
గుండెపోటుతో కన్నుమూత
ఎల్లుండి చెన్నైలో అంత్యక్రియలు
లవకుశలో సీతాదేవి పాత్రతో ఘనకీర్తి
సనీ,రాజకీయ ప్రముఖుల సంతాపం
చెన్నై, కాకినాడ, హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): తెలుగు సినీ స్వర్ణయుగానికి చెందిన మరో ద్రువతార దివికేగింది. తెలుగువారి సీతమ్మ తల్లిగా పేరొందిన అలనాటి మేటి నటి.. అంజలీదేవి ఇక లేరు! సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. అశేష అభిమానులనూ శోకసంద్రంలో ముంచి మరలిరాని లోకాలకు తరలిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను రెండు రోజుల క్రితం చెన్నైలోని విజయా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇద్దరు కుమారులు చిన్నారావు, నిరంజన్ కుమార్ ఉన్నారు. అమెరికాలో ఉన్న మనవరాళ్లు రావల్సి ఉన్నందున గురువారం ఉదయం చెన్నైలోని బిసెంట్నగర్ శ్మశానవాటికలో దహనక్రియలు నిర్వహిస్తామని ఆమె కుమారుడు చిన్నారావు తెలిపారు. అంతవరకూ అంజలీదేవి పార్థివ దేహాన్ని స్థానిక రామచంద్ర ఆస్పత్రిలో ఉంచుతున్నట్లు చెప్పారు.

ఇదీ నేపథ్యం..
ఎనిమిదేళ్ల వయసులోనే రంగస్థల నటిగా కెరీర్ ఆరంభించిన అంజలీదేవి అసలు పేరు అంజనీ దేవి. 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో నూకయ్య, సత్యవతి దంపతులకు ఆమె జన్మించారు. పెద్దాపురం ఆ రోజుల్లో నాటకప్రదర్శనలకు పెట్టింది పేరు కావడంతో.. చిన్నతనంలోనే ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. తదనంతరకాలంలో అంజలీదేవికి భర్త అయిన ఆదినారాయణ రావు.. ఆమె తండ్రి నూకయ్యకు ఆప్తమిత్రుడు. అప్పట్లో ఆయన కాకినాడలోని యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో కీలక వ్యక్తిగా ఉండేవారు. దీంతో నూకయ్య తన కుమార్తెను నటిగా తీర్చిదిద్దే బాధ్యతను ఆదినారాయణరావుకు అప్పగించారు. దీంతో అంజలీదేవి మొట్టమొదటిసారిగా ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం కోసం ముఖానికి రంగు వేసుకున్నారు. ఆ నాటకంలో ఆమె లోహితాస్యుడి పాత్ర ధరించారు. ఆ తర్వాత.. స్ట్రీట్ సింగర్, లోభి, ఖిల్జీ రాజపత్రం ఇలా పలు నాటకాల్లో పాత్రలు పోషించారు. అనతికాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని క్లబ్లో నెలకు రూ.100 పారితోషికంతో శాశ్వత హీరోయిన్గా ఎంపికయ్యారు.

స్ట్రీట్ సింగర్ నాటకంలో ఆమె ఎస్వీరంగారావు సరసన హీరోయిన్గా నటించారు. పన్నెండేళ్ల వయసులోనే ఆదినారాయణరావును వివాహం చేసుకున్నారు. పెళ్లికి ఆవిడ పెట్టిన షరతు ఒక్కటే.. ‘పెళ్లయ్యాక కూడా నేను నటిస్తాను. అందుకు అంగీకరిస్తేనే పెళ్లి’ అని! ఇందుకు ఆదినారాయణరావు ఆనందంగా అంగీకరించడంతో వారి పెళ్లయింది. అక్కణ్నుంచీ వారి అడుగులు చెన్నపట్నం వైపు పడ్డాయి. వెండితెరపై అవకాశాలకు అంజలీదేవి పెద్దగా కష్టపడింది లేదు. నాటకాల్లో ఆమె ప్రతిభను అప్పటికే ఒకసారి తిలకించిన ప్రముఖ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య.. అంజలి కోసం ఒక వ్యక్తితో కబురంపారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ప్రముఖ హాస్యనటుడు రేలంగి. అప్పటికి అంజలీదేవి ఇద్దరు పిల్లల తల్లి. అయినా సరే, తన చిత్రంలో పాత్రకు ఆమె అయితేనే సరిపోతారని భావించి రేలంగిని పంపించి మరీ ఒప్పించారు పుల్లయ్య. ఆ సినిమా.. మీర్జాపురం రాజా నిర్మించిన ‘గొల్లభామ’. అందులో అంజలీదేవి వేసింది వ్యాంప్ క్యారెక్టర్. సినీరంగంలో ఏ నటికైనా ఆమె వేసే మొదటిపాత్రే ఆమె కెరీర్ను నిర్ణయిస్తుంది. అంజలీదేవి విషయంలోనూ అదే జరిగింది. వరుసపెట్టి అలాంటి పాత్రలే రావడం మొదలైంది. ఉదాహరణకు కీలుగుర్రంలో రాక్షసి పాత్ర. పగలు అందమైన అమ్మాయిగా ఉంటూ రాత్రవగానే రాక్షసిగా మారి గజశాలలో దూరి ఏనుగుల్ని తినే పాత్ర వేశారు.
అయితే.. వాటన్నిటికీ భిన్నంగా వచ్చిన ‘శ్రీలక్ష్మమ్మ కథ’, ‘పల్లెటూరి పిల్ల’ ఆమె కెరీర్ను మలుపు తిప్పాయి. ముఖ్యంగా పల్లెటూరి పిల్ల సినిమా తర్వాత అంజలి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. నిర్దోషి, అనార్కలి, సువర్ణ సుందరి, స్వర్ణమంజరి, సతీ సక్కుబాయి, చరణదాసి, భక్త తుకారాం.. ఇలా ఎన్నో మంచి చిత్రాలు, చక్కటి పాత్రలు. లవకుశ చిత్రం అంజలీదేవి కీర్తికిరీటంలో కలికితురాయి. ఆరుదశాబ్దాల సినీ కెరీర్లో 400కు పైగా చిత్రాలో నటించినా ఆమెకు సంతృప్తినిచ్చి, నటిగా చిరంజీవిని చేసింది మాత్రం ‘లవకుశ’లోని సీత పాత్రే. ఆ సినిమా విడుదలై 50 ఏళ్లు దాటినా సీతమ్మతల్లిగా అంజలీ దేవి ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతస్థానం సంపాదించుకున్నారు. రాముడు అనగానే ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో.. సీతాదేవి అనగానే అంజలీదేవి గుర్తొచ్చేంతగా చెరగని ముద్ర వేశారు. ఇక.. అంజలీదేవి నటించిన చివరి చిత్రం 1994లో విడుదలైన పోలీస్ అల్లుడు. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు.. హిందీలో సైతం దాదాపు 30 సినిమాల్లో నటించి, అక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆమెది.
నిర్మాతగా..
నటిగా తన ప్రతిభను నిరూపించుకున్న అనంతరం అంజలీదేవి నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. తొలిగా ఆమె అక్కినేని నాగేశ్వరరావు, మేకప్మన్ గోపాలరావులతో కలిసి అశ్వనీ పిక్చర్స్ బేనరుపై ‘మాయలమారి’ చిత్రాన్ని నిర్మించారు. కానీ, ఒక సినిమాతోనే ఆ సంస్థ మూత పడింది. ఆ తరువాత 1951లో అంజలీ పిక్చర్స్ సంస్థను ఏర్పాటు చేసి సొంతంగా చిత్రాలను నిర్మించారు. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘పరదేశి’. తమిళ సినిమా మూలస్తంభాల్లో ఒకరుగా పేరొందిన శివాజీగణేశన్ ఆ చిత్రంతోనే వెండితెరకు పరిచయమయ్యారు. అలాగే.. తెలుగు చిత్రాల్లో స్లో మోషన్ ఫొటోగ్రఫీని ఈ సినిమాలోనే తొలిసారిగా ఉపయోగించారు. అనంతరం ‘అనార్కలి’, ‘సువర్ణసుందరి’ (తెలుగుతో పాటు హిందీలోనూ రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఘనవిజయం సాధించింది), భక్త తుకారాం’, ‘మహాకవి క్షేత్రయ్య’ వంటి చిత్రాలు తీశారు. అలాగే, తన కుమారుడు చిన్నారావు పేరిట చిన్ని బ్రదర్స్ సంస్థను ఏర్పాటు చేసి ‘సతీసుమతి’ తదితర చిత్రాలు నిర్మించారు. అంజలీ పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రాల్లో కథావిలువలే కాకుండా సంగీత సాహిత్యాలకు అధిక ప్రాధాన్యం ఉండేది. తర్వాత కాలంలో.. అంజలీ టెలీ ఫిలింస్ బేనర్పై ‘షిర్డీసాయి-పర్తిసాయి’ టీవీ సీరియల్ నిర్మించారు. అందులో పోషించిన ఈశ్వరీబాయి పాత్ర తనక ఎంతగానో సంతృప్తినిచ్చిందని చెప్పేవారామె. చివరిదశలో చెన్నైలోని తన స్వగృహంలో సాయిదేవాలయం నిర్మించుకుని బాబా ధ్యానంలో ప్రశాంత జీవనం గడిపారు.
ప్రముఖుల సంతాపం
అంజలీదేవి మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అంజలీదేవి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతి తెలుగు చిత్ర రంగానికి తీరని లోటని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సినిమాల్లో గౌరవప్రదమైన పాత్రల్లో నటించి తనదైన ప్రత్యేక బాణిని సృష్టించుకున్న మేటి నటి అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నటనలో ఆమె సాధించిన పరిణితి తర్వాతి తరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. గొల్లభామ, కీలుగుర్రం, అనార్కలి, సువర్ణసుందరి.. లవకుశ వంటి చిత్రాల్లో ఆమె నటనను ప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోలేరని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ అన్నారు. తెలుగు చిత్రసీమలో అనేక దశాబ్దాల పాటు తిరుగులేని అభినేత్రిగా ప్రకాశించిన నటి అంజలీదేవి అని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి.నారాయణరెడ్డి కొనియాడారు. అంజలీదేవి-ఆదినారాయణరావు దంపతులు నిర్మించిన ఎన్నో చిత్రాలకు తాను రాసిన గీతాలు బహుళ ప్రజాదరణ పొందాయని గుర్తు చేసుకున్నారు. ఇంకా.. తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, వైసీపీ అధ్యక్షుడు జగన్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, సీనియర్ నిర్మాతలు కె.మురారి, కాట్రగడ్డ ప్రసాద్, గీత రచయిత భువనచంద్ర, ఊర్వశి శారద, సాహితీ విమర్శకులు వీఏకే రంగారావు, పుట్టపర్తిలోని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు ఆర్జే రత్నాకర్, శ్రీనివాసులు, చక్రవర్తి తదితరులు సంతాపం తెలిపారు.
ఏ అవార్డుకూ నోచుకోలేదు!
చాలామందికి ఆశ్చర్యం అనిపించొచ్చుగానీ.. ప్రైవేటు పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు తప్ప రాష్ట్ర ప్రభుత్వపరంగా గానీ, కేంద్రప్రభుత్వం నుంచిగానీ గొప్పగా భావించే గౌరవ పురస్కారాలు ఏవీ అంజలీదేవికి అందలేదు. ఈ విషయమై ఏనాడూ ఆవేదన వ్యక్తం చేయని ఆమె ఒక్కసారి మాత్రం.. అవార్డులకు కొలమానం ఏమిటనే సందేహం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాలకు ఎవరు, ఎవర్ని ఎలా ఎంపిక చేస్తారనే విషయం తనకు తెలియదన్నారు. తమిళులు తమిళ సెల్వి, కలైమామణి వంటి పురస్కారాలతో ఆమెను నెత్తిన పెట్టుకుంటే.. సొంత రాష్ట్రం మాత్రం ఆమెకు ఏనాడూ తగిన గౌరవం ఇవ్వలేదు. ఆ దిగులు మాత్రం అప్పుడప్పుడూ ఆమె మాటల్లో కనిపించేది.
పట్టపర్తితో అనుబంధం
పుట్టపర్తి: సత్యసాయి భక్తురాలైన అంజలీదేవికి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తితో ప్రత్యేక అనుబంధం ఉంది. తరచూ ఆమె పుట్టపర్తికి విచ్చేసి సత్యసాయిని దర్శించుకునేవారు. సత్యసాయి జీవిత చరిత్రపై తీసిన టీవీ సీరియల్లో సత్యసాయి మాతృమూర్తి అయిన ఈశ్వరమ్మ పాత్ర పోషించారు. ఆ పాత్ర పోషించడం తన పూర్వ జన్మ సుకృతమని చెప్పేవారు. సత్యసాయి శివైక్యం పొందిన తరువాత ప్రతి ఏడాదీ జయంతి వేడుకల్లో పాల్గొంటూ వచ్చారు.
