స్స్వయంక్రుతాపరాధం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44

44-కవి శిక్ష రాసిన -మొదటి వాగ్భటుడు

జైన  కవి వాగ్భటుడు1121-1156 కాలానికి చెందినా వాడు ,’’వాగ్భటాలంకారం ‘’ రాశాడు .ఇందులో అయిదు పరిచ్చేదాలుంటాయి .కావ్య లక్షణాలు ,హేతువులు ,ప్రయోజనాలు ,కవి శిక్ష ,కవిసమయాలు ,కావ్య భేదాలు ,దోషాలు గుణాలు ,భాష ,అలంకారం ,రీతులు ,చిత్రబంధ కవిత్వం నాయికా నాయక భేదాలు రసం మొదలైన వన్నీ  చర్చించాడు కావ్యాలను మూడు రకాలుగా చెప్పాడు ఛందస్సుతో ఉన్నవి ఛందస్సు లేనివి ,మిశ్రమాలు .రీతులలో గౌడీ .వైదర్భి లనే గ్రహించాడు .లక్షణాలకు ఉదాహరణలు తానె స్వయం గా రాయటం వాగ్భటుని ప్రత్యేకత .’’నేమి నిర్వాణం ‘’అనే మహాకావ్యాన్ని రాశాడు .ఇతని అలంకార గ్రంధానికి సింహ దేవ గని వ్యాఖ్య రాశాడు .ఇనో గమ్మత్తైన విషయం తన అలంకార గ్రంధానికి తానె వ్యాఖ్యానం రాసుకోవటం .

45-ఛందోశాస్త్రం రాసిన-  రెండవ వాగ్భటుడు

పద్నాలుగవ శతాబ్దికి చెందిన మరొక వాగ్భటుడు ఉన్నాడు .ఇతనిని రెండవ వాగ్భటుడు అంటారు .ఈయనా  ఆలంకారికుడే .’’కావ్యాను శాసనం ‘’రాశాడు .ఇది సూత్ర పద్ధతిలో సాగిన రచన .తానె స్వయం గా ‘’అలంకార తిలకం ‘’అనే వ్యాఖ్యానాన్ని రాసుకొన్నాడు .ఇది కాక చందోసాసనం అనే ఛందస్శాస్త్రాన్ని కూడా రాశాడు .ఋషభ దెవక చరిత్ర అనే మహాకవ్యాన్నీ రాశాడు .

అష్టాంగ సంగ్రహ  అష్టాంగా హృదయ అనే ఆయుర్వేద గ్రంధాలను  రాశాడు వాగ్భటుడు .యితడు బౌద్ధుడు .చరక ,శుశ్రుత సంహితలలో వాగ్భాటుని గురించి ఉంది .ఆనాటి సింధు ఈనాటి పాకిస్తాన్ లో ఉండేవాడు .సింహగుప్తుని కుమారుడు .అవలోకితుని శిష్యుడు .ప్రఖ్యాత ఆయుర్వేద శాస్త్ర కర్త ర్త చరకుని శిష్యుడు .మూడు వేల సూత్రాలను రాశాడు .ఎనభై అయిదు శాతం వ్యాధులు ఆయుర్వేద  సూత్రాలను పాటిస్తే డాక్టర్ తో పనిలేకుండా నయమవుతాయని మిగిలిన పది హీను శాతం వాటికే మందులు వాడాల్సి వస్తుందని తెలియ జేశాడు .శుశ్రుతుడు శస్త్ర వైద్యం లో దిట్ట .చరకుడు ఆయుర్వేద మేధావి .వాగ్భాటుడు ఆయుర్వేద సార సంగ్రహం చేసిన వాడు ఈ ముగ్గురిని ఆయుర్వేద త్రయం అంటారు .

అష్టాంగ హృదయ సంహితను వాగ్భాటుడు కమ్మని కవిత్వం లో రాశాడు .ఇందులో ఏడువేల నూట ఇరవై శ్లోకాలున్నాయి .ఎనిమిది విధాల వైద్యం గూర్చి చెప్పాడు .అష్టాంగా హృదయ సంహిత ఆయుర్వేదం లో వచ్చిన మాస్టర్ పీస్ గ్రంధం .ఇది అనేక దేశాలలో ఆయా భాషలలో అనువాదం పొందింది . అష్టాంగ  నిఘంటు ,అష్టాంగ సార ,భావ ప్రకాశ ,ద్వాదసార్ధ నిరూపణ ,కాల జ్ఞాన ,పదార్ధ చంద్రిక ,శాస్త్ర దర్పణ ,శత శ్లోకి ,వాగ్భటీయ ,వామన కల్ప ,మొదలైనవి రాసినట్లు తెలుస్తోంది .

46- రాజ తరంగిణి కర్త –కల్హణుడు

కాశ్మీర రాజుల చరిత్ర ‘’రాజ తరంగిణి ‘’రాసిన కల్హణుడు కాశ్మీర రాజు జయ చంద్రుని ఆస్థానకవి .కాలం 1127-1149.ఏంతో శ్రమించి రాజుల చరిత్రలను సేకరించి అధారితటేటివ్ గా రాజ తరంగిణి రాశాడు .ఇందులో ఎనిమిది తరంగాలున్నాయి .మదటి మూడు తరంగాలలో ఊహలు అపోహలు కలగా పులగం గా ఉంటాయి మిగిలినవి పూర్తీ చారిత్రిక సత్యాలే .తండ్రి అమాత్య చంపకుడు .1148-49మధ్య రాజ తరంగిణి రాశాడు ..తండ్రి కాశ్మీర రాజు హర్షుడి ఆస్థానం లో ద్వారపతి .తర్వాత మంత్రి అయ్యాడు .శైవమతావలంబ కుటుంబం .అయినా బౌద్ధం అంటే అభిమానం .హర్ష రాజు దుర్మార్గుడు .తిరుగుబాటు జరిగి దేశం అల్లా కల్లోలమైంది హర్ష వధ తర్వాత తండ్రి పదవి ఊడింది .కల్హణుడు ఎక్కడా రాజాస్థానం లో ఉన్న దాఖలాలు లేవు .

రాజతరంగణీయం

ఇందులో 7826 శ్లోకాలున్నాయి శాంత రస ప్రధానం గా కల్హణుడు రాశాడు .తానుకొత్తగా చెప్పింది ఏదీ లేదని పూర్వపు వాటినే గుర్తుకు తెస్తున్నానని చెప్పాడు .తనకు ముందున్న పదకొండు రచనలే రాజతరంగిణి కి ఆధారం అన్నాడు .ఇందులో నీలమత పురాణం ,క్షేమేంద్రుని నృపావలి ,హెల రాజు రాసిన పార్దివా వలి మొదలైనవి .ఎన్నో శాసనాలను పత్రాలను పరిశోధించి రాసిన ఉద్గ్రంధం ఇది .మొదటి నుంచి తన కాలం వరకు ఉన్న రాజుల చరిత్రలన్నీ సేకరించి రాశాడు .ఏది చెప్పినా నిష్పాక్ష పాతం గా చెప్పాడు .ఆ నాటి రాజకీయాలను ఉద్యోగులను వారి పాలన లో డొల్ల తానాన్ని బయటికి తీసి నిర్భయం గా చెప్పాడు .రాజకీయ ఆర్ధిక సామాజిక  నైతికక ధార్మిక న్యాయ విషయాలన్నీ చర్చించాడు .యూరపు దేశం లోని మధ్యయుగ చరిత్ర ఉన్నట్లే రాశాడని అభినందించారు .స్టెయిన్ అనే ఆంగ్లేయుడు 1900లో ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రచురించాడు .1617లో జహంగీర్ కాలం లో హైదర్ మాలిక్ పర్షియన్ భాషలోకిపా శికం గా  అనువాదం చేశాడు  ఆధునిక  యుగం లో రంజిత సీతా రామ పండితుడు పూర్తిగా అనువాదం చేశాడు  పిరదౌసి రాసిన షానామా కంటే రాజ తరంగిణిలో వాస్తవం పాలు ఎక్కువ .

కల్హణుడు వ్యాకరణ పారంగతుడు .ఇతని గొప్పతనాన్ని’’ మంఖ పండితుడు’’మెచ్చాడు .అర్ధ ,రాజనీతి బౌద్ధ శాస్త్రాలను ఆకళింపు చేసుకొన్నాడు .చక్కని కధనాన్విత శైలి  లో రాశాడు .కధనాలను కావ్య పద్ధతిలో రాశాడు .రసాన్ని ప్రకటించేటప్పుడు నేల విడిచి సాము చేయలేదు .వైదర్భీ రీతిలో నూత్న శబ్ద భాండారం తో రసజ్నులను మెప్పించాడు .కాశ్మీర పదజాలం సంస్కృతం లో ఎక్కువగా చేరింది .

అశోకుడి ముందు యాభై రెండు రాజుల చరిత్ర గురించి వివరించాడు .ఒక్కో రాజు పాలనా కాలం సుమారు యాభై ఏళ్ళుగా గ్రహించాడు .అశోకుడిని వెయ్యేళ్ళు ముందుకు నేట్టాడుకాని మౌర్య వంశస్తుడే అన్నాడు .కుషాన రాజుల చరిత్రనూ సాధికారం గా రాశాడు. మిహిరకులుడు శివాలయం నిర్మించాడని బ్రాహ్మణులకు భూరి దానాలిచ్చాడని కనిష్కుడికాలం లో ఆచార్య నాగార్జుండు ఉన్నాడని ,మాత్రుగుప్త రాజు కళా పోషకుడు ,కవి అని అతని ఆస్థానం లో ‘’మేంఠకవి ‘’ఉండేవాడని ,ఆయన హయగ్రీవ వధ  రాశాడని చెప్పాడు .ఉత్పల వంశ రాజులలో అవంతి వర్మ మొదటి రాజు అని అతనికాలం లోనే కాశ్మీర దేశ చరిత్ర ఐతిహాసిక సత్య సమన్వితం గా రచించాడు .కాశ్మీర రాజు హర్షుడు నాలుగు వేల బుద్ధ దేవాలయాలను విగ్రహాలను ధ్వంసం చేసినట్లు చెప్పుకొన్నాడు .కాశ్మీర రాజుల చరిత్రను సాధికారం గా రాసిన మొదటి కవి కల్హణుడు .

మరో కవితో ఈ సారి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -43

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -43

43- మహా రాజ కవి –భోజుడు

భోజరాజు వేదాంతి ,బహుశాత్రవేత్త .మధ్య భారతం లో మాల్వా సంస్థాన రాజు .పారమార్  వంశానికి  చెందిన వాడు .1055వరకు రాజ్యపాలన చేశాడు .’’రాజా భోజా ఆఫ్ దార్ ‘’అని ఆప్యాయం గా పిలుస్తారు .భోజ అంటే సంపూర్ణమైన సర్వ  సంపన్నమై సరళమైన వాడని అర్ధం .మహాభారత యుద్ధం లో భోజ వంశీయ రాజులు పాల్గొన్నారు .భోజుడు అనేక దేవాలయాలు నిర్మించాడు అందులో ముఖ్యమైనది భోపాల్ లో కట్టించిన ‘’భోజేశ్వర దేవాలయం ‘’.భోజేశ్వర పట్టణం ను భోపాల కు ముప్ఫై కిలో మీటర్ల దూరం లోబెట్వా నదీ తీరం లో  నిర్మించాడు .భోజ శాల నిర్మించి అందులో అతిపురాతన తాళ పత్రా గ్రంధాలను సేకరించి ఉంచాడు .ఇది గొప్ప విద్యాకేంద్రం గా విలసిల్లింది. ఈనాటి దార్ లో భోజుడు నిర్మించిన సరస్వతీ దేవాలయం ఉన్నది .

భోజ రాజీయం

భోజుడు ఘూర్జర రాజ వంశానికి చెందిన వాడు .వేదాంతం కవిత్వం జంతుశాస్త్రం ,యోగ శాస్త్రం భాషా శాస్త్రం యోగ శాస్త్రం ధనుర్ శాస్త్రాలలో గొప్ప గ్రంధాలు రచించాడు .భోజుడికాలం లో మధ్య భారతం సువర్ణ యుగం గా పేరుపొందింది గుజరాత్ రాజు సోలంకి తో కలిసి సోమనాదాలయాన్ని నిర్మించాడు .1026-1042కాలం లో ఈ బృహత్ నిర్మాణం జరిగింది .భోజపురం నిర్మించాడు ఈనాటి భోపాల్ కూడా ఆయన కట్టించినదే .భోజ పట్నం లో ధనపాలుడు అనే జైన  పరివ్రాజకుడు ఉండేవాడు .ఈయన బోధనలతో యజ్న యాగాదులలో పశు హింసను ఆపెయించాడు .అంతేకాదు భోజుడు వేటా డటానికీ ఫుల్ స్టాప్  పెట్టాడు .సైనిక బలాన్ని బాగా వృద్ధి చేసుకొని చాళక్య రాజుఅపై దండ యాత్ర చేసి ఓడించి రాజ్య వ్యాప్తి చేశాడు .సుల్తాన్ మహమ్మద్గజనీ తో సౌరాస్త్రలోని సోమనాధ దేవాలయం వద్ద భీకర పోరాటాలు చేశాడు .భోజ సైన్య ప్రతాపానికి గజని పలాయనం చిత్త గించాడు .శాకంబరి రాజు చః మానస్ ను ఓడించాడు .తర్వాత చండేలా రాజులు రాష్ట్రకూటులు మొదలైన వారంతా కలిసి భోజునిపై దండెత్తారు .సోలంకి రాజు భీమదేవుడి రాజ్యాన్ని ఆక్రమించాడు భోజుడు .భీముడు హయహయులతో చేతులుకలిపి భోజుని ఎదిరించాడు .హయహాయ రాజు కర్నాను సోలన్కిని ధైర్యం గా ఎదుర్కొని భోజుడు పోరాడాడు కాని ఒక బాణం వచ్చి తగిలి భోజుడు వీరమరణం పొందాడు .ఘజనీ ముఠాను సోమనాధ దేవాల సమీపానికి రానీకుండా తీవ్రం గ అడ్డుపడ్డాడు భోజమహా రాజు .భోజునిపై ఒక చాటువు ప్రచారం లో ఉంది –

‘’అద్య ధారా సదా ధారా సదాలంబ సరస్వతీ –పండితాః మండి తాః సర్వే భోజ భువనం గథెహ్ ‘’దీని అర్ధం ‘’ఇవాళ ధారా రాజ్యం ఎల్లప్పుడూ అండగా ఉంది సరస్వతీదేవి భూమిమీద కవులందరినీ సత్కరించే భోజునికోసం ఎదురు చూస్తోంది .

భోజుడు ఓడిపోయిన తర్వాత కవులు –

‘’అద్య ధారా నిరాధారా నిరాలంబ సరస్వతీ –పండితాః ఖండితాః భోజ రాజే దివం గతే ‘’దీనిభావం –‘’ఈ నాడు ధారా రాజ్యానికి రక్షకులే లేరు .సరస్వతీదేవికే సంరక్షణ లేదు .పండితులందరూ భోజుడు దివికి చేరగానే ఎక్కడివారు అక్కడే పారిపోయారు .భోజుడు మొత్తం 84 గ్రంధాలు రచించాడు .పరిపూర్ణమైన కవిత్వ గ్రంధాలు రాశాడు .భోజునిది గొప్ప కవిత్వం గా పేరు తెచ్చుకొన్నది .పతంజలి యోగ శాస్త్రానికి భాష్యం రాశాడు .సివిల్  ఇంజినీరింగ్ గురించి సమరాంగణ సూత్రధార రాశాడు .ఇందులో దేవాలయ ,నిర్మాణం కోటల నిర్మాణం  ,విగ్రహ నిర్మాణం ఇళ్ళ నిర్మాణం మొదలైన సమస్త విషయాలున్నాయి .తత్వ ప్రకాశ అనే తాంత్రిక గ్తంధం ,రస రాజ మ్రుగాంకం అనే లోహశాస్త్ర గ్రంధం ,యుక్తి కల్ప తరు అనే నౌకానిర్మాణ శాస్త్రం  ,న్యాయ శాస్త్రం పై ధర్మ శాస్త్ర వ్రుత్తి ,చంపూ రామాయణం మొదలైనవి భోజ రచనలు .అన్నీ సుప్రసిద్ధాలే బహు శాస్త్ర కోవిదుడు అయి నందు వల్లనే ఇలాంటి గ్రంధాలూ రాయగలిగాడు .

కవిపండిత పోషకుడై సాహిత్య ప్రేమికుడై నిరతాన్న దాత అయి ఆశ్రయించిన వారి కొంగుగుబంగారమై వర్ధిల్లిన రాజు భోజుడు .మన కృష్ణ దేవరాయల ఆస్థానం లో కవి పండితులున్నట్లే భోజాస్థానం లోను కాళిదాసాది కవులుండేవారు రాయలూ కవే . భోజుడూకవే .అందుకే రాయలను ఆంధ్రభోజుడు అన్నారు .భోజుని చంపూ రామాయణం వాల్మీకమే .దానిపై తన భక్తిని చాటుకొంటూ భోజుడు –‘’వాల్మీకి గీత రఘుపున్గవ కీర్తి లేశైః-తృప్తిం కరోమి కధమప్యాదునా బుదానాం ‘’-గంగా జలైర్భువిని భాగీరధ యత్న లబ్ధైహ్ –కిం తర్పణం నవిదధాతి నరః పిత్రూనాం’’అన్నాడు అంటే భగీరధుడు తన పితృదేవతలకు గంగాజలం తో తర్పణ లిచ్చి తరింప జేసినట్లు వాల్మీకి మహర్షి రాసిన రామ చరిత్రనే ఆధారం గా సజ్జనులకు తృప్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నాను .’’

భోజునికవిత్వం రస రమ్యమైనది .వర్ణనలను అద్భుతం గా చేశాడు రుతువర్ణనలు  గొప్పగా ఉంటాయి అనుప్రాస యమకాలన్కారాలను బాగా ఉపయోగించుకొన్నాడు .ఆపాత మధురమైన కవిత్వం తో విందు చేస్తాడు .గద్యమూ హృదయం గా రాశాడు. లలితం గా కర్ణ పేయం గా కవిత్వం ఉంటుంది .అలాంటి శబ్దాలనే ఎన్నుకొంటాడు .వైదర్భీశైలికే ఎక్కువ విలువ నిచ్చాడు శ్లేషనూ సమాదరించాడు .అంత్య ప్రాసలతో అలరిస్తాడు –

‘’ఏనాం పురాణ నగరీం నగరీతి సాలాం-సాలాభి రామ భుజ నిర్జిత యక్ష రాజః –హేలాభి భూత జగతాం రజనీ చరా –ణాంరాజా చిరాదయితి రావణ నామ దేయః ‘’.వాలి వధ తర్వాత తార విలాపం లో శోకాన్ని బాగా ప్రదర్శింప జేశాడు –

‘’నాహం సుకేతు తనయా నచ సప్త పాళీ –వాలీ నచ త్రిభువన ప్రదిత ప్రభావః

తారాస్మి వజ్ర హృదయా విశిఖర భేద్యా –ధన్వీ కదం భవసి రాఘవ మామ విధ్వా’’రాముడితో తార అన్నమాటలివి –రామా నేను తాటకను కాను సప్త తాళ వ్రుక్షాలనూ అంతకంటే కాను  .త్రిభువన పరాక్రమ శీలి వాలినీ కాను .వజ్ర హృదయం ఉన్న తారను .నన్ను నువ్వు ఏమీ చెయ్యలేవు. నన్ను చంపే వరకు ధన్వి అనే పేరు నీకు సార్ధకం కాదు ‘’

రామాయణ చంపువు ను ‘’భోజ చంపు అంటారు’’. చంపు అంటే పద్యం వచనం కలిసిఉన్న కావ్యం అని తెలిసిందేకదా .ఆంద్ర దేశం లో పూర్వం గురుకుల విద్యలో రామాయణ చంపుతోనే విద్యార్ధి మొదలు పెట్టేవాడట .అంతటి ప్రశస్తి భోజుని చంపువుకున్నది  ద్రావిడ కర్నాటకాలలో కూడా  దీనికి వ్యాప్తి, ఆసక్తి ఎక్కువ .దేనీ నారాయణ ,రామ చంద్ర కామెశ్వర ఘనశ్యామ లు రాసిన టీకాలు ఉన్నాయి .

మరోకవితో కలుద్దాం

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -42

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -42

42-వ్యంజనా వ్రుత్తి  కారుడు -ముమ్మటుడు

ముమ్మటుడు 1050-1100వాడు .అభినవ గుప్తుడి శిష్యుడనని  తానే  చెప్పుకున్నాడు .’’కావ్య ప్రకాశం ‘’అనే అలంకార గ్రంధం రాశాడు .సాహిత్య శాస్త్ర ములో ముమ్మటుడికావ్యానికి ప్రత్యెక స్థానం ఉంది .ఇతని జన్మ స్థలం తల్లిదండ్రుల గురించి తెలియదు .

ముమ్మట సమ్మత కావ్యత్వం

కావ్య ప్రకాశం లో ముమ్మటుడు పూర్వ అలంకార వాదుల మార్గాన్నే అనుసరించాడు .కాని ధ్వని సిద్ధాంతాన్ని బాగా సమర్దించాడు . ఈ సిద్ధాంతాన్ని ఎదిరించిన వారికి  దిమ్మ తిరిగే సమాధానాలు చెప్పి యుక్తులతో ధ్వని కి అశేష ప్రాచుర్యం సాధించాడు .ఆనంద వర్ధనుడి ధ్వని  సిద్ధాన్తానికి తిరుగు లేని ప్రచారం ముమ్మటుని వల్లనే సాధ్యమైంది .భామహుడు కూడా ధ్వని వాదియే అని నిరూపించాడు .కావ్య ప్రకాశం లోని భాగాలను ‘’ఉల్లాసాలు ‘’అన్నాడు ఇందులో నూట నలభై కారికలున్నాయి .మొదటి ఉల్లాసం లో మామూలుగానే కావ్య ప్రయోజనాలు ,కావ్య హేతువులు ,భేదాలు ,కావ్య భేదాలు చెప్పాడు .రెండులో శబ్ద వ్యంజనం గురించి చెప్పాడు . .మూడులో అర్దీ వ్యంజన గురించి చెప్పాడు . నాలుగులో రసాది ధ్వని చర్చ చేశాడు .అయిదులో వ్యంజన యొక్క శక్తిని వివరించాడు .ఆరవ ఉల్లాసం లో చిత్రకావ్య ప్రస్తావన చేశాడు .ఏడులో గుణ దోష చర్చ చేశాడు .ఎనిమిదిలో గుణం అంటే ఏమిటో తెలియ జేశాడు .తొమ్మిదో ఉల్లాసం లో శబ్దాలంకారాలను వివరించాడు .పదిలో అర్దాలంకార వివరణ ఉంది .’’తద దోషౌ శబ్దార్ధౌ సగుణా నవలం కృతీ పునః క్వాపి ‘’అని గుణాన్ని నిర్వచించాడు .దోషాలు లేకుండా గుణ సహితం గా కావ్యం ఉండాలని దండి చెప్పినదాన్ని దండిగా సమర్ధించాడు .దీనికి బలీయం గా దోష చర్చను చాలా విపులం గా చేసి ఆ దారి పట్టవద్దని హెచ్చరించాడు .ఎక్కువ  గా అలం కారం రం మీద ఆధారపడలేదు .అందుకే ‘’అనలం కృతీ పునః క్వాపి’’అని సమర్ధించుకొన్నాడు .కాని అలంకార భేదాలను మాత్రం విపులం గా చర్చించాడు .ముమ్మటుడి కావ్య ప్రయోజనాల ,కావ్య హేతువుల గురించి చేసిన చర్చ అందరినీ  ఆకర్షిం చింది .అతని శబ్ద శక్తుల వివరణ ప్రాచుర్యం పొందింది ..

ముమ్మటుడి కావ్య ప్రాకాశానికి మొట్ట మొదటి వ్యాఖ్యానం మాణిక్య చంద్రుడు అనే జైన మతాచార్యుడు 1159 లో రాశాడు .తర్వాత చాలా మంది రాశారు .దాదాపు యాభై టీకలు రాశారు .భగవద్గీతకు తప్ప ఇన్ని టీకాలు మరి ఏ ఇతర గ్రన్ధానికీ లేదని అంటారు .టీకలకు వివరణలు ,వివరణలకు మళ్ళీ టీకలు రాస్తూనే ఉన్నారు .ప్రతి ఇంటిలో ముమ్మటుడి ‘’కావ్య ప్రకాశం ‘’ ఆవరించి ఉంది అని ఒక శ్లోకం ప్రచారం లో ఉంది –‘’కావ్య ప్రకాశస్య  కృతాగృహే గృహే టీకా తదాప్యేష తధైవ దుర్గమః ‘’-

43-  అభివ్యక్తివాద వ్యాపకుడు- అభినవ గుప్తుడు

అభినవ గుప్తుడు మహా మేధావి ,గొప్ప దార్శ నికుడు గా ,ఆలంకారికుడు గా  ప్రసిద్ధుడు .కొత్త గ్రంధాన్ని రాయలేదుకాని ఇతర గ్రంధాలకు గొప్ప వ్యాఖ్యలు రాశాడు .భరతుని నాట్య శాస్త్రానికి ‘’అభినవ భారతి ‘’వ్యాఖ్యానాన్ని ,ఆనంద వర్ధనుడి ‘’ధ్వన్యా లోకం ‘’కు ‘’లోచన ‘’ వ్యాఖ్యను రాసిన మహా పండితుడు .స్వతంత్ర ఆలోచనలున్న వాడుగా సుప్రసిద్ధుడు

అభినవ గుప్తీయం

ధ్వన్యాలోకం లో అస్పష్టం గా ఉన్న సిద్ధాంతాలను స్పస్టపరచి  పుస్ష్టి కల్గించాడు .రస ధ్వనికి ఆతనుచేసిన వివరణ చిర స్థాయిగా నిలిచిపోయి  ఆనంద వర్ధనుడిని చిరంజీవి ని చేసింది .అభినవ గుప్తుడు ‘’అభి వ్యక్తి వాదం ‘’అనే దాన్ని సిద్ధాంతీకరించాడు .శైవ అద్వైతం లో ఉన్న ఆనంద వాదం  భూమికగా అభినవ గుప్తుడు  రసాన్ని చర్చించాడు .విభావ ,అనుభావ మొదలైన వాటిద్వారా సామాజికు లలో ఉన్న వాసనా రూపం లో రసం అభి వ్యక్తం అవుతుందని ,రసం వలన కలిగే ఆనందం బ్రహ్మానంద సహోదరమైనదని తిరుగు లేని తీర్పు నిచ్చాడు .యితడు రాసిన ‘’ధ్వన్యాలోకం ‘’ ‘’చాలా ప్రౌఢ రచన .ఈ వ్యాఖ్యానమే తర్వాతి ఆలం కారులకు  మార్గ దర్శనం చేసింది .

పందొమ్మిది మంది మహా పండితుల వద్ద అభినవ గుప్తుడు శాస్త్ర విద్యలను నేర్చాడు .భట్ట ఇందురాజు దగ్గర ధ్వని సిద్ధాంతాన్ని ,భట్ట తౌతుడివద్ద నాట్య శాస్త్రాన్ని ,అభ్యసించాడు .శైవ సంప్రదాయం లో ‘’ప్రత్య భిజ్న’  గ్రంధం  రాశాడు .గుప్తుడికి  తండ్రియే గురువు .తల్లి విమల ,తండ్రి నరసింహ గుప్తుడు .తాత వరాహ గుప్తుడు .ఈతని పూర్వులు పంజాబ్ లోని ‘’దో ఆబ్ ‘’ప్రాంతం వారు .తర్వాత కాశ్మీరం చేరుకున్నారు .గుప్తుడు శైవ ఆగమాలలో నిష్ణాతుడు .తంత్ర శాస్త్రం లోనూ దిట్టయే.శైవానికి చెందిన నలభై ఒక్క  గ్రంధాలను రాశాడు .ఇందులో పదకొండు మాత్రమె లభ్యం .శైవ ఆగమాలమీద, స్తోత్రాల మీద అనేక వ్యాహ్యలు రాశాడు .భట్ట తౌతుడు రాసిన ‘’కావ్య కౌతుకం ‘’కు ‘’వివరణ ‘’రాశాడు అభినవుడు .

అభినవ గుప్తుడికి పూర్వం   ధ్వన్యా లోకానికి ‘’చంద్రిక ‘’అనే వ్యాహ్యనం ఉండేదని ,దాన్ని అభినవ గుప్తుని అన్న రాశాడని వారి వంశం లో దాన్ని పారం పర్యం గా అధ్యయనం చేసేవారని ప్రచారం లో ఉంది. చంద్రిక చాలదని లోచన వ్యాఖ్య రాశానని అభి చెప్పాడు .ముమ్మటుడు అభినవ గుప్తుని ‘’ఆచార్య పాదుడు’’అని కీర్తించటాన్ని బట్టి శిష్యుడే అని నిర్ధారించారు .క్షేమేంద్రుడు కూడా అభినవుడు తన గురువు అన్నాడు .శిష్య బృందం తో  అభినవ గుప్తాచార్య పరంపర అభి వృద్ధి చెందింది

అభినవ గుప్తుడు తానూ ”యోగిని ”కుమారుడు అని చెప్పుకొన్నాడు వీరు భైరవారాధకులు ఇతని బావ  వరుస అయిన కర్ణుడు చిన్నప్పుడే శైవాన్ని ఆవ పోసన పట్టాడ ట పెద్దాక్క  అమ్బనిచ్చి వివాహం చేశారు వీరిద్దరికీ ”యోగీశ్వర దత్తు ”జన్మించాడు .ఇతదు యోగం లో పండి పోయాడు  కనుక యోగీశ్వరుడ నిపించుకొన్నాడు రామ మ దేవుడు, క్షేమ కూడా  అభి శిష్యులే .కర్నుడి  స్నేహితుడు మంద్ర రాజు బాగా ఆదుకొన్నాడు  మంద్రుని బంధువు  ”వాతాసిక ”రచనలకు ప్రేరణ నిచ్చింది .పరిసరాల పరి రక్షణ చేస్తూ అభినవ గుప్తుడు ఒంటరిగా జీవించాడు  నిశ్చల మనసుతో శైవ తాన్త్రికాలు రాశాడు మధ్య  భారత  నివాసి  అయిన అత్రి గుప్త అనే పూర్వీకురాలు మధ్య భరతం నుండి హిమాలయాల వరకు అంతా  గొప్ప పీఠ భూమి అని చెప్పిందట .వినాశన అనే నది ఉండేదట .శమ్భు నాధుడు అనే గురువు ప్రేరణతో తంత్రలోకం మొదలైన తాంత్రిక గ్రంధాలు రాశాడు

అభినవ గుప్తుడు ఆజన్మ బ్రహ్మ చారిగా ఉండిపోయాడు ముప్ఫై అయిదేళ్ళు సకల శాస్త్రాల అధ్యయనం చేసి దేశాటనం చేశాడు కాశ్మీర్ చేరాడు .”విరా సన ”లో శిష్యుల మధ్య కూర్చున్న చిత్రం ఒకటిఉంది .తన్త్రసార రాశాడు అతని శతకాలు చాలా ఉన్నాయి  అందులో  బోధ పంచ దశిక ,బోదార్ధ కారక ,అనుభవ నివేదన ,అనుభావస్టక  ,క్రమ స్తోత్ర భైరవఅష్టకం ,దేహ స్తిత దేవతా చక్ర స్తోత్ర ,పరమార్ద్ధ వాదాసిక ,మహోప దేశ వింశతిక ,శివ శక్త్యావినాస స్తోత్రాలు ఉన్నాయి

వేదాంత గ్రంధాలు కూడా రాశాడు ఽ అందులోఈశ్వర ప్రజ్ఞాభిజ్న విమర్శన, వ్రుత్తి విమర్శిని ,ఘత కార్పర కులాక వ్రుత్తి కావ్య కౌతుక వివరణ ,పరాత్రిక లఘు వ్రుత్తి ,పర్యంత పనికషణ  ,దేవీ స్తోత్ర వివరణ ఉన్నాయి

  Inline image 1

.Inline image 2

మరో కవిని చూద్దాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-14-  ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చికాకోల్ లో ఎవర్ని పలకరించినా ఏడుపే -అట్టాడ అప్పల నాయు

ఎవుర్ని పలకరించూ, యేడుపే..
నాచిన్ననాటి నుంచి నాకు అక్టోబర్‌, నవంబర్‌ మాసాలంటే భయమేస్తాది! ఈ రెండు మాసాల గండం గడనీయి, దేముడా అని మొక్కేది మాయమ్మ! ఆకాశానికీ, భూమికీ దండం బెట్టీవోడు, మా బాపు! గుండెలరచేతిల పెట్టుకొని ఇంటికీ, పొలానికీ తిరుగాడేవోరు వొరదో, వొరుపో యిరుసుకుపడ్తాదని, అరవయ్యేళ్లనాటి భయం… ఇప్పటికీ పోలేదు. ఇంత పెద్దయ్యాను. నేనూ, నా పిల్లలూ పల్లెనీ, పంట భూముల్నీ వొదిలీసాం. నాగల్నీ, నాగేటి చాలునీ వొదిలీసాం. మట్టి, చేతికి మాత్రమే కాదు మరిదేనికీ అంటకుండా బతికేస్తన్నాం. మార్కెట్‌ చల్లగా వుంటే మా కడుపులో చల్లకి ఢోకా లేదన్నట్టగ, లోకంతోపాటు బతికీడం నేర్చుకున్నాం. లోకమా, యింత మారిపోయింది. కాదు కాదు ఎదిగిపోయింది. (మారడమే యెదగడమనుకుంటున్న మిత్రుల భావనలో కూడా), ఆధునికులమ్మాత్రమేకాదు అత్యాధునికులమయ్యాం. ఆటో ఛార్జీలకంటా తక్కువ ఛార్జీలకి అంతరిక్షంలోకి యెళ్లోస్తన్నాం. సృష్టికి సేస్తన్నాం. ప్రకృతిని యెలగ కావొలిస్తే అలాగ మలుసుకొని మార్కెట్లలోన పెట్టి యాపారం సెయ్యగలగతన్నాం… అయినా, అక్టోబర్‌, నవంబర్‌ మాసాలంటే భయం పోలేదు. ఇంకమరి పోదే టో?
మా తల్లిదండ్రులు పంటలు పోతాయేమోనని మాత్రమే భయపడేవారు, గానీ నేడు బతుకులు పోతాయేమోనని భయపడుతున్నం. హుద్‌హుద్‌ తుఫాను యీ భయాన్ని కలిగించడమేగాక, ప్రకృతికి యెంత దూరంగా బతుకుతున్నామో కూడా తెలయిజేసింది. మన పూర్వీకులు, విద్యుత్‌ లేకుండా, మోటార్లూ, బోర్లూ లేకుండా, చివరికి వేగవంతమైన రవాణా సౌకర్యం గూడా లేకుండా… ప్రకృతి ప్రసాదించిన దానితో జీవించేసేవారు. ప్రకృతిని స్వాధీనం చేసుకొని యేర్పాటు చేసుకున్న ఆధునిక సౌకర్యాలమీద యింతగా ఆధారపడేవారుగాదు. ఈ ఆధునిక సౌకర్యాలేవి అందుబాటవకపోయినా, జీవితమెంత దుర ్లభమో హుద్‌హుద్‌ విలయంతో అనుభవంలోకొచ్చి భయమేస్తాంది. విద్యుత్‌.. ఒక్క దీపాల వెలుగుకే తొలిసారిగా, నా చిన్నపుడు పరిచయమైంది. ఇవ్వాల జీవితంలోని అనేక అవసరాలకు విద్యుత్‌ తప్పనిసరయ్యింది. (ఈ కారణంగానే ధర్మల్‌, అణువిద్యుత్‌ కర్మాగారాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రజా పోరాటాలకు సామాజిక మద్దతు కరవవుతోందేమో!) హుద్‌హుద్‌ దాడికి కూలినవి విద్యుత్‌ స్తంభాలే గానీ ఫలితంగా పల్లెలనుంచి నగరాల దాకా రోజువారీ జనజీవితం కుప్పకూలిపోయింది. వెలుగు కోసం మాత్రమే కాదు (కొవ్వొత్తితో సరిపెట్టుకోగల్రు), కర్మాగారాలూ కార్ఖానాలకే గాదు, నీళ్ళ కొరకు మేడలమెట్లు యెక్కి దిగేందుకు, వాహనాల రవాణా కొరకు, కొసకు చేతుల్లో మోగే సెల్‌ కొరకు విద్యుత్‌ కావాలి. కళింగాంధ్రా కవరేజీ యేరియాలో లేకుండా పోయిందిపుడు! ఈ ఆధునిక సదుపాయాల మీద ఆధారపడడమెంత తప్పనిసరో, యిటువంటి విపత్కాలంలో అంతకెక్కువ నిరాధారులమై విలపిస్తాము.. నీళ్ల కోసం, పాలకోసం, పెట్రోల్‌ కోసం, నిత్యావసర సరకుల కోసం… యెంత విలవిల లాడేం కళింగాంధ్రులు (ఒక్క విశాఖవాసులే కాదు) మీడియాసాక్షిగా అందరూ చూసి వుంటారు. ఈ ఆధునిక సదుపాయాలనేవి, యెంతగా మార్కెట్‌ సృష్టిస్తున్నవో, మార్కెట్‌ యెలా మనుషుల జేబుల్ని చిల్లులు పోడుస్తుందో గూడా, యీ నాల్రోజులూ మీడియా చూపించింది.
చట్టం ముందు అందరూ సమానమే గానీ, కొందరు యెక్కువ సమానమట! ప్రకృతి విలయం ముందు కూడా! హుద్‌ హుద్‌ విలయానికి కళింగాంధ్ర దుంపనాశనమై పోయింది. కాదు, విశాఖపట్టణం యెక్కువ నాశనమై పోయిందంటా! గాజు మేడలు, మేడలవారి కార్లూ, ఎత్తయిన షాపింమాల్లూ, ఎత్తయిన హోర్డింగులూ, అంతస్తు అపార్టుమెంట్లు, రోడ్లూ, రోడ్ల మీది చెట్టూ చేమలూ, విమానాశ్రయం, కైలాసగిరి కొండ, యారాడ కొండ (రాచకొండ లేదులెండి), కలెక్టేరు బంగ్లా కొసకి కళింగాన్ని దుంపనాశినం చేస్తాదేటో సుమా అని ముందుగా యెచ్చరించిన రాడార్‌ ఆఫీసూ.. ప్రకృతి విలయం ముందు – సాదాసీదా సజ్జుతో సమానంగా, కాదు కాదు యెక్కువ సమానంగా దుంపనాశనమైపోయింది.
కళ్ళముందర -పడవలూ, బోట్లూ, గుడిసెలూ, గుడిసెల్లోని గిన్నేముంతా, గుడ్డా పాతలూ సంద్రంలోకి కొట్టుకు పోతే కడపు (పోనీ గుండెలు) కొట్టుకొని కళ్లంట జాలారోళ్లు (మత్స్యకార్లు మర్యాదపదం); ఆపాటీపాటి చినుకులుకే సిటీలోని మురికినీటికాల్వలన్నీ ప్రవహించే మురికిపేటల ఇళ్లల్లోని సర్వమూ జగన్నాధమై పోగా కన్నీరు మున్నీరై యేడ్చే మురికివాడల పేదలూ; చిన్నా చితకా కోలనీలూ, కోలనీలలోని చిన్నా చితకా మనుషులూ; అటు పాయకరావుపేటవతల నుంచీ యిటూ భోగాపురమివతలదాకా గుడిసెలు, పెంకుటిల్లు, డాబాలు, దాబాలూ… అందలి ఆటోవాలాలు, తాపీ పనివాళ్ళు, కలాసీలు, చిన్న ఉద్యోగులు, కూలీలు, పనిమనుషులు, పనిదొరకని మునుషులు, పట్నానికి పాలూ, నీళ్లూ, పల్లూ, పూలూ, కాయగూరలూ, తిండిపదార్థాలు, అలంకారాలు, అవసరమైనవన్నీ అమ ర్చే యాపారుస్తులూ – వాళ్లేటి వీళ్లేటియెందరి బతుకులో హుద్‌హుద్‌ ధాటికి బదాబదలైపోయాయి! ఎవర్ని పలకరించూ, యేడుపే…! ఓలప్పా, యేటలగ యేడస్తావు? నీకేనేటే?? వందరికీ ఒకటే రేవు యెట్టీసింది తుఫాను తల్లి. నీకు తెల్దుగానీ సియ్యమ్మారోడి వద్దాల షాపయితే.. చిరిగిన చింకిచాప అయిపోనాది. ఓలప్పా, అల్లా సోనీ కంపినీవోడి బిల్డంగయితే అద్దాలతోటి, ఏసీల్తోటి తళతళ్లాడీదా, అలాపింటిది-అప్పడుకోడె రంకెలేసి కుమ్మేస్తే, కుమ్మరోడి కుండలు చిల్లి పెంకులయిపోతాయి సూడూ అలాగయి పోనాది. అల్లా జోయల్లూకాసూ, స్పెన్సారూ, రిలయిన్సూ, ఒకటేటి వందం వొలకబోసీ షాపులన్నీ వల్లకాడులయిపోనాయి. నీలాగ, ఆళ్లు గానీ యేడిస్తే, సెంద్రబాబుగానీ, మోడీ బాబుగానీ .. ఓదార్సగల్రా? అళ్ల వొసిమా?? నికిచ్చినట్టగ, కోటా బియ్యిమూ, కిరసనూనే, ఉప్పూపప్పూ ఆళ్లగ్గానీ యివ్వగల్డా, యిస్తే ఆళు తీసకుంతారా, ఆళ యేడుపు ఆపతారా? సెప్మీ, సేన, మరేడకు, అంతటోళికే ఆపదొచ్చింది. మనమేపాటి? యేడకని తప్పకా ఓదార్సేవోడు, మా రావిశాసి్త్ర గారి రాకెట్టప్పారావు (బతికిలేడుగానీ).
హుద్‌హుద్‌ దాడికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కూడా యెన్నడెరగని రీతిలో ధ్వంసమైనాయి. కళింగ ప్రాంతం – మూడు విభిన్నప్రాంతాల సమాహారం. సముద్రతీరం, అడవీ ఆడవినానుకొని ఉన్న ఆదివాసీ ప్రాంతం, మైదాన ప్రాంతం. ఈ మూడు ప్రాంతాలూ విలయానికి గురయినాయి. ఎన్నడెరగని రీతిలో వీచిన గాలికి అరణ్యం గూడా విధ్వంసమైంది. సాధారణ రోజుల్లోనే ఆదివాసీ ప్రాంతానికీ, యితర ప్రాంతానికీ అనుసంధానం అంతంత మాత్రమే, అటువంటిది, యీ విలయ సందర్భాన ఆదివాసీప్రాంతంలోని జీవుల కడగండ్లు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. వాగులు పొంగిపోతాయి, వృక్షాలు కూలిపోతాయి, దారీతెన్నూ వుండదు. తాగే నీరు, తినేందుకు తిండి, వుండడానికి గుడిసె.. యేమీ వుండదూ, యెవరో వస్తారని, ఆదుకుంటారని ఆశ గూడా వుండదు. ఆదివాసీ ప్రాంతంలో యే నిధి నిక్షేపాలున్నవో తెలిపే, వెలికి తీసే శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలు వారి కనీస అవసరాలు తీర్చాల్సినపుడు మాత్రం అక్కరకు రావటం లేదు. (అన్నలీ అవసరాలను తీర్చతున్నారని పోలీసుల ఆగ్రహం).
ఇక కళింగ మైదాన ప్రాంతాన సారవంతమైన పల్లపు భూములున్నవి. వరి, చెరకు, జొన్న, పత్తి (ఒకప్పుడు చోడి, గంటెలు, చామలు వగైరా తిండిగింజల పంటలు) పంటలు పండుతాయి. పట్రాలు రారమ్మని పిలవగా, యెందరో వలసబోగా – కిట్టుబాటు ధరలు లేకపోయినా పంటలు పండించడమొక వ్యవసనమైన రైతులూ; వారినాధారం చేసుకు అర్థాకలితో, అరాకొరా ఉపాధితో బతికే వృత్తి జీవులూ, చేతివృత్తులవారూ, చాకలీ, మంగలీ వగైరా సేవక కులాల జనాలూ, మైదాన ప్రాంతాన నేడు మిగిలినవారు! ఇక్కడి అరటితోటలు యెవరో పగబట్టి తెగనరికినట్టయినాయి. వరిచేలు నీళ్లల్ల తలకిందులుగా మొలకెత్తుతున్నాయి. చెరకులు నడుములు విరిగినాయి. కొబ్బరి తలలు నేలకేసి కొట్టుకున్నాయి. మునగ చెట్ల ముప్పయి ముక్కలుగా విరిగినాయి. నట్టింట దీపమెలిగించ చమురు లేదు (కరెంటు మామూలు రోజుల్లోనే యే జాము రాతిరికో వుండేది) రైతు వెన్నుపూసలు ఫటా ఫటా తెగిపడినాయి! కళ్లంట నీళ్ళుగాదు, నెత్తురు గారుస్తున్నాడు మైదాన ప్రాంతీయుడు!
సముద్రతీరం సరే, మీడియా విశాఖను చూపినట్లే, సుమారు ఇచ్ఛాపురం దాకా తీరంలోని మత్స్యకారులంతా మునుపెన్నడూ లేనంతగా భయభ్రాంతులయినారు. తుఫానుతీరం తాకేదాకా కొట్టుకునే గుండెలు, తీరం తాకింతరాత ఆగి పోయాయి. సంద్రాన్ని చూస్తే భయపడిపోతున్నారు. వల లేదు, బోటు లేదు, గుడిసె లేదు, బతుకు భరోసా లేదు. తెర చాప చిరిగినా, తెడ్డు చేజారినా, గుండె జారనీకు.. ఓ జాలరన్నా… అని యెవరు ధైర్యం చెప్తారు వాళ్లకు?
ఈ తుపాను సందర్భాన రాజకీయ విభేదాలు పక్కన బెట్టి అన్ని రాజకీయ పార్టీలూ ఐక్యంగా విపత్తునుంచి ప్రజలు బయటపడే కార్యక్రమాలను చేపట్టాలి. సినిమా రంగం ముందుకు వచ్చి విరాళాలందించడం మనకు ఆనవాయితీయే, గానీ కళాకారుల మీదా, సాహిత్యవేత్తలూ, సామాజికవేత్తలూ, మేధావులమీదా.. యింకా ముఖ్యమైన బాధ్యతలుంటాయి. అవేమిటంటే, శాశ్వత ప్రాతిపదికన ప్రకృతి విలయాలను తట్టుకునే స్వావలంబనా శక్తీ, మానసిక ధైర్యం, సమష్టితత్వం, సహకార గుణం మనుషుల్లో కలిగించడం, సామూహిక కార్యాచరణ మార్గాలను ఎరుక పరచడం. సమాజాన్ని ఆ మేరకు చైతన్య పరచడం. నదులను మళ్లించడం, ఇళ్లను ముంపులకు గురికాని యెత్తయిన ప్రాంతాల్లో నిర్మించడం, రహదార్లను ఎప్పటికప్పుడు రిపేరు చేయించడం, సముద్రతీరం ప్రాంతంలో తుఫాను షెల్టర్లు నిర్మించడం వంటి ముందు జాగ్రత్త చర్యలను దీర్ఘకాల ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలి. అలా ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రాతిపదిన చర్యలు చేపడితే ఇటువంటి విపత్తులు వచ్చినపుడు ప్రజలు తమనాదుకోమని ప్రభుత్వాల వేపు చూడరు. ప్రభుత్వం కూడా ఆదుకోమని దాతలను వేడుకోనక్కరలేదు.
అట్టాడ అప్పల్నాయుడు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సచిన్‌ సెలబ్రిటీ పల్లె

సచిన్‌ సెలబ్రిటీ పల్లె
ఇన్నాళ్లు బ్యాటు పట్టుకుని పరుగులు తీయడమే కాదు.. ఇప్పుడు పల్లెలను దత్తతకు తీసుకుని అభివృద్ధిలోను పరుగులు పెట్టిస్తానంటున్నాడు సచిన్‌ టెండుల్కర్‌. ఆయన చేతి చలవతో నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజుకండ్రిగ రూపురేఖలే మారిపోనున్నాయి. మోడల్‌స్కూల్‌, నిరంతర మంచినీటి సరఫరా, పక్కాఇళ్లు, తళతళలాడే రోడ్లు, సౌరవిద్యుత్తు, క్రీడామైదానం, బ్యాంకు ఒక్కటేమిటి? ఇవన్నీ సమకూరితే ఇదొక సెలబ్రిటీ పల్లె కావడం ఖాయం..
‘‘మన ఊరికి సచిన్‌ వస్తున్నాడు తెలుసా?’’
పుట్టంరాజుకండ్రిగకు వెళితే ఎవరు ఎదురుపడ్డా ఇదే ముచ్చట. ఊరు ఊరంతా ఉత్సాహంతో ఈ తీపి కబురును పంచుకుంటోంది. నెల్లూరు జిల్లా గూడూరు మండల పరిధిలోని నెర్నూరు పంచాయతీ కిందికి వస్తుంది పుట్టంరాజుకండ్రిగ. ఇదొక చిన్న పల్లెటూరు. గూడూరు నుంచి వెంకటగిరికి వెళ్లే ప్రధాన మార్గం నుంచి పదహారు కిలోమీటర్లు మట్టిరోడ్డు మీద వెళితే – ఈ పల్లె వస్తుంది. పల్లెటూరంటే చెప్పేదేముంది? వీధుల్లో రోడ్లు లేవు. సగానికిపైగా ఇళ్లన్నీ శిథిలమై మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయి. ఊరి ప్రజల్లో ఎక్కువమంది నిరుపేద కూలీలు. గేదెలు, గొర్రెల పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్నవాళ్లు. ‘‘మా ఊరి మొత్తం జనాభా 443. ఇళ్ల సంఖ్య 120. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ. ఇన్నేళ్లు మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు. అందుకే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయాం. ఇప్పుడు అందరి దృష్టి మా ఊరి మీద పడటం సంతోషకరం’’ అంటున్నారు గ్రామీణులు.
ప్రధాని పిలుపుతో..
నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యాక – ఆయన దృష్టి పల్లెటూళ్ల మీద పడింది. దేశంలో వివిధ రంగాల్లో పేరుప్రఖ్యాతలు, డబ్బు సంపాదించుకున్న సెలబ్రిటీలు పల్లెల వైపు చూడాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఏదో ఒక తోచిన పల్లెను దత్తతకు తీసుకుని సకలసౌకర్యాలతో ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలన్నది ఆయన కోరిక. ప్రధాని ప్రకటనకు స్పందించాడు సచిన్‌టెండుల్కర్‌. నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజుకండ్రిగను దత్తత తీసుకున్నాడాయన. దాంతో ఒక్కసారిగా ఈ పల్లెకు సెలబ్రిటీ ఇమేజ్‌ వచ్చింది. జిల్లా కలెక్టర్‌ శ్రీకాంత్‌ చొరవతో ఊరికి మహర్దశ పట్టింది. సచిన్‌ కూడా ఎంపీ నిధులు కేటాయించారు. ఇప్పటికే నాలుగు కోట్లతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామంలోని 14 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని అద్దంలా తీర్చిదిద్దారు. త్వరలో ఇక్కడొక క్రీడా మైదానం ఏర్పడనుంది. ‘‘క్రికెట్‌కు సచిన్‌ మా ఊరి పిలగాళ్లందరికీ ఆదర్శం. ఆయనే స్వయంగా మా ఊర్లో గ్రౌండ్‌ను ఏర్పాటు చేసి.. క్రీడల్లో మా పిల్లలను ప్రోత్సహించడం సంతోషకరం’’ అని చెప్పారు స్థానికులు.
ఊళ్లో ఇప్పటికే పడిపోయిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి కూడా తారురోడ్డుగా మారనుంది. చదువుకునే విద్యార్థులకైతే కొత్త పాఠశాల భవనాలు రానున్నాయి. అదీ ఆధునాతన వసతులతో – కిచెన్‌, డైనింగ్‌హాల్‌, రన్నింగ్‌ వాటర్‌, క్రీడామైదానం, పరికరాలు, మరుగుదొడ్లు, కంప్యూటర్లతోపాటు విద్యార్థులకు సైకిళ్లు కూడా అందివ్వనున్నారు. గ్రామం మొత్తం వైపై సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలను పంపారు అధికారులు. ఇందుకు సంబంధించి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సివిల్‌ ఇంజనీర్లు నమూనాలను తయారు చేశారు.
మా గ్రామంలో మంచినీటి సమస్య ప్రధానమైనది. త్వరలో 24 గంటలు నీళ్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అంతకంటే మాకు ఇంకేమి కావాలి? అంటున్నారు ప్రజలు. ఆర్థికలావాదేవీలకు బ్యాంకు, ఆరోగ్యకేంద్రం, పశువైద్యశాలలను సచిన్‌ నిధులతో ఏర్పాటు చేయనున్నారు. పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరాతోపాటు ప్రత్యామ్నాయంగా సౌరవిద్యుత్తు అందుబాటులోకి రానుంది. గ్రామంలో మహిళల ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు – సాక్షరతాభారత్‌ కేంద్రం రానుంది. ‘‘ఇవన్నీ సమకూరితే మా ఊరు ఒక ఆదర్శ గ్రామంగా కావడం ఖాయం. ఆ రోజు కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నాం’’ అంటున్నారు జనం. వచ్చే నెల రెండో వారంలో ఈ గ్రామాన్ని సందర్శించేందుకు సచిన్‌ రానున్నారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శోభన్‌బాబు, మంజుల హిట్‌ కాంబినేషన్‌!

శోభన్‌బాబు, మంజుల హిట్‌ కాంబినేషన్‌!

జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఎనిమిదో చిత్రం ‘మంచిమనుషులు’. అంతవరకూ అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రమే సినిమాలు నిర్మించిన ఈ సంస్థ తొలిసారిగా మరో హీరోతో నిర్మించిన చిత్రమిది. అత్యధిక భారీ వ్యయంతో రూపుదిద్దుకొని శోభన్‌బాబు కెరీర్‌లోనే కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సాంఘిక చిత్రం ఇదే. అలాగే ఆయన నటజీవితంలో అత్యుత్తమ సంగీతభరిత చిత్రంగా ‘మంచిమనుషులు’ ప్రశంసలందుకొంది. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా నలభై ఏళ్లు. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ సంస్థ అంటే అక్కినేని సొంత బేనరు అనే అభిప్రాయం అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఉండేది. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘అన్నపూర్ణ’లో తప్ప మిగిలిన అన్ని సినిమాల్లోనూ అక్కినేనే హీరో. జగపతి సంస్థ నుంచి అక్కినేని చిత్రం వస్తుందంటే చాలు అభిమానుల కోలాహలం అంతా ఇంతాకాదు. మంచి కథ, పాటలు ఆ సినిమాలో ఉంటాయనేది వారి నమ్మకం. అటువంటి సంస్థ తొలిసారిగా శోభన్‌బాబుతో ‘మంచిమనుషులు’ చిత్రం నిర్మిస్తున్నట్లు ప్రకటించగానే అక్కినేని అభిమానుల ఆగ్రహాన్ని దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ చవిచూడాల్సి వచ్చింది. అయితే అక్కినేనితో బదులు శోభన్‌బాబుతో ఆయన ఈ సినిమా చేయడానికి ఒక కారణం ఉంది. ఆ సమయంలో అక్కినేని అమెరికా వెళ్లడం, అక్కడ ఆపరేషన్‌ జరిగి కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సలహా ఇవ్వడం జరిగింది. అన్ని రోజులు సినిమా చేయకుండా ఖాళీగా కూర్చోవడం కష్టం. పైగా ఆఫీసుపై ఆర్థిక భారం పడుతుంది. అందుకే అక్కినేని అమెరికా నుంచి తిరిగి వచ్చేలోగా వేరే హీరోతో సినిమా చేస్తానని రాజేంద్రప్రసాద్‌ చెప్పగానే అక్కినేని కూడా సరేనన్నారు. అయితే ఈ విషయం తెలియని అభిమానులు మాత్రం
ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాటని నిర్లక్ష్యం చేసి సినిమా తీసే విడుదల రోజున ప్రింట్లు తగలపెడతామనీ, ధియేటర్లో తెరలు చించేస్తామనీ బెదరించారు. కానీ రాజేంద్రప్రసాద్‌ ఆ బెదిరింపులకు వెరవలేదు. ధైర్యంగా సినిమా మొదలుపెట్టారు.
హిందీ రీమేక్‌
జీవన్‌ప్రభ దేశాయ్‌ రాసిన ఒక హిందీ కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఆ గలే లగ్‌ జా’(1973) చిత్రం ఆధారంగా ‘మంచిమనుషులు’ చిత్రం తయారైంది. శశికపూర్‌, షర్మిలాఠాగూర్‌ హిందీలో పోషించిన పాత్రలను తెలుగులో శోభన్‌బాబు, మంజుల నటించారు. హిందీలో శత్రుఘ్న సిన్హా పోషించిన పాత్రను జగ్గయ్య ధరించారు. తెలుగులో ఈ చిత్రం హిట్‌ అవడంతో 1976లో శివాజీగణేశన్‌, మంజులతో తమిళంలో ‘ఉత్తమన్‌’ పేరుతో నిర్మించారు. కథలో కీలకమైన బాలనటుడి పాత్రను మూడు భాషల్లోనూ మాస్టర్‌ టిటు పోషించడం విశేషం.
శోభన్‌, మంజుల తొలి కాంబినేషన్‌
‘మంచిమనుషులు’ చిత్రంలోనే శోభన్‌బాబు, మంజుల కలసి తొలిసారిగా నటించారు. ప్రేక్షకుల అభిమానజంటగా కితాబునందుకొన్నారు. అక్కడి నుంచి నాలుగేళ్ల కాలంలో ఎనిమిది చిత్రాల్లో వీరిద్దరు నటించారు. ఈ సినిమాలో ‘పడకు పడకు వెంటపడకు’ పాటలో లైలా, మజ్ను, అనార్కలి, సలీంగా మంజుల, శోభన్‌బాబు నటించి అభిమానులకు కనువిందు చేశారు. అలాగే సినిమాలో స్కేటింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉండటంతో శోభన్‌బాబు, మంజుల 45 రోజుల పాటు స్కేటింగ్‌ నేర్చుకోవడం విశేషం.
కశ్మీర్‌లో షూటింగ్‌
చిత్రంలోని కీలక సన్నివేశాలను కశ్మీర్‌లో పాకిస్థాన్‌ బోర్డర్‌లో చిత్రీకరించారు. దర్శకునిగా రాజేంద్రప్రసాద్‌కు ఇది మూడో చిత్రం. దర్శకునిగానే కాదు నిర్మాత కూడా ఆయన ఎక్కడా రాజీపడలేదు. తన గత చిత్రాలకంటే అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మించారు. భారీ సెట్స్‌, కొత్త లొకేషన్లు ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకొన్నాయి.
మ్యూజికల్‌ హిట్‌
శోభన్‌బాబు నటజీవితంలోనే అత్యుత్తమ సంగీతభరిత చిత్రంగా ‘మంచిమనుషులు’ ప్రశంసలందుకొంది. అంతకుముందు అడపాదడపా శోభన్‌బాబుకు పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం చిత్రంలోని అన్ని పాటలూ పాడటం గమనార్హం. ఈ సినిమా తర్వాత బాలు శోభన్‌బాబుకి పర్మనెంట్‌ సింగర్‌ అయ్యారు. ‘పడకు పడకు వెంట పడకు’, ‘నీవు లేని నేను లేను.. నేను లేక నీవు లేవు’, ‘విను నా మాట విన్నావంటే’, ‘నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్లాలని’, ‘పెళ్లయ్యింది ప్రేమ విందుకు వేళయింది’… ఇలా సినిమాలో ప్రతి పాటా హిట్టే. ఆత్రేయ, ఆరుద్ర రాసిన పాటలకు మామ మహదేవన్‌ మధురమైన బాణీలు సమకూర్చారు. అలాగే ప్రేక్షకుల్ని కలల తీరంలోకి తీసుకువెళ్లేలా దర్శకుడు రాజేంద్రప్రసాద్‌ ఈ పాటల్ని చిత్రీకరించారు.
పది కేంద్రాల్లో వంద రోజులు
1974 అక్టోబర్‌ 18న ‘మంచి మనుషులు’ చిత్రం 35 కేంద్రాల్లో విడుదలైంది. ఆంఽద్రప్రదేశ్‌ లో ఫుల్‌ రన్‌లో కోటి రూపాయలు వసూలు చేసిన శోభన్‌బాబు తొలి సాంఘిక చిత్రం ఇదే. పది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా కళ్లల్లో ‘హుద్‌హుద్‌’ – ఆర్‌. నారాయణమూర్తి

సమస్త శాఖలును నాయందే నిక్షిప్తమైనవి, సమస్త నిర్ణయాలు నానుండే వెలువడుచున్నవి, సమస్త సర్వేలు నాచే జరుపబడుచున్నవి, నేనే సత్యం, నేనే నిత్యం, నేనే కర్మ, నేనే ఫలితం…
నా కళ్లల్లో ‘హుద్‌హుద్‌’ – ఆర్‌. నారాయణమూర్తి
ఈ నెల 11వ తేదీ రాత్రి నుంచీ 12వ తేదీ రాత్రి వరకు విశాఖలో పెను తుపాను ‘హుద్‌హుద్‌’ సృష్టించిన బీభత్సానికి ప్రత్యక్షసాక్షిగా నిలిచారు నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్‌. నారాయణమూర్తి. ఓ కార్యక్రమానికి హాజరై మధ్యలో విశాఖలో చిక్కుకుపోయిన ఆయన తన జీవిత కాలంలో ఇలాంటి పెను తుపానునూ, ఇంతటి బీభత్సాన్నీ ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ‘హుద్‌హుద్‌’ తుపాను రోజు విశాఖలో తను చూసిన, ఎదుర్కొన్న అనుభవాలను చిత్రజ్యోతితో ప్రత్యేకంగా పంచుకున్నారు నారాయణమూర్తి. ఆ విలయ విశేషాలు ఆయన మాటల్లోనే…
ఈ నెల 11న కుల నిర్మూలనా పోరాట సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జరిగిన సభకు హాజరై, బస్సులో ఆ రాత్రికి విశాఖపట్నం చేరుకున్నాను. అక్కడ రైలు ఎక్కాలనేది నా ఆలోచన. అయితే టైమ్‌ దాటిపోయింది. రైలు అందే పరిస్థితి లేదు. వర్షం పడుతోంది. అప్పటికి ఐదు రోజుల ముందునుంచీ హుద్‌హుద్‌ తుపాను గురించి మీడియాలో వస్తున్న విస్తృత ప్రచారం చూసి, జనాన్ని ఇంతగా భయపెట్టాలా, వారికి మానసిక ప్రశాంతత లేకుండా చేయాలా అనుకున్నా. వర్షం రాను రాను పెరుగుతూ పోతోంది. ఆ రాత్రి విశాఖపట్నంలో ఉండి, మర్నాడు బయలుదేరదామని విశ్వభవన్‌ లాడ్జిలో దిగాను. గత ముప్పై ఐదేళ్ల నుండీ నెనెప్పుడు విశాఖపట్నం వెళ్లినా ఆ లాడ్జిలోనే నా మకాం. ఆ రాత్రి గాలి, వాన హోరు అంతకంతకూ ఉధృతమవుతున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు ఊగిపోతున్నాయి. అర్ధరాత్రికి భయం మొదలైంది. పక్కనే సముద్రం ఉన్నదాయె. ‘భగవంతుడా. ఇది మరో దివిసీమ ఉప్పెన కాకూడదు, మరో కోనసీమ ఉప్పెన కాకూడదు, మరో సునామీ కాకూడదు’ అని ప్రార్థించా. హోరుగాలి ఉధృతం పెరుగుతున్నదే కానీ తగ్గలేదు. అప్పటికే కరెంటు లేదు. చిమ్మచీకటి. ఆ రాత్రంతా కలత నిద్రే. పొద్దున లేస్తే.. ఏ వైపు చూసినా బీభత్సమే. భయానకమే. రాత్రి ఊగుతూ కనిపించిన పచ్చని చెట్లన్నీ ఽనేలమట్టమైపోయాయి. ఽపెద్ద పెద్ద బిల్డింగుల అద్దాలన్నీ పగిలిపోయి బీభత్సమైపోయాయి. కరెంటు స్తంభాలు విరిగి, ధ్వంసమయ్యాయి. రోడ్లు రోడ్లులా లేవు. లాడ్జిపైకెక్కి చూస్తే విశాఖ అంతా కల్లోలమైపోయి కనిపించింది. మనం వాస్తవాలు ఒప్పుకోవాలి. హుద్‌హుద్‌ తుపాను గురించి ముందే హెచ్చరించిన శాస్త్రవేత్తలకూ, ప్రజలనూ, యంత్రాంగాన్నీ అప్రమత్తం చేసిన కేంద్ర, రాష్ట ప్రభుత్వాలనూ ఈ సందర్భంగా ప్రశంసించి తీరాలి. అప్పట్లో ఈ సైంటిఫిక్‌ నాలెడ్జి లేకపోవడం వల్లే దివిసీమ ఉప్పెనలో చాలామంది చనిపోయారు. జనం సురక్షిత ప్రాంతాలకు తరలింపబడలేదు. జనాన్ని ఉప్పెన కబళించేసింది. దాని ప్రభావం సంగతి ప్రభుత్వానికీ తెలీదు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో, తుపానును ముందే అంచనా వేయగలిగారు. దానికి తగ్గట్లు ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోగలిగింది. ఎవర్నీ బయట తిరగవద్దని హెచ్చరించింది. అందువల్లే ప్రాణనష్టం బాగా తగ్గింది. ఇది సాంకేతిక పురోగతి సాధించిన విజయం.
నలుగురితో పాటు నారాయణమూర్తి
ఇక నా విషయానికి వస్తే 13వ తేదీ ఉదయం ఆకలి వేస్తుంటే టిఫిన్‌ చేద్దామని లాడ్జి నుంచి బయటకు వచ్చాను. అంతే. ఏం గాలి! ఏం హోరు! ఎటు చూసినా కూలిన చెట్లు, కరెంటు స్తంభాలు. అడ్డదిడ్డంగా, వెల్లకిలా పడిపోయిన కార్లు, బైకులు. అక్కణ్ణించి రెండు ఫర్లాంగుల దూరంలో ఉంది గ్రీన్‌పార్క్‌ హోటల్‌. అక్కడకు వెళ్లాలి. ముందుకు అడుగులు వేశానో, లేదో తుపాను గాలికి నేనూ బ్యాలెన్స్‌ తప్పి ఎగిరాను. ఓ కాలికి భూమ్మీద పట్టుదొరికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే కొట్టుకుపోయేవాణ్ణే. చివరకు దేవుడి మీద భారంవేసి, ఆ తుపాను ఉధృతిలోనే గ్రీన్‌పార్క్‌ హోటల్‌కి చేరుకున్నా. ఆ హోటల్‌ వాళ్లు తుడుచుకోవటానికి టవల్స్‌ ఇచ్చి, టిఫిన్‌ పెట్టారు. మీరు నమ్మాలి. ఉదయం తొమ్మిది గంటలకు ఆ హోటల్‌కు వెళ్లినవాణ్ణి, మళ్లీ విశ్వభవన్‌కు రావడానికి రాత్రి ఎనిమిదయ్యింది. ఓ మహానుభావుడు ప్రేమగా అక్కడ కారులో దింపారు. అప్పటికీ ఉధృతం తగ్గలేదు. ఎటుచూసినా గాఢాంధకారం. ఎక్కడకీ కమ్యూనికేషన్‌ లేదు. 61 సంవత్సరాల నా జీవితంలో ఊహతెలిశాక ఇలాంటి బీభత్సాన్ని కళ్లతో ఎప్పుడూ చూడలేదు. దివిసీమ, కోనసీమ ఉప్పెనలను మించి ఈ హుద్‌హుద్‌ తుపానులో గాలి చేసిన బీభత్సం ఎక్కువ. అయినప్పటికీ ఈ బీభత్సం నుంచి బయటపడేందుకు అహర్నిశలూ కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికీ, ప్రధాని నరేంద్రమోదీగారికీ, ప్రభుత్వ యంత్రాంగానికీ, స్పందించి విరాళాలు అందజేస్తున్న దాతలకూ, స్వచ్ఛందంగా బాధితులకు సాయపడుతున్నవారికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను కూడా నా కళ్లముందు పడిపోయిన చెట్లను నలుగురితో కలిసి అక్కణ్ణించి ఓ మూలకు జరిపాం. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశాం. అంటే ‘నలుగురితో పాటు నారాయణమూర్తి’నయ్యా.
బోడిగా మారిన విశాఖ
ఈ సందర్భంగా నేను చాలా బాధాపడిన విషయం.. ఇంత తుపాను బీభత్సం జరుగుతుంటే చాలామంది దొంగలు చీకట్లో ఇళ్లలోకి జొరబడి అందిన వస్తువునల్లా దోచుకుని పారిపోయారు. నా కళ్లారా ఓ సంఘటనను చూశాను. ఏడుపొచ్చింది. ఇంత కష్టకాలంలోనూ మానవత్వం లేకుండా ప్రవర్తించే అలాంటివాళ్లను ఏం చేసినా పాపంలేదు. ఇంకోవైపు ఇదే అదనుగా పెట్రోల్‌ ధరను పెంచేశారు. పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచేశారు. విపత్కర పరిస్థితుల్లో ఎవరైతే జనానికి మేలు చేస్తారో వాళ్లే దేవుళ్లు. ఎవరైతే లూటీ చేస్తారో వాళ్లే దెయ్యాలు. ఆ దెయ్యాలను పట్టుకుని కాల్చిపారెయ్యాలన్నంత కోపం వచ్చింది. దేశానికి ముంబై ఎలానో ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ అలాగా. చాలా అందమైన నగరం. ఓ వైపు సముద్రం, మరోవైపు పచ్చని ప్రకృతి. అలాంటి నగరంలో ఇప్పుడు మచ్చుకి కూడా పచ్చదనం లేకుండా అంతా ధ్వంసమైపోయింది. సుందర విశాఖ బోడిగా మారింది. ఏడుపొచ్చింది. ఒక ప్రాణం పోయినా పోయినట్లే. అయినప్పటికీ వీలైనంత తక్కువగా పాతికమందిలోపునే మరణించడం చాలా నయం. నాకు నిజంగా ఆనందమేసిన సందర్భం.. జనం ప్రభుత్వ సిబ్బంది కోసం ఎదురుచూడకుండా, తమ ఇళ్లముందు, రోడ్ల మీద చెల్లాచెదురుగా పడిపోయిన చెట్లనీ, చెత్తనీ, పగిలిపోయిన వస్తువుల్నీ తీసి, ఆ ప్రాంతాల్ని శుభ్రం చేసుకోవడం. ధనిక, పేద తేడాలేకుండా కలిసి పనిచేసిన వాళ్ల సమష్టితత్వానికి హ్యాట్సాఫ్‌. వాళ్లలో నేనూ ఒకడిని కావడం నాకు ఆనందదాయకం. తుపాను తగ్గిపోవడంతో జనమంతా రోడ్లమీదకు వచ్చేశారు. వీధుల్ని శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టారు. వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఒకాయన నన్ను కారులో కత్తిపూడిలో దింపారు. అక్కణ్ణించి సామర్లకోట వచ్చి, అక్కణ్ణించి 14వ తేదీ ఉదయం గుంటూరుకు చేరుకున్నా. నాగార్జున యూనివర్శిటీలో చల్లపల్లి స్వరూపరాణి ఆధ్వర్యంలో అక్కడి దళిత విద్యార్థి సంఘం ఏర్పాటుచేసిన కవి పైడి తెరేశ్‌బాబు సంస్మరణ సభలో పాల్గొన్నా.
సక్రమంగా అందాలి
ఇప్పుడు చేయాల్సింది ఒకర్నొకరు విమర్శించుకోడం కాదు. హుద్‌హుద్‌ బీభత్సానికి అతలాకుతలమైన ఉత్తరాంధ్రను మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి అహర్నిశమూ శ్రమిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికీ, ఇంతటి విపత్కర స్థితిలోనూ ఎంతో మనోనిబ్బరాన్ని ప్రదర్శించిన అక్కడి ప్రజానీకానికీ వందనాలు. అక్కడివాళ్లను ఆపద్బాంధవులుగా ఆదుకొంటున్న గుర్తుతెలియని స్వచ్ఛంద సేవకులకు హ్యాట్సాఫ్‌. అలాగే మన తెలుగువాళ్లు ఎప్పుడు ఏ కష్టాన్ని ఎదుర్కొన్నా ఆదినుంచీ సినీ పరిశ్రమ వాళ్లకు చేయూతనందిస్తూనే వచ్చింది. ఇప్పుడు కూడా మన సినిమావాళ్లు ప్రదర్శిస్తున్న దాతృత్వాన్ని ప్రశంసించి తీరాలి. పవన్‌కల్యాణ్‌ నుంచి సంపూర్ణేష్‌బాబు దాకా ఎవరికి తోచింది వాళ్లు దానం చేస్తున్నారు. అయితే ఈ విరాళాలు, ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారాలు అర్హులైనవారికే చేరాలనీ, అవి దుర్వినియోగం కాకుండా చూడాలనీ ప్రభుత్వాన్ని కోరుతున్నా.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాంకేతిక సంరంభం

సాంకేతిక సంరంభం
సాధారణంగా మన దేశంలో ప్రజలు క్రికెట్‌ సిరిస్‌ ప్రారంభం కోసమో, ఒక సినిమా రిలీజ్‌ కోసమో ఎదురుచూడటం సామాన్యమైన విషయమే. ఒక కొత్త జనరేషన్‌ మొబైల్‌ కోసం, ఒక ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్‌ కోసం ప్రజలు ఎదురుచూడటం మాత్రం విశేషం. ఈ కోణం నుంచి చూస్తే నేడు దేశ మొబైల్‌ ఫోన్ల చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన టెక్నాలజీ కంపెనీలుగా పేరు పొందిన గూగుల్‌, యాపిల్‌ కంపెనీలు భారత మొబైల్‌ మార్కెట్‌లో తమ స్థానాన్ని పదిలపరుచుకోవటానికి తమ ఉత్పత్తులను మార్కెట్‌లలోకి ప్రవేశపెడుతున్నాయి. అందరూ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 6ను యాపిల్‌ విడుదల చేస్తుంటే, దానికి సవాలుగా ఆండ్రాయిడ్‌-ఎల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో గూగుల్‌ నెక్సస్‌ 6ను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోంది. నెక్సస్‌ ఫోన్లను ఉపయోగించేవారందరికీ నేటి నుంచి ఆండ్రాయిడ్‌ ఎల్‌ అప్‌డేట్‌ అవుతుంది. దీని కోసం కూడా లక్షల మంది ఎదురుచూస్తున్నారు.
ఈ మధ్యకాలంలో రెండు అగ్రశ్రేణి కంపెనీలు నేరుగా తమ ఉత్పత్తులతో పోటీ పడటం ఇదే తొలిసారి. సామాన్యంగా మార్కెట్‌లోకి ప్రతి ఏడాది వందల మొబైల్‌ మోడల్స్‌ విడుదలవుతూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి ఆదరణ లభిస్తుంది. మరికొన్ని మౌనంగా మార్కెట్‌ నుంచి మాయమయిపోతూ ఉంటాయి. కానీ రాబోయే మోడల్స్‌ కోసం ఆతృతగా ఎదురుచూడటం, వాటికి సంబంధించిన చిన్న విషయం బయటకు పొక్కినా పెద్ద వార్తగా మారటం కూడా ఇదే మొదటిసారి. మధ్యతరగతి ప్రజల మందహాసంతో మారిన పరిస్థితులకు దీని ఉదాహరణ. ఇక్కడ ఈ రెండు కంపెనీల ప్రస్థానం కూడా చెప్పుకోవాలి. అగ్రశ్రేణి డస్క్‌టాప్‌ కంప్యూటర్లను తయారుచేసే కంపెనీగా ప్రారంభమయిన యాపిల్‌ ఆ తర్వాత ఐపాడ్‌, ఐఫోన్‌ వంటి ఉత్పత్తులతో సంచలనాలకు తెర తీసింది. ఉన్నత వర్గాల ప్రజలు వాడే ఒక స్టైల్‌ స్టేట్‌మెంట్‌గా మారిన ఐఫోన్‌కు మన దేశంలో మొదటి నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తూనే ఉంది. ఐఫోన్‌6లో ఫీచర్స్‌ ఎలా ఉంటాయో తెలియకముందే మన దేశంలో దాదాపు 25 వేల మంది వాటిని ప్రీబుక్‌ చేసుకోవటమే దీనికి ఉదాహరణ. తమకు లభిస్తున్న ఈ ఆదరణను ఆ కంపెనీ జాగ్రత్తగా పసిగట్టింది.
ఇప్పటి దాకా యాపిల్‌ ఎప్పుడూ తన ఉత్పత్తులను పాశ్చత్య మార్కెట్‌లను అనుసరించి డిసెంబర్‌లో విడుదల చేస్తూ వస్తోంది. కానీ ఈ సారి దీపావళి సీజన్‌ ప్రాముఖ్యం గుర్తించి ఐఫోన్‌ను రెండు నెలల ముందు విడుదల చేయటం భారత మార్కెట్‌పై ఆ కంపెనీ చూపిస్తున్న ఆసక్తికి నిదర్శనం. మొబైల్‌ విక్రయాలను అర్థరాత్రి నుంచే ప్రారంభించటం ద్వారా కొత్త సంప్రదాయానికి కూడా తెరతీసింది. ఒక సెర్చ్‌ ఇంజిన్‌ ద్వారా టెక్నాలజీ మార్కెట్‌లోకి ప్రవేశించిన గూగుల్‌ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విస్తరిస్తూ వచ్చింది. సెర్చ్‌ఇంజిన్ల దగ్గర నుంచి మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ (ఓఎస్‌)ల దాకా ఎదిగిన గూగుల్‌ ప్రతి ఏడాది కొత్త అప్‌గ్రేడ్‌లను ప్రవేశపెడుతూ ఉంటుంది. మొబైల్‌ రంగంలో ఆండ్రాయిడ్‌ ఒక విప్లవం. అరచేతిలో ఇమిడిపోతూ డెస్క్‌టాప్‌కీ, లాప్‌టాప్‌కీ స్మార్ట్‌ఫోన్‌ ఒక ప్రత్యామ్నాయంగా అవతరించింది. డ్రైవర్‌ అవసరం లేకుండా నడిచే కార్ల దగ్గర నుంచి ఒక రక్తపు చుక్కతో 20 వ్యాధులను పసిగట్టే చిప్‌ల దాకా రకరకాల టెక్నాలజీలను గూగుల్‌ రూపొందిస్తూ వస్తోంది. మొబైల్‌ ఫోన్‌ డిజైన్‌ విషయంలో కాకపోయినా- తన అప్లికేషన్ల ద్వారా యాపిల్‌ మార్కెట్‌ను కొల్లగొట్టాలని గూగుల్‌ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. దీనికి భారత్‌ మార్కెట్‌నే యుద్ధభూమిగా ఎంచుకుంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న భారత్‌లో మొబైల్‌ అప్లికేషన్లకు అధిక ఆదరణ ఉంది. ఈ కోణం నుంచి చూస్తే- మొబైల్‌ ఫోన్లలో ఉపయోగించే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)లకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే గూగుల్‌ సరికొత్త ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లాలిపప్‌ కోసం లక్షల మంది లొట్టలేసుకుంటూ ఎదురుచూస్తున్నారు. మొబైల్‌ వినియోగదారుల అవసరాలను జాగ్రత్తగా గమనించటం, వాటికి అవసరమైన పరిష్కారాలు కనిపెట్టడం గూగుల్‌ ప్రత్యేకత. దీని కోసం ఆ కంపెనీ కొన్ని వేల కోట్ల రూపాయలను ప్రతి ఏడాది ఖర్చు పెడుతూ ఉంటుంది. అలాంటి పరిశోధనలను రహస్యంగా ఉంచుతుంది. అలాంటి ఒక రహస్య ప్రాజెక్టయిన వోల్గాలో రూపొందించినదే ఆండ్రాయిడ్‌ ఎల్‌. త్రీడీ మొబైల్‌ ఫోన్లకు గూగుల్‌ ఒక అడుగు దూరంలో మాత్రమే ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎల్‌ విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం వల్ల వందల కొత్త అప్లికేషన్లను మొబైల్‌లో ప్రవేశపెట్టాలని గూగిల్‌ భావిస్తోంది. ఎక్కువ అప్లికేష్లన్లను ప్రవేశపెడితే బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోతుంది కాబట్టి దానిపై కూడా గూగుల్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఎక్కువ సమయం బ్యాటరీ పనిచేసే విధమైన టెక్నాలజీలను రూపొందించి వాటిని దీనిలో ప్రవేశపెట్టామని గూగుల్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ టెక్నాలజీ కోసం కూడా చాలా మంది ఎదురుచూస్తున్నారు.
కేవలం టెక్నాలజీల పరంగా మాత్రమే కాకుండా- మార్కెట్‌ విషయంలో చైనాతో మనం పోటీపడగలమా అనే విషయాన్ని కూడా అంచనా వేయటం కోసం అంతర్జాతీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. ఐఫోన్‌ గత నెల 19న కొన్ని దేశాల్లో విడుదలయింది. మార్కెట్‌లోకి ప్రవేశించిన మూడు రోజులకే కోటి మొబైల్స్‌ను వినియోగదారులు కొనుగోలు చేశారు. చైనాలో దాదాపు లక్ష ఐఫోన్ల కోసం ఆర్డర్లు బుక్‌ చేసుకున్నారు. ఈ లెక్కలతో పోలిస్తే మన మొబైల్‌ మార్కెట్‌ తక్కువే అనిపించవచ్చు. కానీ మన వినియోగదారులు టెక్నాలజీ వాడకంలో ముందు ఉంటారు. అందుకే ప్రతి కంపెనీ తమ తాజా పరిజ్ఞానాన్ని మన మార్కెట్‌లో పరీక్షించి చూసుకోవాలనుకుంటుంది. ఈ కోణం నుంచి చూస్తే మనం మొబైల్‌ టెక్నాలజీల విషయంలో గెలిచినట్లే.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”స్మితాపాటి లీయం ”- జీతం లేని పని గీత చెబుతుందా?

జీతం లేని పని గీత చెబుతుందా?
భగవద్గీత మీద ఎంత ప్రేమ, భక్తి ఉన్నవాళ్లకైనా ‘నీవు కర్మ మాత్రమే చేయి, కర్మ ఫలాన్ని ఆశించకు’ అని శ్రీకృష్ణుడు చెప్పిన మాట గొంతులో వెలక్కాయ పడినట్లు అనిపిస్తుంది. మేము ఏ మైక్రోసాఫ్ట్‌లోనో, డెల్లాయిట్‌లోనో పొద్దుటినుంచి రాత్రివరకూ పనిచేసి జీతం తీసుకోవద్దా అని మిత్రులు అడుగుతూ ఉంటారు. ప్రపంచం పోటీతత్త్వంతో ముందుకు వెళుతుంటే మనం ఎలాంటి యాంబిషన్‌ లేకుండా, ఎలాంటి ప్రమోషన్‌ కోరకుండా, జీతం తీసుకోకుండా పనిచేయాలా? ఇది చాలా వింతబోధ అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కృష్ణుడు చెప్పిన మాటలకు మన సంప్రదాయం ప్రకారం ఎలాంటి అర్థం ఉందో చూడాలి.
కర్మ అంటే పని అని అర్థం. ఈ పనులు ఎన్ని విధాలో గమనిద్దాం. తినడం, తాగడం, నడవడం మొదలైనవి ఒకరకం పనులు. ఇవి అందరికీ సమానమే. వీటివల్ల శరీర నిర్వహణ తప్ప ప్రత్యేకమైన ఫలం ఏమీ లేదు. వీటిని ఎవరూ వదలలేరు. జీవనాధారం కోసం ఏదో ఒక పనిచేస్తూ డబ్బు సంపాదించి సంసారాన్ని నడపడం రెండోరకం పని. ఇది తప్పక చేసి తీరాల్సిందే. లేకుండా లోక వ్యవహారం నడవదు. కృష్ణుడే కాదు మరెవరూ దీన్ని కాదనలేరు. మన స్మృతులు కూడా ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేయకూడదు అని నిర్దేశించాయి. కాబట్టి కృష్ణుడు చెప్పిన కర్మ అంటే ఇది కూడా కాదు.
మరోరకం పనులు కూడా ఉన్నాయి. మనం తిరుపతికి వెళ్లి కోరికలు కోరుకుంటాం. లేదా పండితుల్ని పిలిచి యాగాలు, వ్రతాలు మొదలనైనవి చేస్తాం. లేదా దానధర్మాలు చేస్తాం. వీటివల్ల మనకు కంటికి కనపించని పుణ్యమనేది లభిస్తుందని మన విశ్వాసం. మనమే కాదు అన్ని మతాలూ ఇలాగే చెబుతాయి. మంచిపనులు చేస్తే పుణ్యం, దానివల్ల స్వర్గం లాంటి లోకాలు వస్తాయని, చెడ్డపనులు చేస్తే పాపం, దాని వల్ల నరకం లాంటి లోకాలు వస్తాయన్నది అన్ని మతాలూ చెప్పే విషయమే. పుణ్యం కోసం లేదా మరొక లాభం కోసం మనం చేసే పనులు మూడో రకానికి చెందినవి. కృష్ణుడు ఈ రకమైన కర్మ గురించే చె ప్పాడు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు కదా, వీటిని ఎలా వదిలేస్తామన్నది ప్రశ్న. మన సంప్రధాయం ప్రకారం ఎన్ని మంచి పనులు చేస్తే అంత పుణ్యం. ఇదొక బ్యాంక్‌ బ్యాలెన్స్‌ లాంటిది. దీన్ని బట్టే స్వర్గంలో ఎంతకాలం ఉండవచ్చు అనేది నిర్ధారణ అవుతుంది. ఆ కాలం ముగిసిన తర్వాత భూమ్మీదికి రావల్సిందే. మళ్లీ కర్మలు చేసి, మంచి లోకాలకో, చెడులోకాలకో వెళ్లాల్సిందే. ఇదంతా ఒక అంతులేని చక్రంలో తిరగడం లాంటిది. మతపరమైన విశ్వాసం.
వేదాంతం అన్ని విషయాల్నీ తర్కబద్దంగా ఆలోచిస్తుందని ఇదివరలో తెలియచేశాను. మరి కర్మగురించిన ఈ విశ్వాసం ఎలా వచ్చింది అంటే, సమాజమంతా ఒక మతసిద్ధాంతాన్ని నమ్ముతున్నప్పుడు వేదాంతి కూడా ఆ స్థాయి నుంచే ప్రారంభించాలి. ప్రజల్ని మంచి మార్గంలో ఉంచడానికి, చెడు నుంచి దూరంగా ఉంచడానికి ఈ విశ్వాసాలు అవసరం. అందుకే తత్త్వానికి విరుద్ధంలేని మతవిశ్వాసాల్ని కొంతవరకు అంగీకరరిస్తూ తత్త్వవిచారం బోధించాలి. ఈ కర్మల విషయంలో కూడా ఇలాంటిదే మనం చూడగలం.
వేదాంత సిద్ధాంతం ప్రకారం జీవుడు, అంటే ప్రతివ్యక్తీ మౌలికంగా బ్రహ్మ స్వరూపుడే. అయినా తనను తాను ఫలానా జాతికీ, కులానికీ, మతానికీ చెందిన వ్యక్తి అని అనుకుంటూ అనేక సామాజిక కట్టుబాట్లలో ఉంటాడు. వీటన్నిటికీ అతీతంగా ఎదిగి నేను కేవలం జ్ఞానస్వరూపుడిని అని గ్రహించడం మోక్షమని వేదం చెబుతుంది. ఈ స్థితిలో స్వర్గం, నరకం అనేవి అర్థంలేనివిగా మారుతాయి. ఉపనిషత్తులు ప్రతివ్యక్తికీ నేరుగా దీన్ని బోధిస్తే ఎవరూ అంగీకరించలేరు. అందువల్ల మతం స్థాయిలో స్వర్గం, నరకం అనే వాటిని అంగీకరిస్తూ వేదాంతస్థాయిలో వీటన్నింటినీ దాటి నీ స్వరూపాన్ని తెలుసుకోమని చెబుతాయి. అంటే రిలిజియన్‌ అనేది ఒక స్థాయి. వేదాంతం అనేది రెండోస్థాయి. వ్యక్తి యొక్క ప్రవర్తనను, పవిత్రమైన మనస్సు, ఆధ్యాత్మిక ఎదుగుదలను బట్టి ఉపనిషత్తులు ఈ రెండు స్థాయిల్లో చెబుతాయి.
ఈ నేపథ్యంలో కర్మఫలాన్ని గూర్చిన మన ప్రశ్నను గమనిద్దాం. జీవితం – కర్మ – దాని ఫలంగా స్వర్గం పొందడం – మళ్లీ జీవితం అనే చక్రం నుంచి బయటపడటం ఎలా? మనం ఒక పని చేసి దాని ఫలితాన్ని ఆశిస్తున్నంత కాలం ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటాం. ఈ చక్రం నుండి బయటపడటమే ఆత్మజ్ఞానం పొందడానికి మొదటిమెట్టు. ఈ చక్రం నుండి బయటపడాలంటే ఫలితాన్ని ఆశించకూడదు. కానీ, ఈ పరిష్కారం అందరికీ నచ్చదు. అందుకే అతి కొద్ది మంది మాత్రమే జ్ఞానానికి ప్రయత్నిస్తూ ఉంటారని, ఆ కొద్ది మందిని ఉద్దేశించి చెప్పిన విషయమే నిష్కామకర్మ – అన గా కర్మచేస్తూ దాని ఫలితాన్ని కోరకపోవడం. ఫలితాన్ని కోరేవాడు సంతోషంగా కర్మఫలాన్ని ఆశిస్తూ మళ్లీ మళ్లీ పుడుతూ ఉండవచ్చని కూడా గీత చెబుతుంది. మరి ఈ కర్మల్ని వదిలేయవచ్చు కదా అనే ఆలోచన రావచ్చు. కానీ, అలా చేయకూడదని ఉపనిషత్తులు చెబుతాయి.
యజ్ఞం చేయడమంటే ఒక సమాజసేవ లాంటిది. అనేక వస్తువులను సమకూర్చుకోవాలి. చాలామందికి దానధర్మాలివ్వాలి. అన్నదానాలు చేయాలి. ఇదంతా సమాజానికి తోడ్పడేదే. ఇలాంటి పనులు మానేస్తే లోకంలో మంచిపనులనేవే లేని పరిస్థితి వస్తుంది. అందుకే కృష్ణుడు ‘నాకు ఎలాంటి అవసరం లేకున్నా అన్ని కర్మల్ని చేస్తున్నాను. నేను వదిలేస్తే అది ప్రజలకు సరియైున మార్గదర్శకం కాదు’ అని అంటాడు. అంటే ప్రతి వ్యక్తీ కర్మఫలాన్ని కోరేవాడైనా, కాకపోయినా కర్మల్ని చేస్తూనే ఉండాలి. ‘ శ్రేష్ఠుడైన వాడు ఏది ఆచరిస్తే ప్రజలందరూ దాన్నే ఆచరిస్తారు’ అంటాడు కృష్ణుడు. అతడు మిగతా వారికి ఆదర్శప్రాయుడు (టౌజ్ఛూ ఝౌఛ్ఛీజూ ) అవుతాడు అని అర్థం. ఇంట్లో ఆచారాలను వదిలేసి నేను రిలిజియస్‌ కాదండి, కేవలం స్పిరిచువల్‌ వ్యక్తిని అని చెప్పుకునేవాళ్లని చూస్తూ ఉంటాం. ఇలాంటి వారు తమ పిల్లలకు సరైన ఆదర్శం చూపించడం లేదు. ప్రజాహితం కోసం ఏమీ చేయకుండా ఉత్తుత్తిగా స్పిరిచువల్‌ అనుకోవడం సరియైునది కాదని శ్రీకృష్ణుడిలాంటివాడే చెప్పడం మనం గమనించాలి.
చివరికి తేలిన విషయం ఏమంటే, మనం ఆఫీసుకు వెళ్లి జీతం తీసుకోవడం అనే కర్మ గూర్చి కృష్ణుడు చెప్పడం లేదు. పుణ్యాన్నిచ్చే కర్మలు – శాస్త్రాల్లో చెప్పినవి – వ్రతాలూ, యాగాలూ, దానాలూ వీటిగూర్చే కృష్ణుడు చెప్పాడు. ఉపనిషత్తుల్లో ఉన్న మాటనే కృష్ణుడు చెప్పాడు. జ్ఞానమార్గంలో ఉండాలని అతికొద్దిమంది మాత్రమే ఆశిస్తారు. ఇలాంటివాళ్లు మాత్రమే నిష్కామకర్మ అనే మార్గాన్ని ఎంచుకుంటారు. మరికొందరు ఆయా యాగాలూ, దానాలూ చేస్తూ పుణ్యాన్ని కోరుకునే వాళ్లే. మిగతా చాలామంది ఆధునికులు ఏమీ చేయనివాళ్లు.
ఈ నిష్కామకర్మకే కర్మయోగం అని పేరు. దీన్ని గురించి మళ్లీ తెలుసుకుందాం.

డాక్టర్‌ కె. అరవిందరావు

అంతర్జ్యోతిని వెలిగించండి
సనాతన భారతీయ సంప్రదాయంలో, ఒకప్పుడు ప్రతిరోజూ ఒక పండగ జరుపుకునేవారు. అంటే సంవత్సరం మొతం్త 365 రోజులూ పండగలే. మన మొత్తం జీవితాన్నంతా ఒక వేడుకలా గడిపేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఆచారాన్ని ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తూ వీధిలో నడవడం, ఆఫీసుకు వెళ్లడం లాంటి మామూలు దినచర్యలను మనం ఒక సంబరంలా, వేడుకలా జరుపుకోవడం లేదు. అందుకే సంబరాలు, వేడుకలు చేసుకోవడానికి ఒక సాకుగా ఈ పండుగలు ఉండేవి. దీపావళి పండుగ ఉద్దేశం కూడా మీ జీవితంలో సంబారాన్ని నింపడమే. దానికి గుర్తుగానే టపాకాయలు పేల్చుతాం. అది మిమ్మల్ని ఎంతో కొంత ఉత్సాహంతో నింపడానికే. దీని ఉద్దేశం ఏదో ఆ ఒక్కరోజు సరదాగా గడిపేయాలని కాదు. మన లోపల ప్రతినిత్యం ఇలానే, అంటే ఒక పండగలానే ఉండాలి. కేవలం అలా ఊరికనే కూర్చున్నా, మన జీవశక్తి, మన హృదయం, మనసు, శరీరం అన్నీ కూడా ఒక సజీవ టపాకాయిలా అన్నివేళలా వెల్లివిరియాలి. అలా కాక మీరు తుస్సుమనే టపాకాయిలాంటి వారైతే, మిమ్మల్ని రగిలిస్తూ ఉంచడానికి రోజూ వెలుపలి నుంచి టపాకాయలు పేల్చాల్సి ఉంటుంది.
దీపాల పండుగే దీపావళి. ఈ దీపావళి రోజున పల్లె, పట్టణం, నగరం, అన్నీ వేలాది దీపాలతో వెలిగిపోతుంటాయి. కానీ, ఈ వేడుక కేవలం బాహ్యంగా దీపాలు వెలిగించడం గురించి కాదు. అంతర్జ్యోతి వెలగాలి. వెలుగంటే స్పష్టత. స్పష్టత లేనప్పుడు, మీలోని మిగతా సుగుణాలన్నీ కేవలం ప్రతిబంధకాలే అవుతాయి. వరాలు కావు. స్పష్టతలేని ఆత్మవిశ్వాసం ఘోర విపత్తులకు దారి తీస్తుంది. లోకంలో ప్రస్తుత పరిస్థితి గ మనిస్తే, ఎటువంటి స్పష్టతా లేకుండా ఎంతో విపరీతంగా పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఉదాహరణకు ఓ సంఘటన చెబుతాను. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ పోలీసు మొదటిసారిగా వాహనంలో తన సీనియర్‌ వెంట రాగా ఓ వీధివెంట వెళుతున్నాడు. కొంత సేపటికి వాళ్లకు వైర్‌లెస్‌లో ఓ వార్త వచ్చింది. ఫలానా చోట చాలా మంది గుమిగూడి ఉన్నారని, అదేదో చూడమని ఆ సందేశ సారాంశం. దాంతో వీళ్లు ఆ వీధిలోకి వెళ్లారు. నిజమే, ఆ వీధిలో ఓ పక్క చాలా మంది ఉన్నారు. ఇంకేముంది, మన కొత్త పోలీసు పరమోత్సాహంతో, తన కారు కిటికీ తలుపులు కిందికి దించి, వాళ్లను ఉద్దేశించి, ‘మర్యాదగా అందరూ అక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ గట్టిగా అరిచాడు. ఆ జనమంతా అర్థంకాక, సందిగ్ధంగా అతడి వైపు చూశారు. అంతేగానీ అక్కడ్నించి కదలలేదు. దాంతో కొత్త పోలీసుకు కొంచెం కోపం వచ్చింది. స్వరం కాస్త పెంచి, ‘చెబుతున్నది మీకే కదా! వెళతారా వెళ్లరా?’ అని కసురుకున్నాడు. అప్పుడు వారంతా వెళ్లిపోయారు.
ఉద్యోగం తొలిరోజు చేసిన తొలి పనిలోనే తను జనంపై చూపించిన ప్రభావానికి ఆనందపడుతూ తన సీనియర్‌ వైపు తిరిగి, ‘మొదటి డ్యూటీ… బాగా చేశానా?’ అని అడిగాడు. దానికా సీనియర్‌, ‘ ఫరవాలేదు, బాగానే చేశావు. కానీ అది బస్‌స్టాప్‌’ అన్నాడు. తగినంత స్సష్టత లేకుండా ఏ పనిచేసినా సరే, అది విపత్కర పరిస్థితులకు దారి తీస్తుంది. వెలుగు మన దృష్టికి స్పష్టత తెస్తుంది. కేవలం భౌతిక విషయాలకే కాదు, అన్ని విషయాలకూ ఇది వర్తిస్తుంది. జీవితాన్ని మీరెంత స్పష్టంగా చూడగలుగుతున్నారు, అలాగే మీ చుట్టూ ఉన్న వాటిని ఎంత స్పష్టంగా గ్రహించగలుగుతున్నారు అన్న విషయాలే మీరు మీ జీవితాన్ని ఎంత అర్థవంతంగా నడిపిస్తారనే విషయాన్ని నిర్ణయిస్తాయి. దుష్టశక్తులు అంతం చేయబడి, వెలుగులు విరజిల్లబడిన రోజే దీపావళి. సూర్యకాంతిని తామే అడ్డుకుంటున్నామని గ్రహించకుండా, కారుమబ్బులు ఎలాగైతే అంధకారంలో సంచరిస్తాయో, అలాగే మనిషి కూడా తనలోకి తానే కారుమబ్బులను అనుమితించానని గ్రహించకుండా, చీకటిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మనిషి ఎక్కడి నుంచో తనలోకి వెలుగుని తీసుకురావలసిన అవసరం లేదు. తనలో గూడుకట్టుకుని ఉన్న చీకటి మేఘాలను తాను చెదరగొడితే చాలు, వెలుగు దానంతట అదే వస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తుచేయడానికే ఈ దీపాల పండుగ.
 – సద్గురు
ఆమె పాత్రలు తెగని జ్ఞాపకాలు
ఆమె ఈ లోకాన్ని వదిలేసి ఇరవై ఏడేళ్లు దాటిపోయాయి. అయినా ఆమె స్థానాన్ని మరే తారా భర్తీచేయలేక పోయింది. ఓ వైపు ఆఫ్‌-బీట్‌ సినిమాల్లో, మరోవైపు కమర్షియల్‌ సినిమాల్లో రాణించి, విలక్షణ తారగా పేరుగాంచి, కేవలం 31 సంవత్సరాల వయసులోనే అర్ధంతరంగా మృతిచెందిన స్మితా పాటిల్‌ కళ్లు, గొంతు, నటన ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నటిగా స్మితను శిఖరాగ్ర స్థాయికి చేర్చిన కొన్ని సినిమాలను, ఆ సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలను జ్ఞాపకం చేసుకుందాం.

కేవలం 22 సంవత్సరాల వయసులో స్మితను ప్రతిభావంతురాలైన నటిగా ప్రపంచానికి చాటిన పాత్ర ‘భూమిక’ (1977)లోని ఉష. ఆమె కెరీర్‌లోని గొప్ప ప్రదర్శనల్లో ప్రథమ స్థానం ఈ ఉష పాత్రదే. తొలిసారి ఆమెను జాతీయ ఉత్తమ నటిని చేసింది కూడా ఇదే. డైరెక్టర్‌గా శ్యామ్‌ బెనగల్‌ సృజనాత్మక సామర్థ్యానికి మెచ్చుతునక ఈ సినిమా. స్మిత అభినయం వెనుక ఆయన కృషి విస్మరించరానిది. 1940ల నాటి సినీ తార హంసా వడేకర్‌ ఆత్మకథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు బెనగల్‌. ‘భూమిక’లోని ఉష ఓ నటి. తనను తాను తెలుసుకోవడానికి ఆమె చేసిన జీవన యానమే ఈ చిత్రం. అనేక విచ్ఛిన్న అనుబంధాల మీదుగా ఆయన జీవితం సాగుతుంది. తనకు తారసిల్లిన పురుషులందరూ (నసీరుద్దీన్‌ షా, అమోల్‌ పాలేకర్‌, అమ్రిష్‌పురి, అనంత్‌ నాగ్‌) తనను ఓ ‘వస్తువు’గా, లేదంటే, తమ కాల్పనిక లోకంలో భాగమైన ఓ ‘పాత్ర’గానే చూశారని ఉష గ్రహిస్తుంది. స్మిత అందాల తారగా ఎన్నడూ మనకు కనిపించలేదు. అయితే పాత్ర ఆత్మను ఒడిసి పట్టుకొని, ఆ పాత్రలో ఒదిగిపోవడం తెలిసిన ‘నటీమణి’ ఆమె. ఉష పాత్రలో ఆమె ఒదిగిన తీరు అపూర్వం.
‘భూమిక’ తర్వాత స్మితకు జాతీయ ఉత్తమ నటి అవార్డును సాధించిపెట్టిన చిత్రం ‘చక్ర’ (1981). ముంబై మురికివాడల్లోని లక్షలాది మంది జీవితాలను కళ్లకు కట్టించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సాధించిన విజయం ఆశ్చర్యకరం. ఎన్నో ఆశలతో ముంబైకి వలసవచ్చి, చివరకు ఓ మురికివాడలో ఆవాసాన్ని ఏర్పరచుకున్న అమ్మ అనే యువతి పాత్రను చేసింది స్మిత. భర్త మరణించడంతో అక్కడి బతుకు కూడా క్లిష్టమైపోతుంది. కేవలం బతకడం కోసం ఆమె నసీరుద్దీన్‌ షాతో, కుల్‌భూషణ్‌ ఖర్బందాతో సంబంధాలు పెట్టుకుంటుంది. కలలు కుప్పకూలిన చోట, బతుకు భయపెడుతున్న చోట ఆశలన్నీ కొడుకు మీదే పెట్టుకున్న సీ్త్ర అంతకంటే ఏం చేయగలదని మనమూ ఆమెపై సానుభూతి ప్రకటించేస్తాం. జీవిత వాస్తవికతను ఎంతో గ్రిప్పింగ్‌గా మన కళ్లముందు పరుస్తుంది ‘చక్ర’. అమ్మ పాత్ర పోషణ కోసం ముంబై తులసీ పైప్‌ రోడ్‌లో ఉన్న జోపడ్‌పట్టీస్‌ (మురికివాడ)కు వెళ్లి అక్కడి సీ్త్రల జీవితాన్నీ, అక్కడి వాతావరణాన్నీ స్వయంగా పరిశీలించింది స్మిత. బాలీవుడ్‌ గ్లామర్‌కు దూరంగా, పాత్రలో ఇమిడిపోయి ఎంతటి డీగ్లామరస్‌గానైనా కనిపించేందుకు వెనుతీయని నిజమైన తారగా ఈ చిత్రంతో మరోసారి ఆమె నిరూపించుకుంది. ఆమెకు ఈ చిత్రంలో ఓ స్నాన సన్నివేశం ఉంది. శోచనీయమైన విషయం ‘చక్ర’ పోస్టర్ల మీద స్నానం చేస్తున్న స్మిత ప్రధానంగా దర్శనమివ్వడం. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు నిర్మాతలు వేసిన ఎత్తుగడ ఫలించింది. ఈ సినిమా విడుదలైన సంవత్సరమే దాని దర్శకుడు రబీంద్ర ధర్మరాజ్‌ మరణించడం విచారకరం.
స్మిత కెరీర్‌లోని గొప్ప పాత్రల్లో ‘నమక్‌ హలాల్‌’ (1981)లోని పూనమ్‌ కేరక్టర్‌ ఒకటి కాదు. అయినప్పటికీ, ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన స్మిత సినిమా ఇదే. ఆమె నాయికగా నటించినవాటిలో బిగ్గెస్ట్‌ హిట్‌ ఫిల్మ్‌ కూడా ఇదే. కారణం ఇందులో హీరో అమితాబ్‌ బచ్చన్‌. అంటే స్మిత మరపురాని చిత్రాల్లో ఈ చిత్రానికి తప్పకుండా చోటుంటుంది. ప్రకాశ్‌ మెహ్రా డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం నటిగా స్మితలోని విలక్షణతను తెలియజేసింది. ఆమె కూడా కమర్షియల్‌ హీరోయిన్‌గా రాణించగలదనీ, పాటల్లో డాన్సులు చేయగలదనీ, రెయిన్‌ సాంగ్స్‌లో తడి తడి దుస్తుల్లో అలరించగలదనీ నిరూపించిన సినిమా ఇది. అమితాబ్‌ ప్రేయసి పాత్రకు తనకే సాధ్యమైన సున్నితత్వాన్ని జోడించి అందరి మెప్పూ పొందింది స్మిత.
నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న కేరక్టర్లు చెయ్యడానికి ఆమె ఎన్నడూ భయపడలేదు. ‘అర్థ్‌’ (1982)లో ఆమె కుల్‌భూషణ్‌ ఖర్బందా ప్రేయసిగా, సినీనటిగా నటించింది. ఆమె వల్లే భార్య షబానా అజ్మీని వదిలేస్తాడు కుల్‌భూషణ్‌. వివాహితుడైన తన ప్రియుడు ఎక్కడ తనకు దూరమవుతాడోనని భయపడే కవిత పాత్రను గొప్పగా పోషించింది స్మిత. అభద్రత, అపరాధ భావన మధ్య నలిగిపోయే పాత్రలో ఆమె నటనను చూసి తీరాల్సిందే. షబానాది సానుభూతి చూరగొనే పాత్ర. స్మితది ఎన్నో నాటకీయ సన్నివేశాలతో ప్రేక్షకులకు ఆగ్రహాన్ని తెప్పిందే పాత్ర. షబానా మాటలు వెన్నాడుతుంటే అద్దం ముందు నిల్చొని స్మిత ప్రదర్శించే హావభావాలు మనల్ని ఓ పట్టాన వదలవు. కూల్‌భూషణ్‌కు కొట్టి, ఆ వెంటనే తనను తానే కొట్టుకొనే సన్నివేశాన్ని మరచిపోలేం. నటిగా స్మిత విశ్వరూపాన్ని చూడాలనుకొనేవాళ్లు తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘అర్థ్‌’.
ఎనిమిదో దశకం మధ్యలో ‘తరంగ్‌’, ‘గిద్ధ్‌ దేబ్‌శిశు’, ‘రావణ్‌’ వంటి ఆఫ్‌బీట్‌ సినిమాలు చేసినా, అవి థియేటర్లలో సరిగా విడుదల కాకపోవడంతో ఆమె నటన చాలామందికి చేరలేకపోయింది. ఆ టైమ్‌లోనే కమర్షియల్‌గా విజయవంతమైన కొన్ని సినిమాలు చేసింది స్మిత. వాటిలో జె. ఓంప్రకాశ్‌ రూపొందించిన ‘ఆఖిర్‌ క్యోం?’ చెప్పుకోదగ్గది. ఇందులో ఆమె రాకేశ్‌ రోషన్‌ భార్య పాత్ర చేసింది. తన కజిన్‌ టీనా మునిమ్‌తో రాకేశ్‌ సంబంధం పెట్టుకోవడంతో, ఇంట్లోంచి బయటకు వచ్చేసి రాజేశ్‌ ఖన్నా స్నేహంతో, సొంత అస్తిత్వంతో నవలా రచయిత్రిగా ఎదిగిన నిషా పాత్రలో స్మిత ప్రదర్శించిన హావభావాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అయితే నిషా పాత్రను మలచడంలో ఆఖరున దర్శకుడు తికమకపడి ఔచిత్య భంగం చేయకుండా ఉండినట్లయితే ఈ పాత్ర మరింత గొప్పగా వచ్చి ఉండేది.
చాలా మంది ‘మిర్చి మసాలా’ స్మిత చివరి చిత్రమని పొరబడుతూ ఉంటారు. నిజానికి 1986 డిసెంబర్‌లో స్మిత మరణిస్తే, ఆమె నటించిన పలు చిత్రాలు 1989 వరకు విడుదలవుతూ వచ్చాయి. అయితే ఆమె మరణించాక వచ్చిన మొదటి ప్రధాన చిత్రం మాత్రం ‘మిర్చి మసాలా’. కేతన్‌ మెహతా డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో ఓ మిర్చి ఫ్యాక్టరీలో కార్మికురాలిగా పనిచేసే సోంబాయి పాత్ర చేసింది స్మిత. ఆ ప్రాంతాన్నంతా తన గుప్పెట్లో పెట్టుకొని సమాంతర రాజ్యం నడిపే నసీరుద్దీన్‌ షా తనను లొంగదీసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లొంగదు స్మిత. తోటి మహిళా కార్మికులను సమీకరించి, అతడిని ఎదుర్కొన్న ఆమె, ఆపత్కాలంలో సీ్త్రకి కారం ఎలా ఓ ఆయుధంగా ఉపయోగపడుతుందో చూపిస్తుంది.
కేవలం పన్నెండేళ్ల కెరీర్‌ (1974 – 1986)లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో భారతీయ సినిమాకు గర్వకారణమైన తారగా పేరుపొందిన స్మితా పాటిల్‌ను కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించింది. భారతీయ సినిమాకు వందేళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని తపాలా శాఖ 2013 మే 3న ఆమె పేరిట ఓ పోస్టేజ్‌ స్టాంపును విడుదల చేయడం నటిగా ఆమెకు లభించిన గౌరవం.

(నేడు స్మితా పాటిల్‌ జయంతి)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ్వించిన కథకుడికి కన్నీటి వీడ్కోలు – ఎలికట్టె శంకర్‌రావు

నవ్వించిన కథకుడికి కన్నీటి వీడ్కోలు – ఎలికట్టె శంకర్‌రావు
అందమైన కథకుడు ఎన్‌.కె. రామారావు తుది శ్వాస విడిచారు. హాస్యప్రియుడు శాశ్వత మౌనం దాల్చారు. ఆయన మిత్రులకు, కుటుంబ సభ్యులకు విషాదం మిగిల్చారు. ఎన్‌.కె. రామారావుగా ప్రాచుర్యం పొందిన నారపరాజు కోదండ రామారావు స్వగ్రామం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌ సమీపంలోని కందిబండ. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఆరు మాసాల ముందు ఆయన జన్మించారు. హుజూర్‌ నగర్‌, తెనాలి, విజయవాడ, నల్లగొండలలో విద్యాభ్యాసం చేశారు. న్యాయశాఖలో ఉద్యోగం చేసి తొమ్మిది సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేశారు. రామారావుకు సాహిత్యం, సంగీతమంటే మక్కువ. ఆయన మంచి పాఠకుడు. మంచి శ్రోత.
సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం నల్లగొండలో కొంతమంది రచయితలు కలసి యువ రచయితల సమితిని ఏర్పాటు చేశారు. మేరెడ్డి యాదగిరి రెడ్డి, బోయ జంగయ్యతో పాటు రామారావు కూడా ఈ సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. కాంచనపల్లి చిన వెంకటరామారావు ప్రోత్సాహంతో కథలు రాయటం ప్రారంభించారు. ముప్ఫయ్‌ ఐదు కథలు రాశారు. పన్నెండు కథలతో విద్యుల్లత కథా సంపుటిని అందించారు. ఆ తర్వాత నవ్య వీక్లీ అప్పటి సంపాదకుడు శ్రీరమణ ప్రోత్సాహంతో మరిన్ని కథలు రాశారు. మా మిలట్రీ బాబాయి పేరుతో ఈ కథా సంపుటిని అందించాలనుకున్నారు. కానీ మధ్యలోనే వెళ్ళిపోయి ఆయన అభిమానులకు నిరాశను మిగిల్చారు.

రామారావు తెలుగు సాహితీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీశ్రీ, రావిశాసి్త్రలతో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది. జిల్లా రచయితల సమితి ఆధ్వర్యంలో నల్లగొండలో జరిగిన సభలకు శ్రీశ్రీని తీసుకురావడం ఆయన ఘనతే. రావిశాసి్త్ర నల్లగొండకు రావడానికి కూడా ఆయనే కారణం. ఎన్‌.కె. రామారావుకు పాత పాటల సేకరణకు ఎంతో ఆసక్తి చూపించేవారు. ఆయనకు వింటేజ్‌ మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. తెలుగు హిందీ సినీ ప్రముఖుల మీద వ్యాసాలు కూడా రాశారు. అవన్నీ హాసం పత్రికలో అచ్చయ్యాయి. పెద్దలతోనూ ఆయన స్నేహాలు అద్భుతమైనవి. బాపు, రమణ, శ్రీరమణలకు ఆయన వీరాభిమాని. విఎకె రంగారావు మనసునూ ఆయన దోచుకున్నారు. బహుభాషావేత్త నోముల సత్యనారాయణ అన్నా ఆయనకు ప్రత్యేక గౌరవం. నల్లగొండలో ఆయన ఎక్కువగా సమయం వెచ్చించింది నోములతోనే. రామారావు మంచి చతురుడు. సాహితీ ప్రియులు ఆయన సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. రామారావు రూపంలోనే కాదు కథల్లో కూడా శిల్పం అంటే ఇష్టపడతారు. అలాంటి కథలనే రాసినారు. ఆయన కథలు గంభీరమైన విషయాలనూ చెప్పినాయి. గిలిగింతలు పెట్టే హాస్యాన్ని పంచినాయి. ఎన్‌.కె. రామారావు వెళ్ళిపోవడంతో తెలుగు కథ చిన్నబోయింది. సాహితీ మిత్రుల్లో విషాదం అలుముకుంది.
– ఎలికట్టె శంకర్‌రావు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆకాశవాణి, ఆ నలుగురూ…

ఆకాశవాణి, ఆ నలుగురూ…
నిన్నగాక మొన్న రావూరి భరద్వాజ, అటు మొన్న కె.చిరంజీవి , నిన్న పైడి తెరేష్‌ బాబు, నేడు తురగా జానకీరాణి…. ఇలా ఒకరికొకరుగా రాలిన ఆకాశవాణి తారలు. వీరందరిలో సానురూప్యత ఉంది . ఎవరి పంథాలో వారు ధిక్కార స్వరాలు. ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతో వారిస్థాయిలో వారు నినదించిన కంఠాలు-కలాలు. రావూరి జ్ఞానపీఠపురస్కారమందుకున్నారు. జీవితమంతాకష్టాలకొలిమిలో కొనసాగిన నేపథ్యం . ఆ నేపథ్యమే వారిని జనం మనిషిగా మార్చింది. ఇక కె.చిరంజీవి రేడియో నాటక ప్రయోక్తగా, రచయితగా, మనసున్న మనిషిగా సమాజానికి తనదైన బాణీలో సేవలందించారు. నాటకరంగంలో ఎందరో ఆయనకు ప్రత్యక్ష పరోక్ష శిష్య గణం. తెరేష్‌ బాబు ‘దళితవాదం’తో హిందూ మహాసముద్రంలో అల్పపీడనం సృష్టించిన వాడు . తురగా జానకీరాణి ‘రేడియో అక్కయ్య’ గా ఆకాశవాణి ద్వారా అందరికీ సుపరిచితురాలు. అయితే సీ్త్రవాద రచయిత్రిగా, రాసిన దానిని ఆచరించిన వ్యక్తిగా సమాజశ్రేయస్సులో తాను ఎంచుకున్న బాటలో నడిచిన వ్యక్తి.
ఈ నలుగురూ …ఆకాశవాణి పొత్తిళ్ళ సాక్షిగా ఎదిగినవారు. ఆకాశవాణి తరతరాల సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించిన వారు . తెలుగు సాహిత్యంలో దళితవాదం , సీ్త్రవాదాలకు పైడి తెరేష్‌ బాబు , జానకీరాణీలు ప్రతీకగా నిలిచారు. చిరంజీవి సామ్యవాద రచయితగా జనం మనిషిగా ఎదురొడ్డారు. ఇక భరద్వాజ గురించి అందరికీ తెలిసిందే . పాకుడురాళ్ళతో ఆకాశవాణికి అందనంత ఎత్తుకు ఎదిగారు.
సమాజంలో వస్తున్న మార్పులకు దీటుగా ‘ఆకాశవాణి’ ధ్వని నిరంతరం విన్పిస్తూనే ఉంటుందనడానికి 2014లో రాలిన ఈ నలుగురు ‘తారల’ చరిత్రే చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. సృజనశీలురకు , ప్రగతికాముకులకు, పురోగతిని వీక్షించే వారికి ‘ ఆకాశవాణి’ ఎప్పుడూ వెన్నంటే ఉంది . వారిని అల్లారు ముద్దుగా పెంచింది. వారి వారి భావాలకు బూజుపట్టకుండా గుండెలకు హత్తుకుంది . ప్రయోక్తల మనో భావాలకు , స్వేచ్ఛలకు బంధనాలు వేయలేదు . అందుకే అందరూ తారలయ్యారు. ఆకాశవాణి సాంస్కృతిక వారసత్వం నిలబ్టెటడంలో ధ్రువతారలయ్యారు.
నియమనిబంధనలున్నా , ప్రభుత్వ విధానాలున్నా ‘ఆకాశవాణి’ఆకాశమే హద్దుగా తన ఒడిలో తన పిల్లలను ప్రగతి శీలురుగా తీర్చి దిద్దింది. ఒక సామాజిక దృక్పథాన్ని , తాత్విక చింతనను నేర్పింది. ఆకాశవాణి ప్రాంగణంలోని వృక్షాల సాక్షిగా అందరూ జ్ఞానోదయంపొందిన వారే . ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచే క్రమంలో వికసించిన వారే . అందుకు ఈ నలుగురూ అతీతులు కారు . మినహాయింపులేదు. పరిణామక్రమంలో ఆకాశవాణి అందించిన సేవలు అజరామమైనవి. . ఆసేవలు సమాజంలో విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని కోరుకుంటూ పరితపించిన ఈ నలుగురూధన్యజీవులు . వీరు ఎప్పటికీ చిరంజీవులే . ఆకాశవాణిని ప్రజల వాణిగా మార్చే ప్రస్థానంలో సేవలందించిన ‘నలుగురు’ ఆకాశవాణి ముద్దుబిడ్డలను స్మరించుకుంటూ..
– వలేటి గోపీచంద్‌
రాష్ట్ర కార్యదర్శి , ఆకాశవాణి,
దూరదర్శన్‌ల కార్యక్రమాల సిబ్బంది సంఘం
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా పల్లె బతకు ల్లొమోగుతున్న ”చావు డప్పు ”-

పల్లె తెలంగాణలో చావురుతువు(సంధర్బం) – కె.శ్రీనివాస్
మెదక్‌ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ కెసిఆర్‌, మెజారిటీ తగ్గకుండా ఓటు చేయాలని ప్రజలను కోరారు. ‘‘నవ్వేటోళ్ల ముందు జారిపడ్డట్టు చేయకండి’’ అని అభ్యర్థించారు. కెసిఆర్‌ ప్రతిష్ఠను కాపాడడం ప్రజల బాధ్యత అయింది. ఆ బాధ్యత వారు నెరవేర్చారు. నూతన రాష్ట్ర ఆశయాన్ని సార్థకం చేస్తూ, సత్పరిపాలన అందిస్తేనే తెలంగాణ ప్రతిష్ఠ నిలబడుతుంది. తెలంగాణ ప్రతిష్ఠను కాపాడడం ఇప్పుడు కెసిఆర్‌ వంతు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది.

నోరుతెరుచుకున్న నిర్లక్ష్యపు బోరుబావిలో నలభై అడుగుల లోతులోకి నాలుగేళ్ల గిరిజ పడిపోయినప్పుడు, ఆ పసితల్లిని ప్రాణాలతో వెలికి తేవడం సాధ్యమవుతుందని ఎవరూ గట్టిగా నమ్మి ఉండరు. కుటుంబసభ్యులంతా పత్తి ఏరడానికి వెళితే, పనిచేయలేని వయసు కాబట్టి ఆడుకోవడానికి కాసింత వెసులుబాటు దొరికితే, ఆ పిల్ల అట్లా చావుబొరియలోకి జారి పోయింది. ప్రాణం లేని బొమ్మ లాగా వెలికిరావడానికి నలభైఎనిమిది గంటలపైనే పట్టింది కానీ, గిరిజ ప్రాణం కొన్ని గంటల్లోనే పోయి ఉంటుంది. ఏం జరిగిందో తెలియని స్థితిలో భయంతోను, ఊపిరాడకుండాను ఆ పాప ఎంతటి నరకం అనుభవించిందో ఊహించలేము. అయినా, లోపల ఇంకా సజీవంగానే ఉంటుందని, ప్రయత్నించి బయటికి తెస్తే బతికించుకోవచ్చునని గిరిజ తల్లిదండ్రులే కాదు, ప్రభుత్వయంత్రాంగమూ చుట్టుపక్కల ప్రజలూ టీవీల్లో ఆ విషాదాన్ని చూస్తున్న ప్రేక్షకులూ అంతా ఆశించారు. లాభం లేదు లెమ్మని ఎవరూ ప్రయత్నించకుండా మానుకోలేదు. ఫలితంతో నిమిత్తం లేకుండా ఒక మరణాన్ని నివారించడానికి మానవీయమైన ప్రయత్నమంతా జరిగింది.
బోరుబావి పాతాళమెట్లా ఉంటుందో, శ్వాసదొరకని చీకటి నరకమెంత బీభత్సంగా ఉంటుందో గిరిజే కాదు, తెలంగాణ రైతాంగానికంతటికీ తెలుసు. అప్పుల ఊబి, నిరాశ చీకటి, కాసింత వెసులుబాటునివ్వని దుర్భిక్షం, కావలసినవేళ కనీసంగానైనా దొరకని కరెంటు- వీటన్నిటి మధ్య రైతులు పరిస్థితి కూడా బోరుబొరియల్లో పడ్డ పసిపాపల వలెనే ఉంటుంది. వారిని ఎవరో ఆ అగాధాల్లోంచి ఉద్ధరించాలి. వారికి ఊపిరాడడానికి ఎవరో కాసింత ప్రాణవాయువు అందించాలి. బతుకుతారో లేదో తెలియదు కానీ, బతికించే ప్రయత్నమేదో చేయాలి. అట్లా చేస్తున్నట్టు సమాజానికి తెలియాలి.
తెలంగాణ రైతుల దురదృష్టమేమిటోకానీ, సొంత రాష్ట్రంలో ఏర్పడిన తొలిప్రభుత్వంలోనే వారి వేదన అరణ్యరోదనగా మారుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి రెండువందల యాభై మందికి పైగా రైతులు ప్రాణం తీసుకున్నారు. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే, అతను ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభంలోనే దాదాపు కొన్ని వందల మంది ఉంటున్నారని లెక్క. పత్తి రైతులే కాదు. వరి రైతులు కూడా నిరాశలోకి కుంగిపోతున్నారు. గురువారం నాడు వరంగల్‌ జిల్లాలో వరిపొలాలను రైతే స్వయంగా తగులబెట్టుకున్నాడు. ప్రతిరోజూ అయిదుగురో ఆరుగురో పదిమందో ఉసురు తీసుకుంటున్నారు. పల్లెసీమలో చావు డేరా వేసిందని ప్రభుత్వం కనీసంగా గుర్తించడం లేదు. 1997-98 ప్రాంతాల్లో వరంగల్‌ తదితర జిల్లాల్లో పత్తిరైతులు వందలసంఖ్యలో మరణించినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూపిన స్పందనకీ, ఇప్పుడు చంద్రశేఖరరావు ప్రభుత్వం చూపుతున్న స్పందనకూ తేడాయేలేదు. నాటి వ్యవసాయ సంక్షోభమే మలిదశ తెలంగాణ ఉద్యమానికి నేపథ్యంగా పనిచేసిందని గుర్తుచేసుకోవాలి. బుద్ధిజీవుల్లోను, ఉద్యోగుల్లోను ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం రాజకీయాల్లోకి కూడా ప్రవహించిన తరువాత ఎంతో కాలానికి గానీ గ్రామీణ ప్రాంతాల్లోకి, రైతాంగంలోకి ఇంకలేదు. పణికర మల్లయ్య చంద్రబాబు నాయుడును అడిగిన ప్రశ్న, రైతాంగం తెలంగాణ రాష్ట్రం మీద పెట్టుకున్న ఆశలకు ఒక సంకేతం. మరి ఆకుపచ్చని తెలంగాణ, మానవీయమైన తెలంగాణ, అసహజమరణాల్లేని తెలంగాణ- ఏమయింది?
రైతాంగంలో నెలకొన్న మనుగడ సంక్షోభం, దాని తీవ్రత కెసిఆర్‌కు తెలియనిది కాదు. తెలంగాణ వాదం ఒక్కటే తనను పూర్తిగా గెలిపించలేదని ఆయనకు అనుమానం ఉంది కనుకనే, రుణమాఫీ, పింఛన్లు వంటి సంక్షేమ హామీలను ఆయన గుప్పించారు. అక్కడ చంద్రబాబుకైనా, ఇక్కడ కెసిఆర్‌కైనా రుణమాఫీ తురుఫుముక్క వలె పనిచేసింది. తమను గెలుపునకు నడిపించిన ఆ అంశం గురించి ఈ ప్రభుత్వాలు చేస్తున్నదేమిటి? రుణమాఫీ పూర్తిగా అమలుచేసి ఉంటే, లేదా చేయగలిగి ఉంటే, ఈ ఆత్మహత్యలు నివారించగలిగేవారమా? కాకపోవచ్చు. ఉసురు తీసుకుంటున్న రైతుల మీద ఉన్న రుణభారం గురించి వింటుంటే, ప్రభుత్వ మాఫీ ఏ మూలకూ సరిపోయేది కాదు. కానీ, ప్రభుత్వాల సీరియస్‌నెస్‌కు మాఫీ అమలుపై వేసిన పిల్లిమొగ్గలు ఒక సూచిక. పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు వేలాదికోట్ల వడ్డీలను, జరిమానాలను, రుణాలను మాఫీ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టని బ్యాంకింగ్‌ నిబంధనలు లక్షలాది రైతుల జీవన్మరణాల సమస్య విషయంలో అడ్డుపుల్లలు వేయడం అమానుషం. ఎవరితోనైనా తగాదాపడడానికి వెనుకాడనన్నట్టు ఉండే కెసిఆర్‌, ఈ విషయంలో రాజకీయపోరాటం చేసి ఉండవలసింది, ప్రజలు ఆయన వెనుక ఉండేవారు. సరే, మాఫీ సంగతి పక్కనబెడదాం. ఆత్మహత్యల నివారణకు క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదా? హైదరాబాద్‌ను విశ్వనగరంగా, కరీంనగర్‌ను న్యూయార్క్‌గా, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి సాధ్యపడుతున్నప్పుడు, కొన్ని విషాదమరణాలను, తెలంగాణకు అవమానకరమైన చావుజాతరను ఆపడానికి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదా? నిజంగా ఏమీ చేయలేదా?
సమగ్ర సర్వే నిర్వహణలో పాల్గొన్న ఒక ఉపాధ్యాయమిత్రుడు అదే రోజు సాయంత్రం తామడిగిన ప్రశ్నల గురించి ఇట్లా వ్యాఖ్యానించాడు. ‘‘ ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లకు ఉన్న ఆస్తుల గురించి అడిగాము కానీ, అప్పులనడగలేదు. అప్పుల గురించి చెప్పని సర్వేలో అర్థసత్యాలే తెలుస్తాయి’’. కానీ, మన గ్రామసమాజాల్లో సాటి మనిషి రుణభారం గురించి తెలియకుండా ఉండదు. అవసరమైనప్పుడు గ్రామసభలను నిర్వహిస్తే, నెలకొని ఉన్న సంక్షోభ వాస్తవికత వెల్లడి అవుతుంది. నిస్పృహ వ్యక్తం చేస్తున్న మనుషులకు తోటివారు ధైర్యం చెప్పడమో, ధైర్యం కలిగే మార్గాలను సూచించడమో చేస్తారు. లేదా, సహాయాన్ని పొందే మార్గం అన్వేషిస్తారు. తలచుకుంటే, ఎక్కడెక్కడ సంక్షోభం పొంచిఉన్నదో, ఎక్కడెక్కడ ఆత్మహత్యలకు ఆస్కారం ఉన్నదో ప్రభుత్వం తెలుసుకోలేదా? ధైర్యం చెప్పగలిగే మార్గాలను అనుసరించలేదా? తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన పాటను, విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి ఉపయోగించిన పాటను, రైతు ఆత్మహత్యల విషయంలో ఒక సాధనంగా వాడుకోలేరా? పూర్తి స్థాయి కరెంటు ఇవ్వలేకపోతే మానె, కనీసంగా తడి చావకుండా విద్యుత్‌ను వంతులవారీగా అందించడానికి గల అవకాశాలను పరిశీలించారా? మరికొంత త్యాగం చేయమని పట్టణ పౌరులను, పారిశ్రామికవేత్తలను అభ్యర్థించారా? కరెంటు దొరకడం దుర్లభం అనుకుంటే, పరిశ్రమలకు మరోరోజు కత్తెరవేసి, అవసరమైతే వారికి అందుకు తగిన పరిహారం చెల్లించి, కనీసంగా పొలాలను తడిపి ఉంటే కొన్ని ప్రాణాలైనా దక్కేవి కాదా?
ఇవన్నీ ఎందుకు జరగలేదు అని ప్రశ్నించుకుంటే, అప్రియమైన సమాధానమే దొరుకుతుంది. రైతులను వాళ్ల చావుకు వాళ్లను వదిలేశారు. అంతే. ప్రభుత్వానికి సంకల్పం లేదు. ప్రభుత్వాధి నేతకు ప్రాధాన్యాలు తెలియడం లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కొత్త ఆలోచనలను ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తూవచ్చారు. వాటిలో అనేకం తెలంగాణ సమాజానికి మేలు చేసేవి, సృజనాత్మకమైనవి ఉన్నాయి. తెలంగాణ సంస్కృతిని వ్యక్తం చేసే అనేక వేడుకలు కూడా జరిపారు, అవీ జనాన్ని ఉద్వేగానాందాలలో ముంచెత్తాయి. పాలనలో ఆచరణలో ఏమి జరిగింది? విద్యార్థులపై, రైతులపై లాఠీచార్జిలు, మీడియాపై నిషేధాలు, సభలపై ఆంక్షలు, సంక్షేమపథకాల సమీక్ష పేరుతో ప్రజలను ఆందోళనపరిచే చర్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వర్గాలవారికి, రాష్ట్రం సిద్ధించిన కొన్ని రోజులకే చేదు అనుభవాలు ఎదురు కావడం ఏ సంకేతాలను పంపిస్తుంది? పింఛన్‌ దరఖాస్తులు ఇచ్చుకోవడానికి వృద్ధులు క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వానికి ఏమి ప్రతిష్ఠ? ఏ ప్రభుత్వాన్నైనా రాజకీయ ప్రత్యర్థులు విమర్శించడం సహజం. ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడానికి విమర్శలు చేసేవారూ ఉండవచ్చు. అదీ రాజకీయాలలో సాధారణమే. కానీ, విమర్శలన్నీ శత్రుపూరితమైనవని, ప్రభుత్వాన్ని విమర్శించడమంటే తెలంగాణను వ్యతిరేకించడమే అనే ధోరణి చూపించడం వివేకం కాదు. తప్పులను కప్పిపుచ్చి, అంతా సజావుగా ఉన్నదని చెప్పేవారు ఎవరైనా కావచ్చును కానీ శ్రేయోభిలాషులు మాత్రం కాదు.
అంతా వైఫల్యమే అని చెప్పడానికి నాలుగు నెలల కాలం సరిపోదు. అందుకే, జనం ఇంకా సహనంతో ఉన్నారు. కానీ, రైతుల చావులెక్క పెరుగుతున్న కొద్దీ ఓపిక వేగంగా క్షీణిస్తున్నది. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు, మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఒక ముఖ్యమైన తేడా ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ప్రభుత్వం కొత్త రాజధానిని నిర్మించడంతో పాటు, యథావిధి పాలన సాగిస్తే సరిపోతుంది. తెలంగాణలో అట్లా కాదు. తెలంగాణ ప్రజలకు కొత్త రాష్ట్రం సాధించుకున్నందువల్ల కొన్ని, కొత్త ప్రభుత్వం నుంచి మరి కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. యథావిధి పాలన నిర్వహిస్తూనే, కొత్త రాష్ట్రం లక్ష్యాలను కూడా పరిపూర్తి చేయాలి. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు పథక రచన చేస్తూ, తక్షణ పాలన కూడా కొన సాగించాలి. కొత్త ప్రభుత్వం విఫలమైతే, తెలంగాణ రాష్ట్ర ఆశయమే విఫలమయినట్టవుతుందని ప్రజలు భయపడు తున్నారు. ఆ భయం నిజం కాదని నిరూపించవలసిన బాధ్యత కెసిఆర్‌పైనే ఉన్నది.
మెదక్‌ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ కెసిఆర్‌, మెజారిటీ తగ్గకుండా ఓటు చేయాలని ప్రజలను కోరారు. ‘‘నవ్వేటోళ్ల ముందు జారిపడ్డట్టు చేయకండి’’ అని అభ్యర్థించారు. కెసిఆర్‌ ప్రతిష్ఠను కాపాడడం ప్రజల బాధ్యత అయింది. ఆ బాధ్యత వారు నెరవేర్చారు. నూతన రాష్ట్ర ఆశయాన్ని సార్థకం చేస్తూ, సత్పరిపాలన అందిస్తేనే తెలంగాణ ప్రతిష్ఠ నిలబడుతుంది. తెలంగాణ ప్రతిష్ఠను కాపాడడం ఇప్పుడు కెసిఆర్‌ వంతు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హుధూదుదంతం

 

 

హుధూదుదంతం

హుత్ అంటే పారిపోతున్దనుకొన్న హుధూద్ తుఫాను అందమైన విశాఖను విశోక నూ ప్రకృతి రమణీయ అరకును చెరుకు ముక్కలుగా ,ప్రశాంత విజయనగారాన్ని విలయ నగరం గా ,ఉత్తరాంధ్ర కధకు ఆటపట్టు చికాకోల్ ను చిక్కుల వలయం గ మార్చింది .కనీ వినే ఎరుగని భీభత్సాన్ని సృష్టించి బతికిన వారికీ ఎందుకు బతకాలనే నిరాశనే మిగిల్చింది .చీలి కోలుకొంటున్న నవ్యాంధ్ర నడుం విరిచింది .కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకొన్నా ప్రక్రుతి ముందు మానవుడు ఓడిపోవాల్సోచ్చింది .ఇది ‘’ఎంత్ టైం’’..కాని వీటిని తట్టుకొని నిలబడి అసమాన ధైర్యాన్ని జీవి తేచ్చను ప్రదర్శించిన సామాన్యులను అ ముందుగా అభినందించాలి .ఆతర్వాత ప్రజా ముఖ్యమంత్రి చంద్ర బాబును ,ఆయనకు ప్రతిక్షణం తోడ్పడిన సహ మంత్రులను వారికీ తోడ్పడుతున్న ప్రభుత్వాధికారులను యెంత ప్రశంసించినా సరిపోదు .కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ముందు జాగ్రత్త చర్యలకు సహాయమందించి దేశీయ విపత్తుగా భావించి వెన్నంటి నిలచిన ప్రజా మోడీ అయన ప్రభుత్వమూ ఎన్ని అభిన్దనలకైనా అర్హమే .కునుకు లేకుండా చిమ్మ చీకటిలో ,ప్రళయ కాలపు చినుకుల మెరుపులా ఉరుముల కుండ పోత ధారల్లో ప్రజానీకం వణికే పోయారు .వారికి ఆపన్న హస్తం అందించటానికి విలయానంతరం అందరూ ముందుకు రావటం హర్షణీయం .ఇది మానవుడు సృష్టించుకొన్న విపత్తు కాదు .నెత్తిపై బలవంతాన పడిన తుఫాను పిడుగు .ఈల వేసి విజ్రుమ్భించి గోల చేసి నాశనం చేసి ,అన్నిటినీ ముంచి తేల్చి జన జీవితాన్ని పీల్చిపిప్పి చేసింది హుధూధు.ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కన్నీటి నివాళి .ఆస్తినష్టం అయినవారికి సానుభూతి .గుండె ధైర్యం తో బతుకు పోరాటం లో గెలిచి నిలబడ్డ వారందరికీ అభినందనలు .ఇలాంటి ప్రళయం మళ్ళీ రారాదని కోరుకొందాం .ఆపన్న హస్తాలు అందిస్తున్న సకల జనులకు ,ప్రభుత్వాలకు సంస్తలకు తీర రక్షణ దళాలకు ఎన్ని కృతజ్ఞతలు చెబితే ఈ ఋణం తీరుతుంది?వారి సద్య స్పందనకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు .ఆంద్ర జాతి ?కో త్తకాపురం కూర్చుకొనే వేల తట్టా బుట్టా సమకూర్చుకొనే సమయం లో కుండా చట్టీకూర్చుకొనే లోపే ఈ జల ఖడ్గ ప్రహారమా?ప్రకృతీ !ఇక నైనా శాంతించు .మా తప్పులేమైనా ఉంటె మన్నించు ఇంతకోపం, ప్రతీకారేచ్చ లకు తట్టుకోగలడా మానవుడు?ఆలోచించు .బిడ్డల తప్పులుంటే సరిదిద్దు .ఇంతటి క్రూర శిక్ష ఇక వద్దు వద్దు వద్దు .images (7) images (6) images (5) images (4) images (3) images (2) images (1) images download

ఎన్నెన్నో హుదుదూ కధనాలు

సాధారణ భూగోళ ఉష్ణోగ్రత ఇరవై  ,పాతిక డిగ్రీలు ఉండాల్సింది యాభై డిగ్రీలకు చేరినందు వల్ల వచ్చిన పెను ముప్పు అన్నది నాసా .’’పంచెకట్టాయన’’భార్య విజయమ్మ ను నెత్తికెత్తుకోక ఓడించిన దాని ఫలితమే అన్నాడొక ఉస్త్ర పక్షి .లేదు గురూ –ఇదంతా బాబు ఉదయం కాకుండా రాత్రి ముహూర్తం లో ప్రమాణ స్వీకారం చేసిన ఫలితం అన్నాడొక పరివ్రాజకుడు .అసలు అయిపోయి తీరం దాటి వెళ్ళిపోయి తోక ముడుస్తున్దనుకొన్న ధూధూద్ ‘’బూమేరాంగ్’’ లాగా వెనక్కి తిరిగొచ్చి పిచ్చకొట్టుడు కొట్టింది గాలీ వానాతో అన్నాడొక వాతావరణజ్నుడు .అసలు మా ‘’ఇటలీ యమ్మను’’ ,కొడుకు ‘’బుచ్చిని ‘’ కేంద్రం లో అధికారం లేకుండా ,రాష్ట్రం లో నామ రూపాలు లేకుండా చేస్తే ప్రక్రుతి సహిస్తుందా?పగ బట్టి మరీ ప్రతీకారం తీర్చుకోంది అన్నాడు ఖద్దరు లాల్చీ ఆయన .రాష్ట్రం లో యెర్ర ఖండువా లేకుండా చేసిన దానికి ప్త్రతిఫలమన్నాడొక యెర్ర చొక్కా మేధావి . ‘’ఓదారుస్తా ‘’నంటూ ‘’గాలిమరాయన ‘’ హావ భావాల తో వికృత చేష్టలతో మళ్ళీ జనం లోకి దూకుడు .మెగాలు   సూపర్లు ,లెజెండ్ లు మాటల వాళ్ళే అయ్యారు కాని క్షేత్రస్తాయిలో కనిపించలేదు .జనం పెరుపెట్టుకొన్న జన సేన నాయకుడు మాత్రం రంగం లోకి దిగి ముందుకొచ్చాడు సుభాష్ గబ్బర్ .

‘’అసలు తుఫాను కన్ను (ఐ) ఒంటికన్ను .అది శుక్రాచార్యుడికి సంకేతం .రాక్షస పగ .అందుకే అంత భీభత్సం  కన్నుకు వెలుపల గోడ (ఐవాల్)లో క్యుములో నింబస్ మేఘాలు నిండి కుంభ వృష్టి కురిపించి అనర్ధాన్ని కల్గిస్తాయి .ఐవాల్ తర్వాత ఉండే ‘’రెయిన్ బాండ్స్ ‘’మూడు వందల మైళ్ళ దాక వ్యాపించి గంటకు రెండు వందల కిలో మీటర్ల వేగం తో గాలులు వీస్తూ ,మేఘాలతో అల్లుకొని ఉండటం తో కుండపోత వర్షం పడుతుంది .తుఫాన్ కన్ను తీరం   చేరగానే  ఆ భాగం ప్రశాంతం గా ఉండి కాసేపు స్మశాన నిశ్శబ్దం ఏర్పడి ,వెంటనే ఐవాల్ తరుముకొచ్చి భీభత్సం సృష్టిస్తుంది .ఇదీ దాటి ,రెయిన్ బాండ్స్ కూడా దాటిపోతే తుఫాను బలహీనమై సమసి పోతుంది ‘’అని హుదూద్ సృష్టించిన విలయాన్ని తీరికగా తెలిపారు వాతావరణ శాస్త్ర వేత్తలూ మీడియా మనీషులు .అంటా అయిన తర్వాత .ఇది నాలుగవ కేటగిరీ తుఫాన్  అన్నారు తీరిగ్గా ఇప్పుడు .’’

రైలు బోగీలే తల దాచుకొనే రక్షణ భూములయ్యాయి చాలా మందికి .ముందు జాగ్రత్తగా రైలు విమాన బస్ సర్వీసుల్ని రద్దు చేయటం తో పెను విలయం ,ప్రాణ నష్టం తప్పింది.  .దీనికి ప్రభుత్వాన్ని మెచ్చాలి  విమాన స్థలం పంటలు రాడార్ కేంద్రం ,ఇల్లు ,అపార్ట్ మెంటులూ నష్టాన్ని అనుభవించాయి .అపార్ట్ మెంట్లు తాతాకుల్లా ఊగిపోయాయి అంటే యెంత ఉపద్రవం వచ్చి మీద పడిందో అర్ధమవుతోంది .ప్రతిక్షణం ‘’మానిటర్’’ చేస్తూ ప్రజలకు ధైర్యం చెబుతూ  సహాయ కార్యక్రమాలకు సూచన లిస్తూ  ,పర్య వేక్షిస్తూ యంత్రాంగాన్ని నడిపించటం లో బాబు చూపిన తీరు బహుదా ప్రశంసనీయం .అందుకే ఆయన్ను ఏరి కోరి పదేళ్ళ తర్వాత  ఆయన్ను  ప్రజలు తమకు రక్షకుడు కావాలని ఎన్నుకొని పట్టం కట్టారు .దానికి ఋణం తీర్చుకొన్నాడు .ఇక్కడ కావలసింది సమన్వయము .దాన్ని సంపూర్తిగా సాధించాడు .రాత్రి ఒంటి గంటకే లేచి రోడ్డున పడే ముఖ్య మంత్రి ఎవరినైనా ఇంతవరకు మనం చూశామా?నీటి సరఫరా ఆహార సరఫరా ,విద్యుత్  ట్రాన్స్ ఫార్మర్ల  మార్పిడి  విద్యుత్ స్తంభాలను నెలకొల్పటం కమ్యూనికేషన్లు సప్లైలను వేగవంతం గా రప్పించటం పంపిణీ పబాబు  ప్రాధమిక వైద్యం ,ముసలీ ముతకాకు ఆసరా ,ఇన్ని పనులు సమన్వయము తో సమయ స్పూర్తితో ,కునుకు లేకుండా ,అలసట ఎరుగకుండా చేయటం చంద్ర బాబుకే సాధ్యం .ఉక్కు మనిషి వజ్ర సంకల్పుడు ,ఏది ముందు ఏది వెనకా చేయాలో విజన్ ఉన్నవాడు  .ఈ విపత్ సమయం లో నిజం గా ఆపద్బాన్ధవుడే అయ్యాడు బాబు .విశాఖ నుంచే పరిపాలన చేస్తూ మార్గ దర్శి గా ,మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిగా ,అనితర సాధ్యమైన కృషికి మారుపేరుగా నిలిచి అందరి చేతా మెప్పు పొందుతున్నాడు . బాబు చేతిలోనే నవ్యాన్ధ్రకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది .ఈ ఒడి దుడుకులు అధిగమించి జయ సంకేతం చూపించి భావి తరాలకు ఆదర్శం గా భవ్య దివ్య శుభ్ర ,స్వచ్చ ఆంద్ర ప్రదేశ్ నిర్మాణమవుతుందని భావిద్దాం .శుభం భూయాత్

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-14-ఉయ్యూరు  ,

 

http://telugusala.blogspot.in/2014/10/blog-post_15.html

 

హుధుద్ కి ధన్యవాదాలు..!

మాదొక అలల నగరం..
మాదొక కలల నగరం..
అలలూ కలలూ కలిసి..
ఎదిగిన మహా నగరం మాది..
నవ్వుతూ తుళ్లుతూ..
ఎంతో హాయిగా ఉండే నగరమిది..
అప్పటికీ రోజూ తీరానికొచ్చి పోయే..
అలల అనుమతి తీసుకునే ఇంత నగరాన్ని నిర్మించున్నాం..
మా అండా దండా నువ్వే సముద్రమా అంటూ కలలన్నీ ప్రోది చేసి..
మిద్దెలూ మేడలూ కట్టుకున్నాం..
మమ్మల్ని రక్షించినా నువ్వే..
శిక్షించినా నువ్వేనని ఒక్కో అడుగూ ముందుకేసుకుంటూ వచ్చాం..
ఇన్నేళ్లుగా మా అభ్యర్ధన మన్నిస్తూ వచ్చాడా సముద్రుడు కూడా..
పురాణకాలం నాటి మా మహా నగరానికి స్నేహహస్తం అందిస్తూనే వచ్చాడు..
ఎన్నో తుఫాన్లు మా పట్టణం మీదకు ఉరికొచ్చినా మా వాళ్లేలే వదిలెయ్ అన్నాడు..
అడుగడుగునా అడ్డుపడుతూనే వచ్చాడు..
కానీ హుధుద్ దూకుడు ముందు ఏం చెయ్యలేక పోయాడా సాగరుడు..
సాగరుడు చేతులెత్తేశాడని తెలిసిన హుధుద్
విశాఖ అణువణువూ  శోధించింది..
ప్రతి ఇసుకరేణువునూ కదిలించి వేసింది..
చెట్టూ చేమ పుట్టా గుట్టా పేరుపేరునా చెదిరిపోయాయి..
మా గూళ్లన్నీ చెదిరాయి.. గుప్పెడంత గుండె ధైర్యం మాత్రమే మిగిలింది..
ఇప్పుడు విశాఖ వాసి అండాదండా ఆ గుప్పెడు ధైర్యమే..
ఆనాడు హిరోషిమా నాగసాకి ప్రజలు పాటించిన ద్రుడ సంకల్పమే ప్రేరణగా..
మన నగరాన్ని మళ్లీ మొదటి నుంచి నిర్మించుకుందామన్న ఉక్కుసంకల్పమే పెట్టుబడిగా.. నిలబడతాం..
ప్రస్తుతం మా నగరంలో రాత్రి వేళైతే దీపాలు వెలగడం లేదు..
అయితేనేం ముందుచూపనే దీపాలున్నాయ్ ఏం భయం లేదు..
తాగడానికి నీళ్లులేవ్.. గుండెలో కావల్సినంత తడుంది మరేం ఆందోళనక్కర్లేదు..
కూడు, గుడ్డకు కష్టంగా ఉంది.. అయితేనేం కండలనిండా శక్తి యుక్తులున్నాయ్ దిగులేలేదు..
పాలకూ నీళ్లకూ కరువు.. అయితేనేం మా నరనరానా ఆశలూ ఆశయాలున్నాయ్..
కలిసినడవడానికి ఈ నాలుగు చాలు..
కదం తొక్కడానికి ఈ బలం చాలు..
మోడీ వచ్చినా.. బాబొచ్చినా.. పవర్ స్టార్ లాంటి సినిమా నటులొచ్చినా..
వాళ్లకు మేం చెప్పేదొక్కటే..
మా ఊరు కొట్టుకుపోయింది కానీ మాలోని ఉత్సాహాన్ని కాదు..
మాకిప్పుడు తిండితిప్పలు లేవేమోగానీ మొక్కవోని ఆత్మస్థైర్యానికి కొదవేలేదు..
మాకేం లోటు లేదు.. మాకెవరూ చెటు చెయ్యలేరు..
ఇది మా చరిత్రను మేమే తిరగరాసుకునే సమయమని తెలుసు..
ఆ అవకాశమిచ్చిన హుధుద్ కి ధన్యవాదాలు..
మీరందరూ తోడున్నందకు శతకోటి దండాలు..
ఈ మాత్రం అండదండ చాలు..
విశాఖపట్నం నుంచి తుఫాను తెచ్చిన శోకాన్ని తరిమికొట్టడానికి..
ఈ చిన్న స్నేహహస్తం చాలు..
వైజాగ్ ని పట్టిపీడిస్తున్న కష్టాలను గజగజలాడించడానికి..
మా నమ్మకం..
మా ధైర్యం..
మా బలం.. ముందు
హుధుద్ ఎంతో చిన్న..
చాలా చాలా చిన్న..
ఎంతో చిన్న.. ఎంతో ఎంతో ఎంతో చిన్న….
అందుకే హుధుద్ కి ధన్యవాదాలు..!
-తెలుగుశాల
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -41 41-ప్రేయో రస ప్రతిపాదకుడు –రుద్రటుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -41

41-ప్రేయో రస ప్రతిపాదకుడు –రుద్రటుడు

రుద్రటుడు తొమ్మిదవ శతాబ్దానికి చెందినా కాశ్మీర పండిత కవి అలంకార శాస్త్రవేత్త .తొమ్మిదవ శతాబ్ద మొదటిభాగం లో ‘’కావ్యాలంకార ‘’అనే  అలంకార గ్రంధాన్ని రాశాడు .అతని గురించి పెద్దగా వివరాలు  తెలియ రాలేదు .కాని అతని గ్రంధం లోని అయిదవ అధ్యాయం లోని పన్నెండునుండి  పద్నాలుగువరకు ఉన్న శ్లోకాలపై ‘’నమి సాధు ‘’రాసిన వ్యాఖ్యానం వలన రుద్రటుడికి’’ సదానంద ‘’అనే మరోపేరు ఉన్నట్లు,.తండ్రిపేరు భాముకుడు అన్నట్లు తెలుస్తోంది .రుద్రటుడు తనకు పూర్వం ఉన్న ఆలంకారికుల మార్గం లోనే కావ్యాలంకారం రాశాడు .అందులో పదహారు అధ్యాయాలు ,734శ్లోకాలున్నాయి .రుద్రటుడు తొమ్మిదో శతాబ్దానికి పూర్వార్ధం లో ఉండినట్లు భావిస్తారు .పద్నాలుగు ప్రక్షిప్త శ్లోకాలున్నాయి .

రుద్రట ప్రతిభా రౌద్రం

కావ్యాలంకారం లో అష్టవిధ నాయికల గురించి రుద్రటుడు పేర్కొన్నాడు .శ్లోకాలను ఎక్కువ భాగం ‘ఆర్యా వృత్తం ‘’లో రాశాడు . పదమూడవ అధ్యాయం లో కేవలం పదిహేడు శ్లోకాలు మాత్రమె ఉండి అతి చిన్న అధ్యాయం గా కనిపిస్తుంది .కాని ఎనిమిది తొమ్మిది అధ్యాయాలలో వరుసగా 111 ,మరియు110శ్లోకాలు ఉండి పెద్ద అధ్యాయాలుగా ఉంటాయి .మొదటి అధ్యాయం లో గణేశ ,గౌరీ స్తుతి చేసి కావ్యారంభం చేశాడు .చదరంగం ఆటగురించి దానిలో నిష్ణాతులైన వారి గురించి ,దాని చరిత్రను గురించి కూడా రుద్రటుడు రాయటం విశేషం .వీరుల పర్యటన (NIGHT;S TOUR) చిత్రాలంకారంఅంటే ‘’తురగ పద బంధం ‘’కూడా ఉండి  వాటి విశేషాలు తెలుస్తాయి .ఔచిత్య చర్చ విశేషం గా చేశాడు .రుద్రట కృతిపై మూడు వ్యాఖ్యానాలున్నాయి .అందులో ముఖ్యమైనది శ్వేతాంబర జైనుడైన నమిసాదురాసినది ,పదకొండవ శతాబ్దం వాడైన శైల భద్రుడు రాసినవి ముఖ్యమైనవి .గోపాల దేవుడు కూడా రాశాడు .గోపాల భట్టు ‘’రస తరంగిణి ‘’పేరిట వ్యాఖ్యానం రాశాడు .

రుద్రటుడు కావ్యాలంకారం లో 495 కారికలున్నాయి మిగిలినవి శ్లోకాలే .ప్రౌఢమైన అలంకార గ్రంధం గా పరిగణింప బడింది .రుద్రటుడు ఏ కొత్త సిద్ధాంత ప్రతిపాదనా చేయలేదు .చర్చ అంతా పరమ శాస్త్రీయ విధానం లో నిర్వహించి మెప్పుపొండాడు .అలంకారాలను శబ్దాలంకారాలు గా అర్దాలంకారలుగా విభజించి కొత్త దారి తొక్కి, తరువాతి వారికి మార్గ దర్శి అయ్యాడు .మొత్తం యాభై ఏడు అలంకారాల గురించి వివరించాడు .అలంకారాన్ని సమర్ధించినా రస నిష్పత్తికి విలువ నిచ్చాడు .అందరికంటే ఇంకొక అడుగు ముందుకు వేసి ‘’ప్రేయోరాసాన్ని ‘’పదవ రసం’’ గా ప్రతిపాదించాడు .దీనికి స్నేహం స్థాయీభావం గా చెప్పాడు .స్నేహాన్ని చక్కగా నిర్వచించాడు –‘’సహృదయ వ్యవహారం తో కూడిన నిశ్చలమైన ,నిర్వ్యాజమైన మనో వృత్తియే స్నేహం ‘’అని రుద్రటుడు నిర్వచించాడు .స్నేహం వలన ఏర్పడిన ప్రేమ ,విశ్వాసం తో సద్భావం తో కోమలం గా పరస్పర స్పందనలుగా ఉంటుంది .మనసు ఆర్ద్రం అవటం ,ఆహ్లాదం తో కళ్ళ వెంట అశ్రుజలాలు కారటం ,స్నిగ్ధ భావం తో ఒకరినొకరు ఆపేక్షగా చూసుకోవటం ఇందులో అనుభవానికి వచ్చే విషయాలు .స్నేహం లో కామం ,రతి ప్రస్తావన ఉండదు .మానసిక రతి ఉంటుంది .అందువలన పుత్రప్రేమ, దాస్య ప్రేమ , దాంపత్య  ప్రేమ (కులపాలికా ప్రేమ),ప్రక్రుతిప్రేమ ,దేశ భక్తీ ,గొప్ప వారియెడ గౌరవ భావం మొదలైన వన్నీ ప్రేయో రసానికి అంతర్గతం గా ఉంటాయి .తరువాత కాలం వారైన భోజుడు మొదలైన వారు ప్రేయోరసాన్ని బాగా ఆదరించారు .ప్రేయోరసం అంటే ‘’అమలిన శృంగారం ‘’మన రాయప్రోలు  సుబ్బారావు గారు దీనిపైనే ‘’తృణ కంకణం ‘’అనే ఖండ కావ్యం రాశారని మనకు తెలిసిన విషయమే .రుద్రటుడు పూర్వం ఉన్న వైదర్భి ,పాంచాలీ ,గౌడీ రీతుల తో బాటు కొత్తగా ‘’లాటి ‘’అనే రీతిని గుర్తించాడు . ఉపమ రూపక  ఉత్ప్రేక్షాలంకారాలను  చక్కగా వివరించాడు .సరిగ్గా నిర్వచనం లేని  వాటిని వాస్తవాలంకారాలన్నాడు .వాస్తవ అంటే వస్తు సంబంధమైనవి అనే అర్ధం లో చెప్పాడు .శ్లేషను అర్దాలంకారం గా ఒప్పుకోలేదు .అదొక విచిత్రాలంకారం అన్నాడు .

రుద్రటుడి తురగ పద బంధం

తురగ పద బంధం ను మొదటి సారిగా అలంకార శాస్త్రం లో చెప్పిన వాడు రుద్రకుడు .ఇది గుర్రపు నడకను పోలి ఉండటం చేత ఆపేరు వచ్చింది .ఇందులో ఒక్కొక్క పంక్తికి ఎనిమిదేసి అక్షరాల వంతున నాలుగు పంక్తులుంటాయి .వీటిని ఎడమ నుంచి కుడి కి చదవ వచ్చు .లేక అశ్వ పద మార్గం లోనూ చదవ వచ్చు అదీ ఇందులో విశేషం .ఇందులోని ప్రతి అక్షరం చెస్ బోర్డ్ లోని ఒక చదరానికి సంకేతం .రుద్రకుడు ఇచ్చిన ఒక ఉదాహరణ ను గమనిద్దాం’

‘’సే నా లీ లీ లీ నా నా నా లీ

లీ నా నా నా నా లీ లీ లీ లీ

న లీ నా లీ లీ లే నా లీ నా

లీ లీ లీ నా నా నా నా నా లీ’’

మొదటి పంక్తి ని ఎడమ నుండి కుడికి మామూలుగా చదవ వచ్చు .లేకపోతె మొదటి చదరం నుండి రెండవ పంక్తికి వెళ్లి మూడవ అక్షరాన్ని తురగ బంధం లో ఒకటికి చేరి చదవ వచ్చు .లెక్కల రూపం లో చెప్పాలంటే -5to2,7to4,8to3,6,to4,4,to3,2.

ఈ తురగ పదబంధాన్ని  చేదించిన  మొదటి గణిత శాస్త్రజ్ఞుడు ‘’లియోన్ హార్డ్ యూలర్ ‘’.దీనికి విధానాన్ని  ‘’వారంస్ డార్ఫ్ రూల్ ‘’గా వివరిం చిన వాడు 1803 కాలపు వాడైన H .C .Von Warns dorff .వీటినే ఆల్గారిదం ‘’అంటున్నారు .వీటికే ‘’Rudraka cycles’’అని పేరుపెట్టి అందులో ప్రవేశించటానికి చాలా ప్రయాసపడ్డారు .అంతటి మేధావి రుద్రకుడు .

Inline image 1Inline image 2

 

మరో కవితో పరిచయం అవుదాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

యెన్ టి అర్ పై ”మహా ఘనుడు ”సినిమా

యెన్ టి అర్ పై ”మహా ఘనుడు ”సినిమా

 

ఎన్టీఆర్‌ జీవిత కథ ‘మహాఘనుడు’
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మహాఘనుడు’. జె.కె.మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతోంది. దావల కుమార్‌ రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. డి.అనీల్‌సుధాకర్‌, డి.క్రిష్ణారావు నిర్మాతలు. ఈ సినిమా విశేషాలను దర్శకుడు చెబుతూ ‘‘నందమూరి తారక రామారావుగారి సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించాం. దీంతో తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ నెల 20 నుంచి రెండో షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్‌ పరిసరాల్లో చిత్రీకరిస్తాం. అక్టోబర్‌ మూడో వారంలో ఆఖరి షెడ్యూల్‌ చేస్తాం. 2015జనవరిలో అన్నగారి వర్ధంతి సందర్భంగా సినిమాను విడుదలచేసి, ఆ రోజు అన్నగారి పేరున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తాం’’ అని అన్నారు. ఎలాంటి విమర్శలు, వివాదాంశాలు లేకుండా కేవలం అన్నగారి గొప్పదనాన్ని నేటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా రూపొందిస్తున్నాం అని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: మురళీకృష్ణ మిరాకిల్‌, ఎడిటింగ్‌: బద్రి, సంగీతం: ఉదయ్‌ముద్గల, రాజు, పాటలు: అచ్చుల నాగేశ్వరరావు, జొన్నలగడ్డ కృష్ణ.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేడియో అక్కయ్య తురగా జానకీ రాణి మృతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -40

గీర్వాణకవుల కవితా గీర్వాణం -40

40-ధ్వన్యాలోక కర్త –ఆనంద వర్ధనుడు

ఆనంద వర్ధనుడు అనగానే ‘’ధ్వని సిద్ధాంతం ‘’జ్ఞాపకం వస్తుంది ధ్వని సిద్ధాంతంపై విపులమైన చర్చ చేసి ధ్వన్యాలోకం లేక ‘’కావ్యాలోకం ‘’అనే అలంకార శాస్త్రాన్ని రాసిన వాడు ఆనంద వర్ధనుడు .ఇది అలంకార శాస్త్రం లో ఒక కుదుపుకుదిపి కొత్తమలుపుకు తిప్పింది .శ.  855-883 వాడిన ఈ ఆలంకరికుడు కాశ్మీర రాజు అవంతి వర్మ ఆ స్థానపండితుడు .ఆనంద వర్ధనుడు ఒక యుగ కర్త అయ్యాడు .ధ్వని యొక్క ప్రకాశమే ధ్వన్యాలోకం .ధ్వని అనే కాంతి దర్శనమే ధ్వన్యాలోకం .సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రిగారు దీనికి తెలుగులో విపులమైన వ్యాఖ్య రాశారు .ఆంగ్లం లో జెఫ్రీ మౌసఫ్ మాసన్  పట్వర్ధన్ లు అభినవ గుప్తుని లోచన వ్యాఖ్య ఆధారం గా  అనువదిస్తే హార్వర్డ్ యూని వర్సిటి ప్రెస్ 1990లో ప్రచురించింది .బిడ్యుత్ భరన్ ఘోష్ చేసిన వ్యాఖ్యానాన్ని సాంస్క్రిట్ పుస్తక భాండార్ వారు ముద్రించారు .

ఆనంద వర్ధనీయం

ధ్వన్యాలోకం లో నూట ఇరవై తోమ్మిదికారికలున్నాయి .వీటిని ధ్వనికారికలు అన్నాడు ఈ కారికలకు రాసిన వృత్తినే ధ్వన్యాలోకం అంటారు ధ్వనియోక్క ఆలోకనం అన్నమాట .దీనికి నూటయాభై ఏళ్ళ తర్వాత అభినవ గుప్తుడు ‘’లోచనం ‘’అనే మహా గొప్ప వ్యాఖ్య రాశాడు .కావ్య ప్రారంభం లో ఆనంద వర్ధనుడు ‘’పూర్వ ఆలంకారికులు కావ్యాత్మనే ధ్వని అన్నారు .కొందరు కాదన్నారు .కొందరు లక్షనాన్తర్గతం అన్నారు. కొందరు అది గోచరించదు అన్నారు .నేను ఇప్పుడు సహృదయుల సంతృప్తికోసం ధ్వని తత్వాన్ని వివరిస్తున్నాను ‘’అని చెప్పుకొన్నాడు .కాని కొందరు దేశీయ కొందరు విదేశీయ పండితులు ధ్వన్యాలోకం ఆనంద వర్ధనుడు రాయలేదన్నారు .అంతకు ముందే ధ్వని ఉందన్నారు

‘’ధ్వనినా గతి గభీరేణ  కావ్య తత్వ నివేశినా –ఆనంద వర్ధనః కస్య నాసీ దానంద వర్ధనః ‘’అన్నదాన్ని బట్టి సందేహ నివృత్తి కలుగుతోంది దీనిభావం –‘’అతి గంభీరమైన కావ్య తత్వ పరిపుష్టమైన ధ్వని యొక్క స్వరూప స్వభావాలను నిరూపించటం చేత ఆనంద వర్ధనుడు ఎవరికి ఆనంద వర్ధనుడు కాదు ?అలాగే ఇంకొక శ్లోకం లో ఉన్నదాన్ని బట్టి –

‘’సత్కావ్య తత్వ విషయం స్పురిత ప్రసుప్త –కల్పం మనస్సు పరిపక్వ దియాం యదాసీత్

తద్వ్యాకరో త్సహృదాయో దయ లాభ హేతో –రానండ వర్ధన ఇతి ప్రథితాభి దానః ‘’-అంటే ‘’పరిపక్వమైన బుదద్ధికల విపస్చిత్తుల మనస్సులలో స్పురించి ,,సుప్తావస్తలో ఉన్న కావ్య తత్వాన్ని సహృదయుల ఆనందానికి సహృదయుడు వ్యాఖ్యానించి చెప్పాడు ‘’.కనుక ఆనంద వర్ధనుడికి పూర్వమే ‘’కావ్యాత్మ ధ్వని’’అని ఉన్నాదని ,దాన్ని నిరూపించి పండితులను అంగీకరించేట్లు వ్యాఖ్యానించాడని భావం .కాణే,ఎస్ కే డే వింటర్ నిత్స్ పండితులు కారికలు రాసింది ‘’సహృదయ ‘’అనే పేరుగల వాడన్నారు ఈ కారికలు ఆనంద వర్ధనుడికి పూర్వమే నూట యాభై ఏళ్ళ కిందటనే ఉన్నాయన్నాడు డే .మొత్తం మీద మనకు తెలిసింది ఏమిటి అంటే అప్పటికే వ్యాప్తిలో ఉన్న ధ్వని ని సిద్ధాంతీకరించి వ్రుత్తి రాసి ప్రచారం లోకి తెచ్చిన వాడు ఆనంద వర్ధనుడు అనుకొంటే ఏ ఇబ్బందీ ఉండదు ఎవరితోనూ .

ధ్వన్యాలోక అవ్యక్త ధ్వని

ధ్వన్యాలోకం లో నాలుగు ఉద్యోతాలున్నాయి .మొదటిదానిలో ప్రాచీన అలంకారికులు ధ్వనిని గురించి ఏమేమి చెప్పారో వాటిని గురించి వాటిపై వచ్చిన ఖండనల గురిచి చెప్పి ధ్వని స్వరూపాన్ని ధ్వని భేదాలను ,గుణీ భూత వ్యంగ్యాన్ని తర్క భూమికపై వ్యాఖ్యానించాడు .తర్వాత ధ్వని నిరూపణ ప్రయోజనాన్ని వివరించాడు .అభినవ గుప్తుడు లోచన వ్యాఖ్యానం రాశాడని చెప్పుకొన్నాం .అతడు ‘’చంద్రిక అనే వ్యాఖ్యానాన్ని గురించి చెప్పి లోచనం లేక పొతే చంద్రిక ఉన్నా ‘’ఆలోకం ‘’కనపడదని చమత్కరించాడు .వర్ధనుడు తన రచనలైన దేవీశతకం, అర్జున చరిత్ర మహా కావ్యం ,విషమ బాణ లీల ,హరవిజయం నుంచే లక్షణాలకు ఉదాహరణలు ఇచ్చాడు .ఇందులో దేవీశతకం ఒక్కటే లభ్యం .విషమ బాణ లీల ,హరవిజయాలు ప్రాకృత భాషలో రాశాడు .

ఇంతకీ ధ్వని అంటే ఏమిటి?కావ్యం లో వాచ్య లక్ష్యార్దాలకంటే వేరైనది ఒకటి అంతరార్ధం గా భాసిస్తుంది .దాన్ని వ్యంగ్యార్ధం అని అంటారని అదే ధ్వని అని ఆనంద వర్ధనుడు నిర్వచించాడు .ధ్వని వాచ్య ,లక్షణార్దాలకంటే చమత్కార రంజకమై ఆనందాన్నిస్తుంది .ధ్వని రామణీయకత్వం సహృదయ వేద్యం .ఇది స్త్రీల అలంకారాల కంటే  భిన్నం గా ఉండే లావణ్యం లాంటిది .

‘’ప్రీతీయమాన  పునరన్య దేవా –వస్త్వ్యస్తి వాణీషుమహా కవీనాం

యత్తత్ ప్రసిద్దావయ వతి రిక్తం –విభాతి లావణ్య మివ అంగనాసు ‘’

‘’గంట కొడితే వచ్చే చెవులు భరించలేని టంకార ధ్వనికంటే దాని ఝంకార ప్రతిధ్వని ఆహ్లాదం కలిగించినట్లుగా ,గుణ , అలంకారాదులకంటే రమణీయమైన ప్రతీయమానమైన అర్ధం సహృదయ జనాలకు  ఆకర్షణీయం అవుతుంది ‘.అదే ధ్వని ‘’అని గంటకొట్టి ధ్వని సిద్ధాంతం లోని రహస్యాన్ని చెప్పాడు .ధ్వనియే కావ్యాత్మ అన్నాడు .ధ్వని లక్ష్య అర్ధాలలో దొరకదని ,దాన్ని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదని వారి అభిప్రాయాలను ఖండించాడు .తర్క ,పాండిత్య ఆధారాలుగా ధ్వని సిద్ధాంతాన్ని స్తాపించాడు .ధ్వనిలో ఉన్న అతి సూక్షమైన భేదాలను వివరించటం లో ఆతను తీసుకొన్న మార్గం మహా విశిష్టమైంది .ఉదాహరణలు లేకుండా ఏదీ చెప్పలేదు .ధ్వనిలో అభిదా మూల ధ్వని ,లక్షణామూల ధ్వని అని ధ్వనిలో రెండు భేదాలనాను వివరించాడు .భరతుని రస సిద్ధాంతమే రసధ్వని శ్రవ్య కావ్యాలకు అన్వయించ బడింది .వ్యంగ్యార్ధం అనే ముసుగు వేసుకొన్న రస సిద్ధాంతమే ధ్వని సిద్ధాంతం అనిపిస్తుంది .రసభావ సమన్వితమైన కావ్యాన్నే ఉత్తమ కావ్యం అన్నాడు .అలంకార రచన ఉత్తమ కావ్యం అని పించుకోదు అని స్పష్టం గా చెప్పాడు ఆనంద వర్ధనుడు .

ఎంతటివాడికైనా సమకాలీనులు అడ్డు తగలటం సర్వ సామాన్యం.ఇది ఆనంద వర్ధనుడికీ తప్పలేదు  .మొదట్లో పండితులు ధ్వని సిద్ధాంతాన్ని చూసి పెదవి విరిచారు .కాని కాలం గడిచిన కొద్దీ కావ్య సిద్ధాంతాలలో ధ్వని సిద్ధాంతమే ఉత్తమోత్తమమిందని తెలుసుకొన్నారు. వ్యాప్తీ ,ప్రచారమూ చేసి నెత్తి కెత్తుకొన్నారు అందరూ .ఒక రకం గా అప్పటివరకు ఉన్న భామఃహ దండిల అలంకార వాదం ,వామనుడి రీతి వాదం వరకు అన్నిటి సమన్వయ పరచిన గొప్ప అలంకారికుడు ఆనంద వర్ధనుడు .మౌలిక తర్క సిద్ధాంత శైలిని  ఎన్నుకొని ఎదురు లేని మొనగాడు అనిపించుకొన్నాడు .’’ధ్వని ధ్వని అని లోకం చెవుల్లో మారుమోగేట్లు’’ చేసిన  ఆనంద వర్ధనాచార్యుడు ‘.

‘’కావ్యాత్మ స ఏవార్ధః తధాచాది కవే ఃపురా –క్రౌంచ ద్వంద్వ వియోగోత్తః శోక శ్లోకత్వ మాగతః ‘’అని మొదట్లోనే ఆనంద వర్ధనుడు అన్నాడు ..కావ్య సృష్టి ఎలాంటిదో కావ్యాన్ని అర్ధం చేసుకొని అభినందించటమూ అంత గొప్ప అన్నాడు ఆనంద వర్ధనుడు .’’The unexpressed is not is not understood by those who only know grammar and lexicon  but only by men of taste and literary instinct who know the essence of poetry .It is the province of the sahridaya ,the connosseur who is expert in discerning through the intricate meshes of veiled word and sense into the aesthetic relish of deeper significance .The aesthetic emotion istransfered only when there is  ideal reawakening of it in the reader .Ananda vardhana clearly states that appreciation of poetry is essentially the same as the creation of it ‘’Aesthetic  consciousness has no end out side of itself .Aesthetics experience charactarised by the immersion of the subject in the aesthetic object is akin to the beatitude of ecstacy or the Brahman or Self  .’’అని డా .కే సుబ్రహ్మణ్యం ధ్వని సిద్ధాంతం పై చక్కని వ్యాఖ్య చేశారు .

మరోకవితో కలుద్దాం

సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39-

39-నైషద కర్త -శ్రీ హర్షుడు

గీర్వాణ కవుల గురించి రాస్తున్న ఈ సీరియల్ లో మొదట కొంచెం అటూ ఇటూ గామొదలుపెట్టిన తర్వాత దాదాపుగా ‘’క్రానలాజికల్ ఆర్డర్ ‘’ననుసరించి కవుల జీవితాలను రాస్తూ హర్ష చక్రవర్తి దాక వచ్చాను .ఇప్పుడు హర్షునికాలం నుండి సుమారు అయిదు వందల ఏళ్ళు ముందుకు దూకి శ్రీ హర్షుడి గురించి రాస్తున్నాను .దీనికి కారణం ఇద్దరూ  ఒకే కాలానికి చెందిన వారుకాకపోయినా ఇద్దరూ వేరు వేరు వ్యక్తులని చాలా మందికి తెలియదు ఒక్కరే అని చాలామంది భ్రమ పడుతున్నారు ..చక్రవర్తి హర్షుడు నాగానందం  మొదలైన మూడు నాటకాలు రాస్తే , శ్రీ హర్షుడు సంస్కృత పంచకావ్యాలలో ముఖ్యమైన నైషద చరిత్ర అంటే మన శ్రీనాధుడు అనువాదం చేసిన శృంగార నైషధంరాశాడు .దీన్ని  రాస్తూ ‘’హర్ష నైషద కావ్యమాంధ్ర భాష’’అన్నాడు  . విద్వాంసులకే ఔషధం అనిపించుకొన్న మహా కావ్యం నైషధం .శ్రీహర్షుడు మహా మేధావి .కనిపించిన ప్రతి దానిపై అమోఘం గా కవితలల్లెవాడట .అవి అర్ధం చేసుకోవటం సామాన్యులకు అలవి అయ్యేది కాదట .పండితులే ముక్కున వేలేసుకొనే వారట .బుర్రలు బద్దలు కొట్టుకొన్నా మింగుడు పడేవికాదట .ఆ తెలివి తేటలు అనితర సాధ్యం గా ఉండేవట .తల్లికి భయం వేసేదట .అతని మేనమామను పిలిపించి గోడు వెళ్ళ బోసుకోనేదట .ఆయన దీనికి విరుగుడుగా అతని మేధస్సు తగ్గించటానికి రెండు కిటుకులు చెప్పి చేయిం చాడట .ఒకటి కాకర పాదు కింద రోజు వేడినీళ్ళతో స్నానం చేయించటం ,రెండవది బుద్దిమాంద్యం కలిగించే మినప పప్పుతో రోజూ కుడుములు లేక గారెలు వేసి తినిపించటం ఈ రెండూ ఆమె క్రమం తప్పకుండా చేసిందట .వీటి ప్రభావం వలన వెయ్యోవంతు మేధ మాత్రమె తగ్గిందట .’’మాష పూపాలపై ‘’(గారెలు )అలవోకగా అప్పుడు శ్లోకం చెప్పి వాళ్ళమ్మను మేనమామను సంభ్రమాశ్చర్యాలతో ముంచేశాడట .అతని మేధస్సును ఎవరూ తగ్గించలేరని నిర్ణయించుకోన్నారట .అలాంటి శ్రీ హర్షుని గురించి ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .శ్రీనాధ కవి సార్వ భౌముడు రాసిన అన్ని గ్రందాలకంటే  శృంగార నైషదానికే  గొప్ప పేరు వచ్చింది .హర్షుని హృదయాన్ని వెతికి పట్టుకొని రాసిన మహా కావ్యం అది .’’సీసాల’’తో ఉయ్యాల లూగించాడు .అంతేకాదు సంస్కృత నైషధం లో శ్రీహర్షుడు మంత్రం శాస్త్రాన్ని నిక్షిప్తం చేశాడని మహా పండితుడు కవి, శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు గొప్ప వ్యాఖ్యానం రాశారు .

శ్రీహర్ష చరితం

కనోజు పాలకుడైన జయ చంద్రుని ఆస్థానకవి శ్రీహర్షుడు .కాలం 1130-1190.తల్లి మామల్లాదేవి తండ్రి శ్రీ హీరుడు .’’నైషద చరిత’’రాసి ప్రసిద్ధుడు అవటం వలన ‘’నర భారతి ‘’అనే బిరుదు పొందాడని రాజశేఖరుడు ‘’ప్రబంధ కోశం ‘’లో రాశాడు .జీవితం లో చివరికాలం గంగా నదీ తీరం లోతండ్రి ఉపదేశించిన ‘’చింతామణి మంత్రం ‘’జపిస్తూ ఒక ఏడాది  గడిపాడు అప్పుడు  త్రిపుర సుందరీదేవి ప్రత్యక్షమై అపూర్వ శేముషిని ,ప్రతిభను అనుగ్రహిం చిందని  ,ఆ ప్రభావం తో అలవోకగా నోటినుండి కొన్ని శ్లోకాలు బయటికి వచ్చాయి అవి పండితులకే అర్ధం కాలేదట .మళ్ళీ దేవి అనుగ్రహాన్నిపొంది అందరికి సులభం గా అర్ధమయ్యే రీతిలో కవిత్వం చెప్పే సామర్ధ్యాన్నిపొందాడట .పండిత సభలో ఉదయనాచార్య  అనే పెద్ద పండితుడిని ఓడించాదట .

.1174లో నైషద చరితను  గుజరాత్ కు వీర ధవళ రాజు వద్దకు శ్రీహరుడు తీసుకొచ్చాడని, చందూ పండితుడు ‘’దీపిక’’లో చెప్పాడట .దీనికి విద్యాధరుడు వ్యాఖ్యానం రాశాడట .శ్రీహర్షుడు ‘’ఖండన ఖండ ఖాద్య ‘’రాసిన దానికంటే ముందే నైషషదము  రాశాడట .శ్రీ హర్షుడు రాసినట్లుగా చెప్పబడుతున్న విజయ ప్రసస్తి ,చంద్ర ప్రశస్తి ,గౌడీర్వికాసకుల ప్రశస్తి ,సాహసాంక చరిత , ఆర్ణవవర్ణన ,అమర ఖండన అలభ్యాలు .న్యాయ శాస్త్ర విశేషాలపై హర్షుడు వ్యాఖ్యానం గా ‘’ఖండన ఖండ ఖాద్య ‘’రాశాడని అంటారు .ఇవికాక స్థైర్య విచారం ,చింది ప్రశస్తి ,శివ శక్తి సిద్ధి ,ఈశ్వర త్రిసంది రాశాడని అంటారు .

శ్రీహర్షుడు కనోజు రాజు జయ చంద్రుని ఆస్థానకవి .జయచంద్రుడు పృధ్వీరాజ్ చౌహాన్ కు మామ .కూతురు రాణి సంయుక్త ప్రుద్వీరాజును ప్రేమించింది .జయ చంద్రుడికి ఇష్టం లేదు .ఆమెను పృధ్వీరాజు వీరోచితం గా తీసుకొని వెళ్లి వివాహం చేసుకోన్నాడని చరిత్ర .నైషధకావ్యాన్ని రాసి కాశ్మీర్ కు తీసుకు వెళ్లి అక్కడ సర్వజన పీఠ అధినేత్రి సరస్వతీ దేవి హస్తాలలో ఉంచాడని ,ఆమె ఆదరం తో స్వీకరించిందని ,తన కావ్యానికి సరస్వతి ఆమోదం తెలిపిందని కాశ్మీర రాజు మాధవ దేవుని నుండి రాజ ముద్రిక ను వేయించుకొని లేఖను తెచ్చాడని ఒక కధనం ఉంది .పృధ్వీ సంయుక్తల అమరప్రేమనే నైషధం లో ప్రతిబింబింప జేశాడని అంటారు  .

నైషధం లో శ్రీహర్షణీయం

నైషద మహాకావ్యం ఇరవై రెండు సర్గలున్నది .నల దమయంతుల ప్రేమకధా పూర్ణం .కద మనకు తెలిసినదే .నలుడిని పరీక్షించటానికి ఇంద్ర వరుణ ,అగ్ని, యములు దమయంతి స్వయం వారానికి రావటం ,నలుడికి  తిరస్కరినణీ విద్య నిచ్చి తమ దూతగా దమయంతి దగ్గరకు రాయ బారిగా పంపటం ,నలుడి వేషం లోనే దిక్పలకులు కూర్చోవటం ,సరస్వతీ దేవి స్వయం గా వచ్చి స్వయంవర రాజులను చమత్కారం గా పరిచయం చేయటం ,దేవతల అనుగ్రంహం తో నలుని దమయంతి గుర్తించటం ,నల దమయంతుల వివాహం ,కలి వవిజ్రు0భణ ,మొదలైనవి ఉన్నాయి .ఇది మహా భారత కధయే .కొంత కదా సరిత్సాగరం లోనూ ఉంది .వివాహం వరకు శృంగారకావ్యం గానే రాశాడు .ఔచితీ యుతమైన రచన చేశాడు .

ఆలంకారిక శైలి  భారవి తో ప్రారంభమై ,మాఘునిలో పరిపక్వమై శ్రీహర్షునితో ఉత్కృష్ట స్థాయి పొందింది .తరువాత వచ్చినవన్నీ అంత గొప్పవికావు కనుక ‘’ఉదితే నైషధే కావ్యే క్వ మాఘః క్వచ భారవిః’’అన్న లోకోక్తి ప్రచారమైంది .విద్వాంసుల గర్వమనే రోగాన్ని పోగొట్టే ఔషధం నైషధం –అంటే ‘’నైషధం విద్యదౌషధం ‘’.అంతేకాదు ‘’అందమైన కన్య సౌందర్యం బాలుని మనస్సునుఎలా  ఆకర్షించ లేదో అదేవిధం గా సరసం లేని అరసులకు నా కావ్యం అర్ధం కాదు ‘’అని చెప్పాడు  హర్షుడు .గురువుదగ్గరైనా చదువుకోవాలి ,లేకపోతె వ్యాఖ్యానాలన్నా చదవాలి .అప్పుడే అర్ధమవుతుంది .

హర్షుని కవిత్వం లో ఒజో గుణం ఉంటుంది .నారికేళ పాకం .పగల గోట్టుకు తింటూ నమిలితేనే మాధుర్యం .శ్లేష తో చమక్కులు చేశాడు .దీర్ఘ సమాసాలతో ఊపిరి ఆడనీయడు .ఉక్తి వైచిత్రి కి అగ్రాసనం వేశాడు .ప్రతిశ్లోకం అలంకార శోభితం .భావ కల్పనా అనితర సాధ్యం ,అద్భుతం ఆశ్చర్యం .అంతమాత్రాన పదలాలిత్యం లేదనుకోరాదు .అదీ తగుమోతాదులో ఉంది .నైషదే పదలాలిత్యం అన్న పేరూ పొందింది .శైలి గాఢమైన బంధాలతో గౌడీ రీతిలో ఉంటుంది .ప్రతిశ్లోకం రామణీయమే .ప్రతిభావం అపూర్వమే .ప్రతి అలంకారం పరమ రామణీకమే .

ప్రబంధం లో ఉండే వర్ణనలన్నీ చేశాడు .ఒకే విషయాన్ని పలు చోట్ల పలురకాలుగా  వర్ణిస్తేనేకాని హర్షుడికి తృప్తి ఉండదు .’’ఎకామత్యజతో నవార్ధ ఘటనాం ‘’అన్నాడు .ప్రతిదానిలో కొత్తదనాన్ని కల్పిస్తాడు ,కన్పించేట్లు  చేస్తాడు .నైషదానికి 23వ్యాఖ్యానాలున్నా మల్లినాద సూరి రాసిన ‘’జీవాతువు ‘’ప్రముఖమైనది .తర్వాత నారాయణ భట్టు రాసిన ,,నైషద ప్రకాశం .హర్షుడు ,మహా పండితుడు ,మహాకవీ మహా వ్యాకరణ, వేత్త ,మహా దార్శనికుడు .షట్ దర్శన పాండిత్య విశేషుడు .అద్వైత సిద్ధాంతి .చార్వాకాది సిద్ధాంతాలనూ చదివాడు .ఇతర దర్శానాలు అవహేళన చేశాడు .అతని వ్యాకరణ పాండిత్యాన్ని తెలియ జేసే శ్లోకాలు అపరిమితం గా కనిపిస్తాయి .అతని కామ శాస్త్ర పారంగత్యమూజ్యోతకమవుతుంది .    ఇందులో కొన్ని ప్రతీకలు కనిపిస్తాయి .నల దమయంతుల ప్రేమకు హంస రాయ బారం జరుపుతుంది .ఈ హంసను జీవాత్మ ,పరమాత్మలను కప్పి ఉంచే అజ్ఞానాని తొలగించి వాటి ఇద్దరి కలయిక కు తోడ్పడే గురువు కు ప్రతీక అని భావించారు .ఇలాంటి అద్వైత భావనలెన్నో ఇందులో ఉన్నాయనే శేషేంద్ర శర్మ గొప్పగా నిరూపించారు .హర్షుడి మేనమామయే ‘’కావ్య ప్రకాశం’’ అనే అలంకార గ్రంధం రాసిన ముమ్మటుడు అని ఒక అభిప్రాయం ఉన్దిలోకం లో .మేనల్లుడు రాసిన నైషధాన్ని ముందే చూసి ఉండి నట్లయితే తాను తన అలంకార శాస్త్రం లో దోష ప్రకర ణానికి వేరే చోట్ల వెతుక్కొనే పని ఉండేదికాదు కదా అని అను కోన్నాడట .

మరోకవిని తర్వాత కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”కదిలే బొమ్మలకు”ప్రాణం పోసిన రఘు పతి వెంకయ్య జయంతి

కదిలే బొమ్మకు ప్రాణం పోసిన బ్రహ్మయ్య
నేడు రఘుపతి వెంకయ్య జయంతి

వందేళ్ల భారతీయ సినిమా సంబరాలు జరుపుకున్నాం. మనదేశంలో సినిమా పుట్టుకకి కారణమైన వ్యక్తుల గురించి, వారు చేసిన కృషి గురించి స్మరించుకున్నాం. అయితే 1910లో ‘పుండలీక్‌’ సినిమా నిర్మించిన దాదాభాయి టోర్నీ కంటే , 1913లో ‘రాజా హరిశ్చంద్ర’ చిత్రం తీసిన దాదాసాహెబ్‌ ఫాల్కే కంటే ముందే ఒక తెలుగువాడు 1909లోనే భారతీయ సినిమా పరిశ్రమకు పునాది వేశాడన్నది చరిత్ర చెప్పే సత్యం. తెలుగు సినిమాకే కాదు దక్షిణాది సినిమాకే ఆద్యుడైన ఆ వ్యక్తి పేరు రఘుపతి వెంకయ్యనాయుడు. ఆయన వేసిన పునాది మీదే దక్షిణాదిన సినిమా వేళ్లూనుకుని దినదిన ప్రవర్థమానమైంది. మనదేశంలో తొలి ప్రదర్శకుడు, తొలి పంపిణీదారుడు ఆయనే. వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం.

ప్రభుత్వంలోని సైనిక శాఖలో సుబేదారుగా పనిచేసిన మచిలీపట్నం వాస్తవ్యుడు అప్పయ్యనాయుడు రెండో కొడుకు రఘుపతి వెంకయ్య. 1873 అక్టోబర్‌ 15న జన్మించారు. వెంకటేశ్వరుని భక్తుడైన అప్పయ్యనాయుడు తన పెద్దకొడుకుకి వెంకటరత్నం అనీ, చిన్నకొడుక్కి వెంకయ్య అని పేరు పెట్టారు. తండ్రి ఉద్యోగ బదిలీ మీద వెంకయ్య తన 18వ ఏట మద్రాసులో అడుగుపెట్టారు. చిన్నతనం నుంచి చిత్రలేఖనం మీద ఆసక్తి ఉండటంతో మౌంట్‌రోడ్‌లో ఒక ఇల్లు తీసుకుని దానిని ఒక కళాకేంద్రంగా తీర్చిదిద్దారు వెంకయ్య. ఆయన వేసే బొమ్మలు, చెక్కే రాతిబొమ్మలు చాలామంది దృష్టిని ఆకర్షించాయి. ఆ రోజుల్లో బొబ్బిలి, విజయనగరం, కళ్లికోట, చెట్టినాడ్‌ సంస్థానాలకు చెందిన మహారాజులు గిండిలో జరిగే గుర్రపు పందాలకోసం వస్తుండేవారు. వారి దృష్టిని వెంకయ్య ఆకర్షించారు. అలాగే బ్రిటీషు ప్రభుత్వ అధికారుల ప్రశంసలు కూడా ఆయన పొందారు.
పెయింటింగ్స్‌తో పాటు ఫొటోగ్రఫీలో కూడా ప్రవేశం ఉండటంతో కొత్త ప్రయోగాలు చేసేవారు. ఒకరోజు పేపరు తిరగేస్తుంటే ‘క్రోనోమెగాఫోన్‌’ నే సినిమాటోగ్రాఫ్‌ మెషీన్‌ను కనిపెట్టారనీ, దాని మీద పిక్చర్‌ ప్రొజెక్ట్‌ అయ్యేటప్పుడు రికార్డెడ్‌ డిస్క్‌ సాయంతో సంగీతాన్ని, ఇతర శబ్దాలను వినిపించవచ్చనే వార్త వెంకయ్యని ఆకర్షించింది. లండన్‌లోని గౌమాంట్‌ కంపెనీ అధినేతలు ఈ ఎక్విప్‌మెంట్‌ సృష్టికర్తలనీ, బకింగ్‌హామ్‌ భవనంలో ఐదో జార్జి, మేరీ రాణి సమక్షంలో ఇచ్చిన తొలి ప్రదర్శన విజయవంతమైందనీ ఆ వార్త సారాంశం. కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే వెంకయ్య వెంటనే మద్రాసులోని జాన్‌ డికెన్‌సన్‌ కంపెనీవారిని కలుసుకొని ‘క్రోనోమెగాఫోన్‌’ ఎక్విప్‌మెంట్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. దాని ఖరీదు రూ. 30 వేలు. తన భార్య నాంచారమ్మ సలహాతో తన ఫొటో స్టూడియోను తాకట్టు పెట్టి ఆ డబ్బుతో ‘క్రోనోమెగాఫోన్‌’ ఎక్విప్‌మెంట్‌ తెప్పించుకున్నారు వెంకయ్య. నాలుగువందల అడుగుల పొడువున్న 12 లఘు చిత్రాలను తయారు చేసి, వాటిని తొలిసారిగా విక్టోరియా పబ్లిక్‌ హాలులో ప్రదర్శించారు. ‘అండర్‌ ది పెనామా’, ‘స్వింగ్‌ సాంగ్‌’, ‘సీ సర్పెంట్‌’, ‘ఫైర్‌మర్‌ సాంగ్‌’, ‘మికాడో’… ఇటువంటి టైటిల్స్‌తో ఆ చిత్రాలను ప్రదర్శించేసరికి జనం ముగ్ధులయ్యారు. తొలి ప్రదర్శనకి ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు. అయినా వెంకయ్య నిరాశ పడలేదు. చిన్న చిన్న కరపత్రాల ద్వారా ఈ ప్రదర్శనకు సంబంధించిన విశేషాలను జనానికి తెలిసేట్టు చేశారు.
ప్రేక్షకుల నాడి పసికట్టిన వెంకయ్య 1910లో ఎస్‌ప్లనేడ్‌(ఇప్పటి రాజా అన్నామలై హాలు)లో టెంట్‌ సినిమా ఏర్పాటు చేసి ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అవి విజయవంతమయ్యాయి. ఆ తర్వాత తన టెంట్‌ సినిమాతో బెంగుళూరు, ఆంధ్రదేశంలోని ముఖ్య పట్టణాలు తిరిగి ప్రదర్శనలిచ్చారు. దీని వల్ల లాభాలు రాకపోయినా నష్టం మాత్రం రాలేదు. నాటకాల ప్రభావం నుంచి కొంత బయట పడి సినిమాలు చూడటం కోసం జనం వస్తున్నందుకు ఆయన సంతోషించారు.
దేశంలోనే కాదు సింహళదేశానికీ తన టెంట్‌ సినిమాతో వెళ్లి అక్కడ ప్రదర్శనలిచ్చేవారు. తన తయారు చేసిన చిత్రాలే కాకుండా విదేశాల 500 అడుగుల పొడవు కలిగిన లఘు చిత్రాలను దిగుమతి చేసుకొని ప్రదర్శించేవారు. సింహళం నుంచి బర్మా వెళ్లి అక్కడ రంగూన్‌, పెరూ పట్టణాల్లో సినిమా ప్రదర్శనలు ఇచ్చారు. ఇవి జనంలో సినిమా చైతన్యాన్ని కలిగించాయి.
1911లో మద్రాసుకు తిరిగి వచ్చిన వెంకయ్య గెయిటీ టాకీస్‌ను నిర్మించారు. మద్రాసులోని తొలి సినిమా థియేటర్‌ ఇదే. ‘మిలియన్‌ డాలర్‌ మిస్టరీ’, ‘మిస్టరీస్‌ ఆఫ్‌ మీరా’, ‘క్లచింగ్‌ హాండ్‌’ వంటి లఘు చిత్రాల్ని ఇందులో ప్రదర్శించేవారు. ఆ తర్వాత మింట్‌ స్ర్టీట్‌లో క్రౌన్‌ థియేటర్‌ని, పరుశువాకంలో గ్లోబ్‌ థియేటర్‌ను వెంకయ్య నిర్మించారు. యూనివర్సల్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన లఘు చిత్రాలను ఇందులో ప్రదర్శించేవారు.
1913లో మౌంట్‌ సీ్ట్రట్‌లో క్రౌన్‌ థియేటర్‌ వెనుక ‘స్టార్‌ ఆఫ్‌ ఈస్ట్‌ ఫిలిం’ అనే సంస్థను నెలకొల్పి, తన చిత్రనిర్మాణకార్యక్రమాలను ప్రారంభించారు వెంకయ్య. ఆ రోజుల్లో కరెంట్‌ సమస్య తీవ్రంగా ఉండటంతో దానిని అధిగమించడం కోసం గ్లాస్‌ స్టూడియోను నిర్మించారు. ఎండ వచ్చి స్టూడియోల్లోని అద్దాల మీద పడుతుంటే ఆ వెలుగులో షూటింగ్‌ చేయవచ్చనే ఆలోచన ఆయనది. ఇటువంటి ప్రయోగం చేయడం భారతదేశంలోనే తొలిసారి. అంటే ఇప్పుడు సినిమా షూటింగ్స్‌లో ఉపయోగిస్తున్న రిఫ్లెక్టర్స్‌ విధానానికి ఆ రోజుల్లో అలా శ్రీకారం చుట్టారు వెంకయ్య.
వెంకయ్య పెద్ద కొడుకు సూర్యప్రకాశ్‌ ఇంగ్లాండ్‌ వెళ్లి సినిమా సాంకేతిక శాసా్త్రన్ని నేర్చుకుని విలియం సన్‌ సైలెంట్‌ కెమెరాతో స్వదేశానికి తిరిగివచ్చారు. తండ్రీకొడుకులు కలసి గ్లాస్‌ స్టూడియోలో ‘గజేంద్రమోక్షం’, ‘మత్స్యావతారం’, ‘భీష్మప్రతిజ్ఞ’ తదితర మూకీ చిత్రాలు నిర్మించారు.
ప్రారంభంలో కాలానికి ఎదురీది కొత్త ప్రయోగాలు చేసిన వెంకయ్య చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులకు లోనయ్యారు. ఆస్తులన్నీ కోల్పోయారు. మూకీ యుగం అంతరించి టాకీల నిర్మాణం పెరగడం కూడా వెంకయ్య వెనకబడటానికి కారణం అయింది. 1941 మార్చి 15న ఆయన కన్నుమూశారు. కానీ ఆనాడు ఆయన సేవల్ని ప్రజలు, ప్రభుత్వం మరిచిపోలేదు. రాష్ట్రవిభజనకు పూర్వం ఆయన పేరిట ఒక అవార్డ్‌ ఏర్పాటు చేసి, చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు ఏటా అందించేవారు. ఇకపై కూడా రెండు రాష్ట్రప్రభుత్వాలు ఆ అవార్డ్‌ను కొనసాగించాలని సినీజనం కోరుకుంటోంది. అలాగే రఘుపతి వెంకయ్య జీవిత చరిత్రకు సినిమా రూపం ఏర్పరచి దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో సతీశ్‌ నిర్మించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నరేశ్‌ ఇందులో వెంకయ్య పాత్ర పోషించారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అల్లూరి -అడ్డతీగెల బంధం -పదాల వీరభద్ర రావు-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోదీయే గత్యంతరం !!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వా కవుల కవితా గీర్వాణం -38

గీర్వా కవుల కవితా గీర్వాణం -38

38-బౌద్ధ నాటక కర్త –హర్ష వర్ధనుడు

స్థానేశ్వరాన్ని రాజ దాని చేసుకొని వింధ్య నుండి హిమాలయాల వరకు రాజ్య పాలన చేసిన హర్ష చక్ర వర్తి మూడు  నాటకాలు రాశాడు.  హర్షుడు క్రీ .శ.606-648కాలానికి చెందినవాడు .తననాటకాలలో హర్ష వర్ధనుడు అని చెప్పకుండా హర్ష దేవుడు అని చెప్పుకొన్నాడు .తండ్రి ప్రభాకర వర్ధనుడు .చైనా యాత్రికులు హ్యూన్ సాంగ్ ,ఈత్సింగ్ లు ఇతని పాలన గురించిరాశారు .బాణుడు హర్ష చరిత్ర రాశాడు .శీలాదిత్యుడు అనే బిరుదు ఉంది .అంటే శీలం లో, సదాచారం లో సూర్యుని వంటి వాడని అర్ధం .హర్షుడికి ముందు అన్న రాజ్య వర్ధనుడు రాజరికం చేశాడు .సూర్యారాధక వంశం .తర్వాత బౌద్ధమతావలంబి అయ్యాడు .గౌడ రాజు శశాంకుడు రాజ వర్ధనుడిని ఓడి చనిపోతే హర్షుడు రాజ్యాభి షిక్తుడయ్యాడు.రెండవ పులకేశిని ఓడించి దక్షిణం లో నర్మదా నది వరకు హర్షుడు రాజ్య వ్యాప్తి చేశాడు ..అయిదేళ్లకోసారి ధనాగారం లోని డబ్బునంతా ప్రజలకు దానం చేసేవాడు .రాజ్యాధికారం కంటే సాహిత్యం పై మోజేక్కువ .మంచికవి .హర్షునికాలం లో నలందా విశ్వ విద్యాలయంపది వేల మంది దేశ విదేశీ విద్యార్ధులతో మహోన్నత దశలో ఉండేది .ధర్మ కీర్తి ఇక్కడ ఆచార్యుడు గా ఉండేవాడు .తన అన్నరాజ వర్ధనుడిని చంపిన శాశాంకుని ఓడించి సంహరించి ప్రతీకారం తీర్చుకొన్నాడు హర్షుడు . శశాంకు ని  చెరలో ఉన్న చెల్లెలు రాజ్యశ్రీ తప్పించుకొని బయట పడి బౌద్ధ భిక్షువు చేత రక్షింప బడి హర్షుని చేరుతుంది .ఆ భిక్షువు తత్వ బోధతో హర్షుడు బౌద్ధాన్ని స్వీకరించాడు .అంతకు ముందు హర్షుడు శివుడి అభిమాని .హర్షుని పట్టమహిషి  పారశీక కన్య .ఆమెనే మహాశ్వేతాగా బాణుడు చిత్రించాడని అంటారు .రెండవ భార్య సౌరాష్ట్ర రాజ వంశానికి చెందినదని ఆమెయే కాదంబరి అని పండితుల పిండితాభిప్రాయం .హర్ష సామ్రాజ్యం అస్సాం నుండి సౌరాష్ట్ర వరకు ,హిమాలయం నుండి వింధ్య వరకు వ్యాపించింది .

హర్షుని కవితా హర్ష వైభవం

హర్షుడు రాసిన మూడు నాటకాలలో ప్రియ దర్శిని మొదటిది .నాలుగు అన్కాలున్నాయి .బృహత్కధ నుండి తీసుకొన్న ప్రేమకధ ఇది .వత్సరాజు ఉదయనుడు నాయకుడు. కాలింగ రాజు దృఢ వర్మ శత్రువుల చేతిలో ఓడిపోగా కూతురు ప్రియ దర్శినిని ఉదయనుడి భార్య వాసవ దత్త దగ్గర పరిచారికగా చేరుస్తాడు .సేనాపతి విజయ సేనుడు .ప్రియ దర్శినిని ఉదయనుడు ఒక సారి ఉద్యానవనం లో చూడటం తో ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది .వీరిద్దరి ప్రేమను నాటకం గా వేస్తారు .అందులో ఉదయనుడు వాసవ దత్తగా ప్రియ దర్శిని  నటిస్తారు .వీరిప్రేమ రాణి వాసవ దత్తకు తెలుస్తుంది .ప్రియ దర్శికను బంధిస్తుంది .దృఢ వర్మ శత్రువులను జయించి వాసవ దత్తకు అసలు విషయం చెబుతాడు .వాసవ దత్త ఉదయన ప్రియ దర్శనికల వివాహం జరిపిస్తుంది ..ఈ నాటకం పై మాళవికాగ్ని మిత్ర ప్రభావం ఉంది .

రత్నావళి నాటకం లో నాలుగు అన్కాలున్నాయి .రత్నావళి నాయిక సింహళ దేశానికి చెందింది .రత్నావళి పెళ్లి చేసుకొన్నా వాడు చక్ర వర్ర్తి అవుతాడనే జ్యోతిష్యం బయట పడుతుంది .వాసవ దత్త ,యౌగంద రాయణులు ఒక పన్నాగం పన్ని వాసవ దత్త చనిపోయినట్లు పుకారు పుట్టించగా, వార్త తెలిసిన మంత్రి వాసు భూపతి ఉదయునిదగ్గరకు  రత్నావళి ని పంపుతాడు .ప్రయాణం లో నౌక ప్రమాదానికి గురై రత్నావళి సముద్రం లో పడిఎల్లాగో బయట పడి వాసవ దత్తను చేరి సాగరిక పేరుతొ పనిమనిషిగా ఉంటుంది .రాజు కంటబడకుండా ఈమెను జాగ్రత్త గా చూసుకొంటున్నా ఒక సారి వారిద్దరూ ఉద్యానవనం లో కలుసుకొని హృదయాలను పారేసుకొంటారు .తరువాత కొన్ని మలుపులు తిరిగి ఉదయన సాగారికల వివాహం జరిగిపోతుంది .ప్రియ దర్శినిలోను ఇందులోనూ దాదాపుఒకే కద ఉంది. భాసుడి స్వప్న వాసవ దత్త ప్రభావం దీనిమీద ఎక్కువ .నాటకం మనసును ఆకర్షిస్తుంది .

మూడవ నాటకం నాగానందం .ప్రౌఢ రచన .అయిదు అంకాలు .ఇది జీమూత వాహనుడిత్యాగ కద .అహింసకు ప్రాధాన్యతనిచ్చాడు .ఈ కధకు ఆధారం జాతక కధలోని విద్యాధర చరిత్ర అని హర్షుడు చెప్పాడుకాని అది దొరకలేదు .నాటకారంభం లో బుద్ధుని స్తుతించాడు .అయినా హిందూ మతం పై కోపం లేదు కనకనే నాటకం లో నాయిక మలయా వతిని  గౌరీ దేవి భక్తురాలుగా చిత్రించాడు  .సన్నివేశాలను వేగవంతం గా నడిపిస్తాడు .విసుగుఉండదు ..మొదటి మూడు  అన్కాలలో  శృంగార రసం పోషింప బడింది .తరువాత శాంత రసం సాగింది .హాస్య అద్భుతరసాలకూ ఇందులో చోటు కల్పించాడు

కాళిదాస భవ భూతుల తర్వాతి స్థానం హర్ష దేవుడిదే .సరళ సుందర శైలితో కోమలమైన రచన చేశాడు .హర్షుడు నాట్య సంగీతాలలో నిష్ణాతుడు అని తెలుస్తుంది .లలితకళా ప్రియుడుగా కనిపిస్తాడు .హర్షుని రస హృదయం ప్రేక్షకాదరణ పొందింది .ప్రక్రుతి చిత్రణా సహజ సుందరం గా చేశాడు .పాత్రల స్వభావాలను సుస్పష్టం గా చిత్రించాడు ..కవిగా,నాటక కర్త గా హర్షుడు సవ్య సాచిత్వం చేశాడు .రచనా ప్రావీణ్యం అమోఘమని పిస్తుంది .హర్షుడు హృదయ హర్షుడనిపిస్తాడు .నాగానంద నాటకాన్ని 2008లో దేశం లో పలుచోట్ల ప్రదర్శించారు .అఖిల భారతీయ మరాఠీ  నాట్య పరిషద్ ఆధ్వర్యం లో చాలా చోట్ల ప్రదర్శించారు .

ఈ నాటి హర్యానా పంజాబ్ ప్రాంతం లో రాజధాని నేర్పరచుకొన్న హర్షుడి సైన్యం లో లక్ష మంది అశ్విక సైన్యం , అరవై వేలమంది ఏనుగులు ఉండేవి .ప్రజలకు విద్యా వైద్య సౌకర్యాలను ఉచితం గా కల్పించాడు మంచినీటి సరఫరా నాణ్యం గా ఉండేది . విశ్రాంతి గృహాలు ఉండేవి . ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడడాని చరిత్రకారులు రాశారు .తక్కువ పన్నులు వేసేవారు ఆరోవంతు భూమి శిస్తు వసూలు చేసేవాడు .ఈ నాడు స్తానేశ్వరం లో ఒక కిలో మీటరు పొడవు ముప్పాతిక కిలోమీటరు వెడల్పు ఉన్న శిధిల ‘’హర్ష కా తిల ‘’కనిపిస్తుంది .అత్యాధునిక సౌకర్యాలున్న ప్రాంతంగా ఇది కనిపించి ఆశ్చర్య పరుస్తుంది .తాంగ్ వంశానికి చెందిన చైనా చక్రవర్తి తిజాంగ్ తో సత్సంబంధాలు నేరపాడు .సందర్శకులు ఇరుదేశాలనుంది వచ్చి వెడుతూ ఉండేవారు .చైనా యాత్రికుడు హ్యూన్ చాంగ్ హర్షుని రాజ్యం లో  ఎనిమిదేళ్ళు భారత దేశం లో గడిపాడు .ప్రయాగలో అయిదేళ్లకోసారి మహా కుంభ మేలను నిర్వహించేవాడు .నలభై ఒక్క ఏళ్ళు హర్షుడు రాజ్యాన్ని పాలించాడు .హర్షునికుమారులు వ్యాఘ్ర వర్ధనుడు ,కళ్యాణ వర్ధనుడు .హర్షుని ముఖ్యమంత్రి అరునణాశ్వుడు వీరిద్దరిని చంపి ,రాణి ప్రభావతిని చెరలో పెట్టాడు .

జయదేవుడు తన గీత గోవిందం లో హర్షుని కాళిదాసుతోపోల్చాడు .జయదేవునికాలానికే హర్షుని కీర్తి దేశావ్యాప్తమైందనిదని తెలుస్తోంది .ఆర్.సి మజుందార్ అనే పరిశోధకుడు హర్షుని గురించి రాస్తూ ‘’A great general and just administrator .Harsha was even greater than patron of religion and learning .He gathered around himself finest intellects holiest sages .Men like Bana ,Mayura ,Divakara and Huen tsang thronged round his throne .In this respect   he is more fortunate than Samudra Gupta for still we posses some gems of literature that proceedede according to tradition from his pen ‘’అని హర్షుని భహుముఖీన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు .

 Inline image 1  

ఈ సారి నైషధాన్ని రాసిన హర్ష దేవుడి గురించి తెలుసుకొందాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -37

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -37

36- వసంత తిలక వృత్త -రత్నాకరుడు

హర విజయం అనే మహా కావ్యం  రాసిన రత్నాకరుడు కాశ్మీర దేశం కవి .బిప్పట జయాపీడుని ఆస్థానం లో ఉన్నాడు .తర్వాత అవంతి వర్మ రాజ్యం లోను ప్రసిద్ధిపొండాడు .కనుక కాలం క్రీ శ .ఎనిమిది వందలు గా నిర్ణయించారు 850-894అనుకోవచ్చు .హరవిజయం లో శివుడు అందకాసురుడిని సంహరించటం అనే కద ఉంది ఇది యాభై సర్గల బృహత్ కావ్యం .శ్లోకాల సంఖ్య 4320.

కవితా రత్నాకరుడు (కవి సముద్రుడు )

రాజానక ,వాగీశ్వర ,విద్యాధిపతి బిరుదులున్న రత్నాకరుడు వసంత తిలక వృత్తానికి సృష్టికర్త .దీనిని క్షేమేంద్రుడు రాజశేఖరుడూ పేర్కొని మెచ్చారు .హర విజయం లో శివ పార్వతులు కామ కళా కేళి లో ఉండగా అంధుడైన అంధకాసురుడు జన్మించాడు .శివుడిని స్తుతించి కను చూపు తెచ్చుకొన్నాడు వరగర్వం తో విర్రవీగి మూడు లోకాలను కల్లోల పరచాడు .దేవతలు అందకుని ఆగడాలు భరించ లేకఈశ్వరుని ప్రార్ధిస్తే వాడిని సంహరించటమే కద .యాభై సర్గ లున్న ఈ కావ్యం లో మొదటి పదమూడు సర్గలలో శివుడు అందకాసురుడిని సంహారం చేయటానికే చేసే   మంత్రాంగమే  వర్ణించాడుకవి .తర్వాత ఏడు సర్గలలో శివుడికి అందకాసురుడికి మధ్య సంవాదం ఉంటుంది సన్నివేశాలు సంవాదాలు బాగా పెంచి రాసిన కావ్యం ఇది .

రత్నాకరుడు సకల శాస్త్ర రత్నాకరుడు .అతనికి ప్రవేశం లేని విద్య లేదు .పురాణ ,ఇతిహాస ,నాట్య ,సంగీత ,నీతి,వేదాంత ,కామ శాస్త్ర ,అలమ్కారాది శాస్త్రాలలో నిష్ణాతుడు .దీనికి మించి చిత్రకావ్య రచనా సమర్ధుడు .మహా కావ్య లక్షణాలన్నీ హరవిజయం లో చొప్పించాడు .తన కావ్య మర్మాన్ని రాత్నాకురుడే –‘’లలిత మధురాఃసాలంకారాఃప్రసాద మనోహరాః –వికట యమక శ్లేషోద్గార ప్రబంధ నిరర్గలాః’’ఇన్ని కవితా లక్షణాలతో తన హర విజయం మనోహర విజయం సాధించిందని చెప్పాడన్నమాట .ప్రతి సర్గ చివర ‘’రత్న ‘’అనే శబ్దాన్ని వాడాడు .దీనికి స్పూర్తి భారవి వాడుకొన్న ‘’లక్ష్మి ,మాఘుడు ప్రయోగించిన శ్రీ  ‘’,శ్రీహర్షుడు ఉపయోగించిన ‘’ఆనంద ‘’శబ్దాలే .రత్నాకరుడి కావ్యం ‘’చంద్రార్ధ చూడ చరితాశ్రయ చారు ‘’సుందరం అని తానే చెప్పుకొన్నాడు .

డేవిడ్ స్మిత్ ఈ కావ్యం లో మతవిషయాలతో బాటు సింబాలిజం కూడా ఉందన్నాడు  భారతీయ సంస్కృతిని కావ్యం లో ప్రతిబింబింప జేశాడనీ చెప్పాడు .సంప్రదాయ  ఆలంకారికులను విమర్శిస్తూ చెప్పిన గ్రంధమనీ అన్నాడు .రాజాస్థాన విధానాలు ,సమాజ వ్యవహారాలూ ఇందులో పొండుపరచాడని తెలియ జేశాడు .హరవిజయాన్ని పండిట్ దుర్గా ప్రసాద్ ,కాశీనాద్ పాండురంగ పరబ్ లు ఆంగ్లం లోకి అనువదించి ప్రచురించారు .పుర ,నగర పర్వత సముద్ర వన సూర్యాస్తమయ ,అస్తమయ యుద్ధ ,ఋతు వర్ణాలతో కావ్యం సర్వాంగ సుందరం గా ఉంటుంది  కద కంటే కధన వర్ణన విధానం బాగా ఆకర్షిస్తుంది .భారవి కిరాతార్జునీయాన్ని మాఘుడి శిశుపాల వధ కావ్యాలను మించిన కవితా సౌందర్యం ఇందులో ఉన్నది .

37-  బాల కవి -రాజ శేఖరుడు

బాల్యం లోనే కవిత్వం లో అమోఘమైన ప్రతిభ చూపి’’ బాలకవి ‘’అనే బిరుదు పొందిన రాజ శేఖరుడు కనోజు పాలకుడు ఘూర్జర రాజు ప్రతీహార వంశస్తుడు  మహేన్ద్రపాల రాజు ఆస్థానం లో విద్యా గురువు .అతనికొడుకు మహీ పాలుని వద్ద ,కేయూర వర్షుని ఆస్థానం లోను గౌరవ పదవులలో రాణించాడు .కనుక కాలం క్రీ శ .860-940గా నిర్ణయించారు .పండిత వంశం లో జన్మించిన ఇతని తండ్రి దుర్దకుడు స్వీయ ప్రతిభతో  మంత్రి అయ్యాడు  తల్లి శీలవతి .ముత్తాత అకాల జలదుడు కూడా గొప్ప కవి .ఇతన్ని మాయవర కుల సంజాతుడని అంటారు ఈ కులం బ్రాహ్మణ క్షత్రియ రెండుకులాల్లోనూ ఉందట .క్షత్రియుడేనని అందుకే చౌహాన్ క్షత్రియ కులానికి చెందిన అవంతీ సుందరిని పెళ్లి చేసుకోన్నాడని వాదించేవారూ ఉన్నారు .ఇది నిజం కాదని బ్రాహ్మణ కుల సంజాతుడేనని మెజార్టీ నమ్మకం .అవన్తీసుందరి గొప్ప పండితురాలు ,విదుషీమణి కాబట్టే ,రాజశేఖరుడు కులాంతర వివాహం చేసుకోన్నాడని అది ఆనాటి సంఘం లో ఉన్న ఆచారమే నని సమర్ధిస్తారు .ఆమె ప్రేరణ అతనికి బహువిధాల తోడ్పడిందని  అనుకోవచ్చు .ఆనాటి చాలా రాజ్యాలతో రాజులతో అతనికి పరిచయాలున్నాయి .జీవిత చరమాంకాన్ని కాశీలో గడిపినట్లు తెలుస్తోంది .ప్రతీహార వంశం రాష్ట్ర కూట రాజు ఇంద్రుని చేతిలో నశించింది .అప్పుడు రాజశేఖరుడు త్రిపురకు  వెళ్లి అక్కడ కాలచూరి రాజు కేయూర వర్షుని ఆస్థానం చేరాడు .శేఖరుడు పండిత కవి .అనేక రచనలు చేశాడు

కవితా రాజశేఖరం .

త్రిపురలో ‘’విద్ధ సాల భంజిక ‘’నాటకాన్ని రాజశేఖరుడు రాశాడు .అక్కడే ‘’కావ్య మీమాంస ‘’అనే అలంకార గ్రందాన్నీ రచించాడు .పాండిత్యం కవిత్వాలతో రాజుల మెప్పుపొంది అనేక ఘన సన్మానాలు అందుకొన్నాడు అతని సమకాలీన కవుల కృష్ణ శంకర వర్మ ,అపరాజితుడు మొదలైన వారు శేఖరుని గొప్ప తనాన్ని గుర్తించి కొనియాడారు .సాహిత్య కళల తో బాటు సాంస్కృతిక ,ధార్మిక విషయాలూ బాగా తెలిసిన వాడు .ఆకాలం లో మహిళా కవులైన భట్టారిక ,సుభద్ర లను మెచ్చుకొన్నాడు .స్త్రీ వలన సాహిత్య ప్రాచుర్యం పొందిన మొదటికవి రాజశేఖరుడు .ఎంత పాండిత్యం ఉన్నా హద్దుల్లో ఉందడి సాటి వారి యెడ గౌరవాదరాలు కలిగి ఉన్న సంస్కారి .ఇతరుల అభిప్రాయాలకు విలువ నిచ్చిన ప్రజాస్వామ్య వాది.

రాజ శేఖరుడు ఆరు కృతులను రచించాడని ‘’నః షట్ ప్రబందాన్ ‘’అని తన రామాయణ నాటక ప్రస్తావనలో తెలిపినదాన్ని బట్టి తెలుస్తోంది .కాని అయిదు రచనలే లభ్యం .అందులో నాలుగు నాటకాలు –అవి బాల రామాయణం ,బాల మహా భారతం ,కర్పూర మంజరి ,విద్ధ సాల భంజిక .అయిదవది అలంకార గ్రంధం అయిన ‘’కావ్య మీమాంస ‘’.భువన కోశం కూడా రాశానని చెప్పాడుకాని దొరక లేదు .

బాల  రామాయణ నాటకం లో తాను  వాల్మీకి అవతారాన్ని అని రాజ శేఖరుడు చెప్పుకొన్నాడు .సీతా స్వయం వరం తో ప్రారంభమై రాముడు అయోధ్యకు తిరిగి వచ్చేదాకా కదనడుస్తుంది. పది అంకాలున్న నాటకం .కనుకనే మహా నాటకం అన్నారు .ప్రతి అంకానికి ప్రత్యేకమైన పేరు పెట్టి కొత్త దారి చూపాడు .అవే-ప్రతిజ్ఞా పౌలస్త్యం ,రామ రావణీయం ,విలక్ష లంకేశ్వరం భార్గవ భంగం ,ఉన్మత్త దశాననం ,నిర్దోష దశరధం ,అసమా పరాక్రమం ,వీర విలాసం ,రావణ వధ ,సానంద రాఘవం ‘’ఈపేర్లు చక్కగా ఆ అంకం లోని కధకు గొప్ప వివరణ గా ఉంది .నాటకానికి అవసరమైన మార్పులు చేశాడు. రావణ విరహానికి ప్రాముఖ్యం ఇచ్చాడు .మన యెన్ టి  రామా రావు లాగా రావనణుడిమీద సానుభూతి పెరిగేట్లు చేశాడు .కధలో గమనం లో సన్నివేశాలలో .నాటకం లో కళా ద్రుష్టి పూజ్యం .బాపు గారి శ్రీరామ రాజ్యం లాగా సర్వం  పూజ్యం అనిపిస్తుంది .కల్పనలకు ఎక్కువ విలువపొండాడు .

బాల భారత నాటకం కు ‘’ప్రచండ పాండవం ‘’అనే పేరుకూడా ఉంది .రెండు అన్కాలే లభించిన అసంపూర్తి నాటకం .ఇందులో  ద్రౌపదీ స్వయం వరం  ,జూదం వస్త్రాపహరణం ఉన్నాయి .కర్పూర మంజరి నాటకం ‘’సట్టకం ‘’అనే రూపక భేదానికి చెందింది .నృత్య ప్రధానమైంది .భార్య అవంతీ సుందరి ముద్దు కోరిక తీర్చ టానికే రాశాడు .మొదటి అంకం లో వసంతోత్సవ వేడుకలు ,చంద్రపాల రాజు రాణి విభ్రమ లేఖ ,విదూషక రంగ ప్రవేశం ఉంటాయి .విదూషకుడికి పరిచారిక విచక్షణ కు వసంత వర్ణన లో పోటీ ఏర్పడి కోపం వచ్చి భైరవానందుడు అనే సిద్ధుని తెస్తాడు విదూషకుడు .సిద్ధుడు మాయ జాలాన్ని చూపించి కర్పూర మంజరిని పరిచయం చేస్తాడు .రాజు ఆమె పై మరులు గొంటాడు .ఆమె రాణికి పిన్ని కూతురే .రెండవ రంగం లో మంజరి రాజు ను ప్రేమిస్తుంది .దూతిక ద్వారా తెలియ జేస్తుంది .రాజు మంజరిని చూస్తాడు .మూడవ అంకం లో మంజరి రాజుకు కలలో కన్పించిన విషయాన్ని విదూషకుడికి చెప్పటం విరహ వేదనతో మంజరి వచ్చి రాజును కలవటం ఈ వార్తా రాణి చెవిన పడటం .నాలుగులో-రాణి మంజరిని నిర్బంధం లో ఉంచటం సిద్ధుడికి కానుకగా ధన సార మంజరితో పెళ్లి చేయిస్తాననటం వార్త రాజుకు చేరవేయటం చివరికి ధనసారమంజరేకర్పూరమంజరి అని తేలటం ఇద్దరికీ వివాహం జరగటం తో సమాప్తం  ఈ నాటకం రాజశేఖరుని నాటకాలలో గొప్పదని అభిప్రాయం. నాటక కళకు కవితా శోభ అద్దాడు .రీతి భేదం చూపి రక్తి కట్టించాడు .విదూషకుడు హుందాగా మాట్లాడటం ప్రత్యేకత .శౌరసేని ప్రాక్రుతాన్ని వాడి కొత్త దారి తొక్కాడు .

విద్ధ సాల భంజిక కూడా పైనాటకం లాంటిదే .’’నాటిక ‘’ అనే రూపక  భేదానికి చెందింది .మొదటి అంకం లో రాజా చంద్ర వర్మ కూతురు’’ మృగాంక వతి’’ని  ‘’ మృగాంక వర్మ’’ అనే పేరుతొ’’ కొడుకుగా’’ ప్రకటించటం ,ఆ వేషం లో ఆమె విద్యాధర మల్లుని రాణి దగ్గరకు చేరటం అతని మంత్రికి  ఈ రహస్యం తెలిసిపోవటం ,ఆమెను పెళ్లి చేసుకొన్న వాడు చక్ర వర్తి అవుతాడని జ్యోతిష్కులు చెప్పటం ,రాజు దగ్గరే ఆమెను ఉంచటం .ఒకసారి విద్యాధర మల్లుడికి  ఆమె ముక్తాహారాన్ని విసిరిపోయినట్లుకల వచ్చి విదూషకుడికి చెబితే స్వప్నం లో చూసిన సుందరి బొమ్మను (విద్ధ సాల భంజిక )చిత్రశాలలో ప్రతిస్టిం చటం  అప్పుడు మృగాంక వర్మ రావటం ,రాజుకు ఆమె స్త్రీ అని తెలియక పోవటం తో మొదటి అంకం పూర్తీ .రెండవ అంకం లో కుంతల రాకుమారి కువలయ మాల తో మృగాంక వర్మ వివాహం జరిపించటానికి రాణి ఆలోచించటం .ఒక రోజు నిజరూపం లో ఉద్యాన వనం లో విహరిస్తున్న ఆమెను రాజు చూడటం ఉంటుంది .మూడులో రాజు  మృగాంకవతిని కలుసుకొంటాడు .ఇద్దరూ ప్రేమ బద్ధులౌతారు .నాలుగవ అంకం లో రాణికి  ఈర్ష్య ఏర్పడి   మృగాంక వర్మ పెళ్లి చేసేస్తుంది .ఇంతలో చంద్ర వర్మకు కొడుకు పుడతాడు. పుత్ర వేషం లో ఉన్న కూతురును రాజు కిచ్చి పెళ్లి చేయాలనుకొంటాడు .చివరికి రాణి ఏమీ చేయలేక మృగాంక వతి బాటు  కువలయ మాలను కూడా రాజు కిచ్చి పెళ్లి చేస్తుంది .

కదా సన్నివేశాలు బహు చమత్కారం గా తీర్చాడు. నాటకీయత లోపించి రక్తి కట్టలేదు .దీనిపై మాలవికాగ్నిమిత్ర ,రత్నావళి నాటక ప్రభావం బాగా ఉందనిపిస్తుంది .కవిత్వాపరం గా హిట్టే .నాటక కళ పరంగా ఫట్టే .ఇందులో సమకాలీన సామాజిక చరిత్ర ఉందని ఆనాటి ప్రజల మనోభావాలకు నిలువుటద్దమనీ భావిస్తారు .తన నాటకాలలో నాటక కళతక్కువే అని ఆయనే చెప్పుకొన్నాడు ..రస భావ అనుకూల భాషను ప్రయోగించటం లో రాజశేఖరుడి నేర్పు కన్పిస్తుంది .మాధుర్య గుణం తో ఉన్న సంగీత గుణం అతనికవిత్వం లో ఉంది .శబ్ద విన్యాస చతురుడు .పదలాలిత్యానికీ శేఖరుని ఉదహరిస్తారు .రాజ శేఖరుని రచనలు మునుల మనస్సుల్లాగా సమాధి గుణం కలవి ,ప్రసన్నం చేసేవి అని తిలక మంజరిలో ధనపాలుడు ప్రశంసించాడు –‘’సమాధి గుణ శాలిన్యః ప్రసన్న పరి పక్త్రియా –యాయా వర కవేర్వాచో మునీనామివ వృత్తయః ‘’

సంస్కృతం లోనే కాక ప్రాక్రుతభాషలైన శౌరసేని ,ప్రాకృత అపభ్రంసః భాషలమీదా ఆధారిటీఉన్నవాడు .బాల రామాయణం లో ‘’ప్రాకృతం సంస్కృతానికి జనని ‘’అని స్పష్టం గా చెప్పాడు .ప్రాకృత భాషలు చెవికి సోకితే ఇతర భాషలు రుచించవు అనీ చెప్పాడు .’’శుభస్య అపభ్రంశః ‘’అన్నాడు కావ్య రచనకు అపభ్రంశ భాషలు ఇతోధికం గా తోడ్పడతాయి అన్నాడు .భూత భాషను ‘’సరస రచనం భూత వచనం ‘’అని కీర్తించాడు .ఈ విధం గా అంతకు ముందు ఏ కవీ చేయని సాహసం చేసి ఆనాడు జన సామాన్యం లో వాడుకలో ఉన్న భాషలను సమాదరించి ,వాటికీ కావ్య గౌరవం ఉంది అని నిర్ద్వంద్వం గా తెలియ జెప్పిన వాడు రాజ శేఖరుడే .

కావ్య మీమాంస

రాజ శేఖరుడు రచించిన అలంకార శాస్త్రం ‘’కావ్య మీమాంస ‘’.ఇది క్షేమేంద్ర ,భోజ హేమచంద్రాదులకు ప్రేరణ గ్రంధం ఇందులో పద్దెనిమిది అద్యాయాలున్నాయి .కావ్య పురుషుడి ఉత్పత్తితో ప్రారంభించి ,అతడు అష్టాదశ శిష్యులకు కావ్య విద్యలు నేర్పటం శిష్యులు వాటిపై గ్రంధ రచన చేయటం, కావ్య భేదాలు ,సాహిత్య విద్యా కన్యను కావ్య పురుషుడు వివాహమాడటం,కవి భేదాలు ,భాష, శైలి వగైరాలు కవి సమయాలు ,కవిరహస్యాలు అలంకార సిద్ధాంత సమీక్ష మొదలైనవన్నీ శాస్త్రీయం గా రాశాడు .ఇలాంటివిషయ చర్చలు ఇంతకూ పూర్వం ఎవరూ చేయలేదు .అందుకే అపూర్వం అనిపిస్తాయి. కావ్యార్దాపహరణ లోముప్ఫై రెండు రకాలను తెలియ జేసి , చర్చించాడు .కవులకు అర్దాపహరణ తప్పదు అన్నాడు .గుణ రీతి ధ్వని సిద్ధాంతాలను స్పృశించాడు .కవుల దిన చర్యలు రాజ సభల్లో గోష్టి విధానం గొప్పగా చిత్రించాడు .రుద్రటుడి ప్రభావమ్ ఇతనిపై ఎక్కువ అంటారు .అలంకారాలు ,రీతులు కావ్యానికి ఉపయోగ సామగ్రి అన్నాడు .ఇవేవీ కావ్యాత్మకాదన్నాడు .ధ్వనిని గురించి ఎక్కడా స్పష్టం గా చెప్పలేదంటారు.అంటే అప్పటికి ధ్వని సిద్ధాంత వ్యాప్తి బాగా ఉండి  ఉండక పోవచ్చు  ఉక్తి వైచిత్రి అవసరం అన్నాడు .

భార్య అవంతీ సుందరికూడా సంస్కృత ప్రాకృత పండితురాలు .ఆమె అభిప్రాయాలకు విలువనిస్తూ చాలా సార్లు పేర్కొన్నాడు .’’రసోచిత శబ్దార్ధ సూక్తులను కావ్యం గా పరిగ్రహిం చాలి ‘’అని అవంతీ సుందరి చెప్పినదానితో తానూ ఏకీభవిస్తున్నట్లు రాజశేఖరుడు చెప్పాడు .’’రసకవి యేఉత్తమ కవి ‘’అన్నాడు .కనుక రస సంప్రదాయానికి చెందిన వాడుగా రాజ శేఖరుని గుర్తించారు  .కావ్య మీమాంసను ఆంగ్లం లో సి ఎస్ వెంకటేశ్వర న్ అనువదించి విపులమైన వివరణ చేశాడు .

Inline image 1  Inline image 2

మరో కవితో మళ్ళీ

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జాషువా జాడ ప్రామానికమా అని ప్రశ్నించిన -బండి నారాయణ స్వామి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -36 -34-శాంతాన్ని నవమ రసం గా చెప్పిన –ఉద్భటుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -36

34-శాంతాన్ని నవమ రసం గా చెప్పిన –ఉద్భటుడు

‘’కావ్యాలంకార సార సంగ్రహం ‘’అనే అలంకార శాస్త్రాన్ని రాసిన ఉద్భట భట్టు కాశ్మీర దేశస్తుడు .కాశ్మీర రాజు జయా పీడుడి ఆస్థాన పండితుడు .కనుక ఇతనికాలం  779-813అని నిర్ధారించారు .ఈ విషయాన్ని కల్హణుడు తన రాజ తరంగిణిలో లో పేర్కొన్నాడు .’’విద్వాన్ దీనార లక్షేణ ప్రత్యహం కృత వేతనః –భట్టో  భూ దుద్భటస్తస్య భూమి భర్తుః సభా పతిః ‘’

కవితోద్బటం

ఉద్భటుని ‘’కావ్యాలంకార సార సంగ్రహం ‘’అలంకార రచన .ఇదికాక’’ భామఃహ  వివరణ ‘’అనే గ్రంధమూ రాశాడు .ఇది భామహుడు రాసిన కావ్యాలంకారానికి వ్యాఖ్యానమే .కాని ఇది లభించటం లేదని చెప్పుకొన్నాం .భరతుడి నాట్య శాస్త్రానికి ఉద్భటుడు టీక కూడా రాశాడు .ఇవికాక ‘’కుమార సంభవం ‘’అనే కావ్యం రాసినట్లుంది ..ఈ కావ్య శ్లోకాలను తన అలంకార గ్రంధం లో ఉదాహరణలుగా ఇచ్చాడు .

కావ్యాలంకార సార  సంగ్రహం కూడా ఆరు పరిచ్చేదాలల్తో ఉన్న గ్రంధం .మొత్తం 79కారికలున్నాయి .భామహుడు నడిచిన బాటలోనే దీన్ని రాసినా అతనికంటే భిన్నమైన అలంకార వివేచన చేశాడు .భిన్నం గా అలంకార భేదాలనూ చెప్పాడు .మొత్తం మీద నలభై ఒక్క అలంకారాలను ఉద్భటుడు వివరించాడు .ఇతని ఉపమ ,ఉత్ప్రేక్ష ,అతిశయోక్తి లను తరువాత  అలంకారికులైన  ముమ్మటుడు రుయ్యకుడు గ్రహిం చారు .కావ్య సౌందర్యానికి గుణాలతో బాటు అలంకారాలు అవసరమే నని ఉద్భటుడు చెప్పిన దానితో రుయ్యకుడు ఏకీభవించాడు .ఉద్భటుడు శాంత రసాన్ని తొమ్మిదవ రసం గా నాట్య శాస్త్రం లో చెప్పాడని పండితాభిప్రాయం .

రీతులను దేశ పరం గా కాకుండా ఉపనాగరక ,గ్రామ్య ,పరుష అనే పేర్లతో పిలిచాడు .ఇది శబ్ద సంయోజనం పై ఆధార పడి ఉండేట్లు చెప్పాడు .ఉపనాగరిక రీతి పరిష్కృతం అయిన పధ్ధతి .గ్రామ్య రీతి సాధారణ మైంది .పరుష రీతి అంటే కఠినమైనది .క్రీ శ .తొమ్మిది వందల యాభై ప్రాంతం వాడైన‘’ప్రతిహా రేందు రాజు’’ ఉద్భటుని కావ్యాలంకార సార సంగ్రహానికి  విపుల మైన వ్యాఖ్యానం రాశాడు .ఉద్భటుడి శిష్య పరంపర రాజశేఖరుడి వరకు వ్యాపించి ఉంది అని ‘’ఇతి ఔదంభరాఃఉద్భట మతానుయాయినః ‘’అని రాజ శేఖరుడు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది .ఉద్భటుని సంప్రదాయం ‘’ఔద్భట సంప్రదాయం ‘’అని పిలువ బడుతోంది .శ్రవ్య కావ్యం లో రసమే ‘’జీవద్రూపం ‘’అని ఉద్భటుడుఅంగీక  రిం చాడని తెలుస్తోంది .ప్రాచీన ఆలంకారుల్లో ఉద్భటునిదిమూడవ స్థానం .మొదటివాడు భరతుడు రెండవ వాడు భామహుడు ,మూడవ వాడు ఉద్భటుడు .రసభావ అలంకార సంయోజనం  గురించి చెప్పిన వాడు ఉద్భటుడు

35- సూత్ర పద్ధతిలో అలంకార గ్రంధం రాసి కావ్యాత్మను చెప్పిన  -వామనుడు

ఇప్పటికి వరకు మనం చెప్పుకొన్న అలంకారికులు తమ గ్రంధాలను పద్యాలకారికల్లో రాస్తే వామనుడు మాత్రం సూత్ర పద్ధతిలో అలంకార గ్రంధం రాశాడు .ఈయనా ఉద్భటుడిలాగే కాశ్మీర రాజు జయా పీడుని ఆస్థాన కవే కాకుండా మంత్రికూడా .ఇతని అలంకార గ్రంధం పేరు ‘’కావ్యాలంకార సూత్ర వ్రుత్తి ‘’.ఏదైనా సూత్రాలుగా చెబితేనే అది శాస్త్రం అవుతుందని నమ్మి అలా రాశాడని భావిస్తారు .ఈగ్రంధం లో మూడు వందల పందొమ్మిది సూత్రాలు ఉన్నాయి .అయిదు అధికరణాల్లో ,పన్నెండు అధ్యాయాలుగా రచించాడు .తన సూత్రాలకు అర్ధాలను కూడా వామనుడే రాసుకొన్నాడు .అదొక ప్రత్యేకత .సూత్రాలను వివరించే వాటికి ‘’వ్రుత్తి ‘’అని పేరు పెట్టాడు .ఇతనికి ముందున్న అలంకారికులు లక్షణాలకు ఉదాహరణలను తమ స్వంత కావ్యాలనుంచే ఇచ్చారు .కాని దీనికి భిన్నం గా వామనుడు ఇతరకవుల కావ్యాలనుంచి ఉదాహరణలు సేకరించి అందజేసి తన సిద్ధాంత వ్యాప్తి చేసుకొన్నాడు . ఇదీ రెండో ప్రత్యేకత.

వామన విశ్వ రూపం

వామనుడు  రాసిన కావ్యాలంకార సూత్ర వృతి లోకావ్య పరిభాష ,కావ్య ప్రయోజనం కావ్య హేతువులు ,కావ్య రీతులు ,కావ్య అంగాల నిరూపణ చేశాడు .రెండు మూడు నాలుగుల్లో  దోష ,గుణ ,అలంకార నిరూపణ చేశాడు .అయిదులో శబ్ద శుద్ధి గురించి చెప్పాడు .ఇది భామహుని కావ్యాలంకారం లోని చివరిపరిచ్చేదాన్ని తలపింప జేస్తుంది .ముప్ఫై మూడు అలమ్కరాలనువామనుడు చెప్పాడు అందులో వక్రోక్తికి ,వ్యాజోక్తికి ఎక్కువ ప్రాముఖ్యాన్నిచ్చాడు .

కావ్యం యొక్క ‘’ఆత్మ ‘’ను గురించి మొదట చెప్పిన వాడు వామనుడే .ఆతను అన్నమాట ‘’రీతి రాత్మా కావ్యస్య ‘’అనేది అందరికి నోట నానిన సూత్రమే .అంటే కావ్యానికి ప్రాణం రీతి .అది ఆత్మ వంటిది అన్నాడు .’’కావ్య శోభాకరాన్ ధర్మాలంకారాన్ ప్రచక్షతే’’అని దండి అభిప్రాయపడ్డాడు .కాని వామనుడు కావ్య శోభ గుణాల వలననే కలుగుతుందని చెప్పాడు –అదే ‘’కావ్య శోభాయాః కర్తారో ధర్మా గుణాః’’అని సూత్రీకరించాడు ఖచ్చితం గా .గుణాల వలననే కావ్యానికి సౌందర్యం కలుగుతుందని ,ఆ సౌందర్యాన్ని ఇనుమడింప జేసేది అలంకారం అని స్పష్టం గా చెప్పాడు .అలంకారాలు లేక పోయినా కావ్యం యొక్క సహజ సౌందర్యానికి ఏ విధమైన లోపమూ రాదనీ వామన మతం .వ్యక్తి గుణాల వల్ల ఆత్మ సౌందర్యం పొందినట్లుగానే ,కావ్యానికి కూడా సౌందర్యం గుణాల వల్ల ఏర్పడుతుంది అన్నాడు .కనుక వామనుడు ‘’సౌందర్య వాది’’ అని పిలవ బడ్డాడు .

వామన ఉద్భట అలమ్కారికులిద్దరూ ఒకే రాజాస్థానం లో ఉన్నారు .కాని ఒకరు రాసిన దానిలో రెండవ వారిని పేర్కొనక పోవటమే అమితఆశ్చర్యం  కలిగిస్తోందని విశ్లేషకులు అంటారు .ఇద్దరివి భిన్నమార్గాలు కూడా అని మనకు తెలిసిన విషయమే .ఉద్భటుడు భామహుని అనుసరిస్తే ,వామనుడు దండి ని అనుసరరించి రీతి సిద్ధాంత కర్త అయ్యాడు .దండి కావ్యాన్ని వ్యక్తీ తో పోల్చగా వామనుడు వ్యక్తికీ ఆత్మ ఉన్నట్లు కావ్యానికీ ఆత్మ ఉంటుంది అన్నాడు .కాశిక రాసిన వామనుడు ,కావ్యాలంకార సూత్ర వ్రుత్తి కర్త వామనుడు ఒకరే అని పండితుడు పి వి కాణేనిర్ణయిస్తే ,బూల్యర్ పరిశోధకుడూ దాన్ని సమర్ధించాడు . వామనుడు రీతి అంటే శైలి కావ్యానికి ఆత్మ అన్నాడు .పాంచాలి రీతి మాధుర్యం గా ఉంటుందని ,గౌడీరీతిలో వేగం శక్తి ఉంటాయని  వైదర్భీ రీతిలో ఇవన్నీ సమపాళ్ళలో కలిసిఉంటాయని చెప్పాడు .

వామనుడు మహా మేధావిగా పరిగణింప బడ్డాడు .’’కావ్యం గ్రాహ్య మాలాన్కారాత్ –సౌందర్య మాలకారః ‘’అని తన గ్రంధాన్ని ప్రారంభించాడు .అలంకారం అంటే సౌన్దర్యమేనన్నాడు ‘’కావ్య శోభాకారాణ్ ధర్మన్ అలంకారాన్ ప్రచక్షతే ‘’అని దండి అంటే –వామనుడు ‘’కావ్యా శోభయా కర్తారో ధర్మాః గుణాః-తదతిస్య హీత్వాః-అలమ్కారః ‘’అన్నాడు .సహజ సౌందర్యం గుణాలవలన ,కృత్రిమ సౌందర్యం అలంకారాల వలన లభిస్తుందని గుణాలకే ఎక్కువ మార్కులు వేశాడు .గుణాలు చక్కని బంధాన్ని ఏర్పరుస్తాయన్నాడు –‘’ఓజః ప్రసాద శ్లేష సమతా సమాధి మాధుర్య సౌకుమార్య –ఉదారతా అర్ధ వ్యక్తీ కాన్తయో బంధుగుణాః’’.అలాగే ‘’విశిష్ట పద రచన రీతి –విశిష్ట గుణాత్మా ‘’అని అన్నాడు .పదరచన విశిష్టం గా ఉంటె నిర్మాణం బాగుంటుంది ..కానీ రీతి  ఆత్మ.విశిస్టపదరచన వ్యన్జకం అయితే రీతి వ్యంగ్యం అని వివరించాడు .విశిష్ట పదరచనతో రీతి పుష్టి చెంది అలౌకిక  సౌన్దర్యాన్నిస్తుందని భావం .పాకం సహ్రుదయుడిని ఆకర్షించి ఆనందింప జేస్తుందని చెప్పాడు –‘’ఉదయితి హై సా తాద్రిక్ క్వాపి వైదర్భ రీతౌ సహృదయ హృదయాననం –రంజకః కూపీ పాకః ‘’’’అని అన్నాడు రీతిని పాకాన్ని ఎలా సరిగ్గా నిర్వచింప లేమో అలానే కూపీ పాకం కూడా అనిర్వచనీయం అన్నారు .శబ్ద పాకం అర్ధ పాకం సమపాళ్ళలో సంయోజనం చెందితే సహృదయ రంజకం జరుగుతుందని భావం .

మరొకరితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరో రెండు సరసభారతి ప్రచురణలు

సాహితీ బంధువులకు శుభాభినందనలు -సరస భారతి పద్నాలుగవ ప్రచురణ గా సరసభారతికి ఆత్మీయులు ,అమెరికా వాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు స్పాన్సర్ చేస్తూ ,వారికి  అభిమానులైన శ్రీ మాగంటి సుబ్బారావు గారికి(85)  (తెనాలి )అంకితం ఇస్తున్న నేను నెట్ లో రాసిన ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”ను మైనేనిగారి 80వ పుట్టిన రోజున  10-1-2015ఆదివారం ఉయ్యూరు లో శ్రీ సువర్చలాన్జనేయ స్వామి సన్నిధిలో సాయంత్రం జరిగె శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవసమయం లో లాంచనం గా ఆవిష్కరించి ,13-1-2015 బుధ వారం ధనుర్మాస సందర్భం గా భోగి నాడు మధ్యాహ్నం అరిగె స్వామి వారల కళ్యాణ సమయం లో పూర్తిగా ఆవిష్కరించి భక్తులకు అందజేస్తున్నామని తెలియ జే యటా నికి  అందిస్తున్నాను . ఇది మైనేని వారు స్పాన్సర్ చేస్తున్న నాలుగవ పుస్తకం అని గుర్తు చేస్తున్నాను .

    నెట్ లోనే నేను రాసిన ”దర్శనీయ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలు ”గ్రంధాన్ని అమెరికాలో ఉంటున్న మా మేనల్లుడు ఛి వేలూరి  మృత్యుంజయ  శాస్త్రి (జె వేలూరి-jay veluri) స్పాన్సర్ గా ఉండి స్వంత ఖర్చులతో ముద్రించటానికి  ముందుకు వచ్చి తమ తల్లి దండ్రులైన శ్రీ వేలూరి వివేకానంద శ్రీమతి దుర్గ అంటే మా అక్కయ్యా బావ గార్లకు  అంకితం ఇచ్చేట్లు ,ఆపుస్తకాన్ని 2015  మే -జూన్ నెలలలోవచ్చే  వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి నాడు స్వామివార్ల కళ్యాణ మహోత్సవం లో  ఆవిష్కరణ చేస్తే బాగుంటుందని  అంగీకరింఛి   ఇప్పుడే మెయిల్ ద్వారా తెలియ జేశాడు  . ఇవి సరసభారతి ప్రచురిస్తున్న 14 ,15 పుస్తకాలు .నేను రాసిన తొమ్మిది ,పది పుస్తకాలు అని మనవి చేస్తున్నాను శ్రీ మైనేని గారికివారి కుటుంబానికి  ,ఛి శాస్త్రికి  ,వాళ్ళ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియ జేస్తూ సరస భారతికి కొండంత అండగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలియ జే స్తున్నాను . ఇలాంటి సహృదయుల సహకారం తో సరస భారతి ప్రగతి పధం లో పయనిస్తోందని వినయం గా  మనవి చేస్తున్నాను -దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -35

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -35

33-మొదటి శ్రవ్యకావ్య అలంకారికుడు-భామహుడు

భామహుడు ఏడవ శతాబ్దానికి చెందిన కాశ్మీర దేశపు కవి ,ఆలంకారికుడు .దండికవికి సమకాలీనుడు ..’’కావ్యాలంకారం ‘’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .నాట్య శాస్త్రం లో భరతుడు రంగ ప్రదర్శనకు నోచుకొన్న నాట్య ,రూపకాల లక్షణాలు వివరించాడు .ఇవన్నీ దృశ్య రూపకాలు. కాని అప్పటికి శ్రవ్య కావ్యాలు లు అంతగా ప్రాచుర్యం పొందలేదు కనుక వీటి సిద్ధాంతాలపై ఎవరి దృష్టీ పడలేదు .శ్రవ్య కావ్య లక్షణాలపై తొట్టతొలి రచన చేసిన వాడు భామహుడు .అందుకే చరిత్ర ప్రసిద్ధి పొందాడు .కావ్యాలంకారం లో భామహుడు శ్రవ్య కావ్యాలో ఉన్న తేడాలు ,వాటి స్వరూపాలు ,మహా కావ్య లక్షణాలు ,కావ్య గుణ దోషాలు ,కావ్య గతమైన అలంకారాలు మొదలైన వాటిని మొట్ట మొదటగా  చర్చించిన వాడు భామహుడే .భరతుడి నాట్య శాస్త్రం తర్వాత అలంకార గ్రంధం భామహుదు రాసిన కావ్యాలంకారం .భామహుడి తండ్రి పేరు ‘’రుక్రిల గోమిన్ ‘’ఇది బౌద్ధ నామం అని ఊహించి అతడు బౌద్దుడన్నారు .కాని భామహుడు కావ్యారంభం లో ‘’ప్రణమ్య సర్వం సర్వజ్ఞం మనోవాక్కాయ కర్మభిః ‘’అని చెప్పటం వాళ్ళ అనుకొన్న పొరపాటు ఇది సర్వజ్ఞ నామం శివుడికే ఉంది –‘’సర్వజ్ననామము శర్వునికే  గాక’’అన్న పద్యం మనకు గుర్తు ఉంది .అదీకాక రామాయణ మహా భారత ఉదాహరణలే భామహుడు ఇచ్చాడు .కనుక బౌద్దుడుకాడు .

‘’ కావ్యాలంకార ‘’శోభ

భామహుడు రచించిన కావ్యాలన్కారం లో ఆరు పరిచ్చేదాలున్నాయి .అలంకారం అనే శబ్దానికి ‘’సౌందర్యం ‘’అనే అర్ధం కూడా ఉంది .వీటిని ‘’ కారికలు’’ అన్నాడు .మొదటి పరిచ్చేదం లో కావ్య ప్రయోజనాలు ,కావ్యానికి హేతువులు ,కావ్య లక్షణాలు ,భేదాలు గురించి చెప్పాడు .రెండవ దానిలో కావ్య గుణాలు ,మూడు లో అలంకారాల చర్చ చేశాడు .చతుర్ధ పరిచ్చేడం లో పూర్వ పరిచ్చేదాలలో వదిలేసిన వాటిని వివరించాడు .పంచమం లో తర్క శాస్త్రాధారం గా దోషాలను ఆరులో వ్యాకరణ శాస్త్ర రీత్యా వచ్చే దోషాలను గురించి వివరణ ఉంది .అలంకారాలను దోషాలను విపులంగా భామహుడు చర్చించటం వలన కావ్యం అనేది శబ్ద శుద్ధికలిగి ఉండాలని  ,అలంకారాలతో శోభించాలని భావించాడు .

భరతుడు చెప్పిన రస సిద్ధాంతాన్ని భామహుడు చర్చించ లేదు .అగ్నిపురాణ కర్త రసమే కావ్యానికి జీవం జవం అని అంగీకరించినట్లు గా భామహుడు  అంగీకరించినట్లు కనిపించదు .భామహుడి దృష్టిలో శబ్దం అర్ధం  ఉండేదేకావ్యం .కావ్యప్రయోజనానికి వైచిత్రి ,వక్రోక్తి తో కలిసిఉన్న అర్ధ సంయోజనం ముఖ్యమైన అవసరం అని చెప్పాడు .దీని తో బాటు కావ్యం దోష రహితం గా ఉండటమే కాకుండా గుణ సహితం గా ఉండాలని కోరాడు .రసాన్ని ‘’రసదలంకారాం’’గా భావించి భామహుడు వివరించాడు .మొత్తం మీద భామహుని దృష్టిలో అలంకారమే కావ్యానికి ప్రధానం .దృశ్యకావ్యం లో రసానికి ప్రాధాన్యం ఉన్నట్లు శ్రవ్య కావ్యం లో రస ప్రాధాన్యత అంత అవసరం లేదని భావించాడు .ముప్ఫై ఆరు అలంకారాలను ,రెండు శబ్దాలంకారాలను భామహుడు వివరించి చెప్పాడు .కావ్యం రాసేవారికి వ్యాకరణ పరిజ్ఞానం తో బాటు శబ్ద పరిచయం ఎక్కువగా ఉండాలని చెప్పాడు .ప్రసాదం మాధుర్యం ఓజో గుణాలను పేర్కొని భామహుడు ప్రసాద మాదుర్యగుణాలు శ్రేష్టమైనవి అని పేర్కొన్నాడు .’’శబ్దార్ధౌ సహితౌ కావ్యం ‘’అనేది భామహుని నినాదం .

ఎనిమిదవ శతాబ్దికి చెందినా ఉద్భటుడుఅనే అలంకార శాస్త్ర వేత్త  భామహునికావ్యాలంకార శాస్త్రానికి’’భామహ వివరణ ‘’లేక భామహ వ్రుత్తి ‘’అనే  చక్కని వ్యాఖ్య రాశాడు .కాని దురదృష్ట వశాత్తు ఇది లభించటం లేదు .దీన్ని ‘’ప్రతిహా రేందు రాజు ,అభినవ గుప్తుడు, రుయ్యకుడు మాత్రం పేర్కొనటం వలన మాత్రమె తెలుస్తోంది .భామహుడు మరోరచన చేశాడని అదే వర రుచి రాసిన ‘’ప్రాకృత ప్రకాశం ‘’కు రాసిన ‘’మనోరమ ‘’అనే వ్యాఖ్యానం . నారాయణ భట్టు భామహుడు ‘’ఛందో గ్రంధం ‘’కూడా రాశాడని ,అందులో అనేక చందోరీతులున్నాయని తెలిపాడు ,కనుక రాసిఉండచ్చు అని అనుకో వచ్చు .భామహుడు తరువాతి ఆలన్కారికులపై గొప్ప ప్రభావాన్ని చూపాడు ఆ ప్రభావం పొందిన వారిలో ఉద్భటుడు ,ఆనంద వర్ధనుడు ,అభినవ గుప్తుడు, ముమ్మటుడు మొదలైన వారున్నారు .

వైదర్భి ,గౌడీ రీతులను పోలుస్తూ వైదర్భిని ‘’అవక్రోక్తి ‘’అన్నాడు భామహుడు .స్వభావోక్తి లో వైచిత్రి ఉండడుకనుక దాన్ని వదిలేశాడు .’’యుక్తం లోక స్వభావేన రసిక శకలైః ప్రుధక్ కావ్యాలంకారా’’అన్నాడు భామహుడు .దీని అర్ధం మహా కావ్యం లోసందర్భాన్ని బట్టి అనేక రసాలు ఉండాలి .రసం కంటే  ఆలంకారాలకే ప్రాధాన్యత నిచ్చాడు .

నాగ నాద శాస్త్రి బటుక్ నాద  శర్మలు ఆంగ్లం లో ఈ కావ్యాలంకారాన్ని వెలువరించారు .తాతాచారి 1934లో తెచ్చిన పుస్తకం ఈరెందిడిటికన్న శ్రేష్టమైనది .

Inline image 1  Inline image 2

మరో కవిని కలుసుకొందాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చారిత్రక కోణంలో వైదిక వాఙ్మయం – ప్రొ.ముదిగొండ శివప్రసాద్ ,ఇంద్ర గంటి శ్రీకాంత శర్మ సాహిత్యం- సృజనపై ”సుధామ

అలుపెరుగని సాధన.. అద్భుత సృజన..

  • -సుధామ
  • 11/10/2014
TAGS:

సృజన
-శ్రీకాంతశర్మ సాహిత్యం
ఒకటవ సంపుటి
ప్రతులకు: ఇంద్రగంటి ఫ్యామిలీ
104, సాహితి రెసిడెన్సీ,
ప్రేమ్‌నగర్ కాలనీ, (జి.కె.కాలనీ)
సైనిక్‌పురి పోస్ట్, సికిందరాబాద్-94
వెల: రూ.2500
(రెండు సంపుటాలకూ కలిపి)

‘మనం ఎంచుకున్న మార్గాన్నిబట్టి
మన జీవనక్రమం నిర్ణయవౌతుంది’
(‘సుపర్ణ’ కావ్యంలో)
సప్తతి పూర్తి చేసుకున్న కవి పండితుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సమగ్ర సాహిత్యం ‘సృజన’ పేర రెండు సంపుటాలుగా వెలువడింది. కథలు, నవలలు, నాటకాలు ఎన్నో రాసినా, వౌలికంగా శ్రీకాంతశర్మకు కవిగా, పండితునిగానే పేరు. 1168 పేజీల ఈ ఒకటవ సంపుటిలో 398 పేజీలే ఆయన కవితా మూర్తిమత్వం. మిగతావన్నీ వచన రచనలే. అందులోనూ నాటకాలు, నాటికలే ప్రథమగణ్యం. ఆ తరువాతనే ఆయన నవలలూ, కథలూ. లలిత గీతాలు, యక్షగానాలూ కవిత్వ పార్శ్వాలే. ఒక సృజనకారుడి బహుముఖీనతకు ఈ ప్రక్రియా వైవిధ్యం నిలువుటద్దం. వ్యాసాలు, సమీక్షలు, మున్నుడులు, పరిచయాలు వంటి రచనలన్నీ వారి పాండితీ వైభవ సంకేతాలే కావడంతో శ్రీకాంతశర్మ అనగానే కవి పండితుడు అనీ, పండిత కవి అని భావించేవారే అధికం. ఆయన విమర్శనా రచనలు కూడా పాండిత్యంలో భాగాలే.
నిజానికి శ్రీకాంత శర్మ వృత్తిరీత్యా ప్రధానంగా ఎంచుకున్న మార్గాలు రెండు. ఒకటి పత్రికా మాధ్యమం, రెండవది శ్రవ్య మాధ్యమం అయిన ఆకాశవాణి. ఈ రెండింటి కారణంగానే ఆయన జీవనక్రమం నిరంతర సాహిత్య ప్రస్థానంగా సాగింది. రెండింటా అనివార్యంగా కలం పట్టక తప్పని అవసరం, స్వతహాగా వివిధ సాహిత్య ప్రక్రియా రచనలు చేయాలన్న అభిమతం, ఇన్నాళ్లుగా ఇనే్నళ్లుగా తన చేత రాయిస్తూ, సహస్రాధిక పుటల రెండు సంపుటాల రూపంలో ఇవాళ అభివ్యక్తమవుతోంది. వీటిల్లోకి రాని రచనలు ఇంకా మిగిలే ఉంటాయన్నది వాస్తవం. ఎందుకంటే తానే స్వయంగా ఓ ‘ఎడిటర్’. తొలుత ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీ ఉపసంపాదకునిగా, ఆపై ఆకాశవాణిలో రచయితగా, కార్యనిర్వహణాధికారి అయినా ఆకాశవాణి నుంచి పదవీ విరమణ చేసి తిరిగి ‘ఆంధ్రప్రభ’ వారపత్రిక సంపాదకునిగా, తన ఉద్యోగ భూమికను నిర్వర్తించినందువల్లనే- ఆయనకు తను రాస్తున్నది ఏమిటో, తాను చేస్తున్నది ఏమిటో క్షుణ్ణంగా తెలుసు. మనసు పెట్టి చేసిన రచనలే కానీ, మనసు చంపుకుని రాసినవి ఇందులో లేవు.
శ్రీకాంతశర్మ సుకుమార భావుకుడు, అనుభూతి ఆరాధకుడు. విశ్వసించిన దానిపట్ల ఎప్పుడూ విముఖత చెందని జగమొండి. గాలివాటుగా ఉద్యమాల వెంటబడి ఆ మూసలో కవి అనిపించుకున్నవాడు కాదు. సంప్రదాయాన్నీ, అభ్యుదయాన్నీ మేళవించి, మానవీయ అనుభూతులకు అక్షరాకృతుల నిచ్చినవాడు. చాలామంది రచయితల రచనలు పాఠకులకు మాత్రమే చేరుతాయి. పత్రికలు కేవలం అక్షరాస్యులకే! అయితే వాటిని చదివేవారిలో – ఒక పాఠక హృదయం మాత్రమే వుండదు. సామాజికుడయిన ప్రతి వ్యక్తిలో ఒక పాఠకుడూ, ఒక శ్రోతా, ఒక ప్రేక్షకుడు వున్నారు. ఒక రచయిత సృజన అంతా త్రిముఖంగా సామాజికులకు చేరి సంతృప్తినిచ్చి ఉపయుక్తం కాగలిగినప్పుడే, ఆ రచయిత ప్రతిభావంతునిగానూ, ఆ రచన ప్రయోజనదాయకంగానూ భాసించడం వీలవుతుంది. అదిగో ఆ ప్రజ్ఞామతి అయిన రచయిత శ్రీకాంతశర్మ.
శ్రీకాంత శర్మ రచనలు పాఠకులనూ, శ్రోతలనూ, ప్రేక్షకులనూ ఏకకాలంలో సామాజికునిలో వున్న ఆ మూడు పార్శ్వాలనూ తట్టగలిగేవిగా ఉం టాయి. అందుకే అంతటి కవి పండితుడూ సామాన్యమైన సా మాజికులనూ తన రచనలతో మెప్పించగలిగాడు.
పత్రికలకు కథలు, నవలలు, వ్యాసాలు, సమీక్షలు, కాలమ్స్ రాసిన వాడే – రేడియోకి పాటలు, నాటకాలు, నాటికలు, రూపకాలు ఎన్నో రాశాడు. ప్రసంగాలు చేశాడు. అలాగే రంగస్థలానికి కావలసిన నాటకాలు, నృత్య రూపకాలు రాశాడు. కొన్ని సినిమాలకు పాటలూ రాశాడు. అచ్చు అక్షరాల్లోనే కాక, ఇలా శ్రవ్య, దృశ్య మాధ్యమాల్లో అక్షరాలుగా వినబడ్డాడు. కనబడ్డాడు. కనుకనే ఆయన జీవన క్రమం వైవిధ్యభరితమైంది. మూస ధోరణులకు భిన్నంగా ఎప్పటికప్పుడు వికాసవంతమైంది.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం వైభవ ప్రాభవాలకు శ్రీకాంత శర్మ రచనా (ప్ర)వృత్తి ఎంతగానో దోహదపడింది. తనకు సంతృప్తినీ, సంస్థకు దీప్తినీ కలిగించింది. ఈ సంపుటంలో లలిత గీతాలు, యక్షగానాలు, నాటకాలు, ఇరుగుపొరుగు నాటికలు విభాగంలోని రచనలు – రేడియో రచనలను కలిగి వున్నాయి. 1982- 2003 వరకు ఆకాశవాణి వార్షిక జాతీయ పురస్కారాలలో ఏడు ప్రథమ బహుమతులు, మూడు ద్వితీయ బహుమతులు, అయిదు యోగ్యతా పత్రాలు సాధించిన ఘనత శ్రీకాంత శర్మ రచనలదే! అవన్నీ సృజనాత్మకం, సంగీత రూపకం, డాక్యుమెంటరీ, నాటకీకరణ విభాగాలవే. ఆ రచనలకు రూపకల్పన చేసింది సి.రామమోహనరావు, ఎస్.బి.శ్రీరామమూర్తి, కలగా కృష్ణమోహన్, పాండురంగారావు ప్రభృతులే కావచ్చుగాక, కానీ రికార్డు స్థాయిలో అన్ని బహుమతులకు శ్రీకాంతశర్మ రచనలే మూలకందం. ‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’ అనే బాలల గీతం నుండి, ఈ మాసపు పాటలు, సంగీత రూపకాలు ఎన్నో ఆకాశవాణి ద్వారా ప్రసారమైన శ్రీకాంత శర్మను రేడియోవాడిగా శ్రోతల హృదయాల్లో సుప్రతిష్ఠితం చేశాయి.
రెండేళ్ల క్రితం 2012లో వెలువడిన శ్రీకాంతశర్మ ‘ఏకాంత కోకిల’ ఒక రకంగా ఆయన జీవన రేఖలు కొన్నింటి కవితాత్మక ప్రదర్శనమే. అందులోని నివేదనములో తన ఆకాశవాణి సహోద్యోగి గూర్చి-
ప్రహరాజు పాండురంగడు
అహరహమును నాకు తోడనంగా, వృత్తిన్
సహచరుడై ఏ చరించెను
విహరించితి నతడి వెంట వివిధ విధములన్
అంటూ – తన నాటక నాటికాభిరుచులకు దోహదమైన మిత్రునిగా తలుచుకున్నారు. అలాగే ‘స్వస్ర్తి అభిశంస’ అంటూ – తను ప్రేమించి పెళ్లాడిన, సాహిత్య సంగీత సమలంకృత ‘జానకీబాల’ గురించి కూడా సరదాగా రాశారు. బహుశా గొప్ప గాయని కూడా అయిన జానకీబాల, కుమార్తె కిరణ్మయిలే ఆయన పాటల రచనా పాటవానికి పరోక్ష ప్రేరకులు కావచ్చు. ‘ఏకాంత కోకిల’లో శర్మగారి ‘ఆరాటాలు’ ‘ఆలోచనలు’ ‘కవి హృదయం’ అవిష్కృతమయ్యాయి. బహుమతులు బడసిన తమ సృజన రేడియో రచనల్లోని పాటలను కూడా ఇందులో చేర్చారు.
రూప, చైతన్య సంగమ రూఢి దెలుపు
సృజనశక్తికి శాస్తమ్మ్రు సిగ్ధతనువు
గంధలహరిని బోలెడు కళ మనస్సు
మనుపజేసెడి యనుభూతి మనిషిభూతి
అంటారు. అనుభూతి కవిగా శ్రీకాంత శర్మను కవితా లోకం ఏనాడో గుర్తించింది. తిలక్, ఇస్మాయిల్ వంటి వారిని అజంతాను ఎంతో ఇష్టపడతారు శర్మగారు. యక్షగాన రచనలో శర్మగారి కవితా ప్రావీణ్యం వల్లనే ఆయనను పండిత కవి అనేవారున్నారు. రేడియోలో సంగీత రూపకాలు, వేదికలపై శోభానాయుడు వంటి నర్తకీమణుల కోరికపై రచించి ఇచ్చిన నృత్య రూపకాలు శ్రోతలను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నవే. కొన్ని సినిమా పాటలు రాసినా సినీ కవిగా స్థిరపడ(దలచ)లేదు ఆయన.
శ్రీకాంత శర్మ నాటకాలు పధ్నాలుగు, నాటికలు పదిహేను ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. పాత్రోచిత సంభాషణలతో, ఔచితీమంతమైన సన్నివేశ కల్పనలతో, ఇతివృత్తానికి దృశ్య శ్రవణ స్పర్శనిచ్చే ప్రజ్ఞ కానవస్తుంది. ‘శిలామురళి’ ‘కెరటాల పల్లకి’ ‘స్మృతి’ ‘ఆషాఢమేఘం’ ‘తెరలు’ వంటి నాటకాలు, 1990-91 నడుమ విజయవాడ ఆకాశవాణి నుండి ‘ఇరుగు పొరుగు’ పేర నలభై వారాలపాటు ప్రసారమైన నాటికలు శ్రోతృజన హృదయ రంజకాలైనవే.
‘సమూహం నుంచి ఏకాంతానికి
ఏకాంతం నుంచి సమూహానికి
లోలకం మాదిరి ఊగులాడుతూ
ఎంత ఉద్విగ్నత!!’
అంటూ ‘సుపర్ణ’ అనే తన ఒక పక్షి ఆత్మకథా కావ్యంలో పేర్కొన్నట్లు – శ్రీకాంతశర్మ అనుభూతి కవిగా ఒక ఏకాంతం నుంచే జన మాధ్యమాలైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల సమూహానికి చేసిన రచనలెన్నో ఉన్నాయి. కథకునిగా కన్నా ఎక్కువగా ‘తూర్పున వాలిన సూర్యుడు’ ‘ఉపాసన’ ‘క్షణికం’ అనే మూడు నవలలతో ఒక నవలా రచయితగా కూడా నిలిచారు. క్షుద్ర సాహిత్యం రాసారన్న అపవాదు కొంత పొందినా, నిజానికి ఆ శాస్త్ర వైదుష్యమే తద్రచన కావించిందని గ్రహించినప్పుడు, ఆయన పాండితీగరిమను ప్రశంసించక ఉండలేం!
ఈ మొదటి సంపుటి ఆయనలోని అనుభూతి కవికీ, శ్రవ్య, దృశ్య రచనా ప్రతిభా పాటవాలకు నెలవైన రచయితకూ అద్దం పడుతోంది. మనిషి సామూహికంగానూ, పది మందిలో ఒంటరిగానూ కూడా జీవించవలసి రావడం బ్రతుకు యధార్థం. వ్యక్తి సమూహాలను శాసించగలుగుతాడనేది పాక్షిక సత్యమే కావచ్చు కానీ, వ్యక్తులవల్లే వ్యవస్థలకు దీప్తి! ఎన్ని అవస్థలు పడినా వ్యవస్థలోనే వ్యక్తి ఉనికి, మనికి! నిత్య చైతన్యశీలమైన పత్రికా ప్రసార రంగాల భిత్తికపై శ్రీకాంతశర్మగారి ‘సృజన’ పాఠకుల, శ్రోతల, ప్రేక్షకుల ప్రశంసాపాత్రమైంది. మనిషితనం ప్రయోజనాలను కాపాడింది. వెనుదిరిగి చూసుకుంటే.. ‘సంతోష స్వాంతం’ మించినదేముంది? ఈ ‘సృజన’లో శాశ్వతంగా నిలిచేదేదో, విస్మృతమయ్యేదేదో నిర్ణయించేది మాత్రం కాలమే! ఇంద్ర పదవికి నూరు యజ్ఞాలు చేయాలిట కనీసం! శ్రీకాంత శర్మ నిరంతర రచనా యజ్ఞం నిజమైన ‘ఇంద్ర’గంటి.

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

చారిత్రక కోణంలో వైదిక వాఙ్మయం

వ్యాస సుందరం
వెలమకన్ని సుందరరామశాస్ర్తీగారి
భాషా వ్యాస సంకలనం
వెల: అమూల్యం,
ప్రతులకు: వి.కన్యాకుమారి, 202
విశ్వలక్ష్మిటవర్స్,
రవీంద్రనగర్, 3వ లైను, గుంటూరు-6

వెలమకన్ని సుందరరామశాస్ర్తీ ప్రధానంగా చారిత్రక పరిశోధకులు. లోగడ విష్ణుకుండినుల వంటి రాజ్యాలపై ప్రామాణిక సిద్ధాంత గ్రంథాలు వెలువరించారు. వారి కుమార్తెలు తమ తండ్రి స్మృత్యర్థం ఇప్పుడు ఒక గ్రంథం తెచ్చారు. ఇందులో రెండు భాగాలున్నాయి. మొదటిది శతరుద్రీయ వ్యాఖ్యానం. రెండవది చారిత్రక వ్యాసములు. శతరుద్రీయము అంటే యజుర్వేదమునకు అనుబంధమైన తైత్తరీయ సంహితలోని నమక విభాగము. ఇది అభిషేక వియోగమునకు భక్తులు వాడుకోవటంవలన దేశములో ఈ అధ్యాయానికి విస్తృతమైన ప్రచారం ఉంది. శతరుద్రీయములో ప్రతిపాదించబడిన శివుడు రుద్రశబ్దంలో ప్రధానంగా పిలువబడ్డాడు. ఈ రుద్రుడు సూర్యమండల అంతర్వర్తియే. వేదమునకు ప్రాచ్యపాశ్చాత్యులు ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. సంప్రదాయ సాయణ భాష్యములవంటి వానితోబాటు ఆధునికమైన అరవింద, దయానందుల భాష్యాలు కూడా లభ్యమవుతున్నాయి. వెలమకన్ని సుందరరామశాస్ర్తీగారు సంద్రాయ భాష్యములను పరిగణనలోనికి తీసుకోకుండా లింటర్‌నెడ్జ్ మాక్సుముల్లర్ వంటి పాశ్చాత్యుల పరిశోధనలను అధ్యయనంచేసి రుద్రశబ్దాన్ని ఇందులో వివరించారు. అలాగే తర్వాతి విభాగంలో భాషాశాస్త్ర పాఠాలున్నాయి. ఆర్.ఎస్.శర్మ వంటి సెక్యులరిష్టులు చేసిన చారిత్రకాంశాలు కూడా వెలమకన్నివారి దృష్టికి వచ్చాయి. ఈ విషయం వాటి ఉపయుక్త గ్రంథ సూచినిబట్టి గ్రహించవచ్చు. వెలమకన్ని వారు ఈ గ్రంథంలో ఆర్య-ద్రవిడ సిద్ధాంతాన్ని ఆమోదించారు.
ప్రాచీన పురాణాలలోని యక్షులు దక్షిణ భారతీయ భాషలో బ్రాహ్మీలిపి నుండి పుట్టాయా? ‘‘స’’ ‘హ’గా ఎందుకు మారుతున్నది? ముండా-తలవర శబ్దాలు సమానార్థకాలా? ఇలా చాలా లోతైన పరిశోధనను వెలమకన్నివారు చేశారు. మారెమ్మా పూజ తెలుగునాట ఉండేదని మార్కాపురం మారన వంటి రూపాలు చూపించారు. (87వ పుట.) ఐతే ఈ ‘‘మార’’ శబ్దం సంస్కృతమేమో పరిశీలింపవలసి ఉంటుంది. పిత్రూణం తీర్చుకునే దిశలో వెలమకన్ని సుందరరామశాస్ర్తీగారి రచనలలో కొన్నింటిని వారి కుటుంబ సభ్యులు గ్రంథ రూపంలో తీసుకొని రావటం ముదావహం. వారి ఇతర అముద్రిత వ్యాసాల్ని కూడా వీలువెంట వెలువడుతాయని ఆశింపవచ్చు. ఇంత విలువైన పుస్తకం అమూల్యం అని ప్రకటించటం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.

మన పాఠ్యపుస్తకాలు ఇలా వుంటే ఎలా…?

గ్రూప్-4 పరీక్ష రాసిన నలుగురు ఇంజనీరింగు విద్యార్థులు రైల్లో ప్రయాణిస్తూ, పరీక్షలో అడిగిన ప్రశ్నల గూర్చి చర్చించుకుంటున్నారు. ‘గ్రీన్‌విచ్ మీన్’ అంటే ఏంటో నాకర్థం కాలేదని ఒక విద్యార్థి అంటే, అలాంటి సూత్రాన్ని ఎప్పుడు వినలేదని మిగతావారి సమాధానం! అదే రైల్లో ప్రయాణిస్తున్న ఈ వ్యాస రచయిత ‘అ క్షాంశ, రేఖాంశాల గూర్చి తెలుసా..?’ అని వా రిని ప్రశ్నించగా ఎప్పుడో చదువుకున్నట్లు జ్ఞాపకంగాని, వాటి గూర్చి తెలియదని మూ కుమ్మడి సమాధానం!
****
అది పదో తరగతి సాంఘిక శాస్త్రం. 16 మంది రచయితలు, ఇద్దరు సమన్వయకర్తలతో పాటు, 14 మంది సంపాదక వర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ 2014-15 విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి రాష్ట్ర విద్యార్థులకై తయారుచేసిన పుస్తకమిది. రచయితలల్లో విశ్వవిద్యాలయ స్థాయి నుంచి, సెకండరీ స్థాయి ఉపాధ్యాయులదాకా ఉన్నా రు. ఇక సంపాదక వర్గంలో మధ్యప్రదేశ్ ఏకలవ్య, బెంగుళూర్ అజీం ప్రేమ్‌జీ, న్యూఢిల్లీలోని ఎన్‌సిఇఆర్‌టి, ఉస్మానియా, హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వున్నారు. రాజీవ్ విద్యామిషన్, ఎస్‌సిఇఆర్‌టిలో విద్యా రంగంపై పట్టు, విశేష అనుభవం గలవారి నాయకత్వంలో తయారైన ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు తయారుచేసిన వారికి కాకు న్నా, బోధిస్తున్నవారికి కూడా దృష్టిలో పడకపోవడం శోచనీయం!
ఈ పుస్తకం బోధన ప్రారంభమై గత సెప్టెంబర్‌నాటికి నాలుగు నెలలు గడిచాయి. ఈ నాలుగు నెలల్లో రెండు నెలసరి పరీక్షలు, ఒక టర్మ్ (మొడు నెలలు) పరీక్ష జరిగింది. ఉపాధ్యాయులు ప్రశ్నలు సంధిస్తే విద్యార్థులు రాస్తున్నారు. పేపర్లు దిద్దారు, మార్కులు వేశారు. పిల్లల మార్కుల్ని చూసి సంతసించే తల్లిదండ్రులు, మార్కులు బాగా సంపాదించే విద్యార్థులుంటే సంబరపడే ఉపాధ్యాయ వర్గమున్న వ్యవస్థ మనది. పాఠ్యాంశాలు ఎలా వున్నాయనే ధ్యాస, తల్లిదండ్రులకు సరే, ఉపాధ్యాయులకు, అందునా అదే విషయ పరిజ్ఞానంతో బోధించే ఉపాధ్యాయులకు లేకుండాపోవడం కొంత ఆశ్చర్యమే!
సాధారణంగా పుస్తకాల్లో అచ్చుతప్పులు దొర్లడం సహజం. గతంలో తప్పొప్పుల పట్టిక ఒకటి పుస్తకం చివర వుండేది. దీనికిప్పుడు కాలం చెల్లింది. లేదా పుస్తకాలు వెళ్లిపోయాయని భావిస్తే ఓ సర్క్యులర్ ద్వారా తప్పుల్ని గుర్తించి, సరిచేసుకొని చదవాలనే సూచనలుండేవి. ఇవేమి లేవంటే, తయారుచేసిన పుస్తకాన్ని ఎవరూ రెండోమారు చూడలేదని అర్థం!
భాగం ఒకటిలో ఒకటో పాఠం. భారతదేశం:్భగోళిక స్వరూపాలు పేజీ (2) మొదటి వాక్యం- ‘్భరతదేశం చాలా విశాలమైన దేశం ఇది పూర్తిగా దక్షిణార్థ గోళంలో ఉంది. దేశం 8-50 డిగ్రీల ఉత్తర రేఖాంశంగల మధ్య 68-9డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్య ఉంది’. …పై పటం చూసి (ప్రపంచ) ఆర్కిటిక్ వృత్తంలో భారతదేశం వుందని ఊహించుకోండి.. మీ జీవితంలో ఏయే తేడాలుంటాయి..?
పైనగల రెండు వాక్యాలలో తప్పొప్పుల గూర్చి పక్కన పెడదాం. పరస్పర విరుద్ధ వాఖ్యానాలు దేన్ని స్ఫురిస్తున్నాయి. దక్షిణార్థగోళంలో భారతదేశం వున్నపుడు, ఎట్టి పరిస్థితుల్లో ఆర్కిటిక్ వృత్తంలో భారతదేశం వుండడానికి వీలులేదు. కాబట్టి ఎలాంటి ఊహలకు తావుండదు. లేదా మొదటి వాక్యమే సరియైనదైతే, అంటార్కిటికా వృత్తంలో ఉన్నట్లుగా భారతదేశాన్ని ఊహించుకోవాలి. పేజీ నెంబర్ మూడు: పటం (2)ను చూస్తే భారతదేశం ఏయే అక్షాంశాల మధ్యన, ఏయే రేఖాంశాలమధ్యన వుందో కనీస పరిజ్ఞానం వున్నవారు గుర్తించగలరు. పటంలో ప్రస్తావించిన వాస్తవ స్థితికి చూపిన కోణాలకు, రెండవ పేజీలోని వాక్యాలకు పరస్పర విరుద్ధం కనపడుతుంది. భారతదేశం 8.4’-37.6’ డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్యన, 68.7’-97.25’ డిగ్రీల తూర్పు రేఖాంశాలమధ్యన వున్నట్లు స్పష్టంగా వుంది. ఇదే పుస్తకంలోని పేజీ నెం.(49)లో ‘ఉత్తరార్థ భూగోళంలోని వ్యాపార పవనాల మేఖలలో భారతదేశం ఉంది..’ అనే వాక్యం కూడా సరిగానే వున్నది. తిరిగి పేజీ నెం.(47)లో మొదటి పేరాలో కూడా.. ‘్భమధ్య రేఖకి దూరంగా ఉన్న రేఖాంశాల కంటే దగ్గరగా ఉన్న రేఖాంశాల వద్ద ఈ తీవ్రత (ఉష్ణోగ్రత) ఎక్కువగా ఉంటుంది…’. భూమధ్య రేఖకు దూరంగా, దగ్గరగా వుండేది అక్షాంశాలుగాని రేఖాంశాలు కావు. ఇదే పేజీలోని రెండవ పేరాలో.. ‘్భరతదేశం సుమారుగా 8-37 డిగ్రీల రేఖాంశాల మధ్య వుంది. రెండో పేజీలో ప్రస్తావించిన 8-50 డిగ్రీల ఉ. రేఖాంశాలమధ్య.. దానికి కూడా ఇది భిన్నంగా వుంది. ఇదీ 8.4’-37.6’ డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్యనే అనే వుండాలి.
అయిదవ పాఠ్యాంశంలోని (59)వ పేజీలో ప్రస్తావించిన సింధూ నది వ్యవస్థ, గంగానదీ వ్యవస్థల గూర్చి అసంపూర్తి సమాచారం, తప్పుడు భావనల్ని కల్గించేలా వున్నాయి. సాధారణంగా ఒక నది మరో నదిలో కలిస్తే, కలిసిన నది ఉపనది అవుతుంది. సింధూ నది టిబెల్‌లోని మానస సరోవరం చుట్టూగల కైలాస పర్వత శ్రేణుల్లో పుట్టి, లడక్ ద్వారా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా పాకిస్తాన్‌లో ప్రవేశిస్తుంది. పుస్తకంలో ప్రస్తావించినట్లు పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలతో ఈ నదికి సంబంధం లేదు. కాని దీని పరీవాహక ప్రాంతంలోని అనేక ఉపనదులు ఈ రాష్ట్రాల్లో పుట్టి ప్రవహిస్తాయి. కాశ్మీర్‌లో ప్రవహించే జీలం, చీనాబ్, తావి, పంజాబ్‌లో ప్రవహించే రావి, బియాస్ సట్లెజ్‌లు ఒకదాంట్లో ఒకటి ఉపనదిగా కలుస్తూ సట్లెజ్ నదిగా పాకిస్తాన్‌లో సింధూ నదితో కలుస్తుంది. చీనాబ్ (ఉధంపూర్ గుండా ప్రవహించే) నదిలో జమ్మూ పట్టణం ద్వారా ప్రవహించే తావి, శ్రీనగర్ పట్టణం ద్వారా ప్రవహించే జీలంలు, పంజాబ్ పఠాన్‌కోట ద్వారా ప్రవహించే రావినదులు కలిసిన తర్వాత బియాస్ నదిని కలుపుకొని సట్లెజ్ చీనాబ్‌తో సంగమం చెందుతుంది (అయినా అట్లాస్‌ను చూడాలి). గంగానదీ వ్యవస్థ గూర్చి ప్రస్తావిస్తూ, ఇదిరెండు నదుల కలయిక అని రాసారు. నిజానికి దేవప్రయాగ దగ్గర అలకనందతో కలిసి గంగానదిగా ఏర్పడే భాగీరథిలో ‘బిలంగ్‌నా’ అనే ఓ ప్రధాన నది, రుద్ర ప్రయోగ దగ్గర కేదార్‌నాధ్‌పైన గల గాంధీ సరస్సు (చార్‌బరీ), వాసుకీతల్‌ల నుంచి పుట్టిన మందాకిని నది అలకనందతో కలిసి అలకనందగా మారుతుంది. ఈ విధంగా ప్రధాన మూడు నదుల కలయిక గంగానది అయితే, అలహాబాద్ దగ్గర యమునా నదితో కలిసి మరింతగా విశాలమైన గంగానదిగా మారుతుంది. యమునానది ప్రస్తావన లేకుండా గంగానదిని ప్రస్తావించలేం. ఇక బ్రహ్మపుత్ర నది ప్రారంభంలో అనేక పేర్లతో వుండి, బంగ్లాదేశ్ గుండా బంగాళాఖాతంలో కలిసేముందు అనేక పాయలుగా డెల్టాలను ఏర్పర్చుతూ కలుస్తుంది. ఈ పాయలలో పద్మ, జమున, మధుమతి, మేఘనలు ముఖ్యమైనవి. పేజీ నెం.(60)లోని పటంలో ఈ విషయాలు స్పష్టంగా వున్నాయి. ప్రస్తావన కూడా వుండాల్సింది. ఇన్ని అంశాలు అవసరమా అనే భావన కొందరికి రావచ్చు! పాఠశాల విద్యాదశలో పదవ తరగతి చివరి దశ. ఈ దశ తర్వాత విద్యార్థి చదువంతా ఐచ్ఛికంగా వుంటుంది. కాబట్టి, పుస్తకంలో ముందే ప్రస్తావించిన విద్యా ప్రమాణాల్లోని సామర్థ్యాలను పొందాలంటే, భూగోళ శాస్త్రం వాస్తవికంగానే వుండాలి. చారిత్రక అంశాలు అన్వయంలో వ్యత్యాసాలు వుండవచ్చు! పాలకుల భావజాలాన్ని బట్టి ప్రపంచ చరిత్రను, యుద్ధాల్ని, విప్లవాల్ని చూడడం జరుగుతుంది. కాని భౌగోళిక విషయాలు ఎలాంటి మార్పునకు గురికాలేవు.
గతంలో పాఠ్యపుస్తకాల రూపకల్పన కేంద్రీకృతంగా, ఒకరిద్దరు రచయితలచే, అదీ తరగతి గది బోధనతో సంబంధంలేని వ్యక్తులచే లిఖించబడేవి. ఈ పుస్తకాల తయారీపై అనేక విమర్శలు వచ్చేవి. కాని పరిస్థితుల్లో మార్పు రావడం, నిధుల కొరతను అధిగమించడం, రాజీవ్ విద్యామిషన్ (ఎస్‌ఎస్‌ఎ) చొరవతో మారుమూల ప్రాంతాలలో నిష్ణాతులని గుర్తించబడిన తరగతి గది బోధకులచే ఎంపిక చేసి, చర్చలు జరిపి, వర్కుషాపుల్ని నిర్వహించి, ముందు ప్రణాళికను, తర్వాత అంశాలను, అంశాలవారిగా పట్టు వున్న ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసి, వీరికి దేశవ్యాపితంగా గల నిపుణులచే సూచనల్ని, సలహాల్ని ఇప్పించి, వారు కూడా ఈ వర్కు షాపుల్లో పాల్గొనేలా చేసి తయారుచేసిన పుస్తకాలు ఇలా తప్పుడు భావనలతో వుంటే విద్యార్థులు అవే తప్పుడు భావనల్ని అవగాహన చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే.
పొరపాట్లు జరగడం సహజమే అయినా- వాటిని కనీసంగా గుర్తించకపోవడం అతి ధీమానే అవుతుంది. ఎవరి చాప్టరును వారే రాసుకొని, చేతులు దులుపుకోవడం జరగడం, సంపాదక వర్గం కనీసంగా అన్ని అధ్యాయాల్ని క్షుణ్ణంగా చూడకపోవడం ఒక లోపమైతే, నాలుగు నెలలుగా ఈ పుస్తకాన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో క్రమశిక్షణతో బోధిస్తున్న విషయ నిపుణులైన ఉపాధ్యాయులు గుర్తించకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం. అంటే పాఠ్యాంశాల్లో పేజి పేజిని బోధించడం, వాటి కనుగుణంగానే ప్రశ్నలు సంధించడం, జవాబుల్ని కూడా సరిగా చూడకుండా మార్కులు వేయడం జరిగిపోతూనే వున్నది. అందుకే, సాంఘిక శాస్త్రంలో అతి తక్కువ మంది ఫెయల్ అవుతూ వుంటారు.
ఈ విషయాల్ని గుర్తించడానికై పెద్దగా విషయ పరిజ్ఞానం అవసరంలేదు. అట్లాసును చూసినా, గ్లోబును పరిశీలించినా అన్ని విషయాలు అవగతం అవుతాయి. కాని మన పాఠశాలల్లో అట్లాసులు వున్నాయా అనేది ఒక ప్రశ్న అయితే, వున్నా అవి బీరువాలోనుంచి బయటకు రావడం చాలా కష్టం. ఇక గ్లోబు సంగతి సరేసరి! ఎప్పుడో కొన్న గ్లోబు ప్రధానోపాధ్యాయుని బల్లపై, లేదా పక్కనేగల బీరువాపై భద్రంగా వుంటుంది. అదెన్నడు తరగతి గదిలోకి ప్రవేశించదు. పటాలు చుట్టచుట్టన్నా వుంటాయి, లేదా స్ట్ఫారూంలో వేళాడుతూ చిరిగిపోతూ వుంటాయి. ఓ తరగతి గదిలోకో, వరండాలోకో వచ్చి వేళ్ళాడితే, అక్కడో పాయింటర్ వుంటే ఏ ఉపాధ్యాయుడికి సహాయం లేకుండా విద్యార్థులే పట నైపుణ్యాల్ని పెంపొందించుకుంటారు. విషయ అవగాహన పెరుగుతుంది. ఉపాధ్యాయుడు పుస్తకంలోని విషయాన్ని ఎత్తి చదివి, బోధన చేస్తున్నానని భ్రమపడితే పరిస్థితి పైన ఉదహరించిన ఇంజనీరు విద్యార్థుల్లాగానే వుంటుం ది. పాఠ్యాంశాల లొసుగులు ఒక్క సాంఘిక శాస్త్రంకే పరిమితం కాలేదు. ఆరో తరగతి సామాన్య శాస్త్రంలోని ‘మన ఆహారం’ అనే మొదటి పాఠం మొదటి పేజీలో పొందుపర్చిన తొమ్మిది రకాల ఆహార పదార్థాలను చూస్తే, మన పాఠ్యాంశాలు ఏ వర్గ ప్రయోజనాల్ని కాంక్షిస్తున్నాయో తెలుస్తుంది. శ్రమజీవులు, హరిజన, గిరిజనులే కాదు, రాయలసీమ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంత ప్రజలు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజల ఆహార పదార్థాలు కనీసంగా చూపకపోవడం పుస్తక రచయితల అవగాహనా రాహిత్యమే! ఇప్పటికైనా కొత్త రాష్ట్రాలకు, వాస్తవ చింతనతో పుస్తకాల తయారీకి పూనుకుంటే విద్యార్థులకు మేలుచేసినవారమవుతాం!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ ప్రక్రుతి వికృతి గా ఎందుకు మారింది?

ప్రకృతి…. వికృతి

ధవళకాంతులతో శోభిల్లే హిమాలయ పర్వత శిఖరాలు…అందమైన తులిప్ తోటలు…నోరూరించే యాపిల్ పళ్లు…దాల్ సరస్సుపై తేలియాడుతూ వెళ్లే కుటీరాల్లాంటి పడవల పరుగులతో కళకళలాడే కాశ్మీర్ అందాలు ఒక్కసారిగా ఎందుకు కకావికలమయ్యాయి? ఎండాకాలం ఉండగానే ఒక్కుదుటున కుండపోత వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి? రుతుపవనాల గమనంలో అనూహ్య మార్పులు ఎందుకొస్తున్నాయి? సాగరాలు చెలియలకట్టలు దాటి ఎందుకు తెగబడుతున్నాయి? ఊళ్లకు ఊళ్లను ఎందుకు ఊడ్చేస్తున్నాయి? శీతాకాలంలోనూ ఉక్కపోత ఎందుకు ఎక్కువవుతోంది? భూతాపం ఎందుకు పెరిగిపోతోంది…అంటే జవాబు తెలియనివారు ఎవ్వరూ లేరు. అనుభవాలనుంచి పాఠాలు నేర్వని మనిషి పదేపదే కష్టాలపాలవుతున్నాడు. అభివృద్ధి పేరిట మానవుడు చేపట్టిన విధ్వంసకర చర్యలు ప్రకృతి ప్రకోపానికి కారణమవుతున్నాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణంలో పెనుమార్పులు సంభవించి ప్రకృతి విపత్తులకు దారితీస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో గతేడాది వరదలు సృష్టించిన బీభత్సం, కొనే్నళ్లక్రితం సంభవించిన గుజరాత్, లాతూర్ భూకంపాలు, సునామీ, ఇక దేశంలో చాలాప్రాంతాల్లో సంభవిస్తున్న వరదలు, కరవు, కొండచరియలు విరిగిపడిన సంఘటనలు ప్రకృతి వైపరీత్యాల ఆనవాళ్లే. ఈ విపత్తుల బెడద ఒక్క మనదేశంలోనే కాదు…యావత్ ప్రపంచంలోనూ ఉంది. పెనుతుపానులు, భూకంపాలు, కార్చిచ్చులు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు… ఇలా విపత్తులు తలెత్తున్నాయి. వీటిలో ఒకటీఅరా సహజంగా ముంచుకొస్తున్నప్పటికీ మొత్తమీద మానవుడి నిర్లక్ష్యం, అత్యాశ పెనువిపత్తులకు కారణమని తేలిపోయింది. విపత్తులను నివారించడం, ఎదుర్కోవడం, కనీసం వాటివల్ల వచ్చే నష్టాన్ని తగ్గించగలగడంపై ఇప్పుడు దృష్టిపెట్టాలి. విపత్తుల కారణాలు తెలుసుకోవడం, ఏయే ప్రాంతాల్లో అవి విరుచుకుపడే అవకాశం ఉందో గుర్తించడం, ఎదుర్కోవడమెలాగో తెలుసుకోవడం, విపత్తుల నియంత్రణ, కనిష్టనష్టాలు ఉండేలా జాగ్రత్తపడటం ప్రస్తుతం మానవాళి కర్తవ్యం. ఇందుకు పెద్దఎత్తున ప్రజల్లో అవగాహన, చైతన్యం అవసరం. అందుకే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో విపత్తుల ప్రమాదాన్ని వీలైనంతవరకు తగ్గించే దిశగా అడుగులుపడుతున్నాయి. ఏటా అక్టోబర్ 13న ప్రకృతి విపత్తుల నియంత్రణ దినోత్సవంగా కార్యక్రమాలు చేపడుతోంది. మనుగడకే ముప్పు మార్స్‌పై మానవ మనుగడ సాధ్యమా? కాదా? అన్న అంశంపై శాస్తవ్రేత్తల పరిశోధనల ప్రయాణం మంగళకరంగానే సాగుతోంది. ఎటొచ్చీ భూమిపైనే జీవరాశి మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. అభివృద్ధి, అత్యాశలతో మానవుడు ప్రకృతిని ధ్వంసం చేస్తూ చేపడుతున్న కార్యక్రమాలు, పారిశ్రామికీకరణ, అభివృద్ధి పనుల పేరిట యధేచ్ఛగా చేపడుతున్న చర్యలు ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నాయి. సెలయేళ్ళు, నదుల గమనమార్గాన్ని అడ్డుకుంటూ, లేదా నీటిప్రవాహ మార్గాన్ని మారుస్తూ విచ్చలవిడిగా చేపడుతున్న నిర్మాణాలు పెనుముప్పునకు కారణమవుతున్నాయి. వర్షాలు కురిసినప్పుడు వరదనీరు వెళ్లేమార్గం లేక ఊళ్లలోకి, నగరాల్లోకి ఆ వరద ముంచేస్తోంది. తాజాగా కాశ్మీర్‌లో జరిగింది అదే. చెట్ల నరికివేత వల్ల నీటిప్రవాహాన్ని నెమ్మదింపచేయగలిగే వ్యవస్థ ధ్వంసమైపోయినట్లవుతోంది. భూమిలోపలికి చొచ్చుకువెళ్లే వాటి వేళ్లు, మొదళ్లు నీటిప్రవాహవేగాన్ని నియంత్రించి భూసారాన్ని కాపాడతాయి. ఇప్పుడు చెట్లే లేకపోవడంతో ఆకస్మిక వరదలు ఊహించని వేగంతో వచ్చి ముంచేస్తున్నాయి. మరోవైపు పరిశ్రమలు, వాహనాలు, ఫ్రిజ్, ఏసీ మిషన్లువంటి ఆధునిక యంత్రాలవల్ల ఉత్పత్తి అవుతున్న కర్బన ఉద్గారాలు పెరిగి వాతావరణం కలుషితమవుతోంది. ఫలితంగా జీవవైవిధ్యం దెబ్బతింటోంది. భూమిమీద ఉన్న జీవజాతుల్లో ఎన్నో అంతరించిపోతున్నాయి. ఇది ఆహారోత్పత్తి, మానవ మనుగడకు ముప్పు తెస్తోంది. పెరుగుతున్న జనాభాపై ఇది పెనుప్రభావం చూపబోతోంది. 1970నుంచి 2010లోగా జీవరాశిలో, ముఖ్యంగా సరీసృపాలు, క్షీరదాలు, పక్షులు, జంతువులలో 52శాతం మేర అంతర్థానమయ్యాయి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. వరల్డ్ లైఫ్ ఫండ్ అనే సంస్థ చేసిన అధ్యయనం చెప్పిన వాస్తవం ఇది. ఇదంతా మానవ తప్పిదాల ఫలితమే. భూమిపై జీవ వైవిధ్యం దెబ్బతింటే మనిషి మనుగడ ప్రశ్నార్థకమే. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తోంది? 80వ దశకంలో ప్రకృతి విపత్తుల జోరు పెరిగింది. అన్నింటికీ మానవాళే కారణం. నష్టపోయేదీ వారే. ప్రమాదాన్ని పసిగట్టిన ఐక్యరాజ్యసమితి విపత్తుల ప్రమాదాన్ని తగ్గించి, నష్టాన్ని కనిష్టం చేసే దిశగా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి నడుంకట్టింది. 1989లో ఈమేరకు సర్వసభ్య సమావేశంలో ఓ తీర్మానం చేసింది. అక్టోబర్ 13ను విపత్తుల నియంత్రణ దినంగా ప్రకటించింది. ఈ దిశగా చర్యలు చేపట్టేందుకు ది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (యుఎన్‌ఐఎస్‌డిఆర్) సంస్థను తనకు అనుబంధంగా నెలకొల్పింది. ప్రపంచంలోని 168 దేశాలు దీనిద్వారా చర్యలు చేపట్టాయి. 2015నాటికి విపత్తుల నివారణకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించేందుకు 2010నుంచి అడుగులు వేయడం ప్రారంభించింది. పిల్లలు, యువకులు, వయోజనులు, వికలాంగులు, ఇలా పధ్నాలుగేళ్లుగా, ఏడాదికో వర్గంనుంచి అభిప్రాయాలు సేకరించింది. వారు ఎదుర్కొన్న విపత్తులు, నష్టాలు, కష్టాలు, నివారణోపాయాలపై వారినుంచి సమాచారాన్ని సేకరించింది. 2014లో వయోవృద్ధుల సంవత్సరంగా ప్రకటించి వారి అభిప్రాయాల్ని సేకరించింది. వీటన్నింటి నుంచి సారాన్ని క్రోడీకరిస్తోంది. విపత్తులను తగ్గించగలగడం, ఎదుర్కోవడం, నష్టాన్ని నియంత్రించడంపై ఈ సంస్థ ప్రజలను చైతన్యం చేస్తోంది. 2015లో జపాన్‌లోని సిండాయ్‌లో జరిగే ప్రపంచస్థాయి సదస్సులో ఈ అంశాలపై చర్చిస్తుంది. విపత్తుల నివారణ ఎలా? మనదేశంలో సునామీ సృష్టించిన బీభత్సం తరువాత ప్రపంచ సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ప్రకృతి విపత్తుల నివారణ, నియంత్రణ లక్ష్యంగా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవిర్భవించింది. విపత్తుల సమయంలో స్పందించి చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంకా ఆ సంస్థ చురుకుగా స్పందించాల్సిన అవసరం ఉంది. విపత్తులు ఏర్పడే ప్రాంతాల గుర్తింపు, వివిధ ప్రాంతాల్లో సాధారణంగా ఎదురయ్యే సవాళ్లు, అక్కడికక్కడ ఎదుర్కొనే యంత్రాంగం ఇంకా ఏర్పడలేదు. దేశరాజధానినుంచే ఆ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవల ఏపీలోను, ఆ మధ్య ఉత్తరాఖండ్, ఒడిశా, తాజాగా కాశ్మీర్‌లో సంభవించిన తుపానులు, వరదల వేళ ఢిల్లీనుండి బృందాలువెళ్లి సహాయం చేశాయి. అదే ఆయా రాష్ట్రాల్లోనే ఉంటే సకాలంలో స్పందించి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేది. శాస్త్ర,సాంకేతిక విజానాన్ని బాసటగా చేసుకుని సవాళ్లను ఎదుర్కోవాలి. ఉపగ్రహాలు అందించే సమాచారాన్ని, వాతావరణ శాఖ చేసే హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలి. ముందుజాగ్రత్త చర్యలతో చాలావరకు నష్టాన్ని నియంత్రించవచ్చు. ఒడిశాలో ఆమధ్య వచ్చిన ఫైలిన్ తుపాను సమయంలో ఆ జాగ్రత్తే ప్రాణ, ఆస్తినష్టాల్ని నియంత్రించింది. విపత్తుల ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో వాతావరణ హెచ్చరికల కేంద్రాలు, డాప్లర్ రాడార్ కేంద్రాల ఏర్పాటు, జాతీయ విపత్తు ప్రాంతీయ కేంద్రాల నిర్వహణ అవసరం. తీరప్రాంతాలకు దూరంగా జనావాసాలు ఉండటం, నదీగమన ప్రాంతాల్లో నిర్మాణాలను అడ్డుకోవడం, నదులు, సెలయేళ్ళలో ఇసుక తవ్వకుండా చూడటం కనీస జాగ్రత్తలు. పర్వతసానువుల్లో నిర్మాణాలు నిరోధించడం, కొండలపైన, దిగువ చెట్లను నరికివేయకుండా చూడటం, పర్వత సానువులను చదను చేయకుండా ఉండటం అతిముఖ్యం. ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలస్థాయి, ప్రభావం బాగా తగ్గిపోతాయి. ఉత్తరాఖండ్‌లో ఏం జరిగింది? హిమాలయ పర్వత సానువుల్లోని ఈ రాష్ట్రం పర్యాటక రంగం విస్తృతికోసం ఇచ్చిన అనుమతులు, జలవిద్యుత్‌కేంద్రాలకోసం చేపట్టిన చర్యలు కేదార్‌నాథ్ విలయానికి కారణమయ్యాయి. మందాకిని, అలకనంద వంటి నదుల మార్గాల్లో విధ్వంసక చర్యలు చేపట్టడం, వేలాది ఎకరాల్లో అడవులు నరికి జలవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో వాతావరణం దెబ్బతిని హఠాత్తుగా వర్షాలు, వరదలు ముంచెత్తాయి. 37వేల ఎకరాల్లో చెట్లను నరికి, 3200 ఎకరాల్లో ఇసుకను తవ్వేసి 51 జలవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు ప్రకృతి ఇలా స్పందించిందన్నమాట. నిజానికి ఈ రాష్ట్రంలో మరో 47 జలవిద్యుత్ కేంద్రాలు నిర్మాణంలో ఉండగా 234 ప్రాజెక్టులకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. విపత్తుల ప్రమాదం ఎక్కువగా ఉన్న హిమాలయ పరీవాహక రాష్ట్రాలైన కాశ్మీర్, ఉత్తరాఖండ్‌సహా పలు ప్రాంతాల్లో రాడార్లు, వాతావరణ హెచ్చరిక కేంద్రాలు, విపత్తు నిర్వహణ కేంద్రాలు లేవంటే అక్కడి పాలకులకు, నేతలకు ఎంత శ్రద్ధో అర్ధమవుతుంది. ఆ మధ్య మహారాష్టల్రోని పూనేలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇక్కడ పర్వతాల దిగువ ప్రాంతాన్ని చదును చేసి 28వేల చెట్లను నరికేశారు. అక్కడభూమి గుల్లబారిపోవడం, భారీవర్షాలు కురియడంతో మట్టిపెళ్లలు జారిపోయి ఇళ్లపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. దేశం మొత్తంమీద 75 శాతం ప్రాంతాలు విపత్తులకు అవకాశం ఉన్నవే. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే అంశం ఇది. ఇక ప్రభుత్వాలూ అది తెలుసుకుని అడుగులు వేయాల్సిందే. మన దేశంలో మహా విపత్తులు ఇవీ… 1770-బెంగాల్ కరవు-బెంగాల్, ఒడిశా, బీహార్‌లో కరవుతో 10లక్షలమంది దుర్మరణం. 1769-73 మధ్య కరవు విలయతాండవం చేసింది. ప్రపంచ మహావిపత్తులో ఇది ఒకటి. 1839-ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలోని కోరింగ ప్రాంతంలో సంభవించిన పెనుతుపాను. 20వేల మంది మృత్యువాతపడ్డారు. ముప్ఫైరెండేళ్లక్రితం సంభవించిన దివిసీమ ఉప్పెనా అలాంటిదే. 1894-ప్లేగ్ విజృంభణతో 12 లక్షలమంది మృతి. మనదేశం, చైనాల్లోనే ఇది సంభవించింది. దాదాపు రెండేళ్లు పీడించిన అంటువ్యాధి ఇది. కోల్‌కతా, ముంబై పోర్టులలో ప్రారంభమై దేశంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించి లక్షలాదిమంది ప్రాణాలు తీసింది. 1979-లాహాల్ అవలాంచ. హిమానీనదం కరిగి లాహాల్ లోయలో మీదపడటంతో 200మంది సజీవసమాధి అయ్యారు. మృతులపై 200 అడుగుల మేరకు మంచు పేరుకుపోయింది. 1993-లాతూర్ భూకంపం-మహారాష్టల్రోని లాతూర్‌లో తీవ్ర భూకంపం ధాటికి 10 వేలమంది మరణించారు. మరో 40వేల మంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. 1999-సూపర్‌సైక్లోన్ 05బిగా చెప్పుకున్న ఈ తుపాను తాకిడికి 15వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తినష్టానికి లెక్కేలేదు. 2001-గుజరాత్ భూకంపం-ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవంనాడు జరిగిన భూకంపం ధాటికి 20వేలమంది మరణించారు. కచ్ జిల్లాలో ఇది పెనువిధ్వంసం సృష్టించింది. 2002-వడగాడ్పులు-దేశంలో వడగాల్పులకు వేయిమంది మరణించారు. ఏపీలో ఈ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. 2004-సునామీ-హిందుమహాసముద్రంలోఇండోనేసియాలో వచ్చిన సునామీ 14 దేశాల్లో తీరప్రాంతాలపై ప్రభావం చూపింది. మనదేశంలోని అండమాన్ నికోబార్ సహా హిందూమహాసముద్రతీర ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. సునామీ తాకిడి ఉన్న అన్ని ప్రాంతాల్లో కలపి 2లక్షల 30వేలమంది మరణించారు. 2007-బీహార్ వరదలు-గడచిన 30 ఏళ్లలో ఎన్నడూలేనివిధంగా వచ్చిన వరదలు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. వందలమంది మరణించారు. ఆస్తినష్టం లెక్కలేదు. 2005-ముంబై వరదలు. వాతావరణంలో వచ్చిన మార్పులతో భారీవర్షాలతో వరదలు. 5వేలమంది మృతి. 2010-తూర్పుభారతదేశంలో తుపానుతో పెనునష్టం. వందమంది మరణించగా 92వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2013-మహారాష్టల్రో కరవు. లక్షలాదిమంది ఆకలికేకలు. గత 40 ఏళ్లలో ఎన్నడూలేని నీటిఎద్దడి. దాదాపు రెండేళ్లపాటు జల్నా, జలగావ్, ధూలే జిల్లాలు విలవిల. ఉత్తరాఖండ్-్ఫ్లష్‌ఫ్లడ్-ఆకస్మిక వరదలతో వెయ్యిమంది మృతి, 5వేలమంది గల్లంతు. వేలాది ఇళ్లు, ఊళ్ళకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం. 2014-కాశ్మీర్ వరదలు-శ్రీనగర్‌సహా పలు గ్రామాలు జలదిగ్బంధం. 250పైగానే మరణాలు. నాలుగువారాలపైగానే అనేక గ్రామాలు నీటిలోనే ఉండిపోయాయి. జాతీయవిపత్తుగా కేంద్రం ప్రకటన. * ఇలా చేయాలి… ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం, నష్టాన్ని తగ్గించుకోవడం లక్ష్యంగా దేశాలు అడుగులేయాలి. భూకంపాలు, వరదతాకిడి సమయాల్లో వాటిని తట్టుకునేలా భవన నిర్మాణాలు సాగాలి. కొత్త టెక్నాలజీని వినియోగించాలి. పర్యావరణ అనుకూల విధానాలు పాటించాలి. కర్బన వాయువుల విడుదలకు కారణమవుతున్న వ్యవస్థలకు కళ్ళెం వేయాలి. మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఆహారోత్పత్తులు పెంచాలి. ఆరోగ్యకర వాతావరణాన్ని పెంపొందించాలి. ఏయే ప్రాంతాల్లో విపత్తులు ముంచుకొస్తాయో శాటిలైట్, వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలి. ఉపద్రవం స్థాయిని అంచనా వేయాలి. ముందస్తు సమాచారంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలి. ఇదీ విపత్తుల విశ్వరూపం విపత్తులు ఒక్క మనదేశానికే పరిమితం కాదు. విశ్వమానవాళి సమస్య ఇది. ప్రకృతి విపత్తులు రెండు విధాలుగా నష్టాన్ని కలిగిస్తాయి. ఒకటి ప్రాణ, ఆస్తినష్టాలు. మరోటి జీవరాశిని దెబ్బతీయడం. విపత్తునుండి కోలుకోవడానికి ఏళ్లతరబడి సమయం, లెక్కలేనంత ధనవ్యయం తప్పదు. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం 1980నుంచి 2011 మధ్య ప్రపంచంలో మొత్తంమీద 3455 ప్రాంతాల్లో భారీ వరదలు ముంచెత్తాయి. 2689 తుపానులు అల్లకల్లోలం సృష్టించాయి. 470 ప్రాంతాల్లో కరవు విలయతాండవం చేస్తే..395 ప్రాంతాల్లో ఉషోగ్రతలు బాగా పెరిగిపోయాయి. 2000-12 సంవత్సరాల మధ్య జరిగిన విపత్తుల వల్ల 1.7 ట్రిలియన్ డాలర్ల ఆస్తినష్టం సంభవించింది. 2.9 బిలియన్లమంది ప్రజలపై పెనుప్రభావం చూపాయి. 12 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అధికారికంగా లభ్యమైన సమాచారం. ఇక అనధికారిక నిజాలు దేవుడెరుగు. కాశ్మీర్ గుణపాఠం హిమాలయ పర్వత ప్రాంతాల్లోని రాష్ట్రాలకు ప్రకృతి విపత్తుల బెడద ఎక్కువ. మానవతప్పిదాల దానికి తోడవడంతో పెనునష్టాలు సంభవించాయి. జీలం, చీనాబ్, రావి నదుల ప్రవాహ గమన మార్గాలను అడ్డుకుని విశృంఖలంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం రిసార్టులు నిర్మించారు. ఫలితంగా నదీజలాల గమనంలోను, వేగంలోనూ తీవ్రపరిణామాలు సంభవించాయి. వరదలు వచ్చినపుడు నీరు వెళ్లే మార్గాలు లేక అవి నగరాల్లోకి, గ్రామాల్లోకి వచ్చాయి. గత శతాబ్దంలో ఎన్నడూలేని విధ్వసం సృష్టించడానికి ఇదే ప్రధాన కారణం. హిమాలయ ప్రాంత రాష్ట్రాలన్నింటికీ ఈ విపత్తుల ముప్పు ఉంది. అడవుల నరికివేత, పర్వతసానువులు చదునుచేయడంతో వరదప్రవాహాన్ని అడ్డుకుని, నెమ్మదింపచేసే వ్యవస్థలు ధ్వంసమై ఈ ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, నాయకుల నిర్లక్ష్యం, స్వార్థంవల్లే భారీ ప్రాణ,ఆస్థినష్టం సంభవించింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”దాదా మౌని ”-అశోక్ కుమార్ జయంతి

రతీయ సినిమాపై ‘దాదామోని’ ముద్ర

అశోక్‌కుమార్‌నూ, భారతీయ సినిమానూ వేరుచేసి చూడలేం. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఆయనది డెబ్భై ఏళ్ల భాగస్వామ్యం. తనకు అమితమైన పేరు తెచ్చిన మొదటి సినిమా ‘అచ్చుత్‌ కన్య’ (1936)లో నటించేందుకు ఆయన మొదట నిరాకరించారన్నది నిజం. డైరెక్టర్‌ హిమాంశు రాయ్‌ బలవంతం మీద ఆ సినిమా చేశారు. ఆ సినిమా నుండి ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలుగలేదు. అందులో నాయిక దేవికా రాణి.
ఆ రోజుల్లో అశోక్‌కుమార్‌, దేవికా రాణి కాంబినేషన్‌ అంటే ప్రేక్షకులకు కన్నుల పంటే. ‘జీవన్‌ నైయా’ (1936), ‘ఇజ్జత్‌’ (1937), ‘సావిత్రి’ (1937), ‘నిర్మల’ (1938) వంటి చిత్రాలలో ఆ జోడీ బాగా రాణించింది. అశోక్‌కుమార్‌ అసలు పేరు కుముద్‌లాల్‌ కుంజిలాల్‌ గంగూలీ. 1911 అక్టోబర్‌ 13న భాగల్పూర్‌లో జన్మించిన ఆయన ఖండ్వాలో పెరిగారు. కలకత్తాలో న్యాయవాద పట్టా పుచ్చుకున్నాక, బాంబే టాకీస్‌లో లేబరేటరీ అసిస్టెంట్‌గా కెరీర్‌ ప్రారంభించారు. అదే కంపెనీ నుంచి నటునిగా మారారు. దేవికా రాణి తర్వాత లీలా చిట్నీస్‌తో కలిసి ఆయన నటించిన ‘కంగన్‌’ (1939), ‘బంధన్‌’ (1940), ‘ఝూలా’ (1941) సినిమాలు సూపర్‌ హిట్టయి అశోక్‌కుమార్‌ను అగ్రశ్రేణి నటునిగా మార్చాయి. ‘కిస్మత్‌’ (1941)లో చేసిన యాంటీ హీరో రోల్‌ ఆయన కెరీర్‌లో మోస్ట్‌ ఫేమస్‌ రోల్‌గా పేరు తెచ్చుకుంది. అందులో ఆయన సిగరెట్‌ తాగే స్టయిల్‌ను ఆ కాలంలో ఎంతోమంది అనుసరించడం ఆ పాత్ర సాధించిన విజయం. అప్పటి నటుల తరహాలో ఆయన కూడా తన పాటలను తనే పాడారు. వాటిలో ‘మై బన్‌ కీ చిడియా’, ‘చల్‌ చల్‌ రే నౌజవాన్‌’, ‘న జానే కిదర్‌ ఆజ్‌ మేరీ నావో చలీ రే’ వంటివి బాగా పాపులర్‌ అయ్యాయి. ‘ఆర్తి’ (1962), ‘గుమ్‌రాహ్‌’ (1963), ‘బందిని’ (1963) చిత్రాల్లో నటునిగా ఆయన ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ప్రత్యేకించి ‘బందిని’లో ప్రతి సన్నివేశంలోనూ నూతన్‌, అశోక్‌ ఒకరిని మించి మరొకరు అద్భుత నటన ప్రదర్శించారనే పేరు తెచ్చుకున్నారు.
కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా…
ఆరవ దశకం ద్వితీయార్ధంలో చేసిన ‘మమత’ (1966), ‘హాతే బజారే’ (1967) చిత్రాల తర్వాత ఆయన కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారారు. ‘జ్యూయల్‌ తీఫ్‌’ (1967)లో విలన్‌గా, ‘మిలి’ (1975)లో సానుభూతికి నోచుకునే తండ్రిగా, ‘ఆశీర్వాద్‌’ (1968), ‘చోటీ సీ బాత్‌’ (1975) సినిమాల్లో వృద్ధునిగా, ‘జవాబ్‌’ (1970)లో రేపిస్ట్‌గా, ‘విక్టోరియా నెం. 203’ (1972)లో మోసగానిగా, ‘ఖూబ్‌సూరత్‌’ (1980)లో భార్యా విధేయుడైన ఇంటిపెద్దగా వైవిధ్యమైన పాత్రల్లో రాణించారు అశోక్‌కుమార్‌. అప్పట్నించే ఆయనను అందరూ ప్రేమగా ‘దాదామోని’ (పెద్దన్నయ్య)గా పిలుచుకోవడం ప్రారంభించారు. ఎనిమిదో దశకానికి వచ్చేసరికి ఆయన సినిమాలను బాగా తగ్గించేసుకున్నారు. టెలివిజన్‌లో అడుగుపెట్టి దూరదర్శన్‌లో ప్రసారమైన మొదటి ధారావాహిక ‘హమ్‌ లోగ్‌’ (1984)కు ప్రయోక్తగా వ్యవహరించారు. 1986లో ప్రసారమైన ‘బహదూర్‌ షా జఫర్‌’ సీరియల్‌లో టైటిల్‌ రోల్‌ పోషించారు. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గుర్తింపుగా 1988లో ఆయన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ను అందుకున్నారు. వృద్ధాప్యం కారణంగానూ, అనారోగ్య కారణాల వల్లనూ ఆయన తొమ్మిదో దశకం మధ్య నుండి సినిమాలకూ దాదాపు దూరమయ్యారు. నటునిగా ఆయన చివరి చిత్రం ‘ఆంఖోం మే తుమ్‌ హో’ (1997). సంపూర్ణ జీవితాన్ని గడిపిన ఆయన తొంభై ఏళ్ల వయసులో గుండెపోటుతో 2001 డిసెంబర్‌ 10న మృతిచెందారు.
(నేడు అశోక్‌కుమార్‌ జయంతి)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కవిత -”సన్నికర్ష

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరిత్ర దారుణాలకు వర్తమాన దర్పణం -నోబెల్ ప్రైజ్ విన్నర్ -పాట్రిక్ మోదియానో

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”భాష కోసమే బతుకుతున్నా ”అంటున్న కేన్సర్ పీడితుడు -తాతా రమేష్ బాబు –

భాష కోసమే బతుకుతున్నా

కళ మనిషిని బతికిస్తుందా? అంటే అవుననే అంటారు తాతా రమేష్‌బాబు. తనను కేన్సర్‌ ఏ క్షణాన్నైనా కబళించే అవకాశం ఉందని తెలిసినా జానపద కళల కోసం ఆయన చేస్తున్న కృషిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జానపద కళల పునరుజ్జీవంతోనే తెలుగు భాష వికసిస్తుందని నమ్మి, గత మూడు దశాబ్దాలుగా అందుకోసం కృషి చేస్తున్నారు రమేష్‌బాబు.

గుంటూరు జిల్లా భట్టిప్రోలులో జన్మించిన తాతా రమేష్‌బాబు గుడివాడలో ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే తెలుగు భాషా వికాసం, తెలుగు భాషా చైతన్యం కోసం కృషి చేశారు. జానపద కళలు, సూక్ష్మచిత్రకళ, పెయింటింగ్స్‌, బొమ్మలాటలు, పప్పెట్‌ షోలు… ఇలా అనేక విధాలుగా తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తుండటం విశేషం. ఇప్పటి వరకు 30కి పైగా పుస్తకాలు రాశారు. దూరదర్శన్‌, రేడియోలో పప్పెట్‌ షోలు చేశారు. ఆకాశవాణిలో ధారావాహిక ప్రసంగాలు చేశారు. కవితలు, కథలు, సభల సమీక్షలు నిర్వహించారు. రంగస్థలంపై నాటకాలకు కొదవ లేదు. ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులను అందుకున్నారు. గుంటూరు శేషేంద్రశర్మ సాహితీ పురస్కారంతో పాటు జాతీయ ఉగాది పురస్కారాలు వరించాయి.

‘‘తెలుగు భాష గొప్పది..’’ అంటూ దీర్ఘ ఉపన్యాలు ఇస్తే వినడానికి జనాలు అంత ఆసక్తి చూపరు. అదే ఏ పప్పెట్‌తోనో, జానపద గేయంతోనో చెబితే వింటారు. నిర్వాహకుల లక్ష్యమూ నెరవేరుతుంది. తాతా రమేష్‌బాబు ఆ పనే చేశారు. జానపద కళలను బతికించుకోవాలని తాపత్రయ పడుతూనే.. మరో వైపు తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారాయన.
ఆంగ్ల చదువులొచ్చాక మాతృభాష పట్ల తగ్గుతున్న ఆసక్తిని గమనించి ఆయనీ పని చేస్తున్నారు. ‘‘తెలుగు భాష తీరు ఇలాగే కొనసాగితే మరో 30 ఏళ్లలో కనుమరుగు కావడం ఖాయం’’ అని ఐక్యరాజ్యసమితి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆయనలో తీవ్ర ఆలోచనలు రేకెత్తించింది. తెలుగు భాషను కాపాడుకోవాలనే దృఢ సంకల్పాన్ని కలిగించింది. తెలుగు భాష అప్పుడెందుకు పరిఢవిల్లింది? ఇప్పుడెందుకు నీరసిస్తోంది? అన్న ప్రశ్నలు రమేష్‌బాబు మదిని నిత్యం తొలిచేవి. కారణాలు ఎన్నున్నా.. జానపద కళలు అంతరించిపోతుండటమూ ఒక కారణమన్నది రమేష్‌బాబు అభిప్రాయం. ‘‘జానపద కళలు పునరుజ్జీవం పొందినప్పుడే భాషకు కొత్త వెలుగు వస్తుంది. పాతికేళ్ల క్రితం చదువురాని వారికి సైతం రామాయణం, మహాభారతం కంఠతా వచ్చేవి. దానికి కారణం జానపదకళలే కదా! తెలుగు భాష వికాసం జరగాలంటే ఆ కళలను మళ్లీ బతికించుకోక తప్పదు’’ అని చెప్పారు.
కేన్సర్‌ కబళిస్తున్నా…
తెలుగు భాషా చైతన్యం కోసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చైతన్యయాత్రలు నిర్వహించారు రమేష్‌బాబు. ఇందుకోసం ఏడు లక్షల రూపాయల వరకు తన సొంత డబ్బును ఖర్చు చేశారాయన. ప్రభుత్వం గానీ, ఇతర సంస్థలు గానీ ఎటువంటి సహాయం చేయలేదు. అయినా సరే వెనుకంజ వేయకుండా ఊరూరా తిరిగి జానపద కళలు, వాటి ప్రాముఖ్యత, తెలుగు భాష గొప్పదనం గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. అయితే అదే సమయంలో ఆయనను విధి వెక్కిరించింది. కేన ్సర్‌ రూపంలో అనారోగ్యం బయటపడింది. కేన్సర్‌ అనగానే తన గురించి, కుటుంబం గురించి ఆలోచిస్తారు ఎవరైనా. కానీ తను అందుకు భిన్నంగా- చనిపోయేలోగా సమాజానికి ఏదైనా చేయాలని సంకల్పించారు. వ్యాధి గురించి తెలిశాకే తన కోరిక మరింత బలపడిందని ఆయన అంటారు. టీచర్‌ వృత్తిని వదిలేసి జానపద కళల ప్రాచుర్యంపై పూర్తి దృష్టి సారించారు. ‘‘కళాసాహిత్య సేవా పీఠాన్ని నెలకొల్పి కళ, సాహిత్యం, సేవ, భాష, సంస్కృతి, చరిత్ర.. ఇలా ఆరు అంశాల్లో పేద కళాకారులకు నగదు బహుమతిని అందజేయాలనుకుంటున్నాను. నేను ఉన్నా లేకున్నా ప్రతి ఏటా ఇది కొనసాగడానికి కొంత నిధిని ఏర్పాటు చేశాను. పేద కళాకారులకు ఇది కొంతైనా సహాయపడుతుందని నా ఆశ. ప్రతి ఒక్కరు సమాజం నుంచి లాభం పొందుతుంటారు. వాళ్లు తిరిగి సమాజానికి కొంత ఇవ్వడాన్ని బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే సమాజం ఆనందంగా ఉంటుంది’’ అని తెలిపారు రమేష్‌బాబు.
కేన్సర్‌ కబళిస్తున్నా ‘అడవి పూలు, గంగతో రాంబాబు’ వంటి సీరియల్స్‌లోనూ ఆయన నటిస్తున్నారు. రేడియో, టీవీల్లో జానపద కళలకు ప్రాచుర్యం తీసుకొస్తున్నారు. గోశాల నుంచి కొన్ని ఆవులను దత్తత తీసుకుని వాటి ఆలనాపాలనా చేస్తున్నారు. అనాథ బాలలకు తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఊరికే ఒక్క పైసా విదల్చని ఈ కాలంలో అంత డబ్బు ఎలా ఖర్చుపెడుతున్నారని అడిగితే ‘‘నాకు అందులోనే ఆనందం ఉంది. టీచర్‌గా పనిచేస్తూనే రాత్రిపగలు నా భార్య, నేనూ స్ర్కీన్‌ప్రింటింగ్‌ నడిపే వాళ్లం. వృథాగా ఎక్కడా డబ్బు ఖర్చు పెట్టలేదు. నా దృష్టిలో ఖర్చు చేయకపోవడం అంటే సంపాదించడమే. అలా నేను సంపాదించిన, పొదుపు చేసుకున్న డబ్బులో నుంచే నాకిష్టమైన వ్యాపకాల కోసం తీసుకునే వాడ్ని. దీనికి నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు’’ అన్నారు రమేష్‌బాబు.
– నవ్యడెస్క్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రంగుల తెలంగాణ -కళాకారుల ఆవిష్కరణ

రంగుల తెలంగాణం

ఆర్ట్‌ అంటే – కాన్వాస్‌, బ్రష్‌లు, రంగులు కాదు. నింగి, నేల, మనుషులు, యాస గోస, బతుకులు, కష్టాలు కన్నీళ్లు. వాటన్నిటినీ అద్దంలో చూపిస్తుంది పెయింటింగ్‌. తెలంగాణలో అలాంటి పెయింటింగ్స్‌కు కొదవ లేదు. ఇక్కడున్నంత మంది ప్రముఖ ఆర్టిస్టులు ఇంకెక్కడ లేరు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను రంగుల్లోకి కన్వర్ట్‌ చేసి కాన్వాస్‌ మీద ప్రతిఫలించి.. దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ఘనత వీరిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి అందరు ఆర్టిస్టులు ఒకచోట చేరి చిత్రకళకు నీరాజనం పలికారు. హైదరాబాద్‌లో జరిగిన ఆ ఆర్ట్‌క్యాంప్‌ విశేషాలే ఇవి..

పెయింటింగ్‌ను వృత్తిగా, ప్రవృత్తిగా ఎంచుకున్న మహిళలు తక్కువేనని చెప్పవచ్చు. అయితే ఉన్న కొద్ది మంది మహిళలు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, పేరును సంపాదించుకున్నారు. మరి కొంత మంది తమ వృత్తిని కొనసాగిస్తూనే ఆర్టిస్టులుగా అప్పుడప్పుడు కుంచె పట్టుకుంటున్నారు. ‘‘తెలంగాణలో 12 మంది మహిళా ఆర్టిస్టులున్నారు. అందులో నేను ఒకరిని కావడం నా అదృష్టం. ఇండియన్‌ మైథాలజీపై నేను రీసెర్చ్‌ చేస్తున్నాను. అందులో భాగంగానే తెలంగాణ గ్రామదేవతలపై పరిశోధన సాగిస్తున్నాను. నేను వేసే పెయింటింగ్స్‌లో కూడా గ్రామదేవతలు ఉంటారు. ఈ క్యాంప్‌లో గాడెస్‌ ఆఫ్‌ లైఫ్‌ పేరుతో బతుకమ్మ చిత్రాన్ని గీసాను. ఒక ఆధునిక మహిళ కల్చర్‌ను ఎలా యాక్సెప్ట్‌ చేస్తోంది.. కల్చర్‌తో పాటు ఎలా ముందుకెళుతోందనే అంశాలను నా చిత్రాలు ప్రతిబింబిస్తాయి’’ అంటున్నారు మహిళా ఆర్టిస్ట్‌ నిర్మల. తను ఇఫ్లూలో రీసెర్చ్‌ స్కాలర్‌గా చేస్తూనే ఉమెన్‌ ఓరియెంటెడ్‌ పెయింటింగ్స్‌ వేస్తూ మహిళాభ్యున్నతికి తన వంతు కృషి చేస్తున్నారు.
ప్రత్యక్షంగా చూసే అవకాశం
ఒక అద్భుతమైన పెయింటింగ్‌ను చూసినపుడు ఎలా గీసి ఉంటారో అనిపిస్తుంది. అయితే అలాంటివి వేసేటప్పుడు చూసే అవకాశం లభించదు. ఇలాంటి ఆర్ట్‌ క్యాంప్‌లు ఆ అదృష్టాన్ని అందిస్తాయి. ‘‘ఇదొక హిస్టారికల్‌ ఈవెంట్‌. ఇక్కడ సీనియర్‌ ఆర్టిస్టులతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. వారితో ఇంటరాక్ట్‌ కావడం వల్ల టెక్నికల్‌ అంశాలు తెలుసుకోగలిగాం. తెలంగాణలో ఉన్న ఆర్టిస్టులందరికీ దక్కిన ఒక అరుదైన అవకాశం ఇది’’ అని కరీంనగర్‌ జిల్లాకు చెందిన కిరణ్‌ వరికిల్ల అన్నారు. ఈయన అద్భుతమైన ఎరోటిక్‌ పెయింటింగ్స్‌ను ఈ క్యాంప్‌లో వేశారు. ఆర్టిస్టులు వేస్తున్న సమయంలోనే సందర్శకులు ఆసక్తిగా తిలకించి వారి చిత్రకళా నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అంతేకాకుండా చిత్రకళలో అపారనైపుణ్యం ఉన్న ఆర్టిస్టులను ఇప్పుడిప్పుడే ఆర్టిస్టులుగా ఎదుగుతున్న వారు చూసి నేర్చుకునేందుకు ఒక వేదికగా ఉపయోగపడింది.
స్వేచ్ఛకు ప్రతీక..

తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తరువాత నిర్వహించిన మెగా ఆర్ట్‌ క్యాంప్‌ కావడంతో చిత్రాలలో తెలంగాణం వెల్లివిరిసింది. ప్రతి పెయింటింగ్‌లో తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు సందర్శకులను కట్టిపడేశాయి. ‘‘స్వేచ్ఛకు చిహ్నంగా పావురాన్ని ఎంచుకుంటారు. కానీ నా చిత్రంలో కాకిని ఎంచుకున్నాను. ఇందులో ఎరుపు పోరాటాన్ని, నీలం నిరసనను తెలియజేస్తుంది. ఆకుపచ్చ రంగు అభివృద్ధికి సూచికగా నిలుస్తుంది. మొత్తంగా దళిత స్వేచ్ఛను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది’’ అని ప్రముఖ ఆర్టిస్ట్‌ అక్బర్‌ అన్నారు. ‘‘సీనియర్స్‌ పెయింటింగ్‌ చేస్తుంటే చూడాలనే ఒక ఆసక్తి ఉండేది. అది ఈ క్యాంప్‌లో తీరింది. ఆర్టిస్టులు మంచి మంచి పెయింటింగ్స్‌ వేయడానికి ఇలాంటి ఎన్విరాన్‌మెంట్‌ బాగా ఉపకరిస్తుంది. అంతరించిపోతున్న రూరల్‌ కల్చర్‌ను పట్టి చూపిస్తాయి నా చిత్రాలు’’ అని మెదక్‌ జిల్లా కాస్లాబాద్‌కు చెందిన కంది నర్సింలు అంటున్నారు. ఈయన ఆర్ట్‌ క్యాంప్‌లో వేసిన పెయింటింగ్‌ పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లి అప్పటి అలంకారం ఎలా ఉండేదో ప్రత్యక్షంగా చూపించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి పెద్దఎత్తున నిర్వహిస్తున్న ఆర్ట్‌ క్యాంప్‌ ఇది. ఈ క్యాంప్‌ విజయవంతం కావడం మాలో ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడిప్పుడే ఆర్టిస్టులుగా ఎదుగుతున్న వారికి ఈ తరహా క్యాంప్‌లు చాలా ఉపయోగపడతాయి. సీనియర్‌లతో ఇంటరాక్షన్‌ కావడం వల్ల చిత్రకళలో మెలకువలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. రంగులు ఎలా అప్లై చేయాలి? కర్వ్స్‌, డ్రాయింగ్‌, ఫినిషింగ్‌ వంటి పనితనం తెలుస్తుంది. ఒక పెయింటింగ్‌ని చూసినపుడు ఈ కర్వ్‌ ఎలా వేసి ఉంటాడు ? ఫినిషింగ్‌ అద్భుతంగా ఉంది, ఎలా చేసి ఉంటాడని అనిపిస్తుంది. అవన్నీ ఇక్కడ స్వయంగా చూసే భాగ్యం కళాభిమానులకు కలిగింది.
– బి.నర్సింగరావు, ప్రముఖ దర్శకులు, చిత్రకారులు

ఆర్టిస్టులందరినీ ఒకే వేదికపై తీసుకురావడం గతంలో ఎప్పుడూ జరగలేదు. మేం ఆ ప్రయత్నం చేసి సఫలమయ్యాం. 100 సంవత్సరాల హిస్టరీని డాక్యుమెంట్‌ చేశాం. 150 మంది ఆర్టిస్టుల ప్రొఫైల్స్‌ను పుస్తకరూపంలో తీసుకువచ్చాం. ఇందులో సీనియర్‌ ఆర్టిస్టుల నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆరిస్టుల వరకు వివరాలు ఉన్నాయి. పాతతరం ఆర్టిస్టుల వివరాలు కావాలంటే ఎక్కడా దొరకవు. ఈ పుస్తకంతో ఆ లోటు తీరింది. ఒక డాటా బ్యాంక్‌ మాదిరిగా ఈ పుస్తకం ఉపయోగపడనుంది.
– ఏలె లక్ష్మణ్‌, ప్రముఖ చిత్రకారుడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -34

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -34

32- సింహళ రాజ కవి -కుమార దాసు

మహా కావ్యం ‘’జానకీ హరణం ‘’రాసిన కుమార దాసు 413-523కాలం లో శ్రీలంకను పాలించిన కుమార సేన మహా రాజు అని భావించారు .కాని కావ్యం చివర లో ఉన్నదాన్ని బట్టి తన తండ్రి కుమారసేనుని సైన్యాధికారి ‘’మానిత’’’అని ,తన చిన్నతనం లో యుద్ధం లో చనిపోయాడని  మేనమామలు మేఘ ,అగర బోధిలు తనను పెంచి పెద్దవాడిని చేశారని రాశాడు .క్రీ శ తొమ్మిది వందల కాలం వాడైన రాజ శేఖరుడు కుమార దాసు అంధుడు గా జన్మించాడని ‘’తన కావ్య మీమాంసలో ‘’మేఘా విరుద్ధ కుమారాదాసదయః జాత్యన్ధాః ‘’అని రాశాడు .కాని ఈ మాట రాసింది మహా కవి కాళి దాసు అని ,కాళిదాసు తర్వాత కుమార దాసు వచ్చాడని అంటారు .కనుక క్రీ .శ. అయిదు వందల నాటివాడని చెప్పారు .మాఘుడికి ముందు భవ భూతికి తరువాత కుమారదాసు ఉన్నాడని అంటారు .జానకీ హరణ కావ్యం రాసేముందు కుమార దాసు కాళిదాసు రాసిన రఘు వంశకావ్యం  చదివి ఉంటాడని భావిస్తున్నారు .కుంహాన్ రాజ అనే పరిశోధకుడి పరిశోధనలో కుమార దాసు దక్షిణ దేశం లోని కంచి లో నివశించి ఈ కావ్యాన్ని రాశాడని ఉంది .ఈ కావ్యం కాళీదాస కృత రఘు వంశ స్తాయి ఉందనీ చెప్పాడు .సుభాషిత రత్న కోశం లో కుమార దాసురాసిన జానకీ హరణ కావ్య  ప్రస్తావన ఉంది .’’జానకీ హరణం కర్తుం –రఘు వంశే పురస్తితే –కవిః కుమారా దాసోవా –రావణోవా యది క్షమః ‘’దీని అర్ధం –రఘువంశ అంటే సూర్య వంశ  కావ్యం కాళిదాసు రాసింది ఉండగా జానకీహరణం అంటే కుమారదాసుకావ్యం సీతాపహరణం చేసే సామర్ధ్యం కుమార దాసుకు, రావణుడికి మాత్రమె ఉంది అని చమత్కరించాడు .

కుమార రామదాసీయం

కుమార దాసు కావ్యాన్ని చాలా గొప్పగా రాశాడు .ఇరవై సర్గల మహా కావ్యం ఇది .దశరదునిపై కమ్మని కవిత్వం చెప్పాడు .సందర్భాలను ఎన్నుకొని మహాకవ్యానికి తగినట్లు వర్ణనలు చేశాడు .బృహస్పతి మహా విష్ణువుతో రావణుడి దురాగతాలను అంతం చేయమని ప్రార్ధిస్తాడు . దాసు జలక్రీడల్ని,  సూర్యోదయ సూర్యాస్తమయాలను నేర్పుగా వర్ణించాడు .తరువాత కద మిధిలకు చేరుతుంది .విశ్వామిత్ర ,జనకుల సమాగమం కమనీయం గా కాళిదాస మార్గం లో వర్ణించాడు .కవిత్వం లో ‘’వైదర్భీ రీతి ‘’ని వాడి కావ్య గౌరవాన్ని ఇనుమడింప జేశాడు .కుమార దాసు గొప్ప వ్యాకరణ పండితుడు .అనుకూలమైన ఛందస్సులను సందర్భాన్ని బట్టి వాడి కదాగమనానికి ,రామ ణీయతకు తోడ్పడ్డాడు .ద్రుత విలంబితం ,ప్రమితాక్షరం ,ఇంద్ర వజ్ర ఉపజాతులు బాగా వాడి సమర్ధతనిరూపించాడు .వంకస్త ,వైతాళీయ ,రదోద్ధత ,ఛందో భేదాలను సద్వినియోగం చేసుకొన్నాడు .శార్దూలం శిఖరిణి ,స్రగ్ధర ,పుష్పితాగ్ర , ప్రహర్శిణి వసంత తిలక ,అవితా మందాక్రాంత ,మాలిని లను అవసరాన్ని బట్టి ప్రయోగించాడు .వాల్మీకానికి పూర్తీ విదేయకం గా రామాయణ పాత్రల ఉదాత్తతకు ఉన్నత స్తానం కల్పించేట్లుగా  మనో భావాలను,భావోద్వేగాలను పరిపూర్ణం గా  స్పష్టం గా వ్యక్త్యం చేసేట్లు రాశాడు కుమార దాసు .అంతకు ముందు ఏకవీ వాడనికొన్ని పదాలను కుమార దాసు వాడి నూతనత్వానికి దారి వేశాడు .

‘’ మాక్డోవేల్ పండితుడి’’ దృష్టిలో కుమార దాసు మౌర్య రాజు ముద్గాలాయనుడికొడుకు .తండ్రి తొమ్మిదేళ్ళు రాజ్య పాలన చేశాడట .దాసుగురించి బౌద్ధ వాజ్మయం లో విస్తృతం గా ఉందట .సింహళ దేశం లో జానకీహరణ కావ్యాన్న్ని ప్రతిమాటనూ అనువాదం చేసి భద్రం గా దాచుకొన్నారు అంటే సింహలీయులపై అతని ప్రభావం జాస్తీగా ఉందని అర్ధం .

వాల్మీకి రామాయణం లోని కదనే  తీసుకొన్నా దాసు కొన్ని మార్పులు చేశాడు .విశ్వామిత్రుడు అడిగిన వెంటనే దశరధుడు యాగ రక్షణకు రాముడిని పంపుతూ క్షత్రియ ధర్మాలు బోధిస్తాడు. మారీచుడు కూడా సుబాహు తో పాటు రాముడి చేతిలో చచ్చినట్లు చెప్పాడు .మాయ లేడి విషయాన్ని సంక్షిప్తం చేశాడు .సీతా స్వయం వరానికి ముందే జానకీ రాములు పరస్పరం కలుసుకొని అనురాగం పొందినట్లు మార్చాడు .తనకు నచ్చిన ఘట్టాల్లోని భారవి ,భవ భూతి కాళిదాసకవితలను స్పూర్తిగా తీసుకొని గొప్ప ప్రేరణ పొంది చక్కగా అనుకరించి కవిత్వం చెప్పాడు –‘’గగన సరసి చంద్ర రూప్య  కుంభే-వ్యప సరతి స్మ నిపాతితే రాజన్యా ‘’అని, భారవి ఉపమానమైన ‘’హేమ కుంభ ఇవ పూర్వ పయోదేర్మున  మజ్జ  శనకైస్తు హిమామ్శుః ‘’ను అనుకరించి కుమార దాసు చెప్పాడు .

నఖ శిఖ పర్యంత సీతా సౌందర్యాన్ని వర్ణించి తరువాతి వారికి మార్గ దర్శి అయ్యాడు దాసు .అనుకరణను అవసరాన్ని కి తగ్గట్టు చేసిన స్వతహాగా మహా భావుకుడైన కవిగా దర్శన మిస్తాడు .అందరికంటే ఒక ఆకు ఎక్కువే చదివి సంభోగ శృంగారాన్నీ తనివి తీరా వర్ణించాడు .పరశురాముడు రాముడిని  కలిసినప్పుడు .ఇద్దరి మధ్యా సంభాషణలను రౌద్ర వీర రసాలతో పుష్టి కల్గించాడు .దాదాపు అన్ని రసాలను కావ్యం లో పోషించాడు విశ్వామిత్ర్ ఆశ్రమ ప్రశాంతతను శాంత రసం తో నింపాడు .విభావాన్ని ,అనుభావాన్ని గొప్పగా ప్రదర్శించి రస పుష్టి చేకూర్చాడు .పద్దెనిమిదవ సర్గలో శబ్ద చమత్క్రుతీ వైభవాన్ని అనుభవైక వేద్యం చేశాడు .అనేక రకాలుగా బంధ కవిత్వం తో చెలరేగిపోయి రాశాడు .అందులో గోమూత్రిక ,మురజాదులు ముఖ్యమైనవి .నిర్యోస్త్య ,అనులోమ ,ప్రతిలోమ కవిత్వం లోను తన ప్రజ్ఞా ప్రదర్శనను అత్యద్భుతం గా చేశాడు .శ్లేషనూ సమాదరించాడు .

ప్రతిభ తో బాటు వ్యుత్పత్తికూడా  సంపూర్ణం గా ఉన్నకవి కుమార దాసు .అందుకే సుప్రసిద్ధ ఆలంకారికులైన విద్యాకరుడు ,జల్హనుడు .శ్రీధరుడూ ,వల్లభ దేవుడు కుమార దాస కృత మహా కావ్యం జానకీ హరణం నుంచి శ్లోకాలను రాసి ఉదాహరించారు .అందుకే ఎవరి ప్రచారమూ అక్కర్లేకుండా కుమారుడు మహా కవికుమారుడై ,దాసు వాణీ దాసుడైనాడు .

Inline image 1

మరో కవిని తర్వాత దర్శిద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-10-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా లంకా శివరాం ప్రసాద్ గారి ”టర్కీ ట్రావలోకం ‘

డా లంకా శివరాం ప్రసాద్ గారి ”టర్కీ ట్రావలోకం ‘turky1 001 turky2 001 turky3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేడియో ప్రయోజనంపై” రేడియో నాటకం”రాసిన స్వర్గీయ పైడి తెరేష్ బాబు

radio1 001 radio2 001 radio3 001 radio4 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -33

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -33

31-  తొలిశాస్త్ర కావ్య కవి -భట్టి

‘’రావణ వధ ‘’అనే మహా కావ్యాన్ని రాసిన కవి భట్టి .దీనికి ‘’భట్టికావ్యం ‘’అనే పేరుంది .భర్త్రు కావ్యం ,రామ కావ్యం ,రామ చరిత్ర అనేపేర్లూ ఉన్నాయి .ఏడవ శతాబ్దానికి చెందిన కవి భట్టి .సంస్కృత శబ్దం ‘’భర్త్రి ‘’ప్రాకృతం లో ‘’ భట్టిఅయందని అంటారు .భర్త్రు హరి కొడుకే భట్టి అనే ఒట్టి భ్రమా ఉంది   . ‘’పాణిని వ్యాకరణాన్ని రామాయణ కధకు జోడించి కవితామయం చేశాడు కావ్యాన్ని.ఒక రకం గా పాణినికి ఇది వ్యాఖ్యాన రామకధా రూపం అని చెప్ప వచ్చు . శ్రీరాముని సకల సద్గుణాభిరామునిగా తీర్చి దిద్దాడు .అగ్ర కవుల సరసన చేర్చే కావ్యం గా రావణ వధ కావ్యాన్ని నిర్వహించాడు .ఈ కావ్యం లో రావణ వధ భాగం అతి చిన్నదే అయినా ,మిగిలిన రామాయణ కావ్యాలకు భిన్నంగా ఉండాలని ‘’రావణ వధ ‘’అని టాగ్ తగిలించాడని పిస్తుంది .సంస్కృత సాహిత్యం లో శాస్త్ర కావ్యాలలో ఇదే మొట్టమొదటిది .శ్లోకాలలో రాసి దాని గౌరవాన్ని మరీ పెంచాడు .ఈ కావ్యం పాఠ్య గ్రంధం అయింది అంటే దాని విశేషమేమిటో కవి ప్రతిభ ఎలాంటిదో తెలుస్తుంది .భట్టి ని భట్టికవి ,భట్టిపండిత ,భట్టి బ్రాహ్మణ అనికూడా పిలుస్తారు .భామహుడి సమకాలికుడు .

భట్టి కవితా భట్టీయం

భట్టి రావణ వదాకావ్యం లో పూర్తిగా వాల్మీకినే అనుసరించాడు .యుద్ధ కాండ తో ఆపేశాడు .ఉత్తరా రామ చర్తిత్ర జోలికి పోలేదు  .పాణిని వ్యాకరణాన్ని జన సామాన్యానికి అందించాలనే తపన తో రాసిన గొప్ప ప్రయోగ ,ప్రయోజన కావ్యం .శబ్దాల వ్యుత్పత్తి ,ప్రయోగ వైచిత్రీ వివరించిన కావ్యం ఇది .వ్యాకరణ అంశాలను కావ్యం ద్వారా బోధించాడు కనుక శాస్త్ర కావ్యం అనే మాట సరిపోయింది .కావ్యం లోని సర్గలకూ వ్యాకరణ సంజ్ఞలను పెట్టటం మరో విశేషం .మొదటి అయిదు సర్గల వరకు ‘’తిగంత’’రూపాలు చెప్పాడు వీటికే ‘’ప్రకీర్ణ కాండం ‘’అనే పేరు .ఆరవ సర్గ నుంచి తోమ్మిదివరకు చాలా లక్ష్య రూపాలను తెలియ జేశాడు .వీటికి ‘’అధికార కాండం ‘’అని పేరుంది.పదో సర్గనుందడి పదమూడవ సర్గ వరకు గుణాలంకార లక్ష్యాలు వివరించాడు .వీటినే ‘’ప్రసన్న కాండం ‘’అంటారు .పదకొండు నుంచి చివరి ఇరవై రెండవ సర్గ వరకు ‘’లట్ ‘’మొదలైన తొమ్మిది లకారాల విశిష్ట రూపాలను తెలియ జేశాడు .వీటిని తిన్గంత కాండమని పేరు .ఈ విధం గా పాణిని చెప్పిన వ్యాకరణ అంశాలను ,అలంకారాలతో మిళితం చేసి రామకధా వస్తువును ఎన్నుకొని కావ్యాన్ని రాశాడు భట్టి . శాస్త్రం  ,కావ్యం అనేజోడు గుర్రాల స్వారీ చేశాడన్నమాట .వ్యాకరణ  ఉదాహరణలకు శ్లోకాలు రాశాడు .వర్ణనలు వర్ణనల కోసమే రాసినట్లు ఉండికృత్రిమత కనిపిస్తుంది .

కవిత్వం విషయం గురించి చెప్పాలంటే ధారా శుద్ధి బాగా ఉంటుంది .శైలి రమ్యం గా రస బంధురం గా ఉండటం మరీ కావ్య శోభను పెంచింది .యమకాలను విస్తృతం గా ప్రయోగించటం తో కర్ణ మాధుర్యం ప్రస్పుటమైంది .ఇదేమి వ్యాకరణం రా బాబోయ్ అని అనిపించదు .ఆ ప్రవాహం లో అలా కొట్టుకు పోతాం .కధకు వ్యాకరణ బోధకు తగిన శబ్దాలను ఎంచుకొని ప్రయోగించటం లో భట్టి అసమాన మైన గట్టి పాండిత్య ప్రతిభను ప్రదర్శించాడు .శబ్ద ప్రయోగం ఆశువుగా వచ్చి చేరి నిండుదనాన్ని ,రామణీయకతనూ చేకూర్చింది .నూతన శబ్దాలకు ,సంధులకు  భట్టి కావ్యం  భాండాగారం గా నిలిచింది .భాష మీట పట్టు ఉందని చూపటానికి భట్టి ప్రసిద్ధం లో లేని పదాలనూ ప్రయోగించి సత్తా చాటుకొన్నాడు .చిన్న చిన్న సమాసాలే వాడి చదువరులకు గొప్ప ఆసక్తినికలిగించి వైదర్భీ రీతికి న్యాయం చేశాడు .

భట్టికవి అలంకార,వ్యాకరణాలలోనే కాదు నాట్య ,సంగీత ,వేద,వేదాన్గాలలోను అర్ధ ధర్మ శాస్త్రాలలోను అసమాన పండితుడు .రానీతిని ఔపోసన పట్టినట్లు కావ్యం తెలియ జేస్తుంది .సంభాషణా చతురుడనిపిస్తాడు .సామాన్యులు ఈ కావ్యాన్ని చూసి పారిపోరు .ఆప్యాయం గా చదివి ఆనందిస్తారు .అదీ భట్టీయం .చాలా చోట్ల భారవిని అనుకరించినట్లు తోస్తుంది .మాఘుడు భట్టిని అనుకరించాడు అదీ భట్టికి ఉన్న ప్రత్యేకత .ఉచితమైన సందర్భ శుద్ధికల వర్ణనలే భట్టి చేసి సెబాస్ అనిపించాడు .శరద్రుతువును వర్ణిస్తూ భట్టి చెప్పిన శ్లోకం మహా భేషుగ్గా ఉంటుంది .చూడండి –

‘’నతజ్జలంయన్న సుచారు పంకజం –న పంకజం తద్యదలీన షత్పదం-నషత్పదోసౌ నజుగుమ్జ యః కలం న గుంజితం తన్న జహార యన్మనః ‘’ –భావం –‘’కమాలలు వికసించని సరస్సులు సరసులేకావు .భ్రమరాలు మూగని కమలాలు కమలాలే కావు .ఝంకారం చేయని తుమ్మెదలు తుమ్మెదలే కావు .మానవుల మనస్సులను ఆకర్షించని   ఝంకారాలు భ్రమర  ఝమ్కారాలేకావు .’’

ఉదయ సూర్యుని గురించి వర్ణిస్తూ ‘’ప్రపంచం అంతా పెను చీకటి అనే బురదలో కూరుకు పొతే ఉదయాద్రి మీద ఉదయించే భాణుడు తన కిరణాలు అనే తాళ్ళ చేత ప్రాణులను పైకి లాగుత్న్నట్లు ఉన్నాడు ‘’

హనుమంతుడు లంకను కాలిస్తే అగ్ని జ్వాలలు  వ్యాపించి లంక యెంత కల్లోలం గా ఉందొ  యమకం లో మహా గమకం గా చెప్పాడు భట్టి .అర్ధం అక్కర లేదు శబ్ద సౌందర్యం తో ఆ విషయం అంతా అర్ధమైపోతుంది –

‘’సరసాం సరసాంపరి ముచ్యతమం పతతాం పతతాం కకుభో బహుశః

సకలైః సకలైః పరితః కరుణై రుదితై రుదితైరివ ఖం నిచితం

నగజా నగజా దయితా దయితా విగతం విగతం లలితం లలితం

ప్రమదా ప్రమదా  మహతా మహతా మరణం మరణం సమయాత్ సమయాత్ ‘’

వ్యాకరణం అనే కళ్ళజోడు పెట్టుకొన్న వారికి తన కావ్యం దీపం లాంటిది అని భట్టి స్వయం గా తెలిపాడు –‘’

‘’దీప తుల్యః ప్రబందోయం శబ్ద లక్షణ చక్షుషాం-హస్తా మర్ష ఇవాంధానాం భవేద్ వ్యాకరణాద్యతే’’-అంటే దీపం గుడ్డివాడికి వస్తువులను చూపించలేదు .అలాగే వ్యాకరణ చక్షువులు ఉంటేనే నా కావ్యం ,దీపం లాగా కదన వస్తువులను దర్శింప జేస్తుంది అని భట్టి స్వయం గా చెప్పాడు .’’తెలుగున వ్యాకరణ దీపం చిన్నది ‘’అన్నారు వెంకట శాస్త్రి గారు .పెద్ద వ్యాకరణ కళ్ళజోడు పెట్టుకొంటేనే భట్టీయం అర్ధమవుతుంది .ఉత్త కావ్య ‘బట్టీయం’’ వలన అందం గోచరించదు .ఈ కావ్యాన్ని పగల గొట్టి అందరికి అర్ధమయ్యేట్లు చేయటానికి ఇరవై రెండు వ్యాఖ్యానాలు వచ్చాయి .పెద్ది భట్టు అనే తెలుగు ఆయన మంచి వ్యాఖ్య రాశాడు .మల్లినాద సూరి మనుమడే పెద్ది భట్టు .మల్లినాదుడుకూడా భట్టి కావ్యానికి ‘’సార్వ పధీనా ‘’పేరుతొ వ్యాఖ్యానం రచించాడు .శ్రీధరుడు కూడా తెలుగులో వ్యాఖ్యానించాడు .శ్రీనాధుడుఅనే పెరుగలాయన  ‘’భట్టి రూప ప్రకాశం ‘’పేరుతొ వ్యాఖ్యానం రాసినట్లు తెలుస్తోంది .ఇతను మన శృంగార శ్రీనాదుడుకాదని ఈయనే రఘువంశ ,నైషధాలకూ వ్యాఖ్యానం రాశాడని భావిస్తున్నారు .ఏమైనా భట్టి మంచి రసపట్టు ఉన్న దిట్టమైన కవి అనటానికి సందేహం లేదు .

భట్టి ఈ కావ్యం లో పదమూడవ సర్గ లో మరో గొప్ప ప్రయోగం చేశాడు .అదే ‘’భాషాసమ ‘’అంటే ఒకే శ్లోకం ను సంస్కృతం లోను ప్రాకృతం లోను చదువుకోవచ్చు .సంధులు విడగోట్టుకొంటే అలా చదవటం సాధ్యమవుతుంది .మన ద్వార్దికావ్యాలలో లాగా .భట్టికావ్యానికివిదేశీ ప్రాచుర్యమూ దక్కింది .జావా దేశం లో పురాతన ‘’జావనీయ రామాయణానికి’’ ‘’సోర్స్ బుక్ ‘’గా  భట్టికావ్యాన్ని ఉపయోగిస్తున్నారు .జావా రామాయణం అతిపురాతనకావ్యం దీన్ని’’కాకావిన్ ‘’అని గౌరవం గా సంబోధిస్తారు .భట్టికావ్యం జావా ప్రజలకు అరాధనీయం   భట్టికావ్యం లోని యమకాలను,శ్లేషను  వాళ్ళు బాగా ఉపయోగించుకొన్నారు .

భట్టికావ్యం అనే రావణ వధ వీరకావ్యమని ,చతుర్విధ పురుషార్ధ సాధన ధ్యేయం గా రాశాడని ,నగర ,పర్వత ,సముద్ర ,ఋతు ,ఉదయాస్తామయ వర్ణనలు కలిగిఉందని ,ప్రేమ శృంగార సమన్వితమని ,సంస్కృత పంచకావ్యాల సరసన చేరి ఆరవ మహా కావ్యం అనిపించుకోందని ,’’ఆలివర్ ఫాలన్ ‘’అనే విమర్శకుడు భట్టికావ్య ఆంగ్ల అనువాదానికి ఉపోద్ఘాతం రాస్తూ చెప్పాడు .

Inline image 1   Inline image 2

మరోకవితో మరోసారి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-10-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సమసమాజ స్వాప్నికుడు – నశీర్‌ అహమ్మద్‌

సమసమాజ స్వాప్నికుడు – నశీర్‌ అహమ్మద్‌
మాతృభూమి విముక్తి కోసం అటు భారత జాతీయ సైన్యం యోధునిగా ఆంగ్ల సైన్యాలతో తలపడి, ఇటు సామ్యవాదం లక్ష్యంగా ఎంచుకుని సాగుతున్న రాజకీయ పోరాటాలలో నిన్నటి దాకా చురుగ్గా పాల్గొన్న కెప్టెన్‌ అబ్బాస్‌ అలీ 1920 జనవరి 3న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బులంద్‌షహర్‌ జిల్లా ఖుర్‌జా గ్రామంలోని జమీందారి కుటుంబంలో జన్మించారు. ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని అంగీకరించని ముస్లిం రాజపుత్ర కుటుంబం నుంచి వచ్చిన అబ్బాస్‌ అలీ ఉన్నత పాఠశాల విద్యార్థిగా సర్దార్‌ భగత్‌ సింగ్‌ స్థాపించిన ‘నౌ జవాన్‌ భారత సభ’లో సభ్యులయ్యారు. ఆ తరువాత ఉన్నత విద్య కోసం అలీఘర్‌ విశ్వవిద్యాలయానికి వెళ్ళిన ఆయన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్‌ కున్వర్‌ ముహమ్మద్‌ అష్రాఫ్‌ శిష్యరికంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యత్వం పొందారు. అష్రాఫ్‌ ప్రేరణతో బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీలో తిరుగుబాటుకు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అబ్బాస్‌ అలీ వ్యూహాత్మకంగా 1939లో బ్రిటిష్‌ సైన్యంలో చేరారు. ద్వితీయ ప్రపంచ యుద్ధంలో భాగంగా 1941లో ఆయన సింగపూర్‌ వెళ్ళారు. 1942లో జపాన్‌ సైన్యాలకు బ్రిటిష్‌ బలగాలు లొంగిపోవడంతో ఇతర సైనికులు, సైన్యాధికారులతోపాటుగా అబ్బాస్‌ అలీ యుద్ధఖైదీ అయ్యారు. ఆ సందర్భంగా, 1943లో చివరి మొగల్‌ చక్రవర్తి బహదూర్‌ షాహ్‌ జఫర్‌ సమాధి వద్ద నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చేసిన ప్రసంగం మాతృభూమి విముక్తి కోసం అంకితమయ్యేందుకు అబ్బాస్‌ను సంసిద్ధం చేసింది. భారత జాతీయ సైన్యంలో చేరిన ఆయనకు ‘కెప్టెన్‌’ హోదా లభించింది. సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన ‘చలో ఢిల్లీ’ నినాదానికి అనుగుణంగా ఆంగ్ల సైన్యాలతో పోరాటానికి అబ్బాస్‌ అలీ అరకాన్‌ యుద్ధక్షేత్రం వెళ్ళారు. ద్వితీయ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ పరాజయంతో భారత జాతీయ సైన్యం వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో బ్రిటిష్‌ సైన్యం భారత జాతీయ సైన్యం యోధులతో పాటుగా ఆయనను అరెస్ట్‌ చేసింది. అరెస్టు తరువాతు బ్రిటిష్‌ సైన్యాధికారులు కోర్టు మార్షల్‌ జరిపి అబ్బాస్‌కు మరణశిక్ష ప్రకటించారు. ఈలోగా బ్రిటిష్‌ వలస పాలకుల నుంచి భారత దేశానికి పూర్తిగా స్వాతంత్య్రం లభించడంతో ఆయనకు విధించిన మరణశిక్ష రద్దయ్యింది. స్వాతంత్య్రం లభించాక 1948లో ఆచార్య నరేంద్రేవ్‌, జయప్రకాష్‌ నారాయణ, డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా సహచర్యంలో సోషలిస్టు పార్టీ నాయకులుగా అబ్బాస్‌ అలీ ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ఈకృషిలో భాగంగా ప్రజల పక్షంగా అబ్బాస్‌ అలీ సాగించిన పోరాటం ఫలితంగా 1948 నుంచి 1974 వరకు ఆయన 50 సార్లకు పైగా అరెస్టు, ప్రభుత్వ నిర్బంధాలకు గురయ్యారు. చివరకు 1975లో ఏర్పడిన అత్యాక పరిస్థితి, నియంతృత్వ పోకడలను వ్యతిరేకించినందుకు గాను అబ్బాస్‌ అలీ 19 మాసాలు జైలులో గడపాల్సి వచ్చింది. 1978లో ఉత్తరప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఆయన ఎన్నికయ్యారు. చివరిశ్వాస వరకు సమసమాజ స్థాపన ప్రధాన లక్ష్యంగా సాగుతానని ప్రకటించిన ఆయనన్యూఢిల్లీ కార్యక్షేత్రంగా తన కృషిని సాగించారు. కెప్టెన్‌ అబ్బాస్‌ అలీ స్వల్ప అస్వస్థత తరువాత 2014, అక్టోబర్‌ 11న కన్నుమూశారు.

– నశీర్‌ అహమ్మద్‌
చరిత్రకారులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓరుగల్లు తరహాలో వల్లూరు

ఓరుగల్లు తరహాలో వల్లూరు -డు సురేశ్
కళ్యాణీ చాళుక్యులు, వైదుంబులు, కాయస్థులకు క్రీ.శ. 1048 నాటి నుంచే వల్లూరు పట్టణం రాజధానిగా ఓ వెలుగు వెలిగింది. క్రీ.శ. 1304 వరకు దాదాపు 256 సంవత్సరాలపాటు కడప జిల్లాలో రాజధానిగా వల్లూరు విరాజిల్లింది. కాకతీయ ప్రభువుల సామంత రాజులైన అంబదేవుడు, మేనమామ గంగయసాహిణి ‘వల్లూరు’ను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ నేపథ్యంలో వల్లూరు మండలం చరిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ‘వల్లూరు’ను కూడా ఓరుగల్లు తరహాలో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలి.

తెలుగువారి తరగని వెలుగుల వీరనారి, కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి గురించి చలన చిత్రం చిత్రీకరిస్తున్న విషయం తెలుగు వారికి విదితమే. ఈ చిత్రంలో రాణి రుద్రమదేవి మరణానికి కారకుడైన కాయస్థ అంబదేవుడిగా జయప్రకాశ్‌ రెడ్డి ఓ పాత్ర పోషిస్తున్న సంగతీ తెలిసినదే. కాకతీయుల నమ్మక సామంతులే కాయస్థులు. ఆ కాయస్థ వంశీయులైన అంబదేవుడు, మేనమామ గంగయసాహిణి కాకతీయ ప్రభువుల ఎడల విశ్వాసపాత్రులై, సామంత రాజులై కడప జిల్లాలోని ప్రాంతాలను కడపకు చేరువలో ఉన్న ‘వల్లూరు’ను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ నేపథ్యంలో వల్లూరు మండలం చరిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
కళ్యాణీ చాళుక్యులు, వైదుంబులు, కాయస్థులకు క్రీ.శ. 1048 నాటి నుంచే వల్లూరు పట్టణం రాజధానిగా ఓ వెలుగు వెలిగింది. క్రీ.శ. 1304 వరకు దాదాపు 256 సంవత్సరాలపాటు కడప జిల్లాలో రాజధానిగా వల్లూరు విరాజిల్లింది. పురాతన పుష్పగిరి ఆలయాలు, ప్రాచీన పీఠాలు, విజయనగర సామ్రాజ్య గురువులైన విద్యారణ్యస్వామి స్థాపించిన విద్యాకేంద్రం వల్లూరు మండలంలో ఉన్నాయి. వల్లూరు మండలంలో శ్రీ చక్రమున్న ఆలయాన్ని శంకరాచార్యులు ప్రతిష్ఠించారు. చోళులు, కళ్యాణీ చాళుక్యులు, వైదుంబులు, కాయస్థులు, విజయనగర రాజాలు నిర్మించిన అద్భుత శిల్పకళా సంపదలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. శ్రీ కృష్ణదేవరాయలను చదరంగంలో ఓడించిన శ్రీ బొడ్డుచర్ల తిమ్మన పుట్టిన కొప్పోలు గ్రామం ఈ మండలంలోనిదే. 150 సంవత్సరాల క్రితం డచ్చి నిర్మాణ కట్టడమైన ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వల్లూరు మండలంలోనే ఉంది. నాచన సోమనాథుడు నడయాడిన ప్రదేశమిది. పంచమనదీ సంగమ ప్రదేశమైన వల్లూరు మండలం పర్యాటకులకు ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతోంది.
రాజరిక, చరిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న వల్లూరు వేదికగా కాకతీయ సామ్రాజ్యాధినేతలకు, సామంత కాయస్థులకు చాలా సన్నిహిత సం బంధం ఉంది. ఆంధ్ర దేశాన్ని ఏక చక్రాధిపత్యంగా పాలించిన రాజవంశాలలో కాకతీయుల కీర్తి గోలుకొండ కోటంత ఘనమైనదీ, గండికోట అంత లోతైనది. మొదట చాళుక్య రాజ్య పతనాంతరం స్వతంత్ర రాజ్యం స్థాపించి తెలుగు వారి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పరచిన ఘన చరిత్ర కలిగినవారు కాకతీయులు. అట్టి కాకతీయుల విశ్వాసపాత్రులైన సైన్యాధ్యక్షులు, సామంతులు కాయస్థులు. కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవుడు విజయపరంపరలతో తెలుగుదేశాన్ని సమైక్యం చేసి, ఆంధ్రులలో వినూత్న జాతీయోత్సాహం కల్గించాడు. ఓరుగల్లు ఆంధ్రానగరి అయింది. గణపతి దేవుడు ఆంధ్రాధీశుడయినాడు. ఈ గణపతి దేవుడకి విశ్వాస పాత్రుడిగా అనేక యుద్ధాలలో పాల్గొని తన ప్రభువునకు విజయం సాధించి పెట్టిన మహావీరుడు కాయస్థ గంగాయసాహిణి. గణపతిదేవుని దక్షిణ దిగ్విజయ యాత్రలో నెల్లూరు తెలుగు చోళరాజు మనుమసిద్ధికి గంగాయసాహిణి సహాయం చేశాడు. కడప జిల్లా ‘వల్లూరు’ పట్టణమును రాజధానిగా చేసు కొని, చోళరాజ్యంపై దండెత్తిన రాయదేవ మహారాజు అనబడే రక్కస గాంగ అను వైదుంబ రాజును సాహిణి జయించాడు. శ్రీ.శ. 1250 నాటి కడప జిల్లా నందలూరు శాసనం ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నవి. ఈ యుద్ధంలో గంగాయసాహిణితో పాటు అతని మేనల్లుడైన జన్నిగదేవుడు కూడా పాల్గొన్నాడు.
ఈ యుద్ధ విజయాన్ని పురస్కరించుకొని గణపతిదేవుడు గంగయసాహిణిని పానగల్లు నుంచి మహారాజవాడి వరకు (మహారాజవాడి అనగా కడప జిల్లా పులివెందుల తాలూకా మోపూరు నుంచి కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లా చింతామణి తాలూకా మిండగల్లు వరకు ఉన్న ప్రదేశం) ఉన్న ప్రాంతానికి అధిపతిగా నియమించాడు. క్రీ.శ. 1255 నాటి మాచుపల్లె శాసనం గంగాయసాహిణి సామంతుడు సోమిదేవుడు వల్లూరు పట్టణం రాజధానిగా పాలిస్తున్నట్లు తెలుపుతున్నది. ఆ విధంగా కడప జిల్లా వల్లూరు రాజధాని కేంద్రంగా కాకతీయుల సామంతులైన కాయస్థుల పాలన కడప జిల్లాలో ప్రారంభమైనది. గణపతి దేవుడు గతించిన తర్వాత రుద్రమదేవి రాజ్యానికి వచ్చిన వెంటనే ప్రతిభ ప్రాతిపదికన సమర్థులకు, నమ్మకస్తులకూ ప్రాధాన్యం ఇస్తూ, కుల మత ప్రాంతాలకతీతంగా, ప్రధాన పదవుల్లో వారిని నియమించింది. వారిలో శివదేవయ్య, కాయస్థ జన్నిగదేవుడు, త్రిపురాంతక దేవుడు, గోనగన్నారెడ్డి, రేచర్లప్రసాదిత్యనాయుడు ముఖ్యలు. వీరందరూ రాణి రుద్రమకు అహర్నిశలు అండగా ఉండి, తమయావత్తూ శక్తియుక్తులూ కాకతీయరాజ్య క్షేమానికై, విస్తరణకై శ్రమించిన శౌర్యులు రాజనీతి కోవిదులు.
ఈ కాయస్థ జన్నిగదేవుడు వల్లూరు రాజ్య ప్రాంతాలను కలుకడ (కలకడ) వకైదుంబ రాజు భుజబలం వీర నారాయణుని నుంచి జయించాడు. గంగాయసాహిణికి పుత్రసంతానం లేకపోవడం వల్ల అతని మేనల్లుడైన జన్నిగదేవుడు కాయస్థ రాజ్యానికి వారసుడైనాడు. క్రీ.శ. 1258-59 మధ్య కాలంలో జారీ చేయబడిన జన్నిదేవుడి శాసనాలు కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఉన్నాయి. తన మేనమామ గంగయసాహిణి వలెనే పానగల్లు నుంచి మహారాజుపాడి వరకు ఉన్న ప్రాంతాన్ని పాలిస్తూ గణపతిదేవునికి విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు. జన్నిగదేవుడి తర్వాత అతని సోదరుడైన మొదటి త్రిపురారి దేవుడు రాజైనాడు. ఇతడు కూడా రుద్రమదేవికి సామంతునిగా ఉంటూ తన పూర్వీకులైన గంగయసాహిణి, జన్నిగదేవుడు నిర్వహించిన పదవులను నిర్వహించినాడు. త్రిపురారి దేవుడు రుద్రమదేవికి ప్రధాన సైన్యాధ్యక్షునిగా ఉండి కమ్మనాడు, మాలికెనాడు, పొత్తపెనాడు, గండికోట మొదలగు సీమలకు అధికారిగా కాకతీయుల ప్రతినిథిగా పాలించాడు.
ఒక స్ర్తీ రాణి కావడం ఓర్చుకోలేని రుద్రమదేవి సవతి కుమారులైన హరహర మురారి దేవులు రుద్రమపై తిరుగుబాటు చేసారు. రేచర్ల ప్రసాదాదిత్యుడు, కాయస్ఠ జన్నిగదేవుడు, అతని సోదరులైన త్రిపురారి దేవుడు, అంబదేవుడు, గోన గన్నారెడ్డి మున్నగు సేనానుల సహకారంతో రుద్రమ దేవి ఆ తిరుగుబాటును తిప్పికొట్టింది. రుద్రమదేవి దక్షిణ దేశ జైత్రయాత్ర చేపట్టింది. త్రిపురారి దేవుడు (1270-72) తర్వాత అంబదేవుడు (1272-1302) ముప్ఫై సంవత్సరాలపాటు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇతడు అనేక మంది రాజులను జయించాడు. 72 మంది రాజులను వధించాడు. కాకతీయ సామ్రాజ్యంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర కాయస్థ రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. క్రీ.శ. 1287 నాటి అత్తిరాల శాసనం ద్వారా అంబదేవుడు వల్లూరు పట్టణం రాజధానిగా గండికోట, ములికినాడు, రేనాడు, పెనదాడి, పెడకల్లు, సకిలి, ఏఱువ, పొత్తపినాడు మొదలగు దేశాలను ఏలినట్లు తెలుస్తోంది.
క్రీ.శ. 1290 ప్రాంతంలో కాకతీయ యువరాజు ప్రతాపరుద్రుడు, రాణి రుద్రాంబ తరపున అంబదేవునిపై దండెత్తి అతని రాజ్యంలోని ఉత్తర ప్రాంతాలు జయించినట్లు తెలుస్తూ ఉంది. అంబదేవుడి బుద్ధి చెప్పాలని రాణీ రుద్రమదేవి తలపోసింది. అంబదేవునితో రుద్రమదేవి పోరాటం భీకరంగా సాగింది. క్రీ.శ. 1290లో అంబదేవునితో యుద్ధంలో తన సైన్యాధ్యక్షునితో సహా రుద్రమ దేవి మరణించిందని చందుపట్ల గ్రామంలోని కాకతీయ ప్రతాపరుద్రుని శాసనం తెలియజేస్తుంది. కాకతీయలకు విధేయులుగా సామంతులుగా ఉన్న కాయస్థుల కార్యక్షేత్రమైన ‘వల్లూరు’ను కూడా ఓరుగల్లు తరహాలో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలి.

–  మొగిలిచెండు సురేశ్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -32

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -32

30-సూర్య శతక కర్త –మయూరుడు

సూర్య శతకాన్ని రాసిన మయూర భట్టు క్రీ శ.606-648కాలం వాడు .హర్షుని ఆస్తానకవులలో  ఒకడు .బాణుడి సమకాలికుడు .మయూరుని వంశస్తులు గొప్ప సూర్యోపాసకులు .అందుకే సూర్య శతకం రచించాడు .సాహిత్యం లో ,ఆధ్యాత్మిక భావాలలో మయూర శతకం విశిష్ట స్థానాన్ని పొందింది .రాజ శేఖరుడు- మయూరుడు, బాణుడు హర్షుని ఆస్థాన కవులని పేర్కొన్నాడు .నిడద వోలు వెంకట రావు గారు తమ పరిశోధనలో’’మయూరుడు –ఆంద్ర వాజ్మయం ‘’లో  మయూరుడు భోజుని ఆస్థానకవి అన్నారు .

‘’అహో ప్రభావో వాగ్దేవ్యాయన్మాతంగా దివాకరః –శ్రీహర్షస్యా భవద్ సభ్యః సమో బాణ మయోరయోః’’అని రాశాడు .మయూరుడు, బాణులతో బాటు హర్షుని ఆస్థానం లో ‘’మాతంగ దివాకరుడు’’ కూడా ఉన్నట్లు చెప్పాడు .బాణుడికి మయూరుడికి కవితా స్పర్ధ ఉన్నట్లూచెప్పాడు . మన వాళ్లకు పుకార్ల షికార్లు చేయటం బాగా అలవాటేకదా .ఈ పుకారు షికారులో విలసిల్లిన మరో కట్టుకధ కూడా లోకం లో కనిపిస్తుంది .అదేమిటంటే –మయూరుడు తన కుమార్తెను బాణుడికిచ్చి పెళ్లి చేశాడు .అంటే బాణుడిని అల్లుడుగా చేసుకోన్నాడన్నమాట .ఒక రోజు నవ దంపతులు శృంగార క్రీడలో ఉండగా మయూరుడు చాటుగా చూసి కూతురు అందానికి ముగ్ధుడై ఎనిమిది శ్లోకాలు చెప్పాడట .అదే ‘’మయూరాస్టకం’’.దీన్ని విన్న మయూరుని కూతురు తండ్రిని కుష్టు వ్యాధి గ్రస్తుడుకమ్మని శపించిందిట .ఆ వ్యాధితో తీసుకొంటూ సూర్యోపాసన చేస్తూ సూర్య శతక రచన ప్రారంభించాడట .ఆరవ శ్లోకం రాసేసరికి పూర్తిగా కుష్టు తొలగిపోయిందట .మయూరుని పేర లోకం లో కొన్ని చాటువులు వ్యాపించాయి .ఇవి స్రగ్ధరా వృత్తాలు .

మయూర శతక ప్రఖ్యాతి

మయూరుడికి ఒకప్పుడు కుష్టు వ్యాధి సోకింది .ఆ దుఖం లో ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్ అనే దాన్ని నమ్మి సూర్య ఉపాసన చేస్తూ సూర్య శతకాన్ని రాసినట్లు కధలు ప్రచారం లో ఉన్నాయి .ఈశతకం పూర్తీ అయ్యేసరికి వ్యాధి పూర్తిగా నయమైనదట .బాణుడి శాపం వాళ్ళ ఈ వ్యాదివచ్చిందనే ప్రచారమూ ఉంది కాని ,జగన్నాధుడు పూర్వ జన్మ వల్లనే వచ్చిందని తెలియ జేశాడు .సూర్య శతకం లో వంద శ్లోకాలున్నాయి .స్రగ్ధరా వృత్తం లో మయూరుడు ఈశతకం రాశాడు .చదువుతుంటే మహానందం కలుగుతుంది .రచన గౌడీరీతిలో ఓజో గుణ ప్రధానం గా ఉంది .యమక పంట పండించాడు ఈ శతకం లో అనేక అర్దాలంకార సంయోజనం తో రచించాడు .ప్రౌఢ రీతిలో నడిచింది .

మొదటి నుంచి నలభై మూడవ శ్లోకం వరకు సూర్య కిరణాల వర్ణన ,సూర్య స్తుతి ఉంది .తర్వాత అయిదు శ్లోకాలలో సూర్యుని రధం ,సూర్యాశ్వాల వర్ణన చేశాడు .పిమ్మట పన్నెండు శ్లోకాలలో సూర్య రధ సారధి అరుణుడిని (అనూరుడు )వర్ణించాడు .సూర్యుని రధాన్ని పదకొండు శ్లోకాలలో చెప్పాడు .ఏడు శ్లోకాలలో సూర్య బింబాన్ని ,మూడు శ్లోకాలలో శివ విష్ణు ,బ్రహ్మ స్వరూపుడుగా సూర్యుని స్తుతించాడు .మరొక శ్లోకం లో సమస్త దేవతలా కంటే సూర్యుడు సర్వ శ్రేస్టుడని వివరించాడు .సూర్యుడు ప్రకాశించేటప్పుడు భూమి పై జరిగే పరిణామాన్ని వర్ణించి చెప్పాడు .మరొక్క శ్లోకం లో సూర్యుడు సమస్త చరా చర జగత్తుకు సార్వ భౌముడు అని నిరూపిస్తూ వర్ణించాడు .మయూరకవి రాసింది ఒకే ఒక్క టి అదే మయూర శతకం దీనితోనే కవుల్లో అగ్రభాగాన నిలిచాడు అంటే అంతటి ప్రశస్తిని ఈశతకం  ద్వారా సాధించాడని గ్రహించాలి .ఒక్క శతకం తో ‘’జాక్ పాట్’’కొట్టి సాహితీ ఉద్యానవనం లో కవితా మయూర నృత్యం చేశాడు సప్తవర్ణ శోభ కల్పించాడు అంతేకాదు –సాహిత్య నభోమండలం లోసూర్య శతకం తో  శతసహస్ర భాను కిరణ పుంజాలను వెదజల్లి ఆరోగ్యం తో బాటు ,ఆనందాన్నీ ,హ్రుదయాహ్లాదాన్ని కల్గించి నభోమండల సావిత్రు నారాయణ మూర్తి యై భాసించాడు .

మయూరుని చాటువుల్లో ఒకటి –అర్ధ నారీశ్వరుడైన పార్వతీ పతికి సంధ్యాదేవి వలన జన్మించిన  సంధ్య ,పై ప్రేమ కల్గిందట .అప్పటికే నెత్తిమీద గంగ సవితిగా ఉంది .ఒక రోజు శివుడు నాట్యం చేసే సమయం వచ్చింది .పార్వతి గంగను దించను ,సంధ్యను వదించను అన్నదట.శివుని శరీరం నుండి వేరైపోవాలనీ అనుకొందిట .ఆమెను ఆపే ప్రయత్నం లో శివుడి హస్తం సర్వ మంగళ కుచాన్ని  తాకిందట .అలాంటి మంగళ కరమైన చేయి మనల్ని రక్షించాలి అని కవి శ్లోకం చెప్పాడు –

‘’అన్యన్యా సంప్రతీమం కురు మదన రిపో –స్వాంగ దాన ప్రదానం –నాహం సోఢుం సమర్దా శిరసి సురనదీం-నాపి సంధ్యాం ప్రణతుం –ఇత్యుక్త్వా కోప విద్దాం విఘట యితు ముమా –మాత్మ దేహం ప్రవృత్తాం –రుంధానః పాతు శంభోఃకుఛ కలశ హఠ క్రుస్తో భుజోవా’’

మయూర శతకానికి పద్నాలుగు వ్యాఖ్యానాలున్నట్లు తెలుస్తోంది  .ఈ శతకానికి ఖండాంతర ఖ్యాతి ఉన్నది .ఆనంద వర్ధనుడు మయూర శ్లోకాలను ఉదాహరించాడు జగన్నాధ పండిత రాయలు మయూరుని అనుసరించి ‘’సుధా లహరి ‘’ని స్రగ్ధరా వృత్తాలలో రచించాడు .మయూరుని కవితా శక్తి  కి ఆకర్షితులైన వారిలో పింగళి లక్ష్మీకాంతం, దాసు శ్రీరాములు ,వడ్డాది సుబ్బారాయకవులేకాక పూర్వకవులలో శ్రీనాధ ,పోతన ,పెద్దన ,రామ రాజ భూషనాదులూ ఉన్నారు .ఇందులో శ్రీనాధుడు మయూరుని పది హేను శ్లోకాలను అనువదించి కాశీఖండం, శివ రాత్రి మహాత్మ్యం లలో చేర్చాడు .అంటే తెలుగు వారికి మొదటగా మయూరుని పరిచయం చేసిన ఘనత శ్రీనాదుడిదేనన్న మాట .’’భట్ట బాణ మయూర భవ భూతి ,శివ భద్ర కాళిదాసు ల’’సరసన మయూరుని నిలిపి గౌరవించాడు . .మయూరుని కవితా వేగం అతన్ని బాగా ఆకర్షించి ఆ ధోరణిలో పద్యాలు అల్లాడు .దాసు శ్రీరాములుగారు 1902 లో సూర్య శతకాన్ని అనువదించారు .ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి గారూ  తెనుగు  చేశారు .రాజ శేఖరుడు మయూరుని –

‘’దర్పం కవి భుజంగానాం గతా శ్రవణ గోచరం –విష విద్యేవ మయూరీ మయూరీ వాజ్ని కృతం తతి’’అని మెచ్చుకొన్నాడు దీని అర్ధం –నెమలి చేసే క్రేంకారం లాంటి మయూరకవి వాక్కు నీచ కవులు అనే  విష సర్పాల చెవి సోకగానే వాళ్ళ గర్వాన్ని నశింప జేస్తుంది ‘’’మయూర శతకం లో మొదటి శ్లోకం అందాన్ని చూద్దాం –

‘’జమ్భారీతివ కుమ్భోద్భావమివ దాదాస్సాంద్ర సింధూర  రేణుం –రక్తా సిద్దా ఇవౌఘే రుదయ తటీ దారాద్రవస్య

ఆయాంత్యాతుల్యకాల కమల వన రుచే వారుణోవొ విభూత్యై –భూయాసుర్భా సయం తో భువన మభినవా భానవో భానఃవీయాః’’-

అర్ధం –సూర్య కిరణాలు దేవ గజం అయిన ఐరావతం కుంభ స్థలం నుండి పుట్టిన సింధూరపు ధూళి కమ్మినట్లు కమ్మాయి .అంటే దేవలోకం నుంచి బయల్దేరాయని చెప్పటం .తర్వాత తూర్పు కొండపై ఉన్న గైరికాది వన మూలిక ద్రవాలతో తడిసి యెర్ర బడ్డాయా అన్నట్లున్నాయి .సూర్యుని రాకతో పద్మాలు వికసించి పద్మవనం యొక్క యెర్రని కాంతిని సంతరించుకొన్నాయి .మూడులోకాలను ప్రభావితం చేస్తాయి అని అంతరార్ధం .

మయూరుని సూర్య శతకం సి డి లు లభిస్తున్నాయి .ఇంటర్ నెట్ లోనూ వినచ్చు .వింటే చాలు ఆనందాను భూతి లభిస్తుంది .నమ్మకం ఉంటె ఆరోగ్యమూ సిద్ధిస్తుంది .

మరో కవిని కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-14-ఉయ్యూరు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -31 29 వేణీసంహార నాటక కర్త -భట్ట నారాయణుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -31

29 వేణీసంహార నాటక కర్త -భట్ట నారాయణుడు

భట్ట నారాయణుడు ఏడవ శతాబ్దికవి  అంటారు .550-650 అని చెప్పవచ్చు . ఆయన రాసిన ‘’ వేణీసంహార నాటకం ‘’ వీర రస ప్రధానమై గొప్ప పేరుపొందింది .గంభీరమైన రచన తో సాగి ఉత్కంఠ రేకెత్తిస్తుంది .దీన్ని విశాఖ దత్తుని ముద్రా రాక్షసం తో పోలుస్తారు .రాక్షసం లో స్త్రీ పాత్ర లేదు ఇందులో ద్రౌపది ఉన్నది .అది ముఖ్యమైన భేదం .భట్ట నారాయణుడు కన్యాకుబ్జ బ్రాహ్మణుడు .బెంగాల్ రాజు ఆది సూరుని ఆహ్వానం మేరకు  బెంగాల్ లో స్తిర వాసం ఏర్పరచుకొన్న అయిదుగురు బ్రాహ్మణులలో భట్టు ఒకడు .టాగూర్ వంశ మూల పురుషుడు భట్ట నారాయణుడు అని బావిస్తారు .బెంగాల్ రాజు ఆదిసూరుడు బ్రాహ్మణాభిమాని కనుక ఈ కుటుంబాలను ఆహ్వానించి పోషించాడు .నారాయణుడికి ‘’భట్టు ‘’అనేది బిరుదు వాచకం .అలాగే ‘’మృగ రాజలక్ష్మ’’అనేది, సింహ అనేది కూడా ఇతని బిరుదే .వేణీ సంహారం లో తనను గురించి ఏమీ చెప్పుకోలేదు .ఇతరులు చెప్పింది ,లోకం లో ప్రచారం లో ఉన్న వాటిని బట్టే వివరాలు తెలిశాయి .వామనుడు వేణీ సంహారం నుంచి కొన్ని ఉదాహరణలిచ్చాడు .దండి కూడా భట్టును గురించి రాశాడు .కనుక వీరిద్దరికంటె ముందువాడు అని  నిర్ణ యించారు .భట్టు మూడు రచనలు చేశాడని దండి అన్నప్పటికీ వేణీసంహారం ఒక్కటే లభించింది .వేణీ సంహారం అనేదానికి పెద్దలు –జుట్టు ముడి వేయటం కోసం సంహారం అని ,వేణి వలన జరిగిన కౌరవ సంహారం అని ,వేణికి సంహారం అంటే జుట్టుకు నివృత్తి అని అర్ధాలు చెప్పారు .ఇందులో మొదటిదే బాగా ఉందనిపిస్తుంది

వేణీసంహారం లో భట్టు కవితా పట్టు

వేణీసంహార నాటకం మహా భారత ఇతి వృత్తం .  .వేణి అంటే జడ .ఇందులో ఆరు  అంకాలున్నాయి .ప్రధమాం కం లో శ్రీకృష్ణుని కౌరవుల వద్దకు రాయ బారిగా ధర్మ రాజు పంపి సంధి చేయమని కోరటం భీమ ద్రౌపదులకు ఇష్టం ఉండదు .సహదేవుడు భీముడిని శాంత చిత్తుని చేస్తాడు .కాని నిండుసభలో పాండవ రాజ పత్నియైన ద్రౌపది  తీవ్ర అవమానం పొందటం హృదయ శల్యం గా భావించి భీముడిని రెచ్చ గొట్టే ప్రసంగం చేసి అతనిలోని పౌరుషాగ్నిని రగుల్గొల్పుతుంది .ఈ మాటలకు ఉద్రేకం, ఉత్తేజం పొందిన భీముడు తన గద తో దుర్యోధనుడి తొడలను విరుగ గొట్టి ,దుశ్శాసనుడి వక్షస్తలాన్ని చీల్చి రక్తం తాగి ,ఆ రక్తం తో తడిసిన చేతులతో ద్రౌపది కేశ పాశాన్ని ముడుస్తాను అని ఘోర ,భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. ద్రౌపది దీనితో శాంతిస్తుంది .విఫలమైన సందిరాయబారం తో వికల మనస్కుడై కృష్ణుడు అప్పుడే తిరిగి వస్తాడు .ధర్మ రాజు ఇక గత్యంతరం లేక కురుక్షేత్ర సంగ్రామానికి పూనుకొనగా భీముడు రెట్టించిన ఉత్సాహం తో యుద్ధ భూమిలో ప్రవేశిస్తాడు .

రెండవ అంకం లో దుర్యోధనుడి భార్య భానుమతికి  నూరు పాములను ఒక ముంగిస చంపి నట్లు కల వచ్చి కీడు ను శంకించి కలవర పడుతుంది  .శాంతికోసం సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తుంది .దుర్యోధనుడు వచ్చి భార్యను ఓదారుస్తాడు  .భార్య భర్తలు ప్రేమ సాగిస్తారు .జయద్రదుడి తల్లివచ్చి తనకొడుకును అర్జునుడు చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వార్త తెలియ జేస్తుంది .గాంధారీ పుత్రుడు యుద్ధానికి వెడతాడు .

మూడో అంకం లో ద్రుస్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపుతాడు .ఈ వార్త ద్రోణ సుతుడు ఆశ్వతామకు తెలిసి క్రోధం తో ఉడికి పోతుంటే మేన మామ కృపుడు ఊరడించి దుర్యోధనుడి దగ్గరకు తీసుకుకొని వెళ్లి మేనల్లుడిని సేనాపతిని చేయమంటాడు .అంతకు ముందే కర్ణుడిని చేస్తానని ఆతను మాట ఇచ్చానంటాడు .కర్ణ ఆశ్వత్థామల మధ్య తీవ్ర వాదోప వాదాలు నడుస్తాయి రాజు సమక్షం లోనే. కర్ణుడు బతికుండగా తాను  ఆయుధం దాల్చనని ప్రతిజ్ఞ చేస్తాడు ద్రోణ సుతుడు .ఇంతలో భీముడు దుస్శాసనుడిని చంపి వక్షస్థలం చీల్చి నెత్తురు తాగాడన్న వార్తా తెలుస్తుంది .

నాలుగో అంకం లో – కర్ణుడికొడుకు వృష సేనుడు చనిపోయాడని వార్తాహరుడు రాజుకు చెబుతాడు .రెట్టించిన కోపం తో ద్రుత రాష్ట్ర సుతుడు యుద్ధానికి సన్నద్ద మవుతాడు .ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు యుద్ధం వద్దని పాండవులతో సంధి ముద్దు అని హితం చెబుతారు .

ఐదో అంకం -లో భీముడు అర్జునుడు దుర్యోధనుడు ఎక్కడో దాక్కున్న సంగతి తెలిసి వెతుకుతూ ఉంటారు .భీముడిని ద్వంద్వ యుద్ధానికి రమ్మంటాడు రాజు .కాని అర్జుండు కల్పించుకొని ఆపేస్తాడు .ధర్మ రాజు వీరిద్దరిని రమ్మన్న వార్త విని అన్నగారి దగ్గరకు వెళ్ళిపోతారు .అశ్వత్థామ వచ్చి రాజును కలుస్తాడు .

చివరిది అయిన ఆరవ అంకం –కౌరవ పక్షం లో అందరూ యుద్ధం లో చనిపోతారు .దుర్యోధనుడోక్కడే మిగిలాడు .ప్రాణ భీతితో ఒక సరస్సులో దాక్కుంటాడు రాజు .పసికట్టిన భీముడు సరస్సు సమీపానికి వస్తాడు .దుర్యోధనుడు పైకి వచ్చి భీముడితో గదా యుద్ధం చేస్తాడు .ధర్మ రాజు గూఢచారి భీముడి చేతిలో దుర్యోధనుడు చనిపోయినట్లు చెబుతాడు .అందరూ సంతోషిస్తారు. ధర్మ రాజుకు పట్టాభిషేకం ద్రౌపదికి వేణీ సంహారోత్సవానికి సర్వం సిద్ధ చేస్తారు .ఇంతలో దుర్యోధనుడి రాక్షస స్నేహితుడొకడు చార్వాక ముని వేషం లో వచ్చి ద్వంద్వ యుద్ధం లో భీముడు నిహతుడైనట్లు వార్త చెపుతాడు .ఇది వరకు తానూ చేసిన ప్రతిజ్ఞా ప్రకారం ధర్మ రాజు మరణ ప్రయత్నం చేస్తాడు .ఈలోగా ఒళ్ళంతా రక్త ప్రవాహం తో తడిసి అలసిన  భీకర రూపం లో భీముడు  రంగ ప్రవేశం చేస్తాడు .అతడే దుర్యోధనుడు అనుకోని యుదిస్థిరుడు యుద్ధం చేయటానికి సిద్ధమవుతాడు .కాసేపటికి రక్తం ఓడుతున్నవాడు దుర్యోధనుడిని చంపిన భీముడుగా అందరూ గుర్తిస్తారు .భీముడు  దుశ్శాసన రక్తం తో నిండిన చేతులతో ద్రౌపదీ దేవి వేణి కి పూసి కురులను ముడిచి వేణీ సంహారం చేస్తాడు ,శ్రీకృష్ణుడు వచ్చి భరత వాక్యం పలుకుతాడు .

వేణి లో నారాయణ భట్టు నాటక రీతి

భారత యుద్ధ క్లైమాక్స్ ఘట్టాలను ఎన్నుకొని ,నాటకీయతను పోషించి మంచి ఉత్సుకతను నింపాడు వేణీ సంహారం లో కవి భట్ట నారాయణుడు .నాటక భాగాలైన సంధి దాని అంగాలను చక్కగా వినియోగించుకోన్నాడని విమర్శక ప్రశంసలు పొందాడు .ధనుంజయ ,విశ్వనాధ మొదలైన నాటక లక్షణ కారులు ఈ నాటకాన్ని చాలా చోట్ల ఉదాహరించారంటే దాని ప్రతిభ ఏమిటో అర్ధమవుతుంది .ఇందులో వేణీసంహారానికే ప్రాధాన్యత నిచ్చి రాశాడు .యుద్ధ ఫలితం అయిన పాండవ రాజ్య ప్రాప్తికి అంత ప్రాధాన్య మీయ లేదు .ఫల ప్రాప్తి నిర్వహణ లో బహుముఖీన ప్రజ్న చూపాడుకవి .మొదటి అంకం లో ముఖ సంధి ద్వితీయం లో ప్రతిముఖ సంధి తర్వాత గర్భ సంధి చివర అవముఖ సంధి లను భట్టు నిర్వహించాడని తెలుస్తోంది .యుద్ధ ఫలితం చివరి అంకం లో డోలాంన్దోళనం లో కాసేపు పడేశాడు చార్వాక రాకతో .కనుక ఫలాపేక్ష అనిశ్చితం అనిపిస్తుంది .టెంపో సృష్టించి కుతూహలం పెంచి కధను నడిపాడు .దుర్యోధనుడు చచ్చాడనిఒక సారి ,కాదు, భీముడే అసువులు బాశాడనిఒక సారి ప్రేక్షకులు భావించే సస్పెన్స్ మెయింటైన్ చేశాడు కవి .అలాగే ఇంకోమలుపు –వస్తున్న భీముడే దుర్యోధనుడనుకొని ధర్మ రాజు రెచ్చిపోయి యుద్ధానికి దిగటం నాటకీయ పరాకాష్ట అనిపిస్తుంది .వీటినన్నిటినీ అద్భుత భయానక భీభాత్సాలతో ఆశ్చర్యాలతో నిర్వహించిన భట్ట బాణుడి నాటక నిర్వహణ తీరుకు హాట్స్ ఆఫ్ అన  బుద్ధి వేస్తుంది .

ఇంతబాగా నాటకం ఉన్నా ఇందులో కొన్ని లోపాలూ ఉన్నాయి .సన్నివేశాలు వేగం గా నిర్వహింప బడలేదు కృత్రిమ సంఘటనలు ఆకట్టుకోలేదు సుదర్శ కుడు అనే చార్వాక  సంభాషణ ‘’సుదీర్ఘ సుత్తి’’ అనిపిస్తుంది .వర్ణనలు సాగదీయటం తో గమనం మంద గించింది .కాని ఈ నాటకం లో శైలిని ‘’రసాభాస ‘’అన్నారు .ఇది పాత్రల చిత్రణకు దోహద పడింది .ఈ దృష్టిలో ఇది శ్రేష్టమైన నాటకం అనిపించింది .సందట్లో సడేమియా అన్నట్లు యుద్ధం లో దుర్యోధనుడు భార్యతో ప్రేమకలాపం చేయటం ఎబ్బెట్టు,అనౌచిత్యం  అనిపించి ‘’దా.వీ .శూ.కర్ణ ‘’(దాన వీర శూర కర్ణ )లో దుర్యోధన ‘’ఎన్టిఆర్,’’ భానుమతి ‘’ప్రభ’’ తో పాడిన డ్యూయెట్ గుర్తుకొస్తుంది .దీన్ని ‘’ముమ్మటుడు ‘’కూడా అధిక్షేపించాడు .మనకే అలా ఉంటె ఆయనకు ఉండటం లో ఆశ్చర్యమేముంది?భానుమతి స్వప్నం షేక్స్పియర్ నాటకం జూలియస్ సీజర్ భార్య కల ను జ్ఞాపకం చేస్తుందన్నారు .కవిత్వ పరం గా వేణి సంహారం తొంభై మార్కులు సాధించినా నాటక కళా ధర్మం ప్రకారం ‘’అత్తెసరు మార్కులు ‘’అంటే పాస్ మార్కులే పొందింది .వీర రసం కోసం వాడిన దీర్ఘ సమాసాలు క్లిస్ట పదాలు ప్రేక్షకులకు కొరుకుడు పడవు .

భట్టు శైలి హృదయ గతం మనోగతం కాదు అదేపెద్ద లోపం వాచ్యార్ధమైన శైలి .మన ‘’పరుచూరి బ్రదర్స్ రకం’’ అన్నమాట .ఇన్ని లోపాలున్నా  వేణీ సంహార నాటకాన్ని సంస్కృత నాటకాలలో విశిస్ట నాటకం గానే భావిస్తారు .శృంగారాన్ని అంగాంగం లో పూసి వదిలిన నాటకాల కంటే భిన్నం గా  వీరానికి ‘’ వీర తాళ్ళు’’ వేసి రంజించే ప్రయత్నం చేసి వినూత్న మార్గానికి దారి వేశాడు భట్ట బాణుడు .ఈ గొడవ ఇలా ఉంటె ఇందులో నాయకుడు ఎవరు అనే ప్రశ్న వేసుకొని విమర్శకులు బుర్రలు బద్దలు చేసుకొన్నారు .ధర్మ రాజే అన్నారు .భారత వాక్యం ద్వారా ఫల ప్రాప్తి పొందాడుకనుక ఆయనేనన్నారు .కవికికూడా ఇది ఇస్టమేనన్నట్లు కధాగమనం వలన అర్ధం అవుతుంది .

ఇది కుదరదు –మొదటి అంకం లో ప్రతిజ్ఞ చేసి చివరి అంకం దాకా కదా నడిపించి అన్నదమ్ములిద్దర్నీ చంపి రక్తం తాగి తొడలు విరగ్గొట్టి ద్రౌపదికి  వేణీసంహారం చేసింది భేముడే కనుక రియల్ హీరో ఆయనే అన్నారుకొందరు .ఫల ప్రాప్తి కలిగించిన వాడు భీముడు ఫల భోక్త ధర్మ రాజు .ప్రధాన సాధకుడు భీముడు ..సాధన ఫలాన్ని పొందిన వాడు పెద్దన్న యుదిస్థిరుడు .కనుక భీముడికే హీరో గా ఎక్కువ మార్కులు .ఇక్కడ ముద్రా రాక్షస నాటకాన్ని దీనీతో పోలుస్తున్నారు అక్కడ చాణక్యుడు కార్య సాధకుడు ,చంద్ర గుప్త మౌర్యుడు ఫల భోక్త .అక్కడ చాణక్యుడు ఇందులో భీముడు తిరుగు లేని నాయకులు అనుకొంటే సరిపోతుంది .

ధర్మాధికారి ,మహోపాధ్యాయ బిరుదాంకితుడైన ‘’జగద్ధార పండితుడు ‘’వేణీ సంహారానికి గొప్ప వ్యాఖ్యానం రాశాడు . వేణీ సంహారాన్ని వడ్డాది సుబ్బరాయ కవి తెలుగు లోకిఅందమైన  కందపద్యాలలో అనువాదం చేశారు . దీన్ని చిలక మర్తి వారికి చదివి వినిపించారట వ సు కవి .ఏంతో బాగుందని మెచ్చి ఆశువుగా –‘’వేణీ సంహారంబును –వాణీ ధవ తుల్యుడైన  వసురాయడు తా—నాణేముగా తెనిగించెను –ప్రాణంబులు లేచి వచ్చు పద్యము విన్నన్ ‘’అని మెచ్చుకున్నారు .వసురాయని వేణీ సంహార అనువాద పద్య గద్యాలను రంగ స్థలం పై పఠించేవారట.

వేణీ సంహారం కొన్ని అద్భుత శ్లోకాలను చూద్దాం .భట్టు వైవిధ్యమైన ఛందస్సును వాడాడు .పద్యా వక్త్రం ,లలితా ,ఔప చ్చ్చందసిక ,ఆర్యా ,ద్రుత విలంబిత ,ప్రహర్షిని ,పృధ్వీ ఛందస్సులను మామూలు వాటితో పాటు సందర్భోచితం గా ఉపయోగించి రక్తికట్టించాడు .

‘’చంచద్భుజ భ్రమిత చండ గదాభి ఘాత-సంచూర్నితోరుయుగళస్య సుయోధనస్య

స్యానవ నద్ద ఘన శోణిత సిక్త పాణి –రుత్తం సయిష్యతి కచాస్తవ దేవి భీమః ‘’-దీని అర్ధం –‘’వేగం గా కదిలే భుజాల చండ గదయొక్క దెబ్బలతో ముక్కలైన తోడలుకల సుయోధనుడి రక్తం తో పూసుకొన్న చేతులతో భీముడు నీ సిగను ముడి వేస్తాడు ‘’అని భీముడు ద్రౌపదికి చేసిన ప్రతిజ్ఞ ఇది .వసంత తిలక వృత్తం లో వీర రసస్పోరకం గా భట్టు రాసిన శ్లోకాన్ని అందరూ ఉదాహరిస్తారు .ఇది మన నన్నయ్య గారు భరతం లో భీమునితో నిండు సభలో ‘’అమ్భోరు నిజోరు దేశమున పంచిన ఇద్దురాత్ము చందా ఘదాహతిన్ భగ్నోరు తరోరు జేసెద యుగ్ర రణాంతరంబునన్ ‘’’ ‘’అనిపించిన పద్యం గుర్తుకు తెస్తుంది .భట్టు తనను ‘’కవి మృగ రాజు ‘’అంటే’’ కవి సింహం ‘’అని పిలుచుకొన్నాడు .మాఘుదడిలాగా విలక్షణమైన వినూత్న, పదాలను ఉపయోగించాడు భట్టు .’’కొణాఘాతమ్ ‘’అనే శబ్ద ప్రయోగం యుద్ధ సందర్భం లో చేశాడు .అంటే లక్ష ధక్కలు ,వెయ్యి భేరులు ఒకే సారి మోగితే వచ్చే శబ్దం అని అర్ధంట .కరభం అనే శబ్దాన్ని వాడాడు అంటే –మణికట్టు నుంచి చిటికెన వేలి వరకు ఉన్న భాగమట.తొడలు కలిగినదీ అనే అర్ధం కూడా ఉందట .

నాటకం లో హాస్యం పండించే విదూషక పాత్ర లేకుండా రాశాడు భట్టు .కాల వస్తు ,సమయ నటన ఐక్యతలు లేవని పాశ్చాత్య విమర్శకులు విల్సన్ ,బారువాలు ఎత్తి చూపారు .దుర్యోధనుడు భానుమతితో సరసాలు  ఆడుతుంటే ద్వారపాలకుడు ఒక్కసారిగా ప్రవేశించి ‘’భగ్నం భగ్నం ‘’అని అరుస్తాడు .అంటే ఆ గది బయట దుర్యోధనుడి రాజధ్వజం పెనుగాలికి విరిగి ఊడి పడిందని అర్ధం .ఈ సన్నివేశ కల్పనా అతనికి జరుగ బోయే కీడుకు సంకేతం గా కవి చెప్పించాడు .నాటక ప్రస్తావనలో  ధార్తరాస్త్రులు’’ అనే శబ్దాన్ని  హంసలకు,కౌరవులకు చక్కగా అన్వయించే గొప్ప శ్లోకం  చెప్పాడు .

మరో కవిని దర్శిద్దాం

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘వేదాలను రక్షిస్తేనే లోక కల్యాణం ”అన్న కంచి స్వామి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత్ లో” విద్యార్ధికి” పాకిస్తాన్ లో ”మలాలా ”కు నోబెల్ శాంతి పురస్కా

 

సమాజంలో మార్పు రావాలి

నోబెల్‌ విజేతల మనోగతం

మానవ హక్కుల రంగం గురించి కొద్దొ గొప్పొ తెలిసిన వారికి పరిచయం అవసరం లేని పేరు కైలాష్‌ సత్యార్థి. వృత్తిరీత్యా ఎలకి్ట్రకల్‌ ఇంజనీర్‌ అయిన సత్యార్థి దాదాపు మూడు దశాబ్దాల క్రితం బచపన్‌ బచావో ఆందోళన్‌ సంస్థను ప్రారంభించారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించటం, వెట్టిచాకిరి కోసం బాలలను ఇతర దేశాలకు తరలించటం వంటి దురాగతాలను అరికట్టడానికి ఈ సంస్థ నిర్విరామంగా కృషి చేస్తోంది. సత్యార్థికి నోబెల్‌ బహుమతిని ప్రకటించిన నేపథ్యంలో- ఆయనతో గతంలో చేసిన ఒక ఇంటర్వ్యూలోని భాగాలు..
బచపన్‌ బచాబో ఆందోళన్‌ను ప్రారంభించటానికి మీకు స్ఫూర్తి?
బాలల హక్కులకు సంబంధించిన అంశాలపై నాకు చిన్నప్పటి నుంచి మక్కువ ఎక్కువ. అయితే వయస్సు, అనుభవం వస్తున్న కొద్ది- ఒక వ్యక్తి సమాజంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకురాలేడని అర్థమయింది. ఇలాంటి మార్పు రావాలంటే భావసారూప్యత కలిగిన వ్యక్తులు ఒక సంస్థగా ఏర్పడాలి. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి. బాలకార్మిక వ్యవస్థ ఒక చట్టపరమైన అంశమో, సాంకేతికపరమైన అంశమో, ఆర్థికపరమైన అంశమో కాదు. అన్నింటినీ కలగలిపిన అంశమిది. దీనిని రూపుమాపాలంటే సమాజంలో ఒక మార్పు రావాలి.
వెట్టి చాకిరిలో మన దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి?
ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది పిల్లలను తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పిల్లలు 5 కోట్ల మంది ఉన్నారనేది ఒక అంచనా. వీరిలో వెట్టిచాకిరి చేసేవారు కోటి మంది దాకా ఉంటే మిగిలిన వారంతా బాలకార్మికులు.
ఏ రాషా్ట్రల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది?
ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌- ఇలా పెద్ద పట్టణాలకు పిల్లలను తరలిస్తున్నారు. ఇక్కడకు వచ్చే పిల్లలు బీహార్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిషా, పశ్చిమబెంగాల్‌లకు చెందినవారు.
దక్షిణాసియాలో ఎలా ఉంది?
బాలకార్మికులకు సంబంధించి మన దేశంలో కఠినమైన చట్టాలు లేవు. కొన్ని చట్టాలు ఉన్నా- ప్రభుత్వాధికారులు వాటిని అమలు చేయరు. తమ దగ్గర బాలకార్మిక వ్యవస్థ ఉందని చెబితే- చెడ్డపేరు వస్తుందని వారు భయపడుతూ ఉంటారు. రాజకీయనాయకులు ఈ విషయంపై పెద్ద శ్రద్ధ పెట్టరు.

Related News
చావుని జయించి చదువుకున్నా

మహిళలు చదువుకోకూడదు. బురఖాలు వేసుకోకుండా బయటకి రాకూడదు. కనీసం నెయిల్‌ పాలిష్‌ కూడా వేసుకోకూడదు… తాలిబన్‌ ఫత్వాలివి. ఇస్లాం అందరికి సమాన హక్కులిచ్చింది. నేను చదువుకుంటే ఏమవుతుంది? బురఖా వేసుకోకుండా స్కూలుకు వెళ్తే ఏం చేస్తారు?- అని ఒక పన్నెండేళ్ల పిల్ల ప్రశ్నించింది. అగ్రరాజ్యం అమెరికాను సైతం గడగడలాడించిన తాలిబన్‌ ఈ ప్రశ్నలకు నివ్వెరపోయింది. ఏం చెప్పాలో తెలియక ఆమెపై బులెట్ల వర్షం కురిపించింది. కాని ఆ పిల్ల బులెట్లను సైతం తట్టుకొంది. దాడి జరిగిన ఏడాది లోపునే ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొంది. ఇప్పుడు అతి చిన్న వయస్సులో నోబెల్‌ శాంతి బహుమతిని పొందిన వ్యక్తిగా చరిత్రకెక్కింది. ఆమె పేరు మలాలా. ఆమె ఆత్మకథే ‘ఐయామ్‌ మలాలా’. గతంలో ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను ‘ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం’ ప్రచురించింది. ఆ కథనమే ఇది..

గోళ్లకు రంగు వేసుకుంటే కొరడా దెబ్బ
గ్రామంలో మహిళల జీవితం అనేక కట్టుబాట్ల మధ్య నడిచేది. మహిళలు బురఖా వేసుకోకుండా బయటకు రాకూడదు. సన్నిహిత బంధువులతో తప్ప ఇతర పురుషులతో మాట్లాడకూడదు. నేను టీనేజర్‌ను అయిన తర్వాత కూడా బురఖా వేసుకొనేదాన్ని కాదు. దీనితో మా బంధువులకు చాలా కోపంగా ఉండేది. మా తెగలో మహిళలను సరిగ్గా చూసేవారు కాదు. వారికి చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేవారు. కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఎవరితోనైనా ప్రేమలో పడితే- నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. ఇలాంటి వాటితో పాటుగా- మా తెగలో స్వర అనే ఒక సంప్రదాయముండేది. మాకు, వేరే తెగవారికి మధ్య తగువు వస్తే- దానిని పరిష్కరించుకోవటానికి ఒక అమ్మాయిని ఆ తెగ వారికి ఇచ్చేసేవారు. ఆ తెగలో పురుషులు ఆ అమ్మాయిని తమ సుఖాలకు వాడుకొనేవారు. ఈ ఆచారాన్ని ప్రభుత్వం నిషేధించింది. కాని అనధికారికంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పస్థూన్‌ సంప్రదాయం ప్రకారం- . ఇలాంటి వాటి వల్ల మహిళలు నష్టపోతున్నారని చాలా సార్లు మా నాన్నతో వాదించేదాన్ని. గతంలో పరిస్థితులు మరింత కఠినంగా ఉండేవని చెప్పేవాడు నాన్న. తాలిబన్లు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రకరకాల చట్టాలు చేశారు. మహిళలు నవ్వటాన్ని నిషేధించారు. తెల్ల రంగు పురుషులకు మాత్రమే చెందుతుందని ప్రకటించి- మహిళలు తెల్ల బూట్లు వేసుకోవటాన్ని నిషేధించారు. గోళ్ల రంగు వేసుకుంటే కొరడాతో కొట్టేవారు. ఇలాంటివన్నీ నాన్న చెబుతున్నప్పుడు నా ఒళ్లు భయంతో జలదరించేది.

అర్థరాత్రి పుట్టిన దేశం నాది. మధ్యాహ్నం నేను మరణానికి చేరువయ్యాను..
ఏడాది క్రితం.. నేను ఇంటి నుంచి స్కూలుకు వెళ్లా. మళ్లీ ఇప్పటి దాకా నేను మా ఇంటికి తిరిగి వెళ్లలేదు. నన్ను తాలిబన్లు బుల్లెట్లతో కాల్చారు. కొందరు నేను మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లనన్నారు. కాని ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వెళ్తానని నా మనసుకు తెలుసు. మనం ఎంతగానో ప్రేమించిన దేశాన్ని వదిలి వెళ్లాలని ఎవరూ అనుకోరు. నేనూ అంతే! ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే కళ్లు తెరిచి చూస్తా. నా స్వదేశం నుంచి ఐదు గంటల దూరంలో ఉన్నాననే సత్యం ఒక్కసారిగా గుర్తుకొస్తుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న వసతులతో పోలిస్తే నా దేశం వందల ఏళ్లు వెనకబడి ఉంది. సుఖవంతమైన జీవితానికి అవసరమైనవన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రతి కుళాయి నుంచి వేన్నీళ్లు, చన్నీళ్లు వస్తాయి. స్విచ్‌ వేసిన వెంటనే లైట్లు వెలుగుతాయి. చమురు దీపాల అవసరమే ఉండదు. బజారు నుంచి గ్యాస్‌ సిలిండర్లు తేవాల్సిన అవసరముండదు. ఇక్కడ మన తిండి కూడా ప్యాకెట్లలో తినటానికి రెడీగా ఉంటుంది. కిటికీలో నుంచి బయటకు చూస్తే పెద్ద పెద్ద భవంతులు కనబడతాయి. నల్లటి రోడ్ల మీద వాహనాలు ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటాయి. మరో వైపు చూస్తే లాన్లు కనిపిస్తాయి. కానీ నా కళ్లు మూసుకుంటే- స్వాట్‌ వ్యాలీ- కళ్ల ముందు కనిపిస్తుంది. ఒక వైపు మంచు కొండలు… మరో వైపు పచ్చని చెట్లు… వేగంగా ప్రవహించే నదులు… ఇవన్నీ గుర్తుకొస్తే నా మనసు పులకించిపోతుంది. నా స్కూలు గుర్తుకొస్తుంది. నా స్నేహితురాలు మోనిబా కళ్లముందు కదులుతుంది.
కాని నేను లండన్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉన్నది నిజం. కల చెదిరిపోతుంది.
ఆ రోజు మర్చిపోలేను..
2012, అక్టోబర్‌ 9. నా జీవితం మారిపోయిన రోజు. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి. వాస్తవానికి నాకు పరీక్షలంటే భయం లేదు. స్వాట్‌ వ్యాలీలో తాలిబన్ల పాలన తర్వాత స్కూలు బోర్డులన్నీ మాయమైపోయాయి. బయట నుంచి చూస్తే లోపల స్కూలు ఉందనే విషయం కూడా తెలియదు. నాలాంటి అమ్మాయిలకు స్కూలు ఒక వేరే ప్రపంచం. అప్పటి దాకా మా ముఖాలను కప్పి ఉంచిన స్కార్ఫ్‌లన్నీ మాయమైపోతాయి. మేము మా గ్రౌండ్‌లోకి వస్తాం. పైన ఆకాశం.. చుట్టూ పర్వతాలు.. మధ్యలో మేము. ఒక అమ్మాయి ‘ఆసాన్‌ భాష్‌’ (స్టాండ్‌ ఎట్‌ ఈజ్‌) అని అరుస్తుంది. మేము మా కాళ్లను నేలకు వేసి కొడతాం. ‘అల్లా’ అని అరుస్తాం. ఆ తర్వాత ఆమె ‘హోషియార్‌’ (అటెన్షన్‌) అని అరుస్తుంది. మేమందరం మళ్లీ అల్లా అని అరుస్తాం. ఆ స్కూలును నేను పుట్టకముందు మా నాన్న స్థాపించాడు. గ్రౌండ్‌కు ఎదురుగా ఉన్న గోడ మీద ‘కుషాల్‌ స్కూల్‌’ అని పెద్ద పెద్ద అక్షరాల్లో రాసి ఉంటుంది. మేము వారానికి ఆరు రోజులు స్కూలుకు వెళ్తాం. ఉర్దూ గ్రామర్‌ చదువుతాం. ఇంగ్లీషులో స్టోరీలు రాయటానికి ప్రయత్నిస్తాం. నా స్నేహితుల్లో చాలామందికి డాక్టర్‌ కావాలనేది ఒక కల. వారు డాక్టర్లు కావటం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. కాని స్కూలు బయట చాలా మంది అలా అనుకోరు. స్వాట్‌ వ్యాలీలోని ప్రధాన నగరమైన మింగోరాకు చెందిన కొందరికి, తాలిబన్‌లకు అమ్మాయిలు చదువుకోవటం ఇష్టం లేదు.
ఆ రోజు కూడా మామూలుగానే ప్రారంభమయింది. పరీక్ష మాత్రం ఒక గంట ఆలస్యంగా మొదలయింది. ఉదయాన్నే నాన్న ప్రతి రోజు మాదిరిగానే ‘టైం అయిపోయింది..జానేమన్‌’ అని లేపాడు. ‘కొద్దిసేపు పడుకోనీ..అబ్బా’ అన్నా. ఆ తర్వాత అమ్మ వచ్చి ‘పిషో’ అని గట్టిగా అరిచింది. పర్షియన్‌లో పిషో అంటే పిల్లి అని అర్థం. అమ్మ నాకు పెట్టిన ముద్దు పేరిది. ‘‘బాబీ..లేటు అయింది..’’ అని గట్టిగా అరిచా. మా సంస్కృతిలో మగవాళ్లందరిని సోదరులని పిలుస్తాం. అమ్మను ఏడిపించాలంటే అప్పుడప్పుడు నేను కూడా అలా పిలుస్తూ ఉంటా. మా ఇంటి ముందు ఒక రూమ్‌ ఉంది. ఆ రూమ్‌లో ఒక బెడ్‌, ఒక బీరువా ఉంటుంది. ఈ ఫర్నిచర్‌ను నేనే కొన్నా. స్వాట్‌ వ్యాలీలో శాంతి కోసం ప్రచారం చేసినందుకు, ఆడపిల్లలు స్కూలుకు వెళ్లాలని ప్రచారం చేసినందుకు నాకు వచ్చిన అవార్డుల ద్వారా ఈ ఫర్నిచర్‌ కొన్నాను. స్కూలు మా ఇంటికి దగ్గరలోనే ఉంది. గతంలో నడిచే వెళ్లేదాన్ని. తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత బస్సులో వెళ్ళాల్సి వచ్చేది. బస్సులో వెళ్తే ఐదు నిమిషాలు పడుతుందంతే. నాకు బస్సులో వెళ్లడమంటే ఇష్టం. బస్సు డ్రైవర్‌ ఉస్మాన్‌ అలీని ‘భాయిజాన్‌’(సోదరుడు) అని పిలుస్తాం. అతను రకరకాల కథలు చెప్పి మమల్ని నవ్విస్తుంటాడు. నేను బస్సులో వెళ్లటానికి మరో కారణం ఉంది. ఏడాది నుంచి నాకు పత్రికల్లో వార్తల రూపంలో తాలిబన్ల నుంచి కొన్ని బెదిరింపులు వచ్చాయి. చిన్న చిన్న చీటీల మీద బెదిరింపులు రాసి గుర్తు తెలియని వ్యక్తులు నా మీద విసిరేవారు. దీనితో మా అమ్మ నన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ నడిచి స్కూలుకు వెళ్లనిచ్చేది కాదు. తాలిబన్లు ఎప్పుడు మహిళలను లక్ష్యంగా చేసుకోలేదు. అందువల్ల నేను పెద్దగా భయపడలేదు. మా నాన్నపై దాడి చేస్తారనే భయం మాత్రం ఉంది. మా నాన్న తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. అందుకే వాళ్లు నాన్న స్నేహితుడు జహీద్‌ఖాన్‌ను నుదుటి మీద కాల్చి చంపేశారు. మసీదుకు ప్రార్థనలకు వెళ్తున్న సమయంలో అందరూ నాన్నను- ‘‘జాగ్రత్తగా ఉండు.. ఇక నీ వంతే’’ అని హెచ్చరిస్తుండేవారు. ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు భయమేసేది.
మా వీధిలోకి బస్సు రాదు. అందువల్ల వీధి చివరే బస్సు దిగి ఇంటికి నడిచివచ్చేదాన్ని. ఎవరైనా దాడి చేస్తే ఇక్కడే చేస్తారని అనుకొనేదాన్ని.

నేను వీధిలో నడుస్తూ ఉంటే హఠాత్తుగా ఒక టెర్రరిస్టు నా మీదకు దూకి కాల్చేసినట్లు కలలు వచ్చేవి. ఆ సమయంలో ఏం చేయాలని ఆలోచించేదాన్ని. కాలికి ఉన్న చెప్పు తీసి ఆ టెర్రరిస్టును కొట్టాలనుకొనేదాన్ని. కానీ అలా చేస్తే నాకు, టెర్రరిస్టుకు తేడా ఏముందనిపించేది. దాని కన్నా అతనిని- ‘‘నన్ను కాల్చు. కానీ నేను చెప్పేది విను. నువ్వు చేస్తున్నది తప్పు. నాకు, నీకు ఎలాంటి శతృత్వం లేదు. ప్రతి అమ్మాయి స్కూలుకు వెళ్లాలని నేను అనుకుంటున్నా. అంతకు మించి నాకేం తెలియదు’’ అని ప్రార్థించాలనిపించేది.
రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత గేటు తాళం పెట్టేదాన్ని. చనిపోయిన తర్వాత ఏమవుతుందని ఆలోచిస్తూ పడుకొనేదాన్ని. నా ఆలోచనలన్నీ నా ప్రాణ స్నేహితురాలు మోనిబాకు చెప్పేదాన్ని. నాకు మోనిబా చిన్నప్పటి నుంచి స్నేహితురాలు. జస్టిన్‌బీవర్‌, ట్విలైట్‌ మూవీస్‌ దగ్గర నుంచి ఫేస్‌క్రీమ్‌ల దాకా అన్ని విషయాలు మాట్లాడుకొనేవాళ్లం. మోనిబాకు ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనేది కోరిక. కానీ వాళ్లింట్లో ఒప్పుకోరని తెలుసు. అందువల్ల అందరితోను డాక్టర్‌ అవుతానని చెబుతుండేది. మా సమాజంలో అమ్మాయిలు టీచర్లు కావాలి. లేదా డాక్టర్లు కావాలి. ఇతర వృత్తుల్లో చేరటానికి అవకాశమే ఉండదు. నాకు చిన్నప్పుడు డాక్టర్‌ కావాలని ఉండేది. ఆ తర్వాత సైంటిస్ట్‌ కావాలనుకున్నా. రాజకీయాల్లోకి వెళ్లాలని ఉండేది. ఈ విషయం చెబితే మోనిబా భయపడింది. తాలిబన్లకు తెలిస్తే చంపేస్తారని హెచ్చరించింది. ‘‘ఏం భయపడకు. మనలాంటి వాళ్ల కోసం తాలిబన్లు బులెట్లు వేస్ట్‌ చేసుకోరు’’ అని ఆమెకు చెప్పా.
ఆ రోజు బస్సు హారన్‌ మోగిన వెంటనే మేమందరం పరిగెత్తుకుంటూ వీధి చివరకు వెళ్లాం. బస్సు అంటే మామూలు బస్సు కాదు. టయోటా టౌన్‌ ఏస్‌ ట్రక్కులో మూడు బెంచీలు వేసి ఉండేవి. దానిలో 20 మంది విద్యార్థులం, ముగ్గురు టీచర్లు కూర్చునేవాళ్లం. నా పక్కనే మోనిబా కూర్చునేది. మా బ్యాగులన్నీ బెంచీల కింద పెట్టేవాళ్లం. ఆ రోజు ఉదయం ఎండగా ఉంది. బస్సు లోపల చాలా ఉక్కగా ఉంది. ట్రక్కు అన్ని వైపులా మూసేసి ఉంది కాబట్టి బయటకు చూడటానికి కూడా లేదు. బయట బాగా ఎండగా ఉందని మాత్రం తెలుస్తోంది. బస్సు కుడివైపునకు తిరగటం మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత అంతా ఒక కలలా జరిగిపోయింది. మాకు కుడివైపు స్వాట్‌ వ్యాలీ తొలి ఆర్థిక మంత్రి షేర్‌ మహ్మద్‌ ఖాన్‌ సమాధి ఉంది. ఎడమ వైపు ఒక ఫ్యాక్టరీ ఉంది. రోడ్డుకు అడ్డంగా లేత రంగు బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చాడు. బస్సును ఆపమని చేతులు ఊపాడు. ‘‘కుషాల్‌ స్కూలు బస్సు ఇదేనా?’’ అని మా డ్రైవర్‌ను అడిగాడు. భాయ్‌జాన్‌ అవునని సమాధానమిచ్చాడు. ‘‘కొంత మంది పిల్లలకు సంబంధించిన సమాచారం కావాలి’’ అని ఆ వ్యక్తి డ్రైవర్‌ను అడిగాడు. ‘‘స్కూలు ఆఫీసులో తెలుసుకోండి’’ అని భాయ్‌జాన్‌ సమాధానమిచ్చాడు. ఒక వైపు అతను మాట్లాడుతుంటే- మరో వైపు ఒక వ్యక్తి బస్సు వెనకవైపు వచ్చాడు. ‘‘ఎవరో జర్నలిస్టు నిన్ను ఇంటర్వ్యూ చేయటం కోసం వస్తున్నాడు..’’ అంది మోనిబా. ఆ వస్తున్న వ్యక్తి మొహానికి రుమాలు కట్టుకున్నాడు. ఒక కాలేజీ స్టూడెంట్‌లా ఉన్నాడు తప్ప జర్నలిస్టులా లేడు. బస్సుపైకి ఎక్కి- ‘‘మలాలా ఎవరు?’’ అని అడిగాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. కాని చాలా మంది నావైపు చూశారు. బస్సు మొత్తం మీద మొహాన్ని కవర్‌ చేసుకొంది నేను ఒక్కదాన్నే. అతను నల్లటి తుపాకీని బయటకు తీసాడు. బస్సులో ఉన్నవారందరూ గట్టిగా అరవటం మొదలుపెట్టారు. నేను మోనిబా చేతిని గట్టిగా పట్టుకున్నా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అతను మూడుసార్లు కాల్చాడని నా స్నేహితులు తర్వాత చెప్పారు. ఒక బుల్లెట్‌ నా కంటిలోపలి నుంచి వెళ్లిపోయింది. మరో బుల్లెట్‌ ఎడమ భుజాన్ని తాకింది. మూడో బుల్లెట్‌ నా ఎడమ చెవికి తగిలింది. నాపక్కన కూర్చున్న షాజియా, కైనాత్‌ రియాజ్‌లకు కూడా బులెట్లు తగిలాయి. కాలుస్తున్న సమయంలో ఆ వ్యక్తి చేతులు వణికాయని నా స్నేహితులు చెప్పారు. నేను ఆసుపత్రికి వెళ్లే సమయానికి మోనిబా ఒళ్లంతా రక్తమే.
అనువాదం : సివిఎల్‌ఎన్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment