ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -10
5- ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్-3(చివరిభాగం )
అనుకోకుండా అకస్మాత్తుగా విట్మన్ కు వార్ధక్యపు చాయలు చోటు చేసుకొన్నాయి .నడక మందగించిది .శరీర బాధలు ఇబ్బందిపెడుతున్నాయి .అశక్తత పెరిగింది .శక్తి క్షీణించింది .అప్పుడప్పుడు ఉద్రేకానికి లోనౌతున్నాడు .సరస్వతి కరుణించినా లక్ష్మీ ప్రసన్నం కాలేదు .కాండెన్ వీధుల్లో బాక్సులలో పుస్తకాలు మోసుకొంటూ హోమ్ డెలివరీ చేస్తున్నాడు .నడవ లేకపోయేవాడు . బరువు మోయటం అసాధ్యమైపోయింది .యాభై వ పడిలో వచ్చిన స్ట్రోక్ ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఇంకో ఇరవై ఏళ్ళు అలాగే జీవితాన్ని లాగేలా చేసింది .అరవైలో కొంత కుదుటబడ్డాడు .అతి దూరంగా ఉన్న కొలరాడో వెళ్లి లింకన్ పై ప్రసంగాలు చేశాడు .అక్కడ ‘’when Lilacs last in the dooryard Bloomed ‘’కవిత చదివి అందరిని సమ్మోహితుల్ని చేశాడు .దాన్ని ‘’నేటివ్ క్లాసిక్ ‘’అన్నారు .
అరవై అయిదో ఏట ఒక చిన్న గదిలో రైల్వే క్రాసింగ్ దగ్గర న్యూస్ పేపర్ల మధ్య గడిపాడు . రైళ్ళ మోత, ఫాక్టరీల రసాయనిక వాయువులు చిమ్నీలనుండి వెదజల్లే దుర్గంధం లో నరకం అనుభవించాడు .ఒక టైలర్ విధవ భార్య వండి పెట్టేది ఇంటిని చూసేది .చినిగిన చొక్కాలు ,పాంటులకు అతుకులు వేసేది .విట్మన్ వీరాభిమానాలు ముప్ఫై రెండుమంది ఒక గుర్రబ్బగ్గీ కొనిచ్చారు . ఈ బృందం లో శామ్యూల్ ఇ క్లేమిన్స్ కూడా ఉన్నాడు .అరవై తొమ్మిదో ఏట కొత్తగా పక్షవాతం ప్రవేశించింది .నరాల బాధ పెరగటమే కాక కిడ్నీ ట్రబుల్ కూడా వచ్చిపడింది మూలిగే నక్క పై తాడి పండు చందం అయింది ఆ మహా కవి బతుకు .డెబ్భై వ పుట్టిన రోజుకు లేచి నిలబడ్డాడు .ఆ తర్వాత ఓపిక తెచ్చుకొని దగ్గరలోనే ఉన్న ఫిలడెల్ఫియాలో లి౦కన్ లెక్చర్ ఇచ్చాడు .మిగిలిన కాలమంతా ఇంటి పై భాగానకాని ,కామ్దేన్ లో మికిల్ స్ట్రీట్ లోకాని గడిపాడు .చనిపోతున్నా ఓడిపోలేదు .శరీరం వేడి చేసుకోవటానికి స్టవ్ దగ్గర గంటల కొద్దీ ఏ ఆలోచనా లేకుండా కూర్చుని పోయే వాడు .చావు వచ్చి మీద పడుతోందని గ్రహించాడు తుది యాత్రకు ప్లాన్ సిద్ధం చేసుకొంటున్నాడు .
72 ప్రవేశించింది .1891 లో చివరి ఎడిషన్ గా ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’ను ౩౦౦ కు పైగా కవితలతో ప్రచురించాడు .దీనినే ‘’డెత్ బెడ్ ఎడిషన్ ‘’అంటారు అందులో తనను తాను ‘’hard cased dilapidated ,grim ,ancient selfish or time banged conch –no legs ,utterly un locomotive –cast up high and dry on the shore sands ‘’అని వర్ణించుకొన్నాడు .1891లో న్యుమోనియా సోకింది .దీనికి తోడూ క్షయ ముదిరిపోయిందని రిపోర్టులు తెలిపాయి .వింటర్ గడిచింది .26-3- 1892 న 73 వ పుట్టిన రోజు ఇంకొక రెండు నెలలు ఉందనగా అమెరికన్ ఆధునిక మహాకవి వాల్ట్ విట్మన్ భువి నుండి దివికి చేరాడు .
పెళ్ళికాని ముదురు బ్రహ్మ చారి విట్మన్ .ఎక్కడా లవ్ అఫైర్ లేనివాడు .ఆయన పుస్తకమే ‘’ఒక వర్డ్ ‘’అంటే శాసనం .ప్రజాస్వామ్య బైబిల్ ‘’అన్నారు లీవ్స్ ఆఫ్ గ్రాస్ పుస్తకాన్ని .’’a better ,fresher ,busier sphere ,a wide ,untried domain awaits –demands you ‘’అని అభయమిచ్చి పిలిచాడు .ఆధునిక కవిత్వ పరిధిని పెంచినవాడు విట్మన్ .అతని సాంకేతిక సృజన అతి వేగ వంతమైన నాగరకత కు అనునాదం .అతనికవిత్వం భాషలో గొప్ప ప్రయోగం .వాడుక భాషకు అందం కూర్చి అందలం ఎక్కించాడు. దాని మూలాలు అతి విస్త్రుతమై భూమికి దగ్గరై ,ప్రజా హృదయాలకు చేరువైంది .అట్టడుగు జన ఘోషకు దర్పణమైంది .ఆ భాషా చాతుర్యం అనితర సాధ్యం చేశాడు .గుండెలకు తాకే కవిత్వం విట్మన్ ది .నీ, నా,మనందరి భావాలకు ఆలవాలం .
తాను వివాదాస్పదుడినే అని చెబుతూ ‘’very well .I contradict my self .I am large –I contain multitudes ‘’ ప్రపంచం అంతా నాలో ఉన్న విశ్వ రూపుడిని అన్నాడు .తన గడ్డిపరక ‘’is no less than the journey work of the stars ‘’అని దాని విస్తృత ప్రయాణాన్ని తెలిపాడు .అందుకే ఎమర్సన్ మహాశయుడు ‘’I expected him to make the songs of the nation –but he seems content to make the inventories ‘’అని విట్మన్ ప్రతిభా విస్తృతికి నీరాజనం పలికాడు .మంచిని చెడుని అందాన్ని వికారాన్ని సమానం గా ఆదరించాడు .లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’monumental mountanious book ‘’అంటారు .అనేక శృంగాలతో పార్శ్వాలతో దేదీప్యమానం గా వెలిగే పుస్తకం .ఆ శిఖరాలు మిరుమిట్లు గొలుపుతాయి .వాటిని చేరటం ,అధిగమించటం ఎవరి వల్లా సాధ్యం కాదు .’’అది ఒక మనిషి’’ ,-_the book is the man ‘’.వాల్ట్ విట్మన్ తన కాలం లోనే కాదు నేటికాలం లో కూడా ‘’టైటానిక్ ఫిగర్ ‘’.
మరోప్రముఖునితో కలుద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-2-15 ఉయ్యూరు

