విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -20 మహా మహుడు మనువు

   విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -20

మహా మహుడు మనువు

భారత దేశానికి ‘’ధర్మ శాస్త్రాన్ని ‘’అందించిన మహాను భావుడు మనువు .అందుకే ఆయన పేరు మీదుగా ‘’మను స్మ్రుతి ‘’పేర చెలామణి అయింది .2694.శ్లోకాలలతో పన్నెండు అద్యాయాలతో   ఇది ఉంది .అత్యున్నత ఆలోచనా ధోరణికి ప్రతీక గా నిలుస్తుంది .కాని కాలం లో వచ్చిన మార్పుల వల్ల అది ‘’బ్రాహ్మణులు బ్రాహ్మణులకోసం ‘’రాసుకోన్నదని,స్త్రీ కి చాలా అన్యాయం చేసిందనే పెడ వాదాలు వచ్చినా అదే ఇప్పటికి సర్వోత్క్రుస్టం అని ప్రపంచమంతా భావించి గౌరవిస్తోంది .ఒక నాటి పంజాబ్  హర్యానా  ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఏం.రామజొయ్స్ మనుస్మృతి పై ఒక సాధికార గ్రంధం రాశాడు .భారత రాజ్యంగ స్పూర్తికి అనుకూలం గా ఉన్న అనేక అంశాలను ఆయన ఇందులో ఉన్నాయని వివరించాడు. మత విషయాలున్నా అవి  పెద్దగా అవరోదాలుకావన్న వారే అనేకులు .సంస్కృత మను స్మృతిని 1913 1920 లలో పి హెచ్ పాండ్య  ,జి ఆర్ ఘర్పూరే లు ఎడిట్ చేశారు తర్వాత దీన్ని ఇంగ్లీష్ లోకి 1974లో అనువదించిన వాడు సర్ విలియం జోన్స్    ,

 

    Inline image 1 Inline image 2Inline image 3

.

స్మృతులు అంటే భిన్న కాలాలకు చెందిన సామాజిక ,రాజ కీయ రాజ్యామ్గాలని అర్ధం .శాత వాహనులకాలం నాటి నాణాలు ఈ రోజు చెల్లు బడికావు .కానీ వాటిని కరగింఛి  ఉపయోగించుకో వచ్చు . అమ్ముకుంటే వాటి విలువా ఎక్కువే .ఇలానే మను స్మ్రుతి అనేక శతాబ్దాల పాటు అమలు అయింది ఇది తిరుగు లేని సత్యం .’’మనువు ‘’శబ్దం నుంచి మనిషి వచ్చింది మనిషి మనీషిగా ఉన్నతం అవటానికి కావలసిన సకల విషయాలు ఉన్న శాస్త్రం మను స్మ్రుతి .

అందరు అనుకొంటున్నట్లు మనువు బ్రాహ్మణుడు కానే కాదు .ఋగ్వేదం లో ‘’మనుర్భవః ‘’అనే మాట ఉంది .అంటే ‘’ముందుగా మనిషిగా రూపొందు ‘’అని అర్ధం .’’సర్వ జీవ  రాశిని కాపాడటానికి ఉపయోగ పడే విధం గా ,ధర్మ స్వరూపం గా ఉంచేందుకు బ్రహ్మ తేజస్సు కల వాడినిగా చేయటానికి రాజుకు ‘దండము ‘’ఏర్పడింది .ఆ దండం మీద భయం తో  సకల ప్రాణాలు సుఖాన్ని పొందటమే కాక తమ తమ ధర్మాలను అనుసరిస్తాయి’’ అనేదే మను స్మ్రుతి సారం . దండం ను అమలు పరిస్తేనే ప్రజలు సక్రమ వర్తన కలిగి ఉంటారు .కేవల స్వభావం వల్ల  నడవడిక ఉండదు .దండానికి భయ పడే లోకం సుఖం గా ఉంటుంది’’అని రాజ దండానికి ఉన్న ప్రాధాన్యత ను తెలిపాడు మనువు అదే’’ దండం దశ గుణం భవేత్  ‘’గా లోకం లో మారింది .

మనువు చెప్పిన ‘’దండ నీతి  శాస్త్రం ‘’లో కొన్ని మార్పులు చేసి చాణక్యుడు అర్ధ శాస్త్రం లో ఇమిడ్చాడు .దండం అంటే కర్ర పెత్తనం అనే భయం లోకం లో వ్యాపించింది ఈ భయం పోగొట్ట టానికి స్వర్గీయ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారు ‘’కౌటిల్యుని అర్ధ శాస్త్రం ‘’రాసి సామాన్యులకూ అందులో ఉన్న విశేషాలను అర్ధం చేసుకోవటానికి వీలు కల్పించారు .తన లక్ష్యాన్ని మనువు వివరించాడు –

‘’యో దద్యా జ్ఞాన మజ్ఞానం కూద్యాద్వా ధర్మ దర్శనం –

సక్రుత్స్నాం పృధివీం దద్యాత్ తేన తుల్యం సతద్భవేత్ ‘’

దీని అర్ధం –అజ్ఞానుల ముంగిటికి జ్ఞానాన్ని తీసుకొని పోవటం ,వారికి సన్మార్గాన్ని బోధించటం కు మించిన దానం లేదు .సమస్త భూ మండలాన్ని ధారా దత్తం చేసినా కూడా అది దీనికి సమానం కానే కాదు ..   స్త్రీ హితం కోసం చెప్పిన విషయాలు

మనం అందరం వల్లే వేసి చెప్పే ‘’యాత్ర నార్యస్తు పూజ్యం తే –రమయతే

యత్రై తాంతున  పూజ్యతే –సర్వాన్తత్రా ఫలాః క్రియాః ‘’

అంటే ఏ ఇంట్లో స్త్రీలు వస్త్ర ,అలంకార, మంచి భోజనాలతో సంతోషింప బడుతారో ,ఆ ఇంట దేవతలు ప్రసన్ను లౌతారు .ఎక్కడ స్త్రీ కి గౌరవం ఉండదో ,మనస్తాపం కలిగిస్తారో ఆ ఇంటి యజమాని చేసే ధర్మ కార్యాలన్నీ నిష్ప్రయోజనమే .

అలాగే ఇంట్లో దంపతుల తో పోషింప బడే కుమార్తెలు,కోడళ్ళు  మొదలైన వారి పట్ల మర్యాద లేక పొతే ఆ ఇల్లు అతి త్వరగా నశిస్తుంది .ఏ ఇంట్లో వారు సుఖ సంతోషాలతో ఉంటారో ఆ ఇల్లు వృద్ధి చెంది ఇంకా వృద్ధి చెందు తూనే ఉంటుంది .

స్త్రీకి సంపూర్ణ స్వాతంత్రం తో ధనం ఆరు రకాల వస్తుంది .మొదటగా వివాహ సమయం లో అగ్ని హోత్రం ఎదుట తలి దండ్రులు , బుట్టువులు ఇతర బంధువులు ఇచ్చి న దానం ,దీనినే ‘’అధ్యగ్ని ‘’అంటారు .రెండవది ‘’ధ్యా వాహనికం ‘’అంటే కూతురు అత్త వారింటికి వెళ్ళే టప్పుడు తలిదండ్రులు అరణం గా ఇచ్చే డబ్బు వగైరా .మూడవది ‘’దత్త ‘’అంటే స్త్రీకి భర్త సంతోషం తో ఇచ్చేది. శోభన సమయం లో భార్య

కొంగుకు ముడి వేసిన ఆభరణాలు ధనం మొదలైనవికూడా దత్త కిందకే వస్తాయి ..నాల్గవది అన్న దమ్ములు ఇచ్చేది దీన్ని ‘’భ్రాత్రు దత్త ‘’అంటారు .అయిదవది తల్లి ఇచ్చేది ఇదే ‘’మాత్రు దత్త ‘’.ఆరవది తండ్రి ఇచ్చేది ‘’పితృ ప్రాప్త  ‘’.స్త్రీ స్వయం గా సంపాదించు కోన్నదాన్ని ‘’ఆనవా ధ్యేయం ‘’అంటారు .దీని పై భర్తకు ,బంధువులకు ఏ విధమైన అధికారం హక్కూ ఉండదు .భర్త బ్రతికి ఉండగా భార్య చనిపోతే ఆమె పేర ఉన్నది సంతానానికే చెందుతుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-11-13-ఉయ్యూరు

.

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.