కాశీ ఖండం –29 కాల భైరవుడు

        కాశీ ఖండం –29

                                                కాల భైరవుడు

 కాల భైరవ ప్రాదుర్భవాన్ని గురించి అగస్త్యునికి కార్తికేయుడు వివ రించాడు .పూర్వం మేరు శృంగం లో బ్రహ్మ దేవుడు ఏకాంతం గా తపస్సు చేస్తున్నాడు ..మహర్షులు ఆయన దగ్గరకు వెళ్లి ఏకాంతం గా ఏమి చేస్తున్నావని ప్రశ్నించారు .దానికి బ్రహ్మ ‘’నేను దాతను .జగత్తును సృష్టించి ,పెంచి లయం చేస్తుంటాను .స్వయంభు ని .సర్వేశ్వరుడిని .జగాలన్ని నా అధీనం .నా కంటే గొప్ప దేవుడు లేదు ‘’అని ప్రగల్భాలు పలికాడు .అప్పుడు నారాయణఅంశ తొ వచ్చిన క్రతువు బ్రహ్మ తొ ‘’పర తత్వాన్ని తెలుసుకోకుండా అజ్ఞానం తొ మాట్లాడుతున్నావు ..నేనే కర్తను ,నారాయణుడిని ,యజ్న స్వరూపుడను .’’అన్నాడు ఇద్దరికీ వాగ్వాదం జరిగింది .చతుర్వేదాలలో ప్రవీణులైన విప్రులను సాక్షు లు గా ఉంచుకొని వాదు లాడుకొన్నారు .వేదాలలో ఏమి చెప్ప బడిందో తెలియ బర్చమని వారిద్దరూ కోరారు .వేదాలే తమకు ప్రమాణం అని తెలియ జేశారు .ఋగ్వేదం ‘’ఈ సకల భూత గణం ఎక్కడి నుంచి వచ్చి ,మళ్ళీ ఎక్కడికి చేరుతుందో అదే పర తత్త్వంఅయిన రుద్రుడు  ‘’అన్నది  యజుర్వేదం ‘’ఎవరు యజ్ఞాధి పతి యో ,యోగం చేత అర్చింప బడే వాడేవ్వడో, ఎవరు అందరికి ప్రమాణమో ఆయనే సర్వజ్ను డైన శివుడు ‘’అని చెప్పింది .సామ వేదం’’ఎవరి చేత విశ్వ భ్రమణం జరుగు తోందో ,యోగులెవరిని గూర్చి చిన్తిస్తారో ,ఎవని కాంతి చే ఈ విశ్వం ప్రకాశిస్తుందో ఆయనే పరమ శివుడైన న త్రయంబకుడు ‘’అన్నది .అధర్వ వేదం ‘’దేవేశ్వరుడేవడో ,కైవల్య స్వరూపుడేవ్వడో అతడే దుఃఖ హారి అయిన శంకరుడు‘’అని చెప్పింది .

                అప్పుడు బ్రహ్మా క్రతువు లిద్దరూ శ్మశానం లో విభూతి పూసుకొని దిగంబరం గా తిరిగే వాడూ ,ఎద్దునేక్కి తిరిగే వాడు సర్ప భూషణుడు ఎలా బ్రహ్మత్వం పొందుతాడు అన్నారు . .అప్పుడు సనాతన ప్రమాణం అమూర్తి అయినా మూర్తి మత్వాన్ని పొంది నవ్వుతు ‘’పరమేశ్వరుని తెలుసు కోవటం కష్టమైన పని .లీలా రూపం తొ నాట్యమాడుతాడు .ఆయన స్వయం జ్యోతి ,సనాతనుడు ,ఆనంద స్వరూపుడు ‘’అని చెప్పింది .అయినా బ్రహ్మ అజ్ఞానం నాశనం కాలేదు .అప్పుడు ఒక జ్యోతి వారి ముందు ప్రత్యక్ష మైంది .అది భూమ్యాకాశాలను ఆక్రమించింది ..జ్యోతిర్మండల మైన పురుషా కారం తొ అది బ్రహ్మ కున్న ఐదో శిరస్సు ను తగుల బెట్టింది .తరువాత ఆజ్యోతి శివ రూపం చెంది ప్రత్యక్ష మై నాడు. .బ్రహ్మ అహంకారం చావలేదు ‘’పూర్వం నువ్వు నా ఫాలభాగం నుండి పుట్టావు .నన్ను శరణు వేడు నేను నిన్ను రక్షిస్తా‘’అని గర్వం గా అన్నాడు .అప్పుడు కోపం తొ ఒక భైరవా కారాన్ని శివుడు తన నుంచి సృష్టించాడు .

            శివుడు కాల భైరవుని తొ ‘’నువ్వు ఈ ప్రపంచాన్ని భరించే శక్తి కల వాడివి .నిన్ను ‘’పాప భక్షకుడు ‘’అని పిలుస్తారు కాశీలోనే నీ ఉనికి కాలమే నిన్ను చూసి భయ పడే కాల భైరవుడివి .’’అన్నాడు అప్పుడు భైరవుడు తన ఎడమ చేతి బొటన వ్రేలి తొ బ్రహ్మ ఐదో తలను గిల్లి వేశాడు .భయ పడిన బ్రహ్మ శత రుద్రీయాన్ని పఠించాడు ..శివుడు బ్రహ్మను ఓదార్చి కాల భైరవుని తొ ‘’నువ్వు యజ్ఞాలలో మాన్యత్వాన్ని పొందుతావు .బ్రహ్మ కపాలాన్ని చేతి లో ధరించి ,బ్రహ్మ హత్యా దోషం పోవటానికి తపస్సు చెయ్యి .’’అని చెప్పాడు  .

             ఆ శివుడు బ్రహ్మ హత్య అనే పేరుకల కన్య ను సృష్టించాడు .ఆమె ఎర్రనిది. యెర్రని వస్త్రాలు యెర్ర చందనం ధరించి కోరలతో కూడిన విశాల మైన నోటి తొ వ్రేలాడే నాలుక తొ ,ఒక కాలు పైకెత్తి రక్త పానం చేస్తూ ఖడ్గం రక్త పాత్ర ,తల పుర్రె చేతుల్లో ధరించి అందర్ని భయ భ్రాంతులను చేసింది .శివుడు కాల భైరవు ని తొ ‘’నువ్వు అన్ని ప్రదేశాలలో తిరిగే అధికారం కల వాడివి .ఈమె తొ నీకు కావాల్సిన పని చేయించుకో ‘’అని చెప్పి అంతర్ధానమయ్యాడు .

           కపాల పాణియై ,కాపాలికా వ్రతము ధరించి భైరవుడు త్రిలోక సంచారి అయాడు .కాశీ లో కాల భైరవుడు నిరంతరం సంచరిస్తూ ఏ దోషాలు రాకుండా కాపాడుతాడు .అన్ని కోరికలను తీరుస్తున్నాడు .భైరవుడు కాశీ లో ప్రవేశించగానే ‘’బ్ర హ్మ హత్య ‘’భయ పడి పాతాళ లోకానికి పారి పోయింది .

                 సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-12-12-ఉయ్యూరు 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.