గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 56-పశుపతి నాగనాధ కవి (14వ శతాబ్ది మధ్య కాలం)

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

56-పశుపతి నాగనాధ కవి (14వ శతాబ్ది మధ్య కాలం)

కౌశిక గోత్రీకుడు పశుపతి కి కుమారుడే నాగనాధుడు .చమత్కార మంజరి రాసిన విశ్వేశ్వరుని శిష్యుడు .రాచకొండ రాజులు అనపోత ,శృంగార భూపాల రాజుల ఆస్థానకవి .సంస్కృత విష్ణు పురాణాన్ని తెలుగు చేశాడు .సంస్కృతం లో మదన విలాస భాణంరాశాడు .ఇందులో కొద్దిభాగమే లభ్యమవటం దురదృష్టం .’

‘’అవ్యాత్ప్రకృతి మనోజ్ఞం నవ్యం తరుణ సౌరభం శంభో –శృంగార జీవనైషధమ౦గ౦ కారుణ్య రంగ భూర్యుష్మాన్ ‘’

‘’లోలాలాలకాన్చిత సమంచిత ఫాల భాగం ధర్మంబు బిందు పరి మండిత గండ మూలం

వల్గాత్కుచం తను రణత్కల కంఠ మూలం మోదం తనోతు సురతం మదిరేక్షణాయః ‘’

ఈ భాణాన్ని సర్వజ్న సింగుని కుమారుడు మేచయ గౌరవార్ధం రాశాడు .అంటే నాగనాధకవి మూడు తరాల రాజుల ప్రాపకం లో ఉన్నాడన్న మాట .రాచర్ల రాజులలోనూ ఈ పేర్లున్నవారున్నారు .సింగని కొడుకు అనపోతుని కి సమకాలికుడని తెలిపేఆధారం ఉంది

‘’రేచర్ల వంశ రత్నకరేణ—-శ్రీ సింహ భూపాల పూర్వాచల ప్రభాకరేణ కేశమామ్బికా కల్ప ప్రసూన గుచ్చేన —శ్రీ అన పోత భూపాలేన సతత సన్నిదీకృత కళ్యాణ నారాయణస్య వసంతోత్సవ —భరద్వాజాన్వయ పరి పూర్ణ రాత్నాకరస్య గురు విశ్వేశ్వర కవి చంద్రస్య ప్రియ శిష్యో నాగానాదః కవిః’’

శింగ భూపాలుడు అంటే రసార్నవ సుధాకరం రాసిన కవి రాజు ,అనపోతుని కుమారుడు అని చరిత్రకారుల భావన .మనకవి విశ్వేశ్వరుని శిష్యుడన్నదిఖాయమే మరి ఇక్కడికెలా వచ్చాడు ?విశ్వేశ్వరుడు సిన్గభూపాలుని ఆస్థానం లో ఉండి ఉంటాడు .వరంగల్ జిల్లా ఐనవోలు లో నాగానాధుడు రాసిన 1369నాటి శాసనం ఉంది .ఇది మొదటి అనపోతునికాలానికి చెందింది .రాజు దాన వివరం ఉంది –

‘’ఉర్వీ ముద్వరతే బిభార్తి చ కుతామ్నాయస్థితి వైరిహ –ద్వేదీ విశ్రుత విక్రమో హతా రిపు క్షత్రాన్వయ  స్స్తోతుమాన్ ‘’

దానం 1369లో అంటే శక వత్సరం 1291లో ఇచ్చినట్లు ఉంది .శాసనం చివర తన గోత్రాదులు చెప్పుకొన్నాడు .కనుక 14 వ శతాబ్దానికి చెందిన అనపోతనాయకుని కాలం లో ని వాడే  .విశ్వేశ్వరుడు అనపోతుని కొడుకు మొదటి రెండవ  సింగ భూపాలుని ఆస్థానం లోని వాడు .ఇతడే చివరి కాకతీయ సామ్రాజ్యాధిపతి ప్రతాప రుద్రుని సమకాలికుడు కూడా .రాచకొండను 1384-1399లో ఏలిన రెండవ సింగమ నాయకుని కొలువులోనూ ఉన్నాడు .అంటే విశ్వేశ్వరుని జీవితకాలం చాలా సుదీర్ఘం అని ,రాచకొండ వెలమ ప్రభువుల మూడు తరాలలోను ఉన్నాడని ఆచార్య బిరుద రాజు రామరాజు గారు తేల్చి చెప్పారు .

57-కందుకూరి నాగ నాద సూరి

కాలాదులు తెలియని ఈ కవి నియోగి బ్రాహ్మణుడని ‘’మీనాక్షి కళ్యాణ చంపు ‘’,రామ విజయ ‘’కావ్యాలు రాశాడని తెలుస్తోంది చంపువు లోకవి వివరాలేమీలేవు .రెండవ దానిలో ఆశ్వాశాంతా గద్యలో కొన్ని వివరాలున్నాయి

‘’యత్కటాక్షోప విక్షిప్త నిరూఢ నిజ సంపదః –ప్రత్యూహ విన వర్తింతేకలయే తంవినాయకం

కులశేఖరుదు మలయా ధ్వజుని  కూతురు మీనాక్షికి  మధురానధుడు శివునికి జరిగిన వివాహమే ఇతి వృత్తం కులశేఖరుడు ప్రాచీన కల్యానపురిని ఏలిన రాజు .ఒక రోజు రాజుకు శివుడు కలలో కనిపించి తానూ నగరానికి పడమరలో ఉన్న చిన్న ఆలయం లో ఉన్నానని ,తనకు నగరం మధ్యలో మంచి ఆలయం నిర్మిచి పూజించమని కోరాడు .శివ సన్నిధిని రాజు గుర్తించి కొత్త రాజధాని కట్టి మధుర అని పేరెట్టి ఆలయం నిర్మించి శివుని ప్రతిష్టించి భక్తీ తో అర్చించాడు .దీనికి ఆధారం హాలస్య మహాత్మ్యం ‘’

రామాయణాన్ని ఆరుకా౦డలలో రామ విజయం గా రాశాడు .మొదటిశ్లోకం సరిగ్గా లేదుకాని అందులో చంద్ర మౌళి కుమారుడు విష్ణు రాజును ప్రస్తుతించాడు .దీన్ని రాయటానికి  కారణం చెప్పుకొన్నాడు –

‘’కచ ప్రబంధ రచనకాహ మత్యల్పసంమతిః-చంద్ర దానే యదా బాలౌ విధాతుం తమహం యతే ‘’

ఆశ్వాసాంత గద్యం లో –‘’ఇతి కందుకూరి చొక్కనాద శిష్య శేషమాంబా గర్భ సంభవ నాగ నాద విరచితే రామ విజయేయుద్ధ కా౦డః

58- మోక్ష గుండం నారాయణ (18వ శతాబ్ది మధ్యకాలం )

మైసూర్ రాష్ట్రం లో మోక్ష గుండం ఇంటిపేరున్న బ్రాహ్మణ కవి నారాయణ .తండ్రి వెంకటార్య 18శతాబ్దం లో జీవించాడు నారాయణ కవి హరిశ్చంద్ర చంపు రాశాడు .ఇది పద్య ,గద్యాత్మకం . సూర్య వంశజుడైన  సత్య హరిశ్చంద్రుని కద.మూడు విలాసాల తర్వాత కద తెలియదు .శ్రీ కృష్ణ ప్రార్ధనతో ప్రారంభించాడుకవి –

‘’వందే త0 దేవకీ పుత్రం మందేతర గుణార్నవం –వందారు ముని బృందార వృందా వన పరాయణం ‘’

తన కుటుంబాన్ని సవివరంగా తెలియ జేశాడు .సమకాలీన రాజునూ పేర్కొన్నాడు .ఆయన రాసిన దానిప్రకారం గౌతమ గోత్రానికి చెందిన మోక్ష గుండం సర్వ సూరి  .ఆయనకు కామయ కొడుకు .ఈయన భార్య లలితాంబ ..వీరి కొడుకు హోన్నయ్య ,కోడలు వెంగమాంబ .వీరి పుత్రుడు వెంకట రాయ .ఈయన మొదటిభార్య కృష్ణ మాంబ రెండవ భార్య సీతమ్మ .మొదటి భార్య కుమారుడే మనకవి నారాయణ .రెండవ భార్య కుమారుడిపేరు కూడా నారాయణ .మోక్షగుండం వారికి రత్న గిరి వీరరాజుపోషకుడు .ఈ వంశం మూల పురుషుడు  17౦౦-1759కాలపు చిక్కదేవరాయ రాజు వద్ద సైన్యాధ్యక్షుడు మంత్రి అయిన  కలువే వీరారాజు .కనుక మనకవి 18వ శతాబ్ది మధ్యవాడు ..పింగల నామ సంవత్సర విజయ దశమినాడు ఈ కావ్యం రాసినట్లు తెలుస్తోంది .

‘’యస్మిన్  కృష్ణ కృపా ఝరీ  భర పరీత పాంచ సౌదా పగా—రింగత్తురంగశీకర కణాఃకల్ప ప్రసూనాయతే

తన్నారాయణ ధీమత  స్సురుచిరో కావ్యామృతే చాదిమః-చంపూ నామని సంవిదాంకృత సముల్లాసో విలాసోగమత్ ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-16-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.