గుజరాత్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్,స్త్రీ విద్య ఉద్యమకారిణి –శారదా మెహతా (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-నవంబర్ విహంగ మహిళా వెబ్ మాసపత్రిక 

గుజరాత్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్,స్త్రీ విద్య ఉద్యమకారిణి –శారదా మెహతా (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-నవంబర్ విహంగ మహిళా వెబ్ మాసపత్రిక 

26-6-1882 న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గోపీలాల్ మణీ లాల్ ధ్రువ అనే జుడీషియల్ ఆఫీసర్ ,బాలాబెన్ అనే నగర బ్రాహ్మణ దంపతులకు శారదా మెహతా జన్మించింది .కవి ,స౦ఘ సంస్కర్త బోలానాథ్ దివేషియా ఈమెకు మాతామహుడు . రాయబహదూర్ మేఘనాధ గర్ల్స్ హైస్కూల్ లో చదివి ,మహాలక్ష్మీ టీచర్స్ ట్రెయినింగ్ కాలేజి లో ఇంగ్లీష్ వాడుక భాష క్లాసులకు హాజరై ,1897లో మెట్రిక్ పాసయింది .లాజిక్ ,మోరల్ ఫిలాసఫీ సబ్జెక్ట్ లను తీసుకొని గుజరాత్ కాలేజి లో బి. ఏ. చదివి 1901లో గ్రాడ్యుయేట్ అయింది .శారదా మెహతా ,ఆమె పెద్దక్క ,విద్యా గౌరీ నిఖాంత్ లు ఇద్దరే మొట్టమొదటి సారిగా గుజరాత్ లో డిగ్రీ పొందిన మహిళలుగా రికార్డ్ సాధించారు .1898లో శారద వివాహం మెడిసిన్ లో నాలుగేళ్ల సీనియర్ అయిన సుమంత్ మెహతాతో జరిగింది. ఆతర్వాత భర్త మెహతా బరోడా మహారాజులు గాయక్వాడ్ ల కుటుంబ డాక్టర్ గా ,సాంఘిక కార్యకర్తగా పని చేశాడు .

శారదామెహతా సంఘ సంస్కరణలు, మహిళా విద్యావ్యాప్తి, మహిళా సాధికారత, వర్ణ వ్యవస్థ నియమాలకు, అస్పృశ్యత లకు వ్యతిరేకంగా ఉద్యమించింది. భారత జాతీయోద్యమం లో పాల్గొన్నది .1906లో గాంధీ మహాత్ముని ప్రభావం మొదటి సారిగా శారదా మెహతాపై పడింది .స్వదేశీ ఉద్యమం ,ఖాదీ వస్త్రధారణ ఆమెను బాగా ఆకర్షించాయి .1917లో గర్మితీయ అంటే ఒప్పంద సేవలకు (ఇండెట్యూర్డ్ సెర్వి ట్యూడ్ ) వ్యతిరేకంగాఒక పెద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. 1919 ‘’నవ జీవన్ ‘’పత్రిక నిర్వహణలో ఎడిటర్ ఇందూలాల్ యాజ్ఞిక్ కు సహాయ సహకారాలదించింది.

1928లో అహ్మదాబాద్ లో జరిగిన గుజరాత్ కిసాన్ పరిషత్ సభలలో శారద పాల్గొని,రాష్ట్ర గవర్నర్ ను కలిసి బార్డోలి రైతు సత్యాగ్రహానికి సరైన, న్యాయమైన పరిష్కారం త్వరగా సాధించమని,ఆసంఘ ప్రతినిధిగా వ్రాతపూర్వకంగా కోరింది .అహమ్మదాబాద్ లోని వస్త్ర పరిశ్రమ లోని కూలి జనాలకు సౌకర్యం కోసం’’ రాయల్ కమీషన్ ఆన్ లేబర్’’ ఎదుట ప్రదర్శన నిర్వహించి దృష్టికి తెచ్చింది .1930 సహాయ నిరాకరణ ఉద్యమం లో కల్లు దుకాణ ముందు పికెటింగ్ నిర్వహించింది. అహ్మదాబాద్ లోని షెర్తా లోని భర్త ఆశ్రమ౦ లో ఖాదీ స్టోర్స్ ఏర్పాటు చేసి సమర్ధం గా నిర్వహించింది .1934లో ‘’అప్నా ఘర్ ని దుకాన్ ‘’అనే కో ఆపరేటివ్ స్టోర్స్ స్థాపించి అందరికి ఉపయోగం లోకి తెచ్చింది .

అహ్మదాబాద్ ,బరోడా ,బాంబే లలోని అనేక విద్యా ,స్త్రీ సంక్షేమ సంస్థలలో సభ్యురాలై, శారదా మెహతా తన సహాయ సహకారాలు, సేవలు అందజేసింది .బరోడా ప్రజా మండల అనే బరోడా ప్రజా సంఘం లో ఆమె సభ్యురాలు .1931నుంచి 1935వరకు అయిదేళ్ళు అహమ్మదాబాద్ మునిసిపాలిటిమెంబర్ గా సేవ చేసింది .స్త్రీసంక్షేమ సేవ కోసం 1934లో ‘జ్యోతి సంఘ్ ‘’స్థాపించింది.

మహిళా విద్యా వ్యాప్తి కోసం అహరహం కృషి చేసిన మహిళా మాణిక్య౦ శారదా మెహతా .దీనికోసం అహమ్మదాబాద్ లో ‘’వనితా విశ్రామ మహిళా విద్యాలయం ‘’నెలకొల్పింది .కార్వే మహిళా యూని వర్సిటి కి అనుబంధంగా ఒక మహిళా కాలేజి కూడా స్థాపించింది.

భారతీయ వేదాంతం ,హిందూ సంస్కృతీ శారద కు గొప్ప స్పూర్తి నిచ్చాయి .సంస్కృత సాహిత్యం ఆపోసన పట్టింది .అరవింద, సుఖలాల్ సంఘ్వి, సర్వేపల్లి రాధా కృష్ణ వేదాంత గ్రంథాలన్నీ చదివి పూర్తిగా అర్ధం చేసుకొన్నది. వీటిపై అనేక వ్యాసాలూ, జీవిత చరిత్రలు రాయటమేకాక, చాలా అనువాదాలు కూడా చేసింది .దిన, వార, మాసపత్రికలలో సాంఘిక విషయాలపై వ్యాసాలూ రాసింది.బాలలవిద్యా, నైతిక వికాసం కోసం ‘’పురానోని బాల్ బోధక్ వార్తా ‘’ అనే కథల సంపుటి రాసి1906లోనే ప్రచురించింది. ’’ఫ్లారెన్స్ నైటింగేల్ జీవిత చరిత్ర ‘’‘’ స్పూర్తి దాయకంగా ’కూడా అదే సంవత్సరం లో రాసి ముద్రించింది .1920లో ‘’గృహ వ్యవస్థ శాస్త్రం ‘’రచించింది. బాల,బాలికల విద్య కోసం ‘’బాలకోను గృహ శిక్ష ‘’రాసి ,1922లో వెలువరించింది . 1938లో శారదా మెహతా తన ఆత్మ కథ’, ఉద్యమాలు, మనోభావాలు, పోరాటాలు,సేవా వివరాలు వివరిస్తూ ’జీవన సంభారణ ‘’రాసి ప్రచురించి మహిళలకు స్పూర్తి, ప్రేరణ కలిగించింది. దీనిలో 1882నుంచి 1937 వరకు సుమారు 55ఏళ్ల ఆమె అనుభవాలు జ్ఞాపకాలు ఉన్నాయి . అక్కయ్య తో కలిసి శారదా మెహతా రమేష్ చంద్ర దత్ రాసిన బెంగాలీ నవల ‘’సంసార్’’ను ‘’సుధా హాసిని ‘’గా 1907లో అనువాదం చేసింది. 1911లో మహారాణీ ఆఫ్ బరోడా, రాసి అందులో భారతీయ జీవిత విధానం లో మహిళాపాత్ర గా రాణీ చిమన్ బాయ్ జీవితాన్ని వర్ణించి చూపింది. దీన్ని 1915లో గుజరాతీ భాషలో ‘’హిందూసస్థాన్ మా స్త్రీ వోను సామాజిక్ స్థాన్’’ గా రాసింది. సాతే అన్న భౌ రాసిన నవలను ‘’వర్ణనే కాంతే’’గా అనువదించింది .

బహుముఖీన ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించి భారత స్వాతంత్ర్య ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించి, మహిళా సాధికారత, విద్యా, గౌరవం కోసం, లేబర్ సోకర్యాల కోసం అహర్నిశలూ కృషి చేసిన, సాహిత్యోపజీవి ధన్యజీవి శారదా మెహతా 13-11-1970 న 88 ఏళ్ళ సార్ధక జీవితం గడిపి మరణించింది.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.