మహిళా మాణిక్యమైన అర్ధాంగి శ్రీమతి మైనేని సత్యవతి గారికి
‘మహిళా మాణిక్యాలు ‘’ అంకితం
‘’మహిళా మాణిక్యాలు ‘’అనే ఈ యాభై ఎపి సోడులను అంతర్జాలం లో రాసి ,ఈ పుస్తకాన్ని సరసభారతి తరఫున ముద్రించ బోతున్నామని ,ఉత్సాహ వంతులైన స్పాన్సర్ లు ఉంటె స్పందించమని అంతర్జాలం లో సాహితీ బంధువులకు విన్న వంచాను .అంతే కొన్ని గంటల్లోనే అదే రోజు సాయంత్రం అమెరికా నుండి నాకు ఆత్మీయులు, సరసభారతి ప్రోత్సాహకులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఫోన్ చేసి ‘’ఎవరికీ ఆ అవకాశం ఇవ్వ వద్దు .ఎంత ఖర్చు అయినా నేనే పెట్టుకొని ఆ పుస్తకాన్ని ముద్రించటానికి తోడ్పడతాను .నా మనసులో ఎప్పటి నుంచో మా శ్రీమతి సత్యవతి కి ఒక పుస్తకం అంకితమివ్వాలని ఉంది .ఆ కోరిక ఇంతవరకు తీరలేదు .ఇప్పుడు మీ ద్వారా ఆ అవకాశం వచ్చింది .కనుక సత్యవతికి అంకిత మిచ్చి పుస్తకం ముద్రించటానికి అభ్యంతరం ఉందా ?’’అని అడిగారు .’’నాకు మహదానందం గా ఉంది .తప్పక మీ మనసు లోని కోరిక తీరుద్దాం ‘’అన్నాను.ఆయన సంతోషించి ‘’ఈ విషయం చాలా సీక్రెట్ గా ఉంచుదాం .సత్యవతికి సర్ప్రైజ్ ఇద్దాం ‘’అన్నారు సరేనన్నాను .అంతే ఆ సాయంత్రానికే నాకు’’ వెస్త్రెన్ మని ట్రాన్స్ ఫర్ ‘’ద్వారా పుస్తక ముద్రణకు అవసరమైన డబ్బును పంపారు .మర్నాడు ఉదయమే నేను పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకొన్నాను .అదీ మైనేని వారి స్పీడు .2012జూన్ లో వారి ఆహ్వానం పై అమెరికా లో నార్త్ కరోలినా షార్లెట్ లో మా అమ్మాయి ఛి సౌ .విజయ లక్ష్మి అవధాని దంపతుల ఇంటి నుంచి గోపాల కృష్ణ గారున్న అలబామా లోని హాంట్స్ విల్ కు వెళ్లాను. రెండు రోజులు వారి అతిధిగా ఉన్నాను. వారూ వారి సతీమణి శ్రీమతి సత్య వతి గారు చూపిన ఆదరణ, ఆతిధ్యం మరువ లేనివి. వారి అబ్బాయి కృష్ణ కుటుంబం చూపిన ఆత్మీయత కూడా అలానే ఉంది .అక్కడి మిత్రులందరికీ నన్ను పరిచయం చేశారు .అలబామా తెలుగు అసోసిఏషన్ తో నాకు అంటే ,సరసభారతికి సన్మానం చేశారు .ఈ పుస్తక ముద్రణకు పూర్తి ఆర్ధిక సహాయం అందించిన శ్రీ గోపాల కృష్ణ గారికి సరస భారతి మనస్పూర్తిగా కృతజ్ఞతలను అంద జేస్తోంది .ఇలాంటి వితరణ శీలుర తోడ్పాటు వల్ల నే ఇప్పటికి పన్నెండు పుస్తకాలను ముద్రించ గలిగామని సవినయం గా మనవి చేస్తున్నాము .
సత్య వతి గారు గోపాల కృష్ణ గారికి అసలైన జీవిత సహ ధర్మ చారిణి .స్వయం సిద్ధ .అర్ధాంగి అనే మాట కు అసలైన నిర్వ చనం ఆమె .మైనేని భాషలో ‘’అలుపెరుగని అర్ధాంగి ‘’.గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా నల్లూరు గ్రామం లో సత్య వతి గారు పరుచూరి భావనారాయణ చౌదరి ,రత్న మాణిక్యం దంపతులకు 1940 జూన్ ఒకటవతేదీన ఏడవ సంతానం గా జన్మించారు .ఆమె సోదరి శ్రీమతి విమలా దేవి అమెరికా లో ఉంటున్నారు .సోదరులు శ్రీ స్వర్గీయ సుదర్శన రావు(ఆర్మీ ఇంజనీర్ ) ,కీ.శే .శ్రీ రామ క్రిష్నయ్య ( ఏం ఏ .పి హెచ్ డి – ప్రపంచ ప్రసిద్ధ గణాంక శాస్త్ర వేత్త అంటే ‘’వరల్డ్ ఫేమస్ స్టాటి స్టిషియన్’’) ,స్వర్గీయ శ్రీ జనార్దన రావు –(గ్రం దాలయ అధికారి )) .కీ .శే .శ్రీ బాబూ రాజేంద్ర ప్రసాద్(రీజినల్ ఇన్స్పెక్టర్ –ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ) లు అమెరికా లో ఉన్నతోద్యాగాలు లో స్తిరపడి స్వర్గస్తులయ్యారు . సోదరుడు శ్రీ మధుసూదన రావు ప్రొఫెసర్ గా అమెరికా లో ఉంటున్నారు .మరొక సోదరుడు శ్రీ శ్రీనాధ వర ప్రసాద రావు అమెరికా లోని చికాగో లో ‘’యూని వర్సిటి ప్రింటింగ్ అండ్ యునిక్ ప్రింటింగ్ సంస్థ ‘’లో మేనేజర్ గా పని చేసి రిటైర్ అయి అమెరికా లో ఉన్నారు .సోదరుడు స్వర్గీయ శ్రీ శివాజీ రావు గారు స్వగ్రామం నల్లూరు లో వ్యవసాయంతోనే జీవిస్తూ స్వర్గస్తులయ్యారు .అంటే ఆమె సోదరులలో ఒక్కశివాజీ రావు గారు మాత్రమె అమెరికా లో స్థిర పడ లేదన్న మాట . ఇండియా లోనే ఉండి పోయారు .
శ్రీమతి సత్య వతి గారు తెనాలి లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ, భాషా ప్రచారక్ పరీక్షలలో గణనీయమైన మార్కులతోఉత్తీర్ణులయ్యారు . ఉయ్యూరు లో శ్రీ సరస్వతి ట్యుటోరియల్ కాలేజి లో మెట్రిక్ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారు.రేపల్లె దగ్గర నగరంలో ని శ్రీ వెలగ పూడి రామ కృష్ణా మెమోరియల్ కాలేజి లో పి.యు.సి పాసై, బి కాం మొదటి సంవత్సరం చదివారు .1965లో ఉయ్యూరు లోని సి బి .ఏం స్కూల్ లో కొద్ది కాలం హిందీ పండిట్ గా పని చేశారు .కృష్ణా జిల్లా ఉయ్యూరు వాస్తవ్యులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారిని వివాహ మాడారు .భర్త తో అమెరికా వెళ్లి అక్కడ కూడా గృహకృత్యాలు యదా విధి గా నిర్వహిస్తూ ఉద్యోగం చేశారు .అమెరికా లోని కెంటకి రాష్ట్రం లూఈ విల్ లో ‘’ చెవ్రాన్ అకౌంటింగ్ సెంటర్’’లో డేటా ఎంట్రి ఆపరేటర్ గా 1973-78 కాలం లో పని చేశారు .అక్కడే’’ హ్యూమానా హాస్పిటల్ అండ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్’’ లో కంప్యూటర్ ఆపరేటర్ గా 1978నుంచి21ఏళ్ళు 1999వరకు సేవలందించారు .న్యు జెర్సీ లోని ప్రిన్ స్టన్ లో ‘’బ్రిస్టల్-మెయర్–స్కిస్బ్ ఫార్మ స్యూటికల్ ఇండస్ట్రి’’లో కంప్యూటర్ ఆపరేటర్ గా 2001నుండి2004 వరకు మూడేళ్ళు పని చేశారు . ఈ ఉద్యోగం చేస్తూనే ప్రిన్ స్టన్ లోనే’’ y.w C .A చైల్డ్ కేర్ సెంటర్’’ లో పార్ట్ టైం ఉద్యోగమూ ఒక ఏడాది చేసి అలుపెరుగని శ్రమ జీవి అని పించుకొన్నారు .
గృహిణి గా తన సమర్ధతను నిరూపించుకొంటు భర్త గోపాల కృష్ణ గారికి అన్ని విషయాలలో సహాయసహకారాలు అందిస్తూ పిల్లల విద్యా విషయాలను పర్య వేక్షిస్తూ చెరగని చిరు దరహాసం తో సత్య వతి గారు ఏ సమయం లో నైనా కని పిస్తారు .అదీ ఆమె ప్రత్యేకత . కుటుంబం , బంధువర్గం లోని వారందరికీ ఆమె అందుబాటులో ఉండి సేవ లందించటం ఆమె నైజం .భారతీయ శాస్త్రీయ సంగీతం అంటే మక్కువ ఎక్కువ .భారతీయ నృత్య కళ పై ప్రత్యెక అభిమానం .వీటిని చూస్తూ, వింటూ ఆమె కాలాన్ని సద్విని యోగం చేస్తారు .అచంచలమైన భగవద్ భక్తీ ఆమె నర నరాన జీర్ణించుకు పోయింది .ముఖ్యం గా శ్రీ కృష్ణ పరమాత్మ ఆమె ఇస్ట దైవం .కుట్టు పని ,అల్లిక లో మంచి ప్రావీణ్యత ఉంది .ఆవరణ లో పెరటి తోటను పెంచి పుష్ప ఫల వృక్షాలను కాయ గూరలను పండించటం లో మహా నేర్పరి సత్యవతి గారు .ఇరుగు పొరుగు వారికి, బంధువులకు తమ తోటలో తాము పండించిన కూర గాయలను ఆమె పంపించి, సంతృప్తి చెందుతారు .అంటే ఇతరుల తో పంచుకోవటం ఆమెకు అమిత మైన ఇష్టం .మాకు కూడా స్టెర్లింగ్ హైట్స్ కుపోస్ట్ లో పంపారు.’’పంచ భూత ప్రియ’’ సత్యవతి గారు .సేంద్రియ ఎరువులనే ఉప యోగిస్తారు . పుష్పాలే ఆమె ఊపిరి .ఉతికిన బట్టలను సూర్యరశ్మి సోకే టట్లు ఆరు బయట ఆరవేయటమే ఆమె కు ఇష్టం .నీటిని చాలా పొదుపుగా ఉపయోగించి ఆదాచేస్తారు .మంచి పొదుపరి గా పేరుపొందారు .దేనినీ వృధా చేయటం ఆమె కు అసలు ఇష్టం ఉండదు .తోట లోని ప్రతి అంగుళం స్థలాన్ని సద్విని యోగ పరచి కరివేపాకు చెట్లు, మిర్చి ,పొట్ల, దోస,దొండ , సొర,కాకర ,చిక్కుడు మొదలైన భారతీయ కూరగాయలను స్వయం సమృద్ధం గా పండించి ఆదర్శ వంతం గా ఉన్నారు .
కుటుంబం లోని అందరితో సత్ సంబంధాలను నెరపటం ఆమె ప్రత్యేకత .తండ్రి గారంటే విపరీత మైన అభిమానం .ఆయన ఆదర్శాలే ఆమె కు శిరోధార్యాలు .ఆమె తండ్రిగారు రేపల్లె లో కో ఆపరేటివ్ బాంక్ లో ఉద్యోగం చేస్తూ,వ్యవసాయం చూసు కొంటు నిత్యం భగవద్ గీతా పారాయణ చేస్తూ సంఘం లో పెద్ద గా ఉంటూ సమాజ సేవలో ధన్యులయ్యారు . ..ఆయన మరణం తరువాత ,వారున్న వీధికి ఆయన పేరు పెట్టి గౌరవించారు . ఆడంబరం ఎరుగని మహిళ శ్రీమతి సత్యవతి .సాదా సీదా జీవితమే .గోపాల కృష్ణ గారి కష్ట సుఖాలలో మమేకం అయి ,వెన్ను తట్టి ముందుకు నడిపిన ఆదర్శ జీవి .సర్వ జన సంక్షేమం ఆమె ఆదర్శం . సకల జనులకు సత్య వతి గారు శ్రేయోభిలాషియే .తన ప్రాణం ,ఊపిరి ,సర్వస్వం సత్య వతి గారే నంటారు ఆమెకు తగిన భర్త అయిన శ్రీ గోపాల కృష్ణ గారు .ఆదర్శ దాంపత్యం వారిది .నలభై ఏళ్ళకు పైగా అమెరికా లో ఉంటున్నా మన సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను చక్కగా పాటిస్తూ స్పూర్తి నిస్తున్న ఈ దంపతులు అభినందనీయులు .వారిద్దరూ జీవికా జీవులు .ఒకరి పై మరోకరికి అత్యంత విశ్వాసం ,ఆత్మీయత,అవ్యాజమైన ప్రేమ, ఆరాధనా .
గోపాల కృష్ణ ,సత్యవతి దంపతులకు ఇద్దరు కుమారులు .పెద్ద కుమారుడు శ్రీ కృష్ణ. కోడలుశ్రీమతి రమ .మనుమ రాళ్ళు ఛి శ్రేయ ,సెరీన .చిన్న కుమారుడు శ్రీ రవి .కోడలు శ్రీమతి కవిత .మనుమడు ఛి కిరణ్ .మనుమ రాళ్ళు ఛి రియా ,కరీనా .కుమారులిద్దరూ కోడళ్ళు కూడా అమెరికా లోనే వారు కోరుకొన్న ఉద్యగ వ్యాపకాలలో స్థిర పడ్డారు .
సరసభారతి ప్రచురిస్తున్న పన్నెండవ పుస్తకం’’మహిళా మాణిక్యాలు ‘’ను శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ఆదర్శ గృహిణి , అర్ధాంగి అన్న పదానికి నిర్వచనం , సర్వ జన శ్రేయోభిలాషి ,స్వయం సిద్ధ ,అలుపెరుగని కర్తవ్య పరాయణు రాలు ,మహిళా మాణిక్యం అయిన శ్రీ మతి మైనేని సత్య వతి గారికి అంకితం ఇవ్వటం అత్యంత సముచితం గా ఉందని , శ్రీ గోపాల కృష్ణ గారి చిరకాల కోరిక ను తీర్చే సదవకాశం లభించిందని , వారికి ఆమోదమూ ఆనందమూ కలు గుతుందని భావిస్తూ హృదయ పూర్వకం గా అంకితమిస్తున్నాము .వీరి దాంపత్యాన్ని , కుటుంబాన్ని కల కాలం ఆయురారోగ్య,ఐశ్వర్య , భోగ .భాగ్యాల తో వర్ధిల్ల జేయ వలసింది గా పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను .అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భం గా ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాన్ని మార్చి30 న సరసభారతి 60వ సమావేశం లో శ్రీ జయ నామ సంవత్శర ఉగాది వేడుకలలో ఆవిష్కరిస్తున్నందుకు మహా సంతోషం గా ఉంది .ఇది శ్రీ గోపాల కృష్ణ గారి మనసు లోని ఆకాంక్ష కూడా .అది నెరవేరుతున్నందుకు వారితో బాటు అందరికి సంతోషం గా ,సంతృప్తి గా ఉంటుందని భావిస్తున్నాను . ఈ సందర్భం గా మరొక శుభ వార్త .సరసభారతి ని రిజిస్టర్ చేయించాము .ఇప్పటి నుండి అది రికగ్నైజేడ్ సంస్థ గా ఉంటుందని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాం రిజిస్టర్ నంబర్ —
గబ్బిట దుర్గా ప్రసాద్ –
అధ్యక్షులు –సరస భారతి
సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
ఉయ్యూరు – 19-2-14-


