మురిపించి ముగిసిన వేయిపడగలు

 

మురిపించి ముగిసిన వేయిపడగలు

హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుంచి ఇరవై రెండు వారాలుగా శనివారం ఉదయం ఎడుమ్బావుకు ప్రసారమైన తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వ నాద సత్యనారాయణ గారి వేయిపడగలు నవలకు మలచబడిన రేడియో నాటకం కిందటి వారం తో పూర్తికాగా ఈరోజు దానిపై విశ్లేషణ స్పందన ప్రసారమైంది .ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు సహృదయ స్పందన తెలిపి అభినందించారు .ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ఈ నాటకాన్ని ప్రసారం చేయటం కష్టతరం అనుకోన్నామని దీన్ని నాటకం గా మలచటానికి దిట్టకవి శ్యామలాదేవి గారు సర్వ సమర్ధురాలు అనే నమ్మకం తో అప్పగించామని మొదటి ఎపిసోడ్ ఆమె రాసి చూపిస్తే అద్భుతం గా వచ్చిందని పించిందని ఆమెనే పూర్తిగా రాయమని చెప్పానని ,తనకున్న నమ్మకాన్ని ఆమె కున్న శేష సాహితీ ప్రజ్ఞ ను జోడించి ,శ్రోతలకు హృదయ స్పందన కలిగేట్లు రాశారని ఇది చాలా అసాధారణ విషయమని అందుకే ఇంత అసాధారణ  విజయాన్ని సాధించిందని ,రాష్ట్రం లోను రాస్త్రేతరం లోను శ్రోతలు రేడియో ద్వారా డైరెక్ట్ టు హోమ్ ప్రసారం ద్వారా విని పులకించి పోయి నట్లు ఉత్తరాలద్వారా మెయిల్స్ ద్వారా ఫోన్ల ద్వారా స్పందన లను తెలియ జేసి తమ ప్రయత్నానికి గొప్ప విజయం చేకూర్చారని, గాత్రదారులందరూ అత్యంత సమర్ధ వంతంగా పాత్రలను పోషించారని సరోజా నిర్మల గారు ఇంత భారీ ప్రాజెక్ట్ ను బ్రహ్మాండమైన బాక్ గ్రౌండ్ సంగీతం ఎఫెక్ట్ లతో తీర్చిదిద్దారని ఇదంతా సమష్టి విజయమని ,మంచి కార్యక్రమాలకు ఎప్పుడూ శ్రోతల ప్రోత్సాహం ఉంటుందని రుజువైంది అన్నారు .అందరికి కృతజ్ఞతలను తెలియజేశారు .శ్రోతల కోరిక పై ఈ నాటకాన్ని రాత్రి వేళ తొమ్మిదిన్నర గంటలకు త్వరలో మళ్ళీ ప్రసారం చేయబోతున్నామని తెలిపారు శ్యామలాదేవి తనకు ఈ ప్రాజెక్ట్ లో పని చేసే అదృష్టం కలిగించిన ఆకాశవాణి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు .ఇంత గొప్ప ఆదరణ లభించటం సహృదయ శ్రోతల సంస్కారానికి అద్దం పట్టటమే నన్నారు .ఇది అందరి విజయం అని వినయం గా చెప్పారు

శ్రీ  ఆదిత్య ప్రసాద్ మరొక గొప్ప ధారావాహికను త్వరలో ప్రసారం చేయబోతున్నామని అది ప్రసిద్ధ రచయిత ,సినీ  కవి స్వర్గీయ వేటూరి సుందర రామ మూర్తి గారు 1970లో రాసిన ‘’సికాకోలు సిన్నది ‘’అనే సంగీత నాటకాన్ని పూర్తీ హంగులతో మరలా ప్రసారం చేయబోతున్నామని దీన్ని కూడా శ్రోతలు విని ఆదరించాలని ప్రతి ఎపిసోడ్ లోను ప్రసిద్ధులైన వారి చేత విషయ వివరణ చేయిస్తామని అన్నారు .నాటకం లో చివరి భాగం లోని  ‘’నీవు మిగిలితివి –నేను మిగిలితిని ‘’అన్నధర్మా రావు వాక్యాలతో ఈ స్పందన కార్యక్రమాన్ని ముగించారు  .

ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి మొదటి ఎపిసోడ్ వినగానే ఆక్షణమే ఫోన్ చేసి అభినందించాను. ఇవాళ ఈ ముగింపు ఎపిసోడ్ పూర్తీ అవగానే ఫోన్ చేసి మళ్ళీ అభినందిస్తూ ‘’అప్పుడే అయిపోయిందా ?’’అని పించిందని  ఇంత మహాద్భుత కార్యక్రమాన్నిఇంత  గొప్ప గా నిర్వహించినందుకు  హృదయ పూర్వక అభినందనలను అందజేశాను .ఆయనకూడా చాలా ఆనంద పడ్డారు .తామూ ఇంత గొప్ప స్పందన ను ఊహించలేదని అంచనాలకు మించి విజయం సాధించిందని అది విశ్వనాధ దార్శనికతకు విజయమని తాము నిమిత్త మాత్రులమే నని అన్నారు .నేను చివరి రెండు ఎపిసోడు లను వినలేక పోయానని చెప్పగా ‘’మీ లాంటి వారి కోసమే మళ్ళీ రాత్రి పూట త్వరలో ప్రసారం చేస్తున్నాం వినండి ‘’అని నవ్వుతూ అన్నారు .

త్వరలో 26 ఎపిసోడ్ లతో వేటూరి వారి ‘’సికాకోలు సిన్నది ‘’సంగీత రూపకం  మళ్ళీ అన్ని హంగులు సమకూర్చి ప్రసారం చేయబోతున్నామని చెప్పారు .నటుడు బాల కృష్ణ దీన్ని సినిమా గా తీసే ప్రయత్నం కూడా ఒకప్పుడు చేశాడని తెలిపారు .ఆయనతోఒక ఎపిసోడ్ కు ముందు మాట్లాడిస్తామన్నారు  వేటూరి వారి అబ్బాయి తోను ప్రతి ఎపిసోడ్ లోను ముందుగా వేటూరి వారి జీవిత విశేషాలను చెప్పిస్తామని అలాగే వేటూరి  వారితో పరిచయం ఉన్న లబ్ధ ప్రతిస్టూలైన వారందరినీ ఇందులో స్పందన తెలియ జేయటానికి ఆహ్వానించి ప్రసారం చేస్తామని ఆనందం గా తెలియజేశారు .హైదరాబాద్ ఆకాశ వాణికి అచ్చ తెలుగుదనం దిద్దుతున్నందుకు అభినందనలు అన్నాను .ఆయన నవ్వి ‘’ఈ మధ్య ,65మంది వివిధ భాషాకవులతో కవి సమ్మేళనాన్ని నిర్వహించానని బహుశా ఏ రాష్ట్ర కేంద్రం లోను ఇలా ఎవరూ ప్రయోగం చేయలేదని దీన్ని పరిశీలించటానికి ధిల్లీ నుండి అయిదుగురు కేంద్ర ప్రముఖులు వచ్చారని  ఎంతో సంతృప్తి చెందారని రాష్ట్ర గవర్న ర్ గారు ఈ కార్య క్రమం లో పాల్గొని ఆశీర్వదించారని వారికి ఒక రేడియో ను తాము బహూకరించి కార్యక్రమాలు వినమని కోరామని నవ్వుతూ చెప్పారు .ఆయన సహజ శైలిలో ‘’మాస్టారూ !ఇలా ముందుకు వెడుతున్నాం ‘’అన్నారు .నిగర్వి ప్రచారార్భాటం అక్కర్లేని అనుక్షణ కార్య శీలి ,ప్రయోగ శీలి శ్రీ ఆదిత్య ప్రసాద్ .’’ఇంకా ఏమేం ప్రాజెక్టులు మీ మనసులో ఉన్నాయ్ ?’’అని నేను అడిగితే ‘’తెలుగు చారిత్రిక నవల కు116ఏళ్ళు వచ్చిన సందర్భం గా శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారి ఒక చారిత్రతక నవల ను చదివించే ఆలోచన ఉన్నది’’ అన్నారు అప్పుడు నేను ‘’ఇటీవల మేము అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ ‘’టోరి’’అనే అంతర్జాతీయ రేడియో కార్యక్రమంలో వారడిగిన ప్రశ్న లకు సరైన సమాధానాలు ,చెప్పినందుకు నాకు ముదిగొండవారి ‘’పట్టాభి ‘’అనే అమరావతి ప్రభువు వెంకటాద్రి నాయుడి పాలన కాలానికి సంబంధిన చారిత్రాత్మక నవలను, మహా మంత్రి తిమ్మరుసు డి.వి.డి ని కానుకగా ఇచ్చారని చెప్పగా సంతోషించారు .ముదిగొండ ‘’మరో పాకుడు రాళ్ళు ‘’అనే నవల రావూరి భరద్వాజ గారి పాకుడు రాళ్ళు నవలకు కొనసాగింపుగా రాశారని ,దాని మీద కూడా ద్రుష్టి ఉందని అన్నారు .చాలా ఓపికగా సంతోషం గా నాతో పావు గంట సేపు ముచ్చటించిన ఆదిత్య ప్రసాద్ గారి సంస్కారానికి నమస్సులన్దించాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రేడియో లో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.