మన స్మృతులు-శ్రీ అరవింద రావు మరియు కంచి ఆలయ జీర్ణోద్ధారణ వివరాలు

మన స్మృతులు

న సంప్రదాయంలో శ్రుతి, స్మృతి అనే మాటలు వింటూంటాం. ఇటీవలే మన ప్రధానమంత్రి ‘భారతరాజ్యాంగం మా యొక్క స్మృతిగ్రంథం’ అన్నారు. ఆ స్మృతులకున్న ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం.
శ్రవణం అంటే వినడం. కావున శ్రుతి అంటే వినబడినది అని అర్థం. స్మరించడం అంటే గుర్తు తెచ్చుకోవడం. కావున స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకోబడినది అని అర్థం. వేదాల్నీ, ఉపనిషత్తుల్నీ శ్రుతులు అంటారు. ఋషులు తపస్సు చేసి గ్రహించిన సత్యాలు, శిష్యులకు వినిపించిన విషయాలు. ఇవి రామాయణం, భారతం మొదలైన వాటిలాగ పుస్తక రూపంలో కాకుండా కేవలం గురువు శిష్యుడికి చెప్పడం. ఆ శిష్యుడు తన శిష్యుడికి చెప్పడం అనే పరంపరలో నడిచాయి. అందువల్ల వీటిని శ్రుతులు అన్నారు. వేల సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకుల్ని అడ్డుకుని ఇదే విధంగా రక్షింపబడిన పరంపర ఇది. మాక్స్‌ ముల్లర్‌ వేదాల్ని ముద్రించే వరకూ ఇవి వ్రాత రూపంలో లభించలేదు.
శ్రుతుల్లో చెప్పిన విషయాల్ని గుర్తుంచుకుని అందరికీ అర్థమయ్యేలా చెప్పిన పుస్తకాలు స్మృతులు. ఇవి రెండు రకాలు. శ్రుతిలో సూత్రప్రాయంగానో, ప్రతీక రూపంలోనో (సింబాలిక్‌గానో) చెప్పిన వాటిని ఉదాహరణలతో విశదీకరించి కథల రూపంలో తెలిపేవి మొదటిరకం. శివపురాణం, విష్ణుపురాణం మొదలైనవి. శ్రుతిలో ఉన్న స్ఫూర్తితోనే సమాజానికి మార్గనిర్దేశం చేయడం, ఆచారవ్యవహారాల గురించి చెప్పడం రెండవరకం. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారదస్మృతి మొదలైనవి. వీటినే ధర్మశాసా్త్రలని కూడా అంటాం.
శ్రుతులు చెప్పే విషయాన్ని రెండు విధాలుగా విభజించవచ్చు. జీవుడి స్వరూపమేమిటి, పరమాత్మ స్వరూపమేమిటి, స్వర్గం, నరకం స్వరూపమేమిటి మొదలైన విషయాల్ని గూర్చి చెప్పడం మొదటిది. దీన్ని సిద్ధాంతస్థాయి అనవచ్చు. సమాజంలో మనిషిని సరైన మార్గంలో నడపడానికై కొన్ని కర్మలను (యజ్ఞం, దానం, వ్రతాలు, యాత్రలు మొదలైనవి) చెప్పడం, వ్యక్తుల మధ్య వర్గాల మధ్య సంబంధాల గూర్చి చెప్పడం రెండవది. దీన్ని సమాజస్థాయి అని చెప్పవచ్చు. దేశ , కాల పరిస్థితులు మారినా, సమాజంలో మార్పులు వచ్చినా సిద్ధాంతంలో మార్పులుండవు. రెండవ అంశంలో మాత్రం మార్పులు సహజంగా ఏర్పడతాయి.
వేదంలోనూ, ఉపనిషత్తుల్లోనూ చెప్పిన సిద్ధాంత భాగాన్ని స్మృతులలో కథలరూపంలో చెప్పినా విషయంలో మార్పు ఉండదు. సామాజికాంశాన్ని చెప్పేటప్పుడు కాల పరిస్థితుల్ని బట్టి కొన్ని మార్పులు రావచ్చు. దీన్ని వేదమే అంగీకరిస్తుంది. తైత్తిరీయ ఉపనిషత్తులో (1-11) ‘‘అథ యది తే ధర్మ విచికిత్సా వా’’ అంటూ మొదలయ్యే వాక్యం ఇలా అంటుంది. – ‘‘ఒకవేళ నీవు వెళ్ళిన ప్రాంతంలో ధర్మాన్ని గూర్చి గాని, ప్రవర్తనను గూర్చి గానీ సందేహం వస్తే ఆ దేశంలో స్వార్థంలేని వారు, సత్యనిష్ఠ సమబుద్ధి ఉన్న పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో దాన్నే ధర్మంగా గ్రహించు’’ అని అర్థం. బ్రహ్మసూత్ర భాష్యంలో శ్రీ శంకరాచార్యులు ఒక చోట ఇదే ధోరణిలో వ్రాస్తారు.- ‘‘ఒకానొక ప్రదేశంలో, కాలంలో, సందర్భంలో ఒక విషయం ధర్మమనిపించుకున్నదే మరొక ప్రదేశంలో, కాలంలో, సందర్భంలో అధర్మం కావొచ్చు. అందువల్ల దీని నిర్ధారణలో శ్రుతియే ప్రమాణం’’.
భగవంతుడి గూర్చి, జీవుని గూర్చి, ఉపనిషత్తులు, భగవద్గీత లాంటి పుస్తకాలు చెప్పే విషయంలో మార్పు ఉండదు. కానీ స్మృతుల్లో (ధర్మశాసా్త్రలలో) మార్పు కనిపిస్తుంది. మనకు అనేక స్మృతులు ఉన్నాయి. అష్టాదశ (పద్దెనిమిది) స్మృతులు ప్రసిద్ధి చెందినవి కాగా మిగతా అనేక స్మృతులు కూడా ఉన్నాయి. బ్రిటీష్‌ వారు అందించారని భావించే మన న్యాయవ్యవస్థ చాలా మటుకు యాజ్ఞవల్క్యస్మృతి, దానిపై ఉన్న మితాక్షర అనే వ్యాఖ్యపై ఆధారపడి వచ్చిందే. బ్రిటీష్‌ వారు మనుస్మృతిలోని కొన్ని సామాజిక అంశాలను ఎక్కువగా విమర్శించడం వల్ల మనుస్మృతి అందరి దృష్టికీ వచ్చింది. అంతేగాని దీనిలోని విషయాలు దేశమంతటా ఒకే రీతిలో అనుసరించబడ్డవి కావు. మనుస్మృతి కృతయుగానికై (అంటే అనేక వేల యేండ్ల క్రితం) చెప్పబడిన ధర్మం. త్రేతాయుగంలో నారదస్మృతి అనీ, ద్వాపరయుగంలో శంఖ, లిఖితస్మృతి అనీ, కలియుగంలో పరాశరస్మృతి అనీ ఒక సంప్రదాయ శ్లోకం ఉంది. (ఈ శంఖ, లిఖితులు మన తెలుగువారే. కడప జిల్లాలో చెయ్యేరు, అంటే బాహుదానది తీరంలో ఈ ఇద్దరు సోదరులకై కట్టిన గుడిని కూడా మనం చూడగలం). అందుకే ఒక స్మృతికీ, మరో స్మృతికీ కొంత తేడా కనిపిస్తుంది. నేడు విమర్శింపబడే వర్ణవ్యవస్థ పట్ల వీటి దృష్టి కోణంలోని మార్పును గూర్చి ఒక ఉదాహరణ- ‘‘క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శ్రద్ధావంతులు, శుచిగలవారు అయినప్పుడు వాళ్ళ గృహాలలో జరిగే హవ్య, కవ్యాది కర్మలలో బ్రాహ్మణులు భోజనం చేయాలి’’ (పరాశరస్మృతి 11-13). అంటే యజ్ఞం చేయించినా, శ్రాద్ధ కర్మలు చేయించినా వారి ఇండ్లలో భోంచేయాలి అని అర్థం. మరొక శ్లోకంలో ‘‘మన ఇంట్లో పనిచేసేవారు, గోపాలురు, కులానికి మిత్రులు అయిన శూద్రులందరూ భోజ్యాన్నులు (పరాశరస్మృతి 11-22). భోజ్యాన్నులు అంటే వీరిచ్చిన అన్నం తినవచ్చు అని అర్థం. ఇలా కాలానుగుణంగా పరాశరస్మృతియే కాక తరువాత వచ్చిన స్మృతులు కూడా మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడానికి, సమాజాన్ని సంఘటిత పరచడానికి అనేక సూచనలు ఇచ్చాయి. బ్రాహ్మణుడు తన వేదాధ్యయనానికి ఎలాంటి భంగం లేకుండా ఆచరించదగిన విషయాలు ఇవి. అలాగే సమాజంలో వర్గాల మధ్య దూరం పాటిస్తున్న మిగతావారు కూడా ఆచరించదగినది.
ఇవన్నీ ఎందుకు అంటే సనాతనధర్మం ఎప్పటికప్పుడు సామాజిక మార్పును దృష్టిలో ఉంచుకొని maximum good for maximum people అనే దృష్టిలో మార్పు చెందగల సామర్థ్యం ఉన్నది అని గ్రహించడానికే. తెలుగు రాషా్ట్రలలో ప్రసిద్ధి పొందిన సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ప్రేరణతో ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ‘కౌండిన్యస్మృతి’ (ఎమెస్కో వారి ప్రచురణ) అనే పుస్తకాన్ని రాశారు. ఇది పైన చెప్పిన విషయాల్ని ఇంకా వివరంగా తెలుపుతుంది. ఇది విద్యావంతులందరూ పరిశీలించల్సిన గ్రంథం.
ఒకప్పుడు వ్యవసాయ ప్రధానమైన గ్రామీణ సమాజంలో మానవ సంబంధాలు, నైతికత (agricultural morality)కు, తర్వాత వచ్చిన పారిశ్రామిక సమాజ నైతికతకూ(industrial morality)కి నేటి సాంకేతిక విప్లవాన్ని సాధించిన సమాజంలోని నైతికతకు చాలా తేడా ఉండడం సహజం. గ్రామీణ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పూర్తిగా మారిన సమయంలో నైతిక విలువల్ని నిలపడం చాలా అవసరం.
సమాజం విడిపోకుండా సంఘటితంగా ధరించి ఉండేదే ధర్మం. (ధారణాత్‌ ధర్మ: అన్నారు). కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాలు, సమాజంలోని వర్గాల మధ్య సంబంధాలు, ఒక సమాజం యొక్క శక్తిని సూచిస్తాయి. సంబంధాలు పటిష్టంగా ఉంటే సమాజం పటిష్టంగా ఉంటుంది. ఈ శక్తినే నేటి భాషలో Social Capitalఅంటారు. సమాజంలోని మార్పుకు అనుగుణంగా మారే శక్తి ధర్మశాసా్త్రల్లో ఉంది. కానీ వీటి అవగాహన మనందరికీ లేదు. అవగాహన ఉన్నా వ్యక్తిస్థాయిలో ఆచరించగలం కానీ విస్తృత స్థాయిలో ఆచరింపజేయడం సాధ్యపడదు. వీటిని అవగాహన చేసుకోవడం, ఆచరణలోకి తేవడం మన ధర్మ సంస్థలు, మతాధిపతులు చేయగల విషయం.
కంచిలో ఆలయ జీర్ణోద్ధరణ విరాళాలకై భక్తులకు పిలుపు

ప్రముఖ శక్తిపీఠంగా విలసిల్లుతున్న కంచి కామాక్షి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయనున్నట్లు కంచి దేవస్థాన ధర్మాధికారి చల్లా విశ్వనాథ శాసి్త్ర వెల్లడించారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కామకోటి పీఠం ఆధ్వర్యంలోనే పునరద్ధరణ జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో కూడా కామకోటి పీఠం ఆధ్వర్యంలోనే ఆలయ జీర్ణోద్ధరణ జరిగినట్లు వివరించారు. ప్రస్తుత పీఠాధిపతి జయేంద్ర సరస్వతి నేతృత్వంలో 1975లో పునరుద్ధరణ కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారని.. ఈ కమిటీకి ఏసీ ముత్తయ్య చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని వివరించారు. ఈ పుణ్యకార్యంలో భక్తులు కూడా పాలుపంచుకోవచ్చని విశ్వనాథశాసి్త్ర తెలిపారు. వారు తాము అందజేసే విరాళాలను ‘‘శ్రీ కంచి కామకోటి పీఠం, శ్రీకామాక్షీ అంబాల్‌ దేవస్థానమ్‌ రినోవేషన్‌ కమిటీ, నెం 1, సాలై, స్ర్టీట్‌ కాంచీపురం, 631502 చిరునామాకు పంపాలని విజ్ఞప్తి చేశారు.
దక్షిణ భారత మోక్షపురి
దక్షిణ భారత దేశంలో ఏకైక మోక్ష పురిగా విలసిల్లుతున్న కంచికి ఎన్నో విశిష్టతలున్నాయి. 64 వేల శక్తి పీఠాలలో అత్యంత ముఖ్యమైన శక్తిపీఠమైన కంచిలో కామాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ కామాక్షి దేవాలయాన్ని పల్లవులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. తర్వాత కాలంలో ఆదిగురువు శంకరాచార్యులు ఇక్కడ శ్రీపీఠాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత కాలంలో 16 వశతాబ్దంలో మరోసారి ఆలయ పునరుద్ధరణ చేశారు. 19వ శతాబ్దంలోనూ, 20 వ శతాబ్దంలో మరో రెండు సార్లు ఆలయ జీర్ణోద్ధరణనను కామకోటిపీఠం పూర్తి చేసింది.
ఆదాయపన్ను మినహాయింపు పొందాలనుకునే భక్తులు తమ విరాళాలను చెక్కులు, డీడీల రూపంలో ఈ కింది చిరునామాకు పంపాలని ఆలయ అధికారులు వెల్లడించారు.
HIS HOLINESS SRI JAYENDRA  SARASWATHI SWAMANGAL GOLDEN JUBLEE
 CHARITABLE TRUST
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.