ధ్వని కోణం లో మనుచరిత్ర -3
వరూదినికి ప్రవర సమాగమే లేకపోతే కరుణ రసమే ప్రాధాన్యం పొందేది .ఆమె ప్రత్యాశను ‘’ధరణీసురవరుడరగిన చొప్పరయుట లోనూ’’,చెలులపలుకులతోను ,తొనణికిసలాడేట్లుపెద్దన చేశాడు .గంధర్వకుమారుడికి వరూధిని యెడల రతి ఉండటం ,ప్రవరుడు వరూధినీ మనోగతమైన రతి భావాన్ని తిరస్కరించటం నిజాలే అయినా ,గంధర్వుడు ప్రవర రూపం లో వరూధినికి ప్రేమపాత్రుడు అయ్యాడే కాని ,తనంత తాను కాకపోవటమూ గమనించాల్సిన విషయమే .నటుడు పాత్రను పోషించేటప్పుడు కనబరచే అనుభావాదులు అన్నీతనకు కాక , ఆ పాత్రకే చెందినట్లుగా ,గంధర్వుని అనుభావాదులన్నీప్రవరుడికి చెందినట్లే భావిస్తారు భావుకులు .,వరూధిని దృష్టిలో వాడు ప్రవరుడే అవట౦ వలన ,భావుకుల దృష్టిలోనూ ప్రవర పాత్ర ధారియే అవటం వలన ,వరూధినీ ప్రవర రతి’’ శృంగారమే ‘’అవుతు౦దికాని వేరేదీకాదంటారు రాజన్న శాస్త్రి గారు .
ఈ శృంగారరసం ,వరూధిని ప్రవరుని యెడ స్వాభిలష ప్రకటన సమయం లో ‘’అభిలాష హేతుక విప్రలంభ ‘’రూపం లోను ,ప్రవరుడు తిరస్కరించగా ,’’తదీయ విరహ దోదూయ మానస యై ‘’తనను తాను నిందించు కొనే సందర్భం లో ,ఉద్దీపకాలైన చంద్ర ,మలయ పవనాదులను ఉపాలంభించే సమయం లో , ‘’ఏకతరానను రాగ జన్య విరహ హేతుక విప్రలంభ రూపం లో ,శా౦బరీ మహిమచేవచ్చిన ప్రవరుని రూపు రేఖా విలాసంతో పాటు అతని దేహ సమిద్ధ శిఖి దీప్తి ని సంగ్రహించి ప్రవర రూపం లో ఉన్న గ౦ధర్వ కుమారుని కలయిక సందర్భం లో సంభోగ శృంగారంగా పోషించబడింది .
ఉపక్రమణికలో ప్రవరునిలో సద్ధర్మాచరణ ఉత్సాహ స్థాయి అయిన ధర్మవీరం ,హిమాలయాన్ని సందర్శించి, దాని వైభవాన్ని’’తలమే బ్రహ్మకు నైన నీ నగమహత్వంబెన్న ‘’అని చెప్పినపుడు అద్భుత రసం ,వరూదినితో ‘’బ్రాహ్మణుడు ఇంద్రియ గతి చరించిన ,బ్రహ్మానందాది రాజ్యపదవికి దూరమగును ‘’అని చెప్పేటప్పుడు శాంతరసం ,తన ఊరు వెళ్ళాలన్న కోరిక ఉన్నా పసరు కరిగి పోవటంతో అడుగు ముందుకు వేయలేక వగచినపుడు కరుణ రసం ,,సిద్ధుని పలుకులతో ,గంధర్వుడు ప్రవరుడు ఐన సందర్భం లో అద్భుత రసమూ పోషించబడ్డాయన్నారు శాస్త్రి గారు .
దీని తర్వాతది వరూధిని కొడుకు స్వరోచి కథ .ఇతడు ఆర్తత్రాణ పరాయణుడు ,భూత దయాపరుడైన ఉదాత్త గుణాలున్న వీరుడు . వేట కండూతి మెండు .. దుష్టమృగాల బారి నుండి కాపాడమని ప్రజలుకోరగా చేసే వేటకాదుఇది . వేట సప్తవ్యసనాలలో ఒకటి .చతుఃషష్టి కళలలో ఒకటి కూడా .కనుక యితడు దీనివలన కళాప్రియుడయ్యాడు.దీనికి తోడు తల్లి నుంచి సంక్రమించిన భోగలాలసత ఉండనే ఉంది.దీనితో భోగపరాయణుడనిపించాడు..అతని బహుభార్యా తత్వాన్ని హంసీ ,హరిణి తీవ్రంగా విమర్శించాయి .అయినా లెక్కచేయకుండా చాలాకాలం భోగలాలసత తోనే జీవించాడు .అయినా కూడా ‘’ముగ్గురుభార్యలముద్దుల మొగుడు’’ కనుక అది ధర్మ విరుద్ధం కాదంటారు శాస్త్రి గారు .మృగయా వినోది ,నిశ్చిం తనుడు ,భోగ పరాయణుడు అయిన స్వరోచి శృంగార ప్రధానుడు కనుక ‘’ధీర లలితుడు ‘’అని తీర్పు చెప్పారు అలంకార శాస్త్రాన్ని పుక్కిటపట్టిన రాజన్న శాస్త్రి గారు .అంతేకాదు మనోరమ మొదలైన ముగ్గురు భార్యలయడ సమాన అనురాగం తో ఉన్నాడు కనుక స్వరోచి ‘’దక్షిణ నాయకుడు ‘’కూడా అన్నారు .
నరక చతుర్దశి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-11-18-ఉయ్యూరు

