శశి బి టెక్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆదివారం అద్భుతం – జీవన యోగం – అంతర్జాతీయ యోగం

అంతర్జాతీయ యోగం (19-Jun-2015)

యోగం అంటే శరీరానికి, మనసుకు ఉన్న సంబంధాన్ని చెప్పే శాస్త్రమనీ
ఇదివరలో తెలుసుకున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపు
కుంటున్న సందర్భంగా యోగ చరిత్ర గురించి తెలుసుకుందాం.

భగవద్గీతతో సహా సమానంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పుస్తకం పతంజలి యోగసూత్రలు. ఇది ఏ దేవుడి సంప్రదాయాన్ని అనుసరించి వచ్చింది కాదు. అందువల్ల అన్ని సంస్కృతుల వారూ దీన్ని గ్రహించారు. ప్రస్తుతం మనదేశంలో కన్నా ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో దీనిపై శాసీ్త్రయమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవలే కొలంబియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఎడ్విన్‌ బ్రైయాంట్‌ పతంజలి యోగసూత్రాలపై ఉన్న వ్యాఖ్యలన్నిటినీ పరిశీలించి ప్రామాణికమైన వ్యాఖ్యను రాశారు. వందలాది మానసిక శాస్త్రవేత్తలు యోగాపై అధ్యయనం చేశారు.
మంత్రయోగం..
వేదాల మొదటి భాగాల్లో యోగ ప్రస్తావన కనిపించదు. ఉపనిషత్తుల్లో యోగం ప్రస్తావన వివరంగా ఉంది. సింధునది నాగరికత నాటి ముద్రల్లో ధ్యానం, యోగ ముద్రలు కనిపిస్తాయి. వైదిక సంప్రదాయం, సింధు నది నాగరికత రెండూ ఒకటా..? వేర్వేరా..? అనే విషయంపై భేదాభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల మొదట్లో ఇది వైదిక సంస్కృతిలో లేదు అని కొందరి అభిప్రాయం. అయితే వైదిక సంస్కృతితో పాటు సమాంతరంగా వచ్చిన సంప్రదాయం ఇదని మరికొందరి అభిప్రాయం. వేదాల మొదటి భాగాల్లో యజ్ఞాలు మొదలైనవి చెప్పారు. ఇవన్నీ మానవ స్వభావమైన కోరికలకు సంబంధించినవి. దీని నుంచి క్రమక్రమంగా ఎదిగి తత్వచింతన చేయడానికై మనసుకు నిలకడ, శిక్షణ అవసరం. అందుకే మనసును అదుపులో పెట్టే సాధనంగా యోగా పద్ధతులను ఉపనిషత్తుల్లో అంగీకరించారు. భారతంలో, ముఖ్యంగా మోక్షధర్మ పర్వంలో భీష్ముడు యోగా పద్ధతులను చాలా వివరంగా చెబుతాడు. పురాణ కాలానికి పతంజలిని పూర్తిగా హిందూ సంప్రదాయంలోని వ్యక్తిగా చూడగలం. ఆయన ఆదిశేషుడి అవతారమని మన సంప్రదాయం. ఆదిశేషుడు గానీ, శివుడి కంఠంలో ఉన్న నాగరాజు గానీ, అనేక దేవతలకు గొడుగు పడుతున్న సర్పాలు గానీ, ఆయా దేవతల యోగశక్తులను సూచిస్తాయని పండితుల అభిప్రాయం. సర్పాలకు వాయుభక్షకులు, గాలిని పీల్చి బతికే జీవులు అని కూడా పేరు. ప్రాణాయామంలో.. ముఖ్యమైంది ప్రాణవాయువే. ప్రాణాయామం యోగంలో ఒక ముఖ్యమైన మెట్టు. తర్వాతి కాలంలో అనేక పూజా విధానాల్లో భాగంగా కొంత యోగా పద్ధతులను ప్రవేశపెట్టినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు సూర్య నమస్కారాలు. వీటిలో ఉన్న ఆసనాలను కొన్ని మంత్రాలు మననం చేస్తూ చేయాలి. అలాగే సంధ్యావందనంలోని అనేక ముద్రలు యోగ నుంచి గ్రహించినవే.
ముద్రయోగం
తూర్పు ఆసియా దేశాలన్నింటిలో యోగ సంప్రదాయం ఉంది. ఇది బౌద్ధమతం ద్వారా వ్యాపించిందని పండితుల అభిప్రాయం. ఆ దేశాల్లోని కొన్ని యుద్ధపద్ధతులు కూడా బౌద్ధబిక్షువులు వ్యాపింపజేసినవే అని ఒక వాదన. కొన్నేళ్ల కిందట వచ్చిన హాలీవుడ్‌ సినిమా ‘blood sport’ లో హీరో కొన్ని విన్యాసాలు చేస్తాడు. వాటిలో చేతులకు, వేళ్లకు సంబంధించినవి ఉన్నాయి. వేళ్లకు సంబంధించిన ముద్రలు కొన్ని మన పూజా విధానాల్లో ఉన్నవే. కుంగ్‌ ఫూ చిత్రాల్లో కూడా ఇలాంటి ముద్రలు చూస్తాం. ఇవన్నీ హఠయోగానికి సంబంధించినవే. గాలిని పీల్చుకుని శరీరాన్ని బిగించే పద్ధతులు హఠయోగంలో కనిపిస్తాయి.
పాశ్యాత్య దేశాల్లో యోగా బోధించేటప్పుడు మన సంప్రదాయంలో చెప్పే మంత్రాలను తీసివేసి వారి సంస్కృతికి అనుగుణంగా బోధిస్తారు. దీనిపై ఆందోళన అనవసరం. మన మంత్రాలకు బదులుగా వారి దేవుడి పేరు చెప్పుకోవడం సహజమే. అర్థచంద్రాసనాన్ని ‘half moon posture’ అని, భుజంగాసనాన్ని ‘cobra posture’ అని ఈ విధంగా పేర్లు మార్చి చెప్పినా వారు కూడా మనం సాధించిన ఫలితాలనే సాధిస్తారు. ఇటీవల కేరళలో క్రైస్తవులు ఈ యోగా పద్ధతులను జీసస్‌ నమస్కారాలు అంటూ బోధిస్తున్నారు. దీనికి మనమేం ఆందోళన చెందాల్సిన పని లేదు.
విద్యాయోగం..

యోగాభ్యాసాన్ని స్కూల్‌ సిలబ్‌సలో భాగంగా పెట్టడం తమ సంస్కృతికి విరుద్ధమని ఇతర మతాల వారు భావించవచ్చు. విషయం ఎంత మంచిదైనా, ఎంత గొప్పదైనా.. స్వచ్ఛందంగా అందరికీ ఆమోదకరంగా ఉన్నప్పుడే దాన్ని ప్రవేశపెట్టడం సరైన విధానం. పదో శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ప్రఖ్యాత అరబ్‌ యాత్రికుడు అల్‌ బెరూనీ పతంజలి యోగ సూత్రాలను అరబిక్‌ భాషలో ‘కితాబ్‌ బతంజల్‌ అల్‌ హిందీ’ పేరిట గురుశిష్యుల సంభాషణ రూపంలో తర్జుమా చేశాడు. దీని అంగ్ల అనువాదం వివరాలను ఇంటర్నెట్‌లో చూడగలం. ‘ఈ పుస్తకం ప్రతి అక్షరం విని అర్థం చేసుకున్న తర్వాత నా ప్రజలకు దీన్ని ఇవ్వకుండా ఉండటానికి నా అంతరాత్మ అంగీకరించలేదు’ అని అల్‌ బెరూనీ రాసుకున్నాడు. ఇలాంటి పుస్తకాలను భారతీయ భాషల్లోకి తేవడం కూడా అవసరమేమో..!
(రచయిత ప్రసంగాలను www.advaitaacademy.org అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు)

డాక్టర్‌ కె. అరవిందరావు,
రిటైర్డు డీజీపీ
రెండు స్థాయిల్లో దేవుడు (12-Jun-2015)

ప్రపంచంలోని అనేక మతాలకూ, భారతీయ మతాలకూ ఒక ముఖ్య భేదం ఉంది. దీన్ని వివరిస్తూ మ్యాక్స్‌ ముల్లర్‌ ఇలా అన్నాడు. what distinguises the vedanta philosophy from all other philosophies is that it is at the same time a religion and a philosophy. ఇతర మతాల్లో ముఖ్యంగా ఒకే మతగ్రంథం ఉంటుంది. దాని ఆధారంగా మిగతా గ్రంథాలు వస్తాయి. ముఖ్యమైన మతగ్రంథం ఒకానొక వ్యక్తి, ఒకానొక చారిత్రకసమయంలో దేవుడి సాక్షాత్కారాన్ని పొంది దేవుడి ఆజ్ఞగా తన ప్రజలకు చెప్పిన విషయాలకు సంబంధించినది. ఇవి విశ్వాసానికి సంబంధించిన విషయాలు. శాస్త్రీయంగా సమర్థించలేనివి. ఒక మతం వారు మా విశ్వాసం సరైనది అంటే మరొక మతం మా విశ్వాసం సరైనది అనవచ్చు. భారతీయ (హిందూ, బౌద్ధ, జైన) మతాల్లో తత్త్వశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, మత సంబంధమైన పుస్తకాలు సమన్వయం చేయబడి ఉంటాయి. ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రాలు తత్త్వశాస్త్రంలోనూ భాగమే, మతగ్రంథాల్లోనూ భాగమే. అందుకే హింద మతగ్రంథాలు రెండు స్థాయిల్లో విషయాన్ని బోధిస్తాయని మునుపటి ఒక వ్యాసంలో ప్రస్తావించాను. తత్త్వశాస్త్రాన్ని అర్థం చేసుకునే శక్తి ఉన్న వాడికి ఆ స్థాయిలోనూ, ఆ శక్తి లేనివాడికి పురాణాలు మొదలైన స్థాయిలోనే విషయాన్ని చెబుతాయి.

పరమాత్మ అంటే విశ్వమంతా వ్యాపించిన శుద్ధచైతన్యం అనీ, సృష్టి అనేది ఆ చైతన్యం నుండి వచ్చిందే అనీ, ఆ చైతన్యంలోని క్రియాశక్తి వల్ల ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, చెట్లు చేమలు, చిట్ట చివరిగా ప్రాణులు వచ్చాయనీ, పంచభూతాల మరో రూపంగానే ఇంద్రియాలు, మనస్సు ఏర్పడ్డాయి అని విశ్లేషించి చెప్పడం శాసీ్త్రయమైన విచారం. ఇది తత్త్వశాస్త్రం అనే కోవకు వస్తుంది. ఉపనిషత్తులు, వాటిపై వచ్చిన వ్యాఖ్యానాలు పై విషయాల్ని అనేక కోణాల్లో వివరించి చెబుతాయి. వీటిని తెలుసుకోవడానికి కొంత శ్రద్ధ, కొంత విషయజ్ఞానం ఉండాలి. పురాణాలలో త్రిమూర్తులు, సృష్టి, స్వర్గం, నరకం మొదలైన విషయాలు, విశ్వాసానికి చెందినవి, ఎవరూ నిరూపించలేనివి ఉంటాయి. వీటిని కూడా మన సంప్రదాయం అంగీకరించింది.
పై రెంటిలో ఏది నిజం? ఆకాశంలో చేతిలో కర్రపట్టుకుని ఒకానొక దేవుడు ఉన్నాడు అనేది ఏ శాస్త్రజ్ఞుడు ఒప్పుకోడు. అందువల్ల శాస్త్రీయంగా ఆలోచించేవాడికి మొదట చెప్పింది నిజం. కానీ మన చుట్టూ సమాజంలో అనేక సంప్రదాయాలు, విశ్వాసాలు ఉన్నాయి. వాటన్నింటినీ కాదని తోసివేయాలంటే బలాత్కారంతో, రక్తపాతంతో ఆ పని చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో అలా జరిగింది కానీ మనదేశంలో అలా జరగలేదు. ఒక బాలుడు బొమ్మ ట్రైన్‌ను నడుపుతూ తాను నిజంగా ట్రైన్‌ నడుపుతున్నానని భావిస్తాడు. తండ్రి దాన్ని నవ్వుతూ అంగీకరిస్తాడు. పెద్దవాడయ్యాక ఎట్లూ ఆ బొమ్మతో ఆడుకోడని అతనికి తెలుసు. అలాగే ఆలోచనాశక్తి పెరగనంత వరకూ ఏదో ఒక స్థాయిలో మనిషి క్రమశిక్షణతో ఉండడం మంచిది కనుక ఆ సంప్రదాయాల్ని కూడా సరే నిజమే అన్నారు. పై స్థాయిలో చెప్పినదాన్ని పారమార్థిక సత్యం అన్నారు. కేవలం విశ్వాసంపై ఆధారపడి వ్యవహారాల్లో ఉన్నదాన్ని వ్యావహారిక సత్యం అన్నారు.
అలాగే రెండింటినీ ఒప్పుకోవడం వల్ల ఒకానొక కాలంలో లాభంపడి ఉండవచ్చు కాని మతాల మధ్య ప్రస్తుత పోటీ వాతావరణంలో కొత్త సమస్యలొస్తున్నాయి. ఒకప్పుడు శాస్త్రీయ చర్చలు చేస్తూ పండితులు ఒకవైపు, రామాయణం, భాగవతం కథలు వింటూ నిరక్ష్యరాస్యులు మరొకవైపు ఒకే విషయాన్ని రెండు స్థాయిల్లో తెలుసుకుంటూ వచ్చారు. ఒకవైపు సత్యం ఏమిటి అంటూ నిష్పక్షపాతంగా, శాసీ్త్రయంగా కొనసాగించే ఆలోచన. మరొకవైపు సమాజంలో ఇదివరకే ఉన్న సంప్రదాయాల్ని(విష్ణువు, శివుడు మొదలైనవి) అంగీకరించడం మొదటి స్థాయిలో విశ్లేషణ శాస్త్రీయమైనది కావున ఎలాంటి వివాదం ఉండదు. రెండవ స్థాయిలోని విషయాలు విశ్వాసానికి సంబంధించినవి. ఒకవైపు వైష్ణవ సంప్రదాయం, మరోవైపు శైవం, ఇంకొకచోట శక్తిపూజ మొదలైనవి. వీటి మధ్య పరస్పర వాదాలు తలెత్తకుండా శ్రీ శంకరాచార్యులు వీటన్నింటినీ ఉపనిషత్తులు అనే గొడుగు కిందకు తెచ్చారని ఇది వరలో గమనించాం. ఇలాంటి సంప్రదాయాలు అనేకం కావున అనేక దేవుళ్ళను అంగీకరించారు. ఏ సంప్రదాయం ప్రకారం పూజించినా ఒకే పరమాత్మను పూజిస్తున్నారని ఈయన సమన్వయం చేశారు. వేదాంత స్థాయిలో చెప్పిన బ్రహ్మ అనేది ఒక వ్యక్తి కాదు. దానికి ప్రపంచ సృష్టి, దుష్టశిక్షణ, శిష్టరక్షణలాంటి డ్యూటీలు లేవు. సంప్రదాయం, లేదా మతంలో చెప్పిన దేవుడికి ఇలాంటి డ్యూటీలున్నాయి. డ్యూటీని ఉపాధి అంటారని మనకు తెలుసు. ఈ ఉపాధి అన్న దేవుణ్ణి సోపాధిక బ్రహ్మ అన్నారు. ఇది కింది స్థాయికి చెందింది. ఉపాధిలేని సత్యము, చైతన్యం అనే దాన్ని నిరుపాధికం అన్నారు. అందువల్లే మొదటి స్థాయిలో మాట్లాడేవారు ఎప్పటికప్పుడు కింది తరగతి వారిని హెచ్చరిస్తూ మీరు సత్యం అనుకుంటున్నది పాక్షిక సత్యం మాత్రమే, ఆ స్థాయి నుంచి మీరు పైకి ఎదగాలి అంటూ చెబుతూ వచ్చారు. ఇలాంటి హెచ్చరికలు ఉపనిషత్తుల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఉదాహరణకు కేనోపనిషత్తులో ‘‘నేదం యదిదముపాసతే’’-‘‘ప్రజలు ఇది దేవుడు అని పూజిస్తున్నది సంపూర్ణసత్యం కాదు’’ అంటూ నాలుగు మంత్రాలున్నాయి. ఇదం అంటే ఇది అని నిర్ధారించి చెప్పిన విషయం. కొందరు మతపెద్దలు కూడి ఇది దేవుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, సర్వజ్ఞుడు, ఇతన్నే పూజించాలి అని చెబితే అది ‘ఇదం’ అనే దాని పరిధిలోకి వస్తుంది. సృష్టి మొదలైన డ్యూటీలు ఉన్న దేవుణ్ణి ఏ మతం చెప్పినా అది ‘ఇదం’ అనే స్థాయికే వస్తుంది. దీనివల్ల ప్రయోజనాలుండవచ్చు. ఇది పూజాపునస్కారాలకు పనికివస్తుంది. మనిషిని సన్మార్గంలో పెట్టడానికి దానం, ధర్మం, అహింస మొదలైన గుణాల్ని ఇవ్వడానికి పనికివస్తుంది. అయితే ఇది వ్యవహార దశలో సత్యమే కానీ పరమార్థ దశలో కాదు. అందువల్లే వేదాంతం మాటిమాటికీ మనిషిని హెచ్చరిస్తూ నీవు మతం స్థాయిలో దేన్ని ఆరాధించినా తప్పులేదు కానీ అదే పరమసత్యం కాదు అని చెప్పింది. అసలైన శుద్ధ చైతన్యాన్ని ఇది అంటూ నిర్దేశించలేం. ఒక టార్చిలైటు వెలుగులో చీకటి గదిలోని వస్తువుల్ని చూడవచ్చు కానీ సూర్యుడువైపు టార్చిలైటు వేసి ఎవరూ చూపరు. చైతన్యం కారణంగా మనం వస్తువుల్ని చూడగలుగుతున్నామే కానీ ఆ చైతన్యాన్నే మనం చూడలేం. Consciousness cannot be objectified అని ఇవాళ శాస్త్రజ్ఞులు ఈ విషయాన్నే చెబుతున్నారు. కావున నీవు పూజిస్తున్నది పరమసత్యంకాదు అని ఉపనిషత్తులు చెబితే ఒక నమ్మకాన్ని వదిలి మరొక నమ్మకాన్ని అంగీకరించమనీ, ఒక మతాన్ని వదిలి మరొకదాన్ని తీసుకోమని కాదు. ఏ నమ్మకమైనా ఒకే స్థాయిలోనిదే, ఉపాధి ఉన్న దేవుడే. ఇది దాటి అసలైన సత్యాన్ని, తెలుసుకోమని వాటి ఉద్దేశం.
దీన్ని వక్రీకరించి కొందరు మీ ఉపనిషత్తుల్లోనే మీరు పూజిస్తున్నది దేవుడు కాదని చెప్పారు కదా, మా మతంలోకి రండి అనడం, ఆధునిక సాధనాలైన వాట్సప్ లాంటి ద్వారా ప్రచారం చేయడం అజ్ఞానంతో కూడిన పని. దీనివల్ల అమాయకుల్ని మతమార్పిడి చేయవచ్చు. కానీ సత్యానికి మరింత దూరంగా వెళ్లడమే అవుతుంది. మరికొందరు మీ ఉపనిషత్తుల్లో మా దేవుడి గురించే చెప్పారు అనడం మరొక మానసిక బలహీనత. సంస్కృత పండితులు నోరు మెదపకున్నంత కాలం ఇలాంటి వాదనలు ఇంకా అనేకం వస్తాయి.
‘ఇదం’ అని చెప్పబడింది పూర్తిగా వ్యర్థంకాదు. డిగ్రీకి వెళ్ళడానికి హైస్కూలు ఎలా అవసరమో ఇదీ అలా అవసరం. అసలైన దాన్ని తెలుసుకోవడానికి అదొక గొప్ప సాధనం.
మన సంప్రదాయంలో చెప్పిన ఉసాసనలన్నీ ఇలాంటివే. అంతేగాని ‘ఇదం’లో ఉన్న ఒకటి సరైనది, మరొకటి తప్పు అనడం దురుద్దేశంతో కూడిన వాదం.
(రచయిత ప్రసంగాల్ని www.advaitaacademy.org అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు)

జీవన యోగం

  • 20/06/2015
TAGS:

ఆదివారం-జూన్ ఇరవై ఒకటవ తేదీన జరుగుతున్న ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ మానవాళి చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం…సమన్వయసాధన పథంలో మరో ప్రగతి పదం. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న దాదాపు అన్ని దేశాలూ మన ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘యోగ దినోత్సవ నిర్వహణ’ ప్రతిపాదనను ఆమోదించడం మన దేశానికి లభించిన సాంస్కృతిక విజయం. శరీరం, మనస్సు, బుద్ధి కలసి మెలసి ఎకోన్ముఖ స్థితి ఏర్పడడం యోగం. ఈ ఏకోన్ముఖ స్థితి మంచి నడవడి. మంచి నడవడిని మానవాళికి నేర్పిం చే సంస్కారాల సమన్వయతత్త్వం యోగం. యోగ విద్య మనదేశంలో అంకురించింది, పల్లవించింది, వికసించింది, పరిమళించింది. ఈ పరిమళం ప్రపంచ మానవాళికి మాధుర్యాన్ని పంచిపెట్టడం చరిత్ర. ఆ మాధుర్యం మానవులను నిజమైన మానవులుగా దిద్దడానికి దోహదం చేసిన చరిత్ర. జంతు ప్రవృత్తి నుంచి పైశాచికమైన వికృతులనుంచి తప్పించి మానవుడిని సంస్కృతి నిబద్ధుడిని చేసిన మాధ్యమం యోగం. యోగవిద్య మనదేశలో పుట్టినప్పటికీ మొత్తం ప్రపంచానికి ఉపయోగపడడం తరాల చరిత్ర. ఈ సంస్కారబద్ధులైన సమయంలో మానవులు ఇతర మానవులను పీడించలేదు. ఈ సంస్కారానికి దూరమైన సమయంలో మానవులు దురాక్రమణ దారులుగా మారారు. కలయిక-యోగం-ఆయా జాతుల మనస్సులలో వికసించకపోవడమే ఇందుకు కారణం… యోగం వికసించడమంటే శరీరం, మనస్సు, బుద్ధి ఒకే లక్ష్యం వైపు ఏకోన్ముఖంగా కేంద్రీకృతం కావ డం. ఈ ఏకోన్ముఖ లక్ష్యం ఆత్మసాక్షాత్కారం. ఒకే ఆత్మ అద్వితీయమైన ఆత్మ. అనంతకోటి బ్ర హ్మాండాలుగా, అసంఖ్యాక జీవాత్మలుగా ప్రస్ఫుటిస్తుండడం విశ్వవ్యవస్థలోని వ్యవహార వాస్తవం. ఈ జీవన వాస్తవం, యోగం ద్వారా యోగ విన్యాసాల ద్వారా ధ్రువపడడం సమన్వయం. అసంఖ్యాక రూపాల, వైవిధ్యాల స్వభావం ఒక్కటే…వైవిధ్యాలన్నీ అద్వితీయమైన సత్యంలో ఆత్మతో సమన్వయమై ఉండడం యోగం-కలయిక! ఈ జీవన వాస్తవాన్ని ‘ప్రపంచం’ ఆచరించగలిగినప్పుడు వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు. మతాల మధ్య, భాషల మధ్య, వర్గాల మధ్య, దేశాల మధ్య, జాతుల మధ్య, జీవజాలం మధ్య, చరాచర విశ్వ స్వరూపాల మధ్య విరోధం లేదు. ఈ సంస్కార మాధ్యమం భారతీయ జీవన యోగం! కలిసి ఉండడమే విలీనమై ఉండడమే యోగ స్వభావం. శరీరం బుద్ధి మనస్సు ఆత్మతో కలసి ఉండాలి. మానవాళి కలసిమెలసి ఉండాలి. ఇదే వసుధైక కుటుంబం…ప్రపంచ మంతా ఒకే కుటుంబం, ఒకే ఇల్లు! అలాగే మన పుడమి విశ్వవ్యవస్థలోని అసంఖ్యాక గ్రహాలతో నక్షత్రాలతో బ్రహ్మాండాలతో కలసి ఉండడం సహజమైన యోగం. మహా మేళనం యోగం. అంతర్జాతీయ యోగ దినోత్సవం ఈ సహజ సమన్వయ తత్వానికి చిహ్నం..
యోగవిద్య, యోగాభ్యాసం, యోగాచరణ, యోగ ప్రబోధం అందువల్ల అనాదిగా ఉన్న సహజ జీవన విన్యాసాలు, సహజత్వానికి తప్పిపోకపోవడం, కృత్రిమత్వానికి గురికాకపోవడం యోగం. అనాది యోగశాస్త్రాన్ని దాదాపు మూడువేల మూడువందల ఏళ్ల క్రితం పతంజలి మహర్షి మరోసారి వివరించాడు. యోగశాస్త్రం ఆరు వేద దర్శన శాస్త్రాలలో ఒకటి. మానవాళికి మార్గదర్శనం చేసేది దర్శనాలు. పతంజలి హఠయోగం అని రాజయోగం అని యోగాభ్యాస పద్ధతులను వర్గీకరించాడు. హఠయోగం ప్రధానంగా శరీరానికి పుష్టిని కలిగించే వ్యాయామం. రాజయోగం శరీరానికి మనస్సునకు బుద్ధికీ కూడ సౌష్టవం కలిగించే ప్రక్రియ మాత్రమే కాదు. నైతికనిష్ఠను పెంపొందించే జీవనరీతి కూడ. అందువల్లనే యోగం కేవలం ఆసనాలకు, ప్రాణాయామానికి ధ్యానానికి పరిమితమైనది కాదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ యోగంలోని ఎనిమిది విభాగాలు. ఇవన్నీ మానవులు ఇరవైనాలుగు గంటల దినంలో సహజంగా పాటించదగిన జీవన సూత్రాలు. హింస చేయరాదు, దొంగతనం చేయరాదు, అబద్ధాలు చెప్పరాదు, ఉన్నదానిలో సంతృప్తి చెందాలి. అత్యాశతో యాచించరాదు, దోచుకోరాదు, శుభ్రతను పెంపొందించుకోవాలి వంటి నైతిక సూత్రాలు యోగంలో భాగం. ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ్భారత కార్యక్రమం యోగం నిర్దేశించే స్వచ్ఛతలో భాగం. ఈ స్వచ్ఛత మానసిక పరిశుభ్రత, శరీర ఆరోగ్యం మాత్రమే కాదు, పరిసరాల పరిరక్షణ కూడ.
యోగసూత్రాలకు దూరమైన జాతులు ఇతర జాతులను దోపిడీ చేయడం చరిత్ర. శక్తిని గాయాలను మాన్పడానికి-క్షతత్రాణ కార్యక్రమానికి-వినియోగించకుండా గాయాలను కలిగించడాన్ని ‘క్షతికారులు’ ఉపయోగించడం వల్ల ప్రపంచ సమాజం అల్లకల్లోలమైంది. సంతృప్తి చెందని జాతులు ఇతర దేశాలను దురాక్రమించడం ఇతర దేశాల ప్రజలను అణచివేతకు ఆర్థిక శోషణకు గురి చేయడం శతాబ్దుల చరిత్ర. కలసి జీవించడమన్న యోగం నష్టమై కలహించడమే ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజల సమష్టి స్వభావంగా మారింది. ఈ కలహించే ప్రవృత్తి మానసిక వికృతి. ఈ వికృతులు అంతర్గత సమాజంలో, అంతర్జాతీయ సమాజంలోను, వైరుధ్యాలను వ్యవస్థీకరించడం కొనసాగుతున్న వైపరీత్యం. మానసిక సంతులనం, మానసిక ప్రశాంతిని కోల్పోయిన వారు రకరకాల ఒత్తడికి గురి అవుతున్నారన్నది దాదాపు అన్ని దేశాలలోను ప్రచారమవుతున్న మనోవైజ్ఞానిక వాస్తవం. అందువల్లనే ప్రశాంతిని వెతుక్కుంటూ వివిధ దేశాలవారు యోగభూమి అయిన మనదేశానికి తరలిరావడం ఆధునిక పరిణామం. అలాగే ఈ దేశంనుండి తమ దేశానకి వచ్చిన వివేకానందస్వామి వారి నుండి మానసిక ప్రశాంతిని, నైతిక జీవనాన్ని నేర్చుకొనడానికి అనేక దేశాల ప్రజలు తపించడం కూడ ఆధునిక పరిణామం. యోగం, నేర్పడానికి నేర్చుకొనడానకి భారతీయ ధర్మాచార్యుల నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్రాలు, సంస్థలు, మందిరాలు, విశ్వవిద్యాలయాలు నెలకొంటుండడం కూడ ఆధునిక పరిణామం. ఈ ఆధునిక పరిణామం అతి ప్రాచీన పరిణామ క్రమానికి పునరావృత్తి. ఈ దేశానికి వచ్చి, ఈ దేశం నుండి పృథివీ తలంలోని సర్వమానవులూ జీవన సంస్కారాలను నేర్చుకొని వెళ్లడం అతిప్రాచీన చరిత్ర. ఈ జీవన యోగం మధ్యకాలంలో మరుగున పడింది. వివేకానందుని వంటివారి కృషి ఫలించి చరిత్ర మళ్లీ పునరావృత్తవౌతోంది. నైతిక నిష్ఠను జీవన సంస్కారాలను నేర్చుకొనడానికై ప్రపంచ ప్రజలు మళ్లీ భారతదేశం వైపు చూస్తున్నారు. భారత్ విశ్వ విజేత కావాలని ఆహంకరించడం లేదు. ఇదీ వౌలికమైన యోగం…ఈ యోగం వల్లనే భారతదేశం విశ్వగురువైంది.
యోగం పెరగడం వల్ల రోగం నశిస్తుంది. సృష్టి, ప్రకృతి, సమాజం, మానవుడు, పరస్పరం విభేదించే విరుద్ధ అంశాలు కాదు. పరస్పరం పరిపోషకమైన సహజ స్వభావ రూపాలు. ప్రకృతి తానేనని మానవుడు భావించినప్పుడు యోగం వికసిస్తుంది. ప్రకృతి తనకంటె భిన్నమని భావించిన మానవుడు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. భౌతికమైన, మానసికమైన రోగాలకు ఇదీ కారణం. సమాజం తనకంటె భిన్నమని భావించడం వల్లనే మానవుడు ఆర్థిక రోగాన్ని విస్తరింపచేశాడు. ఈ రోగం దోచుకొనడం. ప్రకృతిని సామాజాన్ని పరిరక్షించడం వల్ల మాత్రమే తనకు సర్వాంగీణ వికాసం కలుగుతుందన్న సృష్టిగత సత్యాన్ని వ్యక్తి వ్యక్తిలో చిగురింపచేసే జీవన మాధ్యమం యోగం… యోగం సృష్టిక్రమం..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -48

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -48

19-     పందొమ్మిది ఇరవై శతాబ్దాల వారధి -థామస్ హార్డీ-2

మరణం దాకా కవే

మళ్ళీ కవిత్వ ప్రవేశం చేసిన హార్డీ కొత్త శక్తీ ఉత్సాహ ప్రోత్సాహాలతో జీవిత చరమకం వరకూ రాస్తూనే ఉన్నాడు .ఎనభై ఏళ్ళు వచ్చాక ఆయన అతి విలువైనకవితా సంపుటులు విడుదలయ్యాయి .కవిత్వ రచన కొనసాగిస్తూనే ఉన్నాడు .చాలా అర్ధవంతమైన వివాద రహితమైన అద్భుతమైన కవితలు రాశాడు దాదాపు తొంభై ఏళ్ళు వచ్చేదాకా .88 వ సంవత్సరం లో గొంతు బాగా బొంగురు పోయింది .శీతలం కమ్మింది .11-1-1928న88 వ ఏట థామస్ హార్డీ చనిపోయాడు .ఆయన చితా భస్మాన్ని వెస్ట్ మినిస్టర్ ఆబే లో భద్ర పరచారు ..కాని ఆయన రాసుకొన్న విల్లు ప్రకారం ఆయన గుండెను మాత్రం స్వగ్రామం డార్ చెస్టర్ లో ఖననం చేశారు .

హార్డీ మనసులోని భావనలు

తను చూస్తున్న సత్యాన్ని ,తన చుట్టూ ఉన్న హీన పరిస్తితులను అర్ధం చేసుకొన్నాడు హార్డీ .విక్టోరియన్ కాలానికి చెందిన విలువలు ,మాధుర్య ప్రకాశ వంతమైన జీవితం ఉన్నది అన్నదాని ఒప్పుకోలేదు .ఆ కాలపు కవిత్వాన్నీ పెద్దగా మెచ్చ లేదు. మరణ శయ్య పై ఉండి కూడా భార్యను తనకు అత్యంత ఇష్టమైన రుబాయత్ ను చదవమని కోరాడు .డార్విన్ సిద్ధాంతాన్ని అంగీకరించిన హార్డీ మానవుడు ఈ విశ్వానికి ఆధారం అన్నమాటను తిరస్కరించి సైన్స్ ను కవిత్వం లో పోదిగాడు .పంచభూతాలు మనిషికి శత్రువులూ కారు ,మిత్రులూ కారు అన్నాడు .వ్యత్యాసం అనేది సృష్టిలో ఉన్న లక్షణం అన్నాడు .వర్డ్స్ వర్త్ మహా కవి చెప్పిన ప్రక్రుతి ప్రేమకు బ్రౌనింగ్ ఆశావాదానికి ,స్విన్ బరన్ విశ్వం దైవం తో ముడిపడిలేదు అన్నదానికి  జవాబుగా ఫాటలిజం ను చెప్పాడు హార్డీ . కర్షకుని కష్టాలకు మనిషిని జంతువుగా చూసే విధానాన్ని తప్పు పట్టాడు . విశ్వాన్ని ఎవరో పాలిస్తున్నారు అన్నదానికి బదులు దాన్ని అనుకోని సంఘటనలే పాలిస్తున్నాయన్నాడు .దేవుడికి మానవుల మీద ఉన్న మమకారాన్ని మర్చి పోయాడన్నాడు .దైవం యొక్క అపజయాలలో ఇదొకటి అంటాడు .క్రూరత్వామో కారుణ్యమో ప్రపంచాన్ని పాలించటం లేదు .చాన్స్ అంటే అవకాశాలే పాలిస్తున్నాయి .’’grass casualty obstructs the sun and rain ‘’ అని భావించాడు హార్డీ .’’Hardy accepted the stern realities without joy .’’

కుంచించుకు పోతున్న ప్రపంచాన్ని గురించే హార్డీ రాశాడు .మానవ నాటకం మీద పెద్దగా ఆసక్తి చూపలేదు .సాను భూతిలేని ప్రపంచాన్ని అసహ్యించాడు .గౌరవం గా జీవించాల్సిన మానవుడు బతుకు పోరాటం లో ఒక నేరస్తుడి విషాదం పాలౌతున్నాడని అంటాడు . Hardy realized that the true satisfaction of life lies in imaginative conflict .What ever their ultimate purpose ,men are alive only while they struggle .. When they grow aware of the futility of their effort ,and yet strive to fashion some thing from it ,they become noble ‘’అని సీగ్ ఫ్రీడ్ ససూన్ అన్నాడు .డబ్ల్యు ఆడెన్ ‘’his hawk’s vision ,his way of looking at life from a great height ‘’అని విశ్లేషించాడు

హార్డీ రాసిన ‘’ the dark eyed gentleman ‘’  కవిత జానపద సాహిత్యాన్ని పోలి ధారా పాతంగా ఉంటుంది .కవిత్వం లో వాడి వేడి సంభాషణాత్మక జాతీయాలు వాడి ఆధునిక కవిత్వానికి దారి చూపాడు హార్డీ .కవిత్వాన్ని కొత్త రక్త మాంసాలు ఇచ్చాడు .జార్జి ఇలియట్ కు చెందిన విక్టోరియన్ రియలిస్ట్ హార్డీ .నవలలో  కవిత్వం లోవర్డ్స్ వర్త్   రోమాంటిజం ప్రభావం ఉంది .హార్డీ పై చార్లెస్ డికెన్స్ ప్రభావమూ ఎక్కువే .డికెన్స్ లాగే విక్టోరియ సమాజపు  అవశేషాలను ఏవ గించాడు .

డి.హెచ్ లారెన్స్ ను  అత్యంత ప్రభావితం చేసిన వాడు హార్డీ .హార్డీ భావనలనే పెంచి లారెన్స్ తన పాత్రలను సృష్టించాడు .అమెరికా నాటక కర్త క్రిస్టఫర్ దురాంగ్ నాటక పాత్రలపై హార్డీ ప్రభావం అధికం .సుమారు 18 నవలలు ,రాశాడు .14 కవితా సంపుటులు తెచ్చాడు .మూడుభాగాల ది డైనాస్టి అనే బృహన్నాటకం రాశాడు .30 కి పైగా కధలూ రాశాడు .

 

The irony and struggles of life and a curious mind led him to question the traditional Christian view of God:

The Christian god – the external personality – has been replaced by the intelligence of the First Cause…the replacement of the old concept of God as all-powerful by a new concept of universal consciousness. The ‘tribal god, man-shaped, fiery-faced and tyrannous’ is replaced by the ‘unconscious will of the Universe’ which progressively grows aware of itself and ‘ultimately, it is to be hoped, sympathetic’.[41]

Signature

 ture

సశేషం

మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-15

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -47

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -47

19-     పందొమ్మిది ఇరవై శతాబ్దాల వారధి -థామస్ హార్డీ

నెల తక్కువ పిల్లాడు

19 20 శతాబ్దాలకు వారధి వంటి కవి థామస్ హార్డీ –అతనికవిత్వం లో సగం రొమాంటిక్ గా మిగిలిన సగం రియలిస్టిక్ గా ఉండటానికి ఇదే కారణం .ఇదే విక్టోరియా యుగపు  ఆఖరి  లక్షణం.  హార్డీ రాసిన చురుకైన ,చిక్కని కవిత్వమే ఆధునిక కవిత్వానికి మార్గ దర్శనం చేసింది .2-6-1840లో ఇంగ్లాండ్ లోని   డార్ చెస్టర్ లో పుట్టిన హార్డీ గ్రామం గొప్ప లాండ్ స్కేప్ లకు నిలయం .దీనికే తర్వాత వేస్సేక్స్ అనే పేరొచ్చింది .అతని కవిత్వానికి నేపధ్యం ఈ ప్రదేశమే .అతని కుటుంబ వృక్షపు వ్రేళ్ళు ఇక్కడే బలం గా పాతుకు పోయి ఉన్నాయి .తల్లి తరఫు వారిది వ్యవసాయ వ్రుత్తి .తండ్రిది రాతి పని చేసే తాపీ వ్రుత్తి .హార్డీకి తలి దండ్రుల నుండి మొరటు తనం అబ్బలేదు . నెలలల కంటే ముందే పుట్టటం తో  ఒక నర్సు అతడిని బతికించింది. రోగిష్టి అవటం తో స్కూల్ కు పంపలేదు .ఇంటిదగ్గరే తల్లి రక్షణలో ఉండి ఆమె చెప్పిందే నేర్చాడు .ఈ ‘’నెల తక్కువ వాడు ‘’ఆరేళ్ళ కంటే బతకడు అని అందరూ ‘’దీవిస్తే ‘’ సుబ్భరం గా 88 ఏళ్ళు జీవించి అందరినీ ఆశ్చర్య పరచాడు . భూమ్మీద పడిన నాటి  నుండి సంచలనమే సృష్టించాడు హార్డీ .

భవన నిర్మాణం-పెళ్లి

ఎనిమిదో ఏడు రాగానే అయిష్టంగానే బడికి పంపారు .ఏది నేర్చినా తల్లి దగ్గరే ఎక్కువ నేర్చుకొన్నాడు హార్డీ  .16 ఏళ్ళకు మామూలు విద్య పూర్తీ చేశాడు .కొడుకును ఒక ఆర్కిటెక్ట్ దగ్గర తండ్రి పనిలో కుదిర్చాడు . ఆతర్వాత ఆర్కిటెక్చర్ లో నిపుణుడైన మరో వ్యక్తీ వద్ద చేర్చాడు .20 వ ఏట రాయల్ ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కి టెక్ట్స్ నుంచి ఒక అవార్డ్ వచ్చింది .ఇది అతని విద్య ను చూసి ఇచ్చిన్దేకాని ఆర్కిటెక్చర్ పనికి మెచ్చి ఇచ్చి౦ది కాదు . బిల్డింగ్ లు నిర్మించటం కన్నా బుక్స్ మీద ఆసక్తి ఉండేది కాని 27 వ ఏట ఆర్కిటెక్ట్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు .30 వ ఏట కారన్ వాలిస్ వెళ్లి ఒక చర్చి ని పునర్నిర్మించాడు .అక్కడ వికార్ వదిన   ఏమ్మా గిల్ ఫోర్డ్ తో ప్రేమలో పడి పెళ్ళాడాడు .

కవిత్వం నుంచి నవలకు జంప్

అప్పటికే హార్డీ కవిత్వం రాస్తున్నాడు .కాని పత్రికలూ మాత్రం ప్రచురించలేదు .రాళ్ళల్లో సూక్తుల సరస్వతీ కటాక్షం ఉన్నా కడుపుకు తిండి పెట్టె లక్ష్మీ కటాక్షం లేదని గ్రహించి. ఆర్కి టేక్చర్ కు గుడ్ బై చెప్పేశాడు .రచనలతోనే సంపాదన పొందాలని భావించాడు .కవిత్వం డబ్బేమీ చేపటం లేదని గ్రహించి ఫిక్షను కు ఫిక్స్ అయ్యాడు .’’ది పూర్ మాన్ అండ్ ది లేడి ‘’అనే మొదటి నవల రాశాడు .కాని ఇందులో ప్లాట్ ఏమీ లేదని పబ్లిషర్ ప్రచురించ లేదు .కోపం వచ్చి రాసిన దాన్ని తగల బెట్టి మరోనవల ‘’డేస్పెరేట్ రేమిడీస్ ‘’రాశాడు .ఇందులో వస్తువు పాత్రల్ని డామినేట్ చేసింది .స్వంత చిలుం వదిలించుకొని అచ్చేసి వదిలాడు .కాని వ్యతిరేకమైన సమీక్షలు మరీ నీరు గార్చాయి .లెక్కచేయకుండా ‘’అండర్ ది గ్రీన్ వుడ్ ట్రీ ‘’,’’ఏ పైర్ ఆఫ్ బ్లూ ఐస్ ‘’అనే రెండు నవలలలు రాసి వదిలాడు .దీనితో తాను ఒక రచయితను అనే నమ్మకం కలిగింది. ఆ తర్వాత ఒక మేగజైన్ నవల రాయమని హార్దీని కోరింది .ఇప్పటికి తానేమిటో లోకం అర్ధం చేసుకోన్నదనుకొన్నాడు .దీని ఫలితమే ‘’ఫార్ ఫ్రం ది మాడేనింగ్ క్రౌడ్ ‘’నవల .ఈ నవల ఆర్ధికం గా విజయాన్నిచ్చి సాహిత్యం లోనూ పేరును నిల బెట్టింది .జార్జి ఇలియట్ కు ఘోస్ట్ రచయిత హార్డీ అని ఒకడు బాంబు పేల్చాడు .హార్డీ నవలలో వేస్సేక్స్ గ్రామీణ వాతావరణాన్ని మనుష్యుల తీరు తెన్నులను చాలా శక్తి వంతం గా ప్రదర్శించాడు .కాని సబ్జెక్ట్ మీదపూర్తీ  అధారిటీ రాలేదు .

ముప్ఫై ఏళ్ళ వయసులో చూడటానికి పెద్దగా ఆకర్షణీయం గా  ఉండేవాడు కాదు .సాధారణ పొడవుతో ,నీలి కళ్ళతో ,పల్లెటూరి రై(బై )తు లాగా కనిపించేవాడు . భార్య తో కొంతకాలం లండన్ లో కాపురమున్నాడు .నలభై లలో వరుసగా గుండె పోట్లు రావటం ప్రారంభించి బతుకే ప్రమాదం అనే స్థితికి వచ్చింది .అయినా మరో నవల చాలా తీవ్రంగా రాస్తూనే ఉన్నాడు .

బాక్ టు పెవిలియన్

. ఈ నవల తో ఆపేసి తాను మొదటి నుంచి మక్కువ పెంచుకొన్న కవిత్వం తోనే కాలం గడపాలని నిర్ణయానికి వచ్చాడు .రెండేళ్ళ తర్వాత లండన్ వదిలి తన స్వగ్రామం డార్చేస్టర్ చేరి మళ్ళీ ఆర్కిటెక్ట్ అవతారం ఎత్తి స్వంత ఇల్లు’’మాక్స్ గేట్’’ నిర్మించుకొన్నాడు . దీన్ని చూడటానికి ఎందరో సందర్శకులు వస్తూంటారు .కొంచెం సిగ్గూ ,ఒంటరితనం ఇష్టపడే హార్డీ లండన్ లోని  పబ్లిక్  జీవితం కంటే ప్రైవేట్ జీవితం లోనే ఆనందం ఉందని భావించి డార్చేస్టార్ కు వచ్చానని చెప్పుకున్నాడు

బెడిసి కొట్టిన నవలలు  .

1874-1890 మధ్య పదహారేళ్ళకాలం లో ఎనిమిది నవలలు  30 చిన్నకధలు రాశాడు .అన్నీ డబ్బును వర్షించాయి .యాభై వ ఏట ‘’టేస్స్ ఆఫ్ దిడి అర్బేర్ విల్లీస్ ‘’నవల రాసి ప్రచురించాడు .దీనిపై విమర్శకులు విరుచుకు పడ్డారు .మేగజైన్ లో ప్రచురణార్హం కాదన్నారు .దీనికి సమాధానం గా ‘’జూడే ది అబ్ స్క్యూర్ ‘’రాశాడు .ప్రకృతి ధర్మాలకు విరుద్ధం గా రాశాడని  అనైతికతను ప్రోత్సహించాడని ఈస డించారు .మనిషి అంతర్ స౦ఘర్షణకు ,బాహ్య క్రూరత్వానికి బలై  చనిపోవటం ఇందులోకద .దీన్నే  అమెరికాలో’’ జూడే ది అబ్ సీన్ ‘’గా ప్రచురించినా విమర్శల జడివాన తప్పలేదు .దాన్ని నిరసించారు అవహేళన చేశారు .’’ఫిల్ది నావెల్ ‘’అన్నారు  ఒకాయన ఆ నవలను తగల బెట్టి దాని బూడిద పార్సెల్ చేసి హార్డీకి పంపి కోపం తీర్చుకొన్నాడు .దీనితో ఇక నవలల జోలికి వెళ్ళ కూడదనే నిర్ణయానికొచ్చాడు .ఈ విషయాన్నే హార్డీ ‘’I have to give up verse for prose in order to make a living –in later life  referred to my novels as’’ pot boilers ‘’ and ‘’wretched stuff ‘’and I  returned with joy as well as relief to poetry ‘’అని చెప్పుకొన్నాడు .

బాక్ టు పెవిలియన్ –మహత్తర బృహన్నాటకం

సుమారు అరవైవ వసంతం లో హార్డీ మొదటి కవితా సంపుటి ‘’వేస్సేక్స్ పోయెమ్స్ ‘’ప్రచురించాడు .ఇందులో 30 ఏళ్ళుగా రాసిన లిరిక్కులు బాలడ్లూ కలిసి ఉన్నాయి .జనానికెవరికీ పట్టనే లేదు .నాలుగేళ్ల తర్వాత’’పోయెమ్స్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ప్రెసెంట్ ‘’సంపుటి వెలువరిస్తే కొంత మెరుగైన ప్రోత్సాహం లభించింది .ఇక ఈ ముసలాడి పని అయి అయిపొయింది ఇక రాసే దమ్ము లేదు అని అందరూ అను కొంటూ ఉండగా ఆశ్చర్య పరుస్తూ ‘’ది డైనాస్త్స్ ‘’అనే నాటకం మొదటి భాగాన్ని వదిలి , నాలుగేళ్ళ తర్వాతా దాన్నిమూడు భాగాలతో  పూర్తీ చేశాడు .ఇందులో  నెపోలియన్  యుద్ధాలకు సంబంధించిన విష యాలు పరమనాటకీయం గా ఉన్నాయి 19 అ౦కాలతో  ,130 సీన్లతో బృహత్తరంగా ఉన్న నాటకం ఇది ..విమర్శకుల నోళ్ళు మూసుకు పోయాయి .అప్పటిదాకా హార్డీ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొన్నారు .లండన్ టైమ్స్‘’the dynasts combines ,as only a work of genius could combine ,a poetic philosophy with minute historical knowledge and a shrewd eye for the  tragical and comical ways of men and women ‘’అని అభి వర్ణించింది  .లాసేల్లెస్ ఆబెర్ క్రోమ్బీ అనే ప్రముఖ విమర్శకుడు ‘’the biggest and most consistent exhibition of fatalism in literature ‘’అని కీర్తించాడు  ‘’ఫాటలిజం’’  అంటే జీవితం లో జరిగే సంఘటనలు ముందే దైవ  నిర్ణయాలై ఉంటాయి వాటిని మనం మార్చలేము అని అర్ధం .ఫేట్ కు సంబంధించింది ఫాటలిజం  మన భాషలో ‘’విధి లిఖితం ‘’.

దూషణలకు బదులు భూషణలు-పురస్కారాలు

ఇప్పటిదాకా అంటీ ముట్టనట్టు ఉన్న సమాజం ఒక్కసారి హార్డీ ని గుర్తించింది. కేర్తి కిరీటం పెట్టింది .విమర్శల జడివాన పోయి పొగడ్తల పూల వాన కురిపించారు. అభినందనల వెల్లువ సాగింది .సన్మాన పరంపర ,సత్కార హోరూ పెరిగాయి .లండన్ రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ వారి స్వర్ణ తకం ,ఆర్డర్ ఆఫ్ మెరిట్  అందుకొన్నాడు హార్డీ .ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జ్ ,బ్రిస్టల్ యూని వర్సిటీలు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించి సత్కరించాయి .రాయల్ ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కి టెక్ట్స్ వారు హార్డీకి ఫెలో షిప్ అందజేశారు .తన డార్ చెస్టర్ స్వగ్రామం ఇంతటి ఘన విజయాలను సాధించి ఇచ్చింది అనుకొన్నాడు .72 ఏళ్ళ వయసులో భార్య చనిపోయింది .ఎంతోకాలం గా తన దగ్గర సేక్రటరిగా పని చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు హార్డీ .ప్రఖ్యాత రచయిత సోమర్ సెట్  మాం రాసిన ‘’కేక్స్ అండ్ ఏల్ ‘’నవల హార్డీ కుటుంబ జీవితమే అని విశ్లేషకుల భావన .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 149-ప్రాచ్య కళాశాల స్థాపించిన శ్రీ ఎస్ టి జి . వరదాచార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

149-ప్రాచ్య కళాశాల స్థాపించిన శ్రీ ఎస్ టి జి . వరదాచార్యులు

జననం –విద్య

శ్రీ మత్తిరుమల గుదిమెళ్ళవరదాచార్యుల వారు అంటే ఎవరికీ తెలియదుకాని ఎస్. టి .జి .వరదాచార్యులు అంటే యిట్టె అందరికి తెలిసి పోతుంది .ఆ పేరుతో అంత ప్రాచుర్యం పొందారు .కృష్ణా జిల్లా బందరు దగ్గరున్న చిట్టి గూడూరు లో విద్యా వైదుష్యాలకు నెలవైన సంపన్న వైష్ణవ కుటుంబం లో వరదా చార్యుల వారు 4-8-1892జన్మించారు .మచిలీ పట్నం హిందూ హై స్కూల్ లోను ,  అక్కడి నోబుల్ కళాశాలలో  ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజి  లోను  విద్య నభ్యసించి సంస్కృతం లో ఏం. ఏ .ఆనర్స్ డిగ్రీ పొందారు .

గీర్వాణ సేవ

డిగ్రీ పొందిన తర్వాత విజయనగరం మహా రాజా వారి సంస్కృత కళాశాలలో కొంతకాలం ,ప్రదానాధ్యాపకులుగా పని చేశారు .తర్వాత ప్రాచ్య పాఠశాలల (ఓరియెంటల్ స్కూల్స్ )పాలనా వ్యవహారాలను పర్య  పర్య వేక్షించే అధికారిగా వ్యవహరించారు .

స్వంత గ్రామం లో ప్రాచ్య కళాశాల స్థాపన

ఆ తర్వాత స్వగ్రామం చిట్టి గూడూరు చేరి తమ తండ్రి గారి పేరిట ప్రాచ్య కళాశాలను ప్రారంభించారు .నిర్వాహక సమితికి అధ్యక్షులుగా ఉన్నారు .ఉవ్వెత్తున ఎగసిన భారత జాతీయోద్యమ కాలం లో  జాతీయ విద్యను బోధించాలనే సంకల్పం తో జాతీయ విద్యా పరిషత్తును ఏర్పరచి కార్య దర్శిగా ఉండి జాతీయ కళాశాల ను మచిలీ పట్నం లో ఏర్పాటు చేశారు .దీన్ని తీర్చి దిద్దటం లో  ఆచార్యులవారు తీసుకొన్న శ్రద్ధా చొరవ మాటల తో వర్ణించ లేనంత గొప్పది .

భద్రాచల రామాలయ  జీర్ణోద్ధరణ

వరదాచార్యుల వారు ఆగమ శాస్త్రం లోను నిష్ణాతులు .భద్రాచలం లోని శ్రీ సీతా రామ స్వామి ఆలయ జీర్ణోద్ధారణ కమిటీ ఉపాధ్యక్షులై అహరహం శ్రమించి నిర్మించారు .

ఆచార్యుల వారి గీర్వాణ రచన

వరదాచార్యుల వారు తెలుగు శతకాలను ఏడింటిని సంస్కృతం లోకి అనువదించారు .వీటిని ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి ముద్రించిం వెలువరించింది .’’భాషా శాస్త్ర సంగ్రహం ‘’అనే తులనాత్మక భాషా శాస్త్ర గ్రంధాన్ని ఆచార్యుల వారు సంస్కృతం లో రచించి అనన్య కీర్తి సాధించారు .అది పరమ ప్రామాణిక గ్రంధం గా పేరు పొందింది .

గౌరవ పురస్కారాలు

రాష్ట్ర, రాష్ట్రేతర విశ్వ విద్యాలయాలలో ‘’పాఠ్య గ్రంధ నిర్ణయ పరిషత్తు’’ లో సభ్యులుగా అధ్యక్షులుగా వరదాచార్యుల వారు పని చేశారు .వీరి సమర్ధతకు తగిన పదవి .ఇది ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడేమి వరదా చార్యుల వారికి  1969 విశిష్ట సభ్యత్వం అందజేసి గౌరవించింది . ఆంధ్ర విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది 90 ఏళ్ళు సార్ధక జీవనం గడిపిన  విద్యా వరదు లైన శ్రీ వరదాచార్యుల వారు 2-11-1982న శ్రీ వైకుంఠ౦   చేరుకొన్నారు. ..

సశేషం

150- కామ ప్రబంధం రాసిన రాజయోగి –దక్షణా మూర్తి పరమ హంసస్వామి

ఒక అనామక మంగయ్య  పరమ హంసగా మారాడు అంటే ఆశ్చర్యం వేస్తు౦ది కాని ఇది పక్కా నిజం .అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న చరిత్ర .

బాల్యం

విజయనగరం దగ్గర మెట్ట లో న్యాయ వాది సూర్య నారాయణ శాస్త్రి ,రత్నాలమ్మ దంపతులకు 9-10-1872 మంగయ్య గారు జన్మించారు .అయిదవ ఏట ఒక సిద్ధుడు కనిపించి  ఏమికావాలని ఆయన కోరితే దక్షిణా మూర్తి మంత్రం కావాలని మంగయ్య కోరితే బలవంతం గా సిద్ధుడు హయగ్రీవ మంత్రం ఇచ్చి వెళ్లి పోయాడు .దాన్ని అనుస్టించటం వల్ల  మంగయ్యకు వాక్సుద్ధి కలిగింది .ఊరవతల గుట్టలలపై ఏకాంతం గా ఎప్పుడూ కూర్చునే వాడు .ఒక రోజున ఎవరిదో బంగారు నగ పోతే మంగయ్యను అడిగితే నగ ఇక్కడికే వస్తుందని చెప్పాడు .ఇంతలో ఒక కాకి ఆ నగను ముక్కుతో కరచుకొని తీసుకొచ్చి ఆయన ఉన్న చెట్టుపై చేరి కిందికి జార విడిచింది .ఈ విషయం తెలుసుకొన్న ఊరి జనం మంగయ్య కారణ జన్ముడు మహాత్ముడు అని భావించారు .

ఉపనయనం –విద్య

మంగయ్యకు ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు .పిన తండ్రి వెంకన్న పంతులు వద్ద సంస్కృతం ,తెలుగు ,ఆంగ్లం నేర్చుకొన్నాడు .ఒక సారి ఇంటికి వెడితే ఒక గుళిక వచ్చి ఆయన మీద పడింది .అందులో ఉన్న పదార్ధాన్ని ఒళ్లంతా రాసుకొన్నాడు .ఆ కాయను బొడ్డులో దాచుకొన్నాడు .దాన్ని గురించి ఆశువుగా రెండు శ్లోకాలు చెప్పాడు .విజయనగరం వెళ్లి హైస్కూల్ లో చేరి సెకండరీ విద్య పూర్తీ చేసి ,ఇంటికి వచ్చి తండ్రి దగ్గర శైవ మంత్రాలను ఉప దేశం పొందాడు .

పెళ్లి –రాజయోగ ,హఠయోగ విద్య

పదహారవ ఏట మంగయ్యకు పెళ్లి అయింది .రైల్వే లో పని చేసే ఒకాయన రాజ యోగం క్షున్నం గా నేర్పాడు .యోగ ప్రభావాన్ని చూపించమని స్నేహితులు బలవంతం చేశారు ..అదే సమయం లో ఒక బండీవస్తుంటే దమ్ముంటే దాన్ని వెనక్కి మరల్చమని సవాలు చేశారు .మంగయ్య యోగ శక్తితో ఆ బండీని అనేక సార్లు ముందు, వెనకలకు నడిపించి ఆశ్చర్య పరచాడు .కొంతకాలం తర్వాత బాలానంద పరమ హంస అనేసిద్దేశ్వర బ్రహ్మ చారి అనే  ఉత్తర దేశీయుని వద్ద రాజ ,హఠయోగ రహస్యాలు ఆకళింపు చేసుకొన్నాడు .

గణితం నుంచి వేదాంతం లోకి

మద్రాస్ వెళ్లి క్రిస్టియన్ కాలేజి లో చేరి గణితం లో బి .ఏ. చదివాడు .ఒక సారి కాలేజి లో జరిగిన డిబేటింగ్ పోటీలో గణిత ఉపన్యాసకుడు ‘’సైకాలజీ లో  ఆంగ్లేయులే ప్రపంచం లో నంబర్ వన్ ‘’ అని వాదిస్తే  ,కోపం తో లెక్కల సబ్జెక్ట్ ను వదిలేసి వేదాంత శాస్త్రాన్ని ఎంచుకొని చదివాడు .బాబాయి వెంకు పంతులు రాసిన సంస్కృత కావ్యం లోని ‘’ఇరావతీ ‘’ఘట్టాన్ని పేరులో  ఉన్న పరమార్ధాన్ని సమర్ధించి సంస్కృత అధ్యాపకులైన వేదం వెంకట రాయ శాస్త్రి గారి అభిమానం పొందాడు .ముఖ్య శిష్యుడయ్యాడు .గురు శిష్యులిద్దరూ తరచుగా కావ్య గోష్టితో కాల క్షేపం చేసేవారు .ఒకసారి ప్రయోగం కోసం ఈ గురు శిష్యులు గంజాయి దమ్ము కొట్టారు .గురువు శాస్త్రి గారు దిమ్మ తిరిగి పడిపోయారు .శిష్యుడు  నిమ్మకాయ నీళ్ళు తాగించి పైత్యం వదిలించాడు .ఇద్ద్దరూ ఒక సారి శకుంతల నాటకం చూడ టానికి వెళ్లి అందులో దుష్యంతుడు శకుంతలకు చేసిన అన్యాయాన్ని సహించలేక  పూర్తిగా చూడ కుండా  లేచోచ్చారు .బి ఏ .పూర్తి అయ్యే సరికి మంగయ్య లోని తర్క శక్తి పట్ట పగ్గాలు లేకుండా శిఖరారోహణం చేసింది .

లౌకిక ఉద్యోగాలు –అలౌకిక సాధన

నాడీ శుద్ధి,  కుంభక ప్రాణాయామం సాధిస్తూ మంగయ్య ఒంటి పూట భోజనం మాత్రమె చేస్తుంటే క్షయ రోగం పట్టుకుంది .తండ్రి మహా విద్య దీక్ష పూని కొడుకు రోగం తగ్గించాడు .మంగయ్యకు తండ్రి మేధా దక్షిణా మూర్తి మంత్రోపదేశం చేశాడు .మంగయ్య పర్లాకిమిడిలో పోలీస్ హెడ్ క్లార్క్ గా కొద్దికాలం  పని చేశాడు .ఉద్యోగం వదిలేసి కురుపాం రాజు వీర భద్ర రాజుకు కార్య దర్శిగా పని చేశాడు .ఒక సిద్ధుడు మంగయ్యకు శ్రీ స్వప్నాన్జనేయ ,శ్రీ వీర దక్షిణా మూర్తి మంత్రాలను నేర్పి ,మంగయ్య పూర్వ జన్మ వృత్తాంతాన్ని తెలియ జేశాడు .

స్కూల్ మేష్టారు మంగయ్య

భార్య ,పిల్లల్ని మామ గారింట్లో వదిలేసి మంగయ్య మద్రాస్ వెళ్లి ఎల్. టి . ట్రెయినింగ్ (ఉపాధ్యాయ శిక్షణ ) లో చేరాడు  .మంగయ్య రాసిన ఇంగ్లీష్ రచనలు చూసి అతని ప్రతిభకు సంమోహితుడై ‘’ఈరాక్ ద్రు’’అనే ఆంగ్ల దొర గుండెలు బాదుకొన్నాడు .తర్వాత నిజాం రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా చేరి పని చేశాడు .ప్రభుత్వం మంగయ్య ప్రతిభను గుర్తించి బి .ఎడ్. జిల్లా కేంద్ర ఉన్నత విద్యాలయానికి హెడ్ మాస్టర్ గా నియమించింది .

శ్రీ కృష్ణ సాక్షాత్కారం –మహిమా ప్రదర్శన

మంగయ్య నిజామాబాదు లో ఉన్నప్పుడు గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి గారు వచ్చి ఈయన వద్ద  ‘’సమాధి భేదాలు ‘’నేర్చుకొన్నారు .మంగయ్య ఋగ్వేద ,యజుర్వేదాలను గురుముఖతా అభ్యసించారు .రామస్వామి అయ్యర్ ‘’వాసు దేవ తత్త్వం ‘’ఉపదేశించారు .దీని వలన మంగయ్య గారికి శ్రీ కృష్ణ సాక్షాత్కారం కలిగింది  .హైదరాబాద్ గౌలి గూడా లో కాపురమున్నారు .ఇద్దరు స్నేహితులకు వేర్వేరు చోట్ల ఒకే సారి కనిపించి ఆశ్చర్య పరచారు .హరిహత్  దంపతులు శివ జపం చేస్స్తుంటే అనుకోకుండా ప్రత్యక్షమై మంగయ్యగారు రుద్రాభి షేకం చేసి మై మరపించారు  .శిష్యుడు ఒకడికి మంగయ్య గారు అగ్ని జ్వాలల మధ్య కనిపించారు. భయ పడి వాడు పారి పోతుంటే మళ్ళీ యధాస్థితికి వచ్చారు .పశు సంవర్ధక శాఖ లో పని చేసే హనుమంత రావు కు ఒక శివ లింగం ఇచ్చి ఆ తర్వాత వరుసగా పదకొండు లింగాలు ఇచ్చారు. గృహస్తాశ్రమ జీవనం గడుపుతున్నా మంగయ్యగారు శ్రీ రామ శ్రీ  కృష్ణులు లాగా బ్రహ్మ చారులే. విదేశీ డాక్టర్లు ఈ విషయం పై పరి శోధన చేసి నిర్ధారించారు .

వశ్య వాక్కు మంగయ్య

మంగయ్య గారి పెద్ద కుమారుడి వివాహముహూర్తాన్ని తానె నిర్ణయించి శ్రీ కాకుళం జిల్లా రామ తీర్ధం దేవాలయం లో పెండ్లి చేయాలని నిశ్చయించారు .కాని అక్కడి పంచాంగ కర్తలు ,పండితులు ఈ ముహూర్తానికి కేతు ,కుజ వేధలు ఉన్నాయని  ఆ పెళ్లి జరగదని తేల్చి చెప్పారు ..ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందని మంగయ్య గారు వాదించారు .పెళ్ళికొడుకుని రామాలయానికి తీసుకు వెడుతుంటే పాము అడ్డమొచ్చినది .కదలటానికి వీల్లేదన్నారు స్థానిక పండితులు .’’ఇదే నయ్యా కేతు వేద అంటే ‘’ అని మంగయ్య గారు చెప్పారు .పాము మాయ మై పోయింది  .పెళ్లి కొడుకును కళ్యాణ వేదిక వద్దకు  తీసుకొని వెళ్ళారు . పీటల మీద వధూ వరులను కూర్చో బెట్టారు .ముహూర్తం కోసం పండితులు జుట్టు పీక్కుంటూ గడియారాలను తదేకం గా చూస్తూ ఉండిపోయారు.ఒకళ్ళ టైం నాలుగు ,అని, ఒకళ్ళ గడియారం ఏడు అని ,మరొకరిది ఆగి పోయిందనీ చెప్పారు .మంగయ్య గారు ‘’ఇదేరా బాబూ కుజ వేద అంటే ‘’అని చెప్పి అక్షింతలు తాను  తీసుకొని ,అందరికీ  ఇప్పించి  అందరి చేత అక్షింతలు వేయించి తాను పెట్టిన శుభ లగ్నానికే కుమారుని వివాహం జరిపించారు ‘’ఇప్పుడు మీ గడియారాలు చోసుకోండి ‘’అన్నారు మంగయ్య .అందరి గడియారాలు మంగయ్య గారు పెట్టిన ముహూర్త సమయాన్నే చూపించాయి . అందరూ ముక్కు మీద వేలేసుకొన్నారు దట్ ఈజ్ మంగయ్య .వశ్య వాక్కు  మంగయ్య అయ్యారు .మంగయ్య గారి మహా శక్తికి అఘటన ఘటనా సామర్ధ్యానికి నివ్వెర పోయారందరూ .

మరిన్ని మంగయ్యగారి మహిమలు

దేవీ దాసు అనే వాడికి ఏ .బి. సి. డి. లు కూడా రావు .వాడితో కొన్ని గంటల సేపు ఇంగ్లీష్ లో గంభీర మైన ఉపన్యాసం ఇప్పించారు మంగయ్యగారు .తనకు’’ షోడశీ’’ మంత్రాన్ని ‘’దేవుజీ మహా రాజు ‘’గారే వచ్చి ఇస్తారని మంగయ్య గారు ముందే చెప్పారు .అందరూ  గణం జయ మహారాజు తో ఇప్పించే ఏర్పాట్లు చేశారు .సమయానికి  గణం జయుడు రాలేదు .దేవూజీయే వచ్చి మంత్రం దీక్ష నిచ్చారు .మంగయ్య గారి సంకల్ప బలం అంత అమోఘమైనది .

మంగయ్య గారి విద్యా వైదుష్యం –గీర్వాణ రచన

మంగయ్యగారి విద్యా వైదుష్యం నిరుపమానమైనది .ఆంగ్లం లో అయిదు పద్యకావ్యాలు రాశారు .పదహారు ఆధ్యాత్మిక గ్రంధాలు రచించారు .సంస్కృతం లో ‘’కామ ప్రబంధం ‘’,’’దక్షిణ గీత ‘’’’సౌభాగ్య రత్నాకరం ‘’’’అద్వైత పారిజాతం ‘’,’’వ్యావహారిక దర్పణం ‘’వంటి అలౌకిక గ్రందాలనేన్నిటినో రాశారు .సంస్కృతం లో స్తుతి స్తోత్ర రచనా చేశారు .’’ధర్మాస్టకం ‘’వంటి అస్టకాలూ రాశారు .

కాలచక్ర గమనాన్ని ప్రత్యక్షం గా  దర్శింప జేసిన మహాత్ముడు మంగయ్యగారు

ఒక శిష్యుడు కాల చక్ర గమనాన్ని ప్రత్యక్షం గా చూడాలని ఉందని మంగయ్యగారిని వేడుకొంటే అతనికి కాల చక్ర గమనాన్ని ప్రత్యక్షం గా చూపించారు .గంటకు వెయ్యి సార్లు వైఖరీ వాక్కు తో జపించే మంత్రాన్ని  మంగయ్యగారు పశ్యన్తీ వాక్కు తో  ,మనో వేగం తో ఒకే నిమిషం లో చేసే వారు .ఒక సారి హైదరాబాద్ లో తన మేడ మెట్లు దిగి కిందికి వస్తుంటే ఒక కుక్క వచ్చింది .దానికి ఆసనం వేయించి కూర్చో బెట్టి ,అది తన భాష లో తన జన్మ వృత్తాంతాన్ని చెబుతుంటే వెంకయ్యగారు వైఖరీ వాక్కులో అనువాదం చేసి జగన్నాయకులు అనే ఆయనతో రాయించారు.అంటే మంగయ్య గారికి సమస్త జీవ రాశుల జన్మ వృత్తాంతాలు పూర్తిగా తెలుసు అని అర్ధమౌతుంది మనకు .

మంగయ్య గారి ప్రముఖ శిష్యులు

మంగయ్య గారికి జాతి మత భేదాలు లేకుండా ఎందరో శిష్యులైనారు .అలాంటి వారిలో జర్మన్ విద్వాంసుడు ‘’స్పర్జ్ ‘’, నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ‘’బర్నెట్ ‘’,విద్యా మంత్రి ‘’నవాబ్ ఆజం యార్ జంగ్ ‘’,ఇంజనీరింగ్ మంత్రి ‘’మొహిదీ నవాబ్ జంగ్ ‘’,గణితా చార్యుడు ‘’సయ్యద్ సిరజుల్ హసన్ ‘’మొదలైన ప్రముఖులెందరో ఉన్నారు .

మంగయ్య గారి స్పెషాలిటీ

మంగయ్య గారికి ఒక విచిత్రమైన అలవాటు ఒకటి ఉండేది .ఎప్పుడూ చేతిలో అక్షింతలు ఉంచుకొని ,తన నెత్తిన తానే వేసుకొంటూ ఉండేవారు .నడుస్తున్న ,కూర్చున్నా తమలో తాము మాట్లాడుకొంటూ ఉండేవారు ఇవి పరమహంస లక్షణాలు .మంగయ్యగారురాసిన ఒక ఇంగ్లీష్ పుస్తకానికి పీఠిక రాసిన ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంవారు ‘’ఈ గ్రంధం లోని  అభిప్రాయాలను గ్రహించటానికి ౩౦౦ ఏళ్ళు పడుతుంది ‘’అని రాశారు .అంత క్లిష్టమైన లోతైన రచన అన్నమాట .

మంగయ్యే దక్షిణా మూర్తి పరమ హంస స్వామి

బాల బ్రహ్మ చారి అని పేరు పొందిన ‘’చిన్మయా నంద స్వామి ‘’మంగయ్య గారికి సన్యాస దీక్షనిచ్చి ‘’దక్షిణా మూర్తి పరమ హంస స్వామి ‘’అని ఆశ్రమనామాన్ని ఇచ్చారు .స్వామి ధవళేశ్వరం లో ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నారు .ఎందుకోకాని అక్కడ మంచి ఫలితం రాలేదు .విశాఖ పట్నం వెళ్లి ‘’లలితాశ్రమం ‘’ఏర్పాటు చేసుకొని శ్రీ లలితా దేవి ని ప్రతిష్టించారు .ఆ ప్రాంతం లలితానగర్ గా పేరు పొందింది .

పరమ హంస సిద్ధి

దక్షిణామూర్తి పరమ హంస స్వామి 1954లో 92 వ ఏట సిద్ధిపొందారు .స్వామి ముఖ్య శిష్యులు ‘’వాల్వేకర్ ‘’ఆశ్రమాదికారి అయి అనేక అభి వృద్ధి కార్యక్రమాలు చేసి 1995లో సిద్ధి పొందారు .వీరిని గురువుగారి ప్రక్కనే సమాధి చేశారు .ఇప్పుడు ఈ లలితాశ్రమాన్ని కుర్తాళం పీఠాదిపతి శ్రీ శివ చిదానంద భారతీ స్వామి (ప్రసాద రాయ కులపతి )28-6-1998 లో దత్తత తీసుకొని శ్రీ రామానంద భారతీ స్వామి వారికి ఆశ్రమ బాధ్యతలు అప్ప గించారు .

(ఆధారం –నేను రాసిన ‘’సిద్ధ యోగి పుంగవులు’’పుస్తకం  )

Inline image 1

 

 

మనవి-   ఆధునిక   సంస్కృత రచయితలైన సర్వశ్రీ కోగంటి సీతా రామాచార్యులు ,కొలచల యజ్న నారాయణ దీక్షితులు అనే క్షేమేంద్ర , ,శ్రీ చెరువు సత్య నారాయణ శాస్త్రి , ల గురించి నాకు వివరాలు ఏవీ దొరక లేదు .ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటె ,నాకు తెలియ జేస్తే వారి గురించి కూడా రాస్తాను .నేను మరచి పోయిన ఇంకా ఎవరైనా ఆధునిక సంస్కృత రచయితలు ఉంటె కూడా నాకు తెలియ జేస్తూ వారి వివరాలూ మీకు అందుబాటులోఉంటే నాకు తెలిపి నా గీర్వాణ సేవకు చేయూత నివ్వమని అర్ధిస్తున్నాను .దుర్గాప్రసాద్ -18-6-15-

మరో మనవి – నా గీర్వాణ కవుల కవితా గీర్వాణం గ్రంధం చదివి ఆచార్య శ్రీ ఇప్పగుంట సాయిబాబా గారు (హైదరాబాద్ ) నేను మరింత సమాచారం తెలుసుకోవటానికి వీలుగా శ్రీ ఏం.కృష్ణ మాచారియార్ గారుఆంగ్లం లో  రచించి 1937లో ప్రచురించ బడిన ‘’History of classical Sanskrit Liiterature ‘’ గ్రంధాన్ని చదవమని సలహా ఇచ్చారు .ఈ విషయం తెలుసుకొని వెయ్యి పేజీల  ఈ మహా గ్రంధాన్ని నాకు, సరసభారాతికి అత్యంత ఆప్తులైన శ్రీ మైనేని గోపాల కృష్ణగారు దాన్ని కొని ,దానితోపాటు మరికొన్ని సంస్కృత గ్రంధాలను కూడా నాకు మే నెలలోనే అందేట్లు పంపారు. వారి సుహ్రుదయతకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేను .

పై గ్రంధం ఆధారం గా మిగిలిన  పూర్వ గీర్వాణ కవుల కవితా గీర్వాణ వైభవాన్ని ‘ఈ రెండవ భాగం లో 150 వ కవిగా ‘’వత్స భట్టి ‘’తో  ప్రారంభించి వీలు కుదిరినప్పుడల్లా రాస్తానని   మనవి చేసుకొంటూ ,శ్రీ గోపాల కృష్ణగారికి కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను  .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్  –19-6-15 –ఉయ్యూరు

151—      ‘’ ప్రశస్తి ‘’రచించిన వత్స భట్టి

మందసార్ సూర్య దేవాలయం లో శిలా ఫలకాలపై ఉన్న ‘’ప్రశస్తి ‘’శ్లోకాలను వత్స భట్టికవి  మాళవ సంవత్సరం లో అంటే 529లో రాశాడని భావిస్తున్నారు . బూలర్ లెక్క ప్రకారం ఇది క్రీ .శ.473-74 అవుతుంది .ప్రశస్తి లో 44 పద్యాలున్నాయి .మొదలు చివర మంగళా శాసనంలు వచనం లో  ఉన్నాయి  .చక్ర వర్తి కుమార గుప్తుని గురించి రాజులు విశ్వ వర్మ ,బంధు  వర్మల గురించి  సూర్య దేవాలయ నిర్మాణాన్ని గురించి  శీతాకాల వర్ణన అందులో కవి రాశాడు .అనేక ఛందస్సులను ప్రయోగించాడు .ఈ రకమైన రచనలు తూర్పు దేశ కవులే చేస్తారని దండి వివరించాడు .మొత్తం కవిత్వం చాలా ధారా శుద్ధితో ఉంటుంది .

నాలుగో శతాబ్దం రెండవ భాగం లో దశ పురా –మందసోర్ లోని సూర్య దేవాలయ ప్రశస్తి గౌడీయ విధానం లో ఉన్నట్లు కనిపిస్తుంది .ఈగౌడకవులు తూర్పు భారతానికి చెందిన వారుగా భావిస్తారు .వత్సభట్టి రాసిన ప్రశస్తి లో కవిత్వాన్ని అధ్యయనం చేస్తే కవి మహా కావ్య పరిచయం బాగా ఉన్నవాడని తెలుస్తుంది .ఛందస్సులో గొప్ప పాండిత్యం ఉన్నవాడుగా తోస్తుంది .అతనిలో గొప్ప కవిత్వం ఉందని  మహా కావ్య నిర్మాణం చేసే సమర్ధత ఉందని అనిపిస్తుందని పరిశోధకులు అంటున్నారు .కాని నిరర్ధక పాదపూరక ప్రయోగాలు ,అసందర్భ పదాలు కొన్ని వాడాడు .ఒక్కో చోట వ్యాకరణ మూల విషయాలనే వదిలేశాడు .సంప్రదాయ కవులు పాటించిన నియమాలను కాదని స్వేచ్చ తో కూడా రాశాడు .కొత్త పోలికలనూ చెప్పాడు .మేఘాలకు ఇళ్ళకూ పోలిక చూపాడుకాని అది ఆకర్షించ లేదు .ఇవన్నీ చూస్తె వత్స భట్టి  ,ఆనాటి సమాజం లో ఉన్న యదార్ద స్థితికే అద్దం పట్టాడని పిస్తుంది .

దీన్ని బట్టి చూస్తె 472 నాటికే గొప్ప ప్రశస్తమైన కావ్య సాహిత్యం ఉందని తెలుస్తోంది .ప్రశస్తిలోని పదవ పద్యం పునరావృత్తమైంది .కాళిదాసు మేఘ దూతం లోని 65 వ శ్లోకం ను భట్టి కవి వాడుకున్నాడని ,కాళిదాసులాగానే ఈతనికీ ‘’శుభగ ‘’పదం ఇస్టమని తెలుస్తుంది 11 వ పద్యం కూడా కూడా కాలిదాసుకు కాపీ యేననిపిస్తుంది .కాళిదాసు రఘు మహా రాజును  వర్ణించి నట్లే  వత్స భట్టి  రఘు వర్మను వర్ణించాడు .కనుక వత్సభట్టికి కాళిదాసమహాకవి కావ్య రచనలన్నీ పరిచయమే నని అనిపిస్తుంది .ప్రశస్తిలో కాళిదాస ఋతు సంహారం లోని అయిదవ సర్గ లోని రెండు మూడు శ్లోకాలను శబ్ద ప్రయోగం భావం లలో పూర్తిగా పోలి ఉన్నాయని ప్రొఫెసర్ కీల్హాన్ అన్నాడు కాని అది అసంబద్ధం అని ఈ గ్రంధ రచయిత క్రిష్ణమాచారియార్ అభిప్రాయ పడ్డారు .ఇవన్నీ గమనిస్తే కాళిదాసు క్రీ శ 472కు పూర్వం వాడే అని నిర్ధారణగా చెప్పవచ్చునంటారు ఆచార్య .

వత్స భట్టి రాసిన గ్రంధాలేవీ లభ్యం కాలేదు .మందశౌర  ప్రశస్తి అనేది మాత్రమె శిలాఫలక రూపం లో దొరికింది .ఇందులో అక్కడి సూర్య దేవాలయాన్ని  చేనేత పనివారు క్రీ.శ 437 లో నిర్మించిన వైనాన్ని వర్ణించాడు .మొదట శివుని గూర్చి ప్రార్ధన ఉంటుంది .తర్వాత మంద సౌర ప్రశస్తిని చెప్పాడు .సమకాలీన రాజు అయిదవ శతాబ్దానికి చెందిన  నరపతి వర్మ ను వర్ణించాడు .వత్సభట్టి కవిత్వం పై కాళిదాసమహాకవి ప్రభావం బాగా కనిపిస్తుంది .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-15-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆడవాళ్ళకు మాత్రమె ప్రవేశం ఉన్న దేవాలయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నడవడి యే అసలైన అలంకారం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ గే ట్ ”మరియు చెత్త రాజకీయం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కస్ట జీవులే కలకాలం బతుకుతారు -84 ఏళ్ళ శ్రీమతి మల్లు స్వరాజ్యం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 148- శతాధిక గ్రంధ కర్త, హయగ్రీవోపాసకులు బెల్లం కొండ రామరాయ కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

148- శతాధిక గ్రంధ కర్త, హయగ్రీవోపాసకులు  బెల్లం కొండ రామరాయ కవి

వైష్ణవ సంప్రదాయం లో జన్మించి అద్వైతాన్ని ఆలింగనం చేసుకొని దాని లోతులను తరచిన మహా కవి ,విమర్శకులు శ్రీ బెల్లం కొండ రామ రాయకవి .గుంటూరు జిల్లా నరసరావు పేట దగ్గర పమిడి పాడు లో నియోగికులం లో సంపన్న గృహస్తుఇంట  రామరాయకవి 1876లో జన్మించారు .భారద్వాజ గోత్రీకులు .ఆశ్వలాయ సూత్రులు ,రుక్ శాఖకు చెందిన వారు .చిన్నతనం లో నే పితృ వియోగం కలిగింది .

స్వయం కృషితో విద్య –పిన్న వయసులోనే రచనా వ్యాసంగం

స్కూలు లో చేరి మొదట కొంతకాలం ఇంగ్లీష్ విద్య నేర్చుకొన్నారు .అది మానేసి సంస్కృతం అభ్యసించారు .హయగ్రీవ ఉపాసకులై విశిస్టాద్వైత మతానికి మారారు .చిన్నతనం నుండి సంస్కృతం లో కవిత్వం రాయటం అలవడింది .సంస్కృత పాండిత్యమూ అప్పటికి గోప్పదేమీకాదు .  కాళిదాసు రాసిన రఘువంశం , కుమార సంభవం లలో రెండేసి సర్గలు మాత్రమె నేర్చుకొన్నారు .మేఘ దూతం చదవటం మొదలు పెట్టి పూర్తిగా చదవకుండా అంతా విన్నారు .సంస్కృత జ్ఞానం బాగా ఏర్పడింది .తర్వాత అన్నిటిని స్వయం గా అభ్యసించారు .14 వయేత ‘’రుక్మిణీ పరిణయం ‘’,రమా పరిణయం ‘’ అనే చంపూ కావ్యాలు రాశారు .నెల్లూరుకు చెందిన సింగరాజు వెంకట రమణయ్య ,గారి రెండవ కుమార్తె ఆడి లక్ష్మమ్మ గారిని రామ రాయకవి వివాహం చేసుకొన్నారు .

అంతర్ముఖత్వం –హయగ్రీవ ఉపాసన

కంఠం లోతు నీటిలో నిలబడి హయగ్రీవ మంత్రాన్ని అనుష్టానం చేసేవారు . చింత తోటలోకి చేరి అరుగుమీద కూర్చుని ఉపాసన చేసేవారు .ఇంటి లో హయగ్రీవార్చన నిత్య కృత్యం గా చేసేవారు .చదువుమీద శ్రద్ధ ఉన్న విద్యార్ధులకు తన ఇంట్లోనే ఆహార వసతులను కలిపించి సాహిత్యాలంకార శాస్త్రాలను బోధించేవారు .పురిఘళ్ళ రామ శాస్త్రి  సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరుల వద్ద తర్కాన్ని వ్యాకరణాన్ని నేర్చారు .వ్యాఖ్యా వ్యాకరణాలను స్వయం గా నేర్చారు .

ద్వైతి- శంకరాద్వైతిగా మారటం    రామరాయ కవితా యశోభూషణం

‘సిద్ధాంత కౌముది పై ‘’శరద్రాత్రి ‘’అనే వ్యాఖ్యానం రాశారు .అనునిత్యం వేదాంత గ్రంధ పఠనం చేసి అద్విత వేదాంతాన్ని మొత్తం గా స్వయం గా ఆకళించుకొని నిష్ణాతులయ్యారు .అప్పటిదాకా ఉన్న విశిష్టాద్వైత మతాభిమానం తొలగించుకొని పూర్తిగా  అద్వైతి అయ్యారు రామరాయకవి .వంశ పారంపర్యంగా వచ్చిన ద్వైతాన్ని విసర్జించి ఆ గురువులకు దూరమై పోయి అద్వైతానికి అంకితమయ్యారు .శంకర వేదాంత గ్రంధాలను బోధించారు .జీవితకాలం లో రామ రాయ కవి 143 గ్రంధాలు రచించిన బహు గ్రంధ కర్త .తానె స్వయం గా కొన్ని గ్రంధాలను ముద్రించారు ఇంత చిన్న వయసులో ఇన్నిఉద్గ్రంధాలు   రాసిన వారెవ్వరూ లేరు .వీరికి వీరే సాటి గా నిలిచారు

.                    రామరాయ కవితా యశోభూషణం

రామరాయ కవి రాసిన వాటిలో స్తోత్ర గ్రంధాలు, శతకాలు అనేకం ఉన్నాయి .అందులో  అష్టకాలు ,స్తోత్రాలు కలిసి 68 ఉన్నాయి .వీటన్నిటిలో శాంకరాద్వైతాన్నే ప్రతిపాదించారు కవిగారు ఇందులో ‘’హకారాది హయగ్రీవ సహస్ర నామావళి ‘’చాలా ప్రాచుర్యం పొందింది ..శంకర భగవత్పాదులు రాసిన ‘’గీతా భాష్యం ‘’కు వ్యాఖ్య రాశారు .శంకర భాష్య టీకా గా ‘’గీతా భాష్యార్ధ ప్రకాశిక ‘’,దశోపనిషత్తులకు ‘’వేదాంత ముక్తావళి ‘’,అద్వైతం పై ‘’శంకరా శంకర భాష్య విమర్శ ‘’ స్వామి మధుసూదన సరస్వతి రాసిన గ్రంధానికి ‘’సిద్ధాంత సింధువు ‘’వ్యాఖ్య , అద్వైత తత్వాన్ని ప్రతిపాదిస్తూ ‘’వేదాంత కౌస్తుభము ‘’,రాశారు .’’అద్వైతాన్య మత ఖండనం ,,’’కౌముదికి వ్యాఖ్యగా ‘’శరద్రాత్రి ‘’,చంపూ భాగవత వ్యాఖ్య  మురారి రాసిన అనర్ఘ రాఘవ నాటకానికి వ్యాఖ్య ,సముద్ర మధన చంపూ కావ్యం ,శ్రీ కృష్ణ లీలా తరంగిణి కావ్యం రాశారు .రామరాయ కవి గ్రంధ రచనను ఒక మహా తపస్సుగా చేశారు .అద్భుత ధారా శుద్ధి  శబ్ద శుద్ధి రామరాయ కవి గారి ప్రత్యేకత .

అంతర్ముఖుడైన సమావిస్టూడైన యోగిగా రామ రాయ కవిని లోకం గుర్తించి కీర్తించింది .హయగ్రీవ ఉపాసకులకు అసాధ్యమేదీ లేదని నిరూపించిన సిద్ధ యోగి పుంగవులు శ్రీ బెల్లం కొండ రామ రాయ కవి కేవలం 39 సంవత్సరాలు మాత్రమె జీవించి శతాధిక గ్రంధ రచన చేసి 1914 లో ముక్తిని పొందారు .

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆఫ్గనిస్తాన్ లో బమియాన్ బుద్ధ ధగ దగ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రంజని -నందివాడ కధల పోటీ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్య మర్మమెరిగిన కారా మాస్టారు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రంగాచార్య – కవిత -”కొలిమంటు కొంది ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మిలిటంట్లకు శివంగి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్యం లో సవాల్ అంటే శారీరక బాల ప్రదర్శనమా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశికా పూరి -తెలుగు వారి శివానంద లహరి

kashi 1 001 kashi2 001కాశికా పూరి -తెలుగు వారి శివానంద లహరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విరాట రాజు గద్దె కాదు -బౌద్ధ స్థూపం

viratraj gadde 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమరావతిలో బౌద్ధమత ప్రాభవం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సూర్యుడు బ్రౌన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిదంబర దేవాలయం లో ”సభలు ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతర్జాతీయ స్థాయి బుచ్చిబాబు -దా.వేదగిరి రా0 బాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇందిరా ఎమర్జెన్సీ పెట్టి 40 ఏళ్ళయింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనీ‘షి’ -అడుసుమల్లి మల్లికార్జున-కద

మనీ‘షి’

  • 14/06/2015
  • |

  • -అడుసుమల్లి మల్లికార్జున

కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన రచన
***
ఓం
భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యమ్
భర్గో దేవశ్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్!’
ధ్యానం ముగించుకుని గాయత్రి మంత్రం స్మరిస్తూ – తలుపు తీశాను. ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ రాముడు.
‘ఒరే రాముడూ!’ ఆనందంతో బిగ్గరగా కేక వేశాను.
‘అంత బిగ్గరగా అరవకు. ఎక్కడో సీతమ్మ దగ్గరున్న రాముడు కంగారుపడి పరుగెత్తుకొచ్చేను’ అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు రాముడు అని నేను పిలిచే రామచంద్రయ్య. చిన్ననాటి నుంచి వదలకుండా ఇంకా మిగిలి వున్న ఏకైక నేస్తం.
‘పద్మ ఎప్పుడు వస్తుందిరా?’
‘నిన్ననే కదరా వెళ్లింది. వాళ్ల తమ్ముడు కూతురు సంబంధం విషయమై వెళ్లింది. రెండు మూడు రోజులు పడుతుంది’ అన్నాను.
‘ఈ మూడ్రోజులు బతుకు పో’ అందా?’
‘మరి? ఆడాళ్లు అప్పుడప్పుడు అలా వెళ్లకపోతే మగాళ్లు చచ్చిపోరట్రా’
మా ఆఫీసులో ఈ మధ్య ఓ జోకు –
సుబ్బారావని అటెండరు. ఈ మధ్య ‘హార్ట్ స్ట్రోక్’ వచ్చింది. ఏమయ్యా! నీకు షుగర్ లేదు. బి.పి. లేదు. ఎందుకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందయ్యా అని డాక్టర్ అడిగారట. ‘్భర్య వుందిగా’ అన్నాడట మెత్తగా. డాక్టర్ తేరిపార చూసి ‘నిజమేనయ్యా! ఆ విషయం మర్చిపోయా’ అన్నాడట అంతకంటె మెల్లిగా.
ఇద్దరం భలే నవ్వుకున్నాం. వాడుంటేనే ‘్భలే’ అనే పదానికి అర్థం.
‘నేను స్నానం, ధ్యానం ముగించుకుని వస్తాను. అంతవరకు వీటి జోలికెళ్లకు’ అంటూ నాలుగు పొట్లాలు టేబుల్ మీద పెట్టాడు.
‘ఏమిటివి?’
‘వస్తూ వస్తూ
కనుక్కున్నాను. శీనయ్య హోటల్‌లో ఇడ్లీ, పెసరట్టు ఉప్మా బావుంటాయని తెలిసింది. అవే ఇవి’ అంటూ టవల్ అందుకున్నాడు.
నేను నోరు తెరుచుకుని చూస్తూండిపోయాను.
నేను బాపట్ల వచ్చి నాలుగైదు నెలలు. ఆ శీనయ్య హోటలు సంగతి నాకింతవరకు తెలీదు. వీడు అడుగుపెట్టింది ఈ రోజే. ఇప్పుడే కాదు వాడు ఎప్పుడూ అంతే. ఏదైనా టూర్ వెళ్లినపుడు – మేమంతా పట్టించుకోని విషయాలు, అతి చిన్న విషయాలు వాడికి తెలిసిపోయేవి. ఏదైనా ఊరు వెళ్లి వస్తే ఆ ఊరు ఆహార వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు. ఈనాటికి వాడికి ఆ ‘ఉత్సుకత’ తగ్గలేదు. అడిగితే ఏమనుకుంటారో అనే ‘్భతి’ నాకూ తగ్గలేదు.
రాముడు వాళ్ల నాన్నగారు మిలట్రీ ఆఫీసర్. కాళ్లకు చెప్పుల్లేకుండా మేము హైస్కూలు వెళ్తున్నపుడు – వీడు టై, టక్, బూట్లతో ప్రత్యక్షమయ్యేడు. అందరూ ‘సిటీ బాయ్’ అన్నారు. వాడి చదువు కూడా అట్లాంటి చోటే సాగింది. వాడి దగ్గరకు వెళ్లాలంటే అందరికీ బెరుకు. తను మాత్రం అందరితో ఫ్రీగా వుండేవాడు. నాతో మరింత దగ్గరగా వచ్చేవాడు. అలా ఆనాటి నుంచి మంచి స్నేహం.
చాలా సున్నితమైన విషయాలు కూడా నాకు చెప్పేవాడు.
పైట చూసి ఆమడ దూరం పరుగెత్తే వయసులో తను మాత్రం మగ పిల్లలతో మాట్లాడినంత మామూలుగా వాళ్లతో మాట్లాడేవాడు. వాళ్లూ హాయిగా మాట్లాడేవాళ్లు.
చిత్రం చూడండి.
చూట్టానికి అలా వుంటారుగాని
ఆడాళ్లు – భలే వాళ్లు.
రాముడంటే చాలామంది అమ్మాయిలు ఇష్టపడేవాళ్లు. జీవితమంతా అలాగే ఆడుతూ పాడుతూ గడిపేశాడు. అందుకే నేను ‘ఒరే రాముడు – కాదు కృష్ణుడు’ అనేవాణ్ని.
ఉదయానే్న ధ్యానం చేస్తాడు. గాయత్రి మంత్రం జపిస్తాడు. సాయంకాలం ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు వెళ్తాడు. రాత్రి ‘బోట్స్ క్లబ్’కెళ్లి సరదాగా గడిపేస్తాడు. ‘దేనికదే’ అంటాడు. అందరూ అలా జీవించలేరు. ఏదో బ్రతుకీడుస్తూ ఉంటారు. ఆ ఆనందాన్ని, అదృష్టాన్ని చూసి విధి కుళ్లుకుంది. హాయిగా విశ్రాంతి తీసుకునే వయసులో భార్య చనిపోయింది.
ఒక కొడుకు, కూతురు – ముచ్చటైన సంసారం. కొడుకు ఏరోస్పేస్ ఇంజనీర్‌గా బ్రిస్టల్‌లో వుంటున్నాడు. వాడికి పెళ్లి చేశాడు. కూతురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. చిన్న యాక్సిడెంట్‌లో భార్య చనిపోయింది. నేనూ, పద్మా వెళ్లి వారం రోజులు అక్కడే వుండి వచ్చాం. ఎన్ని వున్నా ఇల్లాలు లేని లోటు ఎవరు తీర్చగలరు.
రాముడు ప్రాక్టికల్ మనిషి. రాత్రులు చందమామను చూసి కలలు కనవచ్చు. పగలు అది తల్చుకుని పని పాడు చేసుకోకూడదు – అనే మనస్తత్వం. త్వరలోనే కోలుకున్నాడు. ఉద్యోగరీత్యా నేను ఎన్ని ఊళ్లు తిరుగుతున్నా ‘కావలి కబుర్లు’ వాడి ద్వారా ఎప్పటికప్పుడు తెలిసేవి. నిజంగా తెలిసీ తెలియని యవ్వనం ఎంత మధురం. ఎప్పుడు తలుచుకున్నా పెదవులు సుతారంగా విచ్చుకుంటాయి.
ఇంతలో రాముడు వచ్చాడు.
‘్ధ్యనం ఎంత మంచి అలవాటు. మనసు ప్రశాంతంగా ఉంటుందిరా’
‘నిజమే రాముడు. దాని ప్రభావం తప్పక కనిపిస్తుంది’
‘నిన్ను చూసేరా.. ఈ ధ్యానం, గాయత్రి మంత్రం అలవాటైతే.. మంచి అలవాటైనా – వదలటం కష్టం’ అంటూ నవ్వాడు.
‘అవున్రా! నాకే తెలీదు. ఈ ఉప్మా పెసరట్టు సంగతి’
‘నీ తలకాయ్.. నువ్వు బైట తింటే కదా తెలిసేది. బాపట్ల ఎట్లా ఉంది? ఈ ఊరు స్పెషల్ ఏమిటి?’
టిఫిన్ తింటూ కబుర్లలో పడ్డాం.
‘మన కావలి, బాపట్ల ఒకలా ఉంటాయిరా. సముద్ర తీరానికి పది కిలోమీటర్లలోపు. మనకు రాతి నేల. ఇక్కడ ఇసుక నేల. మల్లెపువ్వులు, ఆకు కూరలు కావాలంటే మాత్రం బాపట్లేరా’
‘ఆహా! మల్లెపూలు ఉంటే ఆడాళ్లెందుకురా!’ అన్నాడు కొంటెగా నవ్వుతూ.
‘పువ్వులు పెట్టుకోటానికి’ అన్నాను నవ్వుతూ.
‘ఓహో! మర్చిపోయాను’
* * *
రాముడు తీరిగ్గా అసలు విషయం బైటపెట్టేడు.
‘చందన సంబంధం విషయం వచ్చాన్రా. బాపట్లలో ప్రసాదరావుగారని. వాళ్లబ్బాయి ఐ.బి.ఎం.లో వున్నాడట. పాప కూడా హైదరాబాదే కాబట్టి – ఒకే ప్రొఫెషన్. అంతా అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అన్ని వివరాలు తెలుసుకుంటే బావుందనిపించింది. నువ్వూ ఇక్కడకే చేరావు. అదీ సంగతి’
‘చాలా ఆనందంగా ఉందిరా’
‘వచ్చిన పని పూర్తయితే కదా’
‘దానికేంరా. కుందనపు బొమ్మ. తప్పకుండా ఈ సంబంధం కుదురుతుంది. పద్మ వుంటే సంబరపడిపోయేది తెలుసా. చందన పెళ్లి తర్వాత నువ్వూ ఇక్కడకు వచ్చేయ్‌రా. ఒక్కడివి ఏం చేస్తావ్? అందరం కలిసే ఉందాం’
ఆ మాటతో రాముడి కళ్లు చెమ్మగిల్లాయి.
కాసేపు మాట్లాడలేదు.
‘నేను మనస్ఫూర్తిగా చెప్తున్నారా. మాకు ఎవరున్నారు? ఎవరి దారి వారిది. నేను పద్మ. మేము నీ గురించి అదే అనుకుంటూ ఉంటాం’
‘ఎప్పుడైనా పొరపాటున రాత్రి తొలి గంటలో మన ‘సెషన్’ చూసిందంటే – తర్వాత మంచి నీళ్లు కూడా పుట్టవు తెలుసా’ అంటూ నవ్వేశాడు.
‘సరే. ఎప్పుడు వెళ్దాం ప్రసాదరావుగారింటికి’ అడిగాను.
‘సాయంత్రం వెళ్దాం’
* * *
చల్లని సాయంకాలం
ఇద్దరం పటేల్‌నగర్‌లోని ప్రసాదరావు ఇంటికి వెళ్లాం. ఇంటి వాతావరణం చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. ముందు వైపు పూల మొక్కలు, జామ, ఉసిరి చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
మేము వెళ్లేసరికి ప్రసాదరావు గారు బైట మొక్కల మధ్య పడక కుర్చీలో కూచొని సంజీవదేవ్ ‘తెగని జ్ఞాపకాలు’ చదువుతున్నారు.
నన్ను పరిచయం చేసుకుని, రాముణ్ని పరిచయం చేశాను. కావలి నుంచి వచ్చాడని చెప్పగానే – ఆయనకు అర్థమైంది.
‘రండి రండి… చాలా సంతోషం. కృష్ణమూర్తిగారు చెప్పారు’ అని ఆప్యాయంగా పలకరించారు.
ఈ అపార్ట్‌మెంటు బతుకుల్లో ఏం కోల్పోతున్నామో, ప్రసాదరావు గారిల్లు చూస్తే తెలిసిపోతుంది.
ఆ మాటే అన్నాను.
‘ఈ క్రెడిట్ అంతా మా ఆవిడదే. పని చేసేది ఆవిడ. ఆస్వాదించేది నేను’ అన్నారు.
ఆయన కూడా సరదా మనిషే.
కుర్చీలు తెప్పించి ఆ మొక్కల మధ్య, చెట్ల నీడలో వేయించారు. తను లోనికెళ్లి వాళ్ల బాబు ఫొటోలు తెచ్చారు. చాలా బావున్నాడు. రాముడు కూడా వాళ్ల పాప ఫొటోలు చూపించాడు.
ఈడూ జోడూ ముచ్చటగా ఉంటుంది.
రాముడు అక్కడి వాతావరణం, ఆ ఇల్లు చూశాక కాస్త ఆలోచనలో పడ్డాడు. కొడుకు ‘బ్రిస్టల్’లో వున్నా, కూతురు ఉద్యోగం చేస్తున్నా ఆర్థికంగా పెద్ద పొజిషన్ కాదు. ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందాన ఉంది. వాళ్లు కాస్త ఎక్కువలోనే ఉంటారు. అయినా వెళ్లిరా. దేవుడి దయ ఉంటే, రాసి పెట్టి ఉంటే అంతా సవ్యంగా జరుగుతుందని కృష్ణమూర్తిగారు చెప్పబట్టి వచ్చాడట.
నిజం చెప్పాలంటే అబ్బాయే అందంగా ఉన్నాడు. కుటుంబ పరంగా, ఆర్థికపరంగా చూసినా అన్ని విధాలా కాస్త ఎత్తులోనే ఉన్నారు ప్రసాదరావుగారు. ఇలాంటి విషయాలు వాళ్లు మాట్లాడుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. నేనే మొదలుపెట్టాను.
కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు – అన్నీ విడమరిచి చెప్పాను. నేను మాట్లాడినంతసేపు ప్రసాదరావు గారు చిరునవ్వుతో విన్నారు. చివరగా ఆయన అన్నారు.
‘కృష్ణమూర్తిగారు మాకు ఫ్యామిలీ ఫ్రెండు. రామచంద్రయ్య గారి గురించి పూర్తిగా చెప్పారు. నాకు చాలా సంతోషం కలిగింది. మా బాబు పెళ్లి విషయంలో వాళ్లమ్మ ఇష్టమే వాడిష్టం. నా మీద అంత నమ్మకం మరి’
మేము నవ్వాం.
తనూ నవ్వి-
‘నిజమండీ. నాకు మాత్రం అన్ని విధాలా నచ్చింది. ముఖ్యంగా రామచంద్రయ్యగారు, మీరు. మీ మాటలు, పాప, కుటుంబం – రాసిపెట్టి ఉంటే అంతే మరి’ అన్నారు.
నాకు తృప్తి కలిగింది.
రాముడి ముఖంలో కూడా కాంతి.
ఆడపిల్లకు పుట్టిల్లు కంటె అత్తారిల్లు ప్రాముఖ్యత ఎంతో ఉంది. జీవితాంతం వీడని అనుబంధం కదా.
ప్రసాదరావుగారిని చూసినా, వారి మాటలు విన్నా ఆడపిల్లల తండ్రులకు భయం తీరిపోతుంది.
మమ్మల్ని తీసుకెళ్లి తన మినీ లైబ్రరీ చూపించారు.

కృష్ణశాస్ర్తీ, చలం, బుచ్చిబాబులతోపాటు ఆధునిక రచయితల పుస్తకాలు కూడా ఉన్నాయి. పోతన భాగవత మాధుర్యం గురించి ముచ్చటించారు. సాహిత్యంలో పడి కాలం ఇట్టే గడిచిపోయింది.
‘మరి మేము సెలవు తీసుకుంటాం’ అన్నాం.
‘వుండండి. మా ఆవిడ వస్తుంది. శ్రావణమాసం కదండీ. పూజలూ అవీ ఉంటాయి’ అంటూ ‘శారదా’ అని పిలిచారు.
కాఫీ తీసుకుని వచ్చిందావిడ.
‘నమస్కారమండి’ అంది.
మేము ప్రతి నమస్కారం చేశాం.
ఆవిడను చూసి రాముడు మ్రాన్పడిపోయాడు. ఆవిడ స్థితి కూడా అలాగే ఉంది.
కలా! నిజమా! అన్నట్లు చూస్తూండిపోయారు.
నేను రాముణ్ని పరిచయం చేశాను. ఈలోపు ప్రసాదరావుగారు విషయం పూర్తిగా చెప్పారు.
ఆవిడ శాంతంగా విన్నారు.
పాప ఫొటో తీసుకున్నారు.
ఆదరంగా, ఆప్యాయంగా మాట్లాడారు.
బాబుతో మాట్లాడి తప్పకుండా త్వరలో అభిప్రాయం చెప్తామన్నారు.
నోట మాట రాకుండా గుడ్లప్పగించి అట్లాగే ఉండిపోయాడు రాముడు.
నమస్కారం చేసి బైటకొచ్చాం.
ఇంటికి వచ్చేవరకు రాముడు మాట్లాడలేదు.
మనిషి కలత చెందినట్లు కనిపించాడు. దిగులుగా వున్నాడు.
‘ఆలోచించకు. నేను మాట్లాడతాను. ఈ సంబంధం కుదురుతుంది’ అన్నాను.
‘నాకు ఆశ లేదు. ఈ సంబంధం కుదరదు’ దృఢంగా అన్నాడు రాముడు.
నాకు అర్థం కాలేదు.
నిదానంగా అన్నాడు.
‘ఆ రోజుల్లో కట్నం నచ్చక ఒక మంచి అమ్మాయిని చేసుకోలేక పోయానని నీకు చెప్పాను గుర్తుందా? ఆ అమ్మాయే ఇప్పుడు మనం చూసిన ఆవిడ’
విషయం చిన్నగా అర్థమైంది.
కారణం ఎవరైనా కానీ ఆ రోజుల్లో వాళ్లు చాలా ప్రాధేయపడ్డారు. డబ్బులు పెద్దగా ఇవ్వలేమని తర్వాత వీలైతే అడిగినంత ఇవ్వగలమని రాముడు వాళ్లను బ్రతిమాలారు. అందరూ మంచివాళ్లే. కాని పెళ్లి జరగలేదు. ఆడపిల్ల గలవాళ్లు చాలా బాధ పడ్డారు. రాముడు కూడా ఆటలో బొమ్మలా అలా ఉండిపోయాడు.
విధి విచిత్రమంటే అదే కాబోలు.
ఈ రోజు తన కూతురు భవిష్యత్తును నిర్ణయించే అధికారం, అవకాశం ఆవిడకే వచ్చింది.
రాముడు చెప్పాక – విషయం పూర్తిగా అర్థమైన తర్వాత, నాకు కూడా సంశయం కలిగింది.
‘చూద్దాంరా. ఇంతకంటే మంచి సంబంధం వస్తుందిలే’ ధైర్యం చెప్పాను.
వౌనంగా ఉండిపోయాడు రాముడు.
జీవితాన్ని ఆడుతూ పాడుతూ ‘సిటీ బాయ్’గా – రాముడు కాదు కృష్ణుడుగా, గడిపిన రాముడు ఒక్కసారిగా డీలా పడిపోయాడు. కూతురు విషయమై ఏ తండ్రి అయినా ఆలోచన చేయటం సహజం. కానీ చేతిదాకా వచ్చింది, నోటిదాకా రాకపోయేసరికి – నిజంగా ఆడపిల్ల తండ్రి అయిపోయాడు.
మరుసటి రోజు వాణ్ని ట్రైన్ ఎక్కించి-
‘నువ్వేమీ ఆలోచన పెట్టుకోకు. చందనకు మంచి సంబంధం నేను చూస్తాను’ అని ధైర్యం చెప్పాను.
సరిగ్గా వారం రోజుల తర్వాత-
ప్రసాదరావుగారు మా బ్యాంక్‌కి వచ్చారు. నన్ను చూసి చిరునవ్వుతో నా దగ్గరకు వచ్చి-
‘నమస్కారం’ అన్నారు.
నేను నమస్కారం పెట్టి-
బాయ్ చేత ‘కాఫీ’ తెప్పించాను.
‘బ్యాంకులో పని ఉందా?’ అని అడిగాను.
‘లేదండి. మీ దగ్గరకే వచ్చాను. మీ రామచంద్రయ్యగారి సంబంధం మాకు బాగా నచ్చింది. కట్నం విషయం ఆలోచన వద్దు. మీ ఫ్రెండ్‌కు చెప్పండి. ముందుగా మీకు చెప్పాలని వచ్చాను’ అని చెప్పారు.
సంతోషానికి అర్థమేమిటో తెలిసింది.
ఆ సాయంత్రం-
పళ్లు, స్వీటు తీసుకుని ప్రసాదరావు గారింటికి వెళ్లాను.
ఎదురుగా ఆవిడ.
ఆవిడకు ఇచ్చి, రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాను.
మానవత్వానికి, మంచితనానికి ప్రతీకగా ఆమె అలాగే నిలబడి ఉంది.
నేను వడివడిగా బైటకొచ్చాను – ఈ విషయం రాముడికి చెప్పాలి కదా! ఈలోపు మీకు కనిపించినా వాడి చెవిలో ఈ శుభవార్త వేయండి.

అడుసుమల్లి మల్లికార్జున
15-5-56, వేదాంతంవారి వీధి, బాపట్ల – 522 101
గుంటూరు జిల్లా.. 99895 99175
*

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇన్‌స్టెంట్’ కిల్లర్స్!

ఇన్‌స్టెంట్’ కిల్లర్స్!

రెండు నిమిషాల్లో వేడివేడిగా, ఘుమఘుమలాడుతూ నోరూరించే ఆ నూడిల్స్.. నెమ్మదిగా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఎందరికి తెలుసు? తెలిసినా పట్టించుకునేవాడేడి? ప్రపంచవ్యాప్తంగా ఇంటిల్లిపాదికీ అప్పటికప్పుడు, చిటికెలో తయారయ్యే రుచికరమైన ‘ఇన్‌స్టెంట్ నూడిల్స్’ అంటే చచ్చేంత ఇష్టం. అయతే ప్రమాదకరమైనవని ఇప్పుడు తేటతెల్లమవుతోంది. నిజానికి నూడిల్స్ మంచి ఆహారమే. కానీ, రుచిని పెంచడానికి వాటి తయారీలో వాడే రసాయనాల పరిమాణం పెరిగితే అది మనిషి ఆరోగ్యానికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలా ప్రమాదకర రసాయనాలతో తయారైన మ్యాగీ నూడిల్స్‌పై ఇపుడు దేశవ్యాప్తంగా వివాదం రేగింది. ‘ఆకలి రుచి ఎరుగదు…నిద్ర సుఖమెరుగదు’ అన్నది అలనాటి సామెత. కానీ, ‘ఆకలి రుచిని కోరుతోంది.. ప్రాణాలతో చెలగాటమాడుతోందన్న’ది నేటి సామెత. ఇపుడు సర్వత్రా చెలరేగిన మ్యాగీ నూడిల్స్ వివాదం ఇదే చెబుతోంది. ఒక్క నూడిల్స్ గురించే ఎందుకు చెప్పుకోవాలి. ‘జంక్ ఫుడ్’గా భావించే ఆహార పదార్థాలన్నీ ఆ కోవలోకే వస్తాయి. కూల్‌డ్రింక్స్, మినరల్ వాటర్ బాటిల్స్‌లో పురుగుమందులు, ఐస్‌క్రీములు, చాక్లెట్లు, పాలపొడి ఒకటేమిటి? నాగరికపు ఆహార పదార్థాలైన బర్గర్లు, పిజ్జాలలో రుచి పెరిగేందుకు వాడే ఎంఎస్‌జి (మోనో సోడియం గ్లుటామేట్) వంటివి దర్శనమిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ‘ప్రాసెస్‌డ్ ఫుడ్’లో పరిమితికి మించి వాటిని వాడుతూనే ఉన్నారు. *** నూడిల్స్…ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినోటా విన్పిస్తున్నమాట. నిన్నమొన్నటివరకు దేశంలో దాదాపు ప్రతి వంటింట్లో ఘుమఘుమలాడిన ఈ నూడిల్స్‌పై ఇప్పుడు ధుమధుమలాడేవారు ఎక్కువయ్యారు. మానవుడి ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాల పరిమాణం ఎక్కువగా ఉన్నాయంటూ అత్యంత జనాదరణ పొందిన మ్యాగీ నూడిల్స్ దేశంలో సంచలన వార్తాకథనాలు వెల్లువెత్తాయి. చాలా ప్రాంతాల్లో వీటిపై నిషేధం విధించారు. వేల ఏళ్ల క్రితమే నూడిల్స్ తయారీ ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఇన్‌స్టెంట్ ఫుడ్‌లో నూడిల్స్‌దే సింహభాగం. వీటిని కనిపెట్టింది చైనా. ఇప్పటికీ వాటి తయారీలోను, వాడకంలోనూ ఆ దేశానిదే అగ్రస్థానం. చైనాలోని ఎల్లో రివర్ ప్రాంతంలో పురాతత్వ శాస్తవ్రేత్తలు 2002లో జరిపిన తవ్వకాల్లో నూడిల్స్‌తో ఉన్న ఓ బౌల్ దొరికింది. అందులో నిండుగా నూడిల్స్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత పురాతన నూడిల్స్‌గా రికార్డు సాధించాయి. శాస్తవ్రేత్తల అంచనా ప్రకారం 206 బిసిఇ- 220 సిఇలో నూడిల్స్ వాడుకలోకి వచ్చాయి. టాంగ్ రాజవంశం పరిపాలించినప్పుడు ఇవి బహుళ వ్యాప్తిలోకి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతారు. నూడిల్స్‌లో ఏముంటుంది? నిజానికి పురాతన పద్ధతి ప్రకారం తయారు చేసిన నూడిల్స్‌లో అన్నీ పోషక పదార్థాలే వాడేవారు. ముఖ్యంగా మొక్కజొన్న పిండి లేదా వరి, గోధుమ పిండి, పామ్ ఆయిల్, కాస్తంత ఉప్పు కలిపి వీటిని తయారు చేసేవారు. వందలాది సంవత్సరాల పాటు ఇవే పదార్థాలు వాడేవారు. తీగలుతీగలుగా వీటిని పేని, ముక్కలుగా, రకరకాల ఆకారాల్లో విరిచి వండేవారు. రెండో ప్రపంచయుద్ధం ముగిసేవరకు అదే పరిస్థితి. సేమియా, పాస్తావంటివి ఆ తరువాత నూడిల్స్‌కు మరోరూపంగా తయారయ్యాయి. ఇక నూడిల్స్‌లో సన్నగా తరిగిన కాయగూరలు, ఇతర ఆహార పదార్థాలను కలిపి వండుకోవడం ఆ తరువాత మొదలైంది. ‘ఇన్‌స్టంట్’ ప్రభంజనం రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఓటమిపాలైన తరువాత సైనికులు, సాధారణ పౌరులు ఆకలితో అలమటించిపోయారు. ధరల పెరుగుదల, క్షామం, ఉపాధి లేమి వంటి పరిస్థితుల్లో వారు ఆహార పదార్థాలను కొనుగోలు చేసుకోలేక ఆకలితో అలమటించారు. తప్పనిసరి పరిస్థితిలో అమెరికా నుండి బ్రెడ్‌ను జపాన్ దిగుమతి చేసుకుంది. కానీ, జనం ఆకలి తీర్చలేకపోయింది. అ బాధలు చూసిన తైవాన్-జపనీస్ వ్యాపారవేత్త మొమొఫుకు ఆండో నిమిషాల్లో తయారయ్యే ఆహార పదార్థం, చౌకగా అందించేలా తయారు చేయాలని భావించాడు. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఇన్‌స్టెంట్ నూడిల్స్. నీటి ఆవిరితో సగం ఉడికించి లేదా పామాయిల్‌తో సగం వేయించి ప్యాక్ చేయించి మార్కెట్‌లోకి వదిలాడు. 1958లో ఇది జరిగింది. తొలిసారిగా వచ్చిన చికెన్ రామెన్ నూడిల్స్ మొదట్లో ఖరీదు ఎక్కువగాను, అది ఓ హోదాకు చిహ్నంగా ఉన్నా అనతికాలంలో అతిచౌకగా, పేదలకు అందుబాటులోకి వచ్చి ఆదరణకు నోచుకుంది. ఇక నిమిషాల్లో తయారయ్యే నూడిల్స్ అంటే లోకం పడి చచ్చిపోతోందన్న పరిస్థితి నెలకొంది. ఇక 1971లో కప్ నూడిల్స్‌నూ ప్రవేశపెట్టాడు. ఆ తరువాత వాటికి రకరకాల ప్లేవర్స్, నాన్‌వెజిటబుల్ నూడిల్స్, వెజిటబుల్ నూడిల్స్ మొదలయ్యాయి. అతడు జపాన్‌లో ప్రవేశపెట్టిన తొలి ఇన్‌స్టెంట్ నూడిల్స్ పేరు ‘రామెన్ నూడిల్స్’. ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ అమ్ముడయ్యే నూడిల్స్ ఇవే. ఆ తరువాత అమెరికాలో వినియోగదారుల ఇష్టాయిష్టాలను గమనించి మరికొన్ని మార్పులతో రకరకాల నూడిల్స్ తీసుకొచ్చాడు. 2007లో అతడు మరణించినా నూడిల్స్ ప్రస్తావన వస్తే మొమొ పేరు స్ఫురణకు రాక తప్పదు. జపాన్‌లో అతడి పేరుమీద, రామెన్ నూడిల్స్ పేరుతోను రెండు మ్యూజియంలు నెలకొల్పారు. ఇప్పుడెందుకు సమస్య ఇన్‌స్టెంట్ నూడిల్స్ రుచికరంగా ఉండటానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కొన్ని రసాయన పదార్థాలు వాడతారు. ముఖ్యంగా మోనో సోడియం గ్లుటామేట్, సీసం (లెడ్) ఉపయోగిస్తారు. మోనో పొటాషియం గ్లుటామేట్, ఆటోలైజ్డ్ ఈస్ట్, అజినోమోటో, సోడియం కేసినైట్ అని పిలిచే ఎంఎస్‌జి సాంద్రత నిజానికి 0.01 పిపిఎం ఉండాలి. మనదేశంలో ఈ మధ్య మార్కెట్లో లభ్యమైన మ్యాగీ నూడిల్స్‌లో ఈ పరిమితి ఆరురెట్లు అధికంగా ఉందన్నది అధికారిక ఆరోపణ. అది నిజం కాదని, తమ పరిశోధనల్లో అంతా సవ్యంగానే ఉందని చెబుతున్న మ్యాగీ నూడిల్స్ ఉత్పత్తిదారు నెస్ట్లే యాజమాన్యం వినియోగదారుడి మనసు నొప్పించకుండా ఉండేందుకు ఆ స్టాక్‌ను వెనక్కి రప్పించుకుంది. ఎంఎస్‌జి అంటే… మోనో సోడియం గ్లుటామెట్ అనేది రుచిని అందించే లవణం. దానిని 1909లో జపాన్‌కు చెందిన అజినొమొటో కంపెనీ అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదులకు తోడుగా దీన్ని ఏడో రుచిగా చెప్పుకుంటారు. ఎంఎస్‌జిని తయారు చేసిన అజినోమోటో కంపెనీ పేరుకు ‘ఎసెన్స్ ఆఫ్ టేస్ట్’ అని అర్థం. భారతీయ వంటకాల్లో దీని వాడకం ఎక్కువే. ఆహార పదార్థాల్లో వీటిని వాడితే రుచి పెరుగుతుంది. కొన్నాళ్లు చెడిపోకుండా నిల్వ ఉంటుంది. ఒక్కోచోట ఒక్కో పేరు భారతదేశంలో నూడిల్స్ అంటే నెస్ట్లే ఉత్పత్తి చేసే మ్యాగీయే గుర్తొస్తుంది. కానీ వివిధ సంస్థలు ఇన్‌స్టెంట్ నూడిల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. మనదేశం సహా బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా, పాకిస్తాన్, సింగపూర్, మలేసియా, బ్రూనే, కొన్ని పాశ్చాత్య దేశాల్లోనూ మ్యాగీదే పైచేయి. జపాన్‌లో రామెన్ నూడిల్స్‌కే జనం పట్టం గట్టారు. హాంకాంగ్‌లో సాన్‌టావో, దక్షిణకొరియాలో షిన్‌రామెన్, ఇండోనేషియాలో ఇండోమీ, థాయ్‌లాండ్‌లో మామ, నేపాల్‌లో గండకి నూడిల్స్ అంటే జనానికి పిచ్చి. మారిషస్‌లో అపోలో నూడిల్స్‌కు ఆదరణ ఎక్కువ. ఇవన్నీ జనాదరణ పొందిన బ్రాండ్లు. ఆయా దేశాల్లో మరికొన్ని ఇతర బ్రాండ్లు ఉన్నా వాటికి ఆదరణ అంతంతమాత్రమే. భారత్‌లో మ్యాగీది అగ్రస్థానం కాగా ఐటిసి కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ‘యప్పీ’ ఈ మధ్య కాలంలో గణనీయంగా మార్కెట్‌ను పెంచుకుంది. విషతుల్యం అదొక్కటే కాదు… ప్రజలు ఆరగిస్తున్న ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో కేవలం నూడిల్స్‌లో మాత్రమే పరిమితికి మించి ఎంఎస్‌జి ఉందని చెప్పలేం. చాలా పదార్థాల్లో అనేక నిషేధిత పదార్థాలు కన్పించాయి. వివాదాలూ రేగాయి. మనదేశంలో లభ్యమయ్యే కోకోకోలా సహా 12 రకాల కూల్‌డ్రింక్స్‌లో క్రిమిసంహారక మందులు ఉన్నట్లు చాలాకాలం క్రితమే ఆరోపణలు వచ్చాయి. ఉండవలసిన పరిమాణం కన్నా 17 రెట్లు ఎక్కువగా డిడిటి కోకోకోలాలో ఉందని పరీక్షల్లో తేలింది. ఆహార పదార్థాల్లో ఆయా రసాయనాల వాడకాన్ని నిషేధించే లేదా ఉత్పత్తిదారులపై చర్య తీసుకునే ఫుడ్‌సేఫ్టీ వ్యవస్థ ఈ ఏడాది ఏర్పడింది. అలాగే వివిధ కంపెనీలు విక్రయిస్తున్న పనె్నండు రకాల తేనెలో పరిమితికి మించి యాంటీ బయాటిక్స్ ఉన్నట్లు తేలింది. క్లోరోంఫెనికోల్, సిప్రోఫ్లాక్సాసిన్, ఎరిత్రోమైసిన్ వంటి యాంటీ బయాటిక్స్ అందులో ఉన్నట్లు రూఢీ అయింది. కోళ్ల ఎదుగుదల కోసం యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నట్లు వాటి మాంసాన్ని పరీక్షించినప్పుడు స్పష్టమైంది. మనదేశంలోనే కాదు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉంది. అమెరికా సహా పలు పశ్చిమ దేశాల్లో చికెన్, బీఫ్ నూడిల్స్‌లో గుర్రం మాంసం దర్శనమిచ్చిన సందర్భాలున్నాయి. మన దేశంలో ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ భారత ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల సాధికార సంస్థ నిబంధనలు రూపొందించింది. ఇప్పుడు మ్యాగీ వివాదంలోకి వచ్చిందికానీ మున్ముందు ప్రాసెస్డ్ ఫుడ్ విక్రయించే ఏ సంస్థ అయినా దోషిగా నిలబడవచ్చు. ప్యాక్‌డ్ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఆ కోవలోకే వస్తాయి. ఇంతకాలం వీటిని పరిశీలించి, పరీక్షించి, నియంత్రించే వ్యవస్థ లేకపోయింది. బహుళజాతి సంస్థల ఉత్పత్తులపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కాగా దేశీయ సంస్థల ఉత్పత్తులు, స్ట్రీట్‌ఫుడ్, ప్రభుత్వ సంస్థలు విక్రయించే పదార్థాలు ప్రమాణాలకు దీటుగా ఉన్నాయా? అంటే లేదనే చెప్పాలి. రుచికన్నా ఆరోగ్యం ముఖ్యమన్న స్పృహ తినేవారిలో ఉంటే జంక్‌ఫుడ్ జోలికి వెళ్లరు. ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మెరుగైన ఆహారమే మేలు. ‘ప్రచారకర్త’లకు బాధ్యత లేదా? చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లు మొదలు భారీ సైజు టీవీలు అమ్ముడుపోవాలన్నా వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు సెలబ్రిటీలు ‘ప్రచారకర్తలు’గా అవతారం ఎత్తాల్సిందే. ప్రకటనల్లో నటించినందుకు భారీగా పారితోషికాలు అందుకునే సెలబ్రిటీలకు మాత్రం సంబంధిత ఉత్పత్తుల నాణ్యతాప్రమాణాలపై ఎలాంటి సంబంధం ఉండదు. ప్రచారం చేయడం వరకే తమ పాత్ర అని, ఉత్పత్తుల విషయమై ఎలాంటి ఫిర్యాదులొచ్చినా తాము బాధ్యులం కామంటూ వారు తెగేసి చెబుతుంటారు. ప్రస్తుతం ‘మ్యాగీ’ నూడుల్స్‌పై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న సందర్భంలోనూ సెలబ్రిటీలు తమ పాత పాటే వినిపిస్తున్నారు. ప్రజారోగ్యంతో సంబంధం ఉన్న ఆహార ఉత్పత్తులపై ప్రచారం చేస్తున్నపుడు సెలబ్రిటీలు అన్ని విషయాలూ క్షుణ్ణంగా తెలుసుకోరా? వారికి సామాజిక బాధ్యత లేదా? అన్న విమర్శలు వస్తూనే ఉంటాయి. శీతల పానీయాల్లో పురుగుమందుల అవశేషాల వివాదం నుంచి తాజాగా ‘మ్యాగీ’లో హనికర రసాయనాల వరకూ ‘ప్రచారకర్త’లైన మన సెలబ్రిటీలు ఏమీ తెలియని అమాయకులే! ‘మ్యాగీ’కి ఇంతటి ప్రాచుర్యం కల్పించి వాటి విక్రయాలు కోట్లలో పెరగడానికి కారకులైన బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలపైనా కేసులు నమోదు చేయాలన్న వాదనలు విన్పించాయి. ‘మ్యాగీ’ వివాదం తీవ్రంగా రాజుకోవడంతో ఆ ముగ్గురిపైనా కొన్ని చోట్ల కేసులు పెట్టడం, నోటీసులు పంపడం చకచకా జరిగిపోయాయి. ‘మ్యాగీ’ ప్రకటనల్లో నటించి చాలాకాలమైందని, ప్రస్తుత వివాదంతో తమకెలాంటి సంబంధం లేదని ఆ సెలబ్రిటీలు సెలవిచ్చారు. అయితే, ఆహారోత్పత్తులకు సంబంధించి ఇకపై ‘ప్రచారకర్త’లుగా బాధ్యతలు నిర్వహిస్తే అన్ని విషయాలూ ఆలోచిస్తామని వారు ప్రకటించారు. ‘ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలతో ప్రచారకర్తలకు సంబంధం లేదా’ అన్న చర్చ అప్పుడప్పుడూ మొదలు కావడం మళ్లీ పాతబడిపోవడం షరామామూలుగానే మారింది. ప్రకటనల్లో నటించినపుడు ఉత్పత్తుల నాణ్యత గురించి ఏ సెలబ్రిటీ కూడా ఆరా తీయడం జరగదు. ఉత్పత్తిదారులు కూడా ఆ విషయాలను ‘ప్రచారకర్త’లకు చెప్పడమూ ఉండదు. తమకు ముట్టజెప్పే పారితోషికం తప్ప మిగతా విషయాలు వారికి అనవసరం. వివాదాలు మరింతగా ముదిరితే, ఆ ప్రకటనలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం తప్ప సెలబ్రిటీలు చేసేది ఏమీ ఉండదు. బాలీవుడ్‌కు సంబంధించి షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అక్షయ్‌కుమార్, బిపాసా బసు, కంగనా రనౌత్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖులు నటించిన ప్రకటనలు గతంలో వివాదాస్పదంగా మారాయి. కోకోకోలాలో పురుగుమందుల అవశేషాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఇక ఆ శీతల పానీయం కోసం ప్రచారకర్తగా తాను వ్యవహరించేది లేదని ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ గతంలోనే స్పష్టం చేశారు. వరకట్నం ప్రస్తావన ఉన్నందున ఓ కంపెనీ టీవీల ప్రచారానికి కూడా ఆయన దూరమయ్యారు. ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్‌పై ఆరోపణలున్నందున- ఉత్పత్తిదారులిచ్చే రెండు కోట్ల రూపాయల పారితోషికం కోసం తాను నటించలేనని యువనటి కంగనా రనౌత్ తెగేసి చెప్పింది. పొగాకు, మద్యం విక్రయాలకు సంబంధించి తాను ప్రచారకర్తగా వ్యవహరించనని నటుడు జాన్ అబ్రహాం ప్రకటించారు. సామాజిక ప్రయోజనం లేనందున ఓ విలాసవంతమైన కార్లకు ప్రచారం చేసేందుకు సిద్ధంగా లేనని అమీర్ ఖాన్ స్పష్టం చేశాడు. ఇలాంటి నిర్ణయాలతో కొందరు నటీనటులు జనం నుంచి జేజేలు అందుకున్నా, మరికొందరు మాత్రం వివాదాలకు కేంద్ర బిందువులయ్యారు. ‘మాజీ విశ్వసుందరి’, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ఆ మధ్య ఓ నగల కంపెనీ కోసం నటించిన ప్రకటన వివాదం రేపింది. నలుపురంగులో ఉన్న ఓ పేద బాలిక ఐశ్వర్యకు గొడుగు పడుతున్నట్లు చిత్రీకరించిన ఆ ప్రకటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్లు ఆ ప్రకటన ఉందన్న ఆరోపణలు రావడంతో దాన్ని ప్రచారం నుంచి ఉపసంహరించారు. నల్లగా ఉన్నవాళ్లు తెల్లగా మారండంటూ ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ గురించి షారుఖ్ ఖాన్ ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. కొందరి మనసులను గాయపరిచే ఇలాంటి ప్రకటనల్లో నటించనని అమీర్ ఖాన్ చెప్పగా, షారుఖ్ మాత్రం ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. నటుడు అక్షయ్‌కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా డెనిమ్ బ్రాండ్ జీన్ ప్యాంట్ల ప్రకటన మరీ అశ్లీలంగా ఉందన్న విమర్శలు వచ్చాయి. 1998లో ఓ బ్రాండ్ లోదుస్తుల ప్రకటనలో నటి బిపాసా, అప్పటి ఆమె ప్రియుడు డినో మోరియా నటనపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. 1991లో పూజా బేడీ, మార్క్ రాబిన్సన్ నటించిన ఓ కండోమ్ ప్రకటన కూడా విమర్శలను మూటగట్టుకుంది. మలైకా అరోరా, ఆర్బాజ్ ఖాన్ నటించిన ఓ కండోమ్ ప్రకటన 1993లో వివాదం సృష్టించింది. నటి కంగనా రనౌత్ ‘లెవిస్’ జీన్స్ ప్రకటనలో మరీ సిగ్గు విడిచి నటించిందన్న విమర్శలు గతంలో వచ్చాయి. లైంగిక విజ్ఞానం గురించి చెప్పడానికి బదులు ‘డూరెక్స్’ కండోమ్ ప్రకటనలో నటుడు రణ్‌వీర్ సింగ్ నటన మరీ శ్రుతి మించిందన్న వ్యాఖ్యానాలున్నాయి. గుట్కా ప్రకటనలో సంజయ్ దత్ నటించడంతో ఎంతోమంది యువకులు ఆయన బాటను అనుసరిస్తున్నారని గతంలో కొందరు వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సినీతారలు యువతకు ఆరాధ్యదైవాలుగా కనిపిస్తున్న నేటికాలంలో వారు నటించే ప్రకటనల ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. ప్రకటనలకు, ప్రచారకర్తలకు సంబంధించి వివాదాలు చెలరేగడం కొత్తేమీ కాకపోయినా- తాము చెప్పే మాటలను జనం సులువుగా నమ్ముతారన్న విషయాన్ని సెలబ్రిటీలు గుర్తుంచుకుంటే వారు విమర్శలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ప్రచారకర్తలుగా బాధ్యతలు స్వీకరించేముందు సంబంధిత ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, ప్రజారోగ్యం, నైతిక విలువలు వంటి విషయాలను వారు తెలుసుకుంటే మరీ మంచిది. *** అందమైన చిహ్నం…ఆవిరైన నమ్మకం అందమైన పక్షిగూడు….అమ్మ తెచ్చే ఆహారంకోసం నోళ్లు తెరిచి ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్న పిల్లలు, వాటికి ఆప్యాయంగా ఆహారాన్ని ఇచ్చేందుకు వచ్చిన పక్షి…వెరసి ప్రఖ్యాత ఆహార పదార్థాల తయారీ సంస్థ నెస్ట్లే వ్యాపారసంస్థ చిహ్నం. దశాబ్దాలుగా భారతీయుల ప్రేమను పొందిన ఆ సంస్థపై విశ్వాసం ఇప్పుడు పరీక్షకు నిలిచింది. అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందిన ఈ సంస్థ ఎన్నో ఇతర ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నప్పటికీ మ్యాగీ పేరుతో ప్రారంభించిన నూడిల్స్ అంతర్జాతీయ ఖ్యాతిని పొంది భారీ మార్కెట్‌ను అందించాయి. ఒక్క భారత్‌లోనే నూడిల్స్ విభాగంలో ఆ సంస్థ 70శాతం మార్కెట్‌ను కొల్లగొట్టింది. ఏటా 8వేలకోట్ల పైబడి రాబడి సాధిస్తున్న మ్యాగీ కేవలం లాభాలపైనే దృష్టిపెట్టి, వినియోగదారుడి ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టిందా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. వివిధ రాష్ట్రాల్లో మ్యాగీ నూడిల్స్‌తో నిషేధం విధించడం, ఆ నూడిల్స్‌ను నిషేధించాలని కేంద్రం ప్రభుత్వ సంస్థ ఆదేశించడంతో విధిలేని పరిస్థితుల్లో నెస్ట్లె తమ నూడిల్స్‌ను మార్కెట్‌నుండి వెనక్కు రప్పించింది. మ్యాగీ నూడిల్స్‌లో పరిమితికన్నా ఏడెనిమిది రెట్లు ఎక్కువగా ఎంఎస్‌జి, సీసం ఉన్నాయన్నది అభియోగం. ఈ వివాదంవల్ల దాదాపు 4వేల కోట్ల రూపాయల మేరకు ఆ సంస్థకు దెబ్బతగిలింది. అయితే భారతీయ వినియోగదారుడి మనసు చూరగొనేలా, విశ్వాసాన్ని పొందేలా మళ్లీ మార్కెట్‌లోకి వస్తామని ఆ సంస్థ గట్టిగా చెబుతోంది. నెస్ట్లె చిహ్నం చూసి ఎంతో నమ్మకంతో ఆ సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేసే భారతీయులు ఇప్పుడు అపనమ్మకంతో ఉన్నారు. మ్యాగీ నూడిల్స్‌లో పరిమితికి మించి ఎంఎస్‌జి, లెడ్ ఉండటంవల్ల ఎన్నో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని తేలడం నెస్ట్లె వ్యాపారానికి గట్టి దెబ్బ తగిలింది. కేవలం ఆ సంస్థ ఉత్పత్తి చేసే పదార్థాలే కాదు. ఇప్పుడు ఇతర సంస్థలు తయారు చేస్తున్న ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నింటినీ పరీక్షించాలని భారత కేంద్ర ఆహార పదార్థాల నాణ్యత, ప్రమాణాల సంరక్షణ సాధికార సంస్థ నిర్ణయించింది. అయితే ఆయా ఉత్పత్తుల తయారీకి, చాలాకాలంగా వస్తున్న ఆరోపణలకు స్పందించకుండా ఉండటానికి రాజకీయ నేతలు, అధికారులే కారణమని భావించాలి. అసలు ఆహార పదార్థాలా నాణ్యత, ప్రమాణాలను పరీక్షించే సంస్థ ఇన్నాళ్లూ లేకపోవడం ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏపాటిదో చెబుతోంది. ఇదీ నూడిల్స్ సామ్రాజ్యం మన దేశంలో ఇప్పుడు అందరినోటా విన్పిస్తున్న మాట మ్యాగీ నూడిల్స్. నిజానికి ‘యెప్పీ’ అనే రకం నూడిల్స్ కూడా ఈ మధ్య జనాదరణ పొందాయి. ప్రపంచవ్యాప్తంగా నూడిల్స్ అంటే ఇష్టపడేవారి సంఖ్య తక్కువేమీకాదు. భారతదేశంలో ఇన్‌స్టెంట్ నూడిల్స్ మార్కెట్‌లో మ్యాగీ వాటాయే ఎక్కువ. దాని వార్షిక అమ్మకాల విలువ 8,900 కోట్ల రూపాయల పైమాటే. మనదేశంలో సైనికులు బాగా ఇష్టపడే ఆహారం కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 102.7 బిలియన్ ప్యాకెట్ల నూడిల్స్‌ను జనం తిన్నారు. భూగోళంమీద ఉన్న ప్రతి ఒక్కరికి వీటిని పంచితే ఏడాదికి ఒక్కొక్కరు 14 ప్యాకెట్లు తిన్నట్లు లెక్క. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్‌స్టెంట్ నూడిల్స్‌ను ‘గ్లోబల్ ఫుడ్’ గా కీర్తిస్తే, భారతదేశంలో ‘కంఫర్ట్ ఫుడ్’ గా భావిస్తారు. వీటిని ఇష్టపడి బాగా తినే దేశాల్లో చైనా, హాంకాంగ్ మొదటి స్థానంలో ఉన్నాయ. ఇక్కడ ఏటా 44,400 మిలియన్ల ప్యాకెట్లు తినేస్తూ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇండోనేషియా, జపాన్ తరువాతి స్థానాల్లో ఉండగా భారత్ నాల్గో స్థానంలో ఉంది. *** మొక్కజొన్న పిండి లేదా వరి, గోధుమ పిండ్లతో నూడిల్స్ తయారైన తరువాత వాటికి ఇతర రుచులు మేళవించాక, సగం ఉడకబెట్టడమో, లేక పొడిబారేట్లు చేయడమో అయ్యాక, 320 డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత వద్ద వేయిస్తారు. దీంతో అందులో ఉండే నీరు ఆవిరై, క్రిస్పీగా తయారైన ఇన్‌స్టెంట్ నూడిల్ సిద్ధమవుతుంది. దీనిని మనం తినాలనుకున్నప్పుడు మరుగుతున్న నీళ్లలో వేసినప్పుడు అత్యంత వేగంగా నీటిని అవి పీల్చుకుని త్వరితగతిన ఉడికి తినడానికి వీలుగా సిద్ధమవుతాయి. ఈ మధ్య కాలంలో ‘బ్లోడ్రై’ పద్ధతిలో ఇన్‌స్టెంట్ నూడిల్స్‌ను సిద్ధం చేస్తున్నాయి. 176 డిగ్రీల ఫారన్‌హీట్ వేడితో ఉండే హాట్‌ఎయిర్‌తో 30నుండి 60 నిమిషాలపాటు మగ్గబెట్టి గట్టిపడిన తరువాత ప్యాకింగ్ చేస్తున్నారు. నిషేధంపై భిన్న వైఖరులు..! హానికర రసాయనాలున్నాయన్న వార్తలు రావడంతో దేశ వ్యాప్తంగా కుతకుతలాడిన ‘మ్యాగీ’ నూడుల్స్‌పై వివిధ రాష్ట్రాల్లో విభిన్న నివేదికలు రావడం విశేషం. మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రావడంతో- ‘మ్యాగీ’పై రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడి ఆగమేఘాలపై నిషేధాజ్ఞలు విధించాయి. ప్రజారోగ్యానికి చేటుతెచ్చే ఆహారోత్పత్తులను తాము అనుమతించేది లేదంటూ కేంద్రం సైతం జూలు విదిల్చింది. వివాదం ముదురుపాకాన పడడంతో ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాలు ‘మ్యాగీ’ నమూనాలను నిపుణుల పరీక్షల నిమిత్తం పంపాయి. ఈ నూడుల్స్‌లో సీసం (లెడ్) వేర్వేరు రాష్ట్రాల్లో ప్రామాణిక స్థాయి (2.5 పిపిఎం)ని మించి అనేక రెట్లు అధికంగా ఉన్నట్లు నివేదికలు రావడం ఆశ్చర్యకరం. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వ్యతిరేక ఫలితాలు రావడం ఇంకో విడ్డూరం. ఓ ప్రముఖ బహుళజాతి సంస్థ నిర్ణీత ప్రమాణాలతో ఒక ఉత్పత్తిని ఒకే పద్ధతిలో తయారుచేస్తే నాణ్యతకు సంబంధించి ఇంతటి తేడాలు రావడం ఏమిటన్నది శేషప్రశే్న! వివిధ రాష్ట్రాల్లో ఒకే ఉత్పత్తిపై పరీక్షలు జరిపితే ఇలాంటి వ్యత్యాసాలు ఎలా ఉంటాయన్నది అర్థం కాని విషయమే. ఈ నేపథ్యంలో ‘మ్యాగీ’పై కేంద్రం వైఖరి ఒకలా ఉండగా, వివిధ రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు ‘మ్యాగీ’కి ‘క్లీన్‌చిట్’ ఇవ్వగా, ఇంకొన్ని చోట్ల నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయి. నిపుణుల పరీక్షలకు నిర్దిష్టమైన విధి విధానాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న వాదనలు లేకపోలేదు. తొమ్మిది రకాల నూడుల్స్‌ను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం ‘నెస్లే’ సంస్థకు సూచించింది. కాగా, ‘మ్యాగీ’లో అభ్యంతరకర అంశాలేవీ లేవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. తొమ్మిది రకాల ఉత్పత్తుల్లో సీసం మోతాదు మించినట్లు కనిపించలేదని మహారాష్ట్ర ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. రుచి కోసం వాడే ఎంఎస్‌జి కూడా పరిమితికి లోబడే ఉందని ఆ సంస్థ అధికారులు తేల్చారు. అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే ‘మ్యాగీ’పై తాము తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని అంశాలు ‘మ్యాగీ’లో కనిపించాయని భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ప్రకటించింది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవ్వించి నవ్వించి కరగించిన సినిమా -నిర్మాత లగడపాటి శ్రీధర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ భాగ్యం నాకు మిగిలింది ”అన్న బుచ్చిబాబు భార్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ యుద్ధానికి ఇం”ధనం ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సిద్ధయోగి శివానంద మూర్తి -డా శ్రీ ఆర్ అనంత పద్మనాభ రావు-మాజీ రేడియో స్టేషన్ డైరెక్టర్

సిద్ధయోగి శివానంద మూర్తి -డా శ్రీ ఆర్ అనంత పద్మనాభ రావు-మాజీ రేడియో స్టేషన్ డైరెక్టర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జిల్లెల్ల మూడి అమ్మ -ఆరాధనోత్సవం -మరియు అసూయకు పతనమే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లోక కల్యాణానికి వెలసిన కొప్పెశ్వర స్వామి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీరీ పండిట్ ల అజ్ఞానం

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

రెండు స్తాయిల్లో దేవుడు -అరవింద రావు ,- ధర్మం రెండు రకాలు -పరిపూర్నానంద ,పతంజలి యోగం -రవి శంకర్



గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ -ముస్లిములు

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఆపరేషన్ బర్మా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -11 (చివరి భాగం )

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -11 (చివరి భాగం )

kp9 001 kp76 001 kp77 001 kp78 001 kp80 001 kp81 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక – 10

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -10kp68 001 kp69 001 kp70 001 kp71 001 kp72 001 kp73 001 kp74 001 kp75 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -9

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -9kp66 001 kp67 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -8

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -8kp56 001 kp57 001 kp58 001 kp59 001 kp60 001 kp61 001 kp62 001 kp63 001 kp64 001 kp65 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

11-6-15 గురువారం -ఉదయం -విజయవాడ

11-6-15 గురువారం -ఉదయం -విజయవాడ స్టెల్లా కాలేజి రోడ్డు లో శ్రీ సాయబాబా గుడి వద్ద ఉన్న  ”సంయుక్త వేదిక ”లో శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి మనవ రాళ్ళు (కుమారుడు కృష్ణ కుమార్తెలు  )ఛి.  సెరీనా,  ఛి . శ్రేయ లకు ”చీరెల సంబరం ”దృశ్యమాలిక -మరియు -స్టేట్ బాంక్ కాలనీలో మా తోడల్లుడి గారింట్లో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సద్గురు శివానంద మూర్తి శివైక్యం –

 
 
 

 

 


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -7

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -7kp46 001 kp47 001 kp48 001 kp49 001 kp50 001 kp51 001 kp52 001 kp53 001 kp54 001 kp55 001

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -46

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -46

18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -5(చివరిభాగం )

జోలాను కుట్ర తో చంపారు

ఎమిలీ జోలా మరణం పై అనేక అనుమానాలున్నాయి ఆయన ప్రత్యర్ధుల  కుట్రవల్లనే కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయి౦దని అంతకు ముందు రెండు మూడు సార్లు వారు హత్యాప్రయత్నం చేశారని అన్నారు .కాని ఇది రుజువుకాలేదు ఒట్టి అపోహ మాత్రమె నని తేలింది .కొన్ని దశాబ్దాల తర్వాత పారిసాన్ రూఫర్ మరణ శయ్యపై ఉండి తానె రాజకీయ కారణాలవలన జోలా ఉన్న ఇంటి చిమ్నీ మూసేశానని చెప్పాడు .జోలాను మొదట పారిస్ లోని క్లేమేటోరి డీ మాంట్ మెట్రి శ్మశాన వాటికలో ఖనం చేశారు .నాలుగేళ్ల తర్వాతా అలేక్సాండర్ డ్యూమాస్ విక్టర్ హ్యూగో ల ను ఖననం చేసిన పా౦ధియన్ లో అవశేషాలను భద్ర పరచారు .1953 లో ఒక విచారణ సంఘం పూర్తీ విచారణ చేసి ఎమిలీ జోలా ది హత్య మాత్రమె నని   ,ప్రమాద వశాత్తు జరిగిన మరణం కాదని  తేల్చింది .చిమ్నీ స్వీపర్ హెన్రి బూరోన్ ఫెస్స్ తానె రాజకీయ వాదుల కోరిక పై చిమ్నీ ని మూసేశానని ఒప్పుకొన్నాడు .కనుక ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని తేలింది .

రెండు కుటుంబాల కద

జోలా రాసిన 20 భాగాల రోగాన్ మాక్వార్ట్  నవల సెకండ్ ఫ్రెంచ్ ఎంపైర్ కు చెందిన విషయ౦  అని ముందే చెప్పుకొన్నాం .1851-71 మధ్య ఉన్న ఇరవై ఏళ్ళలో జరిగిన ఒక కుటుంబ గాధ అది .ఇందులో మూడొందల అధ్యాయాలున్నాయి .ఇది రోగాన్  మరియు మాక్వార్ట్ అనే రెండు కుటుంబాల కద .దీనికి జోలా పెట్టిన ఫ్రెంచ్ పేరుకు ఇంగ్లీష్   పేరు ‘’the natural and social history of a family   ,under the second empire ‘’దీన్ని ఫ్రెంచ్ మూడవ రిపబ్లిక్ కాలం లో రాశాడు .మూడవ నెపోలియన్ కాలం లో ఫ్రెంచ్ సైన్యం దారుణంగా ఓడిపోవటమే ఇందులోని విషయం .నానా నవలలో కూడా దీని గురించి రాశాడు .

శాస్త్రీయ పరిశోధనా నవల కు ఆద్యుడు జోలా

‘’లి రోమన్ ఎక్స్ పెరిమెంటల్ ‘’నవలలో నేచరలిస్ట్ నవల ధోరణి ప్రారంభమై ,సైంటిఫిక్ పరిశోధనానవలగా పేరు తెచ్చుకొన్నది .క్లినికల్ ఫిజియాలజికి దారి తీసింది .జోలా దృష్టిలో ‘’no character should appear larger than life ‘’ Although Zola would not accept that it was either scientifically or artistically justifiable to create larger-than-life characters, his work does present a number of larger-than-life symbols which, like the mine Le Voreux in Germinal, take on the nature of a surrogate human life. The mine, the still in L’Assommoir and the locomotive La Lison in La Bête humaine impress the reader with the vivid reality of human beings. The great natural processes of seedtime and harvest

జోలా ఒక రచయిత ,కవి సైంటిస్ట్ మాత్రమె కాక ఆశావాది .’’పాజిటివిజం ‘’అంటే మక్కువ .మానవాభ్యున్నతిపై అచంచల విశ్వాసం ఉన్నవాడు జోలా .ఆయన జీవితం పై సినిమా కూడా తీశారు . “I wish to explain how a family, a small group of human beings, conducts itself in a given social system after blossoming forth and giving birth to ten or twenty members, who, though they may appear, at the first glance, profoundly dissimilar one from the other, are, as analysis demonstrates, most closely linked together from the point of view of affinity. Heredity, like gravity, has its laws’’

 అని తన సీరియల్స్ కు ముందుమాట రాశాడు జోలా .సంఘం లో ఉన్న పరిసరాల పరిస్థితులు ,హింస ,తాగుడు వ్యభిచారం ఏవిదం గా ప్రజలను  ‘’సెకండ్ వేవ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ‘’కాలం లో ప్రభావితం చేశాయో వివరించాడు .బ్రెజిల్ ఫ్రాన్స్ దేశాల రచయితలపై జోలా ప్రభావం అధిక౦ .అయిదుగురు నేచరలిస్ట్ రచయితలకు జోలా ఆదర్శనీయుడు .

      Inline image 1     Inline image 2 Inline image 3Inline image 4

          సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికా సాంఘిక సంస్కర్త ,క్వేకర్ ఉద్యమనాయకురాలు -లుక్రేషియా కాఫిన్ మొ

అమెరికా సాంఘిక సంస్కర్త ,క్వేకర్ ఉద్యమనాయకురాలు -లుక్రేషియా కాఫిన్ మొట్

బాల్యం-ఉద్యోగం వివాహం సంతానం

unnamedఅమెరికా లోని మసా చూసేట్స్ రాష్ట్రం లో నాన్ టకేట్ లో లుక్రేషియా కాఫిన్ 3-1-1793 జన్మించింది .ఎనిమిది మంది సంతానం లో రెండవ పిల్ల కాఫిన్ .తల్లి పీటర్ ఫోల్గేర్ మేరీ ఫోల్గేర్ లకు ముని మనుమరాలికి మనవ రాలు .బెంజమిన్ ఫ్రాన్క్లిన్ కు కూడా చుట్టరికం ఉన్నది .డచేస్ కౌంటిలో ఉన్న ‘’నైన్ పార్ట్నర్స్ స్కూల్ ‘’లో13 వ ఏట చేరి చదివింది .ఇది న్యూయార్క్ లోని సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ నిర్వహించే స్కూల్ .గ్రాడ్యుయేట్ అయి అక్కడే టీచర్ గా చేరిపని చేసింది .ఆ స్కూల్ లో అప్పుడు మగ మేస్టర్లకు ఆడ టీచర్లకంటే మూడు రెట్ల జీతం ఇస్తూ ఉండేవారు .ఇది గమనించి కాఫిన్ మహిళలకు సమాన హక్కులు కావాలనే అభిప్రాయం లోకి వచ్చింది .తండ్రి కుటుంబాన్ని ఫిలడేల్ఫియాకు మార్చటం తో పీటర్ మొట్ అనే టీచర్ తో సహా అక్కడికి వెళ్ళింది .మొట్ ను పెళ్ళాడింది .సంతానం కలిగారు .ఆమెపిల్లలు ఆమెలాగే బానిసత్వ నిర్మూలన ఉద్యమం లో క్రియాశీలంగా పని చేశారు .

బానిసత్వ నిర్మూలనోద్యమం

ఇతర క్వేకర్ ల లాగానే కాఫిన్ కు బానిసత్వం అంటే నచ్చేదికాదు .బానిసత్వం సాంఘిక దురాచారం అని భావించింది .ఇతర బానిసలు నేసిన నూలు దుస్తులు వారు తయారు చేసిన పంచదార ,మొదలైనవి ఉపయోగించేదికాదు . మొట్ క్వేకర్ మినిస్టర్ అయింది ఆత్మజ్ఞానం పొందిన కాఫిన్ ప్రతివారిలోను భగవంతుని దర్శించింది .భర్తకు చేదోడుగా సహకరించి ప్రజలలో బానిసత్వం యెడల విముఖతకలిగేట్లు ప్రచారం చేసింది .భర్త ‘’అమెరికన్ యాంటి స్లేవరి సొసైటీ ‘’స్థాపించటానికి ఎంతగానో సహకరించింది .ఫిలడెల్ఫియాలో బహిరంగ వేదికలపై మాట్లాడే నేర్పు అలవడింది .అందరిని ఒప్పించే గుణం ఆమెలో ఉండేది .అప్పటికి ఆమె ఒక్కతే బహిరంగ సభలలో ఉపన్యాసం ఇచ్చేది. ఇంకెవరూ అంతటి సాహసం చేయ లేక పోయేవారు .కనుక ఏకైక మహిళా వక్త అయింది .ప్రజాబలం కూడగట్టుకొని కొద్దికాలం లోనే ‘’ఫిలడెల్ఫియా యాంటి స్లేవరి సొసైటీ ‘’ని స్థాపించింది .అక్కడి నల్ల జాతివారి సహాయ సహకారాలు ఆమెకు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. జాతి వివక్షతపై పోరు బాట సాగించింది .నల్లజాతివారి మత ఉత్సవాలలో పాల్గొని వారి అభిమానాన్ని పొందింది .బంధు మిత్రులతోకలిసి ‘’రోచెస్టర్ యాంటి స్లేవరి సొసైటీ ‘’నికూడా ఏర్పాటు చేసింది .
కుటుంబ ఆదాయాన్ని బట్టి ఖర్చు చేస్తూ మిగిలిన డబ్బును ఉద్యమ విస్తరణకు విని యోగించేది. ఇంటికి వచ్చిన అతిధులకు సేవల౦ద జేసేది .కుటుంబ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తూనే సాంఘిక న్యాయం కోరే మహిళగా గుర్తింపు పొందింది .అందరిని కూడగట్టి ఉత్సవాలు ఊరేగింపులు చేస్తూ వచ్చిన రాబడిని బానిస విమోచనానికి ఖర్చు చేసేది 1837, 38,39 లలో జరిగిన ;;యాంటి స్లేవరి కన్వెన్షన్ ఆఫ్ అమెరికన్ వుమెన్ ‘’సభలు మూడింటికి హాజరై ప్రాతినిధ్యం వహించింది మొట్ .1838లో ఫిలడెల్ఫియాలో సమ్మేళనం జరిపే హాల్ ను దుండగులు తగల బెట్టారు .ఆరుబయటనే మీటింగ్ నిర్వహించి బానిసవిమోచనశంఖా రావం పూరించింది .అగ్గి మీద గుగ్గిలమైనవ్యతిరేకులు మొట్ ఇంటినీ నల్లజాతివారి ఇళ్ళను దోచుకొన్నారు .భీభత్సం సృష్టించారు

ప్రపంచ సభలో పాల్గొనటం

1840 జూన్ నెలలో లండన్ లో జరిగిన ‘’ప్రపంచ బానిస వ్యతిరేక సభ ‘’లో మొట్ పాల్గొన్నది .అప్పటికే అంతర్జాతీయంగా గుర్తింపు పొంది ఆరుగురు అమెరికన్ ప్రతినిదు లతో హాజరైన ఆమెను అక్కడి’’ మగ పురుషులు ‘’తమతో అమెరికన్ మహిళలు కూర్చోటానికి వీలు లేదని వ్యతిరేకించి పాల్గొన కుండా చేశారు . పాపం మహిళలు వేరేగా కూర్చోవాల్సి వచ్చింది .ఈ సభలో ఆడవారి హక్కుల విషయం ప్రస్తావి౦చ రాదని నిషేధం విధింఛి బానిస విమోచనాన్ని నీళ్ళు గార్చే ప్రయత్నం చేశారు .అప్పడు లండన్ లో ఉన్న న్యాయ చట్టాల ననుసరించి స్త్రీలు బహిరంగం గా రాజకీయ సభలలో పాల్గొన రాదు అనే నియమం కూడా ఉంది . మగవారికి వారికి అది కలిసొచ్చింది .కాని అమెరికా నుండి వచ్చిన పురుష ప్రతినిధులైన గారిసన్ ,నేతానియాల్ పి.రోజేర్స్ ,విలియం ఆడమ్స్ ,ఆఫ్రికన్ –అమెరికన్ యాక్టివిస్ట్ చార్లెస్ లేనాక్స్ రిమాండ్ మొదలైనవారు స్త్రీలకోసం కేటాయించిన స్థలం లోనే స్త్రీ ప్రతినిధులతో బాటు కూర్చుని నిరసన తెలియ జేశారు . ఐరిష్ పత్రిక మొట్ ను ‘’మహిళా సింహం ‘’అని కీర్తించింది .ఇంగ్లాండ్ స్కాట్ లాండ్ సభలలో పాల్గొని అమెరికాకు తిరిగి వచ్చింది .

బానిస రాష్ట్రాల పర్యటన

న్యూయార్క్ లోను బోస్టన్ లోను బహిరంగ సభలలో మొట్ ఉపన్యసించింది .బానిసలున్న రాష్ట్రాలలో పర్యటన చేసి బాల్టిమోర్ వర్జీనియా మేరీలాండ్ లలో ప్రసంగించి చైతన్యం తెచ్చింది .బానిస యజమానులతో సమావేశమై వారి మనసు మార్చటానికి ప్రయత్నించింది .40 మంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల సమావేశం లో ప్రసంగించి వారికి విమోచన పై అవగాహన కలిగించింది .ఆసభకు వచ్చిన’’ ప్రెసిడెంట్ జాన్ టేలర్’’ మొట్ వ్యక్తిత్వానికి ,ఉపన్యాసానికి ముగ్ధుడైపోయాడు .అక్కడే ఉన్న బానిస విమోచనాన్ని వ్యతిరేకించే సెనేటర్ ‘’కల్హాన్ ‘’ ఆమెకు అప్పగిస్తానని ప్రకటించాడు .
న్యూయార్క్ లోని సేనేకా ఫాల్స్ లో మొట్ మరియు మరోనాయకురాలుసాంటన్ తో కలిసి మహిళాహక్కుల సభ 1848లో జరిపారు .స్త్రీ వోటు హక్కు కోసం నినదించారు .విమోచన ఎంతముఖ్యమో స్త్రీ వోటుహక్కూ అంతే ముఖ్యం అన్నారు .మానవ హక్కుల నాయకుడు ఫ్రెడరిక్ డగ్లాస్ ఇందులో కీలక పాత్ర పోషించాడు .మొట్ ప్రభావం యునిటేరియన్లు అయిన ధియోడర్ పార్కర్ ,విలియం ఎల్లరి చానింగ్ , విలియం పెన్ ల పై అధికం .యూని వరసల్ రైట్స్ కోసం పోరాడాలని నిర్ణయించారు .మొట్ క్రమంగా దూరమైంది అనారోగ్య రీత్యా .
‘’the kingdom of God is within man ‘’అని అభిప్రాయపడింది మొట్ .తర్వాత రెలిజియస్ లిబరల్స్ ఏర్పరచిన ‘’ఫ్రీ రేలజి యన్ అసోసియేషన్ ‘’లో చేరింది .దీనిలో మహా వేదాంతి ఎమర్సన్ ,మొదలైన గొప్పవారు కూడా సభ్యులయ్యారు మొట్ ‘’సేర్మాన్ టు మెడికల్ స్టూడెంట్స్ ‘’రాసి 1849లో ప్రచురించింది ‘’డిస్కోర్స్ ఆన్ వుమెన్ ‘’అనే కరపత్రం వెలువరించింది .క్వేకర్ ఉద్యమనాయకురాలుగా ఉండి మహిళా హక్కులకోసం, బానిస విమోచనం కోసం అహరహం శ్రమించిన మహిళా మాణిక్యం లుక్రేషియా కాఫిన్ మొట్ ..87 ఏళ్ళు జీవించి 11-11-1880 న మరణించింది .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – అరసి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – అరసి

IMG_4253గబ్బిట దుర్గా ప్రసాద్ సాహితీ ప్రియులకు , అటు అంతర్జాల చదువరులకు సుపరిచితమైన పేరు . వృత్తి రీత్యా సైన్స్ మాస్టర్ అయిన , ప్రవృత్తి రీత్యా సాహిత్య వేత్త , బహు గ్రంధ రచయిత . ఇప్పటి వరకు తన స్వీయ రచనలు తొమ్మిది పుస్తకాలు వెలువరించారు . స్వీయ సంపాదకత్వంలో సరస భారతి ప్రచురణలో ఏడు గ్రంధాలను ప్రచురించారు . ప్రస్తుత రచన “ గీర్వాణ కవుల కవితా గీర్వాణం” .

ఈ పుస్తకం సుమారుగా 146 వ్యాసాల సమాహారం . ప్రసిద్ధ కవులు వ్యాస , వాల్మీక , శ్రీ హర్షుడు , విశాఖ దత్తుడు , భారవి , శూద్రక , దండి , హర్షవర్ధనుడు , మాఘుడు , బాణుడు ,భోజుడు ,కవిరాజు , కల్హణుడు , గౌడ డిండిమ భట్టు మొదలైన కవులు లతో పాటుగా అలంకార శాస్త్ర రచయితులైన దండి , ఉద్భుటుడు , వామనుడు , ఆనందవర్ధనుడు , రాజశేఖరుడు ,రుద్రుటుడు , అభినవ గుప్తుడు , విశ్వనాధుడు , వామనభట్టు , బాణుడు , మధుసూదన సరస్వతి , జగన్నాధ పండితరాయులు గురించి వివరణ కూడా పొందుపరిచారు .

అదే విధంగా కవియిత్రులు గంగాదేవి , ప్రణయ కవియిత్రి మోరిక , స్వభావోక్తి కవియిత్రి మురళ , నంజన గూడు తిరుమలాంబ , రామ భద్రాంబ , పద్మా వతి , గౌరీ వారి విశేషాలతో పాటు నాట్యం , సంగీతం కళలకు తమ రచనల ద్వారా వన్నె తెచ్చిన కవులు , పండితులు భరతముని , జయదేవుడు , జాయపసేనాని, సింగభూపాలుడు . కొమారగిరి రెడ్డి,నారాయణతీర్ధులు మొదలైన వారి జీవిత విశేషాలు , రచనల వివరాలు పొందుపరిచారు .

అపర శంకరులు . శంకర భాగాత్వాదులు మొదలుకొని శతావధాని గణేష్ వరకు ఎందరో సంస్కృత పండితుల సమాచారం పొందుపరిచారు రచయిత . కేరళలో కాలడి గ్రామంలో జన్మించిన అపర శివావతారులే ఆది శంకరాచార్యులు . అద్వైత మత స్థాపనాచార్యులు , త్రిమతాచార్యులలో ప్రధములు , శంకరాచార్యుల బాల్యం గురించి , గురుదర్శనం , స్తోత్రరత్నాలు , అద్వైతం మొదలైన ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి . అర్ధ శాస్త్ర రచయిత కౌటిల్యుడు విశేషాలు , భరత నాట్య సృష్టి కర్త భరతముని వివరాలు , భరతముని రచించిన నాట్య శాస్త్రాన్ని పి.యస్ .అప్పారావు తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని అందుకున్నారు .

క్రీ.పూ 1వ శతాబ్దానికి చెందిన ఘటకర్పకుడు గురించి వివరణ ఉంది . భాసుడే ఘటకర్పకుడు అనే ప్రచారం ఉంది అని , అది నిజం కాదు అనే వివరణ కూడా రచయిత ఆ పుస్తకంలో ఇచ్చారు . ఘటకర్పకుడికి యమక చక్రవర్తి అనే బిరుదు కూడా ఉంది . బౌద్ద వేదాంత కవి అశ్వ ఘోషుడు గురించి సమాచారం విపులంగా తెలియజేశారు . తెలుగు సాహిత్యంలో శ్రీనాధుడి పేరు సుపరిచితమే . శ్రీహర్షుడు సంస్కృతంలో రచించిన నైషధీయ చరిత్రను శ్రీనాధుడు తెలుగులోకి అనువదించాడు . అలాగే సంస్కృతం నైషదీయంలో శ్రీహర్షుడు మంత్ర శాస్త్రాన్ని నిక్షిప్తం చేశాడని మహా పండితుడు కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప వ్యాఖ్యానం రాశారు .

మహా కవి శూద్రకుదు , ఈయన నాటక నవలాకారుడు ,3 వ శతాబ్దానికి చెందినవాడు . శూద్రక అనేది కలం పేరు . అభీర రాజులలో ఒకడై ఉంటాడని ఊహ . ప్రకరణ రచనకు ఆద్యుడు శూద్రకుడు . అలాగే మృచ్చకటికం గురించి , నామ ఔచిత్యం గూర్చిన వివరణ కూడా తెలియజేశారు రచయిత . విశాఖ దత్తుడు అనగానే ముద్రారాక్షసం నాటకం గుర్తుకు రాక మానదు . ఆయన దేవీ చంద్ర గుప్తా నాటకం అభిసారికా వంచితం మొదలైన నాటకాలను కూడా రాశాడు . అలాగే విశాఖ దత్తుడు అర్ధ , నాట్య , న్యాయ , రాజనీతి శాస్త్రాలలో నిష్ణాతుడు .

పాల్కురికి సోమన గురించి తెలియని తెలుగు వారు అరుదు . కాని ఆయన సంస్కృతి పాండిత్యం అంతగా తెలియక పోవచ్చు . సోమనాధుని “వీర శైవాగ్రేసరుగు” అంటారు . బసవేశ్వరుని చరిత్రను పురాణంగా రాసి కొత్త దారి తీశాడు . చరిత్రకు పురాణ వైశిష్ట్యతను కలిగించిన మొదటి కవి పురాణ కర్త సోమన . ఎవరైనా ఏ పుస్తకం మీదనైనా మంచి వ్యాఖ్యానం రాస్తే మల్లినాధ సూరి వ్యాఖ్యానంలా ఉంది అంతం పరిపాటి . ఈయన 1350- 1450 కాలంలోని వాడు . కాళిదాసు కుమారా సంభవం , భారవి కిరాతార్జునీయం , మాఘడు , హర్షుడు వారి కావ్యాలకి వ్యాఖ్యానాలు రాసాడు సూరి .

రేడియోలో సంస్కృత పాఠాలు బోధించిన సర్వోదయ ప్రచారకులు కేశిరాజు వెంకట అప్పారావు 1913 మార్చి 14 న తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నంలో జన్మించారు . తెనాలి నుండి వెలువడే సామ్య యోగం ‘సర్వోదయ పక్ష పత్రికకి గౌరవ సంపాదకులుగా సేవ చేశారు . వీరి కావ్యాలు పంచవటి , గంగాలహరి . వీటిని తెలుగులోకి అనువాదం చేసారు . బృందావనం అనే కావ్యాన్ని హిందీ , తెలుగు , సంస్కృతి భాషలలో రచించి తమ ప్రతిభను చాటుకున్నారు . చివరి వ్యాసంగా శతావధాని గణేష్ పరిచయం వివరాలతో ముగుస్తుంది . సంస్కృత , కన్నడ , ఆంద్ర భాషలలో శతావధానం చేసి ఆశు కవిత్వంలో దిట్ట . అవధానాలతో పాటు శతావధాన శారద , శతావధాన శ్రీవిద్య , శతావధాన శాశ్వత గ్రంధాలను రాశారు . షేక్ స్పియర్ రాసిన నాటకం హామ్లెట్ కు కన్నడ అనువాదంగా హొరాషియో రాసి , తానే ముఖ్య పాత్ర పోషించారు .

విరూపాక్ష కవి , సంబందు , మయూరుడు , అమరుక కవి , భట్టి మురారి , వాక్పతి రాజు , దిజ్నాగుడు , పరిమళ పద్మ గుప్తుడు , రుమ్యకుడు , జినరత్న , వామన భట్ట బాణుడు , నంజన గూడు , తిరుమలాంబ , నుదురుపాటి వెంకన్న , రాజవర్మ , శొంటి భద్రాద్రి రామ శాస్త్రి మొదలైన కవులు సమాచారం కూడా పొందుపరిచారు . అలాగే కాళిదాసు కుమారా సంభవం కావ్యాన్ని కన్నడంలోకి అనువాదం చేసిన కవి ఎవరు ?, జైన తీర్ధం కురులలో చివరి వాడైన మహా వీరుని జీవితం పై వచ్చిన మొదటి గ్రంధం ఏది ?, అభినవ కాళిదాసు అని ఎవరిని పిలుస్తారు ?, షేక్ స్పియర్ నాటకాలను సంస్కృతంలోకి అనువదించిన రచయిత ఎవరు ?, సంస్కృతంలో ఉత్తరాలు రాసిన రచయిత పేరేమిటి ? ఇత్యాది ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పక చదవాల్సిందే .

ఇది వరకు వచ్చిన “పూర్వ ఆంగ్ల కవుల చరిత్ర పుస్తకం ఆంగ్ల సాహిత్యానికి ఒక కర దీపికగా లభించిందో ,ఈ పుస్తకం పేర్కొన్న కవులు, రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకత కలిగిన వారే . సంస్కృత సాహిత్యాన్ని అభిమానించే వారికి ఈ గ్రంధం అపురూప కానుక . సంస్కృత సాహిత్యాన్ని చదవాలి అనుకునే వారికి ఈ గ్రంధం ఒక కరదీపిక అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు .

– అరసి

ప్రతులకు :

గబ్బిట దుర్గా ప్రసాద్  

శివాలయం వీధి  ,ఉయ్యూరు  

కృష్ణా జిల్లా

సంచార వాణి:9989066375

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నమస్తే హేమలత గారు -”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ” గ్రంధం పై శ్రీ /శ్రీమతి” అరసి ”గారు ”లోనారసి ”విపులమైన అర్ధ వంతమైన సమీక్ష చేసి  గ్రంధం ఔచిత్యాన్ని ,ప్రస్తుత సమాజానికి దాని అవసరాన్ని ,అందులోని వివిధ విశేషాలను ఆసాంతం ఆస్వాదనీయం గా రాశారు వారికి నా తరఫున సరసభారతి తరఫున కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను ..సమీక్ష రాయించి విహంగ లో ప్రచురించిన మీకు ధన్యవాదాలు . -దుర్గాప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment