కష్టాల కడగళ్ల నుంచి విశ్వ చైతన్య పరవళ్లవరకు
శ్రావస్తి నగరం లో వైశ్య కుటుంబం లో ‘’పాటా చార్య ‘’జన్మించింది ..యుక్త వయసురాగానే తలిదండ్రులు వారి అంతస్తుకు తగిన అదే కుల0 కుర్రాడికి ఆమె నిచ్చి వివాహం చేయటానికి నిశ్చయించారు ..అతడిని వివాహమాడటానికి నిరాకరించి తనకు నచ్చిన యువకుడిని పెళ్లాడింది ..ఇది తలిదండ్రులకు నచ్చలేదు .ఆమె ఇల్లు వదిలి భరతో వేరొక కొత్త ప్రదేశానికి వెళ్లి కాపురం పెట్టింది ..కొన్నేళ్లు గడిచాక ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు .. తన తలిదండ్రులను ఒకసారి చూసి రావాలని కోరిక కలిగి భర్త, ఇ ద్దరు పిల్లలతో సహా శ్రావస్తికి బయల్దేరింది .. అరణ్య మార్గం లో ప్రయాణం చేయాలి .. ధైర్యం గా అందరూ కలిసి నడుస్తున్నారు ,ఇంతలో అకస్మాత్తుగా ఒక విషనాగు ఆమె భర్తను కరవటం ఏ వైద్య సహాయం అందకపోవటం తో అతడు అక్కడికక్కడే మరణించాడు..ఈ ఆకస్మిక దుర్ఘటనకు ఆమె మనసు కలత చెందింది .మౌనంగా రోదిస్తూ అలాగే ముందుకు పిల్లలతో కలిసి వెళ్ళింది .. అడవిలో ఒక చెట్టునీడన విశ్ర మిస్తుండగా ,చిన్నపిల్లాడిని ఒక వింత పెద్ద పక్షి కాళ్లతో తన్నుకొని ఆకాశానికి యెగిరి పోయి మళ్ళీ కనిపించలేదు .హతాశురాలైంది .మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది .. తలిదండ్రులను చూడాలనే బలమైన కోరికతో మిగిలిన పెద్ద కొడుకుతో ముందుకు నడిచింది .ఇద్దరు కలిసి ఉధృతంగా ప్రవహిస్తున్న కొండ వాగును దాటుతుండగా మహా ప్రవాహం ఈ ఒక్క కొడుకునూ మింగేసి ఆమెకు కన్నీళ్లే మిగిల్చింది ..ఆమె దుఃఖానికి దరి ,దాపు లేకుండాపోయింది. విధి వ0ఛితయింది .
బరువెక్కిన గుండెతో ఆమె ఎటు పోతోందో తెలియక అటూ ఇటూ తిరుగుతూ చివరికి తలిదండ్రులను చూస్తే తనకు దుఃఖం ఉపశమిస్తుందన్న ఆశతో పుట్టింటికి చేరాలని భావించింది . కాని ఆ ఇల్లు గుర్తు పట్ట లేక పోయింది.చుట్టు ప్రాక్కల వారిని అడిగితె ఆమె ఇంటిని వదిలిన కొన్ని రోజులకే ఇల్లు కూలి పోయి తలిదండ్రులిద్దరూ చనిపోయారని తెలిసింది .పాపం పాటా చార్యకు దారులన్నీ మూసుకు పోయాయి .ఆమె అనంత శోక సాగరం లో మునిగి తేలుతోంది .దారీ తెన్నూ తోచటం లేదు ..శ్రావస్తిలో వీధి వీధీ తిరుగుతూ తన దయనీయ గాధను వెల్లడిస్తూ దుఃఖిస్తూ గడిపింది .దిక్కు లేని వారికి దేవుడే దిక్కు .
ఆ సమయం లో బుద్ధ భగవానుడు శ్రావస్తి లో ఉన్నారు .ఆయన సన్నిధానానికి చేరి తన గోడు వె ళ్ళ బోసుకొన్నది పాటా చార్య .తథాగతుడు ఆమెకు ‘’జీవితం అశాశ్వతమైనది ‘’అని బోధించగా ఆ మె శోకం ఉపశమించింది .మనసు కుదుట బడింది . ఆమెను సంఘం లో ఉండమని భగవాన్ కోరారు .అక్కడే ఆమె బౌద్ధ సన్యాసిని అయి మానవ సేవలో తరించింది .బుద్ధ భగవానుని కొత్తమతాన్ని అందరికి బోధిస్తూ ,ఆయన ప్రవచించిన ధర్మ మార్గాన్ని తెలియజేస్తూ ,ఆత్మ జ్ఞానం పొందిన తథాగతుని మార్గం లో నడిచి జీవితాలను ధన్యం చేసుకోమని బోధించేది . ఆమె జీవితాంతం సాధన చేస్తూ ఆత్మ బలాన్ని పొందుతూ ,వేలాది స్త్రీ పురుషుల హృదయాలకు శాంతిని చేకూర్చింది .ఒక సారి ఆమె 500 మంది స్త్రీలకూ బౌద్ధ ధర్మ బోధన చేయగానే వారందరి మనసులు మారి బౌద్ధ సన్యాసినులయ్యారని బుద్ధ దేవునితో దీక్ష పొందిన అదృష్ట వ0తులయ్యారని ‘’పిటకం ‘’లో ఉంది .అప్పటివరకు బౌద్ధ మత చరిత్రలో ఇంతమంది ఒకే సారి బౌద్ధ సన్యాసినులుగా మారటం జరగ లేదు ..ఆమె కస్టాలు కడగళ్ళు ,ఆమె పవిత్ర ధర్మా చరణ వారందరిలో పరివర్తన కలిగించి ,ప్రభావితం చేసింది ..సాధారణ లౌకిక జీవితం నుండి ఆధ్యాత్మిక ఆనందానికి ,విశ్వ చైతన్యానికి ఎదిగి తోటి వారికి దుఃఖోపశమనం కలిగించి నిండైన సంతృప్తికర ఆనందమయ జీవితాన్ని గడపటానికి ప్రేరణ కలిగించిన ,ఆదర్శ మహిళా మూర్తి పాటా చార్య .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-9-6-17- కాంప్ -షార్లెట్ -అమెరికా
