రవి కవి రవీంద్ర నాద్ టాగూర్

            రవి కవి
                        రవీంద్ర నాద్ టాగూర్ నూట ఎభైవ జయంతి సంవత్చరం ఇది .విశ్వ కవి గా సుప్రసిద్ధుడైన రవి కవి గురించి మళ్ళీ ఒక సారి జ్ఞాపకం చేసు కొందాం .రవీంద్రుడు 1861  మే నెల ఆరవ తేదిన జన్మించాడు ,తండ్రి మహర్షి దేవేంద్ర నాద టాగూర్ .తాత గారు ద్వారకా నాద్ టాగూర్.రవీంద్రుడు కవి ,కారుణ్య మూర్హి ,తాత్వికుడు ,ధార్మికుడు ,చిత్రకళా మర్మజ్ఞుడు ,నటుడు ,నాటక రచయిత ,కధకుడు ,నవలా కారుడు ,సంగీతజ్ఞుడు,నాట్య శాస్త్ర వేత్త  .అంటే సకల కళా సమగ్ర స్వరూపం .విశ్వ మోహనుడు .పూర్ణ పురుషుడు అంటారు అందుకే .ఆయన చదువు అంతా ఇంటి వద్దే సాగింది .ప్రకృతి ఒడిలో విద్య నేర్చాడు .అందుకే ప్రకృతి అంటే విపరీత మైన మమకారం .పదిహేనవ ఏట ;”;కవిగాద ”,అడవి పూలు” అనే కవితలు రాశాడు .1878 లో బారిస్టర్ చదువు కోసం లండన్ వెళ్ళాడు .౧౮౮౧ లో ;;ప్రభాత గీతికలు ”,సంధ్యా గీతికలు ‘రాశాడు .ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ,దాన్ని నాశనం చేయ టానికి ప్రయత్నిస్తే అది మన మీద ప్రతీకారం తీర్చుకుంటుంది  అనే సందేశం తో ”మానసిని ”రాశాడు .చిత్ర ,తోటమాలి ,వెన్నెల గొప్ప రచనలు .జలియన్ వాలా baagh హత్య సందర్భం గా తనకు ప్రభుత్వం ఇచ్చిన సర్ బిరుదును తిరిగి ఇచ్చేసిన దేశాభిమాని .బ్రిటన్ ,ఫ్రాన్సు మొదలైన దేశాలు పర్య టించి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటిన విశ్వ మానవుడు .1940 లో   ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం డాక్టర్ అఫ్ లెటర్స్ బిరుదు  నిచ్చి సత్కరించింది .గోరా నౌకా భంగం నవలలు మంచి పేరుతెచ్చాయి  .నౌకాభంగం నవలనే ”తెలుగు లో ”చరణ దాసి ”సినిమా గా తీశారు .రామ రావు ,నాగేశ్వర రావు ,అంజలి ,సావిత్రి అందులో నటించారు .
                    రవీంద్రుడు రాసిన ”కాబూలి వాలా ”.పదిక్ చక్రవర్తి  ”మొదలైన నవలలు మంచి ఆదరణ పొందాయి .పాఠ్యాంశాలు గా కూడా వచ్చాయి .రవీంద్రుడు అంటే మనకు గుర్తుకు వచ్చేది గీతాంజలి పద్య కావ్యం .బెంగాలి భాషలో రాశాడు .తరువాత ఆయనే దాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేశాడు .దీనికే 1913 లో సాహిత్యం లో నోబెల్ బహుమతి లభించింది .ప్రపంచం అంతామొదటి  ప్రపంచ యుద్ధ సన్నద్ధం లో వున్నప్పుడు మనిషికి ,మాన వత్వానికి విలువ తగ్గి పోతున్న సమయం లో మనిషి అల్పత్వాన్ని తెలియజేస్తూ ,పరమాత్మ ఔన్నత్యాన్ని ,మనిషి లోని విశ్వాసాన్ని ,ప్రకృతి శోభను ,కళారాదనను ప్రతిబింబించే గీతాంజలి కవితలు శాంతికి ,విశ్వ మానవ సోదరాత్వానికి ,హింసా ,దౌర్జన్యా రాహిత్యానికి ప్రతీకలు గా వుండటం చేత మానవీయ విలువలకు పట్టంకడుతూ నోబెల్ పురస్కారాన్ని అందించారు .
               19 వ ఏటనే ”వాల్మీకి ప్రతిభ ”నాటకం రాశాడు .విసర్జన ,రాజు రాణి ,చిత్రాంగద ,కర్ణ-కుంతి శరదు త్చవ ,ప్రాయశ్చిత్త  , ,పోస్టాఫీస్ ,అనే మనోరంజకమైన నాట కాలు రాశాడు .ముక్త ధార నాటకం లో బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ప్రతినిధి గ రాజు పాత్రను సృష్టించాడు .ఆయనకు చాలా ఇష్టమైన నాటకం ”నటీర్ పూజ ”రవీంద్రుని ”చండాలిక ”నాటకం బుద్ధ భగవానుని కాలమ్ లోని  నిమ్న జాతి స్త్రీ కధ ను అతి రమణీయం గా చిత్రించి ,ఆమెకు భగవాన్ అనుగ్రహంకలిగిన విధానాన్ని అత్యుత్తమం గా చిత్రించాడు .దీనినే ప్రఖ్యాత కూచి  పూడి నాట్యా చార్యులు శ్రీ వెంపటి చిన సత్యం గారు సంగీత నాటకం గా మలచి అద్భుత విజయం సాధించారు .శ్రీమతి శోభా నాయుడు చండాలిక వేషం లో నభూతో గా నటించి మెప్పించారు .సత్యం గారికి ఇది ఎన లేని కీర్తి తెచ్చింది .ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు .
                     రవీంద్రుడు మానసిక శాస్త్రం బాగా తెలిసిన మహా మానవుడు .స్త్ర్రేలకు కావలసిన విద్య బోధించటానికి శాంతి నికేతన్ నిర్మించాడు .అది విశ్వ భారతి గా రూపుదిద్దు   కొంది తరువాత విశ్వ విద్యాలయం అయింది .రవీంద్రుని మరో సృష్టి ”శ్రీ కేతన్ .”ఇందులో నూతన వ్యవసాయ పద్ధతులను ,గ్రామాల పునర్నిర్మానాన్ని నేర్పించాడు .ఆయనది సంస్కృతీ వికాస దృష్టి .దానికి అవిరళ కృషి చేశాడు .అంతర్జాతీయ సౌభ్రాతృత్వం ఆయన ఆశయం .కనుకనే ఆయన్ను మహాపురుషుడని ,యుగ పురుషుడని అంటారు .వంగ కవి సార్వభౌముడు అయినా ,ఆయన భావాలన్నీ విశ్వ వ్యాప్తమైనందున విశ్వ కవి అయాడు .రవీంద్ర సంగీతాన్ని సృష్టించాడు .ఇందులో భారతీయ ,పాశ్చాత్య సంగీతాలను ఫ్యూజన్ చేశాడు పాట ,ఫణితి దేశీయ మైనవి .ఆడుతూ పాడే విధానం .ఇందులో ”ఏక్ ల చల్ ఏక్ ల చల్ ఏక్ లచలోరె ”  అనే పాట అందరికి ప్రేరణ.ముఖ్యం గా ఇందిరా గాంధికి . .అలాగే ఆయన గీతం ”Where the mind is without fear and the head is held high ”అనేది ఒక మహత్తర సందేశమే .పాత్యాంశం గా బోధిస్తూనే వున్నారు .ఇది విశ్వ వ్యాప్త ఆదరణ పొందింది .
                   విల్ డ్యురాంట్ అనే తత్వ వేత్త ”భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వ టానికి రవీంద్రుడు ఒక్కడు చాలు ”అన్నాడంటే ఆయన భారతీయులందరి ప్రతినిధి అని అర్ధమై పోతుంది .అంతటి ఉత్కృష్ట మానవుడు రవీంద్రుడు .రవీంద్ర ,టాగూర్ ,గీతాంజలి పేర్లు తెలిగింట పిల్లలకు పెట్టు కోవటం అలవాటు బాగా వుంది .ఆయన్ను మనం స్వంతం చేసు కున్నాం .
                      విశ్వ భారతి లో ”యత్ర విశ్వం భవతి ఏక నీడం ”అనే సూక్తి రాయించాడు రవి కవి .అంటే అర్ధం ;;ఎక్కడ విశ్వం అంతా ఒకే గూటిలో వుంటుందో ”అని .అంతటి విశ్వ జనీన భావం ఆయనది ఆనాడే ప్రపంచం అంతా ఒక కుగ్రామం (global villege )అవుతుందని ఊహించాడు దార్శనికుడైన రవీంద్రుడు .ఆయన వేషమే రుషి వేషం.అ గడ్డం ,కాంతులు వెదజల్లే ఆ కళ్ళు ,చూస్తె ఒక అలౌకిక వ్యక్తి మనకు కన్పిస్తాడు .ప్రేరణ గా నిలుస్తాడు .రవీంద్రుడు సౌందర్య మూర్తి .రూపం లో ,పలుకు లో ,పాట లో అంతా సౌందర్యమే .ఆయన జీవితమే సౌందర్య మయం రస విహారం అన్నారు ముట్నూరి కృష్ణా రావు గారు .శాంత రసమైన  గాంభీర్యం ,బంగారు కాంతివెదజల్లే వర్చస్సు ,మధుర మంజల రూప సంపదా ,ఓజస్సుప్రదర్శించే ఠీవి ,రమ్య లోకాలను చూపే చిరునవ్వు హృదయానికి పండుగ చేస్తాయి .ఆధునిక మహర్షి చంద్రుడు రవీంద్రుడు .
                         మన జాతీయ గీత రచయిత రవీన్ద్రుడే నని గుర్తు చేయక్కరలేదనుకుంటా .అంతే కాదు బంకిం చంద్ర చటర్జీ రచించిన  ”వందే మాతరం ప్రార్ధనా గీతానికి స్వర రచన చేసింది రవీన్ద్రుడే అని మర్చి పోయి వుంటారు చాలా మంది .ఒక సారి ప్రముఖ బెంగాలి నవలా రచయిత శరత్ బాబును కొందరు పాథకులు ”మీ రచనలు మాకు బాగా .తేలిగ్గా అర్ధమవుతాయి .రవీంద్రుని రచనలు అర్ధం కావటం కష్టం గా వుంది ”అన్నారట ”’.దానికి వెంటనే శరత్ ”నేను మీకోసం రాస్తాను .రవీంద్రుడు మా కోసం రాస్తారు ”అని రవీంద్రుని స్థాయినిగొప్పగా   ఆవిష్కరించాడు .ఒక సారి ఆంద్ర దేశ ప్రముఖ  వైణిక విద్వాంశులు ,పిఠాపురం సంస్థాన సంగీతవిద్వాంసులు   తుమురాడ సంగమేశ్వర శాస్త్రి గారి వీణా వాడనాన్ని గంటల తరబడి వింటూ అలాగే తన్మయులు. అయారట . .శాస్రి గారిని శాంతి నికేతన్ కు తీసుకొని వెళ్లి అందరికి ”శాస్త్రి గారు నా గురువు గారు ”అని ఆనందం గా పరిచయం చేసిన వినయ సంపన్నుడు .శాంతి నికేతన్ లో మన ఆంద్ర ప్రముఖులు రాయప్రోలు సుబ్బా రావు ,బెజవాడ గోపాలరెడ్డి ,సంజీవ దేవ్ లు విద్య నేర్చి న వారే .గాంధీ మహాత్ముడు రవీంద్రుని తన గురువు గా చెప్పుకొన్నారు .రావీన్ద్రుడే గాంధి గారికి ”మహాత్మా ”బిరుదును ఇచ్చారు .”రేఖల్లో నృత్యాని ,రంగుల్లో సంగీతాన్ని ,దర్శించ టం ద్వారా విశ్వ చిత్ర కళా రంగం లో ఆరని జ్వాలా తోరణాన్ని వెలిగించాడు . .రవీంద్రుని చిత్రకళా సాధన -విశ్వ సౌందర్య సాధనే .”అని కీర్తించారు  ప్రముఖ చిత్రకారులు ,రచయిత ,తాత్వికులు ,భావుకులు అయిన స్వర్గీయ  సంజీవ దేవ్ .”విశ్వ కవి ”అనే పేరు ప్రపపంచం మొత్తం మీద ఒక్క రవీన్ద్రునికే వుంది ”అని తేల్చి చెప్పారు ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం .స్వాతంత్ర్య సమర సాధనలో ఎందరో నాయకులకుస్ఫూర్తినీ   ప్రేరణనుఅందించిన   దేశభక్తుడు  రవీంద్రుడు .
                 రవీంద్రునిగీతాంజలి కి   తెలుగు లోనే యాభై కి పైగా అనువాదాలు వచ్చాయి .మరి ఇతరభాషల్లో ఎన్ని వచ్చాయో .అది నిత్య నూతనం గా అని పిస్తుంది ,చదివిన కొద్దీ మళ్ళీ చద వాలి అని పించే  మహోత్కృష్ట రచన .మనిషిని మహోన్నతుని చేసే తపన .ఈపరిధి   దాటి ఇంకో plane లోకి   తీసుకు  వెళ్ళే అమోల్య రచన .అందుకే ”రవీంద్రుని ఆరాధనా దైవం నిఖిల రసామృత మూర్తి అయిన ”విశ్వ మానవుడు ”అన్నారు ముట్నూరి వారు .ఆయన మనిషి కోసం పడే తపన తెలిపే కవితచూడండి .
                ”Into the mouths of these -dumb ,pale ,and meek —We have to infuse the language of the soul
                 Into the hearts of these weary ,worn ,and forlorn —we have to minstrel the hope of humanity ”
                     చివరగా మన కవుల నీరాజనం తో ముగిస్తాను .నారాయణ రెడ్డి గారు రవి కవిని ప్రసంషిస్తూ —
              ”ఒ కవితా రసాలపుం స్కోకిలమా -వ్యాకులమౌ మా జాతికి ,నీ గీతిక -మధుమాస మహోదయమ్ము
               ఎల్లలు దాటి జనించిన షెల్లీ వందురే  కాని –ఆలశ్యముగా పుట్టిన అపర కాళిదాసువు నీవు
               నీవు ప్రభుని చరణమ్ముల నివేదించు గీతాంజలి –నిత్యమూ బీటేట్టిన గుండెల పండించు రసాంజలి ”అన్నారు
                             ఆంద్ర ప్రదేశ్ ఆస్థాన కవి స్వర్గీయ దాశరధి రవీంద్రుని   ప్రస్తుతిస్తూ
                                          ”ఈ లోకమ్మొక  నాకమౌనటుల నీవే చేయగా  జాలెదు ఈ
                                            హాలాహాల మయ ప్రపంచము ,సుధా వ్యాప్తమ్ము  గావింతువు ఈ
                                             వ్యాలా భీల వనమ్ము ,నందన  వన ప్రాయమ్ము గావించి క్రోం
                                             బూలన్ నిండిన పారిజాతములతో పొంగింతువో సత్కవీ !
                                                                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

1 Response to రవి కవి రవీంద్ర నాద్ టాగూర్

  1. Raveendruni smaranamlo mee akshaaraarchana chaalaabaavundi.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.