గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
415-హనుమద్రామాయణ కావ్యకర్త –దిట్టకవి లక్ష్మణ కవి (16వ శతాబ్దం )
ఏక సర్గ హనుమద్రామాయణ కావ్యం రాసిన దిట్టకవి లక్ష్మణ 16వ శతాబ్దికవి .18వ శతాబ్దికి చెందిన ఇంకొక దిట్టకవి ఇంటిపేరున్న నారాయణకవి తెలుగులో రంగరాయ చరిత్ర రాశాడు .వీరిద్దరికీ బంధుత్వం ఉందొ లేదో తెలీదు .వీరికి దిట్టకవి అనేది ఇంటిపేరు లేక బిరుదుకూడా కావచ్చు .మనలక్ష్మణకవి తన ఇంటి పేరును ‘’మండల వేముల ‘’అని కూడా తెలిపాడు .తండ్రికాలం లో ఉన్న ఇంటిపేరు ‘’మండలవేముల’’ ,కొడుకుకాలం లో కవిత్వం లోసాధించిన దిట్టతనం వల్ల’’ దిట్టకవి’’గా మారి ఉండచ్చు .కౌండిన్య గోత్రం .నియోగి బ్రాహ్మణుడు .
దిట్టకవి లక్ష్మణకవి ‘’హనుమద్రామాయణం ‘’ను వ్యాఖ్యాన సమేతంగా రాశాడు .కవి తనగురించి వచనం లో –‘’ఇహ ఖలు సంస్కృతాంధ్ర భాషాకవన చాతుర్య దుర్యో దిట్టకవి లక్ష్మణార్యః ‘’’’కావ్యం యశసే ర్దకృతే—‘’అని మాత్రం ఉన్నది .కావ్యం చివర రెండు శ్లోకాలలో మళ్ళీ చెప్పుకొన్నాడు –
1-‘’శ్రీమద్రామ వరప్రసాద కలనా సంప్రాప్త సారస్వత –శ్రీ మద్దిట్ట కవీంద్ర లక్ష్మణ సుధీ వరేణ్య సంపూరితే
షట్కా౦డేరిత ,యావదర్ధ కలితే సంక్షిప్త రామాయణే-శ్రోతృశ్రోత్ర సుఖావహే సర్గో ద్వితీయ సర్గః ‘’
2-మండల వేముల కులజః కౌ౦డిన్యస గోత్ర కృష్ణ కవిపుత్రః –లక్ష్మణ సుకవిః కృతవాన్ సర్గే ణై కేన రఘుపతేశ్చరితం ‘’
అనేక పరిశోధనల అనంతరం రామరాజుగారు దిట్టకవి లక్ష్మణ కాలం 16వ శతాబ్దం అని తేల్చి చెప్పారు .
ఆరుకాడల వాల్మీకి రామాయణాన్ని ఈ కవి ఒకే కాండలో 118శ్లోకాలో ఇమిడ్చాడు .ప్రారంభ శ్లోకాల సౌరు చూద్దాం –
‘’వరదం భజామి శరదంబుద ప్రభం ,ద్విరదం ముఖే శుభరదం తనౌ నరం –గణనాథ మాత్మ గణనా పరేస్టదం శశి ఖండ మండిత శిఖండ మీశ్వరం ‘’
‘’ప్రమితాక్షరోక్తి మమితా సురా౦తకం ,స్మిత భూషణం ,వితత భాను తేజసం –
కలయామి చాపవలయాన్వితం ముదాశర ధారిణం దశరథాత్మజం భజే ‘’
మొదటిశ్లోకానికి విస్తృత వ్యాఖ్య రాశాడు కవి .మిగిలినవాటికి సంక్షిప్తంగా రాశాడు .కవి శైలీ విన్యాసానికి కొన్ని ఉదాహరణ శ్లోకాలు –
‘’దశ కన్ధరేణభ్రుశ కంపితైస్సురైరభి యాచితోధిక భియా సమన్వితైః
మిహిరాన్వయే జనిహి రామనామతః కమలాపతిస్స విమలాంబు జేక్షణః ‘’
‘’నవనావనాయ పవనాస్త్ర మోజసా దధతా సుబాహురధ తటకాసుతః
జ్వలనాశుగం చ బలనాశనేన తౌ కృశతాం గతౌ దశ శతాంగసూనునా ‘’
వర్ష ,శరత్తులను ఒకే శ్లోకం లో వర్ణించి తనకవితా ప్రతిభ చాటుకొని ‘’ దిట్టమైన కవి ‘’అనిపించాడు –
‘’సతతా నవగ్రహతటాభ్రమ౦డలా భ్రుత నీలకంఠ కృత నృత్తకా జగత్
స్వకులాయ యుక్ఖగ కులాధవార్షుకీ సమయాత్ ప్రదోష సమయో యధోర్గతిః’’
మరో శ్లోకం లో ‘’ఆగ్రహ ‘’శబ్దాన్ని తెలుగులో ప్రచారంగా ఉన్న కోపం అనే అర్ధం తో ప్రయోగించాడు .’’వ్యాఖ్యాన౦ లోకూడా ‘’తెలుగు సంస్కృతం ‘’తొంగి చూస్తూ కనిపిస్తుందని వ్యాఖ్యానించారు రాజుగారు .
ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-19-ఉయ్యూరు
