జ్ఞానదుడు మహర్షి నారదుడు -12

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -12

  భక్త ప్రహ్లాద రక్షకుడు నారదుడు

భాగవతం సప్తమ స్కంధం లో ప్రహ్లాద బాలకుని చెలి కాళ్ళందరికి విష్ణు భక్తి అతనికి ఎలా అబ్బిందో అర్ధం కాక బుర్రలు బద్దలు కొట్టుకొని చివరికి అతనినే అడిగేశారు .ఆశ్చర్యం గా ‘’మంటిమి గూడి ,భార్గవ కుమారులొద్ద ననేక శాస్త్రముల్

వింటిమి ,లేడుసద్గురుడు వేరొక డేన్నడు ,రాజ శాల ,ము

 క్కంటికి నైన రాదు చోరగా ,వెలికిం జన రాదు ,నీకు ,ని

ష్కంటక వృత్తి ,నెవ్వడు ప్రగల్భుడు సెప్పె గుణాధ్య చెప్పుమా ?’’అడిగారు

    అప్పుడు ఆ పరమ భాగవోతోత్తముడు ‘’నేను పూర్వం దివ్య ద్రుష్టి గల నారద మహా ముని వల్ల సవిశేష మైన ఈ జ్ఞానాన్ని ,పరమ భాగవతోత్తమ ధర్మాన్ని తెలుసుకొన్నాను .’’అని సవినయం గా చెప్పాడు .తన తండ్రి తపస్సు కోసం అరణ్యాలకు వెళ్ళగా గర్భవతి అయిన తన తల్లి లీలావతీ దేవిని ఇంద్రుడు చేర బట్టి తీసుకొని వెళ్తుంటే దైవ యోగం గా నారద మహర్షి వచ్చి ,ఆమె గర్భం లోని శిశువు మహా భక్తు డౌతాడని రాక్షసామ్ష ఉండదని నచ్చ చెప్పటానికి ప్రయత్నించాడట

‘’స్వర్భువనాది నాద !సురసత్తమ ,వేల్పులలోన మిక్కిలిన్

  నిర్భర పుణ్య మూర్తివి ,సునీతివి ,మానిని బట్టనేల ?ఈ

  గర్భిణినాతురాన్ విడువు ,కల్మష మానసురాలు గాదు ,నీ

  దుర్భర రోషమున్ నిలుపు ,,దుర్జయుడైన నిలింప వైరిపై ‘’అని నచ్చ జెప్పే ప్రయత్నం చేశాడు

 కాని ‘’వేయి కన్నుల ఠవర’’ఒప్పుకోకుండా ‘’వేల్పు దపసి ‘’తో

  ‘’అంత నిధాన మైన దివిజాదిపు వీర్యము ,దీని కుక్షి న

   త్యంత సమృద్ధి నోందెడి మహాత్మా ,కావున ,తత్ప్రసూతి ప

   ర్యన్తము బద్ధ జేసి ,జనితార్భకు ,వజ్ర ధార ద్రుంచి ,ని

   శ్చింతడ నై ,తుదిన్ విడంతు,సిద్ధము దానవ రాజ వల్లభన్ ‘’అని ఇంద్రుడు తన మనసు లోని మాటను భయాన్ని వెలువరించాడు .మహర్షి అంత మాత్రం గా వదిలే రకమా ?తన ప్రయత్నాన్ని అర్ధంతరం గా ముగిస్తాడా ?వేల్పు రేని తో మళ్ళీ అంటున్నాడు

‘’నిర్భీకుడు ప్రశస్త భాగవతుడున్ ,జన్మాంతరా

 విర్భతాచ్యుత పాదభక్తి మహిమా విస్టుండు,దైత్యాంగనా

 గర్భస్తుం డగు బాలకుండు,బహు సంగ్రామాద్యుపాయంబులన్

 దుర్భావంబున నొంది చావడు ,భవ దోర్దర్ప విభ్రాన్తుడై’’ అనినువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చావడు .అతను కారణ జన్ముడు  అని దేవముని చెప్పగా ,మన్నిన్చాడని ,తన ఆశ్రమానికి తీసుకొని వెళ్లి తన తల్లిని పుత్రికా భావం తో సంరక్షిన్చాడని తెలియ జేశాడు .ఆమె గర్భం లో పరమ భాగవతుడైన ప్రాణి ఉన్నాడని ,ఆమె భర్త వచ్చే వరకు తన ఆశ్రమం లోనే ఉండవలసినదని కోరాడు మహర్షి .ఆమె భక్తీ తో నారద మునిని సేవిస్తూ భర్త రాక కై ఎదురు చూసేది .’’ఆశ్రిత శిక్షా విశారడుడైన నారదుడు ‘’గర్భం లో ఉన్న తనకు ధర్మ తత్వాన్ని ,నిర్మల జ్ఞానాన్ని ఉపదేశించాడు .దాని ఫలితమే తనకు లభించిందని ప్రహ్లాదుడు స్నేహితులకు చెప్పాడు .ఇదంతా చెప్పి తాను నమ్మి చరిస్తున్న బాట లో వారినీ సాగి పొమ్మని హితవు చెప్పాడు .

‘’దానవ దైత్య భుజంగమ ,మానవ గంధర్వ సుర సమాజాము లో –

 లక్ష్మీ నాధుని చరణకమల –ధ్యానంబున ,నేవ్వ డైన ధన్యత నొందున్ ‘’అని చెప్పి విష్ణువు ఏ విధం గా తమకు దక్కుతాడో వివరించి చెప్పాడు ‘’

‘’చిక్కడు వ్రతముల ,గ్రతువుల ,జిక్కడు దానముల ,శౌచ శీల,తపములం

 జిక్కడు యుక్తిని భక్తిని ,జిక్కిన క్రియ నత్యుతుం డుసిద్ధము సుండీ ‘’అంటూ చండా మార్క గురువులు ‘’బాధ గురువులే ‘’కాని ‘’నిజ బోధ గురువులు కారని ‘’స్పష్టం చేశాడు .

 ‘’గురువులు దమకును లోబడు –తెరువులు సేప్పెదరు ,విష్ణు దివ్య

   పదవికిం ,దెరువులు సెప్పరు ,చీకటి బరువులు పెట్టంగ నేల బాలకులారా ?’అని తనతో బాటు మోక్ష ధ గాములై ,కైవల్య పదాన్ని పొందమని వేడుకొంటాడు బాల ప్రహ్లాదుడు చెలి కాళ్ళతో .ఇంకేముంది ?తా చెడ్డ కోతి వనమెల్లా చేర్చి నట్లయింది .రాక్షస వనాన్నే హరి నామ బీజం తో చెడగోట్టాడు .శిష్యులంతా చదువు మానేసి ‘’నారాయణ భక్తి చిత్తముల గీలించారు ‘’’ఇంత గాఢ మైన భక్తీ భావాన్ని తల్లి గర్భం లో ఉండగానే ముద్ర వేసిన నారద మహర్షి మహత్తు మాటలకుఅంద రానిది

              సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –15-3-13-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.