
గబ్బిట దుర్గా ప్రసాద్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2
163-పార్వతీ రుక్మిణీయ కవి-విద్యా మాధవుడు
శివ పార్వతి కల్యాణాన్ని ,శ్రీ కృష్ణ రుక్మిణీ కల్యాణాన్ని కలిపి ‘’పార్వతీ –రుక్మిణీయం ‘’అనే ద్వ్యర్ధి కావ్యం గా రాశాడు విద్యా మాధవుడు .చాళుక్య రాజు సోమదేవుని ఆస్థాన కవిగా ఈ కవి ఉండేవాడు .1126-1138 కాలం కళ్యాణ రాజు నాల్గవ సోమేశ్వరుడే ఈ సోమదేవుడు .మనకవిగారు గుణవతి దగ్గర నీలాలయం లో జన్మించాడు .వేదం,శాస్త్రాలన్నీ నేర్చాడు .కిరాతార్జునీయం మొదలైన వాటిపై పై వ్యాఖ్య రాశాడు .కవిరాజు తన తోకలిపి మహా కవులు ముగ్గురే అన్నాడు .మిగిలిన ఇద్దరు బాణుడు ,సుబందు .విద్యా మాధవుడు.ఇంకో అడుగు ముందుకు వెళ్లి బాణ ,సుబందు ,కవిరాజుల తర్వాతా నాలుగో వాడిని నేనే అని చెప్పుకొన్నాడు .కవిరాజుకన్నా చిన్నవాడేకాని సమకాలికుడు .
అంతకు ముందే రామాయణ భాగవత కధలను ‘’యాదవ రాఘవీయం ‘’గా రాశాడు వేంకటాధ్వరి .అతనిపదిహేడవ శతాబ్ది రచన ‘’విశ్వ గుణాదర్శం ‘’విశిష్టమైన రచనగా పేరొందింది .కఠిన పదాలతో యమకాను ప్రాసలతో సాగిన రచన అది .ఐతే కవిరాజు కావ్యానికి ఇది తీసికట్టు .దీనిపైనా వ్యాఖ్యానం వచ్చింది .బహుశా కవి రాసిన వ్యాఖ్యానమే అది అయి ఉండచ్చు .
164- రాఘవ యాదవీయ కవి-సోమేశ్వరుడు
వింజమూరి కుటుంబానికి చెందిన కృష్ణ సూరి కుమారుడే సోమేశ్వరుడు .గౌతమ గోత్రీకుడు .పది హీను కా౦ డాలున్న ‘’రాఘవ యాదవీయ౦ ‘’రాశాడు .ఇందులో శ్రీ రామ,శ్రీ కృష్ణ చరిత్రలను వర్ణించాడు .ఇది ద్వ్యర్దికావ్యం .కాళిదాస ,భారవి ల శబ్దాలానే ప్రయోగించి అమరకవి లాగా ఏకాక్షర పదాలనూ వాడాడు .ఇది కావ్యమే కాదు అలంకార గ్రంధం కూడా .విపులమైన వ్యాఖ్యానమూ ఉంది ..ఇదే పేరుతో రఘునాదా చార్యుడు ,శ్రీనివాసాచార్యుడు ,వాసుదేవుడు కూడా రాశారు .రామ చంద్రుని ‘’రసిక రంజనం ‘’అనేది శృంగార ,వైరాగ్య అర్ధ భావాలను తెలియ జేసే కవితల సంపుటి .1524 లో రాసిన రామ చంద్రుడు లక్ష్మణ భట్టు కుమారుడు .
165-త్ర్యర్దికావ్య రచనకు నాంది పలికిన ‘’చిదంబర కవి ‘’
ఇలా ద్వ్యర్దికావ్యాలు మూడు పూలు ఆరుకాయలులాగా వర్ధిల్లిన కాలం అది .మరో అడుగు ముందుకు వేసి త్ర్యర్ది కావ్య రచన చేశారు కవులు .మూడు రకాలైన కధలను ఒకే కావ్యం లో చెప్పటమే త్ర్యర్దికావ్యం .రాఘవ యాదవ పాండవీయం లో రామాయణ మహా భారత భాగవత కధలను ఒకే చోటమూడు కాండలలో చెప్పాడు’’చిదంబర కవి ‘’.ఇతడు అనంత నారాయణ వెంకటా లకుమారుడు .కౌశిక గోత్రానికి చెందిన సూర్య నారాయణ కు మనవడు .శ్రీనివాసుడు ఇతని తమ్ముడు .శివ సూర్య ఇతని మేనమామ .ఇతని ‘’భాగవత చంపు ‘’కృష్ణ కదామృతమే .డిండిమ కు చెందిన ముల్లనద్రం నివాసి .1586-1614ప్రాంతపు విజయ నగర రాజైన మొదటి వెంకట ఆస్థానం లో ఉండేవాడు .ఈ గ్రంధం పై వ్యాఖ్యానం ఉన్నది .తండ్రి అనంత నారాయణుడే రాశాడు .కావ్యం లోని మూడు అర్ధాలను చక్కగా విడమరచి విపులంగా అర్ధ మయెట్లు రాశాడు .ఈ కవి ఇంకాస్తముందుకు వెళ్లి ‘’పంచ కళ్యాణ చంపువు ‘’రాశాడు అందులో రామ ,కృష్ణ ,విష్ణు, శివ ,సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణాలను ఐదింటిని ఒకే సారి వర్ణించాడు .తానే విపుల వ్యాఖ్యానమూ రాసుకొన్నాడు .
మైసూరుసంస్థానం లో ఉదయేంద్ర పురానికి చెందిన అనంతా చార్యుడు ‘’యాదవ –రాఘవ –పాండవీయం ‘’రాశాడు .రాజాస్థాన కవ యిత్రి ‘’త్రివేణి ‘’కి ఈయన తండ్రి .కృష్ణ ,నల ,హరిశ్చంద్ర ,కధలను చతురర్ధ కావ్యం ‘’ఆబోదాకర ‘’గా ఘనశ్యామ కవి రాశాడు .ఇలా అనంతార్ధ కావ్య విజ్రు౦భణ జరిగింది .సాహిత్యం పరిపుష్టి చెందింది .కాని దాన్ని పగల కొట్టి విడమర్చి చెప్పాల్సిన వింత పరిస్తితి ఏర్పడింది .
166-మేఘ విజయ గని –
జైన సన్యాసి అయిన మేఘ విజయ గని క్రిపావిజయుని శిష్యుడు .హీరవిజయకు అయిదవ తరం వాడు .వ్యాకరణ,ఖగోళ ,మీమాంస ,శాస్త్రాలలో ఉద్దండుడు .వీటిపై విపులంగా గ్రంధాలు రాశాడు .అతడు రాసిన ‘’సప్త సంధాన కావ్యం ‘’లో తన కవితా ప్రతిభ ఏమిటో నిరూపించుకొన్నాడు .ఈ కావ్యం లో ఒకే సారి ఏడు రకాల కధలను అల్లాడు .మధుర భాషా సంపద దీనిలో కనిపిస్తుంది .’’దేవానందాభ్యుదయం ‘’కావ్యం లో ఏడు కాండాలలో ‘’విజయ దేవ సూరి ‘’జీవితాన్ని చిత్రించాడు .ఇది 1671లో రాసిన పుస్తకం .’’శాంతి నాద చరిత్ర ‘’లో శాంతినాధుని జీవితాన్ని వర్ణించాడు ఈరెండు కావ్యాలలో విజయగని శిశుపాల వధ ,నైషద కావ్యాలలోని పంక్తులను సమస్య కోసం గ్రహింఛి తన స్వంత కవిత్వం తో వాటి ఉత్ర్కుస్టతను చాటి చెప్పాడు.
మేఘ విజయ గని కవి తన ‘’సప్త సంధాన మహా కావ్యం ‘’లో ప్రతి శ్లోకం లోను ‘’వృషభ నాద ,శాంతి నాద ,పార్శ్వ నాద ,నేమినాద ,మహావీర ,కృష్ణ ,బలదేవ లను వర్ణించాడు .ఇందులో మొదటి అయిదుగురు ఇరవైనలుగురు జైన తీర్ధ౦కరులలో ఉన్నారు .తొమ్మిది కాండాలలో వీరిపై అనేక కధలు రాశాడు .అతి సరళంగా సుందరం గా కవిత్వాన్ని అలవోకగా జాలువారించాడు .అతని సంస్కృత పరిజ్ఞానానికి ముగ్దులయేట్లు చేస్తాడు .
హేమ చంద్ర సూరి కూడా’ సప్త సంధాన కావ్యం ‘’రాసినట్లు ఉందికాని కావ్యం అలభ్యం .ఆ లోపాన్ని మేఘ విజయ సూరి పూరించి గొప్ప మేలు చేశాడు .కాళిదాసమహాకవి మేఘ సందేశ కావ్యం లాగా గని ‘’మేఘ దూత సమస్య లేఖ ‘’రాశాడు ఇందులో కవి తన ప్రభువు గచ్చ విజయ ప్రభ సూరి ‘’కి రాసిన లేఖ ఉంది .విజయప్రభ సూరి జీవితం పై పదమూడు కాండల ‘’దిగ్విజయ మహాకావ్యం ‘’రాశాడు విజయ గని . ‘’ సమకాలీన వేదాంతుల సిద్ధాంతాలను ఖండిస్తూ దృష్టాంతం గా మేఘ విజయ గని రాసిన నాటకమే ‘’యుక్తి ప్రబోధం ‘’..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-15-ఉయ్యూరు
ముసలి మనసుల మానసికోల్లాసం –F.M.రేడియో
ఏ చానల్ చూసినా ఏదో ఒక రాద్ధాంతం , సిద్ధాంతంపై అనవసర చర్చలు .లేకపోతే ఒకే హీరో గారి మూస సినిమాల దాడి .ఏ సీరియలోను రియల్ గా ఉండేది ఏమీలేదు .అన్నీ కుతంత్రాలు ,ఆరళ్ళు ,భీభత్సాలు ,పగలూ ప్రతీకారాలు మాయలు మంత్రాలు .ఇవన్నీ చూస్తూ బంగారం లాంటి సమయాన్ని ఖర్చు చేసి మనం పొందే మానసిక ఆనందం కాని ,త్రుప్తికాని లేదు .ఇక భక్తీ చానళ్ళ విషయానికొస్తే ఒకాయన భారతం దగ్గర్నుంచి’’ పల్లీలు బటానీలు’’దాకా నాన్ స్టాప్ గా వాయిస్తాడు .మరో ఆయన ఏది మొదలు పెట్టినా శాఖా చంక్రమణం చేసి కద అంగుళం కదలకుండా ఎపిసోడ్ లకు ఎపి సోడులు నవిలి మింగేస్తాడు .మరో ఆయన ఆయన ఏం చెబుతాడో ఆయనకే అర్ధం కాని అగమ్య గోచరం .సూటిగా సరళంగా చెప్పే వ్యక్తీ దుర్భిణీ వేసినా దొరకటం లేదు .ఏదైనా నేర్చుకొనే విజ్ఞానం ఉందా అంటే అదీ గగన కుసుమమే .అందుకే అలసిన ముసలి మనసులకు ఆరోగ్యా తెరపి ఎఫ్ ఏం రేడియో అంటాను నేను .నేను అదే అనుసరిస్తూ. టెన్షన్ లేకుండా హాయిగా ఉన్నాను .ఆ వివరాలే మీకు చెబుతున్నాను .
రెయిన్ బౌ కృష్ణ వేణి
విజయ వాడ నుండి ప్రసారమయ్యే ఆకాశవాణి వారి ‘’రెయిన్ బౌ ‘కృష్ణ వేణి ’ఎఫ్ ఏం .చాలా హాయిగా ఉంటుంది .ఉదయం అయిదింటికి చక్కగా భక్తీ సినిమాల పాటలు వస్తాయి .ఏదైనా పని చేసుకొంటూ వినచ్చు .లేక పోతే నా బోటి బద్ధకిస్టూ వింటూ అరమూత కనులలో నిద్రా మెలకువ స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఆ పాటల మాధుర్యాన్ని అనుభవించవచ్చు .ఉదయం ఆరు గంటలకు సంప్రదాయ భక్తీ సంగీత ప్రసారం జరుగుతుంది .ఏడు గంటలవరకు ఇది ప్రసారమౌతుంది .ఈరెండు గంటలు మనం అలౌకిక ఆనందం లో మునిగి పోతాం .ప్రతి గంటకు రెండు నిమిషాల ముఖ్య వార్తాప్రసారం ఉంటుంది .ఉదయం ఏడు తర్వాత నేనెప్పుడూ దీన్ని వినలేదు .కుర్రకారుకు కావాల్సిన మిర్చి మసాలా అంతా రాత్రి తొమ్మిది దాకా ఉంటుంది .కావాలనుకొనే వాళ్ళు వినచ్చు. నాకు అంత సీను లేదు .నేను వినను .రాత్రి పదిగంటలకు నిజం గా అమృత సమయం .’’ఆపాత మధురాలు’’ పేరిట ఎన్నో పాత సినిమా పాటలు వినిపిస్తారు పదకొండు గంటల దాకా .ఆ గంటా మళ్ళీ ఏదో లోకం లో విహరిస్తున్నట్లే ఉంటుంది శ్రావ్యతకు ప్రాముఖ్యమిస్తారు .ఘంట సాల మేస్టారి పాటలు వింటూంటే పానకం తాగినట్లు భానుమతి పాటలు వింటూ ఉంటే స్వర్గ సీమలో విహరిస్తున్నట్లు మనసున మల్లెల మాల లూగుతున్నట్లు ఉంటుంది .ఏం ఎస్ రామారావు ,ఏ ఏం రాజా లీల గీతాలు ఉల్లాసం ఉత్తేజం కల్గిగిస్తాయి . ఎవరికి వారు విని అనుభవించాల్సిందే . రాత్రి పదకొండుగంటలకు దక్షిణాది భాషా సినీ సంగీతం వస్తుంది .ఆసక్తి ఉన్నవారు విని ఆనందించవచ్చు .నాకు మాత్రం ఉదయం అయిదు నుండి ఏడు వరకు ,రాత్రి తొమ్మిదిన్నర నుండి పదకొండు వరకు అదే కాల క్షేపం .మంచం మీద పడుకొని దొర్లుతూ విని ఆనందిస్తా .బుధవారం రాత్రి తొమ్మిదిన్నరకు ఆకాశ వాణి నాటకం ,ఆ తర్వాతవచ్చే సంగీత కచేరి వింటా .ఆదివారం మధ్యాహ్నం మూడుగంటలకు వచ్చే గంట నాటకం రాత్రి వచ్చే సంగీతం వినటం ఎన్నో ఏళ్ళుగా వస్తున్న అలవాటు .
అయితే ఈ రెయిన్ బౌ లో ఒకరిద్దరు జాకీ కుర్రాళ్ళు ‘’ఫ్రెండ్స్, ‘ఫ్రెండ్స్ ’అంటూ నిమిషానికి పది సార్లు అంటూ రాత్రి పూట ఆ హాయైన అందమైన సమయాన్ని వృధా చేస్తున్నారు .అది లేక పొతే మరీ రక్తి కట్టిస్తుంది .మధురమైన పాటలకు వారేమీ ఇంట్ర డక్షన్ చెప్పక్కర్లేదు .వాళ్ళు చెప్పినా దాని మాధుర్యాన్ని పాడు చేయటమే చేస్తున్నారు .దీన్ని అధికారులు గుర్తిస్తే ఎంతో మేలు చేసిన వారవుతారు .అలాగే ఒక రోజు వేసిన పాటలను మర్నాడే రిపీట్ చేస్తే వైవిధ్యం ఉండక బోరు కూడా కొడుతుంది .కనుక గాప్ ఇవ్వాలి .అప్పుడే చిక్కగా చక్కగా కార్యక్రమం నడుస్తుంది .మరో విషయం వారి ‘’ యాడ్’’ గా-‘’రేడియో కృష్ణవేణి –విజయవాడ విజయవాడ’’ అని చెప్పేది ఆకర్షణీయం గా లేదు .లాగుడుగా ఉంది .మార్చే వీలుంటే మార్చాలి . ఇలా రైన్ బౌ కృష్ణ వేణి అలసిన ముసలి మనసులకు అందమైన దివ్యమైన అనుభవాన్నిస్తోంది .దీన్ని నిర్వహిస్తున్న ఆకాశ వాణి విజయ వాడ కేంద్రానికి అభి నందన శతం .ఈ మధ్య 103 మీటర్ల మీద ఆకాశ వాణి వారిదే మరో ఎఫ్ ఏం వస్తోందని తెలిసింది .నేను ఇంకా వినలేదు . ఆహ్వానిద్దాం .
రెడ్ ఎఫ్ ఏం
రెడ్ ఎఫ్ ఏం ఎవరిదో నాకు తెలియదుకాని ఇదీ చాలా బాగుంది .ఉదయం అయిదు నుంచిఏడు గంటలదాకా ఇందులోనూ మంచి భక్తీ సంగీతం వస్తుంది .అనేక వైవిధ్యభరితమైన భక్తిపాటలు కీర్తనలు ,వినిపిస్తారు .ఈ సమయం లో ఉండే జాకీ ఒకామ్మాయి చాలా విషయాలను సేకరించి మనకు తెలియ జేసి సంతోష పరుస్తుంది . చాగంటి వారి ప్రవచనమూ సాగుతుంది ఎడ్లరామదాసు కీర్తనలు బాలమురళి తత్వాలు హైలైట్ . చాలా బాగా ఉంటాయి .ఎందరో కొత్త గాయినీ గాయకులూ తమ స్వర మాధుర్యంతో దీన్ని సుసంపన్నం చేస్తున్నారు అభినందనలు ..వీలున్నప్పుడు దీన్నీ వింటూ ఉంటాను .ఏడు గంటలనుండి రాత్రి తొమ్మిదిదాకా యువతను ఉర్రూత లూగించే పాటలు మాటలతో వారిని బాగా ఆకర్షిస్తోంది .వీటి జోలికి నేనెప్పుడూ వెళ్ళలేదు .
రెడ్ ఎఫ్ ఏం లో రాత్రి తొమ్మిది నుంచి పద కొండువరకు మధుర మైన పాటలు వినిపిస్తారు .’’రెడ్ క్లాసిక్స్ ‘’పేరిట కృష్ణం రాజ్ చెప్పే విషయాలు ఆసక్తిదాయకం గా ఉంటాయి .సినిమా రంగం లో పేరుపొందిన నటులు నటీమణులు ,దర్శకులు నిర్మాతలు పాటల, సంభాషణ రచయితలూ ,ఛాయాగ్రాహకులు సంగీత దర్శకులు మొదలైన వారినందరినీ కృష్ణం రాజ్ పరి చయం చేసే తీరు అత్యద్భుతం .మూలాలోకి చొచ్చుకొని వెళ్లి విషయ సేకరణ చేసి అందంగా హాయిగా అందించే ‘’రాజ్ ‘’రెడ్ ఎఫ్ .ఎం. కు నిజంగానే ’’ రాజే ‘’నని పిస్తాడు .మధ్య మధ్యలో వచ్చ్చే క్లాసికల్ సాంగ్స్ వింటూ మనం మైమరచి పోతాం .ఆ మధుర సుందర స్వర్గ సీమ లో నుంచి బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది ‘’హాట్స్ ఆఫ్ టు కృష్ణం రాజ్’’ .
మిర్చి –చాలా హాట్ గురూ
ఏ సెంటర్ లో విన్నా ,ఏ బస్ లో ,ఏ కారులో విన్నా రేడియో మిర్చి వినిపిస్తూనే ఉంటుంది .కుర్రకారుకు కిక్కెక్కించే ఎన్నో విషయాలు రేడియో మిర్చి హాట్ హాట్ గా అందిస్తుంది .దాన్ని వినని విని ఆనందించని కుర్ర్రాడు ఉండడు .క్రికెట్ స్కోర్ నుంచి ట్రాఫిక్ దాకా అది స్పృశించని అంశం ఉండడు .అందులో మరీ ఆకర్షణీయమైనది ‘’రాంబాబు కబుర్లు ‘’ ‘’బాబు బాగా బిజీ’’అని టెలిఫోన్ మోగినప్పుడు వినిపించే అమ్మాయి’’ హస్కీ వాయిస్’’ గమ్మత్తుగా ఉంటే రాంబాబు మిత్రుడితో సంభాషిస్తూ చెప్పే సినీ సిత్రాలు మరింత హాట్ కేక్ లే అనిపిస్తాయి .రోజుకు నాలుగైదు సార్లు వస్తుంది .వెరైటీ ఉంటుంది .సినీ,రాజకీయాలపై సంధించే వ్యంగ్యాస్త్రమే ఇది . కడుపుబ్బా నవ్విస్తూ అవతలివారిని నవ్వుల చేన్నాకోల్ తో బాదేస్తున్నట్లని పిస్తుంది . దీన్నిమాత్రం నేనెప్పుడైనా హైదరాబాద్ లో మా అబ్బాయిల కార్ లో వెడుతున్నప్పుడు వాళ్ళు పెట్టె మిర్చి లో విని ఎంజాయ్ చేస్తాను .మిగిలినవేవీ కావాలని వినను .
మిర్చి కూడా ఉదయం అయిదింటి నుంచి ఏడు వరకు’’ దేవరాగం ‘’వస్తుంది దీన్ని భారతి అనే అమ్మాయి మహా గొప్పగా నిర్వ హిస్తుంది ‘’’దేవరాగం విత్ భారతి ‘’అందరూ విని తీరాల్సింది .ప్రతి రోజు తిదినక్షత్రాలు వర్జ్యం దుర్ముహూర్తం తో బాటు ఆ రోజు ప్రత్యేకత ఏమిటో భారతి చెప్పే విషయాలు మనకు అంతకు ముందు ఎప్పుడూ వినని విషయాలే .ఎక్కడి నుంచి సేకరించి ఆ మహా తల్లి అందిస్తుందో మహాశ్చర్యం .పురాణాలు చారిత్రికవిషయాలు పండగలు పబ్బాలు మన రాష్ట్రం లో మాత్రమె కాదు దేశం లో ఏ రాష్ట్రం లోనైనా ఏ ప్రాంతం లోవైనా భారతి తెలియ జెప్పే తీరు ముచ్చటగా ఉంటుంది .మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాటలు దోర్లుతున్నా అవీ ఇంపుగానే ఉంటాయి భారతి గొంతులో. అదే ఈ కార్య క్రమం ప్రత్యేకత .దిన ప్రాధాన్యాన్ని మహా వివరంగా తెలియ జేస్తుంది భారతి .దైవరాగం విత్ భారతి వింటూ ఉంటే దైవ లోక సందర్శనం చేసినట్లే ఉంటుంది .దీనికి కారణమైన భారతిని ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది .
ఈ రెండు గంటలలో క్లాసికల్ మ్యూజిక్ తప్పక ఉంటుంది .బాలమురళి ని వినచ్చు .పట్టమ్మాళ్ ,సుబ్బులక్ష్మి మొదలైన సంగీతజ్ఞులస్వరాభి షేకం లో నిండా మునిగి పోవచ్చు .భక్తీ జ్ఞాన వైరాగ్యాల పై పాటలు మహా ఇంపుగా ఉంటాయి .ప్రతి రోజు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఉంటుంది .రేడియో మిర్చి ని ఉదయంఅయిదు నుంచి వినటం నాకిష్టం . .మిగిలిన వాటిపై నాకు అవగాహన లేదు .
ఈ విధంగా విజయవాడ నుంచి ప్రసారమయే మూడు రకాల ఎఫ్ ఏం రేడియో లు ఉదయం రాత్రి మనసుకు ఆహ్లాదం కల్గిస్తున్నాయి .అందులో ముసలిమనసులకు మరీ ఆనందం అనుభూతి .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2
162- కొంకణ రాయబారి -మంఖ కవి
మంఖ కవికి మంఖక ,మంఖూక అనే పేర్లు కూడా ఉన్నాయి .కాశ్మీర్ దేశం లో పుట్టాడు తండ్రి విశ్వా వర్తుడు .సోదరుడు అలంకారుడు కూడా కవే కాక కాశ్మీర్ రాజులు సుసాల ,జయ సింహ రాజుల ఆస్థానం లో మంత్రికూడా .రాజా జయసింహ 1127-1150కాలం లో కాశ్మీర్ ను పాలించాడు .మంఖ కవి కొంకణ దేశానికి రాయబారిగా వెళ్ళాడు మంఖ మరో సోదరుడు శృంగారుడు ‘’బృహత్త౦త్రాధిపతి ‘’పదవిలో ఉన్నాడు .మంఖుని గురువు రుయ్యకుడు .మంఖ కవి’’ శ్రీ కంఠ చరిత్ర ‘’కావ్యాన్ని 1140లో రాశాడు .ఇరవై అయిడుకాండల మహాకావ్యం ఇది .ఇందులో శివుడు త్రిపురాసుర సంహార విషయం రాశాడు .
చివరి కాండ చాలా ఆకర్షణీయంగా ఉంది .అందులో అనేక మంది సమకాలీన ,పూర్వ కవులను పేర్కొన్నాడు .వాళ్ళ పేర్లు చెప్పటమేకాదు ఒక్కొక్కకవి ఏ విషయం లో నిష్ణాతుడో కూడా వివరించటం మంఖకవి ప్రత్యేకత .ఆనందుడు న్యాయ మీమాంసలో ,శంభూరిని కొడుకు ఆనందుడు వైద్యం లో ,అలక దత్తుని శిష్యుడు కళ్యాణుడు సాహిత్య శాస్త్రం లో ,గర్గుడు,గోవిందుడు జల్హనుడు సాహిత్యం లో,జిన్దూకుడు త్రైలోక్యుడు మీమాంస లో ,జనక రాజు వేదాలలో , నందనుడు వేదాంతం లో నిష్ణాతులు అని చెప్పాడు ., మొదటి కాండ లో ఇష్ట దేవతాస్తుతి .అందరు దేవుళ్ళనూ ప్రార్ధించాడు .చాలా భాగం కవితలో రెండు అర్ధాలు వచ్చేట్లు నేర్పుగా కూర్చాడు మంఖ కవి .భాషమీద మాంచి పట్టు ఉంది .అందుకనే నెమో మనవాళ్ళు ఎవరైనా మారాం చేసి పట్టు బడుతుంటే ‘’మంకు పట్టు ‘’పట్టాడు అంటారు .అది ‘’మంఖ కవి పట్టు’’ ఏమో .చదివే వారికి కష్టంగా ఉంటుంది మంఖ కవిత్వం .ప్రవాహ వేగం తక్కువ .జన రాజు దీనికి రాసిన వ్యాఖ్యానం వలన ఆ పాషాణ పాక కవిత్వాన్ని కొంత వరకు అర్ధం చేసుకో వచ్చు .మంఖ కవి ప్రయోగించిన శబ్దాల అర్ధాలను వివరించే నిఘంటువు ‘’మంఖ కోశం ‘’వచ్చింది . ఇది ఇప్పటికీ కాశ్మీర దేశం లో ఉన్నది . రుయ్యకుని అలంకార శాస్త్రం పై మంఖ కవి ‘’అలంకార సర్వస్వం ‘’రాశాడు .రుయ్యకుని కారికలకు వ్యాఖ్యానం రాస్తూనే మంఖ కవి అలంకార సూత్రాలు కూడా రాసినట్లు అని పిస్తుంది .’’మంఖు కసుత్రోద్ధారణ ‘’లో సూత్రాలకు మంఖ కవి శిష్యుడు సముద్ర బంధుడు ఉదాహరణలు రాశాడు .ఇతనే అలంకార సర్వస్వానికి వ్యాఖ్య కూడా రాశాడు .అందులో రాజా రవి వర్మను కీర్తించాడు .మంఖ కవికాలం లో కాశ్మీర రాజాస్థానం లో నిరంతరం సాహిత్య చర్చలు జరిగేవి .ఎంతో విలువైన సమాచారం అందేది .కాశ్మీర రాజులు ఇతర దేశాల రాజులతో మంచి సంబంధాలు నెలకొల్పారు రాయబారులను పంపేవారు .మంఖ కవిని కాశ్మీర దేశపు రాయబారిగా కొంకణ దేశానికి పంపారని ముందే చెప్పుకొన్నాం .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2
161- కలికాల సర్వజ్ఞుడు – ఆచార్య హేమ చంద్రసూరి
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
జైన సంస్కృత ప్రాకృత కవి ,పండితుడు ,వ్యాకరణ వేత్త ,సర్వ శాస్త్ర విశారదుడు ,ఆలంకారికుడు ,గణిత మేధావి ,జీవశాస్త్ర విజ్ఞాని మహా కావ్యాలతోబాటు అనేక నిఘంటువుల నిర్మాత అయిన హేమచంద్రకవి 1088లో ధందూక లో జన్మించాడు . చాచిగ శ్రేష్టి ,పాహిని దంపతుల పుత్రుడు .ఒకరోజు తండ్రి దూర దేశాలకు వెళ్ళినప్పుడు వజ్ర శాఖకు చెందిన దేవేంద్ర సూరి అనే ముని వచ్చి అతని తల్లిని అయిదేళ్ళ ఆమె కొడుకును తనకిమ్మని అడిగాడు .ఆమె ఇచ్చేసింది .ఆయన తనతో తీసుకొని వెళ్లి సన్యాసాశ్రమ వాతావరణం లో పెంచాడు .తల్లి తో సంబంధం లేని ఆ కుర్రాడికి ‘’చాంగ దేవుడు ‘’అనే పేరు పెట్టాడు .
హేమచంద్ర నామం
ఊరినుంచి తిరిగి వచ్చిన తండ్రికి కొడుకు విషయం తెలిసి వెదకటం మొదలు పెట్టాడు .అప్పటికే ఆలస్యమై పోయింది .కొడుకు సన్యాసాశ్రమం లో అనేక సిద్ధులు సాధించాడు .ఒక సారి తన మహిమ చూపించటానికి మండే అగ్నిలో తన చెయ్యి పెట్టి కాల్చుకొన్నాడు. అది బంగారం అయి పోయింది .అప్పటి నుంచి అతని పేరు ‘’హేమచంద్ర ‘’అయింది .
ఆచార్య హేమ చంద్ర సూరి
హేమ చంద్రుడు పురాణ తల్లి యాగచ్చ కు చెందిన దేవ చంద్ర చంద్ర సూరి శిష్యుడై శాస్త్రాలు నేర్చాడు .1154లో పండితుడై సూరి బిరుదాన్ని పొందాడు .గుజరాత్ లోని అన్హిల్విద్ పఠాన్ వంశ రాజాస్థానం లో జయసింహ సిద్ధ రాజ ,ఆ తర్వాత వచ్చిన కుమారపాల ల ఆస్థానకవిగా ఉన్నాడు .నిజానికి హేమ చంద్రుడు రాజ దర్బారులో మంత్రి .అతని జైన మత అభిమానం వలన రాజ్యం లో జైన ధర్మానికి గొప్ప ఆదరణ లభించి,రాజ్య మతం కూడా అయింది .1400 జైన విహారాలు స్థాపించ బడ్డాయి .అహింసను అమలు చసి జంతువధ మాన్పించి మాంసాహారాన్ని నిషేధించారు .21ఏళ్ళ వయసులో హేమ చంద్ర సూరి శ్వేతాంబర జైన మతాన్ని రాజస్థాన్ లోని నాగూర్ లో స్వీకరించి’’ఆచార్య హేమ చంద్ర సూరి ‘’అయ్యాడు .
సోలంకీ సిద్ద రాజు ఆస్థానం లో
హేమ చంద్రుడు జైన మతావలంబి అయినా పూర్వాశ్రమ బ్రాహ్మణ ధర్మాలను వదిలి పెట్టలేదు .జైన మతానికి చెందినవే కాక ఇతర మత గ్రంధాలనూ విపరీతంగా అధ్యయనం చేశాడు .మహా మేధావిగా గుర్తింపు పొందాడు .అతని వివేకం ,పాండిత్యం బహు గొప్పవి .సాహిత్యం లో ఆణిముత్యమని పించాడు .ఎన్నో వైవిధ్య రచనలు ప్రాకృత ,సంస్కృత భాషల్లో చేశాడు .వ్యాకరణం లో కొత్త దారి తొక్కాడు . ఆ సమయం లో అన్హిల్వద్ పఠాన్ ను సోలంకీ వంశ రాజులు గుజరాత్ ను స్వాధీనం చేసుకొని పాలించారు . చాతుర్మాస్య దీక్షతో నాల్గు నెలలు ఇక్కడే గడిపాడు . అతని రచనలలో ఎక్కువ భాగం ఇక్కడే ఉండి రాశాడు .1125 లో సోలంకి ప్రభువు సిద్ధ రాజ సింహకు పరిచయమై 1135లో రాజదర్బారులో విశిష్ట వ్యక్తీ అయ్యాడు .
పాణినికి దీటుగా వ్యాకరణం
సిద్ధరాజు మాల్వాను జయించాడు . అన్నిటితో బాటు భోజ రాజ రచనలను ధారా నగరం నుండి తనతోబాటు తీసుకొని వెళ్ళాడు .ఒక రోజు సంస్కృత వ్యాకరణం అయిన ‘’లక్షణ ప్రకాశ ‘’అనే ,’’సరస్వతీ కంఠా భరణం ‘’ను సిద్ధ రాజు చూశాడు. అది ఎంతో ప్రభావం కలిగించి రాజాస్థాన పండితులకు అలాంటి దే సులభ ,పటిష్ట వ్యాకరణం తయారు చేమని కోరాడు .హేమ చంద్రుడు రాజును కాశ్మీర దేశం లోని ఎనిమిది గొప్ప వ్యాకరణాలను తెప్పించమన్నాడు వాటిని చదివి అధ్యయనం చేసి పాణిని రాసిన ‘’ఆస్టాధ్యాయి ‘’తో సరి తూగగల వ్యాకరణాన్ని రాశాడు .దీనికి ‘’సిద్ధ హేమ శబ్డాను శాసనం ‘’అని రాజు పేరు, తన పేరుకలిసి వచ్చేట్లు గా పేరుపెట్టాడు .రాజు కవిగారి కృషికి ఎంతో సంతోషించి ఆ వ్యాకరణ గ్రంధాన్ని ఏనుగు పై అన్హిల్వద్ పఠాన్ పురవీధుల్లో ఊరేగించాడు .హేమ చంద్రుడు సోలంకి రాజ వంశ చరిత్ర ‘’ద్వాశ్రయ కావ్యం ‘’రాసి అందులోనుంచి తన వ్యాకరణానికి ఉదాహరణలు ఇచ్చాడు .
కుమార పాలుని ఆస్థానం లో
సిద్ధరాజు తన మేనల్లుడు కుమార పాలను చంపే ప్రయత్నం చేస్తే హేమ చంద్రుడు అతన్ని అనేక పుస్తకాల కుప్పలో కనపడకుండా దాచేసి ప్రాణం కాపాడాడని ఒక కధనం ఉంది .కుమారపాలుని వలన తనకు ,తన రాజ్యానికి ప్రమాదం సంభవించి ,రాజ్యం పతనం చెందుతుందని భావించి ఈ హత్యా ప్రయత్నం చేశాడు సిద్ధ రాజు .సిద్ధరాజు ఆస్థానం లో నుంచి కుమార పాలుని ఆస్థానానికి చేరాడు హేమ చంద్రుడు .
కుమార పాలుని కాలం లో అంటే 1143-1173 లో హేమచంద్రుడు కుమారపాలునికి ముఖ్య సలహాదారుడుగా వ్యవహరించాడు .అప్పుడు గుజరాత్ రాజ్యం సాంస్కృతిక కేంద్రం గా వర్ధిల్లింది .జైన మతం లోని ‘’అనేకాంత వాదం’’ను బాగా నేర్చినవాడుకనుక హేమచంద్రుడు చాలా విశాల దృక్పధం అలవరచుకొని ,రాజు అభిమానాన్ని పొంది మరీ సన్నిహితుడయ్యాడు శైవుడైన కుమారపాలుడు పాఠాన్ లోని సోమనాధ దేవాలయాన్ని పునర్నిర్మించాలని భావించాడు .హేమచంద్రుని ప్రాపకం ప్రాభవం చూసి అసూయ చెందిన కొందరు అతడు సోమనాధ శివునికి నమస్కారం కూడా చేయడని, పొగరు బోతు,గర్విష్టి అని చాడీలు చెప్పారు .సోమనాధ ఆలయ ప్రారంభోత్సవం రోజున రాజు ఆహ్వానం పై హేమ చంద్రుడు రాజు వెంట ఆలయానికి వెళ్లి సోమనాధ లింగానికి సాగిల పడిమ్రొక్కి ‘’మనిషి జీవితం లో మనిషిలోని సహజాతాలైన అసూయ ,అనుబంధాలను నాశనం చేసే బ్రహ్మ అయిన, విష్ణువైన, జినుడైన వాడికి నమస్కరిస్తున్నాను ‘’అని ప్రార్ధించాడు .
కుమారపాలుడు జైనమతం లోకి
ఆ తర్వాత కుమార పాలుడు హేమ చంద్రునికి మరీ సన్నిహితుడై జైన మతావలంబి అయ్యాడు .
1121లో’’తరంగ ‘’లో ప్రారంభమైన జైన దేవాలయ నిర్మాణం లో హేమ చంద్రుడు పూర్తి బాధ్యత తీసుకొన్నాడు . .హేమ చంద్రుని ప్రభావం వలన రాజ్యం లో జైనమత వ్యాప్తి జరిగింది .అహింస కు ప్రజలు అలవాటు పడ్డారు . జంతువధ నిషేధింప బడింది . గుజరాత్ లో .యజ్న యాగాలలో పశువద జరగ కుండా కుమారపాల ,హేమ చంద్రులు కట్టడి చేశారు .హేమ చంద్రుడు చనిపోయి 900 ఏళ్ళు దాటినా ఇప్పటికీ గుజరాత్ అహింసా వ్రతాన్ని అవలంబిస్తోంది .
హేమ చంద్రునిమహా నిర్వాణం
.తన మరణాన్ని ఆరు నెలలు ముందే ప్రకటించి , ‘’సల్లేఖన ‘’అనే మత దీక్ష పూని నిరాహార దీక్షతో ఆచార్య హేమ చంద్ర సూరి 1173 లోఅన్హిల్వద్ పఠాన్ లోమహా నిర్వాణం పొందాడు ..
కలికాల సర్వజ్ఞుడు
హేమచంద్రుని రచనల మొత్తం 35,000,000 పంక్తులు ఉంటుంది .అందుకే హేమ చంద్రుని ‘’కలికాల సర్వజ్ఞుడు ‘’(omniscient) అన్నారు .మహాత్ముడు అన్నారు . ఇరవై ఎనిమిది కాండల ‘’కుమార పాల చరిత ‘’ను హేమచంద్ర సూరి రచించాడు .ఇది అనిహిల్వద్ రాజ వంశ చరిత్ర .ముఖ్యం గాకుమారపాల రాజ చరిత్ర .మొదటి ఇరవై కాండాలు సంస్కృతం లోను , చివరి ఎనిమిది ప్రాకృత భాషలో రాశాడు .అందుకే దీనికి ‘’ద్వాశ్రయ కావ్యం ‘’అనే పేరొచ్చింది .చివరిభాగాలు ప్రాకృతం లో రాయటానికి కారణం తన కున్న ప్రాకృత భాషాభిమానమే కాకుండా అందులోని వ్యాకరణం లో తన కున్న ప్రతిభను తెలియ జెప్పటం ,దానితో బాటు ప్రాకృతం లో ఉన్న మహారాష్ట్ర ప్రాకృతి ,సౌరసేని మాగధి ,పైశాచిలేక చూలికా పైశాచి అపభ్రంశ ,మొదలైన ఆరు రకాల మాండలీకాలను పరిచయం చేయటం .గుజరాతీ మాండలికాన్ని సుసంపన్నం చేశాడు ..ఆప భ్రంశ భాషలకు ఇదొక్కటే చింతామణి లాంటి వ్యాకరణ ఔషధం .ఈ కావ్యాన్ని 1160లో ప్రారంభించి చనిపోయే వరకు రాశాడు .అసంపూర్తి కావ్యాన్ని అభయ తిలక గణి 1255లో పూర్తీ చేశాడని అంటారు .కాని తన పాత్ర అతి స్వల్పం అన్నాడు మణి కవి .
‘’ త్రిశష్టి శలాక పురుష చరిత్ర ‘’ అనే దీర్ఘ కావ్యం లో హేమచంద్రుడు ఇరవై నలుగురు జైన తీర్ధంకరుల తో బాటు ,63 జైన మహా మునుల జీవిత చరిత్ర రాశాడు .వారి పుట్టుక ,పునర్జన్మ మొదలైన వివరాలను ,జైనమత నిర్మాణానికి, వ్యాప్తికి వారి సేవలను వివరించాడు . దీనికి అనుబంధం గా ‘’స్థవిర వాలి చరిత్ర ‘లేక ‘’పరిశిష్ట పర్వం ‘’రాసి జైన సన్యాసుల జీవితాలను వర్ణించాడు .ఇది ఆంగ్లం లో ‘’ది లైవ్స్ ఆఫ్ ది జైన్ ఎల్దెర్స్ ‘’గా అనువాదంపొందింది . కాశ్మీర ఆలంకారికుడు మమ్మటుడు రాసిన పద్ధతినే అనుసరించి హేమ చంద్రుడు ‘’కావ్యాను ప్రకాశ ‘’రాశాడు .ఇందులో అభినవ గుప్త ,ఆనంద వర్ధనుల రచనలను పేర్కొన్నాడు . . .’’చందాను శాసనం ‘’అనే ఛందో గ్రందాన్నీ హేమ చంద్రుడు రాశాడు .’’కావ్యానుశాసనం’’తో బాటు ,దానికి వ్యాఖ్యానం కూడా రాశాడు .అదే ‘’అలంకార చూడామణి ‘’.ఎనిమిది అధ్యాయాల ఈ గ్రంధం సాహిత్య చరిత్రలోనే చాలావిలువైనది అపూర్వమైనది .భరత ,లొల్లట దండి , .శంఖ మమ్మట , భట్టనాయక రచనలను ఇందులో సమీక్షించాడు .ఇవికాక మరెన్నిటినో స్పృశించాడు .ఇదొక విస్తృత రచన .
నిఘంటు రచన –స్తోత్ర రచన
హేమ చంద్రుడు కూర్చిన నిఘంటువులలో ‘’దేశి నామ మాల ‘,లేక’’ దేశి శబ్ద సంగ్రహం’’, ‘’అభిదాన చింతామణి’’ ,’’అనేకార్ధ కోశం ‘’ముఖ్యంగా పేర్కొన దగినవి . ., ,’’నిఘంటు శేషం’’అనేది జీవ శాస్త్ర నిఘంటువు . . ‘’శ్యాద వాద మంజరి’’ ,’’జినేంద్ర స్తోత్రం ‘’మొదలైనవి వర్ధమాన మహా వీరునిపై స్తోత్రాలు .’’వీత రాగ స్తోత్రం ‘’అనే ఆధ్యాత్మిక స్తోత్రం కూర్చాడు .’’యోగ శాస్త్రం తో బాటు ‘’,ప్రమాణ మీమాంస ‘’గ్రంధమూ రాశాడు. సంస్కృత ‘’ వ్యాకరణం గా ‘’శబ్డాను శాసనం ‘’రాశాడు .ఇందులో ఎనిమిదవ అధ్యాయం లో ప్రాకృత వ్యాకరణమూ చేర్చాడు ;జైన మత కరదీపికగా ‘’యోగ శాస్త్రాన్ని’’ ,లింగనిర్దారణకు ‘’లింగాను శాసనా’’న్ని హేమ చంద్రుడు రాశాడు .
గణిత మేధావి
గణితం లో కూడా హేమ చంద్రుడు తన ప్రతిభను చూపాడు .అంతకు పూర్వం గోపాలుడు రాసిన ఆధారంగా హేమ చంద్రుడు ఆధునికకాలం లో పిలువ బడిన ‘’ఫైబోనాసి సీక్వెన్స్ ‘’ను తయారు చేసి చెప్పాడు .’’ఫైబో నాసి ‘’అనే గణిత శాస్త్రజ్ఞుడు 1202లో చెప్పిన ఈ సూత్రాన్ని యాభై ఏళ్ళకు ముందేఅంటే 1150 లోనే హేమచంద్రుడు తయారు చేసి చూపించిన మేధావి .దీన్ని F(n)=F(n-1)+F(n-2)నిర్వచనంద్వారా చెప్పాడు ఫైబోనాసి .
సోమ ప్రభాచార్యుడు ప్రాకృతభాషలో ‘’కుమార పాల ప్రతిబోద మహాకావ్యం ‘’రాసి కుమార పాల చరిత్రను బోధ పరచాడు .సోమప్రభుడు విజయ సింహుని శిష్యుడు .ముని చంద్రునికి అయిదవ తరం వాడు .అతని తండ్రి సిద్ధ పాలుని సహచరుడు ,కవిహేమచంద్రుని స్నేహితుడుఅయిన శ్రీపాలుడు .అనిల్హివిద్ రాజాస్థానం లో ఉన్నాడు .ఈచరిత్రలో కుమారపాలుడు జైనం లోకి పరి వర్తన చెందినవిధానం వర్ణించ బడింది .హేమచంద్రుని ప్రబోధం వలననే కుమారపాలుడు జైనం స్వీకరించాడని తెలియ జేశాడు. అందులో కావ్యం చివర సంస్కృత భాషలో ‘’ ప్రశస్తి ‘’రాశాడు .హేమ చంద్రుని ఇతర గ్రంధాలు ‘’హేమ కుమార చరిత్ర ‘’,సోమతినాద చరిత్ర,సాలాంత కావ్యం మొదలైనవి .
మహా మేధావి ,సర్వ శాస్త్ర పారంగతుడు ,సంస్కృత ప్రాకృత కవి ,కలికాల సర్వజ్ఞ బిరుదాంకితుడు జైనాచార్యుడు హేమచంద్ర సూరి ని మనవాళ్ళు అంతగా గుర్తించినట్లు కనిపించదు .అందుకే ఈతరానికి హేమ చంద్రుని పరిచయం చేశాను .
–గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2
159-ద్విసందాన (ద్వర్ది)కావ్య నిర్మాత –ధనుంజయుడు
వాసుదేవ ,శ్రీదేవి ల పుత్రుడైన ధనుంజయుడు జైనకవి .అప్పటికే సాహిత్యం లో ద్వార్దికావ్యాలు విజ్రుమ్భించాయి .ఒకే పద్యం లో రెండు వేర్వేరు కదార్ధాలు వచ్చే దాన్ని ద్విసందాన కావ్యం అన్నారు .దండి కవి సంస్కృతం లో దీనికి నాన్దిపలికితే భోజుడు శృంగార ప్రకాశ లో దాన్ని పేర్కొన్నాడు .సుబందు దీన్ని వచనం లో చేశాడు .సుబందు వాసవ దత్తలో ద్వ్యర్దికావ్య నిర్మాణాన్ని శిఖరారోహణం చేయించాడు .ధనుంజయుడు అదే బాటలో నడిచి రామాయణ ,మహా భారత కధలను ద్విసందాన కావ్యంగా సుమధుర ,సాంద్ర ప్రవాహ కవిత్వం లో రాశాడు .తన శక్తి ఎరిగిన వాడు కనుక ధనుంజయుడు తనను వాల్మీకి వ్యాసులతో పోల్చుకొని వారితర్వాత మూడో వాడిని తానే నని చెప్పుకొన్నాడు. దండిని దృష్టిలో పెట్టుకొనే ఈ మాట అన్నాడు .తన కావ్య్యం మూడు వజ్రాలలో ఒకటి అన్నాడు .ఆకలంకుని న్యాయ సారం ,పూజ్య పాదుని వ్యాకరణం మిగిలిన రెండు వజ్రాలుట .ధనుంజయుడు ఆనంద వర్ధన ,రాత్నాకరులను బాగా మెచ్చు కొన్నాడు .సోమదేవ,జల్హనులు ధనుంజయ కవిత్వాన్ని మెచ్చారు ఇతనిగురించి వర్ధమానుడూ చెప్పాడు .కనుక ధనున్జయునికాలం తొమ్మిది పది హతాబ్దుల మధ్యగా నిర్ణయించారు .
160-మూషిక వంశ చరిత్ర రాసిన –అతుల కవి
పదిహేను కాండాలలో అతులకవి మూషిక వంశ రాజ చరిత్రను రాశాడు .అంతకు మించి అతుల గురించి మనకు ఏమీ తెలియ లేదు .దక్షిణ తిరువాన్కూరు పాలకులైన మూషిక వంశ రాజుల సుదీర్ఘ చరిత్ర ఇది .పరశురాముడు రాజ క్షత్రియ రాజ వంశ నిర్మూలన చేస్తుండగా ఒక క్షత్రియ వంశ రాజు చనిపోగా అతని భార్య పారిపోయి ఒక పర్వత గుహ లో దాక్కున్నది .ఒక రోజు ఏనుగంత ఉన్న ఎలుక ఆ గుహలో దూరి ఆమెను బలాత్కారం చేయబోతే ఆమె కంటి చూపుకే అది కాలి బూడిద అయ్యింది .ఎలుక ఆత్మా పర్వత రాజు రూపంగా ప్రత్యక్షమైంది. తన రూపం మారిపోవటం గ్రహించిన ఎలుక కౌశిక ముని శాపం వల్ల తనకు ఆ ఎలుక రూపం వచ్చిందని చెప్పాడు .రాణి ఆ గుహలోనే ఉండిపోయి ఒక మగ పిల్లాడిని కన్నది .రాణి తో పాటు ఇక్కడే ఉన్న రాజ పురోహితుడు ఆ పిల్లవాడికి విద్య నేర్పాడు .పరశురామ యజ్ఞానికి బలి పశువుగా ఈ బాలుడు వెళ్లి ఆయన్ను మెప్పించి చావు తప్పించుకొని ఆయన అనుగ్రహం తో ‘’మూషిక రామ ఘట ‘’పేరుతో మూషిక రాజ్యానికి రాజు అయ్యాడు . ఒక కుండ నీటితో పవిత్రీకరింప బడ్డాడుకనుక రామ ఘట (కుండ)అనే పేరొచ్చింది .ఇతను మగధ రాజు మాధవ వర్మనుయుద్ధం లో చంపి కూతురు భద్రసేనను పెళ్ళాడాడు .మగధ కు మాధవ వర్మ కుమారుడిని రాజును చేశాడు .
రామ ఘటకు ఇద్ద్దరు కొడుకులు .పెద్దవాడు వటు ను హైహయ రాజ్యం ఇచ్చి రాజును చేశాడు .చిన్నకొడుకు నందన ను చోళ రాజుగా అభిషిక్తుని చేశాడు. అరణ్యాలకు వెళ్లి వాన ప్రస్తాశ్రమం లో చివరి రోజులు గడిపాడు .మనకవి గారు ఇక్కడి నుండి ఆ తర్వాతా రాజులందర్నీ వరుసగా పేర్కొని చివరిరాజు నీల కంఠవల్లభా అతని కొడుకు దాకా వారి చరిత్ర అంతా పూస గుచ్చి వర్ణించాడు . .. శ్రీకంఠరాజు ఆస్థానం లో ఉండి ఈ మూషిక వంశ చరిత్ర రాశాడుఅతులకవి . .పద్నాలుగవ కాండం లో రాజా వల్లభ కేరళపై దండయాత్రకు వస్తున్నచోలరాజును నిలువ రించటానికి కేరళ రాజుతో కలిసి చోళ రాజుల దండయాత్రను ఎదుర్కొన్నాడు .ఈ చోళ రాజు 1014-1046వాడైనమొదటి రాజేంద్ర చోళుడు అయి ఉండ వచ్చు .పన్నెండు ,పద్నాలుగు అధ్యాయాల్లో శ్రీ మూల వాసం లో ఉన్న బుద్ధ దేవాలయాన్ని వర్ణించాడు .ఈ ఆలయం సముద్రం చొచ్చుకు రావటం వలన శిధిలమై పతన దశకు చేరుకొన్నదని ఆవేదన వ్యక్తం చేశాడు .868లో రాజ పోషణం లో ఈ బుద్ధ దేవాలయం పరమ వైభవంగా ఉండేది .కనుక అతుల మూషిక వంశ చరిత్ర పదకొండవ శతాబ్దం లో రాసి ఉంటాడని భావిస్తారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-15-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -54
22—ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ –విలియం జేమ్స్
అమెరికా వేదాంతి ,సైకాలజిస్ట్, డాక్టర్ అయిన విలియం జేమ్స్ అమెరికాలో మొట్టట మొదటి సారిగా సైకాలజీ కోర్సును ప్రవేశ పెట్టిన ఘనుడు .19వశతాబ్దపు మేధావులలో ఒకరుగా గుర్తింపు పొందాడు .అమెరికాలో ప్రసిద్ధ వేదా౦తు లలోఅప్పటి వరకు అంతటి గొప్ప వేదాంతి జన్మించలేదని అంటారు ..ఆ నాటి ప్రముఖ వేదా౦తు లైన విలియం సాండర్స్ పియర్స్,జాన్ డ్యూయీ సరసన నిలిచిన మహా వేదాంతి .వీరి సిద్ధాంతం ‘’ప్రాగ్మాటిజం ‘’అంటే పరిస్తితులను బట్టి సమస్యలను గురించి ఆలోచించి పరిష్కారం కలిగించే విధానం .దీనితో ‘’ ఫంక్షనల్ సైకాలజీ ‘’నిర్మాతలలో ప్రసిద్ధుడైనాడు .ఇరవై వ శతాబ్దపు సైకాలజిస్ట్ లలో పద్నాలుగవ శ్రేణిలో నిలిచాడు .అందుకే విలియం జేమ్స్ ను ’’’ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ ‘’అని పిలుచుకొన్నారు .
మేధావుల కుటుంబం
జేమ్స్ కుటుంబం అంతా మేధావి వర్గమే .దియాలజి ,ఫిలాసఫీ ,సాహిత్యాలలో హెన్రి జేమ్స్,సీనియర్ విలియం జేమ్స్ హెన్రి జేమ్స్ జూనియర్ అగ్ర శ్రేణి లో ఉన్నారు .అందరూ బహు స౦పన్నులే .వీరి తాత వ్యాపార్ ఫైనాన్షియర్ కూడా .మూడు వేల మిలియన్ డాలర్ల ఎస్టేట్ ను అప్పగించాడు .వీరిలో సీనియర్ హెన్రి ఆకుటుంబం లో చాలా తమాషా మనిషి స్వీడెన్ బర్గ్ అనుచరుడు ,జీవితాంతం మత గ్రందాలు చదువుతూ ,మతపరమైన సమస్యలకు పరిష్కారాలు చెబుతూ ,ముఖ్యం గా సృష్టికి సంబంధించిన మెటా ఫిజిక్స్ పై ద్రుష్టి పెట్టి జీవించాడు అన్నాడు బెర్నార్డ్ షా .తన తండ్రి నిజం గా దియలాజికల్ కాలం లో పుట్టి ఉంటే ,ఆయన దేవునికి మానవునికి ఉన్న సంబంధం ,దైవ సృష్టి ,అందులోని మిస్టరి లను వెలికి తీసి ,ఉంటే ప్రపంచానికి మార్గ దర్శనం చేసిన మహానుభావులలో ఒకడై తీర్చి దిద్దే వాడై ఉండేవాడు ‘’అన్నాడు విలియం జేమ్స్ .తండ్రి ఒక మత ప్రవక్త అని ,మహా మేధావి అని అన్నాడు .
సాగని చదవు
సీనియర్ హెన్రి జేమ్స్ ,భార్య మేరీ రాబర్ట్ సన్లకు నలుగురు కుమారులు ,ఒక కూతురు .విలియం జేమ్స్ న్యూ యార్క్ సిటీలో 11-1-1842 జన్మించి న పెద్ద కొడుకు .అక్కడే ప్రైవేట్ స్కూల్ లో చదివి ఇక్కడి స్కూలు చదువులు నచ్చక తండ్రి కుటుంబాన్ని యూరప్ కు మార్చేశాడు .లండన్ ,పారిస్ ,బోలాన్ స్విట్జర్లాండ్ ,జెర్మని లలో ప్రైవేట్ మాస్టర్లు ,గవర్నసేస్ లు చదువు చెప్పారు మధ్య మధ్యలో మార్పులు కనుక పిల్లల చదువు వరుస క్ర్రమం లో సాగలేదు .విలియమ్స్ కు జర్మన్ ,లాటిన్ ఇటాలియన్ భాషలలో గొప్ప పాండిత్యం అలవడింది .
అస్థిర నిర్ణయాలు
పద్ద్దేనిమిదేళ్ళ వయసులో విలియం జేమ్స్ అమెరికా కు వచ్చాడు .యూరప్ అతడిని మృదు స్వభావిని చేయ లేక పోయింది .అక్కడ తిట్లు శాపనార్ధాలే నేర్చుకోన్నానని తండ్రితో చెప్పాడు .17వయసులో పెయింటర్ అవుదామనుకొన్నాడు .ఒక కొడుకు ఆర్టిస్ట్ మరొకడు నావలిస్ట్ అవాలని తండ్రి భావించాడు .అయిన కొడుకులకు నిర్ణయించుకొనే స్వేచ్చ ఇచ్చాడు .విలియమ్స్ పారిస్ చేరి న్యు పోర్ట్ ఐలాండ్ లో ఒక ఇంట్లో ఉండి అభిమాన చిత్రకారుడు విలియం హంట్ బృందం తో ఉన్నాడు .
మళ్ళీ మెడిసిన్
ఒక ఏడాదికే చిత్ర లేఖనం మొహం మొత్తింది.ఆర్ట్ వదిలేసిహార్వర్డ్ లో లారెన్స్ సైంటిఫిక్ స్కూల్ లో చేరాడు .మూడేళ్ళ తర్వాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో చేరాడు ..ఏడాదికే తాను సిద్ధాంత కర్తనే కాని ప్రాక్టికల్ మనిషిని కాదని గ్రహించాడు .లూయీ అగస్సి అతని గురువయ్యాడు ఆ స్కూల్ లో .అగస్సి బ్రెజిల్ కు ఒక అన్వేషణ లో బయల్దేరితే ,విలియం అనుసరించాడు .అక్కడ మొక్కలు వగైరా సేకరించటంవర్గీకరించటం బోరు కొట్టి మళ్ళీ మెడిసిన్ చదవటం మొదలు పెట్టాడు .ఈ మార్పు మానసిక సంఘర్షణ కలిగించింది .అప్పుడప్పుడు నరాల జబ్బు వచ్చి బాధ పడేవాడు .ఈ నరాల వ్యాధి నుంచి తానను తానూ కాపాడుకోవాలని నిర్ణ యించుకొన్నాడు .ఆరోగ్యం కోసం జర్మని వెళ్ళాడు .మెడిసిన్ పాసై మంచి ఉద్యోగం వస్తేచేరాలనుకొన్నాడు .
![]()
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2
158-యుదిష్టిర విజయం రాసిన వాసుదేవకవి
వాసుదేవకవి ‘’రవి’’ కుమారుడు .మహా భట్ట భట్టాత్రి అనే భారత్ గురువు కు శిష్యుడు .తిరువాన్కూర్ లో విపర సత్తామ లో ఉండేవాడు .మలబారు తీరం కధనం ప్రకారం తన గురువు గారి శిష్యులు చదివే పురాణాలను శాస్త్రాలను వినటం అంటే వాసు దేవుడికి ఇష్టం గా ఉండేది .కాని చదువుకోవాలని ఉన్నా శబ్దాలను సరిగ్గా పలికే వాడు కాదట .’వాసు ‘’అనటానికి బదులు ‘’వాతు ‘’అని పలికే వాడు .ఒక రోజు తిరువలక్కావు దేవాలయం నుండి వాసు దేవ ఇంటికి తిరిగి వస్తూ ఉంటే విపరీతంగా వర్షం కురిసింది .ఒక బోటు ఎక్కి సుళ్ళు తిరుగుతున్నవరద నీటి ప్రవాహం దాటే ప్రయత్నం చేశాడు .కాని అసాధ్యం అని భావించి మళ్ళీ దేవాయానికే చేరుకొన్నాడు .అక్కడే ఆ రాత్రి గడిపాడు .బయట వర్షం తీవ్రం గా కురుస్తూనే ఉంది .ఒంటిమీద తడిసిన పంచె తప్ప ఏమీలేదు .ఆకలి విపరీతంగా ఉంది .తన ఇలవేలుపైన ఆ దేవిని ప్రార్ధించాడు .దయతో చలికాచుకోవటానికి కట్టెల మంట ఏర్పరచింది దేవి. తినటానికి కొన్ని అరటి పళ్ళు కూడా ప్రసాదించింది .ఆ పళ్ళు తినగానే వాసుదేవునికి మహా గొప్ప కవిత్వం ఆశుదారగా వచ్చేసింది .మహా కవి అయిపోయాడు .ఉదయమే వచ్చిన దేవాలయ పని మనిషి అది గమనించి అతనిని అరటి తొక్కలను ఎక్కడ పారేశాడో తెలుసుకొని వెళ్లి తెచ్చుకొని తినేసింది . ఆశ్చర్యం గా ఆమె నోటి వెంబడి అమోఘమైన కవిత్వం జాలు వారింది .కవయిత్రి అయిపొయింది .ఆ తర్వాత రాజా కులశేఖర ,రాజా రాము ల ఆస్థానం లో వాసుదేవకవి తొమ్మిదవ శతాబ్దం లో ఉన్నాడు .
దేవి కృపతో మహాకవిఅయిన వాసుదేవ ‘’యుదిష్టిర చరితం ‘’ అనే ఎనిమిది కాండలలో ఆర్యా వృత్త శ్లోకాలలో కావ్యం రాశాడు .అందులో తన రాజు కులశేఖరుడు అని తెలియ జేశాడు .పాండురాజు వేట తో ప్రారంభించి ధర్మరాజు పట్టాభి షేకం తో కావ్యం ముగించాడు . అక్షింబ శిష్యుడైన చొక్కనాధుడు దీనికి వ్యాఖ్యానం రాశాడు .శ్రీరంగానికి దగ్గరలో ఉన్న శాత నూర్ కు చెందిన సుదర్శన కూడా ఈ కావ్యం పై వ్యాఖ్య రాశాడు .
శౌరికాధోదయ ,త్రిపురదహనం కావ్యాలలో రాజు రామ అని పేర్కొన బడింది .మొదటికావ్యం శ్రీకృష్ణుని జననం నుండి బాణాసుర వధ వరకు ఉన్న శ్రీ కృష్ణ కద. దీనికి హరివంశం మూలం .నీల కంఠుడుదీనికి వ్యాఖ్య రాశాడు .ఇతడు ముక్తిస్తలానికి చెందిన ఈశానుని కుమారుడు ..రెండవ కావ్యం త్రిపురాలను దహించిన శివ గాధ.దీనికి నిత్య ప్రియుడు అని చెప్పుకొన్న కవి వ్యాఖ్యానం రాశాడు .వాసుదేవుడు రాసిన ఈ మూడు కావ్యాలు యమకం లో ఉండిబాగా రాణిం చాయి .ఇటీవలి పరిశోధనలలో కాళిదాసు రాసినట్లు భావిస్తున్న ‘’నలోదయ ‘’కావ్యాన్ని కూడా వాసుదేవ రచించి ఉంటాడని భావిస్తున్నారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-15-ఉయ్యూరు
తెల్లవారి పై కోర్టు కేసు గెలిచిన తొలి నల్లజాతిమహిళ-సౌజేర్నార్ ట్రూత్
నల్ల వజ్రం
ఆఫ్రికన్ అమెరికన్ మహిళ,బానిసత్వ నిర్మూలన ఉద్యమకారిణి ,స్త్రీహక్కుల పోరాట యోధురాలు సౌజేర్నార్ ట్రూత్ అమెరికా న్యూయార్క్ లోని స్వార్టర్కిల్ లో అల్స్తర్ కౌంటి లో1797లో బానిసగా జన్మించింది .1826లో బానిస సంకెళ్ళు తెంచుకొని కూతురు తో సహా పారి పోయింది .తన కొడుకును తనకు ఇప్పించమని తెల్లాయన పై కోర్టులో కేసు వేసింది .ఆ కేసు గెలిచి కొడుకును దక్కి౦చు కొని దేశం లో మొదటి సారిగా తెల్లవారిపై కేసు వేసి గెలిచిన నల్లజాతి వజ్రం అయింది ట్రూత్ .నిజం గా ట్రూత్ ఆమె వైపే ఉంది .అందుకే గెలిచింది .ఆమె అసలు పేరు ఇసబెల్లా బామ్ ఫ్రీ. 1843లో తన పేరును సౌజేర్నార్ ట్రూత్ గా మార్చుకొన్నది .ఒహాయో లోని ఆక్రాన్ లో 1851లో ఒహాయో స్త్రీహక్కుల సమావేశం లో అనర్గళం గా మాట్లాడి అందరిని ట్రూత్ ఆకర్షించింది .ఆమె ఎంచుకొన్న శీర్షిక ‘’నేను స్త్రీని కానా ?(Ain;t I a woman ?)ఒక విమోచనోద్యమ స్లోగన్ అయింది .ఆమె సివిల్ వార్ లో డచ్ భాష ను మొదటిభాషగా ఉపయోగించింది .అమెరికన్ యూనియన్ ఆర్మీకి నల్లవారిని సైనికులుగా చేర్చటానికి సాయ పడింది .యుద్ధం తర్వాత బానిసలుగా పూర్వం జీవించిన వారందరికీ నివాస స్థలాని ప్పించటానికి తీవ్ర కృషి చేసింది కాని ,సఫలీకృతం కాలేదు .
బానిసగా నాలుగు సార్లు అమ్మకం
ట్రూత్ తలిదండ్రులను హార్డెన్ బర్గ్ అనే తెల్ల దొర బానిస వర్తకుల నుంచి కొని తన ఎస్టేట్ లో ఉంచుకొన్నాడు .ట్రూత్ తొమ్మిదేళ్ళ పిల్లగా ఉన్నప్పుడు హార్డెన్ బర్గ్ చానిపోతే ఆమెను సంతలో గోర్రేపిల్లలతో బాటు వంద డాలర్లకు న్యూయార్క్ లోని కిన్గ్ స్టన్లో ఉండే జాన్ నీలీ కి అమ్మారు .అప్పటిదాకా ట్రూత్ డచ్ భాషలోనే మాట్లాడేది .నీలీ కర్కోటకుడు. ఎప్పుడూ ఇనపరాడ్లు పెట్టి కొట్టి బాధించేవాడు .దయా దాక్షిణ్యం లేని పశువు .నీలే ట్రూత్ ను నూట అయిదు డాలర్లకు పోర్ట్ ఈవెన్ లో ఉండే మార్తినాస్ కు అమ్మేశాడు .పదినెలల తర్వాత మార్టినస్ ఈమెను న్యూయార్క్ దగ్గర వెస్ట్ పార్క్ లోని జాన్ డుమాంట్ కు అమ్మాడు . ఈ నాలుగో యజమాని కొంత ఉదారా స్వభావం ఉన్నవాడే కాని అతని రెండో భార్య ట్రూత్ ను నరక యాతన పెట్టేది .
బానిస మరో ఫాం లో బానిసను ప్రేమించరాదా?
1815 ప్రాంతం లో ప్రక్క ఫాం లో ఉండే ఒక బానిస రాబర్ట్ ను ట్రూత్ ప్రేమించింది .రాబర్ట్ యజమాని లాండ్ స్కేప్ పెయింటర్ .తనకు చెందని బానిస తో తన బానిస రాబర్ట్ పిల్లల్ని కనటానికి ఇష్టపడక అడ్డునిలిచాడు .ఒక రోజు రాబర్ట్ ట్రూత్ ను తొంగి చూస్తుంటే అతని యజమాని కొడుకు చూసి రాబర్ట్ ను చితక బాదాడు. ఇది చూసి ట్రూత్ యజమాని జోక్యం కలిగించుకొని విడిపించాడు .అప్పటి నుండి ట్రూత్ రాబర్ట్ ను చూడనే లేదు .ఈ సంఘటన ట్రూత్ ను మానసికం గా కల్లోలపరచింది .తర్వాత ట్రూత్ ఒక ముసలి బానిస థామస్ ను పెళ్ళాడి అయిదుగురు పిల్లల్ని కన్నది .
స్వేచ్చ కోసం పారిపోయిన ట్రూత్
న్యు యార్క్ రాష్ట్రం 1799లోనే బానిసత్వ నిర్మూలనం మొదలు పెట్టినా పూర్తిగా అమలు జరిగింది 4–4-1827నమాత్రమె .విమోచనకు ఒక ఏడాది ముందే ట్రూత్ కు విమోచన కలిగిస్తానని ఆమె యజమాని ప్రకటించినా ఆ పని చేయ లేదు .ఆమెకు చేతి దెబ్బ తగిలిందని ఆమె వల్ల ఆదాయం లేదని కుంటి సాకులు చెప్పాడు .యజమాని మీద విశ్వాసం తో ట్రూత్ వంద పౌన్ల నూలు వడికింది .1826లోపెద్ద పిల్లలను యజమాని దగ్గరే వదిలిపెట్టి చంటి పిల్ల సోఫియా తో యజమాని ఇంటినుంచి పారిపోయింది .అక్కడ నుండి ఐసాక్ మేరియా దంపతుల దగ్గరకు చేరగా వారు ఈమెను ,పిల్లను జాగ్రత్తగా చూసుకొన్నారు .విమోచన చట్టం ఆమోదం పొందేదాకా అక్కడే ఉంది .
కోర్టులో కేసు గెల్చిన మొదటి బానిస స్త్రీ ట్రూత్
ఆమె పెద్దఅయిదేళ్ళ కొదుకునూ యజమాని అన్యాయం గా అలబామాలోని ఒక యజమానికి అమ్మాడని తెలుసుకొన్నది .మేరియా దంపతుల సహాయం తో కోర్టులో కేసు వేసి గెలిచి తన కొడుకును తాను దక్కించు కొన్నది ట్రూత్ .ఈ విధం గా ఒక నల్ల జాతి బానిస తెల్ల జాతి యజమాని మీద కోర్టులో కేసు వేసి గెలిచి కొడుకును దక్కించుకోవటం చరిత్రలో ఇదే మొట్టమొదటిది .దీనితో ట్రూత్ గురించి అందరికీ తెలిసింది
మత విశ్వాసం .
మేరియా వాన్ వాజేన్స్ దగ్గర ఉండగా ట్రూత్ ఆధ్యాత్మిక ఆలోచనలలో పది నిజమైన క్రిస్టియన్ గా మారింది 1829 లో పిల్లాడు పీటర్ తో సహా న్యూయార్క్ సిటీ చేరింది .క్రిస్టియన్ ఇవాన్జలిస్ట్ ఎలిజా పియర్సన్ ఇంట్లో హౌస్ కీపర్ గా ఉన్నది .తర్వాతా రాబర్ట్ మాధ్యూస్ తో పరిచయమై మాతియా కింగ్డం ఆఫ్ కమ్మ్యునల్ కాలనీ లో అతని హౌస్ కీపర్ అయింది .ఎలిజా పియర్సన్ మరణించాడు .అతన్ని విషం పెట్టి చంపారని అతని ఇల్లు అంతా దోచేశార్ని రాబర్ట్ మీద ట్రూత్ మీద అభియోగం వచ్చింది .కేసు కొట్టేశారు .రాబర్ట్ పడమటి దేశానకి వెళ్ళిపోయాడు .
1839లో ట్రూత్ కొడుకు వేల్ హంటింగ్ షిప్ లో ఉద్యోగం లో చేరి మళ్ళీ కనిపించలేదు తిమింగిలం బారిన పడి చని పోయి ఉంటాడు .1843 జూన్ ఒకటవ తేదీ న తన పేరు ‘’సౌజేర్నార్ ట్రూత్ ‘’గా మార్చుకొని దేవుడు తనను పిలుస్తున్నాడని చెప్పింది .మెథడిస్ట్ గా మారి బానిస విమోచానకోసం పర్యటన చేస్తూ ఉపన్యాసాలిస్తూ గడిపింది .1844లో మాసా చూసేట్స్ రాష్ట్రం లోని నార్త్ ఆమ్ప్ టన్లో ‘’నార్త్ అంప్ టన్అసోసియేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రి’’లో చేరి స్త్రీ హక్కులకోసం ,మత సహిష్ణుత ,పాసిఫిజం లకోసం కృషి చేసింది .ఈ సంస్థ 470ఎకరాల ఒక ఫాం హౌస్ లో ఉండేది .అక్కడ సభ్యులు పశువుల పెంపకం ,కోతమర నిర్వహణ ,గ్రిస్ట్ మిల్లు (పిండిమర)సిల్క్ ఫాక్టరీ నిర్వహించారు .ఇక్కడే ప్రసిద్ధ విమోచన నాయకులు ఫ్రెడరిక్ డగ్లాస్ ,విలియం లాయడ్ ,డేవిడ్ రాగ్లర్స్ మొదలైన వారితో పరిచయం కలిగింది .1846లో స్వయం పోషకం గా లేదని ఈ సంస్థను రద్దు చేశారు .
ట్రూత్ లైఫ్ హిస్టరీ
జాన్ బెన్సన్ ఇంటి వ్యవహారాలూ చూడటానికి ట్రూత్ కుదిరింది .పశ్చిమం వైపు వెళ్లేముందు జాన్ ద్యుమాంట్ ను కలుసుకొన్నది .తన జ్ఞాపకాలను స్నేహితురాలు ఆలివ్ గిల్బర్ట్ కు ట్రూత్ చెబితే ఆమె రాసి పుస్తకం గా కూరిస్తే విలియం గారిసాన్ దాన్ని రహస్యం గా ‘’ది నారేటివ్ ఆఫ్ సౌజార్నేర్ ట్రూత్ –ఏ నార్దర్న్ స్లేవ్’’పేరిట పబ్లిష్ చేశాడు . ఫ్లారెన్స్ లో మూడు వందల డాలర్లతో ఒక స్వంత ఇల్లు ఎర్పరచుకోన్నది .మాసాచూసేత్స్ లోని వార్ చెస్టర్ లో ‘’మొదటి జాతీయ మహిళా సమాఖ్య ‘’సమావేశం లో ట్రూత్ మాట్లాడింది .కమ్మ్యూనిటికి చెందిన సామ్యుఎల్ అప్పులు తీర్చింది .తన ఇంటి ప్రక్క స్థలాన్నికొని ,తర్వాతా అమ్మేసి మిచిగాన్ రాష్ట్రం లోని బాటిల్ క్రీక్ కు చేరింది .
నేను స్త్రీనికానా?
ట్రూత్ మాట్లాడిన’’ Ain;t I a woman ?స్పీచ్ చిరస్తాయిగా నిల్చి పోయింది ఆ తర్వాతా పదేళ్ళు వందలాది ఉపన్యాసాలిచ్చి జనాన్ని ప్రభావితుల్ని చేసింది .న్యూయార్క్ లోని బ్రాడ్వే లో గొప్ప ప్రసంగం చేసింది .’’ఫ్రెండ్స్ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెస్ ‘’లో మిచిగాన్ లోని బాటిల్ క్రీక్ చేరి మహోపన్యాసమిచ్చింది .అందులో ఒకడు ‘’నువ్వు మరీ మగాడిలా మాట్లాడుతున్నావ్ ‘’అనగానే రెచ్చి పోయి ట్రూత్ జాకెట్ విప్పి తన వక్షోజాలను సభా ముఖం గా చూపించి వాడి నోరు మూయించింది . ‘’అమెరికన్ ఈక్వల్ రైట్స్ అసోసియేషన్ లో ,నీగ్రోల ఎనిమిదవ స్వేచ్చా సమావేశం లో భావోద్రేకాలతో మాట్లాడి కార్యో న్ముఖులను చేసింది .
సేవాకార్యాలు
నార్త్ అంప్ టన్లో ఇల్లు అమ్మేసి మిచిగాన్ లో హార్మోనియాలో కొత్త ఇల్లు కొనుక్కొన్నది .అమెరికన్ సివిల్ వార్ లో నల్లజాతి వారిని సైన్యం లో చేర్చే ప్రయత్నం చేసింది .ఆమె మనవడు జేమ్స్ కల్దేవేల్ చేరాడు .వాషింగ్టన్ లోని ‘’నేషనల్ ఫ్రీడ్ మాన్స్ రిలీఫ్ అసోసియేషన్ ‘’లో ఉద్యోగం చేసింది .అక్కడి ఆఫ్రికన్ అమెరికన్ ల జీవిత విధానాన్ని మెరుగు పరిచింది .ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ను కలుసుకొన్నది .ఫ్రీడం హాస్పిటల్స్ లో పణి చేస్తూ గుర్రబ్బండీ తొలి సైన్యానికి సాయ పడింది .’
సైన్యం కోసం దేశ భక్తీ గీత రచన ,గానం
మొదటి మిచిగాన్ కలర్డ్ రెజిమెంట్ కోసం ‘’ది వాలిఎంట్ సోల్జేర్స్ ‘’అనే దేశ భక్తీ ప్రబోధ గీతం రాసి దాన్ని స్వరపరచి డెట్రాయిట్ ,వాషింగ్ట న్ లలో స్వయం గా పాడిన దేశ భక్తురాలు ఫ్లారెన్స్ లో విపరీతమైన ప్రయాణ బడలిక తో ఉన్నా కోరగానే చిన్నపిల్లలా నుద్దేశించి అప్పటికప్పుడు మాట్లాడి వారిని ఉత్సాహ పరచింది .1870లో ఫెడరల్ ప్రభుత్వం పూర్వపు బానిసలకు ఇళ్లస్థలాలను ఇప్పించమని తీవ్రంగా కోరి ప్రయత్నించినా ఇప్పించ లేక పోవటం ఆమెను తీవ్రంగా కలచి వేసింది . ప్రెసిడెంట్ యులిసిస్ ను కలిసి బాటిల్ క్రీక్ కు తిరిగొచ్చి అధ్యక్ష ఎన్నికలో వోటు వేయటానికి వెడితే తిరస్కరించి పంపారు .
26-11-1883 నాడు సాంఘిక సంస్క రణాభిలాషి ,విమోచనోద్యమ నాయకురాలు ,మహిళాహక్కుల పోరాట యోధురాలు మహా వక్త ‘’సౌజేర్నార్ ట్రూత్ ‘’ఎనభై ఆరేళ్ళ వయసులో మరణించింది .
![]()
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-15-ఉయ్యూరు
గోపాల కృష్ణాష్టకం -2
5-కుమారులిద్దరూ కృష్ణ ,రవి
తలిదండ్రుల సంస్కారం తో పెరిగి
తమదైన విధానం తో విలసిల్లుతున్నా
ఇద్దరికీ వారు నిత్య ఆరాధ్య దైవాలే
ఇద్ద్దరు కోడళ్ళు ,మనుమలు మనవ రాళ్ళు
ఆ ఇంటి సౌభాగ్య చిహ్నానికి ఆన వాళ్ళు
దేశీయత నిండిన విదేశ జీవన యానం
విదేశం లో వెదజల్లుతున్న జంట విజ్ఞాన ప్రసూనం .
6-అక్క డాక్టర్ శ్రీమతి అన్నపూర్ణకు నుద్దియౌ బావ
డాక్టర్ శ్రీ నరసింహ శర్మ ఏం. డి. రాచకొండ
సాహితీ సౌరభాలు వెదజల్లే ఏరాడ కొండ
వైద్యం లోనేకాక ఆంధ్రాంగ్ల గీర్వాణాల మేలిమి కలయిక
మా గోపాల కృష్ణ దంపతులకు అక్కా బావా
ఆది ఆదర్శదంపతులు భళిరా వారే వా .
వారిద్దరి సంస్కారానికీ వీరిద్దరి నీరాజనాలు
వసుధైక కుటుంబ భావనలకు వెదజల్లిన బీజాలు .
7-సిద్ధ యోగిపు౦గ వులను తల్లికి అంకిత మిప్పించి
మహిళా మాణిక్యాలను జీవన సహచరి అర్ధాంగి కిప్పించి
క్షేత్రాలనేమో తన్నుతీర్చి దిద్దిన కోగంటి వారి కందజేయించి
ఋణము తీర్చుకొన్నట్టి ఘనులు గోపాల కృష్ణ
పట్టు బట్టి తెలియ కుండ ‘’గీర్వాణకవుల ‘’న౦కితమిచ్చి
గోపాల బంధుకోటి లోఒకడనై సరస జేరి
ధన్యుడనైన నా భాగ్య గరిమ ఎన్న దరమే
సరసభారతికి శ్రేయో మూర్తి గోపాల కృష్ణ మూర్తి .
8-పుట్టిన దేశం పై ,పెరిగిన గ్రామ౦ పై ఎంతటి ఆరాధన !
ఎన్నెన్నో దాన ధర్మాలు చేసి చేతికి ఎముక లేదని పించారు
ఉయ్యూరు ఊసులకు ,ఊసుల్లో ఉయ్యూరుకు పరవశులౌతారు
ఆపదలో ఉన్నవారికి ఎప్పుడూ వారిది అభయ హస్తమే
పెడ దారిన పడిన వారికి అందించే ఆపన్న హస్తమే
బంధువులందరి నోళ్ళలో నానే ‘’కృష్ణ ‘’–‘’కృష్ణ మామ ‘’
స్నేహపు విలువ తెలిసిన అక్షర తేజో మూర్తి గోపాల మైనేని
వర్ధిల్లాలి వారి దాంపత్యం సుఖశాంతులతో ఏండ్లు ఎన్నేని .
మీ ఆప్తుడు ,ఆత్మీయుడు – దుర్గా ప్రసాద్ -28- 6-15-ఉయ్యూరు
ఉభయ కుశలోపరి
చెన్నై
27.06.2015
పూజ్యులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి,
నమస్సులు. తమరు దయతో పంపిన పుస్తకాలు అందాయి. ఎంత గొప్ప సాహితీ వరివస్య !ఒకవైపు ఆంగ్ల కవుల పరిచయాలు, మరో వైపు సంస్కృత కవుల పరిచయాలు. అటుపై మహిళా మాణిక్యాలు. ఇక దర్శనీయ దైవక్షేత్రాలు, దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు, శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం – ఎంత వైవిధ్యం, ఎంత వైదుష్యం!
‘పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు’ ద్వారా అనేక ఆంగ్ల కవుల గురించి తొలిసారి తెలుసుకొన్నాను. ముఖ్యంగా రాజకవి మొదటి జేమ్స్, జాన్ స్కెల్టన్, క్రిస్టఫర్ మార్లో, రిచర్డ్ క్రాషా ప్రభృతుల గురించి. ఇక చాసర్, షేక్స్పియర్, మిల్టన్, డ్రైడన్, అలెక్జాండర్ పోప్, బ్లేక్, వర్డ్స్ ప్రభృతుల గురించి తగినంత విపులంగా రాశారు. డిలాన్ థామస్ గురించి చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. మరికొంత కాలం బతికి ఉండి, ఇబ్బందులు లేని జీవితం గడిపి ఉంటే మరిన్ని మంచి రచనలు చేసే వాడేమో అనుకోకుండా ఉండలేక పోయాను.
ప్రాచీన, ఆధునిక సంస్కృత కవులందరినీ పరిచయం చేస్తూ సంతరించిన గీర్వాణ కవుల కవితా గీర్వాణం అద్భుతమైన గ్రంథం. సరళంగా చెబుతూనే అవసరమైన అన్ని అంశాలనూ అందించారు. ముఖ్యంగా నైషధ కావ్య పరిచయం, మృచ్ఛకటిక పరిచయం, భారవి, భాసుడు, బాణుడు, మాఘుడు, భవభూతి, ఆనందవర్ధనుడు (ఆలంకారికుడు), మల్లినాథసూరి (వ్యాఖ్యాత), జగన్నాథ పండితరాయలు(ఆలంకారికుడు), మానవల్లి రామకృష్ణ కవి ప్రభృతుల పరిచయాలు చక్కగా వచ్చాయి. తెనాలి రాముని కథలను సంస్కృతీకరించిన సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారి కృషి కొనియాడ దగినది. ఇతర భాషలలోకి మన సాహిత్యాన్ని తీసుకుపోయిన వారి పట్ల నాకు విశేష గౌరవం.కాగా, వాల్మీకి, వ్యాసుల పరిచయం కూడా ఇచ్చి ఉంటే సమగ్రత సిద్ధించి ఉండేదని భావిస్తున్నాను. విశ్వనాథ వారి సంస్కృత రచనల గురించి రేఖామాత్రంగా నైనా పరిచయం చేసి ఉండవచ్చుననుకొంటాను. అదలా ఉంచితే, సంస్కృత సాహిత్యాన్ని తెలుగులో ఇంత సరళ సుందరంగా పరిచయం చేసిన వారు ఇంకెవరూ లేరు. మీ కృషి దొడ్డది.
‘దర్శనీయ దైవక్షేత్రాలు’ తీర్థయాత్రలకు వెళ్ళే వారికి బాగా ఉపకరిస్తుంది. గుడిమల్లం గురించి మీరు పరిచయం చెయడం ముదావహం. నేనూ, మా అన్న (పెదనాన్నగారి అబ్బాయి) సత్యనారాయణా 1989లో ఆ గుడిని సందర్శించాము, చారిత్రక స్పృహతో. ఇన్నేళ్ళకు మళ్ళీ ఆ గుడి గురించి చదవడం ఎన్నో జ్ఞాపకాలను తట్టి లేపింది. ర్యాలి (జగన్మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు), సురుటుపల్లి (అనంతశయనంలో శివుడు), శ్రీ కూర్మం, అరసవిల్లి, శ్రీ ముఖలింగం, కాణిపాకం (చిత్తూరు జిల్లా – విఘ్నేశ్వర మందిరం), మంత్రాలయం (రాఘవేంద్ర స్వామి), విజయవాడ కనకదుర్గ మందిరం, మంగళగిరి, అహోబిలం, మహానంది ఇత్యాది దేవాలయాలను కూడా (మలి ముద్రణలో) కలుపుకొంటే మన రాష్టంలోని అన్ని ఆలయాలనూ పరిచయం చేసినట్టు అవుతుంది.
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు చదివి ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. ఇన్ని దేశాలలో ఆంజనేయ ఆలయాలు ఉన్నాయా అని ఆశ్చర్యం, తెలుసుకోగలిగినందుకు ఆనందం. శ్రద్ధాసక్తులతో ఎక్కడెక్కడి సమాచారాన్నో క్రోడీకరించినందుకు మీకు జోహారు.
శ్రీ ఆంజనేయస్వామి మాహాత్మ్యం మా నాన్న చదివిన తరువాత నేను చదువుతాను. కాగా, త్యాగి పేరడీలు మరింత పదును దేరవలసి ఉంది.
మహిళా మాణిక్యాలు ఎంతో ఉపయుక్తమైన గ్రంథం. ప్రజా
కవయిత్రి ఫీలిస్ మెక్ గిన్లీ గురించి మీ పుస్తకం ద్వారానే తెలుసుకొన్నాను. పెరెల్ ఎస్. బక్, డొక్కా సీతమ్మ, శకుంతలా దేవి, భానుమతి, కేథరిన్ మాన్స్ ఫీల్డ్, యశోధరా రెడ్డి, భండారు అచ్చమాంబ. జిల్లేళ్ళమూడి అమ్మ, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, సిల్వియా పాత్, అన్నే ఫ్రాంక్, అగతా క్రిస్టీ, జూడిత్ రైట్ మినహా తక్కిన వాళ్ళ గురించి ఇప్పుడే తెలుసుకొన్నాను. ధన్యవాదాలు. ఇంకా జెన్నీ మార్క్స్, సరోజినీ నాయుడు, డా. ముత్తులక్ష్మీ రెడ్డి, ఆంగ్ కాయ్ సూ (మయన్మార్ నేత), మేరీ క్యూరీ తదితరులను కూడా చేర్చుకోవచ్చు. మొత్తం మీద ఉత్తమ రచన అనడంలో ఎలాంటి సంశయమూ లేదు.
తమ కృషికి మరో మారు అభినందనలు.
ఉప్పలధడియం వెంకటేశ్వర
India 


గోపాలాస్టకం
1-శ్రీయుత మైనేని గోపాల కృష్ణ
తరగని మెరుగైన సాహితీ తృష్ణ
ఆత్మీయ ఆప్యాయతల నిండు కృష్ణ
మాటల్లో మాత్రం గలగలా పారే కృష్ణ
హృదయం అతి పవిత్ర పుష్కర కృష్ణ
సహృదయత, మానవతల పోటెత్తిన కృష్ణ
సహన సంస్కారాల మెండు నిండు కృష్ణ
ఆధ్యాత్మిక వలయాలకు ఆవలి కృష్ణ ‘
2-శ్రీ గోపాల కృష్ణ మైనేని
స్నేహానికి మత్తెక్కించే ఐరేని
అందరి శాంతి సౌఖ్యాలు కోరుకొనే శాంత మౌని
చిరు విషయాకే స్పందించే చైతన్య వని
హృదయం విజ్ఞానం నిండి ఉన్న గని
మస్తిష్కం నిండా పుస్తకాలున్న మణి
బాధిత పీడిత జనుల చింతామణి
మంచి కోసం మనిషికోసం నినదించే సువాణి .
౩-శ్రీ కృష్ణ మైనేని గోపాల
ఆర్తుల పాలిటి కృష్ణ గోపాల
బంధువుల కు గోపికా లోల
హిత సన్నిహితులకు కృష్ణ కుచేల
గురువులకు సాందీపాశ్రమశిష్య హేల
పెద్దల యెడ అత్యంత వినయ విలోల
శ్రీ రామ శ్రీ కృష్ణ భక్తిలో పరవశ లీల
మాతా పిత నిత్య సంస్మరణలో ధన్య లోల .
4-సరసభారతి కి శ్రీ గోపాల కృష్ణ తరగని గని
గురు పూజోత్సవ నిర్వహణ సౌజన్య శీలి
అర్ధాంగి శ్రీమతి సత్యవతికి ఆదర్శ పెనిమిటి
ఆఇద్దరి దాంపత్యం లోకానికి పెన్నిధి
అమెరికాలో ఉన్నా ఆకుటుంబం
అక్కడా ,ఇక్కడా అందరికీ ఆదర్శం .
ఇంతటి సంస్కార సౌజన్యాల కలయిక
పరిచయం ఉన్న మనందరికీ అష్ట సిద్ధుల వరం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-6-15-ఉయ్యూరు
నమస్తే గోపాల్జీ -టాప్ లేపే లాప్ టాప్ తో జ్ఞాపికలతోపుష్పహారం ,నగదు బహుమతి లమీ దంపతుల అభిమాన వర్షం తో బాటు ,పూజ్యులు శ్రీ మీబావ గారి చేత ఈ డెబ్బై ఆరేళ్ళ కుర్రాడికి అభినందన ఆశీస్సుల కవితా వర్షం కురిపించి నన్ను పూర్తిగా కృతజ్ఞతా భావపు హర్షం తో తడిసి ముద్ద చేసేశారు . దీనికి ఏమిచ్చి నేను ఋణం తీర్చుకోగలను?శ్రీ శర్మగారి సౌజన్యానికి అభిమానానికి నా కృతజ్ఞతా నమస్సుమాలు. ఇది ఎన్నటికీ తీర లేని ఋణం ,అనుబంధం . అని పిస్తుంది .కాళి దాసు చెప్పిన ”జననాంతర సౌహృదయం ”గుర్తుకు వచ్చింది . ఏ పూర్వ రుణాను బంధమోఇది ? ఇంతకంటే మాటలు రావటం లేదు మాటల కంటే నిండు గుండె తో మౌనం గా ఉండటం మేలే కాని అది సభ్యత కాదు సంస్కార లోపం అవుతుందని ఈ నాలుగు మాటలు రాశాను .సదా మన అభిమాన ,అత్మీయతలు వర్ధిల్లాలని భావిస్తూ -మీ -దుర్గా ప్రసాద్
అయ్యా, శ్రీ దుర్గాప్రసాద్ గారూ : ఆమాట కొస్తే మీరు “చేతలవారు” సార్, మీరన్నట్లు “మాటల వారు ” కాదు. పట్టువిడవని- రమణగారిని అడగండి చెబుతారు- డా :శర్మ గారి “ప్రశంసనీయ పద్య సుమములు ” చూశారుగదా! దానితో పోలిస్తే ఇది ఫీలింగ్ లో, శ్రమలో నామమాత్రమే నంటే ముమ్మాటికి నమ్మాలి మీరు. ఆరోగ్యకారణంగా అవస్తపడుతూ గుండెనొప్పితో బాధపడుతూకుడా ఆపద్యాన్ని ఎన్నిసార్లు revise చేశారో , చేయిoచారో , రమణ గారికీ , journalist శ్రీ ప్రకాష్ గారికీ , వారి సతీమణి సునీత గారికే తెలుసు . ఆరునూరైనా సరే , మీవ్యక్తిత్వం, వారి సీస, కంద పద్యాల్లో ప్రతిఫలించాలనే తపన ఇoతింతని చెప్పనలవికాదు . రోజుకి పదిసార్లు “ఫోనుల చెర్నాకోలు” తో తోలుకువచ్చారు మమ్మల్ని .
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
156-రామ చరిత్ర రాసిన అభినంద
సదానదుని కుమారుడైన అభినందుడు .ఉదయ సుందరి అనే కావ్యం లో సోద్దాలుడుఅనే కవి అభినంద కవిని ,రా జ శేఖరుడిని అభినందించాడు .దీనివలన అభినందన తర్వాతి వాడే రాజ శేఖరుడు అని తెలుస్తోంది .పదకొండవ శతాబ్ది పూర్వార్ధం లో సోద్దాలుడు జీవి౦చిఉన్నాడని యువ రాజు హర వర్ష అతనికి ఆశ్రయ మిచ్చాడని ,మహా గౌరవం గా చూసుకోన్నాడని తెలిసింది .కవి గొప్పతనాన్ని గుర్తించి హరవర్ష అర్ధ సింహాసనాన్ని అందించాడనీ కధనం .సోద్దాలక ,అభిన్దలు రాజా హర వర్ష ను విక్రమాదిత్య ,హాల ,శ్రీ హర్ష ల తో పోల్చారు .అభినందన రాసిన’’ రామ చరిత’’ లో హర వర్ష ను యువ రాజ దేవునిగా ,విక్రమాదిత్యుని కుమారుడిగా ,పాల వంశ బీజమైన ధర్మ పాలుని సంతతి వానిగా చెప్పాడు .
బెంగాల్ చరిత్రలో పాల వాంశ రాజు ధర్మ పాలుడు ప్రసిద్ధుడు .అతిని ఇద్దరు కొడుకులు త్రిభువన పాల ,దేవ పాల లు .మాన్ఘీర్ చరిత్రలో త్రిభువన పాలుడు యువ రాజు గా పేర్కొన బడింది .కాని తండ్రి తర్వాత దేవపాలుడే రాజ్యానికి వచ్చాడు .తొమ్మిదవ శతాబ్దపు రెండవ భాగం లో దేవపాలుడు ఖ్యాతి పొందిన రాజు అయ్యాడు ..రాజా దేవపాలుడే యువరాజు హర వర్ష అని రామ సామి శిరోమణి పరిశోధన లో తేలింది .ఇతడే యువ రాజ దేవుడు ..పాల వంశపు వాడికి హర వర్ష అనేకొత్త పేరు ఎలా వచ్చింది అనే సందేహం ఉంది .దీనికి సమాధానమూ చెప్పారు .ధర్మ పాలుడు రాష్ట్ర కూట రాచ కన్య కామ దేవి ను పెళ్లి చేసుకొన్నాడు . రాష్ట్ర కూట రాజులకు పేరు చివర హర్ష అని టాగ్ తగిలించుకోవటం ఒక ఫాషన్ .అందుకే అత్తవారింట్లో ఉన్నప్పుడు దేవపాలుడి పేరు హర వర్ష గా వాళ్ళు పిలుచుకోవటం ప్రారంభించి ఉంటారు అదేచివరికి స్తిరపడి పోయింది .కాని ఇతని పెద్దన్న త్రిభువన పాలుడు తండ్రి ధర్మపాలుని రాజ దర్బారులో యువరాజుగా చలామణి అయ్యాడు . దీన్ని బట్టి అభినందన కవి తొమ్మిదవ శతాబ్ది పూర్వార్ధం వాడు అని తేల్చారు .
అభినందన రాసిన ‘’రామ చరిత’’ ను భోజుడు ,మమ్మటుడు మహిమ భట్టు పొగిడారు దీనితో అతని ప్రశస్తి ద్విగుణీక్రుతమైంది .ఇది రామాయణ కద యే.బరోడా ప్రతిలో కావ్యం చివరినాలుగు కాండలలో అభినందన ,భీమ కవుల హస్తం ఉందని అనిపిస్తుందట .ఈ భీమకవి ఎవరో అజ్ఞాత కవి .అభినంద కవి అసంపూర్తిగా వదిలినకావ్యాన్ని నాలుగు కాండాలను అదనం గా చేర్చాడు అనుకోవాలి .మొత్తం 36 కాండలలో చాలాభాగం అభినంద కవి రాసినవే .కదా భాగం తోబాటు తనకు ఆశ్రయ మిచ్చిన రాజుల ప్రశంస చేశాడు .దీనితో బాటు తన రచనా చమత్క్రు తినీ చెప్పుకొన్నాడు తీర్ధం ,స్వార్ధం గా .విషయ వివరణలో స్పష్టత చిక్కని కవిత్వం ,కవితా వినోదం తో అభినంద కవి రాసిన రామ చరిత కావ్యం అలరారు తుంది .
157కాదంబరి కదా సారం రాసిన –మరో అభినంద కవి
ఇప్పటిదాకా తెలుసుకొన్న రామ చరిత రాసిన అభినంద కవి కాక ,మరో అభినందుడున్నాడు .ఇతనిని ‘’గౌడాభినందనుడు ‘’అంటారు.వీరి వంశం గౌడ దేశం లో ఉండేది .వీరిలో శక్తి అనే వాడు కాశ్మీర దేశం కు చేరేదాకా ఆ పేరుతోనే పిలువ బడ్డారు . శక్తి ఇక్కడికొచ్చి ,దర్వాభి సార లో ఒకమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .శక్తి మనవడు శక్తి స్వామికాశ్మీర్ రాజు లలితాదిత్యముక్త పాద అనే కర్కోటక వంశ రాజు ఆస్థాన మంత్రి .ఇతని పరిపాలన కాలం 726.శక్తి స్వామికి అభినంద అయిదవ తరం వాడు .జల్హనుడు తన సూక్తి ముక్తావళి లో అభినంద ను రాజ శేఖరుని సమకాలికునిగా చెప్పాడు .అభినవ గుప్తుడు కూడా తన లోచన లో ఇతని గురించి చెప్పాడు .కనుక ఈ అభినంద కవి తొమ్మిదవ శతాబ్ది వాడు అని నిర్ణయించారు .కాని అభినంద కవి తండ్రి జయంతుడు న్యాయ మంజరిలో దామోర గుప్తుని కుంతిని మాతను శృంగారం తో వర్ణించటం తప్పు పట్టాడు .శంకర వర్మ ఆ నాటి కాశ్మీర్ రాజు అన్నాడు .శంకర వర్మ 884నుండి రాజ్యం చేసినట్లు ఉంది .ఇది అభినందన కాలాన్ని కొంచెంతర్వాతి కాలానికి తెచ్చింది .అంటే పదవ శతాబ్దపు మొదటి వాడు అయ్యాడు .ఇతను ఎనిమిది కాండలలో రాసిన కాదంబరి కదా సారం బాణకవి వచనం లో రాసిన కాదంబరి కధే .ఈ కావ్యాన్ని తర్వాతి కవులు చాలా చాటువులలో పొగిడారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 27-6-15-ఉయ్యూరు
సాహితీ బంధువులకు -ఇవాళ నా పుట్టిన రోజు -75 నిండి 76 లో ప్రవేశిస్తున్న సందర్భం గా అందరికి శుభ కామనలు-మీ -దుర్గా ప్రసాద్ -27-6-15- ఉయ్యూరు
–
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797