కవి శిఖరం కేదార్‌నాథ్ (వివిధ) -ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

కవి శిఖరం కేదార్‌నాథ్ (వివిధ) -ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

కేదార్ ప్రతి రచనలోనూ ప్రజాస్వామిక ఆకాంక్షలు, స్వేచ్ఛావాదం ప్రతిఫలి స్తాయి.. ఏది రాసినా ఆయన అద్భుతమైన ప్రతీకలతో, గాఢమైన భావాలతో మనను కట్టిపడేస్తారు. ప్రకృతి ఆయన కవిత్వంలో ప్రధానమైన అంశం. శ్రీశ్రీలాగా ఆయనకు కూడా కాదేదీ కవితకనర్హం. పార, కూరగాయలు తరిగే కత్తి, విరిగిపడిపోయిన ట్రక్కు.. ఇవన్నీ ఆయనకు కవితా వస్తువులే. జానపద సంగీతంలోని లయ ఆయనకు ఎంతో ఇష్టం. వాటిని ఆయన కవిత్వంలో ప్రవేశపెడతారు. సంగీతం, ఒంటరితనం, కవిత్వం.. ఈ మూడే నాకు అత్యంత ఇష్టమైనవి.. అని కేదార్‌నాథ్ అంటారు.

‘రాలిపోతున్నాయి వేపచెట్టు ఆకులు.. పెరిగిపోతోంది మనసులో నైరాశ్యం..’ అని జీవితంలో ఖాళీతనాన్ని చిత్రించిన కవి, సాహిత్య విమర్శకుడు, అధ్యాపకుడు కేదార్‌నాథ్ సింగ్‌కు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే ఎంతో సంతోషం కలిగింది. 1988లో డా.సి.నారాయణరెడ్డికి ఈ అవార్డు వచ్చిన తర్వాత మళ్లీ ఈ పురస్కారం లభించిన లబ్దప్రతిష్టులైన గొప్ప కవుల్లో కేదార్‌నాథ్ ఒకరు.

హిందీలో గొప్ప కవులెందరో ఉన్నారు. హరివంశరాయ్ బచ్చన్, దినకర్, నిరాలా, అజ్ఞేయ, సుమిత్రానందన్ పంత్, సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా, మహదేవి వర్మ, నిర్మల్ వర్మ.. వీరు కవిత్వంలో ఉన్నత ప్రమాణాలు సాధించినవారు. మానవీయ విలువల్ని ప్రతిబింబించిన వారు. వారి శ్రేణికి కేదార్‌నాథ్ సింగ్ వస్తారనడంలో సందేహం లేదు. నిజానికి అంతర్జాతీయ ప్రమాణాలతో సాహిత్యాన్ని సృజించిన ఉత్తమ భారతీయ రచయితలకు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇవ్వాలనే ఆలోచన కవుల నుంచే పుట్టింది. 1961 మే నెలలో కలకత్తాలో శాంతి ప్రసాద్ జైన్ నివాసంలో సమావేశమైన బచ్చన్, దినకర్ మొదలైన కవుల సమక్షంలోనే ఈ ఆలోచన కార్యరూపం దాల్చి అది ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డుగా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ నిజంగానే ఉత్తమ రచయితలకు, కవులకు ఈ అవార్డు ఇస్తూ సార్థకత సాధించింది.

కేదార్‌నాథ్ కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే హిందీ సాహిత్యాన్ని, దాని సామాజిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. నిజానికి 20వ శతాబ్దంలోనే హిందీలో కవిత్వం ప్రారంభమైంది. అంతకుముందు మధ్యయుగాల హిందీలో రకరకాల స్థానిక భాషల్లో సాహిత్య రచన సాగేది. రాజస్థానీ, మైథిలీ, అవధి, బ్రజ్‌భాషల్లో ఉత్తమ సాహిత్యం వెలువడింది. 14వ శతాబ్దం నుంచి ఉత్తర భారతంలో భక్తి సాహిత్యం ఒక్క ఊపు ఊపింది. 17వ శతాబ్దంలో రాజాస్థానాల్లో ప్రణయం సాహిత్యంలో ఆధిపత్యం వహించింది. రాధాకృష్ణుల ప్రణయం సాహిత్యాన్ని ఆవరించింది. భక్తి, ఆదర్శ ప్రేమ (రీతి) రచనలే చాలా కాలం హిందీ సాహిత్యంపై ప్రభావం చూపాయి. 20వ శతాబ్దంలో హిందీ సాహిత్య తీరు తెన్నులే మారాయి.

సాంప్రదాయ, బ్రజ్ భాషా హిందీ స్థానంలో మాట్లాడే హిందీలో (ఖరీబోలీ) రచనలు ప్రారంభమయ్యాయి. సాహిత్యం కొత్త ప్రతీకల్ని, వస్తువుల్ని, భావా వేశాల్ని ఎంచుకోవడం మొదలైం ది. సామాజిక సంస్కరణలు, జాతీయ వాదానికి హిందీ ఆలం బన అయింది. మహాదేవీ ప్రసాద్ ద్వివేదీ, మైథిలీ శరణ్ గుప్తా లాంటి వారు మార్పుకు దోహద కారులయ్యారు. ఆ తర్వాతి కాలం లో వ్యక్తుల భావావేశాలను, బాధల్ని చిత్రించే ఛాయావాదం హిందీ సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. రాజకీయ స్వాతంత్య్రం ఒకవైపు, వ్యక్తి స్వేచ్ఛ మరోవైపు రచయితలను వివిధ మార్గాల్లో వెళ్లడానికి ప్రోద్బల పరిచాయి. ఆ తర్వాత ప్రగతిశీల ఉద్యమాలు హిందీ సాహిత్యంలో ఉత్తమ రచయితలను సృష్టించాయి. ఛాయావాదం ఆశించే వ్యక్తిగత స్వేచ్ఛ, స్వప్నాల స్థానంలో ప్రగతివాదం సామాజిక వాస్తవికత చోటుచేసుకుంది. అదే ప్రయోగవాదం, నయీ కవిత (కొత్త కవిత)ల కాలానికి దారి తీసింది. ఆ రోజుల్లో కవి, సాహితీ విమర్శకుడు అజ్ఞేయ ఆధ్వర్యంలో వెలువడిన తార్ సప్తక్ పత్రిక అనేకమంది యువకవుల గళాలను ధ్వనించింది. వారి ఆవేశం, ఆలోచన నాటి సమాజానికి ప్రతిబింబాలయ్యాయి. ఆ కవుల్లో కేదార్‌నాథ్ సింగ్ ఒకరు.

ప్రేమ్‌చంద్, బచ్చన్, పంత్ లాంటి అనేకమంది ఉత్తమ కవులను సృష్టించిన గడ్డ ఉత్తర ప్రదేశ్‌లోనే కేదార్ నాథ్ సింగ్ జన్మించారు. గోరఖ్‌పూర్ సమీపంలోని బలియా జిల్లాలో చకియా అనే గ్రామంలో ఆయన 1934లో జన్మించారు. ఆ రోజుల్లో ఉన్నత విద్యను అభ్యసించాలంటే బనారస్ వెళ్లాల్సిందే. కేదార్‌నాథ్ కూడా బనారస్‌లోనే ఉన్నత పాఠశాల, కళాశాల విద్యను అభ్యసించారు. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచే ఆయన హిందీలో ఎంఏ, పిహెచ్‌డి చేశారు. దాదాపు దశాబ్దం పాటు బనారస్‌లో ఉదయ్ ప్రతాప్ కళాశాల, గోరఖ్‌పూర్ యూనివర్సిటీల్లో ఆయన విద్యార్థులకు హిందీ బోధించారు. 1976లో ఆయన ఢిల్లీలోని జెఎన్‌యూలో హిందీ బోధించేందుకు వచ్చారు. అక్కడే రిటైర్ అయ్యేంత వరకూ కొనసాగారు.

కేదార్‌నాథ్ సింగ్ కవిగా మారడానికి కారణం ఆయన ప్రగతివాద కవుల ప్రభావంలో పడడమే. 1952లో 18 ఏళ్ల వయస్సులో ఆయన తొలి కవిత రాశారు. సమాజ్ అనే పత్రికలో ఆయన తొలి కవిత పడింది. ప్రగతివాదం అనేదాన్ని సాధారణ అర్థంలో తీసుకోవాలి. ప్రగతివాద కవుల్లో ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని అభిమానించే అజ్ఞేయ నుంచి మార్క్సిస్టులైన ముక్తిబోధ్ వంటి వారు కూడా ఉండేవారు. ‘మా కవులు ప్రయాణీకులు కూడా కారు.. రహదారులను వెతుకుతున్నవారు..’ అని అజ్ఞేయ తన పత్రికలో రాశారు. ఈ దృష్ట్యా నయీ కవితా.. అంటే కేవలం కొత్త భావాలు మాత్రమే కాదు, కొత్త ప్రతీకలు, కవిత్వానికి కొత్త రూపాలు వెతికేవారు అని కూడా అర్థం. కేదార్‌నాథ్, రఘువీర్ సహాయ్ లాంటి వారి కవితలు ఇందుకు నిదర్శనం. ఈ కొత్త కవులందరూ తొలుత తీస్రా సప్తక్‌లో దర్శనమిచ్చేవారు. 1960లోనే కేదార్‌నాథ్ కవితా సంకలనం అభీ, బిల్కుల్ అభీ వెలువడింది.

కేదార్‌నాథ్ తొలి కవితలు చూస్తే మనకు శ్రీశ్రీయే గుర్తుకువస్తారు. నవీన్ జోష్ జిందగీ జాగాయే చల్.. జగాయే చల్, జగాయే చల్.. (కొత్త ఆవేశం జీవితాన్ని మేల్కొల్పేందుకు పదండి..), గులామీయోంకే చిన్హ్ మిటాయే చల్.. మిటాయే చల్.. మిటాయే చల్ (బానిసత్వ అవశేషాలను తుడిచిపెట్టేందుకు వెళదాం పదండి.. పదండి..) అని లయాత్మకంగా రాశారు. 1960లో వెలువడిన ఆయన తొలి సంకలనంలో అన్నీ ఇలాంటి కవితలే కనిపిస్తాయి. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు కాని 1980లో ఆయన మరో కవితా సంకలనం జమీన్ పక్‌రహీ హై వెలువడలేదు. ఆయన మూడో కవితా సంకలనం అకాల్ మే సరస్ (1989)కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1995లో ఉత్తర్ కబీర్ అవుర్ అన్య కవితా, 1996లో బాగ్, 2004లో టాల్‌స్టాయ్ అవుర్ సైకిల్ అనే కవితా సంకలనాలు వెలువడ్డాయి. పులి పేరిట రాసిన సుదీర్ఘ కవితా సంకలనంలో ఆయన మనిషి జీవితంలో సంక్లిష్టతను పులి అనే ప్రతీక ద్వారా అద్భుతంగా చిత్రించారు. పలు సాహిత్య విమర్శా గ్రంథాలు కూడా ఆయన రాశారు. కల్పనా అవుర్ ఛాయావాద్ అనే వ్యాససంకలనంలో ఆయన ఛాయావాదం గురించి రాశారు. మేరీ సమాజ్, మేరీ శబ్ద్ అనే వ్యాస సంకలనంలో సాహిత్యోద్యమాల గురించి రాశారు. ఖబరిస్తాన్ మే పంచాయత్ అనే వ్యాస సంకలనంలో మానవ భావోద్వేగాలు, జీవితంలో సంక్లిష్టత, సాంస్కృతిక చైతన్యం గురించి రాశారు. ఆయన ప్రతి రచనలోనూ ప్రజాస్వామిక ఆకాంక్షలు, స్వేచ్ఛావాదం ప్రతిఫలిస్తాయి. కుమార్ ఆసన్, మైథిలీ శరణ్ గుప్తా, దినకర్, జాషువాల పేరిట ఆయనకు పలు అవార్డులు లభించాయి. స్పానిష్, డచ్, జర్మన్, రష్యన్, హంగరీ భాషల్లో ఆయన కవితలు అనువాదాలయ్యాయి.

ఆయన కవితలు ఒకో దశలో ఒకో సామాజిక వాతావరణాన్ని ప్రతిఫలి స్తాయి. తొలి కవితల్లో భావావేశం, ప్రగతివాదం, గ్రామీణ వాతావరణం, గంగానది గలగలలు, సామాన్యుడి జీవితం కనపడతాయి. తర్వాతి కవితల్లో ఆలోచన, తాత్వికత, తాజా కవితల్లో ఆవేదన, యుద్ధాలు, హింసాకాండ, నిరాశా నిస్పృహలు, ప్రపంచీకరణ సృష్టిస్తున్న వైపరీత్యం ప్రతిఫలిస్తాయి. ఏది రాసినా ఆయన అద్భుతమైన ప్రతీకలతో, గాఢమైన భావాలతో మనను కట్టిపడేస్తారు. ప్రకృతి ఆయన కవిత్వంలో ప్రధానమైన అంశం. అంతేకాదు, శ్రీశ్రీలాగా ఆయనకు కూడా కాదేదీ కవితకనర్హం. పార, కూరగాయలు తరిగే కత్తి, విరిగిపడిపోయిన ట్రక్కు.. ఇవన్నీ ఆయనకు కవితా వస్తువులే. జానపద సంగీతంలోని లయ ఆయనకు ఎంతో ఇష్టం. వాటిని ఆయన కవిత్వంలో ప్రవేశపెడతారు. సంగీతం, ఒంటరితనం, కవిత్వం.. ఈ మూడే నాకు అత్యంత ఇష్టమైనవి.. అని కేదార్‌నాథ్ అంటారు. పడవ నడిపేవారు, పసుల గాచేవారు, ఆడుకునే పిల్లలు, బండ్లు నడిపే ఎద్దులు, సూర్యుడు, వెన్నెల నక్షత్రాలు, పక్షులూ, నేలా ఇవన్నీ ఆయన ఇష్టమైన కవితా వస్తువులు. మనిషి వైపు శబ్దాల్ని విసిరేయాలనుకుంటాను.. అని కేదార్ నాథ్ అంటారు ఒక కవితలో. ఆయన విసిరివేసిన శబ్దాలే నేడు ఆయనకు జ్ఞానపీఠ అవార్డును ఇచ్చాయి.

-ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
ఉపాధ్యక్షులు, కేంద్రీయ హిందీ సంస్థాన్

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.