శ్రీ పరమాచార్య పరమపద పీయూషం -2

  శ్రీ పరమాచార్య పరమపద పీయూషం -2

‘’పాశ్చాత్యులకు మీరిచ్చే సందేశం ఏమిటి””? /అని ఒక సారి శ్రీ పరమాచార్యను అడిగితే వారు ‘’మీరు చేసే ఏ పని అయినా సరే దానికి ప్రేమ ముఖ్య కారణం గా ఉండాలి .కార్యం అంటే కర్త, కర్తకు భిన్నమైన ఇతరులూ ఉంటారు .కనుక కార్యం ప్రేమతో నిండి ఉండాలి ఒక్కోసారి ఇతరులను  హిమ్సించాల్సి వస్తుంది .యుద్ధాలు చేయాల్సి వస్తుంది .అప్పుడు కూడా మన హృదయం లో ద్వేషం ఉండ రాదు ‘’ఈ కర్మ సంస్కార కారణం గా చేయ బడుతోంది .దీనిలో ద్వేషానికి తావులేదు ‘’అన్నభావం ఉండాలి ప్రేమఓతప్రోతమైతే ఎలాంటి గడ్డు సమస్య అయనా మనం పరిష్కరించగలం .’’అని చెప్పారు .

స్వామికి ఉపవాసం ఉండటం చాలా ఇష్టం .చాలా రోజులు నిరాహారం గానే ఉండేవారు లేకపోతే గుప్పెడు పేలాలు పాలు లేక పెరుగు లో నాన బెట్టి స్వీకరించేవారట .ఉపవాసం శరీరానికి మనస్సుకు మంచిదని వారి భావం .పౌర్ణమి అమావాస్య ,శుక్ల అష్టమి చతుర్దశి పంచమి షష్టి తిదులు  ఉపవాసంకు  శ్రేష్టం అని భారతం లో ఉన్నట్లు తరచుగా స్వామి చెప్పేవారు మనం చేసే ప్రతి పనీ ఈశ్వరార్పణ బుద్ధి తో చేయాలని వారి అభిమతం .

         స్వామి ‘’కామ కోటి రామ కోటి ‘’అయిందని చమత్కరించేవారట .రామ కోటి రాసిన వారు వచ్చి ఇక్కడ స్వామికి సమర్పించేవారు .అయోధ్యలో పుట్టిన రాముడికి కంచిలోని కామాక్షి అమ్మవారికి ఏమిటి సంబంధం ?అని విచారించి వారు లలితా పరా భట్టారిక శ్రీ త్రిపుర సుందరి అయిన కామాక్షి అని ,శ్రీ రామ చంద్ర మూర్తి ,కామాక్షీ అమ్మవారూ ఒక్కరేనని అన్నారు .అందుకే రామాయణం లో సీతాదేవి భర్తను ‘’నువ్వు పురుషుడివి కావు స్త్రీవి ‘’అనటం లో ఇంత అంతరార్ధం ఉందని చెప్పారు .అది దెప్పి పొడుపు మాటే అయినా యదార్ధమే ఆమె నోటి లో నుంచి బయటకు వచ్చిందని సెలవిచ్చారు .

       ఒకసారి ‘’ఆర్ధర్ ఐషన్ బర్గ్ ‘’అనే విదేశీయుడు స్వామి వారిని దర్శించాడు .అతను ‘’నేను జ్ఞానిని అయితే మిమ్మల్ని అడగాల్సిన సరైన ప్రశ్న ఏది ?’’అని గడుసుగా అడిగాడు .పరమాచార్య ఎవరైనా ప్రశ్నిస్తే రెండు నిమిషాలు మౌనం లో ఉండి సమాధానం చెప్పటం అలవాటు .స్వామి ‘’మీరు జ్ఞాని అయితే ఏ  ప్రశ్నలూ  వేయరు ‘’అని బదులు చెప్పారు .అతనితో సుదీర్ఘ సంభాషణ జరిపి చివరికి ‘’మనం చేసే అన్వేషణే ఆనందం ,సుఖం .ఒక సుఖం పొందాము అంటే అది సుఖం కాదు .సుఖ స్వరూపం గా ఉండే సుఖం అని అర్ధం చేసుకోవాలి ‘’అన్నారు

   అద్వైతాన్ని వివరిస్తూ స్వామి ‘’అద్వైతం అంటే రెండవది లేనిది ..ఈ ప్రపంచం లో ఎన్నో చూస్తుంటాము ఇవన్నీ లేవు అంటే అసంగతం అవుతుంది అప్పుడు మన ప్రయత్నాకి ఫలం ఏమిటి మరి ?ఆకలి దరిద్రం దప్పిక రోగం పోగొట్టుకోవటానికి ఎంతో శ్రమ పడుతున్నాం ఇవి లేని చోటు ఉందా ?ఇవన్నీ దేహ ధర్మాలు .మనం చేసుకొన్నా కర్మ ఫలాన్ని అనుభవించటానికి దేహదారణ చేస్తున్నాం ఆత్మకు ఇవేవీ అంటవుకదా .ఈదేహమే మనం అనే భావన కల్గించి దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు ఈ ద్వంద్వాల పరిధి లో నుంచి బయట పడాలి ‘’దేహనా నాస్తి కించన ‘’అనే భావం ఏర్పడితే కోరికా భయం మొదలైన వేవీ ఉండవు ‘’ఆత్మావా ఇదమేక ఎవాగ్ర ఆసీ నాన్యత్కిమ్చన ‘’’’ఎకో దాదారభువనాని విశ్వా’’ఎకమేవాద్వితీయం ‘’అని అద్వైతంబోధిస్తోంది మనసును ఆత్మలో ఉంచాలి అద్వైత జ్ఞానం చేతనే వాసనలు నశిస్తాయి ప్రశాంతత ఏర్పడుతుంది పంచ భూతాలు సముత్తితాలైనప్పుడు యోగి శరీరం యోగాగ్ని మయమే అవుతుంది అప్పుడు ముసలితనం,భయం ,రోగం ,చావు ఉండవు అని శృతి చెప్పింది ‘’అని స్పష్టం చేశారు

     ఒక సరి దుర్గా దేవి ప్రతిష్ట సమయం లో స్వామి ‘’దుర్గా పంచరత్న స్తోత్రం ‘’అనే మంత్రాలను రాశారు

పరబ్రహ్మ అని మనం తెలిసో తెలీకో చాలా సార్లు అంటాం ఇంతకూ ఆయన ఎవరు ?అంబతో కూడిన పరమేశ్వరుడే ఆ పరబ్రహ్మ వేరే ఏదీ కాదు అన్నారు స్వామి .ఈశ్వర తత్త్వం సామ్బుడే నంటారు వారు అందుకే శంకర భగవత్పాదులు‘’దశ శ్లోకి ‘’లో ‘’తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబేపర బ్రహ్మణే ‘’అన్నారు ఈ సాంబ మూర్తి మీద హృదయాన్ని లగ్నం చేస్తే సుఖం గా వర్దిల్లుతామంటారు స్వామి

‘’ఆకాశ స్చికురాయతే దశ దిశాభోగో దుకూలాయతే

 శీతాం శుహ్  ప్రసవాయతే స్తిర తరానందః స్వరూపయతే

 వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే

తస్మిన్ మే హృదయం సుఖేన రమతం  సాంబేపరబ్రహ్మణే ‘’

    ఒక సారి పరమాచార్యుల వారికి కనకాభి షేకం చేయాలనే తలంపు భక్తులకు కలిగింది ఆ సందర్భం గా వారు ‘’మీరు నాకు పళ్ళూ పుష్పాలు సమర్పిస్తూఉంటారు  పద్యాలు రాసి పఠిస్తారు ఇవన్నీ నాకు కనకాభిషేకమే .ఇవన్నీ స్వీకరించటానికి నాకేమి అర్హత ఉంది అని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. ఒకే ఒక కారణం కని పిస్తోంది శ్రీ శంకర భగవత్పాదుల వారి దివ్య నామం ఏదో భాగ్య వశం చేత నాకు లభించి నందు వల్ల  అని అనుకొంటాను వారిపేర ఈ సేవలన్ని నాకు చేస్తున్నారని నా భావన ఇన్ని గౌరవ మర్యాదలు మీ నుండి పొందటానికి ఆ స్వాముల వారి గుణ గణాలను స్మరిస్తాను ‘’

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం –నమామి భాగ త్పాదం శంకరం లోక శంకరం ‘’

సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అన్నారు కదా మీరు చేసేవన్నీ ఆది శంకరులకే చెందుతాయని నేను బావిస్తున్నాను .వారికే వీటిని నేను మీ తరఫున సమర్పిస్తున్నాను. వీటిని పొందే అర్హత వారికి మాత్రమె ఉంది క.ర్మలన్నీ చేసి ‘’జనార్దనః ప్రీయతాం ‘’అంటాం కదా ఈ కర్మలన్నీ నా సంత్రుప్తికి కాదు ఆ జనార్దనుని సంత్రుప్తికి అని అందులో ఉన్న పరమార్ధం .మాకు కర్మానుస్టానమే విధి .ఈ కర్మలు ‘’పర బ్రహ్మాత్మనా స్తీయతాం ‘’అనే చివరి మెట్టుకు తీసుకొని పోతాయి అందుకే నిత్యం పరమేశ్వరుడినిప్రార్ధించాలి .ఆయన అనుగ్రహం కోరుకోవాలి ఆ శ్రద్ధ మనకు కలిగింది అంటే‘’బ్రహ్మైవాహం ‘’అనే అనుభవ సిద్ధి కలుగుతుంది .అలాంటి బ్రాహ్మీ స్తితియే కనకాభిషేకం .అంతే కాదు రాత్నాభిషేకమే అవుతుంది ‘’అని గొప్ప సమన్వయము తో ఎరుక పరచారు శ్రీ పరమాచార్యుల వారు అదీ వారి మహోత్రుస్టస్తితి .అదీ వారి పరమ పద పీయూష లహరి .

    సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-3-13

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.