మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్

 మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్

మరాఠీ భాషలో నవకవిత్వానికి నాంది పలికి కేశవ సుత్,అటు బెంగాలీలకు  మైకేల్ మధుసూదన దత్ ,ఉర్దూ భాషాభిమానులకు హాకీ ,గుజరాతీయులకు నర్మద్ ల సరసన చేరాడు .ఈ శతాబ్ద సాహిత్య చరిత్రలో వీరు మైలు రాళ్ళు .వీరందరూ వాగ్గేయకారులే . జాతీయ చైతన్యానికి పాశ్చాత్య సంస్కృతీ ఎలా దోహదం చేసిందో తమ రచనలద్వారా స్పష్టం చేసిన వాళ్ళు .మరాఠీనవలారచనలో హరి నారాయణ ఆప్టే సాధించిన ఘనత కేశవ సుత్ మరాఠీ కవితా నిర్మాణ శక్తికి కలిగించాడు .దేశీయ ,విదేశీయ ప్రతి ధ్వనుల ప్రపంచం లో కేశవ సుత్ ధ్వని విస్పష్టమైనది .ఈ కవి జీవితచరిత్రను ప్రభాకర్ మచ్వే మరాఠీ లో రాయగా ,శ్రీ ఎస్ .సదాశివ తెలుగులోకి అనువాదం చేస్తే ,కేంద్ర సాహిత్య అకాడెమి 1970 లో ముద్రించిండ్ .వెలరూ-2-50.

  జీవితం

మొదట్లో సంప్రదాయ పద్ధతిలో రాసి తర్వాత తన స్వీయ భావ వ్యక్తీకరణకు స్వంత శైలిని ఏర్పాటు చేసుకొన్నాడు .1885 రఘు వంశ కావ్యానికి అనువాదం చేశాడు .తర్వాత నిత్య వ్యవహార భాషలోని సొగసును ప్రదర్శించి ,,కావ్య భాషా విరుద్ధ పదాలను చాలా వాడాడు .ఆత్మాశ్రయ కవిత్వానికి ,,భావనలో ఆత్మ విశ్వాసాన్నీ కలిగించి ,కవితా ప్రయోజనాన్ని నిరూపించటం లో సాటిలేని నిజాయితీ ప్రదర్శింఛి ,ఆధునిక మరాఠీ ‘’లిరిక్ ‘’కు ప్రాణదాత  అయ్యాడు .అతని ఆవ్య రత్నావళి లో ఎ కవిత్వమా చదివినా మరుభూమిలో సుందర పుష్ప దర్శనం లా ఉంటుంది .అతనిలోని చైతన్య ,తాదాత్మ్యాలు రసానుభూతి కలిగిస్తాయి .ఆంగ్ల ప్రకృతి కవి వర్డ్స్ వర్త్ కవితలలాగా సరళ ,ధ్యానముద్ర కలవి గా ఉంటాయి .

  అగార్కర్ ప్రభావం వలన కేశవ సుత్ సర్వమానవ సౌభ్రాత్రుత్వాన్నీ ,సంఘ సంస్కరణను అభిలషించాడు .సాంఘిక దురాచారాలు ,మూఢ సంప్రదాయ నిరసనగా ‘’నవ సిపాయి ‘’రాశాడు .అతని కవితలు ఆలోచనాత్మకాలు .సాంప్రదాయ’’ చెమ్మా చెక్కా ఆట’’ –జిమ్మా లో మాటిమాటికీ వాడేపదం-‘’జా –పోరీ –జా ‘’ను క్లుప్తం చేసి ‘’జపుర్జా ‘’కవిత రాశాడు .’’హరప్ లే శ్రేయా’’ కవితలోఎదో వింతలోకం లో ,సృష్టికి అంతటికీ నిలయమైన దాన్ని పొందాలని ఉవ్విళ్ళూ రాడు .దీనిపై వర్డ్స్ వర్త్ కవిత –‘’ఓడ్ టు ఇంటిమేషంస్ ఆఫ్ ఇమ్మోర్టాలిటి”  ప్రభావం ఉందన్నారు విశ్లేషకులు .19వ శతాబ్ది ప్రారంభం లో రవీంద్రుడు ఏర్పరచిన నవ చైతన్యానికి ఏర్పరచిన మూడు విషయాలు-ప్రకృతిపై పరతత్వ దృష్టి ,మాతృదేశ విముక్తి కాంక్ష ,సాంఘిక న్యాయానికి మానవతా వాదం మూడూ కేశవ సుత్ కవిత్వం లో త్రివేణీ సంగమం గా ఉన్నాయి .

  కేశవ్ తమ్ముడు సీతారాం కేశవ్ దామ్లె రాసిన అన్న గారిజీవిత చరిత్రలో  జనన తేదీని 15-3-1866 ఫాల్గుణ బహుళ చతుర్దశి గా చెప్పాడు కానీ దీనిపై ఏకీ భావం రాలేదు .కొందరు ప్రామాణికులు 7-10-1866గా నిర్ణయించారు సంవత్సరం ఒకటే నెలా, తేదీలు మారాయి .ఈ కవి 39వ ఏట హుబ్లి లో 7-11-1905 న ప్లేగు వ్యాధితో మరణించాడని ,ఆతర్వాత ఎనిమిది రోజులకు భార్యకూడా చనిపోయిందనీ  నిర్ధారించారు .తనపుట్టిన ఊరు  గురించి కవి ‘’నైరుత్యే కడీల్ వారా ‘’కవితలో మాల్గుండా గ్రామాన్ని సంస్కృతీకరించి మాల్యకూటం గా చెప్పాడు .ఏక్ ఖేడే కవిత లో వర్ణించిన ప్రకృతి ని చూస్తె ‘’వశ్నే’’గ్రామం అని అన్నారు .ఈ గ్రామ వర్ణన వర్డ్స్ వర్త్ రాసిన ‘’ప్రేల్యూడ్’’ను పోలి ఉంటుంది .

  కేశవ తల్లి మల్దౌలీ జమీన్దారులులైన కరదీపుల ఇంట పుట్టింది .1902లో ఉజ్జైన్ లో చనిపోయింది .భావుకత ,ఆస్తిక్యం ,విశాల హృదయం ,ఉదారమానవత ఆమెకు పెట్టని సొమ్ములని   ఒకకవితలో కొడుకు రాశాడు .

  తండ్రి కేశవ విఠల్ ఉపాధ్యాయుడు .వ్యవసాయమూ ఉంది .అతని జీతం నెలకు మూడు రూపాయలతో మొదలై 39తో ముగిసింది .అనారోగ్యం వలన ముందే రిటైరై 11రూపాయల ఉపకార వేతనం పొందాడు .తర్వాత స్వంతూరిలో విశ్వనాథ మా౦డలిక్ కు  సంబంధించి  భూవ్యవహారాలూ చూసేవాడు .క్రమ శిక్షణ నిజాయితీ ఆత్మశక్తి ఆయన సొమ్ములు .1893లో చనిపోయాడు .

  తలిదండ్రుల సంతానంలో  కేశవ సుత  నాలుగవ వాడు .అయిదుగురు సోదరులు ,ఆరుగురు ఆడపడచులు .పెద్దన్నయ్య 11 ఏట నీట మునిగి చనిపోయాడు .రెండవ అన్న శ్రీధర్ రత్నగిరి హైస్కూల్ లో ఫస్ట్  గా పాసై జగన్నాథ శంకర్ సేట్ స్కాలర్ షిప్ పొందిన మేధావి .1882లో ఎల్ఫి౦ టన్ కాలేజి లో బిఎ పాసై ,బరోడా కాలేజి లో సంస్కృత లేక్చరర్ గా చేరాడు .కాని ఏడాది లోపే టైఫాయిడ్ తో మరణించాడు .

   సుత్ చదువు సంధ్యలు

ఖేడ్ లో చిన్నతమ్ముడి తో కలిసి చదివి ప్రాధమిక విద్య పూర్తీ చేసి ,ఉన్నత విద్యకోసం బరోడా వెళ్ళారు సోదరులు సుత్ కు 15,తమ్ముడికి 13 వయసుకే పెళ్ళిళ్ళు జరిగాయి .కేశవ సుత్ భార్య చితళే వంశానికి చెందిన రుక్మిణీ దేవి పెళ్లి  నాటికి ఆమె వయసు 8..రూపవతికాకపోయినా  దయామయి ,కష్టజీవి .ఇద్దరికీ సిగ్గు ఎక్కువే .మామగారు కేశవ గంగాధర చిదలే .ఖాందేశ్ జిల్లాలో చాలీస్ గావ్  మరాఠీ హైస్కూల్ హెడ్ మాస్టర్ .సుత దంపతులకు  మనోరమ వత్సల ,సుమతి కుమార్తెలు .మహతారీ కవితలో రెండో కూతురిగురించి రాశాడుసుత్.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-11-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.