భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -6

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -6

సెప్టెంబర్  అసెంబ్లీ సమావేశాలలో విఠల్ భాయ్ సూచించిన సూచనలన్నీ సమ౦జసాలని సభ తీర్మానించగా మోతీలాల్ ‘’1928డిసెంబర్ 1లోపల అసె౦బ్లే ఆఫీస్ డిపార్ట్ మెంట్  ఏర్పడాలని దానికి ఇండియా కార్యదర్శి అనుమతికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ‘’ఒక తీర్మానం లో కోరాడు . ఈ తీర్మానం నెగ్గి డిపార్ట్ మెంట్ స్థాపన జరిగింది .విఠల్ భాయ్ తన అధికారం హద్దులుదాటి రక్షణ బిల్లుపై రూలింగ్ ఇచ్చాడనీ ,అసెంబ్లీ ఆఫీస్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేశాడని బొంబాయి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది .ఆరాతలు అధ్యక్షపీఠాన్ని కి౦చ పరచేవిగా ఉన్నాయని నిరసనగా గయాప్రసాద్ సింగ్ అద్జర్న   అడ్జర్న్ మెంట్  మోషన్ తీసుకురావాలనుకొంటే పటేల్ రూలింగ్ ఇచ్చి చర్చకు రానివ్వలేదు .ఒకసారి బ్రిటిష్ కామన్స్ సభలో డైలీ మెయిల్ పత్రిక పై నిరసన తీర్మానం ప్రవేశ పెట్టాలనుకొంటే ,స్పీకర్ మొదట అనుమతించినా తర్వాత నిరసన తీర్మానం ప్రభుత్వ విధానం మీదనే ఉండాలని  తెలుసుకొని తీర్మానాన్ని ఉపసంహరించుకోమని కోరాడు .టైమ్స్ ఆఫ్ ఇండియా తోపాటు లండన్ డైలి టెలిగ్రాఫ్ వంటి మరికొన్ని పత్రికలూ పటేల్ భాయ్ పై నిప్పులు చెరిగాయి  .ఈ ఉడత ఊపులకు చలించని మేరునగ ధీరుడు మన భాయ్ .’’నేను అధ్యక్షుడినికానా ?అస్తమానం నా చర్యలపై నిఘాఎమిటి “”?అని హాస్యం తో అన్నాడు .హోంమంత్రికూడా ఆపత్రిక ప్రకటలను నిరసించాడు .కానీ పత్రికలపై ,పత్రికా విలేకరులపై చర్య తీసుకోవటం పటేల్ కు నచ్చని విషయం .పత్రికా స్వాతంత్ర్యం ఉండాలని భావించేవాడు .ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రాలలో దీనికి విరుద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలుసు .వార౦తట వారే క్షమాపణ కోరుతారేమో అని ఆశించాడు .’’మీ సభ్యులు చెప్పిన మాటలే రాశాను ‘’అని అధ్యక్షుడికి ఆపత్రిక రాయగా ,సభ్యులు నిరసన తెలిపారు .దేశం లోని మిగిలిన పత్రికలన్నీ విఠల్ భాయ్ నే సమర్ధించి అతని గౌరవాన్ని పెంచాయి .

  పూర్వపు అధ్యక్షుడు రైట్ వివిధ శాసన సభలకు  వెళ్ళే వాడు .పటేల్ కూడా ఆసంప్రదాయాన్ని కొనసాగించాడు .దీన్ని ఒకపత్రిక విమర్శిస్తే అసెంబ్లీలోనే ‘’ఈ ఆచారం నాతోనే మొదలుకాలేదు మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ కాలం నుంచే ఉన్నదే .అసెంబ్లీ అధ్యక్షుడు రాష్ట్రీయ శాసన సభాధ్యక్షులకు మార్గ దర్శిగా ఉండాలని ఆశయం ఇందులో ఉంది .రైట్ కూడా ఇలాచాలాసార్లు చేశాడు. కార్యదర్శి మాంటేగ్ తో వెళ్లి చర్చించేవాడు అసెంబ్లీ అధ్యక్షుడు రాష్ట్ర శాసన సభాధ్యక్షులతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని మాంటేగ్ సూచించాడు .1921లో రైట్ సిమ్లాలో శాసన సభాధ్యక్షుల సమావేశం జరిపాడు .అప్పటినుంచి అందరిమధ్య సత్సంబంధాలు పెరిగాయి .నేనూ అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నాను ‘’అని ప్రకటించాడు .ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా శాసన సభాధ్యక్షుని గౌరవాన్ని కాపాడే ప్రయత్నమే విఠల్ భాయ్ చేసి సెబాస్ అనిపించాడు .

 బర్డ్ వుడ్ ఎపిసోడ్

ఇండియా సర్వ సైన్యాధ్యక్షుడైన సర్ విలియం బర్డ్ వుడ్ మిలిటరిలో భారతీయులు చేరటానికి కావలసిన విద్యా విధానం గూర్చి స్కెన్ కమిటీ వేసి ఆనివేదికను వైస్రాయ్ కి పంపగా ,అది అడ్జర్న్ మెంట్ తీర్మానం గా అసెంబ్లీకి రాగా ,బర్డ్ వుడ్ టూర్ లో ఉన్నందున అసెంబ్లీకి రాలేదు.ఆర్మీ సెక్రెటరి ఆయనబదులు వచ్చాడు .వైస్రాయ్ కూడా రానందుకు విమర్శించి వదిలేయగా ,బర్డ్ వుడ్ తిరిగివచ్చి తనతప్పు తెలుసుకొన్నాడు .

  జమేదార్ పటేల్

ఢిల్లీ అసెంబ్లీ బిల్డింగ్స్ చూడటానికి ఒకసారి ఒక అమెరికన్ దంపతులురాగా ,వారి విజిటింగ్ కార్డ్ లను పటేల్ కు ఎవరో తెచ్చిఇచ్చారు .వాటిని చూసి వెంటనే వెళ్లి స్వాగతం చెప్పాడు .వారితో ఉండి అన్నీ చూపించాడు .వాళ్ళు ఆయనను అక్కడి ‘’జమేదార్ ‘’అనుకొన్నారు .చివరికి వారిద్దర్నీ అధ్యక్ష పీఠం మీద కూర్చోపెట్టగా ,శ్రమపడి అన్నీ చూపించాడని ఉదారబుద్ధితో ఏదో ‘’బక్షీష్ ‘’ఇవ్వబోగా తిరస్కరించాడు .ఇంకా చూడాల్సినవి ఉంటె ,నౌకర్ కు చెప్పి చూపించి ,తర్వాత తన చేంబర్ లోకి ఆదంపతులను తీసుకు రమ్మన్నాడు .ఆగదిలోకి రాగానే వాళ్ళ ఆశ్చర్యం పట్టపగ్గాలు లేకుండా పోయింది .అవాక్కై పోయారు .తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు .తాము జమేదారు అని పొరబడిన వ్యక్తీ ‘’భారత ప్రభుత్వ నిర్వహణ అనే గురుతర బాధ్యతను నిర్వహిస్తున్న అసెంబ్లీ అధ్యక్షుడా ?’’అని విస్తుపోయారు .సిగ్గుతో క్షమాపణ కోరారు .

    శాసన సభా బహిష్కరణ

లాహోర్ కాంగ్రెస్ శాసనసభా బహిష్కరణ తీర్మానం ఆమోదించింది .21-1-1930న అధ్యక్షుడు పటేల్ అసెంబ్లీలో తీర్మానాన్ని పురస్కరించుకొని ‘’కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని బట్టి నా అభిప్రాయాలు మీకు తెలియ జేస్తున్నాను ‘’ఇంగ్లాండ్ కామన్స్ సభలో  స్పీకర్ ప్రవర్తన గురించి కొన్ని నియమాలున్నాయి .అతడు పార్టీ  లకుఅతీతుడుగా ఉండాలి .చక్రవర్తికిలాగానే స్పీకర్ కు రాజకీయాలు ఉండరాదు .ఒకపార్టీ  సభ్యుడి గా  గెలిచిఆపార్టీ ప్రతిపాదించగా స్పీకర్ గా ఎన్నుకోబడినా ,అన్నిపార్టీలవారూ అతనిని సభాధ్యక్ష స్థానం వద్దకు అత్యంత గౌరవంగా తీసుకు వెడతారు ,అప్పుడే అతనికితనపార్టీ  తో బంధం తెగిపోయినట్లే. అందరి వాడు అయ్యాడన్న మాట  .1923లో కాంగ్రెస్ లో అంతర్భాగమైన స్వరాజ్య పార్టీ టికెట్ పై నేను గెలిచాను  .1924లో అధ్యక్ష స్థానం లభించింది .ప్రమాణ స్వీకారం రోజే నేను అన్నిపార్టీల మనిషిని అని చెప్పుకొన్నాను .1926మార్చిలో స్వరాజ్యపార్టీవారు  నిరసన సూచకంగా బయటికి వెళ్ళారు .నేనుకూడా  వెళ్ళిపోతానేమో అని అనుకొన్నారు కొందరు .కామన్స్ స్పీకర్ లాగా ఇక్కడా అధ్యక్షుడు  తటస్థంగా ఉండాల్సిందే  .ఆనియమాన్నే అప్పుడు పాటించాను .1926చివరలో జరిగిన ఎన్నికలలోనేను స్వత౦త్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఏకగ్రీవం గా  గెలిచి ,కాంగ్రెస్ ప్రదిపాది౦చ గా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను .నా నిర్ణయాలు తీర్పులు అన్నీ నిష్పక్షపాతాలు సభ గౌరవాన్ని పెంచినవే .

   ‘’ఇప్పడు ఈ లాహోరు తీర్మానం పై నేను ఏమి చేస్తానో అని  అందరూ ఎదురు చూస్తున్నారు . ఏ పార్టీ కి  చెందని వాడినికనుక లాహోర్ తీర్మానం బట్టి నేను రాజీ నామా  చేయను .ఈ నాలుగేళ్ళు నేను చేసిన కృషి నిష్ప్రయోజనమౌతుంది .కాంగ్రెస్ వారి బదులు మరెవరో రావచ్చు. వారి విశ్వాసాన్ని కూడా పొందగలను అనే నమ్మకం నాకు ఉంది .నేను వ్యవహరించటానికి వీలులేని పరిస్థితేవస్తే మీరు నన్ను ఈ పీఠం పై చూడరు .కానీ భారత దేశ పరిస్థితులు వేరు . దేశ క్షేమం కోసం ఎప్పుడైనా అధ్యక్షుడు పదవికి రాజీనామా చేసే పరిస్థితి కలగవచ్చు

‘’సైమన్ కమీషన్ బహిష్కరణలో రాజీనామాచేద్దామా వద్దా అనే సందేహం వున్నా ఈపదవిలోనుంచే దేశ సేవ ఎక్కువగా చేయగలనని భావించి ఉండిపోయాను. ఇప్పుడుకూడా ఈ పదవి వదలరదనే అనుకొంటున్నాను .దేశ స్వాతంత్ర్యం కోసం నా  అభిప్రాయాలను ప్రభుత్వానికి  చెబుతూనే ఉన్నాను .కాంగ్రెస్ బలం అపారం ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం  ఏర్పడుతుంది అనె విశ్వాసం నాది .కనుక ప్రస్తుత పరిస్థితులలో అసెంబ్లీ అధ్యక్ష పదవికి రాజీనామా ఇవ్వటం లేదని మరో సారి తెలియజేస్తున్నాను ‘’అని తనమనోభావాలను విస్పష్టంగా ప్రకటించాడు విఠల్ భాయ్ పటేల్ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-21-ఉయ్యూరు  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.