీలోని నిర్వహణ బా«ధ్యతల్లో తెలుగువారు చురుగ్గా ఉండటం మాకు ఆనందం, ఆశ్చర్యం కలిగించాయి. ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎం. తిరుమలై, రిజిష్ట్రార్ డాక్టర్ ఎన్.ఎస్. గణేశన్ ఇద్దరూ తెలుగువారే!
ఆ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకురాలు డాక్టర్ సిహెచ్. సావిత్రి సమన్వయకర్తగా పుస్తకాల అనువాదాలతో పాటు, ఆ రాష్ట్రంలోని తెలుగువారి జీవనంపై సమగ్ర అధ్యయనం కోసం చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనలను మన ప్రభుత్వానికి సమర్పించబోతున్నాం. తమిళ తల్లి విగ్రహంతో సహా అక్కడి భాషాభిమానులు చేసిన సృజన, పెంచుకుంటున్న పదజాలంతోపాటు ప్రపంచ తమిళ మహాసభలతో సహా పలు విషయాల్లో తమిళులు మనకన్నా ఎంతో ముందున్నారు. తమ రాష్ట్రం వదిలి ఇతర ప్రాంతాల్లో ఉన్న తమవారితో కొనసాగిస్తున్న సంబంధాలు, అందిస్తున్న ప్రోత్సాహం కూడా మనం అందుకుని పాటించతగినవి వున్నాయి. మన దేశంలో హిందీ తరువాత ఎక్కువమంది మాట్లాడే భాషగా తెలుగు ఉందని గర్వంగా చెప్పుకునే మనం ఆ తరువాత మోగుతున్న ప్రమాద ఘంటికలను మాత్రం పట్టించుకోవడం లేదు.

‘పరాయివారుగా చూడం’
మారుతున్న తరాల వల్ల ఇతర ప్రాంతాలలోని తెలుగువారు పరాయివారుగా మారిపోతున్నారు. తమిళనాడులో ఈ పరిస్థితి బాగా పెరిగిపోయింది. ఆ రాష్ట్రంలోని విద్యావిధానంలో ద్వితీయ స్థానంలో తెలుగు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించనట్టు ప్రవర్తిస్తున్నారు. మన రాష్ట్రంలో అధికార భాషగా రెండవ స్థానంలో ఉర్దూను గుర్తించి, ఆదరించి ప్రోత్సహిస్తున్న తీరులోనే తమిళనాడులో తెలుగు ఉండాలని మనం అంటున్నాం. కేంద్ర ప్రభుత్వం త్రిభాషా సూత్రం ప్రకారం కూడా తెలుగును కోరుకున్నవారికి బోధించాల్సిన వసతులు కల్పించటం ఆ రాష్ట్ర బాధ్యత. ఈ అంశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య తమిళనాడు ప్రభుత్వానికి గతంలో లేఖ కూడా రాశారు. తెలుగువారితో సన్నిహిత సంబం«ధం గల గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు తమిళ నాడులో ఉన్న ప్రస్తుత సందర్భంలో తమిళనాడులోని తెలుగువారు ఆశావహంగా నూతన విద్యావిధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ విధానాన్ని చురుగ్గా అమలు చేసేలా చేయాలని మా ప్రతినిధి వర్గం మరోసారి కోరుతోంది.

సరస్వతీ మహల్
తమిళ నాడులోని తంజావూరులో తెలుగువారి సారసత్వానికి మహత్తరమైన పెన్నిధి వంటి తాళపత్ర గ్రంథాలను పరిరక్షిస్తున్న సరస్వతీ మహల్‌లో తెలుగు పుస్తకాల ప్రచురణ కూడా మందకొడిగా సాగుతోంది. 1855 దాకా పరిపాలించిన మరాఠీ రాజులు, అంతకు ముందటి నాయక రాజులు పెంచి పోషించిన తెలుగుదనం, మనకు అందించిన అక్షర సంపద ఇంకా విస్తృతంగా వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. తెలుగు పుస్తకాల ప్రచురణలో తరతరాల తాటి ఆకుల రచనల్నే భావితరాలకు అందించే పుస్తకాల ప్రచురణ చురుగ్గా సాగాల్సిన అవసరం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ‘ఆముక్తమాల్యద’ రాత ప్రతి వంటి కావ్యాలు అక్కడ ఎన్నెన్నో ఉన్నాయి. ఆ గ్రంథాలయాన్ని నిర్వహించాల్సిన సిబ్బంది విషయంలో ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని గమనించాం. సరస్వతీ మహల్ వంటి గ్రంథాలయాన్ని నిర్వహించడంలో ఏళ్ళ తరబడి ఇన్‌ఛార్జ్‌లు మాత్రమే తమ పరిధిలో బాధ్యతలు నిర్వహించడం లోపభూయిష్టంగా ఉంది.

సాంస్కృతిక మండలి
దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, సమన్వయ బాధ్యతలు, పరస్పర మార్పిడి కార్యక్రమాలు నిర్వహించాల్సిన దక్షిణ భారత సాంస్కృతిక మండలిలో చురుకుదనం లోపించింది. మన రాష్ట్ర వాటాగా కోటి రూపాయలు మించిన మదుపు ఉన్నా అందుకు తగిన రీతిలో కార్యక్రమాలు జరగటం లేదనిపిస్తోంది. అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడానికి ఆ మండలి అధ్యక్షుడిగా వ్యవహరించే తమిళనాడు గవర్నర్ రోశయ్య గారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేయబోతున్నాం. మన రాష్ట్ర కళారంగం నుంచి ఆ మండలి పాలకవర్గంలో సభ్యులుగా ఉన్నా, వారికి తగిన సమాచారం, బాధ్యతలు వహించే అవకాశం కూడా లేకపోవడంతో అసలు ఆశయం కుంటుపడుతోంది.

పల్లెలో తెలుగుదనం
వ్యవసాయ కుటుంబాల్లో చెక్కుచెదరని తెలుగు ఆపేక్ష, కొద్దిగానైనా మాటల సంపద పెంచుకుందామనే తాపత్రయం కనిపించే పల్లె మమ్మల్నందరినీ కదిలించింది. ‘పిళ్ళైపట్టి’ పేరుతో తంజావూరుకు సమీపంగా జీన్న గ్రామంలో ఒక సాయంత్రం అనుభూతి మా మీద చెరగని ముద్ర వేసింది. సుమారు 55 ఏళ్ళుగా ఆ పల్లెకు సర్పంచిగా ఉన్న పెద్దాయన తమ ఊరిలోవారి కోరికలను తెలియజెబుతూ తమ ఇంట్లో కొన్ని మాటలకు పరిమితమైపోయిన తెలుగును చదవటం, రాయటం వచ్చేలా చేయాలని తాను ఎంతగా ప్రయత్నించినా ప్రోత్సాహం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన సంప్రదాయమైన పూజలు, పండుగల సమయాల్లో కనీసం ఒక్క పాట, ప్రార్థనలను అయినా నోరారా తెలుగులో ఆలపిద్దామన్నా నేర్పించేవారు లేరని అక్కడ ఒకామే బాధపడింది. మన సాంస్కృతిక శాఖ వారికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచనలు చేస్తున్నాం.

తిరువయ్యూర్ త్యాగరాజు
కర్నాటక సంగీతాన్ని సుసంపన్నం చేసిన త్యాగరాజు సమాధి ఉన్న తిరువయ్యూరులో ఏడాదికోసారి చెన్నై నుంచి నిర్వాహకులు వచ్చి చేసే ఆరాధనోత్సవాలు తప్ప మన తెలుగువారికి సంబంధించి ఏ కార్యక్రమమూ జరగటం లేదు. ఆ ప్రాంతాన్ని నిత్యం సందర్శించి పూజలు చేసేవారికి ఏడాది పొడవునా అక్కడ సంగీత స్రవంతి పొంగి పొరలేలా తగిన ప్రాంగణం ఉండాలని భావించాం. అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

శ్రీరంగంలో నాదస్వరం
ప్రకాశం జిల్లా ప్రాంతాల నుంచి అక్కడి కావేరీ తీరంలో వైష్ణవనిలయమైన శ్రీరంగంలో నాదస్వర విద్వాంసులుగా స్థిరపడిన తెలుగు కుటుంబాలవారిని మనం ఆదరించడం మరచిపోయాం, పద్మశ్రీ, కలైమామణి వంటి బిరుదులతో తమిళనాడు ప్రభుత్వం వారిని ఆదరిస్తుంటే, వారిని గుర్తించి సత్కరించడం కూడా విస్మరించిన మన ప్రభుత్వం తీరుపై మనస్తాపం చెందుతున్న ఆ కుటుంబాల వారిని సన్నిహితంగా గమనించాం. ఆ కళను ప్రోత్సహంచేలా తగిన చర్యలు చేపట్టే విధివిధానాలను సూచించనున్నాం. మన పొరుగున ఉన్న తెలుగువారికి సంతృప్తికరమైన ప్రోత్సాహకాలు అందించడానికి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో అవసరమైన చురుకుదనం పెంచడానికి మనం ఎంతో శ్రద్ధ పెట్టాలన్న నిశ్చయంతో మా వంతుగా తగిన ప్రయత్నాలు మొదలుపెట్టనున్నాం” అని మండలి వివరించారు.
-జి.ఎల్.ఎన్. మూర్తి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీనియస్ జివి కృష్ణరావు – ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న

 

నాటకకర్తగా, నవలా రచయితగా, కథా రచయితగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా, వ్యాసకర్తగా, అలంకారశాస్త్రాల్లోని లోతుపాతులు తెలిసిన మేధావిగా, ప్రాక్‌పశ్చిమ దేశాల తత్వశాస్త్రాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రతిభావంతుడుగా, హేతువాదిగా, మానవతావాదిగా, తెలుగుదేశంలో పేరు ప్రఖ్యాతులు గడించారు డాక్టర్ గవిని వెంకట కృష్ణరావు.
కృష్ణరావు వ్యవసాయ కుటుంబంలో తెనాలి తాలుకా కూచిపూడి గ్రామంలో నవంబర్ 15, 1914లో జన్మించారు. వీరు తురిమెళ్ల, కొల్లూరు హైస్కూళ్లలో విద్యను అభ్యసించారు. గుంటూరు ఎ.సి.కాలేజిలో 1937లో డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరులోనే పళ్ళెపూర్ణ ప్రజ్ఞాచార్యులు దగ్గర సంస్కృతం నేర్చుకున్నారు.

కాలేజీ చదివే రోజుల్లో కృష్ణరావుకి గోపీచంద్‌తో స్నేహం ఏర్పడింది. ఆ సమయంలోనే కృష్ణరావు ఎమ్.ఎన్.రాయ్ రచనల్ని చదివి ఆకర్షితులయ్యారు. గోపీచంద్‌తో కలవడంతో ‘జీవితానికి ఒక మార్గం, రచనకు ఒక లక్ష్యం ఏర్పడ్డాయని’ కృష్ణరావు చెప్పారు. ప్రారంభంలో త్రిపురనేని రామస్వామి చౌదరి వల్ల హేతువాద దృక్పథం అలవడింది.
డిగ్రీ తర్వాత కాశీహిందూ విశ్వవిద్యాలయంలో ఎమ్ఏ ఇంగ్లీషు లిటరేచర్‌లో చేరారు. పరీక్షలు రాయకుండానే 1941లో తిరిగివచ్చారు. బెనారస్ నుండి వచ్చిన తర్వాత కృష్ణరావు పత్రికారంగంలో అడుగుపెట్టారు. పత్రికా రంగానికి స్వస్తి చెప్పిన తర్వాత మద్రాస్ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డిలో చేరారు. కళాపూర్ణోదయంపై Studies in Kala purnodayam అనే ప్రామాణిక పరిశోధనా గ్రంథాన్ని ఆంగ్లంలో రాసి 1955 లో డాక్టరేట్ పట్టా పొందారు. ఈ పరిశోధనా గ్రంథంలో కళ ఎలా పూర్ణోదయం చెందిందో వివరించారు. అంతేకాక పింగళి సూరనని ప్రపంచ కవుల సరసన నిలబెట్టారు.

తెనాలిలోని విఎస్ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా చేరి 1962లో అధ్యాపక వృత్తికి రాజీనామా చేశారు. తర్వాత పొన్నూరు సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్‌గా చేరారు. పిదప 1963లో ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రంలో ‘స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్’గా చేరారు. 1973 వరకు అంటే పదవీ విరమణ చేసేవరకు ఉద్యోగం చేశారు.

కృష్ణరావు కాలేజీ చదువుతున్న రోజుల్లో ‘వరూధిని’ (1935) అనే భాండ కావ్యాన్ని రాశారు. ఆకాశవాణిలో ఉద్యోగం చేసేటప్పుడు భాసుడు రాసిన ‘ప్రతిమ’ నాటకాన్ని తెలుగులోకి అనువదించారు. వీరు కొన్ని కవితలు, కథలు, సాహిత్య వ్యాసాలు కలిపి ‘ఉదబిందువులు’ అనే సంపుటి ప్రచురించారు. అధ్యాపక వృత్తిలో వుంటూ ఆచార్య నాగార్జున గ్రంథంలోని కొన్ని భాగాల్ని పద్యాలుగా అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున ప్లేటోరి పబ్లిక్ గ్రంథాన్ని ‘ఆదర్శ రాజ్యం’ పేరుతో తెలుగులో అనువదించారు.
కాశీలో ఎమ్.ఏ.విద్యార్థిగా ‘కావ్య జగత్తు’ అనే ప్రామాణికమైన విమర్శ గ్రంథం రాశారు. భరతుడు నుంచి పండిత రాయల వరకూ, ప్లేటో నుంచి మార్క్సు వరకు వున్న మహనీయుల సూక్తుల్ని ఉదహరిస్తూ ‘కావ్య వస్తువు’ సామాజిక వ్యవస్థని బట్టి ఎలా మార్పు చెందుతుందో నిరూపించిన ఉత్తమ విమర్శ గ్రంథమిది. దేశ కాలపరిస్థితుల్ని అనుసరించి కావ్యాల్లో వస్తురూపంలో ఎలా మార్పు చెందుతుందో ఇందులో మార్క్సిస్టు దృక్పథంతో విపులీకరించారు.
జి.వి.కష్ణరావుపై కవిరాజు హేతువాద ప్రభావమే కాక అటు యమ్.యన్ రాయ్ మానవవాద ప్రభావం కూడా వుంది. అలాగే మార్క్సిస్టు ప్రభావం వీరి రచనల్లో కన్పిస్తుంది. రావు తాను రాసిన ‘కావ్య జగత్తు’లో ‘నా సిద్ధాంతం క్రొత్తదీ కాదు, పాతదీ కాదు. ఇలా అనటం వలన ప్రాత కొత్తల కలయిక అని చెప్పడానికి అంత కన్నా వీలులేదు. ఎందుకంటే భారతాది లాక్షణికులు చెపుతూ వచ్చిన రసవాదాన్నే స్వీకరించి, ఆది భౌతిక సిద్ధాంతాన్ని అన్వయించాను. ఈ రెండు సిద్ధాంతాలూ పాతకే. మొదటిది ప్రాచీన మతం, రెండోది పద్దెనిమిది, పందొమ్మిది శతాబ్దాల్లో ప్రబలమైన ఈ రోజుల్లో ప్రసరిస్తూ వుంది’ అని అన్నారు.

వీరు ‘కీలు బొమ్మలు’ 1951లో రాశారు. ‘కీలు బొమ్మలు’లోని పాత్రలు కీలుబొమ్మలుగా మారుతాయి. అంటే వారంతా స్వేచ్ఛని ఏదో రకంగా కోల్పోతారు. గ్రామీణ వాతావరణానికీ, వారి జీవన విధానానికి ప్రతిబింబం కీలు బొమ్మలు గ్రామాల్లో జరిగిన సంఘటనల్ని యథాతథంగా తీసుకొని వారి మానసిక ప్రవృత్తిని తాత్వికంగా వర్ణించిన అద్భుతమైన నవల యిది. ఈ నవల్లో రచయితకు ప్రతినిధి డాక్టర్ వాసుదేవశాస్త్రి. అతని ద్వారా రచయిత తాను చెప్పదలచుకున్న మాటల్ని చెప్పించారు. ‘కీలుబొమ్మలు నవల చదువరులను ఆనందపరిచే నవలగా మాత్రమేకాక, వారి ఆలోచనల్ని రేకెత్తించే ఒక కళాత్మకమైన తత్వచరిత్రగా మనకు గోచరిస్తుంది’ అని మొదలి నాగభూషణ శర్మ పేర్కొన్నారు. ‘ఆధునిక యుగంలో వ్యక్తిగత సమస్యల స్వరూపాన్ని ధరించే వైనం చిత్రించిన తర్వాత, రాజకీయాల స్వైరవిహారం ఎట్లా ఉంటుందో రచయిత చక్కగా చిత్రించారు. రాజకీయాల్లో యువకులూ, విద్యార్థులూ ఆదర్శవాదులే. కాని వాళ్లు కూడా కీలుబొమ్మలే అన్న సత్యాన్ని ఆవిష్కరించారు’ అని ప్రముఖ విమర్శకులు ఆర్‌యస్ సుదర్శనం తెలియ జేశారు.

1977లో ‘పాపికొండలు’ రాశారు. ఈ నవల ఆంధ్రప్రభలో సీరియల్‌గా వచ్చింది. అధికారం మనుషుల్ని ఎలా దిగదార్చుతుందో ఈ నవలలో వ్యంగ్యంగా కృష్ణరావు చెప్పారు. పాపికొండలు నవల ‘ఒక రసగంగ’ అని హితశ్రీ ప్రశంసించారు. మానవత్వపు విలువుల్ని కాపాడుకోవాలి. నైతిక ఆదర్శాల్ని అలవాటు చేసుకోవాలి. ఏదైనా అనైతిక సాధన ద్వారా సాధించవచ్చుననే దృక్పథం తప్పు అని చెప్పారు. ఈ ప్రయోజనం కోసమే కృష్ణరావు పాపికొండలు నవల రాశారు. బౌద్ధం అంటే కృష్ణరావుకు అభిమానం. ఆ కారణంగా బౌద్ధ మత ప్రభావంతో ‘రాగరేఖలు’ నవల రాశారు. ఈ నవల్లో తీయతీయని తెలుగు సామెతలు, తెలుగు పలుకుబడులు చోటుచేసుకున్నాయి. వీరు ‘జఘన సుందరి’ అనే నవలిక కూడా రాశారు. ఈ నవల పలు విమర్శలకు గురి అయింది.
కృష్ణరావు మానవుని మూల తత్వాన్ని గూర్చి అన్వేషణ చేసిన ప్లేటో, అరిస్టాటిల్, లాక్, రూసో, కాంటో, జెఎస్ మిల్, డ్లూలూ, రస్సెల్, రాయ్ మొదలైన తత్వవేత్తల సిద్ధాంతాల్ని అధ్యయనం చేశారు. తాత్వికుడైన రచయిత చేసిన రచనలు మామూలు రచయితల రచనల కంటే భిన్నంగా వుంటాయి అనే వారికి కృష్ణరావు రచనలే ప్రబల తార్కాణం. ప్రాచ్య పాశ్చాత్య వైజ్ఞానిక సంప్రదాయాల్ని ఆకళింపు చేసుకొన్న మహనీయుడు డాక్టర్ కృష్ణరావు.

వీరు భిక్షాపాత్ర (1938), ధమ్మిల్లం (1951), దానధార (1952), యాదవ ప్రళయం (1952) మొదలైన భావ విప్లవానికి సంబంధించిన నాటికల్ని రాశారు. వీరి నాటకాలపై హేతువాదం, మానవవాదం, మార్క్సిస్టు వాదాల దృక్పథాలు చాలా స్పష్టంగా కన్పిస్తాయి. పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకొని అందులోని అహేతుక అంశాల్ని ఖండిస్తూ నూతన వ్యాఖ్యానాలతో కొన్ని రచనల్ని చేశారు. సమాజంలో నెలకొన్ని వున్న అనేక ఆచార సంప్రదాయాలపై మతమౌఢ్యంపైన ధ్వజమెత్తిన కృష్ణరావు రచనలు ముఖ్యంగా పౌరాణిక రూపకాలు భావవిప్లవాన్ని రేకెత్తించేవిగా వున్నాయి.
తెలుగు సాహిత్యంలో నవల, నాటకం, కథ, కవిత, అనువాదం మొదలైన ప్రక్రియల్ని తనదైన శైలిలో రాసి మహామహా పండితుల, విమర్శకుల ప్రశంసల్ని అందుకున్న సాహితీమూర్తి డాక్టర్ జి.వి. కృష్ణరావు.
-ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న
(నవంబర్ 15న జి.వి.కృష్ణరావు శతజయంతి సంవత్సరం ప్రారంభం)

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పోరాటాల వేదిక ‘సృజన’ – సాహితీ మిత్రులు

 

సృజన- ఆ మూడక్షరాల పేరు ఇరవయో శతాబ్ది రెండో అర్ధభాగపు తెలుగు సాహిత్యంలో, సమాజంలో, సాంస్కృతిక రంగంలో, మేధో ప్రపంచంలో ఉజ్వల అరుణారుణ తార. ఒక చిన్న యువ సాహితీమిత్రుల బృందం పూనికతో స్పష్టాస్పష్ట అన్వేషణగా 1966లో ప్రారంభమైన సృజన పావుశతాబ్ది ప్రయాణం తర్వాత 1992లో అర్ధాంతరంగా ఆగిపోయేనాటికి తెలుగుసీమలో సమాజ సాహిత్య సంబంధాలకు, ప్రజాపక్షపాతానికి, విప్లవ దృక్పథానికి, ప్రామాణిక సృజనాత్మక రచనకు, విశ్లేషణకు అత్యంత ప్రభావశీల నిదర్శనంగా నిలిచిపోయింది.

26 ఏళ్ల యాత్రలో 200 సంచికలలో సృజనలో ప్రచురితమైన వెయ్యికి పైగా కవితలు, పాటలు, మూడు వందల కథలు, వందలాది వ్యాసాలు, పుస్తక సమీక్షలు, అనువాద రచనలు, రెండు వందల సంపాదకీయాలు సమకాలీన సమాజానికి, ప్రజాపోరాటాలకు, సాహిత్య అభివ్యక్తికి ఎప్పటికప్పుడు అద్దం పట్టాయి, ప్రతిఫలించాయి. సృజన వందలాది మంది సాహిత్యకారులను సృష్టించి, వారి సాహిత్యానికి మెరుగులు దిద్దింది. అప్పటికే సాహిత్య లోకంలో లబ్ధప్రతిష్ఠులైనవారి నుంచి అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకుంటూ రచయితలైనవారి వరకు, మేధావుల నుంచి నిరక్షరాస్య సృజనకర్తల వరకు ఎందరికో వేదిక కల్పించడంలో, ఆరుగాలం శ్రమలో తీరిక దొరకని కష్టజీవులను రచయితలుగా మలచడంలో, తీర్చిదిద్దడంలో సృజన సాగించిన కృషి, నెలకొల్పిన ప్రమాణాలు అసాధారణమైనవి. ఒక అత్యల్ప సంఖ్యాక బుద్ధిజీవుల, సాహితీమిత్రుల ఆధునిక సాహిత్య పఠన అవసరాలు తీర్చే ఆధునిక సాహిత్య వేదికగా ప్రారంభమైన సృజన నవనవోన్మేష ప్రయాణంలో, ప్రజానుకూల చలనంలో, సామాజిక విస్తరణలో లక్షలాదిమంది ప్రజలు ఎదురుచూసే పత్రికగా, వారి ఆరాటాలను గానం చేసేవేదికగా, పోరాటాలకు ఉద్యుక్తుల్ని చేసే కార్యకర్తగా, వారి పోరాటాలను ప్రపంచానికి పరిచయం చేసే వాహికగా తనను తానే అధిగమించుకుంటూ పురోగమించింది. పోరాటంలో నిమగ్నులైన నిరక్షరాస్య రైతుకూలీలు చదివి వినిపించుకునే పత్రికగా ఎదిగింది.

‘సృజన వ్యవస్థాపక సాహితీమిత్రులు వే.నరసింహారెడ్డి, నవీన్, రామన్న, వరవరరావు 1966 మే నెలలో వే.నరసింహారెడ్డి ఇంట్లో సమావేశమై, ఆధునిక సాహిత్య వేదికనొకదానిని ప్రారంభించాలని, దానికి శాస్త్రీయ దృక్పథం, ప్రయోగదృష్టి, సమకాలీన సామాజిక స్పృహ పునాదులుగా ఉండాలని నిర్వచించుకున్నారు. ఆధునిక కవిత్వ పత్రికగా నాలుగైదు సంచికలైనా నడచి ‘నిలిచిన’ ‘నవత’ లేని లోటును తీర్చడమే కాకుండా సాహిత్య కార్యరంగాన్ని విస్తృతపరచి సాహిత్య విమర్శ, కథ, సమీక్షలకు సముచితమైన స్థానం కల్పించాలన్నది కూడ ప్రేరణ. అప్పటికి అయిదో సాక్షి లోచన్. అండగా నిలిచిన పెద్దమనిషి కాళోజీ’ అని సృజన పుట్టుక గురించి వందో సంచిక తలచుకుంది.

అలా సృజన మొదటి సంచిక ‘సాహితీమిత్రుల’ నిర్వహణలో కాళోజీ ప్రచురణకర్తగా నవంబర్ 1966లో హనుమకొండ నుంచి వెలువడింది. వివరాలకు వరవరరావు జడ్చర్ల చిరునామా, వే నరసింహారెడ్డి హనుమకొండ చిరునామా అచ్చయ్యాయి. అప్పటి నుంచి 1970 వరకు సాగిన 16 సంచికలు తెలుగు సమాజంలోనూ సాహిత్యంలోనూ జరిగిన సంచలనాలన్నిటికీ అద్దం పట్టా యి. 1971లో సృజన మాసపత్రికగా మారింది. అప్పటికే ఝంఝా ప్రభంజనంగా వీస్తున్న విప్లవ రచయితల సంఘానికి అ«ధికార పత్రిక ఏర్పడకపోవడంతో సృజన విప్లవ సాహిత్యోద్యమ అనధికార వేదికగా నిలిచింది. “ఆధునిక సాహిత్యమంటే-శాస్త్రీయ దృక్పథం, హేతువాదం, సమకాలీన సమాజం-వీని ప్రభావం వ్యక్తి జీవితంలోని అన్ని అంశాల మీద కొద్దో గొప్పో ఉన్నదని గుర్తించడం, ఈ గుర్తింపు ఉన్న రచనని ఆధునిక సాహిత్యంగా నిర్వచించవచ్చు. ఇతరమైన విలువల్ని కూడా విస్మరించకుండా.

ఇది ఒక సాహస ప్రయోగం. ఇది పత్రికా? కాదు ‘మారుతున్న కాలాన్ని, విస్తృతమౌతున్న జాగృతిని ప్రతిబింబించే, అనువదించే ఒక జౌటఠఝ’. దీనికి సంపాదకుడు లేదు, సాధకులే తప్ప. ప్రయోగశీలత్వం, సృజనాత్మక శక్తి, ఆధునిక దృక్పథం- ఈ జౌటఠఝ పునాదులు” అని మొదటి సంచిక సంపాదకీయం ‘ప్రయోగం’ రాసింది.

ఇవాళ తెలుగు సాహిత్యలోకంలో లబ్ధప్రతిష్ఠులైన వచనకవులు, పాటల రచయితలలో ఎందరో సృజన ద్వారా పరిచయమైనవారే, ప్రాచుర్యం పొందినవారే. మధ్యతరగతి కథల నుంచి ప్రజా జీవితాన్ని, పోరాటాలను, ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రతిఫలించిన కథల దాకా సృజన తెలుగు కథ అభివృద్ధికి ఇచ్చిన కానుకలు అపారమైనవి. అల్లం రాజయ్య, ఎన్ఎస్ ప్రకాశరావు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, అట్టాడ అప్పల్నాయుడు, కె రాంమోహన్‌రాజు, బిఎస్ రాములు వంటి కథకులెందరో సృజనతోనే తమ కథారచన ప్రారంభించారు. ‘అంపశయ్య’ నుంచి ‘కొలిమంటుకున్నది’ దాకా, చైనా అనువాద నవలలు ‘నా కుటుంబం’, ‘ఉప్పెన’ల దాకా ప్రయాణించింది సృజన. వ్యాసం, సమీక్ష ప్రక్రియలలో సృజన చేసిన ప్రయోగాలు, సాధించిన విజయాలు అద్భుతమైనవి. త్రిపురనేని మధుసూదనరావు, కె.బాలగోపాల్, జెసి, సివి సుబ్బారావు, ఆర్ఎస్ రావు వంటి సామాజిక, సాహిత్య విమర్శకులూ వ్యాకర్తలూ ఎంద రో సృజన ద్వారానే ప్రాచుర్యంలోకి వచ్చారు. శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంతోపాటు పుట్టి, కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలతో వికసించి, దండకారణ్య ఉద్యమపు తొలిరోజుల దాకా సృజన ప్రజావిముక్తి పోరాటాలన్నింటికీ వేదికగా నిలిచింది. సృజన ప్రచురణలుగా ముప్పైకి పైగా పుస్తకాలు ప్రచురించింది.

ప్రజా సాహిత్య రంగంలో ఈ విస్తారమైన కృషి వల్లనే సృజన పాలకవర్గాల నుంచి తీవ్రమైన ఆగ్రహాన్నీ నిర్బంధాలనూ నిషేధాలనూ ఎదుర్కొన్నది. దాదాపు పది సంచికలు నిషేధానికి గురయ్యాయి. ఒక సంచిక నిషేధం కేసులో సంపాదకురాలు పి హేమలతకు న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. వరవరరావును 1973 లో నిర్బంధించినప్పుడు, సికిందరాబాదు కుట్రకేసులో నిందితునిగా చూపినప్పుడు సృజన సంచికల రచనలే నేరారోపణలు. నిర్బంధం వల్లనే ఎమర్జెన్సీలో రెండేళ్లు, ఆటాపాటామాటా బంద్ కాలంలో నాలుగేళ్లు సృజన వెలువడలేకపోయింది.

సృజన ప్రారంభ సంచిక నుం చీ సంపాదకులుగా ఉన్న వరవరరావును 1973 అక్టోబర్‌లో ఆంతరంగిక భద్రతా చట్టం కింద అరెస్టు చేయడంతో నవంబర్ సంచిక నుంచి సంపాదకురాలు, ప్రచురణకర్త, ముద్రాపకులుగా పి హేమలత బాధ్యత తీసుకున్నా రు. అయితే మొదటి సంచికలో చెప్పినట్టుగా సృజన సంపాదకత్వం ఎప్పుడూ ఒక్కరిది మాత్రమే కాదు. రెండో సంచిక నుంచి 1973 అక్టోబర్ సంచిక వరకూ ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్‌గా వరవరరావు పేరు అచ్చయింది. ఆ కాలంలోనూ, చివరివరకూ ఎక్కువ సంపాదకీయాలు వరవరరావు రాసినప్పటికీ, సాహితీమిత్రుల బృందమే ప్రతి రచననూ సమష్టిగా చదివి, చర్చించి, తగిన మార్పులు చేసి ప్రచురణకు సిద్ధం చేసేది. సృజన వరంగల్‌లో ఉన్నన్ని రోజులూ ‘సాహితీమిత్రులు’ వారానికి ఒకరోజయినా సమావేశమయ్యేవారు. ఆ బృందంలో ప్రత్యేకంగా సభ్యత్వం ఏమీ లేదు. రచనల పఠనం, చర్చ జరుగుతున్న సమయంలో ఎవరు వచ్చినా అందులో భాగమయ్యేవారు.

‘సాహితీమిత్రులు’ మేధోశ్రమకూ శారీరకశ్రమకూ మధ్య అంతరం చెరిపివేసిన ఒక ఆదర్శవంతమైన సామూహిక కృషి. అందులో సిద్ధాంతకర్తలు, కార్మికులు, సృజనాత్మక రచయితలు, విశ్లేషకులు, లబ్ధప్రతిష్ఠులైన రచయితలు, వర్ధమాన రచయితలు, కేవలం పాఠకులు అందరూ ఉండేవారు. రచనలో, రచనల ఎంపికలో పాల్గొనేవారే రోజువారీ ప్రూఫ్‌రీడింగ్, సర్క్యులేషన్ పనులు, నెలనెలా ప్యాకింగ్, పోస్టింగ్ పనులు, సంచికల కట్టలు నెత్తినమోసే పనులు కూడ చేసేవారు. 26 ఏళ్లపాటు నడిచిన సృజనకు ఎప్పుడూ ప్రత్యేకంగా కార్యాలయం లేదు, వరవరరావు ఇల్లే కార్యాలయం. వరవరరావు పనిచేస్తుండిన చందా కాంతయ్య మెమోరియల్ కాలేజి, ఆ కాలేజి పోస్ట్ బాక్సులే దాదాపు మూడేళ్లు సృజన చిరునామా. 1971-72ల్లో అతికొద్ది కాలం మినహా ఎప్పుడూ వేతనానికి పనిచేసే పూర్తికాలం సిబ్బంది లేరు. వేరువేరు కాలాల్లో వేరువేరు వ్యక్తులు స్వచ్ఛందంగా, ఉచితంగా అందించిన సేవలతోనే సృజన నడిచింది. మరణించిన వే.నరసింహారెడ్డి, డా.ఎ.రామనాథం, గోపి, సి.వి.సుబ్బారావు, కరుణ, కె.రాంమోహన్‌రాజు, బి.వెంకటేశ్వర్లు, కె.బాలగోపాల్ ఆయాకాలాల్లో ‘సాహితీమిత్రులు’గా సృజన అభివృద్ధికి ఎంతో దోహదం చేశారు. సృజన లోగో అక్షరాలు దిద్దిన పి.సి.నరసింహారెడ్డి ‘శుక్తి’ నుంచి బాపు, చలసాని ప్రసాదరావు, శీలా వీర్రాజు, చంద్ర, మోహన్, అంజన్‌బాబు, కాతోజు వంటి వారెందరో ముఖపత్రాలంకరణలో భాగం పంచుకున్నారు.
– సాహితీ మిత్రులు
(ఈ నెల 17న హైదరాబాద్‌లో సోమాజిగుడ ప్రెస్‌క్లబ్‌లో ఉ.10లకు సృజన 200 సంచికల డివిడి విడుదల జరుగనుంది)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నమ్మాల్సిన నిజాలు -3

             నమ్మాల్సిన నిజాలు -3

తాను అత్యంత లౌకిక వాదినని ,మత విశ్వాసాలు తన ఒంటికి పడవని ,సోషలిస్ట్ భావాల పుట్ట నని మతం గీతం జామ్తానై అని కమ్యూనిస్టులను ప్రసన్నం చేసుకోవటానికి కుహనా లౌకికవాద నినాదాన్ని పూరించిన పండిట్ జవహర్ లాల్ నెహ్రు అవసరం వచ్చినప్పుడు, గతిలేక పోయి నప్పుడు  వీతికన్నిటికి  గుడ్ బై చెప్పి మతాధికారులను ఆశ్రయించాడు .ఆయనే కాదు ఆయన తండ్రి మోతీలాల్ ,కూతురు ఇందిర, ఆమె కొడుకు రాజీవ్ కూడామొత్తం ‘’ఫామిలీ అంతా ‘’‘’ భవరాహా బాబా’’ ను అనేక సార్లు సందర్శించారు .వారి సందేహాలను నివృత్తి చేసుకొని ,శిష్య పరమాణువు లై ఆజ్ఞలను ఔదల దాల్చిబాబా మహాభినిష్క్రమణ వరకు దీన్ని కోన సాగించిన న అపూర్వ సంఘటనల గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .

మోతీలాల్ నెహ్రు ‘’బవారీ బాబా’’ కు ప్రీతి పాత్రుడైన శిష్యుడు .ఆయన తన కొడుకు జవహర్ కు చిన్నతనం లోనే బాబా దగ్గర దీక్ష ఇప్పించాడు . కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రూపు దాల్చిన తర్వాత ఆ పార్టీకి ఎన్నికల గుర్తు

దేన్నీ తీసుకోవాలో తెలియక తబ్బిబ్బు పడ్డారు .ఏదీ నిర్ణయించలేక ఊగిస  లాడారు ..అప్పుడు జవహర్ ఒక రోజు అనుకోకుండా ‘’భవరాహా’’ బాబా దగ్గరికి వచ్చాడు .సమస్యను బాబా కు విన్న వించి ఏదైనా’’ క్లిక్ ‘’అయ్యే చిహ్నం కాంగ్రెస్ కు సూచించమని కోరాడు .అప్పుడు బాబా ‘’పద్మ పురాణం లో విష్ణు భగవానుడు ‘’ఆవు  –దూడ ‘’ను తన స్వరూపం గా భావించి ఆరాధించమని చెప్పాడు .కనుక ఈ ‘’ఆవుదూడ ‘’గుర్తునే నువ్వు కాంగ్రెస్ కు ఎన్నికల చిహ్నం గా తీసుకో .నీకు శుభం కలుగుతుంది .నువ్వు పండితుడివి కనుక ‘’ధర్మం ‘’మీద ద్రుష్టి పెట్టి ముందుకు సాగు ‘’అని ఆశీర్వ దించాడు .అప్పటి నుంచి ఆవు దూడ యే కాంగ్రెస్ వాళ్ళ ఎన్నికల గుర్తు అయింది ఇందిరా స్వంత కుంపటి పెట్టి హస్తం గుర్తు పొందే దాకా .

1977-78నెహ్రు కూతురు ఇందిర దేశమంతా ‘’ఎమర్జన్సీ ‘’విధించింది .ఆ సమయం లో ధిల్లీ లోని ‘’గో రక్షా సమితి ‘’కార్యాలయాన్ని కూడా ఆమె కొడుకు సంజయ్ దగ్గరుండి కూల్పించాడు .అరాచకం పెరిగి పోయింది .అనేక అత్యాచారాలు జరిగాయి .ఇదంతా ఆమె కొడుకు సంజయ్ నిర్వాకమే .ఆమె పై అనేక ఆరోపణలోచ్చాయి .కేసుల్లో ఇరుక్కోంది .జనతా పార్టి చేతిలో చిత్తుగా ఆమె, ఆమె కాంగ్రెస్ ఓడి

అభాసు పాలైందన్న సంగతి మనందరికీ తెలుసు .ఆమెలో నిరాశ నిస్పృహ నిండి పోయి అడుగు ముందుకు వేయలేని పరిస్తితి వచ్చింది .

అప్పుడు ఇందిర బాబా ను సందర్శించింది ‘’బాబా ! మీ రోక్కరే నన్ను ‘’అమ్మాయీ’’ అని ఆప్యాయం గా పిలిచారు .జనం అంతా నన్ను ఏవగించుకొని దూరం అయ్యారు .నాపై కృప చూపండి .’’మీ అమ్మాయి’’ ఇప్పుడు మీ చరణాలను ఆశ్రయించింది .దేశ సేవ చేయాలి అంటే అధికారం ఉండాలి ఇప్పుడది నాకు లేదు ‘’అని గోడు వెళ్ళ బోసుకోంది  .బాబా ఆమెతో ‘’నువ్వు గో సేవ చేస్తే అప్పుడే దేశ సేవ చేసి నట్లు .గో గౌరవమే భారత మాత గౌరవం .గోవుకు కష్టం వస్తే భారత మాతకు కష్టం వచ్చి నట్లే .ఈ దేశం లో పేదరికం,దరిద్రం ప్రజల కస్టాలు పోవాలి అంటే గో సేవ యే మార్గం .ముందు గో సేవ తో ప్రారంభించు .అప్పుడు దేశ సేవ చేసే అదృష్టం కలిసి వస్తుంది .కుంగిపోయిన ఇందిరా ‘’ఇక నుంచి గోసేవే నా పరమావధి  నన్ను ఆశీర్వదించండి బాబా ‘’అని ప్రాధేయ పడింది .’’నీకు మరో సారి దేశ సేవ చేసే అదృష్టం వస్తుంది అయినా గో సేవ మరచి పోకు సుమా ‘’అన్నారు బాబా .అప్పుడు ఇందిరా ‘’మా నాన్న కు ఎన్నికల గుర్తు గా ఆవుదూడ ‘’ను సూచించారు మీరు. ఇప్పుడు నాకు కూడా ఎన్నికల గుర్తు  అవసరం ఉంది .దయతో సూచించండి ‘’అని కోరింది ‘’గో సేవ చేసే వారికి  నాఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ‘’అని చేయెత్తి ఆశీర్వ దించారు .గ్రహించిన ఇందిర ‘’బాబా !మీ ‘’హస్తం ‘’చిహ్నమే నా పార్టీ కి ఎన్నికల గుర్తు గా అనుగ్రహించండి .’’అంది .బాబా ఆశీర్వ దించి పంపిస్తూ ‘’అమ్మాయీ !నా శిష్యురాలు’’ ఆనందమాయి ‘’హరిద్వార్ లో ఉంది .నువ్వు అక్కడికి వెళ్లి గంగలో  పవిత్ర స్నానం చేసి ఆమెను సందర్శించు .ఎమెర్జెన్సీ లో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలకు  గురి అయిన దీనుల ,దరిద్రుల ,సాధువుల ,మహాత్ముల శాపం నుంచి నీకు విముక్తి కలుగు తుంది ‘’అని చెప్పి కిస్ మిస్ పండ్లను ప్రసాదం గా ఇచ్చి ,ఒక ‘’నల్ల రంగు శాలువా’’ ఆమెకిస్తూ అది ఆమె దగ్గరున్నంత వరకు ఆమెకే కష్టం రాదు అని దీవించి పంపారు బాబా .

’’హస్తం ‘’గుర్తుతో ఇందిరా కాంగ్రెస్ పేర ఎన్నికలలో నిలబడి అపూర్వ విజయం సాధించిన ఇందిర బాబా ను దర్శించింది ‘’బాబా !మీ అమోఘ ఆశీర్వాద బలంతో మీరు ఇచ్చిన హస్తం గుర్తు తో ఎన్నికలో గెలిచాను. మీ ఆశీర్వాదం అమోఘ శక్తి కలది .మీ వంటి యోగులు సిద్ధులను కన్న భారత దేశం ధన్యమైంది ‘’అని బాబా పట్ల తనకున్న ఆరాధనా భావాన్ని వ్యక్తం చేసింది నెహ్రు కూతురు ఇందిర .ఇప్పటికి తాత ,తండ్రి కూతురు ల బాబా భక్తీ ని గురించి తెలుసుకొన్నాం .తరువాత ఆమెకొడుకు రాజీవ్ బాబా యెడల  ఎలా ప్రవర్తించాడో తెలుసుకొందాం

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -.10-11-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వెండి తెర బంగారం

1-vyjayantimala 001 2-vyjayantimala 001 a.n.r.as vivekananda 001

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అంధుల ఆప్తుడు – ఉయ్యూరు

Apthudu 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జనం కష్టసుఖాలు బాగా తెలుస్తాయి – గుళ్లపల్లి నాగేశ్వరరావు

 

‘పల్లెటూళ్లో పెరగకపోతే మంచి వైద్యుడు కావడం కష్టం. సామాన్యుడి కష్టసుఖాలు నాకు తెలిసేలా చేసింది మా ఊరే’ అంటున్నారు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు. మన రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన ఎల్‌వీప్రసాద్ నేత్ర వైద్య ఆస్పత్రిని నిర్మించి నిర్వహిస్తున్న ఆయన సొంతూరు కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు. తాను పుట్టిపెరిగిన ఊరి గురించి డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు చెబుతున్న విశేషాలే ఈ వారం ‘మా ఊరు’

“నేను పుట్టింది కృష్ణా నది ఒడ్డున ఉన్న చోడవరం అనే పల్లెటూళ్లో. అది మా అమ్మమ్మగారి ఊరు. మా నాన్న మెడిసిన్ చదువు కోసం మద్రాసు వెళ్లడంతో నాకు మూడేళ్ల వయసు వచ్చే వరకూ చోడవరంలోనే ఉన్నామట. మా తాతగారు కోవెలమూడి రాఘవయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. తర్వాత రోజుల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారట. రాజకీయాల్లో తిరుగుతూ ఉన్న ఆస్తినంతా ఖర్చుపెట్టేశారని మా కుటుంబాల్లో చెప్పుకునేవారు. నాకు మూడేళ్లు నిండాక మా అమ్మ మా నాన్న దగ్గరకు మద్రాసు వెళ్లడంతో నన్ను మా పెద్దమ్మ తనతోపాటు ఈడుపుగల్లు తీసుకెళ్లిపోయింది. వాళ్లకప్పటికి పిల్లలు లేరు. అప్పట్నుంచి నేను ఎనిమిది పాసయ్యే వరకూ అక్కడే ఉన్నాను. ఇంత కథ ఉంది గనకే నా సొంతూరేదంటే ఈడుపుగల్లు అనే చెబుతాను.

ప్రముఖుల పుట్టినిల్లు
మా పెదనాన్న మేనల్లుడు వీరమాచనేని వెంకటరత్నంగారిని ఈడుపుగల్లులో అందరూ మైనరుగారు అనేవారు. తల్లిదండ్రుల్లో ఒకరిని చిన్నత నంలోనే పోగొట్టుకున్నవాళ్లను అప్పట్లో మైనరు అనేవాళ్లు. ఆయన సంరక్షణ కోసం మా పెదనాన్న కుటుంబం ఆయన ఇంట్లోనే ఉండేది. అందువల్ల నేను పెద్ద కుటుంబంలో పెరిగాను. ఈడుపుగల్లు చాలామంది ప్రముఖులు పుట్టిన ఊరు. ప్రజానాట్యమండలిని అభివృద్ధి చేసిన కమ్యూనిస్టు సుంకర సత్యనారాయణ, సినిమా రంగంలో పేరున్న విక్టరీ మధుసూదనరావు, మిక్కిలినేని రాధాకృష్ణ, కాంగ్రెస్ నాయకుడు పర్వతనేని దశరథరామయ్య మొదలైనవాళ్లంతా ఆ ఊరివాళ్లే.

సందడే సందడి
నాకు ఊహ తెలిసేనాటికి కూడా మా ఊళ్లో కరెంటు లేదు, శుభ్రమైన మంచినీటి సౌకర్యం లేదు. కాళ్లకు చెప్పులు వేసుకోవడం, నిక్కర్లు గాకుండా ప్యాంట్లు వేసుకోవడం అనేది పెద్ద విలాసం. పెళ్లిళ్లకో లేదా మరేదైనా ప్రత్యేక సందర్భాల్లోనే వాటిని ధరించేవాళ్లం. అప్పట్లో ప్రయాణ సాధనం అంటే ఎడ్లబండే. ఆ బండెక్కి ఏదైనా పొరుగూరికి వెళ్లడమంటే మాకెంతో సంబరంగా ఉండేది. ముందురోజే బండిని, ఎడ్లను అలంకరించి సిద్ధం చేసేవాళ్లం. ఇక మా ఊళ్లోనో, పొరుగూళ్లోనో ఎవరిదైనా పెళ్లి అంటే మహా సందడే. అవసరమై కాదుగాని, సరదా కొద్దీ పొలాల్లో చిన్నచిన్న పనులు చేస్తుండేవాణ్ని. ఇప్పటికీ పచ్చటి పంట పొలాలను చూస్తే నా మనసుకెంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది.

పి.ఎస్.ఆర్ వక్కపొడి తెలుసా
ఈడుపుగల్లు ఊరు మధ్యలో వీరబ్రహ్మంగారి స్థూపం ఉండేది. దాని ఎదురుగా ఒక చిన్న దుకాణం ఉండేది. ఊళ్లో ఏ అవసరానికైనా ఆ దుకాణానికి వెళ్లాల్సిందే. నాకు గుర్తున్నంతలో కృష్ణా జిల్లాలో వక్కపొడి తయారుచెయ్యడం మొదలెట్టింది ఈ దుకాణాన్ని నడిపే పి. సుబ్బారావుగారే అనుకుంటాను. పి.ఎస్.ఆర్. వక్కపొడి అన్న పేరుతో అది మా ప్రాంతంలో చలామణీలో ఉండేది. రాష్ట్రమంతా ఉండేదో లేదో నాకు తెలియదు.

ఎప్పుడైనా, ఎక్కడికైనా
ఊళ్లో చుట్టాలుపక్కాలు – తోచినప్పుడు తోచిన వాళ్లింటికి వెళ్లడం, మాట్లాడుకోవడం, వాళ్లేవైనా పెడితే సుబ్బరంగా తినేసి రావడం – ఇలా ఉండేది మా చిన్నప్పుడు. నాకు తెలిసి ఎవరూ తమ ఇళ్ల తలుపులు వేసేవారే కాదు. తాళాలు వెయ్యడం అన్నది ఎప్పుడో ఊరెళితేనే.

తొలి ఉపాధ్యాయుడి చలవ
అప్పటికి ప్రాథమిక పాఠశాలలు లేవు. అందువల్ల సీతారామయ్యగారు నడిపే బడే మా బడి. నన్ను అమితంగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరంటే నా తొలి ఉపాధ్యాయుడు సీతారామయ్యగారి పేరే చెబుతాను. ఆయన బాగా చదువుకుని, పెద్దపెద్ద డిగ్రీలున్నవారేం కాదు. అయినా ఆయన నేర్పించిన క్రమశిక్షణ, మంచి అలవాట్లు నాలో ఈనాటికీ పదిలంగా ఉన్నాయి.

పరుగులు తీసి తీసి…
ఈడుపుగల్లులో హైస్కూలుకు మా ఇంటి నుంచి ఒక మైలు దూరం నడవాలి. బడి ఉదయం పదింటికి మొదలవుతుందంటే సీతారామయ్యగారు తొమ్మిదింటి దాకా కదలనిచ్చేవారు కాదు. తొమ్మిదికి ఇంటికెళ్లి స్నానం చేసి పెట్టినదేదో తిని స్కూలుకు వెళ్లాలంటే సమయం సరిపోయేది కాదు. ఆలస్యంగా వెళితే అక్కడి హెడ్మాస్టరు బెత్తం పట్టుకుని చావబాదేవారు. అందుకని అంత దూరమూ ప్రతిరోజూ పరుగెత్తుకుంటూ వెళ్లేవాళ్లం. వెళ్లేసరికి ఆయాసం వచ్చేది. మా స్కూలు చుట్టూ నేరేడు చెట్లుండేవి. మధ్యాహ్నం కేరేజ్ డబ్బాలో పెట్టిన అన్నం తిన్నాక అవి కడిగేసి ఆ చెట్లెక్కేవాళ్లం. డబ్బా నిండేటన్ని నేరేడు పండ్లు ఎవరు కోస్తే వాళ్లు గొప్పన్న మాట. సాయంత్రం స్కూలయిపోయాక అక్కడే గ్రౌండులో కబడ్డీ ఆడేవాళ్లం.

కరెంటొచ్చిందోచ్
ఈడుపుగల్లుకు 1950 – 52లో విద్యుత్ సౌకర్యం వచ్చింది. కరెంటుతో వెలిగే బల్బు, ఫ్యానులను చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్లం. చెబితే నవ్వుతారేమోగాని, మా ఊళ్లో మొట్టమొదట లావెట్రీ కట్టించింది మైనరుగారే. ఊరుఊరంతా వచ్చి దాన్ని అబ్బురంగా చూసి వెళ్లడం నాకింకా గుర్తుంది. అలాగే ఊరికి బస్సు వస్తే పండగలా ఉండేది. పండగంటే గుర్తొచ్చింది… సంక్రాంతి వస్తోందంటే చాలు, మా ఊళ్లో కోడి పందేలు జోరుగా సాగేవి. పందేలు ఒక ఎత్తు, అవి జరిగే చోట ఉండే కోలాహలం మరొక ఎత్తు. ఊళ్లో పందేల కోసం ఎదురుచూసేవాళ్లు తక్కువ, ఆ కోలాహలం కోసం ఎదురుచూసేవాళ్లు ఎక్కువ.

వేరు చెయ్యగలరా?
ఒక్కముక్కలో చెప్పాలంటే – ఈడుపుగల్లు వంటి పల్లెటూళ్లో పెరగడం అనేది నా అదృష్టం అనుకుంటాను. అక్కడ పెరిగిన కాలమే నా జీవితంలో అత్యంత విలువైన కాలం. పల్లెటూరిలో పుట్టిపెరిగినవారు మెడిసిన్‌లోకి వెళితే మాత్రం మంచి వైద్యులు కాగలరని, బాగా పేరు తెచ్చుకోగలరని నా అభిప్రాయం. ఎందుకంటే పల్లెటూళ్లో కనీసం కొన్నేళ్లు పెరిగితే సామాన్య మానవుల కష్టసుఖాలు ఏమిటో అర్థమవుతాయి. ఏదో సెలవులకు చుట్టపుచూపుగా వెళితే అర్థమయ్యే విషయాలు కావు అవి. వైద్యులనే కాదు, ఏ రంగంలో రాణించాలన్నా పల్లెటూళ్ల జీవన శైలి తెలిసి ఉండటం మంచిదని నేననుకుంటాను. ‘పుట్టినూరి నుంచి ఒక మనిషిని బైటికి తీసుకురాగలం గాని మనిషిలోంచి సొంతూరిని తీసెయ్యలేం’ అని ఒక ఇంగ్లీషు సామెత ఉంది. అలా నేను ఈడుపుగల్లు నుంచి బైటికొచ్చి చాలా దూరం ప్రయాణించానుగాని, నా లోపల మా ఊరు ఇప్పటికీ అలాగే సజీవంగా ఉంది. మా ఊరు నన్ను మంచి వైద్యుణ్ని చేసింది, అంతకన్నా మిన్నగా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దింది.”

ఈడుపుగల్లుతో పాటు ఆ చుట్టుపక్కల పల్లెటూళ్లన్నిటికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ శాఖ ఒకదాన్ని విజయవాడ సమీపంలోని తాడిగడపలో ప్రారంభించాం. ఇది మా ఊరికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పరిసరాల్లో ఉన్న గ్రామస్థులందరికీ అది ప్రపంచస్థాయి నేత్ర వైద్యాన్ని అందిస్తోంది. నాకు మేనమామ వరసయ్యే మైనరుగారు ఆయన కొడుకు కుటుంబంతో ఈడుపుగల్లులోనే ఉంటున్నారు. ప్రతి రెండు మూడు నెలలకోసారి ఊరెళ్లి వాళ్లను చూసొస్తుంటాను.

ఈడుపుగల్లు గాంధీ
మా ఊరి గురించి ఇంత చెప్పాను కదాని ఈడుపుగల్లు వెళ్లి ‘గుళ్లపల్లి నాగేశ్వరరావు’ అంటే ఎంతమంది గుర్తుపడతారో చెప్పలేను. ఎందుకంటే ఆ ఊళ్లో నా పేరు గాంధీ. పసివయసులో మా ఇంటి అరుగుల మీద కూర్చుని ఎవరైనా నా పేరడిగితే ‘గాంధీ’ అని చెప్పేవాణ్నట. అందుకని ఊళ్లో ఆ పేరే స్థిరపడిపోయింది నాకు.

మారకపోవడం మా ఊరి చలవే
సాధారణంగా పల్లెటూళ్ల నుంచి వైద్యవృత్తిలోకి వచ్చేవాళ్లు – వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లినప్పుడు, పది పదిహేనేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చేద్దామని అనుకుంటారు. కాని వెళ్లిన తర్వాత ఎక్కువమంది ఆ ఆలోచనను మర్చిపోతారు. నేను ఎన్ని దేశాలు తిరిగినా తొలినాటి ఆలోచనను మర్చిపోకుండా, మారిపోకుండా మళ్లీ మన దేశానికి వచ్చెయ్యడం, ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థను ప్రారంభించడం వెనక మా ఊరి ప్రభావం ఎంతో ఉంది.
ం అరుణ పప్పు
ఫోటోలు : గోపి, కస్తూరి చిట్టిబాబు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

’ఉత్తినే ఉత్తినే…… ‘’అంటూ నిజంగానే నిష్క్రమించిన ఏ.వి.ఎస్.

‘’ఉత్తినే ఉత్తినే ‘’అంటూ నిజంగానే నిష్క్రమించిన ఏ.వి.ఎస్.

తెలుగు హాస్య నటుల్లో ఎవరికి వారు ప్రత్యేకం గా ఉన్నారు ఎవరి శైలి వారిదే .ఎవరి డైలాగ్ డెలివరి తీరు వారిదే .అంతా విలక్షణ నటులే .విడుదలైన మొదటి చిత్రం మిస్టర్ పెళ్ళాం తో తెలుగు ప్రేక్షకుల కు పరిచయమయ్యాడు ఏ.వి.ఎస్. అప్పటి నుంచి దాదాపు అయిదు వందల సినిమాల్లో తన మార్కు హాస్యాన్ని పండించాడు .దేనికదే సాటి గా మేటి గా నటించి మెప్పించాడు .అదో ‘’తుత్తి’’ఆయనకూ ,మనకూ గా మిగిలింది .కిత్తుడు అన్నా ,కిత్నాత్తమి అన్నా ,అతలు అని స బదులు త వాడి కితకితలు పెట్టాడు అరంగేట్రం తోనే .అది అమాయక పాత్రా కాదు తెలివి ఉన్న వాడి డీ కాదు మానవత్వం కూడా మిళితమైన పాత్ర .ఈ పాత్ర సృష్టికర్త ముళ్ళ పూడి అయినా ,దాన్ని నిజ రూపం లో ఆవిష్కరించిన వాడు ఏ.వి.ఎస్ .మాత్రమె. దీన్ని ఇంత గొప్పగా తీసి చూపించిన వాడు సినీ పుంభావ సరస్వతి బాపురే బాపు .

‘’ఉమాపతి’’గా బ్రహ్మానందాన్ని ‘’అదో టైపు ‘’లో చేరువై గిలిగింతలు పెట్టి ,అతనికి సంకటాన్ని మనకు సంభ్రమాన్ని కలిగించాడు .’’మాఅమ్మాయి నిజంగా నీతో చెప్పిందా ? నోటితోనే చెప్పిందా? ప్రామిస్ !’’అని మాటలు రాని కూతురు శ్రీ లక్ష్మి బ్రహ్మానందం ప్రేమించి పెళ్ళికి తొందర చేస్తుంటే వాడు బలైపోతాడని ముందు హెచ్చరిక గా చెప్పి చివరికి అతని ఖర్మానికి వదిలేసిన తండ్రిగా ఏ.వి.ఎస్.నటించి జీవిస్తే బ్రాహ్మి అసలు విషయం తెలిసి షాక్ కు గురైన సన్ని వేశం కడుపుబ్బా నవ్విస్తుంది .ఇదీ ఆయన మార్కు కామెడీ .

ఏం ఎస్.నారాయణ డాన్స్ చేస్తూ హావ భావాలు ఒలికిస్తుంటే ‘ఈడు’ పందికి విగ్గు పెట్టి నట్లున్నాడు  .వీడికి డాన్స్ ఏమీ రాదురా ..వాడేడ్చినట్లేదో తీసి ఎడిట్ చేసుకో అని డైరెక్టర్ కు చెప్పే సీన్ లో బయటి మాట అనలేక లోపలి మాటను బయట పెట్టి మనకు అసలు విషయం తెలియ జేస్తాడు .’’ప్రసాదూ !ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా “’అని ఏం ఎస్.మాటి మాటికి అంటూ తనే అన్నిట్లోనూ వేలుపెడుతుంటే ‘’అలాగే బాబూ’’అని ! మమ్మల్ని ఎప్పుడు వేలు పెట్టనిచ్చావు ?’’అని జనం తికం గా  అనటం భలే నవ్వించే సీను ..

నెత్తిన టోపీ పెట్టె పాత్ర అయినా పెట్టించుకొనే పాత్ర అయినా అతని నటన రమ్యం గా ఉంటుంది సహజం గా ఉంటుంది .ఏ.వి.ఎస్.అంటే ముందుగా మనకు టోపీతో  కనీ పించే రూపమే కనీ పిస్తుంది        .యాంకరింగ్ చేసినా అతని స్టైల్ గమ్మత్తుగా వెరైటీ గా ఉంటుంది .తాను  దర్శకుడై  నిర్మాత కూడా అయి ఇంతటి హాస్య నటుడుసక్సేస్ లేక అపహాస్యం పాల్లవ్వటం మాత్రం ఆయన జీవితం లో విషాదమే ..వినోదం సినిమా లో అతి తెలివిఉన్న ఇంటి యజమానిగా కళ్ళకు గంతలు కట్టుకొని అన్నీ చూస్తున్నట్లు నటిస్తూ అమాయకం గా ఉంటూ బ్రహ్మానందం- ఇంటిని సైలెంట్ గా నోట మాటలేకుండా అంతా నిలువు దోపిడీ చేస్తుంటే,డబ్బు ,నగలు ఎక్కడున్నాయో జాగ్రత్త చేసే నెపం తో భార్యకుచెబుతూ  దొంగకు తెలిసేట్లుచేసి సర్వ మంగళం పాడించుకొన్న సీను అదరహో  .

నారద వేషం లోను ఏ.వి.ఎస్.తన మార్కు స్టైల్ తోనే నటించాడు ,మెప్పించాడు .పౌరాణికమైనా సాంఘిక మైనా పాత్రోచితం గా నటించి పాత్రలో లీనమై పోయి నటించే నేర్పున్న వాడు .తండ్రిగా, తాతగా కూడా నటించి సామర్ధ్యం చూపాడు .అందులోను హాస్యాన్ని నింపి ఒలికించాడు .     శుభాకాంక్షలు సినిమాలో సంగీత సాధకుడు గా కడుపుబ్బా నవ్విస్తాడు .కాని సహృదయం ఉన్న వాడుగా జగపతి బాబుకు సుధాకర్ కు ఆశ్రయం కల్పించి మేలు చేస్తాడు .అలాగే ఇంకో సినిమాలో నాదస్వరం వాయిస్తూ హాస్యాన్నే పిండిస్తాడు .

జర్న లిస్టు గా జీవితాన్ని ప్రారంభించి ,మిమిక్రీతో పైకొచ్చి హాస్య నటుడైస్తిరపడి  ,తెలుగు దేశం పార్టీ కి ప్రచార సారధియై .తన శక్తి యుక్తులను వినియోగించి నాయకుల మన్ననల నందుకొని ,రాజకీయ వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ ఆంధ్రజ్యోతి లో ఈ మధ్య దాకా ‘’ఉత్తినే ‘’శీర్స్ధిక లో అనేక కవితలను ప్రాస బద్ధం గా రాసి ,చదువుతూంటేనే  గిలిగింతలు పెట్టించి,ఆరోగ్యకర హాస్యాన్నిఅందించి ,సంస్కారం చూపి   ఆ నాయకులకు కొరడా దెబ్బలుగా వాటిని రంగరించి  హాస్యాన్ని సృష్టించాడు .ఉత్తినే అనిరాసి నిజం ఆనే ఈ జీవిత రంగాస్తలం నుండి నిష్క్రమించిన ’’ఎప్పుడూ విపరీతం గా సెటైర్’’(ఏ.వి.ఎస్.)  చిందించే ‘’హాస్య నట చిరంజీవి ఏ.వి.ఎస్.ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను.

‘మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-11-13-ఉయ్యూరు

.

 

Posted in సినిమా | Tagged | Leave a comment

నమ్మాల్సిన నిజాలు -2

   నమ్మాల్సిన నిజాలు -2

లోక్ నాయక జయ ప్రకాష్ నారాయణ గారికి కూడాఆరోగ్య విషయం లో  దేవరహా బాబా ఏంతో తోడ్పడిన విషయం ఇప్పుడు తెలుసుకొందాం .ఇందిరా గాంధి ఎమర్జన్సీ విధించి ముఖ్య రాజ కీయ నాయకులను జైల్లో పెట్టించిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది .ఆ సమయం లో లోక్ నాయక జయ ప్రకాష్ నారాయణ ను కూడా వృద్ధాప్యం అని లెక్క చేయకుండా జైల్లో పెట్టారు .ప్రజాగ్రహం ,స్వంత పార్టీలో వ్యతిరేకత గమనించిన ఇందిరా తన నియంతృత్వ ధోరణికి కొంత తగ్గి నాయకుల్ని జైలు నుంచి విడుదల చేయించింది .జయప్రకాష్ విడుదల అయిన తర్వాతా తీవ్ర మైన కిడ్నీ సంబంధ మైన జబ్బు చేసి బొంబాయి జేస్లోక్ హాస్పిటల్ లో చేరారు .డాక్టర్లు ఆయన్ను కాపాడటానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు .

ఆయన సన్నిహితులందరూ కలిసి ఈ సంక్షోభం నుంచి బయట పడద వేయ గల వారు ఒక్క ‘’దేవా రాహా బాబా ‘’మాత్రమె అని నిశ్చయించు కొన్నారు  .సమాజ్ వాది పార్టీ నాయకుడు రామా నంద సిన్హా

లోక్ నాయకు కు అత్యంత సన్నిహితుడు . అంతేకాక బాబా పై అత్యంత భక్తీ విశ్వాసాలు కల వాడు.అతను  వచ్చి బాబా ను పదేపదే జయప్రకాష్ ను కాపాడమని కాళ్ళా వేళ్ళా పడి వేడుకొన్నాడు .అప్పుడు బాబా ‘’నాయనా !ప్రమిదలో నూనె అయి పోయిన తర్వాత ఒత్తిఎలా వెలుగుతుంది ?’’అని ప్రశ్నించారు.అప్పుడు రామా నంద ‘’నూనె మళ్ళీ పోస్తే వెలుగుతుంది కదా బాబా ‘అలాగే జయప్రకాశ్ గారికి జీవితాన్నివ్వండి ‘’అని ప్రార్ధించాడు .మళ్ళీ బాబా ‘’నాయనా ఎవరు తన ఆయుర్దాయాన్నిజయ ప్రకాశ కు  ఇవ్వటానికి ఒప్పుకుంటారు ?’’అని ప్రశ్నించారు .వెంటనే రామా నంద ‘’నేను ఇవ్వటానికి సిద్ధం బాబా .ఆయన్ను ఎలాగైనా బతికించండి ‘’అన్నాడు .బాబా మళ్ళీ ‘’నీఆయుర్దాయం అంతా ఇవ్వక్కర్లేదు .ఒక అయిదేళ్ళ ఆయుర్దాయాన్ని ఆయనకిస్తే చాలు .ఈ అయిదేళ్ళలో జయప్రకాష్ బతికి ఉన్నంత కాలం  నీకోరికలేవీ నేర వెరవు నీకిస్ట మైతే ఆయన్ను కాపాడతాను ‘’అన్నారు .ఆనందం గా రామానంద్ అంగీకరించారు .మళ్ళీ బాబా  ‘’నీ ఆయుర్దాయం తీసుకొని తానూ బతికానని జయప్రకాశ్ కు తెలిసిన మరుక్షణం ఆయనకు విరక్తి కలిగి అదే ఆఖరి క్షణం అవుతుంది. కనుక ఈ రహస్యం మన ఇద్దరి మధ్యనే ఉండి పోవాలి జయరకాష్ కు తెలియ నివ్వద్దు సుమా ‘’అని హెచ్చరించారు

‘’నేను ధర్మ దేవతను జయప్రకాశ్ కోసం ప్రార్ధిస్తాను .అప్పటి దాకా నువ్వు హరి నామ స్మరణ చేస్తూ ఉండు ‘’అని చెప్పి కుటీరం లోపలి వెళ్లి పోయారు బాబా .అక్కడ చేరిన భక్తులందరూ రామానంద్ టో కలిసిజయప్రకాష్ కోసం  హరి నామ స్మరణ భక్తిగా చేశారు .కొద్ది సేపటికి బాబా బయటికి వచ్చిరామానంద్ తో  ‘’నేను నారాయణ కోసం ధర్మ రాజు ఖాతాలో నీఆయుర్దాయం నుండి అయిదు సంవత్సరాలు జమ చేశాను .ఈ విషయం మాత్రం జయప్రకాశ్ కు తెలియ కూడదు ‘’అని చెప్పి ఒక విభూతి పొట్లం ఇచ్చి నారాయణ్ తలదిండు కింద పెట్టమని చెప్పారు బాబా .కొన్ని ఉసిరికాయలు కిస్ మిస్ పళ్ళు రామానంద్ కు ఇచ్చి ‘’నువ్వు నారాయణ్ ను చేరగానే ఆయనతో వీటిని తిని పించు .ఇదంతా శనివారం లోపే జరిగి పోవాలి ‘’అని ఆదేశించారు .రామా నంద ఆనందం తో అలాగే నని బయల్దేరాడు .నాలుగడుగులు వేశాడో లేదో బాబా అతన్ని పిల్చి ‘’నువ్వు జయప్రకాష్ ను ఇప్పుడు చేరలేవు .మరేవ్వరికైనా ఇచ్చి

పంపించు .ఆ వెళ్ళే మనిషికి ఈ ప్రసాదం తిని పించు .ఏ ఆటంకం లేకుండా అప్పుడు అతను రాయణ్ ను చేరగలడు ‘’అని చెప్పారు .

రామానంద్ కు బాబా మాటల్లో అంతరార్ధం తెలియ లేదు .కొన్ని గంటల్లోనే ఆయనకు జ్వరం వచ్చి కదలలేక పోయాడు .బాబా మాటలు జ్ఞాపకం చేసుకొన్న రామా నంద పాట్నా లో ఉన్న తన స్నేహితుడు నారాయణ అనే వ్యక్తిని పంపాడు .ఈ నారాయణ బాబా ను ఎప్పుడూ చూసిన వాడు కాదు .వెంటానే బయల్దేరి బొంబాయి చేరి జయ ప్రకాష్ ను కలిశాడు .అప్పటికే చిక్కి శల్య వస్త లో ఉన్న జయప్రకాష్ ను చూసి దిగులు పడ్డాడు .’’దేవా రాహా బాబా ఈ ప్రసాదం మీకు ఇమ్మన్నారు.తినండి ‘’అని చెప్పికిస్ మిస్ నోట్లో వేసి ,ఉసిరి రసాన్ని తీసి బాబా నోటిలో పోశాడు  విభూతి పొట్లం దిండు కింద పెట్టాడు .నారాయణ్ దగ్గర ఈ నారాయణ సెలవు తీసుకొని పాట్నా చేరుకొన్నాడు .సాయంత్రం బజారులో ఒక దుకాణం దగ్గర ఆగితే ఆ దుకాణ దారు ‘’జయ ప్రకాష్ నారాయణ్ చని పోయారు ‘’అని ఏడుస్తూ చెప్పాడు .ఆశ్చర్యం వేసింది బాబా అబద్ధం చెప్పరుకదా అని పించింది .

ఈ వార్త తో తెల్ల వార్లు  నిద్ర పట్టక నారయణ చాలా బాధ పడ్డాడు

పొద్దున్నే దిన పత్రిక చూస్తె ‘’నిన్న రాత్రి జయ ప్రకాష్  ఆరోగ్యం విషమించింది .ఆయన్ను ‘’ఇన్సెంటివ్ కేర్’’ లో చేర్చారు .అందువల్ల ఆయన చని పోయారనే వార్త లోకం లో వ్యాపించింది కాని అర్ధ రాత్రి అయిన తర్వాత ఆయన బాగా కోలుకొన్నారు .ఆహారం కూడా తీసుకొన్నారు .’’అని రాసి ఉంది .జయప్రకాష్ బాబా దయ వాళ్ళ బతికారని ఏంతో సంతోషించిన నారాయణ బాబా కు జయప్రకాష్ గారి కృతజ్ఞతలు తెలియ జేయటానికి సరయూ నది ఒడ్డున ఉన్న బాబాను చేరాడు .రాగానే బాబా ‘’జయప్రకాష్ ను కలిశావా ?కిస్ మిస్ తిని పించావా ?విభూతి దిండుకింద పెట్టావా ?’అని ప్రశ్నల వర్షం కురిపించారు .బాబా ను చూడటం నారాయణ కు ఇదే మొదటి సారి .తర్వాత బాబా దగ్గర శిష్యుడై దీక్ష తీసుకొన్నాడు

బాబా అనుగ్రహం టో జయ ప్రకాష్ నాలుగేళ్ళు జీవించారు .అయన ఆయుర్దాయాన్ని అయిదేళ్లకు పెంచారుకదా నాలుగేళ్ళకే ఎలా చని పోయారని భక్తులు బాబా ను ప్రశ్నించారు .బాబా నిర్లిప్తంగా’’ తన ఆయుర్దాయం పెరగటానికి కారణం జయప్రకాష్  కు తెలిసిన మరుక్షణం మనస్తాపానికి గురౌతాడు .అది ఆయన మృత్యువుకు కారణం అవుతుంది అని ముందే సూచించాను .ఆయనకు ఈవిషయం తెలిసింది వెంటనే శరీరం వదిలేశాడు ‘’అని జరిగింది చెప్పారు బాబా .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-11-13-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కార్తీక మాసానికి అది దేవత ఎవరు /శ్రీ చాగంటి వారి అభిభాషణం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నమ్మాల్సిన నిజాలు -1

         నమ్మాల్సిన నిజాలు -1

అనేక పేర్లతో పిలువబడుతూ ,అనేక వేల సంవత్సరాలుగా జీవిస్తున్నానని చెబుతూ ,కాలా తీత సిద్ద యోగిపున్గవునిగా ఉంటూ ,తనను తానూ బ్రహ్మ స్వరూపునిగా ప్రకతిన్చుకొంటు,కబీర్ నానక్ లతో కలిసి తిరిగానని చెబుతూ నేపాల్ రాజ వంశేకులు తనకు  18తరాలుగా శిష్యులని  తెలియ జేస్తూ ,కదలాడే మహేశ్వరునిగా భక్త జనం చేత భావింప బడుతు ,బృందావన్ బాబా గా ప్రసిద్దులై ,అత్యంత శీతాకాలం లో కూడా గంగా ,యమునా నదీ తీరాలలో మంచే మీద నే నగ్నం గా పద్మాసనం లో కూర్చుంటూ ,ఆర్తత్రాణ పరాయణుడిగా పూజ లందుకొంటు ,కేవలంరోజుకు వంద గ్రాముల అవుపాలను మాత్రమె ఆహారం గా స్వీకరిస్తూ ,అహింసా మూర్తిగా ,కరుణా మయుడుగా సార్ధక నాముడై ,గోసేవా సంరక్షకుడై  ,త్రికాల దర్శి ,మహాజ్ఞాని ,అభయ ప్రదాత ,సర్వాంతర్యామిగా ,సాక్షాతూ భగ వంతుని సాకార రూపం గా అశేష జన సందోహం చేత కీర్తింప బడిన వారు బ్రహ్మర్షి ‘’దేవ రాహో బాబా’’.(దేవారియా బాబా )

.Devaha Baba.jpgInline image 1Inline image 2Inline image 3

ఋషుల జన్మ ఏరుల జన్మ తెలియదు అన్నట్లే ఈ బాబా ఎక్కడివారో ఎప్పటి వారో తెలియదు .కాని వారి మహిమలు మాత్రం వర్ణనా తీతాలు .అందుకు కొందరుభారత  రాష్ట్ర పతులు ,ప్రధాన మంత్రులు సాక్షులు .వీరిని అనుగ్రహించటం ,అవసరమైన వారికి ముందు హెచ్చరికలు చేయటంతో  బాబా పై వారికి అపార నమ్మకం కలిగింది .ఇవి మనకు నమ్మలేని నిజాలు అని పించ వచ్చు .కాని ప్రత్యక్ష సాక్షులు చెప్పటం వల్ల  అవి ‘’నమ్మాల్సిన నిజాలు ‘’అనినేను అనుకోని మీకు తెలియ జేస్తున్నాను  .

ఒక సారి మన ప్రధమ రాష్ట్ర పతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చిన్నతనం లో వారి తాత గారు ఈ కుర్రాడిని దేవరాహో బాబా దగ్గరకు తీసుకొని వెళ్ళారు .దారిలో తాతగారిని రాజేంద్ర ఆ బాబా ఎన్నాళ్ళనుంచి తెలుసు అని అడిగితె , నీఅంత వయసున్న దగ్గర్నుంచి అని సమాధానం చెప్పారు తాత .ఆ బాబా దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని ఈ చిన్నారి మరో ప్రశ్న .ఆయన్ను చూస్తె తన మనసు ఆనంద పరవశమవుతుందని తాత జవాబు .ఈ చిన్న వాడు ఆటతలాదుతు ,బాబా ఆశ్రమంలో  లో తిరిగాడు తాత కోప్పడ్డాడు. అప్పుడు దేవరాహో బాబా ‘’వీడిని కోప్పడకండి .గొప్ప సంస్కారి వీడు .వీడికి నాఆశీర్వాదం ఎప్పుడూ

ఉంటుంది ‘’అని చెప్పారు .ఈ బాలుడితో ‘’నాయనా !నువ్వు రాజువు అవుతావురా ‘’అని దీవించారు .నిజంగానే ఆయన రాష్ట్ర పతి అయ్యాడని మనకు తెలుసు .ఆ పదవిలో ఉండగా బాబాను దర్శించారుకూడా ‘’నువ్వు రాజువురా ‘’అన్నారు బాబా .దానికి సంస్కారంతో  రాజెన్ బాబు ‘’బాబా !దుమ్ముకణం ఆకాశం లో ఎగురుతుంది అది దాని గొప్ప కాదు .వాయుదేవుని దయతో దానికి ఆ అదృష్టం పట్టింది .మీ ఆశీర్వాద ఫలితం గానే నేను ఇంతవాడినయ్యాను ఇది నా గొప్ప తనం కాదు ‘’అని ఏంతో వినయం గా తెలియ జేశారు .ఈ  విషయాన్నిరాజేంద్ర ప్రసాద్  తన ఆత్మ కద లో ఆయన రాసుకొన్నారు కూడా .

పాలకోట రాజు శ్రీ కృష్ణ సాహ దేవ్ .ఆ రాజ్యం లో ఒకప్పుడు విపరీతం గా ఎలుగు బంట్లు అడవుల నుండి వచ్చి జనాన్ని చీకాకు పరచేవి .ఎన్ని రకాల ప్రయత్నించినా పార ద్రోల లేక పోయారు .అప్పుడు దేవరియా బాబా ను దర్శించి భారం ఆయన మీదే వేశాడు రాజు .ఆయనా చెప్పినట్లు రాజు రెండు వేల మందికి సరిపోయే పూరీ, కూరా ,హల్వా చేయించాడు .బాబా ఎవరికి అర్ధం కాని భాషలో ఏదో పెద్దగా అన్నారు .అప్పుడు వేలాది భల్లూకాలు వచ్చాయి .వాటిని ఒక వరుసలో

కూర్చో బెట్టి విస్తర్లలో చేయించిన పూరీ కూరా హల్వా వడ్డింప  జేశారు అవి ఏమీ మాట్లాడకుండా ఏంతో వినయం గా అవన్నీ తిని అందర్నీ ఆశ్చర్య పరచాయి .బాబా వాటితో ‘’ఇక నుంచి మీకు మానవులేవ్వరు హాని చేయరు .మీరు కూడా మీ ఆవాసాలు వదిలి రా వద్దు ‘’అని చెప్పారు అంతే అన్నీ క్రమ శిక్షణగా అరణ్యాలలోకి వెళ్ళిపోయాయి.మళ్లీ  ప్రజల మీద దాడి చేయలేదు .దీన్ని బట్టి బాబాకు ఎలుగు బంటి భాష తెలుసు అని పించిందని రాజు తన చిన్నతనం లో జరిగిన ఈ సంఘటను గుర్తు చేసుకొన్నాడు .

ఒక సారి హరిద్వార్  కుంభ మేళాలో ఒక మఠాధిపతి గారి ఏనుగు పిచ్చి పట్టి వీర విహారం చేస్తోంది .పోలీసుల వల్ల  కూడా దాన్ని అదుపు చేయటం సాధ్యం కాలేదు. అప్పుడు దేవహారా బాబా దగ్గరకు వెళ్లి మొర పెట్టుకొన్నారు .ఆయన ఒక ప్రసాదం ఇచ్చి ఏనుగుతో తిని పించమని భంవార్ సింగ్ అనేఆయనతో చెప్పారు   .ఏనుగు కు దూరం గా నిలబడి ‘’దేవరాహా బాబా ప్రసాదం ఇది అని బాబా చెప్పినట్లు చెప్పి తినమన్నాడు  భంవార్ సింగ్ .అంతే ఏనుగు కిక్కురు మన కుండ నెమ్మదిగా ఆయన దగ్గరకు వచ్చి పండుతీసుకొని తినేసింది. సింగ్ గారి చేతిలో రెండో పండు ఉంది .దాన్ని కూడా ఇమ్మని తొండం సాచింది .ఆయన ‘’ఈ పండు బాబా నాకు ప్రసాదం గా ఇచ్చారు ‘’అని చెప్పగానే అర్ధమైనట్లు ఏనుగు తొండం వెనక్కి లాక్కుని ప్రశాంతం గా వెళ్లి పోయింది .ఆ మఠాధిపతి ఏంతో సంతోషించి ఏనుగును తీసుకొని బాబా ను దర్శించాడు. బాబా తన చేతులతో ఏనుగుకు ప్రసాదం తిని పించారు .ఆ తర్వాత ఆ ఏనుగును కుంభ మేళా  లో ఊరేగించారు .ఇలా సకల జీవుల భాషా బాబాకు తెలుసు అని అంతా అర్ధం చేసుకొన్నారు

సశేషం

ఆధారం –బ్రహ్మర్షి దేవరాహో బాబా –రచన- డాక్టర్ ప్రేమ చంద్ భా ర్గవ

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ పింగళి లక్ష్మి కాంతం కవి – తిక్కన – పోతన

Thikkana Vs Pothana Pingali Lakshmi Kantham 29 10 1927R (1)

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సమంత నన్ను మార్చేసింది-కంచర్ల రమేష్ -ఆంధ్ర జ్యోతి

 

పసిపిల్లలంటే అందరికీ ప్రాణమే. కానీ, ఆ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే, అత్యంత ఆధునికమైన వనరులెన్నో కావాలి. ఆ వనరులెన్నింటినో చేర్చుకుని వెలిసిందే ‘రెయిన్‌బో’ హాస్పిటల్. దాని మూలస్తంభం పేరే డాక్టర్ రమేశ్ కంచర్ల. ఒక దశలో అప్పుల్లో కూరుకుపోయి ఇక హాస్పిటల్ నడపడం అసాధ్యమేమో అనిపించిన స్థితి నుంచి మరో మూడు కొత్త బ్రాంచీలను ప్రారంభించే స్థితికి చేరుకోవడం వెనుక రమేశ్ కంచర్ల, ఆయన బృందం అహోరాత్రులూ పడ్డ శ్రమ ఉంది. డాక్టర్‌గా, రెయిన్‌బో హాస్పిటల్ అధినేతగా ఆయనకు ఎదురైన కొన్ని సంఘటన ల సమాహారమే ఈ వారం అనుభవం.

జీవితపు విలువ గురించి, వ్యక్తిత్వపు ఔన్నత్యం గురించి తెలియచెప్పే సంఘటన లు కొన్నిసార్లు అనుకోకుండా ఎదురవుతాయి. అవి మన ల్ని సమూలంగా మార్చివేస్తాయి. అలాంటి ఓ సంఘటన నేను వైద్య వృత్తిలోకి ప్రవేశించిన తొలినాళ్లలో జరిగింది. నేనీరోజు ఈ స్థితిలో ఉండడానికి ఆ సంఘటనే ప్రధాన కారణం. మాదొక మధ్యతరగతి కుటుంబం. నెల్లూరు జిల్లాలోని చిరమన మా స్వగ్రామం. ఇంటర్ అయిపోయేదాకా నేను సగటు విద్యార్థినే. కాకపోతే మా అన్నయ్య డాక్టర్ రవీంద్రనాథ్ మెడిసిన్‌లో సీటు సంపాదించాక నన్నూ డాక్టర్‌ను చేయాలన్న కోరిక మా నాన్నగారిలో మొదలయ్యింది. ఆ మేరకు మెడిసిన్ ఎంట్రెన్స్ రాస్తే తిరుపతి మెడికల్ కాలేజ్‌లో సీటు వచ్చింది. మెడిసిన్‌ను నాన్నగారి కోరిక తీర్చడం కోసం అన్నట్లుగా చేశానే గానీ, నాకంటూ ఒక లక్ష్యమేదీ లేదు. అయితే నాకు సర్జరీ చే యడం మొదట్నించీ నచ్చేది కాదు. అందుకే చ్రిల్డన్ స్పెషాలిటీలో ఫిజీషియన్‌గా చేయాలనుకున్నాను. అలాగే మంగళూరులో చ్రిల్డన్ స్పెషాలిటీతో ఎండీ చేశాను. ఆ సమయంలో మా అన్నయ్య రవీంద్రనాథ్ పై చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లాడు. ఆ దిశగా నన్నూ ప్రోత్సహించాడు. నేను అక్కడికి వెళ్లి వర్క్ చేస్తూ రాయల్ కాలేజ్‌లో ఎంఆర్‌సిపి చేశాను. అప్పటిదాకా ఏదో గాలివాటంగా సాగిపోతున్న జీవితంలోకి ఒక్కసారిగా సుడిగాలి వీచి అది మొత్తం జీవితాన్నే మార్చేస్తుందని నేనెలా ఊహిస్తాను?

పాప నేర్పిన పాఠం
ఇంగ్లండ్‌లో నేను పనిచేస్తున్న చ్రిల్డన్ హాస్పిటల్‌లో ఒకరోజు సమంత అనే ఒక ఏడేళ్ల పాప అడ్మిట్ అయ్యింది. కేన్సర్ తీవ్రమైపోయిన ఒక దశలో వేరే హాస్పిటల్ నుంచి ఇక్కడికి మార్చారు. ప్రతిరోజూ నేను ఆ పాపను చూసేవాణ్ని. 15 రోజుల త ర్వాత ఒకసారి ఆ పాప నా వద్దకు వచ్చి ఒక చాక్లెట్ పాకెట్, ఒక కార్డు ఇచ్చింది. “ఇది నీ పుట్టిన రోజా!” అన్నాను. “లేదు డాక్టర్. నేను మిమ్మల్ని ఒక ఫంక్షన్‌కు ఆహ్వానిస్తున్నా” అంది. ఆ పాకెట్ తీసుకుని, వివరాలు ఆ కార్డులో ఉంటాయి కదా తర్వాత చూద్దాంలే అనుకుని పేషెంట్లను చూడటంలో నిమగ్నమయ్యాను. అరగంట తర్వాత ఆ కార్డు విప్పి చూస్తే ఒక్కసారి నా ఒళ్లు జలదరించింది. నా గొంతు తడారిపోయింది. నా కళ్లల్లో నీళ్లు సుడితిరిగాయి. అందులో “డాక్టర్ గారూ! దయచేసి నా అంత్యక్రియల్లో మీరు తప్పకుండా పాల్గొనండి. ఇప్పటిదాకా మీరు నా పట్ల చూపిన శ్రద్ధకు, మీరు నాకు అందించిన సేవలకు కృత జ్ఞతలు- సమంత” అని ఉంది. నా కళ్లలోంచి ధారాపాతంగా కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. నాకు అర్థం కానిదొక్కటే. బర్త్‌డేకి ఆహ్వానించినంత సంతోషంగా తన అంతిమయాత్రకు ఆహ్వానించడమేమిటి.. అదీ ఓ ఏడేళ్ల పాప. ఎంత గుండె నిబ్బరం. ఎంత పరిణతి?

నేను అక్కడున్న నర్స్‌ను అడిగితే, “ఆ పాపకు కేన్సర్‌తో తాను త్వరలోనే మరణించబోతున్న విషయం తెలుసు డాక్టర్. కౌన్సెలర్లు, సైకాలజిస్టులు, నర్స్‌లు ఆరు మాసాలుగా మరణానికి ఆమెను మానసికంగా పూర్తి స్థాయిలో సంసిద్ధం చేశారు. అందుకే ఆ పాప అంత ధైర్యంగా ఉంది. ఆమె కోరికల్లా తన అత్యంత సన్నిహితులందరూ తన అంత్యక్రియల్లో పాల్గొనాలన్నదే. అందుకే ఆ కార్డులు పంచుతోంది’ అంది. అప్పటికి అతి కష్టంగా తమాయించుకున్నాను. అయితే గంట తరువాత ఆ పాప దగ్గరకి వెళ్లినప్పుడు మళ్లీ నా కళ్లల్లోంచి నీళ్లు ఉబికి వ చ్చాయి. “డాక్టర్ గారూ కార్డు చూశారు కదూ! ఎందుకు ఏడుస్తున్నారు? వద్దు వద్దు ఏడవద్దు డాక్టర్ గారూ! అంత్యక్రియలకు రావాలన్న నా కోరికను తప్పకుండా తీరుస్తారని ఆశిస్తున్నా” అంది. ఆ తరువాత వారం రోజుల దాకా నాలో నేను లేను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనుషులు ఇంత ధైర్యంగా ఒక సమస్యను ఎదుర్కోగలరని నాకు అప్పటిదాకా తెలియదు. ఈ స్థితికి చేరుకోవడానికి మనుషులు తమకు తాము కౌన్సెలింగ్ చేసుకోగలరని నాకు తెలియదు. ఈ సంఘటన జరిగిన నాలుగు రోజులకు ఆ పాపను ఇంటికి తీసుకువెళ్లారు. ఆ మరుసటి రోజే ఆ పాప చనిపోయింది.

మనసంతా చిక్కబట్టుకుని పాప అంత్యక్రియల్లో పాల్గొన్నాను. నేను ఆరోజు అనుకున్నదల్లా ఒక్కటే. పరిస్థితి మన చేతుల్లోంచి దాటిపోయిన తరువాత మనం ఎలాగూ ఏమీ చేయలేం. కానీ చేయడానికి ఎంతో కొంత ఇంకా మిగిలి ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా సేవలు అందించగ లిగితే అంత బెటర్ అని. నిజానికి అప్పటిదాకా డాక్టర్‌గా నేను అదో వృత్తి మాత్రమే అనుకున్నా. కానీ, ఆ సంఘటన తరువాత వైద్యం ఒక వృత్తి గా కాదు ఒక ప్రాణంగా తీసుకున్నాను. ఆ సంఘటన తర్వాత పిల్లల పట్ల నేను చూపే శ్రద్ధ పదింతలు పెరిగిపోయింది. వారానికి ఐదు రోజులే హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉన్నా వారానికి ఏడు రోజులూ వెళ్లే వాణ్ని. డాక్టర్ వృత్తి నిజంగా నాకొక అబ్సెషన్‌గా మారింది. పసిపిల్లల ప్రాణాలు కాపాడే ఏ చిన్నఅవకాశాన్నీ జారవిడుచుకోకూడదన్న భావన నాలో అణువణువునా వ్యాపించింది. అదే ఈ పిల్లల ఆసుపత్రి స్థాపనకు బీజం అయ్యింది.

అంచులదాకా వెళ్లాలి
ఇండియాలో మేము పిల్లల ఆసుపత్రి స్థాపించాలనుకున్నప్పుడు, అంటే 1999లో హైదరాబాద్‌లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఉన్న ఆసుపత్రి నీలోఫర్ ఒక్కటే. ప్రైవేట్ హాస్పిటల్ ఒక్కటీ లేదు. అప్పుడే కొంతమంది మిత్రులతో కలిసి అత్యంత ఆ«ధునికమైన యంత్రపరికరాలతో ఈ రెయిన్‌బో హాస్పిటల్ ప్రారంభించాం. కాకపోతే హాస్పిటల్ నిర్వహణ మాకు అనుభవంలేని పనైపోయింది. మేము అహోరాత్రులు సేవలందించడానికి సిద్ధమైనా, ఆ విషయంఅంత తొందరగా జనంలోకి వెళ్లదు కదా! అందుకే దాదాపు మూడేళ్ల దాకా ఆశించిన స్థాయిలో పేషెంట్లు రాలేదు. కోట్లల్లో పెట్టుబడి పెట్టిన మాకు బ్యాంకు రుణం కట్టడం కష్టమైపోయింది. వ్యవధి తక్కువగా ఉండడం, వడ్డీ ఎక్కువగా ఉండడం ఇవన్నీ మమ్మల్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. బ్యాంకు వాయిదాలు కట్టలేకపోయాం. నిలదొక్కుకునేందుకు ఏదైనా సాయం అందించండి అంటూ వివిధ హోదాల్లో ఉన్న బ్యాంక్ అధికారులను అదేపనిగా కలుస్తూ ఉండేవాళ్లం. కానీ, అందరూ మేమేమీ చేయలేమని చేతులెత్తేశారు.

రోజురోజుకూ అప్పుల్లో కూరుకుపోతున్నాం. ఏదైనా అమ్మి కడదామన్నా అప్పటికే అన్నీ హరించుకుపోయాయి. అప్పుడు ‘ఎందుకైనా మంచిది. ఒకసారి ఆంధ్రాబ్యాంక్ ఛైర్మన్‌ను కలవండి’ అంటూ ఎవరో సలహా ఇచ్చారు. నేను వెళ్లి పరిస్థితినంతా ఆయనకు వినమ్రంగా కాదు కొంత ఆక్రోశంగానే వివరించాను. అంతా విని “మీ పరిస్థితి నాకు అర్థమయ్యింది. నేను ఏదో ఒక రీతిలో మీకు సాయం చేస్తాను” అన్నారు. అయినా నాలో ఏదో అసహనం. అందుకే ‘మీ మాటల్ని నమ్మొచ్చా సార్!’ అన్నాను. “ప్రాసెస్ రేపే మొదలవుతుంది” అన్నారు. అప్పటికీ నాకు నమ్మకం కలగలేదు. కానీ మరుసటి రోజు మధ్యాహ్నానికల్లా బ్యాంక్ నుంచి లెటర్స్ వచ్చాయి.

అందులో తీసుకున్న రుణానికి మేమివ్వాల్సిన వడ్డీ రేటును తగ్గిస్తూ, రుణం చెల్లించే వాయిదాల గడువును పెంచుతూ, మొత్తంగా రుణం చెల్లించాల్సిన కాల వ్యవధిని పెంచుతూ, మొదటి ఆరునెలలు అసలు వాయిదాలు కట్టాల్సిన అవసరమే లేదన్నట్లు ఉత్తరాలు వచ్చాయి. వాటితో మాకు ఎంతో వెసులుబాటు కలిగింది. ఆ పరిస్థితులే మేము తిరిగిపుంజుకోవడానికి ఎంతో తోడ్పడ్డాయి. అదే జరగకపోతే ఈ రోజు మా ఊరూ, ఉనికీ ఉండేదే కాదు. ‘ఏం సాధించాలన్నా చివరిదాకా పోరాడాలి’ అనే మాటలోని అర్థమేమిటో నాకు అప్పుడు మరింత స్పష్టంగా బోధపడింది. అప్పటిదాకా లేనిదేదో ఆ చివర్లో ఉంటుందని కాదు. ఒక్కొక్కటిగా మనకు ఎదురైన వైఫల్యాలు మనకు నేర్పిన పాఠాలతో ఆ తరువాత్తరువాత మనలో వ్యవహార దక్షత పెరుగుతుంది. అది ఎదుటివారికి మన మీద విశ్వాసం కలిగేలా చేస్తుంది. నా విషయంలో జరిగింది ఇదే.

ప్రయత్నమెందుకు ఆపడం?
ఇటీవలే నా అత్యంత సన్నిహిత మిత్రుడొకరు ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన కూడా డాక్టరే. నెల్లూరులో జరిగిన ఆ ప్రమాదంలో కారు స్టీరింగ్ పొట్ట, ఛాతీ భాగాల్లో బలంగా గుద్దుకోవడంతో కడుపులోని ఆహారం శ్వాసకోశాల్లోకి వచ్చేసింది ఆ తరువాత కొద్దిసేపట్లోనే కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ విషయం తెలిసిన నేను మద్రాసులోని గ్లోబల్ హాస్పిటల్‌కు ఫోన్ చేసి, సంబంధిత డాక్టర్లను నెల్లూరుకు రప్పించాను. ఆ తరువాత ఇక్కడి నుంచి అంబులెన్స్‌ను నెల్లూరుకు పంపించి నేను విమానంలో నెల్లూరుకు చేరుకున్నాను. వెళ్లిన వారు ప్రధమ చికిత్సలేవో చేశారు కానీ, అవసరమైన పరికరాలన్నీ అక్కడ అందుబాటులో లేవు. పరిస్థితి నిమిష నిమిషానికీ విషమిస్తోంది. అత న్ని వెంటనే మద్రాసుకు తరలించడం తప్ప మరో మార్గం లేదని చెప్పాను. కానీ, అక్కడున్న వాళ్లంతా తరలించే ఒత్తిడిలో వీడు దారిలోనే చనిపోతాడు కాబట్టి, ఏం చేసినా ఇక్కడే చేయండి అంటూ చెబుతున్నారు.

నాకేమో వీడు ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయమని తెలుస్తోంది. రక్తబంధమేదీ కాదు కాబట్టి నేను వాడి కుటుంబ సభ్యులమీద ఒత్తిడి తేలేను. నా ఆలోచనల్ని విరమించుకుంటే నేను వాడ్ని శాశ్వతంగా కోల్పోతాను. రెండు వైపులా ప్రాణాపాయమే ఉన్నప్పుడు చేష్టలుడిగిపోయి విఫలమైపోవడం కన్నా, ప్రాణాల్ని కాపాడే ప్రయత్నంలో విఫలమైపోవడం మేలనిపించింది. నిజంగానే వాళ్లంతా అంటున్నట్లు మార్గమధ్యంలో చనిపోయి, నాకు రాకూడని చెడ్డ పేరంతా వచ్చినా సరే! వాడిని తీసుకు వెళ్లాల్సిందే అనుకున్నాను. కుటుంబ సభ్యులకు ధైర్యం రావడానికి వాడి ప్రాణానికి నా ప్రాణం ఇస్తా అన్న అర్థం వచ్చేలా హామీ ఇచ్చాను. మొత్తానికి వాడ్ని మద్రాసుకు తరలించాను.

కొత్తగా వచ్చిన ఎక్మో అనే ఒక పరికరాన్ని, దాన్ని నిర్వహించే నిపుణులందరినీ ముంబయ్‌కు ఫోన్‌చేసి చెన్నయ్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌కు తెప్పించాను. ఇది శ్వాసకోశాలను, గుండెనూ విశ్రాంత స్థితిలో ఉంచడం వల్ల అవసరమైన బైపాస్ సర్జరీలన్నీ చేయవచ్చు. ఆ సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. అతనిప్పుడు పూర్తిగా కోలుకుని డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అన్ని దశల్లోనూ విమర్శలు ఉంటాయి. అయినా అవసరమైనప్పుడు తెగించి అడుగు ముందుకు వేయకపోతే, అమూల్యమైన వాటిని శాశ్వతంగా కోల్పోతామన్న సత్యాన్ని ఈ సంఘటన నాకు చెప్పింది.

నిస్సహాయతలోంచి నిలదొక్కుకోవాలి
కొన ఊపిరిని నిలబెట్టినప్పుడు ఒక గొప్ప ఆనందాన్నే పొందుతాం. ఎంత శ్రమించినా ఒక్కోసారి ఏ ఫలితమూ ఉండదు. ఒక నిస్సహాయ పరిస్థితి నిలువునా ముంచేస్తుంది. ఆ క్షణంలో ఈ మాత్రానికి ఎందుకీ వైద్య వృత్తి అని కూడా అనిపిస్తుంది. మన నిస్సహాయతను అర్థం చేసుకోకుండా, పరుషాతిపరుషంగా నిందించే వారిని చూసినప్పుడు ఇవన్నీ భరించడానికేనా ఈ వృత్తిలోకి వచ్చిందీ అని కూడా అనిపిస్తుంది. కానీ, ఆ నిస్సహాయ స్థితిలోనూ నిబ్బరంగా ఉండడం ఎంతో ముఖ్యం. ఒక డాక్టర్‌గా నీ శక్తిని నూటికి నూరు శాతం ఉపయోగించావా లేదా అన్నదే ముఖ్యం కానీ అధిగమించలేని పరిమితులను చూసి నీరుగారి పోవడం వల్ల ఫలితమేముంది? వాస్తవానికి నిరంతరం కొంగ్రొత్త పరిశోధనా ఫలితాలు వెలుగు చూస్తున్నాయి. ఒకప్పుడు చికిత్స అసాధ్యంగా ఉన్న ఎన్నో వ్యాధులు ఈ రోజుల్లో నయమవుతున్నాయి. ఈ రోజు అసాధ్యంగా ఉన్నవి రేపు సాధ్యమవుతాయి. నిస్సహాయత నుంచి నిలబెట్టేది, ముందుకు నడిపించేది ఎప్పటికైనా ఆశావహ దృక్పథమే. ఈ మాటే నేను నా మనసుకు పలుమార్లు చెప్పుకుంటాను. నా సహచరులందరికీ చెబుతుంటాను.

 బమ్మెర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ నారాయణ మూర్తి శ్రీ రాం ప్రసాద్ గార్ల పదవీ విరమణ

శ్రీ నారాయణ మూర్తి శ్రీ  రాం ప్రసాద్ గార్ల పదవీ విరమణ

శ్రీ నారాయణ మూర్తి గారు నాలుగు రోజుల రాత్రి క్రితం నాకు ఫోన్ చేసి తాను,రాం  ప్రసాద్ గారు అక్టోబర్ ముప్ఫై ఒకటి న రిటైర్ అవుతున్నామని, తనకు నా  ఆశీస్సులు కావాలని ,ఇంటికి వచ్చి చెబుతానని సన్మానం రోజు వచ్చి డిన్నర్ కూడా తీసుకొమ్మని కోరారు .సరే అన్నాను.నిన్న ఉదయమే మా ఇంటికి మూర్తి గారు వచ్చి పాదాల నంటి నమస్కరించి ,ఆశీర్వాదం తీసుకొన్నారు .మనస్పూర్తిగా ఆశీర్వదించి మన సరసభారతి ప్రచురించిన ‘’సిద్ధ యోగి పుంగవులు ,’’శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ‘’రెండు పుస్తకాలు కానుకగా అందించాను. ఎంతో ఆనందం గా తీసుకొన్న సంస్కారి .నా ఆశీర్వాదం తీసుకొన్న తర్వాతే ,చివరి రోజున కాలేజికి వెళ్దామని అనుకోని వచ్చానని చెప్పారు మేమిచ్చిన కాఫీ తాగి, కాలేజికి వెళ్ళారు

పొలిటికల్ సైన్స్ హెడ్  అయిన మూర్తి గారు అందరికి తలలో నాలుకగా వ్యవహరించి మంచి ప్రజా సంబంధాల నేరుపుతారు .గొప్ప స్నేహ శీలి .ఆత్మీయత ,ఆప్యాయత కురి పిస్తారు .నేను పదేళ్ళ క్రితం ఫ్లోరా స్కూల్ లో అడ్మిని స్త్రేటార్ గా పని చేసి నప్పుడు వారి రెండవ పాప   టెన్త్ చదివింది .అప్పటి నుంచి పరిచయం .నవ్వు ముఖం చూడ గానే వ్యక్తిత్వం తెలుస్తుంది. గొప్ప సంస్కారి ,ఆప్యాయం గా అందర్నీ పలకరిస్తారు .నాలుగేళ్ళు గా మేం నిర్వహించే సరస భారతి కార్యా క్రమాలకు అన్నిటికి దాదాపు హాజరై ఎంతో సంతృప్తి ని వ్యక్తం చేసే వారు .ఒకసారి ఒక సమావేశానికి అధ్యక్ష స్తానం కూడా అలంకరించారు. మాకెంతో ప్రోత్సాహ కారి .బెజ వాడలో జరపదలచుకొన్న మూడవ ప్రపంచ తెలుగు రచయితల సంఘానికి ప్రతి నిధి గా కోరిన వెంటనే నమోదైన  సాహితీ పిపాసి .శ్రీ దత్త భక్తులు కూడా. .మా ఆంజనేయ స్వామి ఆలయానికి తరచూ వస్తారు దంపతులు.వారి పెద్దమ్మాయి వివాహం దత్త గుడి లోనే చేస్తూ శుభ లేక ఇంటికి వచ్చి ఇచ్చి, వచ్చి ఆశీర్వదించమని కోరారు. అలానే నేను, మా మనవడు చరణ్ తో వెళ్లి ఆశీర్వదించి విందు భోంచేసి వచ్చాను .కాలేజి లో సరసభారతి, కృష్ణా జిల్లా రచయితల ,సంఘం కాలేజి తెలుగు శాఖ,సం యుక్తం గా విద్యార్దులకోసం చేసిన అనేక కార్య క్రమాలకు చక్కని సహకారం అందించిన వారు .ప్రిన్సిపాల్ రాయుడు గారికోరిక పై నేను అక్కడ మూడేళ్ళు గెస్ట్ లెక్చర్లు ఇస్తే వాటికి స్వయం గా హాజరై ప్రశంశించిన సహృదయులు .ఇలాంటి సీనియర్ అయిన వీరి పదవీ విరమణ తో, కాలేజి లో కొంత కొరత ఏర్పడుతుంది .యాజ మాన్యం నిన్న సభలో వీరిసేవలు సద్వినియోగం చేసుకొంటామని చెప్పటం అందరికి శుభ వార్తయె .

This slideshow requires JavaScript.

శ్రీ రాం ప్రసాద్ గారు ఫిజిక్స్ హెడ్ .రాం ,నారాయణులు ఇద్దరు నరనారాయణు ల  వంటివారు కాలేజికి. ,ఫిజిక్స్ లో పెద్ద దిక్కు, ఫ్లోరా హైస్కూల్ మూల స్తంభాలలో ప్రసాద్ గారొకరు .మంచిఅవగాహన ఉన్న వారు .సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ .కూడా .నేను ఫ్లోలోరాలో పని చేసినప్పుడు వీరి అమ్మాయి టెన్త్ చదివింది .భక్తీ పరులు .అప్పటి నుంచే పరిచయం .ఎక్కడ కనీ పించినా ,నమస్తే అంటూ పలకరించే సంస్కారం రాం ప్రసా ద గారిది. భార్య శ్రీమతి పద్మ గారు

ఫ్లోరాలో హాస్టల్ నిర్వహణ లో సమర్ధురాలు .ప్రతి మంగళ వారం మా ఆంజనేయ స్వామి గుడికి వస్తారు. ఇక్కడ జరిగే అన్నికార్యక్రమాలలో భక్తిగా పాల్గొంటారు .అలాంటి వీరి సేవలను కూడాకాలేజి వారు కొనసాగిస్తామని సభలో చెప్పటం ఆనందం గా ఉండే విషయమే. వీరి విరమణ జీవితం సుఖ ప్రదం గా ఉండాలని కోరుకొంటున్నాను .

విరమణ వేడుకలో పదనిసలు

వేదిక మీద ఉన్న బానర్ లో’’పదవీవిరమణ’’   అని ఉండాల్సింది ‘’పదవ విరమణ‘’అన్నట్లు గా ఉంది .అలాగే చెరుకు మొక్కలు ఉయ్యూరు ప్రాంతం లో పండే పంచదార చెరకు మొక్కలు గాలేవు .బెల్లం చెరుకు గడల్లాఎర్రగా  ఉన్నాయి .బహుశా ఎవరూ గమనించలేదేమో .

ఈ కాలేజి లో బాటనీ లెక్చరర్ గా ,ప్రిన్సిపాల్ గా పని చేసి రిటైర్ అయిన శ్రీ కోటేశ్వర రావు గారు నన్ను పలకరించి చాలా అఆప్యాయం గా మాట్లాడారు. బెజ వాడలో ఉంటున్నారట .వారబ్బాయి కెనడా లో ఉద్యోగిఅట .పేరు కిషోర్ అని చెప్పిన జ్ఞాపకం. అతను నిత్యం సరసభారతి బ్లాగ్ చదివి ఎంతో ఆనందించి తనకు ఫోన్ చేస్తూ ఉయ్యూరు విశేషాలు బాగా తెలియ జేస్తున్నారని మెచ్చుకోన్నాడట .ఈ మధ్య వర్షాలకు గ్రౌండ్ జల సముద్రం గా మారినది నేను ఫోటోలు తీసి పంపిన వాటిని   కూడా చూశాడట .ఇది సరసభారాతికి మంచి కితాబు .

రాం ప్రసాద్ గారి సన్మానం పూర్తీ అయ్యేసరికే రాత్రి దాదాపు తొమ్మిదయింది .తర్వాత మూర్తి గారి సన్మానం.చాలా ప్రేమ ఆప్యాయతలతో వీడ్కోలు సభ నిర్వహించారు. అందరు అభినందనీయులే . డిన్నర్ కాంటీన్ లో అని అనౌన్స్ చేస్తే అక్కడికి వెళ్తే ఏమీ కనీ పించక ఉండలేక ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేశాను .

మీ- గబ్బిటదుర్గా ప్రసాద్ -1-11-13-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పింగళి లక్ష్మీ కాంతం గారి నాటక నటనా కౌశలం-3

 పింగళి లక్ష్మీ కాంతం గారి నాటక నటనా కౌశలం-3

-చివరి భాగం

పింగళి వారు గయోపాఖ్యానం లో కృష్ణుడు ,పాదుకా పట్టాభిషేకం లో భరతుడు ,కంఠాభరణం లో కృష్ణా రావు ,రసపుత్ర విజయం లో రాజసిమ్హుడు,ప్రతాప రుద్రీయం లో విద్యానాధుడు ,చిత్ర నలీయం లో బాహుకుడు ,ముద్రా రాక్షసం లో రాక్షస మంత్రి ,మ్రుచ్చ కటికం లో చారు దత్తుడు వేషాలు ధరించి అన్నిటికీ గుర్తింపు తెచ్చుకొన్నారు .రాజ సింహ పాత్రకు పోటీలలో బంగారు పతకం గెలుచుకొన్నారు .ఈ పోటీని పురాణం సూరి శాస్త్రిగారే నిర్వ హిమ్చారు . శాస్త్రి గారు పింగళి వారికి’’ రాయల్ పాట్రన్ ‘’అయ్యారు .రాజ సింహ పాత్ర వేషం లో ఖడ్గం ధరించి కనీ పిస్తే వీరావతార మూర్తిగా భాసించే వారు .ముద్రా రాక్షసం లో రాక్షస మంత్రిగా ఆయన చూపిన అభినయం లోకోత్తరం గా ఉండేది .చందన దాసు ముఖం చూడలేని జన్మ ఎందుకు అని పరితపించే ఘట్టాన్ని అద్భుతం గా పండించేవారు. కోపం తో మళ్ళీ కత్తి చేత బూని కన్నీరు ఓడుస్తూ ‘’ఆహా !కస్టమెంత కష్టము ‘’అంటూ మూడు పేజీల డైలాగులను భావ గర్భితం గా చెప్పి ,’’కాలము కాదు ఇది కత్తికి ‘’ఆని బాధ పడుతూ తనకు దేహ నాశనమే శరణ్యం అని దీనం గా బాధ పడి మళ్ళీ కత్తితో

భయపెడుతూ నిష్క్రమించే సన్నీ వేశాలలో పింగళి వారి నటన అజరామరం అని  వర్ణించ టానికి వీలుకాదని ఆ నాడు అందరు మెచ్చే వారు .

పాదుక నాటకం లో భరతుడు వేస్తూ సంభాషణలను తానె రాసుకొనే వారు కాంతం గారు .మేన మామ ఇంటి నుంచి అయోధ్యకు తిరిగి వస్తు పట్నం అంతా చిన్న బోయినట్లు కనిపించటం చూసి ఏదో కీడు జరిగిందని మనసులో శంకించే సందర్భం లో వారు రాసుకొన్న సంభాషణలు రసవత్తరం గా కరుణ రస స్పోరకం గా ఉండి చూచే వారిని చలింప జేసి గుండెలు పిండించేవి . .

పింగళి వారిలా పద్యం చదవాలని, డైలాగ్ చెప్పాలని ఆ కాలం లో ఎందరో నటులు ప్రయత్నం చేసి విఫలమయ్యారు .’’లక్ష్మీ కాంతం గారిని అనుకరిస్తూ ,వారి వెంట తిరుగుతూ ఉండేవాన్ని ‘’అని విశ్వనాధ చెప్పుకొన్నారు .తన నాటక రంగ ప్రవేశాన్ని గూర్చి పింగళి వారు ‘’నాటక రంగం లో ప్రవేశం నాకు మొదట మా గురుపాదులైన శ్రీ చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారి మూలం గానే కలిగింది .శాస్త్రి గారు తాము ఏ ఊళ్ళో అవధానం చేసినా ,అచట తాము రచించిన నాటకాలను కూడా తన శిష్యులతో ప్రదర్శింప జేసే వారు .శిష్యులకు కవిత్వం తో బాటు నటనలో కూడా తరిఫీదు ఇచ్చేవారు .నాటకాలలో వేషం వేసే వారిని ఆ నాడు చిన్న చూపు చూసే వారు .కాని వెంకట శాస్త్రి గారు తమ శిష్యుల చేత వేషాలు వేయిస్తున్నారంటే నాటక కళకు ,నటులకు కూడా గౌరవం ఏర్పడింది ‘’అని అన్నారు .

పురాణం సూరి శాస్త్రి గారు తమ ‘’నాట్యాంబు జం ‘’లో ‘లక్ష్మీ కాంతం ’రాజ సిమ్హుని వీర రస పుత్ర గుణాలు యధోచితం గా ప్రదర్శిం ఛి పరిషత్ వారి స్వర్ణ పతాకాన్ని గెలుపొందారు .శాంత స్వభావము గల ధీర నాయకుల వీరావేశము లెస్సగా అభినయిన్చును ధర్మ రాజు గుణాభినయం లో లక్ష్మీ కాంతాన్ని మించిన నటుడు లేడు .రాక్షసుని స్వభావం అంతా వాని ఆర్యా వర్త భూచరణ సామర్ధ్యము లక్ష్మీ కాంతము చే చక్కగా ప్రదర్శింప బడింది .కదా సందర్భాన్ని విమర్శించుకొని తనకు ఏ పాత్ర తగునో ,దానినే గైకొని పాత్ర సాదృశ్యము నొంది నేర్పు యేర్పడ అభినయించు లక్షణములు లక్ష్మీకాంతమునకే కలవు ‘’అని ప్రశంసిస్తూ రాశారు .

‘’సాహితీ వైదగ్ధ్య సహిత నాటక కళా శోభి పింగళి ధర్మ సూనుడొకడు ‘’అని కవి పాదుషా  పువ్వాడ శేష గిరిరావు గారు బందరు నటులను మెచ్చుకొంటూ పింగళి వారి గురించి అన్నారు ..మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారు కృష్ణా పత్రికలో ‘’నా కవి మిత్రులు ‘’అనే వ్యాసం లో ‘’ఆ కాలం లో పింగళి వారితో చెలిమి చేసిన వారు ఏమండీ అంటూ ప్రారంభించి ఒక వారం లోనే యేమిరా అంటూ మార్పు చెందే వారు .అయన అతి గంభీరులు, సింహము వంటి వారు .అయన దగ్గరకు వెళ్ళుటకు భీతి చెందే వారు .ధైర్యము తో దగ్గరకు చేరిన వారు మరల తిరిగి అవతలకు పోవుట అనేది ఉండేది కాదు ‘’అని పింగళి వారి వ్యక్తిత్వాన్ని గొప్ప గా ఎస్టిమేట్ చేశారు .ఇదీ పింగళి వారి సౌజన్యం .

కవి  అవధాని ,సాహితీ దిగ్దంతులు ,విమర్శనా సామ్రాట్ ,సాహిత్య శిల్ప వేత్త ,అభినయ సూరి ,కావ్య నిర్మాత ,సాగర సమానప్రతిభా సంపన్నులు ,ఉత్తమ దేశికులు అత్యుత్తమ శిష్యులు ,జంట కవిత్వకవి శేఖరులు ,మిత భాషి ,గంభీర స్వభావులు ,భక్తీ భావ తత్పరులు ఆచార్య వరేన్యులు,డీన్,వాజ్మయ చరిత్ర కారులు ,పాఠ్య పుస్తక రచనా సలహా

దారులు,వ్యాకరణ కర్త ,శ్రీ పింగళి లక్ష్మీ కాంతం అన్నిటా సర్వ సమర్ధులని పించుకొన్న పుంభావ సరస్వతి .

Inline image 1

సమాప్తం

నాగుల చవితి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 7-11-13- ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కార్తీక మాసంలో దీపం ప్రధానం

 

దీపం ప్రధానం! మనకి సనాతన ధర్మంలో- లౌకికమైన సాధనాల్ని సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందటానికి ప్రయత్నించటం ముఖ్యమైన అంశం. అందుకే ఆశ్వయుజ మాసంలోనూ, కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనదేదీ అంటే దీపమే. ఆశ్వయుజ మాసం చిట్టచివర వచ్చే అమావాస్య ఒక్కదానికే దీపావళి అమావాస్య అని ఒక ప్రత్యేకమైన పేరు. దీపావళి అంటే దీపాల వరుస. అందుకే దీపావళి అమావాస్యనాడు ఒక ప్రత్యేకత వుంది. మనం ఎప్పుడు స్నానం చేసినా లౌకికమైన జలాలతో స్నానం చేస్తే కురు అంటాము. మొట్టమొదట గంగ పేరు చెప్పి ఆ గంగ ఈ నీటిలో ఆవాహన అగుగాక అని అడుగుతాం. కానీ ఒక్క దీపావళి అమావాస్య తిథినాడు మాత్రం ఎక్కడెక్కడ నీరు ఉన్నా గంగ ఆ నీటిలోకి ఆవాహన అవుతుంది. అందుకే అంటే దీపావళి అమావాస్యనాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. దీపావళి అమావాస్యనాడు ప్రాతఃకాలంలో మజ్జనం లేని స్నానం చేయకూడదు. మజ్జనం అంటే తలతో కలిపి శరీరం మునిగితేనే స్నానం. లేకపోతే గౌరవ స్నానం అంటారు. అన్నివేళలా యథార్థంగా చెంబుతో నీళ్ళు తీసుకుని పోసుకుంటాం అంటారు.

నదీస్నానం గానీ, ప్రవాహ జలంలో గానీ స్నానం చెయ్యాలి. కానీ ఒక్క దీపావళి అమావాస్యనాటి ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజున గంగాదేవి వచ్చి నీటిని ఆవహిస్తుంది. లక్ష్మీదేవి వచ్చి నువ్వుల నూనెను ఆవహిస్తుంది. అందుకే తైలాభ్యంగో విధీయతే! అంటారు. నువ్వుల నూనె ఒంటికి రాసుకుని, తెల్లవారు ఝామున స్నానం చేస్తారు. దేనికి? ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మీ పరిహారార్థం! లక్ష్మీ స్పర్శలో అలక్ష్మి పోతుంది. ఇక గంగాస్నానంలో పాపనాశం అవుతుంది. ్‌భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశుః । అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో బాలకాండలో. పరమశివుని శరీరానికి తగిలింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది. గంగ ఒంటికి తగిలితే పాపాలన్నీ నశిస్తాయి. అటువంటి గంగ మనం వెళ్ళి స్నానం చెయ్యవలసిన అవసరం లేకుండానే తనే వచ్చి ఆవహిస్తుంది దీపావళి అమావాస్యనాడు. అందుకనే అభ్యంగనం చేయాలంటే నూనెను ఒంటికి రాసుకుని తల మీద నుంచి నీళ్ళు పోసుకోవాలి. ఇక రెండవ రోజు తప్పకుండా ఆ దీపాలను వరుస పేరుస్తారు. దీపాలను పేర్చి ఆ దీపాల కాంతిలో అలక్ష్మిని తొలగగొడతారు. ఆ అలక్ష్మిని దూరంగా పంపడం కోసం మేం వేద ప్రమాణాన్ని స్వీకరించి తైలాభ్యంగనం చేసి, దీపాల వరుస పెట్టి లక్ష్మిని ఆవాహనచేసి ఆంతరంలో జీవుడున్న స్థితిని, బాహ్యంలో లక్ష్మి అన్రుగహాన్ని పొందుతాం అని చెప్పటానికి అలక్ష్మిని పోగొట్టుకోవటానికి పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడిన వివిధ రకాలైన బాణసంచా కాలుస్తారు. బాణసంచా కాల్చటానికి కారణం నరకాసుర వధ అని లేదు. దేనికి కాలుస్తారు అంటే అలక్ష్మీ పరిహారార్థం. అలక్ష్మిని తరిమిగొట్టడానికి లక్ష్మిని నిలబెట్టుకోవటానికి చేస్తారు. పితృ దేవతలకు మార్గం చూపించి ఇంట్లోకి వెళ్ళి దీపం వెలిగించాలి.

ఎక్కడ దీపం వెలిగించాలి?
కార్తీక దీపం అన్నదొక్కటే అంత ప్రాశస్తం వహించింది. అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు! వెలిగించమన్నారు కదా అని కర్పూరపు బిళ్లలు పట్టుకెళ్లి ఎక్కడపడితే అక్కడ వెలిగించకూడదు. దీపం పెట్టడానికి ఎక్కడ అనువైన ప్రదేశమో అక్కడే దీపాల్ని ఉంచాలి. కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికైనా వెళ్ళండి. భక్తి ఎక్కువై నందీశ్వరుని వెనకభాగంలో పెడతారు. అదేమన్నా పద్ధతేనా? ఇంకొకరు వచ్చి ఎలా దర్శనం చేసుకుంటారు అక్కడ? ఇబ్బంది కాదూ? ఒక పని చేస్తున్నామంటే ఏదో చెయ్యడం కాదు. కొంచెం మనసు పెట్టి విచారణ చేసి, మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో, పరిణతితో చెయ్యవలసి ఉంటుందో, ఆ పరిణతితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప, యావత్ లోకానికి ఉపకారం కోసం నిర్దేశించిన ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చెయ్యకూడదు. ఇందుకే కార్త్తీక మాసానికి, నదికి అంత దగ్గర సంబంధం.

ఉపనిషత్తోల్లో దీపం
దీపం గురించి ్్‌న సూర్యోభాతి న చంద్రతారకం నేమా ద్యుతోభాతి కుతో….. త్వమేవ భాంతి మనుభాత సర్వం ఇతి భాసా సర్వమితవ్య భాసం** అని ఉపనిషత్తులు చెబుతాయి. పరమేశ్వరుడు ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగుముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకంటే ఆ వెలుగుముందు ఈ వెలుగు పనిచెయ్యదు. కాబట్టి ఆయన ఒక్కరే ప్రకాశిస్తూ వుంటాడు. కాబట్టి ప్రకాశిస్తున్న ఆ కాంతిపుంజమున్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. దీనినే పోతనగారు –
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగుపెం
జీఁకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్. (భాగ. 8-75)

వీళ్ళందరూ మహా ప్రళయంలో పడిపోతే, కటిక చీకటి ఆవరిస్తే, సూర్యచంద్రుల గమనమాగిపోతే ఈ కటిక చీకటి కావల ఒక్కడు వెలిగిపోతూ వుంటాడు. ఆ వెలిగిపోతున్న వెలుగుకు వెలుగైనదొక్కటున్నదే అది పరమేశ్వర స్వరూపం. దాన్ని నేను పిలుస్తున్నానన్నాడు గజేంద్రుడు అష్టమ స్కంధంలో.

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

డిజైనర్ మమత

 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే ఓ ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. ఆమెలో ఓ చిత్రకారిణి, ఓ కవయిత్రికూడా ఉన్నారని కొందరికే తెలుసు. తాజాగా ఆమె డిజైనర్ అవతారాన్ని కూడా ఎత్తబోతున్నారు. దీనావస్థలో ఉన్న ప్రభుత్వ చేనేత సంస్థ ‘తంతుజా’కు పునర్వైభవం తీసుకురావడానికి ఆమె నడుంబిగించారు. ఇందుకోసం ఆమె స్వయంగా కొన్ని చీరలకు డిజైన్ చేయాలనుకుంటున్నారు.అగ్గిరవ్వ మమత లోపల ఒక డిజైనర్ ఉన్నట్టు ఇంతకు ముందే కొన్ని సందర్భాల్లో బయటపడింది. అది ఎలాగంటే – కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు లోగోలను డిజైన్ చేశారామె. తన ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో ఏయే రంగులు వాడాలో కూడా ఆమె నిర్ణయించేవారు. బెంగాల్‌లో చిన్న, సన్నకారు పరిశ్రమలను ఎలా ప్రమోట్ చెయ్యాలో ఆమె సూచించేవారు. బాలికల కోసం నెల రోజుల క్రితం చేపట్టిన కొత్త పథకం ‘కన్యాశ్రీ’ కూడా ఆమె డిజైన్ చేసిన లోగోతోనే ప్రారంభమయింది.

తమ రాష్ట్రంలోని ఔషధ మొక్కల ప్రచారానికి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వాటిని మార్కెట్ చేయడానికి మంత్రుల, కార్యదర్శుల కమిటీలను ఏర్పాటు చేశారు మమత. ఆ పనిలో ఉన్నప్పుడే – మూలికలతో తయారయ్యే రంగులను చీరల తయారీకి వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందామెకు. కొత్త డిజైన్లు, సహజ రంగులతో రూపొందించిన చీరలతో ‘తంతుజా’కు పునర్వైభవం తీసుకురావాలని ఆమె ప్రణాళికలు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేరెన్నికగన్న 400 మంది చేనేతకారులను రప్పించి, వారితో ఆమె ఆలోచనలను పంచుకోవాలన్నది దీనిలో మొదటి మెట్టు. రెండో మెట్టుగా ప్రతి సంవత్సరం రెండు లక్షల చీరలను తంతుజా సొసైటీ నుంచి కొనుగోలు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇంతకు ముందు 75 వేల చీరలను మాత్రమే కొనుగోలు చేసేది. ఈ చర్యల ద్వారా బెంగాల్లోని 488 సహకార సంఘాల్లో పనిచేస్తున్న 7000 మంది చేనేతకారుల భవిష్యత్తు మారిపోతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రజలకూ లాభం ఉంది. ఒక్కొక్కటీ 184 రూపాయల విలువ చేసే చీరలను పేదలకు రూ. 104లకే అందిస్తారు. ప్రస్తుతానికి ఈ డిజైన్ సెంటర్‌కు రెండు కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రభుత్వం. ‘ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ వచ్చిన నాటి నుంచి మా అమ్మకాలు పెరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే కిందటేడు పాతిక కోట్ల రూపాయల ఎక్కువ ఆదాయం లభించింది మా సంస్థకు. దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చెయ్యనిదంటూ లేదు…’ అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తంతుజా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కేరాయ్. ‘ఇప్పుడు ఆమే స్వయంగా డిజైన్ చేస్తున్నారంటే ప్రముఖులంతా మా దుస్తులను తెగ కొంటారు…’ అని కూడా సంబరపడుతున్నాడాయన.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల నటనా కౌశలం -2

పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల  నటనా కౌశలం -2

     పింగళి వారికి”దేవ గాంధారి ”రాగం అంటే చాలా ఇష్టం .. మోహన ,కేదార గౌళ ,గౌరీ ,కళ్యాణ రాగాలన్నా ఆయనకు అమిత మోజు ఆ కం ఠానికి మాత్రం దేవగాంధారి బాగా నప్పింది  పాండవ విజయం నాటకం లో అభిమన్యు వధ ఘట్టం లో అంతా కరుణ రాసం విస్తరించి ఉంటుంది అర్జునుడు కర్ణుడిని చంపకుండా వచ్చినప్పుడు సంభాషణలు రస వత్తరం గా ఉంటాయి. ఆ సీన్ లో పింగళి వారు అద్భుత నటన ప్రదర్శించి సెహబాస్ అని పించుకొన్నారు తిరు వెంగళా చార్యులు అనే గొప్ప నటుడు ..”కరండక వేషం ”వేసే వారు .లక్ష్మీ కాంతం గారు ఈ ఘట్టం లో  చూపిన విషాదం అందరిని కళ్ళ నీరు పెట్టించేవి ..
                 ద్రోణ వధ లో కృష్ణార్జునులు ధర్మ రాజు ను అబద్ధం చెప్ప మని బల వంత పెడతారు .”వొడ బడడీ ప్రుదాగ్ర తనయుండు అనృతమ్మువచింప ”అంటూ కోపం లో ధర్మజుడు లేచి పోతాడు అంతకు ముందు  విషాదం  చూపిన  చూపిన పింగళి వారు విషాదం వదిలి కాల రుద్రునిగా మారి నిష్క్రమిస్తారు మళ్ళీ వచ్చి .”అశ్వత్థామ హత కుంజరః ”అని  అయినా అనమని పట్టుబడతాడు కృష్ణుడు ససేమిరా అననంటాడు నేను అబద్ధమాడాను నేనేక్కడికైనా వెళ్లి పోతాను అంటదు ధర్మ  రాజు ఈ సందర్భం లో . ధర్మ రాజు
”      ”ఏను అసమర్దుదన్ ధరణి ఎలాగా జాల తపోనిరూఢికై -కానన సీమకుం జనియెద కర్ణుని ద్రున్తువో ,కర్ణుని చేతనే
        ప్రాణము కోలు పోయేదవో,భండన భూమి పరిత్యజించుడువో -పూనిన మానమున్ విడిచి పోయి సుయోధను నాశ్ర యింతువో ”అని తిరుపతికవుల పద్యం పాడేటప్పుడు కూడా ప్రేక్షకులు కంట తడి పెట్టె వారు చివరికి తమ్ముడు అర్జునుని లెవ దీసి మన్నింపు మని కన్నీటితో కౌగ లించుకోవటం తో ఆ రంగం లో కాంతం గారి నటనా కౌశలం పతాక స్తాయి నందు కొంటుంది ఇంతటి మహా నటుడు ఆంద్ర దేశానికి లభించి నందుకు బందరు పౌరుల ఆనందం వర్ణనా తీతం. ధర్మ రాజు పాత్ర వారికి అజరామర కీర్తి సాధించి పెట్టింది  ఆయన్ను అపర ధర్మ రాజు గా భావిం చే వారు. నట జీవితం లోనే కాదు నిజ జీవితం లోను అబద్ధం ఆడని అపర సత్య సంధులు పింగళి వారు .
”చతురంబోది పరీత మైన  ధరణీ చక్రంబు ”అనే పద్యం ,”చచ్చిరి సోదరుల్ సుతులు ”పద్యం పాడినా రస ప్లావితమయ్యే వారు రసిక లోక జనం         ధర్మజ పాత్ర పింగళి వారు వెయ్యటం ఎలా జరిగిందో తెలియ జేసే సంఘటన ఒకటి ఉంది చెళ్ళ పిళ్ళ వారి ఆధ్వర్యం లో ఒక ఊళ్ళో పాండవ ఉద్యోగ విజయం నాటకం జరుగుతోంది. ధర్మ రాజు పాత్ర దారికి జబ్బు చేసి రాలేదు .శాస్త్రి గారు ఆ పాత్రను తనతో బాటు వచ్చిన పింగళి వారిని వెయ్యమని ప్రోత్స హించారు .వెంటనే సంకోచించకుండా వెయ్యటం అందరి మెప్పు పొందటం జరిగి పోయింది .అప్పటి నుంచి ధర్మ రాజు పాత్ర వేస్తున్నారు  .
       ఒక సారి రాజ మండ్రి లో ఈ నాటకాన్ని వేస్తున్నారు ,నాటకం మధ్యలో వడ్డాది సుబ్బా రాయ కవి (వసు రాయ కవి )లేచి నిల్చుని ”ఎవరు నాయనా నువ్వు “?అపర ధర్మ రాజు లాగా ఉన్నావు ”అని అన్నారట. లక్ష్మీ కాంతం గారు స్టేజి ముందుకొచ్చి అందులో భీమ పాత్ర దారి అయిన తన అన్న గారు నరసయ్య గారి ని వేలు పెట్టి చూపిస్తూ
          ”వీర రసావ తారుడని విశ్రుతి కెక్కిన నాటకుండువా-క్శూరుడుమానృసిమ్హునకు కూరిమి తమ్ముడ
           వీర ,శోక ,శృంగార రస ప్రధానముల నాయక వేష ధరుం డ ,సత్కవిన్ -పేరున కేను కాంతుడ పవిత్రపు వంశ జాతుడ”న్
    అని ఆశువుగా తనను పరిచయం చేసుకొన్నారు . మహేంద్ర పండితులంతా సెహబాస్ అని మెచ్చుకొన్నారు . నరసయ్య గారు ఉబ్బి తబ్బిబ్బు అయి లోపలకు వెళ్లి తమ్ముడిని ఆప్యాయం గా కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. నరసయ్య గారినటనకు బంగారు గంటల వెండి గదను బహూకరించారు నరసయ్య గారు ఆంజనేయ ఉపాసకులు కూడా ..”సంపూర్ణ మహాభారతం ”అనే నాటకం రాసి ప్రదర్శించారు కూడా .
                 కాంతం గారు స్పుర ద్రూపి అయిదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తు మనిషి. విశాలమైన పద్మ పత్రాల వంటి కనుదోయి ఉత్తమ లక్షణ సమన్వి.తులు.పలుచని చర్మ ఉండటం వల్ల  ధీరో దాత్త గుణాలున్దేవి .. వారి జీవితమూ కరుణ రస ప్రధానమే అందుకే కరుణ తో ఉన్న ధీరో దాత్త పాత్రలు ఆయనకు మరీ అచ్చోచ్చాయి .రాయల్ కంపెని మూత పడింది .ఆంద్ర సభ అనే సంస్థ ఏర్పడింది బందరులో. దీనిలో అంతా ఉద్యోగస్తులే మెంబర్లు .ముంజులూరు కృష్ణా రావు పింగళి వారు దీనికి సారధులు .ముత్తరాజు వెంకట సుబ్బారావు గౌరవాధ్యక్షులు. వీరు గయోపాఖ్యానం .,పాడుక ,కంఠా భరణం ,రస పుత్ర విజయం ,మ్రుచ్చ కటిక ,ముద్రా రాక్షసం ,ప్రతాప రుద్రీయం ,చిత్ర నళీయం ,మొదలైన నాటకాలు ఆడారు .
                    సశేషం
                        మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ 6-11-13- ఉయ్యూరు
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల నటనా కౌశలం -1

     పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల నటనా కౌశలం -1
              ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో గొప్ప తెలుగు అధ్యాపకులు అని రీడర్ అని ఆయన క్లాసుల్లో చెప్పిన నోట్స్ ను వేలాది కాపీలు విద్యార్ధులు చదివి ఉత్తీర్నులయ్యారని వెంకట శాస్త్రి గారి ప్రధాన శిష్యుల్ని గురువు గారితో కలిసి ఎన్నో అవధానాలు చేశారని ,ఆయన కాటూరి వెంకటేశ్వర రావు గారితో జంట కవిత్వం చెప్పి ”సౌందర నందం ”అనే సుందర కావ్యాన్ని రచించారని ,తొలకరి ని ని కూడా ఇద్దరు కలిసే రాశారని ,తిరుమల తితిరుపతి దేవస్తానం వారి విశ్వవిద్యాలయం లో వారు ప్రొఫెసర్ గా పని చేశారని,స్వయం గా సాహిత్య శిల్ప సమీక్ష రాశారని అలానే కుమారవ్యాకరణం విద్యార్దులకోసం రాశారని  అందరికి తెలుసు .కాని తిరుపతి యూని వర్సిటీలో ”దీన్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ”పొందిన తోలి తెలుగు ప్రొఫెసర్ పింగళి వారే నని,,తెలుగు వాజ్మయ చరిత్ర అసమగ్రం గా రాశారని దాన్ని ఆ తర్వాతఅకాడెమి పూర్తీ చేసి ప్రచురించింది అని  అతి కొద్ది మందికే తెలుసు .పింగళి వారు ఎంతో అద్వితీయ నాటక రంగ నటులని కొన్ని పాత్రలను వారు న భూతో గా నటించారు అన్న సంగతి ఎక్కువ మందికి తెలియక పోవచ్చు ..పింగళి వారి రంగస్తల నటనా కౌశలాన్ని గురించి వివరం గా తెలియ జేయటమే ఈ వ్యాసం  లో నా ఉద్దేశ్యం .
       సుమారుగా 1912లో గుంటూరు లో ”నరకాసుర వధ ”నాటకం శ్రీ కృష్ణ పాత్ర కోసం పోటీలు జరిగాయి అందులో పింగళి వారు ”బలభద్రుడు ”పాత్ర ధరించారు .బుర్రా రాఘవాచార్యులు కృష్ణ పాత్రకు ముఖ్య పోటీ దారు .న్యాయ నిర్ణేతలు హరి ప్రసాద రావు ,బలిజే పల్లి లక్ష్మీ కాంతం గార్లు .అందరు పింగళి వారి నటనే సూపర్బ్ అని మెచ్చారు .ఆయనకే బంగారు పతాకాన్ని ఇవ్వాలని ఏకగ్రీవం గా నిర్ణయించారు .కాని జరిగింది కృష్ణ పాత్రకు పోటీ కనుక బుర్రా వారికి బంగారు పతకం అంద జేశారు .చిన్నతనం లోనేఅంటే పది హేనువ  ఏటనే  హేమా హేమీల చేత ప్రసంశ లందు కొన్న వార య్యారు  పింగళి వారు
             పింగళి  వారి అన్నగారు నరసయ్య గారు గుంటూరుజిల్లా పేద పులి వర్రు గ్రామం లో ఒక నాటక కంపెనీ స్తాపించి తమ్ముడిని అందులో చేర్పించారు .తమ్ముడు అర్జునుడుగా ,అన్న గారు గయుడుగా ”గయో పాఖ్యానం ”లో నటించే వారు .నరకాసుర్ర వధ లో కృష్ణుడు లక్ష్మీ కాంతం గారైతే నరకాసురుడు నరసయ్య గారు .నర్సయ్య గారు పులి వర్రు వదిలేశారు తూ గో జి.లోని పసర్ల పూడి లో ఒక ఔత్సాహికులు నాటక కంపెని స్తాపించి నరసయ్యగారిని ఆహ్వానిస్తే తమ్ముడితో సహా వెళ్ళారు తమ తో బాటు రాం భాయ్ అనే నటిని కూడా తీసుకొని వెళ్లి ఆ కంపెనీ లో చేర్పించారు .సారంగధర నాటకం లో రామ్భాయి చిత్రాంగి నరసయ్య గారు రాజ రాజు ,లక్ష్మీ కాంతం గారు సారంగధరుడు గా వేశారు .ఆ కంపెనీకి వీరి వల్ల  పేరొచ్చింది .కాంతం గారు కృష్ణుడు అర్జునుడు ,భరతుడు వేషాలూ ధరించి మెప్పు పొందారు .బిబ్బిలి నాటకం లో బుస్సీ రంగారావు ,కంతా భరణం లో కృష్ణారావు   ,చిత్ర నలీయం లో బాహుకుడు గా కాంతం గారు వివిధ వేషాలు ధరించి తన నటనా కౌశలాన్ని చాటి చెప్పారు .
          బందరు లో రాయల్ దియేటర్ అనే నాటకసంస్థ  ఏర్పడింది .దీనికి చెళ్ళపిళ్ళ వారుగౌరవాధ్యక్షులు . గౌరవాధ్యక్షులు . కాంతం గారు ధర్మ రాజు ,అన్న నరసయ్య గారు భీముడు ,ముంజులూరు కృష్ణ రావు గారు కృష్ణుడు తిరుపతికవుల ”పాండవ ఉద్యోగ విజయాలు ”నాటకం లో గురువు గారి ఆధ్వర్యం లో నటించి పేరొందారు .ఇదులో కాంతం గారి ధర్మ రాజు పాత్ర చేయటానికి పింగళి వారు ఎంతో విమర్శనా ద్రుష్టి తో స్టడీ చేశారు ..మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి మామ గారు పురాణం సూరి శాస్త్రి గారు తమ ”నాట్యాంబుజం   ”అనే పుస్తకం లో ”పింగళి వారి ధర్మ రాజు పాత్ర వైదిక ధర్మ రాజు కాదు .పక్కా నియోగి ధర్మజుడు ”అని విమర్శించారు .ధర్మ రాజు మెత్తని పులి అని మనందరికీ తెలిసిన విషయమే .””పేరు ధర్మ రాజు పెను వేప విత్తండ్రు”అని చిలక మర్తి  వారు రాసిన పద్యం అందరి హృదయాల్లో నిలిచి పోయింది .ఇవన్నీ జీర్ణించుకొని కొత్త ఒరవడిని సృష్టించారు ధర్మ రాజు పాత్ర ధారణా లో పింగళి వారు .పింగళి వారి పద్యం చదివే తీరు   చెళ్ళపిళ్ళవారి ఫక్కీ లో సాగేది .ఆ రోజుల్లో బందరు లో వెంకట శాస్త్రి గారు, శిష్యుడు లక్ష్మీ కాంతం గారు ఇద్దరే పద్యాలను పదాలను చక్కగా విరిచి ,అర్ధం అందరికి తెలిసేలా పాడి ప్రేక్షకుల మెప్పు పొందే వారు వాచికాభి నయం లో వీరు సాధించిన ఘనత ఇదే .పద్యం తో రాగాన్ని ఆపెయ్యటం కాంతం గారి ప్రత్యేకత
                   సశేషం
                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -.6-11-13- ఉయ్యూరు
.-

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కథ చెబుతాను… ఊ..కొడతారా

 

ఈ ఫోటోల్లో కనిపిస్తున్నావిడ పేరు దీపా కిరణ్. ముఖంలో హావభావాలు చక్కగా పలికిస్తోంది డాన్సరేమో అనుకుంటున్నారా. కానే కాదు. ఈవిడ కథలు చెప్తుంది. గుక్కపట్టి ఏడ్చే చిన్న పిల్లల నుంచి వయోధికుల వరకు ఎవరైనా సరే ఈవిడ చెప్పే కథ విన్నారంటే ఆ కథల లోకంలో మైమరిచి పోవాల్సిందే. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్ఘళంగా, ఆసక్తికరంగా కథల్ని వినిపించే ఈవిడ ఒకప్పుడు స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పారు. ఆకాశవాణిలో కంపీరింగ్ చేశారు. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా పనిచేశారు, రచయిత్రి కూడా. ఇలాంటివెన్ని చేసినా కథలు చెప్పడమే నాకిష్టం అంటున్న దీప గురించి ఆమె మాటల్లోనే…

“స్కూల్స్‌లో పనిచేస్తుండగానే కథలు చెప్పడం ప్రారంభించాను. ఎందుకోగాని కేంద్రీయ విద్యాలయాల్లో జూన్‌లో టీచర్లు తక్కువగా ఉండేవారు. డిసెంబర్‌లోపల సిలబస్ పూర్తయిపోవాలి కదా. ఆ క్లాసుకి సంబంధించిన టీచర్ని కాకపోవడం వల్ల పిల్లల్ని అల్లరి చేయకుండా కూర్చోపెట్టడం కష్టమయ్యేది. అందుకని క్లాసులోకి వెళ్లగానే 20 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే స్టోరీ చెప్తాననేదాన్ని. అలా కథలు చెప్పడం మొదలైంది. సిలబస్‌లోని పాఠాల్నే కథలుగా మార్చి చెప్పేదాన్ని. దాంతో ఆ స్టూడెంట్స్ నన్ను బయట ఎక్కడ చూసినా పాత స్నేహితురాల్ని పలకరించినట్టు పలకరించేవాళ్లు. వాళ్లతో నాకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు భావించేవారు. అది గమనించిన నాకు కథల్లో మ్యాజిక్ ఉంది, అది మనుషులను దగ్గర చేస్తుంది అనిపించింది.

ఆలోచించేలా చేసింది
2008లో మూడు వారాల స్టోరీ టెల్లింగ్ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశాను. 15 మంది పిల్లలొచ్చినా చాలనుకున్నాను. కాని 25 మంది వచ్చారు. ఈ క్యాంప్ ఏర్పాటుచేయడం వెనక నా వ్యక్తిగత కారణం కూడా ఒకటి ఉంది. అప్పట్లో నాకు కిడ్నీ సమస్య వచ్చింది. చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ ఎక్కువ వాడాల్సి వచ్చింది. దాంతో కొలెస్ట్రాల్ స్థాయి 650కి చేరింది. బాగవడానికి ఎన్నాళ్లు పడుతుందో తెలియదన్నారు డాక్టర్లు. అప్పుడు నా పిల్లలకి ఒకరికి ఏడాదిన్నర, మరొకరికి మూడున్నరేళ్లు. డాక్టర్లు అలా చెప్పేసరికి జీవితం గురించి చాలా ఆలోచించాను. ఏదైనా చేయాలనిపించింది. అలా నాకిష్టమైన ‘స్టోరీ టెల్లింగ్ క్యాంప్’కు అంకురార్పణ జరిగింది. చాలా స్కూల్స్‌లో కథల క్యాంపులు ఏర్పాటుచేశాను. అవి చూసిన కొందరు బయట కూడా చేయమని అడిగారు. అప్పట్నించీ కార్పొరేట్ ప్రోగ్రామ్‌లు కూడా చేస్తున్నాను. ఇంగ్లీషు, హిందీ, తెలుగు – మూడు భాషల్లోనూ కథలు చెప్తాను. కథల మధ్యలో పంజాబి, బెంగాలి, తమిళ భాషల్లో పద్యాలే కాక కొన్ని వాక్యాలు కూడా చెప్తుంటాను.

కథ అంటే ఓకే అంటారు
సాధారణంగా పాట పాడదామా, డ్రాయింగ్ వేద్దామా అని పిల్లల్ని అడిగితే కొందరు మాత్రమే సరేనంటారు. అదే కథ వింటారా అంటే అందరూ ఓకే అంటారు. కథ చెప్పడం అనేది ఒక కళ. మిగతా కళలతో పోలిస్తే కథల్లో – వినేవాళ్లే కళాకారులు. ఎందుకంటే కథ వినేవాళ్లు వాళ్ల బుర్రల్లో పాత్రల్ని ఊహించుకుంటారు. అందుకే కథల్ని అందరూ ఇష్టపడతారు. ‘పిల్లలు తెలివయిన వాళ్లు కావాలంటే వాళ్లకి కథలు చెప్పాలి’ అన్నారు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. కెనడాలో మూడేళ్ల క్రితం స్కూల్ కరిక్యులమ్‌లో స్టోరీ టెల్లింగ్‌ను చేర్చారు. మన సంప్రదాయంలో మాత్రం అది ఎప్పట్నించో ఉంది. మనకి చరిత్ర, పురాణాల వంటివేవి చెప్పాలన్నా కథల ద్వారానే చెప్తారు కదా!
కథ ఎంపిక ప్రేక్షకుల్ని బట్టి, జరిగే ఈవెంట్‌ని బట్టి చేసుకుంటాను. అలాగే ఒకే వయసు వాళ్లా, భిన్న వయస్కులా అనేది కూడా చూసుకోవాలి. ‘వరల్డ్ స్టోరీ టెల్లింగ్ డే’నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడేళ్ల నుంచి 92 యేళ్ల వయసు వరకు ప్రేక్షకులు ఉన్నారు. అలాంటప్పుడు అందర్నీ ఆకర్షించే జానపద కథల్ని తీసుకుంటాను. వాటిలో కూడా భారతీయ జానపద కథల్నే తీసుకుంటాను. ఎందుకంటే అవి చాలా సింపుల్‌గా ఉండి ఆసక్తికరంగా సాగిపోతుంటాయి. చివరగా ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. కథల్లో మన జీవితం ఉంటుంది. కాబట్టే అవి ఎప్పటికీ ప్రజాదరణ పొందుతాయి.
కథలు వినే వాళ్లలో కొంచెం పెద్ద పిల్లలుంటే సస్పెన్స్ స్టోరీస్, జడ్జిమెంట్ స్టోరీస్ చెప్తాను. ఎనిమిది నుంచి పదేళ్ల లోపు పిల్లలకయితే కథ చెప్తున్నంతసేపూ ఏదో జరిగిపోతుందన్న ఆసక్తి రేకెత్తించే ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకుంటాను. అదే బుజ్జిబుజ్జి చిన్నారులకయితే జంతువుల కథలు ఎక్కువగా చెప్తాను.

జీవితాన్ని కళ్లెదుట నిలుపుతాయి
వయసులో పెద్దవాళ్లకి చెప్పాల్సి వచ్చినప్పుడు మైథాలజి, సూఫీ కథలు ఎంపిక చేసుకుంటాను. అంటే జీవితం గురించి ఆలోచింపచేసేలాంటివన్నమాట. అందుకు ఉదాహరణ ఈ కథ – పర్వతాల మధ్యనుంచి ఒక నది పారుతుంటుంది. అది కొంతదూరం ప్రయాణించిన తరువాత ఎడారి వస్తుంది. ఆ ఎడారిని దాటాలని ఎంత ప్రయత్నించినా నది ఇసుకలో నుంచి పారలేకపోతుంది. ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తుండగా… ఎడారిలో ఉన్న గాలి ‘నువ్వు గాలికి లొంగిపోతే దాటగలవు’ అని చెప్తుంది. ‘అలా చేస్తే నా రూపం మారిపోతుంది’ అని నది ఒప్పుకోదు. ‘నువ్వు ప్రయత్నించి చూడరాదూ’ అని గాలి చెప్పగాచెప్పగా నది సరే అంటుంది. వెంటనే నది మేఘంలా మారిపోతుంది. ఆ మేఘాన్ని గాలి ఎడారి అవతలకి తీసుకెళ్లి వానలా కురిపిస్తుంది. నదిగా దాటలేకపోయినా నీళ్లలా దాటిందన్నమాట. ఈ కథ జీవితం గురించి చెప్తుంది. కొన్ని పరిస్థితుల్లో మనం ఎలా స్పందించాలో నేర్పిస్తుంది.
* * *
ఒకసారి చిన్మయ మిషన్‌లో తల్లిదండ్రుల కార్యక్రమంలో మాట్లాడేందుకు వెళ్లాను. నేను ప్రసంగాలు చేయను. ఒక కథ మాత్రమే చెప్తానన్నాను. సరే అన్నారు వాళ్లంతా. అప్పుడు తల్లిదండ్రుల మనసులు తాకే కథ ఒకటి చెప్పాను. ఇదో ఆఫ్రికన్ జానపద కథ. – ఒకావిడకి పిల్లలు ఉండరు. పూజలు చేస్తే మౌంటెన్ స్పిరిట్ పన్నెండు మంది పిల్లల్ని వరంగా ఇస్తుంది. వాళ్లు మొదట గుమ్మడికాయల్లా ఉండి కొన్నాళ్లకు పిల్లల్లా మారతారు. అందరు పిల్లలు బాగుంటారు కాని ఒక పిల్లవాడు మాత్రం కదలకుండా ఒక దగ్గరే కూర్చొని ఉంటాడు. ఆ పిల్లవాడ్ని చూసి విసుగొచ్చి ‘మిగతా పిల్లల్లా నువ్వు కూడా ఉండొచ్చు కదా. ఎప్పుడూ అలా కూర్చుని ఉంటావేమిటి? నువ్వు గుమ్మడికాయలాగా ఉన్నా పోయేది’ అంటుంది. అంతే వెంటనే ఆ పిల్లవాడు గుమ్మడికాయగా మారిపోతాడు. తల్లి మనసు తల్లడిల్లి అయ్యో ఎందుకలా అన్నానని దుఃఖిస్తుంది. అప్పుడు మిగతా పిల్లలందరూ వచ్చి ప్రార్ధిస్తే వాడు మళ్లీ పిల్లాడిలా మారతాడు. ఈ కథ విన్న తల్లిదండ్రులందరూ ‘నిజమే పిల్లలకి నచ్చింది చేయనివ్వాలి. మన ఇష్టాన్ని వాళ్లపై రుద్దకూడదు’ అన్నారు.
* * *
విలువల కథ
పిల్లలకి నైతిక విలువలు నేర్పే కథ ఇది… ఓ ఇద్దరు మంచి స్నేహితులు ఉంటారు. వాళ్లు చాలా అందంగా కూడా ఉంటారు. తమలో ఎవరు ఎక్కువ అందమైన వాళ్లో తెలుసుకోవాలన్న కోరిక పుడుతుంది వాళ్లలో ఒకనాడు. వారిద్దరిలో ఒకదాని పేరు కథ, ఇంకో దాని పేరు నిజం. బయటికి వెళ్లినప్పుడు ఎక్కువమంది ప్రజలు ఎవరిని చూస్తే వాళ్లే అందమైన వాళ్లు అని ఒక పోటీ పెట్టుకుంటారు. ముందు కథ వెళ్తుంది. బోలెడు మంది జనాలు బయటికి వచ్చి చూస్తారు. ఆ తరువాత నిజం వస్తుంది ఒక్కరు కూడా వచ్చి చూడరు. ఇలా కాదని తన బట్టలు విడిచి (నేకెడ్ ట్రూత్) వెళ్తుంది. అప్పుడయితే ఒక్కరంటే ఒక్కరు కూడా బయటికి రాకపోగా తలుపులు గట్టిగా బిగించుకుని లోపలే ఉండిపోతారు. ‘నేను ఇంత అందంగా ఉన్నా నన్నెవరూ ఎందుకు చూడడం లేద’ని నిజం బాధపడుతుంది. ‘నువ్వు కథని దుస్తులుగా వేసుకుని బయటికి వచ్చి చూడు’ అంటుంది కథ. అలానే బయటికి వస్తుంది నిజం. అప్పుడు దాన్ని జనం ఎగబడి మరీ చూస్తారు.”

డిక్షనరీనీ వదల్లేదు

నేను పుట్టింది కలకత్తాలో అయినా నాన్న ఉద్యోగరీత్యా చెన్నయ్, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో పెరిగాను. హైస్కూల్ నుంచి హైదరాబాద్‌లోనే చదువు. న్యూట్రిషనల్ అండ్ క్లినికల్ డైనమిక్స్‌లో బి.ఎస్.సి చేశాను. చదువుకునే రోజుల్లో ఎన్‌సిసిలో ఎయిర్‌వింగ్ కాడర్‌లో గ్లయిడర్ పైలట్‌గా ఉన్నాను. ఎయిర్‌ఫోర్స్‌లోకి వెళ్లాలనుకున్నాను. కాని ఇంట్లో వద్దన్నారు. దాంతో సెంట్రల్ యూనివర్శిటీలో పోస్టుగ్రాడ్యుయేషన్ ‘ఇంగ్లీష్ లిటరేచర్’ చేశాను. ఆ తరువాత ఇఫ్లు(ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ)లో ఇంగ్లీషు టీచింగ్‌లో స్పెషలైజేషన్ చేశాను. సైన్సు చదివిన నేను లిటరేచర్‌కి మారడానికి దాని పట్ల నా ఆసక్తే కారణం. చిన్నప్పట్నించీ పుస్తకాలు బాగా చదివేదాన్ని. నాన్న పుస్తకాలు బాగా తెచ్చేవారు. వాటిలో ఎన్‌సైక్లోపిడియాలు ఎక్కువగా ఉండేవి. ఫిక్షన్ అంటే బాగా ఇష్టం. హిస్టరీ, జాగ్రఫీ ఏ పుస్తకం వదలకుండా చదివేదాన్ని. పేపర్ మీద ప్రింట్ ఉంటే చాలు చదవడమే. పఠనం అలవాటు ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఒక ఉదాహరణ చెప్తాను – ‘ఈత ఎలా నేర్చుకోవాలి’ అనే రష్యన్ పుస్తకం చదివి ఈత నేర్చుకున్నాను. స్టిచ్చింగ్ ఎలా చేయాలన్న పుస్తకం కూడా వదలలేదు. వేరే పుస్తకాలేవీ అందుబాటులో లేక డిక్షనరీని ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదు.

1989లో హైదరాబాద్ వచ్చినప్పటికీ ఎమ్మే చేసేటప్పుడే మంచి తెలుగు నేర్చుకోగలిగాను. అప్పుడే ఆలిండియా రేడియోలో యువవాణిలో ‘హలో నమస్తే ఆదాబ్’ కార్యక్రమం చేశాను. దీన్ని ముగ్గురం తెలుగు, ఉర్దు, ఇంగ్లీషు భాషల్లో చేసేవాళ్లం. అప్పుడే మీడియా గురించి అవగాహన వచ్చింది. వాయిస్ ట్రైనింగ్ కూడా అక్కడే నేర్చుకున్నా. నా మాతృభాష తమిళమే అయినా కొన్నాళ్లు బెంగళూరులో ఉండడం వల్ల చదవగలిగేంత కన్నడ కూడా వచ్చింది. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తవ్వగానే సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ‘కేంద్రీయ విద్యాలయం’లో పదకొండు, పన్నెండు తరగతులకు కొన్నాళ్లు ఇంగ్లీషు బోధించాను. ఆ తరువాత బొల్లారంలో చేశాను. టీచింగ్ పట్ల ఆసక్తి ఉందని అప్పుడే అర్థమైంది నాకు.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కాంగ్రెస్‌కు రాహుల్ భయం (ఇండియా గేట్ )- ఎ.కృష్ణారావు

 

‘రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు..’ అని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానిస్తే ‘రాహుల్‌కు రాహులే శత్రువు’ అని మరో పరిశీలకుడు అభిప్రాయపడ్డారు. రాహుల్ నాయకత్వ సామర్థ్యాన్ని శరద్‌పవార్ లాంటి మిత్రపక్షాల నేతలే బహిరంగంగా శంకించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అభిప్రాయ సేకరణల కంటే రాహుల్ వెలిబుచ్చే అభిప్రాయాలే కాంగ్రెస్‌కు ఎక్కువ భయాన్ని కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు.

వచ్చే ఏడాది సార్వత్రక ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు.. యూపీఏ తిరిగి అధికారంలోకి వస్తుంది.. అని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఒకవైపు అన్ని సర్వేలు, ప్రజాభిప్రాయ సేకర ణలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వెలువడుతుంటే, సాధారణ ఎన్నికల్లో యూపీఏ విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి ఏ భరోసాతో చెబుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. నిజానికి ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తుంటే కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయం చెందుతుందని, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీల్లో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అభిప్రాయ సేకరణలు చెబుతున్నాయి. సీఎన్ఎన్ ఐబీఎన్‌తో పాటు అన్ని ఎన్నికల సర్వేలు కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో చిత్తుగా ఓడిపోతుందని చెబుతున్నాయి. దాదాపు 15 సంవత్సరాలు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ కూడా ఈ సారి గద్దెదిగక తప్పదని అంటున్నారు. నిజానికి ఈ ఎన్నికల ఫలితాలు ఇలాగే వచ్చినా కాంగ్రెస్ పెద్దగా బెంబేలు చెందనక్కర్లేదు. 2008లో ఇవే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రాజస్థాన్‌లో తప్ప కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయింది. అయినప్పటికీ 2009లో యూపీఏ తిరిగి అధికారంలోకి రాగలిగింది. ప్రధానమంత్రి భరోసాకు ఇదే కారణం కావచ్చు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రధానమంత్రిలా ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలపై కూడా ప్రభావం చూపగలవని వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ఎందుకు విశ్వాసంతో వ్యవహరించలేకపోతున్నది? కాంగ్రెస్ శిబిరం ఎందుకు కకావికలైపోతున్నది? అధికారం కోల్పోతున్నామన్న భయం కాంగ్రెస్ నేతల కళ్లలో ఎందుకు కనిపిస్తోంది? అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. కానీ కాంగ్రెస్ నేతలు ఈ సారి అధికారం కోల్పోతే తాము తిరిగి రాగలమనే విశ్వాసం కోల్పోతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ పదేళ్లకాలంలో చేసిన అకృత్యాలు మరింత బట్టబయలై తాము మరింత అపఖ్యాతి కాగలమనే ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నారు. అధికారంలో ఉండగానే అధికారం కోల్పోతామన్న భయంతో ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతున్న కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతోంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీనేనా ఇది? నిజానికి వాజపేయి హయాంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాలేదేమోనన్న భయాలు వ్యక్తమయ్యాయి. పీవీ నరసింహారావును కాంగ్రెస్ నేతలే ఇంటికి పంపించారు. సీతారాం కేసరి లాంటి దుర్బలమైన నేతల్ని పార్టీ అధ్యక్షులుగా నియమించారు. ఉత్తర ప్రదేశ్, బీహార్‌లలో పార్టీ నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. ఉత్తరాదినే కాక దక్షిణాదిన కూడా బీజేపీ బలం పుంజుకుంది. ఎన్డీయేకు మిత్రపక్షాలు ఏర్పడ్డారు. అయినప్పటికీ బీజేపీ చేసిన స్వయం కృతాపరాధాల వల్ల ఆ పార్టీ తానెక్కిన కొమ్మను తానే నరుక్కుంది. ఎన్డీయే కకావికలయ్యేలా చేసింది. తిరిగి వామపక్షాలు, ఇతర మిత్రపక్షాల బలంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా బీజేపీ వీలు కల్పించింది. ఇప్పుడదే చరిత్ర కాంగ్రెస్ విషయంలో పునరావృతమయ్యేలా కనిపిస్తోంది.

అంత మాత్రాన కాంగ్రెస్ బెంబేలెత్తడం దేనికి? ఒపీనియన్ పోల్స్‌ను, సర్వేలను నిషేధించాలని ఎన్నికల కమిషన్ తలుపులు తట్టడం దేనికి? ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఎన్నికలు ముగిసే వరకూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించడం నిషేధించాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదిస్తూ రాజకీయ పార్టీలను సంప్రదించింది. అభిప్రాయ సేకరణలను ఎన్నికలకు ముందు కాకపోతే ఎన్నికల తర్వాత ఎవరైనా నిర్వహిస్తారా? మీడియా బాధ్యత ప్రభుత్వాల పట్ల, పార్టీల పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నదో తెలుసుకోవడం. దాన్ని నిషేధిస్తే ఇక మీడియా స్వేచ్ఛకు అర్థమేమున్నది? ఒకవేళ అభిప్రాయ సేకరణే జరగలేదనుకుందాం. ఓటర్లు తమ అభిప్రాయాలు మార్చుకుంటారా? అభిప్రాయ సేకరణను నిషేధిస్తే వారు తమ ఓటు ద్వారా తమ అభిప్రాయం చెప్పడం మానుకుంటారా? అభిప్రాయ సేకరణలు వెలువడినంత మాత్రాన అవి ఓటింగ్ సరళిపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిన దాఖలాలు ఎక్కడా లేవు. 2004 ఎన్నికల్లో ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని మెజారిటీ సర్వేలు తెలిపాయి. కానీ అవన్నీ ఆచరణలో విఫలమయ్యాయి. ఏమైనప్పటికీ ఒపీనియన్ పోల్స్‌పై రాజకీయ పార్టీలు రెండుగా విడిపోయాయి.

అభిప్రాయ సేకరణలపై నిషేధం విధించడం భావప్రకటనా స్వేచ్ఛను అరికట్టడమేనని బీజేపీ అంటే, అసలు అభిప్రాయ సేకరణలు శాస్త్రీయం కాదని, అదంతా ఒక రాకెట్‌గా, మోసపూరితమైన ప్రక్రియగా మారిపోయిందని కాంగ్రెస్ విమర్శించింది. గతంలో జర్నలిస్టుగా ఎన్నికల సర్వేలు నిర్వహించిన కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా కూడా ఇప్పుడు ఒపీనియన్ పోల్స్ అనేది ఒక బూటకమని, అదొక దందాగా మారిపోయిందని విమర్శించారు. రాజీవ్ శుక్లా జర్నలిస్టుగా ఉన్నప్పుడు ఇలాంటి దందాలే నిర్వహించి ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పగల స్థాయికి చేరుకున్నారని భావించాలా? ఒక ఎన్జీవో తరఫున ప్రతి ఎన్నికల్లో సర్వేలు నిర్వహించి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పే ఒక సీనియర్ జర్నలిస్టు ఇప్పుడు ఏఐసీసీలో కార్యదర్శిగా ఉన్నారు. నిజానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఒపీనియన్ పోల్స్‌ను కళగా నిర్వహించి, అస్మదీయుల ద్వారా వాటిని ప్రచారం చేసింది, తమ రోజువారీ మీడీయా సమావేశంలో ప్రకటించిందీ కాంగ్రెసే. కానీ ఇప్పుడు పరిస్థితులు అడ్డం తిరిగే సరికి అసలు ఒపీనియన్ పోల్స్‌నే నిషేధించాలని ప్రతిపాదిస్తోంది. రోజులు తమవి కానప్పుడు ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారేమో?

కానీ కాంగ్రెస్ భయం కేవలం తమ పట్ల ప్రజల్లో అభిప్రాయ సేకరణ వ్యతిరేకంగా రావడం మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం కోల్పోవడం కూడా ఈ భయానికి కారణంలా కనిపిస్తోంది. ఒకవైపు బీజేపీ నేత నరేంద్ర మోదీ ఎక్కడ కు వెళ్లినా, పెద్ద ఎత్తున ప్రతిస్పందన రావడం, అక్కడి కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించడం జరుగుతుంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్లిన చోటల్లా ప్రతిస్పందన కరువు కావడం కాంగ్రెస్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో గత నెలలో ఆయన రెండు చోట్లా ర్యాలీల్లో పాల్గొంటే అక్కడ అధికసంఖ్యలో జనం హాజరుకాకపోవడం, దీని పర్యవసానంగా మరో రెండు సభలను రద్దుచేయాల్సి రావడం కాంగ్రెస్ వాదుల్లో చర్చనీయాంశమవుతోంది. పైపెచ్చు రాహుల్ గాం«ధీ ఎక్కడ ఏమి మాట్లాడినా అది వివాదాస్పదమవుతున్నది. నేరచరితుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాలరాచే విధంగా జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ వ్యతిరేకించిన తీరు వివాదాస్పదంకాగా ఆ తర్వాత కూడా ఆయన తన వైఖరిని మార్చుకోలేదు. తన తండ్రి, నానమ్మలను మతతత్వ శక్తులు వధించినట్లే తనను కూడా వధించవచ్చునని ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రకటించి సానుభూతి పొందాలనుకున్నారు.

కానీ ఇందిరాగాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ తాము చేసిన విధాన నిర్ణయాలు వికటించడం వల్లే చివరకు మృత్యువు పాలయ్యారన్న విషయం కాంగ్రెస్ నేతలకు తెలియనిది కాదు. పంజాబ్‌లో ఆధిపత్యం కోసం భింద్రన్ వాలేని సృష్టించిందీ, పెంచి పోషించిందీ కాంగ్రెసేనన్న విషయం చరిత్రలో పలు సందర్భాల్లో రికార్డయింది. ఇందిరాగాంధీని చంపింది మతతత్వ వాదులయితే ఆపరేషన్ బ్లూస్టార్ మాటేమిటి? ఇందిర మరణానంతరం ఢిల్లీ వీధుల్లో జరిగిన సిక్కుల ఊచకోత మాటేమిటి? అన్న ప్రశ్నలకు ఆస్కారం ఉన్నది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సహజంగానే సిక్కుల మనసుల్లో మాసిపోతున్న గాయాలను తిరిగి రేపాయి. అనేక సిక్కు సంఘాలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించాయి. అంతటితో రాహుల్ గాంధీ ఊరుకోలేదు. మరో సందర్భంలో ముజఫర్ నగర్‌లో అల్లర్లకు గురైన ముస్లింయువకులను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ రెచ్చగొట్టి తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు చూస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు తనకు తెలిపాయని రాహుల్ గాం«ధీ ప్రకటించి మరింత సంచలనానికి తెరలేపారు. అసలు రాహుల్‌గాంధీ ఎవరని ఐబి వర్గాలు ఆయనకు సమాచారాన్ని ఇస్తాయి? ఆయన అనధికారిక శక్తిగా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు కలిగే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. దీనితో రాహుల్ ఏమి మాట్లాడతారో, దాని వల్ల ఎలాంటి విమర్శలు తలెత్తుతాయో అన్న భయాందోళనకు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు గురవుతున్నారు. పత్రికా సమావేశాల్లో రాహుల్ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడమే వారికి సరిపోతున్నది.

అసలు విషయం ఏమంటే రాహుల్ గాంధీకి ఏ విషయం ఎలా ఎత్తుకోవాలన్న విషయంలో ఒక అవగాహన లేకపోవడం. ఒక విషయాన్ని సంచలనం లేకుండా అదే సమయంలో స్పష్టంగా, ప్రతిభావంతంగా చెప్పడం ఆయనకు ఇంకా పట్టుపడినట్లు కనపడడం లేదు. నేరచరితులపై ఆర్డినెన్స్‌ను తాను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నానని, దీనివల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని, దాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అభ్యర్థిస్తున్నానని ఆయన చెప్పి ఉంటే మరింత శక్తివంతంగా ఉండేది. నేరచరితుల గురించి ఆయన తన వైఖరిని వివరించి ఉంటే ఇంకా ఆయన ప్రతిష్ఠ పెరిగి ఉండేది. కానీ ఆయన అలా చేయలేరు. గత 9 సంవత్సరాల్లో కాంగ్రెస్‌లోనే పలు నేరచరితులు బయలు దేరారు. నేరచరితులతో మిలాఖత్ కాకుండా మనుగడ సాధించలేని పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం త్యాగం చేశారని తాను కూడా మతతత్వ శక్తులతో పోరాడే క్రమంలో త్యాగాలకు సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ ప్రకటించి ఉంటే మరోరకంగా చర్చనీయాంశమయి ఉండేది.

ముజఫర్ నగర్ అల్లర్ల విషయంలో ఐబి నివేదికలను ఉటంకించకుండా మతతత్వ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పిఉంటే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అయి ఉండేవే కాదు. ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసు పంపాల్సిన ఆగత్యం ఏర్పడేదే కాదు. ఈ వ్యాఖ్యల తర్వాత రాహుల్‌ను కాంగ్రెస్‌కు భారంగా పరిగణించేవారే ఎక్కువయ్యారు. ‘రాహుల్ గాంధీ నరేంద్ర మోదీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు..’ అని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానిస్తే రాహుల్‌కు రాహులే శత్రువు అని మరో పరిశీలకుడు అభిప్రాయపడ్డారు. రాహుల్ నాయకత్వ సామర్థ్యాన్ని శరద్‌పవార్ లాంటి మిత్రపక్షాల నేతలే బహిరంగంగా శంకించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అభిప్రాయ సేకరణల కంటే రాహుల్ వెలిబుచ్చే అభిప్రాయాలే కాంగ్రెస్‌కు ఎక్కువ భయాన్ని కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మూర్తిభవించిన మతత్వవాది! పటేల్ అని తొందర పడి మాట జారిన నెహ్రు -ఆంధ్ర జ్యోతి

 

న్యూఢిల్లీ, నవంబర్ 5: ‘నువ్వు మూర్తీభవించిన మతతత్వవాదివి’- ఈ మాట అన్నది భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ! ఎవరినంటారా.. తన కేబినెట్‌లో హోం మంత్రి.. అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను! పటేల్‌ను నెహ్రూ ఇంత మాట అనడానికి కారణం.. స్వాతంత్య్రం తర్వాత భారత్‌లో కలిసేందుకు ససేమిరా అన్న హైదరాబాద్ నిజాంను లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాలని పటేల్ సూచించడమే! 1947 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎంకేకే నాయర్ రాసిన ‘ది స్టోరీ ఆఫ్ యాన్ ఎరా టోల్డ్ వితవుట్ థర్డ్ విల్’ అనే పుస్తకాన్ని ఉటంకిస్తూ బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ ఈ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు తన బ్లాగ్‌లో మంగళవారం పేర్కొన్నారు. నాయర్ అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో పని చేశారు. పటేల్‌కు ఆయన సన్నిహితుడని కూడా చెబుతారు. హైదరాబాద్‌పై పోలీసు యాక్షన్‌కు ముందు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నెహ్రూ, పటేల్ మధ్య నువ్వా నేనా అన్నట్లు జరిగిన సంభాషణను ఆ పుస్తకంలో పేర్కొన్నారు. వాస్తవానికి, ఈ పుస్తకాన్ని మలయాళంలో రాశారు. ప్రస్తుతం దీనిని ఆంగ్లంలోకి తర్జుమా చేస్తున్నారు. “నిజాం పాకిస్థాన్ పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే తన తరఫున రాయబారిని పాక్‌కు పంపించాడు. పాక్ ప్రభుత్వానికి పెద్దఎత్తున డబ్బును కూడా పంపించాడు. నిజాం మద్దతుదారులైన రజాకార్లు స్థానికులపై దారుణ అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్‌లో ఉగ్రవాద పాలనకు చరమగీతం పాడాలంటే సైన్యాన్ని పంపాల్సిందే” అని పటేల్ సూచించారు. సాధారణంగా నెహ్రూ చాలా సౌమ్యంగా, శాంతంగా మాట్లాడతారు. కానీ, ఈ సమయంలో మాత్రం ఆయన అదుపు తప్పారు. మాట జారారు. “నువ్వు మూర్తీభవించిన మతతత్వ వాదివి. నీ సిఫార్సును నేను అంగీకరించనంటే అంగీకరించను” అని తేల్చి చెప్పారు. అయినా “పటేల్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నెహ్రూ మాటలకు నొచ్చుకోలేదు. తన కాగితాలను తీసుకుని మౌనంగా బయటకు వెళ్లిపోయారు” అని పుస్తకాన్ని ఉటంకిస్తూ ఆడ్వాణీ వివరించారు. నాయర్ పుస్తకం ప్రకారం.. జమ్మూ కాశ్మీరు తరహాలోనే హైదరాబాద్ అంశాన్ని కూడా నెహ్రూ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. హైదరాబాద్‌కు సైన్యాన్ని పంపాలన్న పటేల్ సూచనను నెహ్రూ తిరస్కరించడంతో అప్పటి గవర్నర్ జనరల్ రాజాజీ తెరపైకి వచ్చారు. హైదరాబాద్‌లో పరిస్థితి మరింత విషమిస్తుండడంతో నెహ్రూ, పటేల్ ఇద్దరినీ రాజాజీ రాష్ట్రపతి భవన్‌కు పిలిపించారు. హైదరాబాద్ అంశంపై చర్చించారు. హైదరాబాద్‌లోని పరిస్థితిని రాజాజీ తనదైన శైలిలో సమావేశంలో వివరించారు. భారతదేశ పరువును కాపాడుకోవాలంటే నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. అయితే, అంతర్జాతీయంగా ఎదురయ్యే విపరిణామాలపై నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశారు.

అప్పుడు రాజాజీ తన చేతిలోని తురుఫు ముక్కను బయటకు తీశారు. అదే.. బ్రిటిష్ హై కమిషనర్ నుంచి వచ్చిన లేఖ! హైదరాబాద్‌లో 70 ఏళ్ల క్రైస్తవ సన్యాసినిని రజాకార్లు అత్యంత పాశవికంగా అత్యాచారం చేయడానికి సంబంధించిన లేఖ అది. వాస్తవానికి, నెహ్రూ, పటేల్‌లతో సమావేశానికి కొద్దిసేపటికి ముందే పటేల్‌కు అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్ అధికారి వీపీ మీనన్ ఆ లేఖను రాజాజీకి అందజేశారు. అప్పుడు రాజాజీ దానిని నెహ్రూ, పటేల్‌లకు ఇచ్చారు. దానిని నెహ్రూ చదివారు. ఆయన ముఖం కందగడ్డలా మారిపోయింది. పట్టరాని కోపంతో ఊగిపోయారు. కుర్చీలోంచి ఒక్కసారిగా పైకి లేచారు. పిడికిలి బిగించి టేబుల్‌పై గట్టిగా కొట్టారు. “ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు. వాళ్లకు గుణపాఠం నేర్పాల్సిందే” అని గట్టిగా అరిచారు. అంతే.. రాజాజీ వెంటనే స్పందించారు. వీపీ మీనన్‌ను పిలిపించారు. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలని కమాండర్ ఇన్ చీఫ్‌కు తెలియజేయాలని ఆదేశించారు. పటేల్ అప్పటికే సైన్యాన్ని సిద్ధం చేసేశారు. అంటే.. అటునుంచి నరుక్కొచ్చారన్నమాట!!

 

Posted in సేకరణలు | Tagged | 1 Comment

పానుగంటి వారి సాక్షి వ్యాసాలు – శ్రీ జి.వెనుగొపాల రెడ్డి

sakshi 1 001పాను గంటి వారి సాక్షి వ్యాసాలపై22-10-13 న సరస భారతి 52వ సమావేశం లో శ్రీ జి.వెనుగొపాల రెడ్డి చేసిన ప్రసంగం  sakshi 2 001 sakshi 3 001 sakshi 4 001 sakshi 5 001 sakshi 6 001 sakshi 7 001 sakshi 8 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆంద్ర వివేకానందులు ,ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -4(చివరి భాగం )

ఆంద్ర వివేకానందులు ,ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -4(చివరి భాగం )

ప్రభాకర ప్రతిభా బారతి

ప్రభాకరులు రాసిన ‘’భారతీయ సంస్కృతీ ‘’లో భారతి అనే మాటకున్న అర్ధాన్ని విపులం గా వివరించారు .ఆత్మ ను ఉద్ధరించేదే భారతీయ సంస్కృతీ అని ,  భావం .రసం శరీరం చేత పవిత్రమై వేలుస్తోందని అన్నారు భావం అనేది మానసిక సంబంధం ,రసం కావ్య సంబంధం ,శరీరం దేహ సంబంధం ,అంటే మనో ,వాక్ కాయములు సౌమ్య స్తితిని పొంది భారత అనే అక్షరాత్మ గా ఏర్పడిందని వివరణ ఇచ్చారు .mail.google.com

ఆది కాలం లో మన దేశాన్ని ‘’అజనాభం ‘’అనే పేరు తో పిలిచే వారని ,అజుడు అంటే బ్రహ్మ కనుక ఆయన సృష్టికి ఈ దేశం నాభి స్తానం గా ఉంది కనుక అజ నాభం అనే పేరు మన దేశానికి ప్రసిద్ధమయిందని చెప్పారు .

మన దేశాన్ని మొదట పాలించింది స్వాయం భువ మను చక్ర వర్తి.అతనికి ప్రియ వ్రతుడు ,ప్రియ వ్రతుడు ,అగ్నీద్రుడు,పుత్రులు అగ్నీధ్రు నికి నాభి నాభికి ,ఋషభుడు ,అతనికి భరతుడు జన్మించారు .భరతుడు పాలించిన కాలం లో అజనాభం పేరు భారత దేశం గా మారి పేరొందింది .

భారతీయులు ఆర్యులని ,హిందువులు అనీ వ్యవహరింప బడుతారు .ఆర్ష ధర్మాన్ని అనుసరించే వారు ఆర్యులు .వారి ధర్మం ఆర్ష ధర్మమ ని ఆర్య ధర్మమని  పిలువ బడుతోంది .’’ఆరాత్  యాంతీతి ఆర్యః ‘’అంటే దగ్గర మార్గాన కానీ ,దూర మార్గాన కాని భగవంతుని చేర గల వారే ఆర్యులు అని అర్ధం చెప్పారు పండితుల వారు .

భారతీయ వాజ్మయం లో ‘’హిందూ ‘’పదానికి ఉన్న పవిత్రతను రెండు వందల పేజీలలో ‘’హిందూ మతం ‘’అనే పుస్తకం లో వివరించారు .

‘’హీనంచ దూష యత్యేవ హిందూ రిచ్యుతే ప్రియే ‘’హీన మైన తుచ్చమైన విషయాలను ప్రేమించకుండా సర్వోత్క్రుస్త తత్వాన్ని ,అభి లషించే వాడు హిందువు ‘’అని ‘’మేరు తంత్రం ‘’అనే గ్రంధం లో పరమేశ్వరుడు పార్వతీ దేవికి వివరించి నట్లు తెలుస్తోంది .’’శబ్ద కల్పద్రుమం ‘’అనే నిఘంటువులో ‘’హీనం దూష యతీతి హిన్దుహ్ ‘’అంటే హీనమైన దాన్ని దూషించే వాడు హిందువు అని చక్కగా వివరింప బడింది అని ప్రభాకరులు చెప్పారు .

‘’అధ గచ్చేత్ రాజేంద్ర దేవికాం లోక విశ్రుతాం –ప్రసూథిహ్ యత్ర విప్రాణాం  శ్రూయతే భరతర్షభ ‘’అని భారతం లోని తీర్ధ యాత్రా పర్వం లో హిందువుల మూల పురుషులు హిమాలయ పర్వత ప్రాంతం లోని ‘’పవిత్ర దేవికా నదీ ‘’తీరం లో జన్మించారని ‘’ధర్మ రాజ్యం ‘’అనే గ్రంధం లో పండితుల వారి వాక్కు .

‘’రుణాని త్రీణ్య.పక్రుత్య మనో మో క్షే నివేశ యేత్’’-రుషి ఋణం పితృ ఋణం దేవతా ఋణం అనే మూడు రుణాలను తీరిస్తే కాని ముక్తికి ప్రయత్నించ రాదు అని భారతీయ సిద్ధాంతం .బ్రహ్మ చర్య ,చేస్తూ వేదం శాస్త్ర పురాణాల రహస్యం తెలుసుకొంటే రుషి ఋణం నుంచి ,మంచి సంతానాన్ని పొంది పితృ రుణాన్ని ,యజ్న యాగాది క్రతువులు చేస్తే దేవతా రుణాన్ని తీర్చుకో వచ్చు .ఈ మూడు రుణాలు తీర్చుకుంటే ముక్తికి అర్హత లభిస్తుంది .అని ‘’ధర్మ రాజ్యం ‘’లో వివరించారు .

దేవతలు వారి తత్వాల గురించి ఎన్నో అఆసక్తి కరమైన విశేషాలు వివ రించారు .’’అస్వప్నయ స్తరనయః ఆశ్రమిష ‘’అని వేదం చెప్పింది .దేవతలు నిదుర లేని వారు సదా యువకులు .శ్రమ తెలియని వారు .

‘’విద్వాం సో హ వై దేవః ‘’అంటే దేవతలందరూ విద్వాంసులు .’’పరోక్ష ప్రియా ఇవహి దేవః ‘’దేవతలు పరోక్ష ప్రియులు .నిరాకార ,సాకార రూపాలలో దేవతలుంటారు .దేవతలా తత్త్వం అంతరార్ధ బాహ్యర్ధాలతో ఉంటాయి .ఒకే నటుడు అనేక వేషాలు వేసి నట్లు పరమాత్మ కూడా గుణ కర్మలను స్వీకరించిలీలా విలాసం ప్రదర్శిస్తాడు .అధర్వ వేదం లో దేవతలు ఎముకలు లేని వారని ,అందువల్లే చర్మం ,మాంసం నెత్తురు ఉండవని పాప రహితులని వాయు బలం తో పరిశుద్ధ చరిత్ర కల వారని ,శుచి మంతులని చెప్పబడిందని వివరిస్తారు ‘’

‘’అవస్థాహ్పూతాహ్పవనేన శుద్ధాఃశుచయః –శుచి మపి యంతి లోకం నైషాం శిశ్నిం ప్రదహతి

జాత వేదాఃస్వర్గే లోకే బుహు స్ట్రైణమేషాం’’ఇదీ పై దానికి శ్లోకం .

‘’ఆప్య తైజస  వాయవ్యాని లోకాంతరేశరీరాణి ‘’అంటే దేవతా శరీరాలు కంటి మయాలు ,తెజోమయాలు ,జల స్వరూపాలు మానవులకున్న ఆకలి దాహం కామాగ్ని దేవతలకు లేవు వారి శరీరం అన్నమయ ,శుక్ల ,షోణిత సంబంధం లేనివి కనుక కామ లోలురు కారు .దేవా చరిత్రలలో అంతరార్ధం ఉంటుంది అది విడ మార్చ గలగాలి .పంతుల గారి గ్రంధాలన్నీ సరస్వతీ శుక్తి ముక్తా ఫలాలే .

ప్రభాకరాస్తమయం

హిందూ గ్రంధ మాల ,భారతీయ ధర్మ ప్రచారక మిషన్ ,శ్రీ ప్రభాకర ఉమా మహేశ్వర పండిట్ ట్రస్ట్’’ధర్మ సంస్తాన్ ,మొదలైన వాటిని నిర్వహించి ఆధ్యాత్మిక పత్రికా వ్యవస్తాపకులుగా వ్యవహరించి ,’’విశ్వ హిందూ పరిషత్ ‘’ప్రారంభ దశలో ఆంద్ర ప్రదేశ్ కు ఉపాధ్యక్షులుగా పని చేసి ,’’సదా చార నిబందినీ పరిషత్ ‘’అధ్యక్షులై,శ్రీ ప్రభాకరులు చేసిన సేవ చిరస్మరణీయం. గజారోహణాది మహా సత్కారాలు పొంది ఏడు శతాబ్దాలు అవిశ్రాంత ధర్మ ప్రచారం చేసిన ప్రతిభా భాస్కరులు పండితులు .11-12-81 విజయవాడ సత్య నారాయణ పురం లోని వారి స్వగృహం ‘’హిందూ భవనం ‘’లో సునాయాస మరణం పొందారు. పండితుల వారి హంస బ్రహ్మ లోకం చేరింది .’’మరణం ఒక అవస్తా భేదం ‘’అని హిందూ సమాజ భావన .సూర్యాస్తమయం లాగే ప్రభాకర నిర్యాణం ఒక సహజమైన విషయమే .జ్ఞాన సాగరం లో ఉవ్వెత్తుగా లేచి ,మళ్ళీ సముద్ర గర్భం లో కలిసి పోయిన ఒక విజ్ఞాన తరంగం ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు .

‘’       ‘’సమస్త ధర్మ సంశాయాన్ధకార హ్రుత్ప్రభాకరః –ప్రభాకరాన్వాయ దుగ్ధ వారి దే స్సుదాకరః

సుదాకరోప మాన సద్యశో ల సద్దిగగంతః –విపస్చితాం వారో జయత్యసా ఉమా మహేశ్వరః ‘’.

సంపూర్ణం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –4-11-13- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | 1 Comment

ఆంద్ర వివేకానందులు ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -3

ఆంద్ర వివేకానందులు ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -3

ప్రభాకర సనాతన ధర్మ ప్రసంగ జైత్ర యాత్ర

కృష్ణా ,గుంటూరు, గోదావరి జిల్లాలో సనాతన ధర్మ ప్రసంగ జైత్రయాత్రను పూర్తిగావించు కొన్న ప్రభాకరులు సామర్ల కోట కాకినాడ ,పిఠాపురం ,తుని ,అనకాపల్లి ,విశాఖ పట్నం ,విజయ నగరం ,శ్రీ కాకుళం ,బరంపురం మొదలైన పట్నాలలో ప్రజల్లో ధార్మిక మహా చైతన్యాన్ని కల్గించారు .ఆ తర్వాత చిత్తూర్ ,జిల్లాలో పర్యటన చేశారు .ఆ రోజుల్లో అమా వాస్య రోజు సెలవు ఉండేది ఆ రోజు అందరు సోదర మైత్రీ భావం తో మెలగాలని పండితుల వారు ‘’అమా వాస్య భజన’’ అనే ప్రత్యెక కార్యక్రమం చే బట్టారు .ఇది ప్రజల్లో గొప్ప చైతన్యం కల్గించింది ..

కంచి పరమాచార్య శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల వారు పండితులను ఆశీర్వదించారు .ప్రజలు మేళ తాళాలతో ఊరేగించారు తిరుపతి లో లక్షలాది ప్రజలు వీరి ఉపన్యాసాల విన్నారు .ఇదిప్రభుత్వం గమనించి అరెస్ట్ చేసి మద్రాస్ కు పంపింది .అక్కడ కాశీ నాధుని నాగేశ్వర రావు పంతులుగారు పండితుల వారికి స్వాగతం పలికి ఉద్యమాన్ని  బల పరిచారు .చిత్తూరు జిల్లాలో ప్రసంగించాకుండా  బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది .హిందూపురం ,మద్రాస్ బెంగుళూరు పట్నాలలో తమ ప్రసంగాలను కోన సాగించారు .

నిజాం రాష్ట్రం లో సికిందరాబాద్ లో ‘’సదాచార నిబందనీ పరిషత్ ‘’ను పండితుల వారు స్తాపించారు ‘’హిందూ గ్రంధ మాల ‘’పేరిట ఎన్నో గ్రంధాలు ప్రచురించారు నలభై ఏళ్ళ పాటు నిజాం రాష్ట్రంలో ధర్మ ప్రచార సభా జైత్య యాత్ర చేశారు .తరువాత విజయ వాడకు వచ్చి అక్కడే స్తిర నివాసం ఉన్నారు .తన యావత్ శక్తి యుక్తుల్ని హైందవ వ్యతిరేక ప్రచారాన్ని వమ్ము చేయటానికి ఉపయోగించిన మహా మనీషి ప్రభాకరులు .క్రైస్తవులు సంధించే అనేక ప్రశ్నలకు దీటైన సమాధానం చెప్పి నిరుత్తరుల్ని చేసే వారు

సాధారణం గా మిత భాషి అయిన పండితుల వారు వేదిక ఎక్కగానే మహోధృత రూపం లో ప్రసంగం చేసే వారు .సహజ సాత్వికులు ఆయన ఆహారమూ సాత్వికాహారమే .పాలు గోధుమ రొట్టెలు మాత్రమె తీసుకొనే వారు ఇంతకు మించి వేటినీ తినే వరుకారు .ప్రతి రోజు తలంటి పోసుకొనే వారు .ప్రాణాయామం చేసే వారు గాయత్రీ మహా మంత్రం జపం దీక్షగా చేసే వారు .చాలా తక్కువా సమయమే నిద్రపోయేవారు .ఇంత క్రంశిక్షంతో ఉండబట్టే 92సంవత్సరాలు పూర్ణాయుస్సుతో జీవించారు .రోజుకు కనీసం 18గంటలు పని చేసే వారు .సర్వ స్వతంత్ర జీవులు .రామాయణ మహాభారత భాగవత సారాన్ని జన సామాన్యానికి అందించటానికి ‘’హిందూ మతం ‘’అనే పేర రెండు వేల పేజీల మహా గ్రంధాన్ని రచించారు .అయన శతాధిక గ్రంధ కర్త కూడా .

దక్షిణ భారత జైత్ర యాత్ర సంతృప్తిగా ముగించుకొని ఉత్తర దేశ యాత్ర చేశారు .1964 మే నెలలో పండితుల వారు తన బృందం తో ఉత్త్తర భారతం చేరారు .స్వర్గంగా ప్రవాహ సదృశమైన పండితుల వారి వాణి ఉత్త్తర దేశీయులనూ విశేషం గా ఆకర్షించింది .కాశీ పండితులను కూడా సంభ్రమాశ్చర్యాలతో వారి ఉపన్యాసాలనువిని  కీర్తించారు కలకత్తా ,గయా ,కాశీ ,అలహా బాద్ ,హరిద్వార్, రుషీ కేష్ ,బదరి ,ఆగ్రా ,అయోధ్య ,మధుర ,డిల్లీ ,బాంబే ,పూనా ,అహమదా బాద్ ,కాన్పూర్ మొదలైన పట్నాలలో ప్రసంగ జైత్రయాత్ర దిగ్విజయం గా నిర్వహించారు .వారి ధర్మ పత్ని ,కుమారుడు ప్రభాకర శ్రీ కృష్ణ భగవాన్ ,ఉప్పులూరి మల్లికార్జున శర్మ , వెంట్ర ప్రగడ రాధాకృష్ణ శర్మ మున్నగు వారు పండితుల వారి బృందం లో ఉన్నారు

భగవాన్ సత్య సాయి బాబా పండితుల వారిని రప్పించి సన్మానించి ఆశీర్వదించారు .తమతో బాటు బాబా పండితుల వారిని ఆంధ్ర దేశ పర్యటన లో వెంట తీసుకు వెళ్ళే వారు. అంతటి అభిమానం ప్రభాకరులంటే బాబాకు .

ప్రభాకర సన్మాన సంరంభం

1953లో మద్రాస్ లో విక్టోరియా హాల్ లో బులుసు సాంబ మూర్తి గారి అధ్యక్షతన పది హీను రోజులు పండితుల వారి ధార్మిక ప్రసంగ ధారా సాగింది .చివరిరోజు ఘనం గా సత్కరించారు ‘’దేవా రహస్యం ‘’అనే వారి పుస్తకం అక్కడే ఆవిష్కరించారు ‘’సువర్ణ ఘంటా కంకణ ‘’సత్కారం జరిపి ఆ  పుంభావ సరస్వతికి ఘన నీరాజనాలు పలికారు .

1953లో బెంగుళూర్ లో ‘’విశ్వేశ్వర పురం ‘’లో పండితుల వారి ప్రసంగాలను మూడు నెలల పాటు నిర్వహించారు .’’హిందూ మతం ‘’అనే పండితుల వారి ఉద్గ్రంధం ఇక్కడే ఆవిష్కృత మైంది .

1956లో జరిపిన ఉత్తరాంధ్ర పట్నాలపర్యటనలో ‘’ఆర్యులు విదేశాల నుండి ఈ దేశానికి రాలేదు ‘’,’’వేదములు మనవ రచితములుకావు ‘’,’’హిందూ దేవతలు వ్యభిచారులు కారు ‘’,స్వర్గ నరకములున్నవి ‘’,’’దశావతారముల లోని పరిణామ రహస్యం ‘’,’’కర్మ కాన్దలకాం డలలోని వైశిష్ట్యం ‘’,’’వివాహ రహస్యం ‘’,’’కృష్ణావతార రహస్యం ‘’,’’గీతా సారం ‘’మొదలైన విషయాలపై అద్భుత ప్రసంగాలు చేసి ఆస్తిక జన హృదయాల్లో భక్తీ బీజాలు నాటి ,మన వారసత్వసంపద పై   గొప్ప అవాగాహన కలిగించారు. అందరికి ఉన్న సహజ సందేహాలకుజవాబులుగా  ఈ ప్రసంగాలు ఏంతో  దోహదం చేశాయి.ఈ సందర్భం లో పండితుల వారిని అపూర్వం గా సత్సత్కరించి గౌరవాదరాభిమలు చూపి కృతజ్ఞతలు ప్రకటించుకొన్నారు .

ఉత్తర దక్షిణ దేశాల్లో అపూర్వ జైత్రయాత్ర దిగ్విజయం గా ముగించుకొన్న ప్రభాకరులు 1965లో నెల రోజులువిజయ వాడ లో  ఆంద్ర ప్రభ సంపాదకులు నీలం రాజు వెంకట శేషయ్య గారి సమక్షం లో ప్రారంభించి సంపూర్తి చేశారు .డాక్టర్ టి.వి.ఎస్.చల పతిరావు ,అధ్యక్షతన కార్య నిర్వాహక సంఘం ఏర్పడి శ్రోతలకు మహా గొప్ప ఏర్పాట్లు చేశింది .గుంటూరు కలెక్టర్ అధ్యక్షతన శతావధాని పళ్ళే పూర్ణ ప్రజ్ఞా చార్యులు ,అనేక కవి ,పండితులసమక్షం లో  మధ్య అశేష జన వాహిని కర తాల ధ్వనుల మధ్యశాస్త్రోక్తం గా ‘’కనకాభి షేకం ‘’అమోఘం గా చేసి భక్తీ ప్రపత్తులు చాటుకొన్నారు

.1966లో చీరాలలో పండితుల వారి ధర్మోపన్యాసాలు నెల రోజులు చేబట్టారు ఆబాల గోపాలాన్ని పండితుల వారు ఆనందాబ్ధి లో ముంచి తేల్చారు మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యం లో ‘’పుష్ప కిరీటం ‘’సమర్పించి సహృదయ సుగంధాన్ని వెలయించారు పుర ప్రముఖులు .పట్టు వస్త్రాలతో జ్ఞాపిక లతో ఘన సన్మానం చేశారు వారి గ్రంధ ముద్రణకు నిధిని విరాళం గా సమర్పించారు ..

బాపట్లలో శ్రీ భావనారయణ స్వామి వారి దేవాలయం లో వీరు ధర్మ శంఖారావం 1966జూన్ లోపూరించారు .ప్రభాకర దంపతులను జిల్లెల్ల మూడి అమ్మ అనసూయా దేవి గారి సమక్షము  లో ఎంతో చారిత్రాత్మకం గా ‘’గండ పెండేరం ‘’తొడిగి పట్టువస్త్రాలు సమర్పించి సన్మానించారు  గ్రంధ ముద్రణకు నిధిని సమకూర్చారు ,

1957మే లో  హైదరాబాద్ ,సికందరా బాద్ నగరాలలో పండితుల వారి నెల రోజుల పాటు ధార్మిక ప్రసంగాలు చేశారు .జంట నగరాల లోని అన్ని ముఖ్య దేవాలయాలలో ,ఆధ్యాత్మిక సంస్థలలో వారు ఉపన్యసించారు ముఖ్య మంత్రి కాసు బ్రహ్మా నంద రెడ్డి గారు పండితుల వారింకి ‘’కిరీటం ‘’తొడిగి ఘన సత్కారం చేశారు .

1968 జూన్ లో విజయ వాడ కొత్త గుళ్ళలో నెల రోజులు సనాతన దార్మాన్ని గురించి ఉపన్యసించారు .దేవాదాయ శాఖ మంత్రి రుద్ర రాజు రామ లింగ రాజు అధ్యక్షతన ‘సామ్ర్రాజ్యాపట్టాభి షేకమహోపంన్యాస సన్మానం ‘’ను వైభవో పేతం గా ని ర్వ హించారు .శాసన సభ్యులు చలపతి రావు గారు, మంత్రి గారు ప్రభాకరుల ఆస్తిక సేవలనుబహుదా ప్రస్తుతించారు .

1981లో తిరుమల తిరుపతి దేవస్తానం వారు’’ ఆస్తాన పండితుని’’ గా పండితుల వారిని నియమించి అపూర్వ గౌరవం కలిగించారు  పెజావర్ స్వామి ప్రభాకరులకు ’స్వర్ణ తకం ‘’,అందజేస్తే చిన జీయర్ స్వామి పట్టువస్త్రాలతో ఆశీర్వ దించారు .కార్య నిర్వహణ అధికారి  పి.వి.ఆర్.కే .ప్రసాద్ ‘’పండితుల వారి జీవితం ఒక మాహోద్యమం  ,వారే ఒక మహా సంస్థ ‘’అని కీర్తించారు .ప్రభాకరుల 75వ ఏట వారి ధార్మిక సేవకు ఏడుకొండల వాడైన ’’శ్రీ వారి ఆస్తాన పండిత ‘’హోదా  అరుదైన గుర్తింపుగా  లభించి చిర స్తాయిగా నిలిచి పోయింది

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -4-11-13-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

అమృతాహారం….. ‘గోంగూర’ …… మీ…. రవీంద్రనాథ్.

 

ప్రియమిత్రమా !

 

                      నమస్తే. ది.27-10-2013 ఆదివారం ఉదయం  తెనాలి చినరావూరులోని మా స్వగృహంలో నా తోటి యోగ సాధకులకు అమృతాహారాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో పది రకాల అమృతాహారాల్ని నా శ్రీమతి రాజ్యలక్ష్మిచే తయారు చేయించి, అతిథులకు వడ్డింఛాము. ఆ సందర్భంగా అమృతాహారం యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ నేను వారికి అందజేసిన పరిచయ పత్ర౦ పి.డి. యఫ్. ప్రతిని  మిత్రులందరి సమాచారం నిమిత్తం ఈ విద్యుల్లేఖకు జతపరుస్తున్నాను. ఎప్పటిలాగే చదివి మీ  స్పందనను తెలియజేయండి. దీన్ని మీ మిత్రులందరికీ పంపండి.

 

               amurttha                                                         మీ…. రవీంద్రనాథ్.0001

0002 0003 0004 0005gongooraప్రియ మిత్రమా !

                       నమస్కారం. ‘కూరగాథలు’ పేరిట ‘ఆంధ్ర జ్యోతి’ దినపత్రిక ఆదివారం సంచికలో ధారావాహికంగా ప్రచురితమౌతున్న శీర్షికకు నేను రాసి పంపిన  తదుపరి వ్యాసం ‘గోంగూర’ పి.డి.యఫ్.ప్రతిని ఈ విద్యుల్లేఖకు జతపరిచాను. ఎప్పటిలాగే చదివి మీ స్పందన తెలియజేయండి. మీ మిత్రులకు పంపండి.

 

                                                                మీ… రవీంద్రనాథ్.

 

0001 0002 0003 0004 0005

Posted in ఆరోగ్యం | Tagged | Leave a comment

మా ఇంట్లో దీపాల దీపావళి

This gallery contains 30 photos.

More Galleries | Tagged | Leave a comment

కార్తీక మాస ప్రాశస్త్యం -శ్రీ చాగంటి కోటేశ్వర రావు -ఆంధ్ర జ్యోతి -4-11-13

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

సినీ గీత పారిజాతం -దాశరధి -ఆంద్ర జ్యోతి -4-11-13

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆంద్ర వివేకానందులు ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు -2

ఆంద్ర వివేకానందులు ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు -2

ప్రభాకర వాక్ మహేంద్ర జాలం

ఇరవై ఏళ్ళ వయస్సులో ఆర్ష విజ్ఞాన ప్రచారోద్యమానికి శ్రీ కారం చుట్టారు ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు .ఆయనది దైవ వాణి గా భావించారు .ప్రజల మనసులో అమృత ధారల్నివర్షించింది .

ఆజాను బాహువులు ,వైదిక వర్చస్వి ,గంబీర ముఖ  కవలిక లతో భాసించేవారు .కనులలో కార్య దీక్ష కనిపించేది .జాతీయ వేష దారణ తో ధీరోదాత్తం గా చూపరులను ఆకర్షించే వారు .దివ్యర్షి సమానం గా ఆరాధించే వారు .మారు మూల ప్రాంతాలలో ఉపన్యాసాలను ప్రారంభించి పట్నాలకు  తమ వాగమృతాన్ని వ్యాపింప జేశారు ..ప్రజలను దేశ భక్తీ ప్రపూరితులుగా ,ధర్మావలంబకులుగా తీర్చి దిద్దే ఉపన్యాస ధారల తో పరవశింప జేసే వారు .గంగా యమునా సరస్వతీ సంగమ స్థానం నం గా  వారి వాక్కు ధ్వనించేది .గుంటూరు మండలం లో ఉపన్యాసాలను మొదట ప్రారంభించి ,కృష్ణ దాటి, గోదావరి ప్రాంతం చేరి, రాజ మండ్రి లో నెలకు పైగా ఉపన్యసించి నాస్తికులనే కాక ఇతర మతస్తులనూ ఆకర్షించిన నేర్పు పండితుల వారిది .

జనా కర్షణ ,తెలీని మత్తు వారి ప్రసంగాలలో ద్యోతక మయ్యేది .వేదం ప్రాశస్త్యాన్ని గురించి చెప్పినా ,పురాణ వివరణ చేసినా ,దేవతల కధల్లో ఉన్న దేవ రహస్యాలు వివరించినా ,కుల భేదాలను పరిష్కరించే మార్గాలనేలా చెబుతారో ,అస్పృస్యత ను గురించి ,శాస్త్రీయ దృక్పధాన్ని ఎలా ఆవిష్కరిస్తారో అని కళా శాల విద్యార్ధులు ,డాక్టర్లు ,న్యాయ వాదులు ,న్యాయాధిపతులు ,ఉద్యోగులు ,సామాన్యులు ముఖ్యం గా మహిళలు విశేషం గా హాజరై అతి ఆసక్తి గా వినే వారు .సమయ పాలన పాటించటం లో వారికే సాటి .సమయానికి ముందే సభకు వచ్చే వారు ప్రజలు మైమరచి తన్మయత్వం తో వినే వారు వారి ప్రసంగం కనీసం రెండున్నర గంటల వరకు ఉండేది .ఇందులో వేదోపనిషత్తులు ,భగవద్గీత ,పురాణ గాధలు శ్లోకాలు కావ్య పద్యాలు ఉదాహరణలు ,గంభీర గర్జనలు ,విదేశీ మతాలపై వాక్ శస్త్రాలు నాస్తికులకు సవాళ్లు ,ఛలోక్తులు తో ఒక శబ్ద మహేంద్ర జాలం గా భాసించేది .

ధార్మిక ఉపన్యాసాలకు వేలాది ప్రజలు ఆకర్షణ గా రావటం పండితుల వారితోనే ప్రారంభ మైంది .పల్లెలు ,పట్టణాల నుండి బండ్లు కట్టుకొని వచ్చి వినే వారు .రైల్ పెట్టెల మీద ,బస్ టాపులపైనా కూర్చుని చేరుకొనే వారు.ఎందరో వాలంటీర్ల అవసరం అయ్యేది .విజయ వాడ లో శ్రీ శివ రామ కృష్ణ క్షేత్రం లో నిర్వ హింప బడ్డ కార్య క్రమాలు న భూతో న భవిష్యతి గా జరిగేవి .పండితుల ప్రసంగం లేకుండా ఏ సభా జరగ లేదు .వారి ఉపన్యాసం లేక పోతే జనం క్షేత్రానికి చందాలుఇచ్చే వారు కాదు   విరాళాలు ఇచ్చే వారూ కాదు . అంత క్రేజ్ ఉన్న ఉపన్యాసకిశోరం ప్రభాకరులు .ఇంతటి స్తాయిని ధార్మిక ప్రసంగాలకు  తెచ్చిన ఘనత వారిదే .

దేశ హితం కోసం ,సనాతన ధర్మ ప్రచారం కోసం వారి కృషి అమూల్యమైనది .పర మతం స్వీకరించిన హిందువులు వీరి ప్రభావం తో మళ్ళీ స్వమతం లోకి ప్రవేశించారు .దీనికి ఇబ్బంది పడ్డ గుంటూరు క్రైస్తవ బిషప్పులు పండితుల వారి పై గుంటూరు కోర్టు లో కేసు వేశారు .దేశ భక్త కొండా వెంకటప్పయ్య ,ఉన్నావ లక్ష్మీ నారాయణ ,నడింపల్లి నరసింహా రావు ,గోవింద రాజుల శ్రీని వాస రావు ,ఏకా లక్ష్మీ నరసింహం ,మొదలైన ఉద్దండులైన న్యాయ వాదులు పండితుల వారి పక్షాన ప్రతి వాదనలు చేసి జడ్జి గారిని మెప్పించారు .న్యాయ మూర్తి బిషప్పులదేదోషం  అని తీర్పు నిచ్చారు ఇలా పండితుల వారు న్యాయ పోరాటం లోను విజయం సాధించారు .

పండితుల వారి ధార్మిక జైత్ర యాత్ర గురించి తరువాత తెలుసు కొందాం .

సశేషం

రేపటి నుంచి పవిత్ర కార్తీక మాస సందర్భం గా సుభా కాంక్షలతో

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-13 –ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -6

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -6

ఆచార్య నాగార్జునుడు

రసాయన శాస్త్రానికి బీజాలు వేసి ,రస వాద సిద్ధాంతానికి మహా ప్రయోగాలు నిర్వహించిన బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు .క్రీ.శ.931లో గుజరాత్ లోని సోమనాధ దేవాలయ సమీపం లో దైహాక్ అనే గ్రామం లో జన్మించి నట్లు తెలుస్తోంది .బౌద్ధం లో మహా యాన విభాగం లో మాధ్యమిక ,యోగాచార అనే రెండు విధానాలలో మాధ్యమిక చింతనను ప్రతి పాదించిన వాడే నాగార్జునా చార్యుడు .ఈయన రచించిన ‘’మాధ్యమిక కారిక ‘’గ్రంధం బౌద్ధ దర్శనాలలో అగ్ర శ్రేణి లో నిల బడింది .దీనితో ఆయన ‘’ఆర్య నాగార్జునుడు ‘’అని పించుకొన్నాడు .గుంటూరు జిల్లా మహా మండల ప్రాంతం లో శ్రీ పర్వత సానువులలో చాలా కాలం నివశించాడు .ఇక్కడి ఈ పర్వతానికే ‘’నాగార్జున కొండ ‘’అనే పేరొచ్చింది .ఇక్కడే ఒక విశ్వ విద్యాలయాన్ని స్తాపించి ఎందరికో విద్య నేర్పించాడు. దేశ ,విదేశాల నుండి ఎందరో విద్యార్ధులు ఇక్కడికి వచ్చి చదువుకొన్నారు .

కాని నాగార్జునుడు అంటే బంగారాన్ని కృత్రిమం గా తయారు చేసే వాడనే పేరు స్తిరపడి పోయింది .ధాతు విజ్ఞాని గా పాపం గుర్తింపు పొందలేదు .అందుకే ఆధునిక శాస్త్ర వేత్తలకు ఆయన దూరమై పోయాడు .పాదరసం వాడకాన్ని మొదటి సారిగా ప్రయోగించిన వాడు నాగార్జునుడే .దీన్ని శుద్ధి చేసే ప్రక్రియ ను కూడా ఆయనే ప్రపంచానికి తెలియ జేశాడు .పాదరసం తో బంగారం తయారు చేసే వాడని చరిత్ర కారులు చెప్పారు .బంగారు తయారీ లో పాద రసాన్ని తప్ప ఏ ఇతర ధాతువును వాడలేదు ఆచార్యుడు .ఆధునికులు బంగారం లో ఎనభై ప్రోటాన్లు ,ఎలేక్త్రాన్లు ఉన్నాయని పాదరసం లో డెబ్భై తొమ్మిది ప్రోటాన్లు ఎలేక్త్రాన్లు ఉన్నాయని కనుక్కొన్నారు మరి ఆ నాడే ఈ రహస్యాం నాగార్జునికి  ఎలా అవగత మైనదో ఆశ్చర్యం వేస్తుంది .

ఆచార్య నాగార్జుండు అనేక వైద్య గ్రంధాలు రాశాడు .రస ప్రక్రియ అంటే ఆల్కెమీ కూడా నేర్చి నట్లు అని పిస్తుంది .ఆయన కాలం లో ‘’విజ్ఞాన వాదం ‘’ప్రారంభం అయి తర్వాత కూడా వ్యాప్తి చెందింది .అదీ ఆయన ఘనత .ఈ నాగార్జునుడు వేరు ఏ లోహాన్నైనా బంగారం గా మార్చ గలిగే ‘’పరసు వేది ‘’ని కని పెట్టిన సిద్ధ నాగార్జునుడు వేరు అనిఅనేక కధలు  ప్రచారం లోఉన్నాయి . దీనితో నాగార్జునా చార్యుడు రసాయన శాస్త్రానికి చేసిన అద్వితీయ కృషి మరుగున పడి పోయింది .నాగార్జునుడు వివిధ లోహాలను ప్రకృతి నుంచి సేకరించి వాటిని శుద్ధి చేసే విధానం కని  పెట్టాడు .రాత్రి వేళల్లో అడవుల్లో కాంతులు ప్రసరించే అనేక మూలికలను సేకరించి ప్రయోగాలు చేశాడు .వృక్ష సంబంధ పదార్ధాల తోను అనేక ప్రయోగాలు చేసి నమోదు చేశాడు .వీటి నన్నిటిని ‘’రస రత్నాకరం ‘’లో వివరించాడు .

ఆచార్యుడు రసాయన శాస్త్రం లోనే కాకుండా వైద్య ,యోగ శాస్త్రాలలో కూడా సృజనాత్మక కృషి చేశాడు .రస రత్నాకరం తో బాటు ‘’కక్షపుట తంత్రం ‘’,’’ఆరోగ్య మంజరి ‘’,యోగసారం ‘’యోగాస్టకం ‘’మొదలైన రచనలు చేశాడు .తన సిద్ధాంతాలను జన సామాన్యానికి అందించాలని ఎంతో తపన పడ్డాడు .దీనికి ఒక చిట్కా చేశాడు  .ఈ అపూర్వ విజ్ఞానం అంతా తనకూ దేవతలకు మధ్య జరిగిన సంభాషణల వల్లనే అబ్బిందని అందరికి చెప్పాడు ఈవిషయాన్ని రస రత్నాకరం లో చెప్పాడు కూడా .

Nagarjuna at Samye Ling Monastery.JPG

 

నాగార్జునుని రస రత్నాకరం ఆధునిక రసాయన శాస్త్ర వేత్తలకూ ప్రామాణిక గ్రంధమే అయింది .తన గ్రంధాలలో వాదప్రతి వాదాలరూపం తో  ఆకట్టుకొనే విధం గా విజ్ఞానాన్ని అందించాడు .ఈయనకున్న మహిమల్ని జనం విస్త్ర్తుతం గా ప్రచారం చేశారు .ఈయన ప్రయోగించిన చిట్కా వల్ల  ప్రాచీన శాస్త్ర వేత్త లెవ్వరికి రాని  ప్రచారం ఆచార్యునికి దక్కింది .రస రత్నాకరం లో రసాయన మూల కాల వివరణ బాగా ఉంది .రాసాయనిక యౌగికాల గురించి మొట్ట మొదట తెలియ జేసిన వాడు నాగార్జునుడే .ఇదే ఆ తర్వాత మెటలర్జీ ,ఆల్కేమీ గా వృద్ధి చెందాయి. రాగి, సీసం ,టిన్ ,వెండి బంగారం మొదలైన ముడి లోహాలను ఖనిజాల నుండి ఏ విధానం లో సంగ్రహించాలో వాటిని ఎలా శుద్ధి చేయాలో మొదలైన అమూల్య విషయాలు ఈ గ్రంధం లో రాశాడు .ఆయన మేధస్సును అంచనా వేయటం కష్టం .రస రత్నాకరం ఒక ప్రయోగాత్మక రసాయన శాస్త్రం .ప్రయోగాల వల్లనే వివిధ ధాతువుల నిర్మాణం, మేళ వింపు ప్రయోజ నాలు తెలుసుకోవచ్చని చెప్పాడు ప్రకృతిలో దాగి ఉన్న ఖనిజాలు ,మొక్కలు, మూలికలు,తృణ  ధాన్యాలు మొదలైన వాటిని ఆరోగ్య సంరక్షణ కై ఔషధాలను తయారు చేసుకోవచ్చునని సూచించాడు ,

 

‘’సిన బార్ ‘’(ఇంగిలీకం )నుండి పాదరసం తయారు చేయచ్చని ,’’కాలమైన్ ‘’సీసాం లాగా కనీ పిస్తుందని దీన్ని కూడా తయారు చేయ వచ్చునని ఈ గ్రంధం లో రాశాడు .దాతువుల్లో ఉన్న హాని చేసే పదార్ధాలను తొలగించి వాటిని ప్రయోజన కరమైన వాటిగా మార్చే విదానాలెన్నో చర్చించాడు .ఆరోగ్యం కోసం కొద్ది మోతాదులో పాదరసం ,గంధకం ఇంగువ  కలిపీ తింటే ఆయుస్సు పెరుగుతుందనీ తెలియ జేశాడు .దీన్నే ఇప్పుడు ‘’రస సింధూరం ‘’గా పిలుస్తున్నారు .మనిషి లో ప్రాణ శక్తి ,దీర్ఘకాల జబ్బుల వల్ల ‘’ఓజస్సు ‘’క్షీనిస్తుందని ,మళ్ళీ దాన్ని పొందాలంటే రసాయన పదార్దాలే గతి అని స్పష్టం గా చెప్పాడు .శరీరం లో రసం ,రక్తం మాంసం ,మేధస్సు ,ఆస్థి ,మజ్జ ,శుక్లం వల్లనే ‘’ఓజస్సు ‘’ఏర్పడుతుంది .కనుక ఓజస్సు తగ్గితే రసాయనిక చికిత్సే అవసరం అవుతుందని చెప్పాడు .వ్యాధి నిరోధక శక్తి పెరిగి ప్రాణ శక్తి పెరిగి సూక్ష్మ జీవులు  నసించితే తే ఓజస్సు వృద్ది చెందుతున్దన్నాడు

వ్యాధిని వివారించటం తో బాటు నియంత్రించటం లో కూడా శ్రద్ధ చూపించాలన్నాడు. ఆచార్యుడు .శుశ్రుతుడు రాసిన ‘’సుశ్రుత సంహిత ‘’ఆధారం గా ‘’ఉత్తర తంత్ర ‘’రాశాడు .దీని అసలు ప్రతి ఇతర దేశాల్లో వ్యాపించటం తో దాని వివరణలు

మనకేమీ తెలియ లేదు .ప్రక్రుతి సిద్ధ మైన రోగ నిరోధక శక్తి ని పెంచటానికి ఇందులో లొ చాలా విషయలున్నాయట..పాదరాసాన్ని పద్దెనిమిది సార్లు శుద్ధి చేసి,ఆ ద్రావకం లో వన మూలికల కషాయాన్ని రంగరించి విపరీతం గా చిలికితే అందులోని గంధకం ,అభ్రకం కొన్ని క్షారాలు కలిపి మళ్ళీ పది హేడు సార్లు శుద్ధి చేస్తే ‘’స్వర్ణ లోహం ‘’ఏర్పడుతుంది అని వివ రించాడు నాగార్జునుడు .అయితే ఇందులో ఏవి ఎన్నిపాళ్ళు ఉండాలో   స్పష్టం గా లేదట .జింక్ ను మూడు రెట్ల రాగితో కలిపి అత్యధిక వేడిలో ఉంచితే ఇత్తడి ఏర్పడుతుంది .కాని బంగారం ఎలా ?దీన్ని ఒక శ్లోకం లో రస రత్నాకరం లో వర్ణించాడు ,

‘’క్రమేణా క్రుత్వామ్బుధరేణ రంజితః – కరోతి శుల్వం త్రిపుటేన కాంచనం’’  కాని ఇంత వరకు ఎవరికీ ఇది అంటూ బట్ట లేదట .ఇలా రసాయనిక శాస్త్రానికి ఆద్యుడయ్యాడు ఆచార్య నాగార్జునుడు .

నాగార్జునుడు ఏర్పరచిన విశ్వ విద్యాలం లో బౌద్ధ భిక్షువులు ,సన్యాసులు అనేక దేశాల నుండి వచ్చి చేరి చదువు కొనే వారు అన్ని శాస్త్రాలను ఇక్కడ విద్యార్ధులు నేర్చుకొనే అవకాశం ఉండేది .ఇక్కడే 108అడుగుల వ్యాసం ,86అడుగుల ఎత్తు ,ఉన్న మహా స్తూపం ఉంది .దీన్ని పద్దెనిమిది అంగుళాల పొడవు ,తొమ్మిది అంగుళాల వెడల్పు ,నాలుగు అంగుళాల మందం తో చేసిన ప్రత్యెక ఇటుక లతో ఈ స్తూపాన్ని నిర్మించారు .విజయ పురి అంతర్జాతీయ బౌద్ధ విహార కేంద్రం అయింది ఇప్పటి నాగార్జున సాగర్ కు ఎనిమిది కిలో మీటర్ల దూరం లో ‘’అనువు ‘’అనే చోట ఇక్ష్వాకుల కట్టడాల్ని పునర్నిర్మించారు

నాగార్జునుడు సకల శాస్త్ర పారంగతుడని అపర ధన్వంతరి అని శాస్త్ర శాస్త్ర ప్రవీణుడు అని తత్వ వేది, తార్కికుడు ,ఖనిజ కళా నిష్ణాతుడు ,వేదంవేదంగ  విద్యా విశారదుడు ,కవి సార్వ భౌముడు ,కళోపాసకుడు ,మాధ్యమిక వాద మహా ప్రవక్త ,మహా యాన మార్తాండుడు ,శతాధిక గ్రంధ కర్త అని ఎందరో తమ రచనల్లో ఆయన ప్రతిభా విశేషాలను ప్రస్తుతించారు .చిన్ననాటే వేదం వేదంగ పారంగతుడై ,వివాహ ప్రసక్తి లేకుండా సన్య సించి సర్వ జ్ఞాని అయ్యాడు అని చరిత్ర కారుల అభి భాషణ .భారతీయ రస వాదుల్లో ప్రప్రధముడు .బట్టీ పట్టటం (దిస్తిలేషన్ )శుద్ధిచేయటం (సబ్లిమేషన్  )భస్మం చేయటం (కాల్సి నేషన్ )మొదలైన పద్ధతుల్లో లోహాల రంగులు మార్చటం ,లోహ మిశ్రమం (అల్లాయ్ల్ )అగ్ని శీలా (పైరైట్స్త్స్ )నుంచి రాగి తీయటం ,మెటాలిక్ ఆక్సైడ్స్ ,ఆక్సైడ్స్ ఆఫ్ బ్రాస్ మొదలైనవి  నాగార్జున మేధో జనితాలే వైద్యం లో ‘’కజ్జోలి ‘’అన బడే బ్లాక్ సల్ఫైడ్ ఆఫ్ మెర్క్యురి ని పరచయం చేసిన వాడు కూడా ఆచార్యుడే .తన శాస్త్రీయ ప్రయోగ వివరాలను శిలలపై చెక్కించాడు .లోహ సంగ్రహణ శాస్త్రానికి (మెటలర్జీ )కి ఆద్యుడయ్యాడు .ఆచార్య నాగార్జుడిని మొదటి నాగార్జునుడు అంటారు .

 

ఆధునిక భౌతిక శాస్త్రం లో లేజర్ కిరణాల సహాయం తో అణువు కేంద్రకం లోని ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్యను మార్చే అవకాశం కలిగింది . ప్రోటాన్ సంఖ్య మారితే ఒక మూలకం ఇంకో మూలకం గా మారుతుందని రుజువు అయింది .లేజర్ తో రాగి కేంద్రాణువులో ఒక ప్రోటాన్ చేరిస్తే నికెల్ అయి పోతుంది .అలానే ‘వల్కన్ ‘’అనే శక్తి వంత మైన లేజర్ నుపయోగించి బంగారాన్ని పాదరసం గా మార్చ గలిగారు ఈ నాటి శాస్త్ర వేత్తలు .వీటి కన్నిటికి ఆచార్య నాగార్జునుని మౌలిక భావనలే ఆధారం .

రెండవ నాగార్జునుడే ‘’’సిద్ధ నాగార్జునుడు ‘’క్రీ.శ.600వాడు .రస విద్య లో అఖండుడు .పుణ్య సాధువు అనే ఆయన మేనల్లుడు .జైన తత్వ వేత్త .వైద్య ప్రకాన్దుడు అని పించుకొన్న పూజ్య పాదుల వద్ద ఉద్యోగి. జైనుడుగా పుట్టినా బౌద్దం స్వీకరించాడు .దేశం లో ను నేపాల్ ,టిబెట్ లలో పర్యటించి బౌద్ధ ప్రచారం చేశాడు శ్రీశైలం కొండడకు వచ్చి ‘’నాగార్జున బోధి సత్వ ‘’గా ప్రసిద్ధుడైనాడు. అనేక రసాయన ప్రయోగాలు చేశాడు .రస వాదవిద్య ద్వారా మోక్షాన్ని పొందాడు అందుకే సిద్ధ నాగార్జునుడుగా అందరూ ఆరాధించారు .’’రస కాచ పుట ‘’,’’కక్షు పుట తంత్ర ‘’,మొదలైన గ్రందాల రచయితగా సుప్రసిద్దుడయ్యాడీ సిద్ధ నాగార్జునుడు .

మూడవ నాగార్జునుడు –అసలు పేరు ‘’భదంత నాగార్జున ‘’క్రీ.శ.ఏడవశతాబ్దివాడు . కేరళ కు చెందిన బౌద్ధ సన్యాసిగా చరిత్ర పుటల కెక్కాడు .ఆయుర్వేదం లో ఆనాడు ప్రసిద్ధ మైన అనేక గ్రందాలు చదివి జీర్ణం చేసుకొన్నాడు .’’రస వైశేషిక సూత్ర ‘’అనే గ్రంధం రాశాడు .ఆయుర్వేద వైద్యానికి చెందిన మౌలిక సూత్రాలను ఇందులో చర్చించాడు .ఇది486సూత్రాలతో నలుగు అధ్యాయాలుగా ఉంది .స్వతంత్ర విధానం గా అలోచించి రాశాడు .తన శైలిలో ‘’నాగార్జుని యాన్ ‘’అనే ప్రత్యెక వైద్య స్సంప్రదాయాన్ని నెల కొల్పి అనేక మందికి తర్ఫీదు ఇచ్చాడు .మొత్తం  మీద నాగర్జునులు ముగ్గురూ ముగ్గురే .వైద్య రసాయనాలకు ముగ్గులేసి వ్యాప్తి చెందించిన వారే .

సశేషం –

దీపావళి  శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-13-ఉయ్యూరు

 

Posted in సైన్స్ | Tagged | Leave a comment

కిసుక్కు కిసుక్కు

కిసుక్కు కిసుక్కు

1-ఒక కూతురు తండ్రి అల్లుడితో ‘’అల్లుడూ !మా అమ్మాయిని గారాబం గా పెంచినీ  చేతిల్ పెడుతున్నాం .ఎలా ఎలుకొంటావో ?’’

గడసరి అల్లుడు ‘’అదేంటి మామగారూ !మీరు సంపాదిస్తున్నంత వరకు మీఅమ్మాయిని   నేను జాగాత్తగానే చూసుకొంటాను ‘’అన్నాడు

2-కూతుర్ని వియ్యపు రాలికి అప్పగిస్తూ ‘ఒదినా !మాపిల్లను అల్లారు ముద్దుగా పెంచి ఎక్కడికీ పంపకుండా జాగ్రత్త గా చూసుకొన్నాను .ఇక మీదే బాధ్యత ‘’అంది

గడసరి అత్త’’అదేమిటి ఒదినా !నాలుగు రోజుల్లో మా కోడలికి  పుట్టిల్లు జ్ఞాపకం వచ్చేట్లుచెయ్యక పోతే మీ మీద ఒట్టు ‘’

‘’అంది

3-బాబూ !తెలంగాణా వస్తే నువ్వే ప్రభువువి కదా .నా సంగతి సేల్లెలు సంగతి ఎంది ?అని అడిగాడు కే.సి.ఆర్ ని కొడుకు కే.టి.ఆర్ .

‘’దాందేముంది కొడకా !వెంటనే హైదరాబాద్ వదిలేల్లమని ఒత్తిడి సేసి ఆంద్రోళ్ళ పై ఒత్తిడితెచ్చి పంపినంక నీకు పట్టాభిసేకం సేయనో ‘’అన్నాడు

‘’మరి కవిత సంగతేంది నాయనో ?”’మళ్ళీ ప్రశ్న .

‘’మెదక్ జిల్లాను రాష్ట్రం సేసి సిన్నమ్మకు కట్టబెట్టనో ‘’అన్నాడు తండ్రి .

4-‘’యేమిరా పొరగా !నువ్వు సువ్వలు లెక్కిస్తాఉంటే నేను నీ అక్కా,దేశాలు సుట్టి కాల్లు  పీక్కోచ్చ్చేదాకా నడిసి డిల్లీ ,ఇటలీ కెళ్ళి ఒత్తిడి తెచ్చి నిన్ను విడిపించి పట్టంకట్టే ఒప్పందం చేశాం .మా గతేంటి ?జయమ్మ అడిగింది కొడుకు జ’’గన్ ‘ ను .

‘’అమ్మరో !సేసిన మేలు మరిచే  వాణ్నికాను నాన్న లాగా .నీకు రాయల సీమ రాసిస్తా.అక్కకు బెంగుళూర్ రాసిస్తా ‘’అన్నాడు అలవాటులో పొరబాటుగా.

5- ఒరేయ్ !ఆ అమ్మాయికి వంద లవ్ లెటర్లు రాశా .రెస్పాన్సు లేదురా .ఏం చేయాలో తోచటం  లేదు ;;అడిగాడు ప్రేమా రావు తన స్నేహితుడు సలహాల్ రావు ను .

‘’భయపడకు బ్రదర్ .ఫలించక పోయినా రోజుకోటి రాస్తూండు. గిన్నీస్ బుక్ ఎక్కే అదృష్టం దక్కుతుంది ‘’అన్నాడు సలహాలు .

6-‘’ఓదినా !నిన్న జీడిపాకం సీరియల్లో చివరికేమైంది .?మా ఆయన అన్నం పెట్టమని పీక్కు తింటే వెళ్లాను చూడలేక పోయాను అడిగింది పక్కింటి ఆవిడను ఒక సీరియల్ రాణి

‘’ఏముంది ఒదినా !హీరోయిన్ చీర మార్చుకోటానికి వెళ్ళిందా .బీరు వాలో ఏ చీరా నచ్చక కింద పారేస్తుంటే ,అసలు చీర కట్టిందో లేదో తెలియ కుండా ఎపిసోడ్ పూర్తయింది అంతే ‘’అంది పక్కింటి ఆవిడ

7-‘’నాధా !ఆంధ్రాను చీలుస్తారా లేదా ?’’’’అడిగింది పార్వతి శివుడిని .

‘’నేను నిన్నూఎలుకొంటూనే  గంగనూనెత్తి కెత్తు కొన్నాను.శ్రీనాధుడు అడిగి నట్లు ‘’పరమేశా గంగ విడువు పార్వతి చాలున్ ‘’ అని  విడిచే చేద్దామంటే రాష్ట్రం అంతా వరదల్లో మునిగే పోయింది ఇంకా గంగ అవసరమే లేదు కదా ?అని నర్మ గర్భం గా నవ్వ్వి తప్పించుకొన్నాడు భవుడు .

8- పిల్లలూ !ఆంద్ర ప్రదేశ అవతరణ శుభా కాంక్షలు’’అన్నారు  ఓమేష్టారు క్లాస్ లోని పిల్లలతో

‘’సార్ !చెప్పండి ఇదే లాస్ట్ చాన్స్ ఏమో .వచ్చే ఏడు ఏం చెప్పాలో ?’’బుర్రగోక్కున్నాడోక గడుగ్గాయి

9-పింగళి లక్ష్మీ కాంతం గారు బందరు వదిలి మద్రాస్ లో ప్రాచ్య లిఖిత భాండాగారం లో రెండేళ్ళు పని చేసి మహా భారతం పై అపూర్వ పరిశోధన చేసి తిరిగి వచ్చినప్పుడు బందరులో మిత్రులన్తాఘన సన్మానం చేశారు పింగళి వారు రెండు గంటలు భారత విషయాలను అనర్గళం గా ప్రసంగించారు .అధ్యక్షా స్తానం లో ఉన్న విశ్వనాధ ‘’మా కాంతం మద్రాస్ లో నిద్ర పోతు ,చుట్ట కాల్చుకొంటూ కూచున్నదేమో అనుకొన్నాను .అట్లా కాదని ఇప్పుడు తెలుసుకొన్నాను భారతాన్ని తరచి పరిశోధించాడు ‘’అని మెచ్చారు .

10-స్వామినాధన్ అనే పెద్దాయన పింగళి వారికి పెట్రన్ .’’గొడుగు పేట గోల్డ్ స్మిత్ ‘’అని అందరు పిలిచే వారు .ఆ నాటి పెద్ద లందరి మీద స్వామినాధన్ చాటువులు చెప్పే వారు .

లక్ష్మీ కాంతం గారిపై ఆయన చెప్పిన రెండు  చాటువులు

‘’కాంతాయ కాఫీ హోటలు ప్రాంతాయ –రుజా క్రాంతాయ –వృధా సంభవాయ ‘’.

‘’చేత కానీ లేని పూరంగడు –పూవుల రంగడై విరియ బూచిన  తంగేడు సంగడీడు ‘’

11-కాటూరి వారి పై స్వామినాధన్ చెప్పిన చాటువు

‘’గూడ కట్టొక టేసి –అన్నంబు దిన్నచో –అరుగు దంచూరక –పోగాకునే త్రాగెడు గ్రాకు గాడు ‘’.

దీపావళి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-13-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

మా ఇంట్లో నరక చతుర్ధశి వేడుకలు

This gallery contains 22 photos.

More Galleries | Tagged | Leave a comment

ఆంద్ర వివేకానందులు ,ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు -1

ఆంద్ర వివేకానందులు ,ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు -1

నాచిన్నతనం నుండే పండితుల వారి గురించి మా నాన్న గారు మామయ్యా ఎప్పుడూ మాట్లాడుకొనే వారు  నాకు కొంచెం వయసు వచ్చిన తర్వాత బెజవాడ లో రామకోటి ఉత్సవాలు ఇప్పుడున్న క్షేత్రయ్య కళా క్షేత్రం ఉన్న చోట శివ రామ కృష్ణ క్షేత్రం లో జరిగేవి .ఒక్కోసారి నెల రోజులు ఉండేవి .రోజు సభలూ సమా వేశాలు ధార్మిక ఉపన్యాసాలు, హరి కధలు భజనలు ,అఖండ రామ నామ కీర్తనలు  సంగీత కచ్చేరీలు నిర్వహించే వారు .నేను  మా మామయ్య గంగయ్య గారు, మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారలతో  మా కుటుంబం తో సహా వెళ్ళే వాళ్ళం .అందరికి భోజన సదుపాయాలు ఉండేవి అని  జ్ఞాపకం ..మా నాన్న ,మామయ్య ల ఉపన్యాసాలు కూడా ఉండేవి .అదుగో అప్పుడు చూశాను పండితుల వారిని .’’గంభీర సాగర ఘోష లాంటి వాగ్ధాటి ,అందులో వేదం విజ్ఞాన గంగ ,ఉపనిషద్ విజ్ఞాన యమునా ,పురాణ విజ్ఞాన సరస్వతి ,,భగవద్గీతా విజ్ఞాన  గోదావరి ,పురాణ విజ్ఞాన కృష్ణ వేణీ,కావ్య విజ్ఞాన కావేరీ ,సనాతన ధర్మ విజ్ఞాన పినాకినీ మొదలైన నదులన్నీ ఉత్తుంగ తరంగాలై ఎగసి పడేవి . ఆ శైలి శైలూషీ ప్రవాహమే ..ప్రశ్నించే వారి ని సంతృప్తి పరచే  విజ్ఞాన సర్వసం .అడ్డం గా మాట్లాడే వారి పాలిట వజ్రాయుధం .ఉపన్యాస చక్రవర్తిగా సనాతన హిందూ ధర్మ పరి రక్షుకుడైన, ఆంద్ర వివేకా నందులుగా స్వర్గీయ ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు ఆదర్శ మూర్తి .అనిపించారు  మొదటి సారి చూడంగానే .అలాంటి మహోన్నత వ్యక్తీ భువిని వదిలి దివిజ కవి వరుల గుండెలు దిగ్గురనగా దివిని చేరారు .అయన  రాసిన పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి .చెప్పింది చేసి ఆచరించే సాధనా పరులు .అలాంటి వారిని జాతి మరచి పోతోందేమో నని ఈ మధ్యనే నాకు అని పించింది .ఆయన గురించి ఏదైనా సమాచారం పుస్తక రూపం గా దొరుకుతుందేమో నని ఎదురు చూస్తున్నాను .కొద్ది నెలల క్రితం బేజ వాడ ‘’లెనిన్ సెంటర్ ‘’లో ఉన్న పాత పుస్తకాల షాపుల్లో ఒకటి సాహితీ మిత్రుడైనజనార్దన రావు గారి   షాపు వుంది .అక్కడ లభించని పాత గ్రంధమే లేదు .అక్కడే దొరికింది శ్రీ  పండితులపైవారి శత జయంతి ఉత్సవ సంరంభం నాడు  ఉత్సవకమిటీ గుంటూరు జిల్లా పొన్నూరు నుండి ముద్రించిన పుస్తకం  కొని  మహా దానంద పడ్డాను .కాని దాన్ని ఈ వారం లోనే చదవ గలిగాను .వారి జీవిత విశేషాలు స్పూర్తి దాయకాలు .అందుకనే అందరికి తెలియ జేయాలనే ఉత్సాహం తో దీన్ని రాస్తున్నాను .పండితుల వారికి నా  వంతు ఋణం తీర్చుకొంటున్నాను .

పండితుల వారి జీవిత విశేషాలు

26-11-1890 లో వికృతి నామ సంవత్సర కార్తీక శుద్ధ పూర్ణిమ బుధ వారం వృశ్చిక లగ్నం లో గుంటూరు జిల్లా సత్తెన పల్లి తాలూకా గుడి పూడి గ్రామం లోప్రభాకర ఉమా మహేశ్వరుల వారు  జన్మించారు .తండ్రి వెంకట కృష్ణ శాస్త్రి

గారు శ్రౌత ,స్మార్తాలలో నిష్ణాతులు . ,తాత గారు నాగేశ్వర పాకయాజి . ప్రభాకరులకు రామ చంద్ర శర్మ ,సూర్య నారాయణ శర్మ తమ్ములు .వీరిది భారద్వాజస గోత్రం

ప్రభాకరులు చిన్నప్పటి నుంచి ఏకాంతం గా శివ ధ్యానం లో గడిపే వారు .గుంటూరు హిందూ హైస్కూల్ లో (ఆ నాటి పేరు టౌన్ హైస్కూల్ )ఫస్ట్ ఫారం లో చేరారు .పుంభావ సరస్వతి ,ఆంద్ర ఆస్థాన తొలి కవి శ్రీ కాశీ కృష్ణా చార్యుల సంస్కృత గురువులు  .ఒక రోజు స్కూల్ మైదానం లో ఉన్నావ లక్ష్మీ నారాయణ పంతులుగారి ఉపన్యాసం విన్నారు స్వరాజ్యం కోసం అందరూ కలిసి రావాలనే వారి బోధ పండితుల వారి గుండెల్ని సూటిగా తాకింది .స్వదేశీ భావన మనసంతా నిండింది .కాలేజి లో చదవటానికి ఇస్ట పడక ఇంగ్లీష్ నేర్వ రాదనీ చదువే మానేశారు .

స్వగ్రామం గుడిపూడిలో విదేశీయులు డేరాలు వేసి క్రైస్తవ ప్రచారం చేయటం చూసి ‘’హిందూ ధర్మ ప్రచారం ‘’చేయాలని నిశ్చయించుకొన్నారు .అప్పుడే వివేకానందుల చికాగో ఉపన్యాసాలు చదివి స్పూర్తి పొందారు .హిందూ ధర్మ ప్రచారమే తన జీవిత ఆదర్శం గా భావించి కృత నిశ్చయం తో జీవితాంతం కోన సాగించిన ధర్మ పరిరక్షకులు .దీనికి వేదం వేదాంగాలను చదివి అర్ధం చేసుకోవాలి .వెంటనే కనుపర్తి  కోటేశ్వర శాస్త్రి గారి వద్ద శిష్యరికం చేసి ,హయగ్రీవ ఉపాసకులై ప్రియ శిష్యులై అన్నీ నేర్చి ‘’అపర శంకరులు ‘’అని గురువు గారిచేత   అనిపించుకొన్న మేధావి .బెల్లం కొండ రామ రాయ కవి వద్ద సంస్కృత ,సాహిత్యం ,తర్కం, వ్యాకరణం ,వేదాంతం, అనేక శాస్త్రాలను చదివి ఔపోసన పట్టారు .వివిధ శాస్త్ర పరిచయం తో ధర్మ రహస్యాలన్నీ ఆకళింపు చేసుకో గలిగారు .గురువులకు తగిన శిష్యులయ్యారు .’’ప్రతిభా ప్రభాకరు’’లయ్యారు  .అకుంఠిత దీక్ష ,సాధన ,నిస్వార్ధత ,త్యాగం ,దేశ భక్తీ కి వీరు నిలువెత్తు దర్పణం .

‘’స్వ ధర్మ ప్రతి పాదిక పై స్వరాజ్య పాలన ‘’అనే ప్రత్యెక నినాదం తో మేఘ గంభీర స్వనం తో, ఉపన్యాసాలతో దేశాన్ని ఉర్రూత లూగించారు .ఆయన ధోరణి అనితర సాధ్యం .అన్యమత ఖండనం లో అరివీర భయంకరులు .నిరంకుశం గానే ఈవిషయం లో వ్యవహరించేవారు .’’సనాతన ధర్మ మంత్రం ‘’ను పండితుల వారు జపించి నన్ని సార్లు మన రాష్ట్రం లో వేరెవ్వరూ జపించాలేదంటే పండితుల వారి ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది ..శాస్త్ర విజ్ఞానాని ,తత్వ విజ్ఞానానికి ,మతానికి హేతు వాదానికి ,ప్రాక్ పశ్చిమ సంస్కృథీ సభ్యతల మధ్య ,గతానికి ,వార్త మానానికి మధ్య సమన్వయాన్ని సాధించిన మహా వ్యక్తీ .సనాతన ధర్మం లోని మానవతా వాదాన్ని ,శాస్త్రీయ దృక్పధాన్ని ,విశ్వ జనీనతను సింహ గర్జనం తో ధ్వనింప జేశారు .క్షాత్ర వీర్యం తో బ్రహ్మ తేజాన్ని మేళ వించి భారతీయులు పురోగమించాలని ఉద్బోధించారు .

భారత భూమి వేదభూమి ,తపో భూమి ,జ్ఞాన భూమి ,త్యాగ భూమి ,పుణ్య భూమి,,యోగ భూమి అని పదే పదే గుర్తు చేసే వారు . రోమన్, గ్రీక్ ఈజిప్ట్ ,జోరాస్ట్రియన్ మొదలైన నాగరకత లన్నీ కొద్ది పాటి ఉపద్రవాలకే తట్టుకోలేక కాల

గర్భం లో కలిసి పోయాయని చెప్పేవారు .కాని ఇరానియన్లు ,గ్రీకులు శిదియన్లు ,కుషానులు ఆంగ్లేయాది ఇతర దేశీయులేందరోభారత దేశం పై దురాక్రమణ చేసి వశ పరచుకొని వెయ్యి ఏళ్ళు ఇబ్బందులు పెట్టినా  మన సంస్కృతీ  గంగ అవిచ్చిన్నం గా పురోగమిస్తూనే ఉంది .వీటి నన్నిటిని తన లో లయింప జేసుకోంది కూడా అంటారు .ఇలాంటి విలక్షణ విశిష్ట సంస్కృతికి మనం వారసులం అని గుర్తు చేస్తారు.‘’నేను హిందువును .నా ధర్మం సనాతన ధర్మం .నా దేశం భారత దేశం ‘’అని ప్రతి హిందువు ఎలుగెత్తి చాటాలని పండితుల వారు ఉద్బోధించేవారు. ఆధ్యాత్మిక చింతన ,ధార్మిక జీవనం వల్లనే పర పీడన నుంచి విముక్తి లభిస్తుందని అనే వారు .హిందువు మనసా వాచా ,కర్మణా హిందువుగా జీవించాలిఅని వారి ప్రబోధం .హిందూ మతం లో ఉన్న విభిన్నత ,శ్రుతి స్మ్ర్తుతి ,పురాణాల లోని పరస్పర విరుద్ధ విషయాలు మన వాళ్లకు అర్ధం కాక పోవటం వల్ల ఇతరులు వేసే ప్రశ్నలకు దీటైన సమాధానాలు చెప్పలేక పోవటం వల్ల  ఇబ్బంది ఏర్పడిందని భావించారు .సహేతుకం గా ,అనుభవ పూర్వకం గా సమన్వయించి చెప్పగల శక్తి ఉన్న పండితులు లేక పోవటమే ఈ దుస్తితికి కారణం గా భావించి ఈ పవిత్ర జ్ఞాన యజ్ఞం కోసం  జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి ప్రభాకర పండితులు . ఆ నాడు మన రాష్ట్రం లో వీరు తప్ప వేరెవ్వరూ లేరనటం నూటికి వెయ్యి శాతం యదార్ధం

పండితుల ఉపన్యాస గంగా స్నాన ఫలితాలు తరువాత తెలుసుకొందాం .

దీపావళి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 2-11-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -5

      విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -5

రసాయనిక ,రస సిద్ధాంతాలకు అలనాటి శాస్త్రజ్ఞుల కృషి

భారతీయ ప్రాచీన రసాయన శాస్త్ర విజ్ఞానం కొన్ని శతాబ్దాల పాటు అజ్ఞాతం లో ఉండి పోయింది .భారత ‘’రసాయనిక పారిశ్రామిక  పిత’’అని పేరొంది  ,ప్రపంచ రసాయన శాస్త్ర వేత్త అయిన ‘’ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే’’రాసిన ‘’హిందూ కేమిస్త్రి ‘’అనే పుస్తకం లో భారతీయ రసాయనిక శాస్త్ర వేత్త ల గురించి సంక్షిప్తం గా చెప్పారు .దీని వల్లనే మొదటి సారిగా మన రసాయనిక విజ్ఞానం లోకానికి తెలిసింది .ఆ కాలం లో’’ధాతు విజ్ఞానం ,చికిత్సా విజ్ఞానం మేళ వింపు’’ నే’’రసాయనిక శాస్త్రం’’ గా భావించే వారట .సాధారణ రసాయన పదార్ధాలను ముఖ్య రసాలు ,ముఖ్య రసాయన పదార్ధాలను మహా రసాలు ,ఉప రసాలు ,సామాన్య రసాలుగా వాటిగా పేర్కొన్నారు.ఆమ్లాలు క్షారాలు ద్రవాలు సొల్యూషన్స్ ఇవన్నీ వారికి తెలిసినవే .

మన పూర్వ రసాయన శాస్త్ర వేత్తలు వాడిన పారి భాషిక పదాలనే రసాయన శాస్త్రం లో వాడుతున్నారు రే.గారు రాసిన గ్రంధం లో ప్రాచీన రసాయన శాస్త్ర వేత్తల జీవితాలు రచనలు చోటు చేసుకొన్నాయి .నాగార్జునుడు ‘’ఆరోగ్య మంజరి ‘’,’’రస రత్నాకరం ‘’,కష పుట తంత్రం ‘’,యోగ సారం ‘’,యోగాస్టకం మొదలైన గ్రంధాలు రాశాడని గోవిందా చార్యుడు ‘’రసార్ణవం ‘’రాస్తే ,యశోధరుడు ‘’రస ప్రకాస సుధాకరం ‘’,సోమదేవుడు ‘’రసేంద్ర చూడామణి ‘’వాగ్భటుడు ‘’రస రత్న సముచ్చయం ‘’,రామ చంద్రుడు ‘’రసేంద్ర చింతామణి ‘’రాసి నట్లు రే చెప్పారు .పూర్వ రసాయన శాస్త్రజ్ఞులు ప్రయోగాలకోసం వైద్యానికి మాత్రమె ప్రయోగాలూ నిర్వహించే వారని తెలియ జేశారు .ధాన్యాలు ,పండ్లు ,దుంపలు ,కర్రలు పుష్పాలతో మద్యం తయారు చేసే వారు వీటికే ఆసవాలు అనే పేరు .వివిధ రోగాలకు వీటిని ఔషధం గా వాడే వారట .మొత్తం తొమ్మిది రకాల ఆసవాలున్నట్లు ఆయన చెప్పారు .సుగంధ ద్రవ్యాలు ,అత్తర్లు గంధాలు ‘’రస శాల ‘’అనే ప్రయోగ శాలలో తయారు చేసేవారు. శాస్త్ర విజ్ఞానాన్ని గురు ముఖతా విని స్వంతం గా ప్రయోగాలు చేసి సిద్ధాంతాలను రూపొందించే వారట .వీరి ధాతు విజ్ఞానం ,చికిత్సా విధానం వైద్య శాస్త్రం లో ఈ రూపం గా ప్రవేశింది .

ఆనాటి రసాయన శాస్త్ర వేత్తలు

-ధుండు నాధుడు –పద్నాలుగో శతాబ్దానికి చెందిన వాడు .కాల నాద మహర్షి శిష్యుడు .’’రసేంద్ర చింతామణి ‘’రచయిత .ఇందులో ఎనిమిది రస సంస్కార విధానాలు చెప్పాడు దీర్ఘ కాల వ్యాధులకు చికిత్సలు సూచిన్చాడు.వైద్యం రస వాదాల మీద పూర్తీ పట్టు ఉన్న వాడు

బిందు –మహా రాష్ట్ర వాడు ‘’రస పద్ధతి రచయిత .అనేక ఔషధాలు రస సంస్కారాలు ఇందులో ఉన్నాయి .సృజన శీలి .

కుమారుడు మహా దేవా తండ్రి గ్రంధానికి వ్యాఖ్యానం రాశాడు ఇందులో మరాఠీ పదాలే ఎక్కువ .

చక్ర పాణి దత్త -1040లో బెంగాల్ లోని భీర్భం లో పుట్టాడు .సంకల కర్త ,వ్యాఖ్యాన కర్త ,.చరక సంహితను అద్భుత వ్యాఖ్యానం గా ‘’ ఆయు ర్వెద దీపిక ‘’రాశాడు .’’చికిత్స సంగ్రహ ,ద్రవ్య గుణ సంగ్రహ ,భానుమతి ఇతని ఇతర రచనలు .ఔషధ నిఘంటువు ను ‘’ ముక్తా వలి ‘’పేరు తో వెలయింప జేశాడు .ఆ నాటి ప్రసిద్ధ వైద్యుడు ‘’నారద దత్త ‘’శిష్యుడై ఘన కీర్తి పొందాడు .

రస వాద విజ్ఞానులు

ఆనంద భారతి -1503-1600వాడు ‘’ఆనంద సిద్ధ ‘’పేరు తో ప్రాచుర్యం పొందాడు .యతీన్ద్రుడు గా నిలిచి పోయాడు .రస వాదం లో ఎన్నో ప్రయోగాలు చేశాడు .దీని పై ‘’ఆనంద మాల ‘’గ్రంధం రాశాడు .ఎనిమిది రకాల పాత్రల స్వరూపాన్ని చెప్పాడు .పాదరాసాన్ని శద్ధి చేసే విధానం చెప్పాడు .తైలాలు ఘ్రుతాలు ,గుళికలు మొదలైన మందుల తయారీ విధానాలను తెలియ జేశాడు .

గోవిందా చార్య –14-15శతాబ్ది వాడు .గుజ రాత్ లో సురాదిత్య కు కుమారుడు .బోధకుడు గా పసిద్ది .సృజన శీలి .’’రస సార’’ గ్రంధ రచయిత . జరణ ,బంధ మొదలైన రస సిద్ధాంతాలపై ఇందులో చర్చించాడు .రస విద్య మీద వచ్చినగోప్ప సిద్ధాంత గ్రంధం ఇదే .ఈ గ్రంధం అత్యంత ప్రామాణికం గా భావిస్తారు .

రామ చంద్ర -14వ శతాబ్దం వాడు .రస సిద్ధాంతానికి ,ప్రయోగాలకు పేరు పొందాడు .సంస్కృతం లో ‘’చక్ర దత్త ‘’,నమక’’ ‘’రసేంద్ర చింతామణి ‘’రాశాడు .రసాయన పొడులు ,భస్మాల విషయాలన్నీ వివరం గా ఇందులో చెప్పాడు .అనేక రోగాలకు ఖనిజాల నుండి తయారు చేసిన ఔషధాల గురించి రాశాడు

రామ కృష్ణ భట్టు –పదహారవ శతాబ్ది వాడు .ఏప్రాంతం వాడో ఖచ్చితం గా తెలీదు. తండ్రి నీల కంఠ ఔషధ శాస్త్రం లో ప్రఖ్యాతుడు .పాద రస రూప కల్పనలో సిద్ధుడు ‘.’రసేంద్ర కల్ప ద్రుమం ‘’అనే సంస్కృత గ్రంధ రచయిత .ఇది పాదరసానికి చెందిన గొప్ప సిద్ధాంత గ్రంధం గా పేరు తెచ్చుకోంది. పాదరసం తయారీ లో అనేక విధానాలను ఇందులో చర్చించాడు .

రామేశ్వర భట్టు –పద్నాలుగో శతాబ్ది వాడు .పాదరసాన్ని ఉపయోగించి అనేక ఔషధాల తయారీ ని చెప్పాడు. పాదరస శుద్ధి ,దాని గుణాల మీద ‘’రస రాజ్య లక్ష్మి ‘’అనే సిద్ధాంత గ్రంధాన్ని రాశాడు

రుద్ర-క్రీ పూ.వాడని అంటారు.అనేక  వైద్య గ్రంధాల  లో ఈయన పేరు ప్రస్తావించారు ‘’రు యామచరిత్ర  ‘పరాద కల్ప ‘’’ధాతు కల్ప ‘’,హరితల కల్ప ‘’(పసుపు పచ్చని తైలాల తయారీ ),’’అభ్రక కల్ప ‘’(అభ్రకం నుంచి ఔషధాల తయారీ )మొదలైన అరవై కి పైగా వైద్య గ్రంధాలు రాసి మహా కీర్తి వంతుడయ్యాడు .‘’,

సశేషం

నరక చతుర్దశి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-11-13 –ఉయ్యూరు

 

 

Posted in సైన్స్ | Tagged | 1 Comment

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దిన శుభాకాంక్షలు 01.11.1956

andhra Pradesh Formation 1 11 1956CR1

Posted in వార్తా పత్రికలో | Leave a comment

ప్రభావ శాలి అమెరికా ప్రెసిడెంట్ తల్లి నాన్సీ -విహంగ మహిళా వెబ్ మేగజైన్ -నవంబర్

ప్రభావ శాలి అమెరికా ప్రెసిడెంట్ తల్లి నాన్సీ -విహంగ మహిళా వెబ్ మేగజైన్ -నవంబర్

అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ పై  చిన్నతనం లో నే ప్రభావం చూపి మార్గ దర్శకత్వం చేసింది  అతని తల్లి

Nancy LincolnNancy Lincoln

నాన్సీ హాక్స్ లింకన్ .ఆమె1784 ఫిబ్రవరి 5న   వర్జీనియా లో నోబుల్ మాన్ అనిపించుకొన్నవ్యక్తి లూసీ హాంక్స్ కుమార్తె ..హాంప్ షైర్ కౌంటి లో పుట్టింది .అమ్మమ్మ చాలా బీద తనం లో ఉన్నా గౌరవం సాధించుకొన్నది .సరిహద్దు ప్రాంతం కనుక పొలం పనులు ,నేత చేతి పనులు తాత గారింట నేర్చింది బైబిల్ బాగా చదివి బెర్రీ హోమ్ లో ‘’సీమ్ స్ట్రెస్ ‘’గా వివాహానికి ముందు వరకు పని చేసింది అమ్మమ్మ ,తాతయ్యలనే అమ్మా ,నాన్న అని పిలిచేది నాన్సీ .. ‘’తన తల్లి తాత గారి గుణాలను వారసత్వం గా పొందిందని లింకనే చెప్పుకొన్నాడు .తనకు తల్లి లక్షణాలు సంక్రమించాయని కూడా అన్నాడు .1806 జూన్ పన్నెండున థామస్ లింకన్ తో నాన్సీ వివాహం జరిగి కెంటకి కి కాపురానికి వెళ్ళింది  .

       నాన్సీ చాలా చురుకుగా ,సూటిగా వివేకం తో తెలివి తేటలతో ఆ నాటి సమాజపు మిగిలిన స్త్రీల కంటే భిన్నం గా ఉండేది ఇవన్నీ కొడుకు లింకన్ సాధించాలని ఆమె ఆరాట పడేది .ఆ నాటి తన వయసు మహిళల సగటు ఎత్తు కన్నా నాన్సీ ఎత్తుగా ఉండేది .కాని చాలా బక్క పలచగా నూట ఇరవై  పౌండ్ల శారీరక  బరువుతో ఉండేది .ఆమెను చూసిన వారికి ఆమె క్షయ వ్యాధి తో ఉన్నట్లు సహజం గా అని పించేది .దీనికి తోడు ఎప్పుడూ దగ్గుతూ ,ఊపిరి గట్టిగా పీలుస్తూ ఉండేది .ఇవి ఆ వ్యాధి లక్షణాలే .నల్లగా ,గోధుమ రంగు జుట్టు తో ఉండేది పాలి  పోయిన కళ్ళతో కని పించేది ..ప్రస్ఫుటమైన నుదురు ,ముఖ కవళికల తోఉండేది  వయసు వచ్చినలింకన్ కూడా తల్లి లాగా కని పించే వాడు .

      నాన్సీ కెంటకి లో ఉన్న స్త్రీలందరిలో  రెస్లింగ్ లో అంటే మల్లయుద్ధం లో అద్వితీయ ప్రతిభ చూపేది .పందొమ్మిదో శతాబ్దపు తొలి భాగంలో కెంటకి లో  రెస్లింగ్ పురుషులకే ప్రత్యేకం కాదు స్త్రీలు కూడా నేర్చుకొనే వారు  .కెంటకీ మహిళా క్రీడాకారులలో నాన్సీ లింకన్ ది ప్రముఖ స్థానం .పురుషులతోనూ మల్ల యుద్ధం చేసి వారిని మట్టి కరపించే సామర్ధ్యం ఆమెది .ఆమె చక్కగా పాడేది ఎన్నో పాటలు ఆమెకు కంఠతా వచ్చు .ఆమె జ్ఞాపక శక్తి అమోఘం గా ఉండేది నిరంతరం పాటలు పాడుకొంటూ పనులు చేసుకొనేది .ఎక్కడో అడవిలో ఒంటరి కాబిన్ లో జీవిస్తున్న ఆమె కు ఈ పాటలే ధైర్యం ఇచ్చి పిల్లల ఆలనా పాలనా చూడటానికి ,వారిపై ప్రేమ కురిపించటానికి తోడ్పడేవి .ఈజ్ఞాపక శక్తి యే పిల్లలపై గొప్ప ప్రభావం చూపి వారికి మార్గ దర్శక మైంది అందుకే తల్లి అంటే లింకన్ అంత అభిమానం ఏర్పడింది .ఆమె అమృత మయ ప్రేమకు అతను కరిగి పోయాడు .ఆమెపై ఆరాధనా భావం ఏర్పడి జీవితాంతం దాన్ని కాపాడుకొన్నాడు లింకన్ .

         నాన్సీ అద్భుత మైన తెలివి తేటలతో ,సరైన నిర్ణయాలతో ,స్పష్టమైన తీర్పులతో డామినేటింగ్ గా డేరింగ్ మహిళ గా  అందర్నీ ఆకట్టుకొనేది .లింకన్ తొమ్మిదేళ్ళ వయసులో ఆమె అతన్ని తీర్చి దిద్ది దేశానికి ఉపయోగ పడే మహా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఏర్పరచి స్పష్టమైన ఆలోచనా విధానాన్ని అలవాటు చేసుకోనేట్లు చేసిన ప్రభావ శాలి .చాలా వేగం గా విని గ్రహించటం చదవటం ,విన్నది  ప్రతిదీ మెదడులో సుస్తిరం గా .ఉంచుకోవటం ఆమె ప్రత్యేకత .ఆమెకు మంచి అంతర్ ద్రుష్టి ఉండేది అన్నీ విని నేర్చుకోవటమే  కాని చదువు లేని కాలం లో జీవించిన మహిళ నాన్సీ .బైబిల్ లోని సుదీర్ఘ పేరాలన్నీ ఆమెకు వాచో విదేయాలై పోయాయి .షేక్స్ పియర్ ఉపన్యాసాలు ,ఈసప్ కధలు ‘’బుక్ ఆఫ్ మార్టియర్స్ ‘’లో ని ప్రొటెస్టెంట్ మతస్తులు నక్కల పాలైన ఉదంతాలు ఇవన్నీ కధలుగా ఆమె విన్నదీ నిత్యం మననం చేసుకొనేది . ‘’అమెరికా డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్’’ .లోని ముఖ్య భాగాలను ,అమెరికా రాజ్యాంగం లోని ప్రముఖ భాగాలను  నాన్సీ బట్టీ పట్టి భద్రం గా మెదడు లో దాచుకోంది.ఇవన్నీతల్లి నోటి నుండినిరంతరం  వింటూ గ్రహించి ,అవగాహన చేసుకొన్నాడు .వాటి ఆంతర్యాలను చిన్నతనం లోనే లింకన్ తెలుసుకో గలిగాడు ఇదంతా తల్లి నాన్సీ ప్రభావమే .విస్తృత ప్రపంచాన్ని గురించి ఆమె కున్న మేధా పరిజ్ఞానం కొడుకు లింకన్ కు ఎంతో సహకరించింది

      తల్లి ప్రభావం తో లింకన్ తనలోని మేధకు పదును పెట్టుకొని వ్యక్తిత్వాన్ని దిద్దుకొన్నాడు .ముందుగా చదువు అంటే ప్రేమ, ఆసక్తి అతనిలో కలిగించింది తల్లి నాన్సీయే .సరైన వయసు రాగానే బడికి వెళ్లి అతను చదువుకోవాలని హితవు చెప్పింది ఆమెయే .ఏడేళ్ళ వయసు లో ఉన్న లింకన్ కెంటకీ ని వదిలి వెళ్ళే లోపు రెండు స్కూళ్ళలో చదువు నేర్చుకొన్నాడు .మొదటిది జకారియా రినే నడుపుతున్నది  ,రెండవది కాలేబ్ హాజల్ నడిపేదీ.అమెరికా విద్యా చరిత్రలో ఈ రెండు చిరస్థాయిగా నిలిచి పోయినవే .

    1861 లో లింకన్ కుటుంబం కెంటకీ నుండి ఇండియానాలోని స్పెంసర్ కౌంటికి చేరింది అక్కడ కూడా నాన్సీ తన కొడుకు లింకన్ ను వీలైనప్పుడల్లా పాఠ శాలకు పంపించేది.  ఆ స్కూల్ ఆజేల్ డార్సీ నడుపుతున్నది .లింకన్ ఫారం హౌస్ కు మైలున్నర దూరం లో ఉంది  .పదేళ్ళు వచ్చేదాకా వీలైనప్పుడల్లా లింకన్ అక్కడికి వెళ్లి విద్య నేర్చుకొనే వాడు .ఆ తర్వాత ఆండ్రూ క్రాఫోర్డ్ నడుపుతున్న స్కూల్ లో చేరి పద్నాలుగో ఏడు వచ్చేదాకా చదివాడు .తర్వాత మాత్రం మిస్టర్ స్వానీ అనే మాస్టారి దగ్గర పదిహేడవ ఏడు వచ్చేదాకా చదివాడు .ఆ నాటి బడులలో మేస్టర్లకు చదవటం రాయటం ,చిన్న చిన్న లెక్కలుఅంటే రూల్ ఆఫ్ త్రీ ( three r s)వస్తే చాలు మేస్టార్లు అయిపోయేవారు లాటిన్ వచ్చిన వాడు ఉంటే ,ఆయన్ను మాంత్రికుడు గా ఆశ్చర్యం గా చూసే వారు .మాస్టర్ల కు జీతాలు లేవు పిల్లల తలిదండ్రులు పండిన ధాన్యాన్నో ,జంతు చర్మాలనో ,,జంతువుల తొడల్నో ,దుప్పి మాంసాన్నో కానుకగా ఇస్తే చాలు.లింకన్ నాలుగు మైళ్ళు నడిచి వెళ్లి చదువు కోవాలసి వచ్చింది ఈ వానాకాలం చదువు ఒక ఏడాది మాత్రమే సాగింది .తను చదవు నేర్చుకోలేదన్న బాధ నాన్సీ కి ఉండేది. అందుకే తన కొడుకు గొప్ప విద్యా వంతుడు కావాలని ఆశించేది. .ఇలా అతన్ని చదివించటానికి భర్త తో రోజూ పోట్లాడ వలసి వచ్చేది కూడా .లింకన్ తండ్రి థామస్ లింకన్ మొండి వాడు. కొడుకు కండలు పెంచుకొంటే చాలు, బుద్ధి పెరగక్కర లేదనుకొనే రకం .ఎప్పుడూ చేతిలో పుస్తకం తో చెట్టుకింద కనిపించేవాడుకొడుకు . ఇలా ఉంటే కూలికి ఎవరూ పిలవరని ,కుటుంబ పోషణ కష్టమని తండ్రి భావించే వాడు .పనికి వెళ్ళక పోతే కొట్టే వాడు అతని కోపాన్ని భరించటం కష్టం గా ఉండేది ఆ తర్వాత ఇరవయ్యొక్కటవ  ఏడు వచ్చేదాకా ఏదో ఒక పని చేసి సంపాదించి అ డబ్బులతో కుటుంబ పోషణకు లింకన్  సాయపడే వాడు .

      1818 లో లింకన్ తల్లి నాన్సీ లింకన్ తొమ్మిదవ ఏట  ‘’మిల్క్ డిసీజ్ ‘’తో చని పోయింది .జ్ఞానోదయం అయిన లింకన్ చదవటం రాయటం పై శ్రద్ధ పెంచుకొన్నాడు .రాయటమూ అలవాటైంది గోడల మీద, లాగ్ దుంగల మీదా బొగ్గుతో, చాక్ పీస్ తో రాసేవాడు .తల్లి సాహచర్యం వల్ల  మేధో పరిజ్ఞానం ,విజ్ఞానం పై ప్రేమ, కవిత్వమూ అలవడ్డాయి అతను పెరిగిన వాతావరణం అంతా గ్రామర్ అంటే ఏమిటో తెలియని క్రూరమైన గ్రామ్య భాష ,తక్కువ స్థాయి మాండలికం మాట్లాడే వారి మధ్య ..కనుక తను మాట్లాడే భాషను సంస్కరించుకోవాలసి వచ్చింది డిక్షనరీ దగ్గరుంచు కొని ప్రతి మాటకు అర్ధం ,తాత్పర్యం గ్రహించాడు ఉచ్చారణ విధానం అవాగాహన చేసుకొన్నాడు .దీనితో భాష పై పట్టు సాధించాడు .సంస్కార వంత మైన భాష తో అవతలి వాడి హృదయాన్ని సూటిగా తాకే చెణుకులతో ,చతురోక్తులతో మాట్లాడి సెహభాష్ అని పించుకొని తల్లి ఋణం తీర్చుకొన్నాడు

 నాన్సీ  అప్పుడప్పుడు డిప్రెషన్ కు లోనయ్యేది ఇదీ లింకన్ పై ప్రభావం చూపింది. విషాదం అతని ముఖంలో కనిపించేది .తల్లి మరణం ,కొంత మంది కుటుంబ సభ్యుల మరణం లింకన్ ను కుంగ దీసింది . తల్లి మిల్క్ సిక్ నెస్  వ్యాధి తో మరణించిందని ముందే చెప్పుకొన్నాం .ఆ వ్యాధి ఇండియానోలో బాగా ఉండే.ది పీజియన్ క్రీక్ నది పరిసర ప్రాంతాల్లో అంటే లింకన్ కుటుంబం నివసించిన ప్రాంతం లో విపరీతంగ వ్యాపించింది .వేలాది  మంది మరణాలకు కారణమయింది .ఈ వ్యాధికి కారణం‘’వైట్ స్నేక్ రూట్ ‘’ను తిన్న ఆవు పాలు తాగటం వల్ల  వచ్చేది అని తర్వాత పరిశోధనల్లో తేలింది ఇది ఆవులో విషాన్ని తయారు చేసేది. అది పాలలో చేరేదన్న మాట .దీన్ని ‘’రివర్ సిక్నెస్’’  అని ‘’,ప్యూకింగ్ ఫీవర్’’ అని ఆ కాలం లో పిలిచే వారు ఈనాటి ‘’mad cow’’ వ్యాధి లాంటిది .ఈ వ్యాధి సోకితే ముందు నీరసం తర్వాత వణుకు ,ఒళ్లంతా బాధా, ,ఒళ్లంతా తిమ్మిరి ,వాపు వచ్చి డిప్రెషన్ ఏర్పడి వాంతులు వచ్చి పాలిపోయి క్షయ గా మారి చర్మం చల్ల బడి ,తెల్లబడి నాడీ  స్పందన క్రమం లో ఉండక నరక యాతన అనుభవిస్తు కోమాలోకి వెళ్లి చని పోతారు ఈ వ్యాధితో వారం బాధ పడి నాన్సీ చనిపోయింది .చనిపోయే ముందు కొడుకు లింకన్ ను ప్రేమగా పిలిచి ఆప్యాయం గా నెమ్మదిగా ‘’కుటుంబాన్ని ప్రేమించు దైవాన్ని నమ్మి పూజించు ‘’అని హితవు చెప్పి 1818 సెప్టెంబర్ అయిదున ముప్ఫై నాలుగవ ఏట మరణించింది .తల్లి శవ పేటిక ను తయారు చేయటం లో లింకన్ తండ్రికి సాయ పడ్డాడు .ఆమెను పయనీర్ సెమేటరిలోఖననం చేశారు అదే ఆ తర్వాత‘’నాన్సీ హాంక్స్ లింకన్ సెమెటరి’’గా పిలువ బడింది .   

    తల్లి నాన్సీ చెప్పిన చివరి రెండు మాటలు  లింకన్ కు తారక మంత్రాలై జీవితం లో పాటించి తల్లి ఋణం తీర్చుకొన్నాడు .తల్లి మరణాన్ని నెలల తరబడి మర్చి పోలేక పోయాడు .తల్లి గురించి ఎప్పుడు మాట్లాడినా లింకన్ ఆరాధనా భావం తో మాట్లాడే వాడు కుటుంబ బాధ్యతను తండ్రితో బాటు తీసుకొని తండ్రి మరణానంతరం కూడా ఆ బాధ్యతను సంతృప్తిగా నిర్వర్తించాడు తండ్రి కి బాసటగా లింకన్ పెద్ద అయ్యే దాకా అక్క సారా ఇంటి బాధ్యతలు నిర్వహించింది . మొదట్లో క్రైస్తవం పై నమ్మకం లేక పోయినా క్రమం గా పరమ గురువుల సాన్నిధ్యం లోగడిపి ,ప్రభావవంతమైన గ్రంధాలను చదివి యేసు క్రీస్తును ఆరాధించి తన సమస్యలకు పరిష్కారాలను సాధించుకొన్నాడు .

  –  గబ్బిట దుర్గా ప్రసాద్

– See more at: http://vihanga.com/?p=10224#sthash.C3MMinPj.dpuf

Posted in రచనలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -4

      విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -4

ప్రపంచ గణితానికి సేవలందించిన అలనాటి మన గణితశాస్త్రజ్ఞుల కృషి

రెండవ భాస్కరా చార్యుడు  1114లో కర్ణాటకలో బీజా పూర్ లో జన్మించాడు .తండ్రి మహేశ్వరోపాధ్యాయులే తొలి గురువు .కన్నడ దేశం లో పుట్టిన తొలి గణితజ్నులు ఇద్దరిలోవీరు  ఒకరు ,మరొకరు మహా వీరాచార్యులు .భాస్కరుడు రాసిన ‘’సిద్ధాంత శిరోమణి ‘’లో గణితం లోని ఎనిమిది మౌలిక అంశాలైన సంకలనం ,వ్యవకలనం ,హెచ్చ వేత ,భాగహారం ,వర్గం ,వర్గ మూలం ,ఘన మూలాలను సోదాహరణం గా వివా రించాడు .బీజ గణిత సింబల్స్ ధ్రువీకరించటం లో భాస్కరుడు విశేష కృషి చేశాడు

భాస్కరుని కుమార్తె పేర ‘’లీలా వతి గణితం ‘’వ్యాప్తి చెందింది .కూతురు పెండ్లి ముహూర్తాన్ని తప్పుగా నిర్ణయించటం వల్లఆమె త్వరలోనే వితంతువు అయింది .ఎంతో వ్యధ చెంది కాల నిర్ణయం పట్ల అశేష శ్రద్ధ చూపించాడు .దీని వల్లనే కాల నిర్ణయానికి’’ ఇసుక గడియారం నీటి గడియారాలను’’ సృష్టించాడు .లీలావతికి దగ్గరుండి గణిత మర్మాలన్ని నేర్పి విదుషీ మణి ని చేశాడు ‘లీలా వతి గణితం లో ఆయన గణిత అధ్యయనా లేమిటో అర్ధ మవుతుంది .గోళం ,అర్ధ గోళం మొదలైనవి ఖగోళ శాస్త్రం లో భాస్కరుడి వల్లనే ప్రాచుర్యం పొందాయి .’’గ్రహ గణిత ‘’అధ్యాయం లో గ్రహాల  గమనాలను కూలంకషం   గా చర్చించాడు .ఈయన్నే ఆ తర్వాతా జ్యోతిష శాస్త్రం లో నూ వాడుకోవటం జరిగింది కొందరు దీన్ని ‘’పంచాంగం ‘’గా మార్చేశారు .ఇతను రాసిన అధ్యాయాలన్ని పాశ్చాత్య భాషల్లోకి అనువాదం అయ్యాయి .1817లో కోహ్రీ బ్రూక్ అనే అతను లీలా వతి గణితాన్ని అనువాదం చేశాడు .అక్బర్ మంత్రి అబుల్ ఫాజి పార్శీ లోకి ‘’కరణ కుతూహల ‘’గా అనువదించాడు .ఇంత జరిగినా భాస్కరుడు మన వాళ్లకు 700ఏళ్ళుగా తెలియనే లేదు .భూమ్యా కర్శర్శన సిద్ధాంతాలను కూడా భాస్కరుడు తెలియ జేయ గలిగాడు .ఆధునిక సిద్ధాంతం ప్రకారం కూడా భూమికి ఉన్న ఆకర్షణ వల్ల  తన వైపుకు లాగుతుంది అని భాస్కర సిద్ధాంతాన్నే సమర్ధిస్తోంది .

మన ఆర్య భట ,బ్రాహ్మ గుప్త భాస్కరుల విశేష శేముషికి అచ్చెరువొందిన పాశ్చాత్య శాస్త్ర వేత్తలు కైమోడ్పులర్పించారు. అందులో ప్రఖ్యాత సాపేక్ష సిద్ధాంత కర్త అయిన్ స్టీన్ శాస్త్ర వేత్త ‘’మనకు లెక్కలు నేర్పి, విజ్ఞాన వంతుల్ని చేసిన భారతీయులకు మనం ఎంతో రుణ పడి ఉన్నాం .పూర్వపు భారతీయ శాస్త్రాలు లేకుండా ఏ రకమైన శాస్త్ర ,సాంకేతిక పరి శోధనలు సాధ్య మయ్యేవి కావు ‘’అని నిండు మనసుతో మెచ్చుకొన్నాడు ఆ మేధావి .

యంత్ర శాస్త్రం లో యంత్రాల గమనం లెక్కలున్నాయి దీన్ని ఆవిష్కరించిన వాడు ఆర్య భట్టు .పరస్పర విరుద్ధ దిశలలో రెండు యంత్రాలు చలిస్తుంటే ఆ రెంటి వేగాల మొత్తం ద్వారా వాటి మధ్య దూరాన్ని భాగించాలని ,ఒకే దిశలో కదుల్తుంటే వేగాల తేడాతో దూరాన్ని భాగించాలి అని చెప్పాడు త్వరణం (ఆక్సిలరేషన్ )మీద ఆర్య భట్టు కు ఎంతో భావనా సామర్ధ్యం ఉందిఅని క్రీ.శ.499లోనే రుజువైంది

శ్రీధరా చార్యుడు అనే గణితజ్ఞుడు ‘’పాటి గణిత ‘’అనే గ్రంధం రాశాడు అందులో వ్యాపార గణక శాస్త్ర సూత్రాలు ఉన్నాయి .శాతాలు, వడ్డీ ,భాగస్వామ్యం ,పెట్టు బడిలో భాగాలు, లాభాల పంపకం మొదలైన విస్త్రుతాంశాలందులో ఉన్నాయి

సరి సంఖ్యలకు బేసి సంఖ్యలకు స్క్వేర్ ఎప్పటికీ స్తిరం గా ఉంటుంది .బేసి సంఖ్యలకు వర్గ మూలం ఉండక పోవటం బేసి సంఖ్యల స్వభావం అని భాస్కర ఉవాచ .సరాసరి నిష్పత్తి ,నిష్పత్తి ప్రకారం విభజన మొదలైన గణిత సూత్రాలను రెండవ భాస్కరుడే మేధా సంపత్తి తో రూపొందించాడు .యజ్న యాగాదులకోసం చేసే అగ్ని గుండాలను నిర్మించటం లో చదరం ,సర్కిల్, త్రికోణం మొదలైన కొలతలను ఖచ్చితం గా ఈ భాస్కరుడే తెలిపాడు .పైదాగరస్ కు ముందే ప్రత్యెక ఆకారాలకు సూత్ర నిర్మాణం జరిగింది మన దేశం లో .పైధగారాస్ గణిత శాస్త్రం ఆయన స్వంతం కాదని ‘’ప్రోక్లూస్ ‘’అనే విజ్ఞుడు 460లోనే చెప్పాడు .అప్పటికే బౌద్ధాయన గణిత సిద్ధాంతాలు ప్రపంచ వ్యాప్తి చెందాయి .

పదకొండవ శతాబ్ది వాడైన జయ దేవ, భాస్కర ‘’చక్ర వాళ ‘’విధానం ,వర్గ మూల సిద్ధాంతం అభి వృద్ధి చేశారు 800 ప్రాంతం వాడైన గోవింద స్వామి ,బోధాయన వర్గ మూలాలను విశ్లేషించారు .రెండు కు వర్గ మూలం విలువ 1.4142156గా ఆపస్తంభుడు ,కాత్యాయండు నిర్ణయించారు .ఆధునికులు దీని విలువను ‘’1.414213గా నిర్ణయించారు

‘’గణిత శాస్త్ర ప్రకాన్దుడు’’ అని పిలువ బడ్డ మహా వీరాచార్య కర్ణాటకలో 850 లో జన్మించాడు ఈయన రాసిన ‘’గణిత సార సంగ్రహం’’ ‘’ఒక్కటే దొరికింది .అరిద్ మాటిక్ ఆల్జీబ్రా జ్యామెట్రీ లలో ఈయన కృషి అపారం .సున్నా ,త్రికోణం సమకోణం మొదలైన వాటి స్వరూప స్వభావాల గురించి ప్రామాణికం గా  చూపాడు .లఘుకోణం కొనికల్ ఆంగిల్ ,కాన్కేవ్ యాంగిల్ ,కరెస్పాండింగ్ యాంగిల్ ,సర్కం యాంగిల్ ,ఆల్తెర్మేట్ యాంగిల్ ,కాన్వేక్స్ యాంగిల్ ,క్రిటికల్ యాంగిల్ ,బ్లాన్తర్ యాంగిల్ ,రిఫ్లెక్స్ యాంగిల్ ,బేస్ యాంగిల్ ,రిఫ్లెక్షన్ యాంగిల్ ,అడసేంట్ యాంగిల్ ,సర్కం యాంగిల్ మొదలైన కోణాలను ఆవిష్కరించిన మేధావి మహా వీరా చార్యులే .హెచ్చ వెత లో అసంఖ్యాక లెక్కలను ఉదాహరించిన ఘనత ఈ అచార్యునిదే .నెగటివ్ నంబర్స్ ,రూట్స్ మధ్య ఉన్న సంబంధాన్ని కూడిక భాగహారం గుణ కారాలను చతురస్రాలు ,దీనికి వర్గ మూలాలు మొదలైన వన్నీ మహా వీరా చార్య గ్రంధం లో ఉన్నాయి అంటే నోరు వెల్ బెట్టి చూస్తాం ఎందు కంటే మన వాళ్ళ మీద మనకున్న నమ్మకం ఆండీ అది .ఈ గ్రంధం 1912లో మాత్ర్రమే వెలుగు చూసింది .ఈయన ‘’నృప తుంగ ‘’మహా రాజు ఆస్థానం లో ఉండగా మరిన్ని గణిత గ్రంధాలు రాసినట్లు తెలుస్తోంది కాని

బయ పడక పోవటం మన దుర దృష్టం .భారత దేశానికి ఒక గొప్ప వైజ్ఞానిక పరంపర ఉంది అన్న విషయం ,విశ్వాసం కలిగించిన వాడే మహా వీరాచార్యులు .

తెలుగులో  మొదట ఆ గణిత శాస్త్రాన్ని రాసిన ఘనత పావులూరి మల్లన్న కే దక్కింది ..ఈయన రాసిన ‘’సార సంగ్రహ గణితం ‘’పద్యాలలో రాయటం ప్రత్యేకత .1019లో గుంటూరు జిల్లల గుండ్ల కమ్మ నదీ పరివాహ ప్రాంతం పావులూరు లో  జన్మించాడు .ఈయన ను గురించి తెలుసుకొన్న రాజ రాజ నరేంద్రుడు తన ఆస్తానానికి ఆహ్వానించి మహా వీరాచార్య రచించిన ‘’గణిత సారసంగ్రహం ‘’ను అనువాదం చేయమని కోరాడు .ఈ అనువాదానికి మెచ్చి పిఠాపురం దగ్గర ఉన్న ..నవ ఖండ ‘’అగ్రహారాన్ని ధారాదత్తం చేశాడు .దీన్ని ఒక పద్యం లో వర్ణించాడు మల్లన్న .తనకు అవగాహన అయిన గణిత సూత్రాలను మక్కీకి మక్కీ గ్రాంధిక పద్యాలుగా అనువాదం చేశాడు .అన్ని పధ్యాలు దొరకలేదు. కొన్ని మాత్రమె లభ్యం .అందువల్ల పెద్దగా ప్రచారానికి నోచు కోలేకపోయింది   ఇది ఇందులో చిక్కు లెక్కలు ,గమ్మత్తు లెక్కలు చాలా ఎక్కువ గా ఉన్నాయి .విద్యార్ధులకు బానే ఉపయోగ పడే పుస్తకం .అంటే మొదటి సారి గా విద్యార్ధుల కోసమే రాసిన గ్రంధం అయింది పావుల్లోరి మల్లనీయం .అయితే ఛందస్సు, కఠిన పదాలు చిక్కని రచనా వల్ల  చేరువ కాలేక పోయింది .ప్రయత్నం మాత్రం మంచిదే .ఉదాహరణకు ఒక పద్యం –

‘’ఆరు నొక్కట్లు నొడ్పుగా నమర బెట్టి –యంత గుణకం బు చేతను నమర బెంచి ‘’

అంటే ఒకట్లను వరుసగా ఆరు రాసి ఆరు ఒకట్ల తో హెచ్చిస్తే  111111ను మళ్ళీ111111చేత హెచ్చిస్తే వచ్చే జవాబు  12345654321అని అతి సూక్ష్మం గా వివ రిస్తుంది ఈ పద్యం అంటే ముందు ఆరు అంకెల ఆరోహణ క్రమం తర్వాత అవరోహణ క్రమంలో ఆన్సర్ వస్తుంది అన్న మాట .ఇలాంటివి కోకొల్లలుగా ఈపుస్తకం లో ఉన్నాయి

తడక మల్ల వెంకట కృష్ణా రావు లీలావతి గణితాన్ని తెలుగులో అనువాదం చేశారు వ్యాఖ్యానం కూడా చేశారు. ఆర్య భాతీయం కు  సూర్య దేవర ఎల్లయ్య మొదలైన వారు టీకా టిప్పణునులు రాశారు. కృష్ణా జిల్లా మేడూరు కు దగ్గరలో ఉన్న ‘’మధునా పురం ‘’వాస్తవ్యులు  నివాసి  వెంకటేశ్వర్లు ఆర్య భటీయం లోని ఖగోళ అంశాలను తెనిగించారు .ఇలా ఎందరోగణితజ్ఞులు  గణిత శాస్త్రాన్ని మన దేశం లో అభివృద్ధి చేశారు .అందరికి వందనాలు .

వైద్య శాస్త్రం లో అలనాటి శాస్త్రజ్ఞుల కృషి గురించి తర్వాత తెలుసు కొందాం

సశేషం

ఆంద్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ ,’’ధన్ తేరాస్’’ శుభా కాంక్షలతో

 

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-13-ఉయ్యూరు

Posted in సైన్స్ | Tagged | Leave a comment

రాచకీయ ‘’ద్విప్లెట్స్’’ -4

       రాచకీయ ‘’ద్విప్లెట్స్’’ -4

26-హైదరాబాదులోఖాళీ ఉన్నచోట్ల  గుడిసె లేసిఆక్రమించి ,,రాష్ట్రపతిని చెయ్యలేదని కినిసే తండ్రి కొడుకు ‘’వివేక్ ‘’

ఖద్దరు గుడ్డలతో తానూ అన్నీపొంది ,జంప్ జిలానీ అయి గులాబీ ఖండువా వేసి’’ ఆంధ్రోళ్ళుమోసంసేసిండ్రు’’అనే’’అవివేక్

27- గులాబీ నవాబు ,దొర ఠీవి ఉన్న కే.సి.ఆర్

     కక్కాలేక  మింగా లేక బిక్క చచ్చిఅయ్యాడు విపరీత  ‘’కోపధార్

28-తాతల వారసత్వం తో అయిన కేంద్ర  ‘’రాజు పళ్ళం’’

     ,ప్రజా సంఘటనతో భయం తో  స్పీడ్ కు వేసుకొన్నాడు ’’ కళ్ళెం ‘’

29-సమైక్యం లో స్పష్టత ఉన్న మంత్రి ‘’సాకే ‘’

   అడ్డొచ్చిన వాళ్ళ పాలిట అయ్యాడు ‘’ఫార్టీ సెవెన్ ‘’ఏకే ‘’.

30-మిస్టర్ పెర్ఫెక్ట్ గా,ఈ కాలానికి మార్గ దర్శి గా  కనిపించే ఆర్.కే గారి  ‘’ఆంద్ర జ్యోతి ‘’

     నిజాం సభను అక్కడి ఫ్రంట్ లో ,ఆంధ్రా సభను ఇక్కడి ఫ్రంట్ లో ఒకే రోజుఅచ్చోసి అయింది  ‘’పక్ష పాతి ‘’.

        ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభా కాంక్షలతో

                  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-1-11-13-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

అపర భగీరదీయం -5(చివరి భాగం ) ఆధునిక ద్రష్ట కాటన్ వ్యక్తిత్వం

               అపర భగీరదీయం -5(చివరి భాగం )

                         ఆధునిక ద్రష్ట  కాటన్ వ్యక్తిత్వం

            సర్వ సమర్ధుడైన మిలిటరీ ఇంజినీర్ మాత్రమే కాదు  ఉదాత్త వ్యక్తిత్వం మూర్తీభవించిన వాడు సర్ ఆర్ధర్ కాటన్ దొర  కేవలం ఒక్క ఏడాది మాత్రమె బర్మా యుద్ధం లో సైన్య విభాగానికి అది పత్యం వహించి రంగూన్ పట్టణవిముక్తి కోసం ధైర్య సాహసాలు  చూపి మేర్గి ,తవాయ్ దుర్గాల ను మర ఫిరంగులతో వశపరచుకోవటం లో ముఖ్య పాత్ర పోషించాడు  .అక్కడ ఒక సారి పై అధికారితో పేకాట ఆడి చిత్తుగా ఉన్నదంతా పోగొట్టు కొన్నాడు .అప్పుడు ఇక జీవితం లో పేకాట ఆడనని శపథం చేసి జీవితాంతం నిల బెట్టుకొన్నాడు .మిగితా జీవితమంతా ప్రజోపకార సేవలోనే గడిపాడు ఇంగ్లాండ్ లో జన్మించిన కాటన్ కు  అక్కడ నీటి పారుదల సౌకర్యాలేమీ లేవు. వాటిపై అవగాహనా లేదు అయినా గోదావరి ,కృష్ణా నదులపై ఆనకట్టలు కట్టి ఆ డెల్టాల్తాలను అన్నపూర్ణ గా మార్చిన అపర భగీరధుడు ఆయన .అయినా ఆయన యే మాత్రం గర్వం పొందలేదు. రెండో శతాబ్ది లో కరి కాల చోడుడు కావేరి పై నిర్మించిన ‘’గ్రాండ్ ఆనకట్ట ‘’ను చూసి స్పూర్తి పొంది  ఆ నాటి నిర్మాణ చాతుర్యాన్ని పొగిడి ఆ స్పూర్తితో తాను ఇరిగేషన్ పనులన్నీ చేబట్టానని వినయం గా చెప్పుకొన్నాడు .

             ఈ ఆనకట్టలు ఆక్వి డేక్ట్ లు కాటన్ మేధో జనితాలే ,మౌలిక ఆలోచనలా ఫలితాలే ఇండియా లో అంతకు ముందెన్నడూ లేని వాటిని తన మస్తిష్కం లో మెదలిన భావాలకు అనుగుణం గా నిర్మించినవే .సంప్రదించ టానికి ఇలాంటి వాటి తో అనుభవ మున్న వారే లేరు .ఎక్కడా చూసి తెలుసుకొనటానికి అసలలాంటివి లేనే లేవు .తానొక్కడే ఆలోచించుకొని ,స మస్యలోస్తే పరిష్కరించుకొని గుండె నిబ్బరం తో చే బట్టిన బృహత్ నిర్మాణాలే ఇవన్నీ .ఆధునిక యంత్ర సామగ్రి లేనే లేదు, సిమెంట్ లేదు, సాంకేతికనైపుణ్యమూ  హుళక్కి గా ఉన్న కాలం లో చేసిన జల దుర్గాలివి తక్కువ కాలం లో తక్కువ ఖర్చు తో అధిక ప్రయోజనాలు కల్గించే భారీ నీటి వనరులివి. ఆయనకు ఆయనే సాటి అని పించుకోన్నవి . ఇంజిన్ ను కానీ పెట్టి నూట యాభై మీటర్లు నడిపించాడు

           కాటన్ నిర్మోహ మాటి తప్పు ఎక్కడున్నా ఖండించే వ్యక్తిత్వం ఆయనది .తాను పని చేస్తున్నది బ్రిటిష్ ప్రభుత్వో ద్యోగిగా .అయినా ఆంగ్ల ప్రభుత్వం విధించిన ‘’ఉప్పు పన్ను ‘’ను తీవ్రం గా విమర్శించాడు.అంటే గాంధీ గారికికంటే యాభై ఏళ్ళకు పూర్వమే నిరసన వ్యక్తం చేసి గాంధి ఉప్పు సత్యాగ్రహానికి ‘’ఉప్పు అందించాడు ‘’అన్నమాట . ఇండియా కు నల్ల మందు ను దిగుమతి చేసి ,ప్రజల ఆరోగ్యం పై దుష్ప్రభావం కలిగిస్తున్న ప్రభుత్వాన్ని మందలించాడు .అది హేయమైన చర్య అన్నాడు .కాటన్ నిరంతర పరిశీలన ఉన్న వాడు అనారోగ్యం తో ఆస్ట్రేలియా కు వెళ్లి నప్పుడు తీరిక గా కూర్చో కుండా స్వంత ఆలోచనల తో ‘’రోటరీ ఇంజిన్ ‘’నిర్మించాడు అయితే ఇంజిన్ కమర్చిన బాయిలర్ బ్రద్దలై కళ్ళకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి .అయినా లెక్క చేయకుండా ఇంజన్ చక్రం నిమిషానికి నూట యాభై చుట్లు తిరిగేట్లు చేసిన సమర్ధుడు .70ఏళ్ళ వయస్సు లో ‘’త్రి చక్ర వాహనాన్ని ‘’రూపొందించాడు .దాన్ని బ్రేకుల్ని పరిశీలించటానికి ఎక్కి కింద పది గాయాల పాలయ్యాడు .ఉపరితల నీరు లేని చోట్ల భూ గర్భ జలాన్ని వెలికి తీయటానికి వాయు శక్తి ‘’(విండ్ పవర్)ఉపయోగించ వచ్చనిమొదటి సారిగా ప్రతిపాదించిన ఇంజినీర్ కాటన్ .

    కరాచీ నుండి కాన్పూర్ కలకత్తా ,కటక్ ,భట్కర్ ,మద్రాస్ ,బెంగుళూర్ నగరాలకు వర్తక సదుపాయాలకోసం నౌకాయానానికి అనువుగా నలుగు వేల మైళ్ళ పొడవైన కాలువలను ముప్ఫై కోట్ల తో నిర్మించే ప్రణాళిక సిద్ధం చేశాడు .గంగా కావేరి అనుసంఫ్దానానికి మొదట బీజం వేసింది ఆయనే ఈహార్ లో సొన్నది నుండి సేద్యానికి నౌకాయానానికి బీహార్ ప్రాజెక్ట్ నిర్మించే సూచనలు చేశాడు .గంగను కాల్వల ద్వారా సట్లేజ్ నదితో కలపాలని చెప్పాడు గంగ పై బారేజి అవసరం అని చెప్పాడు ఇదే తర్వాత ‘’ఫరక్కా బారేజి ‘’గా రూపొందింది .

                84ఏళ్ళ వయసు లో కూడా అలుపు సొలుపు లేక ఇంగ్లాండ్ లో తన వ్యవసాయ క్షేత్రం లో వ్యవసాయం పై పరిశోధనలు చేశాడు .నేలను లోతుగా దున్నితే గాలి లోపలి బాగా వెళ్లి అక్కడి నత్రజని ని మొక్కలకు ఎక్కువ గా అంది  పంట దిగుబడి పెరుగుతుందని ప్రాక్టికల్ గా చేసి చూపించాడు .తన పొరుగు ఇంటి యజమాని మద్యానికి బానిస అయి దుర్మరణం చెందటం చూసి తాను  ఎప్పుడూ మద్యం ముట్టకూడని నిర్ణయించుకొని, నిలుపు కొన్నాడు .వైద్యుడు ఆరోగ్యం కోసం సూచించినా తాగలేని కఠోర నియమం కాటన్ ది .భాగ్య వంతులైన కాటన్ బావ మరదులు బావ గారి కోసం ఒక ఇల్లు కట్టించి ఇచ్చే వరకూ కాటన్ కు స్వంత ఇల్లే లేదు అంటే అయన నిజాయితీ ఎలాంటిదో తెలుస్తోంది .ఇన్దిఆ ను వదలి వెళ్ళినా   ఇక్కడి జల వనరుల పై సమాచారాలు తెలుసుకొంటూ పత్రికా ముఖం గా లేఖలు గా తన అభిప్రాయాలను చెప్పే వాడు .టైమ్స్ పత్రికలో ఇండియా లో క్షామానికి ,పంట నష్టానికి బ్రిటిష్ ప్రభుత్వం నీటికి బదులు ఇనుమును (రైల్ నిర్మాణం )ఇవ్వటమే అని ఆవేదన తో రాశాడు .

   భారత దేశం లో పేదరికం నిరక్షరాస్యత ,అజ్ఞానం పట్టి పీడిస్తున్నాయని దీనికోసం ఏ బ్రిటిష్ అధికారీ పట్టించుకోలేదని ప్రబుత్వానికి కావలసింది డబ్బు వసూలు చేసే బిల్ కలెక్టర్ర్లె కాని ప్రజాక్షేమం కోరే రాజ నీతిజ్నులు కాదని ఎద్దేవా చేశాడు సముద్రం లోకి వృధా గా పోతున్న అపార నదీ జలాలను ఆనకట్టలు కట్టి భూ సాగుకు మళ్ళించే సద్బుద్ధి బ్రిటిష్ ప్రభుత్వానికి కలిగించమని పరమాత్మను వేడుకొంతానని ఆవేదన వెలి బుచ్చాడు .తన క్షేత్రం లో స్వయం గా పొలం దున్నటానికి మరనాగాలి తయారు చేసుకొన్నాడు కాటన్ .

              మనకు తెలియని కాటన్ మరో పార్శ్వం  

    ఆయన ఇంగ్లాండ్ లో ఉన్న డార్కింగ్ లో’’ రై’’గడ్డిని అయిదు అడుగుల రికార్డ్ ఎత్తుకు పెంచాడు ద్రవరూప ఎరువు వాడకం వల్లనే ఇది జరిగిందని చెప్పాడు .అప్పుడు ఎక్కడా పచ్చగడ్డి కూడా మొలవని కాలం లో. అది ఎకరానికి నాలుగున్నర టన్నుల దిగుబడి నిచ్చింది .1895లోతన క్షేత్రం లో బంగాళా దుంప ను ,మధ్య లో కాబేజీ ని వేసి పండించాడు ఎకరానికి దుంప  35టన్నులు ,కాబేజీ  ఇరవైటన్నులు  పండించిన పరిశోధనా పరామేశ్వరుడు కాటన్ .కాటన్ సూచించిన ‘’లో దుక్కి ‘’పద్ధతిని ఇంగ్లాండ్ అంతా టితో బాటు ఆస్ట్రేలియా మొదలైన దేశాలకు వ్యాపించి అధిక ఫలసాయానికి వీలు కల్పించింది .ఆస్ట్రేలియా ద్రాక్ష తోటలు ,వెస్ట్ ఇండీస్ కాఫీ తోటల్లో ఈపధ్ధతి రికార్డ్ స్తాయి పంటను పండించి రైతులకు ఎంతో మేలు చేకూర్చింది .నేలను సక్రమం గ ఉపయోగించుకొంటే దాదాపు యాభై శాతం అధిక దిగుబడి సాధించ వచ్చు నని కాటన్ ఆ నాదే ఘంటా పధం గా ఉదాహరణ పూర్వకం గా తెలియ జేశాడు .కాటన్ నిబద్ధతకు సేవకు బ్రిటిష్ ప్రభుత్వం మెచ్చి ‘’సర్ ‘’బిరుదును1861లో ఇచ్చి  సత్కరించింది .

                          ఇంత చేసిన కాటన్ కు ఏం చేశారు ?

             రిటైరై ఇంగ్లాండ్ చేరి డెబ్భై ఏళ్ళ వృద్ధాప్యం లో ఉన్నడెల్టా శిల్పి ,అపర భగీరధుడు  కాటన్ దొరపై బ్రిటిష్ ప్రభుత్వ్వదికారులు కొందరు కుత్సితం గా ఆయన ప్రతి పాదనలకు వక్ర భాష్యాలు కల్పించి ఎన్నో అభియోగాలు మోపారు .అభిశంసన తీర్మానం పెట్టారు. దీనికి బ్రిటిష్ కామన్స్ సభలో 1872లో మిలిటరీ ఖర్చులపైకాటన్ నిర్భయం గా300 ప్రశ్నలకు దీటుగా సమాధానం చెప్పి అందరి నోర్లు మూయించాడు ‘సెలెక్ట్ కమిటీ పనికి మాలిన ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టిందే కాని ఆయన వ్యక్తిత్వాన్ని ఏ మాత్రం భంగ పరచలేక నీరు కారింది .’’దట్ ఈజ్ కాటన్’’.’’.లేడీ ఆఫ్ ది లాంప్ ‘’గా పేరొందిన ఫ్లారెన్స్ నైటింగేల్ ఇండియా లో కాటన్ చేబట్టిన ప్రాజెక్టుల పట్ల ఎంతో ఆసక్తి చూపేది .అందుకని ‘’ఇండియా లో నీటి పారుదల ,రవాణా జల మార్గాలు ‘’పేరు తో ఒక మాప్ ను రూపొందించి నైటింగేల్ కు బహుమానం గా ఇచ్చాడు వీటి  అమలుకు తన కున్న పలుకు బడిని బ్రిటిష్ ప్రభుత్వం పై పెంచమని ఆమెను కోరాడు కాటన్ మహాశయుడు .

                          ఇంతకీ ఎవరీ కాటన్ ?

  సర్ ఆర్ధర్ కాటన్ క్రీ .శ .1803 మే నెల పదిహేనవతేదీన ఇంగ్లాండ్ లో మత గురువులు నివశించే ‘’కమ్బార్ మీర్ ఆబీ ‘’ అనే చోట జన్మించాడు  తండ్రి హెన్రీ కాల్వేలి కాటన్ తల్లి హెన్రీ కాల్వేలి కాటన్ ..తాత సర్ లించ్ కాటన్ .తండ్రి తాతకు పడవ కొడుకైతే తండ్రికి పదో కొడుకుగా కాటన్ పుట్టటం విశేషం .కాల్వాలి కాటన్, ఫ్రెడరిక్ కాటన్ అనే మన కాటన్ సోదరులు మద్రాస్ రాష్ట్ర నీటి పారుదల శాఖలో ఆర్ధర్ తో కలిసి పని చేసిన వాళ్ళే .కాటన్ పై తల్లి ప్రభావం ఎక్కువ .చిన్నతనం లోనే మట్టితో కాలువలు నిర్మించి వినోదించే వాడు వర్షపు  నీటి పాయల్ని చేతి కర్రతో పాయలుగా చీల్చి ఆనందించే వాడు

          పదిహేనవ ఏట ఇండియా లో సైన్యం లో చేరటానికి ప్రభుత్వం అనుమతి పొంది ..ఏడిస్ కొమ్బ్ ‘’లో మిలిటరీ శిక్షణ లో చేరాడు .ఫిరంగి దళం,ఇంజినీరింగ్ లలో పని చేసే శిక్షణ నేర్చుకొన్నాడు .సాటి బ్రిటిష్ యువత చదువు పై శ్రద్ధలేకుండా జులాయిలు గా తిరుగు తుంటే ఎంతో శ్రద్ధ తో చదువుకొన్నాడు .పదహారవ ఏట ఏ పరీక్షా రాయాల్సిన అవసరం లేకుండా ‘’రాయల్ ఇంజినీర్స్ ‘కు ఎంపికయిన మేధావి .1820 లో సెకండ్ లెఫ్టి నెంట్ గాఆర్డి నేంస్ సర్వీస్

లో చేరి బ్రిటిష్ దీవుల సర్వేమాపులను తయారు చేసిన ఘనుడు .ఒంటరిగా కాలినడకన తిరిగి తనకప్పగించిన బాధ్యతను సమర్ధ వంతం గా పూర్తీ చేశాడు .తర్వాతా ఒకటిన్నర ఏడాది ‘’చాతం ‘’అనే చోట ఉంది ,1821మే లో తన పద్దెనిమిదవ ఏట ‘’ఈస్ట్ ఇండియా కంపెని ‘’లో మిలిటరీ ఇంజినీర్ గా పని చేయటానికి నియుక్తుడై లండన్ నుంచి నాలుగు నెలలు ఓడలో ప్రయాణం చేసి మద్రాస్ చేరాడు .

                        ఇండియా లో సేవలు

  మద్రాస్ పబ్లిక్ వర్క్స్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం తో పరిచయం పొంది ,1822దక్షిణ విభాగపు తాటాక శాఖలో కెప్టెన్ పులర్తాన్ అనే ససూపరింతెంన్దేంట్ వద్ద అసిస్టంట్ గా బదిలీ అయ్యాడు  ఇండియా శ్రీ లంకలను కలిపే ‘’ఆడం వంతెన ‘’గా పిలువ బడే పాంబన్ కనుమ లోతు చేసే పనిలో చేరాడు.వానరులు త్రేతాయుగం లో ఇక్కడ వారధి కట్టటానికి సముద్రం లో విసిరినా రాళ్ళను తీసే పని లో శ్రద్ధగా పని చేసి సంతృప్తి కల్గించాడు .ప్రభుత్వం ఇచ్చిన అతి తక్కువ డబ్బు నలుగు వందల పౌండ్ల తో పాం బన్ లోతును మూడు అడుగుల లోతు చేసి నౌకలనలు సింహళాన్ని చుట్టి రాకుండా హిందూ మహా సముద్రం నుండి బంగాళా ఖాతం లో పాంబన్ కనుమ ద్వారా ప్రవేశించే వీలు కల్గించాడు కాటన్ .తర్వాతా కోయం బత్తూర్ ,మదురై ,తిరునల్వేలి ,తిరుచురా పల్లి ,తంజావూర్ జిల్లాలలో చెరువులు మరమ్మత్తులను నిర్వహణ ను పర్య వేక్షించాడు సాగు నీటిని నిలువ చేసి పంపిణీ చేసే విధానం లో అపార అనుభవం సంపాదించాడు .ఎనిమిదేళ్ళు ఇక్కడ పని చేసి కెప్టెన్ గా పదోన్నతి పొంది కావేరి నీటి పారుదల పధకానికి ప్రత్యెక అ దికారి అయ్యాడు .  మొదటి బర్మా యుద్ధం లో లో బర్మాకు వెళ్ళాడు .ఆ తర్వాతా సంగతులన్నీ ఇప్పటికే మనం తెలుసు కొన్నాం .

     1841 అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఎలిజ బెత్ లియర్ మంత్ ను కాటన్ వివాహం చేసుకొన్నాడు .వీరి మొదటి కుమార్తె ‘’బేబీ హాప్ ‘’.రెండవామ్మాయి చ్చిన్నతనం లోనే చని పోయిందని తెలుసుకొన్నాం .

                    కాటన్ మహా ప్రస్తానం

 ఇంగ్లాండ్ లోని డార్కింగ్ లో ఉన్న ‘’ఉడ్ కాట్ ‘’భవనం లో భార్య తో కాపురం ఉన్నాడు .రోజు ఉదయమే లేచి బైబుల్ చదవే వాడు చిరు నవ్వుతో ఆలోచనల్లోకి జారి పోయే వాడు  ఒక సారి కూతురు ఒచ్చి ‘’రోజూ బైబిల్ చదవటం విసుగ్గా లేదా “?”అని అడిగితే ‘’లేదమ్మా !సరస్సు ఒడ్డున అందుకొనే బాలుడిని నేను .జీవితాంతం చదువుతున్నా ఏమాత్రం బైబిల్ ను అర్ధం చేసుకోలేక పోయాను .జీవితాంతం చదివినా అందులో మర్మం అర్ధం కాదు ‘’అని అనునయం గా చెప్పాడు .ఒక రోజు ఆయనకు యేసు క్రీస్తు అవతార సమాప్తి దృశ్యం కనీ పించింది జ్వరం తో పది రోజులు బాధ పడ్డాడు .చివరగా 1899 ఏప్రిల్ ఇరవై నాలుగున 96 ఏళ్ళ వయసులో  కాటన్ ధ్రువ తార రాలిపోయింది .డార్కింగ్ శ్మశాన వాటిక లో అంత్య క్రియలు జరిగాయి .యూనియన్ జాక్ తో కప్పి గౌరవ సూచకం గా సైనిక లాంచనాలతో పూర్తీ చేశారు

          ఆర్ధర్ కాటన్ ముని మనుమడు అర్ సి.కాటన్ ఆయన భార్య నికోలేట్టే కాటన్  దంపతులు 1988లో ఇండియా వచ్చి కాటన్ బారేజి ని సందర్శించారు  .కాటన్ శత జయంతి ఉత్స వాలను 14-7-1999 న ప్రభుత్వం గౌరవ ప్రదం గా నిర్వహించింది .ఆ సందర్భం గా ఈ నాటి యువతరం యువ ఇంజినేర్లు స్పూర్తి  పొందాలనే ధ్యేయం తో హైదరాబాద్ లోని ‘’ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ‘’వారు కాటన్ జీవితం పై కృష్ణా జిల్లా పామర్రు మండలం లోని జమీ గొల్వే పల్లి గ్రామ నివాసి శ్రీ చెరుకూరి వీరయ్య ‘’గారి ‘’ఆంద్ర మాతని  అన్నపూర్ణని  చేసిన ఆంగ్లేయ జెనరల్ కాటన్ దొర ‘అనే పుస్తకాన్ని రాయించి ’  అందరికి అందుబాటులో ఉండేట్లు ప్రచురించి ఋణం తీర్చుకోంది. పామర్రు దగ్గర పుల్లేరు దగ్గర చీలిన గండి కోడు ద్వారా వీరయ్య గారి పొలాలకు నీరు రావటం తెలిసి దీన్ని నిర్మించిన వాడు కాటన్ అని అర్ధం చేసుకొని ఆరాధనా భావం తో ఈ పుస్తకాన్ని రాశారు .నేను దీన్ని ఆధారం గా చేసుకొనే ‘’అపర భగీరదీయం ‘’రాశానని సవినయం గా మనవి చేస్తున్నాను .

‘’ముందు తరముల చీకటుల –సమ్మూలముగ ఛేదిమ్పగా –విశ్వ శాంతికి ,హరిత క్రాంతికి –సస్య కాంతుల దీపికల్

నీవు పెట్టిన దీపముల –సాటేవి’’ కాటన్ మహాత్మా ‘’    (ఏ.వి అప్పా రావు )

‘’Happiness is achievement –achievement of goals –goals of helping some one –doing your self –and thinking good thoughts –happiness is doing ‘’(Anonym )

                  అపర భాగీరదీయం ‘’సర్వం సంపూర్ణం ‘’

      ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభా కాంక్షలతో

              మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -31-10-13-ఉయ్యూరు.

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

అపర భగీరధీయం—4 డొక్కా సీతమ్మ గారి లంకల గన్నవరం వద్ద ‘’ ఆక్విడేక్ట్ ‘’

అపర భగీరధీయం—4

డొక్కా సీతమ్మ గారి లంకల గన్నవరం వద్ద ‘’ ఆక్విడేక్ట్ ‘’

గోదావరి సెంట్రల్ డెల్టా లో వసిష్ట గోదావరికి ,దాని పాయ అయిన వైనతేయ నదికి మధ్య’’ నగరం అనే సార వంత మైన భూఖండం’’ ఉంది .దీన్ని ‘’గోదావరి ఉద్యానం ‘’అని ముద్దుగా పిలుచుకొంటారు .1851నాటికి నగర ఖండం లో ఎలాంటి సాగు నీటి సౌకర్యం లేక ,రవాణా సౌకర్యాలు లేక బాగా వెంక బడి ఉంది వరదకాలం లో నిండుగా ప్రవహించే నది నీటిలో నాటు బోట్ల  పైనే ప్రయాణం చాలా భయంకరం గా ఉండేది .ఎన్నో ప్రమాదాలు తరచుగా జరిగి ప్రాణనష్టం అపారం గా జరిగేది .వేసవిలో కాలి నడకన ఇసుకలో మండు టెండలో వెళ్ళాల్సి వచ్చేది  బొబ్బలెక్కిన కాళ్ళ తో ఏటికి అడ్డం గా నడవాల్సిన దుస్తితి ఉండేది .ఎవరికైనా జబ్బు చేస్తే ఇంతే సంగతులు .వైద్య సదుపాయం లేక ప్రాణాలు హరీ మనేవి Inline image 1

ఆ కాలం లో లంకల గన్నవరం లో డొక్కా సీతమ్మ గారు భర్త జోగన్న గారు ఉండేవారు .ఈ దంపతులు ఎంతో మంది అతిధి అభ్యాగతులకు నిరతాన్న దానం చేసి గొప్ప కేర్తి పొందారు. సీతమ్మ గారిని’’ అపర అన్నపూర్ణ ‘’గా ఆరాధించే వారు .ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ,పురుళ్ళు వచ్చినా సీతమ్మ గారు చేతికి ఎముక లేకుండా విరాళాలు ఇచ్చి ఆదుకొనే వారు .అర్ధ రాత్రి కూడా అతిధులేవరైనా వస్తారేమో నని లాంతరు పట్టుకొని ఏటి ఒడ్డుకు వెళ్లి చూసి వచ్చి అప్పుడు నిద్ర పోయేవారు .సీతమ్మ గారి ఈ సేవా తత్పరతకు అబ్బుర పడ్డ ఆ నాటి బ్రిటిష్ చక్ర వర్తి ఏడవజార్జి ఆమెకు 1908జనవరి ఒకటవ తీదీన కలెక్టర్ తో  సన్మానింప జేసి ‘’ప్రసంశా పత్రం ‘’అంద జేశాడు .ఏ విరాళాలు ఆమె స్వీకరించక స్వచ్చందం గా తనకున్న దానితో ఈ సేవలను కొనసాగించిన ఉత్తమా ఇల్లాలు సీతమ్మ తల్లి .Inline image 1

గోదావరి డెల్టాకంతటి కి ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా సాగు నీటి సౌకర్యం కల్పించిన కాటన్ దొర నగర ఖండానికి ఏమీ చేయలేక పోయానే నని తీవ్రం గా మధన పడ్డాడు. పుష్కలం గా నీరు లభించే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని సంకల్పించాడు .దీనికి పరిష్కారం ఇక్కడి వైనతేయ నది పై ‘’ఆక్విడేక్ట్’’నిర్మాణం ఒక్కటే సరైనది అని భావించాడు .దీని వల్ల  నగర ఖండం లోని 45వేల ఎకరాల సార వంత మైన భూమికి సాగు నీటి వసతి కల్పించాలని ఆలోచించాడు .ఈ బాధ్యతను యువ ఇంజినీర్ అయిన లెఫ్టి నెంట్ హేగ్ కు అప్పగించాడు .మొదటి అంచనాలో ఆక్వి డేక్ట్ పొడవు 600గజాలు ,39ఆర్చి స్తంభాలు ,గా తీసుకొని ఖర్చు 73,200రూపాయలు అవుతుందని ప్రభుత్వానికి కాటన్ దొర  1851ఆగస్ట్ లో ప్రతి పాదనలు పంపించాడు .డిసెంబర్ లో ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .అయితే నది వెడల్పు పెరిగినా ,ప్రవాహ వేగం తగ్గి ,నిర్మాణం సాఫీ గా జరుగుతుందని అనుకొని ప్రాజెక్ట్ స్థలాన్ని కొంచెం దిగువ వైపుకు జరిపాడు .దీని వల్ల  ఆక్వి డేక్ట్ పొడవు 750గజాలు ,ఆర్చి స్తంభాలు 49తొమ్మిదికి పెరిగి నిర్మాణ వ్యయం 1,60,395రూపాయలకు పెరిగింది .శ్రేష్టమైన ఒండు మట్టి ఇక్కడ లభించటం వల్ల  రాతికి బదులు పద్దెనిమిది అంగుళాల పొడవు ,ఆరు అంగుళాల వెడల్పు ,మూడు అంగుళాల మందం ఉన్న ప్రత్యెక ఇటుకలను తయారు చేయించి ఉపయోగించాడు ఇవి బాగా కాలటానికి గారెలకు మధ్యలో చిల్లి చేసినట్లు మధ్యలో అరంగుళం వ్యాసం కల బెజ్జం పెట్టించాడు .దీని వల్ల అతి నాణ్యమైన,దృఢమైన  ఇటుకలు తయారయ్యాయి .ఇవన్నీ కాటన్ ఊహ తో చేసినవే .1853 లో బెంగాల్ ఇంజినీర్ కల్నల్ బెర్డ్ స్మిత్ ఆక్వి డేక్ట్ ను పరిశీలించటానికి వచ్చి, కాటన్ నిర్మాణ కౌశల్యానికి అబ్బుర పడి ఎంతో మెచ్చుకొన్నాడు .కాటన్ ఇక్కడ చేబట్టిన నిర్మాణ విధానాన్ని స్మిత్ తాను చేస్తున్న గంగా నది పనుల్లో ఉపయోగించుకొన్నాడు.అదీ కాటన్ స్పూర్తి .

గన్నవరం ఆక్వి డేక్ట్ లో ఇరవై రెండు అడుగుల వెడల్పు గల ఒక కాలువ ,దానికి ఒక వైపు పడవ సరంగులు ,ఇతరులు నడవ టానికి వీలుగా తొమ్మిది అడుగుల వెడల్పున్న కాలి బాటను ఏర్పాటు చేయించాడు .ఆక్వి డేక్ట్ నిర్మాణం కేవలం పది హీను నెలల్లో పూర్తీ చేశాడు కాటన్ దొర .సరి లేరు తన కెవ్వరూ అని రుజువు చేశాడు .కాని నిర్మాణ వ్యయం అంచనాలకు మించి పోయిందని ప్రభుత్వం హేగ్ ను సంజాయిషీ కోరింది .అప్పటికే మద్రాస్ కు చీఫ్ ఇంజినీర్ గా ప్రొమోషన్ తో వెళ్ళిన కాటన్ తగు వివరాలతో ప్రభుత్వానికి  నచ్చ జెప్పి ,జరిగిన అదనపు వ్యయాన్ని కూడా వచ్చేట్లు చేసి తన మీద ఉన్న నమ్మకాన్ని మరో సారి రుజువు చేసుకొన్నాడు. తన సమర్ధత ను చాటాడు .గన్నవరం ఆక్వి డేక్ట్ ఇండియాలోనే మొట్ట మొదటి ఆక్వి డేక్ట్ .దీని ‘’రూప శిల్పి కాటనే’’ ఆయన ఆలోచనలతో నే సాకారమైంది .దీనితో నగర భూఖండం సస్య శ్యామలమై సర్వతో ముఖాభి వృద్ధి చెందింది .ఈ ఆక్వి డేక్ట్  తర్వాత ‘’డొక్కా సీతమ్మ  ఆక్వి డేక్ట్ ‘’‘’గా పేరొందింది

బెజవాడలో కృష్ణా నది పై ఆనకట్ట నిర్మాణం

కృష్ణా నదిపై బెజవాడ వద్ద ఆనకట్ట నిర్మించాలని చాలా కాలం గా ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నా నెరవేర లేదు .1792లోసర్వేయర్  మేజర్ జెనరల్ అలేక్సాండర్ బీట్సన్- మైకేల్ టాపింగ్ అనే ఖగోళ శాస్త్రజ్నుడినిసర్వే చేసి నివేదిక పంపమని  ఆదేశించాడు .ఆయన అన్నీ చూసి బెజవాడ వద్ద ఆనకట్ట చాలా అవసరం అని రాశాడు 1832-33లో వచ్చిన ‘’నందన క్షామం ‘’కృష్ణా గోదావరి మండలాలను అతలా కుతలమ్ చేసి, కరాల నృత్యం చేసి, రెండు లక్షల పశువులు, మూడు లక్షల మనుష్యులు మృత్యు వాత పడ్డారు .కోట్లాది రూపాయల రెవిన్యు కు నష్టం జరిగినా ప్రభుత్వం ఏమీ పట్టించుకోక నిర్లిప్తం గా ఉండి పోయింది .1839లో  ఎడ్వర్డ్ బకుల్ అనే ఇంజినీర్ ఆనకట్ట విషయం మరో సారి ప్రభుత్వ దృష్టికి తెచ్చాడు .బేజ వాడ వద్ద కృష్ణ పై 3,900 అడుగుల వెడల్పైన ఆనకట్ట ఇరుకైన లోయలో నలభై అడుగుల ఉవ్వెత్తుగా ఎగసి పడే వరద ప్రవాహం లో అసాధ్యం అని ‘’బుట్ట  దాఖలు’’ చేసింది ప్రభుత్వం .ప్రజలు పట్టు

వదలని విక్రమార్కుల్లా ప్రభుత్వం వెంటా పడ్డారు చివరికి గత్యంతరం లేక ఇక్కడ సాగునీటి సౌకర్యాలను కృష్ణా డెల్టాకు ఎలాచేయవచ్చో వివరణ తో కూడిన నివేదిక ఇవ్వమని సివిల్ ఇన్జినీర్  హెచ్ ఏ లేక్ ను ఆదేశించింది .

అప్పటికే గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి జగద్విఖ్యాతి చెందిన కాటన్ దొరను లేక సంప్రదించి నదీ గర్భం లో ఇసుకలో పదకొండు అడుగుల లోతు పునాది బావుల్ని దింపి ,దాని పై పది హీను అడుగుల ఎత్తున ఆనకట్ట గోడను ,దాని పై రోడ్డు ను నిర్మించాలని ,గోదావరి డెల్టా కాలువలతో ,ఏలూరు వద్ద కృష్ణా డెల్టా కాలువను కలిపి ,పడవల రాక పోకలకు అనుగుణం గా త్రవ్వాలని  ప్రభుత్వానికి ప్రతి పాదన పంపాడు .ఇక్కడి ప్రభుత్వాదికారుల్లో భిన్నాభి ప్రాయాలేర్పడ్డాయి. అప్పుడు ప్రభుత్వం దీనిలో ప్రావీణ్యం ఉన్న కాటన్ దొర సలహాను కోరింది .కాటన్ నదీ ప్రవాహానికి ఇసుక పునాదులు కదిలి పోకుండా రాతి చప్టా పేర్చి జాగ్రత్త తీసుకొంటే ప్రమాదం ఉండదుఅని  సూచించాడు వ్యయం కూడా అనుకున్నంత ఎక్కువ ఏమీ కాదని ఇక్కడ ఆనకట్ట బహుళ ప్రయోజనం అని గట్టిగా చెప్పాడు .

దీనిపై 1849 జనవరిలో కెప్టెన్ అలేక్సాండర్ ఆర్ మొదలైన వారితో నిపుణుల సంఘాన్ని ఏర్పరచి అభిప్రాయ సేకరణ చేసింది .ఈ కమిటీ ఇక్కడి ఆనకట్ట ప్రజల జీవన్ మరణ సమస్య అని దీన్ని డబ్బుతో లంకె పెట్ట వద్దని ఘాటుగా చెప్పింది  .కాటన్ పై ఉన్న అచంచల విశ్వాసం తో ఆయన మార్గ దర్శకత్వం లో నివేదికను అధ్యయనం చేసి1851లో ఆమోదించింది .కాటన్ దగ్గర శిక్షణ పొందిన కెప్టెన్ అలేక్సాండర్ పర్య వేక్షణ లో కృష్ణా నదిపై బెజవాడ వద్ద ఆనకట్ట నిర్మాణం ,కాలువల త్రవ్వకం 1852లో ప్రారంభమై మూడేళ్ళ 1855లో పూర్తీ అయింది.ఏ మాత్రం ఆధునిక సాంకేతిక సామర్ధ్యం లేని ఆ కాలం లో నిర్మాణ కాలం లో నీటి ప్రవాహాన్ని మల్లించటం ఎంతో కష్టమైన విషయం అయినా అకుంఠిత దీక్ష తో మూడేళ్ళ లో ఆనకట్ట నిర్మాణం పూర్తీ చేశారు .ఇలాంటి వాటికి అన్ని వనరులున్నా ఇప్పుడు పదేళ్ళు పడుతోంది .మొదట్లో 5,80 ,000ఎకరాలకు మాత్రమె సాగు నీటి సౌకర్యం కలిగించ గలిగారు .1894లో ఆనకట్ట ఎత్తుమరో మూడు అడుగులు పెంచి ,ఆయకట్టు ను ఎనిమిది లక్షల ఎకరాలకు పెంచారు .1925లో అయిదు అడుగుల తలుపులు బిగించి సాగు విస్తీర్ణాన్ని పన్నెండు లక్షల ఎకరాలకు పెంచి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేశారు అప్పటిదాకా ఇక్కడ జొన్న పంట మాత్రమె మెట్టపంట గా పండేది. ఇప్పుడు చెరకు, వరి ప్రత్తి ,పసుపు ,మొదలైన వానిజ్యపంటలు పండించే వీలు కలిగింది .సాళ్వా. దాళ్వా పంటలు కూడా పండాయి

1957లో శిధిలా వస్తకు చేరిన ఆనకట్ట స్థానం లో బారేజి ని నిర్మించి ‘’ప్రకాశం బారేజి ‘’గా నామకరణం చేశారు .కృష్ణాతూర్పు  డెల్టాకు 378కిలోమీటర్లు, పశ్చిమ డెల్టాకు307కిలో మీటర్ల కాలువలు త్రవ్వి సాగు నీటి సౌకర్యం కలిగించారు .లాకులు కట్టి రవాణా మార్గాలనేర్పరచారు .కాటన్ దొర ఈ దేశానికి రాక పోయి ఉంటె కృష్ణా నది పై బేజ వాడ వద్ద ఆనకట్ట నిర్మాణం జరిగి ఉండేది కాదని అందరు అభిప్రాయ పడ్డారు .కృష్ణా డెల్టా ప్రజలు కాటన్ దొరకు ,కెప్టెన్ అలేక్సాండర్ కు రసదా రుణ పడి  ఉంటారు .అందుకే కృతజ్ఞతా భావం తో  బెజవాడ ఆనకట్ట వద్ద కెప్టెన్ ఆర్ శిలా విగ్రహాన్ని  ప్రతిష్టించి స్మరణకు తెచ్చుకొంటున్నారు .

కాటన్ అసమాన ప్రతిభా విశేషాలను తరువాత తెలుసు కొందాం

సశేషం

 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

కాదంబరి ప్రేమలో రవీంద్రుడు

 

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ యుక్తవయస్సులో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి కాదంబరి. సొంత వదిన అయినా, తన కన్నా వయస్సులో రెండేళ్లు పెద్దదయినా ఆమెతో ఠాగూర్‌కు ఎలాంటి అనుబం«ధం ఉందనే విషయంపై అనేక కథనాలు వెలువడ్డాయి. తాజాగా ప్రముఖ మానసిక విశ్లేషకుడు సుధీర్ కాకర్ రాసిన ‘యంగ్ ఠాగూర్’లో ఈ అనుబంధానికి సంబంధించిన విశ్లేషణ ఉంది. ఆ పుస్తకం నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు..

“ఠాగూర్ యుక్త వయస్సులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన వారిలో ఆయన వదిన కాదంబరీ దేవి ఒకరు. ఠాగూర్ రచయితగా, కవిగా ఎదగటంలో ఆమె ఒక పాత్ర చాలా ఉంది. సోదరుడు జ్యోతీంద్రనాథ్‌తో కాదంబరికి వివాహమయినప్పుడు ఠాగూర్ తొలిసారి ఆమెను చూశాడు. అప్పటికి ఆమెకు పదేళ్లు. ఠాగూర్‌కు ఎనిమిదేళ్లు. ఠాగూర్ ఇంట్లో ఆడవాళ్లకు ప్రత్యేకమైన గదులు ఉండేవి. వాటిలో ఎవరికీ ప్రవేశం ఉండేది కాదు. అందువల్ల కాదంబరి, ఠాగూర్ కలుసుకొనే అవకాశం చాలా తక్కువగా ఉండేది. కాదంబరి పెద్దగా చదువుకోలేదు కానీ జీవితాన్ని అనుభవించాలనే కోరికతో ఉండేది. సంప్రదాయ బెంగాలీ కుటుంబాలలో మహిళలు బయటకు రావటం చాలా తక్కువ. కానీ కాదంబరి గుర్రపు స్వారీ నేర్చుకొని ప్రతి ఉదయం మైదానానికి వెళ్తూ ఉండేది. ఆమె భర్త జ్యోతీంద్రనాథ్ ఎక్కువ సమయాన్ని సంగీతం, నృత్యం, నాటకాలు వంటి వినోదకాలక్షేపాలలో గడిపేవాడు. చాలా సార్లు ఉదయమే లేచి తాను దర్శకత్వం వహించే నాటకాలకు సంగీత రూపకల్పన చేసుకునేవాడు. ఆ సమయంలో ఠాగూర్ అతనితో పాటే ఉండేవాడు.

మధ్యాహ్నం జ్యోతీంద్రనాథ్ ఎస్టేట్ పనులు చూసుకోవటానికి వెళ్లినప్పుడు- కాదంబరికి ఠాగూర్ రకరకాల గ్రంథాలను చదివి వినిపించేవాడు. ఆ సమయంలో బంకించంద్రచటర్జీ రాసిన బి(వి)షవృక్ష అనే సీరియల్ బంగ్లాదర్శన్ అనే పత్రికలో వస్తూ ఉండేది. దీనిని కూడా చదివి వినిపించేవాడు. ఇలాంటి దృశ్యాన్ని- కాదంబరి, ఠాగూర్‌ల మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా తీసిన సత్యజిత్ రే చారులత చిత్రంలో కూడా మనం చూడవచ్చు. కేవలం ఇతరులు రాసినవే కాకుండా తాను రాసిన కవిత్వాన్ని కూడా ఠాగూర్ ఆమెకు వినిపిస్తూ ఉండేవాడు. కాదంబరి అభిప్రాయాలను తెలుసుకొనేవాడు. ఠాగూర్ తాను 13 నుంచి 18 ఏళ్ల దాకా రాసిన కవితల సంకలనం శిశుశబోసంగీత్ (చిన్ననాటి గీతాలు)ను కాదంబరికే అంకితమిచ్చాడు. కేవలం ఠాగూర్ కవిత్వాన్ని వినటమే కాదు. అతని అవసరాలన్నింటినీ కాదంబరి చూసేది. ఠాగూర్‌కు ఇష్టమైన ఆహారపదార్థాలు వండిపెట్టి ప్రేమగా వడ్డించేది. మేడపైన ఉన్న గార్డెన్‌లో కాదంబరి, జ్యోతీంద్రనాథ్‌లతో కలిసి ఠాగూర్ సాయంత్రాలను ఆస్వాదించేవాడు. ఆ సాయంత్రాల గురించి ఠాగూర్- “సాయంత్రమయ్యే సరికి మేడపైన పరుపులు, దిండ్లు వేసేవారు.

అందమైన వెండి గిన్నెలో మల్లెపూలను ఉంచేవారు. చల్లటి మంచి నీళ్లను ఒక చెంబులోను, సువాసనభరితమైన తమలపాకులను ఒక ప్లేటులోను సిద్ధంగా పెట్టేవారు. అప్పుడే స్నానం చేసి, తలను అందంగా దువ్వుకొని కాదంబరి వచ్చి తన స్థానంలో కూర్చునేది. శాలువా కప్పుకొని జ్యోతీంద్రదా వచ్చేవాడు. నేను పాడటం మొదలుపెట్టేవాడిని. అతను తన వయలిన్ తీసుకొని వాయించటం మొదలుపెట్టేవాడు. నా గొంతు దూరానికి కూడా వినిపించేది. నెమ్మదిగా చీకటి పడేది..” అని వర్ణించాడు. కాదంబరి, ఠాగూర్‌ల మధ్య చిలిపి తగాదాలు కూడా ఉండేవి. కాదంబరికి ఆధునికంగా ఉన్న సిల్క్ బట్టలు వేసుకోవటమంటే ఇష్టం. ఠాగూర్‌కు ఆ బట్టలు ఇష్టం ఉండేవి కావు. ఆమె సంప్రదాయబద్ధమైన తెల్లటి చీరలు కట్టుకోవాలనుకొనేవాడు. ఈ విషయంపై ఇద్దరికీ తగవులు జరిగేవి. ‘నీ వయస్సుకు తగ్గట్టు ప్రవర్తించు. మామయ్యలా ప్రవర్తించకు…’ అని ఆమె కసురుకొనేది. నేను ఆమెతో వాదించి ఎప్పుడూ గెలవలేకపోయేవాడిని. చదరంగంలో కూడా ఆమె ఎప్పుడూ నాపై గెలిచేది” అనే మాటలు ఠాగూర్‌కు ఆమెతో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తాయి. ఆ తర్వాతి కాలంలో తనకు, కాదంబరికి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని వర్ణిస్తూ ఠాగూర్ అనేక కవితలు రాశాడు. 14 నుంచి 18 ఏళ్ల వయస్సులోపులో ఠాగూర్ రాసిన కవితలన్నింటిలోను శృంగార భావనలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి.

1878, సెప్టెంబర్ 20వ తేదీన ఠాగూర్ ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. ఇంగ్లాండ్‌కు వెళ్లే నౌకలో ఉన్న పరిస్థితుల గురించి, అక్కడ ఉన్న అమ్మాయిల గురించి కాదంబరికి మూడు ఉత్తరాలు రాశాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో అమ్మాయిలు ఎలా ఉంటారో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ ఉత్తరాలలో మనకు కనిపిస్తుంది. వారంటే తనకు ఇష్టం లేదని కూడా వీటిలో ఠాగూర్ పేర్కొంటాడు. 1880లో ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చేసిన ఠాగూర్ మళ్లీ జ్యోతీంద్రనాథ్, కాదంబరిలతో సమయం గడపటం మొదలుపెట్టాడు. జ్యోతీంద్రనాథ్, కాదంబరిలు చందర్‌నాగూర్‌లో కొంత సమయం గడపటానికి వెళ్తే ఠాగూర్ కూడా వారితో పాటు అక్కడికి వెళ్లాడు. వారిద్దరి మధ్య ఈ సమయంలో విపరీతమైన సాన్నిహిత్యం ఏర్పడింది. ఠాగూర్ నదిలో ఈత కొడుతుంటే కాదంబరి ఒడ్డున కూర్చుని చూసేది. ఇద్దరూ కలిసి నేరేడు పళ్లను ఏరడానికి దట్టమైన అడవిలోకి వెళ్లేవారు. తాము గడిపిన సమయాన్ని- “ఒక అద్భుతమైన వజ్రం సిల్కు బట్టలో చుట్టిపెట్టినట్లుంది..” అని ఠాగూర్ వర్ణిస్తాడు.

1884లో ఠాగూర్‌కు పెళ్లయింది. అప్పుడు ఆయనకు 23 ఏళ్లు. ఆయన భార్యకు 11 ఏళ్లు. ఠాగూర్‌కు పెళ్లయిన నాలుగు నెలలకు కాదంబరి నల్లమందు ఎక్కువ మోతాదులో తీసుకుని స్పృహ కోల్పోయింది. రెండు రోజుల పాటు వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. కాదంబరి మరణం పెద్ద దుమారం రేపుతుందని భావించిన ఠాగూర్ తండ్రి దేబేంద్రనాథ్ ఆమె రాసిన చివర ఉత్తరం, డాక్టర్ రిపోర్టు, ఇతర ఉత్తరాలన్నింటినీ తగలపెట్టించాడు. ఠాగూర్ కుటుంబానికి సంబంధించిన అకౌంట్ పుస్తకాలలో కాదంబరి మరణం తర్వాత- “ఈ వార్త ప్రెస్‌కు పొక్కకుండా చూడటానికి పెట్టిన ఖర్చు 52 రూపాయలు” అని ఉంది. పదహారేళ్ల తర్వాత ఠాగూర్ ముగ్గురి వ్యక్తుల మధ్య ప్రేమను ఇతివృత్తంగా తీసుకుని నష్‌తానిర్ (చిధ్రమైన ఇల్లు) అనే నాటకం రాశారు. ఇది ఆ నాటి ఠాగూర్ జీవితానికి నాటకరూపమని విశ్లేషకులు భావిస్తారు.
యంగ్ ఠాగూర్
రచయిత:
సుధీర్ కాకర్
ప్రచురణ: పెంగ్విన్
ధర: రూ. 499
పేజీలు: 238
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభిస్తుంది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అపర భగీరధం -3 గోదారి కంఠాభరణం ఆనకట్ట పూర్తి

         అపర భగీరధం -3

గోదారి కంఠాభరణం ఆనకట్ట పూర్తి

గోదావరి వరదలోచ్చినా  ,రాళ్ళు పగల కొట్టటం ,సున్నం కాల్చేపని ,ఇటుక తయారీ నిర్విఘ్నం గా జరుగుతూనే ఉన్నాయి .రెండో రైల్ మార్గం పనులూ అయిపోయాయి .ఆరున్నర మైళ్ళ పొడవు గల రైల్వే లైన్ కు కావాల్సిన కర్ర పట్టాలు అమర్చారు .పట్టాల పై భాగాన్ని సమతలం గా చెక్కి వాటిపై రెండు అంగుళాల వెడల్పు ఇనుప రేకులమర్చి దానిపై కొయ్య చక్రాలవాగన్లు తేలిగ్గా తీసుకు పోయే ఏర్పాట్లూ జరిగి పోయాయి .1847అక్టోబర్ నుంచి వరదలు తగ్గాక మళ్ళీ పనులు మొదలైనాయి .25వేల ఘనపు అడుగుల చెక్కిన రాయి సిద్ధమై ఉంది .రోజుకు అయిదు వందల అడుగుల  రాయి ఫంటూలపై ఆనకట్ట ప్రదేశానికి చేరుతోంది .

వేసవి అయినా ఏ శీతల ప్రదేశాల్లో హాయిగా గడపటానికి వీలుగా ఉన్నా, కాటన్ ఎక్కడికీ కదలకుండా నెత్తిన టోపీ పెట్టుకొని ,పర్యవేక్షిస్తూ పని తీరును గమనించాడు .ఎక్కడికైనా కాంప్ మార్చాల్సి వస్తే అతి తక్కువ సామాను తో కుటుంబం తో కదిలే వాడు .ఆర్భాటం ఉండేదికాదు .అవసర సౌకర్యాలు లేక బాధ పడే వాడు .1848జూన్ కు ఆనకట్ట తొమ్మిది అడుగుల ఎత్తువరకు నిర్మించారు .ఇంకొక మూడడుగులు ఎత్తుపెంచాలి .లాకుల పని పూర్తయింది .తలుపులు బిగించాలి .అడుగు తూములు అంటే అండర్ స్లూయిస్ చెక్కుడు రాయి పని కూలీలు దొరక్క నెమ్మదిగా నడిచింది .ప్రధాన తూము అంటే హెడ్ స్లూయిస్ ఆర్చీల మట్టాలకు పూర్తీ అయింది .ర్యాలీ పాయలో కూడా పని మందకొడిగా జరుగుతోంది .లాకు పని అయిపోయి ,కాలువ పని ఉంది .మద్దూరు పాయలో పనులు వేగం గా జరుగుతోంది .వింగ్ వాల్స్ పై భాగం తప్ప అంతా పూర్తీ అయింది .విజ్జేశ్వరం పాయలో ప్రధాన ,అడుగు తూముల పనులు బాగా జరిగాయి .వరద లోచ్చే సరికి దాదాపు అంతా పూర్తీ అయింది .లాకుల పై పని అనుకొన్నంత వరకు బానే జరిగింది .తలుపుల పని మిగిలింది .రెక్క గోడలపై వరద లోచ్చినా పని చేయ వచ్చు .

కాని రెండు వారాల ముందే జూన్ లో వరద లోచ్చాయి . రాతి కట్టడం ఏమై పోతుందో అని భయ పడ్డాడు కాటన్ .దీనికి తోడు ఆయన ఆరోగ్య పరిస్తితి కూడా బాగాలేదు వడ దెబ్బ తగిలి తీవ్ర జ్వరం వచ్చి బాధ పడుతున్నాడు కాని ఆనకట్ట మీద ద్రుష్టి మాత్రం మర్చి పోలేదు .సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోమని భార్య ఒత్తిడి పెట్టింది .మిగిలిన అధికారులు కూడా అలానే చేయమని కోరారు .క్లిష్ట సమయం లోసెలవు పెట్టటం  ఇష్టం లేక పోయినా ఆరోగ్యం దృష్ట్యా సెలవు పెట్టి,ప్రభుత్వ ఆదేశం పై బాధ్యతను కెప్టెన్ చార్లెస్ అలేక్సాండర్ ఆర్ కు అప్పగించి, కాటన్ కుటుంబం తో ఆస్ట్రేలియాకు వెళ్ళాడు .మనసు ఇక్కడా శరీరం అక్కడ గా ఉంది ఆయన పరిస్తితి .సెలవు పై వెళ్ళ టానికి ముందే ఉన్న డబ్బు అంతా ఖర్చు అయినందువల్లా ,మరొక లక్షా ముప్ఫై తొమ్మిది వేల రూపాయలు కావాలని ప్రభుత్వానికి రాశాడు

దీనికి ప్రభుత్వం నుండి వ్యతిరేకం గా శ్రీముఖం వచ్చింది .మితి మీరిన వ్యయం చేస్తున్నాడని పనుల భద్రత, ,నాణ్యత పట్టించుకోకుండా త్వరగాపని చేస్తున్నాడని విమర్శించింది .ఒకరిద్దరు అనుభవమున్న ఇంజినీర్లను పంపి సమీక్షించి ,నివేదిక ఇమ్మని కోరింది .విచారణ సంఘం లో ఇంజినీర్ యి.బకుల్ ,జే.హెచ్.బెల్.,కెప్టెన్ అలేక్సాండర్ ఆర్ ,రాజ మండ్రి సబ్  కలెక్టర్ హెన్రి ఫోర్ట్స్ సభ్యులు . 1848 నవంబర్ లో విచరణ సంఘం ఆనకట్టపనులు పర్య వేక్షించి జనవరి లో ప్రభుత్వానికి నివేదిక పంపింది .అందులో వివరాలు ‘’గోదావరి ఆనకట్ట నిర్మాణం లో మేజర్ కాటన్ ప్రదర్శించిన అపూర్వ శాస్త్ర విజ్ఞాన ప్రతిభను ,అనుభవ పూర్వక సామర్ధ్యాన్ని ,నిర్విరామ కృషిని ఈ కమిటీఎంతో ప్రశంసించింది .అయన మేధా శక్తికి ,ఆత్మనిష్ట కు ,ఒక అమోఘ ఈ నవీన జలదుర్గం ఒక ఉదాహరణ.అనుకో కుండా వచ్చిన వరదల వల్ల  ఆనకట్టకు కొంత నష్టం జరిగి అంచనా వ్యయం పెరిగిందే తప్ప కాటన్ తొందర పాటు కాదు అని మేం పూర్తిగా విశ్వ సిస్తున్నాం .ఇప్పటికే రాజమండ్రి జిల్లా ఈ ఆనకట్ట వల్ల  ఎంతో ప్రయోజనం పొందింది .కనుక మేజర్ కాటన్ ప్రతి పాడించిన అదనపు డబ్బుతో బాటు ,కెప్టెన్ ఆర్ కోరిన మరో మూడు లక్షల యాభై వేల రూపాయలు అత్యవసరం గా మంజూరు చేయమని గట్టిగా సిఫార్సు చేస్తున్నాం ‘’అని కాటన్ దొర పని తనానికి, నిజాయితి కి ,నిర్భీకతకు కీర్తి కిరీటం పెట్టింది ఆ సంఘం.ప్రభుత్వం వెంటనే ఆ డబ్బును సాంక్షన్ చేసి పంపించింది .

రెండేళ్ళు ఆస్ట్రేలియా లో విశ్రాంతి తీసుకొని 1850 సెప్టెంబర్ లో తిరిగి వచ్చి బాధ్యతలు చేబట్టాడు .అనుకున్నట్లు గా పనులన్నీ పూర్తిగా సంతృప్తికరం గా జరిగిపోయాయి కాటన్ అక్కడ లేక పోయినా . .కెప్టెన్ సారధ్యం లో పనులు బాగా జరిగి నందుకు అతన్ని కాటన్ మనసారా అభి నందించాడు .నదిలో పడవలను వేగం గా లాగటానికి స్టీం లాంచ్ అవసర మని ప్రభుత్వానికి రాసినా అనుమతివ్వలేదు .కలకత్తా నుంచి లాంచిని తెప్పించి పని అతి వేగం గా జరిపించాడు .లాంచి వల్ల  ఎంత ప్రయోజనం జరిగిందో ప్రభుత్వానికి రాశాడు. సంతృప్తి చెందిన ప్రభుత్వం కలకత్తా లాంచి రావటానికి ,నిర్వహణకు అయిన డబ్బంతా ఇచ్చేసింది నిజాయితీ ఉన్న ఆఫీసర్ కు  దక్కిన గౌరవం ఇది .నిబద్ధతకు నిలువెత్తు గా కాటన్ నిలిచాడు .ఆయన దగ్గర పని చేసిన ఇంజినీర్లు కూడా పని మీద అత్యంత శ్రద్ధ ఉన్నవారే అవటం ఆయనకు ఎంతో కలిసి వచ్చింది .కెప్టెన్ అలేక్సాండర్ ,కెప్టెన్ హచిన్సన్ ,లెఫ్టి నెంట్ హేగ్ ,లెఫ్టి నెంట్ రున్దాల్ ,ఒవర్సీర్ వేణంవీరన్న ఆనకట్ట నిర్మాణం లో చిరస్మరణీయ సేవ లందించారు .ఏమాత్రం భేదాలు లేకుండా శాయ  శక్తులా కాటన్ కు సహాయ సహకారాలందించి అభిమాన పాత్రులయ్యారు .వేణం వీరన్న ను గూర్చి ‘’వీరన్న గారు లేక పోయి ఉంటె వేలాది కూలీల సమీకరణ జరిగేది కాదు .ఆన కట్ట పని సకాలం లో జరగటానికి వీరన్న సేవలు నిరుపమానం ‘’అని మెచ్చుకొన్నాడు కాటన్. వీరన్నకు ఇంజినీర్ గా ప్రొమోషన్ ఇవ్వటమే కాకుండా ‘’రాయ్ బహదూర్ ‘’బిరుదాన్ని కూడా ప్రభుత్వం చేత ఇప్పించిన పని పక్ష పాతి కాటన్ .

కాటన్ మార్గ దర్శకత్వం ,ఉత్సాహ వంతులైన ఇంజినీర్లకర్తవ్య నిస్ట ,వేలాది కార్మికుల అవిరళ కృషి, ,ప్రజా సహకారం వల్లనాలుగు కిలో మీటర్ల పొడవైన ఆనకట్టలు కేవలం అయిదేళ్ళలోఅంటే 1852లో పూర్తీ చేయగలిగాడు అపర భాగీరదుడు,డెల్టా శిల్పి అయిన  మేజర్ ఆర్ధర్ కాటన్ దొర .రెండు వేల మైళ్ళ పొడవున్న డిస్త్రి బ్యూటర్లు ,మురుగు కాలవలు ,రోడ్లు ,వంతెనలు ,వరద కట్టలు నిర్మించి మాహాద్భుతాన్ని ప్రపంచం లోనే అరుదైన గోదావరి నాదీమ  తల్లికి దివ్య భవ్య కంఠా భరణంఅయిన ధవళేశ్వరం  ఆనకట్ట నిర్మాణాన్ని సమర్ధ వంతం గా పూర్తీ చేశాడు .గోదావరి డెల్టాకు ఏడు లక్షల ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కలిగింది . 1889లో ఆనకట్ట ఎత్తు మరో రెండు అడుగులు పెంచారు . 1936లో మరో మూడు అడుగులు ఎత్తుపెంచి ఆయకట్టు విస్తీర్ణం పది లక్షల ఎకరాలకు పెంచారు .

1970 లో ధవళేశ్వరం ఆనకట్ట శిధిలా వస్తకు చేరింది దాని స్స్థానం లో బ్యారేజి నిర్మించి కాటన్ గౌరవ సూచకం గా ‘’సర్ ఆర్ధర్ కాటన్ బారేజి ‘’అని పేరు పెట్టి గౌరవించారు .పది లక్షల ఎకరాలకు రెండు పంటలు పండించే సాగు నీరు లభ్యమై గోదావరి డెల్టా ‘’ఆంద్ర దేశపు దాన్యా గారం ‘’గా రూపొందింది .ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తీ అయ్యే సరికి కాటన్ దొర రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ గా ప్రమోషన్ పొంది మిగిలిన పని చేయటానికి తన తమ్ముడు ‘’ఫ్రెడ్ కాటన్ ‘’కు అప్పగించి కల్నల్ కాటన్ మద్రాస్ కు వెళ్ళాడు

వాస్తవం గా జరిగిన ఆశ్చర్య కర సంఘటన

1852 లో గోదావరి ఆనకట్ట ల నిర్మాణం పూర్తీ అయింది కాల్వలలోకి నీరు గలగలా ప్రవైస్తున్నాయి రమ్య జల నాదం విని పిస్తోంది .రైతుల ముఖాలలో ఆనందం తంతాండ  విస్తోంది .సంతృప్తి జీవితం లో చోటు చేసుకోంది. వెలుగు జీవితాలలో ప్రవేశించింది .ఒక వేదం పండితుడు గోదావరి కాలవలో పవిత్ర స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ‘

‘’నిత్య గోదావరీ స్నాన పుణ్యతోయో  మహా మతిహ్ –స్మరామ్యమ్ ఆంగ్లేయ  దేశీయం ,కాటనుం తం భగీరధం ‘’

అని శ్లోకం చెబుతూ మూడు సార్లు కాటన్ దొరకు అర్ఘ్యం సమర్పిస్తున్డటం ఆ ఒడ్డునే నడుస్తూ వెళ్ళిన ఒక తెల్ల దొర ,అతని దుబాసీ లకు కనీ పిస్తూ, విని పించింది .ఇందులో ‘’కాటన్ ‘’అనే మాట వారిని ఆకర్షించింది ఠక్కున ఆగి పోయారు .ఆ శ్లోకానికి అర్ధం ఏమిటో కనుక్కోమని తెల్ల దొర దుబాసీ కి చెప్పాడు అతడు వినయం గా ఒడ్డు దగ్గరకు చేరి నమస్కరించి ఆ శ్లోకం అర్ధం ఏమిటో వివరించమని ఆ ‘’వేద పండు’’ ను ప్రార్ధించాడు అప్పుడు ఆయన ‘’పవిత్ర గోదావరీ జలాలతో అను నిత్యం స్నాన పానాదులు చేయటానికి పుణ్య ఫలాన్ని మాకు ప్రసాదించిన మహాను భావుడు భగీరద సమానుడు ఆంగ్లేయుడు అయిన కాటన్ దొరను సంస్మరిస్తున్నాను ‘’అని అర్ధం చెప్పి పరవశం చెందాడు. ;అప్పుడు ఆ దొర ‘’అయన తన విద్యుక్త ధర్మం గా ఈ ఆనకట్ట కట్టించాడు. అంత మాత్రాన ఆయన్ని దేవుడిగా ఆరాదిన్చాలా? “’అన్నాడు అందుకా పండితుడు ‘’దొరగారూ !విధ్యుక్త ధర్మ నిర్వహణమే దైవ లక్షణం ;క్షామ పీడితం గా ఉన్న ఈ గౌతమీ మండలాన్ని గోదావరీ జలాలతో సస్య శ్యామలం చేసి, మా బతుకుల్లో వెలుగులు నింపిన మహాను భావుడు కాటన్ దొర .కనుక ఆయనే మాకు ప్రత్యక్ష దైవం .అందుకే ఆయన్ను నిత్యం మేము మనసారా స్మరించి అర్ఘ్య ప్రదానం చేసి కృతజ్ఞత తెలుపు కొంటున్నాం ‘’అన్నాడు

అప్పుడు దుబాసీ ‘’మీరు ఆరాధిస్తున్న కాటన్ దొరగారు   వీరే ‘’అని చెప్పి ఆ పండితునికి కాటన్   దొరను పరిచయం చేశాడు .అంతకు ముందెప్పుడూ కాటన్ దొర ను చూడని ఆ పండితుడు ఒక్క సారిగా తన ముందు కాటన్ ప్రత్యక్ష మయ్యేసరికి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు .రెండు చేతులు జోడించి ‘’కాటన్ దొర గారూ !మీ దర్శన భాగ్యం  వల్లనా జన్మ తరించింది .నేనెంతో ధన్యుడిని ‘’అంటూ ఆనంద పారవశ్యం తో కాటన్ దొర పాదాలపై ఆ వేద పండితుడు వాలి పోయాడు .ఇంతకు మించిన క్రుతజ్నత ఇంకేముంది ?కాటన్ దొరకు ఈ సన్నివేశం ఆశ్చర్యం కలిగి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారా పాతం గా కారి పోయాయి. ఏ భారతీయుడు ఏ తెలుగు వాడూ చేయని మహోప కారాన్ని తెలుగు దేశానికి చేసిన మహనీయుడు కాటన్ దొర .ఆంధ్రుల పాలిటి జీవన దాత .తెలుగు వారికి ప్రాతస్మరణీ యుడు .

కాటన్ మహోన్నత వ్యక్తిత్వాన్ని ,పుట్టుకా జీవిత విశేషాలను ఈ సారి తెలుసు కొందాం .

సశేషం

మీ–గబ్బిట   దుర్గా ప్రసాద్ -30-10-13-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | 1 Comment

అపర భగీరధీయం –2 ఆనకట్ట నిర్మాణ పనులు షురూ

                             అపర భగీరధీయం –2

ఆనకట్ట నిర్మాణ పనులు షురూ

రాజ మంద్రికి నాలుగు కిలో మీటర్ల దూరం లో ఉన్న ధవళేశ్వరం వద్ద ఆనకట్టనిర్మాణా నికి అనువైన స్థలం గా భావించారు .దీనికి ఎగువన నదిని ‘’అఖండ గోదావరి ‘’అంటారు .ఆనకట్ట ప్రాంతం వద్ద గోదావరి ధవళేశ్వరం ,ర్యాలి ,మద్దేశ్వరం విజ్జేశ్వరం అనే నాలుగు పాయలుగా చీలి పోతుంది .దిగువ కొంత దూరం లో ‘’గౌతమి, వసిష్ట’’ అనే మరి రెండు పాయలౌతుంది .ఆనకట్టలు కట్టాల్సిన ఈ నాలుగు పాయల మొత్తం పొడవు 11,945అడుగులు అంటే రెండున్నర మైళ్ళు .మధ్యలో మట్టి కట్ట వేసి ,ఎత్తు పెంచాల్సిన లంకలు నాలుగున్నాయి  .అవే పిచ్చిక లంక ,బొబ్బర్లంక ,మద్దూరు లంక ,చిగురు లంక .వీటి మొత్తం పొడవు ఒకటిన్నర మైళ్ళు అంటే 7,430అడుగులు .నదీ గర్భం లో ఆరు అడుగుల లోతు వరసకు ఇటుక బావులు నిర్మించి ,వాటిపై పన్నెండు అడుగుల ఎత్తు ఆనకట్ట నిర్మించాలి .దాని పై పద్దెనిమిది అడుగుల వెడల్పు రోడ్డు వేయాలి .’’ఇలాంటి ఆనకట్ట అప్పటికి ఇండియా లోనే కాదు ప్రపంచం మొత్తం మీద మరెక్కడా లేదు’’. ఈ బృహత్ నిర్మాణానికి కావలసింది అసాధారణ సాంకేతిక నైపుణ్యం తో బాటు ఎన్ని ఓడిదుడుకులోచ్చినా నిలబడే గుండె నిబ్బరం కూడా ఉండాలి  .ఈ రెండు కాటన్ దొరలో పుష్కలం గా ఉన్నాయి .అందుకే ఈ అత్యంత క్లిష్టమైన నిర్మాణం చేబట్టాడు .

 

Inline image 1Inline image 1Inline image 1

 

ధవళేశ్వరం లో ఉన్న డెల్టా క్లబ్ వెనక తాటి దూలాలతో, తాటాకులతో ఒక కుటీరం నిర్మించుకొన్నాడు దొర .అదే దొరగారి బంగాళా .దాని పక్కనే సిబ్బందికి గుడారాలు వేయించాడు .భార్య ఎలిజ బెత్ ,కూతురు బేబీ హాప్ లను కూడా తీసుకొచ్చి ఇక్కడే కాపురం పెట్టాడు .దగ్గరలో ఉన్న కొండ రాయి ఎంతోనాణ్య మైనదిగా భావించాడు .ఇటుకలు తయారు చేయటానికి కావలసిన మంచి మట్టి ,కాల్చటానికి సున్నపు రాయి దగ్గరలోనే ఉన్నాయి .లాకులకు తూములకు పనికొచ్చే ప్రశస్తమైన టేకు ప్రక్కనే ఉన్న అడవిలోనే ఉంది .అన్ని వనరులు ఉన్న ప్రదేశం గా భావించాడు కాటన్ .సున్నపు బట్టీలు ఇటుక ఆవములు తయారయ్యాయి .క్వారీలో పగల గొట్టిన రాయి తేవటానికి రైలు మార్గం ఏర్పడింది .అక్కడి నుండి నదిలోకి వీటి నన్నిటిని చేర్చటానికి ‘’ఫంటు ‘’అంటే బల్లకట్టు నిర్మాణం చేయించాడు .రాళ్ళను సైజులో చెక్కటం ,ఆనకట్టల మధ్య ఉన్న లంకల ను ఎత్తు చేయటం ,వాటిని బల పరచటం చక చకా సాగిపోయాయి .జూన్ నెలాఖర్లో వచ్చే గోదావరి వరదలకు ముందే ఈ పనులన్నీ పూర్తీ చేయాలని కాటన్ లక్ష్యం   గా పెట్టుకొని చురుగ్గా పర్య వేక్షించి పనులు పూర్తీ చేశాడు

కావేరి పై కట్టిన ‘’గ్రాండ్ ఆనకట్ట’’ను నిశితం గా పరిశీలించిన కాటన్ అక్కడ ఉపరితలం పై వాడిన సున్నపు పూతకు బదులు ఇక్కడ చెక్కిన రాయి ని ఉపయోగిస్తే ఆనకట్ట బలం మరింత పెరుగుతుందని నిర్ణయించాడు .ఇలాంటి చెక్కుడు రాయి పని వాళ్ళు రాజ మండ్రి జిల్లా మొత్తం మీద ఎక్కడా దొరక లేదు .ఉన్న వాళ్ళతోనే పని సాగిస్తే నిర్మాణం మరో ఏడాది ఆలస్యం అవుతుంది. దీనికి ఇష్టపడలేదు దొర .అందుకని వ్యూహం మార్చాడు .తూములు ,లాకులు మొదలైన ముఖ్య భాగాలకే చెక్కుడు కొండరాయి ఉపయోగించాలని రాయి వాడకాన్ని పరిమితం చేశాడు .

1847 ఏప్రిల్ లో ఆనకట్ట నిర్మాణం ప్రారంభ మైంది .ఆ నాడు కాంట్రాక్ట్ తీసుకొని చేసే సంస్థలు లేవు .క్వారీలలో కొండ రాయి పగల గొట్టటం ,సున్నపు రాయి కాల్చి గానుగ ఆడి  సున్నం తయారు చేయటం ఇటుకల్ని కాల్చటం మొదలైన పనులకు ప్రభుత్వం 12మంది అధికారుల్ని ,కొందరు సహాయకుల తో బాటు1300మంది కూలీలను ఏర్పాటు చేసింది .కూలీలు నదిలో పనికి ముందు భయపడ్డా ఒక వారం లో మంచి ఉత్సాహం తో ఇది తమ పని అని తమ కోసమే ఆనకట్ట అని పని చేశారు .ఆ తర్వాత చాలా మంది కూలీలు వచ్చి చేరారు .అధికారులు కూడా వారిని ఎంతో దయతో చూసేట్లు చేశాడు దొర. అప్పుడు మగ కూలీకి రోజుకు ఒక అణా అంటే ఇప్పటి ఆరు పైసలు ,ఆడకూలీకి తొమ్మిది పైసలు అంటే ఇప్పటి నాలుగున్నర పైసలు .తాపీ ,వడ్రంగం కమ్మరులు మొదలైన నాణ్యమైన పని వారికి  రోజుకూలీ రెండు అణాల,మూడు పైసలు అంటే నేటి పద్నాలుగు పైసలు .ఆదివారం సెలవు అయినా ,ఆ రోజు కూలి కూడా కలిపి వారానికి మొత్తం శనివారానికే డబ్బు చెల్లించే ఏర్పాటు చేశాడు కాటన్ .రోజు పని మొదలు పెట్టటానికి, ,ముగియ టానికి గుర్తుగా ఫిరంగి మోగించే వారు .

ఇక్కడ జరుగుతున్నా జల యజ్ఞం చూసి కూలీలు విపరేతం గా వచ్చి చేరుతూ సంఖ్యను పది వేలకు చేర్చారు .ఐదు వందల మంది వడ్రంగులు ,మరో అయిదు వందల కమ్మర్లు ,వెయ్యి మంది రాతి చెక్కుడు వాళ్ళను నియమించి వేగం గా పనులు చేయించాడు కాటన్ .రోజుకు అయిదు వందల టన్నుల కొండ రాయి కొట్టి సిద్ధం చేసే వారు .ఈ రాయి సున్నం ఇటుక నది ఒడ్డుకు చేర్చే రైలు మార్గమూ తయారై పోయింది .నాలుగు క్రేనులు పదహారు రైల్వే వాగన్లు తయారయ్యాయి .వీటిని నదిలోకి చేర్చటానికి పద్దెనిమిది ఫంట్లు వచ్చేశాయి .

ఇక్కడ తాటాకు పాకలో ఉన్నప్పుడే కాటన్ కు రెండో కూతురు పుట్టింది .కాని దురద్రుస్ట వశాత్తు ఏడాది మాత్రమె బ్రతికి చని పోయి కాటన్ దంపతులకు తీరని శోకం మిగిల్చింది .మనో వేదన తో తట్టుకో లేక పోయారిద్దరూ .నెమ్మదిగా జన జీవన స్రవంతిలో కలిసి నిర్మాణం పనులు వేగవంతం చేశాడు .పల్లెల నుంచి నిరుపేద స్త్రీలు చంకలో పిల్లల్ని ఎత్తుకొని అర్ధ నగ్నం గా కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వచ్చి పని చేయటం ఆ దంపతుల్ని కలచి వేసింది బిచ్చ గాళ్ళ బెడద ఉండేది కాదు .కస్టపడి పని చేసి ,దొర మెప్పు సంపాదించుకొన్నారు. తెల్ల దొరలని వీరంతా గౌరవించే వారు. దొరలకు తమ వద్ద ఉన్న కానుక లిచ్చి సంతోష పెట్టె వారు. వాళ్లకు ఇబ్బంది కల్గించకుండా కూలీలు ఏంతో  జాగ్రత్తగా మసలే వారు .

నాలుగు వైపులా కొండను ప్రేలుడు పదార్ధాలతో పగల కొట్టే భయంకర శబ్దాలు, కూలీల పాటలు .మేస్త్రీల అదలింపు ల తో దొర ఇంటి చుట్టూ సందడే సందడి .ఈ గందర గోళానికి దూరం గా కొండ ప్రాంతం లో కి కాటన్ మకాం మార్చాడు .రాయిని మందు సామానుతో పేల్చినప్పుడు రాయి ముక్కలేగిరివచ్చి బంగ్లా పై పడుతూ ఉండేవి .ఈ అదు రుడు కు ఇంటి గోడలు బీటలు ఇచ్చి అందులోంచి గాలి వెలుతురూ ధారాళం గా బంగ్లా లోనికి వచ్చేవి .పాములు బెదిరి ఈ బీటల్లో దూరి భయం కలిగించేవి .పిల్లలు భయ పడే వారు .ప్రజల్లో కాటన్ దొర పై ఆరాధనా భావం ఏర్పడింది .ఆటబొమ్మలు, పంచదార చిలకలు తినే పదార్ధాలు దొర కుటుంబానికి కానుక లు గా ఇచ్చే వారు .

దొర ఇంటి పని వంటపని బట్టలుతికే పనికి ప్రత్యెక సేవకులుండే వారు .ఏకులం వాళ్ళు ఆ పనే చేసే వారు ఒక రోజు ‘’లచ్చి ‘’ అనే ఇల్లు ఊడ్చే పని మనిషి ఎలిజ బెత్ ను బతిమి లాడి అర్ధ రూపాయి జీతం లో అడ్వాన్సుగా అడిగి తీసుకోంది.ఎందుకు అంటే కారణం చెప్పలేదు .లచ్చి వెంటనే రాజ మండ్రి వెళ్లి అర్ధ రూపాయి పెట్టి ఒక చిన్న పాపను కొనుక్కొని తెచ్చుకోంది .పిల్లలు లేకుండా ఒంటరిగా బ్రతకలేనని అందుకే ఈ పిల్లను కొనుక్కోవటానికే అర్ధ రూపాయి అడిగానని చెప్పి పాపను దొరసానికి చూపించింది .ఆమె నిర్వీర్యురాలైంది .ఆడపిల్లల్ని ఎంత కారు చవకగా ఆనాడు అమ్ముతున్నారో అర్ధం చేసుకొని విచారించింది ఎలిజబెత్ .ధవళేశ్వరం ఆనకట్టకు కొన్ని పునాది బావుల నిర్మాణం పూర్తీ అయింది .కాని 1847లో గోదావరికి వచ్చిన వరదలవల్ల పనులు పూర్తిగా ఆగిపోయి కొంచెం నిరాశ కల్గించింది కాటన్ కు ఆనకట్ట నిర్మాణం పూర్తీ అయిన విధానం తరువాత తెలుసు కొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-10-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment