వేమన ముందున్న రెడ్డి కవులు -రచనలు -2

  వేమన ముందున్న రెడ్డి కవులు -రచనలు -2
                                                                                                                రెడ్డి రాజ్య స్థాపన 
క్రీ.శ.1325 లో పెద కోమటి వేమా రెడ్డి రెడ్డి రాజ్య స్థాపన చేశాడు .కొమర గిరి రెడ్డి ,కాటయ వేమా రెడ్డి ,అనపోతా రెడ్డి ,అన వేమా రెడ్డి మొదలైన వారు రెడ్డి రాజుల్లో పేరు పొందిన వారు .సుమారు వంద సంవత్స రాలు రెడ్డి రాజులు ఆంద్ర దేశాన్ని  పాలించారు.వీరంతా సంస్కృతం లో గ్రంధాలు రచించారు .తెలుగును బాగా నే ఆదరించారు .లక్షణం తో సమన్వయము చేసే కావ్యాలు వీరి తోనే ప్రారంభ మైనాయి .పంటలను పండించే  రెడ్లు ,కవితా ఫలసాయమూ చేసి ,భేష్ అని పించుకొన్నారు .కావ్యకర్తలే కాకుండా ,కావ్య భర్తలూ అయారు .రాచ వేమా రెడ్డి తో రెడ్డి రాజ్యం అంతరించింది .పద్మ నాయక రాజులు తెలంగాణా ప్రాంతాన్ని పాలించే రోజుల్లో ,రెడ్డి రాజులు ఆంద్ర ప్రాంతాన్ని పాలించారు .అద్డంకి,కొండ వీడు ,రాజమండ్రి రాజ దానులుగా రెడ్లు పాలించారు .ఎర్రన ,శ్రీ నాధుడు ,రాయని బాచడుమొదలైన కవులకు ఆశ్రయం కల్పించి ,గ్రంధ రచనలు చేయించి ప్రోత్స హించారు .సంగీతానికి ,నాట్యానికి సమాన స్థాయిని సాహిత్యం తో పాటు కల్పించి చరితార్దు లైనారు రెడ్డి ప్రభువులు .ఎన్నో ధర్మ కార్యాలు చేశారు .వసంతోత్స వాలను నిర్వహించారు .ఆ రోజుల్లో సంగీత ,సాహిత్య ,నాట్య సరస్వతులు అవధుల్లేని ఆనందాన్ని అనుభ వించారు .కళలకు  కాణాచి గా రెడ్డి రాజులు పాలన చేశారు .ప్రజా రంజనే మొదటి కర్తవ్యమ్ గా పాలించిన రెడ్డి రాజులు బహుధా అభి నంద నీయులు .ఇప్పుడు వరుసగా వారి సాహితీ సేవ ను తెలుసు కొందాం .
                                      పెదకోమటి వేమా రెడ్డి 
”పల్లవ త్రినేత్రుడు ”,అనే బిరుదాన్ని అందుకొన్న పెద కోమటి వేమా రెడ్డి రెడ్డి రాజ్యాన్ని సర్వోన్నత స్థితి కి తెచ్చాడు .అద్డంకి ,కొండవీడు ,కొండ పల్లి ,ధాన్య వాటిక లలో దుర్గాలను పటిష్టం గా నిర్మించి ,రాజ్యాన్ని సుస్తిరం చేశాడు .వేగి ,వెలనాటి ,ద్రావిడ బ్రాహ్మణులకు36 అగ్రగారాలను దానం చేసిన మహా దాత .శ్రీ శైలానికి ,ఆహోబిలానికి సోపాన పంక్తులు నిర్మించాడు .ఇవన్నీ శాసనాలలో సాక్ష్యాలు గా కనీ పిస్తున్నాయి .ఈయన ప్రేరణ తోనే ఎర్రన ”హరివంశాన్ని ”రామ కధను రాశాడని తెలుస్తోంది . ఈయనకు ”సర్వజ్ఞ చక్ర వర్తి ”,”వీర నారాయణ ”బిరుదులున్నాయి . తమ్ముడు మాచా రెడ్డి ని కొండపల్లి రాజును చేశాడు .వేమా రెడ్డి కి సంగీతం లో గొప్ప ప్రవేశం ఉంది .”సాహిత్య చింతా మణి ”అనే ఉద్గ్రంధం రాశాడు .ఇది తిరువనంత పురం లైబ్రరీ లో లభిస్తోంది .రావి పాటి త్రిపురాంతక  కవి రాసిన ”ప్రేమాభి రామం ”అనే వీధి నాటకం నుంచి ఒక శ్లోకాన్ని గ్రహించి ”సాహిత్య చింతామణి ”ని వేమా రెడ్డి రాశాడట .ఇది అలంకార శాస్త్ర గ్రంధం .సంస్కృత రచన .”సంగీత చింతా మణి ”అనే గాంధర్వ విద్యా శాస్త్రమూ వేమా రెడ్డి రాశాడు .సంస్కృత ”గాధా సప్త శతి ”కి వివరణ గా ”సప్త శతీ సారాణిక ”రాశాడు .అమరుక శతకానికి ”శృంగార దీపిక ”వ్యాఖ్యనూ రచించాడు .ఈయన చంద వోలు కు రాజుగా ఉన్నప్పుడు శ్రీ నాధుడు వచ్చి నట్లు తెలుస్తోంది .”వేమా రెడ్డి కీర్తి లత శ్రీ శైలం లో స్థిర మూలమై ,కుమారాచలం లో వృద్ధి చెంది ,పంచారామాలలో ,సింహాచలం లలో పందిళ్ళు అల్లి ,శ్రీ కూర్మం ,పురుషోత్తమాలలో పుష్పించి ,కాశీ లో విశ్వ నాదునికి నిత్య నైవేద్యానికి ఫలించింది ”అని శ్రీ నాధ కవి సార్వ భౌముడు అన్న మాట ప్రత్యక్షరసత్యం ..ఈ శ్లోకం ఫిరంగి పురం శాసనం లో ఉంది .
.శ్రీ నాధుడు ”విద్యాధి కారి ”కనుక ,శాసన కర్త కూడా ఆయనే .శ్రీనాధుని ”విద్యాధి కారీ ,శ్రీ నాధో,వీర శ్రీ వేమ భూపతే ” అని చెప్పుకొనే వారు .”శ్రిత పోషణ ,రిపు శోషణ ,బుధ తోషణ ,సత్య భాషాది గుణాన్ ,దధతే దశరధ రామః -ప్రాగద్య కలౌతు ,కోమటి విభు వేమా ”అని వేమా రెడ్డి కీర్తింప బడ్డాడు .ఈ రాజు కాశీ ,రామేశ్వ రాలను సందర్శించి నట్లు సాక్ష్యాలున్నాయి .”సముద్ర రిపు వీర, రాజ వేశ్యా భుజంగ ,అతుల భీమ ,పెద కొమటన్నయ వేమా ”అని ప్రస్తుతింప బడ్డాడు .కొండ వీడు ”ముగ్గురు రాజులకును ,మోహంబు గలిగించు కొమర మించిన వీడు ”కీర్తి పొందింది .వేమారెడ్డి ఇరవై ఏళ్ళు పాలించాడు .క్రీ.శ.1400 లో రాజ్యానికి వచ్చి ,1420లో చని పోయాడు .చివరి కాలం లో గజపతులు ,విద్యా నగర రాజు ,రాజమండ్రి రెడ్డి రాజులూ ,వెలుగోటి వేమ రాజుల చుట్టు ముట్టారు .మాచర్ల వెలమ రాజు వెలుగోటి మాదయ లింగమనేడు వేమా రెడ్డి నిఓడించి ”సంది కంత పోత రాజు ”అనే వేమా రెడ్డి గారి కటారి ని తీసుకొని పోయాడట . వేమా రెడ్డి బొమ్మను లింగమ నేడు తన ఎడమ కాలిగండ పెండేరానికి కట్టు కొని అవమాన పరచాడు .అప్పుడు కవి సార్వ భౌముడు శ్రీ నాధుడు లింగమ నేడు ఆస్థానికి వెళ్లి ,తన కవితా ధారతో ప్రసన్నం చేసుకొని ,అతన్ని అర్ధించి వేమా రెడ్డి కటారిని అడిగి తీసుకొని వచ్చి దాన్ని వేమా రెడ్డి ప్రభువుకు అంద జేశాడట .ఇలా తన ప్రభువు ఋణం తీర్చుకొన్నాడు శ్రీ నాధుడు .1417లో పెద కోమటి వీరా రెడ్డి ఫిరోజ్ షా తో కలిసి రాజ మహేంద్రం పై దండ యాత్ర చేశాడు .దీనికి ప్రతీ కారం గా నే లింగమ నేడు వేమభూపతి కటారిని తీసుకు వెళ్ళాడని కధనం .
వేమా రెడ్డి తమ్ముడు మల్లా రెడ్డి ఎర్రాప్రగడ కవిని ఆదరించి ,అన్నగారైన వేమా రెడ్డి వద్దకు పంపినట్లు తెలుస్తోంది .వేమా రెడ్డి చదల వాడ కు వచ్చి తమ్ముడు కట్టించిన రామాలయాన్ని దర్శించి ,చంద్ర గ్రహణం నాడు ఒక అగ్రహారాన్ని ,గుండ్ల కమ్మ నదిలో ఇసుక తిన్నె పై కూర్చుని దానం చేసి నట్లు శాసనం ఉంది .ఆఊరే తర్వాత ”మల్లాపురం ”అయిందట  ప్రభువు ఎర్రన కవీశ్వరుని రామాయణాన్ని రాయమని కోరితే ,వ్రాశాడట .అయితే అదంతా శిధిలమై కేవలం 28పద్యాలు మాత్రమె లభించాయట  .రామాయణం వల్ల తనకు గొప్ప కేర్తి వచ్చిందని వేమా రెడ్డి చెప్పుకోన్నాడట .వేమా రెడ్డి ”ప్రబంధ పరమేశ్వరుడు” ,”శంభు దాసుడు ”అని బిరుదాంకితుడైన ఎర్రన మహా కవిని ”హరి వంశం ”వ్రాయ మని అర్ధించాడు .హరి వంశం తో కలిస్తేనే భారతం ”మహా భారతం ”అవుతుందనీ రాజే చెప్పాడట .అలానే ఎర్రన హరివంశం రాసి కీర్తి పొందాడు. భారతాంధ్రీ కరణాన్నిఆదికవి నన్నయ ఆపేసిన  అరణ్య పర్వ శేషం నుంచి పూరించి కవిత్రయం లో ఒకడైనాడు ఎర్రన .నేపాల్ దేశం లో న్యాయ స్థానాలలో ”హరి వంశం ”ను నెత్తిన పెట్టుకొని ప్రమాణం చేస్తారట .వేమా రెడ్డి ”వీర నారాయణ చరిత్ర ”అనే ”భాణం” కూడా రాశాడు .వేమా రెడ్డి ప్రభువు కాలం లో శైవ ,వైష్ణ వాలు సమానం గా ఆదరింప బడినాయి .హరిహర నాధ సమన్వయమూ సాధించ బడింది .ముఖ్యం గా ఈ కాలం లో ద్విపద ఆదరాన్ని పొందటం విశేషం కూడా .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-8-12–కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.