ఈ లోకంలో ఏది విలువైనదని మనం ప్రశ్నించు కుంటే, సామాన్యంగా ఐహికమైన విషయాలపైనే దృష్టి పడుతుంది. కానీ ఇవేమీ శాశ్వతాలూ కావని తెల్సినా, మనస్సు వాటివైపే లాగుతుంది. మహాత్ములు పలు సందర్భాల్లో పదే పదే చెబుతున్నట్లుగా, మనసంపదా దనరాసులూ పోతే మరలా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పాడైపోతే ఏదో కొంత మనం కోల్పోయినట్లే అవుతుంది. ఇక శీలం పోతే అంతా పోయినట్లే అనుకోవాల్సి వుంటుంది. మనిషి గుణం వక్రించరాదు. బుద్ధి గడ్డితింటే కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ సమాజంలో చరిత్రహీనుడికి, శీలం లేనివాడికీ గౌరవం కలకాలం లభించదు. అయితే ఇలాంటి అధములకు అనర్థాలే ఎక్కువ జరుగుతాయి. సద్గుణం కలిగి వుండటం కోటాను కోట్ల ధనరాసులకూ, వజ్రవైడూ ర్యాలకన్నా ఎక్కువ విలువ కలవనే చెప్పుకోవాలి.
సద్గుణ వంతులనే అందరూ ఆశ్రయిస్తారు. దుర్మా ర్గుడైన వాడికీ, దుర్గుణవంతునికీ సదా అందరూ దూరంగా వుంటారు. కొందరు పెద్దలు ‘దు’ అనే పదంలోనే దుష్ట స్వభావముందనే అంటారు. ఎందుకంటే మహాభారతం లోని కౌరవుల పేర్లలో దుర్యోదనుడు, దుశ్శాసనుడూ, దుర్మార్గుడూ, దురాచారుడూ అని చమత్కారంగా చెబుతారు.
సద్గుణాలే మనకు నిజమైన సంపదలు, కొందరు కులం కాదు కావల్సింది గుణం అంటారు. సదాచారులై, సత్ప్రవర్తనతో ఉండేవారే ఎల్లప్పుడూ సంతోషంగా వుంటారు. సంతోషమే సగం బలం కదా మరి. ఈ సమాజానికి సద్గుణాలు కలవారి అవసరం ఎంతైనా వుంది. సచ్చీలము, సద్గుణమూ, సదాచారము కలిగి వుండటం దైవకృపగానే భావించాలి. అవన్నీ దైవ సంపదలేమరి.
ఈ విధమైన దైవీక సంపదలు లేకపోవడం దురష్టంగానే భావించాలి. అలాంటి వారి జీవితం చీకటి మయమే. ఫలానా వాడు మంచివాడు, ఉత్తముడు, సద్గుణ సంపన్నుడు, సచ్చీలుడు సదాచార సంపన్నుడు అని లోకంలోని వారు అను కుంటే, వారి జీవితం ధన్యమేకదా! కొందరు చాలా కాలం బతకాలను కుంటారు. కొందరు ఎంతో బల వంతుల్లాగా వుండాలనుకుంటారు. ఎవ్వరికీ ఎందుకూ పనికిరాని వాళ్లు ఎంతకాలం బ్రతికితే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి?
ఎంత మంచి పనులు చేశామన్నదే ముఖ్యంగా భావించాలి. ఎవ్వరూ మరణాన్ని తప్పించుకోలేరు. వారు అడవిలో వున్నా, నివాస ప్రాంతాల్లో ఉన్నా, ఆకాశంలో విహరిస్తున్నా ఆ సమయం ఆసన్నమైనదంటే చాలు మరణం తద్యం. ఆ సమయం రాకముందే సచ్చీలాన్ని అలవర్చుకున్న వారు ధన్య జీవులే మరి. పుట్టటం కాదు ముఖ్యం. పుట్టింది ఎందుకో ముందు తెలుసుకోవాలి. పుణ్యకార్యాలను చేయాలి.
సాటి మనిషిని ఆదుకోవాలి. చేయరాని పనులు చూస్తూ, స్వస్వరూప జ్ఞానాన్ని సంపాదించనిచో, మరలా పుట్టడం, మరలా చావడం తథ్యం. ఇలాంటి బాధలనుండి విముక్తి పొందాలంటే సచ్చీలమును అలవాటు చేసుకోవడం తప్పనిసరి అని తెలుసుకోవాలి.
ప్రతి ప్రాణియందూ దైవం వున్నాడనుకుంటే మనుష్యుడు అంటే దేవుడ్శుమనస్సు అంటారు. అలాగే మనుష్యుడు – మనస్స్సుదేవుడు అని కూడా చెబుతారు. మనస్సులో ఎలాంటి సంకల్పాలూ లేకుండా వుండాలి. అమనస్క స్థితిని పొందాలి. అలాంటప్పుడు ఆత్మ ఒక్కటే దైవ రూపంలో మిగులుతుంది. అలాంటి అమనస్క స్థితియే మోక్షం. మనస్సులో ఎలాంటి దోషం లేకుండా మహా పవిత్రంగా వుండాలి.
– -డాక్టర్ పులివర్తి కృష్ణమూర్తి
9949092761
