గురువులకు గురువు -దేవీ స్వరూపిణి ఆనందమయీ మా
ఆమె సన్నిధే దైవ సన్నిధి .ఆమె సమక్షం ఆనంద రసప్లావితం .ఆమె వాక్కు పరావాక్కు . ఆమె గురువులకు గురువు అని పించు కొన్న దైవీ స్వరూపిణి అయిన ఆనందమాయీ మాత .అసలు పేరు నిర్మలా సుందరి .తూర్పు బెంగాల్ లో ఖొరా లో 1896లో ఏప్రిల్ 30న సంప్రదాయ కుటుంబం లో జన్మించింది .పసి తనం లో నే ముసి ముసి నవ్వులతో ముంచేసేది. అందుకే ‘’నవ్వ్వుల తల్లి ‘’అని ‘’సంతోషీ మా’’ అని పిలిచేవారు .పుట్టిన తర్వాత యేడవనే లేదు ,పరమ ప్రశాంతం గా ఉండేది .ఎప్పుడూ సమాధి స్తితిలో ఉన్నట్లు కనిపించేది .ప్రక్రుతి సౌందర్యానికి పరవశించేది .మాంసం చేపలు తినేదికాదు .ప్రతి పని అతి శ్రద్ధగా సంపూర్ణం గా చేసేది
ఆనందమయి కి పదమూడవ ఏట భోలానాద అనే యోగ్యునికిచ్చి వివాహం చేశారు .అనేక తాత్కాలిక ఉద్యోగాలు చేస్తూ అనేక ఊర్లు తిరిగేవాడాయన .ఆయన బంధువులలోనూ ఈమె అణకువ ,సంతోషం ఉన్న స్త్రీ గా పేరు తెచ్చుకోంది.పద్దెనిమిదవ ఏట అస్టగ్రామానికి లో భర్త తో కాపురానికి వెళ్ళింది .ఆమె తో దాంపత్య సుఖానికి ప్రయత్నిస్తే భర్తకు కరెంట్ షాక్ కొట్టినట్లయింది .ఇంకా వ్యక్తిత్వం రాలేదని సరి పెట్టుకున్నాడు .ఆమె దైవీ స్వరూపం అని గ్రామస్తులు భావించారు .పూజలో భజనలో ఆమె యిట్టె సమాధి స్తితికి వెళ్ళేది .
1916లో ఆరోగ్యం బాగుండక తలిదండ్రుల దగ్గరకు వెళ్ళింది .ఆరోగ్యం కుదుటపడిన రెండేళ్లకు మళ్ళీ భర్తను చేరింది .అంతకు ముందెన్నడూ వినని చదవని వేదం మంత్రాలు ఆమె నోటి నుండి ఆశువుగా వచ్చేసేవి .విన్న వారందరూ ఆశ్చర్యం ఆనందం పొందే వారు .అతి తేలికగా హఠ యోగం చేసేది .అప్పుడు ఆమెకు ‘’నువ్వే అన్నీ .నువ్వే శక్తివి ‘’అన్న అంతర్వాణి విని పించింది .తాను ఈ అనంతశక్తిలో ఒక శకలం అన్న భావన కలిగింది .ఇదొక శక్తి ప్రవాహం గా ఆమెకు సహకరించి ఎందరో రోగగ్రస్తుల కు వరమై స్పర్శ చేతనే వ్యాధులను నయం చేసింది .నిరంతరం వేద మంత్రాలు నాలుకచివర నుండి పలికేవి .
1922 ఆగస్ట్ మూడు న ఆంతరంగిక ప్రేరణ తో గురువు శిష్యుడు తానే అయి బీజాక్షరాలను అకస్మాత్తుగా పలికింది .ఆమె భర్తకంటే తాను కొంత ఉత్కృష్ట స్తితి లో ఉన్నట్లు గ్రహించింది .అయిదు నెలల తర్వాత భర్తకే మంత్రోపదేశం చేసి ప్రత్యక్ష గురువే అయింది .అతన్ని రెండు గంటలు సమాధి స్తితిలో ఉండేట్లు చేసింది .అప్పుడు భర్త భోలా నాద కు తాను పూర్ణ బ్రహ్మ నారాయణుడినని ,దైవాన్ని అని ఎరుక కలిగింది .అపుడు ఆయన లో ‘’ఇంతకీ ఈమె ఎవరు ?’’అనే జిజ్ఞాస కలిగింది .ఆమె లో దైవీ శక్తులు కేంద్రీకరించి ఉన్నాయని గ్రహించాడు .ఆమె క్రమం గా ఆహారం నిద్రలకు దూరమవుతోంది .మా మూడేళ్ళు పూర్తీ మౌనం గా ఉండి పోయింది .కుటుంబం ఢక్కా లోని షాభాగ్ గార్డెన్స్ కు మారింది .ఒక్కోసారి పన్నెండు గంటలు సమాదిలోనే ఉండి పోయేది మా .ఆమె లో అద్భుత మైన కాంతి పుంజం గోచరించేది. నిర్వికల్ప సమాధిలో ఉండిపోయేది .
ఢక్కా దగ్గర సిద్దేశ్వరిలో ఉన్న పురాతన కాళికా దేవాలయానికి ఒక సారి వెళ్ళింది .అక్కడే చిన్న ఆశ్రమాన్ని ఏర్పరచుకొని రాత్రిళ్ళు గడిపేది .1924 -28వరకు ఇక్కడే మా ఉండి పోయింది .అనుచరులేర్పడ్డారు .డజనుకు పైగా చోట్ల ఆశ్రమాలేర్పరచారు .1925లో మౌనాన్ని వదిలి సంభాషించటం మొదలు పెట్టింది .ఆమె ను దర్శిస్తే దివ్యానుభూతి కలుగుతుందనే అభిప్రాయం బాగా వ్యాపించింది .హిందూ ముస్లిం క్రిస్తియన్లు కూడా అదే అనుభవాన్ని పొందేవారు .కాళీ దేవికి నిత్య పూజాదికాలు చేయాబోతు పూలు తన శిరస్సునే ఉంచుకోవటం ,అమ్మవారికి పూయాల్సిన చందనాన్ని తానే పూసుకోవటం పరవశ స్తితి లో చేసేది .వేలాది మంది చేరేవారు .వారూ అదే పరవశాన్ని అనుభవించేవారు .అందరి కస్టాలు తనవిగా భావించి తనలో ఆపాదిన్చుకోనేది.అప్పుడు అందరూ ఆమెను ‘’ఆనంద మయీ మా ‘’.అని కీర్తించటం ప్రారంభించారు. ఆ పేరే స్తిర పడింది .భోలానాద్ ను’’ భాయీజీ ‘’ అని ఆప్యాయం గా పిలిచేవారు .ప్రార్ధన గీతాలను పారవశ్యం గా పాడి అందరిని భక్తీ లో ఓలలాడించటం మా ప్రత్యేకత .ఈ సమయం లో ఆమె శరీరం లో అనేక వింత మార్పులు గోచరించేవి .భూమి మీద పడుకోన్నప్పుడు శరీరం విపరీతమైన పొడవు పెరిగేది .,లేక పోతే అతి చిన్నదిగా కుంచించుకునేది .ఇంకోసారి రబ్బర్ బంతిలా గుండ్రం గా అయ్యేది .ఇవన్నీ మేరపు వేగంతో జరిగిపోయేవి .మరోసారి మధ్యాహ్నం నుండి సాయం సంధ్య వరకూ విపరీతం గా ఏడుస్తూ కూర్చునేది . .సిద్దేశ్వరిలో ఒకసారి ఆమె శరీరం ఉన్నట్టుండి సంకోచించి క్షణాల్లో అదృశ్యమై,చీరలో ఒక చిన్న ముక్క మాత్రమె మిగిల్చింది .అంతే వేగం తో యదార్ధ స్తితి పొందింది .


1924లో ఆహారం తీసుకొనే శక్తినే కోల్పోయింది .ఒక భక్తురాలే తినిపించేది .అనేక గంటలు రోజులు ఉపవాసం ఉండేది ఆరు నెలలు రోజుకు ఆరుగింజలు మాత్రమె తిన్నది .చెట్టునుండి రాలిన పండ్లను ఒకటో రెండో తినేది . ఎనిమిది నెలలు మధ్యాహ్నం రాత్రి మూడేసి ముద్దలు మాత్రమే తినేది .అయిదు నెలలు వారానికి రెండు సార్లే అన్నం ముద్దలు తినేది .డాక్టర్ శశాంక మోహన ముఖోపాధ్యాయ ఆయన కూతురు ఖుక్ని మాతకు శిష్యులై ఆన్తరంగికులైనారు .గురుప్రియ దేవిగా మారిన ఖుక్ని మా పై పదిహేడు గ్రంధాలను బెంగాలీ భాషలో ,పందొమ్మిది గ్రంధాలను హిందీ లో రాసి ఆనందమాయీ మా లీలా విభూతిని ప్రపంచానికి చాటింది .1950లో శిష్యులు ‘’శ్రీ శ్రీ ఆనందమయీ సంఘం ‘’ఏర్పరచారు .మా పర్యటనలు జరుపుతూ వేదాంత విషయాలను బోధించేది .1926లో ఉత్తర ,మధ్య భారతాన్నంతా తిరిగి జ్ఞాన బోధ చేసింది .1927లో కాశీ ప్రయాగ రుషీకేష్ మొదలైన పుణ్యక్షేత్ర సందర్శనం శిష్యులతో సహా చేసింది .ఉత్తర ప్రదేశ్ లో వింధ్యాచలం లో ఒక ఆశ్రమాన్ని స్తాపించింది .వారణాసి లో మహా మహోపాధ్యాయ గోపీ నాద కవిరాజ్ ను కలిసింది .ఆయన వెంటనే శిష్య పరమాణువైనాడు . ఆమేలో భగవత్ ప్రేరణ కలిగింది .దీన్ని ‘’ఖేయాల ‘’అన్నారు .ఆమె 36వ పుట్టిన రోజు వేడుకలను ఇరవై ఒక్కరోజులు ఘనం గా నిర్వహించారు భార్యా భర్తలు డేహ్రా డూన్ చేరి కొన్ని రోజులున్నారు .1934లో సిమ్లా కు వెళ్ళగా రాజు దుర్గా సింగ్ శిష్యుడైనాడు అక్కడ ఆనందమాయీ సంఘాన్ని స్తాపించారు .నెహ్రు భార్య కమలా నెహ్రు మా ను దర్శించి అనుభూతి చెందింది .1936లో పురుష సహకారం లేకుండా ఉత్తరభారత సందర్శనం చేసింది .టిబెట్ లోని శివ ధామం కైలాస శిఖరాన్ని సందర్శించింది
1938మే నెల ఏడవతేది మా భర్త భోలా నాద కు మసూచికం సోకి చని పోయాడు .అమ్మ శక్తి ప్రభావానికి అందరూ లోనయ్యారు .పెద్ద వాళ్ళను అమ్మా నాన్నా అని పిల్లలను బిడ్డలారా స్నేహితులారా అనీ సంబోధించేది .ఆస్ట్రేలియాకు చెందిన ప్రుముఖుడొకడు వచ్చి అమ్మ ప్రభావం చూసి అంతే వాసి అయ్యాడు .’’అంతా ఆయనదే నీది నాదీ ఏమీలేదు ‘’అని అందరికీ చెప్పేది మా .’’విచారం వద్దు సంతోషం గా ఉండండి ‘’అని బోధించేది .జీవితాన్ని దైవ లీల గా భావించేది .1974ఆగస్ట్ 27న మా మహాసమాధి చెందింది .పరమ హంస యోగా నంద మా జీవిత చరిత్ర’’ఒక యోగి ఆత్మ కద ‘’పేర రాశారు వారణాసి లో పేదలకు ఉచిత వైద్య సేవ లన్దించటా నికి ఒక హాస్పిటల్ ను నిర్మించారు విద్యా సంస్థలను ఏర్పరచి ఉచిత విద్య బోధిస్తున్నారు . మధ్య ప్రదేశ్ లో ఓంకారేశ్వర్ దగ్గర ట్రై బల్స్ కోసం ఒక ఉచిత విద్యాకెన్ద్రాన్ని ఏర్పరచి వారి సర్వతొముఖాభి వృద్ధికి కృషి చేస్తున్నారు ఇలా మాపేరఎన్నో సే వాకార్యక్రమలను అందిస్తూ ప్రజా పురోగతికి తోడ్పడుతున్నారు
‘’మీ బాధలూ విచారాలు నాకు తెలుసు .ఒకే ఒక ఆత్మ ఉంది నువ్వు నేను ఆ ఆత్మా లమే.మీరేవ్వరో నేనూ మీ లాంటి దానినే .ఒకే ఒక చిదానందం యొక్క రూపాలే మీరూ నేనూ .ఈ చిన్న పిల్ల ఎప్పుడూ మీతోనే ఉంటుంది .’’అని మా బోధనలో సారాంశం .మా పై దాదాపు ఇరవై పుస్తకాలు వెలువడి ఆమె భావ వ్యాప్తికి తోడ్పడ్డాయి .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-14-ఉయ్యూరు
