జన వేమన -11 సామెతల ఆమెతలు

 జన వేమన -11
                                         సామెతల ఆమెతలు —

మహిమ ,ప్రతాపం లేని  దేవుడిని ,వీరుడిని కొలిస్తే ,ఏమీ ప్రయోజనం లేడు .”మహిమ లేని వేల్పు ,మంటి జేసిన పులి ”.రాజు చాలా తెలివి తో ప్రవర్తిస్తాడు .ఆశ్రితుల యెడ ,ఆదరంగా ,దయగా ఉన్నట్లే ఉంటాడు .ఏమాత్రం తప్పు చేసినా చంపేస్తాడు .”పట్టా నేర్చు పాము ,పాడగా నొరగ జేయు -చెరుప జూచు వాడు చెలిమి చేయి -చంప దలచు రాజు చను విచ్చి చూడడా ”అని లోకోక్తి రాజ బాధ అనుభ వించిన వారి పట్ల ,వాడుతాం .దానం చెయ్యి అని లోభి వాడి దగ్గరకు వెడితే ,గొడ్డు టావు దగ్గరకు పాలు పిండ టానికి వెళ్తే ఈడ్చి తన్ని నట్లు ఉంటుందని సామెతను మహా గొప్పగా చెప్పాడు వేమన్న .ఈ పద్యం రోజు మన నాలుక పై ఆడే పద్యమే .”గొడ్డు టావు బితుక కుండ గోమ్పోయినా -పండ్లు నూడ దన్ను బాలు రావు -లోభి వాని నడుగ లాభంబు లేదురా ”.చావు తెలివి కావాలి ,రావాలి .మిగతాది ఎంత చదివినా వృధానే .”చావు తెలియ లేని ,చదువు ల దేలరా ”అంటాం .చావు తెలివి అంటే చావును గురించిన జ్ఞానం .ఆది తెలిస్తే బ్రహ్మ జ్ఞానే అవుతాడు .మిగతా చదువులు కూడు ,గుడ్డా పెడతాయి కాని ,పరాన్ని ఇవ్వవు .అయితే -ఇప్పుడు లోకం లో చావు తెలివి అంటే -పనికి రాని తెలివి తేటలు అనే అర్ధం రూధీ అయి పోయింది .బలం లేని సమయం లో ,బలహీనుడు కూడా బల వంతుడిని ఓడిస్తాడు .అందుకే ”బలిమి లేని వేళ బంతంబు చెల్లదు ”అనే సామెత వాడుక లోకి వచ్చింది .సింహం బక్క చిక్కి తే బక్క కుక్క పిల్ల కూడా దాన్ని ఇక్కట్ల పాలు చేస్తుంది .
ముండనం (గుండు )చేయించు కొని ,కాషాయాలు కట్టు కొన్న మాత్రం చేత ,సన్యాసి కాడు .అందుకే ”తలలు బోడు లైన ,తలపులు బోడులా ?”అన్న లోకోక్తి ప్రచారం లోకి వచ్చింది .వేమన సూక్తులలో ,లోకోక్తుల్లో ,మనమందరం ఎప్పుడు వాడే పద్యం ”ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు -చూడ ,చూడ రుచుల జాడ వేరు -పురుషు లందు పుణ్య పురుషులు వేరయా ”అన్నది .చూడ టానికి అందరు పైకి ఒక లానే కనీ పిస్తారు .దాన్ని చూసి మోస పో కూడదు .ఆంతర్యం చాలా ముఖ్యం .పుణ్య పురుషులు ,మహాత్ములు కర్పూరం లా గా కరిగి పోతారు .ఆత్మ త్యాగం తో నీరాజ నాలు అందు కొంటారు .సామాన్యులు మాత్రం ఉప్పు లాగా ,ఉప్పగా ఉంటారు .అలాగే శరీరాన్ని కుల ,మతా లను బట్టి కాకుండా ,మనసును బట్టి విలువ నివ్వాలి ..”మిరప గింజ చూడ మీద నల్లగా నుండు -కొరికి చూడ లోన ,చురుకు మనును –సజ్జను లగు వారి సార మిట్టుల నుండు ”అని సజ్జన సాంగత్యం గురించి తెలియ జేశాడు .పెత్తనం ఇస్తే పరాయి సొమ్ము కాజేసే ప్రబుద్దుల్ని చూసి ”ఎదుటి వారి సొమ్ము ఎల్ల వారికి తీపి ”అంటాం కదా .
కులం గొప్పా ,గోత్రం గొప్పా విద్య గొప్ప లను గురించి ప్రగాల్భాలను పలుకు తూ ఉంటాం .అలాంటి వారిని కుహనా సంస్కారులం అను కొంటాం .”కులము గల్గు వారు ,గోత్రము గల వారు -విద్య చేత విర్ర వీగు వారు -పసిడి గల్గు వాని బానిస కొడుకులు ”అని వేమన్న లాగా చీదరిస్తాం .తనకు తెలిసిందే సర్వస్వం అని ,తనకు తెలియనిది ఏమీ లేదని భావించే ,అల్ప మనస్కులు ”బావి లోని కప్పు పరి కిన్చునే జగంబు లాగా  గిరి గీసుకొని ,అదే ప్రపంచం అన్న చందం గా ప్రవర్తిస్తారని పోలుస్తాం .చంప దగిన శత్రువు తన చేత చిక్కి తే మేలు చేయాలి అనే ఆదర్శం అందరికి రావాలని అంతే కాని ”ఒకరి మేలు జూడ నొల్లక యితరుల -చెరుప దలతు వేని ,చెడేద వీవు — జింక జంప గుట్ర జేసి ,నక్క యే జచ్చె ”అని పంచ తంత్ర నీతి కధను గుర్తు చేస్తాడు .అర్ధాంతరం గా ఆస్తి వస్తే ,వాడు గర్వం తో కన్నూ ,మిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటే ”కలిమి హెచ్చె నేని ,కనులు నెత్తికి వచ్చు ”అని లోకోక్తి చెబుతాం .కళ్ళు నెత్తికి రావటం అన్న వేమన మాట జన సామాన్యం లో పాతుకు పోయింది .
అడ్డూ ,ఆపు లేక విచ్చల విడి గా తిరిగే ,వాణ్ని చూసి ,జాగ్రత్త గా ఉండమని ”విచ్చల విడి గ తిరుగుట -చిచ్చు న బడు నట్టి ,మిడుత చెలువమే వేమా ” అని హెచ్చ రిస్తాం .ముందు ఏమి ఉందొ తెలీక కళ్ళు మూసు కొని తిరిగే మిడుత అగ్ని ఎదుట ఉన్నా తెలుసు కోలేక దూకి చస్తుంది .అలా మీరూ కావద్దని చెప్పటమే మన ఉద్దేశ్యం .దీంతో బాటు ”లోభి నడుగ ,లాభంబు లేదు ”అని చురక వేస్తాం .ఆప్యాయం గా ,ప్రేమగా ,పెట్టని కూడు ”పిండాకూడే ”అవుతుంది అని చెబుతాం .కులాన్ని కోరే వాడు కుల హీను డవుతాడు అని చెబుతూ కుల గజ్జి పనికి రాదు అని స్పష్టం చేస్తాం .ఆచారాలు బయటి వేషాలు మోసాలే .ఆత్మ ప్రక్షాళనం అయితేనే ముక్తి .అలాంటి వారి గురించి ”కుక్క సింహ మగునే -గోదావరికి బోవ ”అని వేమన మాటను గుర్తు చేస్తాం .ఇలా నిత్య వ్యవహారాలలో ,పనులలో ,పాటల్లో ,ఆలోచనల్లో ,ఆచార వ్యవహారాల్లో ,భావనల్లో ,బాన్ధవ్యాలలో ఉన్న వైరుధ్యాలను స్వోత్కార్శలను ,తేడాలను బేరీజు వేస్తూ వేమన సూక్తుల్ని సామెత లుగా విసరుతూ మనమేదో గొప్ప అని హెచ్చరిల్లు తాం ,పెచ్చ రిల్లి పోతాం .ఆయన చెప్పిన వన్నీ మనకూ వర్తిస్తాయన్న నిజాన్ని మరచి పోరాదు .ఇంత స్పష్టం గా సామెతల ఆమెత లను ఇచ్చి విందు భోజనం కల్పించాడు వేమన్నయోగి .యోగులకు సాధ్యమేదీ లేదు .ఇదంతా భరద్వాజ విందు గా జీర్ణించు కొందాం .ఒక్క సందర్భం లో నైనా ,మనం ఇతరులకు మార్గ దర్శకత్వం చేద్దాం .వేమన్న ఆశించిన దాన్ని నిజం చేసి ”పురుషు లందు పుణ్య పురుషులు వేరయా ”అని నిరూపిద్దాం .
                      ఇంతకీ వేమనది యే ఊరు ?
”ఊరు కొండ వీడు ఉనికి పశ్చిమ వీధి -మూగ సేత లెల్ల మొదటి ఇల్లు –అ రసి చూడ నది ,ముక్తికి మార్గమే ”అని వేమన తన ఊరు ను గురించి చెప్పుకొన్నాడు .ఇందులో గూడార్ధం ఉంది అని ”బ్రౌను ”అభిప్రాయ పడి ,ఆంగ్లం లో వ్యాఖ్యానించాడు .”శరీరం అనే గ్రామం లో ఎత్తైన ప్రదేశ మైన శిరస్సు లో పరమాత్మ ఉంటాడు .వెనక వీధి అనేది ”వెన్నెముక”. అందులో ఆరు చక్రాలు ఉన్నాయి .మొదటిది నిశ్శబ్దం గా ఉండే మూలాధారం .అక్కడి నుండి ప్రయాణం చేస్తే ,సహస్రారం చేరితే ,ఆత్మ దర్శనం అవుతుంది .ఆది అంతా ఆనంద మయం .సచ్చిదానందం ..సుందరం” అని భావించి నట్లు బ్రౌను వివరణ ఇచ్చాడు .ఆయన మార్గం యోగ మార్గం .ఆయన గమ్యం ఆత్మ దర్శనం .ప్రాంత ,కుల భాషా పరిధులకు అతీతుడు వేమన .విశ్వ కుటుంబి వేమన అని భావించాలి .
సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –28-8-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.