నా దారి తీరు -117
పదవ తరగతి పరీక్షల డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా
అడ్డాడ హైస్కూల్ లో హెడ్ మాస్టర్ గా చేరి ,1998 జూన్ లో రిటైరయ్యే దాకా ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్ లో పదవతరగతి మార్చి పబ్లిక్ పరీక్షలకు ,సెప్టెంబర్ సప్లిమెంటరి పరీక్షలకు డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా డి.యి.వో. ఆఫీస్ నుంచి నియామక ఉత్తర్వులు రావటం , నేను పని చేయటం జరిగింది .ఎక్కువ సార్లు గుడివాడలోనే డ్యూటీ పడింది .అందులో టౌన్ హై స్కూల్ లో ఏలూరు రోడ్ లో ఉన్న మిషన్ హైస్కూల్ లో ,మాంటిస్సొరి ఇంగ్లిష్ మీడియం ,ఆంధ్రనలంద మునిసిపల్ హై స్కూల్స్ లో చాలా సార్లు ,పామర్రు అస్సిసి లో ఒకటి రెండుసార్లు ఉయ్యూరు విఆర్ కే ఎం హైస్కూల్ లో ఒకసారి చేశాను .చివరిసారిగా 1998 మార్చి పరీక్షలకు ఎలమర్రు హైస్కూల్ లో చేశాను .ఎక్కడ చేసినా చాలా స్ట్రిక్ట్ గా పరీక్షలు నిర్వహించి డిపార్ట్ మెంట్ నాపై ఉంచిన నమ్మకానికి పూర్తి న్యాయం చేశాను .గుడివాడ విశ్వభారతి లో అస్సలు డ్యూటీ పడలేదు .బహుశా పడకుండా వాళ్ళు మెయింటైన్ చేసినా చేసి ఉండచ్చు .డియివో ఆఫీస్ చుట్టూ తిరగటం డ్యూటీ వేయించుకోవటం కొందరి పనిగా ఉండేది .అక్కేడేవరో గుమాస్తాను మంచి చేసుకొంటే ‘’ఆమ్యాయ్మ్యా’’ ఇస్తే కావాల్సిన చోట డ్యూటీ పడేది .నాకు అసలు ఆ ధోరణే లేదు .డ్యూటీ పడితే సంతోషం పడకపోతే మరీ సంతోషం టైపు నేను .కనుక దాన్ని గురించి బెంగ ఎప్పుడూ లేదు .పడినప్పుడు నిక్కచ్చిగా చేయటమే నాపని .కనుక స్కూల్ వాళ్ళు భయపడి నాకు పడకుండా జాగ్రత్త పడిన సందర్భాలుకూడా ఉన్నాయి .అన్నీ చూస్తూ లొంగకుండా సమర్ధంగా చేశాను .అందరినీ సమానంగా చూడటం ,ప్రలోభాలకు లొంగక పోవటం నేను నడిచినదారి .అదే నాకు రహదారి అనిపించింది .చివర సారిగా ఎలమర్రు లో డ్యూటీ కత్తి మీద సాము గానే ఉంది .అది కాపీలకు పెద్దపేరు .కన్ను కప్పి మాయ చేసే వారెక్కువ .హెడ్ మాస్టర్ కూడా మంచి రిజల్ట్ కోసం కక్కుర్తి పడటం అలవాటే నని చాలా కాలంగా వింటున్నాను .శ్రీ హనుమంతరావు హెడ్ మాస్టర్ అని గుర్తు .ఆయన ఎం.ఇ. వో .చేసి మళ్ళీ హెచ్ ఎం .ఏం. గా వచ్చాడు .అక్కడే కాశీ విశ్వవిద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ గా ఉన్నడా . శ్రీ గబ్బిత ఆంజనేయ శాస్త్రిగారిల్లు హెడ్మాస్టర్ ఒక రోజు చూపించిన జ్ఞాపకం అప్పటికి ఆయన గురించి నాకు అస్సలు తెలియదు .ఎక్కడ డ్యూటీ పడినా ఉయ్యూరు నుంచే వెళ్ళటం అలవాటు .పోలీస్ స్టేషన్ నుండి ప్రశ్న పత్రాలు హెడ్మాస్టర్ నేనూ జాయింట్ గా ఏ రోజు కా రోజు తీసుకోవాలి .దానికో రిజిస్టర్ దానిలో సంతకాలు హడావిడి ఉంటుంది .క్వస్చిన్ పేపర్లు రెండు దఫాలుగా డివివో ఆఫీస్ పంపిణీ చేస్తుంది .ఆ సమయానికి డిపార్ట్మెంట్ ఆఫీసర్ హెడ్ మాస్టర్ వెళ్లి రిసీవ్ చేసుకొని వెరిఫై చేసుకొని పెద్ద పెద్ద రేకు పెట్టెలలో పెట్టి సీలు వేయాలి .ఏ రోజు పేపర్ ఆ రోజు ఒక గంటముందు అందులోంచి జాయింట్ గా తీసు పోలీస్ ఎస్కార్ట్ తో హై స్కూల్ కు తీసుకువెళ్ళి అక్కడ ఇనుపబీరువాలో భద్రం చేసి పరీక్ష ప్రారంభానికి పావుగంట ముందు ఇన్విజిలేటర్ల సంతకాలు పాకెట్స్ పై పెట్టించి రిజిస్టర్ మెయిన్ టైన్ చేసి అప్పుడు ఓపెన్ చేయాలి .ఏ రూమ్ కు ఎన్ని పేపర్లు ఇవ్వాలో ముందే తెలుస్తు౦ది కనుక ఆప్రకారం పెట్టి మిగిలిన పేపర్లు కవర్ లో పెట్టేసి అకౌంట్ రాసి ఇద్దరూ సంతకం చేసి మళ్ళీ బీరువాలో పెట్టాలి .బిట్ పేపర్ ఒక పావుగంట ము౦దుమాత్రమే ఓపెన్ చేసి రూమ్స్ కు డిస్ట్రిబ్యూట్ చేయాలి .వీటిపై స్కూల్ స్టాంప్ వేయించాలి .అలాగే ఆన్సర్ పేపర్స్ పై స్కూల్ స్టాంప్ ఇన్విజి లేటర్ సంతకం ఉండాలి .ఆ రోజు సబ్జెక్ట్ కు సంబంధించిన క్వస్చిన్ పేపర్ ఇచ్చామో లేదో ఇద్దరూ జాగ్రత్తగా చూడాలి .అంతపకడ్బందీ గా పరీక్షలనిర్వాహణ ఉండేది .దీనికి కారణం ఉయ్యూరు మొదలైన చోట్ల పేపర్లు లీక్ అయ్యాయని బాగా బిగి౦చేశారు .లేకపోతె హెడ్ మాస్టర్ కే పేపర్లు వచ్చేవి. ఆయన అధీనం లోనే పేపర్లు ఉండేవి .ఆనమ్మకం పోవటం తో ఇంత తిరకాసు వచ్చి పడింది .ఒకరినొకరు నమ్మలేని స్థితి ఏర్పడింది .రిజల్ట్ కక్కూర్తికోసం ఇదంతా మనం చేజేతులా చేసుకొన్న అనర్ధమే .
ఎలమర్రు లో చాల స్ట్రిక్ట్ గా పరీక్షలు జరిపించాను .ఇంవిజిలేటర్స్ పై కూడా నిఘా ఉంచాలి .వారిలో కొందరు లోకల్ ఒత్తిళ్లకు లొంగిపోతారు .కనిపెట్టి జాగ్రత్తపడాలి .అందులోనూ చివరి రోజుల్లో అప్పర్ ప్రైమరీ ఉపాధ్యాయులను కూడా ఇంవిజిలేటర్స్ గా నియమించటం జరిగేది .వాళ్ళు చాలా ఈజీ గోయింగ్ గా ఉండేవారు .కనుక మరింత జాగ్రత్త పడాల్సి వచ్చేది .కాపీలు ఉన్నాయేమో నని అందర్నీ ముందే చెక్ చేసి ఆడపిల్లలను లేడీ టీచర్స్ చేత చెక్ చేయించి అప్పుడు రూమ్స్ లోకి పంపేవాళ్ళం .అంటే కాపీలు లేవని మా భావన .అయినా ‘’ఎక్కడెక్కడో ‘’దాచి కన్నుకప్పేవారు .శల్య పరీక్ష చేయాల్సి వచ్చేది .నేను యెంత స్ట్రిక్ట్ గా ఉన్నా స్లిప్పులు లాగేసి బయట పారేసే వాడినేకాని పరీక్ష నుంచి బయటికి పంపటం చేయలేదు .డిపార్ట్మెంట్ వాళ్ళు స్క్వాడ్ లు ఏర్పాట్లు చేసి ,ఆకస్మిక తనిఖీలు నిర్వహించేవారు .అప్పుడు పట్టుబడితెతప్పక బుక్ చేసేవాళ్ళం .ఇక ఆపరీక్ష ఖతం అయ్యేది .చాలా సార్లు వార్నింగ్ లు ఇచ్చేవాళ్ళం . భయపెట్టే వాళ్ళం .కాని మనకంటే ముదుర్లు ఉంటారు .పాపం పట్టుబడితే వాళ్ళగతి అంతే .
ఒకసారి నన్ను పామర్రు అస్సిసి హైస్కూల్ లో డిపార్ట్మెంట్ ఆఫీసార్ గా వేశారు .అప్పుడు అడ్డాడ పిల్లలు అదే సెంటర్ లో పరీక్ష రాస్తున్నారు .ఇలా మా పిల్లలు పరీక్ష రాసే కేంద్రం లో నేను డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా పని చేయటం న్యాయం కాదని అనిపించి పైఅదికార్లకు లెటర్ పెట్టాను .వారు నా విషయం బాగా తెలుసునని ఎక్కడపని చేసినా నిర్దుష్టంగా డ్యూటీ చేస్తానని కనుక ఆవిషయమై ఆందోళన చెందకుండా డ్యూటీ చేయమని చెప్పారు .అలాగే చేసి అందరి అభిమానాన్ని పొందాను నిజంగా ఇదొక సవాల్ వంటిది ఆ సవాల్ ను అధిగామించాగలిగాను .చివరిపరీక్షకాగానే ఇంవిజిలేతర్స్ తో గెట్ టుగెదర్ ఉంటుంది .అందులో ఈ విషయాలన్నీ చెప్పాను అప్పడు హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి మేరీ అనిజ్ఞాపకం. ఆమెకూడా నన్ను నా పని తీరును బాగా మెచ్చారు .
. అడ్డాడ హై స్కూల్ కు పబ్లిక్ పరీక్ష కేంద్రం కోసం తంటాలు
ఒకప్పుడు అడ్డాడ హయ్యర్ సెకండరి స్కూల్ గా పరీక్షా కేంద్రంగా ఉండేది .కానిదగ్గరే రెండు కిలో మీటర్ల దూరం లో పెంజెండ్ర లో హై స్కూల్ వచ్చింది . అడ్డాడ సెంటర్ లో పెంజెండ్ర వాళ్ళు వచ్చి పరీక్ష రాసేవారు .కొంతకాలానికి పెంజెండ్ర సెంటర్ తెప్పించుకొన్నారు .పాస్ పర్సంటేజ్ పెంచుకోవాలని రెండు స్కూల్స్ వాళ్ళు పోటీపడి కాపీలు చేయించి ఆతర్వాత ఒకరిపై ఒకరు ఫిర్యాదులు పెట్టుకోవటం డిపార్ట్ మెంట్ ఎంక్వైరీ జరగటం చివరికి రెండు స్కూళ్ళకు సెంటర్లు లేకుండా జరిగిందని చెప్పుకొనేవారు .నేను అడ్డాడలో చెరేనాటికే సెంటర్ పోయి మూడునాలుగేళ్ళు అయింది .
మా స్టాఫ్ అంతా స్కూల్ ఇప్పుడు గాడిలో పడింది జిల్లాలో మంచి పేరు తెచ్చుకోన్నదికదా మళ్ళీ సెంటర్ కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చారు ..స్టాఫ్ మీటింగ్ లోకూడా చర్చించి ప్రయత్నిద్దామనుకొన్నాం డిపార్ట్ మెంట్ కు హయ్యర్ అఫీషియల్స్ కుఅఫీషియల్ గా లెటర్స్ పెట్టాం .గుడివాడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారిని కలిసి విషయం చెప్పాం .ఆయన రికమెండ్ చేస్తేనే ఫైల్ కదుల్తుంది .ఆయన తనకేమీ అభ్యంతరం లేదని కాని సెంటర్ ఇవ్వాలంటే కనీస సంఖ్యలో విద్యార్ధులు ఉండాలికనుక అడ్డాడ తోపాటు జమీ గొల్వేపల్లి, పెంజేండ్ర ,ఎలమర్రు స్కూల్స్ అడ్డాడ సెంటర్ తమకు అభ్యంతరం లేదని సర్టిఫికేట్ ఇస్తే తానూ రికమెండ్ చేస్తానని చెప్పారు. అప్పుడు అధికారిగారు శ్రీ రామ చంద్రరావు గారని జ్ఞాపకం .ముక్కు సూటి మనిషి ప్రలోభాలకు లొంగేవారుకాదు .అయినా మన ప్రయత్నం మనం చేయాలి కదా అని ప్రయత్నాలు ప్రారంభించాం ..
నేనూ ,స్టాఫ్ సెక్రెటరి శ్రీ దుగ్గిరాల వీరభద్రరావు అనే సెకండరి గ్రేడ్ టీచర్ ,శ్రీ డి .నాగేశ్వరరావు అనే డ్రిల్ మాస్టర్ బాధ్యత మీద వేసుకోన్నాం. వాళ్ళిద్దరికీ ఈ స్కూళ్ళు బాగా పరిచయం .ముందు గా పెంజె౦ డ్ర హెడ్ మాస్టర్ శ్రీ రామమోహనరావు నుకలిసి విషయం చెప్పాం .ఆయన తనకు అభ్యంతరం లేదని చెప్పి స్టాఫ్ అభిప్రాయాన్నీ కమిటీ అభిప్రాయాన్నీ తీస్కోని వారూ అంగీకరించారని వ్రాతపూర్వకం గా మాకూ డిపార్ట్ మెంట్ కు అంగీకార పత్రం రాసిచ్చారు .గొల్వేపల్లి వాళ్ళుకూడా అంగీకార పత్రం బేషరతుగా ఇచ్చారు .ఇక మిగిలింది ఎలమర్రు .ఎలమర్రు హెడ్ మాస్టర్ ను సంప్రదించాం.మొదట్లో నానుడుగా మాట్లాడారు .తర్వాత స్టాఫ్ మీటింగ్ లో చర్చించి తెలియజేస్తామన్నారు .కొంతకాలం తర్వాత స్టాఫ్ కు అంగీకారం కాదని చెప్పారు .మరికొంతకాలం తర్వాత కమిటీవారికి అసలు ఇష్టం లేదని చెప్పేశారు . ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు గుడివాడ ఉపవిద్యాశాఖాదికారు శ్రీ రామ చంద్ర రావు గారికి తెలియ జేస్తూనే ఉన్నాం .యలమర్రు సెంటర్ లేకపోతె అక్కడ పర్సెంటేజ్ రాదనీ వాళ్ళ ప్రగాఢ విశ్వాసం అని అర్ధమైంది కనుక వాళ్ళు కలిసిరారు అని నిశ్చయానికి వచ్చాం .వాళ్ళూ ఆ విషయం అధికారిగారికి చెప్పారు. ఒకరోజు శ్రీ రామచంద్రరాగారు మమ్మల్ని పిలిపించారు .వారి ఆఫీస్ కు వెళ్లాం .ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పారు .ఒక వేళ ఎలమర్రు వారు అభ్యంతరం చెప్పినా తానూ దాన్నికాదని అడ్డాడ సెంటర్ కు రికమెండ్ చేయగలనని కానీ తర్వాత ఏదో తానుకక్కూర్తి పడి రికమెండ్ చేశాననే అభియోగం వస్తు౦ది కనుక ఏం చేయమంటారో మేరే చెప్పండి అని బంతిని మాకోర్ట్ లోనే విసిరారు .అప్పుడు నేను ‘’సార్!మీ వ్యక్తిత్వం మాకు తెలుసు .మీ మీద ని౦దపడటానికి మేము ఒప్పుకోము .మీ ముక్కుసూటితనం అలాగే కొనసాగించండి .మాకోసం మీరు ఫేవర్ చేశామని పించుకోవద్దు .సెంటర్ మాకు రాకపోయినా ఫరవాలేదు మీకు అపఖ్యాతి రాకూడదు ‘’అన్నాను ఆయన ఎంతో సంతోషించి ‘’దుర్గాప్రసాద్ గారూ !నన్ను బాగా అర్ధం చేసుకొన్నారు .ఈ మేటర్ ఇక్కడితో వదిలేద్దాం ‘’అన్నారు .మేమూ ఇక సెంటర్ విషయం పై ఆశా వదిలేసుకొని స్టాఫ్ కు ,కమిటీకి తెలియజేశాం .ఇలా ఎలమర్రు వారు పాస్ పర్సెంటేజ్ కోసం మాకు చెయ్యిచ్చారు .కనుక నేను రిటైరయ్యేదాకా సెంటర్ రానేలేదు .ఆతర్వాత ఎవరూ అంతగాట్టిగా ప్రయత్నం చేసిన దాఖలా లేదు. అడ్డాడ పిల్లలు పామర్రు సెంటర్ లోనే పరీక్ష రాశారు ,రాస్తున్నారు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-3-19-ఉయ్యూరు
—

