వీక్లీ అమెరికా -13 (19-6-17 నుంచి 25-6-17 వరకు )
పూరీ జగన్నాధ రధోత్సవ ,దువ్వాడ జగన్నాధ వారం
19-6-17 సోమవారం -మా మనవడు చి సంకల్ప్ చికాగోలో ఉద్యోగం లో చేరాడు రూమ్ మేట్లు కూడా తెలుగు వాళ్ళే దొరికారని చెప్పాడు సంతోషం . భారత రాష్ట్ర పతి అభ్యర్థిగా మోడీ ఒక దళిత మేధావి ,మాజీ బీహార్ గవర్నర్ ,ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్రీ రామ్ నాధ్ కోవింద్ ను యెన్ డి ఏ బలపరచిన బిజెపి అభ్యర్థిగా , అందరి అంచనాలను తలక్రిందు చేసి నిలబెట్టాడు . కాంగ్రెస్ కూడా బీహార్ కే చెందిన జగజ్జీవన్ రామ్ కుమార్తె మాజీ లోక్ సభ స్పీకర్ శ్రీమతిమీరా కుమార్ నుపోటీ గా నిలబెట్టింది . గీర్వాణం 3 లో 250 దాకా కవుల గురించి రాశాను .మంగళవారం గీ -3 అంకిత ,స్పాన్సర్ ఆర్టికల్స్ రాశాను ..శ్రీ చలపాక ప్రకాష్ కు ఫోన్ చేసి ఆధునిక ప్రపంచ నిర్మాతలు డిటిపి ఎంతవరకు వచ్చిందో తెలుసుకొన్నా. రాష్ట్ర కార్య దర్శి అవటం తో ప్రతి ఆదివారం గుంటూరు వెళ్లాల్సి వస్తోందని తన రమ్యభారతి కూడా సమయానికి వెలువరించలేక పోతున్నామని తెలిపి మన పుస్తకాన్ని మరో రెండు వారాల్లో పూర్తి చేస్తానన్నారు . అది అవగానే శివ లక్ష్మికి పంపి తప్పులు దిద్దించి సరి చేశాక స్క్రిప్ట్ లోమార్చి నెట్ లో నాకు పంపితే నేను రెండవసారి చూసినట్లవుతుందని ఇండియా రాగానే మూడవ సారి చూసి ప్రింట్ కు ఇవ్వవచ్చునని అన్నాను సరేనన్నారు . ఇది అవగానే గీర్వాణం -3 కూడా అంతా రెడీ చేసి ఫైల్ పంపిస్తానని అప్పుడు మొదలు పెట్టమని చెప్పాను .అలాగే అన్నారు .
ఇక్కడికి వచ్చాక రెండు సార్లు వసుధ గారికి మెయిల్ చేసి ‘’వసుధైకం ‘’యెంత వరకు వచ్చిందని అడిగితె సమాధానం రాలేదు .ఆయనకూ తీరిక లేకపోవటం, వేసవి తీవ్రత వలన అడుగులు ముందుకు సాగలేదని పిస్తోంది .. రాత్రి అల్లరినరేష్ ‘’సీమ ఆటపాకాయ్ ‘’గొట్టం ‘’లో చూసాం బాగానే ఉంది .బుధవారం చరణ్ ,రమ్య లతో ఫోన్ లో మాట్లాడాము . ఈ రోజు సాయంత్రం అడ్డాడ శిష్యురాలు అమెరికాలో ఉంటున్న శ్రీమతి కోడూరి పావని ఫోన్ చేసి మాట్లాడింది తాము ఆగస్టు రెండవవారం లో కొలంబస్ కు ఉద్యోగం లో చేరటానికి వెడుతున్నామని చెప్పింది .రాత్రి ‘’ఇదేం పెళ్ళాం రా బాబోయ్ ‘’రాధికా ,రాజేంద్ర ప్రసాద్ సినిమా ట్యూబ్ లో చూసాం సరదాగా ఉంది .మూడు రోజుల నుంచి వర్షాలు బాగానే పడుతున్నాయి .
గురు వారం శైవ వీరశైవ సంస్కృత కవుల వివరాలు దొరికితే రాసి 260 కి చేర్చా .
దువ్వాడ జగన్నాధం
23-6-17 శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల మాటినీ షోలో ‘’దువ్వాడ జగన్నాధం ;;చూసాం .మాముగ్గురుకాక మరొక 7 గురు మాత్రమే ఉన్నారు మొత్తం 10 .ఉదయం ఆట వేయలేదట గురువారం రాత్రి ఆట ఆడా రట .వర్కింగ్ డే కనుక జనం ఉండరు అంది మా అమ్మాయి . మా మనవడు శ్రీకేత్ మాతో రాకపోతే మా అమ్మాయి రాత్రి ఆటకు వాడిని తీసుకొని వెళ్లి రెండో సారి చూసింది .ఆర్భాటం పెద్దగా బడ్జెట్ లేని సాధారణ ఆంద్ర బ్రాహ్మణ కుటుంబం కథ .వాడే దువ్వాడ జగన్నాధం .వాడు పరిత్రాణాయ సాధూనాం గా మారితే మెడలోని రుద్రాక్ష తీసేసి డి .జే .గా మారి ఫైట్లు చేసి విలన్లను చావబాది అగ్రి గోల్డ్ ఖాతాదారుల డబ్బు 9 వేలకోట్లు దోచుకొన్న వాళ్ళ భరతం పట్టి ఆడబ్బు బాధితులకు అందేట్లు చేస్తాడు డి జె అల్లు అర్జున్ .అతని పెర్ఫార్మన్స్ కు తగిన కథ .మాటలు రాసి డైరెక్ట్ చేసిన హారీస్ శంకర్ ప్రతిభ ప్రతిభ అంగుళం లోనూ కనిపిస్తుంది .మాటలు అదుర్స్ అంటే మామూలు మాట అవుతుంది అల్లు భాషలో ‘’ఉత్కృష్టహ్ ,ఉత్కృష్ఠస్య ,ఉత్కృష్టే భ్యహ్ ‘’. అర్జున్ బ్రాహ్మణ వాచకం కూడా సూపర్బ్ .ఈ పాత్ర అతనికి కొత్తదే కానీ కొట్టిన పిండి ని చేసేశాడు . అతని ఎనర్జీ అంతా ఖర్చు చేసి పోరాటాలు డాన్స్ లు చేశాడు . డాన్సుల్లో ఒంగిన చువ్వ అని పించి ;;ఇరగ ‘’దీ శాడు .అన్నిటికంటే గొప్ప విషయం రావు గోపాలరావు లాగా మట్టలాగు , బారు చొక్కా రొయ్య మీసం వేసుకున్న ఆయన కొడుకు రావు రమేష్ అదే యాసలో తండ్రికి తగిన కొడుకు కాక మించిన తనయుడు అనిపించాడు నటనలో . ఇది బాగా ప్లస్ పాయింట్ . జొన్నవిత్తుల పాటలు సుశబ్ద సరళ సుందరం గా ఉంటె దేవిశ్రీ సంగీతం అర్జున్ డాన్స్ లకు తగ్గ భంగిమ లో నాట్యం చేసింది .. హీరోయిన్ వలన ఒరిగిందేమీ కనిపించలేదు . చూసినవాళ్లకు అల్లుకు సెక్షీ గా కనిపించిందేమో తెలీదు . మిగిలిన పాత్ర దారులందరు యధా శక్తి నటించి ‘’అన్నపూర్ణా కేటరింగ్ ‘’లో రుచికరమైన శుచికరమైన హాయైన హాస్య సాహస , ,ఉద్రేక, శోకాది భావోద్రేక పిండివంటలతో సహా వంటలు వండి వడ్డించి ,తినిపించి ‘’ బ్రేవ్ ‘’మని’’త్రేనుపు ‘’ తెప్పించారు . ‘’ఇంగువ వేసిన పులిహోర’’ లాగా ఘుమ ఘుమ లాడించి ‘’ఎక్సలెంట్ ,ఎక్స్ట్రార్డినరీ , మైండ్ బ్లోయింగ్ ‘’అనిపించాడు దువ్వాడ . ఒక రకంగా ‘’సభ్య సమాజానికి మంచి సందేశమే ‘’ఇచ్చాడు డి జె.
శనివారం శ్రీయల్లాప్రగడ వారు ఫోన్ చేసి మళ్ళీ మాకు ఎప్పుడు వీలయితే అప్పుడు వాళ్ళ ఊరు కారీ కి రమ్మని కోరారు తప్పక వస్తామన్నాం .
విశ్వ నాదామృతం
..రాత్రి యు ట్యూబ్ లో ‘’విశ్వనాధామృతం ‘’చూసాం .ఇండియాలో ఉండగా మొట్ట మొదటి ఎపిసోడ్ మాత్రమే చూసాం ఇవాళ సాగర సంగమం ,స్వర్ణకమలం సప్తపది ఎపిసోడ్ లు చూసాం . రచయితా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కళాతపస్వి విశ్వనాధ్ దర్శకత్వ ప్రతిభను అన్నికోణాలలో ఆవిష్కరించాడు . సాగర సంగమం తన కు బాగా నచ్చిన సినిమా అని అది శంకరాభరణం తర్వాత మరొక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింద ని అందులో 12 పీక్ పాయింట్లున్నాయని .ప్రతి పాయింట్ దగ్గరా సినిమా అయిపొతుందే మోననిపించి మళ్ళీ సాగటం విశ్వనాధ ప్రతిభకు నిదర్శనమని నెగటివ్ కేరక్టర్, జీవితం లో ఫెయిల్యూర్ అయిన వాడి కథను అంత అద్భుతంగా తీయటం ఆషామాషీకాదని ,ఆయన మనతోపాటు ఉంటూ మనకు మార్గ దర్శకత్వం చేస్తూ ,మన హృదయాలను కదిలిస్తూ ద్రవీభూతం చేస్తూ భారతీయ కళా సంస్కృతి విలువల పట్ల అభిమాన్నాన్ని వెయ్యి రెట్లు పెంచిన దార్శనికుడు విశ్వనాధ్ ను కళాతపస్వి అని ఏ అరణ్యం లోనో ముక్కు మూసుకుని కూర్చున్నవాడిగా భావించరాదని ఆయన జనక చక్రవర్తిలాగా జ్ఞాన బోధకుడుకనుక ఆయనను అన్నట్లే ‘’కళా రాజర్షి ‘’అనటం సముచితమని అన్నాడు. నాకు బాగా నచ్చిన మాట .ఇలాంటి సినిమాలు ఏ దర్శకుడైనా జీవితం అంతా కస్టపడి ఒక్క సినిమా మాత్రమే తీయగలడ ని కానీ విశ్వనాధ్ ఇలాంటివి 10 కళాఖండాలు తీసి నభూతో న భవిష్యతి అనిపించారని చెప్పాడు నా దృష్టిలో ‘’కళాఖండాల కళా విశ్వం -విశ్వనాధ్ ‘’. స్వర్ణకమలం అద్భుత కళాఖండం .భానుప్రియ అభినయ నృత్య వేదమే అది . పాపం చర్చలో పాల్గొన్న అందులోని హీరో వెంకటేష్ మనసులో ఉన్న భావాలను ఇంగ్లిష్ తెలుగు మిక్సింగ్ లో సరిగ్గా చెప్పలేక పోయాడు . ఇక ‘’సప్తపది ‘’హీరోయిన్ సబితను 1998 లో పెదకళ్లేపల్లి లో వేటూరి గారు రెండు రోజులపాటు తమ ఇంట్లో కాఫీ టిఫిన్ భోజనాలతో నిర్వహించిన కళాసదస్సు లో విశ్వనాధ్ బాలు ,దేవదాస్ కనకాల దంపతులతో పాటు చూసాం . భరణి దీని చర్చలో ఉన్నాడు .అసలే మాట కంగారు దానికి తోడు మహా గొప్ప సినిమా గురించి చెప్పేటప్పుడు మరింత కంగారుపడి తొందరగా మాట్లాడి పాపం ఇబ్బందిపడి ,ఇబ్బంది పెట్టాడు .ఈ మూడిట్లో విశ్వనాధ్ ఉన్నా చెదరని చిరునవ్వుతో తనకేమీ తెలియదన్న భావం తో ఆసమయానికి అలా తోచింది కనుక అలా చేశాననే నిర్లిప్తతతో కళా యోగిగా కనిపించాడు సప్తపది ఒక విప్లవాత్మక భావ వ్యాప్తి .దీన్ని సమాజం స్వీకరించటానికి కతగిన ఉపపత్తులన్నీ దట్టంగా దట్టించుకుని తీశాడు .నమ్మించాడు .దీనిపై విమర్శ లేమీ రాలేదా అని ఈ ఎపిసోడ్ లు తీసిన పార్ధ సారధి అడిగితె ఒకే ఒక్క బ్రాహ్మణ సంఘం వారు మాత్రమే తిరస్కరించారని ‘’మీ అమ్మాయికి ఇలాగే పెళ్లి చేస్తారా ?’’అని సూటిగానే ప్రశ్నించారని చెప్పాడు సప్తపదిలో ‘జానకీ పాడిన త్యాగరాజకీర్తన ‘’మరుగేలరా ఓ రాఘవ ‘’’’ హృదయాలను కదిలించే పాట నాకెంతో ఇష్టమైంది .త్యాగరాజుకు వేయి రె ట్ల గౌరవం ఆపాదించే ట్లుగా ఈ కీర్తనను మహదేవన్ జానకి విశ్వనాధ్ లు తీర్చిదిద్దారు . . దీనికి విరుద్ధంగా సెంటిమెంట్ లకు గౌరవం కలిపిస్తూ బాపుగారు ‘’రాధా కళ్యాణం ‘’తీసి అభిమానం పొందారు .తానూ ఇలాంటి చిత్రాలు తీయటానికి కారణం అభిరుచి ఉన్న నిర్మాతలు ముందుకు రావటమే నన్నారు కళాతపస్వి . .పార్ధ సారధి ‘’విశ్వనాధ్ గారు తన చిత్రాలలో ఎన్నోపాటలకు పల్లవులు సూచించారని అవి ఒక గ్రంధంగా వస్తే బాగుంటుందని’’ అన్నాడు .నాకేమనిపిస్తుంది అంటే ‘’విశ్వనాధ్ కళా సర్వస్వము ‘’ అనే గ్రంధం రావాలి .
పూరీ జగన్నాధ రధోత్సవం
25-6-17 ఆదివారం -ఆషాఢ శుద్ధ విదియ పూరీ లో జగన్నాధ రధోత్సవం కన్నుల పండువుగా జరిగింది .ఇక్కడ షార్లెట్ లో కూడా హిందూ సెంటర్ లో మినీ రధ యాత్ర పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించారని తెలిసింది .చికాగో కూడా ఇస్కాన్ వారు బ్రహ్మానందంగా రధ యాత్ర నిర్వహిస్తారని చదివాను .
ఇండియాలో ఉండగా గీర్వాణం -3 లో 138 కవుల గురించి రాశాను .ఇక్కడికి వచ్చాక సుమారు 15 రోజులనుంచి అన్ని చోట్ల సేకరించి ఇవాళ్టి కి 300 మంది గీర్వాణకవుల గురించి రాయగలిగాను . ముఖ్యంగా మనకు తెలియని ఎందరో కాశ్మీర సంస్కృతకవులు కాశ్మీర పండిట్ లు రాసిన రచనలు ,శైవ శాక్తేయ వీరశైవ కవులు మరీ ముఖ్యంగా ఒరిస్సా కవులు చాలాకొద్దిమందిమాత్రమే మనకు తెలుసు .వారిలో అన్నియుగాలలోని కవుల విషయాలు తెలుసుకొని వారి గురించి కూడా సమ గ్రంగానే రాశాను .వీరుకాక మన సమకాలీన కవులు ఏ యుని వర్సిటీలలో ఉన్నా వారి గురించి వివరాలు సేకరించమని పాపం మైనేనిగారిపై ఈ ముసలి వయసులో పెద్ద బాధ్యత పెట్టాను వారు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు . శైవ పీఠం కు చెందిన కొందరు ప్రసిద్ధ కవుల గురించి వివరాలు అడిగి తెలుసుకోమని కీ శే సద్గురు సదానంద మూర్తి గారి కుమారులు శ్రీ బసవ రాజుగారిని సంప్రదించమని కోరగా వారితో సంప్రదించారు ఒకటి రెండు రోజుల్లో ఆ వివరాలూ లభ్యమవచ్చు .
ఇంత రాసినా ఈ రాత వ్యగ్రత తో దాదాపు రెండు వారాలనుండి పుస్తకాలు చదవటం కుదరటం లేదనే బాధ ఎక్కువగా ఉంది . .అందరికి’’ శు, శుభస్య ,శుభస్యేభ్యహ్’’అని డి జె మాటతో వీక్లీ కి సమాప్తి పలుకుతున్నాను .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-17-కాంప్-షార్లెట్-అమెరికా
—
గబ్బిట దుర్గా ప్రసాద్

